సత్యప్రభ -మున్నుడి

సత్యప్రభ ఆంధ్రవిష్ణు కాలంనాటి చారిత్రిక నవల. దీనికి మూలకథ వ్రాసినది సామాన్య వ్యక్తి కాదు. అతని పేరు గురుపరంపరలలో ఒకటిగా కీర్తింపబడుతోంది. ‘నాయన’ అని, ‘ముని’ అని ప్రేమగా శిష్యులు పిలుచుకొనే అతని పూర్తి పేరు – ‘శ్రీ.శ్రీ.శ్రీ వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని’. భారతి సాహిత్య మాసపత్రికలో 1937లో ఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. కాని ‘గణపతి ముని’ స్వర్గస్థులయి పోవడం వల్ల అది అసంపూర్ణంగా ఉండిపోయింది. (గణపతి ముని పై పొద్దులో గతంలో వచ్చిన వ్యాసం, ఒక నవయువకుని నవద్వీప విజయం చదవండి.)

 

కావ్యకంఠ గణపతి ముని

కావ్యకంఠ గణపతి ముని

 

శ్రీ గణపతి ముని ఈ నవలకి పెట్టిన పేరు ‘పూర్ణ’! ఆ తరువాత 30 సంవత్సరాలకి అతని కుమారుడు కీ.శే వాసిష్ట (అయలసోమయాజుల మహాదేవశాస్రి)  ఈ నవలని, “సత్యప్రభ” అనే పేరుతో పూర్తి చేసారు. దానిని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1964లో సీరియల్ గా ప్రచురించింది.

అయలసోమయాజుల మహదేవ శాస్త్రి

అయలసోమయాజుల మహదేవ శాస్త్రి

ఆ తరువాత దానిని విశాలాంధ్ర ప్రచురణాలయం – విజయవాడ వారు పుస్తకంగా ప్రచురించారు.

సత్యప్రభ

సత్యప్రభ

దురదృష్ట వశాత్తు  ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కాదు.

ఆతరువాత దీనిని శ్రీ గంటి శ్రీరామ మూర్తిగారు ఇంగ్లీషు భాషలో అనువదించారు. ఇంగ్లీషు ప్రతిని Kavya Kantha  Bharati—ANAKAPALLE వారు ప్రచురించారు. ఇదీ.. నవలారాజమైన సత్యప్రభ ప్రస్థానం.

దురదృష్టవశాత్తు ఇప్పుడు అది కూడా లభ్యం కాదు.

……………………

సత్యప్రభ నవలను పొద్దులో ధారావాహికగా ప్రచురించేందుకు సంకల్పించి, అయలసోమయాజుల శ్రీధర్ గారిని సంప్రదించాం. ఆయన కీ.శే మహాదేవశాస్త్రి గారి తృతీయ పుత్రుడు, ‘నాయన’ గారికి స్వయానా పౌత్రుడు. శ్రీధర్ గారి కథలు 30 ఏళ్ల క్రిందట వివిధ మాస వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వాటిలో ‘స్మిత నయన’ అనే కథకి ‘జాగృతి’ బహుమతి వచ్చింది. ’విరిసిన హరివిల్లు’ అనే కథను ఆంధ్రప్రభ స్పెషల్ కథగా ప్రచురించింది. దాదాపు ఇరవై కథలు సామాన్య ప్రచురణకి నోచుకొన్నాయి. ‘చీకటి చకోరాలు’ అనే నాటికకి పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు వచ్చింది. ’బీబీ నాంచారి’  అనే నాటకం 14 కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. 2004, ఏప్రిల్ 21 న ’బీబీ నాంచారి’ని మా టివి వారు ప్రసారం చేసారు. సీరియల్ పూర్తి కాకుండానే స్పాన్సర్స్ లేకపోవడాన అది ఆగిపోయింది.

పొద్దు పాఠకులకు శ్రీధర్ గారు సుపరిచితులే! తెలుగు అంతర్జాలంలో తొలి నాటికని, నాటకాన్ని ఈయన పొద్దు ద్వారా పరిచయం చేసారు. ‘రమల్’ ప్రశ్నశాస్త్రంపై వ్యాసాలను కూడా రాసారు. ఇప్పుడు ‘సత్యప్రభ’ను శ్రీధర్ గారి ద్వారా పొద్దు పాఠకులకు అందిస్తున్నాం.

Posted in కథ | Tagged , , | 1 Comment

స్మ’రణం’

వచ్చి వున్న నువ్వు
విచ్చుకుంటున్న తలపులలోకి
వచ్చి చేరాలని తలపడుతూ
ఒక పల్లెటూరూ, ఒక నదీ

ఒక బాల్యమూ, ఒక వెన్నెలా!


నేనిప్పుడు నీవై ఉన్నాను!

మోహరించుకుంటున్న జ్ఞాపకాలని
ఎన్నిసార్లని ఇలా మోహించుకుంటూ
ఆ వెంటవెంటనే శోకించుకుంటూ!


వెనక్కి తిరిగి చూడడం నాకు తెలియని విద్యేం కాదు
తెలిసీ తెలియని రోజులనుంచే
తలపులకొక కిటికీని తగిలించుకుని
కూర్చోవడం తప్పినదీ లేదు!


సుఖంలో పెద్దగా జరిగేదీ ఒరిగేదీ ఏమీ లేదనీ
శోకంలోనే మాట తననుతాను అలంకరించుకోజూస్తుందనీ..


నిన్ను తలచినపుడు
నదినీళ్ళలో కాళ్ళు తడవనపుడూ
ఇసుకలా వెన్నెల శరీరంపై కాసింత సేపైనా పొర్లాడి రాలనపుడూ
మరేమాటా లేకుండా రాత్రి
సరివి చెట్ల మధ్య దిరిసెనపువ్వులా విప్పారి
తనకుతానుగానే అర్పించుకోనపుడూ గాని
అర్ధం కాదు!

Posted in కవిత్వం | 3 Comments

విలక్షణ కథా రచయిత – త్రిపుర

 

సెయింట్‌వో, భక్తుడివో, భగవంతానివో ఆ కళ్ళు,

ఏర్పోర్ట్ లాంజ్‌లలో, ఓడరేవుల వీడ్కోలులో

ఎడతెగకుండా కలుసుకునే  ఎదురుచూపులు.

గుడ్డిదీపం వెలుగులో, పేరు తెలీని స్టేషన్‌ లో

అర్ధాంతరంగా జీవితపు అంతిమ నిష్క్రమణ.

అలోచనలు ఆగిపోదగ్గచోటు..

అన్వేషణ ఆగి మరింత వేగంతో కదిలే హాల్టు … త్రిపుర

 

– స్వాతికుమారి బండ్లమూడి

 

 


త్రిపుర అసలు పేరు: రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో (ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా మదనపల్లి, జాజ్ పూర్, బర్మా ఇంకా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాల్లో పని చేసారు. రిటైరై గత ఇరవైయేళ్ళుగా విశాఖపట్నంలో ఉంటున్నారు.

