మృతజీవులు – 11

“ఏమమ్మా, మేము ప్రయాణీకులం. ఈ రాత్రికి కాస్త తల దాచుకోనియ్యి”, అన్నాడు చిచీకవ్.

“మొత్తం మీద గట్టివాళ్ళేనే. ఇదేనా వచ్చేవేళ? ఇది వసతి గృహం కాదు, దొరసాని గారి ఇల్లు”, అన్నది ముసలిది.

“మేమేం చెయ్యాలి, చెప్పూ. మేం దారి తప్పాం. ఇది ఆరుబయట గడిపే రాత్రేనా? వాతావరణం చూడూ!”

“అవును వాతావరణం చాలా చీకటిగ ఉంది. మంచి వాతావరణం కాదు”, సేలిఫాన్ వంతపలికాడు.

“నోరు ముయ్యరా, వెధవా!” అన్నాడు చిచీకవ్.

“మీరెవరేమిటి?” అన్నది ముసలిది.

“ఒక కామందును”

కామందు అనే మాట చెవినిబడగానే ముసలిది ఆలోచించి, “క్షణం ఉండండి, యజమానురాలితో చెబుతాను”, అని రెండు నిమిషాలలో లాంతరు పట్టుకుని తిరిగి వచ్చింది. గేటు తలుపులు తెరుచుకున్నాయి. ఇంకొక కిటికీలో కూడా వెలుతురు కనిపించింది. బండి లోపలికి వెళ్ళి ఒక చిన్న భవంతి ముందు ఆగింది. చీకటిలో ఇంటి స్వరూపం తెలియరావటం లేదు. కిటికీలోంచి వచ్చే కాంతి ఇంటి ఒకవేపునే పడుతున్నది. ఆ కాంతి ఒక నీటి మడుగుమీద పడటం వల్ల అది కూడా కనిపిస్తున్నది. వాన ఇంటి కప్పు మీది చెక్కల పైన పడి చప్పుడు చేస్తున్నది. నీళ్ళ గొట్టం గుండా నీరు దొణదొణా ప్రవహిస్తున్నది. ఇంతసేపూ కుక్కలు అన్ని స్థాయిలలోనూ అరుస్తున్నాయి. ఒక కుక్క మోర ఎత్తి ఎవరో బాగా డబ్బిస్తున్నట్టు ఎంతో శ్రమపడి దీర్ఘంగా కూస్తున్నది; మరొకటి చర్చిలో పవిత్ర పాత్రలను సంరక్షించే వాడిలాగా అతి వేగంతో కంయి కంయి మంటున్నది; ఈ రెంటికీ మధ్యగా టపాబండీ గంట లాగా తారాస్థాయిలో అరుస్తున్నది, బహుశా కుక్కపిల్ల అయి ఉంటుంది, దీనితో ఒక మందరస్థాయికుక్క పోటీ చేస్తున్నది. బహుశా దృఢమైన శునకత్వం గల ముసలికుక్క అయి ఉంటుంది. చర్చిలో బృందగానం జోరుగా సాగేటప్పుడు బొంగురుగా పాడేవాడి గొంతు ఇలాగే ఉంటుంది. ఉచ్ఛస్థాయిలో పాడేవాళ్ళంతా మునివేళ్ళపై నిలబడి స్థాయి అందుకోవడానికి మోరలెత్తి సాగుతూ ఉంటారు. వీడు మటుకు చతికిలపడి నేలకు అంటుకు పోయేవాడిలా కూచొని మాసిన గడ్డాన్ని మెడపట్టీలోకి దూర్చుకుని భోం అని ఒక్క స్వరం పలికేసరికి కిటికీల అద్దాలన్నీ దద్దరిల్లిపోతాయి. ఇటువంటి కుక్కల బృందం మొరుగునుబట్టే ఇది మంచి గ్రామమని అనుకోవచ్చు.

కాని మన కథానాయకుడు తడిసి చలికి బిగుసుకు పోయి ఉండటాన పక్కను గురించి తప్ప మరి దేన్ని గురించీ ఆలోచించలేదు. బండి ఆగీ ఆగక ముందే అతను బయటికి దూకి తూలినంత పనిచేశాడు. మెట్లమీదికి మరొక ఆడది వచ్చి అతన్ని లోనికి తీసుకుపోయింది; ఈ మనిషి ముసలిదానికన్నా చిన్నది, కాని ముసలిదాన్ని పోలియున్నది. చిచీకవ్ గదిని ఒకటి రెండు సార్లు సంగ్రహంగా చూచాడు. గదిగోడలకు పాతరకం చారల కాగితం అంటించారు. పక్షుల చిత్రాలున్నాయి. కిటికీల మధ్య భాగంలో పాతకాలపు అద్దాలు, ఆకుల ఆకారంలో చేసిన నల్లటి చట్రాలు గలవి, ఉన్నాయి. ప్రతి అద్దం వెనకా ఒక ఉత్తరమో పాత చీట్లపేకో, కాలి తొడుగో కుక్కి ఉన్నది. గోడన ఒక గడియారం ఉన్నది, దాని మొహాన పూవులు వేసి ఉన్నాయి. అతనికి అవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. అతని కళ్ళనెవరో తేనె పూసినట్టుగా రెప్పలు అంటుకుపోతున్నాయి. మరొక నిమిషానికి ఇల్లుగలావిడ స్వయంగా వచ్చింది. వయసు మళ్ళిన మనిషి, తొందరపాటుగా నెత్తికొక కుళాయి తగిలించుకున్నది. మెడకు ఫ్లానల్ చుట్టుకున్నది. చిన్న ఎస్టేట్లకు హక్కుదార్లయిన ఇలాటి బుద్ధిమంతురాళ్ళు, తలలు ఒక పక్కకు కొద్దిగా ఒరగేసి, తమ పంటలు పాడయిపోయాయో, నష్టం వచ్చిందో అని లబలబలాడుతూ, కాస్త కాస్తే డబ్బుచేర్చి, వేరు వేరు సొరుగుల్లో దాచిపెడ్తూంటారు. తాము పోగుచేసిన రూబుళ్ళనన్నిటినీ ఒక సంచిలో వేస్తారు. మరొక సంచీలో అర్థరూబుళ్ళూ, మూడోదానిలో కాలు రూబుళ్ళూ చేరుస్తూ ఉంటారు. వాళ్ళ సొరుగుల్లో చిన్నచిన్న ఉడుపులూ, రాత్రి దుస్తులూ, దారపు ఉండలూ, కుట్టని తొడుగూ తప్ప ఏమీ ఉండదనుకుంటాం. పాత తొడుగు వంట చేసేటప్పుడు నిప్పంటుకుని కాలిపోవడమో, చినిగిపోవడమో జరిగితే తప్ప కొత్తది కుట్టడం జరగదన్నమాట; కానీ ఆ పాతది ఎంతకాలానికీ కాలనూ కాలదు, చినగనూ చినగదు. కొత్త తొడుగు ఏళ్ళ తరబడి అలాగే కుట్టకుండా ఉండి, చివరకు మిగిలిన చెత్తతోబాటు వారసురాలికి పోతుంది.

అనుకోకుండా ఇలావచ్చి ఆమెకు శ్రమ కలిగించినందుకు చిచీకవ్ క్షమాపణ చెప్పుకున్నాడు.

“పరవాలేదు, పరవాలేదు” అన్నదావిడ. “ఎంతవానలో పంపాడు దేవుడు మిమ్మల్ని! ఏమిగాలి, ఏమివాన… ప్రయాణం చేసి వచ్చారు, మీరేదైనా తినటం భావ్యంగా ఉంటుంది, కాని ఈ అపరాత్రి వేళ వంట చేయటానికి లేదు.

ఆమె మాట్లాడుతుండగానే పెద్ద బుస వినబడేసరికి చిచీకవ్ గాబరా పడ్డాడు. ఆ చప్పుడు వింటే గది నిండా పాములున్నాయనిపించింది. కాని తలయెత్తి చూసేసరికి అతని గుండె కుదుట పడింది. గడియారం గంటలు కొట్టబోతోందని అతను తెలుసుకున్నాడు. బుసవెంట మూలుగు లాటిది వినబడింది. చివరకు అతిప్రయాస మీద గడియారం రెండు కొట్టింది. ఆ దెబ్బలు ఓటికుండ మీద కర్రతో కొట్టినట్టున్నాయి. గంటలు కొట్టటం కాగానే పెండ్యులం అటూ ఇటూ ఆడుతూ ఎప్పటి లాగ టిక్కి టిక్కు మనసాగింది.

చిచీకవ్ ఆవిడతో తనకేమీ అవసరం లేదనీ, తనకోసం ఎలాటి శ్రమ పడవద్దని, తనకు కావలసినదల్లా పక్క మాత్రమేననీ, తాను చేరిన గ్రామం ఏదో తెలుసుకోవాలని ఉన్నదనీ, సబాకవిచ్ ఉండే గ్రామం సమీపంలోనే ఉన్నదా అనీ అన్నాడు. ముసలావిడ తాను ఆ పేరెన్నడూ వినలేదనీ, అటువంటి భూస్వామి ఆ ప్రాంతాల లేడనీ చెప్పింది.

“పోనీ మీకు మానిలవ్ తెలుసా?” అన్నాడు చిచీకవ్.

“మానిలవ్ ఎవరేమిటి?”

“భూస్వామి”

“లేదు, ఎన్నడూ వినలేదు. అలాటి పేరుగల భూస్వామి ఈ ప్రాంతాల లేడు.”

“ఈ ప్రాంతాల ఉండే భూస్వాములెవరు?”

“బబ్రోవ్, స్వీన్విన్, కనావత్యెవ్, ఆర్పాకిన్, త్రిపాకిన్, ప్లేషకీన్”

“మంచి సంపన్నులా?”

“లేదు బాబూ, అంత సంపన్నులు కారు. ఇరవై మందీ, ముప్పైమందీ కమతగాళ్ళు కలవారు. నూరు మంది గలవాళ్ళు ఒక్కరూ లేరు.

తాను వచ్చి పడినది ఉత్త అడవీ ప్రాంతమని చిచీకవ్ తెలుసుకున్నాడు.

