ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లో కాటమరాజు కథాచక్రం ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచన "కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వమునాహరింప" అనే రీతిగా వారి జీవిత సమస్త శక్తిని పీల్చి వేసిన కారణంగా దీనిని పరిష్కరించలేకపోయారని ఈ నాటకానికి ముందుమాట రాసిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు అంటారు.


క్లుప్తంగా కథ, ప్రచారం:

శ్రీశైలం దగ్గర ఆవుల్ని మేపుతున్న కాటమరాజు, అక్కడ క్షామం రావడం చేత తన అనుచరులతో కలిసి ఆలమందలను తోలుకుని దక్షిణ భూములకు తరలి వస్తాడు. నెల్లూరిసీమను పాలించే నల్లసిద్ధి రాజుతో ఒక ఏడాది పాటు తమ పశువుల్ని అక్కడ మేపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం కోసం రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఖడ్గతిక్కన సాయాన్ని తీసుకుంటారు. ఐతే, నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసిచంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. ఆ విధంగా మొదలైన ప్రతీకారాలు, ఒప్పంద ఉల్లంఘనలు ఇరుపక్షాల వారినీ యుద్ధానికి ప్రేరేపిస్తాయి. యాదవులకు మొదట్నుంచీ సహాయం చేసిన ఖడ్గతిక్కన ఈ సంఘటనల నేపథ్యంలో వారితోనే యుద్ధంచేసి స్వర్గస్థుడౌతాడు. నల్లసిద్ధి రాజు, కాటమరాజు ముఖాముఖీ తలపడే యుద్ధ సన్నివేశంతో నాటకం ముగుస్తుంది. ఐతే విజయం ఎవరిది అనే విషయం అస్పష్టంగా ఉంది. ఇదే అస్పష్టత ఈ కథ మీద ప్రచారంలో ఉన్న ఇతర గాథల్లోనూ ఉన్నట్టు తెలుస్తుంది.

కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్ధంలో జరగగా, కాటమరాజు ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది.

కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని "సుద్దులగొల్లలు, కొమ్ములవారు" అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత "యాదవభారతం ఎద్దుమోత బరువు" అనే సామెత పుట్టింది. ఈ కథాచక్రాన్ని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారంగా ఉన్నప్పటికీ శ్రీనాధ విరచితమైన కథ మనకి అందుబాటులో లేదు.

రచనారీతి, పాత్రల చిత్రిక:

మొత్తం ముప్పైనాలుగు రంగాలుగా విభజించబడ్డ ఈ నాటకరచన ఒకరంగం నుండి మరో రంగంలోని పాత్రలకూ, స్థలానికీ అత్యంత సహజంగా మారుతూ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిస్తుంది. మనకు ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఖడ్గతిక్కన కథలో ఖడ్గతిక్కన నాయకుడిగానూ, కాటమరాజు పుల్లరి ఎగ్గొట్టి మోసం చేసిన ప్రతినాయకుడిగానూ కనిపిస్తారు. అటువంటి బహుళప్రచారంలో ఉన్న పాత్రలను తీసుకుని కాటమరాజుని అవతారపురుషుడిగా, సౌమ్యుడు, మితభాషి ఐన ఉత్తముడిగా  చిత్రీకరించడం, దానిని పాఠకుడిచేత సందేహం లేకుండా ఆమోదింపజేయటం అంత సులభమైన పనేం కాదు. ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్నేళ్ళుగా ఖడ్గతిక్కనకు ఉన్న కథానాయకుడి స్థానం మారినప్పటికీ, అతని వ్యక్తిత్వ చిత్రణ, ధీరత్వ వర్ణన,  పాత్ర ఉదాత్తత వంటి విషయాల్లో ఎటువంటి మార్పూ చెయ్యకుండా ఆ పాత్రపై పాఠకుడిలో ఆరాధనాభావాన్ని కలిగిస్తారు రచయిత.

