కొ.కు. వర్ధంతి

koku1.JPG
[1950లలో కుటుంబరావు]

“ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు” అనే స్థిరాభిప్రాయంతో విరివిగా సాహితీసృజన చేసిన అభ్యుదయగామి కొడవటిగంటి కుటుంబరావు (28 అక్టోబర్ 1909 – 17 ఆగష్టు 1980) గారి వర్ధంతి నేడు.

ఈ సందర్భంగా ఆయన అభిరుచులు, వ్యక్తిత్వం, సాహిత్యాల గురించి తెలిపే మూడు వ్యాసాలను అందిస్తున్నాం. వీటిలో సుప్రసిద్ధ వైణిక విద్వాంసుడు చిట్టిబాబు, రచయిత, కళాదర్శకుడు మా. గోఖలే గార్లు రాసిన వ్యాసాలను రచయితల ఫోటోలు, పరిచయాలతో సహా మాకందించిన డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు. మూడో వ్యాసం ప్రసిద్ధ కథావిమర్శకులు కోడూరి శ్రీరామమూర్తిగారు రాసిన “తెలుగు కథ: నాడూ నేడూ” పుస్తకంలోనిది. ఈ వ్యాసాన్ని పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన శ్రీరామమూర్తిగారికి ధన్యవాదాలు.

ఈ నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు (వ్యాసం)

కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు (వ్యాసం)
శ్రోత, గాయకుడు – కుటుంబరావు (వ్యాసం)
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం (వ్యాసం)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

Posted in ఇతరత్రా | Comments Off on కొ.కు. వర్ధంతి

కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం

-కోడూరి శ్రీరామమూర్తి

“ఒక కథకుడికి రచనాసామర్థ్యం లేకపోయినా సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం.”

-ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడిపదార్థంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, గల్పికలను మలిచిన అక్షరశిల్పి కొడవటిగంటి కుటుంబరావుగారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

1909-80 సంవత్సరాల మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1931-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ది సాహిత్య జీవితకాలంలో – కుటుంబరావుగారు సమకాలీన ప్రజాజీవితాన్ని కుదిపేసిన ఎన్నో సంఘటనలకు వ్యక్తిగా, రచయితగా ప్రతిస్పందించాడు. భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై బలమైన ముద్రను వేసిన ఎన్నో సంఘటనలకు ఆయన ప్రత్యక్షసాక్షి. రెండు ప్రపంచయుద్ధాలు, ఆర్థిక మాంద్యం, జాతీయోద్యమం, స్వాతంత్ర్య సాధన, దేశవిభజన, కాంగ్రెస్ పరిపాలన, నిరాశనే మిగిల్చిన స్వాతంత్ర్యం, మతోన్మాదం, కులతత్వం, పెరిగిన దారిద్ర్యం – నిరుద్యోగం, అపహాస్యంగా మిగిలిన ప్రజాస్వామ్యం, రష్యాలో జరిగిన విప్లవం రేకెత్తించిన కొత్త ఆలోచనలు, ఆదర్శాలు – వీటన్నిటి ప్రభావమూ వ్యక్తిగా, రచయితగా కుటుంబరావుగారిపై ఉంది. ఈ నేపథ్యంలోంచి కొ.కు. సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవలసి ఉంది.

సంప్రదాయ నీతులను వ్యతిరేకించినా, మూఢనమ్మకాలను ఎద్దేవా చేసినా, స్వాతంత్ర్యానంతరం గద్దెనెక్కిన ప్రభువుల పాలనను హేళన చేసినా, సమసమాజ స్థాపనకై పరితపించినా, రచయితగా కుటుంబరావు ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. “అన్నింటికన్నా కష్టసాధ్యమైనది జీవిత వాస్తవికత. వాస్తవ జీవితం వేరు, జీవిత వాస్తవికత వేరు. వాస్తవ జీవితం అందరికీ అనుభవంలోకి వచ్చేదే.”

“మానవజాతి ఎటు పోతున్నది? ఎటు పోవాలి? దారిద్ర్యము, అనారోగ్యము, సంకుచితత్వము, కులతత్వము, మతతత్వము, ఇటువంటి సాంఘిక పీడలు నిర్మూలనమై ప్రజలు స్వేచ్ఛగా, తమ ఆర్థిక, నైతిక జీవితాలను గట్టి పునాది మీద నిర్మించుకొనడానికి మార్గమేది? యిటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న కొద్దీ కథలు జీవితానికి దగ్గరగా వచ్చి జీవితసత్యాలను తెలుసుకోగలుగుతాయి.” అని ప్రకటించిన కుటుంబరావుగారు ఏ భావజాల ప్రభావంతో ఏ రచనలు చేసినా ఈ ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించేందుకే పరితపించారు.

1931 సంవత్సరంలో కథకుడుగా కుటుంబరావు కలంపట్టేనాటికి చింతాదీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, వేలూరి శివరామశాస్త్రి, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, పూడిపెద్ది వెంకటరమణయ్య, వఝుల బాబూరావు, రాయసం వెంకట శివుడు ప్రభృతులు కథలు రాస్తున్నారు. గురజాడవారి ‘దిద్దుబాటు’ కథ వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కొ.కు.గారికి కథలు రాయాలనే కోరిక కొడవటిగంటి వెంకటసుబ్బయ్య ‘సుకుమారి’, ‘ఏప్రిల్ ఫూల్’, – చింతా దీక్షితులు ‘సాహితికి కథ’ వంటివి చదివాక బాగా కలిగినప్పటికీ – కథకుడుగా తొలినాళ్ళలో ఆయనకు మార్గనిర్దేశకత్వం చేసింది గురజాడ, చలం అని చెప్పాలి. వీరిద్దరిలో గురజాడ ప్రభావం చివరిదాకా ఉన్నప్పటికీ – చలం ప్రభావం మాత్రం ఆయన తొలినాటి కథల్లో గణనీయంగా కనబడుతుంది.

“Though art is my master, I have a duty to society” అనే గ్రహింపుతో చురుక్కుమనిపించే వ్యంగ్యస్ఫూర్తితో రచనలు చేసిన గురజాడ – సమకాలీన ప్రపంచంలో అమలులో ఉన్న విలువలు మానవుని శ్రేయస్సుకు దోహదకారిగా లేకపోతే వాటిని ప్రశ్నించవలసిన బాధ్యత కలం పట్టిన రచయితకు ఉన్నదనే విషయాన్ని తెలియజెప్పాడు. అవి సామాజికపరమైనవైనా, లేక ఆర్థిక రాజకీయ రంగాలకు సంబంధించినవైనా, వాటిని ప్రశ్నించే అలవాటును అభ్యుదయ దృక్పథం గల రచయితలు గురజాడ అడుగుజాడ నుండి తెలుసుకున్నారు. ఇలాంటి గురజాడ స్ఫూర్తి చివరివరకూ కొ.కు. రచనల్లో కనబడడంలో ఆశ్చర్యం లేదు.

ఇక – చలం విషయానికి వస్తే, నీతికీ అవినీతికీ మధ్య గీతగీసి, దాన్ని గురించి బెంగపెట్టుకుని బుర్ర పాడు చేసుకోవలసిన అవసరం లేదనీ, దానికన్నా ముఖ్యమైన విషయాలు మరికొన్ని జీవితంలో వున్నాయనీ చెప్పడం వరకూ కుటుంబరావు చలానికి సన్నిహితంగా కనబడతాడు. కుటుంబరావు తాను రచించిన ‘చెడిపోయిన మనిషి’ కథలో లేడీడాక్టర్ నోట చెప్పించినట్టు
“మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేటట్లు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన. మిగిలినవి బూటకపు నియమాలు” అనేదే ఆయన ఆలోచన. ఈ పనిని సాధించే క్రమంలో ఎదుటివారు, ప్రక్కవారు, ఏమనుకుంటారు అనికాకుండా నీ మనసు ఏం చెబుతున్నది అనే విషయానికి ప్రాధాన్యతను యివ్వాలని చలం కోరుకున్నట్లుగా – కొడవటిగంటివారు కూడా కోరుకున్నారు.

ప్రపంచప్రఖ్యాత తత్త్వవేత్త రసెల్ రెండు తరహాల ‘మంచిపనులు’ వుంటాయి అని అంటాడు. ఒకటి subjective rightness, రెండోది objective rightness. చట్టం, సంప్రదాయ నీతులు, చర్చి మొదలైనవి ఏం చెయ్యాలని చెబుతున్నాయో అది objective rightness అయితే, ఇతరులు ఏమంటారు అని కాకుండా మనసు దేనిని మంచి పని అంటుందో దానిని subjective rightness అంటారు. ఈ రెండింటిలో మనిషి అనుసరించాల్సింది ‘సబ్జెక్టివ్ రైట్నెస్’ అని చెప్పిన నేరానికి – సమకాలీన సమాజం రసెల్ వంటి గొప్ప మేధావిని దారుణమైన అవమానాలకు గురిచేసింది. “మనిషి పాపం చేసినా ఫరవాలేదు. మానవత్వం వదులుకోకూడదు.” అని చెప్పిన నేరానికి (యిక్కడ పాపం అనే మా టను చర్చి చెప్పే మూఢనమ్మకాలకు, తిరోగమన ధోరణులకు వర్తించేదిగా అర్థం చేసుకోవాలి) అతడిపై ఆస్తికులు, సంప్రదాయవాదులు కత్తిగట్టారు.

సంప్రదాయ నీతులను, పురుషాధిక్య సమాజంలోని రెండునాల్కల ధోరణిని నిరసించి వ్యక్తిస్వేచ్ఛకు పట్టాభిషేకం చేసిన చలం గారిలో కూడా ఇలాంటి తిరుగుబాటు ధోరణే ఉన్నది. కుటుంబరావుగారిని ఇది బాగా ఆకట్టుకుంది. కుటుంబరావుగారి ‘అపనమ్మకం’ కథలోని రాజ్యం “నాకు నిజంగానే నీతి పై నమ్మకం లేదు.నీతి కంటే ముఖ్యమైనవి జీవితంలో ఉన్నట్లు అదివరకే నిర్ధారణ చేసుకున్నాను. ఇక, ఆత్మగౌరవము, పవిత్రత అంటావా? దీర్ఘంగా ఆలోచిస్తే అవి అణచిపెట్టిన అహంకారాతిశయాలేగాని, ఇంకేమీ కాదు” అనడాన్ని – “పెళ్ళి వ్యవహారం” కథలోని సులోచన తన స్నేహితురాలి అన్న జగన్నాథంతో వివాహం లాంటి ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారాన్నీ, “పాప ఫలం” కథలోని పంకజాక్షి పంకంలోంచి బయటపడిన తీరునూ, “సద్యోగం” కథలోని సూర్యనారాయణ నీతిని పట్టుకుని వేళ్లాడి నిరుద్యోగిగా ఉండిపోవడం కంటే తన ‘పురుష లక్షణానికి’ తగిన (?) వ్యాపకాన్ని సంపాదించుకుని బ్రతుకుదెరువును వెదుక్కోవడాన్నీ, కుహనా నీతులతో ‘అరణ్యం’లా మారిపోయిన ఈ సమాజంలోంచి బ్రతికి బయటపడడానికి ‘అరణ్యం’ కథలోని వివాహిత చేసిన తెగింపునూ గమనిస్తే – చలం ప్రభావంతో సమకాలీన సమాజాన్ని దుఃఖమయం చేసిన సంప్రదాయనీతులపై కుటుంబరావు ఎగరేసిన తిరుగుబాటు బావుటా తెలుస్తుంది.

అయితే చలాన్ని కుటుంబరావు ఏనాడూ గుడ్డిగా అనుసరించలేదు. చలంలో వుండే మితిమీరిన వ్యక్తివాద ధోరణి గానీ, వివాహవ్యవస్థ పట్ల విముఖత గానీ, కుటుంబరావు కథల్లో సార్వత్రిక రీతిలో కనబడవు. అదిన్నీగాక – చలంగారి పాత్రల్లా కొ.కు. కథల్లోని పాత్రలు లౌకిక దృక్పథం లేనివి కావు. లౌక్యం పండిన పాత్రలవి. సంప్రదాయంతో అవి ఢీకొనేవి – కేవలం ‘నిజమైన’ ఆనందం సాధించడానికీ, తమను తాము అన్వేషించుకోవడానికీ కాదు. లౌకికంగా ఏ ప్రమాణాలతో చూసినా హాయిగా సుఖపడడానికీ – బ్రతుకుదెరువును సాధించుకోవడానికీ అవి సంప్రదాయంపై తిరుగుబాటు చేస్తాయి. ఇందుకు కావలసిన తెగువ, గడుసుదనం ఆయన స్త్రీపాత్రల్లో మరింతగా కనబడుతుంది. వ్యక్తి చేసే తిరుగుబాటును లౌకిక దృష్టితో అవలోకించినందువల్లనే ఆయన కాలక్రమంలో ఆ గీతను పొడిగించి సామాజిక అభ్యున్నతికి దానినొక మార్గంగా చూడగలిగారనిపిస్తుంది.

ఇక – “సెక్సు అనేది ఒక సున్నితమైన విషయం. అది ఒక సహజమైన ప్రవాహంలా సానుభూతి, ఉదారత, వెచ్చని తాదాత్మ్యతలతో కూడిన ధారావాహికలా ఉండాలి. హృదయంలేని లైంగిక సంయోగంలా ఉండకూడదు. ఏదో ఒక తాత్కాలిక ఆవేశంతో తొందరలో అయిపోయే వ్యవహారంలా ఉండకూడదు.” అనే డి.ఎచ్. లారెన్స్ భావాలకు చలంగారిలా కుటుంబరావు సన్నిహితుడు కాదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్ వ్యాసంలో (కొడవటిగంటి సాహిత్య సమాలోచన – ఢిల్లీ ఆంధ్ర సంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి.

“చలం తన ప్రపంచానికి కేంద్రంలో స్త్రీని నిలబెట్టాడు. స్త్రీ స్వాతంత్ర్యం ముఖ్యంగా సెక్స్ స్వాతంత్ర్యం దృష్టి నుంచి సకల సామాజిక సమస్యలనూ పరిశీలించాడు. కథారచనలో ఒక విధంగా ఆయన వారసుడు కొడవటిగంటి .” కాని చలం ప్రారంభించిన భావ విప్లవాన్ని ఈయన విశ్వతోముఖంగా విస్తరింపజేశాడు. మార్క్సిస్టు సామాజిక దృక్పథాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి ఆ ప్రక్రియను మానవుని సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్తింపజేశాడు. మానవుడి ఆర్థిక, రాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్త్యాన్ని తన సాహిత్య వస్తువుగా తీసుకుని హేతువాద దృక్పథం నుండి నిశితంగా, నిర్దాక్షిణ్యంగా విశ్లేషిస్తూ రచనలు సాగించాడు – ” అంటారాయన ఆ వ్యాసంలో.

ఇందులో నండూరి వారు ప్రస్తావించిన ‘ఫ్రాయిడ్’కు సంబంధించిన అంశాన్ని కూడా (సంక్షిప్తంగా నయినా) అవలోకించవలసి వుంది. ఇరవయ్యవ శతాబ్దంలో మానవుని ఆలోచనలను అత్యంత ప్రభావితం చేసిన మేధావుల జాబితాను చెప్పవలసి వస్తే – అందులో ఫ్రాయిడ్ పేరు ప్రముఖంగా కనబడుతుంది. ఒకప్పుడు ఛార్లెస్ డార్విన్ సిద్ధాంతం చేసిన అలజడీకి మించిన అలజడిని సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘సైకో ఎనాలిసిస్’ సిద్ధాంతం సృష్టించింది. దీని ప్రభావం పలురంగాలపై పడినట్టుగానే సాహితీ సృజనపై కూడా పడింది. పాత్ర చిత్రణలో క్రొత్తపుంతలు తొక్కేందుకు రచయితలకు వీలు చిక్కింది.

దీని ప్రభావం కొ.కు. కథలపై కూడా కొంతవరకూ కనబడుతుందిగాని, కొందరు రచయితల్లా – ఈ సిద్ధాంతాల అవగాహనతో ప్రయోగాత్మకమైన రీతిలో కథలు రాసి ప్రత్యేకతను చూపుదామనే తపన కుటుంబరావుగారికి లేదు. ఆయన దృష్టి అంతా ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం మీదనే! ఇందుకుగాను ఈ అవగాహన ఎంతవరకూ తోడ్పడగలదో అంతవరకే దానిని ఉపయోగించుకున్నారు.

ఉదాహరణకు కుటుంబరావు గారి ‘అమాయకురాలు’ కథనే తీసుకుందాం. ఒక కథను మనోవైజ్జానిక దృక్పథంలోంచి చెప్పబడిన కథగా పేర్కొనేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈ కథలో ఉన్నాయి. కానీ – ఈ కథను చెప్పడంలో కథకుడి లక్ష్యం అంతటితో ఆగిపోదు. ఈ కథలోని భ్రమరకు యుక్తవయస్సు వచ్చిన తొలిరోజుల్లోనే వైధవ్యం సంప్రాప్తించినప్పుడు సంప్రదాయాన్ని కాదని జుట్టు తీసుకోవడానికి నిరాకరించడానికీ, ఆ తర్వాత ఇంటిలో వాళ్ళు వద్దంటున్నా తనకు తానుగా జుట్టు తీసుకోవడానికీ గల కారణాన్ని ఆమె అంతరంగపు లోలోపలి పొరల్లో వెదికి పట్టుకోవలసి ఉంటుంది. వెంకటేశ్వర్లు పట్ల ఆమె గుండెల్లో కోరిక గూడుకట్టుకుని వున్నందునే మొదటిలో ఆమె జుట్టు తీయించుకోడానికి అంగీకరించలేదు. చివరకు వెంకటేశ్వర్లుకు మరొక అమ్మాయితో వివాహం జరుగుతున్నప్పుడు అందమైన తన కురులను బీభత్సదాయకమైన రీతిలో కత్తిరించుకుని ‘ మెసోకిక్‘ ప్రవర్తన ద్వారా అంతరంగంలోని తన కోరికకు ఉపశమనం కలిగించుకోవలసి వచ్చింది.