“అయితే పట్నం చాలా దూరమా?”

“నలభై మైళ్ళుంటుంది. నేను మీకేమీ యివ్వలేకపోతినే! ఒక కప్పు తీసుకోరా బాబూ?”

“వద్దండి. నాకు పక్క తప్ప ఇంకేమీ వద్దు.”

“ఇటువంటి ప్రయాణం చేసినాక విశ్రాంతి అవసరమే. మీరిలా ఈ సోఫా మీద పడుకోండి, బాబూ! ఏమేవ్ ఫితీన్యా, ఈకల పరుపూ, దిళ్ళూ, దుప్పటీ పట్టుకురా. ఏమి వాన తెప్పించాడు దేవుడు! ఒకటే ఉరుములూ — దేవుడి దగ్గర తెల్లవార్లూ దీపారాధన ఉంచా. అయ్యొ బాబూ, మీ వీపునా, పక్కనా ఈ బురదేమిటి, పందిలాగా? ఈ బురదంతా ఎక్కడ చేసుకున్నారు?”

“ఇంకా నయం, బురదతో పోయింది. ఎముకలు విరగనందుకు సంతోషించాలి”

“ఓరి దేవుడా, ఎంత ఘోరం! మీ వీపు ఏదన్నా పెట్టి తుడవొద్దూ?”

“వద్దండీ. మీరేమీ హైరానా పడకండి. నా బట్టలు ఆరబెట్టి, బ్రష్‌తో తుడవమని మీ పనిమనిషికి మటుకు చెప్పండి.”

“విన్నావా ఫితీన్యా!” అన్నది ముసలావిడ మెట్ల మీదికి వచ్చిన ఆడమనిషితో. ఆ మనిషి ఇప్పుడు ఒక ఈకల పరుపును గది లోకి ఈడ్చుకు వచ్చి, దాన్ని రెండు పక్కలా బాది, గది అంతా ఈకలమయం చేసింది. “ఈ బాబు గారి కోటూ అవీ తీసుకుని, మీ అయ్యగారి దుస్తులు ఆరబెట్టే దానివే, అలాగే మంట దగ్గర ఆరబెట్టి, ఆ తరవాత వాటిని దులిపి, బ్రష్‌తో తుడిచెయ్యి” అన్నది యజమానురాలు దాసీతో.

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 11

విషాద సంధ్య

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

(సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ఈ కవిత సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక బహుమతి కథల ప్రత్యేక సంచికలో (జూలై-సెప్టెంబర్ 2007) ప్రచురితమైంది. ఈ కవితను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన నేత్రం సంపాదకులు శశిశ్రీ గారికి నెనర్లు.)

ఎన్ని కడవల అశృబిందువులో అక్షరాలుగా చింది
నన్నంతా తడిపి తడిపి తిరగేసినప్పుడు
ఆ పల్లెకు – నా పుట్టిల్లుకు నడుస్తాను.
బస్సంటే తెలీని ఆ ఐదుమైళ్ళ కాలిబాట
ఐదైదు స్మృతివిహంగాలై నా మెదడు మైదానం
నిండా వాల్తాయి.

చేతిలోని లెదర్ బ్యాగ్
పుస్తకాల సంచి అయి వూగుతుంది.
ప్రతి మట్టి రేణువు చిరుమువ్వ అయి
నా కాలి వేళ్ళతో కిలకిలలాడుతుంది.

దారిమధ్య ‘సగిలేరు‘ చెలిమ కన్నుల్ని తెరచి
నా బాల్యం దాకా గుచ్చి గుచ్చి చూస్తుంది.

వానపొద్దున వొంటిమీది బట్టల్ని
ప్లాస్టిక్ సంచిలో పుస్తకాల వెనక కూరి
నెత్తిన అడ్డుంచుకొని పరిగెత్తిన
అమాయిక నగ్నత్వం నన్నిపుడు గిలిగింతలు
పెడుతుంది.

రాళ్ల దెబ్బలు, కాపలా కేకల వాయిద్యాల్ని మోస్తూ
మామిడితోపు వాసన కాలిబాట దాకా వీస్తుంది.

ఊరంచున పొలాలన్నీ
బడి పలకలై తడితడిగా లేస్తాయి.

డొంకలో –
అరికాలి కింద నాటిన తుమ్మముల్లు
గ్రాంఫోను ముల్లయి పసి ఆటలన్నిట్నీ పాడుతుంది.
బడిగంట లేత వెలుగుల్ని రాల్చుతూ
ఎదకొలనులోకి నెలవంకలా జారుతుంది.

అప్పుడే – పల్లె నన్ను తాకుతుంది.
స్మృతులన్నీ బెదరిన గుడిపావురాలవుతాయి.
కొత్తగాలినై వీధులెంట సాగుతోంటే
ఎన్ని చూపులో నన్ను మూచూసేందుకు
పొడుచుకొస్తాయి.

వాళ్ళలో వాళ్ళు పరస్పరం నన్ను పరిచయం
చేసికొంటుంటారు.
నేను వీధి గతుకుల్ని పరిశీలిస్తున్నట్లుగా
హుందాగా నడుస్తుంటాను.

నా స్వంత యింటి వాసన కొంత దూరాన్నించి
గుండెల్ని తాకుతుంది.
ఇంటిముందు అరుగుమీద అమ్మనాన్నలు
గుడ్డిదీపాలై
నాకేసి ప్రశ్నార్థకాలుగా వంగి
ఆపై ఆశ్చర్యార్థకాలై సాగి
మరుక్షణం కరిగి కరిగి కన్నీటి మడుగులవుతారు.

చెదలుగుంపై వాళ్ల వొంటినంతా, మనస్సునంతా
తినేసిన
నా అనాదరణ పవరెంతో నాకిప్పుడు
అర్థమవుతుంది.
వాళ్ల జీవన సాయం సంధ్యలోకి అతిథినై
అడుగేసినందుకు సిగ్గుపడతాను.
నేనింకా –
ఆ యింటి కోడినై, కుక్కపిల్లనై, లేగదూడనై
నిక్కరులో వొదిగిన కుర్రాడినై
వాళ్ల కన్నీటిని పొదువుకొనే మట్టినై కరగనందుకు
చిరునామా చెప్పుకోలేనంత సిగ్గుగా ఉంది.

——————–
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డివృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కవిగా, కథా-నవలా రచయితగా ప్రసిద్ధుడు. 1987లో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం “కవితా! ఓ కవితా!!” లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని – వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి – ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.

Posted in కవిత్వం | 3 Comments

ఒక నవయువకుని నవద్వీప విజయం

చాంద్రమానం ప్రకారం, ఈ సంవత్సరం డిసెంబరు రెండోతారీఖు కావ్యకంఠ గణపతిముని జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని – సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాసం.

-పప్పు నాగరాజు (http://www.canopusconsulting.com/salabanjhikalu/)

———-

కావ్యకంఠ గణపతిముని
కావ్యకంఠ గణపతి ముని (1878-1936)

అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.

ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.

శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం – దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.

ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.

అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది. బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:

సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః

అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు. అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే:

గణపతి రితి కవికులపతిరతి దక్షో దాక్షిణాత్యోహం
ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా కవికులపతి అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా – భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, నేను ఔరస పుత్రుడిని) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడుకూడా. సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు. ఆ నాలుగు సమస్యలు:

స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి (కింత్యనవద్యచరితా)
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా)
పిపీలికా చుంబతి చంద్రమండలమ్

ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు. ఆ పూరణలేమిటంటే:

హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి
(భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తనమామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం. ఇక్కడ, ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు – మెదటిది ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు)

చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయా
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
(భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూడవలసి వస్తుందేమోననే శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు)

రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయే
కళత్ర భావే చ ధరా తనూజః
లగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్
సూర్య శశాంకేన సమం వినష్టః
(పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు – లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును)

సతీ వియోగేన విషణ్ణ చేతసః
ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్ర మండలమ్
(దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను)

కావ్యకంఠ గణపతి ముని
యువ గణపతి ముని

దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే. ఇక వ్యాఖ్యాన పటిమని పరీక్షించాలి. ఇందుకోసం అంబికాదత్తుడు, రఘువంశంలోంచి ఒక శ్లోకము, కావ్య ప్రకాశమనే గ్రంథంలోంచి మరొక శ్లోకము ఇచ్చి – వీటిపై గణపతిని వ్యాఖ్యానించమన్నాడు. అనర్గళంగా, సుమారుగా ఒక గంటసేపు, ఈ రెండు శ్లోకాలపై తన కవిత్వ పటుత్వాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, యుక్తిని, విమర్శనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ, సభాసదులందర్నీ మంత్రముగ్ధులని కావిస్తూ గణపతి ప్రసంగం కొనసాగుతోంది – ఇంతలో, ఒకచోట – సర్వాసాం అనుటకు బదులు సర్వేషాం అని గణపతి వాణి తొట్రుబడింది. తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న అంబికా దత్తుడు – వెంటనే ‘విరామాతావత్‘ అన హూంకరించి:

అనవద్యే నను పద్యే గద్యే హృద్యేపి తే స్ఖలతి వాణీ
తత్కింత్రిభువన సారా తారా నారాధితా భవతా


నిర్దుష్టమగు పద్యములో మనోహరమగు వచనమందు నీ వాణి స్ఖలించెను. నీవు త్రిభువన శ్రేష్టురాలగు సరస్వతినారాధించలేదా?
అంటూ ఆక్షేపించాడు. స్త్రీలింగ శబ్దం వాడాల్సిన చోట పుల్లింగం వాడేడని ఇందులో చమత్కారం.సుమారొక గంటసేపు గంగాప్రవాహంలా పరవళ్ళు తొక్కుతూ, రసికజన హృదయాలని రసపూరితమొనర్చిన వాణి, అంత సేపు నిర్దోషంగా ఉన్నందుకు అభినందించడానికి పోయి, ఆక్షేపించిన అంబికాదత్తుడు కూడా పాపం పప్పులో కాలేసాడు. సారస్తారా అని పుల్లింగ శబ్దాన్ని ప్రయోగించడానికి బదులు, సారాతారా అంటూ ప్రాసకోసం పాకులాడేడు. గణపతి వెంటనే ఈ దోషాన్ని సభాసదులకెత్తి చూపి:
సుధాం హసంతీ మధు చాక్షిపంతీ
యశోహరంతీ దయితాధరస్య
న తే ల మాస్యం కవితా కరోతి
నోపాస్యతే కిం దయితార్ధ దేహః
(అమృతమును పరిహసించునట్టి, మధువునాక్షేపించునట్టి, ప్రియురాలి యధరోష్ఠ కీర్తిని హరించునట్టి కవిత్వము నీ ముఖమునలంకరించ లేదెందువలన? నీవు కాంతార్ధ విగ్రహుడగు నీశ్వరు నుపాసించలేదా?)ఈ ఆక్షేపణతో అంబికాదత్తుడు పరాభవాన్ని తట్టుకోలేక గణపతిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ వ్యక్తిగత సంవాదం ఆరంభమైంది. ఇద్దరూ తమ తమ ఆశుకవితా శక్తినే కొరడాలుగా మలచి ఒకరినొకరు చావబాదుకోవడం మొదలెట్టారు.