కథానాయకుడైన కాటమరాజు మొదటినుంచీ ధర్మబద్ధుడిగా, ఆవేశం, ఆగ్రహం, విషాదం కలిగించే సందర్భాల్లో సంయమనం పాటించే వ్యక్తిగా, అవసరానికిమించి మాట్లాడని తత్వంగలవాడిగా, తన పశుగణాలపై, తమవారిపై అపారమైన అభిమానంగలవాడుగా కనిపిస్తాడు. ఇచ్చినమాటకు అతను కట్టుబడే విధానాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే – దక్షిణాదికి పశువులతో సహా తరలివస్తున్నప్పుడు అది శత్రుసీమ కాబట్టి తన కొడుకుని పంపడం ఇష్టం లేని సవతితల్లి, అయితమరాజును పంపకుండా కొన్ని సాకులు ఏర్పరుస్తుంది. కానీ  అక్కడ కాటమరాజు తప్పక నెగ్గుకొస్తాడనే నమ్మకం లోలోపల ఉన్నది కావటం చేత సంవత్సరం తర్వాత తాము దక్షిణాదిన సాధించిన దానిలో తమ్మునికి వాటా ఇవ్వమని మాట తీసుకుంటుంది. ఐతే ఆమె చెప్పిన గడువుకి యుద్ధం మొదలౌతుంది. తాము నెల్లూరిసీమలో సాధించినది ఇదే కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడికి యుద్ధంలో భాగం ఇస్తానని కబురు పంపుతాడు కాటమరాజు.

"తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని", కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.

ఇటుపక్క కత్తి దించిన వారిపై కదనం చేయలేక ఇంటికి తిరిగివచ్చిన ఖడ్గ తిక్కనను పిరికివాడిగా భావించి తల్లి, తండ్రి, భార్య హేయంగా అవమానిస్తున్నప్పుడు కనీసం నోరు మెదపక తిక్కన సహనం పాటించిన సందర్భంలో వ్యక్తిత్వం, బాధ్యత, యుద్ధనీతుల నిర్వాహణ లో సంయమనం సాధించడానికి ఆ పాత్ర వహించిన మౌనం అతని గంభీరతను నిరూపిస్తుంది.

ఎనిమిదవ రంగంలో బోయలు యాదవుల వల్ల తమ భుక్తికి ఇబ్బందిగా ఉందనీ, వేటలో తమకన్నా వారు చురుగ్గా ఉండటం వల్ల వేట తమవరకూ రావడం లేదనీ తిక్కన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, 'వాళ్లంత చురుగ్గా మీరు లేకపోవడం వాళ్ల దోషం కాదు' అని సమాధానపరచి పంపుతాడు. అటువంటిది, ఒప్పందాన్ని అతిక్రమించి యాదవులు రాజ్యం దాడిచేశారన్న వార్త విని, యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడౌతాడు. రెండు సందర్భాల్లోనూ వేడుకున్నది తమ ప్రజలే అయినా, ఒప్పంద నియమాలను సూక్ష్మంగా విచారించి స్పందించే ధోరణి కనపడుతుంది.

తన మీద సీసపద్యం చెప్పిన కొమరభట్టుకి ఎత్తుగీతి పూర్తి చేశాక బహుమతి ఇస్తానన్న వాగ్దానానికి తిక్కన చివరి క్షణాల్లో సైతం కట్టుబడి తన ఉంగరం ఇచ్చి పంపడం ఒక ఎత్తయితే, తమతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న శత్రుసేనలోని వీరుడిని చూసి ఆరాధనాభావంతో ఎన్నాళ్లక్రితమో ఆగిపోయిన పద్యాన్ని కొమరభట్టు పూర్తి చెయ్యడం ఆ సన్నివేశానికి కథలో ఉదాత్తమైన స్థానాన్ని కల్పించింది.


యుద్ధరంగం:

వీరరస ప్రధానమైన కథ కాబట్టి అయువుపట్టైన యుద్ధ సన్నివేశాలకి అవసరమైనంత భాగం ఈ నాటకంలో దక్కినట్టే కనిపిస్తుంది.

జిలుగుటమ్ములు పాతించి, పారాలు తవ్వించి, నిడిపట్టు, అలిమేక, దిగుమజవ వంటి వ్యూహాలతో కూడిన చక్రబంధాన్ని రచించి నల్లసిద్ధి ఆధునిక యుద్ధతంత్రాలతో సాయుధసేనతో సమరశంఖారావం చేస్తే..

అడ్దాయుకటువ, అమలచెలిక, కుందలింగముకొంద, తూమువేరులను కాపాడటానికి బొల్లావును నియమించి, గోసంగి బలాలు , భండన విక్రములైన యాదవవీరులు, ఏనుగులను చంపడానికి ఎద్దులు, అశ్వాలను చంపడానికి అక్షీణసంఖ్యలో ఆవులనూ తరలించి, స్థైర్యమే సైన్యంగా, ఆత్మబలమే అంగరక్షణగా కాటరాజు బలగం రణభూమిలోకి దిగినట్టు చిత్రిస్తారు రచయిత.

దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి , వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.

పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్థావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం  సందర్భోచితంగా ఉంటుంది.

మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.

భీకర యుద్ధసన్నివేశాల్లో, బీభత్సరసం ఆయువుపట్టుగా సాగే సందర్భాల్లో రంగస్థలం మీద చూపించడానికి ఉన్న పరిమితుల దృష్ట్యా అటువంటి సన్నివేశాల్ని ఛాయానాటకం టెక్నిక్ ద్వారా చూపించారు.


సందేశం:

యాదవులు రాచరికపు నాగరికతల దృష్ట్యా వెనకబడినవారు. దేశసంపదలోని స్వయంసమృద్ధికి ఆయువుపట్టైన పశుగణాన్ని ప్రాణాధికంగా కాపాడి అహర్నిశలూ వాటి క్షేమాన్ని కోరుకునే అమాయకజాతి. రాజులకి పశుగణాలు కేవలం సంపద ఐతే యాదవులకి అవి దైవ స్వరూపాలు. గోవుని మాతగా పూజించే భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని బొల్లావుని విష్ణుస్వరూపంగా ఆరాధించినవారు. అటువంటి ఒక నిర్మలమైన జాతిని, ఆ జాతి జీవనాధారమైన పశు సంపదను నిర్మూలించడానికి ఆధునిక పరికరాల్ని, మందుగుండునూ వాడి, ఆర్ధికంగా సాస్కృతికంగా వినాశనాన్ని కొనితెచ్చిన ప్రతిపక్షమే నెల్లూరిరాజులని నిరసించడమే ఈ నాటకంలోని ముఖ్యోద్దేశం.

అన్ని పాత్రలకూ సరిపడినంత స్థలమూ, అన్ని సన్నివేశాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా తానుఎంచుకున్న కోణం నుండి కథను రసవత్తరంగా చూపించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు.


వచనంలో శబ్ధలయ

పద్యాలకైతే ప్రాసయతులు, గణాల గుణగణాల వల్ల స్వతహాగా శబ్ధ సౌందర్యం అబ్బుతుంది. వచనంలో ఆ లయను సాధించడానికి శబ్ధాల పలుకుబడిపై అవగాహన, నాటక ప్రదర్శనలో వాచకం పై పట్టు కుదరాలి. ఈ నాటకంలో అవి చక్కగా కుదిరాయి. సంభాషణలు హాయిగా లయాత్మకంగా సాగుతాయి.


మచ్చుకి కొన్నిమాటలు:

  • వెర్రిగొల్లలు వెక్కిరిస్తే నాదేం పోదు.  ఓండ్రకప్పకు నోరు గొప్పదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తే ఏం భయపడం. గొల్ల వంకరబుద్ధి గొబ్బున మానండి.
  • మీరు ముడుపులోని కనకంలాంటివారు. మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే ముడుపుపోదు. మీరు కన్నయితే మేము కంటికి రెప్పల వంటి వాళ్లము, రెప్పకు హాని రానిదే కంటికి దెబ్బ తగలదు.
  • ఆవులు అల్లకల్లోలం చేస్తున్నాయి ప్రభూ! కొమ్ముటేనుగులను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా పడుతున్నాయి.


తెలుగు నుడికారం, జాతీయాలు, వాడుక పదాలు:

ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:

  • పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము.
  • శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట
  • ఏరాలి కొడుకు – సవతి కొడుకు
  • పొరుపులు –  పొరపొచ్చాలు
  • రాణువలు- సేనలు
  • కూటయుద్ధం – అధర్మయుద్ధం
  • సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు
  • సృగాలాలు – నక్కలు
  • కెంధూళి – గోధూళి కి మరో రూపం (కెంపు+ధూళి)


జాతీయాలు:

  • పుచ్చకాయల దొంగంటే భుజాలెందుకు తడుముకుంటావు?
  • అవ్వపేరే ముసలమ్మ
  • బావిలో నీళ్ళు వెల్లువపోతాయా?
  • మాణిక్యం మహారాజు శిరసున ఉండాలికానీ మసిపాతన ఉంటే ఏం లాభం?
  • వెర్రివాడు వేడుక చూడబోతే వెతకడానికి ఇద్దరూ, ఏడవడానికి ముగ్గురూ
  • మెడపట్టుకు గెంటుతూ ఉంటే చూరుపట్టుకు వేళ్ళాడే స్వభావం
  • ఏరునిండి పారితే వెంపలిచెట్టు ఆపగలదా?
  • ఆశీర్వదించేప్పుడు అధ్యాహారం ఉంచరాదే!
  • ఉడుమునకే గాని ఉత్తమునకు రెండు నాలకలుండవమ్మా!
  • శత్రువులను చంపి తలపూలు వాడకుండా తిరిగిరండి


