మృతజీవులు – 7

“వాడి సంగతి మీకింకా తెలీదు, వాడు చాకులాంటివాడు. ఇంక రెండోవాడు ఆల్కైడ్స్ అంత చురుకు కాడు. వీడున్నాడే ఒక పురుగుగాని, పక్షిగాని కనిపిస్తే వాలు, వాడి కళ్ళు వాటివెంటే పడతాయి; వాడు వాటి వెంటపడి వాటిని చూస్తాడు. వీణ్ణి రాజ్యతంత్ర శాఖలో చేరుస్తామనుకుంటున్నాను… తెమిస్టోక్లస్, నువు రాయబారిగా పోతావుట్రా?” అని మానిలవ్ కొడుకును అడిగాడు.

తెమిస్టోక్లస్ రొట్టెను నములుతూ తల అటూ ఇటూ ఆడించి, “అవును, పోతాను” అన్నాడు.

కుర్రాడి వెనకాలే నిలబడి ఉన్న నౌకరు సమయానికి రాయబారి ముక్కు తుడవకపోతే సూప్ లో ఏదో పడి అభాసు అయి ఉండేదే. సంభాషణ ప్రశాంత జీవితం మీద నడిచింది. ఇంటి యజమానురాలు మధ్య మధ్య అడ్డొచ్చి పట్నంలో నాటక సమాజం గురించీ, అందులోని నటులను గురించీ వ్యాఖ్యానించింది. పంతులు సంభాషణను అతి శ్రద్ధతో గమనిస్తూ మాట్లాడుతున్నవారిలో ఎవరు నవ్వబోతున్నట్టు తోచినా నోరంతా తెరిచి బలంగా నవ్వేశాడు. ఆయన కృతజ్ఞతా స్వభావం కలవాడై, తన యజమాని ఋణం ఉంచుకోరాదనుకున్నాడేమో. అయితే ఒక్కసారి మటుకు ఆయన మొహాన కోపం తాండవించింది. ఆయన బల్ల మీద గట్టిగా కొట్టి, తన ఎదురుగా ఉన్న పిల్లలను తన చూపులతో గుచ్చాడు. ఆయన తగుసమయంలోనే ఈ పని చేశాడు, ఎందుకంటే తెమిస్టోక్లస్ అప్పుడే ఆల్కైడ్స్ చెవి కొరికాడు. ఆల్కైడ్స్ కళ్లు మూసి, నోరు తెరిచి దీనంగా ఏడవడానికి సిద్ధపడ్డాడు; అయితే అలా చెయ్యడం వలన మిగిలిన తిండికి కాస్తా స్వస్తి చెప్పవలసి వస్తుందేమోనని భయపడి, ఏడిచే ప్రయత్నం మాని, మొహం మామూలుగా పెట్టి, నీళ్ళు తిరిగిన కళ్ళతో ఎముక ఒకటి తీసుకుని, రెండు బుగ్గలూ జిడ్డుతో నిగనిగ లాడేదాకా పళ్ళతో గీకాడు.

“మీరసలు భోజనమే చెయ్యటం లేదు, చాలా కొంచం తింటున్నారు” అని ఇంటావిడ అతిథితో చీటికీమాటికీ అంటూ వచ్చింది. ఆవిడ అలా అన్నప్పుడల్లా చిచీకవ్, “చాలా కృతజ్ఞుణ్ణి. బాగానే తింటున్నాను. సద్గోష్ఠి ముందు ఎంత మంచి వంటకాలూ చాలవు” అంటూ వచ్చాడు.

భోజనాలు ముగించి లేచారు. మానిలవ్ ఆనందానికి మేరలేదు. ఆయన అతిథి వీపు మీద చెయ్యి ఆనించి డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా, ఆ అతిథి తలవని తలంపుగా, మహా గాంభీర్యంగా, తాను మాట్లాడవలసిన విషయం ఒకటి ఉన్నదని ప్రకటించాడు.

“అలా అయితే పఠన మందిరానికి పోదాం, దయచెయ్యండి”, అంటూ మానిలవ్ అతన్ని ఒక చిన్నగదిలోనికి తీసుకుపోయాడు. దాని కిటికీలోంచి దూరాన ఉన్న అడవి నీలంగా కనిపిస్తున్నది.

“ఇది నా గర్భగుడి”, అన్నాడు మానిలవ్.

“చక్కని గది”, అంటూ చిచీకవ్ గదిని కలయజూశాడు. గది ఆకర్షవంతంగా లేకపోలేదు. గోడలకు బూడిదరంగూ, నీలంరంగూ కలిపిన రంగు వేశారు. గదిలో నాలుగు కుర్చీలూ, ఒక వాలుకుర్చీ, ఒక బల్లా, దానిమీద లోగడ చెప్పిన పుస్తకం, గుర్తుతోసహా ఉన్నాయి. అన్నిటికన్న అక్కడ హెచ్చుగా కనిపిస్తున్నది పొగాకు. అది రకరకాల ప్రదేశాలలో -పొట్లాలలోనూ జాడీలోనూ, బల్ల అంతటనూ – కనిపిస్తున్నది. గది కిటికీలు రెంటిలోనూ పొగాకు నుసి, బారులుగా అమర్చిన చిన్న చిన్న కుప్పలుగా ఉన్నది. దాన్ని అలా అమర్చడం ఇంటి యజమానికి సరదా లాగుంది.

“మీరు ఇలా వాలుకుర్చీలో కూచోవాలని నా ప్రార్థన. అందులో మీకు సౌకర్యంగా ఉంటుంది.”, అన్నాడు మానిలవ్.

“క్షమించాలి. నేనిలా కుర్చీలో కూచుంటాను.”

“క్షమించటానికి వీల్లేదు. ఈ వాలుకుర్చీ అతిథుల కోసమే. అంచేత మీకిష్టంలేకపోయినా కూచోవలసిందేనూ!” అన్నాడు మానిలవ్ నవ్వుతూ.

చిచీకవ్ కూచున్నాడు.

“మీకొక పైప్ ఇవ్వమన్నారా?”

“వద్దు, థాంక్స్. నేను పొగతాగను”, అన్నాడు చిచీకవ్ మంచిగానూ, నొచ్చుకుంటున్నట్టుగానూ.

“ఏం?” అన్నాడు మానిలవ్ మంచిగానూ, నొచ్చుకుంటున్నవాడిలాగానూ.

“నాకు అలవాటు లేదు, అదంటే భయం కూడాను. పొగతాగితే ఒళ్ళు ఎండిపోతుందంటారు.”

“తమరు అనుమతిస్తే అది కేవలం అపోహ అంటాను. ఆ మాటకు వస్తే నస్యం సేవించటం కన్న పైప్ కాల్చటం ఒంటికి ఎంతో మంచిదంటాను. మా రెజిమెంటులో ఒక లెఫ్టినెంటు ఉండేవాడు, చాలా మంచివాడూ, సంస్కారీనూ; భోంచేసేటప్పుడే కాదుగదా ఇంకెక్కడ కూడా నోట్లోనుంచి పైపు తీసేవాడు కాదు. ఇప్పుడాయనకు నలభై దాటాయి, అయినా మంచి దృఢంగా ఉనాడు.”

ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుందనీ, ప్రకృతిలో అనేక విషయాలు ఎంతటి మేధావులకూ అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయని చిచీకవ్ అన్నాడు.

“కాని ముందు నేనొక ప్రశ్నడుగుతాను మీ సెలవైతే…” అంటూ అతను వింతగా వినబడే గొంతుతో పలికి, ఎందుకో తనవెనుకవైపు చూసుకున్నడు. మానిలవ్ కూడా ఎందుకో తెలియరాకుండా తన వెనకవైపు చూశాడు. “మీరు జనన మరణ లెక్కలు తీసుకుని ఎంతకాలమయినది?”

“చాలా కాలమయింది. ఎప్పుడు తీసుకున్నామో నాకు జ్ఞాపకం కూడా లేదు.”

“అంటే అటుపిమ్మట మీ కమతగాళ్ళు చాలామంది చనిపోయి ఉండాలిగా?”

“ఆ సంగతయుతే నాకు తెలీదు. మా నిగామానును అడగాలనుకుంటాను. ఒరే, ఆ నిగామానును కేకేసుకురా. ఇవాళ అతను రావలసినరోజే.”

నిగామాను వచ్చాడు. అతనికి సుమారు నలభై ఏళ్ళుంటాయి, గడ్డం ఉంచుకోడు, పొడుగు కోటు వేసుకున్నాడు, సుఖజీవితం గడిపేవాడిలాగా కనిపించాడు, ఎందుకంటే అతని మొహం కొవ్వి ఉబ్బరించి ఉన్నది. అతని పాలిపోయిన శరీరచ్ఛాయ చూస్తే మెత్తని పరుపులూ దిళ్ళూ మరిగినట్టున్నాడు. భూస్వాముల కింద పనిచేసే నిగామానులందరూ ఎలా పైకి వస్తారో ఇతనూ అలాగే వచ్చాడని తెలుస్తున్నది. ఒకప్పుడీ ఇంటనే నౌకరీ కుర్రాడిగా ఉంటూ చదవటమూ రాయటమూ నేర్చుకున్నాడు, తరవాత తమ యజమానురాలికి అభిమాన పాత్రురాలైన ఇంటి దాసీలకు పెద్దదైన ‘అగాష్కనో’ ను పెళ్ళాడి, స్టోరుకీపరై తరవాత నిగామాను అయ్యాడు. నిగామాను అయాక అతను సహజంగా నిగామాను లందరూ ప్రవర్తించినట్టే ప్రవర్తించాడు; గ్రామంలో ఉండే కలవారితో పూసుకు తిరుగుతూ లేనివారి కష్టాలు పెంచాడు; ఉదయం ఎనిమిది దాటాక నిద్రలేచి, సమొవార్ సిద్ధమై టీ తాగేదాకా బయటికి కదిలేవాడు కాడు.

“ఇదుగో చూడవోయ్, కిందటిసారి జననమరణ లెక్కలు తీసుకున్నాక మన కమతగాళ్ళు ఎంతమంది పోయి ఉంటారు?”

“ఎంతమందా? ఓ, చాలామంది పోయారు” అన్నాడు నిగామాను. అతనికి ఎక్కిళ్ళు వస్తూండటం చేత నోటికి చేతిని డాలు లాగా అడ్డం పెట్టుకున్నాడు.

“నేనూ అలాగే అనుకున్నాను మరి. చాలామంది పోయారు”, అన్నాడు మానిలవ్. ఆయన చిచీకవ్ కేసి తిరిగి, “అవును, చాలామంది పోయారు” అన్నాడు.

“మాటవరసకు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది?” అని చిచీకవ్ అడిగాడు.

“అవును, చనిపోయిన వాళ్ళ సరి అయిన సంఖ్య ఎంత?” అన్నాడు మానిలవ్.

“సంఖ్య ఎంతో నాకుమాత్రం ఏం తెలుసూ? చచ్చినవాళ్ళ సంఖ్య చెప్పేందుకు లేదు. ఎవరు లెక్కగట్టారు గనకా?” అన్నాడు నిగామాను.

మానిలవ్ చిచీకవ్ కేసి తిరిగి, “నిజమే, చాలమంది చచ్చారని నేనూ అనుకున్నాను గాని, ఇంతమంది చచ్చారని స్పష్టంగా చెప్పటానికి లేదు”, అన్నాడు.

చిచీకవ్ నిగామానుతో, “అయితే ఇప్పుడు లెక్కపెట్టి, చనిపోయినవా రందరి పేర్లు జాబితావేసి ఇవ్వాలి”, అన్నాడు.

“అవును, ప్రతి ఒక్క పేరూ జాబితాలో చేర్చు”, అన్నాడు మానిలవ్.

“చిత్తం”, అంటూ నిగామాను వెళ్ళిపోయాడు.

—————

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 7

పల్ప్ ఫిక్షన్

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం.

తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ సినీ చరిత్రకు ఒక Breathless లాగా, హాలీవుడ్ సినీ చరిత్రకు ఒక Citizen Kane లాగా ఆధునిక ప్రపంచ సినీ చరిత్ర మొత్తానికి ప్రాతినిధ్యంవహించే ఒక సినిమాను ఎన్నుకోవలిసి వస్తే అది ఖచ్చితంగా Pulp Fiction సినిమానే అవుతుంది.

ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఈ సినిమా నేటికీ ఎంతో మంది విశ్లేషకులచే విశ్లేషింపబడడమే కాకుండా దాదాపు అన్ని film schools లోనూ ఈ సినిమా ఒక పాఠ్యాంశంగా భోధింపబడుతూంది. అంతేకాకుండా, ప్రపంచంలోని దాదాపు అన్ని Top 100 సినిమాల లిస్టుల్లోనూ ఈ సినిమాకు స్థానం కల్పించబడింది. కొంతమంది ఈ సినిమాను Modern Citizen Kane గా కూడా వర్ణించారు. మరో విచిత్రమేమిటంటే ఈ సినిమాకు ఒక cult status కు తీసుకెళ్ళిన అభిమానులు ఎంతమంది వున్నారో, ఈ సినిమాను చెత్త సినిమాగా తీసిపారేసి ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది వున్నారు. Pulp Fiction సినిమాకున్న ప్రత్యేకత అదే! నచ్చిన వాళ్ళకు అతిగా నచ్చేస్తుంది. నచ్చని వాళ్ళు ఘోరంగా ద్వేషిస్తారు. నచ్చినా నచ్చకపోయినా ఒక మాట మాత్రం నిజం; ఇది ప్రపంచ సినీ చరిత్రలోని అత్యంత ప్రాచుర్యం కలిగిన సినిమాలలో ఒకటి.

ప్రపంచంలోని ఎంతో మంది film enthusiasts లో ఒక cult film గా ఈ సినిమా ముద్రపడటానికి కారణాలేంటి అని వెతుక్కుంటూ వెలితే ఒక మహా సముద్రం ఈదినట్టవుతుంది. పొరలు పొరలుగా విడదీసి విశ్లేషించినా కూడా చూసిన ప్రతి సారీ ఎదో ఒక కొత్త విషయాన్ని మన ముందుంచే ఈ సినిమా గురించి కాబోయే దర్శకులే కాదు, సినిమాలంటే కొద్ది పాటి ఆసక్తి కలిగిన వారెవరైనా తప్పక తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

అసలేంటీ సినిమా యొక్క ప్రత్యేకత? మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు వున్న తేడా ఏంటి? ఈ సినిమా ఇంతటి ప్రఖ్యాతి గాంచడానికి కారణం ఏంటి? విడుదలయిన పదమూడు సంవత్సరాల తర్వాత కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి?.. లాంటి విషయాలకు సమాధానాలు అన్వేషిస్తూ ప్రపంచంలోని ఇతర విశ్లేషకుల అభిప్రాయలను తెలియచేస్తూ, తెలుగు సినీ ప్రేమికులకు Pulp Fiction సినిమా గురించి పరిచయం చేయడమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం.

ఏ సినిమానైనా విశ్లేషించే ముందు ఆ సినిమా విడుదలయిన కాలాన్ని పరిగణించి విశ్లేషించాలి. ఉదాహరణకు Godard దర్శకత్వంలో వచ్చిన French New wave నాటి తొలి సినిమాల్లో ఒకటి అయిన Breathless సినిమాను తీసుకుంటే, ఈ సినిమాను విశ్లేషించేటప్పుడు అందులో ప్రత్యేకించి చెప్పుకోవల్సిన అంశాల్లో ఒకటి, జంప్ కట్ అనబడే ఎడిటింగ్ ప్రక్రియ. ప్రతి తెలుగు సినిమాలోనూ అవసరం వున్నా లేకపోయినా జంప్ కట్ ను ఎడాపెడా వాడేస్తున్న ఈ రోజుల్లో జంప్ కట్ గురించి, Godard తన సినిమా Breathless లో ఎడిటింగ్ ద్వారా చేసిన ప్రయోగాల గురించి చెప్తే, అదేమంత పెద్ద విషయమని అనిపించకపోవచ్చు. అందుకు కారణం అది ఇప్పుడు సర్వ సాధారణమైపోవడమే. అలాగే Citizen Kane సినిమా చూస్తున్నప్పుడు అందులో ప్రత్యేకించి మనకెదురయ్యే అంశం, సినిమాటోగ్రాఫర్ వుపయోగించిన deep-focus అనబడే ప్రక్రియ. అంతవరకూ ఏ సినిమాలోను చూడనటువంటి విధంగా, నమ్మశక్యం కాని depth-of-field ను వుపయోగించడం ద్వారా ఒకే ఫ్రేములో ఒకరికంటే ఎక్కువమంది నటులను చూపించగలగడమే కాకుండా వారి వారి భావోద్వేగాలను సైతం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తేగలగడం ద్వారా Citizen Kane సినిమాతో కొత్త శకానికి నాంది పలికాడు Orson Wells. ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే లెన్సులు, కెమెరాల ద్వారా ఈ deep-focus షాట్లు తీయడం చాలా సులభమైపోయింది. కానీ ఇలా తీస్తే ప్రేక్షకుల మనోభావాల్లో కొత్త అనుభూతులు కలుగ చేయొచ్చని దాదాపు 70 ఏళ్ళకు ముందే ఆలోచించిన Orson Wells గొప్పతనం, ఆ రోజుల్లో డీప్-ఫోకస్ లాంటి ప్రక్రియను సృష్టించడం మీదే ఆధారపడి వుందనడంలో సందేహం లేదు.