ఈ కథలో భ్రమర అంతరంగంలోని సంఘర్షణ మాత్రమే కాదు – ఆమెలాంటి బాల వితంతువులు ఆనాటి సమాజంలో ఎదుర్కోవలసివున్న సామాజిక సమస్య కూడా ఆవిష్కరించబడడం విశేషం. ఇదే విషయాన్ని ‘కాలప్రవాహపు పాయలు’ కథ విషయంలో కూడా చెప్పవచ్చు. ఈ కథలోని పురుషోత్తం ఒకప్పుడు సోషలిస్టు. మార్క్స్, లెనిన్ రచనల పట్ల వల్లమాలిన అభిమానాన్ని చూపినవాడు. సంఘాన్ని మరమ్మత్తు చేసి, పేదల బ్రతుకులు బాగుచెయ్యాలని పరితపించినవాడు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే – అతని గుండె లోపల వున్న అసలు పురుషోత్తం అతడికి మానసిక సంక్షోభం కలిగిస్తూ ఉంటాడు. అతడి ఒకనాటి ప్రియురాలినీ, అతడు ఒకనాడు నమ్మిన ఆదర్శాలనూ జ్ఞాపకానికి తెచ్చి చికాకును కలిగిస్తూ ఉంటాడు.వీటన్నింటి ఫలితంగా ఆతడు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పే “ఆడిటరీ హెల్యూసినేషన్స్”కు, “విజువల్ హెల్యూసినేషన్స్”కు గురి అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఒక ఉదంతాన్ని ఈ కథలో కుటుంబరావుగారు మనసుకు హత్తుకునేలా చెబుతారు. అవకాశవాద రాజకీయాలు ఇవ్వగల స్వల్పకాల ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ – దానివలన వ్యక్తికి మనశ్శాంతి కరువుకాక తప్పదని హెచ్చరించే కథ యిది.

ఇలాంటి ఉదాహరణలు కొ.కు. కథల్లో మరికొన్ని కూడా కనబడతాయి. కొందరు కథకుల్లా లైంగికప్రవృత్తి, అంతరంగంలో అణచివేయబడిన శృంగారభావనలు వంటి కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా – మనిషి కథను పలు డైమెన్షన్లలో చూపేందుకు మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల అవగాహనను సమర్థవంతంగా ఉపయోగించుకున్న కథకుడు కుటుంబరావు.

ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, కుటుంబరావుగారిపై గల ఇతర ప్రభావాల గురించి చెప్పేటప్పుడు జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి. వెల్స్, అనటోల్ ఫ్రాన్స్, మొదలైనవారి పేర్లు మనోవీధిలో మెదులుతాయి.

రచనలో సామాజిక ప్రయోజనానికి పెద్దపీట వేసిన బెర్నార్డ్ షా నాటకాల్లో భావావేశపరులైన హీరోలు, హీరోయిన్లు కనబడతారు. వ్యంగ్యం, హాస్యం వీటన్నింటితో తాను చెప్పదలిచిన విషయాన్ని పాఠకుడి బుర్రకు గట్టిగా పట్టేలా చెబుతాడాయన. ఈ వ్యంగ్యస్ఫూర్తి కుటుంబరావుగారికి చాలా అభిమానపాత్రమైన విషయం.

నిరాడంబరమైన శైలిలో ఉండే ఆయన రచనలకు ఈ వ్యంగ్యస్ఫూర్తే ఒక ప్రత్యేకతను సమకూర్చి పెట్టిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రేమకథను రాసినా, వర్గపోరాటం గురించి చెప్పినా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్ళికథను రాసినా, ఆఖరికి సినీ ‘మాయాలోకం’ గురించి రాసినా, ఆయన కథలన్నింటిలోనూ ఈ వ్యంగ్యస్ఫూర్తి తళుక్కుమంటూనే ఉంటుంది. ఏ విషయాన్నయినా ఘాటయిన పదజాలంతో విమర్శించకుండా – చురుక్కుమనిపించే వ్యంగ్యంతో చెప్పడం ఆయన ప్రత్యేకత. తన జీవితకాలంలో ఆయనకు చికాకు కలిగించిన చౌకబారు సినిమాలను, – తాడు, బొంగరం లేని ‘సైన్స్ ఫిక్షన్’నూ – అధమస్థాయి అభిరుచిని పెంపొందించే డిటెక్టివ్ సాహిత్యాన్ని – ఇట్లాంటి సాహిత్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే వ్యాపార రచయితలనూ – కుటుంబరావుగారు తమ కథల్లో ఆటపట్టించిన తీరు ఆయన రచనలు చదివినవారందరికీ గుర్తుంటుంది.

వ్యంగ్యరచనా చమత్కృతిలో కొందరు కుటుంబరావుగారిని ప్రఖ్యాత రష్యన్ రచయిత చెహోవ్ తో పోలుస్తూ ఉంటారు. చెహోవ్ లాగానే కుటుంబరావుగారికి కూడా పాఠకులను గిలిగింతలు పెట్టడం ప్రధానధ్యేయం కాదు. సరి అయిన రీతిలో ప్రశ్నను పాఠకుడి ముందు ఉంచి అతడిని ఆలోచింపచెయ్యడమే ఇద్దరికీ ఇష్టమైన విషయం. “ఉపదేశం వ్యక్తిత్వాన్ని పరాభవిస్తుంది. ఆలోచనను రేకెత్తించే గుణం వ్యక్తిత్వాన్ని నిద్రలేపుతుంది-” అనే కుటుంబరావుగారి సాహితీ దృక్పథం చెహోవ్ ఆలోచనకు సన్నిహితమైందే.

అంతేకాదు – “కథారచయితగా చెహోవ్ ఇతివృత్తం మీదా, ఏదో ఒక ఆశ్చర్యదాయకమైన విషయం మీద కాక – మొత్తం వాతావరణం మీదా – ఒకసంఘటన ప్రాతిపదికగా జీవితానుభూతినంతటినీ పట్టుకోగలగడం మీద ఆధారపడతాడు.” అంటూ చెహోవ్ గురించి ‘మార్టిన్ సేమూర్-స్మిత్’ చేసిన విశ్లేషణ (‘గైడ్ టు మోడరన్ వరల్డ్ లిటరేచర్’ అనే గ్రంథంలో) కుటుంబరావుగారికి కూడా చాలా వరకూ వర్తిస్తుంది.

వ్యంగ్యాన్ని అభిమానించే కుటుంబరావుగారు ఒక సందర్భంలో ఇలా అన్నారు:
“నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులుతొక్కడమూ అనుకోనక్కరలేదు. ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్లే ఉండనవసరం లేదు. ‘కన్యాశుల్కం’లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును. చలంగారి కథల్లో కసి ఉంది. ఆయనలో సౌందర్యదృష్టి ఒకపాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథల్లో ఉన్నదా కసి. భమిడిపాటి వారి హాస్యంలో పళ్లు పటపటలాడించే కసి ఉండేది. సెటైరంతా కసి సాహిత్యమే.”

(సాహిత్య వ్యాసాలు – పే. 313)

-ఇలాంటి ‘కసి’తోనే కుటుంబరావుగారు తన సాహితీ ప్రస్థానంలో అన్ని దశలలోనూ రచనలు చేస్తూ వచ్చారు. రాసిన ప్రతిసందర్భంలోనూ సంఘటనల ప్రాతిపదికగా మొత్తం జీవితానుభూతినీ, వాతావరణాన్నీ సమర్థవంతంగా పట్టుకున్నారు.

“నేను మామూలుగా బుద్ధిమంతుణ్ణే.” (రాజకీయ వ్యాసాలు – పే.366) అని చెప్పుకున్న కుటుంబరావుగారు ఏప్రిల్ 1931లో ‘గృహలక్ష్మి’లో ‘ప్రాణాధికం’ అనే మొదటి కథను రాసేనాటికి తెలుగుసాహిత్యానికి మరో ‘బుద్ధిమంతుడయిన’ రచయిత వచ్చాడని పెద్దలు భావించారు. ఆ పత్రిక సంపాదకులు ఆండ్ర శేషగిరిరావుగారు ఈ కథకొక ప్రస్తావికను రాస్తూ –

“భారతమహిళ శీలవిషయమున అగ్నిశిఖ. నియమ పాలనమున వజ్రభిత్తి. భర్తృ సేవ ఆమెకు ప్రాణాధికము. ఈ విషయమునే ఈ కథ నిర్వహించుచున్నది. ఇది భారతమహిళా సతీత్వమును ప్రదర్శించు చక్కని చిన్నకథ.” – అని మెచ్చుకున్నారు కూడా.

కాని, మరో ఆరేళ్ళు గడిచేసరికి “తాతయ్య”, “అరణ్యం”, “కాలభైరవుడు” లాంటి కథలు రాసి, ఆ ‘బుద్ధిమంతతనాన్ని’ చాలావరకూ పోగొట్టుకున్నాడు! కుసంస్కారి అయిన ముసలి మొగుడితో సంసారం చెయ్యలేక సవతికొడుకుతో వెళ్ళిపోయిన ఓ అభాగ్యురాలి కథను “అరణ్యం”లోను, ఒక ఊరకుక్కను కాలభైరవుడి అవతారంగా భావించి పూజాదికాలు, భజన సంకీర్తనలు, మొక్కుబడులు, వగైరా కార్యక్రమాలన్నీ జరిపించి ఖంగుతిన్న మూఢభక్తుల కథను “కాలభైరవుడు”లోనూ – రాసి విమర్శకులకు చికాకు కలిగించాడు! బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం అనే విమర్శకుడు “కాలభైరవుడు” కథను విమర్శిస్తూ ‘ఈ కథ ఎందుకు వ్రాసినట్లో తెలియడం లేదు’ అని విసుక్కున్నాడు కూడా. అంతటితో ఆగకుండా ‘రావణుడికి న్యాయం చేస్తాను’ అని బయలుదేరి ‘అశోకవనం’ అనే కథను రాసి సీతను ‘బొత్తిగా సౌందర్య దృష్టిలేని వ్యక్తి’గా చిత్రిస్తే* – విమర్శకులు ఇది ‘రావణుడికి న్యాయం చెయ్యడం కాదు. సీతకి అన్యాయం చెయ్యడం’ అంటూ గుండెలు బాదుకోవలసి వచ్చింది!

ఇక – కుటుంబరావుగారు ఆ రోజుల్లో రాసిన కథల్లో తనకు బాగా తృప్తి కలిగించిన కథ అని చెప్పుకున్న ‘తాతయ్య’ కథ సంప్రదాయవాదులకు మరింత ‘బాధ’ కలిగించింది.

“మనుషులందరిలోకీ బ్రాహ్మలెక్కువ. బ్రాహ్మల్లో నియోగులకంటే వైదీకులెక్కువ. బ్రాహ్మణ పిల్లలు శూద్దర వాళ్ళ ఇండ్లలో మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందులో ఒక మజ్జిగ చుక్క వేస్తే తాగవచ్చు. నియోగులు మంచి బ్రాహ్మణులు కారు. కాని, వాళ్లను శూద్దర వాళ్ల ను చూసినట్లు చూడరాదు. నీళ్ళల్లో మజ్జిగ చుక్క వెయ్యమని అడగకూడదు! మాలవాళ్ల దగ్గరగా పోతే మనం మైలపడతాం. దొరలు కూడా మాలవాళ్ళే – వాళ్ళు స్నానాలు చెయ్యకపోయినా తెల్లగా ఉంటారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు!”

-ఇలా, ఒక బాలుడి స్వగతాన్ని కుహనా విలువలతో నిండిన సంప్రదాయభావాల పట్ల ‘కసి’తో – మన ముందుంచుతారు కుటుంబరావుగారు ‘తాతయ్య’ కథలో. ఇలాంటి చురకలు ‘కొంతమందికి’ ఆగ్రహం తెప్పించడంలో ఆశ్చర్యం ఏముంది?
సుమారుగా ’40ల వరకూ సామాజిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చిన కుటుంబరావుగారి ఆలోచనల్లో ’40ల తర్వాత చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దీనికి కారణం సామ్యవాద దృక్పథంతో పరిచయం ఏర్పడడం, ఒకప్పుడు Keynes లాంటి అర్థశాస్త్రవేత్తలు – “It is an obsolete economic text book which I know to be not only scientifically erroneous but without interest or application for the modern world” అని భావించిన కారల్ మార్క్స్ ‘డాస్ కాపిటల్’లో కుటుంబరావుగారికి గొప్ప వెలుగు కనబడింది. (ఆర్థికమాంద్యం సమయంలో మరణశయ్యమీద కెక్కిన పెట్టుబడిదారీ వ్యవస్థను బ్రతికించి సోవియెట్ రష్యా ఒరవడిలో ప్రపంచం ‘ఎర్రబడిపోకుండా’ ‘రక్షించిన’ కీన్స్ వంటి అర్థశాస్త్రవేత్తలకు మార్క్స్ ఆలోచనలు రుచించకపోవడంలో ఆశ్చర్యం లేనట్టే – పీడితుల పక్షాన నిలబడాలని కోరుకునే కొ.కు. వంటి వారిని మార్క్స్ దృక్పథం ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.)

“-1942లో మార్క్స్ రాసిన ‘కేపిటల్’ చదివిందాకా నాకు కమ్యూనిజం యొక్క ఆధారమేమిటో తెలియలేదు. ఒక మిత్రుడు యథాలాపంగా అన్నమాట నామీద బండెడు ప్రభావం కన్నా ఎక్కువ పని చేసింది. దొరికిన మార్క్సిస్టు సాహిత్యం చదివాను. భవిష్యత్తు మార్క్సిజంకే ఉన్నట్లు నమ్మకం కుదిరింది.” – (“రాజకీయ వ్యాసాలు” నుండి)

“మార్క్స్ కేపిటల్ చదవడంతో సహా మార్క్సిజం గురించి చదవడం నాకు మేలు చేసింది. సంఘవ్యాధి గురించి కొంత అర్థం చేసుకోగలిగాను. ఈపాటి జ్ఞానోదయం కలగగానే నేను చేసిన మొదటిరచన ‘కులం గాడి అంత్యక్రియలు’, – అటుతర్వాత రాసిన కథల్లో మనస్తత్వం గురించి గాలికబుర్లు రాయడం మానేసి ఆ మనస్తత్వాన్ని ఆడించే సాంఘికశక్తులను చిత్రించడం ప్రారంభించాను. ‘నీ కథలు వెనుక ఉన్నట్లుగా లేవు. అవే బాగున్నాయి’ అని కొందరు అభిమానులు నన్ను హెచ్చరించారు.”
– (“సాహిత్య వ్యాసాలు” నుండి) అంటూ కుటుంబరావుగారు వ్యక్తిగా, రచయితగా తనపై మార్క్స్ ఆలోచనలు చూపిన ప్రభావాన్ని చెప్పుకున్నారు. కుటుంబరావుగారు ఏ ఆలోచనలతో కథలను రాసినా, దాని ఆవిష్కరణకు మధ్యతరగతి కుటుంబీకుల జీవితచిత్రాన్నే నేపథ్యంగా తీసుకునేవారనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను చిత్రించడంలో కుటుంబరావుగారికి గొప్ప నిపుణత ఉంది. మార్క్సిస్టు దృక్పథంతో రచనలు చేసినప్పుడు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తూ కుటుంబరావుగారు ఇలా అన్నారు.

“- నేను మధ్యతరగతి సంస్కారం కలవాణ్ణి. ఈ సంస్కారంతో నేను అభ్యుదయ రచనలు చేయగలను కానీ, – శ్రామిక సాహిత్యసృష్టి చెయ్యలేను. అందుచేత నా రచనలు జనసామాన్యాన్నీ, శ్రామికులను, ఉత్తేజపరచలేవు. కాని, మధ్యతరగతి వారిలో ప్రజాజీవితానికి అనుకూలించే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. ఈ పని ఎంత విజయవంతంగా చెయ్యగలిగితే అంత ఉత్తమ కథకుణ్ణి అనిపించుకుంటాను.” –

ఇలా అంటూనే – “రచయిత తన వర్గాన్ని గురించే రాయాలని లేదు. అనేకమంది సుప్రసిద్ధ కథకులు తమకు దూరంగా ఉండే వర్గాలను గురించి కూడా కథలు రాసి ఆయా జీవితాల్లోని సత్యాన్ని ప్రదర్శించగలిగారు -” అని కూడా అంగీకరించారు.

రచయిత తాను ఏ వర్గానికి చెందినవాడో ఆ వర్గాన్ని గురించి రాసినప్పుడు జీవితసత్యాన్ని మరింత స్పష్టంగా పట్టుకునేందుకు – దానిని శక్తివంతంగా కథల్లో ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో తాను ఏ వర్గాన్ని గురించి రాస్తున్నాడో ఆ వర్గంతో కొంత సన్నిహిత సంబంధం ఉండాలి. కేవలం ఊహించుకుని జీవితసత్యాన్ని అన్వేషించగలగడం సాధ్యంకాదు.

మరొక వర్గానికి చెందిన రచయితకు శ్రామికుల జీవితాలతో సన్నిహిత సంబంధం ఉన్న సందర్భాలలో కూడా ఎంతకాదనుకున్నా తన వర్గస్వభావం రచనలో చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఇది చెబుతుంటే – మార్క్సిస్టు సాహిత్యవిమర్శ గురించి చెబుతూ లూనకార్స్కీ –
“- రచయిత సృష్టించే సాహిత్యం ఉద్దేశపూర్వకంగానయితేనేమి, అట్లాంటిది లేకుండానయితేనేమి, అతడు ప్రాతినిధ్యం వహించే వర్గానికి ఎప్పుడూ ప్రతిబింబంగా ఉంటుంది. అలాకానప్పుడు సర్వసాధారణంగా జరిగేదేమంటే – రచయితపై వివిధ వర్గాల ప్రభావం జమిలిగా అ సాహిత్యంలో కనబడుతుంది. దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది.” అనడం జ్ఞాపకానికి వస్తుంది.

ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా, ’40ల తర్వాత కొ.కు. రాసిన కథల్లో – స్వాతంత్ర్యానంతరం దేశంలో పెచ్చుపెరిగిన దారిద్ర్యం, నిరుద్యోగం, కమ్యూనిజమ్ ను అణచివేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఆకలి దారిద్ర్యాలను నిర్మూలించడం విషయంలో చూపకపోవడం, కులం పేరుతో మతం పేరుతో పెరిగిన దోపిడీ ప్రవృత్తి, మొదలయిన విషయాలను సార్వత్రిక ధోరణిలో చర్చిస్తూ – మధ్యతరగతి కుటుంబాల్లో పలు రూపాల్లో చోటుచేసుకునే ‘జంకులు’ వారినెలా శక్తిహీనులను చేస్తున్నాయో, చిన్నపాటి సంపద లభించే అవకాశం ఏర్పడినా మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పెట్టుబడిదారీ ప్రవృత్తి ఎలా తలెత్తుతుందో – అద్భుతంగా చిత్రించడం జరిగింది అనేది విస్మరించరాని సత్యం. ఇందుకుగాను ఆయన వ్యంగ్యాన్ని చిలకరిస్తూ “కసి” సాహిత్యాన్ని రాయవచ్చు. లేదా సింబాలిక్ ధోరణిలో కథను అల్లవచ్చు. లేదా – మామూలుగానే కథను చెబుతూ మనుషుల ప్రవర్తనలోని సంకుచితత్వాన్ని ఎద్దేవా చేయవచ్చు. అదీకాదనుకుంటే ఒక ‘సైన్స్ ఫిక్షన్’గా మన ముందు ఉంచవచ్చు. ఏధోరణిలో ఎలా రాసినా ఆయన అరాటం మనిషి మనిషిగా జీవించాలని మాత్రమే!