పద్యాల పదును:

కంఠమెత్తి రాగాలాపన చెయ్యడానికి వీలైన పద్యాలు లేని నాటకాన్ని తెలుగువాడు ఆదరించడు అనే రహస్యాన్ని తెలిసినవాడు కావడం చేత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కొన్ని చాటు పద్యాలను, వీరగాథల్లోని ద్విపద పంక్తుల్ని గ్రహించి కథలో ఉపయోగించారు. ఐతే వీటిల్లో ఏవి సేకరించినవి, ఏవి ఆయన రచించినవి అన్న సంగతి స్పష్టంగా లేదు.

రాగయుక్తంగా పాడుకోదగ్గవిగా, సరళంగా ఉన్న కొన్ని పద్యాలు:
సీ!!

సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి
                 కంటి నెత్తుటిధార కార్చసాగె
రిల్లనొప్పి జనించి పుల్లావు వెతనొంది
                 నాలుగ్గడులుగూడ నడువలేదు
ముగ్గురోగముతోడ నిగ్గుచెడి పసరమ్ము
                 లుయ్యాలపోలిక నూగసాగె
నాలుకచేరితో నరములుబ్బిన గొడ్డు
                 "అంబా" యటంచైన నార్చలేదు.

పై పద్యంలో పశుజాతులు, వాటి వ్యాధులపై అవగాహన ఉన్నవాళ్లకి కాటకపరిస్థిని, అంటువ్యాధులను కరుణరసాత్మకంగా కళ్లకు కట్టారు.

సీ!!

వెండి కొండలదండు విహరించునట్లు
                   వెల్లావుమందలు వెడలసాగె
నల్ల మబ్బులమూక నభమువీడినభంగి
                   కర్రియావులమంద కదలసాగె
పొంగిపారిన నదుల్ భువిని వలంచెడి పోల్కి
                   లేగదూడలు త్రుళ్లసాగదొడగె
ఏడుసంద్రమ్ములు కూడినడచెడురీతి
                   ఎద్దులాబోతులు నేగసాగె

గీ!!

విచ్చుకత్తుల వారలు వింటిమూక
వేయ గుర్రాల కంపటీల్ వెంటరాగ
ధరణి కంపించ దిక్కులు దద్దరిల్ల
పశులమందలు నెల్లూరి పథముపట్టె

సీ!!

పోట్లాట కుడుముల వేట్లాటవంటిదా
                    క్రొవ్వి పోరికి కాలుదువ్వరాదు
ఆలమ్ముసేయుటపాలుపిండుటకాదు
                    బరితెగించి తొడలు చరచరాదు
కదనమ్ము చేయుట కావడిమోయుటా
                    కలహించి కచ్చలు కట్టరాదు
యుద్ధమొనర్చుట యెద్దులంతోలుటా
                    కావరమ్మున కత్తి కట్టరాదు

అని రాయశృంగారభట్టు యాదవులను హెచ్చరించిన సందర్భంలో రాజసూయ యాగం లో శిశుపాలుడు కృష్ణుని హేళన చేసిన పోలిక లీలగా గుర్తుకు వస్తుంది.


రమ్మను సిద్ధిభూవరుని రాణువతో కదనమ్ము సేయగా
రమ్మను. చేవదప్పి సమరమ్మును చేసెడి శక్తిలేనిచో
నమ్మకమొప్ప మాదుచరణమ్ములపై శరణంచువాలగా
రమ్మను. యుద్ధమందు తన రాకడ పోకడలొక్కటేయగున్.
 

బెజవాడ బెబ్బులి పెయ్యలెర్రయ లేచి
                   కోడెదూడల నుసికొల్పునాడు
వెలమవీరుడు మాదు చెలుడు రాఘవుడల్లి
                   మింటమంటలు కురిపించునాడు
అరిభయంకరమూర్తి అయితన్న యేతెంచి
                   రిపుల కుత్తుకలుత్తరించునాడు
గోసంగి బీరన్న కోపించి రుద్రుడై
                   కొగంవాల్ కత్తితో కోయునాడు

అని కాటమరాజు భట్టుని హెచ్చరించినప్పుడు "అలుగుటయే ఎరుంగని" అన్న తిరుపతి వెంకట కవుల పద్యం స్ఫురిస్తుంది.