అంబి:

జ్యోతిరింగణ న కిం ను మన్యసే
యత్త్వమేవ తిమిరేషు లక్షసే
(ఓ మిణుగురు పురుగా, నీవు చీకటిలోనే కాని వెలుతురులో ప్రకాశించవు – అంటే, ఎదుటి వాళ్ళ దోషాలు ఎత్తి చూపించటమే నీ ప్రతిభ అని శ్లేష) దీనికి, దీటుగా, గణపతి:

కిం ను దీప భవనే విభాససే
వాయునా బహిరహో విధూయసే

(ఓ దీపమా, నీవు గృహములోపలనే ప్రకాశించగలవు, వెలుపలకు వచ్చినచో గాలిచే కదల్పబడుదువు – అనగా సభలలో నీ పాండిత్యము నిలువ జాలదని పరిహాసం)అంబికాదత్తుడు:
ఉచ్చైః కుంజర మాకార్షీః బృంహితాని మదోద్ధత
కుంభికుంభామిషాహారీ శేతే సంప్రతి కేసరీ

(ఓ కుంజరమా, మదముచే గర్వించి బృంహిత ధ్వనులను చేయుచుంటివి. ఏనుగుల కుంభస్థలములందుండు మాంసమును హరించు సింహమిచ్చటనే కలదు సుమా)

గణపతి:
మరల దోషమే. కర్మధారయ సమాసముపై హరీ యను మత్వర్ధీయము చెల్లదు. కుంభికుంభామిషాహారః అని బహువ్రీహి సమాసమును మాని ప్రాసకొరకే పాకులాడుతూ దోష ప్రదర్శన చేసుకొనుచున్నావు.

సమాసీనో రసాలే చేత్ మౌనమావహ మౌకలే
లోకః కరోతు సత్కారం మత్వాత్వా మపి కోకిలం
(ఓ కాకమా, నీవు మామిడి చెట్టు నెక్కి కూర్చుండ దలచితివేని మౌనముగా నుండుట మంచిది. లోకులు నిన్నుకూడా కోకిల అనుకొని సత్కరించుదురు)ఇంతటితో ఊరుకోకుండా, గణపతి మరొక పరిహాసం కూడా అంబికాదత్తుడిపై ప్రయోగించాడు:

అపుష్పా చూత లతికా విపన్నా సా సరోజినీ
హేమంతే హంత రోలంబ నిరాలంబః క్వమోదసే
(మామిడి గున్న పుష్పించలేదు – శిశిర ఋతుకాలము రానందువల్ల, తామర పుష్పము నశించెను – హేమంత ఋతువైనందున, అక్కటా – తుమ్మెదా – హేమంత కాలమంతయూ నాశ్రయము లేనిదానివై నీవెక్కడ సంతోషింప గల్గుదువు?)

గణపతికి అంబికాదత్తుడెవరో, అతని వ్యక్తిగత జీవితమేమిటో అస్సలు తెలియదు. కాని, అంబికాదత్తుడి మొదటి భార్య సరోజిని చనిపోగా, అతను రెండో పెళ్ళి చేసుకొన్నాడు, కాని ఆవిడ అప్పటికింకా పుష్పవతి కానందువల్ల, సంసార సుఖానికి నోచుకోలేదు. ఈ విషయం, తెలియకుండానే ధ్వనింప చేసిన గణపతి సిద్ధకవి అని గ్రహించి, అంబికాదత్తుడు, వాదం చాలించి, గణపతిని ఒక ఆసనముపై కూర్చుండబెట్టి, మొహం చిన్నపుచ్చుకొని మౌనంగా ఉండిపోయాట్ట. ఇది కనిపెట్టిన శితికంఠ వాచస్పతి – మీరిద్దరూ సంసారవిషయములను, వ్యక్తిగత దూషణలను విడిచిపెట్టి, గౌడ దాక్షిణాత్యులగుటచే, పరస్పరాంతర్జాతి పరముగా పరిహసించుకొని, సాహిత్య వృత్తాంతములచే వాదముపసంహరించండి అని ఇద్దరినీ ఆజ్ఞాపించాడు.

వెంటనే – అంబికాదత్తుడు:

భటోఖిలోట్టో పరివారవధ్వానిపీయ మధ్వారభతే విహారం
(భట్టులందరు – అనగా దక్షిణాత్యులు – మేడలపై వేశ్యలతోగూడి మద్యపానమును చేసి విహరింతురు)

గణపతి:

అసువ్యయో వాస్తువ్యయో వాప్య మీ న మీన వ్యసనం త్యజంతి
(ప్రాణము పోయిననూ సరే, డబ్బుపోయిననూ సరే మీ మీన వ్యసనమును మాత్రము విడువరు) గణపతి ఇలా శ్లోకం పూరించగానే, ఆనందం పట్టలేక అంబికాదత్తుడు ఆసనం మీంచి లేచివచ్చి గణపతిని కౌగలించుకొని, అతని నిరర్గళ కవితాపటుత్వానికి మెచ్చుకొని సంతోషం వెలిబుచ్చాడు. గణపతి – తాను వాదధోరణియందు చూపిన దూషణాపరాధమును మన్నించమని సవినయంగా వేడుకొన్నాడు. దానికి అంబికాదత్తుడు నవ్వుతూ – నీ మీనద్వయమే నీ అపరాధాన్ని తుడిచిపెట్టిందని పరిహసించాడు (మీనద్వయమనగా అ+మీన+మీన అని రెండు మీనములను బహూకరించుట. నిజానికీ పద విభాగం అమీ+న+మీన.. అనుంటుంది)

అప్పుడు మిగిలిన పరీక్షావర్గం వారు, గణపతినింకా పరీక్షించగోరి, భారతమందు పదునెనిమిది పర్వముల సారమునూ పర్వమునొక్కొక్క శ్లోకము చొప్పున 18 శ్లోకములను చే, అపి, హి, తు, చ అను పదములను ప్రయోగించకుండా చెప్పమని అడిగారు. అడిగిన వెంటనే, ఆశువుగా గణపతి పదునెనిమిది శ్లోకములతో భారతకథా సారమంతా మనోహరంగా చెప్పి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేడు.

నవద్వీపచరిత్రలో ఒక ఆంధ్రుడు గెలుపొందడం ఆకాలంలో అదే మొదటిసారి. పరీక్షావర్గం గణపతికి ‘కావ్యకంఠ’ అనే బిరుదుతో పాటుగా ఒక శ్లోకం బహుమానంగా ఇచ్చి సత్కరించారు.

ప్రాచీనై స్తైః కవికులవరైః కాళిదాసాదిభిర్యా
లబ్ధా కీర్తి దను గతా సైవ భూయ దిదానాం
సద్భిర్దత్తోయ ఇహ రుచిరః కావ్యకంఠోపహారః
తేవ శ్రీమానిహ భువి భవానుజ్జ్వల శ్చాపి భూయాత్
(ప్రాచీనులగు కాళిదాసాది కవివర్యులెట్టి కీర్తిని పొందిరో, వారి ననుసరించిన నీచే నట్టి కీర్తి యిప్పుడు పొందబడెను. ఇక్కడ సత్పురుషులచే మనోహరమగు కావ్యకంఠ బిరుదమేది యొసగబడెనో, ఆ బిరుదమువలన నీవీ భూలోకమందు శ్రీమంతుడవై ప్రకాశింతువు గాక !)అప్పటినుండి, గణపతి శాస్త్రి కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధి కెక్కారు. ఈయన రమణమహర్షి అంతేవాసులలో అగ్రగణ్యుడు. సుమారు వందకు పైగా, సంస్కృత రచనలు చేసారు గణపతిముని స్పృశించని అంశమంటూ లేదు — వేదాంతసారం, యోగం, తంత్రశాస్త్రం, మీమాంస, జ్యోతిష్యం, ఆయుర్వేదం, విమర్శ, ఛందోదర్శనం – లాటి ఎన్నో విషయాలపై గణపతిముని రచనలు – పండితుల ప్రశంసలందుకొన్నాయి. తత్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని కపాళిశాస్త్రిలాటి పండితులభిప్రాయ పడ్డారు.

సద్దర్శనం, రమణగీత, ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమా శతకం, దశమహావిద్యలు వంటి వేదాంత, తాంత్రిక గ్రంధాలు, విశ్వమీమాంస, తత్వఘంటాశతకం, భారత చరిత్ర పరీక్ష వంటి విమర్శనాత్మక గ్రంథాలు, అంబికాగీతం, యోగసార గీతం, గురుగీతం, రేణుకాగీతం, గణపతిగీతం వంటి స్తోత్ర సాహిత్యం, సంస్కృతంలో పూర్ణ అనే ఆంధ్రవిష్ణువుకాలం నాటి చారిత్రాత్మక నవల ఇలా గణపతిముని సాహిత్య సృష్టి అపారం. అంతే కాకుండా, గణపతిముని భారతదేశ స్వాతంత్రపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు, అస్పృశ్యతా నివారణోద్యమాల్లో కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

బొబ్బిలి దగ్గర కలవరాయి అనే అగ్రహారంలో 1878 సంవత్సరం కార్తీక బహుళ అష్టమి నాడు జన్మించిన గణపతిముని 58 సంవత్సరాలు మాత్రమే జీవించి, 1936 లో ఖరగ్‌పూరులో పరమపదించారు.

———-

nagaraj-with-cigar.jpgపప్పు నాగరాజు గారు రాస్తున్న తెలుగు బ్లాగు సాలభంజికలు. ఈ బ్లాగులో ఒక్కో టపా చదువుతూ ఉంటే ఎక్కడా వెనుదిరగనవసరం లేకుండానే విక్రమార్కసింహాసనంపై ఒక్కో మెట్టూ ఎక్కుతున్న అనుభూతి కలుగుతుంది. “వాక్యం రసాత్మకం కావ్యం” అంటే ఏంటో బోధపడుతుంది.

Posted in వ్యాసం | Tagged | 8 Comments

నవంబరు ’07 గడి సమాధానాలు

2007 నవంబరు నెల గడిని పూర్తిగా నింపి ఎవరూ పంపలేదు.

సమాధానాలు:

1శ్రీ వా 2ణి X 3రం X 4 స్త్య 5భ్రా X
కా X X 6భా
నే X X జి X 7సా
8కు రు 9 X X కాం X X 10 త్స
లాం X 11శి
లా
లో 12లి X 13నో ము X X
14ధ్ర వం X
శా
X 15 వా X
రూ
X 16నం 17
X 18నె 19 X X 20రు క్మి X ప్పు
హా X జ్జ X 21 22 ము 23డి X X 24కం చే
25వి
ప్పు
ను
X స్సి X 26
స్త్రి
27 X సి
ష్ణు X లు X 28దీ X X X 29పి
వు X X 30శం
పా
X 31మృ X 32 X ప్పు
X 33సి X X
ళి
X X X 34హై కూ
X 35రా జు కు యా నం రు డు

Posted in గడి | Tagged | 5 Comments

డిసెంబరు గడిపై మీమాట

డిసెంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. నవంబరు గడి, సమాధానాలు
2. అక్టోబరు గడి, సమాధానాలు
3. ఆగష్టు గడి, సమాధానాలు
4. జూలై గడి, సమాధానాలు
5. జూన్ గడి, సమాధానాలు
6. మే గడి, సమాధానాలు
7. ఏప్రిల్ గడి, సమాధానాలు
8. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 3 Comments

పులికంటికి ‘నాలుగ్గాళ్ళ మండపం’ నివాళి

-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

(గమనిక: ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారి రచనల గురించి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు రాసిన ఈ వ్యాసం ఈభూమి వారపత్రిక 6 డిసెంబర్, 2007 సంచికలోనిది)

కథానిక ప్రక్రియలో ఒక ప్రయోగం ఒకే పాత్ర చుట్టూ అనేక కథలు రాయడం. చింతా దీక్షితులు రాసిన వటీరావు కథలు, శ్రీశ్రీ రాసిన కోనేటిరావు కథలు, భానుమతీ రామకృష్ణ అత్తగారి కథలు వంటివి ఇందుకు ఉదాహరణలు.అలాగే ఒక ప్రాంతం కేంద్రంగా కథలు రాయడం మరో ప్రయోగం. సత్యం శంకరమంచి అమరావతి కథలు, పి. రామకృష్ణారెడ్డి పెన్నేటి కతలు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. కథానికలో లాగే కథనప్రక్రియలో కుడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కథలు వంటివి. పులికంటి కృష్ణారెడ్డి “నాలుగ్గాళ్ళ మండపం” తెలుగు కథనప్రక్రియలో అలాంటి ప్రయోగం. పులికంటి కృష్ణారెడ్డి రాసిన 200 కథానికలు ఒక ఎత్తయితే, ఆయన నాలుగ్గాళ్ళ మండపం ఇంకో ఎత్తు. కథానికకు చెందకుండా, స్కెచ్ కు చెందకుండా రెండింటినీ మేళవించుకున్న ఒక ప్రక్రియ, కథన ప్రక్రియ. ఈ ప్రక్రియకు పులికంటి నాలుగ్గాళ్ళ మండపం ద్వారా స్థిరమైన రూపాన్ని సాధించి పెట్టారు.

‘నాలుగ్గాళ్ళ మండపం’ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఒక స్థలం. పులికంటి ఇంటికి కూతవేటు దూరం ఉంది. ప్రతిరోజూ ఉదయాన్నే దినకూలీలంతా అక్కడ పోగవుతారు. కూలీ కుదిరేదాకా లోకం విషయాలు మాట్లాడుకొని కూలి దొరగ్గానే వెళ్ళిపోతారు. ఆ ముఖ్యస్థలాన్ని కార్యస్థానంగా చేసుకుని పులికంటి వర్తమాన సమాజ పరిణామాల మీద తనవైన వ్యాఖ్యానాలు చేస్తూ, చేయిస్తూ రాసిందే ‘నాలుగ్గాళ్ల మండపం’. ఈ కథనాలలోని విషయమంతా వర్తమానం. విధానం మాత్రం జానపదం. ఈ కథనాలలో 1978 ప్రాంతాల నుంచి 1995 ప్రాంతాలదాకా మన రాష్ట్రంలో, మన దేశంలో వచ్చిన పరిణామాలు, వాటిపట్ల రచయిత అభిప్రాయాలు స్వచ్ఛమైన చిత్తూరు జిల్లా జానపదభాషలో వ్యక్తం చెయ్యబడ్డాయి. కథనం తిరుపతి పట్టణానిదైనా విషయం మాత్రం చిత్తూరు జిల్లా గ్రామీణ రైతాంగ జీవితానిదే. రచయిత భార్య, తల్లి, స్నేహితుడు అరుణాచలం, మరో మిత్రుడు ముత్తా రెడ్డెన్న నాలుగు పాత్రలు, నాలుగు స్తంభాలుగా నడిచిన ప్రక్రియ నాలుగ్గాళ్ళ మండపం. రచయిత అన్నిటా కనిపిస్తాడు. ఒకటి ఒకటిన్నర దశాబ్ది కాలంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ పరిణామాల వ్యాఖ్యానాలుగా సాగిన నాలుగ్గాళ్ళ మండపంలో పులికంటి భావజాలం, ఇష్టాయిష్టాలు, ఆయనకు తెలిసిన చరిత్ర అన్నీ స్వస్వరూపాలతో దర్శనమిస్తాయి.

“అసలీ రాయలసీమలో పుట్నోళ్ళే కర్మ చేసుకోని పుట్నోళ్ళేమో! చేసేదానికి సెగితుండాది. దున్నుకుండేదానికి జానడో, బెత్తెడో కయ్యలుండాయి. అయినా నీళ్ళేడుండాయి?” ఇదీ రాయలసీమ ముఖచిత్రం మీది ప్రశ్న. నాలుగ్గాళ్ళ మండపమంతా ఈ అంశాన్ని ఆవరించిన ఆర్థిక సాంఘిక రాజకీయాంశాలతో వ్యాఖ్యానించబడ్డాయి. “కాంగ్రెసోళ్ళ చేతుల్లో పెత్తనం ఉన్నపుడు ఎక్స్ పార్టీలోళ్ళు రాయలసీమో అని మొత్తుకుంటే కాంగ్రెసోళ్ళకు చీమకుటినట్టనిపించిందా? లేదు. ఇప్పుడు కాంగ్రెసోళ్ళూ సీమ, అయ్యో రామా! అంటూ కాకిశోకంగా అరస్తా ఉంటే ఇప్పుడూ పెత్తనం చెలాయిస్తా ఉండే తెలుగుదేశం వాళ్ళ చెవికెక్కతా ఉండాదా? లేదు… ఎవుడు పెత్తనం చేసినా మనకు మాత్రం ఇత్తనాల గింజిలకు లాట్రీయే గదా!” వంటి వ్యాఖ్యలు ఈ నాలుగ్గాళ్ళ మండపానికి బలం. పాఠకులకు ఆసక్తినేగాక ఆలోచనల్ని కూడా కలిగించే వ్యాఖ్యలివి. పులికంటి తనకు వాదాలు, ఇజాలు తెలియవని చెప్పుకున్నా ఆయనకు ఖచ్చితమైన రాజకీయ దృష్టి ఉందని ఈ మండపం తెలియజేస్తుంది.

ఈ మండపంలోని రాజకీయాలెలా ఉన్నా, వాటికతీతంగా పాఠకులు బాగా ఆస్వాదించేది ఇందులోని ప్రవాహసదృశమైన భాష, వాక్యం మీద వాక్యం దొర్లుకుంటూ పోయే శైలి. చిత్తూరు జిల్లా ప్రజల భాషల్లోని సారమంతా ఈ కథనాలలో ప్రదర్శించారు పులికంటి. సభా, రాజారాం గార్ల తర్వాత చిత్తూరు జిల్లా భాషకు పండిత గౌరవం కల్పించిన రచయిత పులికంటి. బాశాలి, తావరం ఈడ్చి కొడితే, నీమయ్య నాయాలి ముండా, సిగ్గూ సెరము, కారికొడి, వక్క కొరికినంత సేపు, వొళ్ళు రగులు, యామారించు, ఎద్దలగొట్టి ముద్దలు తినాల్సిన బతుకు, కసువు చెక్కేసిన బీడు మాదిరి తలకాయ వంటి మాటల పోహళింపుతో నాలుగ్గాళ్ళ మండపం స్థానిక పరిమళంతో శోభిల్లుతూ ఉంటుంది. ముత్తా రెడ్డెన్న ఒక కామన్ సెన్స్ ఉన్న గ్రామీణ మేధావి. భార్య సహజమైన కోపతాపాలు, ప్రేమానురాగాలు గల మహిళ. ఈ మండపంలో ప్రసక్తికి వచ్చేవాళ్ళంతా ఇంతే.

నాలుగున్నర ఐదు దశాబ్దాల సాహిత్య జీవితం గల పులికంటి సహజ కథకుడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన నాలుగ్గాళ్ల మండపం ఉంది. ఆయనకు నివాళి దానిని చదవడమే.

Posted in వ్యాసం | 2 Comments

తెలుగు కలాలు

ఆరుద్ర

ఆరుద్రభాషా సాహిత్యాలు లేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తు శకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాలనుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు వున్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు పాలించారు. వీరు తెలుగువారే. వీళ్ళ కుదురు తెలుగు ఏకగణాలలోనే ఉంది. రాజులు ప్రాకృత సంస్కృత భాషలకు ఎగబడినా నాటి సామాన్య ప్రజానీకం తెలుగులోనే నిత్యవ్యవహారాన్ని జరుపుకొనేవారు. తమకు కావలసిన సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు.

ప్రాకృత జనుల సాహిత్యం మౌఖికంగానే వుంటుంది. సామెతలు, పొడుపు కథలు, పని పాటలు, వీరగీతాలు మొదలైనవి వాటిలోని భాగాలు. మతవిశ్వాసాలూ, మంత్రచర్యలకు వాడే మాటలూ కూడా సంస్కృతిలోని భాగమే. తెలుగుగడ్డ మీద ఆదిలో బౌద్ధ, జైనమతాలు చాలా బలపడ్డాయి. జనాభాలో అత్యధికసంఖ్యాకులు ఇతర మతాలవైపు ఆకర్షితులు కావడం చూసి బ్రాహ్మణ్యం ప్రాబల్యం కోసం ప్రయత్నాలు చేసింది. జనుల ఆచార వ్యవహారాలకు ఆస్కారం కలిగించే పాడిపంటలకు అవసరమైన పశుసంపదను యజ్ఞయాగాదులలో బలికాకుండా ఈ అహింసామతాలు కాపాడడంచేత జనసామాన్యానికి, వాణిజ్య వర్గాలకు ఈ మతాలు అభిమానపాత్రమయ్యాయి. మతాధికారులకు ప్రజలు కానుకలు, దానాలు, ధర్మాలు చేయసాగారు. ఆరామాలు1, బసదులు2 ఐశ్వర్యవంతాలయ్యాయి. మాన్యాలూ, తోటలూ వృద్ధి చెందాయి. రైతాంగం వీటిమీద బతికేవారు. జీవనాధారమైన మతం ప్రజలకు అభిమతం.

ఆదిలో వైదికమతం యజ్ఞయాగాదులనే అంగీకరించింది. విగ్రహారాధన, గుళ్ళు, నోములు, వ్రతాలు నిషేధించింది. స్త్రీలనూ, శూద్రులనూ నిరక్షరాస్యులను చేసింది. మతాన్ని సృష్టించింది. ఇది వేదోక్తమని అధర్వవేదం సాక్ష్యాలతో ప్రచారం చేసింది. బ్రాహ్మణ్యం శంఖంలో పోస్తేనే గాని రాచరికం తీర్థం కాదు. అందుచేత రాజులు వైదికమతాన్ని ఆదరించారు. రాణులు బౌద్ధ, జైనులను పోషిస్తూనే వచ్చారు.

ప్రజల భాషలోకాక సంస్కృత ప్రాకృత భాషలలో శాసనాలు వేయించడం పాలకులకు అలవాటు. అయితే ఆ శాసనాలలో స్థలనామాలు, వ్యక్తుల పేర్లు తెలుగులోనే ఉంచక తప్పదు. క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో తెలుగు మాటలు ఎలా వుండేవో ఈ శాసనాల వల్ల తెలుస్తోంది. రేనాటి చోళులు తెలుగులోనే తమ శాసనాలను వేయించారు. వీటిలో కొన్ని అస్పష్ట ఛందస్సులో ఉన్నాయి. ఆనాడు ఒకరకమైన సాహిత్యం లిఖిత రూపంలో కూడా వుండేదన్న భావనకు ఆస్కారం ఉంది.

విద్యావంతులు మార్గరీతులలోనే సాహిత్యాన్ని సృష్టించుకొనేవారు. తూర్పు చాళుక్యుల ఏలుబడిలో కవితలకు కూడా దేశి కవితలకు కూడా రాజాదరణ లభించింది. ఈ సంగతిని నన్నెచోడుడు ఇలా చెప్పాడు.

మును మార్గ కవిత లో
కంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్‌

దేశికవితను పుట్టించినవాళ్ళు పలువురు ఉన్నా వాళ్ళు నిలిపిన కవితలు ఆట్టే కాలం నిలువలేదు. తూర్పు చాళుక్యులలో రాజరాజనరేంద్రుడు నేటికి రమారమి వెయ్యేళ్ళ కిందట వైదికమత ప్రచారం కోసం మహాభారతంలోని నిరూపితార్థాన్ని తన కులబ్రాహ్మణుడు నన్నయభట్టు చేత తెలిగింపచేశాడు. ఇదే మన ఆదికావ్యం. అంతకు ముందున్నవన్నీ నశించాయిగాని, ఆ రోజుల్లో కవులూ వుండేవారు, రచనలు చేసేవారు. వేంగీదేశంలో విద్వత్సభలు వుండేవి. నన్నయ రెండున్నర పర్వాలే ఆంధ్రీకరించాడు. మిగతా భాగాన్ని ఎవరైనా పూర్తి చేయాలని సంకల్పించడానికే రెండు శతాబ్దాలు పట్టింది. నన్నయ సారమతిని కవీంద్రులు మెచ్చుకోవడానికి భారతాన్ని తెలిగించితే తిక్కన మాత్రం భారతామృతాన్ని “కర్ణపుటంబుల నారగ్రోలి” ఆంధ్రావళి మోదం చెందడానికి పూర్తిచేశాడు. జనంలో అధికభాగం అక్షరాస్యులు కానప్పుడు కావ్యాలను ఎవరైనా చదివి వినిపిస్తేనే దానిని ఆరగ్రోలడం వీలవుతుంది. మహాభారతమే కాదు రామాయణం కూడా ఇంతే.

భాస్కర రామాయణం చంపూకావ్యం. రంగనాథ రామాయణం ద్విపదకావ్యం. ఇది గానం చేయడానికి అనువైనది. అందుకే దీనినే ఈనాటికీ తోలుబొమ్మలాటలో గాయకులు పాడుతూ ఉంటారు. తెలుగులో రామకథలు ఎన్నెన్నో ప్రక్రియలలో వెలువడ్డాయి. అయితే ఏ ఒక్కటీ బహుళ ప్రచారాన్ని పొందలేదు. రామాయణ భారతాలను తెనిగించి భాగవతం జోలికి ఎవరూ వెళ్ళకపోవడం బమ్మెర పోతరాజుగారు తమ అదృష్టంగా భావించారు. దానిని భక్తితో, అంతకు మించిన ఆవేశంతో రచించారు. పోతరాజుగారి భాగవతం ఎంత ప్రసిద్ధమైనదంటే దానికి వరవడి పెట్టిన ఎర్రాప్రగడగారి హరివంశం ఆట్టే కనబడకుండా కాలగర్భంలో ఒక మూలపడి వుండిపోయింది.

ఎర్రాప్రగడగారిని ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఈయన భారతంలో నన్నయగారు వదిలివేసిన అరణ్యపర్వ భాగాన్ని పూర్తి చేయడమేకాక హరివంశంతో బాటు నృసింహ పురాణం కూడా రచించారు. ఈ పురాణంలోనే ప్రబంధాల తొలి రూపురేఖలు కనబడతాయి. ఎర్రాప్రగడగారి సమకాలికుడు నాచనసోమన నిజంగా నవీనగుణ సనాధుడు. సాహిత్య రచనలో సమకాలీన సమాజాన్ని ప్రతిఫలింపచేయడం ఇతనితోనే ప్రారంభమైంది. ఇతని “ఉత్తర హరివంశం” అనే కావ్యం పురాణకథలకు ఎలా నగిషీలు పెట్టాలో తెలియజేస్తుంది.

నన్నయ్య, తిక్కన, ఎర్రన మన కవిత్రయం. తెలుగు కవిత వారి భిక్ష. వ్యాసభారతం తెలిగింపును శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో…అంటూ ప్రారంభించి నన్నయ్య రెండున్నర పర్వాలు వ్రాయగా, శ్రీయన గౌరి నాబరగు చెల్వకు…అంటూ తిక్కన 15 పర్వాలు, స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోవ…అంటూ ఎర్రన అరణ్యపర్వశేషాన్ని పూర్తిచేశారు. తెలుగువారి ఇష్టకవి పోతన. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట… అంటూ పోతన తెలిగించిన భాగవతం ఆంధ్రుల ఇష్ట గ్రంథం. “కలయో వైష్ణవ మాయయో” వంటి పోతన పలుకుబడులెన్నో తెలుగువారి నిత్యవ్యవహారంలో స్థిరపడ్డాయి.

మార్గపద్ధతులను అనుసరించే కవులు పురాణేతిహాసాలను సనాతన వైదిక మత నిర్దేశాలకు అనువుగా రచిస్తూ ఉంటే వీరశైవులు దేశి ఛందాలలో, దేశీయమైన ఇతివృత్తాలను కొత్త పురాణాలుగా భక్తుల చరిత్రలుగా రూపొందించారు. ద్విపద ప్రచార సాధనమైంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, దక్షిణ భారతంలోని చారిత్రక పురుషుల జీవితగాథలు, కుల వర్గ భేదాలను రూపుమాపి, ఆడా, మగా అందరూ సమానులే అన్న మతస్థాపనకు వీరశైవులు ఉద్యమాలను నడిపారు. జన సాహిత్యానికి చేరువలో ఆ రూపాలకు సన్నిహితమైన వచనాలను రచించారు. ఆదిలో వచనాన్ని పాడేవారు. ఇప్పటికీ యాగంటివారి రచనలను రాయలసీమలో ముఖ్యంగా గానంచేస్తారు.

వీరశైవులలాగే వైష్ణవులు కూడా వచనాలను రచించారు. కృష్ణమాచార్యుడు కాకతీయుల కాలంలో సింహగిరి వచనాలు నాలుగు లక్షలు రచించాడు. వీటిలో అధికభాగం రాగిరేకులపై చెక్కించి శ్రీరంగం పంపించాడు. తాళ్ళపాక కవులు కృష్ణమాచార్యులనే అనుసరించారు. అన్నమయ్య పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాడు. ముప్ఫయిరెండువేల సంకీర్తనలలో తెలుగు జీవితాన్ని, ఆచార వ్యవహారాలను భద్రం చేశాడు. భక్తీ, దానిని మించిన రక్తీ ఈ సంకీర్తనలలో సజీవంగా వున్నాయి. భక్తి బంగారానికి రక్తి శృంగారం రస సౌరభాన్ని పూసింది.

సంస్కృత సాహిత్యంలో శృంగారం వెర్రితలలు వేశాక అష్టరసాలలో ఇదే ఇష్టరసమయ్యాక ఆ ఉన్మాదం తెలుగులోకి కూడా దిగుమతి అయింది. హర్ష నైషధాన్ని శ్రీనాథుడు శృంగార నైషధంగా ఆంధ్రీకరించాడు. ప్రౌఢి పలుకు, నుడికారం సమపాళ్ళలో వున్న శ్రీనాథుడు కొత్త వరవళ్ళు పెట్టాడు. ఇతని తర్వాత ఎందరో తమ కావ్యాలలో “శృంగార” అనే విశేషణం తగిలిస్తూ వచ్చారు.

ఏదో ఒక పురాణగాథను తీసుకొని, అష్టాదశ వర్ణనలు సందర్భశుద్ధి వున్నా లేకున్నా జొప్పించి, నాయిక అంగాంగవర్ణన చేసి, నాయికా నాయకుల సంభోగ శృంగారచేష్టలను అతిగా వర్ణించడం తెలుగులో సర్వసామాన్యమైంది. పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు కవులకు ముడిసరుకులయ్యాయి. ఎంత నీచంగా బతికినా, ఎన్ని పాపాలు చేసినా, కడ శ్వాస వరకు పంచ మహాపాతకాలు చేస్తున్నా, దివ్యక్షేత్రంలో మరణించినవానికి ముక్తి రెడీమేడ్‌గా దొరకడం అన్నది ఈ గ్రంథాలు చాటుతాయి. ఈ మూసకథలలోకూడా కొందరు ప్రతిభావంతులు వున్నంతలో తమ నేర్పు చూపగలిగారు. పదగుంభనం వాళ్ళ ప్రౌఢత్వానికి చిహ్నం.

కేవలం కల్పనాకథలు కృత్రిమ రత్నాలనీ, ఆద్యసత్కథలు గనిలో తీసిన శుద్ధిచేయని మణులని, ఈ రెండింటినీకాక నచ్చిన పాతకథను సానపట్టి ప్రజలకివ్వాలని నాటి కవులు భావించారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన అష్ట దిగ్గజాలలో పెద్దపీటలవాళ్ళు. ఇంతటి ఉద్దండుల రచనల ముందు ఇతరుల కావ్యాలు సూర్యుని ముందు దివిటీలే. అందుకే తరువాత వచ్చిన పింగళి సూరన్న, భట్టుమూర్తి, ముందు రెండర్థాల కావ్యాలు రాసి తమ గొప్పతనం చాటుకున్నారు. తర్వాత కళాపూర్ణోదయం, వసుచరిత్ర రాశారు. సూరనగారి కళాపూర్ణోదయం అంత గొప్ప కావ్యం కన్యాశుల్కం వచ్చేదాకా ఇంకేదీ పుట్టలేదు. వసుచరిత్రకు వెనువెంటనే ఇమిటేషన్లుగా పిల్ల వసుచరిత్రలు కోకొల్లలుగా వచ్చాయి. భట్టుమూర్తి శ్లేషలతో తెలుగు సాహితిని ఆశ్లేషించాడు. ఆ కౌగిలి విడిపించుకొందికి చాలా కాలం పట్టింది.

శివకవులు దేశ సాహిత్యానికి ఎంత సేవ చేశారో శతక కవులు ఆత్మాశ్రయ కవిత్వానికి అంత ప్రాణంపోశారు. చాటుకవులు కొత్త బాటలు వేశారు. తెలుగు సాహిత్యం అంతా గాలించినా వేమనగారి వంటి “సామాజిక స్పృహ” గల రచయిత ఇంకెవరూ కనబడడు. కనబడ్డా అంత ఉన్నతునిగా కంటికి ఆనడు. ఆధునికులలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారొక్కరే వేమన ఆలోచనా విధానాలకు అత్యంత సన్నిహితులు.

కడపటి రాజుల యుగం నాటికి కవుల కక్కూర్తి స్పష్టంగా వెల్లడవుతూ వచ్చింది. పోషకుడు మెచ్చి ఇచ్చాడో “చంద్రరేఖా విలాసం”, ఇవ్వకపోతే “చంద్రరేఖా విలాపం” అల్లడానికి పూనుకొనే స్థితికి సాహిత్యం దిగజారింది.

“కావ్యం యశసే, అర్థకృతే” అన్న నిర్వచనాల దగ్గరే ప్రబంధకవులూ, వారి తరువాతవారు ఆగిపోయారు. వ్యవహారాన్ని విదితం చేయడం, శివేతరమైనదానిని ఛేదించడం, మొదలైన లక్షణాలను పందొమ్మిదో శతాబ్దపు ఉత్తరార్థంలోనే రచయితలు గాఢంగా విశ్వసించారు. సంఘసంస్కారం కోసం వీరేశలింగంగారు, గురజాడ అప్పారావుగారు సాహిత్యమే ఉత్తమ సాధనంగా భావించారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. మేలుకొంటున్న ప్రజలను జోకొట్టే ఉద్యమాలు భావకవిత్వం రూపంలో వచ్చినా అవి గురజాడ ప్రభావం ముందు ఉత్తరోత్తరా నిలబడలేకపోయాయి. గేయం ధ్యేయమైంది.

గురజాడ అప్పారావుగారు దేశి ఛందస్సులను చేపట్టి ప్రజలకు చేరువగా కవిత్వాన్ని తీసుకువచ్చారు. అక్షరాస్యులు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ప్రచార సాధనం నాటకమే అని గుర్తించారు. శ్రవ్య కావ్యాలను ప్రదర్శన కళలుగా మార్చగలిగే వీలు కల్పించారు. గురజాడ దేశమంటే మనుష్యులన్నాడు. శ్రీశ్రీ మనుష్యులంటే శ్రమజీవులే అని స్పష్టపరిచాడు. అభ్యుదయ దృక్పథమే సాహిత్యంలో ప్రజలను సాయుధులను చేయగలదు. ఇదే నిజమైన వారసత్వం.

————
1. ఆరామం = బౌద్ధుల ప్రార్థనాలయం
2. బసది = జైనుల ప్రార్థనాలయం

————-
ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర వేసిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు రాశాడు. ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన….. ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు. త్వమేవాహమ్, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు అనువాద రచనలు, అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ఠ. సాహిత్య విమర్శనా గ్రంథాలే కాకుండా రాముడికి సీత ఏమౌతుంది?, గుడిలో సెక్స్ వంటి రచనలు, డిటెక్టివ్ రచనలు, చదరంగంపైన ఒక పుస్తకమూ కూడా రాశాడు. తెలుగులో ఆరుద్ర మార్కు గళ్లనుడికట్టు సుప్రసిద్ధం.
(పరిచయం, ఫోటో తెవికీ నుంచి)

(ఈ రచనను యూనికోడ్ లో పొద్దుకు పంపిన డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన శ్రీమతి రామలక్ష్మి గారికి నెనర్లు.)

Posted in వ్యాసం | 1 Comment

ఆంద్రె బాజిన్, మందిమన్నియమ్ -2, కవితలు

ప్రసిద్ధ సినిమా విశ్లేషకుడు ఆంద్రె బాజిన్ గురించి వెంకట్ సిద్ధారెడ్డి గారు తెలియజేస్తున్నారు. తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారి పుస్తకం లోని భాగం, “మందిమన్నియమ్-2” కూడా సమర్పిస్తున్నాం. అలాగే అసూర్యంపశ్య గారి కవిత, కల, కొత్త ఝాన్సీ లక్ష్మి గారి కవిత, పాట ను కూడా సమర్పిస్తున్నాం.

మధురాంతకం రాజారామ్ రచనల సమీక్ష త్వరలో మీకందించబోతున్నాం. అలాగే బ్లాగరులకు గిలిగింతలు పెట్టి, కవ్వించే ఒక ప్రయోగం కూడా త్వరలో మీముందుకు రానుంది. చూస్తూ ఉండండి.
——

ఈ నెల రచనలు:

మందిమన్నియమ్-2
ఆంద్రె బాజిన్
కల
పాట

మందిమన్నియమ్ – 1
మృతజీవులు – 10
కథానిలయం
మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు
విశ్వంలో మనిషి స్థానం
అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి
అక్టోబరు గడి సమాధానాలు
నవంబరు గడిపై మీమాట
కౌంతేయులు (అతిథి)
కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)
కుటుంబరావు కథల్లో వాస్తవికత (వ్యాసం)
మృతజీవులు – 9 (మృతజీవులు)
నేనూ మీ లాంటి వాడినే (కథ)
జగజ్జేత ఆనంద్! (వ్యాసం)
గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

Posted in ఇతరత్రా | Comments Off on ఆంద్రె బాజిన్, మందిమన్నియమ్ -2, కవితలు

కల

కనులు మూస్తే –
చుట్టూ వెలుతురున్నా నన్నలుముకున్న చీకటి
నా చీకట్లోనే ఎన్నో వెలుగులూ
ఆ నలుపు లోనే ఎన్నో రంగులు!

కళ్ళు తెరిస్తే –
ఆ రంగులకీ, వెలుగులకీ చీకటి!
నాకు మిగిలినవి
కలిగిన కలల అస్థిపంజరాలు!

-అసూర్యంపశ్య

“ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” అంటున్న అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటున్నారు.

Posted in కవిత్వం | 6 Comments

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut, Erich Rohmer లాంటి విమర్శకులు తదుపరి కాలంలో, New wave అనే సినీ ఉద్యమం ద్వారా తీసిన సినిమాలతో ఫ్రాన్సు సినిమా పరిశ్రమనే కాదు, ప్రపంచ సినిమాలన్నింటినీ ఒక కొత్త బాటన నడిపించాడు.

చాలా మంది అంటుంటారు – సినిమా తీయాలనే ఆసక్తి కలిగిన వారెవ్వరైనా మొదటగా చదవాల్సింది Aristotle రాసిన Poetics అనే గ్రంధం మరియు Andre Bazin వ్యాస మాలిక అయిన What is Cinema? అని. నా దృష్టిలో అది అక్షరాలా నిజంనిపిస్తుంది. Andre Bazin వ్యాసాలు అసాధారణ పరిశీలన మరియు అత్యుత్తమ సమాచారాల కలయికగా వుంటాయి.

Andre Bazin ఎవరో తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతుక్కుంటే ఎంతో సమాచారం దొరుకుతుంది. కానీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు Andre Bazin గురించి ఏమన్నారో తెలియచేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు Francois Truffaut మరొకరు Jean Renoir. ఫ్రెంచ్ సినిమాల గురించి ఏ మాత్రం పరిచయమున్నా, మీకు వీరిద్దరి పేర్లు ఇప్పటికే తెలిసివుంటాయి. Francois Truffaut తన మొదటి సినిమా అయినా 400 Blows తో ఫ్రాన్సులో New Wave అనే సినీ వుద్యమానికి శ్రీకారం చుట్టాడు. Jean Renoir తన సినిమాలైన The Grand Illusion, The Rules of The Game లాంటి సినిమాలతో చిరస్మరణీయుడు.. నాదృష్టిలో Citizen Kane తో పోల్చదగిన సినిమా ఏదైనా వుందంటే, అది The Rules of the Game మాత్రమే!

Andre Bazin వ్యాసాలతో కూడిన రెండు సంపుటాలు “What is Cinema” పేరుతో లభ్యమవుతున్నాయి. ఆ సంపుటాలలో, ఒక దానికి ముందు మాట రాసిన వాడు Renoir మరో దానికి Truffaut. Bazin ఎవరో, సినిమాకు ఆయన చేసిన సేవ ఎంటో తెలుసుకోవాలంటే Renoir మరియు Truffaut రాసిన పరిచయం చదివితే అర్థమవుతుంది. అందుకే వారు రాసిన పరిచయ వాక్యాలను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేసాను.

Andre Bazin గురించి Frncoise Truffaut రాసిన ముందుమాట.

సినిమా గురించి Andre Bazin రాసినంత గొప్పగా యూరోపులో మరెవ్వరూ రాయలేదు. 1948 లో నాకు మొదటి ఉద్యోగం ఇప్పించిన నాటి నుండి, అతనితో పని చేస్తూ, నేనాయనకు దత్తతిచ్చిన కొడుకయి పోయాను. ఆ తర్వాత, నా జీవితంలో జరిగిన ప్రతి మనోహరమైన విషయం ఆయన పుణ్యమే.

ఆయన నాకు సినిమాల గురించి రాయడం నేర్పించారు, తప్పులు రాస్తే సరిదిద్దారు మరియి నా మొట్టమొదటి వ్యాసాలనూ ప్రచురించారు. అంతే కాదు నేనొక సినిమా దర్శకుడు కావడానికి సహాయపడ్డారు. నా మొదటి సినిమా షూటింగ్ చేయడం మొదలుపెట్టిన రోజే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. ఆఖరి ఘడియల్లో ఆయన స్నేహితుడు Piere Leger పిలుపునందుకుని, Nogent లో వున్న ఆయనింటికి చేరుకున్నాను. నా వైపైతే చూసారు గానీ కానీ నోట మాట లేదు. భయంకరమైన భాధననుభవిస్తున్నారని మాత్రం తెలిసింది. అంతకు ముందు రోజు సాయంత్రమే టీవీలో ”Le Crime de Monsieur Lange” సినిమా చూస్తూ దర్శకుడు Jean Renoir గురించి రాస్తున్న పుస్తకం కోసం నోట్సు రాసుకున్నారు.

ఎవరైనా నన్ను Andre Bazin గురించి చెప్పండి అంటే మొదటగా నాకు గుర్తొచ్చేది, నేను అమెరికన్ పత్రికలో చూసిన వాక్యమొకటి: “The most unforgettable character I’ve met.”

Giraudoux నాటకాల్లో పాత్రల్లాగే Andre Bazin కూడా పాపం పుట్టకముందు నాటి జీవి అనిపిస్తుంది. ఈయన మంచితనం, నిజాయితీల గురించి మాకందరికీ తెలిసినప్పటికీ ఆయన మంచితనం నిరంతరం సాగే ఒక అధ్భుతం అని తోచేది. అలాగే ఆయన చేసే మంచిపనులకూ అంతులేదు. హైందవునికి గంగలో స్నానమాడడమెంత పుణ్యకార్యమో ఆయనతో మాట్లాడడమూ అంతే. ఆయన మంచితనం రుచి చూడడానికే ఒక్కోసారి నేను తెలిసిన వాళ్ళతో కావాలని గొడవకి దిగేవాడిని. అలాంటి సమయాల్లో ఆయన వారి పక్షాన చేరి వారికి అండగా నిలిచేవాడు.

లంకంత హృదయం గలిగినవాడయినప్పటికీ తర్కమే తనైన వాడాయన. Bazin స్వఛ్ఛమైన జ్ఞాని, ఉత్కృష్టమైన తార్కికుడు. హేతుబధ్ధంగా వాదించడమనే శక్తిని నమ్మిన వాడీయన. మహామహులెందరినో తన వాదంతో చిత్తుచేయడం నా కళ్ళారా చూశాను. నత్తి కారణంగా తడబడుతూ మాట్లాడినా, శ్రోతలను ఆకట్టుకోవడంలో మాత్రం ఆ లోపాలేవీ ఆయనకు అడ్డు రాలేదు. యోగ్యతలేని వాదనతో తన వద్దకొచ్చిన వాళ్ళని, ముందుగా ఆ వితర్కనీయ విషయాన్ని ఆ వచ్చిన వారు చెప్పిన దానికంటే బాగా వికసింపజేసి, ఆ తర్వాత కఠినమైన తర్కం ద్వారా ఆ వాదాన్ని కూలదోసేవాడు. Bazin ఎంతో ప్రేమగా ఆరాధించిన Sartre వ్యాసాల్లో మాత్రమే ఇటువంటి బుధ్ధి జ్ఞానము మరియు మనో సంబంధమైన యోగ్యతా కనిపిస్తాయి.

తీవ్ర అస్వస్థతతో కూడిన ఆయన ఆరోగ్యానికి సమాంతరంగానే ఆయన మనోబలమూ, గుండే ధైర్యమూ వుండేవి. వూరందరికీ తెలిసేలా అప్పులూ చేసేవాడు, మరో కంటికి తెలియకుండా దానాలూ చేసేవాడీయన. ఈయన సమక్షంలో అన్ని విషయాలూ చక్కగానూ, సరళంగానూ, స్వచ్ఛంగానూ తోచేవి. నాలుగు సీట్లున్న కారులో ఒక్కడే ప్రయాణం చేయడం ఇష్టంలేక Nogent బస్సు స్టాపులో మరో ముగ్గురిని తన కారులో ఎక్కించుకుని వారి గమ్య స్థానం చేరడంలో సహాయపడేవాడు. ఎప్పుడైనా తన కుటుంబంతో పాటు కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సివస్తే తనకి తెలిసిన పేద కుటుంబీకులెవరికైనా తన ఇంట్లో వుండే ఏర్పాట్లు చేసి వెళ్ళేవాడు. అంతేకాదు తన కారు కూడా అవసరమున్న వారెవరికైనా ఇచ్చే వెళ్ళేవాడు.

ఈయన సినిమాని ప్రేమించాడు. అంతకంటే కూడా జీవితాన్నీ ప్రేమించాడు. ఆ ప్రేమతోనే మనుషులకు, జంతువులకూ, శాస్త్రానికి, కళలకూ తన జీవితంలో స్థానం కల్పించాడు. చనిపోయే కొద్దిరోజులముందు పెద్దగా ప్రచారం లేని Romanesque చర్చ్ ల గురించి ఒక లఘు చిత్రం తీయాలనే ఆలోచనలో కూడా వున్నాడు. అతనింట్లో అన్ని రకాల పశు పక్ష్యాదులనూ పెంచుకున్నాడు. ఊసరవెల్లి, చిలుక, ఉడుత, తాబేలు, మొసలి ఇలా ఎన్నో జంతువులు ఆయనింట్లో కాపురం చేసేవి; వీటిలో కొన్నింటి పేర్లను ఎలా ఉచ్చరించాలో కూడా నాకు తెలియదు. చనిపోవడానికి కొద్దిరోజులముందు, బ్రెజిల్ కి చెందిన ఒక రకమైన తొండకు జబ్బు చేయడంతో బలవంతంగా తిండి తినిపిస్తూ “ఈ జీవి చనిపోవడం కంటే ముందే నేనే పోతానని భయమేస్తోంది” అన్నారు.

ఈ లోకం మంచిదో చెడ్డదో నేను చెప్పలేను కానీ, Andre Bazin లాంటి వారి వల్లనే ఈ లోకం మేలైనదిగా వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మంచితనమే మేలైనదని నమ్ముతూ, ఆ మంచితనాన్ని జీవితంలో అమలుపరుస్తూ జీవించడం వల్లనే ఆయనతో పరిచయం కలిగిన వారందరికీ ప్రయోజనం కలిగింది. అందుకే Andre Bazin తో గొడవలు పెట్టుకున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆయనతో సంభాషించిన వారెవరైనా, కేవలం ఒక్కసారి మాత్రమైనప్పటికీ, ఆయన్ని తమ ప్రియతమ మిత్రుడిగా భావిస్తారు. ఆయన లోని నిష్కాపట్యముతో ఎలాంటి వారైనా తమ లోని మంచిదనాన్ని ఒక్కసారైనా బయటకు తేవల్సిందే.

“ఇప్పటికీ మన మధ్యనే వున్నారు” అనో, లేదా “ఇంకా జీవిస్తూనే వున్నారు”అనో మాయ మాటలతో, బూటకపు పదజాలంతో వర్ణించడం ఆయనకి తప్పకుండా నచ్చుండేది కాదు. ఒక దారుణమైన, అత్యంత క్రూరమైన, శోకభరితమైన నిజమేంటంటే ఆయన మరణించారు; ఇక లేరు. మనం చేయగలిగిందేదైనా వుందంటే అది విలపించడం మరియు ఆయన వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదవడం. చనిపోవడానికి కొన్ని రోజుల క్రితమే ఆయన రాసిన ఒక వుత్తరంలోని ఈ విషయం చదివితే ఈయన అవలంబించిన సూక్ష్మమైన ఆగమం ఎట్టిదో తెలుస్తుంది: “Cinematheque లో మీతో పాటు Mizoguchi సినిమాలు మరోసారి చూడలేకపోయినందుకు నన్ను క్షమించండి. Mizoguchi ని మీరెంత ఇష్టపడతారో నేను అంతే విధంగా ఆయన్ని ఇష్టపడతాను. అందుకు కారణం నాకు Kurosawa ఇష్టం కావడమే. వీరిద్దరూ నాణేనికి చెరో వైపూ. చీకటేంటో తెలియకుండా మనకి వెలుగంటే ఏంటో తెలిసే అవకాశం వుందా? Mizoguchi నచ్చినంత మాత్రాన Kurosawa నచ్చకపోవడమనేది వారిద్దరినీ అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. అలా కాకుండా కేవలం Kurosawa నే ఇష్టపడేవాడు నిస్సందేహంగా గుడ్డివాడే. అలాగే కేవలం Mizoguchi నే నచ్చేవాడికి ఒక్క కన్నే వున్నట్టు లెక్క. కళలన్నింటిలోనూ కొన్ని భావగర్భితమై, ఆలోచనలు రేకెత్తించేవిగానూ వుంటే మరికొన్ని ఆలోచనకి అతీతంగానూ, భావోద్వేగాలతోనూ వుంటాయి.”

Andre Bazin గురించి Jean Renoir రాసిన ముందుమాట.

ఏ రోజుల్లో అయితే రాజులు మనసున్న మారాజులో, ఏరోజుల్లో నయితే పేద వాడి పాద పూజకు సైతం రాజులు ముందడుగువేసేవారో, ఏ రాజుల అడుగుల సవ్వడికే విపరీతమైన జాడ్యముతో బాధ పడుతున్నవారు సైతం స్వస్థత చెందేవారో, ఆ రోజుల్లో ఆ రాజుల గొప్పతనాన్ని కీర్తించడానికి కవీశ్వరులుండేవారు. కానీ చాలా పర్యాయల్లో గేయం కంటే గాయకుడు, కవిత్వం కంటే కవి, కథ కంటే కథకుడూ గొప్పగా ప్రస్తావించబడడం చుస్తూనే వుంటాం.. సినిమా విషయంలో Bazin సరిగ్గా ఇలాంటి వాడే. కానీ కథలోని ఆ భాగం భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా మూలవస్తువలన్నింటినీ ఒక సమూహంగా చేర్చడమే. నాగరికత అంటే పనికిరాని వాటిని జల్లిస్తూ వెళ్ళడమే కదా. చివరికి మేలైనదే మిగుల్తుంది. Villon రోజుల్లో Seiene నది ఒడ్డున కవులు విస్తారంగా వుండే వాళ్ళని నేనొప్పుకుంటాను. కానీ ఇప్పుడు వారంతా ఎక్కడ? ఎవరు వారంతా? ఎవ్వరికీ తెలియదు. కానీ Villon మాత్రం ఇంకా అక్కడే వున్నారు, పరిపూర్ణంగా మరియు పవిత్రంగానూ.

గతం మిగిల్చిన అపూర్వ అవశేషాలను క్రమ పర్చుకోవడంలో రాబోయే తరాల వారికి వెలకట్టలేని సాయం అందుతుంది. వారికి చేయూతగా Bazin వాళ్ళతో వుంటాడు. ఆ రోజుల్లో రాజులను కీర్తించడానికి కవీశ్వరులున్నట్టే, సినిమాకీ ఒక కవి ఉంటాడు. అప్పటి రాజులకు కవీశ్వరులు ఎలా అయితే కీర్తి కిరీటాన్ని అందజేసారో అలాగే అల్పాయుష్కుడు, అశక్తుడు, నిగర్వి, సాత్వికుడు అయిన Bazin సినిమాకీ రాజత్వం కలిగిన నూతన కల్పనాధికారాన్ని అందచేసారు. ఏ రాజుకైతే కిరీటం పొదిగి ఎంతటి గుర్తింపు నద్దిచ్చాడో అదే రాజు ధరించిన కృత్రిమమైన తళుకు బెళుకులను పీలికలు చేసి బంధాలనుంచి విముక్తి గావించి అభివృధ్ధి పథాన్ని సూచించాడు. అశుధ్ధాల నుంచి శుభ్రం చేయబడి, పరిశుధ్ధాత్మగా గావింపబడ్డ మేలైన మహరాజునే మన మనవళ్ళు మనమరాళ్ళు కలుసుకొని, తెలుసుకొని అహ్లాదోత్సాహాలు పొందుతారు. అదే సమయంలో ఆ రాజునంతటి వాడిని చేసిన ఆ కవి కూడా వారికి గోచరిస్తాడు. ఎలా అయితే గాయకుడు ఒక్కోసారి గేయం కంటే గొప్పవానిగా పరిగణించబడతాడో అలాగే వారు Andre Bazin ను మరో సారి కనుగొంటారు, ఆయన సేవల్ని శ్లాఘిస్తారు.

రాబోయే తరాల వారిపై Bazin ఎంతటి ప్రభావం కలుగచేస్తాడో అన్న విషయంలో సందేహం లేదు. సినిమా అనే ప్రక్రియ అంతమొందినప్పటికీ ఆయన సినిమా గురించి చేసిన రచనలు మాత్రం పదిలంగానే వుంటాయి. సినిమా అనే కళ ఒకటి వుండేదని రాబోయే తరాల వారికి ఈ వ్యాసాలే సాక్ష్యాలవబోతాయి కాబోలు. ఈయన రచనల ద్వారా, మానవులు తమ మనసులో ఒక తెరను ఊహించుకుని, దానిపై వేగంగా పరిగెట్టే ఒక గుర్రాన్ని, ఒక అందమైన యువతి క్లోజప్ ను, తుది శ్వాశ విడుస్తున్న ఒక వీరుని చూడగలుగుతారు. ఆ చిత్రాలకు ఎవరికి తగ్గట్టు వారు అర్థాలు వెతుక్కుంటారు. కానీ వీరందరు మాత్రం What is Cinema? గ్రంధం యొక్క నాణ్యత గురించి మాత్రం ఏకీభవిస్తారు. ఎలా అయితే గతించిపోయిన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు ఒక్కో సారి మన ఊహలకందవో అలాగే ఈ వ్యాసాలు కూడా గతించిన పోయిన సినిమా అనే కళను గురించి మనతో మాట్లాడ గలుగుతాయి, అచ్చెరువు కలుగచేస్తాయి.

రాబోయే తరాలకు Bazin వ్యాసాల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నది సత్యం. తన సమకాలీనులపై ఈయన ప్రభావమే ఆయనపై నాకీ ఉన్నత అభిప్రాయం కలిగేలా చేసింది.అందుకే నా హృదయంలో ఆయనకు ఎప్పటికీ పదిలంగా స్థానం కల్పించబడింది. ఒకప్పటి సత్పురుషులు బానిసలకు మానవ ధర్మం యొక్క విలువను తెలియచేసినట్లు గానే Bazin, మాకూ మా వృత్తి యొక్క పవిత్రతని తెలియచేసారు.

ముగింపు

సినిమాల గురించి ఆసక్తి కలిగిన వారందరూ చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి “What is Cinema?” అలాగే Gilles Deleuze అనే ఫ్రెంచ్ తత్వవేత్త రాసిన సినిమా వ్యాసాలు కూడా సినిమా అనే ప్రక్రియ కేవలం వినోదాన్నందించే సాధనంలా కాకుండా మానవ మేథస్సుని ఇనుమడింపజేసే సాధనంలా చూడడంలో వుపయోగపడతాయి. సినిమాలు తీయడంతో పాటు వాటి గురించి విశ్లేషించడం కూడా సినిమా అభివృధ్ధి చెందడంలో ఎంతో దోహదం చేస్తాయి.

అలాగే సినిమాలు తీసే దర్శకులు కూడా ఒక్కోసారి తాము చూసిన, తీసిన సినిమాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు ఇప్పుడు వెలకట్టలేని గ్రంథాలుగా మనకి లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు సత్యజిత్ రే వ్యాసాల సంపుటం “Our Films – Their Films” అయినా, Alfred Hitchcock తో Francois Truffaut చేసిన ఇంటర్వ్యూలతో కూడిన పుస్తకమైనా, Andrei Tarkovsky రచించిన Sculpting in Time అనే గ్రంథమైనా సినిమా అనే ప్రక్రియకు పవిత్రతను చేకూరుస్తాయి.

ఒక దేశం యొక్క సినిమాలలో మార్పు రావడానికి ఇలాంటి విశ్లేషణా వ్యాసంగాలు ఎంతగానో ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. www.passionforcinema.com అనే website ఈ మధ్యనే సినీ ప్రముఖులను, ప్రేక్షకులను, విశ్లేషకులను ఒక చోటికి చేర్చే ప్రయత్నంలో దాదాపు సఫలం కాగలిగింది. మూస సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మన సినీ పరిశ్రమను రేపటి రోజున ఇలాంటి ప్రయత్నాలే కాపాడతాయని నా ధృఢమైన నమ్మకం.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 3 Comments