“రోడ్డు ప్రక్కన శవం” కథలో కుటుంబరావుగారు “-మనిషి ఫాలాక్షుడు. ఫాలం విప్పి ఏ సమస్యకేసి చూసినా ఆ సమస్య యొక్క స్వరూపం మారిపోతుంది. అయితే – తాను ఫాలాక్షుణ్ణన్న సంగతి మనిషికి తెలియదు. అందుచేత ఫాలం విప్పడు. శివోహం అనుకోడు -” అని వ్రాశారు. పాఠకుల చేత ‘శివోహం’ అనిపించేలా చెయ్యాలన్నదే కొ.కు. తపన!

తాను నమ్మిన విషయాన్ని ఆచరించే విషయంలో వున్న ‘జంకు’ వ్యక్తికీ, దేశానికీ, మంచిదికాదు అనేది కుటుంబరావుగారి అభిప్రాయం. ఈ విషయాన్నే మనం ‘యావజ్జీవ శిక్ష’, ‘బకాసుర’ వంటి కథల్లో ఛూడవచ్చు. ఈ రెండూ ’60లలో రాయబడిన కథలే – ( ‘బకాసుర’ను నవలగా భావించడం వున్నదిగాని, ఒక ప్రక్రియగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది కథే అని నా అభిప్రాయం)

‘యావజ్జీవ శిక్ష’లోని శేషు ఒక ఆదర్శవాది. హేతువాది. అతగాడికి జంఝెప్పోగు మీద, బ్రాహ్మణత్వం మీద, పరలోకం మీద బొత్తిగా నమ్మకం లేదు. కాని, బ్రతుకుతెరువు కోసం – ఆదెమ్మత్త ఆదరణను పొందడం కోసం – ఈ బూటకపు విలువలన్నింటికీ తలవంచవలసి వచ్చింది. ఆఖరికి తద్దినాలు కూడా పెట్టవల్సి వచ్చింది. “నేను ఎంత వాజమ్మనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది” అనే శేషు స్వగతంతో ఈ కథను ముగిస్తారు కుటుంబరావుగారు. ఇట్లాంటి “రాజీ”లు మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లో కోకొల్లలుగా కనబడతాయి. వీరిలోని -‘జంకు’ ఈ పరిస్థితికి మూలకారణం. ఈ ‘జంకు’ వల్లనే పెట్టుబడిదారు కూడా స్వేచ్ఛగా ప్రజలను దోచుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని ‘బకాసుర’లో అత్యద్భుతంగా చెబుతారు కుటుంబరావుగారు.

ఈ కథలో భీముడు చంపిన బకాసురుడు (రాక్షసుడు నిజానికి – భయంకరుడేమీ కాదు! వంట్లో జవసత్వాలు లేకపోయినా (వార్ధక్యం కారణం వల్ల) తన ఏజెంట్ల పబ్లిసిటీ ద్వారా “రాక్షసత్వాన్ని” నిలబెట్టుకుంటూ ప్రజల్ని హడలగొడుతున్న ముసలి రాక్షసుడు! – ప్రజల అజ్ఞానమే – ప్రజల పిరికితనమే – అతడి శక్తి. “కేపిటలిజమ్”కు ఉన్న ముద్దుపేర్లన్నింటికీ ఇతడూ బదులు పలుకుతాడని చెప్పవచ్చు.)

ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకుతెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే! “బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటల నేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.

‘జాంబవంతుని కల’లో కూడా ఇలాంటి సింబాలిక్ ధోరణి కనబడుతుంది. ఈ కథలోని జాంబవంతుడు ఓ వానర ప్రభువు కొలువుకూటంలోని మంత్రి మాత్రమే కాదు. ప్రజల అభ్యుదయం కోసం ఆరాటపడిన ఓ మహనీయుడు. కిష్కింధ ప్రజలకు వాలి పాలన పోయి సుగ్రీవుడి పరిపాలన వస్తే దేశం స్వేచ్ఛా, సమానతలతో అభివృద్ధి చెందుతుందనీ, ప్రజలకు హాయి కలుగుతుందనీ ఆయన కలలు గన్నాడు. కానీ, – సుగ్రీవుడి పాలనలో ఆ కలలేవీ నిజం కాకపోవడమేకాకుండా – దేశంలో రాక్షసరాజ్యం విజృంభించడం చూసి కృంగిపోయాడు. ఋష్యమూకం మీద ఉన్న విప్లవకారులు దేశానికి మంచి చేద్దామనే పట్టుదలతో ఉన్నారని విని – వాళ్ళమీద ఆశలు పెంచుకున్నాడు. దర్బారులో “విప్లవం వర్ధిల్లాలి” అని కలవరించి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈ కథ చదివినప్పుడు మనదేశంలో ప్రజల కలలు కల్లలుగా మారిన స్వాతంత్ర్యానంతర పరిస్థితులు మాత్రమే కాదు – అవకాశవాదులతో సహజీవనం చెయ్యలేక, ఆత్మను చంపుకోలేక కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన కొందరు వృద్ధ నాయకులు కూడా జ్ఞాపకానికి రావడం సహజం.

స్వాతంత్ర్యానంతరం మనదేశంలో అధికారం స్వార్థపరుల హస్తగతం కావడంతో దేశం ‘దిబ్బరాజ్యం’గా మారిపోయిందని భావించిన కుటుంబరావుగారు ‘దిబ్బరాజ్యం’ కథలు రాశారు.

దిబ్బరాజ్యానికి స్వాతంత్ర్యం వచ్చిందని విని మనకు కథను చెప్పే వ్యక్తి ఆ రాజుగారిని కలుసుకోవడానికి అక్కడకు వెళ్ళే సరికి రాజుగారి దర్బారు ‘శాసనసభ’గా పేరు మార్చుకుందనీ, దానికి రాజావారు అధ్యక్షులయిపోయారనీ, జమీందారులందరూ మంత్రులుగా మారిపోయారని తెలుస్తుంది! – రాజుగారు మాటల మధ్యలో తమ దేశంలో జమీందారీలు రద్దయిపోయాయని చెబితే – మన కథానాయకుడు చాలా సంతోషించి, ఆ వివరాలు చెప్పమంటాడు.

-జమీందారీలు లేవుగానీ, ఒక్కటే చింత, – జమీందార్లకు నష్టపరిహారం రొక్కరూపంలో ఇవ్వలేకపోయాం. పరిహారం క్రింద చాలా భూములు వారికిచ్చేసి – మిగిలిన వాటిని రైతులు నాలుగేళ్ళపాటు ఎలాంటి ప్రతిఫలం పొందకుండా సాగు చేసేటట్లు నిర్ణయించాం” అంటారు రాజుగారు!

యిక, – మరోకథలో దిరుగుండం రాజ్యాన్ని ఏలుతున్న దిబ్బరాజుగారు దేశంలో దారిద్ర్యం పెరిగిపోయిందని విని దరిద్రుల పీడ వదిలించుకోవడానికి వాళ్ళందరినీ ఉరితీయాలని ఆదేశిస్తారు! దీని ఫలితంగా దేశంలో పనిచేసేవారే లేకుండా పోయారు. ధనికులకు భూమ్మీద కాలు నిలవని పరిస్థితి ఏర్పడి దేశం అల్లకల్లోమైపోయింది. అప్పటికిగాని శ్రీశ్రీ రాజావారికి, వారి ఆశ్రితులయిన ధనికులకు, తాము ఇన్నాళ్ళు బ్రతికింది బీదల కష్టం మీదనేనని తెలిసిరాదు!

ఇట్లాంటి కథలను కుటుంబరావుగారు ఏ వ్యవస్థపట్ల ‘కసి’తో రాశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇలాంటి ‘కసి’తో రాసినదే ‘కరువొచ్చింది’ అనే కథ కూడా –
“-కరువొచ్చింది. పంటలు పండినై, – గింజలు కళ్ళాలు దాటగానే మాయమయినై. పైరు పచ్చగా పెరిగినప్పుడూ, కంకులు బరువుగా వొంగి, తమను ఏపుగా పెంచిన భూదేవికి జోహార్లు చేసినప్పుడూ, బంగారు గింజలు కనక వర్షంలా జలజల రాలినప్పుడూ, కళ్ళపండువుగా చూచిన పేదప్రజలకు కన్నుపొడుచుకున్నా గింజ కనిపించలేదు. రైతుల తపఃఫలితాన్ని గద్దలు తన్నుకుపోయినై. కాటకం వచ్చింది.” అంటూ మొదలయ్యే ఈ కథలో కరువు నివారణకు ఏర్పాటు చేయబడిన సభలో – దేశమంతటా కరువు నివారణ హోమాలు, యజ్ఞాలు చెయ్యాలనీ, రామభజనలు చేయాలనీ, పేదప్రజలు రోజూ గీతాపారాయణం చెయ్యాలనీ – బ్రహ్మచర్యం పాటించి సంతానోత్పత్తిని తగ్గించాలనీ – పూటకు పావుశేరుకన్నా ఎక్కువ బియ్యం అన్నంగా వండుకోకూడదనీ (తర్వాత దీన్ని అర్ధశేరుగా సవరించారు) తీర్మానాలు ఆమోదించబడడమూ, – ఆ కథ చదివినవారికి గుర్తు ఉంటుంది. అయితే – కథ చివరకు వచ్చేసరికి, – పేదవాళ్ళందరూ ఏకం కావడం వల్ల లక్షల కొద్దీ బస్తాల ధాన్యం చీకట్లోంచి బయటకు రావడమూ, కరువు పటాపంచలు కావడమూ, జరుగుతుందనుకోండి – అది వేరే విషయం!

ఈ కథ గురించి చెబుతూ వుంటే, – బిజెపి ప్రభువుల పాలనలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన వింత ఒకటి జ్ఞాపకానికి వస్తున్నది. ఆ సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే కాస్త పెరిగింది. అప్పటికే ఫుడ్ కార్పొరేషన్ వారి గిడ్డంగుల్లో టన్నులదాకా ఆహారధాన్యాలు మూలుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్రొత్త దిగుబడి కూడా జతచేరితే వాటిని గిడ్డంగుల్లో నిలవ చెయ్యడానికి పెద్దమొత్తంలో వ్యయం అవుతుంది. ఏం చెయ్యాలి అనే సమస్య వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఆహారధాన్యాలు ఖర్చు కాకుండా ఎందుకిలా పేరుకుపోతున్నాయి అనే సందేహం కూడా వచ్చింది.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా వెంటనే మన ‘మేధావులు’ కనిపెట్టారు. పేదప్రజలు ఇప్పటికే తగినంత ఆహారధాన్యాలను వినియోగం చేస్తున్నారు. అందుచేత వారు అదనంగా ఆహారధాన్యాలను వినియోగం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చేపలు, మాంసం ఇలాంటి వాటిపైన వ్యయం చెయ్యడానికీ, ఆహారేతర వస్తువుల వినియోగం చెయ్యడానికీ మొగ్గుచూపిస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు తేల్చి చెప్పారు! దాదాపు 50 కోట్ల మంది ప్రజలు రోజుకు ఒకపూట కూడా కడుపునిండా తినడానికి నోచుకోని స్థితిలో ఉన్న దేశంలో – ప్రజలకు ఆహారధాన్యాలు అదనంగా అవసరం లేదని ఆ ‘మేధావులు’ ఎలా తేల్చి చెప్పారో అర్థం కాదు! ఇంతకన్నా విచిత్రం మరొకటి కూడా ఉంది. ఆహార సబ్సిడీలపై చేస్తున్న వ్యయం బాగా ఎక్కువగా వుంటున్నది కాబట్టి – ఆహారధాన్యాల నిల్వలపైనా, రవాణాపైనా ఉన్న నియంత్రణలన్నీ ఎత్తివేసి – వీటిని ‘సద్వినియోగం’ చేసే బాధ్యత ప్రయివేటు రంగానికి అప్పజెప్పమని మరో అర్థశాస్త్రవేత్తగారు సలహా ఇచ్చారు.

ఫుడ్ కార్పొరేషన్ గోడవున్లలో పేరుకునిపోయి ఉన్న నిల్వలలో ‘పనికి ఆహారం’; పథకం క్రింద అదనంగా మరికొన్ని పనులు చేపడితే పేదప్రజలకు మేలు సమకూరడం మాత్రమే కాకుండా దేశ ఆర్థికప్రగతికి అది దోహదం చేస్తుందని ఈ ‘మేధావులకు’ తెలియదనుకోవాలా? – గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలు వినియోగం కాకపోవడానికి కారణం ప్రజలకు వినియోగశక్తి లేకపోవడం అనే కనీస అవగాహన వారికి ఉండదనుకోవాలా? లేక పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ అనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం ఆ మేధావులకే తెలియాలి!

-ఇలా ఆలోచించినప్పుడు – కొ.కు. గానీ 2002 వరకూ జీవించి వుంటే ‘కరువొచ్చింది’ కథను ఇంతకు మించిన ‘కసి’తో రాసివుండేవారేమో అనిపిస్తుంది.

-పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు మూలాధారమైన విషయాల్లో ‘దోపిడీ’ అనేది ముఖ్యమైనది. ఈ దోపిడీ అనే ప్రక్రియ అవతలి వ్యక్తికి తెలిసీ, తెలియకుండా కూడా ఎలా జరుగుతుందో – సాధారణ ప్రజాజీవితంలో ఇది ఎలా ఆమోదాన్ని పొందుతుందో కుటుంబరావుగారు ‘నువ్వులు – తెలగపిండి’, ‘ట్యూటర్’ అనే రెండు కథల్లో చాలా అద్భుతంగా చెబుతారు.

“తెలగపిండి ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతిలో పెరిగి మధ్యవాళ్లకు అమ్ముడై బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ ఎక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చక్కను నువ్వులు ఒకవేళ చూచినా పోల్చలేవు. అది గొడ్లకూ, పేదవాళ్లకూ ఆహారం అవుతుంది.” అంటూ ప్రారంభిస్తారు కొ.కు. ‘నువ్వులు – తెలగపిండి’ కథను (రచనాకాలం – 1950).

కొందరికి లాభాలను ఆర్జించిపెట్టడానికి మరికొందరు ఎలా గానుగ ఆడబడి వ్యర్థపదార్థంగా ఎలా మిగిలిపోతారో – పెట్టుబడిదారీ పారిశ్రామిక నాగరికతలో ఉత్పత్తి కారకంగా శ్రామికుడి స్థానం ఏమిటో ఒక మధ్య తరగతి కుటుంబం కథగా ఇందులో చెబుతారు కుటుంబరావుగారు. ఈ ‘నువ్వులు – తెలగపిండి’ వ్యవహారంలో గానుగ ఆడించేవాడు పారిశ్రామికవేత్త. ఆడబడేవాడు శ్రామికుడు, అనే నియమం ఏదీ లేదు. దగ్గర బంధువుల విషయంలో కూడా ‘స్వార్థం’ అనేది చొరబడినప్పుడు మనషులు నువ్వుల గానుగ ఆడబడుతూనే ఉంటారు. చివరకు తెలకపిండిలా మారి వ్యర్థపదార్థంగా మిగిలిపోతూ ఉంటారు అనేదానికి ఈ కథలోని సోమయాజులు అనబడే ఇంటల్లుడే తార్కాణం. అతడికి భగవంతుడు ఇచ్చిన చక్కని గాత్రమే అతడి బ్రతుకును తెలకపిండి చక్కలా మార్చేసింది.

ఇక ‘ట్యూటర్’ కథలోని రాజశేఖర్ – ‘నువ్వులు – తెలగపిండి’ కథలోని సోమయాజులు మాదిరిగా నోట్లో నాలుక లేనివాడు కాదు. ‘దోపిడీ’ అనేది ఎలా జరుగుతుందన్న విషయంలో అవగాహన ఉన్నవాడు. ‘వాణి’ అనే ఓ ధనవంతుడి కూతురు (టెక్స్ టైల్ ఫ్యాక్టరీ అధినేత కూతురు. ఓ మందుల కంపెనీ అధినేత కుమారునికి కాబోయే భార్య) అ న్నట్టు – ‘చాలా నాస్టీమేన్. రిచ్ క్లాస్ అంటే చాలా ఎన్వీ. – ఎప్పుడూ కమ్యూనిజమే మాట్లాడతాడు. ‘

-ఇలాంటి రాజశేఖర్, వాణికి కేవలం వందరూపాయలకు ట్యూషన్ చెప్పడానికి రోజూ ఎందుకు వాళ్ళ ఇంటికి వెడుతున్నాడు? ఓ సినిమా కంపెనీ వాళ్లకు చాలా తక్కువ పారితోషికం అని తెలిసి కూడా తన నాటకాన్ని ఎందుకు అమ్మాడు?

“- నెస్సెసిటీ. నా బోటివాళ్ళకు నెస్సెసిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు మీ డాడీ (వాణి తండ్రి) వంద రూపాయలు జీతం ఇస్తున్నారు – ఇలాంటి ట్యూషన్స్ రోజుకు మూడు చెబితే నెలకు మూడు వందలు వస్తాయి. డుయు థింక్ ఇట్ ఈజ్ ఎ డీసెంట్ ఇన్కం? – అయితే నేను వంద రూపాయలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను? – నెస్సెసిటీ. నేను సర్వైవ్ కావాలంటే ఈ ఎక్స్ ప్లాయిటేషన్ కు ఒప్పుకోవాలి.” అనే రాజశేఖర్ ఆవేదనలో ఎక్స్ప్లాయిటేషన్ జరగడానికి గల అసలు కారణం తెలుస్తుంది. దీనిని నిర్మూలించాలన్నదే ‘సోషలిజమ్’ ధ్యేయం.