స్వల్ప సందేహాలు:

కొన్ని సందర్భాల్లో "ఇక్కడ ఇలా ఎందుకు ఉందో!" అని చిన్నపాటి సందేహాల్ని కలిగించిన అంశాలు;

  • పదమూడవ శతాబ్ధానికి చెందిన కథలో "అలగాజనం, దొమ్మి" అనే పదాలు పొసగలేదేమో అనిపిస్తుంది.
  • సిరిదేవమ్మ ఏదో తప్పుడు కోరిక కోరి ఉంటుదన్న అనుమానంతో, "పాపనూకమ్మ లాగా నిన్ను కూడా ఒంటిస్థంభం మేడలో పెట్టిస్తాడు." అంటాడు పోచయ్య. పాపనూకమ్మ దుష్టనక్షత్రంలో పుట్టి అరిష్టాలు సంభవిస్తున్నందున ఆమెని దూరంగా ఉంచడాన్ని, తప్పుడు ఆలోచనలకు శిక్షతో పోల్చడం అసమంజసంగా ఉంది.
  • మాలవాడి కొడుకు గోసంగి బీరన్నను "ఎడమరొమ్మిస్తే ఎడమైపోతాడని కుడిరొమ్ముకుడిపి అసమానంగా సాకేవు" అని సిరిదేవమ్మని ఉద్దేశించి అయితమరాజు అంటాడు. ఆ సందర్భంలో అది వెటకారంగా ధ్వనించినా, చివరికి యుద్ధ సందర్భంలో బీరన్న అదే మాట వాడుతూ తల్లి ఋణం  తీర్చుకోవలసి ఉందని కాటమరాజుతో అంటాడు. ఈ మాట అబద్ధమని కానీ, ఖండించినట్టు కానీ ఎక్కడా కనపడదు. మరి అటువంటి తరతమభేదాలు చూపని తల్లి, కళ్లల్లో నిప్పులు పోసుకుని కాటమరాజు పీడ విరగడ కావాలని చూస్తున్నట్టు రచయిత అగుమంచి ద్వారా చెప్పిస్తాడు. సిరిదేవమ్మ పాత్రలో ఈ వైరుద్ధ్యం కొంచం అసంబద్ధంగా అనిపిస్తుంది. కథకు రామాయణంతో పోలిక తీసుకురావడం కోసం ఈ పాత్రని కైకేయితో పోల్చినట్టుగా అనిపిస్తుంది.
  • బొల్లావు యాదవుల కులదైవమనీ, విష్ణుమూర్తి అంశమనీ చాలాసార్లు ఉటంకించబడుతుంది. కాకపోతే ఆ ఆవుయొక్క ప్రత్యేకత, విశిష్టతల గురించి యాదవులతో చెప్పించి ఉంటే బాగుండేది.
  • ఖడ్గ తిక్కన మరణించిన తర్వాత అతని భార్య జానమ్మ సహగమనం చేసిన సంగతి, ఈ కథలోని సహగమనాల విషయమూ గురించి చారిత్రకంగా ఆధారాలున్నప్పటికి, స్త్రీవాదం ప్రబలుతున్న ఆధునిక కాలానికి అణుగుణంగా ఆ విషయాలను ఆరుద్ర పరిహరించారని ముందుమాటలో చెబుతారు. ఐతే చరిత్ర ఆధారంగా రాసిన నాటకం కాబట్టి ఆ కాలపు ఆచారాలు, సాంఘిక పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి కీలకమైన ఇటువంటి సంగతులను రచయిత అభ్యుదయ వాదానికి అతీతంగా ప్రస్తావించి ఉంటేనే సముచితంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇదే నాటకంలో మరొక చోట ఇద్దరు భటులు మాట్లాడుకుంటున్న సందర్భంలో తాను ఓలి (కన్యాశుల్కానికి మరొక రూపం) చెల్లించి పెళ్ళాడిన సంగతి చెబుతాడు ఒక భటుడు. ఇది కూడా ఒకరకంగా దురాచారమైనప్పటికీ రచయిత ప్రస్తావించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