“త్రిపుర కథలు” అనే కథా సంకలనం, “బాధలు – సందర్భాలు”, “త్రిపురకాఫ్కా కవితలు” కవితా సంకలనాలు, segments అని ఆంగ్ల కవితలు (వీటిని వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువదించారు) పుస్తకాలుగా వచ్చాయి. అనితర సాధ్యమైన రీతిలో మనిషి అంతరంగపు లోతుల్ని చిత్రించి కేవలం పదిహేను కథలతో తెలుగు కథకి ఒక కొత్త Dimension తెచ్చిన కథకుడు త్రిపుర. కథలో autobiographical elements తో పాటు ఒకరకమైన confession ఉండాలని బలంగా నమ్ముతారు. తను రాసిన కథల్లో “భగవంతం కోసం”, “జర్కన్” తనకి ఇష్టమైనవట. మదనపల్లిలో ఉండగా త్రిపుర జిడ్డు కృష్ణమూర్తికి శిష్యుడు కూడా!

——————–

లైట్ హౌస్

                                          -మూలా సుబ్రహ్మణ్యం

ఆకాశాన్ని అందుకోలేక

చతికిలపడే అలల మధ్య

అగాధమంత నిశ్శబ్దం

మసక చీకట్లో

ఇసక రేణువుల

దాహం తీరదు

* * *

దూరంగా

ధ్యానముద్రలోకి

డాల్పిన్ నోస్

కాంతి వలయాలు

విరజిమ్ముతూ

లైట్ హౌస్

తడుముకునే పడవలు

సంకేతాన్నందుకుని

బింకంగా ముందుకు..

* * * *

తీరమెంత

దూరమైతేనేం?

ఇన్నాళ్ళకి నాక్కూడా

లైట్ హౌస్ దొరికింది

త్రిపుర గారూ..

కలుద్దాం మళ్ళీ!

(త్రిపుర గారిని మొదటి సారి కలిసిన సందర్భంగా…)
——————————————-

సెప్టెంబరు 2 న విలక్షణ కథారచయిత త్రిపుర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కథ జర్కన్‌ ను పొద్దు పాఠకులకు సమమర్పిస్తున్నాం. అనుమతించిన త్రిపుర గారికి కృతజ్ఞతలు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on విలక్షణ కథా రచయిత – త్రిపుర

కథాకథనం – 3

కథ కానిది

కథలాగే వార్తా, వార్తాకథ,  వ్యాసం కూడా వచనరూపాలే.  నిడివిలో, నడకలో, పేరెట్టుకోడంలో ఈ నాల్గింటి మధ్యా ఇటీవల పెద్ద తేడాలు కనిపించవు. ఈ మధ్య ఇవి కూడా కథల్లా ఆరంభమై కథల్లా ముగుస్తున్నాయి.

కథ గురించిన మన అవగాహన మరింత స్పష్టం కావాలంటే – కథ పోలికలున్నా కథలుకాని – వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అందువల్ల వీటి నుండి కథ ఏవిధంగా భిన్నమో తెలుస్తుంది.


ముందుగా వార్తను తీసుకుందాం.
ఎనభై ఏడు జూలైలో మంచిర్యాల దగ్గర దక్షిణ ఎక్స్ ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున పొంగి వచ్చిన వరద కెరటంలో ఎనిమిది బోగీలు కొట్టుకుపోగా రెండు బోగీలు రైల్వేట్రాక్ కి ఐదువందల అడుగుల దూరంలో మట్టిలో కూరుకు పోయేయి.


ఫలానా తేదీన, ఫలానా ఇన్ని గంటలకు, ఫలానా ఛోట ఇలాంటిలాంటి సంఘటన ఇలా ఇలా జరిగింది. జరిగిన ఘోర నష్టాలివి – అంటూ వచ్చే భోగట్టాను వార్త అంటాం. ఆ భోగట్టాను లేదా వార్తను నిర్లిప్తంగా, నిర్ధుష్టంగా, తెలిసిన మేరకు సొంతంగా, వీలైనంత క్లుప్తంగా చెప్పడం పూర్వపద్ధతి. ఇప్పటికీ కొన్ని పత్రికలు ఈ సంప్రదాయాన్నే పాటిస్తాయి.


అలా కాకుండా –
అది తెల్లవారుఝాము.  పెట్టెలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.  హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న నారాయణరావు అనే యువకుడికి ఎవరో కొట్టి లేపినట్టు తెలివొచ్చింది.  చూస్తే రైలు ఆగిపోయినట్టుంది.  భోగీ ఓ పక్కకు ఒరిగిందా అనిపించింది – అంటూ ఆరంభించి ఆయన పై బెర్తు మీంచి క్రిందికి దిగేసరికి చీలమండదాకా నీరుండడం, గబగబా వెళ్ళి తలుపు తీయబోతే తలుపు రాకపోటం, గాభరాగా ముందు పెట్టిలోకి పరుగెత్తడం, ప్రయాణికులంతా అల్లకల్లోలంగా రైల్లోంచి గెంతేస్తూండడం, తక్కినవారితో తనూ ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకోడం, అప్పటికప్పుడే తగ్గుముఖం పడుతున్న నీటిలోంచి విషాద దృశ్యాలొకటొకటీ బయటకు తేలిరావడం,  కొందరు యువకులూ,  సాహసులూ ఆపదలో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చడం, ఇంకో అరగంటలో మంచిర్యాల నుండి తండోపతండాలుగా జనం తరలివచ్చి అందరికీ సాయపడడం – ఇలా జరిగినదంతా ఓ ప్రత్యక్ష సాక్షి కథనంలా చెప్పడం కొత్త పద్ధతి.


ముందు చెప్పినట్టు నిర్లిప్తంగా చెప్పినా, ఇప్పుడు చెప్పినట్టు హృదయాన్ని తాకే విధంగా చెప్పినా, రెండింటిలోనూ చెప్పింది భోగట్టాయే. కాబట్టి అది వార్తే అవుతుంది.


ఆ తరవాత వార్తా కథ –

సంఘటనాత్మకమైన వార్తల్లో సంఘటనలు రెండు రకాలు.  పైన చూపినలా కొన్ని ఆకస్మిక సంఘటనలు.  వీటికి పూర్వ వృత్తాంతాలుగా చెప్పదగ్గవేమీ ఉండవు. ఆకస్మికాలు కాని సంఘటనలకు పూర్వాపరాలు రెండూ ఉంటాయి.

ఏదో రావులపూడిలోనో, రాజన్నపాలెంలోనో, ఓ వర్గంవారు కత్తులూ, బరిసెలూ, గండ్రగొడ్డళ్ళూ వంటి మారణాయుధాలతో ఇంకో వర్గం వారిమీద దాడి జరుపుతారు.


ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైన వివరాలతో ముందుగా ఆ సంఘటన గురించి మొదటి భోగట్టాలొస్తాయి.  అప్పటికది తొలివార్త.  ఆ మర్నాడు దాడి వివరాలన్నీ దాని పూర్వాపరాలతో వస్తాయి. సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడిది? తక్కిన నాగరిక ప్రపంచంతో దానికుండే సంబంధాలు ఏపాటివి? ఘర్షించిన వర్గాలేవి? ఘర్షణకు మూల కారణమేమిటి? ఏ కొత్త చట్టమైనా, కోర్టు తీర్పైనా, ప్రభుత్వ ఉత్తరువైనా ఒకరి న్యాయసమ్మతమైన హక్కుని మరొకరికి చట్ట సమ్మతంగా (అంటే చట్టం అందతో) దఖలు పరిచిందా? మతపరమైన లేదా కులపరమైన ఘర్షణ అయితే – ఎవరు ఎవరిని ఎప్పుడెప్పుడు ఏ ఏ విధాల రెచ్చగొట్టడం వల్ల ఈ ఘర్షణ ఏర్పడింది? జరిగిన దాడి ఆకస్మిక ఆవేశాల ఫలితమా? ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జరిగిందా? దాడిలో పరిస్థితులు ఎవరికి ఏవిధంగా అనుకూలించేయి? ఎవరికి ఎలా ప్రతికూలించేయి? భవిష్యత్తులో ఈ సంఘటన ఏ పరిణామాలకి దారి తీయొచ్చు?