-కుటుంబరావు కథల గురించి చెప్పేటప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కేపిటలిస్ట్ ప్రవృత్తులు ఎలా చోటుచేసుకుంటాయో ఆయన చెప్పే తీరు గురించి తప్పకుండా ప్రస్తావించవలసి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులకు ఆర్థికపరంగా ఏమాత్రం అవకాశం దొరికినా పెట్టుబడిదారీ వ్యవస్థలోని బడాబాబులను మించిన అవలక్షణాలను అతి సునాయాసంగా సంతరించుకుంటారనేది కొ.కు. అభిప్రాయం. “మారిన జీవితం”, “అంతరాత్మ”, “కొత్తజీవితం” మొదలైన కథలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

“మారిన జీవితం” కథలోని లీల ఒక ఆదర్శవాది కూతురు. హెచ్చు, తగ్గులనే తేడాలు కృత్రిమంగా కల్పించబడినవేననీ, మనుషులందరూ ఒకటేననీ వాళ్ళ నాన్న వాళ్ల అమ్మకు ప్రతిరోజూ ఇంటిలో ఇచ్చే ఉపన్యాసాలను ఆమె తరచూ వింటూండేది. అయితే – ఆమెకు డబ్బున్న పల్లెటూరి సంబంధం కుదరడంతో – తండ్రి ఇచ్చే ‘ఉపన్యాసాలు’ జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేకుండా పోయింది. బడుగువర్గాలకు చెందిన ప్రజలను పీడించడానికి కావలసిన హంగులన్నీ సునాయాసంగా ఆమెకు సమకూరాయి. మొదట్లో అత్తింటి వారు ఈమెను పరాయి పిల్లగా చూశారు గానీ, ఆమెకూ తమ తరహా ప్రవృత్తే ఉన్నదని రూఢి కావడంతో ఆమెను స్వంత మనిషిగా చూడడం ప్రారంభించారు! ఒక ప్రక్క కూలిజనాన్ని (“తిండికి లేని వెధవలు”) అణిచిపెడుతూ – మరో ప్రక్కన బ్రాహ్మణులకు సంతర్పణలు చేయిస్తూ – “పెద్దమనుషు”లకు ఉండవలసిన హంగులన్నిటినీ సముపార్జించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే “ఐశ్వర్యం” నవలలోని డాక్టరు కూతురు వంటిదే లీల కూడా.

ఇదే విషయం “అంతరాత్మ” కథలో మరొకవిధంగా ఆవిష్కరించబడింది. ఈ కథలోని సుదర్శనం అనే యువకుడి తండ్రి ఒక ఆదర్శవాది. వీరేశలింగం గారితో కాస్త పరిచయం ఉన్నవాడు. అయితే – అతడు చనిపోయిన తర్వాత – అతడు చేసిన 13 వేల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తానికి సుదర్శనం తల్లి ‘అధిపతి’ కావడంతో ఆమెలో తలెత్తిన ‘కేపిటలిస్ట్’ ప్రవృత్తిని – మున్నెన్నడూ లేని విధంగా జ్యోతిష్యం, హస్తసాముద్రికం, అంకెలశాస్త్రం, వారాలు, వర్జ్యాలు మొదలైనవాటికి ఆ ఇంటిలో ప్రాధాన్యత లభించిన వైనాన్ని, అకారణంగా ఆ ఇంట్లోని మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని ఈ కథలో చాలా ఆసక్తికరమైన రీతిలో చెబుతారు కుటుంబరావుగారు.

“నేను సమ్మెలు చూశాను. పోలీసుల లాఠీచార్జీలు చూశాను. కానీ, మా ఇంట్లో జరిగే పోట్లాటలంత అర్థరహితమైన సంఘటనలని ఎక్కడా చూడలేదు. ఇంట్లో ఇంత తిండి వుండి బతకడం చేతకాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు తప్ప ఈ కొట్లాటలను ఊహించుకోలేరు. ఇంట్లో డజను మంది ఉంటే ఏ ఇద్దరి మధ్యనైనా శత్రుత్వం ఉండేది. ఇవాళ కొంపలో ఎవరికి ఏ ఎదురుదెబ్బ తగిలినా మిగిలినవారంతా ఏకగ్రీవంగా నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు”.

-అంటూ ఈ కథలోని సుదర్శనం లోనయిన ఆవేదనను పాఠకులు మరిచిపోలేరు. ‘ధనంగాడి’ లీలలకు తార్కాణాలే ఇవి అన్నీ!

కుటుంబరావుగారి “కులంగాడి అంత్యక్రియలు” కథలో (మార్క్స్ ‘కేపిటల్’ చదివిన తర్వాత కలిగిన అవగాహనతో తాను రాసిన తొలికథగా దీనినే కొ.కు. పేర్కొన్నారు) దిక్కులేని చావుచచ్చిన కులంగాడి కథ, ఆ తర్వాత వచ్చిన అధికారం గాడి కథల తర్వాత ధనంగాడి కథ కూడా వున్నది.

పరమ కర్కోటకుడు అయిన ధనం గాడు అమలుపరిచే నిశ్శబ్ద అలిఖిత శాసనాన్ని గురించి చెబుతారు కుటుంబరావుగారు ఈ కథలో. “వాడి మహత్యం ఏమిటోగాని వాడికోసం ప్రతీతరంలోనూ అనేక కోట్లమంది మనుషులు మనస్ఫూర్తిగా బలి అయ్యారు. కేవలం వాడి అనుగ్రహం పొందలేకా, కోల్పోయీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెద్దది” అని అంటారాయన.

– ఇలాంటి ధనం గాడి ‘ఘనత’ గురించి ఎంతమంది ఎన్ని కథలు రాసినా ఇంకా కొంత ‘వ్యథ’ మిగిలిపోతూనే ఉంటుంది!

– కుటుంబరావుగారు ‘రోడ్డుప్రక్కన శవం’ అనే కథ ఒకటి రాశారు. అవడానికి ఇది రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ఒక వ్యక్తి కథే అయినా – ఆ కథలో కొ.కు. బ్రతికుండగా ఒక ముష్టివాడికి వచ్చిన రెండు కలల గురించి చెబుతారు.

మొదటి కలలో – పూరిపాక. పాక మీద సొరపాదు. ఆ పాదుకు కాయలు. పాకలో వంటచేసే ఆడకూతురు. అన్నం వాసన – పులుసు వాసన – పొయ్యి క్రింద ఎర్రెర్రగా మండుతున్న చితుకుల మంట ఉంటాయి.

ఇక, రెండో కలలో ఒక పెద్ద ఇల్లు. దానికి గోడలు, వాకిళ్ళు ఉండవు. అందులో చాలా కుటుంబాలుంటాయి. అందరూ కలిసి అందరికోసం అందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య స్నేహం, చుట్టరికం, ఇలాంటివి ఉన్నాయో లేదోగాని – అంతకన్నా సహజమైన, విశాలమైన, బంధం ఏదో వాళ్ళ మధ్యన ఉంది. వాళ్ళందరికీ రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ముష్టివాడి మీదా, ఆ ముష్టివాడికి వాళ్ళ మీదా, అపారమైన విశ్వాసం ఉంది.

– ఇవి ఫ్రాయిడియన్ కలలు కావు. అంతరంగపు లోతుల్లోంచి దీన్ని విశ్లేషించవలసిన అవసరం లేదు. ఇవి అచ్చంగా మనిషి బాహ్యజీవితానికి కనీస అవసరాలకు సంబంధించిన కలలు. మనిషికి ఆహారం ఉండాలి – దానిని వండుకోడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత, అవకాశం ఉండాలి. అతడికంటూ ఒక సంసారం ఉండాలి – అనే కోరికలు మొదటి కలలో కనబడుతున్నాయి. ఆకలితో మాడి చనిపోయిన ముష్టివాడికి ‘నా’ అంటూ ఎవరూ లేని ముష్టివానికి – అలాంటి కల రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ కలకు వ్యక్తిపరమైన ఆకాంక్ష మూలం.

రెండో కలకూ అవసరాలు తీరడం అనేదే ప్రాతిపదిక విషయం గాని – ఆ ప్రాతిపదిక వ్యక్తిపరమైన ఆకాంక్షకు సంబంధించింది కాదు. సామాజిక ఇచ్ఛకు, సామూహిక శ్రేయస్సుకు సంబంధించినది. ఒక్కమాటలో absolute communism చెప్పే లక్ష్యాన్ని చెబుతున్నది ఈ కల.

ఈ కలలు నిజమై మానవుడు వ్యక్తిపరంగాను, సమాజపరంగానూ, అభ్యున్నతి సాధించగలగాలనే తపనతో కుటుంబరావు గారు వందలాది కథలను, గల్పికలను రాశారు. ‘గల్పిక’ అనే ప్రక్రియను తనదైన రీతిలో రచించి సాహిత్యంలో దానికొక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఘనత కొ.కు. గారిది. కథకూ, గల్పికకూ, కొంత పోలిక ఉన్నప్పటికీ తేడా కూడా ఉంది. కథకు ఇతివృత్తం అనేది ఎంతో కొంత మేరకు తప్పనిసరిగా ఉండాలి. గల్పికకు ఆ అవసరం లేదు. ఇందులో పాత్ర చిత్రణ అనేదానికి అవకాశమే లేదు. గిలిగింతలు పెడుతూ, చురుక్కుమనిపించే వ్యంగ్యంతో – మన విలువలలోని లేకితనాన్ని, చిత్తశుద్ధి లేమినీ, అవకాశవాదాన్నీ ఎద్దేవా చేస్తూ ‘సున్నితంగా’ మొట్టికాయలు మొట్టేందుకు (!) నిర్దేశించబడిన ప్రక్రియ ఇది! కథతో పోలిస్తే దీని నిడివి బాగా తక్కువే గాని – ఇంచుమించుగా కథ సాధించే ప్రయోజనాన్ని ఇది కూడా సాధించేందుకు అవకాశం ఉంది.

– ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా, ఒక విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. కుటుంబరావుగారు కథలు రాసినా, గల్పికలు రాసినా, మరేది రాసినా, అన్నింటి వెనుకా ఒక లక్ష్యం ఉన్నమాట వాస్తవమేగాని – సిద్ధాంతాల ఆవిష్కరణ కోసం జీవితాన్ని ఆయన వక్రంగా ఎన్నడూ చిత్రించలేదు. అన్ని సందర్భాలలోనూ – సిద్ధాంతాల కన్నా జీవితాన్నే ఆయన ప్రమాణంగా భావించాడు.

“- రచయిత ఆగ్రహానికి బలమైన కారణం జీవితంలో ఉండాలి. జీవితంలో లేని లోపాలను సంస్కరించి పారేస్తూ రచన చేస్తే ఆ రచనకు రెండు కాళ్ళూ ఉండనట్టే – జీవితంలో లేని విషయం మీద ఆగ్రహావేశం తెచ్చుకుని రచన చేస్తే అదో సుడిగుండంగా తయారై ఊరుకొంటుంది…” అంటారాయన.

ఇక – కథారచనలో శిల్పానికి అవాంఛనీయమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కుటుంబరావుగారు అంగీకరించలేదుగాని – కథకు ఆయువుపట్టు అని చెప్పదగ్గ అంశాలలో శిల్పం ముఖ్యమైనది అని ఆయన పలు సందర్భాలలో చెప్పారు. అంతేకాదు – “ఈనాటి యువకులు తమ కథల ద్వారా పరిస్థితులను మార్చాలని చూస్తున్నారుగానీ కథ యొక్క వాస్తవికత శిల్పం మీద ఎంత ఆధారపడి ఉంటుందో గ్రహించడం లేదు” అని కూడా అన్నారు.

నేటి కథా రచయితలు కొ.కు. చెప్పిన ఈ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొనవలసిన అవసరం ఎంతయినా ఉంది.

– కథలు రాయడం తగ్గించుకున్న తర్వాత కూడా కుటుంబరావుగారు తన సమకాలీన పరిస్థితులపై పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు.

‘- మనదేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ప్రారంభమై అక్కడే ఆగిపోతున్నది’
“- మనం తలక్రిందులుగా నిలబడి వ్యవసాయం అనే పునాది లేకుండా పారిశ్రామికంగా పైకి రావాలని చూస్తున్నాం”.
“- ఈనాటి ప్రపంచ రాజకీయాలను సంక్షోభంలోకి నెడుతున్న అంశాలలో ఒకటి ఆహారధాన్యాలు, రెండోది పెట్రోలు. తిండిగింజలు అమెరికా పాలకుల చేతిలో ఒక అస్త్రం లాంటిది. ఒక వంక ఆహారసమస్య ప్రపంచ సమస్య అయి కూర్చున్నా కూడా అమెరికా ఆహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే ఆలోచన కట్టిపెట్టలేదు”
“…తలసరి రాబడిలో అయిదుశాతం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా తిండిపోతులుగా పౌరులు జీవించే అవకాశం ఉన్న దేశాలలో సైతం ఆహార పదార్థాలకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చే స్థితిలో ఉండగా – మనదేశంలో లక్షలాది ప్రజలకు ఆదాయం కడుపు నిండా తినడానికే చాలడం లేదు.
(‘రాజకీయ వ్యాసాల’ నుండి)

– వివిధ సందర్భాలలో ’70 లలో కుటుంబరావుగారు రాసిన వ్యాసాల్లోని కొన్ని వ్యాఖ్యలు ఇవి. కాలగమనంలో కొన్నిమార్పులు, చేర్పులూ, ఏర్పడినా ఈనాటికీ ఈ వ్యాఖ్యలు చాలావరకు వర్తిస్తాయి.

ఒకప్పుడు కుటుంబరావూగారు “గ్రహశకలం” అనే సైన్స్ ఫిక్షన్ కథలో చీకటి ప్రపంచంలోని వెలుగుకు, వెలుతురు ప్రపంచంలోని చీకటికి, మధ్య జరిగే సంఘర్షణ గురించి రాశారు. ‘చీకటి’ అనేదానిని పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూపానికి – ‘వెలుగు’ అనేదానిని సామ్యవాద వ్యవస్థకు ప్రతీకలుగా తీసుకుంటే ఒకనాటి రష్యా, అమెరికా విధానాలకు సంబంధించిన ఘర్షణగా దీనిని చెప్పుకోవచ్చు.

కాని, – ఇవాళ సోవియట్ యూనియన్ లేదు. రష్యాలో పెట్టుబడిదారీ ధోరణులకు చోటు దొరికింది. దీనితో సామ్యవాద ధోరణికి సంబంధించిన శకం ముగిసిపోయిందనే ‘ఆనందం’ కొందరికి లభించింది! -‘ప్రపంచీకరణ విధానాల’ పేరుతో పెట్టుబడిదారీ దేశాలు బహిరంగంగా, నిస్సిగ్గుగా, పేదదేశాలను దోచుకోవడం మొదలుపెట్టాయి. ప్రయివేటీకరణ మంత్రం పేదదేశాలలో కొందరిని మరింత ధనికులను చేస్తే – పేదవారి పరిస్థితి మరింత దయనీయమైపోయింది. ఈ సమకాలీన చరిత్రను మూడు దశాబ్దాల కిందటి కొ.కు. వ్యాఖ్యలలోంచి అవలోకిస్తే మనం ముళ్ళబాటలో చిక్కుపడిపోవడానికి గల కారణాలు అవగతం అవుతాయి.

– కొద్ది మాసాల క్రితం (2004 సం.లో) ఐక్యరాజ్యసమితి వారి మానవాభివృద్ధి నివేదిక వెలువడింది. ఈ నివేదికలో 177 దేశాలకు సంబంధించిన వివిధ మానవాభివృద్ధి అంశాలలో జరిగిన ప్రగతి ప్రాతిపదికగా ‘రేంకు’లను ఇవ్వడం జరిగింది. అందులో మన రేంకు 127 అని ప్రకటించడం జరిగింది. అంటే – అర్థశతాబ్దికి పైగా ప్రణాళికలను అమలు చేస్తూ – ఆర్థిక ప్రగతిని సాధించేస్తున్నామని డాంబికాలు పోతున్న మనం – ప్రపంచంలో (మానవాభివృద్ధి విషయంలో) అట్టడుగు స్థాయిలో ఉన్న 50 దేశాలలో ఒకటిగా ఉన్నాం!
– అదే విధంగా యు.ఎన్.డి.పి. వారి అంచనా ప్రకారం మన దేశానికి ‘హ్యూమన్ పావర్టీ ఇండెక్స్’ (మానవ దారిద్ర్య సూచిక), మహిళా అభ్యున్నతిని గురించి తెలిపే ‘జెండర్ డెవెలప్మెంట్ ఇండెక్స్’ , మొదలైనవాటి విషయంలో కూడా పరిస్థితి ఎంతమాత్రము గౌరవప్రదంగా లేదు !-

– ఏదో ఒక సంవత్సరంలో కాస్త వర్షాలు పడి పంట దిగుబడి పెరిగిన కారణంగా ఆర్థిక అభివృద్ధి రేటు (జిడిపి) పెరిగితే – ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ డంబాలు పలికితే సరిపోదు. మానవాభివృద్ధికి దోహదం చెయ్యని సంపద వృద్ధి ఏ దేశానికీ ఎంతమాత్రమూ మేలు చెయ్యదు.

ఇలాంటి స్థితిలో ఉన్న మనం – మన గురించి మరొకసారి ఆలోచించుకోవడానికి ‘కొ.కు.’ కథలు ఇవాళ్టికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, కథకుడిగా కలం పట్టినవారి బాధ్యతను కూడా గుర్తు చేస్తాయి.

కుటుంబరావు గారే అంటారు ఒకచోట –

“- జీవితం చాలా విశాలమైంది. సంఘంలో అనేక వర్గాలవారు, వృత్తులవారు, ప్రాంతాలవారు ఉన్నారు. వీరందరికీ అనేక వందల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్థిక పరిస్థితులకు గురి అవుతున్నారు. విస్తృతమైన ఈ జీవితాన్ని ప్రతిబింబించడానికి ఎన్ని కథలైతే చాలేటట్టు?
జీవిత వైవిధ్యంతో బాటు మార్పుకూడా చాలా వేగంగా జరుగుతున్నది. రెండేళ్ళ క్రితం ఒక సమస్య ఏరూపంలో ఉన్నదో ఈనాడది ఆ రూపంలో ఉండడం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించవలసిన ఆవశ్యకత ఉన్నది.

యివాళ్టి తెలుగు కథాసాహిత్యాన్ని అవలోకిస్తే, – ప్రపంచంలోనూ భారతదేశంలోను వచ్చిన, వస్తున్న, – మార్పులను నేటికథకులు నిశితంగా పరిశీలించడమే కాదు – పలు సందర్భాలలో వాటిని సమర్థవంతంగా కథల్లో ఆవిష్కరిస్తున్నారు. వైవిధ్యభరితంగా ఉన్న సమస్యలను, వాటి లోతులను, గమనించి కథల్లో అక్షర రూపం ఇస్తున్నారు. ఈ కృషి బహుముఖంగా జరుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, వాణిజ్య పోకడల తాకిడిని తట్టుకుని జరగవలసి ఉన్నది.

ఒకనాడు గురజాడ – ఆ తర్వాతి కాలంలో కొడవటిగంటి కుటుంబరావు – వంటి ఎందరో మహనీయులు పెంచి పోషించిన ఈ ప్రక్రియ మరింతగా పురోగమించేందుకు యథాశక్తి కృషిచెయ్యడమే కుటుంబరావుగారికి నిజమైన నివాళి.

