దివ్య దీపావళి

అందాలకు కాణాచి ఆశ్వీజ మాసమ్ము!
పరిఢవిల్లె ప్రకృతి ప్రశాంతమై ఎల్లెడల –
ఎండలూ వానలూ ఏకమై రాగానె ఝడిసి
పింజలై మేఘాలు నింగిపై పరుగుతీసాయి!
వెనకట్టె వానలు వడి తగ్గె వాహినులు
నిర్మల వారితో నిండి ప్రవహించె నదులు.
చల్లని శారద చంద్రికాపూరమున సొక్కి
వెల్లనై మెరిసింది వెండి పోలికను రేయి !
చేమంతి విరబూయ పూదోటల చెలువము హెచ్చె
పంటచేలు తలవంచె పరాగపు పెంపుమీర!
తేమ తగ్గి గాలి ఎల్లెడల తెమ్మెరై వీయగా
సేదదీరి జనులు మదినెంతొ సంబరపడ్డారు.
దసరా పండుగలు దరికి రాగానే నరులు
నవరాత్రి పూజల నయమున కొలిచారు దుర్గను !
దినదినము కొలిచారు దివ్యశక్తిని వారు!
మహిషాసురమర్దని మహిమగల తల్లి –
ఇష్టసిద్ధితోడుత అష్టైశ్వర్యములనిచ్చు,
కొలిచినవారికి కొంగుబంగారమై నిలిచి !
విజయదశమినాడు ఆయుధాల నర్చించి
ఉద్వాసన చెప్పారు ఉత్సవాలకు అందరూ.
విజయయాత్రలకు విహితదినము విజయదశమి –
నరకాసురుని తలపడ నడిచెను భగవానుడు !

************

నరరూప రాక్షసుడు నరకుడనువాడు
భూదేవి గర్భాన విష్ణ్వాంశము చేత నొక,
దుర్ముహూర్తాన జనించిన దుష్ట పుత్రుడు,
లోకాల నలయించు లోకకంటకుడు వాడు !
దుష్ట మిత్రుల నెందరినో దరిజేర్చుకుని
వాడు పాపిష్టి పనులెన్నొ ప్రీతితో చేశాడు !
కన్నెపిల్లల చెరబట్టి కడగండ్ల పాల్జేసె,
సాధుజనుల హింసించె, సజ్జనుల పీడించె,
యజ్ఞ యాగాది క్రతువుల నేవగించుకొనె,
దుండగాలు చేసి జగమును దురపిల్లజేసె !
రాక్షస గణములకు  రారాజై వాడు
దుశ్చర్యలన్నిటికి  దక్షయై నిలచాడు !
“హా, హా ” రవముల ధ్వనించె నంతరిక్షమ్ము.
దీనజనులకు దిక్కెవ్వరంటూ దురపిల్లె ధరిత్రి….

*****

దీననాథుడు, అజేయుడు, దివ్య శక్తియుతుడు
హరి తా పూనుకొనె హరియింప కడగండ్లు !
“దుష్టశిక్షణ సేయుటే నా ధ్యేయమ్ము కాగా,
శిష్టరక్షణమన్న నాకెంతొ ఇష్టమగుటచే
నరకుని వధియింతు నళినలోచన నేను
నరకబాధల నుండి నరుల కాపాడగాను!
లోకకంటకుడౌ  నిజ పుత్రుని దునిమాడి
రక్షింతు లోకాన్ని రయమున పోయి !
గర్భశోకము  తప్పదింక మనకు !”
భర్తమాటలు విని బిట్టు వగచింది వసుధ –
“దుష్ట పుత్రునిగన్న తల్లినగుటచేత
వాడి పాప చర్యలందు పాలుంది నాకు –
పాపాత్ముని కన్న పాపాన పొగలుచూ ఈ
పుత్రశోక మనుభవిచక తప్పునా  నా కిపుడు !
చేసిన తప్పును దిద్దుకొన సమయ మరుదెంచె
పాపిష్టి నరకుని పట్టి పరిమార్తు రణమున.
వాని వధింపగా వరమిమ్ము నా” కనుచు
దుర్భర శోకాన దుఖించె ధారుణీమాత !
“అటులె కాని” మ్మంచు ఆనతిచ్చె భూజాని.

**********

దుష్టుల దునుమాడి, శిష్టుల రక్షింపగా
సంకల్ప మాత్రాన ఇలను జన్మించి రిరువురూ,
పరమాత్మ కృష్ణునిగ, పడతి తా సత్యగా !
సంతసించిరి సురులు, మునులు, సజ్జనులందరు –
నవరాత్రి పండుగల నాతి సత్యనుగూడి
నిశ్చల భక్తితో దుర్గ నర్చించె కృష్ణుడు !
లోక కల్యాణమునకై లోకమాతను ప్రార్థించి
లోకరక్షకుడు రథమెక్కె రణమునకేగ –
నవలామణి తా నాథునికి రథసారధయ్యనంత
సతిపతు లిద్దరూ సమరభూమిని చేరగ
తలపడెను నరకుడు తండ్రితో పోరుకు –
ఘోర రణమందు అతి ఘోరుడౌ నరకుడు
అమ్ముల జడిలో ముంచి అలయించె తండ్రిని,
సొలసి లీలా మానుషరూపుడు సొమ్మసిల్లె !
ఆగ్రహము పెంపున అమ్ములు చేగొని శీఘ్రమే
విల్లెక్కుపెట్టి, బాణములు సంధించి తాను
రణము చేయ సంసిద్ధురాలాయె రమణి సత్య !
బాణాలు గుప్పించి, భయంకర యుద్ధము చేసి
నరకుని దునుమాడె నళినలోచని తానె!
నేలగూలి నరకుడు నిర్వీర్యుడై చచ్చె !!

************

దేవదుందుభులు మ్రోగె దిక్కులదరగాను,
సురలు పుష్పవృష్టి కురిపించి రా పుణ్యవతిపైన !
మూర్ఛ వీడి లేచి ముదిత విక్రమము చూసి
మురిపాన మగువను పొగడె మాధవుడు –
దుష్ట పుత్రుని దునిమిన ధన్యవు అవనీ !

వాసిగంటివి మాట నిలుపుకు వనితలందరిలో…..
పీడ విరగడయ్యెనని ప్రజలు పండుగ చేస్తారు.

చతుర్దశి నరకుని పుణ్యతిధి కాగా, ముందుగా
నిన్ను మెచ్చి ఆపై వాడికి నివాళు లిస్తారు!, పిదప
స్వర్గస్థులైన పెద్దలు తరింపగా తర్పణలిస్తారు ….
ప్రేమ లెన్ని ఉన్నా మాతృపేమకు దీటు కాదేదీ !
తల్లి ప్రేమనే త్యజించి లోకాల్ని కాచిన తల్లివి నీవు!
జగము గుర్తించులే నీ అఖండ త్యాగ నిరతి –
నీ ఈవికి గుర్తుగా ఇలలోన గొప్ప పండుగ చేస్తారు
దీపావళి పేరున వెలిగింతురు దీపాల వరుసలెన్నో –
నీ కన్నీటి చినుకులే దీప కళికలై వెలిగి ఇంటింట
చీకట్లు తొలగించి కాంతిని వెలయించును జగాన !
స్వార్ధాన్ని విడిచి, సుతుని దునిమి లోకాల
చీకట్లు పోకార్చి కాచిన ఘనత కదా కలికి నీది !
దీపావళి నాడు నీ విజయాన్ని దీపింపజేయగా
వెలిగింతురు వేలాది దివ్వెలు వరుస వరుసలుగా
దివ్య దుందుభులు మ్రోయగ, పూలు కురిపించగా
విలువైన బాణసంచా ఏటేట వెగింతురు చూడు !
తనయుని తమకై చంపిన త్యాగశీలివగుటచే
జోహారులర్పించి నీకు జ్యోతలిడుదురు జనులు -”
ఇట్లు పరిపరి విధముల కృష్ణుడు పడతి నోదార్చె .
పతి మాటలతో సుంత పరితాపము తగ్గగా నామె
దుఃఖాన్ని దిగమింగి దయతో దీవించె లోకాన్ని!
కృతజ్ఞత పెంపున జనులు కొనియాడి రామెను…….

***********

దీపావళీ శుభదినాన దీపలక్ష్మికి మ్రొక్కి
ధనలక్ష్మిని పూజించి ధన్యులైన వారు
సకల సౌభాగ్యములు, సిరిసంపదలు కల్గి
కలకాలమూ ఇలలోన సుఖముగా నుందురు!
==============

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

మృతజీవులు – 33

పదవ ప్రకరణం

అధికారులు పోలీసు అధిపతి ఇంట సమావేశమై ఒకరినొకరు గమనించుకుని ఈ వచ్చిపడిన కష్టాలతోనూ, మనోవ్యధతోనూ ఎలా చిక్కిపోయినదీ తెలుసుకున్నారు. నిజానికి, ఈ కొత్త గవర్నర్ జనరల్ నియామకమూ, ఈ రెండు హెచ్చరికలూ, ఈ విడ్డూరమైన పుకార్లూ వారి ముఖాలపైన ముద్ర వేసినట్టయింది; వారి కోట్లు బాగా వదులయాయి. అంతా అధ్వాన్నమైపోయింది; అధ్యక్షుడు చిక్కిపోయాడు, మెడికల్ బోర్డు ఇనస్పెక్టరు చిక్కిపోయాడు, ప్రాసిక్యూటరు చిక్కిపోయాడు. సెమ్యోన్‌ ఇవానవిచ్ అనే ఆయన – ఆయన్ను ఇంటిపేరు పెట్టి ఎవరూ పిలిచేవారు కారు, ఆయన చూపుడువేలి కొక ఉంగరం ఉండేది, దాన్ని ఆడవాళ్లకు చూపుతూ ఉండేవాడు – ఆయన కూడా చిక్కిపోయాడు.  కొంచం కూడా చలించని ధైర్యశాలులు కొందరు లేకపోలేదు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు; కానీ వాళ్ళు ఎంతోమంది లేరు – పోస్టు మాస్టరు ఒక్కడే. ఆయన నిండుకుండ లాగా తొణకకుండా ఉండిపోయాడు. ఇలాటి అసందర్భాలు తటస్థపడినప్పుడల్లా ఆయన, “మీ గవర్నరు జనరళ్ళ సంగతి మాకు తెలుసు లెస్తూ! మిమ్మల్ని మూడు నాలుగుసార్లు మార్చేస్తారు. కాని అయ్యా, నేను ముప్ఫై ఏళ్ళుగా ఉన్నట్టే ఉన్నాను” అంటాడు. దానికి అధికార్లు “నీకేం ఇవాన్‌ ఆంద్రేయిచ్, నువు పోస్టాఫీసు చూసుకుంటావు- తపాలా తీసుకుంటావు, పంపిస్తావు; మహాచేస్తే, కోపం వచ్చినప్పుడు పోస్టాఫీసు ఒక గంట ముందే మూస్తావు, టైముదాటి ఇచ్చిన వర్తకుడి ఉత్తరం తీసుకుంటావు లేక పంపగూడని బంగీ పంపేస్తావు- నీ ఉద్యోగం లాటిది చేసేవాడెవడైనా మునీశ్వరుడులాగే ఉంటాడు. కాని సైతాను రోజూ నీవెంటపడి, వద్దుమొర్రో అంటున్నా ముడుపు అంటగడతాడనుకో. నీకు భయమేముందీ? ఒక్కడే కొడుకు; కాని ప్రస్కోవఫ్యదోర్నా దేవుడి వద్ద వరంపొంది; ఒక్క ఏడుకూడా నాగా పెట్టకుండా నాకో ప్రస్కోవ్యనో, పెత్రూష్కనో ఇస్తూనే ఉన్నది; మా స్థితిలో నువుంటే ఇలా మాట్లాడకేం” అంటారు.

 

అధికార్లు అనేది అదీ; మరీ సైతానును ధిక్కరించడం సాధ్యమా, కాదా అంటే అది నేను చెప్పలేను. ఈ సందర్భంలో జరిగిన సమావేశంలో, ఇంగితమని నలుగురూ దేన్నైతే అంటారో, ఆ ముఖ్యమైన వస్తువు బాగా లోపించింది. చూడగా మనం ప్రాతినిధ్య సంస్థలకు పనికిరామల్లే ఉంది. రైతు సమావేశాలు మొదలుకొని సాంస్కృతిక సమావేశాల వరకూ ప్రతి సమావేశంలోనూ, పైన దక్షతగల నిర్వాహకుడు లేకపోయాడో.., ఎంత డబ్బు కావాలో అంతా అవుతుంది. ఇది ఇలా ఎందుకవుతుందంటే చెప్పడం కష్టం. రష్యనుల మనస్తత్వం ఎలాటిదిగా కనిపిస్తుందంటే, వారు ఏర్పరిచే కమిటీలు వినోదాలూ, విందులూ, జర్మనుల పద్ధతిలో వనవిహారాలూ మాత్రమే జయప్రదంగా నిర్విహించగలవు. అయినప్పటికీ మనం ప్రతిదానికీ ముందుకు వస్తాం. ధర్మకార్యాలకూ, దానాలకూ, ఇంక వేటివేటికో సంఘాలు ఏర్పరచమంటే, వాయువేగంతో వచ్చిపడతాం. ఆశయాలు గొప్పవే కావచ్చు, కాని క్రియ ఉండదు. మనం ఆరంభంలోనే సంతృప్తిచెంది అంతా అయిపోయినట్టు భావించడం మూలాన ఇలా జరుగుతూ ఉండవచ్చు. మాటవరసకి, పేదల సహాయార్ధం ఒక సంఘం ఏర్పాటౌతుంది, మంచి మొత్తమే వసూలవుతుంది, మన మహదాశయాన్ని లోకానికి చాటటం కోసం నగరంలో ఉండే అడ్డమైనవాళ్లకూ విందు ఏర్పాటు చేసి వసూలైన మొత్తంలో సగం ఖర్చుపెట్టేస్తాం. మిగిలినదానిలో నుంచి కమిటీవారి ఉపయోగం నిమిత్తం ఒక బ్రహ్మాండమైన ఇల్లు తీసుకుని, దానికి దానికి చలిమంటల ఏర్పాట్లూ, నౌకర్లూ, చాకర్లూ వగైరా అన్ని హంగులూ అమర్చుతాం; అంతా అయ్యాక పేదలకు పంచడానికి సరిగ్గా అయిదున్నర రూబుళ్ళు మిగుల్తుంది. దీన్ని ఎలా పంచాలనే విషయమై కమిటీ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. ప్రతివాడూ తనని నమ్ముకున్న ఎవడో ఒకడి కిమ్మంటాడు.

 

ఇప్పుడు సమావేశమైన కమిటీ మరొకలాటిది. ఇది పరిస్థితుల ప్రోద్బలంవల్ల ఏర్పడింది. ఇది పేదవాళ్ళ సమస్యా, పైవాళ్ల సమస్యా కాదు, అక్కడ చేరిన అధికార్ల సొంత సమస్య. ఉపద్రవం అందరికీ సమానంగానే వచ్చిపడింది. అందుచేత ఈ సమావేశం మరింత ఐక్యంగానూ, ఐక్యకంఠంగానూ ఉండవలసింది. కాని అలాటిదేమీ జరగలేదు. ఏ సమావేశంలో ఐనా అభిప్రాయభేదాలకు తావుండనే ఉంటుంది, కాని ఇక్కడ చేరినవారిలో ఏ నిర్ణయానికి రావడానికీ శక్తి చాలకపోవడం కూడా కనబడింది, చిత్రం. ఒక పెద్ద మనిషి, చిచీకవ్ దొంగనోట్లు తయారుచేసినవాడే నంటూనే “ఒకవేళ అలాటివాడు కాడేమో” అని కూడా అనేశాడు. మరొకడు, అతను తప్పక గవర్నరు జనరలు ఆఫీసులో పనిచేసేవాడేనని, “అయితే, అలా అని అతని మొహాన రాసిలేదులే” అన్నాడు. అతను మారువేషంలో ఉన్న బందిపోటు అన్న సూచనకు ఏ ఒక్కరూ సమ్మతించలేదు. అతను చూడటానికి ఎంతో పెద్దమనిషిలాగా ఉండటమే గాక, అతని స్వభావం చూస్తే హింసాచర్య చేసేవాడిదిగా లేదని అందరూ ఒప్పుకున్నారు. కొంతసేపుగా దీర్ఘాలోచనలో ఉండిన పోస్టు మాస్టరు, లోపల ఏదో తన్నినట్టుగా ఉన్నట్టుండి, “ఇంతకూ అతనెవరో మీకు తెలుసటర్రా?” అన్నాడు. ఇలా అప్పుడాయన గొంతులో ఏదో ధ్వనించింది; అందరూ ఒక్కసారిగా “ఎవరు?” అని అడిగారు. “అతను మరెవరూ కాదు, కాప్టెన్‌ కపేయ్కిన్‌ ఎవరో కూడా మీకు తెలీదా?” అన్నాడు పోస్టు మాస్టరు.

కాప్టెన్‌ కపేయ్కిన్‌ ఎవరో తమకు తెలియదని అందరూ అన్నారు.

పోస్ట్ మాస్టరు తన పొడుం డబ్బీ కొద్దిగా మాత్రమే తెరచి ఒక పట్టు తీసుకున్నాడు. డబ్బీ పూర్తిగా తెరిస్తే తలా ఒక పట్టూ తీసుకుంటారని భయం; వాళ్ల వేళ్ళు శుభ్రంగా ఉండవని అనుమానం – ఆయన తరచు అనేవాడు; “అయ్యా, తమ వేళ్ళు ఎక్కడెక్కడ తాకాయో చెప్పటానికి వీలు లేదు. నశ్యం  అనేది  మహా శుచి అయిన వస్తువు” ఆయన పొడుం తీస్తూ “కాప్టేన్‌ కపేయ్కిన్‌ కథ మహా విచిత్రమైనది. రొమాన్సు పుస్తకాలు రాసేవాళ్లకు ఎంతో బాగుంటుంది.” అన్నాడు.