ఇలాంటి అధారాలన్నింటికీ జవాబులా – ఏ ప్రత్యేక విలేఖరో అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా జరిగిందీ, జరగబోయేదీ అంతా ఒక కథలా రాస్తారు.  అలాంటి దాన్ని వార్తా కథ అంటారు.


సంఘటనను విడిగా కాకుండా దాని పూర్వాపరాల మధ్య చూపడంవల్ల ఆ సంఘటన స్వభావాన్ని మరింత స్పష్టంచేయగలుగుతుంది – వార్తా కథ.

వార్తయినా, వార్తా కథయినా చేయవలసేది యదార్ధ ప్రకటన. యదార్ధమంటే ఊహకూ, కల్పనకూ, పక్షపాతాలకూ, స్వీయ ప్రయోజనాలకూ తావుండనిది.   విలువలు పాటించడం, పాటించకపోవడం వేరే సంగతి.


ఇంక వ్యాసానికొస్తే – ఆ రైలు ప్రమాదం మీదే వ్యాసం రాయదలచుకున్నామనుకోండి.  దాన్నీ ఓ కథలా ఆరంభించొచ్చు. ఆ పనే చేస్తున్నారు ఈ మధ్య.


ఆరోజు మీ మనవరాలి పుట్టినరోజు. రోజల్లా విందులూ, వినోదాలతో పిల్లల నవ్వులతో, ఆటలతో హాయిగా గడిచింది. సాయంత్రం పార్టీకొచ్చిన బంధుమిత్రులను సాగనంపడమూ అయ్యింది. ఇంటిల్లిపాదీ డైనింగ్ టేబుల్ దగ్గర చేరేరు. తన పుట్టినరోజు బహుమతుల గురిమ్చి బడాయిలు పోతుంది మనవరాలు. మీరూ, మీ అబ్బాయీ ప్రేమగా టీజ్ చేశారు. నాన్నమ్మ మనవరాలిని వెనకేసుకొస్తుంది. కబుర్లు, కబుర్లు, ఒకటే కబుర్లు. ఎవరో లైటార్పేస్తారు. అబ్బా పన్నెండయ్యిందా అంటూ పడకలెక్కుతారు. పడుకున్నదే తడవు నిద్ర పట్టేస్తూంది. నిద్దట్లో ఏవో శబ్ధాలు. ’అయ్యో! అమ్మా! ఇదేమిట్రా’ అని అరుపులు. అమ్మో తల పగిలిపోయింది. కదపబోతే కాళ్ళూ చేతులూ కదలవేం! ఇసకలో కూరుకుపోతున్నట్లు ఈ అనుభవమేమిటి! కళ్ళెందుకిలా కూరుకుపోతున్నాయ్! పీడకల! అవునంతా పీడకల!


ఆ కలలోనుంచి తేరుకునేసరికి మీరు ఆసుపత్రిలో ఉంటారు. మీ బెడ్ పక్కన మీ వాళ్ళొక్కరూ కనిపించరు. క్రమంగా ఒక్కొక్క భోగట్టాయే తెలుస్తుంది. మీ ఫ్లాట్కి పైనున్న రెండు ఫ్లాట్లూ కూలి, ఆ బరువు మీ కప్పుమీద పడ్దది.కప్పు విరిగి ఇంటిల్లపాదీ ఆ డెబ్రస్ లో కూరుకుపోయి చచ్చిపోయేరట. మీ బల్ల మంచం గోడవార ఉండడంవల్ల మీరు మాత్రం బతికిపోయారట.


ఇటువంటి దుర్ఘటన నిజంగానే మీకు జరిగిందనుకోండి. ఆ ప్రమాదానికి మీరేవిధంగా స్పందిస్తారు? మేడలూ, మిద్దెలూ ఒట్టినొట్టినే కూలిపోయాయంటే నమ్ముతారా? ఎక్కడో ఏదో జరిగింది.  ఎవ్వరో ఏదో చెయ్యరాని తప్పు చేసేరు.  కాంట్రాక్టర్లూ, కట్టించిన ఇంజనీర్లూ, మీకు దానిని అమ్మిన హౌసింగ్ బోర్డువారూ అదో ప్రమాదమని అనొచ్చు.  తగు రుజువులూ చూపొచ్చు.  కానీ మీరు మాత్రం ఆ వాదాన్ని అంగీకరించరు. అది ప్రమాదమని నమ్మరు.
అలానే నేనూ నమ్మను.


జూలై తొమ్మిది తెల్లవారు జామున మంచిర్యాల దగ్గర రైలుకి జరిగింది అచ్చమైన ప్రమాదం – అని రైల్వేమంత్రిగారు ఏ విచారణా జరపకుండానే చెప్పొచ్చు.  లేదా విచారణ జరిపించాక ఓ కమిటీచేతే చెప్పించొచ్చు.  ఎవరూ ఎప్పుడలా చెప్పినా నేనే కాదు బుద్ధీ జ్ఞానం ఉన్నవారెవరూ అలాంటి వాదాన్ని అంగీకరించరు.

-అంటూ ఆ వ్యాసాన్ని విషయంలో ఏ సంపర్కం లేని ఒకానొక కల్పనతో ఆరంభిస్తాము. ఆరంభం ఎలా జరిగినప్పటికీ వాదనను వివరించే దశలో ఒక్క పొల్లు మాటకు తావివ్వకుండా ప్రభుత్వం వారి రికార్డులనుండే సాక్ష్యాధారాలు చూపిస్తూ సంబంధిత ఇరిగేషన్, రైల్వేశాఖలు దానికెలా బాధ్యులో నిరూపిస్తాము.


వార్తలకు లాగానే వ్యాసాలకు కూడా యదార్థాలే ఊపిరి. రుజువుకి రాగల విడివిడీ యదార్ధాలను తగు తర్కంద్వారా పరిశీలించి, ఈ వాస్తవాన్ని గ్రహించి, దాన్ని వ్యక్తీకరించేందుకు తర్కానుగుణ్యమైన ఒక వాదనను నిర్మిస్తాం. అది వ్యాసం.

మరి కథలో జరిగేదేమిటి?

కథలో – వార్తలోలా ఒకానొక సంఘటనలోని యదార్ధానికి కాదు ప్రాధాన్యం. ఒకటిగానీ వ్యాసంలోలా ఒకటికన్నా ఎక్కువగాని యదార్ధాల నుండి వ్యక్తమయ్యే వాస్తవానికి ప్రాధాన్యం. ఆ వాస్తవం వ్యక్తమయ్యేటప్పటి వేదనకు ప్రాధాన్యం.