పైన పేర్కొన్న Breathless, Citizen Kane సినిమాలలాగే Pulp Fiction సినిమాను విశ్లేషిస్తున్నప్పుడు మనకు మొదటగా ఎదురయ్యే విషయం ఈ సినిమాలోని కథనం. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సినీ పరిశ్రమ వ్యక్తి నోటా వినబడుతున్న Non Liner narrative విధానంలో నడుస్తుంది ఈ సినిమా యొక్క కథ.

సాధారణంగా ఈ సినిమా అయినా తీసుకుంటే దానిని మూడు అంకాలుగా చూడవచ్చు. మొదటి అంకంలో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేయడంతో సరిపోతుంది. మొదటి అంకం చివర్లో సినిమాలోని ప్రముఖ పాత్రధారి అయిన నాయకుడు అనుకోని పరిస్థితిని ఎదుర్కొని, అప్పటివరకూ స్థిరంగా వున్న జీవితం అనుకోకుండా కష్టాల కడలిలో చిక్కుకుటుంది. తన జీవితంలో ఏర్పడిన కష్టాలను ఒక్కొక్కటే చేదించుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోకి అడుగడుగునా అడ్డుపడే ఒక ప్రతినాయకుడూ వుంటాడు. రెండో అంకం ముగిసే సరికి తన కష్టాలకు కారణాలు వెతుక్కోవడమే కాకుండా ఏంచేస్తే తన కష్టాలు తీరుతాయో కూడా తెలుసుకుంటాడు నాయకుడు. ఇక మూడో అంకంలోకి వచ్చేసరికి నాయకుడు తన గమ్యం చేరడానికి ఎదురయిన అడ్డంకులన్నీ తొలగించుకోవడంలో మునిగిపోయి సినిమా ముగిసే సరికి తన లక్ష్యం సాధిస్తాడు. ఈ మూడు అంకాల క్రమాన్నే ఇంగ్లీషులో Three-Act Structure అని పిలుస్తారు. మొదటి అంకాన్ని setup అని, రెండో అంకాన్ని conflict అని మూడో అంకాన్ని resolution అనీ పిలుస్తారు. ఈ మూడు అంకాల క్రమంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి కథ మొత్తాన్ని సరళ రీతిలో చెప్పకుండా ఫ్లాష్‌బ్యాక్ లాంటి ప్రక్రియలు వుపయోగించడం ద్వారా సినిమాకు కొత్త రంగులు అద్దాలని చాలా మందే ప్రయత్నాలు చేసారు. కానీ ఇలాంటి ప్రయత్నంలో అత్యంత వున్నతమైన ప్రయోగం చేయడమే కాకుండా ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు Quentin Tarantino.

కథా పరంగా పల్ప్ ఫిక్షన్ గురించి చదవడం కంటే చూడడమే మంచిదని నా అభిప్రాయం. సరళ రీతిలో లేని కథ ఒక ఎత్తయితే ఎటువంటి సంబంధంలేని మూడు కథలు అనుకోని పరిస్థితుల్లో మూడు కథల్లోని పాత్రలు మధ్య సంకర్షణను ఏర్పరుస్తూ వారి మధ్య సంఘర్షణను సృష్టించడం నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో అదే మొదటి సారి. అందుకే ప్రపంచం మొత్తం ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.

దాదాపుగా మనం చూసే అన్ని సినిమాలు ప్రేక్షకుల మెదడుకు పెద్ద పని పెట్టవు. చాలా కొద్ది సినిమాలు మాత్రమే సినిమా చూస్తున్నంత సేపే కాకుండా, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మన మదిలో మెదులుతూనే వుండేలా చేస్తాయి. అలా చేసిన అతి కొద్ది సినిమాల్లో పల్ప్ ఫిక్షన్ ఒక్కటి అని చెప్పొచ్చు. అంతగా మన మేధస్సుకి పని పెట్టే విషయం ఏముంది ఈ సినిమాలో అంటే చెప్పడం కష్టం. విరళ రీతిలో సాగే ఈ కథ మొదటి సారి చూడగానే అన్ని విషయాలు అర్థం కావడం కొంచెం కష్టం.

పల్ప్ ఫిక్షన్ సినిమా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఈ సినిమాలోని వైవిధ్యమైన కథనం. నిజానికి ఈ సినిమాలోని కథ ఒక జిగ్‌సా పజిల్ అని చెప్పొచ్చు. మూడు విభిన్న కథలను ముక్కలు ముక్కలు చేసి మన ముందు విడి విడీ సన్నివేశాలుగా ప్రదర్శించి ప్రేక్షకుడిని సినిమాలో ఒక ముఖ్య భూమిక పోషించేలా చేసి, ఆ ప్రయత్నంలో ప్రేక్షకునికి ఒక అధ్భుత అనుభూతిని అందించడంలో సఫలం అయ్యాడు ఈ చిత్ర దర్శకుడు Quentin Tarantinio. జిగ్‌సా పజిల్ లోని ముక్కల్ని ఒక దగ్గరకు చేర్చి ఏ విధంగా చిత్రాన్ని పరిపూర్ణం చేయగలమో, అలాంటి అవకాశమే ప్రేక్షకులకు అందివ్వడం ద్వారా ప్రేక్షకుడిని కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్ర వహింపచేయడం అనేది అంతకు ముందెప్పుడూ జరగకపోవడం అనేది పల్ప్ ఫిక్షన్ సినిమాను అత్యున్నత శిఖరాలను చేరేలా చేసింది.

పల్ప్ ఫిక్షన్ కంటే ముందే Krzysztof Kieslowski అనే పోలిష్ దర్శకుడు Blind Chance అనే సినిమా ద్వారా Non linear narrative అనే ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, పల్ప్ ఫిక్షన్ సినిమాలో వున్నంత క్లిష్టంగా ఈ సినిమాలోని కథనం వుండదు.

కథనం ఒక్కటే కాదు ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశాలు చాలానే వున్నాయి. అర్థం చేసుకోగలిగితే (ఒక్కోసారి అమెరికన్ హ్యూమర్ అర్థం చేసుకోవడం మనకు కష్టమే), ఈ సినిమాలోని సంభాషణలు ఈ సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు. Bruce Wills, John Travolta, Uma Thurman, Samuel L Jackson లాంటి హాలీవుడ్ దిగ్గజాలను ఒక్క చోట చేర్చడమే కాకుండా వారు పోషించిన పాత్రలచే మాట్లాడించిన సంభాషణలు ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్.

సన్‌టైంస్ పత్రికకు సినిమా రివ్యూలు రాసే ప్రఖ్యాత సినీ విశ్లేషకుడు Roger Ebert చెప్పినట్టు ఈ సినిమా ఒక audio book గా కూడా విని ఆనందిచవచ్చు. సినిమా అనగానే పొయెటిక్ గా వుండే సంభాషణలు, ఒక సంభాషణకు బదులుగా మరో సంభాషణలా కాకుండా దాదాపుగా ప్రతి పాత్రధారి తమ సంభాషణలను ఒక చైతన్య స్రవంతిలా వల్లించడం ఈ సినిమా లోని సంభాషణల యొక్క మరో ప్రత్యేకత.

పల్ప్ ఫిక్షన్ సినిమా చూసిన చాలామంది చేసే మొదటి వాఖ్య సినిమా చాలా హింసాత్మకంగా వుందని. కానీ Quentin Tarantino హింసను చూపించకుండానే సినిమాను హింసాత్మకంగా రూపొందించారన్నది సత్యం. కాకపోతే ఆ విషయం చాలా మంది ప్రేక్షకులు గ్రహించరు. Quentin Tarantino తన మొదటి సినిమా అయిన Reservoir Dogs లో కూడా ఇదే ప్రయోగం చేసారు. Reservoir Dogs కథాపరంగా ఒక బ్యాంకు దోపిడీకి సంబంధించిన కథాంశంతో నడుస్తుంది. కానీ Oceans Eleven సినిమాలోలా దోపిడీ ఎలా చేసారు అన్న కథాంశం కాకుండా, దోపిడి చేసిన తర్వాత దొంగల ముఠా సభ్యుల మధ్య జరిగే సంఘర్షణను కథాంశంగా ఎన్నుకోవడంలోనే Quentin తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరిగా అలాగే Pulp Fiction సినిమాలో కూడా హింసాత్మక సంఘటనలు చూపించకుండానే ప్రేక్షకులు చూసినట్టు ఫీల్ అయ్యేలా చేయడంలో తన పనితనాన్ని చూపెట్టారు.

ఉదాహరణకు, ఈ సినిమాలో కార్లో ఒక వ్యక్తిని కాల్చి పారేసే సన్నివేశం వుంటుంది. కాల్చడం ప్రేక్షకులు అసలు చూడనే చూడరు. కానీ ఆ వ్యక్తిని చంపేసాక రక్తసిక్తమైన దుస్తులతో వున్న హంతకులను, రక్తంతో తడిసి ముద్దయిన కారు సీటు చూపించడం ద్వారా ఆ హింసాత్మక సంఘటను మనం చూసినట్టు మన మదిలో భ్రమింపజేస్తాడు దర్శకుడు. అలాగే మరో సన్నివేశంలో ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గుర్ని కాల్చి చంపుతున్నప్పుడు మనకు కనిపించే దృశ్యం కాల్చే వాళ్ళ మొహాలే కానీ హతమౌతున్న వ్యక్తులు కాదు.

ఇలా చెప్పుకుంటూ పోతే, పల్ప్ ప్జిక్షన్ సినిమాలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. ఉదాహరణకు ఈ సినిమాలోని ఒక కథ మొత్తం ఒక బ్రీఫ్‌కేస్ చుట్టూ తిరుగుతుంది. కానీ సినిమా అంతా అయ్యాక కూడా ‘అసలా బ్రీఫ్‌కేస్ లో ఏముందని అంతమంది కొట్టుకు చస్తారో’ అర్థంకాదు. కొన్ని విషయాలను ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేస్తుంది ఈ సినిమా. ఆ విధంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులభంగా సినిమా కథను రొటీన్ గా చెప్పేయకుండా ప్రేక్షకులు నిశ్చష్టులను కాక, చైతన్యవంతుల్ని చేసి, సినిమాలో ఒక భాగస్వామిని చేసి, తనలోని ప్రేక్షకుడిని డర్శకునిగా గౌరవించాడు Quntin Tarantino.

నిజానికి పల్ప్ ఫిక్షన్ సినిమాలోని కథలు ఈ సినిమా కోసంగా రాసినవి కాదట. ఈ సినిమా తీయాలని ఆలోచన లేని రోజుల్లోనే తన మిత్రుడు (ఇప్పుడు శత్రువు) Roger Avery తో కలిసి రాసుకున్నారట. విడి విడిగా రాసిన కథలను ఒకటిగా చేర్చి ఒక సినిమాగా తీయడం ఒక అద్భుత ప్రయోగం. ఇలాంటి ప్రయోగమే Short cuts అనే సినిమా ద్వారా Robert Altman అమెరికన్ రచయిత అయిన Raymond Carver రచించిన పదికి పైగా కథలను ఎన్నుకుని వాటన్నింటిని ఒక సినిమాగా రూపొందించారు.

మనం ఎంత అరిచి గీపెట్టినా మీడియా చేసే మాయాజాలం ముందు మన నోర్లు మూతబడాల్సిందే. ఈ post modern ఎరాలో మీడియా ఎంత చెప్తే అంత. పల్ప్ ఫిక్షన్ అంతగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణాల్లో మీడియా ఒకటని నా అభిప్రాయం.

వైవిధ్యమైన సినిమాలకు పెద్దపీట వేసి ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే Cannes చిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారం లభించడంతో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఒక వైపు Cannes అవార్డు అందించిన ప్రాచుర్యం, మరో వైపు ఈ సినిమా నచ్చిన వాళ్ళు చేసిన ప్రచారంతో పాటు పత్రికలు మరియు ఇతర మీడియా కల్పించిన ప్రచారం కూడా ఈ సినిమా ఇంతటి జనాకర్షణ పొందడానికి మరో కారణం. ఈ సినిమా సాధించిన విజయం ఎంతో మంది కొత్త తరం దర్శకులను సంప్రదాయక కథన ప్రక్రియలను ఛాలెంజ్ చేసేలా చేసింది. అందుకు సాక్ష్యమే Steven Soderberg రూపొందించిన Traffic, Alexandro Gonzalez రూపొందించిన Amerros Perros, Christopher Nolan రూపొందించిన Momento, Following సినిమాలు.

పల్ప్ ఫిక్షన్ సినిమా కంటే ముందు Quentin Tarantino దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా, Reservoir Dogs కూడా ఈయన దర్శకత్వ ప్రతిభకు ఒక మంచి ఉదాహరణ. ఈ రెండు సినిమాల తర్వాత ఈయన తీసిన Jackie Brown, Kill Bill లాంటి సినిమాలు మాత్రం మొదటి రెండు సినిమాల్లోని వైవిధ్యాన్ని కనబరచలేదంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా Kill Bill హింసను stylistic గా ప్రదర్శించడంలో సఫలం కాగలిగింది కానీ పల్ప్ ఫిక్షన్ అంత గొప్ప సినిమా మాత్రం కాదని చెప్పొచ్చు. ఈ మధ్యనే Death proof అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచాడు Quentin. ఈ సినిమా పల్ప్ ఫిక్షన్ స్థాయిలో వుందో లేదో చూసిన వారెవరైనా చెప్పాలి.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 14 Comments

అక్షర పద్యవిన్యాసాలు

గమనిక: ఈ వ్యాసానికి మూలం ఆచార్య తిరుమల రచించిన “నవ్వుటద్దాలు” పుస్తకంలోని అక్షరాలతో అద్భుతాలు అనే వ్యాసం. ఇక్కడ ఉదహరించిన పద్యాలన్నీ ఆ పుస్తకం నుండి సేకరించినవే.

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

jyothi.bmp

మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటునుండి చూసినా ఒకేలా ఉండే అనులోమ, విలోమ, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎన్నో ఎన్నెన్నో…..

బమ్మెర పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో వృత్యనుప్రాసాలంకారం (ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అవడం) ఉపయోగించి సర్వలఘు కందం రాసి మనలనలరించాడు.

అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

అడిగెద నని = అడుగుదామని

కడువడి = సంకోచించి/సందేహించి

జనున్ = వెళ్ళును

తను = తను

అడిగిన = అడిగితే

మగడు = భర్త

నుడువడని = చెప్పడని

నెడ = మనసు

నుడుగున్ = కంపించగా

వెడవెడ = చిన్న

చిడిముడి = తత్తరపాటుతో

తడబడ = తడబడుతూ

అడుగిడు = (ముందుకు) అడుగేస్తూ

అడుగిడదు = (అంతలోనే) ఆగిపోతూ

జడిమ = మెల్లిగా

నడుగిడు = అడుగువేస్తూ

నెడలన్ = వెళ్ళగా

మొసలికి చిక్కి శ్రీహరి కొఱకై ఆర్తనాదాలు చేయుచున్న గజేంద్రుని రక్షించుటకై వడివడిగా బయలుదేరిన విష్ణువు ననుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యం ఇది. సంగతేమిటో, ఏమయిందో అడుగుదామని అడుగు ముందుకేసి కూడా అడగలేక, తడబడుతున్న అడుగులతో, గుండె దడతో భర్తను అనుసరించింది.

ఇంకో వింత చూద్దామా! ఒకే హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. ‘క’ గుణింతంతో.. “కాకీక కాకికి కోక కాక కేకికా?”- కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?” అని దీనర్ధం. అలాగే న గుణింతంతో ఓ పద్యం:

నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై
నానీ నను నానా నను
నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!

అని లక్షణకారుడు చెబితే మరో తుంటరి నూనె అనే ఒక్క మాటతో గిలిగింతలు పెట్టాడు . ఇలా…”నా నూనె నీ నూనా? నీ నూనె నా నూనా? నా నూనె నీ నూనని నేనన్నానా”

మరి శ్రీశ్రీగారు ఊరకుంటారా. మ,న,స అనే మూడక్షరాలతోనే త్యక్షర కందాన్ని రసవత్తరంగా అందించారు.

మనసాని నిసిని సేమా
మనసా మసి మనిసి మనసు మాసిన సీనా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!

సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనేపదాలతో చమత్కారమందించారు. ఇందులో శ్రీ శ్రీగారు మహాకవిగా కంటె సినిమా కవిగా కనిపిస్తారు.

ఇక ఒక అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి రసజ్ఞుల నలరించారు.

మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!

ఇప్పుడు కొన్ని పద్య చమక్కులు చూద్దాం. ఎటువైపునుండి చదివినా ఒకేలా ఉండడమే కాకుండా అర్థభేదంతో ఉండే అనులోమ-విలోమ పద్యాలు. ఈ పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.

దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!

ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.

సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!

పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.

ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!

ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. (ఈ ప్రక్రియను ఇంగ్లీషులో Palindrome అంటారు)

రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!

పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో క భాషలో ఇలా చమత్కారంగా చెప్పారు.

తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!

ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ” వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” అనే వాక్యం వస్తుంది.