ఈ కథను, అంటే రచయితలు ఆకర్షించే మహా విచిత్రమైన రొమన్సును వినాలని తాము కుతూహలపడుతున్నట్టు అందరూ చెప్పగా, పోస్టు మాస్టరు ఇలా ప్రారంభించాడు.

“అయ్యా, 1812 దాడి అనంతరం” – ఆ గదిలో ఒకరుగాక ఆరుగురు ఉన్నప్పటికీ, ఆయన వారిని అలాగే సంబోధించాడు – “1812 దాడి అనంతరం  కాప్టెన్‌ కపేయ్కిన్‌ ను క్షతగాత్రులవెంట యుద్ధరంగం నుండి పంపేశారు. అమిత దురుసు మనిషీ, ఖయాళీ మనిషీ కావటంచేత ఎన్నో రకాల శిక్షలు పొందాడు, నిర్బంధంలో ఉంచబడ్డాడు- అతను చవిచూడని అనుభవం లేదు. క్రాస్నోయలోనో, లైప్‌త్సిగ్ లోనో సరిగా చెప్పలేనుగాని, అతని ఒక చెయ్యి, ఒక కాలు పేలిపోయాయి, ఏమిటనుకున్నారో. ఆ సమయంలో మరి క్షతగాత్రుల కోసం ఎలాటి ఏర్పాట్లూ లేవు. ఆ.. దాన్నేమంటారూ? – క్షతగాత్రుల పెన్‌షన్‌ నిధి తరవాత ఎంతో కాలానికిగాని సాగింది కాదు. తెలుసా? తాను శ్రమచేసి బతకవలసి ఉంటుందని కాప్టెన్‌ కపేయ్కిన్‌ గ్రహించాడు. కాని అతనికి ఉన్నది ఒకే చెయ్యి, తెలిసింది గాదూ! ఎడమచెయ్యి. అతను ఇంటికి, తండ్రివద్దకు వెళ్లాడు; నేను నిన్ను పోషించలేను. నాకే ఇంత రొట్టె తునక దొరకకుండా ఉంది’ అన్నాడు తండ్రి. ఏమనుకున్నారో. అయ్యా అప్పుడు మన కాప్టన్‌ కపేయ్కిన్‌ పీటర్స్‌బర్గ్ వెళ్ళి తాను ఒకవిధంగా తన ప్రాణాన్నీ, రక్తాన్నీ ధారపోశానని అధికారులతో చెప్పి వారివద్ద నుంచి సహాయం ఏదైనా లభిస్తుందేమో చూద్దామని నిశ్చయించుకున్నాడ. అయ్యా, ఇంకేముందీ, అతను ఏదోవిధంగా, సామానుబళ్ల మీదనో, ప్రభుత్వ వాహనాలమీదనో చిట్టచివరకు పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. అప్పుడు, ఏమిటనుకున్నారో, ఇతనుందే, ఇతని పేరేమిటీ, అదే కాప్టెన్ కపేయ్కిన్‌, రాజధానిలో వచ్చి పడ్డాడు. ఒకవిధంగా అలాటిది ప్రపంచంలో మరెక్కడా లేదన్నమాట: ఒక్కసారిగా అతని ఎదట, ఒకేవిధంగా ఒక కొత్త ప్రపంచం, ఒక జీవిత విధానం, ఒక షహజాదీ వింతగాధ, తెలిసిందిగాదూ, ప్రత్యక్షమయింది. ఒక్కసారిగా, ఏమిటనుకున్నారో – నెవ్‌స్కీ ప్రాస్పెక్ట్, గరోఖవీయా, లితేయినీ; గాలిలో ఏదో గోపురంలాంటిది; వాటి దుంపతెగ వంతెనలు ఏ ఆధారమూ లేకుండానే, తెలిసింది గాదూ, నిలబడతాయి! ఎక్కడన్నా బస సంపాదింతామని చూశాడు; కాని, చచ్చే ఖర్చుతో కూడిన పని. పరదాలూ, తెరలూ, పాడూ, పచ్చిబద్దలూ, తెలిసింది గాదూ, తివాసీలూ – అయ్యా, పర్షియా అనుకోండి!.. ఒకవిధంగా ధనాన్ని కాళ్లకింద మట్టగించడమన్నమాట. వీధులంట పోతుంటే, ముక్కుతో వేలకువేలు పీల్చెయ్యొచ్చు: మరి మన కాప్టన్‌ కపేయ్కిన్‌ వద్ద చూడబోతే యాభై రూబుళ్ళూ, కొద్ది చిల్లరా ఉన్నది… దాంతో ఎస్టేటు కొనటానికున్నదా చెప్పండి. దానికొక నలభైవేలు చేరిస్తే, ఏమన్నా వీలౌతుందేమో, ఫ్రాన్సు రాజును అప్పడిగి తీసుకురావాలి; సరే, అతను ఒక వసతి గృహంలో రోజుకు రూబులిచ్చి బస సంపాదించుకున్నాడు… అక్కడ ఎంతోకాలం ఉండటానికి లేదని అతనికి తెలుసు. ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలో విచారించాడు. “ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటావూ? ఉన్నతాధికారులు పీటర్స్‌బర్గ్‌లో లేరు” అని చెప్పారు. వారంతా పారిస్‌లో ఉన్నారు; ఇంకా సైన్యాలు తిరిగి రాలేదు. తెలిసింది కాదూ? కాని ఒక తాత్కాలిక కమిటీ ఉన్నట్టు చెప్పారు; అక్కడికి వెళ్ళి విచారిస్తే, ఏమైనా చెయ్యవచ్చునన్నారు. ‘ఒక విధంగా నేను రక్తం ధారపోశాననీ, ప్రాణాలను ధారపోశాననీ చెబుతాను’ అనుకున్నాడు కపేయ్కిన్‌.

 

అయ్యా, అందుకని పెందలాడే లేచి, ఎడమచేత్తో గడ్డం దువ్వుకున్నాడు. మంగలి దగ్గరకు పోవడమంటే, ఒకవిధంగా డబ్బు ఖర్చేగద; తన మురికి దుస్తులు వేసుకుని, తన కొయ్యకాలితో, ఏమిటనుకున్నారో, కుంటుకుంటూ కమిటీపెద్ద ఉండేచోటికి బయల్దేరాడు. ‘అల్లదిగో నది ఒడ్డున ఉండే ఇంటో’ అని చెప్పారు. ఏమి ఇల్లులెండి, తెలిసింది గాదూ, కిటికీలకు అద్దాల తలుపులూ, ఏమిటనుకున్నారో, పదేసి అడుగుల వెడల్పుగల నిలువుటద్దాలు, చలవరాళ్ళు, నౌకర్లు, అయ్యా, చూస్తే తల తిరిగిపోయేటట్టున్నది. తలుపుకు ఒకలోహపు పట్టుపిడి ఉన్నది – మహామహుడి కుండవలసినది, దాన్ని తాకాలంటే ముందు దుకాణానికి పరిగెత్తి, తెలిసిందికాదూ, ఇంత సబ్బుకొని, రెండు గంతలసేపు చేతులు కడుక్కోవాలన్నమాట. వాకిలి దగ్గర ద్వారరక్షకుడు, తెలిసిందికాదూ, వాడిచేతిలో ఒక కర్ర, వాడిది జాగీర్దారు మొహం, వాడి మెడపట్టీ బలిసిన కుక్కలాగా ఉంది. ఎలాగో కొయ్యకాలు ఈడ్చుకుంటూ మన కపేయ్కిన్‌ రిసెప్షన్‌ గదిలోకి వెళ్ళి, తన మోచెయ్యి తగిలి ఏ అమెరికన్‌ గిల్టు పింగాణీ కూజా, ఈ ఇండియన్‌ కూజా ఏమైపోతుందోనని ఒదిగి ఒకమూల నిలబడ్డాడు. అతను చాలివచ్చినదాకా వేచి ఉండవలసి వచ్చిందంటూ వేరే చెప్పాలా? ఎందుకంటే అతను వచ్చినవేళకు పెద్ద అధికారి అప్పుడే నిద్రలేచాడు, నౌకరు ఆయన మొహం కడుక్కోవడానికి నీళ్ళూ అవీ తెచ్చాడు, తెలిసీందికాదూ? మన కపేయ్కిన్‌ నాలుగు గంటలు వేచిఉన్నాక పనిలోఉన్న గుమాస్తా ఒకడు వచ్చి, “డైరెక్టరు గారు ఇప్పుడే వస్తారు. ” అన్నాడు. అ్ప్పటికి భుజకీర్తుల వాళ్లతోనూ, భుజాల మీద ముడులుగల  వాళ్లతోనూ గది నిండిపోయింది- బటానీలు పొసిన పళ్ళెంలాగా. అయ్యా చివరరకు డైరెక్టరు రానే వచ్చాడు. డైరెకరు మరి…..ఏమిటనుకున్నారో ! ఆయన మొహంలో, అదేమరి ఆయన హోదాకు తగ్గట్టు, తెలిసిందికాదూ?… అంతదర్జా. అన్ని విధాలా హుందా అయినమనిషి; ఒక్కొక్కరినీ సమీపించి, మీరు దేన్నిగురించి వచ్చారు? మీకేం కావాలి? మీ పని ఏమిటి అని అడిగాడు. అయ్యా, చిట్టచివరరకు ఆయన కపేయ్కిన్‌ వద్దకు వచ్చాడు. కపేయ్కిన్‌ అదీ ఇదీ చెప్పాడు: రక్తం ధారపోశాను, కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నాను, పనిచేసుకోలేను – సాహసించి అడుగుతున్నాను, ఏ విధమైన సహాయంగాని దొరకదా, పరిహారంగా ఏదో ఒక రకమైన ఏర్పాటు, పింఛనులాంటిది. తెలిసిందికాదూ? అతడి కొయ్యకాలూ, ఖాళీగా ఉండిన చొక్కా కుడిచెయ్యీ చూశాడు డైరెక్టరు. ‘మంచిది, ఒకటిరెండు రోజుల అవతల మళ్ళీ కనపపడు ‘ అన్నాడు. మన కపేయ్కిన్‌ పారవశ్యం చెందాడు. ‘ఇంకేం, అంతా కుదిపోయిందిలే’ అనుకున్నాడు. అతను పేవ్‌మెంట్‌ మీద గెంతుకుంటూ వెళ్ళి, పాల్కిన్‌స్కీ రెస్టారెంటులోకి పోయి ఒక గ్లాస్ వోద్క తాగాడు.  అయ్యా, లండన్‌ రెస్టారెంటుకు భోజనానికి వెళ్ళి, కట్లెట్లూ, ఊరగాయీ, కోడీ ఆర్డరిచ్చాడు. ఒక బుడ్డీ ద్రాక్షసారా తెప్పించాడు, సాయంకాలం థియేటరుకి వెళ్ళాడు – మొత్తంమీద మంచి జల్సా చేశాడనవచ్చు. వీధిలో నక్కులాటి ఇంగ్లీషు పిల్ల కనిపించింది, హంసలాగ తేలిపోతూ, ఏమిటనుకున్నారో, మన కపేయ్కిన్‌ – అతని రక్తం కాస్త వేడెక్కి ఉన్నది, తెలిసింది కాదూ – కొయ్యకాలు టకటకలాడించుకుంటూ ఆమె వెనకే పరిగెత్తుదామనుకున్నాడు. కానీ మళ్ళీ వద్దులెమ్మనుకున్నాడు. ‘పస్తుతానికి ఆడవాళ్ళ వెంటపడటం కూడని పని. తరవాత, పింఛను వచ్చాక, చూసుకోవచ్చు. ఇప్పటికే కాస్త కణువు దాటాను’ అనుకున్నాడు. ఈలోపుగా, ఒక్కరోజులోనే అతను తనకున్న డబ్బులో సగం ఖర్చు పెట్టేశాడు, మీరు గమనించాలి.

 

మూడునాలుగు రోజులు తాళి, అతను కమిటీకివెళ్ళి, డైరెక్టరునుచూసి, ‘తమరునాకేం సహాయం చెయ్యబోతున్నారో తెలుసుకునేందుకు వచ్చాను, నాకు చేసిన జబ్బులూ, తగిలిన గాయాలూ మూలాన రక్తం ధారపోశానన్నమాట…’ ఈ ధోరణిలో తగిన భాషలో చెప్పుకున్నాడు, తెలిసింది కాదూ? పై సైనికాధికారుల వద్దనుంచి ఉత్తరువులు రానిదే మేము నీ విషయంలో ఏమీ చెయ్యలేమని నీకు ముందే చెప్పెయ్యాలి. పరిస్థితి నువే చూడు. యుద్ధకార్యకలాపాలు ఒకవిధంగా ఇంకా ముగియలేదు. కొంచం ఓపిక పట్టాలి. మంత్రిగారు వచ్చినదాకా ఆగాలి. ఆ తరువాత నీకు కొంత గిట్టుబాటు కాకపోదు. బొత్తిగా చేతిలో ఏమీ లేకపోతే, ఇంద దీనితో గడుపుకో; అంటూ ఆయన ఏదో ముట్టజెప్పాడు. అది పెద్ద మొత్తం కాదు, తెలిసింది కాదూ? కాని పైనుంచి ఉత్తరువులు వచ్చేదాకా సరిపోతుంది, పొదుపుగా వాడితే. కాని మన కపేయ్కిన్‌ కు కావలసింది అది కాదు. తనకు వెంటనే వెయ్యి రూబుళ్ళు మొత్తంగా ఇస్తారనో ఏదో అనుకున్నాడు; ఇచ్చి, ‘ఇదిగోరా అబ్బీ! దీనితో హాయిగా తాగు, జల్సా చెయ్యి.’ అంటారనుకున్నాడు. అది లేకపోగా, ఆగమమన్నారు, గడువుకూడా చెప్పకుండా. వాడప్పటికే ఇంగ్లీషు పిల్లను గురించీ, భోజనాలను గురించీ, కట్లెట్లను గురించీ కలలు కనేశాడు. అందుకని వాడు, నీళ్లలో తడిసి, చెవులు వేళ్ళాడేసుకుని, తోక ముడుచుకునిపోయే కుక్కలాగా, గబ్బిలాయి మొహం వేసుకుని మెట్లుదిగి వచ్చేశాడు. అతను అప్పుడే పీటర్స్‌బర్గ్‌ జీవితం రుచిమరిగాడు, అది అతన్ని పట్టేసింది. ఇప్పుడతను ఎలా బతకాలో తెలియకుండా పోయింది, సుఖాలనుభవించే ఆశలేదు, తెలిసింది కాదూ? అతను చూడబోతే మంచి ఆరోగ్యంతో, జీవం తొణికిసలాడుతూ ఉన్నాడు. అతని ఆకలి తోడేలు ఆకలే. అతను ఒక రెస్టారెంటు పక్కగా వెళ్ళేవాడు; అక్కడి వంటవాడు, ఏమిటనుకున్నారో, ఫ్రెంచివాడు కపటంలేని మొహం వేసుకుని, లినెన్‌ చొక్కా, తెల్లని ఆప్రన్‌, మంచులాంటిదన్నమాట, ధరించి నోరూరించే వంటకాలన్నీ చేస్తుండేవాడు. వాటినిచూస్తే ఎంత ఆకలి పుడుతుందంటే మనని మనమే తినెయ్యాలనుకుంటాం. అతను మిల్యూతిన్‌స్కీ దుకాణం పక్కగా వెళితే అందులోనుంచి సామన్ చేప తొంగిచూస్తుండేది, ఎత్తు ఐదురూబుళ్ళ ఖరీదు చేసేది. కిటికీలో పెద్ద బస్సు ప్రమాణంగల పుచ్చకాయ కనిపించేది, ఎవరన్నా వెర్రివాళ్ళు వచ్చి తనను నూరు రూబుళ్ళకు కొంటారేమో అన్నట్టుగా.

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 33

శారదా విజయోల్లాసము – 2

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

రవి : రాఘవ గారూ రసపట్టులో వచ్చారు. స్వాగతం

నచకి : స్వాగతం, రాఘవా!

గిరి: మరుగేలరా ఓ రాఘవా

రవి : బాపు బొమ్మకు పద్యాలు చెబుతున్నారు. ఇప్పుడుగిరిగారు చెప్పబోతున్నారు.

గిరి: ఆలకించండి

గిరి:

ద్వి.

ప్రియమైన లచ్చిని ప్రేమతో తలచి| ప్రియసఖుడు పనుపు విరజాజి లేఖ,

నీ చేతి స్పర్శము నెఱనోచుకొన్న|దేచేతనో గదా ఈ కాగితమ్ము

నే కట్టుకోని పున్నెములమూట యిది| దాకొనిపెట్టి సదా చూడు సుమ్ము

తొలిసారి కలిసిన తోడుదొంగలని| తెలిసి, చెలిమి సమ్మతి తెలిపి, గొడవ

చేసిన కన్నులు, చెలునికై యెదురు|చూసి పాప మలసిసొలసిన వేమొ,

చల్లనికాటుక చక్కగాదిద్ది |చల్లగాకాపాడు చారెడుకండ్లు,

నల్లనినలుపైన నచ్చవచ్చునని| నల్లనికీల్జడ నాగుపాముజడ

నిమిరి తెలుసుకొని, నీకుంతలాల|కు ముఖమునద్దినా, కుఱ్ఱచేష్టలకు

నవ్వు చిందించిన నవ్యారుణ రుచి| పువ్వించు వాతెఱపూమొగ్గలేవి?

కుంకు మద్దిన మల్లి గోరింటిరేఖ| పొంకపడిన కరపుష్పములట్లు

తెల్లకలువ కెంపు దినకరురేఖ| పల్లవించిన కాలిపారాణులట్లు

చలువబింబాస్యము చంద్రునియట్లు| వెలుగులీనును కదా వెన్నెలయట్లు,

ఆషాఢమాసము లాలుమగలన|పాషాణకాఠిన్యవైఖరి చూపు,

అడ్డుగోడలవలె నాలుమగలను| తెడ్డుకోతీరుగా తెగలాగినిలుపు

మనవాళ్ళు వైశాఖమాసాన కాక| మనపెళ్ళి శ్రావణమాసాన చేసి

యుందురా కష్టములుండునా నేను|నిన్ దూరముగ నుండనిత్తునా నేడు.