లోకంలో జరిగే అనేక సంఘటనల నుండీ, లేదా ఆయా పరిస్థితుల్లో, సన్నివేశాల్లో వ్యక్తుల ప్రవర్తన నుండీ, ఒకప్పుడు పలువురి జీవితాల పరిశీలన నుండీ వారి జీవనగతి నుండీ – ఇలా మానవ జీవితానికి సంబంధించిన వేర్వేరు ముఖాలలో ఏదో ఒక దానినుండి వ్యక్తమయ్యే వాస్తవాలను కల్పిత వృత్తాంతాల ద్వారా వ్యక్తం చేస్తాయి కథలు. వృత్తాంతాలు కల్పితాలే అయినా అవి జీవితమంత సహజంగా ఉండాలి. అందలి సమస్తం యదార్ధాలనిపించేటంతటి భ్రమ కలిగించాలి. వాటివల్ల మనం పొందే అనుభూతులూ, వేదనల తీవ్రతా, అలాంటివి నిజజీవితంలో మనం పొందేప్పుడు పోలిస్తే వీసమెత్తు తేడా రాకూడదు.


అంటే-
* చెప్పదగ్గ ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి సాకల్యమైన భోగట్టా నిర్లిప్తంగా ఇచ్చినా, సవిస్తరంగా ఇచ్చినా అది వార్తే అవుతుంది.
* ఒక సంఘటన తాలూకూ స్వభావం మరింత సుస్పష్టమయ్యే విధంగా ఆ సంఘటన పూర్వాపరాల మధ్య దాన్ని చూపితే అది వార్తా కథ అవుతుంది.
* సంఘటన భావుకతను ప్రేరేపిస్తే అప్పుడు పుట్టిన తర్కం ఫలితంగా ఏర్పడ్డ వాస్తవాన్ని లేదా నిజాన్ని నిరూపించేది వ్యాసం.
లోగడ-
* ఒట్టి వృత్తాంతమే అయితే అది కథ కాదనీ, కథ కాలేదనీ అనుకున్నాం.  కథ కానప్పుడు మరేదో అయినా కావాలి కదా! ఏమవుతుందో ఇప్పుడు చెప్పుకోవచ్చు.
* ఒట్టి వృత్తాంతం ఒక విధమైన వార్తో, వార్తా కథో అవుతుంది.
* అలానే – లోగడ అనుకోలేదు గాని ఇప్పుడు అనుకోవచ్చు.
* సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు.
* ఒక వృత్తాంతం హృదయాన్ని స్పృశించగలిగేదైనా అందులో వ్యక్తం కాగల వాస్తవం లేనప్పుడు కథ కాదు.ఒక వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది  హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు.

Posted in వ్యాసం | Tagged , , | Comments Off on కథాకథనం – 3

నారాయణ కల్పవృక్షమ్

(విశ్వనాథ సత్యనారాయణగారు జీవించి వుండి ఆరుద్ర గారి షష్టిపూర్తి ఉత్సవానికి సందేశం పంపివుంటే ఇట్లా వుండవచ్చు…)

భాగవతుల శంకరశాస్త్రి. ఇది కొందరికి తెలియును, కొందరికి తెలియదు. ఆరుద్ర. ఇది మిక్కిలి బ్రసిద్ధము. ఆరుద్ర యనునది యొక నక్షత్రము. పుష్య మాసములో వచ్చెడి ఆరుద్ర నక్షత్రము శైవులకు బర్వదినము. పరమేశ్వరుడు కైలాసము నుండి దిగి వచ్చునని వారి నమ్మిక. ఆ రోజు ద్వారదర్శనము చేయుదురు. కొందరు కొన్ని పేర్లు ధరించుటచే అవి ఖ్యాతి బడయును, కొందరు వాసికెక్కిన పేర్లు ధరించి ఖ్యాతి గడింతురు. మా ప్రాంతములో విశ్వనాథ నాగభూషణమని యొకడున్నాడు. వాని తాత ముత్తాతలు మెట్ట సేద్యములో దిట్టలు. వీనికి అది కూడ అబ్బినది కాదు. జులాయిగా తిరుగుచుండెడివాడు. అయినను ఇంటిపేరుచే గొంత ప్రాచుర్యము పొందినాడు. ఫలానా నాగభూషణము మీ దాయాదియా అని పలువురు నన్ను ప్రశ్నించుచుండెడివారు. అతడు మా శాఖవాడు కూడ కాదని నేను నిజము చెప్పెడి వాడను. కొందరికి యిట్టి వరములు ఆయాచితముగా లభించును.

ఆరుద్ర అభ్యుదయవాదినని చెప్పుకొనును. కాదనుటకు నావద్ద నిదర్శనములు లేవు. అయినచో అయివుండవచ్చును. కాకపోయినచో మాత్రము ప్రమాదమేమి? అతను గడ్డము పెంచును. ఆనాడు జులపాలు పెంచుటను భావకవులు ఆచారము చేసిరి. నేను ఏ వాదమునకూ జెందను. నా వాదము నాది. నచ్చినవారికి యది వేదము, లేని వారికి లేదు. వారికి జుత్తు బెంచుట అవశ్యకమని తోచినది. కవియైనవాడు మేధను బెంచుకొనుట ముఖ్యమని నాకు దోచును. ఏది ముఖ్యమో ప్రాజ్ఞులు గ్రహింతురు గాక!

త్వమేవాహమ్… అని యొకటి వ్రాసినాడు. సినీవాలి యని మరియొకటి వ్రాసినాడు. ఇవి సంస్కృత కావ్యములు గావు. పచ్చి ఆధునిక వచన కవితల కూర్పు. పచ్చియనిన జ్ఞాపకము వచ్చును. ఆరుద్ర పైలాపచ్చీసు యని కూడా ఒకటి రచించినాడు. ఈతడు రైలుబండిని మానవ జీవితమునకు ముడిపెట్టి ఒక కవిత అల్లినాడు. అందు జీవుని వేదన కొంత స్ఫురించును. భావకతయూ వున్నది. ఓ కూనలమ్మ యను మకుటములో బద్యములు గిలికినాడు. అవి మిక్కిలి చమత్కారముగా నుండును. అసలు చమత్కారమే యితని మతమని తోచును. ఒక చోట నేనతనికి గురుతుల్యుడనని బేర్కొన్నాడు. నా రచనలు గొన్నింటిని చదివి, యెట్లు వ్రాయకూడదో తెలిసికొంటినని చమత్కరించినాడు. ఏమైననేమి? ఆ ‘ఎఱుక’ యేదో నా వల్లనే కలిగినది కదా? అజ్ఞానము తొలగించిన వాడు గురువు, సముద్రమున ఆణిముత్తెములు ఉండును. నత్తగవ్వలును ఉండును. వారి వారి బ్రాప్తము ననుసరించియు, వారి వారి పూర్వజన్మ సుకృతమును బట్టియు అవియవి వారి వారికి లభించును. అతని ‘ఊహ’ యట్లున్నది. అతని కదియే ప్రాప్తమని భావింతును.

ఆరుద్ర పరిశోధకుడు, అని చెప్పగా వినియుంటిని. నాలుగు దశాబ్దములుగా చెన్నపట్టణములో నివాసము యుంటూ తెనుగు సాహిత్యము, తెనుగు జీవనము ఇత్యాది అంశములపై నితడు మిక్కిలిగా వ్యాసములు వెలువరించినాడు. జైనము గురించి ఇతనికి గొంత తెలియును.

ప్రస్తుతాంశము షష్ట్యబ్దిపూర్తి. అరువది సంవత్సరములు నిండుట యీ వేడుక అయినచో ఆరుద్రకు అరువది నిండినవా? లేదు… భాగవతుల శంకరశాస్త్రికి అరువది నిండియుండవచ్చును. ఆరుద్ర పుట్టినది తరువాత గదా! మరి ఆరుద్రకు అరువది యెక్కడివి? కనుక యీ షష్ట్యబ్దిపూర్తి భాగవతుల శంకరశాస్త్రికే గాని ఆరుద్రకు కాదు, ఔను. ఇది యొక చమత్కారము.

—————————–xxxx——————————-


ఈ వ్యాసంలోని బొమ్మ, శ్రీరమణ రాసిన "హాస్యజ్యోతి" పుస్తకం (నవోదయ పబ్లిషర్స్) నుండి సేకరించిన బొమ్మలనుండి తయారుచేసినది.

Posted in వ్యాసం | 4 Comments

ఒక ఆరుద్ర

 

చాలా ఏళ్ల క్రితం ఆరుద్ర భారతిలో ఒక వ్యాసం రాస్తూ, "విశ్వనాథ నాకు గురుతుల్యులు, ఎందుకంటే ఆయనను చదివి ఎలా రాయకూడదో నేర్చుకున్నాను" అని చమత్కరించారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 2 Comments

ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లో కాటమరాజు కథాచక్రం ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచన "కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వమునాహరింప" అనే రీతిగా వారి జీవిత సమస్త శక్తిని పీల్చి వేసిన కారణంగా దీనిని పరిష్కరించలేకపోయారని ఈ నాటకానికి ముందుమాట రాసిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు అంటారు.


క్లుప్తంగా కథ, ప్రచారం:

శ్రీశైలం దగ్గర ఆవుల్ని మేపుతున్న కాటమరాజు, అక్కడ క్షామం రావడం చేత తన అనుచరులతో కలిసి ఆలమందలను తోలుకుని దక్షిణ భూములకు తరలి వస్తాడు. నెల్లూరిసీమను పాలించే నల్లసిద్ధి రాజుతో ఒక ఏడాది పాటు తమ పశువుల్ని అక్కడ మేపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం కోసం రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఖడ్గతిక్కన సాయాన్ని తీసుకుంటారు. ఐతే, నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసిచంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. ఆ విధంగా మొదలైన ప్రతీకారాలు, ఒప్పంద ఉల్లంఘనలు ఇరుపక్షాల వారినీ యుద్ధానికి ప్రేరేపిస్తాయి. యాదవులకు మొదట్నుంచీ సహాయం చేసిన ఖడ్గతిక్కన ఈ సంఘటనల నేపథ్యంలో వారితోనే యుద్ధంచేసి స్వర్గస్థుడౌతాడు. నల్లసిద్ధి రాజు, కాటమరాజు ముఖాముఖీ తలపడే యుద్ధ సన్నివేశంతో నాటకం ముగుస్తుంది. ఐతే విజయం ఎవరిది అనే విషయం అస్పష్టంగా ఉంది. ఇదే అస్పష్టత ఈ కథ మీద ప్రచారంలో ఉన్న ఇతర గాథల్లోనూ ఉన్నట్టు తెలుస్తుంది.

కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్ధంలో జరగగా, కాటమరాజు ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది.

కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని "సుద్దులగొల్లలు, కొమ్ములవారు" అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత "యాదవభారతం ఎద్దుమోత బరువు" అనే సామెత పుట్టింది. ఈ కథాచక్రాన్ని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారంగా ఉన్నప్పటికీ శ్రీనాధ విరచితమైన కథ మనకి అందుబాటులో లేదు.

రచనారీతి, పాత్రల చిత్రిక:

మొత్తం ముప్పైనాలుగు రంగాలుగా విభజించబడ్డ ఈ నాటకరచన ఒకరంగం నుండి మరో రంగంలోని పాత్రలకూ, స్థలానికీ అత్యంత సహజంగా మారుతూ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిస్తుంది. మనకు ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఖడ్గతిక్కన కథలో ఖడ్గతిక్కన నాయకుడిగానూ, కాటమరాజు పుల్లరి ఎగ్గొట్టి మోసం చేసిన ప్రతినాయకుడిగానూ కనిపిస్తారు. అటువంటి బహుళప్రచారంలో ఉన్న పాత్రలను తీసుకుని కాటమరాజుని అవతారపురుషుడిగా, సౌమ్యుడు, మితభాషి ఐన ఉత్తముడిగా  చిత్రీకరించడం, దానిని పాఠకుడిచేత సందేహం లేకుండా ఆమోదింపజేయటం అంత సులభమైన పనేం కాదు. ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్నేళ్ళుగా ఖడ్గతిక్కనకు ఉన్న కథానాయకుడి స్థానం మారినప్పటికీ, అతని వ్యక్తిత్వ చిత్రణ, ధీరత్వ వర్ణన,  పాత్ర ఉదాత్తత వంటి విషయాల్లో ఎటువంటి మార్పూ చెయ్యకుండా ఆ పాత్రపై పాఠకుడిలో ఆరాధనాభావాన్ని కలిగిస్తారు రచయిత.

కథానాయకుడైన కాటమరాజు మొదటినుంచీ ధర్మబద్ధుడిగా, ఆవేశం, ఆగ్రహం, విషాదం కలిగించే సందర్భాల్లో సంయమనం పాటించే వ్యక్తిగా, అవసరానికిమించి మాట్లాడని తత్వంగలవాడిగా, తన పశుగణాలపై, తమవారిపై అపారమైన అభిమానంగలవాడుగా కనిపిస్తాడు. ఇచ్చినమాటకు అతను కట్టుబడే విధానాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే – దక్షిణాదికి పశువులతో సహా తరలివస్తున్నప్పుడు అది శత్రుసీమ కాబట్టి తన కొడుకుని పంపడం ఇష్టం లేని సవతితల్లి, అయితమరాజును పంపకుండా కొన్ని సాకులు ఏర్పరుస్తుంది. కానీ  అక్కడ కాటమరాజు తప్పక నెగ్గుకొస్తాడనే నమ్మకం లోలోపల ఉన్నది కావటం చేత సంవత్సరం తర్వాత తాము దక్షిణాదిన సాధించిన దానిలో తమ్మునికి వాటా ఇవ్వమని మాట తీసుకుంటుంది. ఐతే ఆమె చెప్పిన గడువుకి యుద్ధం మొదలౌతుంది. తాము నెల్లూరిసీమలో సాధించినది ఇదే కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడికి యుద్ధంలో భాగం ఇస్తానని కబురు పంపుతాడు కాటమరాజు.

"తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని", కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.

ఇటుపక్క కత్తి దించిన వారిపై కదనం చేయలేక ఇంటికి తిరిగివచ్చిన ఖడ్గ తిక్కనను పిరికివాడిగా భావించి తల్లి, తండ్రి, భార్య హేయంగా అవమానిస్తున్నప్పుడు కనీసం నోరు మెదపక తిక్కన సహనం పాటించిన సందర్భంలో వ్యక్తిత్వం, బాధ్యత, యుద్ధనీతుల నిర్వాహణ లో సంయమనం సాధించడానికి ఆ పాత్ర వహించిన మౌనం అతని గంభీరతను నిరూపిస్తుంది.

ఎనిమిదవ రంగంలో బోయలు యాదవుల వల్ల తమ భుక్తికి ఇబ్బందిగా ఉందనీ, వేటలో తమకన్నా వారు చురుగ్గా ఉండటం వల్ల వేట తమవరకూ రావడం లేదనీ తిక్కన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, 'వాళ్లంత చురుగ్గా మీరు లేకపోవడం వాళ్ల దోషం కాదు' అని సమాధానపరచి పంపుతాడు. అటువంటిది, ఒప్పందాన్ని అతిక్రమించి యాదవులు రాజ్యం దాడిచేశారన్న వార్త విని, యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడౌతాడు. రెండు సందర్భాల్లోనూ వేడుకున్నది తమ ప్రజలే అయినా, ఒప్పంద నియమాలను సూక్ష్మంగా విచారించి స్పందించే ధోరణి కనపడుతుంది.

తన మీద సీసపద్యం చెప్పిన కొమరభట్టుకి ఎత్తుగీతి పూర్తి చేశాక బహుమతి ఇస్తానన్న వాగ్దానానికి తిక్కన చివరి క్షణాల్లో సైతం కట్టుబడి తన ఉంగరం ఇచ్చి పంపడం ఒక ఎత్తయితే, తమతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న శత్రుసేనలోని వీరుడిని చూసి ఆరాధనాభావంతో ఎన్నాళ్లక్రితమో ఆగిపోయిన పద్యాన్ని కొమరభట్టు పూర్తి చెయ్యడం ఆ సన్నివేశానికి కథలో ఉదాత్తమైన స్థానాన్ని కల్పించింది.


యుద్ధరంగం:

వీరరస ప్రధానమైన కథ కాబట్టి అయువుపట్టైన యుద్ధ సన్నివేశాలకి అవసరమైనంత భాగం ఈ నాటకంలో దక్కినట్టే కనిపిస్తుంది.

జిలుగుటమ్ములు పాతించి, పారాలు తవ్వించి, నిడిపట్టు, అలిమేక, దిగుమజవ వంటి వ్యూహాలతో కూడిన చక్రబంధాన్ని రచించి నల్లసిద్ధి ఆధునిక యుద్ధతంత్రాలతో సాయుధసేనతో సమరశంఖారావం చేస్తే..

అడ్దాయుకటువ, అమలచెలిక, కుందలింగముకొంద, తూమువేరులను కాపాడటానికి బొల్లావును నియమించి, గోసంగి బలాలు , భండన విక్రములైన యాదవవీరులు, ఏనుగులను చంపడానికి ఎద్దులు, అశ్వాలను చంపడానికి అక్షీణసంఖ్యలో ఆవులనూ తరలించి, స్థైర్యమే సైన్యంగా, ఆత్మబలమే అంగరక్షణగా కాటరాజు బలగం రణభూమిలోకి దిగినట్టు చిత్రిస్తారు రచయిత.

దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి , వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.

పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్థావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం  సందర్భోచితంగా ఉంటుంది.

మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.

భీకర యుద్ధసన్నివేశాల్లో, బీభత్సరసం ఆయువుపట్టుగా సాగే సందర్భాల్లో రంగస్థలం మీద చూపించడానికి ఉన్న పరిమితుల దృష్ట్యా అటువంటి సన్నివేశాల్ని ఛాయానాటకం టెక్నిక్ ద్వారా చూపించారు.


సందేశం:

యాదవులు రాచరికపు నాగరికతల దృష్ట్యా వెనకబడినవారు. దేశసంపదలోని స్వయంసమృద్ధికి ఆయువుపట్టైన పశుగణాన్ని ప్రాణాధికంగా కాపాడి అహర్నిశలూ వాటి క్షేమాన్ని కోరుకునే అమాయకజాతి. రాజులకి పశుగణాలు కేవలం సంపద ఐతే యాదవులకి అవి దైవ స్వరూపాలు. గోవుని మాతగా పూజించే భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని బొల్లావుని విష్ణుస్వరూపంగా ఆరాధించినవారు. అటువంటి ఒక నిర్మలమైన జాతిని, ఆ జాతి జీవనాధారమైన పశు సంపదను నిర్మూలించడానికి ఆధునిక పరికరాల్ని, మందుగుండునూ వాడి, ఆర్ధికంగా సాస్కృతికంగా వినాశనాన్ని కొనితెచ్చిన ప్రతిపక్షమే నెల్లూరిరాజులని నిరసించడమే ఈ నాటకంలోని ముఖ్యోద్దేశం.

అన్ని పాత్రలకూ సరిపడినంత స్థలమూ, అన్ని సన్నివేశాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా తానుఎంచుకున్న కోణం నుండి కథను రసవత్తరంగా చూపించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు.


వచనంలో శబ్ధలయ

పద్యాలకైతే ప్రాసయతులు, గణాల గుణగణాల వల్ల స్వతహాగా శబ్ధ సౌందర్యం అబ్బుతుంది. వచనంలో ఆ లయను సాధించడానికి శబ్ధాల పలుకుబడిపై అవగాహన, నాటక ప్రదర్శనలో వాచకం పై పట్టు కుదరాలి. ఈ నాటకంలో అవి చక్కగా కుదిరాయి. సంభాషణలు హాయిగా లయాత్మకంగా సాగుతాయి.


మచ్చుకి కొన్నిమాటలు:

  • వెర్రిగొల్లలు వెక్కిరిస్తే నాదేం పోదు.  ఓండ్రకప్పకు నోరు గొప్పదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తే ఏం భయపడం. గొల్ల వంకరబుద్ధి గొబ్బున మానండి.
  • మీరు ముడుపులోని కనకంలాంటివారు. మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే ముడుపుపోదు. మీరు కన్నయితే మేము కంటికి రెప్పల వంటి వాళ్లము, రెప్పకు హాని రానిదే కంటికి దెబ్బ తగలదు.
  • ఆవులు అల్లకల్లోలం చేస్తున్నాయి ప్రభూ! కొమ్ముటేనుగులను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా పడుతున్నాయి.


తెలుగు నుడికారం, జాతీయాలు, వాడుక పదాలు:

ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:

  • పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము.
  • శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట
  • ఏరాలి కొడుకు – సవతి కొడుకు
  • పొరుపులు –  పొరపొచ్చాలు
  • రాణువలు- సేనలు
  • కూటయుద్ధం – అధర్మయుద్ధం
  • సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు
  • సృగాలాలు – నక్కలు
  • కెంధూళి – గోధూళి కి మరో రూపం (కెంపు+ధూళి)


జాతీయాలు:

  • పుచ్చకాయల దొంగంటే భుజాలెందుకు తడుముకుంటావు?
  • అవ్వపేరే ముసలమ్మ
  • బావిలో నీళ్ళు వెల్లువపోతాయా?
  • మాణిక్యం మహారాజు శిరసున ఉండాలికానీ మసిపాతన ఉంటే ఏం లాభం?
  • వెర్రివాడు వేడుక చూడబోతే వెతకడానికి ఇద్దరూ, ఏడవడానికి ముగ్గురూ
  • మెడపట్టుకు గెంటుతూ ఉంటే చూరుపట్టుకు వేళ్ళాడే స్వభావం
  • ఏరునిండి పారితే వెంపలిచెట్టు ఆపగలదా?
  • ఆశీర్వదించేప్పుడు అధ్యాహారం ఉంచరాదే!
  • ఉడుమునకే గాని ఉత్తమునకు రెండు నాలకలుండవమ్మా!
  • శత్రువులను చంపి తలపూలు వాడకుండా తిరిగిరండి


పద్యాల పదును:

కంఠమెత్తి రాగాలాపన చెయ్యడానికి వీలైన పద్యాలు లేని నాటకాన్ని తెలుగువాడు ఆదరించడు అనే రహస్యాన్ని తెలిసినవాడు కావడం చేత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కొన్ని చాటు పద్యాలను, వీరగాథల్లోని ద్విపద పంక్తుల్ని గ్రహించి కథలో ఉపయోగించారు. ఐతే వీటిల్లో ఏవి సేకరించినవి, ఏవి ఆయన రచించినవి అన్న సంగతి స్పష్టంగా లేదు.