ఇలా ఎందరో కవులు అక్షరాలతో పద్యాలాటలు ఎన్నో ఆడారు. కాని కొందరు ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని ఎద్దేవా చేసారు. అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయడం ఎక్కువే కదా. కాబట్టి వారిని పట్టించుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం.

అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.

మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!

ఈ పద్యానికి అర్థం చూద్దామా.

మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా

చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

అలాగే సంస్కృతంలో ఉన్న ఒక ఏకాక్షర శ్లోకం
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!

ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన
రోః = భయం కల
అర = వేగంగా పరుగెత్తే
రురోః = జింకయైన మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న
ఉరో రరే = వక్షము నందు
రీరారా = లీల నాపాదించునట్టి
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన
ఉః = లక్ష్మి = సీత
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూ శత్రువైన రావణునికి
రిః = నాశం కల్గించినదై
ఆరిరా = చెలికత్తెలను
రా = పొందిన దాయెను

శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.

శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభకు ఒక కవి వస్తే మన తెనాలి రామకృష్ణుడు మేక తోకతో హడలకొట్టిన సంగతి తెలియనిదెవరికి! అది ఇలా ఉంది..

మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక

కాని అదే వికటకవి రాయలవారి కీర్తిని వర్ణిస్తూ అక్షర సౌందర్యంతో గంభీరంగా చెప్పిన ఈ పద్యం.

నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!

నరసింహరాయల కుమారుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి – కరిభిత్ = గజాసుర సంహారియైన శివునిలా, గిరిభిత్కరి = ఇంద్రుని ఏనుగైన ఐరావతంలా, కరిభిద్గిరి =కైలాసంలా, గిరిభిత్ = వజ్రాయుధంలా, కరిభిద్గిరిభిత్తురంగ = శివేంద్రుల వాహనాలైన నంది, ఉచ్చైశ్రవం (తెల్ల గుర్రం) లలా అందంగా తెల్లగా ఉందని భావం.

సరే అయితే కవుల చమత్కారాల అల్లికలు, ఆటలు, వింతలు, విడ్డూరాలు చూసాము కదా. ఇప్పుడు కాళిదాసు పేరు మీద చలామణిలో ఉన్న నోరు తిరగని ఈ పద్యాన్ని చదివి ఎంతవరకు అర్థమైందో చెప్పండి:

షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జ లాంశ్చ మడ్ఖాఖరే
జడ్జ ట్కి ట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనః ఖడ్జోత వీడ్య భ్రమా
వీడ్యాలుడ్ భ్రమ లుట్ప్ర యట్ట్రి యపదా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటే త్ప్రట తట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః !!

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

(ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం సమర్పిస్తున్న వ్యాసం ఇది.)

Posted in వ్యాసం | 14 Comments

మృతజీవులు – 6

“నా భార్యను పరిచయం చేస్తాను. ఇదుగో, వీరే పావెల్ ఇవానొవిచ్” అన్నాడు మానిలవ్ భార్యతో.

చిచీకవ్ ఇప్పుడే ఆ యువతిని చూశాడు, ఆయన మానిలవ్ ముందు వంగి, కాళ్ళు నేలకేసి గౌరవంగా రాస్తున్నప్పుడు ఆమెను గమనించనేలేదు. ఆమె అనాకారి కాదు, అందమైన దుస్తులు ధరించి ఉన్నది. ఆమె వదులుగా ధరించిన తేలికరంగు జరీసిల్కుగౌను ఆమె శరీరానికి చక్కగా అమరింది. ఆమె చేతులు సుకుమారంగా ఉన్నాయి. ఆమె చేతిలో ఉన్నదేదో చప్పున బల్లమీద పడేసి, మూలల ఎంబ్రాయిడరు చేసిన కేంబ్రిక్ చేతిరుమాలును గుప్పిట్లో గట్టిగా పట్టుకున్నది. ఆమె తాను కూచుని ఉన్న సోఫా నుంచి లేచింది. చిచీకవ్ ఆమె చేతిని మనస్ఫూర్తిగానే ముద్దు పెట్టుకున్నాడు. మానిలవ్ సతి కొంచెం తొస్సుగా మాట్లాడుతూ, అతనిరాక తమకు ఆనందం కలిగించిందనీ, తన భర్త ప్రతిరోజూ అతని గురించే మాట్లాడతాడనీ అన్నది.

“అవును, ఆవిడ అస్తమానమూ, ‘మీ స్నేహితుడు రారేం?’ అని అడుగుతుంది. ‘వస్తారు, కొంచెం ఓపిక పట్టవోయ్,’ అన్నాను. ఇంకేం మీరు మాపై దయతో రానేవచ్చారు. మీ రాక మాకు నిజంగా ఎంతో గొప్ప సంగతి…పర్వదినం…హృదయానికి వేడుక”, అన్నాడు మానిలవ్.

వ్యవహారం హృదయం వేడుకదాకా వచ్చిందనేసరికి చిచీకవ్ కొంచెం తికమకపడి, తాను పేరు ప్రఖ్యాతులు కలవాణ్ణి కాననేశాడు.

మానిలవ్ ముచ్చటగా చిరునవ్వు నవ్వుతూ, “మీకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి కూడాను”, అన్నాడు.

“మా పట్నం ఎలా ఉన్నది? మీకిక్కడ సౌఖ్యంగా ఉన్నదా?” అని మానిలవ్ సతి అడిగింది.

“చాలా మంచి పట్నం, అందమైన పట్నం. నాకు చక్కగా కాలం గడుస్తున్నది, మంచి సాంగత్యం”, అని చిచీకవ్ జవాబు చెప్పాడు.

“మా గవర్నరు గారి గురించి మీ అభిప్రాయ మేమిటి?” అని మానిలవ్ సతి మళ్ళీ అడిగింది.

“ఆయన నిజంగా చాలా ఘనత గల మనిషి, సరదా అయిన వాడు కాదూ?” అన్నాడు మానిలవ్.

“అక్షరాలా నిజం. ఆయన చాలా గొప్పవాడు. తన బాధ్యతలను సమగ్రంగా గ్రహించగలడు, వాటిని ఎంత క్షుణ్ణంగా నిర్వర్తించగలడు! అలాటి మనుషులింకా ఉంటే ఎంత బాగుండును!” అన్నాడు చిచీకవ్.

“అన్ని రకాల వారికీ ఆతిథ్యం ఇవ్వడం ఆయనకెంత బాగా తెలుసో, చూశారా, ఆయన ప్రవర్తనలో ఏమి నాజూకు!” అని మానిలవ్ ఆనందం వ్యక్తం చేస్తూ, చెవులవెనక నిమిరితే పిల్లి పారవశ్యంతో కళ్ళు మూసుకున్నట్టుగా తన కళ్ళను దాదాపు మూసుకున్నాడు.

“అమిత మర్యాదస్తుడూ, వాంఛనీయుడూను. ఆయన తెలివి ఏమిటని! ఆయన ఆ ఎంబ్రాయిడరీలన్నీ ఎలా చేస్తారో నాకు బోధపడకుండా ఉంది. ఆయన చేసినది ఒక సంచీ చూపారు. ఎంతోమంది స్త్రీలు కూడా అంతబాగా ఎంబ్రాయిడరు చెయ్యలేరని తోస్తుంది,” అన్నాడు చిచీకవ్.

“డిప్టీ గవర్నరో? చాలా సరదా అయినవాడు కాదూ?” అన్నాడు మానిలవ్, మళ్ళీ కళ్ళు సగం మూస్తూ.

“బహు యోగ్యుడు, బహు యోగ్యుడు!” అన్నాడు చిచీకవ్.

“అవునుగానీ, ఇది చెప్పండి, పోలీసు అధిపతిని గురించి మీ అభిప్రాయమేమిటి?”

“మంచి రంజకత్వం కలవాడు. పైన, ఎంత తెలివి! ఎంత చదివిన వాడు! మేము పబ్లిక్ ప్రాసిక్యూటరుతోనూ, న్యాయస్థానాధ్యక్షుడి తోనూ కలిసి కోడి కూసినదాకా చీట్లాడాం!”

“పోలీసు అధిపతి భార్యగారి గురించి మీ అభిప్రాయమేమిటి?చాలా మంచి మనిషి కాదూ?” అన్నది మానిలవ్ భార్య.

ఆహ అలాంటి యోగ్యురాలిని నేనెన్నడు ఎరగను,” అన్నాడు చిచీకవ్.

ఆ తరువాత వారు న్యాయస్థానాధ్యక్షుణ్ణి గురించీ, పోస్టుమాస్టరును గురించీ మాట్లాడుకున్నారు. అటు పిమ్మట పట్నంలో ఉన్న ప్రతిఒక్క అధికారిని గురించీ మాట్లాడుకున్నారు. అందరికి అందరూ బహు దొడ్డ మనుషులే.

“మీ కాలమంతా పల్లెపట్టునే గడుపుతారా?” అని చిచీకవ్ తనవంతుగా ప్రశ్నించ సాహసించాడు.

“ఎక్కువ భాగం అంటే.” అన్నాడు మానిలవ్. “ఎప్పుడన్నా పట్నం పోతాం. అది కూడా నాగరిక సాంగత్యం కోసమే. అస్తమానం ఇక్కడే ఉంటే బొత్తిగా బూజు పట్టిపోతాం.”

“అవును నిజం. అవును నిజం” అన్నాడు చిచీకవ్.

“మాకు సంస్కారం గల పొరుగే ఉంటే ఈ చిక్కు లేకపోను. గొప్ప గొప్ప విషయాలను గురించి కొంతవరకు మాట్లాడటానికీ, ఆత్మను చైతన్యవంతం చేసే విషయాలు చర్చించటానికీ ఎవరైనా ఉంటే, ఒక విధంగా ఉత్తేజకరంగా ఉంటుంది మరి…” అన్నాడు మానిలవ్.

ఆయన ఈ ధోరణిలో ఇంకెంతసేపు మాట్లాడేవాడో గాని, తాను అసలు విషయం వదలి పెడగా వెళ్ళినట్లు అనిపించే సరికి, చేతి వేళ్ళు ఆడించి, “అలాంటి పరిస్థితులలో గ్రామ జీవితమూ, ఏకాంతవాసమూ ఆహ్లాదకరంగానే ఉంటాయి మరి. అయితే ఒక్కరయినా లేరు… ఒక్కొక్కప్పుడు ‘దేశమాత కన్నబిడ్డ’ చదవటం తప్ప చేసేది ఉండదు”, అన్నాడు.

చిచీకవ్ ఈ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ, ఏకాంతంగా జీవించడమూ, ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించటమూ, గ్రంథపఠనమూ కంటే వాంఛనీయం మరొకటి లేదన్నాడు.

“అవుననుకోండి. కాని మన భావాలు పంచుకోవడానికి తగిన మిత్రులెవరూ లేకపోతే…” అన్నాడు మానిలవ్.

“అందుకేమీ సందేహం లేదు, ఎంతమాత్రమూ లేదు”, అంటూ చిచీకవ్ అడ్డొచ్చి, “ప్రపంచంలో ఉన్న నిక్షేపాలేమిటి? జ్ఞానులు చెప్పినట్టు, డబ్బు కాదు, సజ్జన సాంగత్యం”, అన్నాడు.

“అన్నట్టు, పావెల్ ఇవానొవిచ్”, అని మానిలవ్ ప్రారంభించాడు. ఆయన ముఖభంగిమ కేవలం తియ్యగా ఉండటంతో చాలక, రోగిని తృప్తిపరచడానికి వైద్యుడు చక్కెరపాకం చేసే ఔషధం లాగా అయిపోయింది. “అప్పుడు మనిషికి నిజమైన ఆధ్యాత్మికానందం కలుగుతుంది… ఇప్పుడు ఈ ఉదాహరణ చూడరాదా? నేను మీతో ప్రసంగించి, దివ్యమైన మీ సంభాషణ వినే మహత్తర అవకాశం, మహద్భాగ్యం కూడా అనవచ్చు…”

“ఇంకా నయం! నా సంభాషణే చెప్పారూ? నేను కేవలం అనామకుణ్ణి తప్ప మరొకటి కాదు” అన్నాడు చిచీకవ్.

“పావెల్ ఇవానొవిచ్, నేను యదార్థం చెబుతున్నాను. మీ గుణగణాలలో ఏ కొంచం నాకు అబ్బినా నా ఆస్తిలో సగం ఇచ్చుకుంటాను!”

“మీరలా అంటున్నారు గాని, నామటుకు నేను అన్నిటికన్న కోరేదేమిటంటే…”

ఈ పరస్పరారాధన ఇలా ఎంత దూరం వెళ్ళేదో తెలీదు, నౌకరు వచ్చి భోజనం సిద్ధమయిందని చెప్పాడు.

“భోజనానికి లేవండి. మీరు గొప్ప పట్టణాలలో గొప్ప స్థలాలలో విందులు చేసిన వారు, మీకు మా భోజనం నచ్చకపోతే క్షమించాలి; మేం తాగేది కాబేజి సూపే అయినా దాన్ని ఆప్యాయంగా ఇస్తాం. దయచేసి లోపలికి పదండి.” అన్నాడు మానిలవ్.

ఎవరు ముందు వెళ్ళాలన్న విషయమై మళ్ళీ కాస్సేపు ఘర్షణ పడ్డాక చిచీకవ్ అడ్డంగా భోజనశాలలో ప్రవేశించాడు.

భోజనాల గదిలో అదివరకే ఇద్దరు పిల్లలున్నారు, వారు మానిలవ్ కొడుకులు. వాళ్ళకు బల్ల దగ్గర కూచుని తినదగిన ఈడు వచ్చినా ఎత్తుకుర్చీల మీద కూచోవలసిన అవసరం తప్పలేదు. వారి వెంట వారికి చదువు చెప్పే పంతులు కూడా ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ మర్యాదగా వంగాడు. ఇంటి యజమానురాలు సూప్ ముందు పెట్టుకు కూచున్నది. అతిథిని భార్యాభర్తల మధ్య కూచోబెట్టారు, ఒక నౌకరు పిల్లల మెడకు నాప్కిన్లు కట్టాడు.

చిచీకవ్ పిల్లల కేసి చూస్తూ, “ఎంత ముచ్చటైన పిల్లలు! వీళ్ళ వయసెంత?”, అన్నాడు.

“పెద్దవాడికి ఎనిమిదేళ్ళు, రెండోవాడికి నిన్ననే ఆరు నిండాయి”, అన్నది మానిలవ్ సతి.

నౌకరు చూడక గడ్డం మీదగా కట్టిన నాప్కిన్ నుంచి గడ్డాన్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తన పెద్దకొడుకును మానిలవ్, “తెమిస్టోక్లస్” అని సంబోధించాడు. ఇలాటి గ్రీస్ నామధేయం – తెమిస్టోక్లిస్ అని ఉండవలసినదాన్ని మానిలవ్ తెమిస్టోక్లస్ గా మార్చాడు – చెవిని బడగానే చిచీకవ్ కనుబొమలు ఆశ్చర్యంతో పైకెత్తి వెంటనే మామూలు మొహం పెట్టటానికి ప్రయత్నించాడు.

“తెమిస్టోక్లస్! ఫ్రాన్సు దేశంలోకెల్లా అందమైన దేశం ఏది?”

ఈ ప్రశ్న వినగానే పంతులు తన శ్రద్ధనంతా తెమిస్టోక్లస్ పై కేంద్రీకరించి వాడి మొహంలోకి దూకబోయేవాడిలాగా కనిపించాడు, కాని తెమిస్టోక్లస్ “పారిస్” అని సమాధానం చెప్పినాక తృప్తిపడి తల ఆడించాడు.

“మన దేశంలోకల్లా అందమైన నగరం ఏది?” అని మానిలవ్ మళ్లీ అడిగాడు.

“పీటర్స్ బర్గు” అని తెమిస్టోక్లస్ సమాధానమిచ్చాడు.

“ఇంకేదైనా ఉన్నదా?”

“మాస్కో” అన్నాడు తెమిస్టోక్లస్.

“చురుకైనవాడు, చిట్టితండ్రి!” అన్నాడు చిచీకవ్. అతను మానిలవ్ దంపతులకేసి తిరిగి, ఆశ్చర్యం అభినయిస్తూ, “ఈ ఈడుకే ఈ విషయాలన్నీ తెలుసునే! ఈ కుర్రవాడు పైకి వస్తాడు, చూస్తూండండి” అన్నాడు.
—————

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 6

తెవికీ విశేషాలు

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]
గత నెలలో తెవికీ
తెలుగు వికీపీడియా మొదటిపేజీ రూపు కొంత ఆధునీకరించి కొత్త తరహా మార్గదర్శిని ప్రవేశపెట్టాము. మొదటిపేజీలోని యాదృచ్ఛిక పేజీని నొక్కి ఒక 20 సార్ల తర్వాతైనా కండపుష్టి ఉన్న వ్యాసం వస్తుందేమో అని ప్రార్థించే బదులు ఇప్పుడు ఈ మార్గదర్శినిలోని లింకులను పట్టుకొని విస్తృతమైన సమాచారం కల వివిధ వ్యాసాలలో విహరించవచ్చు.

కొత్తగా ఈ వారపు బొమ్మ అనే శీర్షిక ప్రారంభమయ్యింది. తెలుగు వికీలోని మంచి మంచి బొమ్మలను ఎంపిక చేసి ఈ శీర్షికలో ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య మొదటి పేజీలలో వారం వారం ప్రదర్శిస్తున్న వ్యాసాలను బట్టి తెలుగు వికీపీడియా రాశిలోనే కాక వాసిలో కూడా మెరుగవుతున్నదని మీరు గమనించి ఉండవచ్చు. మీరింత వరకూ ఈ వారం వ్యాసాలను చూచి ఉండకపోతే.. గత నెలలో ఈ వారపు వ్యాసాలుగా ప్రదర్శించబడినవి ఇవి: మంగళగిరి, ఖొరాన్, తోలుబొమ్మలాట, భారత జాతీయపతాకం. వికీ వ్యాసాల నాణ్యతను పెంచటానికి తెలుగు వికీలో అచ్చుతప్పులు దిద్దటానికి, భాషను మెరుగుపరచటానికి ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేయటం జరిగింది. మీరూ ఒకటి, రెండు వ్యాసాలను ప్రూఫురీడు చేసి తోడ్పడండి. వ్యాసాలు చదివి తగు సూచనలు చేసినా మాకు ఆనందమే.

తెవికీలో జ్ఞాన గుళికలవేట
*మనదేశంలో కూడా ఒకప్పుడు పొద్దు పొదుపు సమయం (డే లైట్ సేవింగ్ టైం) ప్రవేశ పెట్టారంట! ఎందుకు? ఎప్పుడు?? (భారత ప్రామాణిక కాలమానం)
*భారతదేశ జాతీయ పతాక రూపకర్త పత్తి వెంకయ్య..కాదు కాదు పింగళి వెంకయ్య అంటారా మరీ ఈ పత్తి ఏమిటి ఆయనకా పేరు ఎందుకొచ్చిందంటారూ?
*జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.. వాతాపి ఏంటో? ఎవరో చెప్పుకోండి చూద్దాం.

మీకు తెలుసా?
*భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్న గుహలు కర్నూలు జిల్లాలోని బెలూం గుహలు అని
* లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు కొంగర జగ్గయ్య అని
*చిరంజీవులు ఏడుగురు అని? (సప్త చిరంజీవులు)
*గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని ఎందుకు చెబుతారో? (బొప్పాయి)
*మనం ఆవురావురుమని తినే ఇడ్లీని బహుశా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్నామని?

బహు భాషా నిఘంటువు – విక్షనరీ
బహు భాషా నిఘంటువైన విక్షనరీలో ఇప్పుడు 20 వేలకు పైగా పదాలున్నాయి. పబ్లిక్ డొమెయిన్లో దొరుకుతున్న మిగిలిన నిఘంటువులను కూడా చేర్చే ప్రయత్నం త్వరలోనే చేస్తున్నాం. అప్పుడు మీరు బ్రౌణ్యంలో ఏమని ఉంది? వేమూరిగారు దీనికి తెలుగులో ఏం అర్ధం చెప్పారు, అసలీ పదం గురించి శంకరనారాయణ గారు ఏమంటారు అని నాలుగుచోట్ల తిరిగి వెతకాల్సిన పని లేకుండా, ఎంచక్కా తెలుగు విక్షనరీలో శోధిస్తే చాలు మీకు వివిధ నిఘంటువుల్లో ఆ పదానికి ఏ అర్ధాలు ఇచ్చారో సందర్భ సహితంగా మీకు తెలియజేస్తుంది. అసలు విక్షనరీ యొక్క అసలు మజా వీటిన్నింటికీ మాండలిక పదాలు, వాటిని ఏ ఏ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు అన్న మరెన్నో విశేషాలు చేర్చిన తర్వాత వస్తుంది. ఇది ఒక మహా యజ్ఞము. మీరూ ఒక పట్టు పట్టాలి. తెలుగు వారికి తెలుగులో సరైన నిఘంటువులు లేవు అని తోసివెయ్యటం అలవాటయ్యింది. నిఘంటువులు ఉన్నాయి. అన్నీ అంతర్జాలంలో అందుబాటులో లేకపోవచ్చు. గూగుల్ బుక్స్ లో, మిలియన్ బుక్స్ ప్రాజెక్టులో మంచి వనరులున్నా అవి తెలుగులో శోధించగలిగే పద్ధతిలో లేవు. ఇలాంటి సమస్యలన్నింటినీ కొంత వరకైనా అధిగమించటానికే తెలుగు విక్షనరీ. పైపెచ్చు ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా వాడుకోవచ్చు..కాపీ కొట్టవచ్చు.

తెలుగు విక్షనరీలో ఆంగ్ల పదాలెందుకున్నాయి? అని చాలా మందికి అనుమానం రావచ్చు. విక్షనరీ కేవలం తెలుగు – తెలుగు నిఘంటువే కాదు. బహు భాషా నిఘంటువు. దీన్లో సూత్ర ప్రాయంగా అన్ని భాషాల పదాలకు తెలుగులో అర్ధము మరియు వివరణ ఉంటుంది. కానీ తెలుగు విక్షనరీకి ప్రస్తుతమున్న వనరుల పరిమితి దృష్ట్యా తెలుగు-తెలుగు, ఆంగ్ల-తెలుగు పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కానీ ఎవరైనా తమిళ, కన్నడ, హిందీ, సంస్కృతం వంటి ఇతర భాషా పదాలకు కూడా తెలుగు అర్ధములు, వివరణ చేర్చగలిగేట్టైతే వారికిదే సభాముఖంగా మా ఆహ్వానము.

సంఖ్యానుగుణ వ్యాసాలు:
ఈ వ్యాస పరంపర మొదలై చాలా రోజులైనా ఈ మధ్యన మరలా పుంజుకుంటున్నది. ఒక్కొక్క సంఖ్యకు సంబంధించిన వ్యాసాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకు మూడు సంఖ్యతో త్రిభుజి, త్రిమూర్తులు, త్రికరణాలు వగైరా

ఇలా వివిధ సంఖ్యలతో 170కి పైగా వ్యాసాలున్నాయి. రవ్వా శ్రీహరి గారి సంకేత పదకోశము యొక్క వికీ తోబుట్టవులే ఈ వ్యాసాలు. కానీ సంకేత పదకోశంలా చెప్పి వదిలెయ్యకుండా వాటి గురించి వివరంగా రాయటమే వికీలో ప్రత్యేకత.
మచ్చుకు కొన్ని: షోడశ సంస్కారాలు, షణ్ముఖుడు, అష్టదిగ్గజములు, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. పూర్తి జాబితా

నా సిఫారుసులు
చార్లీ చాప్లిన్, నక్సలైటు, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము, రవీంద్రనాధ టాగూరు, రాజమండ్రి, శకుంతల

మీ సహకారం

తలా ఒక చెయ్యేసి ఈ క్రింది వ్యాసాలు తెలుగులోకి అనువదించి తెలుగు వికీకి తోడ్పడదాం రండి
చదరంగం (ఆట), జపాన్, టిప్పు సుల్తాన్, తొమ్మిది, ఇళయరాజా

రవి వైజాసత్య(http://saintpal.awardspace.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

Posted in జాలవీక్షణం | Tagged | 2 Comments

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు. మానవ ప్రస్థానంపై రోహిణీప్రసాదు గారు రాసిన వ్యాసాన్ని అతిథి శీర్షికన అందిస్తున్నాం.

—————–

ప్రాణులన్నీ ఒకే కుదుటినుంచి పుట్టాయని మనకు తెలుసు. వీటిలో మనను ఏమాత్రమూ పోలనివీ, మనతో కొంత పోల్చదగినవీ, మనకు దగ్గర బంధువులనిపించే వానరాలూ ఇలా అనేకం ఉన్నాయి. ప్రపంచంలో 300 కోట్ల ఏళ్ళ క్రితమే మొదట ఏకకణజీవులు పుట్టాయనీ, ఆ తరవాత 53 కోట్ల ఏళ్ళ క్రితం వరకూ బహుకణజీవులే ఆవిర్భవించలేదనీ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏవో భౌతిక కారణాల వల్ల పెద్దపెట్టున బహుకణజీవులు పుట్టుకురావడం మొదలుపెట్టాక మొదటగా జలచరాలూ, తరవాత ఉభయచరాలూ ఆవిర్భవించాయనీ రాక్షసిబల్లులకు ముందూ, తరవాతా చిత్ర విచిత్రమైన ఆకారాల్లో వివిధ జాతులు భూమి మీద తిరిగాయనీ సాక్ష్యాలు లభించాయి. కాలవ్యవధిలో ఈ తేడాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిర్జీవమైన భూతలం మీద మొదటి వంద కోటి సంవత్సరాల దాకా జీవకణాలే పుట్టలేదు. ఆ తరవాత ఎంతో కాలంపాటు ఏకకణ జీవులే ఉండేవి. 53 కోట్ల సంవత్సరాల కిందట రకరకాల బహుకణప్రాణులు ఆవిర్భవించిన నాటికి భూమీ, సూర్యుడూ పుట్టి 400 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ప్రాణుల్లో వెన్నెముక కలిగినవి కొన్ని మాత్రమే ఉండేవి. వాటిలో కొన్ని నీటినుంచి పొడి నేల మీదికి పాకటం, సరీసృపాలూ, క్షీరదాలూ అంటూ తేడాలు ఏర్పడటం, క్షీరదాల్లో ప్రైమేట్‌ జాతి ఆవిర్భవించి అందులో నుంచి మనుషులు పుట్టుకు రావడం, ఇవన్నీ ప్రకృతిలో సహజంగా జరుగుతూ వచ్చిన మార్పులననుసరించి జరిగిన పరిణామాలు. ఈ లెక్కన చూస్తే మనిషి ఆవిర్భావం “ఇటీవలనే” జరిగినట్టు అనుకోవాలి.

మనిషి ఆవిర్భావం జరగడమే యాదృచ్ఛికం. ఆరున్నర కోట్ల ఏళ్ళ క్రితం పెద్ద ఉల్కవంటిదేదో భూమిమీద వచ్చిపడగా రాక్షసిబల్లుల ప్రాబల్యం తగ్గిందనీ, క్షీరదాల ప్రాచుర్యం పెరిగిందనీ తెలుస్తోంది. పాలిచ్చి పిల్లలని పెంచే క్షీరదాల్లో ఎన్నెన్నో రకాలు తలెత్తాక చెట్లను అంటిపెట్టుకుని, తక్కిన ఇంద్రియాలతో పోలిస్తే కళ్ళమీదనే ఎక్కువగా ఆధారపడి బతికే మర్కట జాతులు ఆవిర్భవించాయి. జీవపరిణామ దశల్లో వీటి తరవాత మనిషిజాతికి దగ్గరగా ఉండేవి వాలిడి కోతులు. కోతుల గుంపులు సామాన్యంగా పోట్లాడుకుంటూ, సంఘర్షణకు లోనవుతాయి. హోమినాయిడ్‌ జాతి ప్రాణులు అలా కాకుండా పరస్పరం సహాయం చేసుకుంటూ, సముదాయాలుగా జీవించసాగాయి. వాటి దేహాలు బలిష్ఠంగా, చేతులు కాళ్ళకన్నా పొడుగ్గా, సున్నితమైన పనులు చెయ్యగలిగినవిగా రూపొందసాగాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మార్పులవల్ల మెదడులో కలిగిన అభివృద్ధి. ఈనాటికీ చింపాంజీలూ, గొరిల్లాలూ ప్రవర్తనలో కోతుల కంటే మనుషులకు దగ్గరగా అనిపిస్తాయి. ఇవి కోతుల్లాగా శాకాహారానికి పరిమితం కావు. భాష లేకపోయినా రకరకాల శబ్దాలతో సంకేతాలు పంపగలవు.

మనకూ, కోతులకూ, తోకలులేని గొరిల్లాలవంటి వాలిడి కోతుల పుట్టుకకు దారితీసిన ఆంత్రోపాయిడ్‌ ప్రైమేట్‌లు సుమారు 5 కోట్ల సంవత్సరాల కిందట తమ శారీరక లక్షణాల్లో ప్రత్యేకత సంతరించుకున్నాయి. చెట్లమీదనే జీవించే ఈ క్షీరదాలు తక్కినవాటికి భిన్నంగా, మెరుగైన చూపునూ, లాఘవంగా కదలగలిగిన అవయవాలనూ సాధించుకున్నాయి. వీటన్నిటికీ సంబంధించిన మెదడు భాగాలుకూడా అభివృద్ధి అవుతూవచ్చాయి. కొన్ని పరిస్థితుల్లో తప్ప ఈ లక్షణాలు మారవలసిన అవసరం ఏర్పడకపోవడంతో రకరకాల కోతులూ, వానరాలూ తామున్న స్థితిలోనే విజయవంతంగా కొనసాగాయి. ప్రతికూల వాతావరణమో, మరొక ఒత్తిడో ఎదురైనప్పుడే జీవ పరిణామానికి ప్రేరణ కలుగుతుంది. అటువంటి కారణాలవల్ల కోతులకు భిన్నమైన హోమినాయిడ్‌ జాతి 25-50 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది.

కోతులూ, వానరాల్లో ముక్కు కింది వైపుకు వంగి ఉండే ఒక జాతి ఏర్పడింది. వాసనపై తక్కువగా ఆధారపడిన ఈ జాతి నిశ్చయంగా మానవుల పుట్టుకకు కారణమైంది. ఈ ప్రాణుల శరీరభాగాల శిలాజాలు దొరికాయి. ఈ ఫాసిల్‌ శకలాలని బట్టి చూస్తే నరవానర (ఏప్‌), మనిషి లక్షణాలు రెండూ ఉన్నట్టు అనిపిస్తోంది. వారి చర్మం ఏ రంగులో ఉండేదో, ఎన్ని వెంట్రుకలు ఉండేవో, ఆహార సేకరణ ఎలా జరిగేదో, సము దాయాలు ఎలా బతికేవో వగైరా వివరాలు తెలియవు కాని ఈనాడు కనబడే చింపాంజీల వంటివాటిని గమనించి శాస్త్రవేత్తలు అనేక విషయాలు ఊహించగలుగుతున్నారు. ముఖాల ఆకారంలోనూ, ప్రవర్తనలోనూ, మెదడు పరిణామంలోనూ, ఒంటిమీద రోమాల విషయంలోనూ వారు చింపాంజీలను పోలి ఉండవచ్చు.

జన్యుపరంగా చింపాంజీలకూ, మనకీ 98.5 శాతం పోలికలున్నాయి. దీనర్థం మనకవి పూర్వీకులని కాదు. ఈ రెండు జాతులూ ఒకే కుదుటినుంచి పుట్టాయని. చింపాంజీలతో పోలిస్తే ఒరాంగుటాన్‌లు మనకు కాస్త దూరపు బంధువులే. ఇవన్నీ మనలాగే సముదాయాలుగా, గుంపులుగా, ఒకదాని కొకటి సహకరిస్తూ బతికే జీవులు. తక్కిన జంతువుల కన్నా తెలివైనవి. మెదడూ, నాడీమండలమూ అభివృద్ధి అయిన లక్షణాలు కలిగినవి. ఈ వాలిడికోతులు మునుపు ఎప్పుడో ఒక శాఖగా చీలిపోయి, మనుషులు సాధించిన జీవపరిణామాన్ని అందుకోలేకపోయాయి. జీవపరిణామం అనేది అప్పుడెప్పుడో జరిగి ఆగిపోయిందా? ఈనాడు కోతులు వాలిడికోతులుగానూ, వాలిడికోతులు మనుషులుగానూ మారటం లేదేం? అని కొందరికి అనుమానాలు కలుగుతాయి. ఒక్కొక్క జీవావరణం, లేక బయోస్ఫియర్‌లో తమ లక్షణాలను మార్చుకోకుండా బతకగలిగిన ప్రాణులు యథాస్థితిలో కొనసాగుతూ ఉంటాయి. అందుచేతనే మనకు దగ్గరివీ, కానివీ అనిపించే రకరకాల జంతువులు ఈనాటికీ కనిపిస్తూనే ఉంటాయి.

సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవజాతికి పూర్వీకులనదగిన ప్రాణులు నరవానరాలవంటి జంతువుల నుంచి వేరుపడ్డట్టు తెలుస్తోంది. రెండు కాళ్ళతో నడవడం, చేతులతో ఇతర పనులు చేసుకోవడం, రకరకాల ఆహారం తినడం, లైంగిక కార్యకలాపాలకు కేవలం వాసనలపైన కాకుండా మెదడూ, సామాజిక నియంత్రణలపై ఆధారపడడం మొదలైనవి మానవుల పూర్వీకుల లక్షణాలు. తొలిరోజుల్లో వీటిలో అనేక జాతులు ఏర్పడ్డాయి. వీటిలో అతి ప్రాచీనమైన ఆస్ట్రలో పితెకస్‌ జాతికి చెందినవి తూర్పు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి. అప్పటి ప్రాణుల ఎముకలూ, అవి, లేదా వారు తయారు చేసుకున్న పనిముట్లే అందుకు దాఖలాలు. 40 లక్షల సంవత్సరాలకు మునుపే ఈ ప్రాణులు మనలాగా కాస్త నిటారుగా నిలబడి రెండుకాళ్ళ మీద నడిచేవి.

image1.JPG

నిటారుగా నిలవడంలో మానవజాతి పరిణామం

ఇందుకు అవసరమైన శారీరక మార్పులు జరిగాయి. కటి ఎముక వాలిడికోతులకన్నా పొట్టిగా, వెడల్పుగా తయారైంది. అందువల్ల జఘనభాగపు కండరాలు నడుస్తున్న శరీరాన్ని అదుపులో ఉంచగలిగాయి. కటి భాగం గిన్నెలాగా ఉండడంతో నిటారుగా నిలుచున్నప్పుడు కడుపు లోపలి భాగాలకు తగిన ఆధారం ఏర్పడింది. నడుముకు కింద కాళ్ళు లోపలి వైపుకు వంపు తిరిగాయి. ఇందువల్ల నిలువుగా నడుస్తున్నప్పుడు మోకాళ్ళు తగిన ఆధారాన్నిస్తాయి. చింపాంజీలవంటి వాలిడికోతులకు నడుము నుంచి కాళ్ళు తిన్నగా దిగుతాయి. అందుచేత అవి రెండు కాళ్ళ మీద నడిచినప్పుడు శరీరం పక్కలకు ఊగుతుంది. ఆస్ట్రలో పితెకస్‌ జాతివారికి కాలి వేళ్ళు పొట్టివిగా తయారై, నడిచేటప్పుడు నేలను వెనక్కి నెట్టడానికి పనికొచ్చాయి. ఇదంతా నడవగా, నడవగా కండరాలు పెరిగినట్టుగా జరగలేదు. ఒక్కొక్క తరంలోనూ యాదృచ్ఛికంగా జరిగిన ఈ రకమైన జన్యు పరిణామాలు బలపడేందుకు ఆస్కారం క్రమంగా పెరిగింది.

ప్రాచీనయుగంలో ఆస్ట్రలో పితెకస్‌ జాతి తక్కిన నరవానరాలనుంచి వేరు పడటానికి పర్యావరణంలో కలిగిన మార్పులే ముఖ్యకారణమని ఊహిస్తున్నారు. 80నుంచి 50 లక్షల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం చల్లబడి పొడిగా మారింది. తూర్పు ఆఫ్రికాలో అడవులు అక్కడక్కడా పలచబడటంతో కొన్ని ఏప్‌ (నరవానర) జాతులు పశ్చిమాన దట్టమైన అడవుల్లో ఉంటున్న తమ జాతినుంచి వేరయాయి. పెద్ద మైదాన ప్రాంతాల్లో ఉండవలసివచ్చిన ఈ ప్రాణులకు మార్పు తప్పనిసరి అయింది. చెట్ల రక్షణ కరువైన పరిస్థితిలో ఇవి పెద్ద సముదాయాలుగా ఏర్పడి, మైదానాల్లో ఆహారసేకరణకూ, క్రూరమృగాల వాతబడకుండా ఉండేందుకూ పాటుపడవలసివచ్చింది. వీటికి రెండు కాళ్ళమీద నడవడం, పరిగెత్తడం, ముందుకాళ్ళను చేతులుగా ఉపయోగించుకోవడం లాభించింది. ఇక్కడ “లాభం” అంటే ప్రాణాలు దక్కడం, తమ లక్షణాలను కలిగిన సంతానాన్ని పొందడం అనుకోవాలి. “నష్టం” అంటే మరణం, తమ లక్షణాలు కలిగిన సంతానం రూపు మాసిపోవడమే.

మొత్తం మీద చెట్లనుంచి దూరమైన పరిస్థితిలో తప్పనిసరి అయిన రెండుకాళ్ళ నడక మానవ లక్షణం అయింది. దీనివల్ల ఆలోచనాశక్తీ, పరస్పరం సమాచారం అందించుకునే సామర్య్థమూ పెరిగాయి. ఒకవేళ ఏదైనా ఒక ప్రాణికి ఈ నేర్పు కొరవడితే అది చచ్చిపోయి, దాని లక్షణాలు ఉన్న సంతానం సోదిలోకి లేకుండా పోయింది. జీవపరిణామం ఇటువంటి ఒత్తిడి ఉన్నంతకాలమూ ఒకే దిశగా సాగుతుంది కనక మనిషిజాతి లక్షణాలుకొన్ని ప్రాణుల్లో బలపడుతూ వచ్చాయి. “భగవంతుడి లీల” ఎటువంటిదో కాని మనిషి ఆవిర్భావానికి తోడ్పడినవి అప్పట్లో ఎండిపోతున్న అరణ్యాలు మాత్రమేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ “లీల” పౌరాణిక సినిమాల్లో చూపినట్టుగా అకస్మాత్తుగా కాకుండా లక్షల సంవత్సరాలపాటు అతి నెమ్మదిగా జరిగింది.

తొలి మానవులు చెట్లనుంచి పూర్తిగా దూరం కాలేదనీ, రకరకాల ప్రకృతి వైపరీత్యాలకు గురి అవుతూ రకరకాల ప్రాంతాల్లో తలదాచుకున్నారనీ ఒక ప్రతిపాదన ఉంది. ఆ కారణంగా ఆస్ట్రలో పితెకస్‌ జాతివారు రెండు కాళ్ళ నడకతోబాటు చెట్లు కూడా ఎక్కగలిగేవారని ఈ సిద్ధాంతం చెపుతుంది. చేతులు ఖాళీ అవడంతో ఆహారాన్నీ, పనిముట్లనూ మోసుకెళ్ళే వీలు కలిగింది. ఈ రాతి పనిముట్లు వేటాడటానికి ఉపయోగించలేదు. పెద్ద మృగాలు చంపి తినగా మిగిలిన మాంసాన్ని గిల్లుకు తినేందుకు ఈ జీవులు పనిముట్లు తయారు చేసుకున్నారు. ఇది అప్పటిదాకా ఏ ప్రాణీ చెయ్యనటువంటి పని. ఇందుకు తగినట్టుగా వారి మెదడు పెరగసాగింది.

image2.JPG

1. చింపాంజీ, 2. ఆస్ట్రలో పితెకస్‌, 3. ఆధునిక మానవుడు ఎ. తొడ ఎముక, బి. మోకాలి ఎముక, సి. బరువు పడే లంబం
(చింపాంజీ కటి భాగం పొడవుగా, ఇరుకుగా ఉంటుంది)

నిటారుగా నిలుచోగలిగిన ఈ జీవులు ఎత్తుగా పెరిగిన రెల్లు దుబ్బుల పైనుంచి కూడా క్రూరమృగాల రాకను గుర్తించగలిగారు. చేతులతో ఆయుధాలను పట్టుకోవడం, నేలమీదా, చెట్ల కొమ్మలమీదా లభించే ఆహారాన్ని అందుకోవడం వీలయింది. చింపాంజీలు కూడా రెండు కాళ్ళమీద నడవగలవు కాని ఎక్కువ దూరం పోలేవు. ఎంత దూరమైనా నడవడం, అవసరమైనప్పుడు చెట్ల చాటుకు పరిగెత్తి, చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకోవడం ఇవన్నీ ఆస్ట్రలో పితెకస్‌ జాతివారు నేర్చారు. తమ మనుగడ పూర్తిగా ఇలాంటి సామర్య్థంపైనే ఆధారపడటంతో ఈ మార్పులు అతి వేగంగా, విజయవంతంగా జరిగాయి. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ మానవజాతి పురోగతికి మార్గం కలిగించారు.

ఈ విధంగా సుమారు 60 లక్షల సంవత్సరాల కిందట మానవజాతి ఆవిర్భావానికి దారితీసిన జాతి ఒకటి దక్షిణాఫ్రికా ప్రాంతంలో రూపొందింది. ఈ ప్రాణుల ముఖ్య లక్షణాలు రెండు కాళ్ళ నడకా, చిన్నచిన్న కోరపళ్ళూను. తరవాత ఈ జాతి ఆఫ్రికాలోని తక్కిన ప్రాంతాలకు వ్యాపించింది. ఈ పరిణామాల కారణంగా 40 నుంచి 20 లక్షల సంవత్సరాల కిందట మనుషులకు పూర్వీకులైన ఆస్ట్రలో పితెకస్‌ జాతి ప్రాణులు జీవించినట్టు శిలాజాలు తెలుపుతున్నాయి.

image3.JPGimage4.JPG

ఆస్ట్రలో పితెకస్‌ జాతి

చాలా విషయాల్లో ఆస్ట్రలో పితెకస్‌ జాతి ప్రాణులు వానర లక్షణాలు కలిగిఉండేవారు. కురచైన నుదురూ, పొడుచుకొచ్చిన ముఖమూ, చింపాంజీలతో సమానమైన నాలుగైదు వందల ఘన సెంటిమీటర్లకు మించని మెదడు పరిణామమూ, ఇలా చూస్తే బహుశా కాస్త ఉన్నతజాతి వానరాల్లాగే కనబడేవారేమో. శరీరపు బరువు కూడా యాభై కిలోలకు మించకుండా, ఎత్తు అయిదడుగులలోపే ఉండేది. కొన్ని జాతుల్లో గొరిల్లాలూ, ఒరాంగుటాన్‌లలాగే మగ ప్రాణులు ఆడవాటికన్నా భారీగా ఉండేవి. చేతి వేళ్ళు నరవానరాల కన్నా కాస్త పొట్టిగానూ, బొటనవేళ్ళు మాత్రం పొడుగ్గా అటూ ఇటూ తిరగ గలిగేవిగా ఉండేవి. వారిలో అప్పటిదాకా మరే ప్రాణిలోనూ కానరాని మార్పు రెండుకాళ్ళ మీద నడవడమే. ఈ ఒక్కటే ఎన్నెన్నో పరిణామాలకు కారణమైంది. మనకీనాడు అలాంటి ప్రాణి కనబడితే అదేదో తెలివైన వాలిడికోతి అనుకుంటామేమో.

నరవానరాల్లాగా తిన్నగా ఉండక వెన్నెముక “క” అక్షరంలాగా వంపు తిరగడంతో ఆస్ట్రలో పితెకస్‌ జాతి ప్రాణుల మొండెం కురచగా తయారైంది. శరీరాలు దృఢంగా, నిలువుగా తిరగటానికి వీలుగా ఉండేవి. నిలుచున్న తీరుకు అనుగుణంగా వెన్నుపాము పుర్రెలోకి చొరబడే స్థలం కూడా నరవానరాలకు భిన్నంగా ఉండేది. ఏప్‌ నరవానరాలకు కొరకడానికీ, భయపెట్టడానికీ పెద్ద పెద్ద కోరపళ్ళుంటాయి. ఆధునిక మానవులకన్నా పెద్దవే అయినా, 40 లక్షల సంవత్సరాలనాటి ఆస్ట్రలో పితెకస్‌ జాతికి కోరపళ్ళు చిన్నవిగా మారాయి. సముదాయాలుగా పరస్పరం సహకరిస్తూ బతికిన మగ జంతువులకు ఒకదాన్నొకటి భయపెట్టవలసిన అవసరం తగ్గింది.

క్రమంగా వీటిలో ఏడెనిమిది జాతులు ఏర్పడ్డాయి. 12 లక్షల సంవత్సరాల కిందట దృఢకాయంతో ఒక ఆస్ట్రలో పితెకస్‌ జాతి తయారైంది. ఈ జాతివారికి శాకాహారాన్ని బాగా నమిలి తినే పెద్ద దంతాలుండేవి. అప్పట్లో పుష్కలంగా లభించే ఆహారం తినడానికి అటువంటి “అభివృద్ధి” జరిగి ఉంటుంది కాని అది ఆధునిక మానవులు రూపొందేందుకు పనికిరాలేదు. మానవజాతికి తరవాతి యుగంలో ముఖ్యలక్షణాలైన అవగాహనా, ముందాలోచనా, ఊహాశక్తీ మొదలైనవి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో అబ్బిన గుణాలు.

ఉన్న పరిస్థితులకు అనువుగా రూపొందిన లక్షణాలన్నీ భవిష్యత్తులో ఉత్తమ జీవ పరిణామానికి దారితీస్తాయనే నమ్మకం ఏమీ లేదు. జీవపరిణామంలోని విచిత్రమైన అంశం అదే. ఏ ఒక్క యుగంలోనైనా ఉన్నంతలో జన్యుపరంగా బాగా బలపడి, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ప్రాణులన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో వాటి ప్రభావం ఇతర జీవరాశి మీదా, ఇతర జీవాల ప్రభావం వాటిమీదా పడుతూ ఉంటుంది. మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు ఉన్న పరిస్థితులని తారుమారు చేసి ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. పరిణామాన్ని ముందుకు నెట్టేవి అవే. ఆపదలని అధిగమించడానికి కొత్త శరీరలక్షణాలు బలపడక తప్పదు. వాటిలో ఏది నిలుస్తుందో, ఏది పనికిరానిదో ప్రకృతే నిర్ణయిస్తుంది. ఈ మార్పులకు ఒక నిర్దిష్టమైన “ప్రణాళిక” అంటూ ఉండదు కనక జీవపరిణామం ఎప్పటికప్పుడు అనుకోని మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది.

కారణాలు ఏవైనప్పటికీ కొన్ని లక్షలఏళ్ళు ఆఫ్రికా అంతా పెరిగిన ఆస్ట్రలో పితెకస్‌ జాతి ఆ తరవాత అంతరించిపోయింది. వీరికన్నా పెద్ద మెదడుతో ఆవిర్భవించిన హోమో ఎరెక్టస్‌ జాతి ప్రజలది పైచెయ్యి అయింది. సుమారు 18 లక్షల సంవత్సరాల కిందట ఆవిర్భవించిన ఈ కొత్త జాతి 30 వేల సంవత్సరాల కిందటిదాకా బతికింది.

image5.JPGimage6.JPG

హోమో ఎరెక్టస్‌ జాతి

నరవానరం స్థాయినుంచి ఆధునిక మానవజాతి ఆవిర్భావం దాకా జరిగిన సంఘటనలను గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక యుగమో, ఒక జాతి ప్రజలో అంతరించగానే అందులోనుంచి కొత్త జాతి పుట్టుకొచ్చిందని భావించకూడదు. ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితులని అనుసరించి మనిషిజాతులు అనేక మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. తరవాతి కాలంలో అంతరించనున్న ప్రజలు ఇతర “మెరుగైన” ప్రజలకు సమకాలికులుగా వేల ఏళ్ళపాటు జీవిస్తూనే ఉండేవారు. విశాలమైన ప్రపంచంలో అప్పుడప్పుడూ అరుదుగా తారసపడి పరస్పరం సంఘర్షించినప్పటికీ ఒక జాతి మరొకజాతిని రూపు మాపేసిందనడానికి రుజువులేమీ కనబడవు. అంతకంతకూ వనరుల కోసం పోటీ పెరిగిన మాట నిజమే అయినా ఒక జాతి అంతరించడానికీ, మరొకటి పెంపొందడానికీ ప్రకృతిలోని పరిస్థితులే కారణం అవుతూవచ్చాయి. ఇవి ఆధునిక యుగంలో ఆటవికజాతులు తమ అలవాట్లని మార్చుకుని నాగరికులైనట్టుగా జరిగిన మార్పులు కావు. ఆస్ట్రలో పితెకస్‌, హోమో ఎరెక్టస్‌ మొదలైనవి వేరువేరు జాతులు. నిన్న మొన్నటిదాకా శాస్త్రవేత్తలు హోమో ఎరెక్టస్‌ జాతినుంచి ఆధునిక మానవజాతి పుట్టిందని భావించేవారు కాని ఆధునిక మానవులు తూర్పు ఆఫ్రికాలో మరొక విడి పాయగా రూపొంది హోమో ఎరెక్టస్‌ జాతికి సమకాలికులుగా ఉన్నారని ఊహిస్తున్నారు.

image7.JPG

హోమో ఎరెక్టస్‌ జాతి కాలినడకన తిరిగిన ప్రాంతాలు


జంతువులతో పోలిస్తే మనిషికి ప్రత్యేకత కలిగించే లక్షణాలు చాలానే ఉన్నాయి. మేధాశక్తిలోనూ, సాంఘిక పరిణామంలోనూ జంతువుల్లో మనిషికి సాటి రాగలిగినవి చాలా తక్కువ. జీవపరిణామ క్రమంలో మనిషికి అబ్బిన ప్రత్యేకతలన్నీ దాదాపు ఒకేసారి రూపొందాయి. రెండు కాళ్ళమీద నడవగలగడం, పనిముట్లు చేసుకోవడం, ముందాలోచనతో వ్యవహరించడం మొదలైన విశేషశక్తులన్నీ కలిసి ఏర్పడ్డాయి. దీనివల్ల కొన్ని అనుకోని మార్పులు జరిగాయి.
వీటన్నిటికీ కారణం ఒకటే; లక్షలాది సంవత్సరాల క్రితం భౌగోళిక పరిస్థితుల్లో కలిగిన మార్పులవల్ల నాలుగుకాళ్ళతో పరిగెత్తే నరవానరజాతుల్లో కొన్నిటికి రెండుకాళ్ళ నడక తప్పనిసరి అయింది. ముందుకాళ్ళు చేతులుగా మారడంతో వాటికి కొత్త నైపుణ్యం అలవడింది. చేతులూ, వేళ్ళ కదలికలను శాసించే మెదడులోని భాగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి.
పనిముట్లద్వారా ఆహారం మరింత బాగా సంపాదించుకోవడంతో రానురాను సున్నితమైన పనులకు చేతులు అలవాటు పడడం, దానికి అనుగుణంగా మెదడు పెరగడం జరిగింది. ఏరుకు తినే దశనుంచి వేటాడే దశకు చేరుకోవడంతో ముందుగా ఆలోచించుకోవడం మొదలైంది. దీనికి తగినట్టే మెదడు విపరీతంగా పెరిగింది. అందువల్ల మనిషి తల పెద్దదయింది. వానరాల్లా కాకుండా నిటారుగా నిలబడ్డ మనిషికి ముఖం అంతకంతకూ విశాలమవుతున్న మెదడుకు కింది భాగాన అమరింది.

క్షీరదప్రాణుల పిల్లలలో రెండు రకాలుంటాయి. మొదటి రకానికి చెందిన ఎలుకలూ, పిల్లుల వంటివి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనేస్తాయి. అవన్నీ చిన్న మెదళ్ళతో నిస్సహాయంగా ఉంటాయి కనక తల్లులు వాటిని కాపాడి సాకుతాయి. పెద్దయాక వాటి మెదడు రెండింతలవుతుంది. రెండో రకానికి చెందిన గుర్రాలవంటివాటిలో పిల్లలు దాదాపు పూర్తి పరిమాణానికి ఎదిగిన మెదళ్ళతో పుడతాయి. అందుకని అవి పుట్టీ పుట్టగానే నేల మీద పడి చకచకా నడవడం, తల్లివెంట పరిగెత్తడం చేస్తాయి. అందులో “పురుటినొప్పులు” కూడా ఉండవు. పిల్లలు త్వరగా పెద్దవై యుక్తవయసుకు వచ్చేస్తాయి. మనుషుల్లో అలాకాదు. మనిషి మెదడు ప్రత్యేకం. పుట్టిన తరవాతకూడా ఒక ఏడాది పాటు అది పిండదశలో ఎదిగినంత త్వరగానూ ఎదుగుతూనే ఉంటుంది. మనుషుల పిల్లలు నిస్సహాయులై పుట్టడమే కాదు, తమ జీవితకాలంలో నాలుగోవంతు పెరుగుదలలోనే గడుపుతారు. ఈ సుదీర్ఘవ్యవధిలో వారి మెదడు అంతులేని అభివృద్ధి సాధిస్తుంది. పుట్టినప్పుడు మాత్రం వారి మెదడు ‘అసంపూర్తి’గా కనిపిస్తుంది. మనుషులలో ఏడాది గడిచేసరికి పిల్లల ‘శిశు’ మస్తిష్కం పూర్తిగా ఎదగడం, వారు కాస్త నిటారుగా నిలవగలగడం, మాటలు నేర్వడం అన్నీ ఒకేసారిగా జరుగుతాయి.

తక్కిన వానరజాతి జంతువులతో పోలిస్తే మనుష్యులు పుట్టే పద్ధతి చాలా విషయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. ప్రసూతి సమయంలో స్త్రీలు నిస్సహాయతకు లోనైనంతగా మరే వానరజాతి ప్రాణి విషయంలోనూ జరగదు. మనిషి సామాజికజీవితానికీ, రెండుకాళ్ళ నడకకూ దీనితో సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. జంతువుల్లాగ కాకుండా మరొక మనిషి మంత్రసానిగా సాయం చెయ్యవలసిరావడం సామాజిక అంశమే. డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం చూస్తే ప్రసూతిలో ఇతరుల సహాయం పొందిన తల్లులు పొందనివారికన్నా బాగా మనగలిగారన్నమాట. వానరాల్లా సహజమైన పద్ధతి అవలంబించిన స్త్రీలలో మరణం ఎక్కువగా సంభవించి ఉండాలి. అందువల్ల ఆ శరీర లక్షణాలు అంతరించిపోయాయి.
రెండుకాళ్ళ నడక కారణంగా మనుష్యుల కటి భాగపు వెడల్పు తక్కిన వానరజాతి జంతువుల కన్నా తక్కువగా ఉంటుంది. యోనిమార్గం ఇరుకవడంవల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. తల్లికి ప్రసూతి బాధ కూడా ఎక్కువౌతుంది. మనిషి మెదడు పరిమాణం పుట్టినప్పటితో పోలిస్తే పెద్దయాక మూడింతలు పెరుగుతుంది. కోతుల్లో ఇది రెండింతలే. ఈ పెరుగుదల గర్భంలో ఉన్నప్పుడే సజావుగా జరగాలంటే తల్లి బిడ్డను 21 నెలలు మొయ్యాలి. అలా జరిగితే పుట్టేనాటికి శిశువు తల విపరీతంగా పెరిగిపోయి బిడ్డ బైటకు రావడం అసాధ్యమౌతుంది. నెలలు నిండడం చింపాంజీల్లో మనిషిలాగే జరుగుతుంది కాని శిశువు మెదడులో మనిషికన్నా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. పుట్టినప్పుడు కోతి పిల్లలు మనుష్యులంత నిస్సహాయంగా ఉండవు.

ఆధునిక విజ్ఞానం వీటికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తుంది. వానరజాతుల్లో పెద్దయాక మెదడు రెండింతలు పెరిగితే మానవ శిశువుల మెదడు మూడింతలవుతుంది. మన మెదడు ఎదిగే చివరి 12 నెలలపాటు మనం తల్లి గర్భంనుంచి బైటపడతాం. గర్భంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా పుట్టిన మనిషి బిడ్డకు నిత్యమూ అనేక ఇంద్రియపరమైన ప్రేరణలు అందడం, స్పందనలు కలగడం వగైరాలన్నీ మొదలవుతాయి. ఆ కారణంగా మనిషి మెదడులోని నాడీకణాల మధ్య అనేక కొత్త లంకెలు అతివేగంగా ఏర్పడతాయి. నిస్సహాయంగా మొదలైన మానవశిశువు జీవితానికి తల్లినుంచి లభించే రక్షణా, పోషణా, భావభరిత ప్రేమానురాగాలూ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఏ చింపాంజీ పిల్లల పద్ధతిలోనో మానవశిశువులు తల్లి శరీరాన్ని పట్టుకుని వేలాడనైనాలేరు. ఎందుకంటే స్వేదం ఎక్కువగా స్రవించే మనిషి శరీరానికి చింపాంజీల్లాగా రోమా లుండవు సరికదా, మన పిల్లల చేతులకు అంతటి పట్టు కూడా ఉండదు. అసలు ఇంతటి పెద్ద మెదడు ఉండడంవల్లనే మనకు స్వేదం ఎక్కువ. పెద్ద మెదడు ప్రసూతికి ఇబ్బంది కనకనే మనం అసంపూర్ణ దశలో జన్మిస్తాం. తల్లితో తప్పనిసరిగా ఏర్పడే అనుబంధం మనకు ‘మానవ’ స్వభావాలనిస్తుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు.

మనిషికి జీవపరిణామం మందగించి సాంఘికజీవితం మొదలవడంతో దానికి అనుగుణంగా శరీరంలో, ముఖ్యంగా మెదడులోనూ, ఇతర లక్షణాల్లోనూ మార్పులు అనివార్యం అయాయి. నోటి నిర్మాణంలోనూ, నాలుక కండరాల్లోనూ జరిగిన అభివృద్ధి మాట్లాడడనికీ, భాష పెరుగుదలకూ దోహదం చేసింది. చిన్న చిన్న తెగలుగా సమాజజీవితం ప్రారంభించిన ఆదిమమానవులకు భాషా, తద్వారా ఇతరులతో సంపర్కమూ కలిగించిన లాభాలు ఇంతా అంతా కాదు.

మనిషి వ్యవసాయం మొదలుపెట్టి, స్థిరనివాసాల్లో జీవించడంతో తినే ఆహారంలో వైవిధ్యం పెరిగింది. కార్బోహైడ్రేట్ల రూపంలో అనేక ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం మెరుగుపడింది. పిల్లలకు పాలు మాన్పి ఇతర ఆహారం అలవాటు చెయ్యడం వీలయింది. తల్లులు మంచి పోషక ఆహారం తినడంవల్ల పది, పదిహేను నెలలలో మలి కాన్పుకు సిద్ధం అవసాగారు. ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా మనుషులు తమను తాము కాపాడుకోగలిగారు. పుట్టినప్పుడు బలహీనంగా ఉన్నప్పటికీ మనుషులు ఒకరికొకరు తోడ్పడే సమాజ జీవితం ద్వారాఇతర ప్రాణులకన్నా అభివృద్ధి సాధించగలిగారు.

ఈ పరిణామాలవల్ల ఏమౌతుంది? మనుష్యుల తలలు పుట్టినప్పుడు అంతకంతకూ పెద్దవౌతాయి. సహజ ప్రసూతిలో శిశువు తల నొక్కుకుపోయి భరించరాని బాధ కలుగుతుంది. మునుపటి కన్నా ఈ రోజుల్లో సిజేరియన్‌ పద్ధతిలో పిల్లలు పుట్టడం ఎక్కువైంది. శస్త్రచికిత్సలో జరిగిన అభివృద్ధి దీనికి కొంత కారణం కావచ్చు కాని పిల్లల తలలు అంతకంతకూ పెద్దవి కావడం కూడా ఇందుకు కారణమేమో. ఈనాటి పోటీ ప్రపంచంలో తెలివితేటలు లేకుండా పెరగడం అసంభవం కనక ఇది ప్రకృతిలో జరిగిన ఏర్పాటేమో.

పిల్లలు పుట్టి పెరగడానికీ, మనుషులు సమాజాలుగా ఏర్పడడానికీ కూడా గట్టి సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్త లంటారు. సమిష్టిగా పెంచిన పిల్లలు బతికి బట్టకట్టే అవకాశం ఎక్కువ. అందరు ఆడవాళ్ళకూ కాన్పు ఒకేసారి రాదు గనక సాటివారికి తోడ్పడడం, ఒకరినుంచి మరొకరు నేర్చుకుని పిల్లల్నికాపాడడం వీలవుతుంది. ఐకమత్యమే మహాబలంగా పెరిగిన ఆదిమానవుల తెగలకు పిల్లల పెంపకంలోని ప్రాముఖ్యత అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఆధునిక శారీరక లక్షణాలు బలపడడానికి దోహదం చేసి ఉండాలి.

నడక అనేది మానవుల ప్రాథమిక లక్షణం. నడవలేని జాతులు వానరాలుగా చెట్ల మీదే ఉండిపోయాయి. రెండు కాళ్ళమీద వేల మైళ్ళు ప్రయాణించగలిగిన ఆదిమానవులు అన్ని విధాలా వానరాలనుంచి వేరుపడి ప్రగతిని సాధించారు. ఈనాటికీ ప్రయాణాలు చెయ్యడం మెదడుకు లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఇందుకు ఉదాహరణగా చాలాకాలంపాటు ఉన్నచోటనే పాతుకుపోయిన నియాండర్తాల్‌ జాతి క్రమంగా అంతరించిపోయినట్టుగా తెలుస్తోంది. కొత్త చోట్లకి వెళ్ళడం, కొత్త వాతావరణానికీ, లభ్యమౌతున్న ఆహారానికీ అలవాటు పడడం మొదలైనవన్నీ ఆదిమానవుల బుద్ధిని పదునెక్కించాయి. ఇతర రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది. నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో అదొక భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరి తీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్దవవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం అవగాహన బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు.

మొత్తంమీద ఆధునిక మానవులకు పూర్వీకులుగా మొదట ఆస్ట్రలో పితెకస్‌ జాతీ, ఆ తరవాత హోమో ఎరెక్టస్‌ జాతీ నడక అనేది అలవరుచుకున్నారు. హోమో ఎరెక్టస్‌ ప్రజలు 15, 20 లక్షల ఏళ్ళ క్రితమే ఆఫ్రికానుంచి మహాప్రస్థానం చేసి ప్రపంచంలో నలుమూలలకీ వెళ్ళి స్థిరపడ్డారు. వీరి పనిముట్లూ, అవశేషాలూ ఎన్నెన్నో లభిస్తాయి. ఆ తరవాత సుమారు లక్ష ఏళ్ళ కిందట ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి కాలినడకన మరో ప్రస్థానం చేసి తమ పూర్వీకులందరూ అంతరించడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయారు. మనం వారికే వారసులం. అందుచేతనే నడక ఎంత ముఖ్యమైనదో మనం గుర్తుంచుకోవాలి.

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

Posted in వ్యాసం | Tagged | 5 Comments

నుడికారము – మరికొన్ని కోణాలు

రానారెయర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. తెలుగు నుడికారం పై పొద్దులో ఒక వ్యాసం రాసి పాఠకజనావళి అభిమానం పొందిన రానారె, అదే అంశంపై రాసిన రెండో వ్యాసమిది. ఆస్వాదించండి.

——————–

“పురుగు మూజూసింది!” అనేది ఒకానొక పలుకుబడి. పురుగు అంటే విషపురుగు. ముఖ్యంగా పాము. మూజూడటం అంటే మామూలు అర్థం వాసన చూడటం అని. కానీ ఈ పలుకుబడిలో మాత్రం కాటువేసిందని అర్థం. పాము కరచిందని చెప్పొచ్చుకదా ఎందుకీ “డొంకతిరుగుడు”!? అనిపించవచ్చు. కారణం ఏమిటంటే కరచిన ఆ పాము పేరు వినవస్తే మత్రంయొక్క లేదా మందుయొక్క ప్రభావం పోతుందని ఒక నమ్మకం. ప్రస్తుతం ఆ నమ్మకం ఉన్నా లేకున్నా ఈ పలుకుబడి మాత్రం జనంలో నిలిచిపోయింది.

“బొత్తిగా నల్లపూసవైపోయావు, ఏమిటి సంగతులు?” పలుకరించాడొక మిత్రుడు. నల్లపూసనయిపోవడం ఏమిటి? “ఈ మధ్య కనబడటం లేదు, కనీసం నీ గొంతుకూడా వినలేదు, నీ గురించి ఏ సమాచారమూ లేదు” అనే ప్రేమపూర్వకమైన అర్థమున్నట్లు తెలుగు వాతావరణంలో తిరగినవారికి తెలుసు. భాష మాత్రమే తెలిసినవారూ లేదా కొత్తగా తెలుగునేర్చుకున్నవారైతే, “ఎండాకాలం కదా, బయట తిరిగి బాగా నల్లబడి చిక్కిపోయావు” అనే అర్థముందేమోనని బుర్రలకు పనిచెప్పవలసింది.

ఇట్లాగ ఒక వాక్యంలోని పదాల అర్థాన్ననుసరించిగాక, ఆ ప్రాంతపు జనజీవన నేపథ్యాన్ననుసరించి కొత్తభావం పుడుతుందన్నమాట. పురుగు మూజూసింది, నల్లపూసవైపోయావు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ – ఈ పదాలనుండి యథాతథంగా వచ్చే భావము ఒకటి. ఈ పలుకుబడులలో దాగిన వాడుకలోని భావము మరొకటి. ఇదే నుడికారపు ముఖ్య లక్షణం. గత వ్యాసంలో ఈ విషయాన్ని మరింత విపులంగా ప్రస్తావించడం జరిగింది.

“పొద్దు గూట్లో పడింది” అంటే ఏమిటో, “చిలక గోరింకల్లాగా” కాపురం చేయమనడం ఏమిటో తెలుసా?
****************************

ఒక భాషలోని పలుకుబడులు మరో భాషలోకి తర్జుమా చేయడంలో ఎన్నో ఇబ్బందులు. రెండు భాషల ప్రజల జీవన విధానాల మధ్య అంతరాలు ఎక్కువయేకొద్దీ ఈ ఇబ్బందులు తీవ్రమౌతాయి. అనువాదరచనలు చేసేవారికి భాష తెలిస్తే సరిపోదు. ఆయా భాషలకు సంబంధించిన సంస్కృతులపై అనువాదకునికి అవగాహన లేకపోతే ఆ అనువాదంలో జీవం ఉండదు.

మనవాళ్ల పెళ్లిచూపుల తంతగాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలంటే అందులో ఎంతోకొంత అసహజత్వం తొంగిచూడక తప్పదు. ఎందుకు? పెళ్లిచూపులు అనబడే వ్యవహారమే ఆంగ్లేయులకు అసహజం కనుక. అందుచేత ఏ భాష నుడికారం ఆ భాషకే ప్రత్యేకం. మన జీవనం పాశ్చాత్య జీవనానికి దగ్గరగా మారేకొద్దీ ఈ ప్రత్యేతక కనుమరుగౌతూ పోతుంది. అప్పుడు మన నుడికారం కూడా ఆంగ్ల నుడికి దగ్గరగా మారిపోతుంది. జీవనవిధానమే నుడికారానికి ముడిసరుకు కనుక ఇది అనివార్యం.
****************************

సినిమాలలో ఒక సన్నివేశానికి తీవ్రతను చేకూర్చడంలో నేపధ్య సంగీతం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మనకు తెలుసు. సందర్భానికి తగిన శబ్దాలతోకూడిన పదప్రయోగం చేయగలిగే వీలు భాషలోనే ఉండటం ఒక చెప్పుకోదగ్గ విశేషం. చిన్న ఉదాహరణ చూద్దాం. విపరీతమైన కోపంలో ఉన్న మహా బలవంతుడైన ఒక మహాకాయుని ముఖాన్ని ఊహించండి. ఆ ముఖంలో క్రోధాన్ని తెలుపుతూ అతని నొసలు ఎగిరెగిరి పడుతోంది. ఈ ఉగ్రరూపాన్ని కళ్లకు కట్టేందుకు వాడబడిన ఒకేఒక్క పదం: నటదుద్యద్భృకుటీభయంకరము. ఈ పదాన్ని పలకడంలోనే ఆ ఉధృతి అర్థమౌతుంది. నటత్ ఉద్యత్ భృకుటీ భయంకరము. నుడి అంటే మాట,పలుకు అనే అర్థాలున్నాయి.