నచకి : చాలా సులభశైలిలో నడిచింది ద్విపద.

శంకరయ్య : బాగుంది… ఎవరూ ముట్టని ఛందంలో మనోహరంగా వ్రాసారు.

రవి : లేఖకు ద్విపద ఎంచుకోవడం ఎత్తుగడ అనుకుంటాను, అద్భుతంగా ఉంది

శంకరయ్య : శ్రావణంలో పెళ్లి అయితే మళ్లీ ఆషాఢం వచ్చె సరికి మోజు తీరిని పురుషుడికి నెల రోజుల స్వాతంత్ర్నం దొరుకుతుందనా?

నచకి : అవును, చక్కని యెత్తుగడ

కామేశ్వర రావు : “గొడవ చేసిన కన్నులు, చెలునికై యెదురు చూసి పాప మలసిసొలసిన వేమొ,” – ఈ భావం చాలా బాగుంది!

రాఘవ : బాగుందండీ గిరిగారూ. నాకు ద్విపద అనగానే శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా… అన్న పంక్తులే తొలిగా గుర్తొస్తాయి. పాడుకోవటానికి తేలిక ఛందస్సు.

సనత్ : నవ్వు చిందించిన నవ్యారుణ రుచి| పువ్వించు వాతెఱపూమొగ్గలేవి? చాలా బాగున్నది

గిరి: శంకరయ్యగారు, మీరు చెప్పనట్టుగా ఊహిస్తే ఇంకో బాపుబొమ్మవుతుంది 🙂

కామేశ్వర రావు : కాని గిరిగారి ద్విపద పాడుకోడానికి కన్న విరజాజి లేఖలా చదువ్కోడానికే బాగుంది 🙂

నచకి : 🙂

గిరి: ఈ మధ్యనే పప్పునాగరాజు గారు వారి తాతగారు వ్రాసుకున్న ద్విపద రామాయణాన్ని జాలంలో పెట్టారు – వీలుంటే చదవండి, అమోఘంగా ఉన్నది

రాఘవ : తొలిసారి చదువుకుంటారండీ, తరువాత పాడుకుంటారు 🙂

రవి : కామేశ్వరరావు గారు :ఇతరుల లెటర్లు చదవడం మంచిది కాదండి.

రాఘవ : అన్నట్టు, గిరిగారూ, మీరు కాటుక గుఱించి చెప్పి బొట్టు సంగతి ఎత్తకపోవటం…

శంకరయ్య : ‘శ్రీరామ భూపాలుడూ …’ అది ద్విపద కాదండీ …

కామేశ్వర రావు : రాఘవా మీరెంతైనా పాటగాళ్ళు కదా, దేన్నయినా పాడుకోగలరు 🙂

శంకరయ్య : ‘శ్రీలక్ష్మి నీ మహిమలూ … వంటి గేయం. పద్యం కాదు …

రాఘవ : శంకరయ్యగారూ, నేను ద్విపద అనగానే శ్రీరామభూపాలుడు గుర్తొస్తుందన్నానండీ. అది ద్విపద అనలేదు.

రాఘవ : ఎందుకో బుఱ్ఱలో అలా నిక్షిప్తమైపోయింది 🙂

శంకరయ్య : మంచిది..

కామేశ్వర రావు : గిరిగారు తన లేఖని ఇలా బయట పెడితే చదవకుండా ఉంటామా?

గిరి: రాఘవా, బొట్టు, వెనక కృష్ణుడి పటం గురించి వ్రాయలేదని నేను కించిత్ నిరాశ కలిగింది కానీ – అప్పటికే పదహారు పంక్తులలోకి వెళ్ళడంతో ఇక ముగించాను

రవి : పాడుకొమ్మన్నారు. చదువుకోరాదు. అంతే 🙂

గిరి: అందుకే, ఆదిత్య వ్రాసిన నిలువుబొట్టు పాదం నాకు అంతగా నచ్చింది

రాఘవ : గిరిగారు బహిరంగలేఖ వ్రాసారు… మన ఆడుపడుచుకు సిఫారసు చేయడం మన పని కూడా అని గూఢార్థం.

గిరి: కానీ కృష్ణుడి పటాన్ని గూర్చి ఎవఱూ వ్రాయలేదు

నచకి : ఆదిత్య గారి పద్యం కూడా హృద్యంగా ఉంది.

కామేశ్వర రావు : ప్రేమలేఖ అనగానే నాకు శ్రీనాథుని “శ్రీమదసత్య మధ్యకును” పద్యమే గుర్తుకువస్తుంది!

రవి : ఏమా ఉదంతం? చెప్పండి

కామేశ్వర రావు :

శ్రీమదసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజ యానకున్, మిగుల చక్కని ఇంతికి మేలు గావలెన్!

మేమిట క్షేమమీవరకు; మీ శుభ వార్తలు వ్రాసి పంపుమీ!

నా మది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహ బాంధవీ!

రాఘవ : చిన్నివయారికి …

గిరి: ఆ హా – శ్రీనాథునిదా, విచిత్రమే

రవి : అసత్య మధ్య! గగనకుసుమంలా ఏం ప్రయోగమండీ?

చదువరి : అసత్య మధ్యా అది..!

రాఘవ : అందులో చిన్ని పదం భలే అమరిందండీ. అలతి అలతి పదాలు ఎంచుకున్నాడు ఆయన.

చదువరి : భలే!

నచకి : ఆహా, ఎంత సింపుల్‌గా వ్రాసేసాడు మహానుభావుడు!

కామేశ్వర రావు : ఉత్తరంలో సగం పైగా ఆమె వర్ణనలే చేస్తే ఆ చిన్నివయారి పొంగిపోదూ!

గిరి: ఏ కావ్యంలోనిది – లేక చాటువా

నచకి : అసత్యమధ్య అన్న ప్రయోగము, చిన్ని వయారి అన్న ప్రయోగము సరసభరితంగా ఉన్నాయి.

కామేశ్వర రావు : చాటువు

రాఘవ : అలాగే, శ్రీనాథులవారిదే, శ్రీరస్తు భవదంఘ్రిచికురంబులకు అన్న చాటుపద్యం కూడా భలే ఉంటుంది చదవటానికి.

చదువరి : చక్కటి మాట! మనం అవర్ గ్లాస్ అని అనువదించుకున్నాం

గిరి: రాఘవా, వినిపించవోయీ

రాఘవ :

సీ ||

శ్రీరస్తు భవదంఘ్రి చికురంబులకు మహా
భూర్యబ్దములు సితాంభోజనయన

వర కాంతి రస్తు తావక నఖ ముఖముల
కాచంద్ర తారకం బబ్జవదన

మహిమాస్తు నీ కటి మధ్యంబులకు మన్ను
మిన్ను గలన్నాళ్ళు మించుబోడి

విజయోస్తు నీ గానవీక్షల కానీల
కంఠ హరిస్థాయిగా లతాంగి

గీ||

కుశలమస్తు లస చ్ఛాతకుంభ కుంభ
జంభవి త్కుంభి కుంభా విజృంభమాణ

భూరి భవదీయ వక్షోజములకు మేరు

మందరము లుండు పర్యంత మిందువదన

రాఘవ : గమనించండి…. నఖముఖములు అన్నవెంటనే చంద్రుణ్ణి తీసుకువచ్చారీయన. కటి, మధ్యము – మన్ను, మిన్ను.భూమి ఎంత తిరిగినా తరగదు, మిన్నేమో శూన్యమాయె.

కామేశ్వర రావు : నఖముఖములు – తారకలు, చంద్రుడు

నచకి : సితాంభోజనయన -> సితాంబోజనయన కదాండీ?

రాఘవ : అంభస్ అన్నది శబ్దం.

కామేశ్వర రావు : అంబుజ అన్నప్పుడు వత్తుండదు, అంభోజ అన్నప్పుడు ఉంటుంది

రాఘవ : అంబు, అంభస్ రెండూ నీటికే పేర్లు.

నచకి : అదే అడగబోయాను కామేశ్వరరావు గారూ, నెనర్లు! నెనర్లు, రాఘవా!

రాఘవ : వక్షోజములన్నాడు – మేరుమందరాల ప్రస్తావన వచ్చేసింది వెంటనే 🙂

రాఘవ : ఎంతైనా చిలిపి శ్రీనాథుడూ అనిపించాడు

శంకరయ్య : ఎత్తుగీతి అద్భుతంగా ఉంది.

రాఘవ : పైగా ప్రత్యేకంగా ఎత్తుగీతిలో చెప్పాడు వక్షోజముల గుఱించి!

కామేశ్వర రావు : అదీ ఊపిరి సలపనివ్వకుండా! 🙂

రాఘవ : ఆఁ 🙂

శంకరయ్య : రాగవల్లరి చూపించె రాఘవయ్య.

రాఘవ : నిజమేనండోయ్… నాకు ఇంతవఱకూ ఆ ఊహే రాలేదు.

రవి : కాలాతీతమవుతున్నది. ముందుకు వెళదామండి.

రాఘవ : అస్తు

రవి : శృంగారం నుండి హాస్యానికి వద్దాం

రవి : టీవీ సీరియల్ మధ్యలో కరెంటు పోవుట – పురాణకథాకాలక్షేపం సనత్ గారు చేస్తారు

చదువరి : శృంగారాన్ని దూరంగా పెట్టి హాస్యాన్ని దగ్గరగా ఉంచుకున్నారు రవి గారు!

రవి : ఊపిరాడట్లేదని రాఘవ గారే అన్నారుగా..

సనత్ : 🙂

రాఘవ : మధ్యలో నన్నెందుకు లాగుతారూ, నాకు ఇంకా ఏ అసత్యమధ్యలూ లేరుగా

గిరి : రవిగారు, ఊపిరాడనిది కామేశ్వరరావు గారికి 🙂

సనత్ :

వ ||
ఒకనాడు జాలారణ్యమున సనత్ మహామునిని కొత్తపాళీ మొదలుగా గల సత్కవులందరకూ అభీష్టసిద్ధి భగవంతుని కధనీవిధముగా      చెప్పదొడంగె..కలియుగమున భారతదేశమున ఆంధ్రదేశమున ఒకానొక భాద్రపద బహుళ నవమినాడు ఒక సాధ్వీమణికి నడిబజారునందు కలిగిన దివ్యానుభవమ్మును వివరించెద ఆలకింపుడు
శా||

టైమొక్కింతయులేదు సీరియలు యాడ్లైపోవునో ఏమొకో

ఆమాత్రానికి పర్వులెట్టుటలు ఆయాసమ్ములింకేటికో

స్వామీ నా మదిగోర్కె తీర్చగదె నాస్వాదింప నా సీరియల్

ఈ ‘మార్గమ్మున’ నెట్లొ జూపగదె నిన్నే వేడెదన్ భక్తితో !

అని పరి పరి విధముల నా సాధ్వీమణి ప్రస్తుతింపగా, కరుణించినవాడై భగవంతుడిరీతి లీలజూపగా నచ్చట సర్వాలంకార శొభితమైన ఒక టివీ షోరూం ఏర్పడె. టీవీలలో ఆ మగువ మనసుబడ్డ సీరియల్ రాదొడంగె. కోరికదీరినట్టి సమయమున సాధ్వీమణి భక్తి తనపైననా? సీరియల్ పైననా కనుగొనగోరి భగవంతుడొక చిన్న పరీక్షయుబెట్టి కరెంటు తీసివైచె.

టీవీ సీరియల్ మధ్యమున కరెంటు పోగా ఆ గృహిణులు పొందిన వేదన ఎట్లున్నదినిన..

ఉ ||

నేనొక టీవి షాపు కడ నిల్చి, భలే యని తల్చి, సీరియల్
మానక జూచువేళ ! నిటు మత్సరమొంది కరెంటుతీయగా
మానస మెట్టు లొచ్చె? చెపు మా, హృది కర్కశమైన దైవమా!
దీనులకున్ కరెంటనెడి దీవెనలీయగ రాదు రా ! దొరా !

కం||

ఒకపరి ముసిముసి నగవుల
నొకపరి క్రౌర్యమున మెలగు నుభయము తానై
దికమకపెట్టే పాత్రల
నికపై వీక్షించు రాత నిడెనో లేదో

అని పరి పరి యోచన జేసి తుట్ట తుదకు –

ఎవ్వడు చూపునిచ్చె? మరి యెవ్వడు ఇష్టములన్ సృజించె? నే
డెవ్వడు టివి నిచ్చె? గన నెవ్వడు తీసెను సీరియళ్ళనున్
ఎవ్వడు స్త్రీ మనస్సులను ఇవ్విధి నాడె కరెంటు తీసి నే
డవ్విభు గొల్తు నివ్వమని ఆదరమొప్ప పునః ప్రసారమున్ !!

అన్నిటా ఉన్నది వాసుదేవుడే యని తలచి, వానిని అర్ధిస్తూ చూచుట, చూచేవాడు, చూడబడునది అన్నీ తానే అనుచు గురుతించి నుతించిన ఆ సీరియల్ భక్తురాలిని గరుణించి అభీష్ఠవరమొసగె నా భగవంతుడు.

ఈ కథను చదివిన వారికీ విన్నవారికీ, చదివించినవారికీ, వినిపించినవారికీ అష్టైశ్వర్యములు కలుగుతాయని స్కాంధ పురాణం రేవాఖండంలో ఉన్నట్టుగా భావించమనిసనత్ మహాముని తెల్పగా సంతసించినవారై సత్కవులు సంతుష్టులైరి.

సనత్కుమారులు చెప్పిన కథను చదివిన వారు సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోదనీ పొయినా తద్వ్రుత్తాంతాన్ని ఒకసారి మనసులొ ధ్యానించితే ఫలశ్రుతి తెలిపారు ఆ కథను ప్రవచనం చేసిన హనుమత్ శాస్త్రులు

ఓం తత్సత్..

రాఘవ : స్కాందమన్నారు, భాగవతచ్ఛాయ కరుణశ్రీ స్థాయిలో తీసుకువచ్చారు!

సనత్ : శ్రీ హనుమత్ శాస్త్రుల వారు

రవి : “ఒకపరి ముసిముసి నగవుల..” – కళ్ళకు కట్టినట్టు వర్ణించారండి

చదువరి : దీన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాల్సి ఉంది మన రాష్ట్రంలో.

సనత్ : కలియుగం లో కాపీ యజ్ఞం బాగా ప్రబలుతుందని చెప్పారు కదా..

కామేశ్వర రావు : చదువరిగారు, మగజాతిపై మీకంత పగ ఎందుకండీ? 🙂

చదువరి : 🙂

సనత్ : అందుకే ఇప్పుడు ఏ పరిక్ష చూసినా, సీరియల్ చూసినా

రవి : చదువరి గారూ, లాభం లేదండి. దీన్నీ టీవీ సీరియల్ లా చూపిస్తే తప్ప ఎవరూ చూడరు

కామేశ్వర రావు : అందులోనూ ఆ ఫలశ్రుతి వింటేనే గుండె గుభేలుమంటోంది నాకు!

గిరి : కానీ ఆ సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పుటుక్కుమంటే కథ మళ్ళీ మొదటికే

సనత్ : నావంటి కాపీ కొట్టేవారికి కొదవేలేదు భువనవిజేతలీ కవులు ‘కాపీ కళలో’ అని మా భావన.

సనత్ : వెంటనే కరెంటు వస్తుందని ఫలశ్రుతి.*

కామేశ్వర రావు : దీన్ని కాపీ అనరండీ, పేరడీ అంటారు. అది కూడా గొప్ప కళే.

రాఘవ : దీనికి రుక్మిణే సాక్షి!

రాఘవ : 🙂

కామేశ్వర రావు : కావలిస్తే H2O కనిపెట్టిన వాళ్ళ వంశంవాని మీద ఒట్టు 🙂

నచకి : నవ్యంగా ఉంది, సనత్ గారూ!

చదువరి : కామేశ్వరరావు గారూ.. 🙂

ఆదిత్య : బాగుంది గానీ ..ముసి ముసి నగవులా..?? ఎక్కడ ? నాకెప్పుడూ వికటాట్టహాసాలే దర్శనమిస్తాయే !

కామేశ్వర రావు : తంబీ, నువ్వు సుమనుని సినిమా సీరియళ్ళు చూడలేదు 🙂

రవి : నచకి గారూ నవ్యకవితాసనత్ – అనే బిరుదిచ్చేద్దామా

నచకి : బిరుదులకేం, బ్రహ్మాండంగా యివ్వచ్చు, అధ్యక్షా!

గిరి: చూస్తూంటే కామేశ్వరరావుగారు సుమనుడి వల్ల చాల బాధపడినట్టు తెలుస్తోంది

చదువరి : సుమను పీడితులు ఎల్లెడెలా కన్పింతురు గిరివర్యా!

ఆదిత్య : ఇప్పుడే టిఫిన్ తిన్నాను దయచేసి టాపిక్ మార్చండి

చదువరి : 🙂

గిరి: చదవరి గారు, నేను తప్పించుకున్నానండీ – మొన్న కామేశ్వరరావుగారు పంపిన దృశ్యకము చూడడమే మొదటి (ఆఖరి) విడత

కామేశ్వర రావు : గిరిగారు, కేవలం ఇది యాడ్ లు చూస్తే కలిగిన వణుకేనండీ! అసలువెప్పుడూ చూసే సాహసం చెయ్యలేదు!

గిరి: ఆదిత్యా – హా హా

చదువరి : గిరీ, ఒకటి చూసారు కదా.. అది చాలు!

రాఘవ : ఏదో మారీచుడికి రా అని వినబడితే రాముడేనేమో అని భయం వేసినట్టుగా, సు అనగానే ఆంధ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. కాకపోతే అక్కడ రాక్షసుడు దేవుడికి భయపడ్డాడు.

చదువరి : 🙂

కామేశ్వర రావు : 🙂

గిరి: రాఘవా – భలే

కామేశ్వర రావు : సరే ఇక ముందుకు సాగడం ఉత్తమం.

రవి : సరేనండి..