రాగయుక్తంగా పాడుకోదగ్గవిగా, సరళంగా ఉన్న కొన్ని పద్యాలు:
సీ!!

సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి
                 కంటి నెత్తుటిధార కార్చసాగె
రిల్లనొప్పి జనించి పుల్లావు వెతనొంది
                 నాలుగ్గడులుగూడ నడువలేదు
ముగ్గురోగముతోడ నిగ్గుచెడి పసరమ్ము
                 లుయ్యాలపోలిక నూగసాగె
నాలుకచేరితో నరములుబ్బిన గొడ్డు
                 "అంబా" యటంచైన నార్చలేదు.

పై పద్యంలో పశుజాతులు, వాటి వ్యాధులపై అవగాహన ఉన్నవాళ్లకి కాటకపరిస్థిని, అంటువ్యాధులను కరుణరసాత్మకంగా కళ్లకు కట్టారు.

సీ!!

వెండి కొండలదండు విహరించునట్లు
                   వెల్లావుమందలు వెడలసాగె
నల్ల మబ్బులమూక నభమువీడినభంగి
                   కర్రియావులమంద కదలసాగె
పొంగిపారిన నదుల్ భువిని వలంచెడి పోల్కి
                   లేగదూడలు త్రుళ్లసాగదొడగె
ఏడుసంద్రమ్ములు కూడినడచెడురీతి
                   ఎద్దులాబోతులు నేగసాగె

గీ!!

విచ్చుకత్తుల వారలు వింటిమూక
వేయ గుర్రాల కంపటీల్ వెంటరాగ
ధరణి కంపించ దిక్కులు దద్దరిల్ల
పశులమందలు నెల్లూరి పథముపట్టె

సీ!!

పోట్లాట కుడుముల వేట్లాటవంటిదా
                    క్రొవ్వి పోరికి కాలుదువ్వరాదు
ఆలమ్ముసేయుటపాలుపిండుటకాదు
                    బరితెగించి తొడలు చరచరాదు
కదనమ్ము చేయుట కావడిమోయుటా
                    కలహించి కచ్చలు కట్టరాదు
యుద్ధమొనర్చుట యెద్దులంతోలుటా
                    కావరమ్మున కత్తి కట్టరాదు

అని రాయశృంగారభట్టు యాదవులను హెచ్చరించిన సందర్భంలో రాజసూయ యాగం లో శిశుపాలుడు కృష్ణుని హేళన చేసిన పోలిక లీలగా గుర్తుకు వస్తుంది.


రమ్మను సిద్ధిభూవరుని రాణువతో కదనమ్ము సేయగా
రమ్మను. చేవదప్పి సమరమ్మును చేసెడి శక్తిలేనిచో
నమ్మకమొప్ప మాదుచరణమ్ములపై శరణంచువాలగా
రమ్మను. యుద్ధమందు తన రాకడ పోకడలొక్కటేయగున్.
 

బెజవాడ బెబ్బులి పెయ్యలెర్రయ లేచి
                   కోడెదూడల నుసికొల్పునాడు
వెలమవీరుడు మాదు చెలుడు రాఘవుడల్లి
                   మింటమంటలు కురిపించునాడు
అరిభయంకరమూర్తి అయితన్న యేతెంచి
                   రిపుల కుత్తుకలుత్తరించునాడు
గోసంగి బీరన్న కోపించి రుద్రుడై
                   కొగంవాల్ కత్తితో కోయునాడు

అని కాటమరాజు భట్టుని హెచ్చరించినప్పుడు "అలుగుటయే ఎరుంగని" అన్న తిరుపతి వెంకట కవుల పద్యం స్ఫురిస్తుంది.

స్వల్ప సందేహాలు:

కొన్ని సందర్భాల్లో "ఇక్కడ ఇలా ఎందుకు ఉందో!" అని చిన్నపాటి సందేహాల్ని కలిగించిన అంశాలు;