  • యుద్ధం మొదలవకముందు వరకూ ఇరుపక్షాలవారినీ (కన్నమదేవి, రాయశృంగార భట్టు మినహా)ధర్మబద్ధులుగా, నీతిపరులుగా చూపించి యుద్ధం మొదలెయిన తర్వాత నల్లసిద్ధిది అధర్మయుద్ధంగా చిత్రీకరించడానికి (ఆవులకి ప్రతిగా మందుగుండు సామాగ్రి వాడటం మినహా) చారిత్రకంగా ఆధారాలేవైనా ఉన్నాయా లేక కథానాయకుడి పక్షాన ప్రేక్షకుడిని నైతికంగా చేర్చడమే ప్రధాన కారణమా అన్నది ఒక సందేహం. కన్నమదేవి ఎంత కోరినా యాదవుల భక్తికీ, నమ్మకానికీ విలువనిచ్చి వారి బొల్లావుని కోరకపోవడం, చివరికి యుద్ధం జరుగుతూ ఉండగా కన్నమదేవి అకృత్యాలను తెలుసుకున్న నల్లసిద్ధి పక్షపాతం వహించకుండా ఆమెని శిక్షించడం వరకూ కూడా రాజు ప్రవర్తన సముచితంగానే అనిపిస్తుంది. పైగా ఆయన రాజ్యంలో లేనప్పుడు యాదవులు ఆవేశంతో చిలకను సంహరించడంతో మొదలై, కన్నమదేవి ఆగ్రహంతో అకృత్యాలు చేయించడం తిరిగి యాదవులు ఆవులతో దాడి చేసి రాజ్యంలో బీభత్సం సృష్టించడం వరకూ నల్లసిద్ధికి ఏమీ తెలియదు. అతడి ప్రమేయం ఏమీ లేకుండానే ఇరుపక్షాల మధ్యా ప్రతీకార వాంఛ తారస్థాయికి చేరుతుంది. తన రాజ్యమూ, ప్రజాజీవితమూ యాదవుల కారణంగా అల్లకల్లోలమైందనే విషయం మాత్రమే తెలిసిన రాజు యుద్ధ ప్రకటన చెయ్యడం ఔచిత్యలేమిగా అనిపించదు.
  • తమ కులదైవమైన బొల్లావుగురించి హీనంగా మాట్లాడిన చిలకను ఆవేశంతో సంహరించిన యాదవులకీ, తన ప్రాణప్రదమైన చిలుక మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవులని చంపించిన కన్నమదేవికీ మధ్య అసంకల్పితంగా, తమ నమ్మకానికీ, అహానికీ భంగం కలిగిన సందర్భంలో ఏర్పడే స్పర్ధ మొదలౌతుంది. తర్వాతి రాయభారమూ, యుద్ధప్రారంభమూ నామమాత్రమే. ఈ మొదటి వరస ఆవేశాల్లో కాటమరాజు, నల్లసిద్ధి ప్రత్యక్షంగా పాత్రలు కారు. తమ పశువులకు, ప్రజలకు అపకారం జరిగిన తర్వాతనే వారిద్దరూ ఆగ్రహానికి లోనౌతారు. కాబట్టి కదనానికి ప్రేరేపించిన వారిగానో, శాంతి కాముకులుగానో వారిద్దరిలో ఎవరినైనా అభివర్ణించడం సబబుగా అనిపించలేదు. ఇది కూడా ఈ నాటకానికి కథానాయకుడైన కాటమరాజు పట్ల పక్షపాత ధోరణిగా అనిపిస్తుంది.

ఈ పుస్తకం ముందుమాటలో ఉదహరించిన దిగుమర్తి సీతారామస్వామి గారి అభిప్రాయాన్ని ఉల్లంఘించి నాటకాన్ని చూడకుండా కేవలం చదివి మంచిచెడ్దలు ఎంచబోవడం దుస్సాహసమే. ఐనప్పటికీ ఈనాటికీ అతి సులభంగా అర్ధమయ్యే భాషలో, చిక్కటి పొదుపైన సంభాషణలతో ఆంధ్రుల చరిత్రలోని ఒకానొక జానపదేతిహాసం దొరుకుతున్నప్పుడు నాటకం చూసే అవకాశం కోసం వేచిచూడకుండా చదివేయడమే మంచిపని. ఈ పుస్తకం ప్రచురణకర్తలు 'స్త్రీశక్తి  ప్రచురణలు, చెన్నై'.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

  1. చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.ఆరుద్ర రచనలెన్నో చదివి ఉన్నా ఇది చదవడం తటస్థించ లేదు.తప్పక సేకరించుకుని చదువుతాను.

Comments are closed.