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం – పారిజాతాపహరణములోని యొకకందము

తెలుగుపద్యాలలో కందానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. కవి అనిపించుకోవాలనుకొనే వాడు పాఠకులకు కందకందాయాలు తప్పక అర్పించుకోవలసిందే. క్రొత్తగా కవితలు, పద్యాలు అల్లేవారిని కాస్తోకూస్తో బెంబేలెత్తించేటట్టు కనబడే లక్షణాలు కందానికి ఉన్నాయి. ఆ భయాన్ని వీడి ముందుకు సాగితే కందాల్ని సులభంగా అల్లుకుపోవచ్చు. అంచేత ఏ కావ్యాన్ని తీసుకున్నా పదిపద్యాల కొకమాఱు కందము తగలకపోదు. చతుర్మాత్రగణ ప్రభావము వల్లనో, నిషిధ్ధ జగణము వల్లనో, పాదాంత్య స-లగలు చెలఁగుట వల్లనో కందం నడకకి అందం చేకూరింది. అలాంటి కందపద్యాలలో నచ్చినది ఒక్కటి ఏరి చూపడమంటే కష్టమే. అందుకే ఈ మధ్యకాలంలో చదివిన కావ్యంలోంచి గుర్తున్న కందాన్ని ఉటంకించాలని నిర్ణయించుకున్నాను.

పారిజాతాపహరణము ప్రసిధ్ధకావ్యం. మన తెలుగువారికే తెలిసిన సత్యభామ తొల్దొలుత ఈ కావ్యంలోనే రూపుదాల్చిందేమో. తెలుగింటి సత్యభామలో పతిభక్తికన్నా పతిని కను సన్నల త్రిప్పుకొనగలగే చక్కదనమున్నదని నిక్కూ, మిగతా రాణులకన్నా భర్త తనపట్ల అధికానురక్తుడై ఉన్నాడని తెలిసిన టెక్కూ ఎక్కవగా కనిపిస్తాయి. నే చెప్పబోయే పద్యం తిమ్మన గారు సత్యభామ చేత చెప్పించినది.

ఇక పద్యం విషయానికి వస్తే, నారదుడు పారజాత పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చాడు. అటుపై కలహాశనుడనే పేరు నిలబెట్టుకోడానికా అన్నట్టు, ఆ పూవును కృష్ణునిచేత రుక్మిణికి ఇప్పించాడు. రుక్మిణికి ఆ పుష్పప్రాసశ్త్యాన్ని వివరించి చివరలో, ’ఇదిగో తానేదో అందఱికన్నా ఎక్కువదాననని నిక్కుతున్నదే ఆ సాత్రాజితి, ఆమె కూడా ఇక నీ ముందు బలాదూర్ చూసుకో’ అని చేటుల చాటచెవుల బడేలా ఊది వెళ్ళాడు. ఈ సంఘటనల నుండి కృష్ణుడు తేరుకొని సత్యభామ సదనానికి చేరుకొనే లోపుగా ఒక పరిచారిక ఆగమేఘాల మీద పితూరీ మోసేస్తుంది. జరగవలసినదంతా జరిగిపోతుంది. ఈ ఘట్టాలన్నిటిలోనూ నువ్వా నేనా అనే విధంగా ఉంటాయి పద్యాలు.

మచ్చుతునక నారదుడు రుక్మిణికి చెప్పిన ఈ కందము.
క.

అలరుంబోఁడుల లోపల,

నలరుం బోఁడుములు నీకు నగ్గలమగుచున్

దలపూ వాడక యుండుము,

తలపూవు ధరించి వికచతామరసాక్షీ.

ఇక నే చెప్పదలచుకున్న కందిమిదిగో.
క.

ధనమిచ్చి పుచ్చుకొన్నను,

మనమున నోర్వంగ వచ్చు మగఁ డింతులకున్

జనవిచ్చి పుచ్చుకొన్నను,

మన వచ్చునె యింక నేటిమాటలు చెలియా

(అంటే, ధనమిచ్చి తిరిగి తీసుకుంటే ఓర్చుకోవచ్చు కానీ, అనురాగము చూపినవారు ఎదురు తిరిగితే ఓర్వగలమా)

చనువిచ్చిన తరువాత ఆ చనువును ఆసరాగా తీసుకొన్నవారు ఏదైనా తప్పుచేస్తే బాధకలగడం సహజం. ఎవరిపరంగా చూసినా ఇది నిజమే. సత్యభామకూడా అలానే అనుకుంది. తన ప్రేమను కృష్ణుడు కించపఱచినాడని ఆమె భావన. అలాంటప్పుడు ఈ పద్యంలో ప్రత్యేకత ఏమిటి? నాకు తట్టిన విషయాలు వివరిస్తాను. సత్యభామ వాక్కులో సహజస్వాభావికం కాని దైన్యము ఈ పద్యంలో కనిపిస్తుంది. భర్త తనను తక్కువ చేసాడని అనుమానము కలిగితే సవతులలాగ ఊరుకొనే స్వభావం కాదు సత్యభామది. మరి అలాంటప్పుడు ఈ దైన్యత ఎక్కడిది? తెలియాలంటే పితూరీ మోసిన చెలికత్తె సత్యభామని కలిసిన క్షణము నుంచి చెప్పుకు రావాలి.

చేటి మాటలు వినగానే మన కథానాయకి త్రాచుపాములా బుసకొట్టింది, భగ్గున మండే అగ్గిలాగ దిగ్గునలేచి నిలుచుంది, వేడివిషం లాంటి తనబాధను వెళ్ళగ్రక్కింది.
ముందు నారదుణ్ణి తూలనాడింది. అమరపురినుండి పువ్వు తెచ్చాడు సరే, కృష్ణునికి ఇచ్చాడు సరే, సమయానికి రుక్మిణి పక్కనుండటం చేత తప్పని పరిస్థితులలో కృష్ణుడు ఆ పువ్వును రుక్మిణికి ఇచ్చాడు సరే, రుక్మిణి కూడా తానే తగినదాన్ని అన్నట్టు తీసుకుంది సరే.. మరి మాటల్లోకి అనవసరంగా నన్ను లాగడమెందుకు, అని కోపగించుకుంది.

అవునులే, కలహభోక్తకదా, అంతకన్నా ఇంకేమి చేయగలడూ అంది. కాసేపు నారదుని మీద విఱుచుకుపడ్డాక, ఇక ధోరణి కృష్ణుని వైపు మళ్ళింది. మనబంగారము మంచిది కానప్పుడు కంసాలిననుకొని ఏమిలాభము అన్నట్లు, నారదుడిని రుక్మిణినీ అనుకోవడం దేనికి, కంసారి ననాలి కానీ అని తేల్చేసింది. నారదుడు నా ప్రస్తావన తెచ్చినప్పుడు ఊరకనిలుచున్న ధూర్తగోపాలుణ్ణి అనాలంది. అచలచిత్తుడై – కలకాలం పూసలో దారంలా మెలగే – మగడు దొరకడం దుర్లభమని తెలిసిందంది. కాసేపు కృష్ణుడు తనపట్ల చూపిన ప్రేమానురాగాలను తలచుకొంది. ఇలా దుఃఖాతిరేకం అవుతున్నకొద్దీ ఆమె మాటలలో దైన్యం చోటుచేసుకొంది. ఆ సంధర్భంలో చివరన చెప్పే పద్యమే ఈ ‘చనువు కందం’.

తత్క్షణమే కోపగృహంలోకి విసవిసా నడచివెళ్ళింది.

ఆ దైన్యం ఎంతసేపో నిలువదని తెలిసినా, పద్యం చదవగానే అయ్యో పాపం అనిపించక మానదు. సత్యభామ విషయంలో అలాంటి సందర్భాలు అరుదు. అందుకే నాకీ పద్యం ప్రత్యేకంగా తోచింది.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

శారదా విజయోల్లాసము – 1

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

రాఘవ  :  నమస్సర్వేభ్యః

కామేశ్వర రావు :  రాఘవులకి స్వాగతం

రాఘవ  :  వేదిక ఇదేనాండీ, లేక ప్రచ్ఛన్నంగా ఏమైనా నడుస్తోందా 🙂

చదువరి  : రాఘవ.. వేదిక ఇదేనండి.

రవి :  రాఘవ గారికి స్వాగతం

రాఘవ  :  కామేశ్వరరావుగారూ,రవిగారూ: నమాంసి

కామేశ్వర రావు :  @రాఘవ, అవును మీరు మాంసి అని మాకు తెలుసు 🙂

రాఘవ  :  ఇప్పుడు నేను అమాంసినా నమాంసినా అని ఆలోచించాలి 🙂

రవి :  ఇంకా అమెరికాలో పొద్దు పొడిచినట్లు లేదు

కామేశ్వర రావు :  పొద్దు కాస్త గట్టిగా పొడవాల్సిందా? 🙂

గన్నవరపు వారు : నేను కొద్ది సేపు మాత్రమే పాల్గోగలను. మిత్రులు బహుచక్కని పూరణలు చేసారు. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి, శ్రీ పండిత నేమాని వారికి నమస్కారాలు.

కామేశ్వర రావు :  అదుగో మూర్తిగారు వచ్చేసారు కాబట్టి అమెరికాలో పొద్దు పొడిచినట్టే! నమస్కారం మూర్తిగారు.

గన్నవరపు వారు : నమస్కారములు కామేశ్వర రావు గారూ

గన్నవరపు వారు : ఈ ఉదయము ముఖ్య కాలాతిక్రమణము లేకుండా సంధ్య వార్చడము జరిగింది !

గన్నవరపు వారు : ఆదిత్య గారూ చక్కని పద్యాలు వ్రాసారు. అభినందనలు !

చదువరి : ఔను అదిత్య గారి పద్యాలు బహు బాగా ఉన్నాయి.

కామేశ్వర రావు :  అధ్యక్షులవారు హఠాత్తుగా కొత్తవారిని సభ్యులని చేసి మాకు పరిచయమే చెయ్యలేదు! 🙂

ఆదిత్య  : ధన్యవాదాలు! అన్నన్నా!  🙂

చదువరి  : 🙂 అధ్యక్షా.. ఉన్నారా?

కామేశ్వర రావు :  అధ్యక్షులవారు ఎక్కడి వెళతారు. ఇదిరవి అస్తమించని పొద్దు సామ్రాజ్యం!

రవి :  ఈశ్వరులకూ, ఆదిత్యులకూ పరిచయం ఇదివరకే ఉంటుందని

చదువరి  : 🙂

 

గన్నవరపు వారు :గిరిగారూ ఈ సారి మీదే ఊపు. దంచేసారు !

గిరి : అవును, ఆదిత్య గారు చిట్టచివరగా వచ్చి చిచ్చుబుడ్లు వెలిగించారు

గన్నవరపు వారు : ఆదిత్య గారూ మిమ్మలను మేరే పరిచయము చేసు కొనండి. నేను వృత్తి రీత్యా వైద్యుడిని. నరసింహ మూర్తి నా పేరు.

గిరి : ఇంతకీ ఆదిత్యగారి పరిచయం?

రవి :  ఆదిత్య పరిచయం రవి గారి బదులు ఆదిత్య గారినే చేసుకోమని కోరుతున్నాను

ఆదిత్య  : పేరు విజయాదిత్య. కామేశ్వరరావుగారి తమ్ముణ్ణి. ఇంతకంటే ఇక్కడ పరిచయం అవసరంలేదనుకుంటా. 🙂

గిరి : మూర్తి గారు,రవిగారు కాస్త కరుణించి ప్రశ్నా పత్రం సులువుగా కూర్చా రీ మాటు

గిరి : ఆదిత్య గారు, మీ చిఱునామలో ఇంటిపేరు లేకపోవడం వల్ల కనిపెట్టలేక పోయాము

గన్నవరపు వారు : నేను సరిగ్గానే ఊహించాను. పెళ్ళి యెప్పుడు చేసు కొంటున్నారు ?

కామేశ్వర రావు :  మూర్తిగారూ 🙂 🙂

ఆదిత్య  : ఖళ్ళ్ ఖళ్ళ్ ఖళ్

కామేశ్వర రావు :  గిరిగారు, మీరిప్పుడున్నది సింగపు ఊరేనా?

గిరి : కామేశ్వరరావుగారు, సింగపూరేనండీ

గన్నవరపు వారు : మిత్రు లెవరైనా మా దిశలో వస్తే మా ఆతిధ్యము స్వీకరించమని విన్నపము. మేము డాలసులో ఉంటాము.

కామేశ్వర రావు :  మూర్తిగారి ఆతిథ్యం అసమానం, దానికి నేను సాక్ష్యం.

గిరి : అయితే, అమెరికా వెళితే పనికల్పించుకుని మరీ వస్తామండీ

గిరి : కామేశ్వరరావు గారు, మీరు విమానాశ్రయంలో కూర్చుని తిన్న దిబ్బరొట్టె మూర్తి గారి వంటింట్లోదేనా

గన్నవరపు వారు : తప్పకుండా! రండి.

ఆదిత్య  : అమెరికా వాళ్ళు ఇండియా గుట్టంతా ఎలా లాగుతున్నారో ఇప్పుడర్థమయ్యింది.:)

గిరి : కామేశ్వరరావు గారు, మీ ఇంట్లో ఇంకా పద్యాలల్లే వాళ్ళెంతమంది ఉన్నారో బయటపెట్టేయండి బాబు

గన్నవరపు వారు : మీకు కూడా దిబ్బరొట్టె పెడతాముగిరిగారూ! ఎవరికైనా తప్పకుండా, రండి !

గిరి : రొట్టె విషయం తెలియకముందే నిర్థారించుకున్నాను, ఈ సారి అమెరికా వస్తే తప్పకుండాను

కామేశ్వర రావు :  గిరిగారు, మా తల్లి చెట్టుకు కాసిన పళ్ళమే మేము!

గిరి : కామేశ్వరరావుగారు, కాస్త వివరిస్తారా..మీ పద్యఫలపరిమళాలు జాలజగద్విదితమే…కాకపోతే ఎన్ని పళ్ళున్నాయన్నది నా ప్రశ్న

కామేశ్వర రావు :  గిరిగారు, చెట్టు ఒకటి. పళ్ళు రెండు 🙂

కామేశ్వర రావు :  మూర్తిగారి మీద నా కంప్లయింటు ఒకటే. వారు ఆతిథ్యము ఇస్తారే కాని స్వీకరించరు 🙂

 

రవి :  మూర్తి గారూ, మీకు నేమాని వారు తెలుసనుకుంటాను

గన్నవరపు వారు :  మీ సింగపురు నుండి భారతదేశము మూడు గంటలలో చేరుతారు. అమెరికా నుండి వెళ్ళాలంటే దిబ్బరొట్టి తప్పక సహకరిస్తుంది. విమానము వాళ్ళ తిండి తినడము కష్టము.

గన్నవరపు వారు : శ్రీ నేమాని వారిని 1975 లో చూసాను. మరలరవి గారి సాయము వలన కొద్ది నెలల క్రితము మళ్ళీ పరిచయము కలిగింది. నా అదృష్టము

గన్నవరపు వారు :రవి గారూ మీరే కదా ఆయనకు నా చిరునామా యిచ్చినది, ధన్యవాదములు

 

గిరి :రవిగారు, సభ చిక్కిపోయి ఉంది ఈ సారి

రవి :  అవును గిరిగారు

శంకరయ్య  : అవునా?

కామేశ్వర రావు :  శంకరయ్యగారికి నమస్కారములు

శంకరయ్య  : నమస్కారం …

గన్నవరపు వారు : నాకు మొహమాటము లేదు కామేశ్వర రావు గారూ మీ ఊరు వస్తే తప్పక వస్తాను.మిత్రులను కలవడము నాకు చాలా యిష్టము

శంకరయ్య  : చింతా వారికి నమస్కారం

రవి :  కామేశ్వరరావు గారి ఆతిథ్యం బావుంటుంది. నాదీ పూచీకత్తు. 🙂

గిరి : శంకరయ్యగారు, నమస్కారం

శంకరయ్య  : నమస్కారమండీ!

శంకరయ్య  : ఇంకా గోష్ఠి ప్రారంభం కాలేదా?

గన్నవరపు వారు : నమస్కారములు గురువు గారూ, రామకృష్ణా రావు గారూ !

రవి :  సరేనండి. ఇక సభ మొదలు పెడదామంటారా?

గిరి : మొదలుపెడదామండీ

కామేశ్వర రావు :  అలాగే

శంకరయ్య  : కానీండి …

శంకరయ్య  :గన్నవరపు వారు వారూ, నమస్కారం!

ప్రార్థన

రవి :  యథావిధిగా శ్రీగణేశ ప్రార్థనతో సభ ఆరంభిద్దాం. చింతావారి కృతి.

శ్రీ గణనాధ! మా మది వసించుమ! విఘ్న వినాశ కారివై,

రాగిలఁ జేసి మా మదులు రమ్య సుచిత్ర కవిత్వ ధారలన్

వేగమె పారఁ జేయుమయ విశ్వ జనీనత పొంగ జేయుచున్.

సాగిలి నీకు మ్రొక్కెదము సర్వ శుభంకర సద్వశంకరా!

చింతా వారు : ఆర్యులందరికీ నమస్కారం.

రవి :  మీ పద్యం టంకించగానే వచ్చేశారు.

కామేశ్వర రావు :  రామకృష్ణారావుగారు, నమస్కారం.

చింతా వారు : ఇప్పటికి మా అమ్మాయి సహకారంతో ప్రవేశించ గలిగాను.

గిరి : విఘ్నేశ్వర స్తుతికదూ, విఘ్నాలు మాయమయిపోయాయి

రవి :  వైష్ణవి మాయ! :))

శంకరయ్య  : (ఆశువు)

సత్కవీంద్ర గణము సాహితీ యజ్ఞమ్ము

చింతా వారు :

చేయుచుంటిమయ్య చిత్ర సుగతి

చేయబూనినారు; చేరి యిటను

విఘ్నములు తొలంగ వేడెద గణనాథ!

పొద్దు పొడిచె నిపుడు ముద్దుగాను.