  • పదమూడవ శతాబ్ధానికి చెందిన కథలో "అలగాజనం, దొమ్మి" అనే పదాలు పొసగలేదేమో అనిపిస్తుంది.
  • సిరిదేవమ్మ ఏదో తప్పుడు కోరిక కోరి ఉంటుదన్న అనుమానంతో, "పాపనూకమ్మ లాగా నిన్ను కూడా ఒంటిస్థంభం మేడలో పెట్టిస్తాడు." అంటాడు పోచయ్య. పాపనూకమ్మ దుష్టనక్షత్రంలో పుట్టి అరిష్టాలు సంభవిస్తున్నందున ఆమెని దూరంగా ఉంచడాన్ని, తప్పుడు ఆలోచనలకు శిక్షతో పోల్చడం అసమంజసంగా ఉంది.
  • మాలవాడి కొడుకు గోసంగి బీరన్నను "ఎడమరొమ్మిస్తే ఎడమైపోతాడని కుడిరొమ్ముకుడిపి అసమానంగా సాకేవు" అని సిరిదేవమ్మని ఉద్దేశించి అయితమరాజు అంటాడు. ఆ సందర్భంలో అది వెటకారంగా ధ్వనించినా, చివరికి యుద్ధ సందర్భంలో బీరన్న అదే మాట వాడుతూ తల్లి ఋణం  తీర్చుకోవలసి ఉందని కాటమరాజుతో అంటాడు. ఈ మాట అబద్ధమని కానీ, ఖండించినట్టు కానీ ఎక్కడా కనపడదు. మరి అటువంటి తరతమభేదాలు చూపని తల్లి, కళ్లల్లో నిప్పులు పోసుకుని కాటమరాజు పీడ విరగడ కావాలని చూస్తున్నట్టు రచయిత అగుమంచి ద్వారా చెప్పిస్తాడు. సిరిదేవమ్మ పాత్రలో ఈ వైరుద్ధ్యం కొంచం అసంబద్ధంగా అనిపిస్తుంది. కథకు రామాయణంతో పోలిక తీసుకురావడం కోసం ఈ పాత్రని కైకేయితో పోల్చినట్టుగా అనిపిస్తుంది.
  • బొల్లావు యాదవుల కులదైవమనీ, విష్ణుమూర్తి అంశమనీ చాలాసార్లు ఉటంకించబడుతుంది. కాకపోతే ఆ ఆవుయొక్క ప్రత్యేకత, విశిష్టతల గురించి యాదవులతో చెప్పించి ఉంటే బాగుండేది.
  • ఖడ్గ తిక్కన మరణించిన తర్వాత అతని భార్య జానమ్మ సహగమనం చేసిన సంగతి, ఈ కథలోని సహగమనాల విషయమూ గురించి చారిత్రకంగా ఆధారాలున్నప్పటికి, స్త్రీవాదం ప్రబలుతున్న ఆధునిక కాలానికి అణుగుణంగా ఆ విషయాలను ఆరుద్ర పరిహరించారని ముందుమాటలో చెబుతారు. ఐతే చరిత్ర ఆధారంగా రాసిన నాటకం కాబట్టి ఆ కాలపు ఆచారాలు, సాంఘిక పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి కీలకమైన ఇటువంటి సంగతులను రచయిత అభ్యుదయ వాదానికి అతీతంగా ప్రస్తావించి ఉంటేనే సముచితంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇదే నాటకంలో మరొక చోట ఇద్దరు భటులు మాట్లాడుకుంటున్న సందర్భంలో తాను ఓలి (కన్యాశుల్కానికి మరొక రూపం) చెల్లించి పెళ్ళాడిన సంగతి చెబుతాడు ఒక భటుడు. ఇది కూడా ఒకరకంగా దురాచారమైనప్పటికీ రచయిత ప్రస్తావించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
  • యుద్ధం మొదలవకముందు వరకూ ఇరుపక్షాలవారినీ (కన్నమదేవి, రాయశృంగార భట్టు మినహా)ధర్మబద్ధులుగా, నీతిపరులుగా చూపించి యుద్ధం మొదలెయిన తర్వాత నల్లసిద్ధిది అధర్మయుద్ధంగా చిత్రీకరించడానికి (ఆవులకి ప్రతిగా మందుగుండు సామాగ్రి వాడటం మినహా) చారిత్రకంగా ఆధారాలేవైనా ఉన్నాయా లేక కథానాయకుడి పక్షాన ప్రేక్షకుడిని నైతికంగా చేర్చడమే ప్రధాన కారణమా అన్నది ఒక సందేహం. కన్నమదేవి ఎంత కోరినా యాదవుల భక్తికీ, నమ్మకానికీ విలువనిచ్చి వారి బొల్లావుని కోరకపోవడం, చివరికి యుద్ధం జరుగుతూ ఉండగా కన్నమదేవి అకృత్యాలను తెలుసుకున్న నల్లసిద్ధి పక్షపాతం వహించకుండా ఆమెని శిక్షించడం వరకూ కూడా రాజు ప్రవర్తన సముచితంగానే అనిపిస్తుంది. పైగా ఆయన రాజ్యంలో లేనప్పుడు యాదవులు ఆవేశంతో చిలకను సంహరించడంతో మొదలై, కన్నమదేవి ఆగ్రహంతో అకృత్యాలు చేయించడం తిరిగి యాదవులు ఆవులతో దాడి చేసి రాజ్యంలో బీభత్సం సృష్టించడం వరకూ నల్లసిద్ధికి ఏమీ తెలియదు. అతడి ప్రమేయం ఏమీ లేకుండానే ఇరుపక్షాల మధ్యా ప్రతీకార వాంఛ తారస్థాయికి చేరుతుంది. తన రాజ్యమూ, ప్రజాజీవితమూ యాదవుల కారణంగా అల్లకల్లోలమైందనే విషయం మాత్రమే తెలిసిన రాజు యుద్ధ ప్రకటన చెయ్యడం ఔచిత్యలేమిగా అనిపించదు.
  • తమ కులదైవమైన బొల్లావుగురించి హీనంగా మాట్లాడిన చిలకను ఆవేశంతో సంహరించిన యాదవులకీ, తన ప్రాణప్రదమైన చిలుక మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవులని చంపించిన కన్నమదేవికీ మధ్య అసంకల్పితంగా, తమ నమ్మకానికీ, అహానికీ భంగం కలిగిన సందర్భంలో ఏర్పడే స్పర్ధ మొదలౌతుంది. తర్వాతి రాయభారమూ, యుద్ధప్రారంభమూ నామమాత్రమే. ఈ మొదటి వరస ఆవేశాల్లో కాటమరాజు, నల్లసిద్ధి ప్రత్యక్షంగా పాత్రలు కారు. తమ పశువులకు, ప్రజలకు అపకారం జరిగిన తర్వాతనే వారిద్దరూ ఆగ్రహానికి లోనౌతారు. కాబట్టి కదనానికి ప్రేరేపించిన వారిగానో, శాంతి కాముకులుగానో వారిద్దరిలో ఎవరినైనా అభివర్ణించడం సబబుగా అనిపించలేదు. ఇది కూడా ఈ నాటకానికి కథానాయకుడైన కాటమరాజు పట్ల పక్షపాత ధోరణిగా అనిపిస్తుంది.

ఈ పుస్తకం ముందుమాటలో ఉదహరించిన దిగుమర్తి సీతారామస్వామి గారి అభిప్రాయాన్ని ఉల్లంఘించి నాటకాన్ని చూడకుండా కేవలం చదివి మంచిచెడ్దలు ఎంచబోవడం దుస్సాహసమే. ఐనప్పటికీ ఈనాటికీ అతి సులభంగా అర్ధమయ్యే భాషలో, చిక్కటి పొదుపైన సంభాషణలతో ఆంధ్రుల చరిత్రలోని ఒకానొక జానపదేతిహాసం దొరుకుతున్నప్పుడు నాటకం చూసే అవకాశం కోసం వేచిచూడకుండా చదివేయడమే మంచిపని. ఈ పుస్తకం ప్రచురణకర్తలు 'స్త్రీశక్తి  ప్రచురణలు, చెన్నై'.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

జర్కన్

ఇది పసుపూ కాదు, ఆకుపచ్చా కాదు. మిరిమిట్లు గొలపదు. అంగుళం పొడవు, నాలుగు ముఖాల అందం దీనివి. ఎన్ని వస్తువులు పారేశాను? ఇచ్చేశాను. ఇది మాత్రం ఇంకా ఇప్పటికీ నాదగ్గర ఉంది. ఉపయోగం లేదు. దీని ఖరీదు తెలీదు నాకు. విలువ? Continue reading

Posted in కథ | Comments Off on జర్కన్

చోరకళ


మనకున్న అరవైనాలుగు కళల్లో చోరకళ ఒకటి. మిగతా కళల్లో నాట్యం, శిల్పం, చిత్రలేఖనం తదితరమైనవి ఇంద్రియాలకు, తద్వారా మనసుకు ఆహ్లాదం చేకూరుస్తాయి కాబట్టి వాటిని కళలు అన్నందుకు మనకే తంటా లేదు. చౌర్యం అనగానే ఇదేమి కళ అనే ప్రశ్న రావాలి. పైగా చౌర్యం అనగానే చోరుని గురించి కాక, నష్టపోయిన వాని గురించిన ఆలోచనలు ముప్పిరిగొనడం కద్దు.

Continue reading

Posted in సంపాదకీయం | 3 Comments

నీల గ్రహ నిదానము – 3

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

శనిదేవుడు

ద్వితీయాంకము :: ద్వితీయ దృశ్యము Continue reading

Posted in కథ | Tagged | 1 Comment