దాశరథీ శతకంలోని ఈ పద్యం చూడండి – రాముడు తిరుగులేని వీరుడు, ఎదురులేని దేవుడు, రెండవ సాటి దైవమింక లేదనే భావాన్ని ఎలుగెత్తి ప్రకటించే ఈ పద్యంలోని శబ్దార్థాలు గమనించండి.

భండన భీము డార్తజన బాంధవు డుజ్జ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, రామ మూర్తికిన్,
రెండవ సాటి దైవ మిక లేడనుచున్, గడగట్టి, భేరికా
దాండ డడాండ డాండ నినాదంబు లజాండము నిండ, మత్తవే
దండము నెక్కి చాటెదను! దాశరథీ కరుణా పయోనిధీ!

ఇంతకు మించిన ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. మీకు తోచింది మీరూ ఒకటి చెప్పండి.

ఉచ్చారణలోని వైవిధ్యం వలన జనించే అర్థాలు పలువిధాలుగా ఉండటం మనకు అనుభవంలోనిదే. ఇది దాదాపుగా ఏ భాషలోనైనా ఉండేదే. ఈ విధానం తెలుగుకు ప్రత్యేకమేమీ కాదు. కానీ ఇది ఒక్కో పదాన్ని నొక్కి పలికే తీరులో మాత్రం ఏ భాష ప్రత్యేకత దానిదే. ఇక్కడే భాష ప్రత్యేతకను నుడికారము నిలబెడుతుంది.
****************************

“తలపులు ఎన్నెన్నొ – కలలుగ కంటావు. కల్లలు కాగానె – కన్నీరౌతావు. మౌనమె నీ భాష ఓ మూగ మనసా …” ఈ గేయాన్ని మీరు వినే ఉంటారు. తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా ఉంటూనే ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పినట్లుగా అనిపించే సంబోధన “ఓ మనసా” అనేది. ఈ ప్రయోగం మాటల్లోనూ, పాటలోనూ, కవితల్లోనూ కనబడుతూ ఉంటుంది. బహుశా వాగ్గేయకారులు “ఓ మనసా … ” అనే సంబోధనను వాడకంలో పెట్టి ఉండవచ్చు.

జనసామాన్యంలోకి చొచ్చుకుపోయి దీర్ఘకాలంపాటునిలిచే రచనలు చేసిన వారందరూ తమదైన నుడికారాన్ని అప్రయత్నంగానే సృష్టిస్తూ ఉంటారు.
****************************

నీ శ్రాద్ధమ్, నీ పిండమ్, అప్రాచ్యుడా – ఇలాంటి సంస్కృతతిట్లు బ్రాహ్మణుల ఇళ్లలో వినబడటం మీరు గమనించే ఉంటారు. ఆ సమాజాల్లో సంస్కృతం చదువుకున్నవారు ఎక్కుగా ఉండటం వల్ల కావచ్చు. ప్రాచ్యం అంటే తూర్పుప్రాంతం. ప్రాచ్యుడు కానివాడు అప్రాచ్యుడు. తిట్లేకాదు మామూలు మాటల్లో కూడా సంస్కృతం ఎక్కువగా తొంగిచూస్తుంది. దేవభాషాపరిమళం ఎంత ఎక్కువగా ఉంటే ఆ భూసురునికి అంత గౌరవం. బ్రాహ్మణేతర సమాజాల్లో తిట్లు, మాటలూ మరోలా ఉండటం మనకు తెలిసిందే. ఇలా బ్రాహ్మణుల నుడికారం కాస్త ప్రత్యేకం(గా ఉండేది). గురజాడ కన్యాశుల్కం, చిలకమర్తివారి గణపతి మొదలైన రచనలలో మనం ఈ నుడికారాన్ని చూడవచ్చు.

కొన్నేళ్ల కిందటి మాట. మా పల్లెకు ఒక కొత్త కోడలు వచ్చింది. చాలా ఆరోగ్యవంతురాలు. మగవాళ్లు మాత్రమే చేయగలిగే కొన్ని సేద్యపు పనులను కూడా అలుపు లేకుండా చేయగలిగేంది. ఆమెకొక బిడ్డ కలిగిన కొత్తల్లో వాళ్ల పుట్టింట్లో కొన్నాళ్లుంది. వాళ్లు ఆమెకు కేవలం గొడ్డుకారం మాత్రమే ఆహారంగా పెట్టారు. నీళ్లు ఎక్కువగా తాగనివ్వలేదు. ఇలా పథ్యం పెట్టకపోతే బాలెంతరాళ్లకు కొన్ని ప్రాణాంతక వ్యాధులొచ్చే అవకాశం ఎక్కువని వాళ్ల గట్టి నమ్మకం. బిడ్డతో ఆమె మా ఊరికొచ్చేసరికి ఆమె ఆరోగ్యము, బలమూ అన్నీ శాశ్వతంగా కోల్పోయింది. ఆమె పరిస్థితి చూసి హృదయం ద్రవించినవాళ్లు అన్నమాట – “ఎద్దట్లాటి మనిషి. ఎట్టైపోయనో చూడు.” ఒక ఆడ మనిషిని ఎద్దుతో పోల్చడం – కేవలం వ్యవసాయాధారిత సమాజంలో మాత్రమే వినబడుతుంది. మిగతావారికిది మొరటుగానూ ఎబ్బెట్టుగానూ ఉంటుంది. ఎద్దులపై సహజీవనం చేసేవారికీ వాటిపై ప్రేమగలవారికీ ఇవేమీ కనబడవు. ఎద్దుల శక్తి, ఎప్పుడంటే అప్పుడు ఎంత పనైనా చేసేందుకు సిద్ధపడటమే కనబడుతుంది.

సముద్రానికి దగ్గరగా నివసించే మత్స్యకారులకు వారి జీవనవిధానంనుడి పుట్టిన ప్రత్యేక నుడికారం ఉంటుంది. ఇలా ఏ వృత్తిలోనివారికి ఆ వృత్తికి, ఆ జీవితానికి సంబంధించిన పలుకుబడులు వారి భాషలో భాగమైపోతాయి. ఇందుకే తెలుగు నుడికారం భాషకు సంబంధించినది మాత్రమేగాక మన సమాజ జీవనానికి సంబంధించినది.
****************************

ప్రపంచంలోని ప్రతి భాషకు వ్యాకరణము, ఛందస్సులాంటి కొన్ని సంప్రదాయనియమాలతో తనదైన శిల్పం ఉంటుంది. ఈ లక్షణం ఆయా భాషల నుడికారాలను నిర్దేశిస్తుంది. ప్రతినిత్యం మనం టీవీలో చూసే వ్యాపార ప్రకటనల్లో వినిపించే భాషను గమనించండి. ఉదాహరణకు ఒక సబ్బు గురించి “ఇది రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది” అనేమాటను నమ్మకంగా సాధికారంగా సొగసుగా చెప్పవచ్చు. కానీ దీన్నే మరోవిధంగా చెబుతారు – “ఇది ఉంచుతుందీ… మిమ్మల్ని రోజంతా తాజాగా.” ఇలాంటి మాటలు హిందీనుండి లేదా ఇంగ్లీషునుండి అనువదింపబడిన వ్యాపారప్రకటనల్లో తప్ప మామూలుగా ఎవ్వరూ మాట్లాడరు. ఇది ఉంచుతుంది … అంటూ మొదలెట్టడం ఆ భాషలకు నప్పుతుందేమోగానీ, తెలుగుకు ఇది కొత్త. కానీ పదేపదే మన టీవీల్లో ఇలాంటిమాటలు వినీవినీ మన పిల్లలకు ఇది అలవడవచ్చు.
****************************

కేవలం వ్రాత(లిపి) ద్వారా నుడికారం అన్నది అందదు. శబ్దార్థం నుడికారానికి ప్రాణం. దీన్నే యాస అనుకోవచ్చు. ఒక మాటను ఎలా పలుకుతున్నామన్నదాన్నిబట్టి మాత్రమే కాక, ఎవరితో మాట్లాడుతున్నామన్నదాన్నిబట్టి కూడా దాని అర్థం మారిపోతుందని మనకు తెలుసు. ఔనా!? — అంటే “అలాగన్నమాట, సరే” అని ఒక అర్థం, “తెలిసి చెబుతున్నావా, నాకు తెలీదని చెబుతున్నావా” అన్న సందేహం వ్యక్తపరచడం ఇంకొక అర్థం. “అబ్బా! మాకు తెలీదులే” అనే వేళాకోళం మరొక అర్థం. పలికే పద్ధతినిబట్టి, శ్రోతల నేపథ్యాన్నిబట్టి ఈ అర్థాలు మారుతూంటాయి.

ఆంధ్రదేశంలో ‘బాగున్నావా?’ యొక్క కొన్ని ఇతర రూపాలు: “బాగున్నవా? బావున్నావా? మంచిగున్నవా? మంచిగున్నావె? మంచిగున్నవానె? బాగుండావా? బాగుండావ్? బాండా..వ్?”

నేను దగ్గరగా గమనించిన ఒక ఉదాహరణ – సాధారణంగా వ్యవహారంలో వినబడే ప్రశ్న “బాగున్నారా?”. దీన్ని కడపజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో …
— తూర్పు-ఆగ్నేయం — “బాగుండా…రు?” (‘డా’ను కొంచెం సాగదీసి, ‘రు’ను కొంచెం కుదించి)
— తూర్పు-ఈశాన్యం — “బాగుండారూ…?” (‘రూ’ను కొంచెం సాగదీసి)
— పశ్చిమ-నైరుతి — “బాగుండారా?”
— పశ్చిమ-వాయవ్యాలలో ఎలా పలుకుతారో నాకు ఇదమిద్దంగా తెలియదు.

ఇలా ఒకే జిల్లాలోనే అతి సామాన్యమైన, సాధారణమైన ఒక చిన్న మాటను వివిధ రకాలుగా ఉచ్చరించడాన్నిబట్టి నుడికారపు ప్రాంతీయతను గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. కడపజిల్లా యాస అంటూ ప్రత్యేకించి ఒకే ఒక్క యాస లేదు. కాకపోతే, మిగిలిన జిల్లాలతో పోల్చినపుడు సార్వజనీనమైన ఒక యాస ఉందనుకోవచ్చు. అలాగే, “రాయలసీమ మాండలికం” అన్నది కూడా. తెలంగాణ, కోస్తా ప్రాంతాల యాసలతో పోల్చినపుడు మాత్రమే రాయలసీమ మాండలికం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు దేనికదే సార్వజనీనమైన ప్రత్యేక యాస ఉంది. కాబట్టి రాయలసీమలోని ఏ ప్రాంతపు భాషను మరియు యాసను ‘రాయలసీమ మాండలికం’ అంటున్నారన్నది రాయలసీమ వాసులకు తెలియనట్లే, తెలంగాణలోని ఏ ప్రాంతపు యాసను ‘తెలంగాణ’ మాండలికం అంటున్నారో వారికీ తెలియదనుకొంటాను. అలాగే కోస్తా జిల్లాల్లోనూ ఎన్నో మాండలికాలు. “వస్తా ఉండారా, పోతా ఉండారా” అని ఏవో రెండుమూడు పదాలు మాట్లాడి, అదే రాయలసీమ నుడికారం అనిపింపజేస్తుంటారు మన సినిమాల్లో. ప్రాంతీయజన జీవనంతో మమేకమైతే తప్ప, ఏ ప్రాంతపు నుడికారమైనా ఎవ్వరికీ అలవడదు. మన సినిమాల్లో చూపించే ‘సీమ యాస’ సీమలోని ఏ ప్రాంతానికీ దగ్గరగా ఉండదు. కాకపోతే అది సీమేతరులకు తెలిసే అవకాశం తక్కువ. సినిమాల్లోని తెలంగాణ, కోస్తా యాసల సంగతి కూడా ఇంతేనేమో!?
****************************

ఒక వ్యవస్థకు, రంగానికి లేదా వర్గానికి సంబంధించిన వ్యక్తులమధ్య జరిగే సంభాషణలో వారికే ప్రత్యేకమైన, ఒకోసారి వారికి మాత్రమే అర్థమయ్యే నుడులు దొర్లుతూ ఉంటాయి.

హాస్టలు విద్యార్థుల మధ్య కొన్ని నుడులు పుడుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ: “జాతీయం చేసెయ్యడం” — అంటే ఏదైనా ఒక వస్తువు దొరికితే, దాని సొంతదారుడు గుర్తుపట్టకుండా రూపురేఖలు మార్చి, అందరూ కలసి దాన్ని వాడుకోవడం. నాగార్జునసాగరం లాంటి ఆనకట్టలను జవహర్లాల్ నెహ్రూ జాతికి అంకితం చేయడం, బ్యాంకుల జాతీయకరణం మొదలైనవి పాఠ్యపుస్తకాలలో చదవడం ఈ నుడికారానికి నేపథ్యం. మన విద్యాలయాల్లో ఇలాంటి పలుకుబడులు లెక్కలేనన్ని.

రెవెన్యూ వ్యవహారాలలో ఎక్కువగా వినబడే ఉర్దూ, పారసీ భాషల పదాలు. దీనికి కారణం బహుశా మహమ్మదీయ రాజుల పరిపాలనలు కావచ్చు. ప్రామిసరీనోటు రాయడానికి ఉపయోగించే భాష ప్రత్యేకంగా ఉంటుంది. డబ్బు చెల్లించినపుడు “… గాన, ముట్టినది” అని ‘రసీదు’ రాసివ్వడం రెవెన్యూ నుడికారం.

కాలంతోబాటుగా పుట్టి, కాలంతోబాటే మాసిపోగల నుడులకు ఒక ఉదాహరణ ‘గాంధీలెక్కల్లో కలిపెయ్యడం’ — గాంధీ ప్రభావం తగ్గుతున్నకొద్దీ, ఈ నుడి వాడుక తగ్గుతోంది.

ఇంగ్లీషు మాట్లాడినట్లుగా తెలుగు మాట్లాడటం. ఎంత కాదనుకున్నా, మన తెలుగు టీవీ ప్రయోక్తలదీ ఒక నుడికారమే. బయట మామూలుగా మాట్లాడేవారు, కెమెరా ముందుకు రాగానే, వారు మాట్లాడే పద్ధతి మారిపోతుంది (కారణాలు, అవసరాలు ఏవైనా).

మన సామెతలన్నీ నుడికారంలో భాగాలే.
****************************

సంధులు, సమాసాలద్వారా ఒకటికన్నా ఎక్కువపదాలను కలిపి ఒక కొత్త పదాన్ని తయారుచేయగలగడం తెలుగులోని ఒక భాషావిశేషం. ఒక పదానికి ఒకటికన్నా ఎక్కువ అర్థాలున్న పదాలతో ఇలా ఏర్పడిన కొత్తపదాల్లోని కొన్ని చమత్కారాలు:
ఆలమంద అంటే ఆవుల మంద అని అర్థం. పెళ్లాల మంద కాదు.
ఆలవాలము – ‘ఆలవాలము’ అంటే ‘పాదు’ అని అర్థం. మొదళ్ల చుట్టూ నేల కుళ్లగింపబడి, నీళ్లు నిలిచి, మొక్కలు చురుకుగా పెరగడానికి అనువైన పరిస్థితి పాదులో ఉంటుంది. రాజమహేంద్రవరాన్ని (రాజమండ్రిని) వర్ణిస్తూ ‘కవిసార్వభౌములకిది ఆలవాలము’ అన్నారు. అలా కాకుండా ‘ఆలమంద’ నుండి ఆవులయొక్క అని గ్రహిస్తే, వాలము అంటే తోక గనక, ఆవులతోక. పక్షులు ఆవులపై వాలి వాటిని బాధించే పిడుదులను, వాటిపైవాలే ఈగలను తింటాయి, ఆ ఈగల్లాగా పక్షులలాగా ‘ఆవులపై మేము వాలము’ అని ఇంకో అర్థం కూడా తీయొచ్చు. తెలుగులో ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఎన్నెన్నో.
****************************

గతంలో నుడికారంపై నేను రాసిన వ్యాసానికి పూర్ణత్వాన్నిచ్చే ప్రయత్నంగా నాతో ఈ వ్యాసాన్ని రాయించిన (సాలభంజికల)నాగరాజుగారికి కృతజ్ఞతాభివందనాలతో … రానారె.


~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

Posted in వ్యాసం | Tagged | 15 Comments

మృతజీవులు-5, కవిత

ఈ వారం మృతజీవులు ఐదో భాగం, తప్పుకో ఇక ఆడలేనని….. అనే కవిత లను ప్రచురిస్తున్నాం. ఆస్వాదించండి.

ఈ నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు (వ్యాసం)
కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు (వ్యాసం)
శ్రోత, గాయకుడు – కుటుంబరావు (వ్యాసం)
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం (వ్యాసం)

మృతజీవులు – 5 (వ్యాసం)
తప్పుకో ఇక ఆడలేనని….. (వ్యాసం)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

Posted in ఇతరత్రా | Comments Off on మృతజీవులు-5, కవిత

తప్పుకో ఇక ఆడలేనని…..