కామేశ్వర రావు :  పద్యసమ్మేళనం “గణ”నాథుని ప్రార్థనతో మొదలుపెట్టడం ఎంతో ఔచితీమంతం.

ఆదిత్య  : అయితే పూర్తి జనగణమనతో చేద్దాం 🙂

శంకరయ్య  :

ఆరంభింతము సద్గొష్ఠి నిపుడు …..?

చింతా వారు : ప్రీతిగ నటులే.

రవి :  రమ్య సు”చిత్ర” ధారలన్ అన్నారు. అందులో వారి అభినివేశాన్ని, ఈ సభలో ప్రవేశపెట్టిన కొత్త అంశాన్ని ప్రస్తావించడం బావుంది

కామేశ్వర రావు :  భేషుగ! పద్యాల్ సంతత మధుధారలగా

రవి :  శంకరయ్య గారి పద్యం “స” లక్షణంగా ఉంది.

గన్నవరపు వారు : చక్కని స్తుతి. మంచి పద్యము

చింతా వారు : ఎంతైనా శంకరులే

శంకరయ్య  : సంతోషము గలిగించును ….

చింతా వారు :

సంతసమున పలుక నటులె జరుగుటతగదే!

శంకరయ్య  : ధన్యవాదాలు చింతా వారూ …

కామేశ్వర రావు :  చింతా శంకరుల జంటకవిత్వం ఈ సభ ప్రత్యేకం!

గిరి : జుంటకవిత్వం

శంకరయ్య  :కామేశ్వర రావు గారిని ‘ఫాలో’ కాలేదు. మన్నించాలి.

కామేశ్వర రావు :  అయ్యో! మీరు గురువులు. మేమే మిమ్మల్ని అనుసరించాలి

రవి :  మరో పద్యానికి సాగుదాం. చింతా వారిదే శారదాంబ ప్రార్థన

చింతా వారు :

భజియింతుం నిను భావనా జనిత సద్భాగ్యంబువై  శారదా

విజయోల్లాసము గొల్పుమా! సకల సద్విజ్ఞాన సంధాత్రివై

సుజనాభాసిత జాల మేళనమునన్ శోభిల్లుమా! శారదా

విజయోల్లాసము చిద్విలాసమగు నీవే మమ్ము దీవించినన్.

గిరి : అస్తు

చింతా వారు : ఆ శారదాంబ మనలను కటాక్షించును గాక.

కామేశ్వర రావు :  విజయోల్లాసాన్ని యీ పద్యంతో ద్విగుణీకృతం చేసారు!

గిరి : విఘ్ననాయకుని ప్రార్థన, సరస్వతీ దేవి స్తుతి మహిమ వల్ల మరికొంతమంది కవులు ప్రత్యక్షం కావాలి

శంకరయ్య  : భజియింతుం నిను …  ఇక్కడ అనుస్వారం రాకూడదనుకుంటా. ‘భజియింతున్ నిను’ …. లేదా ‘భజియింతున్ వరభావనా జనిత…’ అంటే బాగుంటుందేమో?

చింతా వారు : భజియింతున్నిను

గిరి : శంకరయ్యగారు, నాదీ అదే అనుమానము – అయితే భజియింతున్ అనే చదువుకున్నాను

శంకరయ్య  : అక్కడ టైపాటనుకుంటా.

చదువరి  : టైపాటేమో

గన్నవరపు వారు : శారదాంబ ప్రార్ధన చాలా బాగుంది

శంకరయ్య  : అనుమానం లేదు… అది ‘టైపాటే’!

 

సవరించిన పద్యం:

భజియింతున్నిను భావనా జనిత సద్భాగ్యంబువై  శారదా

విజయోల్లాసము గొల్పుమా! సకల సద్విజ్ఞాన సంధాత్రివై

సుజనాభాసిత జాల మేళనమునన్ శోభిల్లుమా! శారదా

విజయోల్లాసము చిద్విలాసమగు నీవే మమ్ము దీవించినన్.

రవి : గిరిగారు కూడా శారద ప్రార్థన వినిపించాలి

గిరి : చిత్తం

అమ్మా నిన్ను స్మరించి నవ్యరచనావ్యాసక్తి నర్థించు మా

కిమ్మిమ్మైన కవిత్వవాక్సరణి బ్రాహ్మీ దివ్య భావార్థసా

రమ్ముల్ సంకలితాత్మమై పదములన్ రమ్యమ్ముగా పద్యహా

రమ్ముల్ కూర్పు పటుత్వమిమ్ము విజయోల్లాసమ్మునన్ శారదా

చింతా వారు : చక్కని మత్తేభ గమనంతో సాగింది మీ శారదా ప్రార్థన.

చదువరి  : “మాకిమ్ము ఇమ్మైన” -అంతే కదా?

గన్నవరపు వారు :గిరిగారూ మనోజ్ఞముగా ఉంది

గిరి : చదువరి గారు, అంతేనండీ

శంకరయ్య  : అద్భుతమైన ధార! రవి గారు,గిరిగారు చేసిన శారదా ప్రార్థనలు బాగున్నాయి.

రవి :  “అక్షరాణామకారోస్మి” – అని గీతాకారుడు. అకారంతో మంగళకరంగా ఉందండి.

కామేశ్వర రావు :  ఇమ్ము ఇమ్మైన – ఇది లాటానుప్రాసా?

గిరి : lot of ప్రాస అనిపించింది, లాటాను కూడానేమో మీరే చెప్పాలి

కామేశ్వర రావు :  🙂

చదువరి  : పద్యం బాగుందండి.

ఆదిత్య  : రమ్ము రమ్ము మాత్రం ” లోటా ” ను ప్రాస

రవి :  🙂

రవి :  ఇమ్మైన – అంటే అర్థం ఏమిటండి?

గిరి : రవిగారు – ఇంపైన అని

శంకరయ్య  : అనుకూలము, మనోహరము అనే అర్థాలున్నాయి.

శంకరయ్య  : ఇమ్ము శబ్దానికి ..

 

కొత్తపాళి : అందరికీ నమస్కారం

చదువరి  : నమస్కారం కొత్తపాళీ గారూ.

రవి :  కొత్తపాళి గారికి స్వాగతం. కాసేపటి ముందే సభ మొదలయింది. “ఇమ్ము” శబ్దం అర్థం చెబుతున్నారు శంకరయ్య గారు

గిరి, చింతా వారు, కామేశ్వరరావు గారు,గన్నవరపు వారు వారు : నమస్కారం కొత్తపాళీగారు, స్వాగతం.

రవి :  సరేనండి. కొత్తపాళి గారు వచ్చిన వేళ – “కొత్త” అంశం చేబడుతూ-

రవి :  శ్రీచక్రబంధ కందం – చింతా వారి తరపున నేను టంకిస్తున్నాను.

గిరి : ఉటంకించండి

శ్రీ శారదాంబ  శ్రీ  కవి

పోష. యిరవు గొలుపు.  శ్రీ సుబోధన్సుశ్రీ

ధ్యాస నిడును. శ్రీన్ శుభకర!

శ్రీ శారద ధ్యాస యిమ్ము! శ్రీకరసుశ్రీ!

చింతా వారు : ధన్యవారాలు రవీ!

గన్నవరపు వారు : పద్యాలను యిమ్ముగా యిస్తున్నారు కవివర్యులు !

రవి :  ఈ పద్యం తాలూకు చిత్రం ఇక్కడ –

శ్రీచక్ర బంధ పద్యం - పొద్దు

శ్రీచక్ర బంధ పద్యం

గిరి : చింతావారు సునాయాసంగా ఇలాంటి చిత్రకవితలు వ్రాస్తూ ఉంటే ఆశ్చరం వేస్తుంది

కొత్తపాళి : ఆసక్తికరంగా ఉన్నది. శ్రీచక్రబంధము అంటే శ్రీచక్ర ఆకృతిలో ఉంటుందేమో ననుకున్నాను

రవి :  కొత్తపాళి గారు, ఈ చిత్రకవితలకు లక్షణాలు కూడా ఉన్నాయండి. పుస్తకం తిరగెయ్యాలి.

చింతా వారు : నిజమే

శంకరయ్య  :

ఎందులకీ యాలస్యము?

సందేహము వీడి గోష్థి సాగించుడు మీ,

కందరకు నేను చేసెద,

వందనశతములను పద్యవర్షము గురియన్.

శంకరయ్య  : బంధ, గర్భ కవితా విశారదులు వారు.

కామేశ్వర రావు :  అయితే శ, ష, స లకి ప్రాస కుదురుతుందన్న మాట.

చింతా వారు : ఊష్మవిశ్రాంతి

చింతా వారు : కాదు కాదు

చింతా వారు : ష స

గిరి : నాదొక చిన్న అనుమానము మూడవ పాదంలో శ్రీన్ ఉన్నది, చక్రములో కూర్చేటప్పుడు శ్రీకారాన్ని ద్రుతప్రకృతిని విడగొట్టవచ్చా

రవి :  నాకూ ఈ అనుమానం వచ్చియున్నది

చింతా వారు : చతురంగ బంధంలో పొల్లక్షరానికి ఒక గడి

చింతా వారు : అలాగే శ్రీచక్ర బంధంలో కందానికింతకంటే మార్గం కనబడలఏదండి.

రవి :  కందం – లిమిటేషను అనుకుంటాను. గీతికి సరిగ్గా సరిపోతుంది.

చింతా వారు : ఔనండి.

గిరి : అదే అనుకున్నాను, ఎలాగైతేనే చక్రాన్ని ముందుకు లాగేసారు చింతావారు

గిరి : రామకృష్ణులు కదా, చక్రం త్రిప్పడం వారికేమంత కష్టమైన పని కాదు

చదువరి  : గిరి.. 🙂

చింతా వారు : మాకు కరంటు కష్టాలు మొదలయ్యాయి.

శంకరయ్య  : నాదీ అదే సమస్య …

రవి :  నాకూనూ 🙂

కామేశ్వర రావు :  ఆంధ్రదేశంలో కరెంటు సమస్య ఎప్పుడూ “కరెంటే” 🙂

చింతా వారు : మాకు పోయింది. యూపీయస్ ఆగిపోతోంది.

Posted in కవిత్వం | Tagged , | Comments Off on శారదా విజయోల్లాసము – 1

శారదా విజయోల్లాసము

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

పద్యకవుల విజయదశమి సమ్మేళనం “శారదా విజయోల్లాసము” సెప్టెంబరు 17 న మొదలై 12 మంది పద్యకవులతో అక్టోబరు 1 వ తేదీన శనివారం నాడు జరిగిన ప్రత్యక్ష సభతో విజయంతంగా ముగిసింది. అనేక గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభలో కింది కవులు, రసజ్ఞులు పాల్గొన్నారు.

సంచాలకుడు: రవి

పాల్గొన్న కవులు:

1.     భైరవభట్ల కామేశ్వరరావు

2.     లంకా గిరిధర్

3.     రాఘవ

4.     సనత్‌శ్రీపతి

5.     కంది శంకరయ్య

6.     నచకి

9.     గన్నవరపు నరసింహమూర్తి

10.   చదువరి

11.  చింతా రామకృష్ణారావు గారు

12.   విజయాదిత్య

 

ఇతరులు :-

1.  కొత్తపాళి

2.  కోడిహళ్ళి మురళీమోహన్

 

ఈ కవిసమ్మేళనంలో సంధించిన  సమస్యలు ఇవి:-

 

సమస్యాపూరణము:

  • భువనవిజేతలీభువనపూర్ణ విజేతలు జాల సత్కవుల్.
  • దార్ఢ్యము కల్గినన్ జయము తప్పక శత్రు వశంబు చేతుమే!
  • వైరిఁ గీర్తించె పతిమెచ్చ వారిజాక్షి.
  • దమ్మును లాగుచుంటి గద తాళగరాదె క్షణమ్ము నీవికన్.
  • రంభా హృదయాబ్జ భృంగ! రామయనంగా!
  • సాక్ష్యంబేదని త్రోసిపుచ్చెను హరిశ్చంద్రుండు నక్షత్రకున్ .
  • శపియింతును బ్రతుకఁగ శతసంవత్సరముల్.
  • శ్రీపరమేశ్వరా! కనగ శ్రీహరి వాణికిఁ గాంతుఁడౌను! హా!
  • కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను.
  • చిగురులకున్ నమస్సులిడ చేతులురా విదియేమి కాలమో!
  • భీముఁడు దుర్నీతుఁడు నవివేకియు నిజమే.
  • దర్పముకన్న లేదుగద దైవికమౌ గుణమీ జగంబునన్.
  • సూర్యుఁ డుదయించెఁ జీకట్లు చుట్టుముట్టె.
  • కోకిలమ్మ మెచ్చె కాకిగోల.
  • యతులన్ వీడిన తెల్గుపద్యమదియే భాసించు దా హృద్యమై
  • గారెలు బొబ్బట్లరిసెలు గరళసమమ్ముల్.

దత్తపదులు:

  1. తూరుపు/తూర్పు – పడమర – ఉత్తరం – దక్షిణం – దిక్కులనే అర్థాలలో వాడకుండా ఈ కాలంలో వార్తా ఛానళ్ళ గురించి.
  2. బిట్టు – చిప్పు – మెమరీ – బైటు – పద్య ప్రాశస్త్యం
  3. ద్రౌపది – భీముఁడు – కృష్ణుఁడు – కంసుఁడు  – రామాయణ ఇతివృత్తంతో ఐచ్ఛిక వృత్తంలో  పూరించండి.

కొత్త ఛందస్సు

పంచచామరము:
శివున్ స్మరించ పాపముల్ నశించునా? యబద్ధమే. (విష్ణు భక్తి వర్ణనము.)

వర్ణనలు

  1. బుల్లితెర నటవిఖ్యాతులు వేసిన కృష్ణునివేషం ఎన్.టీ.ఆర్ చూడడం తటస్థించితే ఆయన (ఎన్.టీ.ఆర్) మనోభావాలు ఎలా ఉంటాయి?
  2. టీవీ సీరియల్ మధ్యలో కరెంటు పోతే గృహిణులు పొందే వేదనను కరుణరసాత్మకంగా వర్ణించండి.
  3. ఈ క్రింది “బాపు బొమ్మ” ను కానీ, ఆ బొమ్మకు తగిన ఊహను కానీ వర్ణించండి.

బాపు బొమ్మ - శారదా విజయోల్లాసం, పొద్దు

బాపు బొమ్మ

4.  కింది రవివర్మ చిత్రానికి తగిన కథ/ఉదంతం పద్యరూపంలో ఐచ్ఛిక ఛందస్సులో వ్రాయండి.

రాజారవివర్న చిత్రం - శారదా విజయోల్లాసం, పొద్దు

రాజారవివర్మ చిత్రం

చిత్రకవిత

శ్రీ చక్ర బంధములో వీణా పాణిని స్తుతించండి.

అనువాదం
ఈ క్రింది శ్లోకాన్ని తెనుఁగులో అనువదించండి. యథాతథంగా కాకపోయినా, ఆ అర్థం వచ్చేటట్లు అనుసరించినా సమ్మతమే.

జ్యోత్స్నాంశాకర్షపాణ్డుద్యుతి తిమిరమషీశేషకల్మాషమీష
జ్జృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణశోచిః |
ప్రాతః ప్రారంభకాలే సకలమివ జగచ్చిత్రమున్మీలయన్తీ
కాన్తిస్తీక్ష్ణత్విషో2క్ష్ణాం ముదముపనయతాత్తూలికే వాతులాం వః ||

(అదుగో! పొన్నపువ్వు ఛాయలో పొద్దుపొడుస్తూంటే చల్లని వెన్నెల తెల్లదనం వ్యాపిస్తూంది. తిమిరరమణి మషీశేషపు నల్లదనం ఆమె పట్టు వల్లెవాటు చెరగు వలె భాసిస్తున్నది. అరవిందసుమాలు పుప్పొడి విరజిమ్ముతూ పచ్చగా మెరుస్తున్నాయి. పుడమితల్లి ఉభయసంధ్యల్లోని ఎఱుపు రంగు గ్రహించి శోభనంగా వెలిగిపోతున్నది. చిత్రభానుని కుంచె నుండి ప్రపంచచిత్రం అందంగా రూపుదిద్దుకుంటూంది)
– కవితాకన్యక కర్ణాభరణం మయూరకవి సూర్యశతకం – ౨౬

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం

కందం గురించి తెలుఁగు పద్యకవులకు చెప్పడమంటే తెలుగువాడికి గోంగూరపచ్చడి గురించి చెప్పడమన్నంత దోషం. అంచేత ఉపోద్ఘాతాలు అవీ లేకుండా ఓ రెండు కందపద్యాలను ఆస్వాదించి “ఆహా” అనుకుందాం.

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతరపరిమళమై
మగువ పొలుపు దెలుపు నొక్క మారుతమొలసెన్.

అది పెద్దన గారి ఘుమాయింపు.

అడిగెద నని కడు వడి జను
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

ఇది పోతన గారి గుబాళింపు.

ఇటువంటివి మీరూ రుచి చూసి ఉంటారుగా. ఆ రుచి (సౌందర్యము)ని మాకూ తెలుపండి. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కందపద్యం ఒకదాని గురించి వివరించండి. పద్యార్థం వివరించడంతో పాటు, ఆ పద్యం ఎందుకు నచ్చింది? ఆ వెనుక కథాక్రమంబెట్టిది? మొదలైన వివరాలను అందించండి.

కవులకు మాత్రమే కాక, శారదావిజయోల్లాసం పాఠకులకున్నూ ఈ ఆహ్వానం అందిస్తున్నాం. మీ రచనలను editor@poddu.net కు పంపండి. హామీపత్రం మరువకండి.

వచ్చిన స్పందనలలో మెచ్చిన వాటిని పొద్దులో ప్రచురించడం జరుగుతుంది.

Posted in వ్యాసం | Tagged , | 2 Comments

సత్యప్రభ – 1

ధరణి రవీంద్రుల ధర్త ఎవండు / పరశక్తి పౌలోమి భర్త ఎవండు,

ఒజ్జలు వర్ణించు నుత్తము డెవడు / ముజ్జగముల నేలు మొనకాడెవండు,

ధాతల ధాతయౌ తాత యెవండు / భూతంబులకు మూల భూతమెవండు,

జీవులు జీవించు జీవమెవండు / దైవంబులర్చించు దైవమెవండు,

యుధ్ధేశుడగు నాది యోధ్ధ ఎవండు / బుధ్ధీశుడగు నాది బోధ్ద ఎవండు,

అందరి లోపల నాత్మ యెవండు / మందులు గానని మర్మమెవండు,

జాతులేకంబగు జాతి ఎవండు / అఖిలము మించిన వ్యాపకుడెవడు,

నిఖిలము మించిన నిత్యుడెవండు / ఆకాశ తనువుచే నలరారు నెవడు,

పాకారి తనువుచే పాలించునెవడు / ఆ యాది దేవుని, అభవు, ననంతు,

మాయావి నింద్రుని మదిలో దలంతు.

అని స్వకృతియైన ఇంద్ర దశకాన్ని పాడుకుంటూ, కౌండిన్య సుచంద్రుని ఇరవై మూడవ రాజ్య వర్షాన, ‘విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ సోమవారం నాటిరాత్రి పూర్వయామంలో,‘సత్యప్రభ’ ‘గణపవర’ గ్రామం నుండి,‘శ్రీకాకుళ’ నగరానికి మరలి వస్తోంది! ఇప్పటికి నగరం అర క్రోసు దూరంలో ఉంది. ఆమె నడుస్తున్న స్థలం ఒక చిట్టడవి, దారి సంకుచితంగా ఉన్నా వెన్నెల్లో చక్కగా తెలుస్తూంది.

సత్యప్రభ చారిత్రిక నవల

’సత్యప్రభ’

సత్యప్రభ పందొమ్మిది సంవత్సరాలు నిండిన యువతి. మహా సుందరిగా ఉన్నా, సుకుమారాంగి కాదు! వ్యాయామంఛే సంస్కారం పొంది, వజ్ర ధృడాలైన ఆమె అంగాలు వేరే శోభను పోషిస్తున్నాయి. ఆమె మంఛి బలవంతురాలే కాదు, ఆయుధ విద్యలన్నింటిలో నేర్పరి! ఆంధ్ర గీర్వాణ భాషల యందు వ్యుత్పన్నురాలు. అమృత వచనాలు సృజించు కవీశ్వరి!

ఆమె ధరించిన చీర ముతకగా ఉన్నా, నిర్మలంగా ఉంది. రవికె దానికి తగ్గట్లుగా ఉంది. చెవులకి ముత్యాల పోగులు, చేతులకు గాజులు, కాళ్లకి వెండి కడియాలు, మెడలో చిన్న వరాల పేరు.. ఇవి మాత్రమే ఆమె ధరించిన ఆభరణాలు. ఆమె వేషం నిరాడంబరమైనా ప్రసన్నంగా ఉంది.

కీర్తిశేషుడైన రాథీతర సత్యరథుని పెంపకపు కూతురు సత్యప్రభ. పదిహేడు సంవత్సరాల క్రిందట సత్యరథుడు ఆంధ్ర కళింగుల ఘోర సంగ్రామంలో అనేక శత్రువులను నురుమాడి రణహతుడై  వీర స్వర్గాన్ని అలంకరించాడు. సత్యప్రభను పెంచిన సత్యరథుని పత్ని పేరు చంపావతి. సత్యరథునికి సత్యప్రభ ఈ చిట్టడివి లోనే దొరికిందట! ఇట్టి సుందరాంగి శిశువుని ఏ తల్లి విడిచి వేసిందో! సత్యప్రభని గహించిన పిమ్మట చంపావతీ సత్యరథులకి మణిమాల అనే కూతురు పుట్దింది. ఆ పిల్ల సత్యప్రభ కంటె ఒక సంవత్సరం చిన్నది.

సత్యప్రభ వెళ్తున్న దారిలో వైరూప సోమదత్తుని ఆశ్రమం ఉంది. అతని బిరుద నామం అక్షోభ్య ముని. మునిని ఒకసారి చూసి వెళ్లాలని తలచింది సత్యప్రభ. సత్యప్రభా మణిమాలలకు అతడు మంత్ర గురువు. కాబట్టి అతని ఆశ్రమాన్ని దాటి వెళ్లడానికి ఆమె ఇష్టపడ లేదు. ఆమె త్రోవలో నుండి ఆశ్రమం వైపు తిరిగింది. ఆశ్రమ ద్వారం తెరచే ఉంది. ముని లోపల ఉన్నారని ఆమె నిశ్శబ్దంగా ప్రవేశించింది.

ముని లోపల కన్పడ లేదు. అచ్చట ఇంకొకడున్నాడు. అతడు సుందర యువకుడు, కులీనుడైన సంపన్నుడు, గర్వితుడైన సైనికాధికారి. అతని సంపూర్ణ నామధేయం మౌద్గల్య వీరసింహుడు.

సత్యప్రభని చూడగానే వీరసింహుడు కూర్చొన్నవాడు లేచి నిలబడ్డాడు. అతడు సత్యప్రభను అనేక పర్యాయాలు చూసాడు. కాని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసి ఉండ లేదు. ఉజ్జ్వలమైన దీపం ఆమె ముఖాన్ని వానికి చక్కగా ప్ర్రదర్శిస్తూంది. వాడు ఆమెను చంపావతి పెద్ద కూతురని పోల్చాడు. సత్యప్రభ కూడ వాడెవడో తెలుసుకొంది, కాని సంభ్రమాన్ని చూపెట్టలేదు. ఆ పరస్పర దర్శనములో వీరసింహుడు తన దృష్టులతో ఆమె రూపాన్ని అర్చించడానికే పూనుకొన్నాడు. సత్యప్రభ తటస్థంగా నిలిచింది.

ఆ దర్శనోత్సాహంలో వీరసింహుని మనస్సు సత్యప్రభను ఈ విధంగా స్తుతించింది.

‘తాక్షక చంద్ర సేనుని కుమార్తె పర్ణినిని చక్కని చుక్క అని ఆ వాడ వారందరూ చెప్తారు. ఆ ఉత్తమ సుందరి ఈమె ముందు, సూర్యప్రభ కెదురైన కర దీపికవలె శోభింపదు.!’

‘మహారాజు కుమార్తె రథినీ కుమారి ప్రపంచము లోని చక్కని కన్యల్లో అగ్రగణ్యురాలని రూప మర్మఙ్ఞుడైన గావల్గణి రూపచంద్రుడు తీర్పిచ్చి ఉన్నాడు. వాడు కాని ఈమెను నిదానించి చూచినప్పుడు, తన తీర్పును గురించి పునరాలోచన చేయకుండా ఉండలేడు.’

‘చంపావతి పుత్రి మణిమాల అందరి కంటె చక్కనిదని నేను రూపచంద్రునితో వాదించడం కలదు. కాని ఈమె కంటె ఎక్కువ అని చెప్పజాలను. ఆమె ఎంత లావణ్యవతిగా ఉన్నా, దయనీయ తన్వంగి, ఈమె పరిపుష్ట భోగ క్షమాంగి! కండపుష్టి సౌందర్యంలో ప్రధానాంశమని నా అభిప్రాయం!’

‘చంపావతికి రెండు రత్నాలు లభించాయి. ఆ రెండింటిలో దీని వెలయే ఎక్కువ! ఈమె మహా వజ్రం! మణిమాల పుష్యరాగం!’

ఇట్లు హృదయంలో శబ్దించుకొంటూ వీరసింహుడు బహిరంగంగా ఇలా అన్నాడు:

“భద్రముఖీ! మునిగారిని చూడడానికా వచ్చావు?”

“ఔను” ముక్తసరిగా జవాబిచ్చింది సత్యప్రభ.

“ఈ పుష్యార్క యోగంలో ఒక మూలికను గ్రహించడానికి వారు అరణ్య మధ్యానికి వెళ్లి ఉన్నారు. వెళ్లి చాల సేపైంది. ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చో!”

ముని వచ్చేవరకు ఉండడమా లేక వెళ్ళిపోవడమా అని ఆలోచిస్తూ, కొన్ని క్షణాలు సత్యపభ గడిపింది. కొసకు వెళ్లి పోవడానికే తీర్మానించి వీరసింహునితో ఇలా అంది:

“నేను మరొకసారి మునీంద్రుని చూసుకొంటాను. ఇప్పుడు వెళ్లి పోతాను. నాకు ఉత్తరువు ఇప్పించండి.”

సత్యప్రభ లోపలికి ప్రవేశించిన తక్షణమే తన్ను చూసి సిగ్గుపడి వెనక్కు తగ్గక, తన కభిముఖంగా నిలుచుండి, వెళ్తానని చెప్పి, తన ఉత్తరువును ఎదురు చూడడం వీరసింహునికి అపోహ కలుగచేసింది! ఆమె ఆభిముఖ్య వినయాలు కామ ప్రేరితాలని వాడు భ్రమించాడు!

మహా వీరవనిత సత్యప్రభకు స్త్రీ జాతి సహజమైన లజ్జ తక్కువ. వీర పరీక్షలో వీరసింహుడు మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయాడని, ఆమెకు వానిపై గౌరవం ఉంది. తన గురువైన అక్షోభ్య మునికి శిష్యుడని ప్రీతి కూడా ఉంది. ఈ రెండు భావాలూ ఆమెను వానికి అభిముఖంగా చేసాయి., వినయంతో మాట్లాడించాయి. బంధుత్వం లేని స్త్రీ తన పట్ల స్నేహం కొంచెం చూపితే చాలు, సాధారణంగా యువకుడు దానిని కామం అని ప్రాయికంగా శంకిస్తాడు. కామచ్ఛాయ లేని స్నేహం బంధువులుకాని స్త్రీ పురుషుల మధ్య ఉండగలదని నమ్మడానికి ఎంతో విశాల బుద్ధి కావలసి ఉంటుంది. వీరసింహునికి అంత విశాల బుధ్ధి లేదు. అందువలన సత్యప్రభ తనను కామించిందని వాడు శంకించడంలో ఆశ్చర్యం లేదు. ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని  భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.

కామింపబడ్డానని భ్రమించిన వీరసింహుడు సత్యప్రభను కామిస్తున్నాడు. వాని కామం స్థిరపడిన కొన్ని క్షణాలలో భ్రమ కొంత శిథిలమైంది.ఆమె తనను ప్రేమిస్తూందా లేదా అన్న సంశయం వానిలో ఉదయించింది. వెంటనే వాడు ఆమె మెల్లగా జారిపోతుందేమో అని సందేహించి, ముని వస్తున్నారేమో చూచే నెపంతో ద్వారదేశాన్ని ఆక్రమించుకొన్నాడు.

వాని దృష్టి బాహ్యప్రదేశం వంక లేదు. ముని వచ్చుచున్నారా, లేదా అనే గొడవే వానికి లేదు.వాని దృష్టి ఉన్మాదంతో సత్యప్రభ మీదకే దుముకుతూంది. ఉత్సాహంతో సత్యప్రభ అంగ సంధుల్లో ఆడుతూంది, పిపాసతో ఆమె లావణ్యామృతాన్ని త్రాగుతూంది.

సత్యప్రభ ఈ విషయాన్ని కనిపెట్టింది, ఆమెకు అనుమానం కలిగింది. కొన్ని క్షణాలలో కొండలా ఉన్న వీరసింహుడు ఆమె దృష్టిలో దూదిపింజై పోయాడు!

“నీవు రాథీతర సత్యరథుని కుమార్తె సత్యప్రభవని నేను పోల్చుకొన్నాను, నా పోలిక సరేనా?” అనిప్రశ్నించాడు వీరసింహుడు.

సత్యప్రభ తృటికాలమైనా వృధా చేయకుండా, సింహిక లాగు వానిపై పడి, సాయుధమైన వాని బాహువును కఠారితో తీవ్రంగా పొడిచింది.వాణ్ని చంపే ఉద్దేశం ఆమెకు లేదు, అలాంటి అభిప్రాయమే ఉంటే, ఆమె వాని హృదయం పైననే పొడిచి ఉండేది. వాని మదం భగ్నం కావాలి, వాని ప్రాణాలు పోకూడదు —ఇదే ఆమె ఉద్దేశం.

“ఔను.”

“నేనెవరో పోల్చుకొన్నావా?”

“ఎవరు మీరు?” అని అఙ్ఞానాన్ని అభినయించి అడిగింది సత్యప్రభ.

“మహాసమాహర్త (రెవిన్యూ మంత్రి) మౌద్గల హేమచంద్రుడు మా తండ్రి, నా పేరు వీరసింహుడు. ఆచార్య భవనంది గురుకులంలో శాస్త్రవిద్యల్నీ, ఆచార్య విషమసిధ్ధి గురుకులంలో శస్త్రవిద్యల్నీ చక్కగా అభ్యసించాను. రెండు మాసాలుగా రాజకీయ సేనలో ‘సహస్ర పతి’గా పనిచేస్తున్నాను.

“ఓహో అలాగా! చాల సంతోషం.”

“రాథీతరీ! నేను నీతో కొన్ని సంగతులు మాట్లాడవలసి ఉంది. దానికి తగిన సమయ ప్రదేశాలు లభించిన దానికి సంతోషిస్తున్నాను.”

“ఆ సంగతులేమో?”

“నా కనేకులు పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నా మనస్సు, రాథీతరీ.., నీపై లగ్నమై పోయింది. రాథీతరి ముఖం నుండి అనుకూల వాక్యాన్ని అపేక్షిస్తున్నాను. నీ అభిప్రాయం అనుకూలంగా ఉంటే, నేను ఘడియలో నా తల్లి తండ్రులతో చెప్పి సంబంధాన్ని స్థిర పరుస్తాను.”

ఇప్పుడు వీరసింహుని భావం సత్యప్రభకి అర్థమయింది. అలాగు అడగడం తప్పని ఆమె భావించ లేదు. కాని అలాంటి ప్రసంగానికి తగిన దేశ కాలాలు అవి కావని ఆమె తలంచింది. తత్కాల కామోద్రేకమే దేశ కాలౌచిత్యాన్ని ఉల్లంఘించిన ప్రసంగానికి కారణమని ఆమె నిర్ణయం. అందువలన వీరసింహుని విషయంలో పడిపోయిన ఆమె గౌరవ బుధ్ధి తిరిగి తల ఎత్తలేక పోయింది. ఆమె భావ శూన్యమైనప్పటికిన్ని, మృదువుగానే ఇట్లు ప్రత్యుత్తరాన్ని ఇచ్చింది:

“మీ అమ్మగారు మా అమ్మను ఈ విషయంగా అడుగునట్లు ఏర్పాటు చేయండి. మా తల్లి అంగీకరిస్తే నేను బధ్ధురాలి నవుతాను..”

ప్రత్యుత్తరం ప్రతికూలంగా లేదు. కాబట్టి వీరసింహుని ఆశకు భంగం కలుగ లేదు. కాని సత్యప్రభ సూచించిన సంవిధానం వానికి నచ్చలేదు. వాని తాత్కాలికోద్రేకం విఘ్నాల్ని సహించలేక పోయింది.వాడు మరలా ఇట్లు అడిగాడు:

“మనం ముఖాముఖిగా సంప్రతించుకొని పరస్పరాంగీకారానికి వచ్చిన తరువాత, పెద్దల సమ్మతికి అనుధావించ వచ్చును. నా అంగీకారాన్ని చెప్పివేశాను. నీ యందు ప్రేమాతిశయంచే నేను ఎట్టి త్యాగం చేస్తున్నానో గమనించు. మా ఆస్తి పది లక్షల విలువ కలిగి ఉంది సుమా! నీ ముఖచంద్రుని నుండి వచ్చు ప్రత్యుత్తరాన్ని నేను వినగోరుతున్నాను.”

“నా అభిప్రాయాన్ని వినాలనే మీ కుందా?”

“ఔను రాథీతరీ!”

“ఆలోచించు కోవడానికి రేపు సాయంకాలం వరకు నాకు అవకాశం ఇవ్వండి.”

సత్యప్రభ ఇప్పటికి వాని నుండి తప్పించుకొని పోవడానికి అలాగు మృదువుగా బదులిచ్చింది. ఎలాంటి విలంబాన్ని సహించలేక పోయాడు, ఆ ఉధ్ధత వీర యువకుడు. వాడు ఆ బిగువుతోనే ఇలా అన్నాడు:

“ఇప్పటి నీ భావాన్ని నేను వినగోరుతున్నాను. నేను కపటం లేకుండా అడుగుతున్నాను. నీవు కూడా కపటం లేకుండా బదులు చెప్పాలి.”

వీరసింహుని స్పష్ట ప్రశ్నకు స్పష్టమైన ప్రత్యుత్తరాన్నే ఇవ్వాలని సత్యప్రభ నిశ్చయించింది. ఆమె వీరసింహుని ఆశ పటాపంచలయేటట్లు ధృఢ స్వరంతో పలికింది:

“స్పష్టంగా నా భావాన్ని మీరు వినగోరుతున్నారు కాబట్టి చెప్తున్నాను.. అధిక పరిచయం లేని ఒక కన్యకను ప్రథమ దర్శనంలోనే భావాన్ని చెప్పమని  బలాత్కరించే మీ స్వభావం నాకు నచ్చలేదు. అధికంగా ఒక కన్యకను ప్రేమించిన వాడు ఇట్టి విరసమైన చర్యను అవలంబించడు. విలంబాన్ని సహించని ఇట్టి ఉద్రేకం పశు స్వభావమే కాని, మానవ స్వభావం కాదు. నేనిప్పుడు మిమ్మల్ని ప్రేమించలేక పోతున్నాను. ఎన్నటికి కూడా ప్రేమించలేను. మీరు సహ ధర్మాచరణానికి మరొక కన్యను వెతుక్కోండి.”

“ముగ్ధురాలా, ఏమిన్నీ ఆలోచించకుండా నీవు తిరస్కరించ వద్దు. కొద్ది రోజుల్లో నేను దండనాయక పదవికి రావడం తథ్యం. ప్రసాదంలో మా కుటుంబానికి ఉన్న పలుకుబడి నీకు తెలిసే ఉంటుంది. మా  ఆస్తి కూడా అఖండ మయింది. నా వీరత్వం కూడా నీకు తెలియని విషయం కాదు.”

“ఈ విషయంలో ఆలోచనలు  పనికిరావని మీరే నిర్ణయించారు. కాబట్టి నేను ఆలోచించను. నా భావాన్ని స్పష్టంగానే చెప్పాను. దీని గురించి మరి మీరు మాట్లాడ వద్దు.మర్యాదగా దారి ఇవ్వండి, నేను వెళ్లాలి.”’

ఇంతటితో వీరసింహుడు మౌనం వహించిన బాగుండును. వాడు తాను అవమానింప బడినట్లు తలంచాడు. ఆ తలంపు రాగానే వాని యుక్తాయుక్త విచారం అస్తమించింది. సాధ్యాసాధ్య విచారం తలనే ఎత్తలేదు. కార్యాకార్య విచారం వెనక పడింది. లాభాలాభ విచారం సన్నగిల్లింది. ధర్మాధర్మ విచారం అసలే వానికి లేదు. నా అంత వాడు కోరి తిరస్కరింప బడడమా అన్న పట్టుదల వానిని ఉత్తర ప్రసంగానికి పురికొల్పింది.

“నా మనస్సును దొంగలించిన కన్యను నేను ఉపేక్షింప జాలను. సుందరి యగు కన్యక వీరపురుషుని సొత్తు.”

“నిజమే! సుందరియగు కన్యక వీరపురుషుని సొత్తే అగును. నీవు మాత్రము వీరపురుషుడవు కావు. వీరపురుషులు రణరంగమున అద్భుత కృత్యాలను ఆచరింఛి సుందర కన్యకల మనస్సుల్ని ఆకర్షిస్తారు. వివిక్త ప్రదేశంలో స్త్రీలను భయపెట్టడం దస్యు లక్షణం. అది వీర లక్షణం కాదు. ఇలాంటి వివిక్త దేశ వీరుని నుంచి రాథీతరి సత్యప్రభ భయపడదు.”

రెండవ పేజీ చూడండి >>

Posted in కథ | Tagged , | 6 Comments

థ్రిల్

“ఏరా మామా! యూనివర్సిటీ బంద్, మెస్ లో యేదో తిన్నాము. ఇప్పటిదాకా తిరిగాము. హాస్టల్ కు వెళ్ళబుద్ధి కావడము లేదు. వాతావరణలు హాయిగా, చల్లగా ఉంది. గొడవలు, ఉద్యమాలు పుణ్యమా అని చదువూ సంధ్యా లేదు. ఇంకేమి.. అలా సెంటరుకు వెళ్ళి యే సినిమా హీరో నైనా బ్రతికిద్దామ” అన్నాడు ఉత్సాహంగా రఘు.

“పన్నెండు అవుతోంది. ఆకలి కూడా అవుతోంది. ఏమైనా తిని వెళ్దాము”, కడుపు పట్టుకుని అన్నాడు రాబర్ట్.

“నెలాఖరు, ఇంటి నుండి వచ్చిన డబ్బులు, ఇటు స్కాలర్ షిప్ డబ్బులు అయిపోయాయి. నాకు తెలిసినంతవరకు ఈడ్చి తన్నినా మన దగ్గర నాలుగు పైసలు లేవు. తిరిగింది చాలు, మెస్ కు వెళ్ళి సాంబారు తిని, నాలుగు పేజీలు తిరగేస్తూ రూమ్ లో పడుకుందాము”, అన్నాడు సీరియస్ గా సుకుమార్.

“వీడెప్పుడు ఇంతేరా, ఉత్త బోర్ గాడు.. ఎప్పుడూ నీతులు చెబుతూంటాడు. అరేయి! వినండిరా, మన యూత్ ఎప్పుడూ సరదాగా ఎంజాయి చేయాలి.అడ్వెంచర్స్ చేయాలి. కాస్త థ్రిల్ అనుభవించాలి. అప్పుడే లైఫ్ లో మజా ఉంటుంది”, అన్నాడు ఈజీ గోయింగ్ దామోదర్.

“మీ మాటలు, డిస్కషన్స్ మీకేనా? నాకు ఆలి వేస్తోంది, తిండి సంగతి చూడండి”, అన్నాడు రాబర్ట్.

“ఐడియా! మనం ఎన్నో సినిమాల్లో చూసాము, ఎన్నోసార్లు ప్రయత్నించి విజయము సాధించాము. ఆ ప్లాన్ అమలు చేద్దాము. అందులో ఎంతో థ్రిల్ కూడా ఉంటుంది”, అన్నాడు దామోదర్.

“యేం ఐడియారా, నాకు అర్థం కావడం లేదు”, అన్నాడు అహ్మద్.

“యేముంది, ఏదైనా ఫంక్షన్ హాల్లో దూరడము, ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళలా ఫోజు కొడుతూ, తెలిసిన వాళ్ళలా అందరినీ పలకరిస్తూ తృప్తిగా భోంచేసి రావడము” అన్నాడు దామోదర్.

“ఈ లేకితనము, దిక్కుమాలిన వేషాలు బయటపడితే చీవాట్లు లేదా చెంపదెబ్బలూ తిని, దేభ్యం మొహం వేసుకుని బయటికి రావడము! ఇదేగా నీవు చెప్పేది” అయిష్టంగా మొహం పెడుతూ, కటువుగా అన్నాడు రవికుమార్.

“పోరా, ఇందులో ఎంత థ్రిల్ ఉంటుందో నీకేమి తెలుసు. ముక్కూ మొహం తెలియని వాళ్ళ మధ్యకు వెళ్ళి, గంటసేపు ఉండి, హాయిగా భోంచేసి హుందాగా బయటికి రావడము ఆషామాషీ వ్యవహారం కాదు.దీనికి ఎంతో నైపుణ్యం, గుండెధైర్యం కావాలి. అన్నిటికంటే థ్రిల్ పొందలన్న కోరిక ఉండాలి”, అన్నాడు దామోదర్.

“చూడు దామూ, నీవూ మన స్నేహితులూ చాలాసార్లు రకరకాల ఫంక్షన్లకు వెళ్ళి పీకల దాకా మెక్కి వచ్చారు. ఒకసారి పట్టుబడి నానా అవమానాల పాలు అయ్యారు. ఇవ్వాళ, రేపు ఫంక్షన్స్ చేయడము, భోజనాలు పెట్టడము అంటే లక్షల్లో వ్యవహారం. ఉన్నవాడి సంగతి వదిలేయండి. అఫ్కోర్స్, బాగా డబ్బున్నవాళ్ళ అరిస్టోక్రటిక్ ఫంక్షన్స్ దరిదాపులోకి కూడా మనలాంటివాళ్లను రానీయరు. వెళ్తే మధ్యతరగతి జీవుల బడ్జెట్ ఫంక్షన్స్ కే వెళ్ళాలి. పాపం వాళ్ళు పైసాపైసా కూడబెట్టుకుని, ప్రతీది బడ్జెట్ వేసుకుని ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడుతూ ఫంక్షన్స్ చేస్తారు. అటువంటి ఫంక్షన్స్ కి మనలాంటి పిలవని పేరంటాలు వెళ్ళి కడుపునిండా మెక్కి ఘనకార్యం చేసామని బయటపడుతూంటాం. కానీ ఆ పెళ్ళిపెద్ద చేయించిన భోజనభాజనాలు వచ్చిన అతిథులకు సరిపోక ఎంత ఇబ్బంది పడతాడో మనం ఆలోచించం” అన్నాడు సుకుమార్.

“భలే చెప్పొచ్చావులే.. సుమతీశతకం. ఇవ్వాళ రేపు యే పెళ్ళినైనా చూడు డబ్బు మంచినీళ్ళలా ఖర్చుపెడుతున్నారు. మనం పదిమందిమి తింటే చేసేవాడికి యేమి తగ్గుతుందిరా? అయినా పెళ్ళిళ్ళలో, విందుల్లో తినేదాని కంటే పారేసేదే ఎక్కువ. పదిమంది ఎక్కువగా వస్తే పెట్టలేనివాడు పెళ్ళిళ్ళు, విందులూ చెయ్యడం ఎందుకురా? అయినా నీతో మాకేంటి. పదండిరా అదుగో మాటల్లోనే శంకర్ ఫంక్షన్ హాలుకు వచ్చాం. అక్కడ యేదో పెళ్ళి జరుగుతోంది. పదండి సుష్టుగా భోచేద్దాం”, అంటూ మిత్రులను ఉత్సాహపరచాడు దామోదర్.

“చూడు దామూ, మనం యూనివర్సిటీ వేదికలపై పేదరికము, ఆకలి, నిరుద్యోగం వంటి గంభీరమైన అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసాలిస్తాము. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, చైతన్యము వంటి విషయాలను యువత అలరచుకోవాల్సిందేనని నొక్కివక్కాణిస్తాము. తీవ్రమైన విషయాలపై ఉద్యమాలు చేస్తాము. కానీ కొన్ని చిన్నచిన్న విషయాలలో సంఘ మర్యాదలు, సాంఘిక బాధ్యతలు మరచిపోయి లేకిగా, చవకగా ప్రవర్తిస్తాము. ఇలాంటి చిన్నచిన్న విషయాలు కూడా సమాజ హితంలో భాగమేనని గుర్తించము. పెద్దపెద్ద ఆదర్శాలు వల్లించడం కన్నా చిన్నచిన్న మంచి పనులు చెయ్యడం మన వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశింపజేస్తుందని భావించము”, అన్నాడు సుకుమార్.

“వద్దురా బాబూ, మమ్మల్ని చావ బాదకు. ఉన్న మూడ్ పాడుచేయకు. వస్తే రా, చస్తే చావు. అంతేగానీ, లెక్చర్లు దంచకు”, అంటూ ముందుకు కదిలాడు దామోదర్. మిత్రులు అతడిని అనుసరించారు. మూర్ఖులతో మాట్లాడి ప్రయోజనం లేదని మౌనంగా సుకుమార్ వారిని అనుసరించాడు.

ఫంక్షన్ హాల్. అప్పుడే పెళ్ళి తంతు ముగిసినట్టుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వివాహం. అటు అట్టహాసంగానూ లేదు, ఇటు సాదాసీదాగానూ లేదు. మిత్రసమూహం పెళ్ళిహాలు లోకి అడుగుపెట్టారు. వీరు హాలులోకి అడుగు పెడుతూండగా ఈ మిత్రబృందం తాలూకు స్నేహితుడు అయిన రవి వీరిని చూసి నవ్వుతూ ఎదురుగా వచ్చాడు. మిత్రబృందము కొంచెం ఖంగుతిన్నారు. కానీ సిగ్గు లేకుండా, దిగజారుడుతనాన్ని బయటపడనీయకుండా విష్ చేసారు. రవికి వీరి సంగతి తెలుసు. ఎందుకు వచ్చారో అర్థమైంది. మనస్సులోనే నవ్వుకుంటూ వారిని ఆహ్వానించాడు. “ఇక్కడ జరగింది మా కజిన్ పెళ్ళి. పెళ్ళి కూతురి తండ్రి మా బాబాయి అవుతాడు. రండి, పరిచయం చేస్తాను. మా చెల్లెలికి విషెస్ చెప్పండి.”, అంటూ మిత్రబృందాన్ని తీసుకువెళ్ళాడు. పరిచయాలు, విషెస్ తరువాత డైనింగ్ హాలుకు తీసుకువెళ్ళి, “సిగ్గుపడకుండా భోంచేయండి. నాకు కాస్త పనుంది” అంటూ మరొక వైపుకు వెళ్ళాడు.

అంతే, ఉప్పెన ఊరిమీద విరుచుకు పడినట్లు, ఆకలితో ఉన్న సింహం ఏనుగు కుంభస్థలానికి ఎగసినట్లుగా, రిలీఫ్ క్యాంప్ లో శరణార్థులు ఆహార పొట్లాల వైపు పరుగెత్తినట్లు మిత్రబృందము ఆబగా ప్లేట్లపై విరుచుకు పడ్డారు. ఒక్కొక్కళ్ళు ముగ్గురు తిన్నంత తిన్నారు. తృప్తిగా త్రేన్చారు. సుకుమార్ మాత్రం ఒక స్వీట్ తిని మౌనంగా ఒక ప్రక్కన కూర్చున్నాడు. భోజన కార్యక్రమము అవ్వడంతో పెళ్ళి వారికి వీడ్కోలు చెప్పి, బయలుదేరారు.
—————

“సుష్టుగా తిన్న భోజనము తాలూకు ఎఫెక్ట్ అంతా దిగిపోయింది. ఈ హీరో, డైరెక్టర్ కలిసి మనను రెండున్నర గంటలు బాది పారేసారు. తలనొప్పిగా ఉంది.”, సినిమాహాలు నుండి బయటికి వస్తూ అన్నాడు రఘు. “ఔను, తలంతా వాచిపోయింది. అర్జెంటుగా చెంబెడు కాఫీయో టీయో పడాలి”, అన్నాడు రాబర్ట్.

“ఇరానీ హోటలుకు వెళ్ళి టీ తాగుదాము”, అన్నాడు సుకుమార్.

“అరే పాగల్! హోటల్ ఎందుకురా, పొద్దున పోయిన ఫంక్షన్ హాలుకు మళ్ళీ పోదాము. ఎట్లాగూ రవిగాడు ఉన్నాడుగా. ఈపాటికి ఎక్కడివారు అక్కడికి పోయి ఉంటారు. అప్పగింతలు అవుతూంటాయి. పిల్లను పిల్లగాడింటికి పంపుతూ పెళ్ళివారికి ఇంత చాయ్ పొయ్యరా, ఇంత టిఫిన్ పెట్టరా? అదే టైమ్ లో మనము వెళితే మనకు పెట్టరా, పొయ్యరా.. అక్కడికే పోదాము”, అన్నాడు దామోదర్.

“ఆలోచన బాగానే ఉంది”, అన్నారు మిత్రబృందము.

“మళ్ళీ వెళ్ళడమా? అట్లా వెళ్ళడము తప్పు. నేను రాను”, అన్నాడు సుకుమార్.

“అక్కడ నీవు ఏమీ తినవద్దు, తాగవద్దు. స్నేహధర్మముతో మాతో పాటు రా”, అన్నాడు రఘ. అనుసరిచాడు సుకుమార్.

మిత్రబృందము పెళ్ళిహాలులో ప్రవేశించింది. ఎక్కువమంది లేరు. కుర్చీలు సర్దేసారు. ఇప్పుడే పెళ్ళి అయిన ప్రదేశంలా లేదు. కళతప్పిట్లుగా ఉంది. అక్కడ ఉన్నవారిలో పెళ్ళి ఉత్సాహము లేకపోగా, గాంభీర్యము కానవస్తున్నది. సుకుమార్ కు ఏదో సందేహము వచ్చింది. ఇంతలో రవి వచ్చాడు.. ’మళ్ళీ ఎందుకు వచ్చార్రా’ అన్నట్టుగా చూస్తూ. ఆ విషయాన్ని బయటపెట్టక, సైలెంట్ గా విష్ చేసాడు.

“యేరా రవీ, పెండ్లి అంతా పీస్ ఫుల్ గా జరిగిందా?”, అడిగాడు సుకుమార్.

“పెండ్లి బాగా జరిగింది. భోజనాల దగ్గరే ప్రాబ్లమ్ వచ్చింది”

“యేం ప్రాబ్లమ్?” ఆసక్తిగా అడిగాడు రఘు.

“మా బాబాయి సెక్రెటేరియట్ లో గుమాస్తా. మధ్యతరగతి మనిషి. అయినా తాహతుకు మించి ఘనంగా వివాహాన్ని ప్లాన్ చేసాడు. ఇరువైపు వారూ కలిసి రెండు వందల మందిని పిలుచుకున్నారు. మా బాబాయి ఎందుకైనా మంచిదని మూడువందల మందికి సరిపడా భోజనము చేయాలని వంటవాళ్ళకు చెప్పాడు. భోజనాల సమయానికి అందరినీ భోజనానికి ఆహ్వానించాము. మీరు మొదట్లోనే తినివెళ్ళారు కదా. ఆ తరువాత పావుగంటలో, చేసిన పదార్థాలన్నీ అయిపోయాయి. నిజానికి తిననివారు ఇంకా దాదాపు వందమంది దాకా ఉన్నారు. వంటవాళ్ళు మూడువందల మందికి సరిపడా వంట చేసామన్నారు. కావలిస్తే ఎంగిలిప్లేట్ల లెక్క చూసుకోండి అన్నారు. మేమంతా పెళ్ళి హడావుడిలో పడిపోయి ఏం పెడుతున్నారు, ఎవరు వచ్చి తినిపోతున్నారు అన్న విషయాలను గమనించలేదు. అయిందేదో అయింది, మళ్ళీ వండమన్నాము. వాళ్ళు మా దగ్గర సరుకుల్లేవు, కూరగాయలు అయిపోయాయి అన్నారు. మేమంతా తలోదారిన వెళ్ళి అప్పటికప్పుడు అరగంటలో సరుకులు కూరగాయలూ తెచ్చాము. బజారు నుండి స్వీట్, హాట్ కొనుక్కుని వచ్చాము. ఇలా మేము ఈ హడావుడిలో ఉండగా పెళ్ళి కుమారుడి బంధువులు కొందరు అప్పుడే భోజనానికి వచ్చారు. అక్కడ పెట్టడానికి ఏమీ లేదు.

మా పిన్నీ, బాబాయిలు ఒక్క అరగంట అగండి ఏర్పాటు చేస్తున్నాము అనే లోగానే ’బాగానే పెళ్ళి చేసాడు భోజనాలిఉ లేకుండా’ అంటూ అక్కడినుండి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. ఇంతలో పెళ్ళికొడుకు తాలూకు ఆఫీసు స్టాఫ్ వచ్చారు. వాళ్ళు అక్కడి పరిస్థితి చూసి, మాకు టైమ్ అవుతోంది, భోజనాలదేముంది అంటూ వెళ్ళిపోయారు. కొందరు ఏమీ తినకుండా వెళ్ళారు. అది నేనూ చూసాను. పెళ్ళికొడుకు వాళ్ళ అక్కయ్య, మరొక ఇద్దరు పెళ్ళికొడుకుతో ఏమన్నారో తెలియదు.. పెళ్ళికొడుకు, “భోజనాలు చెయ్యకుండా వెళ్ళిన ఆ పదిమంది నాకు చాలా ముఖ్యులు. నా బంధువుల్లో నాకు చాలా అవమానము జరిగింది. పెండ్లి ఇలా చేస్తారని ఊహించలేదు”, అంటూ ఊగిపోయాడు. మేమంతా పెండ్లికొడుకు తల్లిదండ్రులకు, పెద్దలకూ క్షమాపణలు చెప్పాము. మా బాబాయి, పిన్నీ పెండ్లికొడుకు తల్లదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు చేసారు. అయినప్పటికీ వాళ్ళు పెండ్లికొడుకుతో పాటు వెళ్ళిపోయారు. మా పిన్ని, బాబాయి, మావైపు పెద్దలూ వాళ్ళింటికి వెళ్ళారు. మా చెల్లి పచ్చని పందిట్లో ఏడ్చి ఏడ్చి స్పృహతప్పి పడిపోయి, ఇప్పుడిప్పుడే స్పృహ లోకి వచ్చింది”, ఎంతో బాధతో చెప్పుకొచ్చాడు రవి. మిత్రబృందము అంతా స్తబ్దులై వినసాగారు. వారి నోటమాట రాలేదు.

“ఒక్క పదిమందికి సమయానికి భోజనము సరిపోకపోవడంతో ఇదంతా జరిగింది. పదిమందికి భోజనము సరిపోయుంటే, ఒకవేళ భోజనము అయిపోయినా ఎలాగో చేయించేవారిమి కాబట్టి, ఈ సమస్య రాకపోయేదేమో. అయినా పెళ్ళిలో ఇలాంటివి మామూలే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. ఊహించని విధంగా కొందరు వస్తూంటారు. దానితో అంచనాలు తారుమారు అవుతూంటాయి. ఏం చేస్తాం? పాపం మా చెల్లెల్ని జీవితాంతము వాళ్ళ అత్తగారింటి వాళ్ళు దెప్పుతూంటారు కాబోలు. ఆ.. అన్నట్లు ఎలాగూ వచ్చారు, టీ ,స్నాక్స్ రెడీగా ఉన్నాయి. తీసుకుని వెళ్ళండిరా”, అన్నాడు రవి మిత్రబృందముతో.

అనవసరంగా వచ్చిన తాము పదిమందిమి కూడా ఈ పెండ్లి ఇలా రసాభాసగా ముగిడానికి ఒక కారణము అని అర్థము అవ్వగానే మిత్రబృందము ముఖము మాడిపోయి, మనసులు పశ్చాత్తాపముతో రగిలి పోసాగాయి.

“లేదురా, పిక్చర్ కు వెళ్ళాము. పోతూపోతూ దారిలోనే కదా అని నిన్ను కలిసి పోదామని వచ్చాము. టీ, కాఫీలు వద్దు. మేము బయట త్రాగి వచ్చాము. వి యార్ వెరీ సారీ! అలా జరిగి ఉండాల్సింది కాదు.” అంటూ కళ్లలో నీళ్ళతో అన్నాడు సుకుమార్.

రవి దగ్గర సెలవు తీసుకుని పెండ్లి హాలు బయటికి వచ్చారు అందరూ. మిత్రబృందము మొహాలు వేలాడదీసుకుని చేదు తిన్నవారిలా ఉన్నారు.

“యేరా దామోదర్, ఈ థ్రిల్ ఎలా ఉంది?”, అన్నాడు సుకుమార్.

దామోదర్ మౌనంగా, సిగ్గుతో తవంచుకున్నాడు.

Posted in కథ | Tagged | 1 Comment

కథా కథనం – 4

కథ  – వస్తువు

కథ కొన్ని యితర ప్రక్రియల నుండి ఎక్కడ ఏ విధంగా ఏ మేరకు భిన్నమో,  ప్రత్యేకమో , యింతకుముందు చూసేం.  ఆ ప్రక్రియలకూ వాటినేకాక మరెన్నింటికో కూడా ఉమ్మడి వస్తువు జీవితం. మానవ జీవితం వీటన్నిటి ఉమ్మడి నేల అయితే అందులో దేని పరిధి ఏదో, ఏ మేరకో తెలియాలి.

కథ పరిధి – అని గిరి గీయటానికి లేదు. సమర్థులు జీవితంలో ఏభాగం నుండైనా  వస్తువు తీసుకోగలరు. ప్రతిభావంతులు దేనినైనా కథగా చెప్పగలరు.  మనమూ అంతవారమైతే  ఫరవాలేదు. లేనప్పుడు ఏ పొర జీవితమైతే కొత్త రచయితలు సులభంగా చెప్పగలుగుతారో, ఏ వస్తువైతే కథకు సులభంగా లొంగుతుందో తెలుసుకోవడం మంచిది.

ఈ  ప్రపంచంలో అనునిత్యం, అనుక్షణం ఎన్నో జరుగుతుంటాయి.

మనుష్యులు కష్టించి శ్రమ చేస్తారు. చాకిరి చేస్తారు. ఆఫీసుల్లోనూ అక్కడా పనిచేస్తారు.

ఒకరికొకరు సహకరిస్తారు.  పదుగురు కలసి ఒకే పని చేస్తారు. స్నేహితులవుతారు. శత్రువులవుతారు. బంధువులవుతారు. బానిసలవుతారు.

రహదార్లమీద లక్షలాది వాహనాల్లో కోట్లాదిగా ప్రయాణిస్తారు. రవాణాలు చేస్తారు. రవాణాలు చేసుకుంటారు.

ఆయా అవసరాల కోసం వారేర్పరచుకొని పోషిస్తున్న వ్యవస్థల చుట్టూ, సహాయం కోసం, న్యాయం కోసం, సేవల కోసం తిరుగుతుంటారు. వాటిని కొంటారు. ఇతరుల కందకుండా చేస్తారు. వంచిస్తారు. వంచితులవుతారు. లాభంపొందుతారు. దెబ్బతింటారు. నష్టపోతారు.

ప్రజల పేరుతో దేశాల్లోనూ, విదేశాలలోనూ ఒప్పందాలవుతాయి. పరస్పర సహకారాలకీ వాణిజ్యాలకూ  ఒడంబడికలవుతాయి. కొన్నాళ్ళు సవ్యంగా సాగుతాయి. తగాదాలొస్తే కలహాలూ యుద్ధాలూ అవుతాయి. శాంతులు నెలకొంటాయి. సంధులు జరుగుతాయి. కొందరు బాగుపడి చాలమంది చెడతారు.

మనుష్యుల అజాగ్రత్తవల్లా, ప్రకృతి పరిణామాలవల్లా, అనర్థాలు సంభవిస్తాయి. వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరూ దెబ్బతింటారు.

మనిషి మనుగడ భద్రమూ, సుఖవంతమూ చేయడానికి భూమి నాలుగు చెరగులా కొందరు మనుష్యులు అలా అహర్నిశలూ కృషిచేస్తూనే ఉంటారు. స్వార్థపరు లా కృషిని స్వీయ ప్రయోజనాలకు వినియోగించుకుని మనిషి కష్టాన్ని మరీ మరీ పెంచుతూనే ఉంటారు.

ఇవీ, యిలాంటివీ – అన్నీ మనిషి బయట ప్రపంచానికి సంబంధించినవి. మనుష్యుల ఉమ్మడి జీవితం అవుతూ వ్యక్తుల అంతరంగిక (మానసిక) జీవితాన్నీ, విడివిడిగా వారి బాహ్యజీవితాన్నీ, ప్రభావితం చేసేవి, ఎంతో కొంత మేరకి వాటిని నిర్ణయించేవి.

విడివిడిగా మనుష్యుల బాహ్య జీవితాల్లోనూ వ్యక్తిగతంగా వారివారి అంతరంగిక జీవితాల్లోనూ కూడా అనునిత్యం, అనుక్షణం ఎన్నెన్నో జరుగుతాయి.

మనుష్యులు ఎవరికి వారు –

పనులు నేర్చుకుంటారు.  చదువుతారు. జీవిక కోసం వెదుక్కుంటారు. ఎందులోనో స్థిరిపడతారు. ముందే జీవిక అమరినవారు పుట్టిన చోటు నుండి కాలు కదపరు.

తోబుట్టువులవీ, కన్నవారివీ బరువులు మోస్తారు. వదల్చుకుంటారు. కట్టుకున్న వారినీ, కడుపున పుట్టిన వారినీ శ్రద్ధగా సాకుతారు. వాళ్ళ పాట్లకు వాళ్ళని వదలిపెడతారు. ఇంటా బయటా కలుపుగోలుగా ఉంటారు. కయ్యానికి కాలు దువ్వుతారు.

అయిన వారి మధ్యా కాని వారి మధ్యా గొప్పలకు పోతారు. పైవారితోనో కింద వారితోనో చేతులు కలుపుతారు. ఆస్తులు పెంచి అంతస్థులు నిర్మిస్తారు. స్థితిగతుల బాగుకోసం అలజడులో, పోరాటాలో సాగిస్తారు.

బాధ్యతలు గుర్తిస్తారు. బాధ్యతల్ని వహిస్తారు. త్యాగాలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. బాధ్యతల్ని విస్మరిస్తారు. అపజయాల కింద అణగి పోతారు.

ఈ బాహ్య జీవితమేకాక ఎవరికి వారిదైన అంతరంగింక జీవితం – వారికి మాత్రమే తెలిసేది ఉంటుంది.

పుడతారు. అల్లారు ముద్దుగానో అడవిలో మొక్కలాగో పెరుగుతారు.

ఇతరుల యీర్ష్యాసూయలకు, పంతాలూ పట్టింపులకూ, భయభక్తులూ మమతాను రాగాలవంటి ఎన్నెన్నో ఉద్వేగాలకూ, వారి వారి స్వభావాను గుణ్యంగా ప్రతిస్పందిస్తారు.

తల్లి తండ్రులూ, గురువులూ, సహాధ్యాయులూ, సమాజంలో గొప్పవారు – ఇలా ఎందరెందరి ప్రభావానికో గురి అవుతూ ఎవరికివారు వ్యక్తిత్వాలేర్పచుకుంటారు. లేదా ఏర్పడతాయి.

జీవితాన్ని తెలివిగా, మొండిగా, బండగా, మెతకగా, పట్టుదలగా, కసిగా, రోషంగా, సాహసంగా, దర్జాగా, ధైర్యంగా, నిబ్బరంగా, నిర్లక్ష్యంగా, గాలివాటంగా రకరకాలుగా ఎదుర్కుంటారు.

తమతో ముడిపడివున్న జీవితాలకు చక్కదిద్దుతారు. ధ్వంసిస్తారు. చికాకు పరుస్తారు. నిర్మిస్తారు. ఆ క్రమంలో ప్రేమిస్తారు. హింసిస్తారు. బాధిస్తారు. బాధపడతారు. కష్టపడి పడ్డ కష్టాన్ని ధారపోస్తారు.

జీవితం వడ్డించిన విస్తరిగా, గులాబుల మెత్తగా, కత్తుల బోనుగా, కఠోర తపస్సుగా, కత్తిమీద సాముగా, సాగర తరణంగా, నిరంతర పోరాటంగా ఒక్కొక్కరి కొక్కవిధంగా వ్యక్తమై ఒక్కొక్కరి అంతరంగిక ప్రపంచం ఒక్కొక్క విధంగా రూపు దిద్దుకుంటుంది.

చివరికి ప్రశాంతంగానో, అశాంతిగానో, హాయిగానో, అసహాయంగానో అకస్మాత్తుగానో జీవితం ముగుస్తుంది.

ఈ విధంగా సాగే వ్యక్తుల అంతరంగిక జీవితాలూ, వారి విడివిడి బాహ్యజీవితాలూ – ఇవి కూడా పరస్పరం ప్రభావితం చేసుకుంటూ మనుష్యుల ఉమ్మడి జీవితాన్నీ బాహ్య ప్రపంచాన్నీ ప్రభావితం  చేస్తాయి. ఏదో ఒక మేరకు నిర్ణయిస్తాయి.

ఇలా పరస్పర ప్రభావనా స్వభావం కలిగి ముప్పేటగా సాగే యీ మానవ జీవితమే వార్తకైనా, వ్యాసానికైనా, కథకైనా కథవంటి తదితర కళారూపాలకైనా ముడివస్తువు.

తమ తమ జీవితాల మీద మనిషి ఉమ్మడి జీవిత ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి లోకజ్ఞత అవసరమేమోకాని – పంటలు పోవడం, ఏలినవారు మారడం, కొత్తశాసనాలు తేవడం వంటి బయట ప్రపంచపు సంఘటనలకూ తమ జీవితానికి లంకె ఉంటుందని గ్రహించడానికి కొద్దిపాటి లోకానుభవం చాలు. కాబట్టే చదువుకున్న వారితో పాటు చదువుకోనివారూ, లోకజ్ఞానం బొత్తిగా లేనివారూ కూడా లోకం ఎలా నడుస్తుందో, ఎక్కడేం జరుగుతుందో, తెలుసుకోవడానికి ఆతృత పడతారు.

ఈ అవకాశం ఉపయోగించుకొని అనాదిగా ఉంటూ వచ్చిన వ్యవస్థలు మారగా ఇప్పటి వార్తాప్రకటనా వ్యవస్థా, వార్తా సేకరణ వ్యవస్థా పుట్టాయి.

మానవుల ఉమ్మడి జీవితం అవిరామం కాబట్టి దానికి గతం, వర్తమానం, భవిష్యత్తూ ఉన్నాయి.

భవిష్యత్తు చెడకుండా వర్తమానాన్ని సరిచేయాలన్నా, గతం నుంచి చెడిన వర్తమానాన్ని సరిదిద్దాలన్నా, వర్తమానస్థితి అర్థం కావాలి. వర్తమానం అర్థం కావడానికీ, గతం నుండి పాఠాలు తీసుకోవడానికీ, గతాన్ని పరిశీలించి విశ్లేషించాలి. ఈ పని చేయగల లోకజ్ఞులు ఏం చెపుతారో తెలుసుకోడానికీ, తద్వారా తమ జీవితపు వర్తమాన స్థితినీ భవిష్యత్తునీ అర్థం చేసుకోడానికీ, లోకజ్ఞానం కలవారు సదా ఆతృత పడతారు.

ఆ అవసరాన్ని తీర్చడానికి వ్యాసం, వ్యాసాన్ని పోలిన ఇతర ప్రక్రియలూ ఉపయోగపడతాయి.

లోకానుభవం తక్కువ కావడం, లోకజ్ఞానాన్ని పొందే అవకాశం లేకపోవడం, ఉన్నా అవసరాన్ని గుర్తించలేకపోవడం వంటివి కారణాలు ఏమన్నా కావచ్చు – తమ దుస్థితికీ లేదా సుస్థితికీ, ముప్పేటలుగా సాగే మానవ జీవితానికీ కల సంబంధం తెలియని వారుంటారు. వారంతా తమ మనోలోకంలో ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు దొరకక, దొరికినా, దొరికిన వాటిలో చిక్కుముడులు విడదీసుకోలేక, సాహిత్యంలో అలాంటి వాటికి జవాబులు దొరుకుతాయనీ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అవి విడమరిచి ఉంటాయనీ విని అందుకు సాహిత్యాన్ని ఆశ్రయిస్తారు.

సాహిత్యం, అందులో ఒక శాఖ అయిన కథా, ఆ పని చేయగలగాలి.

కథలు రాసే తొలిదశలో కథకుల లోకానుభవమైనా, వారి లోకజ్ఞానమైనా చాలా పరిమితాలే. కాబట్టి ముందే పెద్దకుండలకు ఎసరు పెట్టకుండా, తామెరిగిన జీవిత భాగాలతోనే, తమకు బాగా అర్థం కాగల జీవిత పరిధి నుండే వస్తువు తీసుకొని కథ చెప్పడానికి ప్రయత్నించడం మంచిది.

వ్యక్తుల అంతరంగిక జీవితాన్నీ, వారి వారి విడివిడి బాహ్య ప్రాపంచిక జీవితాన్నీ, చాతనైన మేరకి పరిశీలించి (చిత్తశుద్ధితో) అందుమీద కథలు రాయడం, నిడివి మీద తమ పరిశీలనను విస్తరిస్తూ పోయి మానవుల ఉమ్మడి జీవితం గ్రహించడం ఏ కొత్త రచయితకైనా అనుసరించదగ్గ మార్గం.

ఇంతవరకూ చెప్పిన దాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే –

٭     మనుష్యుల కందరికీ బయట ప్రపంచంలో ఒక ఉమ్మడి జీవితం ఉంటుంది.

٭     ప్రతి మనిషికీ బాహ్య ప్రపంచంలో ఒక పరిమిత జీవితం ఉంటుంది. ఎవరికి వారికి అంతరంగిక జీవితం ఉంటుంది.

٭     ఈ మూడూ దేనికదిగా తక్కిన రెండింటినీ ప్రభావితం చేస్తూ వాటిని ఒక మేరకి నిర్ణయిస్తాయి.

٭     మానవుల ఉమ్మడి జీవితం గురించీ, వ్యక్తుల రెండురకాల జీవితాలమీదా అది నెరపగల ప్రభావాల గురించీ తెలియాలంటే చాలా విషయాలు తెలియాలి. దానికి సంబంధించిన వార్తలనూ, వ్యాస విషయాలనూ కథలుగా తీసుకొని రాయడం కొత్తవారికి దుస్సాధ్యం.

٭     వారికి అర్థం కాగలదీ, అందుబాటులో ఉండేవీ, వ్యక్తుల బహిర్జీవితం. కాబట్టి మొదట్లో వారి రచనను వాటికే పరిమితం చేసుకోవడం వారికీ, సాహిత్యానికీ మంచిది.

Posted in వ్యాసం | Tagged , , | 1 Comment