-కోడూరి శ్రీరామమూర్తి
(2004 సంవత్సరం ఆగస్టు నెలలో విశాఖలో ‘వెలుగు’ సాహిత్య సంస్థ నిర్వహించిన సెమినార్ లో సమర్పించిన ప్రసంగ పత్రం.)

(తెలుగు కథంటే ఏ మాత్రం ఆసక్తి ఉన్నవారికైనా కోడూరి శ్రీరామమూర్తి గారి పేరు తెలియకుండా ఉండదు. తెలుగుకథలపై ఆయనది సాధికార స్వరం. తెలుగులో వచ్చే మంచి కథలను విశ్లేషిస్తూ ఆయన చాలాకాలం వివిధ పత్రికల్లో అనేక శీర్షికలు నిర్వహించారు. “తెలుగు కథ: నాడూ నేడూ”, “తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ” మొదలైన పుస్తకాలు రాశారు. తెలుగు కథ: నాడూ నేడూ పుస్తకంలోని ఈ వ్యాసాన్ని పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన కోడూరి శ్రీరామమూర్తిగారికి కృతజ్ఞతలు.)
———————-
* ’అశోకవనం’ లో సీత కేవలం సౌందర్య దృష్టిలేని వ్యక్తి మాత్రమే కాదు, ఇంకా చాలా ’కథ’ ఉంది. -సం.

Posted in వ్యాసం | 2 Comments

కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు

gokhale.PNG

మాధవపెద్ది గోఖలే

కుటుంబరావు కక్కయ్య మనకు, సాహిత్యలోకానికి భౌతికంగా అందకుండా దూరమైపోయినాడు. కాని మనలోను, సాహిత్యలోకంలోను, సమాజంలోనూ శాశ్వతంగా వుండిపోయింది ఆయన ప్రతిపాదించిన సాహిత్య శాస్త్రవిజ్ఞానం. ఆయన మన ఊహకందని ఒక నూతన పంథా మహారచయితగా తను బతికుండగానే అయినాడు. కనుక గతించినాక ఆయనకు ముట్టచెప్పవలసిందేం వుండదు.

మా అమ్మకు మేనత్త కొడుకు అవటంవల్ల ఆయన నాకు కక్కయ్య అయినాడు. నాకు బుద్ధి తెలుస్తున్న నా అయిదవ ఏటనుండి చివరిరోజులవరకూ తనని సన్నిహితంగా ఎరుగుదును. విమర్శనాదృష్టితో మాట్లాడటం, సామాజిక జ్ఞానం అప్పట్లోనే కనపరుస్తూండటంవల్ల తోటివారిలో ప్రత్యేకంగా కనబడుతూ ఆయన నన్ను చిన్నతనంలోనే ఆకర్షించాడు. తర్వాత మా చరిత్రలు దగ్గరగా నడవటం, ఆయన దృక్పథాలకు నేను సన్నిహితంగా ఉండటం ఇందుకు దోహదం చేసింది.

కుటుంబరావు పుట్టింది (1909), పెరిగింది, భవిష్యత్తుకు బీజాలు వేసుకుంది తెనాలిలో. ఆయన అయిదవ ఏట తండ్రి, పదకొండవ ఏట తల్లి మరణించారు. తోటి సంతతివారు అన్న వెంకటసుబ్బయ్య (ఓవర్సీరు, కవి, సాహితి పత్రిక సంపాదకవర్గం వాడు, సన్యసించి వెళ్ళాడు), చెల్లెలు అన్నపూర్ణ, తమ్ముడు కృష్ణమూర్తి (కథకుడు, బొంబాయి ఫిలింస్ డివిజన్‌లో వ్యాఖ్యాత) తో వారు నలుగురు. ఆయన తన పదహారవ ఏట గుంటూరులో ఇంటరు, పందొమ్మిదవ ఏట విజయనగరంలో బి.ఏ., ఇరవయ్యవ ఏట బెనారెస్‌ (BHU)లో ఎం.ఎస్‌సి. (పూర్తి చేయలేదు) చదివాడు.

బాల్యంలోను, యవ్వనంలోను విమర్శనావాదతత్వం కుటుంబరావుది. బంధువుల్లో దుస్సంప్రదాయాల్ని, నాటకాల్లో అసభ్యతను, అసమర్థతను, సాహిత్యరంగంలో ప్రయోజనారహితమైన రచనలను, కుతర్క రాజకీయాలను ఎగతాళి, విమర్శ చేసేవాడు. కాని యీ రంగాల్లో ఆయన సన్నిహితంగా పాల్గొంటూ వాటిలోని మంచి విలువల్ని పాటించకపోలేదు. అట్టి సందర్భాల్లోనే ఆయనకు కథారచనపై ప్రేరణ కలిగింది.

ఆ రోజుల్లో, తన 15వ ఏటికే ప్రముఖ ఇంగ్లీషు రచయితలను, ఆధునిక సాహిత్యాన్ని అమితంగా చదివేవాడు. ఆయన విమర్శనాత్మక ధోరణి గిట్టని మా బంధువులు ఆయన్ని “వెర్రికుట్టె, కొరకరాని కొయ్య” అనేవారు. వాళ్ళే ఆయన కథలు ప్రథమంగా పత్రికల్లో అచ్చయినప్పుడు చచ్చినట్టు వారి ధోరణిని కొంత మార్చుకుని “మనవాడు పరవాలేదే!” అనేవారు, లోపల కొంత కన్నీరు వుంచుకునే.

1931లో, నా పధ్నాలుగవ ఏట, మద్రాసు ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ – క్రాఫ్‌ట్స్‌లో కళాభ్యాసం కోసం చేరాను నేను. ఆ సమయంలో కక్కయ్య మద్రాసు వచ్చి తన కథలను మొదట ప్రచురించిన ఆండ్ర శేషగిరిరావును (ఆంధ్రభూమి), శ్రీనివాస శిరోమణిని (చిత్రగుప్త) కలిసినపుడు, నేనూ ఆయనతో ఉండి, వారు కక్కయ్యను చాలా గౌరవించటం, రచన చేయటం గురించి అడగటం చూశాను. ఆ నాడు చలం స్త్రీల దుస్థితిపై తన దృష్టి కేంద్రీకరిస్తే, కుటుంబరావు సమాజంలోని కుళ్ళు, పీడలు, తిరోగతి, పురోగతుల్ని తన రచనలకు ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేయటం మొదలుపెట్టాడు.

సాహిత్యం, కళలు సమాజాన్నుంచి విడదీయలేనివని, సాంఘిక ప్రయోజనం లేని రచనలు నిర్జీవమైనవని, మానవ పురోగమనానికి సాహిత్యం ప్రేరణ కలుగజేయగలదని ఆనాడే ఆయన విశ్వసించాడు. ఆయన రచనలు ఈ లక్ష్యాలకే పరిమితమై, పదునైన సూక్ష్మ వాక్యాలతో విమర్శనాత్మకంగా నడిచి ఒక బలమైన శైలిని ఏర్పరచుకున్నాయి.

ఆనాటి కుటుంబరావు రచనలు సమాజం ఆమోదిస్తున్న సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైనవి. ‘వీడు నిరుద్యోగి, బడుద్ధాయి, వక్రమార్గాల్లో పడ్డాడు. వీడు రాస్తే అవాకులూ, చవాకులూ అచ్చువేసుకునేందుకు మనకు పత్రికలు తలవెండ్రుకలన్ని’ అని చుట్టూ ఉండే సంప్రదాయవాదులు, ఛాందసులు, పాతగొప్పల వాక్కులవారూ ఆ నాడాయన్ని అనేవారు.

తన రచనలపై నిలదీసినవార్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా ఎదిరించేవాడాయన. ఫలానా తన రచన ఏ విధంగా పనికిమాలిందో సహేతుకంగా రుజువుచేస్తే తన రచనలు చేయటం మానుకుంటానని కచ్చితంగా వాదించేవాడు.

మా అమ్మ పిల్లలమర్రివారి ఆడబడుచు (కక్కయ్య అమ్మా అంతే). ఆ వంశంలో నటకులు, కవులు, సాహితీపరులు ఉన్నారు. కక్కయ్య రచనలు చదివినపుడు ‘మన ఆచారాలు, నీతినియమాలు ఇంతమందికి (సమాజానికి) గిట్టగా లేంది నీకేం మాయరోగంరా వాటిపై పేపర్లో రాయటానికి? మీ అమ్మా నాన్నలుంటే నువిలా చెడేవా?’ అని మా దగ్గిర ఆడచుట్టాలు కక్కయ్యను అనడం ఎరుగుదును. ‘మన బుద్ధులు మన గడప దాటవు గనక నా రాతలు మీకు గిట్టవు. మీ ఆచారాలు, నీతినియమాలకు మగ్గుతున్న ఓ నలుగుర్ని -మాటవరసకు నన్ను- బయటికి లాగనిస్తే, వారికి సుఖపడే గీత ఎలా ఉంటుందో రుజువు చేస్తా’ అని వారికి సమాధానం ఇచ్చేవాడు కక్కయ్య. ఆయన తన రచనలో చూపే ధోరణే నిత్యజీవితంలో కూడా అక్షరాలా కనపడేది.

కక్కయ్య కంఠం శ్రావ్యంగా ఉండేది. సంగీతాభిలాష ఎక్కువ. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించటం, స్వరం అల్లటం నేను తెనాల్లోనే చూశాను.

తెనాలి ఆ రోజుల్లో సాహిత్యానికి, నాటకరంగానికి, రాజకీయాలకు, విద్యావంతులకు, విమర్శకులకు కూడలి స్థలం. కక్కయ్యకు సమకాలికులు, సన్నిహితులైన ఆధునిక రచయితలు చలం, గోపీచంద్, జి.వి.కృష్ణారావు, చక్రపాణి, ధనికొండ, బాలకృష్ణశాస్త్రి తెనాలి వాస్తవ్యులే. కృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి మొదలైనవారు తరచు తెనాలి వస్తూ బ్రహ్మసమాజ కార్యకలాపాలు, నవ్యసాహిత్య పరిషత్ ఔత్సాహికులతో సమావేశాలు జరుపుతూ ఉండేవారు. కక్కయ్యకు వారు పరిచితులే కాక, నవ్యసాహిత్య పరిషత్ లో ఆయన సభ్యుడు కూడా. (అయితే త్వరలోనే రాజీనామా చేశాడు)

తెనాలి రామవిలాససభ నాటకసమాజం నటకులు మాధవపెద్ది వెంకట్రామయ్య, స్థానం నరసింహారావు, గోవిందరాజుల సుబ్బారావు, అద్దంకి శ్రీరామమూర్తి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి మొదలైనవారి ఉమ్మడి నాటక కార్యకలాపాలు జరుగుతున్న ఆ కాలంలో వారి పరిచయం కక్కయ్యకు ఉండేది. ఇట్టి సాహిత్య, నాటక, సంగీతాది కార్యక్రమాల వాతావరణంలో కక్కయ్య అభిరుచులు, రచనా దృక్పథానికి గట్టి పునాది ఏర్పడి, ఆయన భవిష్యత్తుకు ఉపకరించినై.

1925లో తన పదహారవ ఏట కక్కయ్యకు వివాహం జరిగి, ఇంకో ఆరేళ్ళకు కొడుకు రామచంద్రరావు (పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఎడిటింగ్ ప్రొఫెసర్) పుట్టాడు. తర్వాత 1929లో బెనారెస్ చదువు అనంతరం, 1931లో వరంగల్, హనుమకొండలలో టీచరుగా పనిచేసి, ట్యూషన్లు చెప్పి, మళ్ళీ తెనాలి చేరి సొంతగా ప్రెస్సు పెట్టుకున్నాడు కాని అది ఎక్కువ రోజులు నడిచింది కాదు.

ఆయితే ఆనాడు కక్కయ్యకు, చక్రపాణికి ఏర్పడ్డ మైత్రి ఒక అపూర్వ విశేషంగా పెంపొంది, ఉభయుల అంత్యదశల వరకు ప్రాణప్రదంగా వీరివెంట వచ్చింది. ఇది ఒకరి మేధస్సులను ఒకరు తెలుసుకున్నందువల్లనే సాధ్యమైంది. చక్రపాణి గాఢమైన సాహిత్యప్రియుడు, రచయిత. ఆయన శరత్ (Sarat Chandra Chattopadhyay), రవీంద్రనాథ మైత్రా, తారాశంకర బెనర్జీ తదితరుల రచనలు తర్జుమా చేసి ‘యువ’ ప్రచురణలనే పేర పుస్తకాలు ముద్రించటం సాగించాడు. కక్కయ్య కథల పుస్తకాలు కూడా చక్రపాణి ద్వారానే మొదట అచ్చయ్యాయి.

కక్కయ్య భార్య 1940లో మరణించటంతో ఆయన తన కొడుకును బంధువులకు అప్పగించి, తెనాలి నుండి సెలవు తీసుకున్నాడు.

అప్పటికి నాగేశ్వరరావు పంతులు గతించగా, ఆంధ్రపత్రిక ఆధిపత్యాన్ని శంభుప్రసాద్ స్వీకరించాడు. 1940లో కక్కయ్య ఆంధ్ర వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు. తర్వాత కొద్ది నెలలకే నేను కూడా ప్రధాన చిత్రకారుడిగా చేరాను.

సుమారు 1943లో ప్రజానాట్యమండలివారి ‘మా భూమి’ నాటకం, నాజరు ‘బెంగాలు కరువు’ బుర్రకథా, ఆ రోజుల్లోనే మొదలై, రూపురేఖలు దిద్దుకుంటున్న అభ్యుదయ రచయితల సంఘం కార్యకలాపాలూ మద్రాసులో పెద్ద సంచలనం కలుగజేసినందువల్ల శ్రీశ్రీ, కొడవటిగంటి మొదలైన ప్రముఖ రచయితలు అభ్యుదయ రచయితల సంఘంలో చేరటం జరిగింది. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ (భారతదేశం అంతటా కూడా) ప్రజానాట్య మండలిని, అభ్యుదయ రచయితల సంఘాన్ని ఎక్కువగా ప్రోత్సహించి అండగా ఉండేది.

‘ఏది అభ్యుదయ సాహిత్యం?’ అంటూ ఆనాడు చెలరేగిన గాలి దుమారాన్ని శ్రీశ్రీ, కొడవటిగంటి బలంగా ఎదుర్కొని అభ్యుదయ రచయితల సంఘం సాహిత్య పత్రిక ‘అభ్యుదయ’లో గట్టి రచనలు చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలోనే తెనాలివద్ద పెదపూడి అనే పల్లెటూర్లో, చదలవాడ పిచ్చయ్య సహకారంతో, దాదాపు ఒక మాసం పాటు సాహిత్య పాఠశాల ఒకటి నడిచింది. చరిత్ర పరిశోధకులు, భాషా పండితులు, ప్రముఖ రచయితలు, కళాకారులు ఇందులో పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభకులుగా మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ దేవీప్రసాద రాయ చౌధరి, రోజుకు ఒక తరగతి నడిపేందుకు శ్రీశ్రీ, కొడవటిగంటి, కృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కోరాడ రామకృష్ణయ్య, నిడదవోలు వెంకటరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, జమ్మలమడక మాధవరాయశర్మ, అయ్యలసోమయాజుల నరసింహశర్మ, మద్దుకూరి చంద్రశేఖరరావు, నేను వగైరా పాల్గొన్నాము.

కక్కయ్య రచనల్లో ఆనాటి వరకు సామాజిక ప్రయోజనకర విధానం కనిపించినా, ‘అరసం’, కమ్యూనిస్టు పార్టీ సంపర్కం, మార్క్సిజం పఠనం వల్ల ఆయన రచనా విధానంలో, ఆ తర్వాత నుండి గతితార్కిక భౌతికవిధాన దృక్పథం కొట్టవచ్చినట్లు కనుపించటం ప్రారంభమైంది. ఈ దృక్పథ పురోగమనం వల్లనే ఆయన మన వాతావరణానికి సాహిత్య శాస్త్రవిజ్ఞానాన్ని ప్రతిపాదించటం జరిగింది.

ఒక విధంగా ఆంధ్రవారపత్రిక నూతన విధానం, పెరుగుదల కొన్ని మాట పట్టింపులకు దారితీయటం వల్ల కక్కయ్య ఆ ఉద్యోగం వదిలి, 1942 ఆఖరులో రెండవ ప్రపంచయుద్ధం పనులకు బొంబాయి, సిమ్లా, జైపూర్‌లలో పనిచేసి, 1945 ప్రాంతంలో మద్రాసు తిరిగివచ్చాడు.

అప్పటికి నేను 1943లో ఆంధ్రపత్రికను వదలి, చక్రపాణి ప్రోద్బలంతో, ఆయన నాగిరెడ్డితో కలిసి బి.ఎన్.కె. ప్రెస్సులో ప్రారంభించిన ‘ఆంధ్రజ్యోతి’ కథల మాసపత్రికలో చేరాను. చక్రపాణి అదే ప్రెస్సులో తన ‘యువ’ ప్రచురణల పనికూడా చూసుకునేవాడు. ఆనాటి అభ్యుదయ సాహిత్యోద్యమంలో పడిన నేను 1944లో చక్రపాణి వద్ద సెలవు తీసుకోకుండానే, విజయవాడలో అప్పుడే ప్రారంభమవుతుండిన కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక ‘ప్రజాశక్తి’ లో చేరాను.

1945లో మద్రాసులో వున్న కక్కయ్యకు కొమ్మూరి పద్మావతమ్మ ప్రథమ పుత్రిక వరూధిని చిన్నమ్మతో ఆయన వివాహం జరిపించాము. ఆ రిజిస్టరు పెళ్ళికి సాక్షి సంతకాలు చేసింది శ్రీశ్రీ, నేనూ అయితే, శుభాశీస్సులు బళ్ళారి రాఘవాచార్యుల నుండి ముట్టినై.