ఎన్నాళ్ళిలా
ఏడుపులు.. ఓదార్పులు
తప్పుకో ఇక ఆడలేనని
జీవన క్రీడ
ఒప్పుకో ఇక సాగలేనని
ఈ ముళ్ళ బాట

అవ్వ బువ్వ తినలేదని
తాత దగ్గు వినలేనని
చూడలేని అమ్మ కళ్ళూ
నడవలేని నాన్న కాళ్ళూ
ఎన్నాళ్ళీ రోదన రాగం?
ఎన్నాళ్ళీ వేదన రోగం?

గంపెడంత బావ ఆశ
తీర్చలేని అక్క గోస
సమాజాల దుర్భిణిలో
సగటోడా ఎన్నాళ్ళు

ఛీ! ఛీ!

వెళ్ళిపో దూరంగా
సన్యాసం లోకి
సాధువులా ముసుగేసుకో
పిరికిపంద!!

రవికిరణం (http://ravikiranam.blogspot.com/)

Posted in కవిత్వం | 3 Comments

మృతజీవులు – 5

బండీ ఇంటిముందు ఆవరణలో ప్రవేశించేసరికి ఇల్లుగలాయన వాకిటనే నిలిచి ఉండటం చిచీకవ్ కంటపడింది. ఆయన పలుచని ఆకుపచ్చకోటు ధరించి, ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని, సమీపించే బండిని పరికిస్తున్నాడు. బండీ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయన ముఖం వికసించసాగింది, చిరునవ్వు విస్తరించింది.

చిచీకవ్ బండి దిగుతూండగా ఆయన “పావెల్ ఇవానొవిచ్ గారే! ఇంతకాలానికి మేం జ్ఞాపకం వచ్చామన్నమాట!” అన్నాడు.

ఇద్దరు మిత్రులూ ఆప్యాయంగా ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నాక, మానిలవ్ అతిథిని లోపలికి తీసుకుపోయాడు. వారు ముందు వసారాను, హాలునూ, భోజనశాలనూ దాటడానికి ఎక్కువసేపు పట్టకపోయినా యీ అవకాశం తీసుకుని యీ గృహస్తు గురించి కొన్ని మాటలు చెప్పాలి; అది అంత సులువైన పని కాదని కథకుడు ముందే మనవి చేసుకోవటం మంచిది. భారీ ఎత్తున వ్యక్తులను చిత్రించడం సులువు; రంగులను గుప్పిళ్ళతో తీసి చల్లవచ్చు – నల్లగా నిగనిగలాడే కళ్లూ, ముందుకు పొడుచుకువచ్చే కనుబొమలూ, ముఖాన చింతమూలాన ఏర్పడిన ముడతలూ, భుజం మీదుగా ఒక నల్లని, లేక రక్తవర్ణంగల పటమూ చిత్రించితే చాలు చిత్తరువు పూర్తయిపోతుంది. కాని మామూలు మనుషులను వర్ణించడం అమిత కష్టం, ప్రపంచంలో అసంఖ్యాకులుగా వున్నవాళ్ళు చప్పున చూస్తే ఒకటిగానే వుంటారు, కాని పరిశీలించి చూస్తే సులువుగా గ్రహించరాని ప్రత్యేక లక్షణాలుంటాయి. కనబడీ కనబడని ఈ ప్రత్యేక లక్షణాలను పైకి తీసుకురావడానికి తల పగలగొట్టుకోవాలి; ఇందుకుగాను ఎంతో సునిశితమైన పరిశీలనానుభవం అవసరం.

మానిలవ్ మనస్తత్వం ఎటువంటిదో ఈశ్వరునికే తెలియాలి. “అదోరకం” అని వర్ణించదగిన మనుషులున్నారు; వారు అటూ ఇటూ కాకుండా ఉంటారు, గొర్రెలలోనూ చేరరు, మేకలలోనూ చేరరు, మానిలవ్ ను ఈ జాతిలో చేర్చవచ్చు. చూడటానికి ఆయన అందమైన మనిషి. ఆయన ముఖం చూడముచ్చటగా ఉంటుంది, అయితే అందులో తీపి జాస్తి. ఆయన ప్రవర్తనలో అవతలివాణ్ణి మంచి చేసుకుందామనే ఆదుర్దా కనిపిస్తోంది. ఆయన చిరునవ్వు సమ్మోహనకరంగా ఉంటుంది. జుట్టు తేలికరంగుగానూ, కళ్లు నీలంగానూ వుంటాయి. ఆయనతో మాట్లాడ నారంభించగానే ఎవరికైనా, “ఆహా, ఎంత మంచివాడు, సహృదయుడు” అనిపిస్తుంది,. మరునిమిషం ఏ భావమూ లేకుండా పోతుంది, మూడో నిమిషంలో “ఈయన ధోరణి ఏమిటయినట్టా?” అనిపిస్తుంది: అప్పుడు మనం సెలవు పుచ్చుకుంటాం, వెళ్లిపోలేని పరిస్థితిలో మనకు చెడ్డ విసుగు పుట్టుకొస్తుంది. మనం అవతలి మనిషికి అప్రియమైన ప్రస్తావన తెచ్చినట్టయితే వాడు తొట్రుపడటమో, తూలి మాట్లాడటమో సాధారణంగా జరుగుతుంది; మానిలవ్ అలా ఎన్నడూ చేయడు. ప్రతి మనిషికీ ఒక వ్యసనం ఉంటుంది: ఒకడికి వేటకుక్కల పిచ్చి; మరొకడికి సంగీతం పిచ్చి, సంగీతపు లోతులను తాను అద్భుతంగా తరచగలననుకుంటాడు; మూడోవాడు భోజనం దగ్గర తన నైపుణ్యం అద్భుతమనుకుంటాడు; నాలుగోవాడు తనకు విధి ప్రసాదించిన పాత్ర కన్న కనీసం ఒక్కపిసరు గొప్పగా అభినయించాలని తహతహలాడతాడు; అయిదోవాడు ఆట్టే పెద్ద ఆశలకు పోక, యే కోర్టు అధికారితోనో పచార్లు చేస్తూ తన మిత్రులకూ, పరిచితులకూ, ఆ మాటకు వస్తే ఎరుగనివాళ్లకున్నూ కనపడి వారి మెప్పు సంపాదించాలని అహోరాత్రాలు కలవరిస్తాడు; ఆరోవాడి చేతికి ఏ డైమను ఆసుముక్క కొసనో, రెండుబంతి ముక్క కొసనో మడపాలన్న ప్రేరణ దైవికంగా కలుగుతూ ఉంటుంది; ఏడోవాడికి సర్వత్రా నియమాలు అమలు చేయాలనీ, స్టేషను మాస్టర్లూ, బండి తోలేవాళ్లూ తన ఆజ్ఞానుసారం నడుచుకునేలాగా చేయాలనీ ఉంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రతివాడికీ ఏదో ఒక “కళ” ఉంటుంది.

కాని మానిలవ్ కు ఏ ఒకటీ లేదు. ఆయన ఇంటివద్ద ఆట్టే మాట్లాడేవాడు కాడు, ధ్యానం లోనూ, ఆలోచనలోనూ జాస్తిగా గడిపేవాడు, కాని దేన్ని గురించి ఆలోచించేవాడో అదీ ఈశ్వరునికే ఎరుక. ఆయనకు పొలాలను చూచుకోవడంతో సరిపోయేదనటానికి లేదు, ఆయన ఏనాడూ తన పొలాలకేసి వెళ్ళి ఎరగడు; ఆయన ఎస్టేటు తన మానాన తాను నడిచేది. నిగామాను తనతో, ఇలాచేస్తే బాగుంటుంది, అలాచేస్తే బాగుంటుంది అంటే, ఆయన పైపు కాలుస్తూ “అవును అందువల్ల చిక్కులేదు” అని సాధారణంగా జవాబిచ్చేవాడు. (ఈ పైపు కాల్చే అలవాటు ఆయనకు సేనలో పని చేసేటప్పుడు పట్టుబడింది; ఆయన సేనలో అధికారిగా ఉండగా చాలా నిరాడంబరుడనీ, నాగరికుడనీ, మంచి సంస్కారం గలవాడనీ అనుకునేవారు). “అవును, అందువల్ల చిక్కేమీలేదు” అనేవాడాయన మళ్ళీ. రైతు ఎవరన్నా తన దగ్గరికి వచ్చి, తల వెనకభాగం గోక్కుంటూ, “యజమానీ, నకు సెలవు దయచేయించాలి. నేను పన్నులు కట్టడానికి డబ్బు సంపాదించి తెచ్చుకుంటాను”, అంటే, “అలాగే వెళ్లు” అనేవాడు పైపు కాలుస్తూ. ఆ రైతు కొంత కాలం తప్పతాగటానికి పోతున్నాడని ఆయన బుర్రకు తట్టేది కాదు. ఒక్కొక్కసారి ఆయన బయట మెట్లమ్నీద నిలబడి తన ఆవరణలోకి గాని, కొలనుకేసిగాని చూసి, ఇంటినుంచి నేల సొరంగం తవ్వినా, కొలనుమీదుగా ఒక వంతెనకట్టి, దానికి అటూ, ఇటూ దుకాణాలు ఏర్పాటు చేసి, వాటిలో రైతులకు కావలసిన వస్తువులన్నీ అమ్మే ఏర్పాటు చేసినా ఎంతో బాగుంటుందనేవాడు. ఈ మాటలనేటప్పుడు ఆయన కళ్లు చక్కెరపాకంలాగా అయేవి, ఆయన మొహంలో ఎంతో సంతృప్తి గోచరించేది. అయితే ఆ ఆలోచనలు మాటలరూపాన్ని దాటి ఎన్నడూ కార్యరూపాన్ని దాల్చేవికావు.

ఆయన చదువుకునే గదిలో ఆయన రెండేళ్లనుంచీ చదువుతున్న ఒక పుస్తకంలో పధ్నాలుగో పేజీవద్ద గుర్తు ఉంచి ఉన్నది. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి వెలితిగా ఉంటూనే ఉంటుంది: డ్రాయింగు రూములో మేలురకం చెక్కసామగ్రి ఉన్నది, దానికి ఎంతో మంచి పట్టుతొడుగులు అమర్చారు, ఆ పట్టు చాలా ఖరీదై ఉండాలి, కాని అది చాలని కారణంచేత రెండు వాలుకుర్చీలకు గోతం తొడుగులు మాత్రమే వేశారు. ఇంటి యజమాని కొన్ని సంవత్సరాలుగా తన అతిథులతో “వాటిమీద కూచోకండి, అవి ఇంకా పూర్తికాలేదు”, అంటూ వస్తున్నాడు. పెళ్లయిన కొత్తలో ఆయన తన భార్యతో, “మన ఖాళీగదుల్లో చెక్కసామగ్రి కొంతకాలంపాటైనా అమర్చాలి, దాని విషయం రేపు చూద్దాం” అన్నాడు, కాని ఆ గదుల్లో ఈనాటికీ చెక్కసామగ్రి అమరలేదు. పొద్దూకగానే బల్లమీద చాలా అందమైన నల్లని కంచు కొవ్వొత్తిస్టాండు తెచ్చి పెట్టారు, దానిపైన మూడు “గ్రేసుల” బొమ్మలున్నాయి, అందమైన ముత్యపుచిప్పతో చేసిన కప్పున్నది. దాని సరసనే మైనంకప్పిన పురాతన రాగివస్తువొకటి కూడా పెట్టారు – ఈ సంగతి ఇంటి యజమాని గాని, యజమానురాలుగాని, నౌకర్లుగాని గమనించనేలేదు.

ఇక ఆయన భార్య – ఏమైనప్పటికీ వారు ఒకరి కొకరు పూర్తిగా అతికిపోయారు. వారికి పెళ్లి అయి ఎనిమిదేళ్లు దాటినప్పటికీ, ఎంతో ప్రేమగా “ఏదీ నోరుతెరూ!” అంటూ ఒకరికొకరు యాపిల్ ముక్కలూ, చక్కెరబిళ్ళలూ, పప్పులూ పెట్టుకుంటారు. ఒకరు నోరు తెరవమనగానే రెండోవారు ముద్దుగా తెరుస్తారని వేరే చెప్పనవసరం లేదు. పుట్టినరోజు పండగలకు ఒకరికొకరు బహుమానాలు – టూత్ బ్రష్ పెట్టుకునేందుకు పూసలుకుట్టిన తొడుగులాటివి – ఇచ్చుకునేవారు. తరుచు వారు సోఫాలో కూచుని ఉన్న సమయంలో, అకస్మాత్తుగా, ఎలాటి కారణమూ లేకుండా, ఆయన తన పైపుతీసి పక్కన పెట్టేవాడు, ఆమె ఆ సమయానికి కుట్టుపని చేస్తూన్న పక్షంలో దాన్ని పక్కన పెట్టేసేది, ఆ తరవాత ఇద్దరూ ఎంత దీర్ఘంగా, ఎంత నీరసం పుట్టేలాగా చుంబించుకునేవారంటే ఈ లోపుగా ఒక చిన్నచుట్ట కాల్చి పారెయ్యవచ్చు. మొత్తంమీద వాళ్ళు సుఖంగా ఉన్నారు. చూశారో లేదో, ఇల్లన్న తరవాత దీర్ఘంగా చుంబించటాలూ, బహుమానా లిచ్చుకోవటాలూగాక ఇంకా ఎన్నో పనులు చెయ్యవలసి ఉంటుంది. ఎన్నో సంశయాలు తల ఎత్తుతాయి. మాటవరసకు, వంట అలా అఘోరిస్తుందేం? ఇల్లుచూసే మనిషి అలా చేతివాట్లు వేస్తుందేం? సామాను గది ఖాళీగా ఉంటుందేం? ఇంటి నౌకర్లు తమ చిత్తం వచ్చినప్పుడు నిద్రలు లేచి, మిగిలిన సమయాల్లో అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తారేం?

అయితే ఇవన్నీ హీనవిషయాలు, మానిలవ్ భార్యేమో బాగా చదువుకున్న మనిషి. వసతి పాఠశాలల్లో ఉండి చదివితేగాని ఉన్నతవిద్య లభించదని అందరికీ తెలిసిన విషయమే గదా. వసతి పాఠశాలల్లో మానవత్వానికి పునాదులుగా ఉండగల విషయాలు మూడు గట్టిగా అబ్బుతాయి: కుటుంబజీవితం సుఖవంతంగా సాగగలందులకు ఫ్రెంచి భాషా, విశ్రాంతి తీసుకునేటప్పుడు వారిని రంజింపజేయటానికి పియానో వాయించటం, ఇంకా ముఖ్యమైన శిక్షణ, అనగా సంచీ వగైరా బహుకృతులు అల్లటం. ఇటీవల ఇంకా కొత్త పద్ధతులూ, అభివృద్ధికరమైన మార్పులూ జరుగుతున్నాయనుకోండి. ఈ సంస్థలను నడిపే ఆడ ప్రిన్సిపాల్ ల వివేక వికాసాలపైన అంతా ఆధారపడుతుంది. ఉదాహరణకి, కొన్ని వసతి పాఠశాలల్లో పియానోకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఫ్రెంచి భాషకూ గృహశిక్షణకూ తక్కువ ఇస్తారు. మరి కొన్నింట గృహశిక్షణ అంటే సంచుల్లాంటివి అల్లడం ప్రధానంగా ఉండి, ఫ్రెంచీ, పియానో తక్కువ స్థానం ఆక్రమిస్తాయి. అన్నిరకాలూ ఉన్నాయన్న మాట. మానిలవ్ భార్య విషయంలో మనం తెలుసుకోదగినది… క్షమించండి, నాకు స్త్రీల గురించి మాట్లాడటమంటే చెడ్డభయం. అదీగాక మన ముఖ్య పాత్రధారులు డ్రాయింగురూము వాకిలివద్ద ఇప్పటికే చాలా నిమిషాలుగా నిలబడి ఒకరినొకరు ముందు వెళ్ళమని వేడుకుంటున్నారు.

“దయచేసి నాకోసం తమరు కించకాకండి. నేను మీ వెనక వస్తాను”, అంటున్నాడు చిచీకవ్.

“అలాకాదు, పావెల్ ఇవానొవిచ్, మీరు అతిథి”, అంటూ మానిలవ్ గదికేసి చెయ్యి ఊపాడు.

“మీరిలాంటి పట్టింపులేవీ పెట్టుకోక ముందు నడవండి, చెబుతాను”, అన్నాడు చిచీకవ్.

“మీరు నన్ను క్షమించవలసిందేను. మీవంటి యోగ్యులూ, సంస్కారులూ నా వెనకగా రావటం ఏమాత్రమూ భావ్యం కాదు.”

“ఏమిటా సంస్కారం?.. పదండి.”

“వీల్లేదు, మీరే పదండి.”

“ఎందుకూ?”

“ఎందుకంటే అందుకే!”

అంటూ మానిలవ్ ముచ్చటగా మందహాసం చేశాడు.

చిట్టచివరకు మిత్రులిద్దరూ అడ్డంగా తిరిగి, ఒకరినొకరు కొంచెంగా ఒరుసుకుంటూ, ఏక కాలమందే లోపలికి వెళ్లారు.

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 5