తర్వాత కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించటం వల్ల నేను మద్రాసు మళ్ళీ వచ్చి, తిరిగి ‘ఆంధ్రజ్యోతి’ లో చేరాను. పిల్లల మాసపత్రిక ‘చందమామ’ను కూడా చక్రపాణి అప్పుడే ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఏ ఉద్యోగమూ దొరకని కక్కయ్య 1949లో ఈసారి ‘ఆంధ్ర దినపత్రిక’లో చేరి, 1952 నాటికి ‘చందమామ’కు ఎడిటరుగా చేరాడు. ఆయన జీవితంలో ఈ ఒక్క ఉద్యోగమే 1952 నుండి 1980 వరకు స్థిరంగా నిలిచిపోయింది. ఆయన చాలా గట్టి స్వతంత్రభావాలు గలవాడు. తన రచనల విషయంలో, ప్రత్యేకించి జీతండబ్బుల కోసం ఏనాడూ తన అభ్యుదయ పంథానుండి దిగజారలేదు. ఆయన భావాలు తన ఉద్యోగాలు ఊడేందుకు ఎక్కువచోట్ల పనిచేసినై. ‘నాకు ఉద్యోగాలు అచ్చిరావు’ అని ఆయన అన్నాడంటే రచయితగా తన స్వాతంత్ర్యానికీ, చేసే ఉద్యోగాలకూ వైరుధ్యాలొస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన సత్ఫలితాలకు “ఆంధ్రవారపత్రిక’ తరఫున కక్కయ్యకో చిన్న యోగ్యతాపత్రం లభించింది. ‘మీ హయాంలో వారపత్రిక కవరుపేజీ చాలా ముచ్చటగా ఉంటున్నదండీ’ అన్నదే ఆ పత్రం. అంటే పత్రిక విలువా (పాఠకుల లేఖల్లో ఈ విషయం వ్యక్తమయేది), సర్కులేషనూ పెరగటం పరిగణనలోకి రాక, ఆయన మెరుగుపరచింది కేవలం అట్టమీద బొమ్మ మటుకేనని చెప్పటం. కక్కయ్య వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

కోడంబాకం ట్రస్టుపురంలో కక్కయ్య కు సొంతంగా ఇల్లు ఏర్పడి, వరూధిని చిన్నమ్మకు ఒక ఆడపిల్ల, ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆడపిల్ల శాంతసుందరికి వివాహం, పెద్దవాడు రోహిణీప్రసాద్ (న్యూక్లియర్ ఫిజిసిస్ట్) ఉద్యోగంలో చేరి వివాహమాడటం జరిగినై. (రెండవ పిల్లవాడు ‘బగ్గీ’ గతించాడు)

ఇప్పటికి అచ్చయిన కక్కయ్య వేలాది రచనల్ని కొందరైనా చదివి ఉండటం అసాధ్యం అనుకుంటా. ఆయన దిట్ట అయిన బహుముఖ రచయిత అని –షుమారుగా- నాకు తెలుసు. ఆయన గతించిన కొద్ది కాలంలో అనేక పత్రికల్లో పడ్డ దాదాపు యాభై రచనల్లో కొన్ని అంది, చదివినాక ఒక వింత అనుభూతి పొంది, ఈయన మన సాహిత్యలోకానికి, సమాజానికి సాహిత్యశాస్త్ర విజ్ఞానం ప్రతిపాదించిన ఒక అసాధారణ రచయితగా మన మధ్య జీవించినవాడని నేను భావించాను.

భావవిప్లవకారుడు కొడవటిగంటి
సాహిత్యసమాలోచన ప్రగతి సాహితి, జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ
సంపాదకుడు: అశోక్ టంకసాల, జూన్ 1982

మాధవపెద్ది గోఖలే (1917-1981) తెలుగు సినీ కళాదర్శకుడుగా అత్యున్నత ఖ్యాతిని పొందారు. మాయాబజార్, చంద్రహారం మొదలైన విజయావారి సుప్రసిద్ధ చిత్రాలన్నిటికీ ఆయనే కళాదర్శకుడు. మహామంత్రి తిమ్మరుసు మొదలైన ఇతర సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. మద్రాసు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ ట్స్ స్కూల్‌లో దేవీప్రసాద్ రాయ్‌చౌదరికి శిష్యుడు. (మద్రాసు మెరీనా బీచ్ రోడ్డు మీద కనిపించే ట్రయంఫ్ ఆఫ్ లేబర్, మహాత్మా గాంధీ విగ్రహాలు రాయ్‌చౌదరి నిర్మించినవే). సినీ గాయకుడు సత్యం గోఖలే తమ్ముడు. కళలోనే కాకుండా గోఖలే అభ్యుదయ రచయితగా కూడా సుప్రసిద్ధుడే. ఆయన రాసిన బల్లకట్టు పాపయ్య తదితర కథలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కుటుంబరావుగారి బంధువుల్లో ఆయనకు సన్నిహితంగా మెలిగిన బహు కొద్దిమందిలో గోఖలే ఒకరు. అందుకే వ్యక్తిగత జీవిత విశేషాలను ఆయన తన వ్యాసంలో వివరించగలిగారు. – రో.ప్ర.

Posted in వ్యాసం | 3 Comments

శ్రోత, గాయకుడు – కుటుంబరావు

chittibabu.PNG

-వైణిక విద్వాన్ చిట్టిబాబు

మద్రాసులో నా కచేరీ ఎక్కడ జరిగినా కొడవటిగంటి కుటుంబరావు, ఆయన సతీమణి శ్రీమతి వరూధిని, వారి అమ్మాయి, అబ్బాయి తప్పక వచ్చేవారు. నాకు ఆయనతో బాగా పరిచయం అయ్యేక, ఆయన్ని, ప్రేక్షకులలో వెనకాల ఎక్కడో కూర్చుని వుండటం (నా కచేరీలోనే) చూసాను ఒకసారి. కచేరీ అయాక, నన్ను ఆయన వేదిక దగ్గరకు వచ్చి కలిసినపుడు నేనన్నాను “అదేమిటండీ, మీరలా ఎక్కడో కూర్చొనడమేమిటి? ఈసారికి మా ఇంటికి వచ్చేయండి. కచేరీకి మనం కలిసి వెళదాం. మీరు ముందర కూర్చుంటే నాకు ప్రోత్సాహంగా వుంటుంది” అని. అందుకు కుటుంబరావు ఏమన్నారో తెలుసా? అబ్బే, అలా కూర్చుంటే thrill ఉండదు. మన స్నేహ విషయం తెలియనివ్వకుండా అలా శ్రోతలతో కలిసిపోయి, వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశంసలు, ఒక చెవినీ, మీ కచేరీ మరొక చెవినీ వింటోంటే గొప్ప thrillingగా ఉంటుంది. అది పాడు చేయకండి” అన్నారు. అటువంటిది సంగీతంలో ఆయన ఆసక్తి.

మరొకసారి కలిసినపుడు, “ఏమండీ, నిన్న నేను ఇంకొకరి కచేరీకి వెళ్ళాను. నాకో సందేహం వచ్చింది, ఆ కచేరీ వింటోంటే” అన్నారు. ఏమిటని అడిగాను నేను. “ఒకే రాగానికి రెండు versions ఉంటాయా?” అని ప్రశ్నించారాయన. “ఏ రాగానికయినా వేర్వేరు treatments ఉండొచ్చు – కళాకారుడి మూడ్‌ని బట్టి. లేదా ఒకే కళాకారుడు ఆ రాగాన్ని వేర్వేరు విధాలుగా treat చేయవచ్చు. అతని మూడ్‌ని బట్టి. కాని మీకు సందేహం వచ్చినట్టు ఒకే రాగానికి రెండు versions వుండవు” అని వివరించాను. ఆయనకు ఆ సమాధానం చాలా నచ్చినట్టుంది. “కరెక్ట్” అన్నారు. అటువంటిది ఆయన విమర్శనాత్మక పరిశీలన.

కుటుంబరావు తమ అమ్మాయి వివాహానికి రిసెప్షన్‌లో నా కచేరీ పెట్టారు. మరి అప్పుడు పెండ్లికుమార్తె తండ్రిగా అందరినీ ఆహ్వానిస్తూ అటు వుండాలి కదా; హాయిగా వేదిక దగ్గరగా ఇంకొంతమంది సంగీతాభిమానులతో కలిసి, నా వీణ వింటూ ఇటు వుండిపోయారు. శ్రీమతి వరూధిని వచ్చి, “మీ కళారసన బంగారంగానూ, మీరీవేళ కూడా చిట్టిబాబుగారి వీణ కచేరీ వింటూ కచేరీకి వెళ్ళిన శ్రోతలాగ ఇక్కడే కూర్చుండిపోతే ఎలా? అతిథులను ఆహ్వానించవద్దూ” అని బుజ్జగించి తీసుకువెళ్ళేదాకా వెళ్ళలేదు. అటువంటి కళారసన కొడవటిగంటిది.

మేం ఇద్దరం ఎప్పుడు, ఎక్కడ కలిసినా సంగీతపరమైన ఏదో విషయం కదపందే ఊరుకొనేవారు కాదు.

కుటుంబరావుకు కర్ణాటకం, హిందుస్థానీ రెండూ అభిమానమైనవే. హిందుస్థానీలో కరీంఖాన్, ఫయాజ్‌ఖాన్, బడేగులాం అలీఖాన్ లాంటివారిని ఆరాధిస్తే కర్ణాటకలో సెమ్మంగుడి, అరియకుడి, సుబ్బులక్ష్మి, చెంబై, మధురమణి, బాలమురళి మొదలయినవారిని అభిమానించేవారు. సినిమా సంగీతంలో సైగల్‌ను తప్ప ఎవరినీ అంతగా మెచ్చుకొనేవారు కాదు. లతా మంగేశ్కర్ కన్న ఆశా భోంస్లే గొప్ప గాయని అని వాదించటం ఆయనకో సరదా.
కొడవటిగంటిది శ్రావ్యమైన గొంతు. సంగీతాన్ని స్వయంగా అభ్యసించేవారు. ప్రసిద్ధ హార్మోనియం వాయిద్యగాడు గోవిందరావు టేంబే వాయింపును ఆయన కరతలామలకం చేసుకున్నారు. (కొ.కు. రెండవ కుమారుడు ప్రసాద్ సితార్ బాగా వాయిస్తాడు) మహారాష్ట్ర గాయకులైన బాలగంధర్వ, దీనానాథ్, మాస్టరు కృష్ణారావుల పాటలకు ముగ్ధుడై ఒకప్పుడు బొంబాయిదాకా వెళ్ళి వారి పాటలు ప్రత్యక్షంగా విని వచ్చారు. ఆయన ఎంతో పాత రికార్డులు కూడా మొదటినుంచీ సేకరించేవారు.

ఒక రచయిత ఆయా అంశాలకు తెచ్చే పోలికను బట్టి ఆయన విషయపరిజ్ఞాన్ని, మేధాశక్తిని అంచనా గట్టవచ్చుననుకుంటే, కృష్ణశాస్త్రి కవితను సన్నాయి వాయిద్యానికీ, శ్రీశ్రీ కవితను డోలు వాయిద్యానికీ సంగీతపరంగా కుటుంబరావు చెప్పే పోలికను బట్టి ఆయనను అంచనా వేయవచ్చు. ఈ పోలికలో ఎంత విస్తృతమైన, నిగూఢమైన ఆలోచన ఉన్నదో యోచించినవారికి తెలుస్తుంది.

అంతటి రచయిత, మేధావి, భౌతికవాదికి నాటకాలవంటి ఇతర కళలతోబాటు సంగీతం పట్ల గొప్ప ఆసక్తి మాత్రమే కాక ప్రవేశం కూడా ఉండటం, ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి.

భావవిప్లవకారుడు కొడవటిగంటి
సాహిత్యసమాలోచన ప్రగతి సాహితి, జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ
సంపాదకుడు: అశోక్ టంకసాల, జూన్ 1982

మద్రాసులోని అనేక ప్రసిద్ధ కళాకారుల్లో చిట్టిబాబు (1936-1995) ఒకరు. ఈమని శంకరశాస్త్రి శిష్యుడుగా, ఆకర్షణీయమైన వీణ విద్వాంసుడుగా తెలుగువారందరికీ ఇష్టుడూ, పరిచితుడూ అయిన చల్లపల్లి చిట్టిబాబుగారి వీణ కచేరీలు మద్రాసులో ఎక్కడ జరిగినా మా నాన్నగారు సకుటుంబంగా హాజరయేవారు. పన్నెండేళ్ళకే కచేరీలు మొదలుపెట్టిన ప్రాడిజీ చిట్టిబాబు. భానుమతి నిర్మించిన లైలా మజ్నూ సినిమాలో చిన్ననాటి నాగేశ్వరరావుగా నటించినది చిట్టిబాబే. ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సినిమా రికార్డింగులకి వీణ వాయించి, రంగులరాట్నం తరవాత పూర్తిగా కచేరీలకే పరిమితమైపోయారు. దేశవిదేశాల్లో కచేరీలిచ్చి, ఎన్నో ప్రజాదరణ పొందిన రికార్డులు రిలీజ్ చేసిన తరవాత అనారోగ్యం కారణంగా 59 ఏళ్ళకే మద్రాసులో మృతి చెందారు. కొమ్మలో కోయిల మొదలైన అనేక గీతాలకు స్వరరచన చేసి కోయిల శబ్దాన్ని వీణ మీద పలికించిన గొప్ప సంగీతకారుడు.
మా నాన్నగారు చనిపోయినప్పుడు పరామర్శించడానికి చిట్టిబాబు వెంట ఆయన తల్లి కూడా మా ఇంటికి వచ్చారు కాని ఉద్వేగం ఎక్కువై ఆవిడ కారు దిగి లోపలికి రాలేదు. సరిగ్గా ఒక వారం లోపునే ఆవిడ కూడా గుండెపోటుతో చనిపోవడంతో నేను చిట్టిబాబుగారింటికి వెళ్ళి ఆయనను పరామర్శించవలసి వచ్చింది. – రో.ప్ర.

Posted in వ్యాసం | 5 Comments

ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు

animated-flag-india.gif

పొద్దు పాఠకులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!!

అరవైయవ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన కొన్ని ఘట్టాలను మీ ముందుకు తెస్తున్నాం. 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు అనుమతించిన శ్రీ ధనరాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

ఆగస్టు 17 న ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని విశేష వ్యాసాలను అందిస్తున్నాం. వేచి చూడండి.

ఈ నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

Posted in ఇతరత్రా | Comments Off on ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు

ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమంలో కొన్ని ఘట్టాలు

indiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.png
ఆంధ్ర ప్రదేశ్ లో స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు తన అంగీకారం తెలిపిన శ్రీ ధనరాజ్ గారికి పొద్దు సంపాదకమండలి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

————————–

భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రపంచచరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. అహింసాయుతంగా స్వాతంత్ర్యోద్యమం జరిగినప్పటికీ, సాయుధ పోరాటాలు జరగకపోలేదు. 1913 – 1935 కాలంలో సాయుధ తిరుగుబాట్లు, కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఇవన్నీ బెంగాల్లోను, పంజాబు, ఇతర ఉత్తర భారత ప్రాంతాల్లోను జరిగాయి. దక్షిణాదిన చాలా తక్కువగా జరిగాయి.1933-35 ల్లో జరిగి, కాకినాడ కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందిన విప్లవ ఘటన వాటిలో ఒకటి.

శాసనోల్లంఘనోద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి. అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాలరెడ్డి, బులుసు సాంబమూర్తి, క్రొవ్విడి లింగరాజు వంటి నాయకుల నేతృత్వంలో ఉద్యమం జరిగింది. ఉద్యమాన్ని అణచివేసే పనిలో భాగంగా బ్రిటిషువారు నాయకులను జైల్లో పెట్టడం, ప్రజల ఇళ్ళలో సోదాలు చేసి భయభ్రాంతులను చెయ్యడం వంటి పనులు చేసారు. గుమిగూడిన ప్రజలపై అకారణంగా లాఠీచార్జి జరిపేవారు. పెద్దాపురంలో జరిగిన సంఘటన పోలీసుల దౌష్ట్యానికి ఓ ఉదాహరణ.

పెద్దాపురం ఘటన:

1930 డిసెంబరు 16 న పెద్దాపురం పట్టణంలో 80 మంది వరకు పెద్దలు, పిన్నలు ధనుర్మాస వనభోజనాల కోసం బొక్కా నారాయణమూర్తి గారి తోటలోకి చేరుకున్నారు. వత్సవాయి జగపతి వర్మ గారు అతిథేయి. క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణమ్మ అక్కడ చేరిన ప్రముఖుల్లో కొందరు. ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనేది కూడా వారు చర్చించబోతున్నారు. ఈ సమాచారం తెలిసికొన్న సర్కిలు ఇన్స్పెక్టరు దప్పుల సుబ్బారావు తన బలగంతో అక్కడికి చేరుకున్నాడు. వనభోజనార్థుల చుట్టూ వలయంగా చేరి, చెదిరిపొమ్మని హెచ్చరిక చేసాడు. వాళ్ళకు చెదిరిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే లాఠీచార్జి చేయించాడు.

ఇదిలా ఉండగా గాంధీ-ఇర్విన్ ఒడంబడిక పర్యవసానంగా బ్రిటిషు ప్రభుత్వం ఉద్యమంపై బిగించిన ఉక్కు పిడికిలిని కొంత సడలించింది. శాంతియుతంగా పికెటింగు వగైరాలతో ఉద్యమం జరుపుకునేందుకు అనుమతించింది. జైళ్ళలో ఉన్న అనేకమంది ఉద్యమకారులను విడుదల చేసింది. ఆంధ్రలోనూ అనేకులు విడుదలయ్యారు. వారిలో ప్రతివాది భయంకరాచారి ఒకరు.

మిగతా దేశంలో వలెనే ఆంధ్ర లోనూ శాసనోల్లంఘనం కొనసాగింది. అయితే శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించుకోవచ్చని ఇచ్చిన హామీని విస్మరించి బ్రిటిషు ప్రభుత్వం అణచివేత చర్యలను కొనసాగించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అటువంటి చర్యల్లో ప్రముఖమైనవి కొన్ని:

వాడపల్లి కాల్పుల ఘటన:

1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి లో వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతూండగా జరిగిన సంఘటన ఇది. రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల ఫోటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నారు. తహసీల్దారుతో సహా అక్కడికి చేరుకున్న డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్, వాటిని తొలగించమని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ప్రజలపై కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

సీతానగరం ఆశ్రమ ఘటన:

ఇక రెండోది 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జరిగింది. సీతానగరం ఆశ్రమాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య, మరికొందరి పర్యవేక్షణలో ఉంచి మిగిలినవారు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనేందుకు క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో కాకినాడ వెళ్ళారు. అప్పటికే – జనవరి 5న – ఆశ్రమం ప్రచురిస్తున్న “కాంగ్రెస్” పత్రికను చట్టవ్యతిరేకమైనదని ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ అక్కడికి చేరుకుని ‘ఈ ఆశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదని ప్రకటించాం. దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి’ అని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ఆశ్రమవాసులపై విచ్చలవిడిగా లాఠీచార్జి చేసాడు. 75 ఏళ్ళ ముదుసలిని కూడా వదలకుండా అందరినీ అరెస్టు చేసాడు.

సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారిని ఈ సంఘటనలు కలచివేసాయి. సామర్లకోటలో పదవ తరగతి వరకూ చదివిన భయంకరాచారి విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో చేరి సగంలోనే ఆపేసాడు. విద్యార్థిగా ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదువు ఆపేసాక కొన్నాళ్ళు సీతానగరం ఆశ్రమంలో గడిపాడు. 19 ఏళ్ళ వయసులోనే లాహోరు కాంగ్రెసు సభలకు హాజరయ్యాడు. శాసనోల్లంఘనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1930 మేలో గురజనపల్లిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. గాంధీ – ఇర్విన్ ఒడంబడిక ననుసరించి ఇతర నాయకులతో పాటు తానూ విడుదలయ్యాడు. కన్ననూరు, బళ్ళారి జైళ్ళలో ఉండగా లాహోరు కుట్ర కేసు నిందితులు, బెంగాలు విప్లవకారులతో సంపర్కంలోకి వచ్చాడు. వారి వద్ద నుండి బాంబులు తయారుచేసే పద్ధతులు నేర్చుకున్నాడు.

భయంకరాచారి విప్లవ వీరులను ఆరాధించాడు. సంపూర్ణ విప్లవమే సంపూర్ణ స్వరాజ్యం తెస్తుందని నమ్మాడు. గాంధీ అహింసా మార్గాన్ని వ్యతిరేకించాడు. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలోకి ఉరకాలని ఉద్బోధించాడు. “యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి..” అని అనేవాడు.

కాకినాడ బాంబు ఘటన:

ఉద్యమ నాయకులపై అన్యాయంగా లాఠీచార్జి జరిపిన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు భయంకరాచారి. మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరిల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్. చారి అండ్ సన్స్ అనే ఓ బోగసు కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.

1933 ఏప్రిల్ 6 న కాకినాడలోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ముస్తఫా వారనుకున్నట్టు రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబరు 11 న భయంకరాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.

డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.

ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మరి రెండు సంఘటనలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సమంజసంగా ఉంటుంది. బ్రిటిష్ పాలనలో తిరగబడిన సామాన్య ప్రజల ఆగ్రహజ్వాలల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి కాగా ఆంగ్లేయాధికారులు ఒక సామాన్యుడిని పొట్టనబెట్టుకున్న ఘటన ఇంకొకటి:

కడప మసీదు ఘటన:

1832 జూన్ 15 సోమవారం నాడు ఎవరో ఒక పందిపిల్లను చంపి కడపలోని పెద్ద మసీదు (జుమ్మా మసీదు)లో పడేశారు. విషయం తెలిసిన ముస్లిములు కోపోద్రిక్తులయారు. “దీన్”, “దీన్” అని కేకలు వేసుకుంటూ వేలాది మంది ముస్లిములు గుంపులు గుంపులుగా మసీదు వద్దకు చేరుకున్నారు. సమయానికి కలెక్టరు లేకన్ ఊళ్ళో లేడు. ఆయన సబ్ కలెక్టరు మెక్డొనాల్డ్ ను మిలిటరీని తీసుకుని సంఘటనాస్థలానికి వెళ్ళి పరిస్థితి అదుపు తప్పకుండా చూడమని ఆదేశించాడు. పందిపిల్లను చంపిపడేసినవారి ఆచూకీ తెలిపితే రూ.500 లు బహుమతిగా ఇస్తామని చాటింపు వేయించాడు. యువకుడైన మెక్డొనాల్డ్ మిలిటరీ రాక ముందే తన సిబ్బందితో మసీదు వద్దకు చేరుకున్నాడు. అతడు అక్కడ గుమికూడిన ప్రజలకు నచ్చజెపుతూ ఉండగా ఒక యువకుడు హఠాత్తుగా మెక్డొనాల్డ్ పై దాడిచేసి కత్తితో రొమ్ముమీద పొడిచాడు. అంతలో అక్కడికి చేరిన సైన్యానికి కాల్పులు జరపమని ఆదేశాలిస్తూ మెక్డొనాల్డ్ సమీపంలోని ఇళ్ళలోకి దూరబోగా ఎవరూ రానివ్వలేదు. అంతలో మరో యువకుడు ఇంకో పోటు పొడిచాడు. మొదటిపోటు పొడిచిన యువకుడు సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడినా వెనుదీయక ఒక సైనికాధికారిని పొడిచి చంపి మరీ నేలకొరిగాడు.

ఈ సంఘటనలో మరణించిన సబ్ కలెక్టర్ మెక్డొనాల్డ్ యువకుడు. అప్పటికి కొన్ని నెలల క్రితమే అతడికి పెళ్లయింది. అతడి మరణవార్త విన్న భార్య ఆగ్నస్ దిగ్భ్రాంతికి గురై, కోమాలోకి వెళ్ళి 21 రోజుల తర్వాత కోమాలోనే చనిపోయింది. వీరిద్దరి సమాధులు కడప నగరంలో దొరల గోరీలు అనేచోట ఇప్పటికీ ఉన్నాయి.

పరాయి పాలన మీద పేరుకుపోయిన అసంతృప్తి, నిరసన భావాలే ఈ సంఘటనలో పెల్లుబికి ఈ హత్యాకాండకు దారితీశాయి. ఆంగ్లేయుల పాలనపై ప్రజల్లో అప్పటికే తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి ఉందని రికార్డులు చెప్తున్నాయి. 1857 తిరుగుబాటుకు ముందే ప్రజల చేతుల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన అరుదైన సంఘటనల్లో ఇదొకటి.

పలనాడు సత్యాగ్రహం

ఇక రెండోది స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన తొలి ఆంధ్రుడు కన్నెగంటి హనుమంతు గాథ (తెలుగు అకాడెమీ వారి బియ్యే చరిత్ర పుస్తకం, ఈభూమి పత్రికలో వచ్చిన “తెల్లవాడి తుపాకిని ఎదురొడ్డిన కన్నెకంటి హనుమంతు” వ్యాసం ఆధారంగా):
గుంటూరు జిల్లా పలనాడులో అటవీప్రాంతం అధికం. అక్కడి పేద ప్రజలు పుల్లరి, వంటచెరకు, ఎరువు ఆకు మొదలైన వాటికి గాను ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి వచ్చేది. వారిని అటవీశాఖాధికారులు, రెవెన్యూ ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టేవారు. 1921 లో కరువు పరిస్థితుల వల్ల ప్రజలు పన్నులలో రాయితీలు కోరారు. అడవి నుండి వంటచెరకును ఉచితంగా తెచ్చుకొనేందుకు, నీటివనరులను వాడుకునేందుకు అనుమతి కోరారు. ఆవులను మేపుకోడానికి చెల్లించే 12 అణాల పన్నును 3 అణాలకు తగ్గించమని కోరారు.

ఈ వినతులను బ్రిటిషు పాలకులు పట్టించుకోలేదు. మాచర్ల, వెల్దుర్తి, శిరిగిరిపాడు, రెంటచింతల, ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అడవిలోకి మేత కోసం తోలేవారు. అధికారులెవరైనా వాటిని బంధిస్తే, ప్రజలు మూకుమ్మడిగా వెళ్ళి వాటిని విడిపించుకొచ్చేవారు. నడిపాలెంలో వందగేదెలను అధికారులు నిర్బంధించగా, ఒక మహిళ నాయకత్వంలో ప్రజలు రేంజరుపై దాడి చేసి, వాటిని విడిపించుకున్నారు. అధికారులు కూడా వీరిని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను సమీకరించుకొన్నారు.

అధికారుల నియంతృత్వ ధోరణికి ఆగ్రహించిన ప్రజలు అటవీ, రెవిన్యూ ఉద్యోగులను వెలివెయ్యడం మొదలుపెట్టారు. మాచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ అధికారులకు చాకలి, మంగలి మొదలైనవారి సేవలు దొరకలేదు. డిప్యూటీ తాసీల్దారు కుమారుడికి గుక్కెడు పాలు కూడా కరవయ్యాయి. రేంజరు, తదితర ఉద్యోగులను ఇళ్ళు ఖాళీ చేయించి, వారికి తమ ఇళ్ళను అద్దెకు ఇచ్చేది లేదని చెప్పేశారు.

పలనాట పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరు అక్కడికి వచ్చి, తన ఆదేశాలను గ్రామాల్లో చాటింపించేందుకు గాను తప్పెటవాళ్ళను పిలిపించాడు. వాళ్ళంతా తమ తప్పెట్లు చెడిపోయాయని చెప్పారు. గ్రామాధికారి కూడా వారిని సమర్ధించాడు. ఇదే సమయానికి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెసు పార్టీ పనుపున ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి పలనాడు చేరుకున్నారు. వారి వలన శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని భావించి, వారిని పూచీకత్తు చెల్లించమని కలెక్టరు ఆదేశించాడు. ప్రజలు వారిని తప్పెట్లతో ఊరేగింపుగా కలెక్టరు వద్దకు తీసుకువెళ్ళారు. చెడిపోయాయని తనకు చెప్పి, కాంగ్రెసు నాయకులను అవే తప్పెట్లతో స్వాగతించడం కలెక్టరుకు అవమానము, ఆగ్రహమూ కలిగించింది. పూచీకత్తు చెల్లించేందుకు నిరాకరించినందుకు గాను వారికి ఏడాది జైలుశిక్ష విధించాడు.

దీంతో రెచ్చిపోయిన ప్రజలు పన్నులు చెల్లించడం మానివేసి, పశువులను అడవిలోకి తోలారు. అటవీ నిబంధనలు అతిక్రమించవద్దని, పన్ను చెల్లించమని కాంగ్రెసు చెప్పినప్పటికీ ప్రజలు వినలేదు. పోలీసులతో ఘర్షణలూ జరిగాయి. వెల్దుర్తిలో రిజర్వు పోలీసు బలగంపై దాడి చేసి, వారి బంగళాను ఆక్రమించుకున్నారు. జెట్టిపాలెంలో పశువులను బంధించిన బందెలదొడ్డిపై దాడి చేసి, వాటిని విడిపించుకుపోయారు. దీంతో కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు మొదలైనవారు పలనాట విడిదిచేసి, పరిస్థితిపై కన్నేసి ఉంచారు.

ఈ సందర్భంలో మించాలపాడు వద్ద జరిగిన సంఘటన ప్రముఖమైంది. అధికారులు అక్కడి అడవిలో 300 పశువులను పట్టుకొని బందెలదొడ్డికి తరలిస్తూండగా వారిపై 300 మంది వరకు ప్రజలు దాడి చేసి, రాళ్ళు రువ్వారు. అధికారులు అందినవారిని అందినట్లు చితకబాదారు. చెన్నయ్య అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి ఊళ్ళోనుంచి చెన్నయ్య మామ కన్నెగంటి హనుమంతు పరుగున వచ్చాడు. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో చెన్నయ్యను కాపాడబోయిన కన్నెగంటి హనుమంతు, మరో ఇద్దరు మరణించారు. కాల్పులు జరిగింది సాయంత్రం 6 గంటలకైతే అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రాణాలతోనే ఉన్న హనుమంతు సమయానికి వైద్యసహాయం అందక మరణించాడు. అంతసేపూ క్షతగాత్రుడై పడి ఉన్న హనుమంతుకు మంచినీళ్ళివ్వబోయిన గ్రామస్థులను సైతం అధికారులు అడ్డుకున్నారు. తదనంతరం జరిగిన అణచివేత చర్యల కారణంగా పలనాట శాసనోల్లంఘనోద్యమం 1922 కల్లా చల్లబడింది. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాఖ ఈ ఉద్యమానికి సుముఖంగా లేకపోవడం ఉద్యమం చల్లారడానికి ఒక కారణం. ఈ ఉద్యమానికే పలనాడు సత్యాగ్రహం అని, పుల్లరి సత్యాగ్రహం అనీ పేరు వచ్చింది.

Posted in వ్యాసం | 3 Comments

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

పాఠకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రలో జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుకు తెస్తున్నాం. ఆగస్టు 15 న ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాం.

ఈ లోగా మృతజీవులు నాలుగో భాగాన్ని ఆస్వాదించండి.

ఈ నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

Posted in ఇతరత్రా | 1 Comment

మృతజీవులు – 4

రెండవ ప్రకరణం

మన ఆగంతకుడు వచ్చి వారం రోజులకు పైగా అయింది. అతనికి బండీ ఎక్కి సాయంకాలపు పార్టీలకు వెళ్ళటంతోనూ, విందులు కుడవటంతోనూ కాలం హాయిగా వెళ్ళిపోతున్నది. చిట్టచివరకు అతను నగరం విడిచి వెళ్ళి, మాట ఇచ్చిన ప్రకారం మానిలవ్‌నూ, సబాకివిచ్‌నీ చూద్దామని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఇందుకు మరొక కారణం, ఇంతకంటే ముఖ్యమైనదీ, అతని అంతస్సుకు సన్నిహితమైనదీ కూడా ఉండి ఉండవచ్చు…ముందు చెప్పబోయే కథను పాఠకుడు ఓపికగా చదివినట్టయితే కాలక్రమాన, కొంచెం కొంచెంగా అన్ని విషయాలూ తెలుస్తాయి; ఈ గాథ వెళ్ళినకొద్దీ మరింత విస్తృతమైన విషయాలను తడవబోతున్నది గనక కొంచెం దీర్ఘంగానే ఉంటంది.

ఉదయం పెందలాడే బండీకి గుర్రాలు పూన్చమని బండీవాడు సేలిఫాన్‌కు ఉత్తరు వివ్వబడింది. పెట్రూష్కను ఇంటివద్దనే ఉండి గదినీ, తోలుపెట్టెనూ జాగ్రత్తగా చూస్తూండమన్నారు. మన కథానాయకుడి తొత్తులైన ఈ ఇద్దరినీ పరిచయం చేసుకోవటంవల్ల పాఠకుడికి నష్టం ఉండదు. అయితే నిజానికి వీరు అంత ప్రాధాన్యంగల పాత్రలు కారు; రెండవ తరగతికి, మళ్ళీ మాట్లాడితే మూడో తరగతికి చెందినవారు; వీరికి ప్రధాన సంఘటనలతో సంబంధం లేదు. కథలో స్థాలీపులాకంగా తగులుతూ ఉంటారు. అయితే ఈ కథకుడు రష్యను అయినప్పటికీ, అన్నిటినీ వివరించటంలో జర్మనులకున్నంత శ్రద్ధగలవాడు. ఈ సందర్భంలో మనకు ఎక్కువ కాలం వ్యర్థంకాదు; ఎందుకంటే

పాఠకుడు అదివరకు వీరి గురించి పెట్రూష్క వదులుకోటు వేసుకున్నాడనీ, అది ఒకప్పుడు అతని యజమానిదనీ, అతని వృత్తిలో ఉండేవారికి సహజంగా ఉండే మందమైన పెదవులూ, ముద్దముక్కూ అతనికి కూడా ఉన్నాయనీ తెలిసినదానికి అదనంగా చేర్చదగిన వివరాలు ఆటేలేవు. అతను ఆటే మాటకారి కాదు, మితభాషి. అతనికి పఠనాసక్తి, అంటే పుస్తకాలు చదవాలనే తృష్ణ చాలా హెచ్చు. అయితే అతనికి ఆ విషయమై ఎలాటి విచక్షణా లేదు. విరహాతురుడైన కథానాయకుడి అనుభవాలుగల కథ అయేది, నిఘంటువయేది, ప్రార్థనల పుస్తకమయేది అతనికి ఒకటే. రసాయనశాస్త్రానికి సంబంధించిన పుస్తకం ఇచ్చినా అతను వద్దని ఉండడు. అతనికి కావాలిసింది పఠనమేగాని, పాఠం కాదు. అక్షరాలతో రకరకాల మాటలు ఏర్పడటం, ఒక్కొకసారి మాటలు అర్థం కాకపోతేనేం, అతనికి సరదాగా ఉండి చదివేవాడు. అతని చదువు చాలావరకు పడుకునే, నడవలో మంచం మీద పరుపు వేసుకుని, దానిపైన పడుకుని. అతనికి ఈ అలవాటుండబట్టే ఆ పరుపు అట్టలాగా తయారయింది. పఠనాసక్తి గాక అతనిలో మరి రెండు విశేషాలున్నాయి; అతను పడుకునేటప్పుడు వేసుకున్న దుస్తులతోనే, ఆ కోటుతోనే పడుకునేవాడు. అతనివెంట ఎప్పుడూ, అతని తాలూకు ప్రత్యేకమైన వాసన ఒకటి ఉండేది. చాలాకాలంగా మనుష్యులుండిన గదిలో కొట్టే వాసన అది. అందుచేత ఎవరూ ఎన్నడూ నివసించని గదిలోకి అతని పైకోటూ, వస్తువులూ తెచ్చిపెడితే చాలు; ఆ గదిలో పదేళ్ళుగా మనుషులు కాపరం చేస్తున్నట్టుగా తోచేది.

చిచీకవ్‌ ఒకంతట తృప్తిపడే రకం కాదు. కొన్ని విషయాలలో చాలా పట్టుదలగలవాడు. అతను ఒక్కొక్క రోజు ఉదయం గాలి మూచూసి మొగం చిట్లించి, తల అడ్డంగా తిప్పి, “ఒరే అబ్బీ, నీకు చెమటో ఏదో పట్టింది, వెళ్ళి స్నానం చేయరాదూ?” అనేవాడు. దీనికి పెట్రూష్క సమాధానం చెప్పక ఏదో పనిలో నిమగ్నుడయేవాడు. బ్రష్‌ తీసుకుని వంకెకు వేళ్ళాడే తన యజమాని కోటువద్దకైనా వెళ్ళేవాడు, లేకపోతే ఏదో వస్తువును అది ఉండవలసిన స్థానంలో పెట్టేసేవాడు. మౌనంగా ఉన్నప్పుడు వాడు తన మనసులో ఏమనుకునేవాడు? “నువు మహామంచివాడివిలే, చెప్పిందే నలభైసార్లు విసుగులేకుండా చెపుతూ…” అనుకునేవాడేమో. తన యజమాని ఉపన్యాసం దంచేటప్పుడు తొత్తు అయినవాడు ఏమనుకుంటాడో ఊహించటం బ్రహ్మతరంకాదు. పెట్రూష్క విషయం ప్రస్తుతానికి ఇది. పోతే బండివాడు సేలిఫాన్‌ వేరేరకం మనిషి…పాఠకులకు ఈ తక్కువరకం మనుషులంటే విముఖత్వమని కథకుడికి తెలుసు. అందుచేత వీళ్ళను గురించి ఇంతసేపు చెప్పటానికి సిగ్గుగా ఉంది. తమకంటే ఏపాటి కొంచెం ఉన్నతస్థితిలో ఉన్న వ్యక్తుల పరిచయ భాగ్యంగాని సంపాదించాలని కుతూహలపడడం రష్యనుల సంప్రదాయం. వారికి మామూలు మనుషులతోటి గాఢమైత్రి కన్న జమీందారులూ, ప్రభువులూ లాటివారి ముఖపరిచయం ఎన్నోరెట్లు ప్రియతరం. ఆ మాటకు వస్తే ఈ కథకుడు తన కథానాయకుడు కేవలం చర్చి కౌన్సిలు సభ్యుడు మాత్రమే అయినందుకు ఆందోళన చెందుతున్నాడు. కోర్టుకౌన్సిలు సభ్యుల్లాటివాళ్ళు అలాటి వ్యక్తి పరిచయాన్ని సహించవచ్చుకాని ఏ జనరల్‌ పదవో అందుకున్నవారు అలాటి వ్యక్తులను చాలా నిరసనతో చూస్తారు. ఒకవేళ అసలు గమనించకుండానే వెళ్ళిపోయారంటే కథకుడికి అది గుండెలో పోటే. ఈ రెంటిలో ఏది జరిగినా బాధాకరమే అయినప్పటికీ మనం మన కథానాయకుడివద్దకు వెళ్ళక తప్పదు.

తాను ఇచ్చే ఉత్తరువులు కిందటి రాత్రే ఇచ్చి, అతను తెల్లవారగట్టే లేచాడు. ఆపాదమస్తకం తడి స్పాంజితో రుద్దుకుంటూ స్నానం చేశాడు. ఇలా ఆదివారంనాడే చేస్తాడు, ఆ రోజు ఆదివారమే మరి చెక్కిళ్ళు నున్నబారి నిగనిగలాడేలాగ క్షౌరం చేసుకున్నాడు. కలినేత ఎర్రకోటు వేసుకున్నాడు. మందమైన ఎలుగుబంటి చర్మం లైనింగు వేసిన పైకోటు ధరించాడు. వెయిటరు ముందు ఈపక్కా, తరవాత ఆపక్కా సాయం పట్టగా మెట్లు దిగివచ్చి, బండిలో ఎక్కి కూచున్నాడు. బండి చప్పుడు చేసుకుంటూ హోటలు గేటుదాటి వీధిలోకి మళ్ళింది. పక్కగా వెళుతున్న ప్రీస్టు ఒకడు నెత్తిమీద టోపీ తీశాడు. వీధిలోని అలగా కుర్రాళ్ళు, మురికి చొక్కాలు తొడుక్కున్నవాళ్ళు, చేతులు చాచి, “దిక్కులేనివాణ్ణి బాబూ, ధర్మం!” అన్నారు. వారిలో ఒకడు బండీ మెట్టుమీద ఎక్కటానికి ప్రయత్నిస్తూండటం చూసి బండివాడు కొరడాతో చురక తగిలించాడు. బండీ కుదుపుతో వీధిలో పరచిన రాళ్ళమీదుగా పరిగెత్తింది.

చారలుగల సరిహద్దు స్తంభం కనిపించగానే మన కథానాయకుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది. ఎందుకంటే, ఇతర పీడల్లాగానే, రాళ్ళు పరచిన రోడ్డుకు కూడా ఒక అంతం ఉన్నదని ఆ స్తంభం సూచించింది. మరి రెండు మూడుసార్లు అతని తల బండీకి అటూఇటూ కొట్టుకున్నాక బండీ మెత్తని మట్టిరోడ్డు ప్రవేశించింది. నగరం దాటగానే రోడ్డుకు అటూ ఇటూ కూడా రకరకాల పెంటకుప్పలూ, చెత్తదిబ్బలూ ప్రత్యక్షమయాయి. ఇది రష్యాలో పరిపాటే. వాటిలో వంటచెరుకు గుట్టలూ, ఎత్తు ఎదగని పైన్‌ (Pine) మొక్కల పొదలూ, పెద్ద వృక్షాల కాలిన మొదళ్ళూ మొదలైనవి ఉన్నాయి. వారికి తగిలిన గ్రామాలలో బారుగా గుడిసెలున్నాయి. అవి చూడటానికి చెక్కగూళ్ళలాగా ఉన్నాయి. బూడిదరంగుగా ఉండే వాటి కప్పుల అడుగున ఎంబ్రాయిడరీ చేసిన తువాళ్ళలాగా కనిపించే చెక్కడాలుంటాయి. మామూలు తప్పకుండా కొంతమంది బైతులు (గ్రామస్తులు) గొర్రెదుస్తులు ధరించి, తమ ఇళ్ళ బయట ఉండే బెంచీలమీద కూచుని, నోళ్ళు తెరుచుకు చూస్తున్నారు. ఆడవాళ్ళ లావుపాటి మొహాలు ఇళ్ళ ఎగువ భాగాలలోని కిటికీల నుంచి తొంగి చూస్తున్నాయి. కింది కిటికీలలోనుంచి దూడలూ, పందులూ ముట్టెలు బయటికి పెట్టాయి. ఇవన్నీ సుపరిచితమైన దృశ్యాలే.

పదిమైళ్ళు ప్రయాణం సాగించాక మానిలోవ్‌ లెక్క ప్రకారం వాళ్ళ గ్రామం అక్కడే ఎక్కడో ఉండాలని మన కథానాయకు డనుకున్నాడు. అయితే పదకోండో మైలు దాటినా కూడా ఆ గ్రామం జాడ కనబడలేదు. సమయానికి ఇద్దరు బైతులు తటస్థపడకపోతే ఆ గ్రామం అంతు చిక్కిఉండకపోను. “జమానిలవ్కా గ్రామం ఇక్కడికి చాలా దూరమా?” అన్న ప్రశ్న వినగానే బైతులు నెత్తిమీద టోపీలు తీసేశారు. ఇద్దరిలోనూ గసిక1లాటి గడ్డం కలవాడు రెండోవాడి కన్న కాస్త తెలివిగా కనిపించాడు. “జమానిలవ్కా కాదే, మానిలవ్కా కావాలి”అన్నాడు వాడు.

“ఒకవేళ మానిలవ్కా యేమో”

“ఆఁ, మానిలవ్కా! అయితే నేరుగా ఇంకో అరమైలు పోయి కుడివేపు తిరగండి”

“కుడివేపుకా?” అన్నాడు బండీవాడు.

“కుడివేపుకు” అన్నాడు బైతు. “ఆ రోడ్డే మానిలవ్కా పోతుంది. జమానిలవ్కా అనే వూరే లేదు. అసలు దాని పేరు మానిలవ్కా. మరి జమానిలవ్కా అంటే ఆ పేరుగల గ్రామం ఈ చాయలే లేదు. అట్టా ఎదురుగా కొండమీద ఇల్లు కనిపిస్తూంటుంది రెండంతస్తుల ఇటుకల మేడ షావుకారుగారి లోగిలి, ఆయన కాపరం అందులోనే. అదే మానిలవ్కా, జమానిలవ్కా అనే వూరు ఇటువేపుల ఏనాడూ లేదన్నమాట.”

వాళ్ళు మానిలవ్కాను వెతుక్కుంటూ బయలుదేరారు. నేరుగా ఒకటిన్నర మైళ్ళు వెళ్ళినాక కుడివేపుకు చీలే రోడ్డు వచ్చింది. ఆ దారిన పడి ఒక మైలుకాదు, రెండుమైళ్ళుకాదు, మూడు మైళ్ళు వెళ్ళినా ఎక్కడా ఇటుకల మేడ జాడలేదు. పల్లెపట్టుల్లో ఉండేవాళ్ళు మనని ఆహ్వానించి, తమ గ్రామం పదిమైళ్ళలో ఉన్నదన్నారంటే కనీసం ఇరవై మైళ్ళ దూరం ఉంటుందని మనం అనుకోవచ్చు ఈ సంగతి చిచీకవ్‌కు స్ఫురించింది. మానిలవ్కా గ్రామం ఏమంత ఒనరుగా లేదు. షావుకారు లోగిలి ఎత్తయిన గుట్టమీద ఉన్నది. ఏ వేపునుంచి గాలి వీచినా ఇంటికి రక్షణ లేదు. దానిచుట్టూ గరిక మైదానం. ఇంగ్లీషు పద్ధతిలో రెండు మూడు చోట్ల లైలాక్‌ (Lilac) పొదలూ, అకేషియా2 (Acacia) పొదలూ వేశారు. అక్కడక్కడా అయిదారేసి చొప్పున బర్చ్‌ (Birch) చెట్ల గుంపులున్నాయి; వాటి తలపై చిన్నచిన్న ఆకులు పలచపలచగా ఉన్నాయి. రెండుచోట్ల మధ్యగా ఒక పొదరిల్లున్నది. ఆ పొదరింటి శిఖరం మట్టంగా, ఆకుపచ్చరంగు వేసి ఉన్నది. దానికిగల కర్ర స్తంభాలు నీలంరంగు వేసి ఉన్నాయి. పొదరింటి మీద “ఏకాంత ధ్యానమందిరం” అని రాసి ఉన్నది. దానికి దిగువలో ఒక పాచిపట్టిన కొలనున్నది. రష్యను భూస్వాములు వేసుకునే ఇంగ్లీషు ఉద్యానాలలో అలాటిది ఉండటం స్వాభావికమే. కొండ దిగువనా, కొంచెం ఎత్తులోనూకూడా బూడిదరంగుగల చెక్కల కుటీరాలున్నాయి. మన కథానాయకుడు ఎందుకో వాటిని చూస్తూనే లెక్కించనారంభించి, రెండువందలకు పైగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ ఇళ్ళమధ్య ఎక్కడా ఒక చెట్టుగాని, ఒక పచ్చని పొదగాని, పొరపాటున కూడా కనిపించలేదు. ఈ దృశ్యానికి ప్రాణం తెచ్చినది ఇద్దరు ఆడవాళ్ళు; వాళ్ళు పావడాలు ఎగదోసి, కొలనులో మోకాలిబంటి నీటిలో నిలబడి, చెరొక కర్రా పట్టుకుని, చినిగిన వల ఒకటి లాగుతున్నారు. అందులో రెండు మూడు చేపలు చిక్కుకుని ఉన్నాయి. వాళ్ళు ఎందుకో ఒకరినొకరు ఆక్షేపించుకుంటూ జగడమాడుతున్నట్టు కనిపించారు. దూరాన ఉన్న పైన్‌ అడవి నీలపు మరకలాగా ఉన్నది. వాతావరణం కూడా ఈ దృశ్యానికి తగ్గట్టే ఉంది. ఎండాలేదు, పూర్తిగా ముసురూలేదు; ఆదివారాలప్పుడు తప్పిస్తే మిగతా రోజుల్లో సౌమ్యంగా ఉండే బారకాసు సిపాయిల దుస్తుల్లాగా, తేలిక బూడిదరంగు కాంతిగా ఉన్నది. అంతలో ఒక కోడి గట్టిగా కూసి దృశ్యానికి మెరుగుపెట్టింది. పెట్టల తగాదాల్లో ఇతర పుంజులు ఈ కోడి నెత్తిని నసాళం అంటా పొడిచేశాయి. అది రెక్కలు విదిలిస్తే వాటికి చాలాభాగం ఈకలు కూడా లేక తుంగచాపల్లా ఉన్నాయి.

బండీ ఇంటిముందు ఆవరణలో ప్రవేశించేసరికి ఇల్లుగలాయన వాకిటనే నిలిచి ఉండటం చిచీకవ్‌ కంటపడింది. ఆయన పలచని ఆకుపచ్చ కోటు ధరించి, ఎండకు చెయ్యి అడ్డంపెట్టుకుని, సమీపించే బండిని పరీక్షిస్తున్నాడు. బండీ దగ్గరికి వస్తున్నకొద్దీ ఆయన మొహం వికసించసాగింది; చిరునవ్వు విస్తరించింది.

చిచీకవ్‌ బండి దిగుతూండగానే ఆయన “పావెల్‌ ఇవానొవిచ్‌గారే! ఇంతకాలానికి మేం జ్ఞాపకం వచ్చామన్నమాట!” అన్నాడు.
 
(ఇంకా ఉంది)
——–
1. గసిక = శలాక, కోతగా చెక్కిన కొయ్య, త్రవ్వు సాధనము, బరిసె, గశికము (కొయ్యమేకు)
2. అకేషియా = కసింద చెట్టు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 4

ఆగస్టు గడిపై మీమాట

ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. జూలై గడి, సమాధానాలు
2. జూన్ గడి, సమాధానాలు
3. మే గడి, సమాధానాలు
4. ఏప్రిల్ గడి, సమాధానాలు
5. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 2 Comments

గతనెలలో తెలుగు వికీపీడియా

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

తెలుగు వికీపీడియాలో గ్రామాలు, సినిమాలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా అన్న పలు సద్విమర్శలు దృష్టిలో పెట్టుకొని, అవేకాదు, ప్రతి ఒక్కరికీ నచ్చేవి, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయని తెలియజెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు వికీపీడియన్లు. అందులో భాగమే ఈ శీర్షిక.

ఇటీవల మొదటి పేజీలో ప్రదర్శించబడిన కొన్ని తప్పకుండా చదవదగిన వ్యాసాలు: సుడోకు, మాయాబజార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హైదరాబాదు, తళ్ళికోట యుద్ధము, అక్షరధామ్, టి.జి.కమలాదేవి, మలేరియా, ఒమన్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (ఈ రేంజి చూస్తే తెలియట్లా తెవికీ విస్తృతి ఈ ఈమధ్య గణనీయంగా పెరుతోందని)

ఇలాంటి ప్రముఖ వ్యాసాలను ప్రతివారం కోరుకున్న వారికి ఈ-మెయిల్ రూపములో పంపిస్తున్నాం. మీరూ మెయిలింగ్ జాబితాలో చేరాలనుకుంటే tewiki-maiku-subscribe@googlegroups.com కు ఈ-మెయిల్ చెయ్యండి.

తెలుగు వికీ విస్తృతి పెంచటంలో భాగంగా ఇప్పుడు మానవ శరీరంలోని వివిధ భాగాల గురించి శాస్త్రీయ వ్యాసాలు వస్తున్నాయి. (మచ్చుకు కాలేయం, ముక్కు వ్యాసాలు చూడండి). ఇవి చూసిన తర్వాత మీరు, ఎవరన్నారూ తెలుగులో శాస్త్రీయ పరిభాష లేదని? అని అనుకుంటారు.

తెలుగు వర్ణమాలలో ఏ అక్షరాలు దంత్యాలు? ఏవి తాలవ్యాలు? తెలుగులో పాలు అన్న పదం కన్నడలో హాలు ఎలా అయ్యింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుగు వర్ణమాలలో వచ్చేస్తున్నాయి (ఆహా..అయితే చూడండి )

తెవికీలో జ్ఞాన గుళికలవేట

పట్టి తెచ్చిన వీరులకు తెవికీ వీరతాళ్ళు, వీరనారీమణులకు గంధపు పూతలు..ఇక కాస్కోండి మరి. చిన్న క్లూ (ప్రశ్నలోనే ఒక పదానికి లింకుంటుంది దాన్ని పట్టుకొని వెళితే గమ్యం చేరతారోచ్)

*తొలకరి వర్షాలు నేలతాకగానే అబ్బా ఏమీ మట్టి వాసన మావూరు గుర్తుకొస్తుందే అనుకుంటాము కదా? మరి ఆ వాసన ఎక్కన్నుండొస్తుందో వెతికి పట్టుకోండి చూద్దాం.

*ఒక మహర్షికి, జింకకు పుట్టినవాడు. ఈయన పేరుమీదుగానే శృంగేరి నగరానికా పేరువచ్చింది. ఎవరీ జింక పుత్రుడు? ఏమా కథ?

మీకు తెలుసా?

* దక్షిణ భారతదేశములోనే అత్యధికంగా వర్షం కురుస్తూ దక్షిణ చిరపుంజిగా పేరుగాంచిన ప్రదేశం ఆగుంబె. ఆర్.కె.నారాయణ్ పుస్తకం ఆధారముగా తీసిన మాల్గుడి డేస్ ఇక్కడే చిత్రీకరించారు. (ఆ ఇల్లు ఫోటో వ్యాసంలో చూడండి)

* అవధానం, ఇది నాకు తెలుసులేవో.. మేడసాని మోహన్ గారిని చూడలేదా అనుకుంటున్నారా, ఈ అవధానం వేరు. మీరే చూడండి.

*ఇటీవల మన క్రికెట్టు వీరుడు టెండుల్కర్ తన సతీమణితో కలిసి ఇక్కడ సర్పదోష నివారణ చేశాడట!!! (కుక్కే సుబ్రమణ్య లో) ఎక్కడుందీ గుడి? ఏమిటీ విశేషం? చదివితే మీకే తెలుస్తుంది.

*భీమునిపట్నం దేశంలోనే రెండవ ప్రాచీన పురపాలక సంఘమని?

* పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు ఓడిపోయాడని? మరి శ్రీనాథుడు నాకు చెప్పలేదే అంటారా?

*ఖడ్గతిక్కన – వెనుక కథ ఏంటి? చారిత్రక సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చూడాల్సిందే.

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.యస్.ఆర్.టి.సి.), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999 లో నమోదైనది.

నా సిఫారుసులు (నాకు నచ్చిన వ్యాసాలు)

రాజా రవివర్మ,

ఆది శంకరాచార్యులు,

విశ్వామిత్రుడు,

రుక్మిణీదేవి అరండేల్,

జోగ్ జలపాతం,

రాచమల్లు రామచంద్రారెడ్డి.

స్వేచ్ఛా గ్రంథాలయమైన వికీసోర్స్ లో ఏం జరుగుతోంది?

* తెలుగు వికీసోర్స్ శరవేగంగా 5000 పుటల దిశగా పరుగులెత్తుతోంది.

* ఆంధ్ర మహాభారతము గుంపు సౌప్తిక పర్వాన్ని తెనుగిస్తున్నారు. మీరూ ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది.

* భగవద్గీత తెలుగు అనువాదం పూర్తయ్యింది !!

* కుమారీ శతకము పూర్తి తాత్పర్యాలతో సహా లభిస్తున్నదిప్పుడు.

*ఇవే కాక వీణె బసవప్ప రాసిన గానవిద్యా వినోదినిని, మొల్ల రామాయణాన్ని మరియు కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞానసర్వస్వాన్ని యూనీకోడీకరిస్తున్నారు. (అంటే ఇవన్నీ ఎత్తిరాసే గొడవల్లేకుండా ఉచితంగా యూనీకోడ్లో పూర్తిగా శోధించే విధంగా త్వరలోనే లభ్యమవుతాయన్నమాట.)

(మరిన్ని విశేషాలు మరోసారి…)

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments