కథా మాలతీయం – 3

స్వాతి:

మీ దృష్టి లో కథకీ ఇతర ప్రక్రియలకీ తేడా ఏమిటి? మీర్రాసేవాటిలో ఎక్కువ కథలే కావటానికి కారణం ఏమిటో !

మాలతి:

ప్రాథమికంగా కథ, కవిత, వ్యాసం – ఇవన్నీ ఒక వ్యక్తి తన అనుభవాలూ, అనుభూతులూ, ఆలోచనలూ వ్యక్తం చెయ్యడానికీ, పంచుకోడానికే కదా. ఈ అనుభూతులూ అనుభవాలూ ఆవ్యక్తి వాతావరణంలోనుండి ప్రభవించేవే. వాతావరణాన్నిబట్టి ఒకొక కాలంలో ఒకొక ప్రక్రియ ప్రాచుర్యంలోకి రావచ్చు. నాచిన్నతనంలో ముందు చెప్పినట్టు స్త్రీవిద్యని ప్రోత్సహించిన కాలం. ఆరోజుల్లో అన్నదమ్ములూ, తండ్రులూ కూడా ఆడపిల్లలకి ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించారు. ఆడపిల్లలు వీధిలోకి వెళ్లకూడదు అనుకున్నవారు కూడా ఆడవారు ఇంట్లో కూర్చుని చదువుకోడానికీ, రాసుకోడానికీ అభ్యంతరాలు పెట్టలేదు.

మాఇంట్లో కూడా నేను చదువుకోడానికీ రాసుకోడానికీ అనుకూలవాతావరణమే వుండేది. పోతే కథే ఎందుకు ఎంచుకున్నానంటే, అప్పట్లో నాకు రాయాలనిపించిన విషయాలు కథకి అనువుగా వుండడం. పరిణతిలేని వయసు కనక ఏదో సంఘటనో, అనుభవమో నా దృష్టికి వస్తే కథ రాస్తూ వచ్చేను. నిజానికి కథ రాయడం సుళువు అని కూడా నేను అనుకుంటాను. ఏదైనా చెప్పగల అంశం వున్నప్పుడు కథ చెప్పడమే తేలిక. మనం నడవలోనో అరుగుమీదో కూర్చుని “నిన్న ఏం అయిందో తెలుసా” అనో “సుబ్బమ్మత్త పుట్టింటికెళ్లినప్పుడూ” అంటూనో మొదలు పెట్టి ఆడుకునే వూసులన్నీ కథలే. జరిగిన కథ, చూసిన కథ రాయడం తేలిక. చెప్పడానికి సరుకు వుంటుంది కనక. నేను కవితలు అనుకుని రాసినవి వున్నాయి. కొందరు అవీ కవితలేనా అంటూ నవ్వేరు. నేను అలాటి వచనకవితలు చూసాను కనక నేను రాసినవి వచనకవితలే అనుకుంటాను. ఎందుకంటే, నాకు ఏదో ఒక భావం చెప్పాలన్న ఆతురతో ఆవేదనో కలిగినప్పుడు, అందులో కథకి కావలసినసరుకు లేనప్పుడు కవితలాగ రాస్తాను.

అలాగే వ్యాసాలూను. చెప్పాలనుకున్న విషయమే ప్రక్రియని ఎంచుకుంటుంది. మరొకరి అనుభూతి కథగా రాయొచ్చు కానీ కవితగా రాయలేం. కవితలు నూటికి నూరు పాళ్లూ వైయక్తికం. కథ వైయక్తికం కావచ్చు, కాకపోవచ్చు. అంతే కాదు. నేను సమీక్షలు కూడా రాసేను. ఇండియాలో వున్నప్పుడు, 1970, ‘71లో ఆంధ్రజ్యోతివారు నాకు పుస్తకాలు పంపేవారు సమీక్షలకోసం.

స్వాతి:

స్త్రీలకోసం ప్రత్యేకమైన సాహిత్యం ఉండాల్సిన అవసరం ఎంతవరకూ ఉంది? ఇప్పటివరకూ ఈ కోవకు చెందిన రచనలు స్త్రీల ఆలోచనల్లో, జీవితాల్లో ఎంతవరకూ మార్పులు తీసుకొచ్చాయంటారు.

మాలతి:

స్త్రీలకి ప్రత్యేక సాహిత్యం ఆనాదిగా వుంటూనే వుంది. లాలిపాటలూ, దంపుళ్లపాటలదగ్గర్నుంచీ, కుటుంబంలో హాస్యం, వెటకారం, బాధనీ ఆవిష్కరించే కథలూ, పాటలూ, గ్రామదేవత కథలూ – ఇలా ఎన్నో రకాల సాహిత్యం కేవలం స్త్రీలే పాడుకున్నవీ, చెప్పుకున్నవీ చాలానే వున్నాయి. వీటిలో ప్రథానాంశాలు ఉపశాంతినివ్వడమో నీతిమార్గం బోధించడమోగా కనిపిస్తోంది. లాలిపాటలు పిల్లలిని నిద్రపుచ్చితే, కోడళ్లు పాడుకునే పాటలు తమబాధని ఇరుగమ్మతోనో పొరుగమ్మతోనే చెప్పుకునేవిగా వుంటాయి. అదే ఆనాటి థెరపీ అన్నమాట. గ్రామదేవతల కథలూ, వీరమాత కథలూ స్త్రీలకి మనోదారుఢ్యాన్ని చిత్తస్థైర్యాన్ని ఇచ్చేవి అని నాకు తోస్తోంది. పోతే ఈనాడు స్త్రీవాదంపేరుతో వస్తున్న సాహిత్యానికీ, పైన చెప్పిన పురా సాహిత్యానికీ ముఖ్యమయిన తేడా తమ అనుభవాల్నీ అనుభూతుల్నీ వ్యక్తం చేసే విధానంలో. ఫూర్వపుసాహిత్యంలో సామరస్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఔద్ధత్యంతో కూడుకున్నది. నా అభిప్రాయంలో ఔద్ధత్యంతో పనులు సాగవనే. ఒకరు ఎప్పుడయితే దుర్భాషలాడేరో, అప్పుడే రెండోవారు అదే స్థాయిలో జవాబిస్తారు. అలా ఇద్దరూ దుర్భాషలాడుకుంటూ కొంతకాలం గడిచేసరికి ఆమాటలు అలవాటయిపోయి, వాటిపదును తగ్గిపోతుంది. వాటికి విలువ లేకుండా పోతుంది. నిజానికి ఈ స్త్రీవాదం కానీ మరో వాదం కానీ చదివేదీ చర్చించుకునేదీ కూడా పండితులే. అవి సామాన్యులస్థాయికి చేరుతున్నాయా అంటే అనుమానమే.

రెండోది ఏవాదం తీసుకున్నా, ఏకాభిప్రాయం వున్నట్టు కనిపించదు. ఆదృష్టితో చూసినా, వాదాలన్నవి పండితులకోసమే అనిపిస్తుంది.

ఈనాటికీ అప్పారావుగారి దిద్దుబాటు గొప్ప సాంఘికకథ అంటే నాకు ఆశ్చర్యంగా వుంటుంది. నేను చూసినంతవరకూ, వేశ్యాలోలత్వం, జూదంవంటి దురలవాట్లు చాలా బలమైనవి. క్షణాలమీద మార్చుకోగల అలవాటు కాదు అది. అప్పారావుగారికథలో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలియగానే ఆ భర్త నిల్చున్న పళాన మారిపోయాడంటారు రచయిత. నాకు తెలిసినంతవరకూ నిజజీవితంలో భార్య పుట్టింటికి పోతే, వేశ్యాలోలురకి మరింత ఆటవిడుపు, అదేకథ స్త్రీ రాసివుంటే ఇంత అమాయకంగా వుండదు.

ఈనాడు విద్యావంతురాళ్లయిన స్త్రీలు చాలామంది వున్నారు. స్త్రీలకి ప్రత్యేక సాహిత్యంమూలంగా వారి ఆలోచనల్లో, జీవితాల్లో మార్పులు వచ్చేయా అన్నవిషయం వారే చెప్పాలి.

నా అభిప్రాయంలో మార్పు సహజం. మనం వద్దనుకున్నా వస్తుంది. అయితే మార్పు రావడానికి ఒక్క సాహిత్యమే చాలదు. అనేక సాంఘిక పరిస్థితులు, స్థానికంగా ఉత్పన్నమయినవీ, బయటినుండి వచ్చినవీ (ఉదా. అమెరికన్ సంస్కృతి) ఏకమయి మార్పుకి దోహదం చేస్తాయి. ఏకారణంవల్ల ఏమార్పు వచ్చింది అని విడదీసి చెప్పడం సాధ్యం అనుకోను.

స్వాతి:

మీ కథల నుండి మీరు ఏమి ఆశిస్తారు. మీకు బాగా తృప్తినిచ్చిన మీ కథలేమిటి? ఎందుకు?

మాలతి:

నేను కథ రాయడం సాధారణంగా కథకి అనుగుణమైన వస్తువు దొరికినప్పుడు జరుగుతుంది. అది ఎలాటిది అంటే నాకో, నాకు తెలిసినవారికో ఆనందమో, బాధో, కోపమో, ఇష్టమో – ఏదో ఒక అనుభూతి బలంగా కలిగించేది అయివుండేది. చాలామంది చదివి స్పందిస్తే, ఓహో నాలా ఆలోచించేవారు వున్నారు, నేను చెప్పినవిషయం సమంజసమే అని అర్థం అవుతుంది కనక తృప్తిగా వుంటుంది.

నాకు బాగా తృప్తినిచ్చినవి చాలానే వున్నాయి. ఎంచేతంటే. రాసిన ప్రతికథకీ వెనక నామనసుకి తగిలిన ఏదో ఒక స్పందన వుంటుంది కదా. అంచేత కథ మొత్తం కాకపోయినా, ఒక సంఘటన, ఒక వాక్యం, ఆఖరికి ఒకమాటవల్ల కూడా ఇది మంచి కథే అనిపిస్తుంది నాకు. నిజానికి పాఠకులస్పందనలు కూడా అంతే. ఒకొకసారి ఒక్కవాక్యం వారిని ఆకట్టుకుని, బాగుంది అనిపించొచ్చు. ఉదాహరణకి, ప్రాప్తం అన్నకథలో ఇంటివారమ్మాయి, పనిఅమ్మాయి మధ్య గల అనుబంధం ఒక స్థాయిలోనూ, ఆ అమ్మాయికీ ఆమెభర్తకీ మధ్యగల అనుబంధం మరొకస్థాయిలోనూ ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. నామటుకు నాకు అది మంచికథే. అయితే ఈనాడు విమర్శకులదృష్టితో చూస్తే, “ఏముంది అందులో అనిపిస్తుంది. గొప్పవారు బీదవారిని బాధపెట్టడం లేదు. భర్త భార్యని హింసించడం లేదు. కొంచెం వుందిలెండి. అనుకున్నరోజుకి తిన్నగా ఇంటికి రాకుండా, స్నేహితుడియింటికి వెళ్తాడు కనక భార్యని బాధపెట్టినట్టే. కానీ కథలో ఆకోణానికి ప్రాధాన్యం లేదు. అయినా అతిమామూలు విషయాన్ని చిన్నకథగా మలచడంలో కృతకృత్యురాలిని అయేననే అనుకుంటున్నాను. మరొక ఉదాహరణ, నాస్నేహితురాలు వైదేహితో మాటాడుతున్నప్పుడు, తనకి చాలా నచ్చినకథల్లో ఒకటిగా “అవేద్యాలు” అన్నకథని పేర్కొంది. నిజానికి మరెవరూ ఎప్పుడూ అనలేదు ఆమాట. నాకథాజీవితంలో తొలిసారిగా తననుండే విన్నాను ఆకథపేరు. ఆకథలో మేనబావ తనని పెళ్లి చేసుకోడానికి మొదట నిరాకరించి, మరో అమ్మాయిని చేసుకోడానికి నిశ్చయించుకుని, మళ్లీ మనసు మార్చుకుని తిరిగి మరదలిని చేసుకుంటానంటాడు. అతనికి మరదలు చెప్పినజవాబు ఆఅమ్మాయి వ్యక్తిత్వానికి గీటురాయి. మరదలి ఆత్మాభిమానం, చిత్తశుద్ధి తనని ఆకట్టుకున్నాయి అంది వైదేహి.

నేను కథలు రాస్తున్న తొలిదశలో, పెద్ద రచయితలదృష్టిని ఆకట్టుకున్న కథ మంచుదెబ్బ. ఒకరకంగా చూస్తే ఒక సాంఘికసమస్యని ఆవిష్కరించిన కథ. 1963-64 ప్రాంతాల్లో ప్రచురించారు ఆనాటి రచనలో. నేను మాత్రం నేనేదో సాంఘికప్రయోజనం గల కథని రాస్తున్నానన్న స్పృహతో రాయలేదు. చెప్పొచ్చేదేమిటంటే, స్పందన ముఖ్యం. ప్రయోజనాలు తరవాత వస్తాయి. నాధ్యేయం పాఠకుడు మనిషిగా స్పందించడమే కానీ అతడిని సంస్కరించడం కాదు.

ఇలా ఆలోచిస్తే, మీప్రశ్నకి సమాధానం, నాకు కథల్లో, నావి కానీ మరొకరివి కానీ, నచ్చే అంశం మానవనైజాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించినవి.

అంచేత నేను ఒకకథ ఎంచుకోడం కంటే, మీరే ఫలానాకథలో మీకు నచ్చినఅంశం ఏమిటి అని అడిగితే, చెప్పడానికి ప్రయత్నిస్తాను.

Posted in వ్యాసం | Tagged | 6 Comments

విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మొదటి అంకము

ఉగాది అనగానే లేత మామిడికాయలూ వేప్పూతా ఉగాది పచ్చడీ ఎలా సహజమో, తెలుగునాట ఉగాది అనగానే కవిసమ్మేళనం కూడా అంతే సహజం. గత ఏడాది సర్వధారి ఉగాదికి పొద్దు నిర్వాహకుల ప్రోత్సాహంతో తెలుగుబ్లాగ్లోకంలో పద్యరచన అంటే ఉత్సాహం ఉన్నవారిని కూడగట్టి మొదటి సారిగా ఉగాది కవి సమ్మేళనము నిర్వహించాము. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. శ్రీ చింతా రామకృష్ణారావు గారు, శ్రీ భైరవభట్ల కామేశ్వర్రావుగార్ల వంటి పద్యరచనలో చెయ్యి తిరిగిన కవులు కూడా మా ఈ చిన్న ప్రయత్నంలో ఆసక్తి చూపించడం ఒక యెత్తయితే, తమతోటివారు అలవోకగా పద్యాలు కట్టేస్తూ సమర్ధవంతంగా సమస్యలు పూరించడం గమనించి చాలా మంది యువతరం వారు ఛందోనియమాలు నేర్చుకుని అనతికాలంలోనే చక్కటి పద్యాలు రాస్తుండటం ఇంకొక యెత్తు. ఇలా వెల్లువెత్తిన ఉత్సాహంతో గత విజయదశమి సందర్భంగా రెండవ కవి సమ్మేళనం నిర్వహించాము. ఈ సభలో వందకి పైగా పద్య కుసుమాలు విరబూసినాయి.

ఏడాది క్రిందట సరదాగా మొదలైన ఈ సంరంభం ఈ ఉగాదితో సంప్రదాయంగా మారుతోంది. ఈ సభలో ఇరవైమందికి పైగా కవులు పాల్గొన్నారు. చమత్కార భరితమైనవీ, దుష్కర ప్రాసలతో కూడినవీ, ఎటూ పొంతన లేకుండా దుర్గమంగా అనిపించేవీ అయిన సమస్యలు, కవుల సృజనాత్మకతని సవాలు చేసే దత్తపదులూ, ఊహాశక్తికి గీటురాళ్ళైన వర్ణనలూ .. ఈ అంశాలు సాధారణంగానే ఉండగా, ఈ సభలో అనువాదమని ఒక కొత్త అంశము ప్రవేశ పెట్టాము. పద్యం రాయడమంటే కేవలం గణాలకి తగ్గట్టు అక్షరాలు పేర్చుకోవడమూ, ఎలాగో కిందా మీదా పడి సమస్యని పద్యంలో ఇరికించెయ్యడమూ కాదు, పద్యమంటే మనసుని ఉత్తేజ పరిచే భావ ధారని మనసుకి హత్తుకునే శబ్ద చాతుర్యంతో చెప్పే కవనమని విశ్వసించి, సంస్కృతాంగ్లాలనుండి కొన్ని ప్రసిద్ధ కవితా పంక్తుల్ని పద్యాల్లో అనువదించమని కోరాము. ఫలితాలు మీరే చూస్తారుగా.

పద్యాలు చాలా పెద్ద సంఖ్యలో రావడం వలన అన్ని పూరణలనీ ఈ నివేదికలో పొందు పరచడం సాధ్యముకాలేదు. అదీ కాక, ప్రత్యక్ష సభలో అందరు కవులూ పాల్గొన లేకపోయారు. అందువలన మొత్తం పద్యాలనుండి కొన్నిటిని మాత్రమే ఈ నివేదికలో ప్రచురించ గలుగుతున్నాము.

{స్వాగత వచనములతో … కొత్తపాళీ}:కం||

స్వాగతమీ కవితతికిని
స్వాగతము విరోధినామ వత్సరమునకున్
స్వాగతము కావ్య కన్యకు
వాగర్ధములకు సరసపు స్వాగత మిత్తున్

{కొత్తపాళీ}: అలనాడు రాయల కొలువులో ముక్కు తిమ్మనార్యునిలా మన సభని రంజింప చేయడానికి వచ్చిన ముక్కు రాఘవ కవీ,
{రాఘవ}: సెలవీయండి
{కొత్తపాళీ}: విఘ్నేశ్వరాది ఇష్టదేవతా ప్రార్ధనముతో మీ కవితా గానం ఆరంభించమని కోరుతున్నాను
{రాఘవ}: శా||

మూలాధారరథాంగదైవతమ! చాముండార్భకజ్యేష్ఠ! చి |
త్రాలంకారవిశేషభూష! తరుణార్కప్రద్యుతీ! సర్వవి |
ద్యాలక్ష్యా! సకలాగమస్తుతమతీ! దన్త్యాస్య! విఘ్నేశ్వరా!
నీ లీలం బలికింపఁజేయుమయ వాణిం బద్యరూపంబులో


{కామేశ్వరరావు}:
విఘ్నేశ్వరుని ప్రార్థన చాలా బావుంది రాఘవగారు!
{కృష్ణమోహన్}: రాఘవ! పద్యం చాలా బాగుంది.
{కొత్తపాళీ}: దన్త్యాస్య .. ఈ సంబోధన నాకు చాలా నచ్చింది. రాఘవా, అలాగే సరస్వతీ దేవిని కూడా స్తుతించి ఆహ్వానించండి.
{రాఘవ}: తప్పకుండానండీ
ఉ||

పిల్లసమీరముల్ గగనవీథిని వీచుచునుండ బ్రహ్మతోఁ
దెల్లనియంచనెక్కి సురదివ్యపురంబుల సంచరించుచుం
బిల్లల పద్యమాలికలఁ విన్చు తలూపుచు సత్కృపన్ సదా
చల్లగఁ జూచుఁగాఁత మము శారద శారదనీరదాభయై


{రాకేశ్వర}:
చాలా క్యూట్ (క్షమించాలి) గా వుంది ఈ పద్యం 🙂
{కొత్తపాళీ}: హహ్హహ్హ. క్యూటెందుకంటే అచ్చ తెలుగు కాబట్టి
{రానారె}: రాకేశ్వరమాటే నామాట. కథ వింటున్నట్టుంది పద్యం వింటున్నట్టు లేదు. అంటే కళ్లకు కట్టినట్టుగా అని నా ఉద్దేశం.
{కృష్ణమోహన్}: సోర్సూ, డెస్టినేషనూ రెంటినీ రాఘవగారే కీర్తించేసారు 🙂 శారద సకలవిద్యా దాత – సకల విద్యాలక్ష్యా అంటూ విఘేశ్వరుడ్ని.. 🙂
{రాఘవ}: పట్టేసారు కృష్ణమోహన్ గారు
{రామకృష్ణ}: శారదా సాక్షాత్కారం అయింది. చాలా బాగుంది.
{సత్యనారాయణ}: పద్యము చాల బాగ వచ్చింది
{భావకుడన్}: ఇది నాకు అర్థంయ్యిందోచ్ 🙂 చాలా బావుందండి.
{రాఘవ}: పద్యం అందంగా వచ్చిందీ అంటే అది పెద్దల ఆశీర్వాదమూ అమ్మ దయానూ

{కొత్తపాళీ}: విజయదశమి సభలో కామేశ్వర్రావు గారు సీస మాలిక రాశారు తెలుగు భారతి నుద్దేశించి. దానికి దీటుగా ఉందిది.
{రాఘవ}: తెలుగుభారతికి వెలుగుభారతి అన్నమయ్య పదాలు వింటూంటే అవే వచ్చేస్తాయండీ మంచి పదాలు.
{కృష్ణమోహన్}: తెలుగు భారతికి వెలుగు హారతి కూడా అన్నమయ్యే!
{పుష్యం}: చెల్లును మీకు గుండె అది ఝిల్లన పద్యములల్ల రాఘవా
{కామేశ్వరరావు}: అయితే “వీథి”లో చుక్క ఉందంటారన్నమాట రాఘవగారు 🙂
{రాఘవ}: ఔను. చుక్కలేకపోతే ఎలాగు చెప్పండి. శారదచంద్రుడు బాధపడడూ! 🙂
{రామకృష్ణ}: మీకు అవధానం అలవాటుందా చేయడం?
{రాఘవ}: రామకృష్ణగారూ, ఎవరిని ఉద్దేశించి అడిగారో తెలియదు కానీనండీ, నేను కనీసం పృచ్ఛకత్వం కూడా వహించలేదండీ.
{రాకేశ్వర}: అవధానానికి మా తరం నుండి ప్రతినిధిగా రాఘవని పంపబోతున్నాం, రామకృష్ణగారు 🙂
{రామకృష్ణ}: శుభం

{కొత్తపాళీ}: ఇష్టదేవతా ప్రార్ధన కూడా కానియ్యండి రాఘవా .. ఇక అసలు సభలోకి వెళదాం
{రాఘవ}: సరే. ఇష్టదైవతప్రార్థన
చం||

శరదిశశాంకపూర్ణసమసౌఖ్యదచారుముఖంబువాని దా
శరథిని ధర్మవిగ్రహుని సత్యపరాక్రమునార్తరక్షకున్
శరధనుఖడ్గధారిని విశాలభుజాంతరసీమవానినిన్
శరధిశయానునిం గొలుతు శంకరసన్నుతు రామచంద్రునిన్

{రామకృష్ణ}: చాలా బాగుందండి
{కృష్ణమోహన్}: స్వస్తుతి అన్నమాట.. అందుకని… మరింత అందంగా వచ్చింది.. 🙂
{రాఘవ}: కృష్ణమోహన్ గారూ… మా కులదైవం పేరు నాకు పెట్టారు అంతేనండీ 🙂

{కొత్తపాళీ}: రామకృష్ణ కవి గారూ, కొత్తకొత్తగా వస్తున్న కొత్త సంవత్సరానికి మీ మధుర వాక్కులతో ఆహ్వానం పలకాలని మా కోరిక.
{రామకృష్ణ}: శ్రీమద్విరోధికి స్వాగతం . చిత్తగించండి.
ఉ||

స్వాగతమమ్మ! సత్కవుల సంగతినీవవిరోధివమ్మ! నీ
యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ! సద్
యోగమునిమ్మ! దుష్టులకయోగము గొల్పు విరోధివౌచు, యే
రోగముఁ లేక మాకిల పురోగతి నిమ్మ! విరోధి వర్షమా!

ఉ||

సద్రచనాభిలాషులగు సజ్జన వర్యుల శత్రు సంహతిన్
రుద్రుని పోలి చీల్చగ విరోధిగ పేరును దాల్చి వచ్చి, మా
భద్రతఁ జూచు నీకు నిట పల్కెద మిమ్ముల స్వాగతమ్ము. సత్
క్షౌద్రము లొల్కుచున్ జనులఁ గౌరవమొప్పఁగఁ గావు మిమ్మహిన్.

{కొత్తపాళీ}: మాష్టారూ కొంచెం తాత్పర్యం చెప్పాలి
{కొత్తపాళీ}: సత్ క్షౌద్రము లొల్కుచున్ ??
{రామకృష్ణ}: క్షౌద్రము = తేనె, నీరు
{రామకృష్ణ}: అందించుతూ
{రాఘవ}: క్షుద్రమంటే తేనెటీగ కదండీ… క్షౌద్రమంటే తేనె
{కొత్తపాళీ}: ఆహా, బాగుంది. నీ యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ – చాలా బావుంది
{రాఘవ}: రామకృష్ణారావుగారూ, భలే చెప్పారండీ. విరోధిర్భవతు నో విరోధవిరోధిః.
{కృష్ణమోహన్}: ఏమి ఉగాదో… ప్రతీ సంవత్సరం పేరు మార్చుకు వచ్చేస్తోంది.. అసలు తను మారుతోందో లేదో తెలియడం లేదు 🙂
{రాఘవ}: ఇలా అంటున్నారనే పేరుతో పాటు ఈ సారి షేరు కూడా మార్చింది 😉
{కొత్తపాళీ}: క్రిమో, ఉగాది ఎప్పుడూ నవ యుగాదే. సంవత్సరాలే మారుతుంటాయ్
{కామేశ్వరరావు}: పేరుకి “క్షుద్రం”గా కనిపించినా అది తేనెలనే అందిస్తుందని ధ్వని! చాలా బావుంది!
{రానారె}: రుద్రుని పోలి చీల్చగ… బ్రమ్మాండంగా ఉంది.

{కృష్ణ}: సభకు నమస్కారములు
{కొత్తపాళీ}: కొండూరి కృష్ణరాయా స్వాగతం. కృష్ణ గారు మనందరికీ ఆత్రేయ బ్లాగు కర్తగా సుపరిచితులు

{కొత్తపాళీ}: కామేశ్వర్రావు గారూ .. సిద్ధమా?
{కామేశ్వరరావు}: మీదే ఆలశ్యం 🙂
{కొత్తపాళీ}: మీ వసంతాహ్వాన కోకిల గానం వినిపించండి 🙂
{కామేశ్వరరావు}:

చం||

మనుషుల గుండెలోతులను మాయని మానవతామరందమున్
గనుగొని, గ్రోలి, కమ్మనగు కైతల తేనెలపట్లు గట్ట, ర
మ్మని పిలిచేనుగా మనల నామని పొద్దు ఉగాదివేళ ఝు
మ్మను మధుగీతి బద్యముల స్వాగతమిత్తము క్రొత్తయేటికిన్


{రానారె}:
అహా! తెలుగు పద్యం 🙂
{రాఘవ}: భలే. మళ్లీ తేనెపట్టు.
{గిరిధర్}: కమ్మని కైతలని తీయని తేనె పట్టులో బానే ఇరికించేసారు
{కొత్తపాళీ}: అంతే తేనెలు వాకలు కడుతున్నాయి 🙂
{రామకృష్ణ}: తేనెలవాగులు ప్రవహిస్తుందీ సంవత్సరం

{కామేశ్వరరావు}: మరొక్క పద్యం.

సీ||

తెలుగన్న తులలేని వలపు తీగలుసాగి జాలానుబంధమై సౌరుమీర
ప్రత్యక్షమైన ఏ పరిచయమ్మును లేని వారి బద్యాలతో పలుకరింప
వర్షాది శుభవేళ హర్షాతిరేకాన నిలువెల్ల హృదయాలు పులకరించ
హృదయాల వికసించు మృదుభావ కుసుమాల మాలలతో తోరాణాలు గట్ట

తే||

వచ్చి వాలితిమి కువకువల్ సెలంగ
గువ్వలటు శారదాలయ గోపురమున
పలుకులమ్మకు మనసార ప్రణతి జేసి
మొదలుపెట్టెదమిక మన ముచ్చటలను

{రానారె}: అలాగే నండి. ఇంత మధురంగా చెప్పిన తరువాత అలాగేనని తలలూపాల్సిందే.
{రామకృష్ణ}: మాటలా తెనుగు తేటలా
{గిరిధర్}: ఆహా, చాల బావుంది
{భావకుడన్}: పలుకులమ్మకు కువకువల స్వాగతం…చాలా మధురంగా ఉంది.
{కామేశ్వరరావు}: గిరిగారు, తేనెపట్లలోంచి తేనెలని తీసే బాధ్యత రసజ్ఞులైన విమర్శకులది!
{రాఘవ}: ఆహాహా. జాలానుబంధం. పద్యాలపలుకరింపు. హర్షాతిరేకం. కువకువలు. శారదాలయగోపురం…. భలే భలే భలే.
{కొత్తపాళీ}: సెబాసు
{రానారె}: తెలుగన్న తులలేని వలపు సాగినట్లే సాగిందీ పద్యం కూడా
{రోహిణి}:
విరోధి ఉగాది శుభాకాంక్షలు
శా||

శ్రీమద్వేంకట నాయకుండు, గ్రహముల్ శ్రేయస్సులన్నిచ్చి, మీ
క్షేమంబున్ నవ వర్షమందు సకలాభీష్టంబు సద్భక్తియున్,
క్షామంబింతయు లేక భూమి శుభముల్ గాంచంగ, పద్మావతీ
శ్రీమాతన్ కొనియాడి వేడెద విరోధీ వర్ష యారంభమున్.

————
(తొలి అంకం సమాప్తం)
————

తరువాతి అంకం: సమస్యాపూరణం (త్వరలో)

Posted in కవిత్వం | Tagged , , | 6 Comments

తామస విరోధి- మొదటి భాగం

విరోధి నామ సంవత్సర ఉగాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన ఆన్లైన్ వచన కవి సమ్మేళనం “తామస విరోధి” కి స్వాగతం. సాధారణం గా సమ్మేళనాల్లో కవులు తమ స్వీయ కవితల్ని చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమం లో దానికి పొడిగింపుగా ఆ కవితలపై అనుభవజ్ఞుల విశ్లేషణలు, సూచనలూ కూడా చేర్చటం వల్ల నవ కవులకి మార్గదర్శకం గా ఉంటుందని భావించాము. ఇంతే కాకుండా “తర్ కవిత ర్కాలు” పేరు తో కవిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపేందుకు దీన్నొక వేదిక గా చేశాము.

తామస విరోధి మొదటి భాగం లో ఉగాది పై వసంతస కవితల్ని అందిస్తున్నాము. తర్వాతి అంకాల్లో మిగతా కవితలు, చర్చలను ప్రచురిస్తాము.

ఇక ఈ చైత్ర యాత్ర లో పాల్గొన్న వారి వివరాలు:

అతిధులు/కవిత్వ విశ్లేషకులు:

  • విన్నకోట రవిశంకర్: కుండీలో మర్రిచెట్టు ని తన కవితా సంకలనం లో బంధించిన రవి శంకర్ గారు కవితలూ, సాహితీ వ్యాసాల ద్వారా అంతర్జాలం లో సుప్రసిద్ధులు.
  • తమ్మినేని యదుకుల భూషణ్: ఆధునిక కవితా రీతుల్ని సశాస్త్రీయం గా చర్చించగల భుషణ్ గారు నేటి కాలపు కవిత్వం- తీరు తెన్నులు అనే విమర్శనాత్మకమైన పుస్తకాన్ని రచించారు.
  • భైరవభట్ల కామేశ్వర రావు: తెలుగు పద్యం బ్లాగు ద్వారా, కవి సమ్మేళనాల ద్వారా బ్లాగ్లోకం లోనూ .  గడి కూర్పరిగా పొద్దు లోను పాఠకులకి పరిచితులు.

పాల్గొన్న కవులు:

  • చావా కిరణ్:  ఆది తెలుగు బ్లాగరు, కవితలే కాక తన కథలతో నెట్‌లో హిరణ్యలోకాన్ని సృష్టించిన కిరణ్ తన నవలను సొంత బ్లాగులోనే అచ్చేసుకున్నారు కూడా.
  • బొల్లోజు బాబా: రవీంద్రుని “stray birds” ని తెలుగు అనువాదం చేసిన బాబా గారు సాహితీ-యానం బ్లాగరి.
  • నిషిగంధ: వివిధ అంతర్జాల పత్రికల్లో వ్యాసాలూ, కవితలూ, కథలూ సీరియల్సూ రాస్తున్న నిషిగంధ గారు మానసవీణ బ్లాగరు.
  • కత్తి మహేష్: పర్ణశాల బ్లాగులో ఎప్పూడూ కత్తి మొన లాంటి చర్చలు , విమర్శలూ సాగించే మహేష్ గారు కవితలూ, సినిమా రివ్యూ లు కూడా రాస్తున్నారీమధ్య.
  • శ్రీవల్లీ రాధిక: మహార్ణవం బ్లాగరిగా ఇంటర్నెట్‌లో కనపడే రాధిక గారు “రేపు చూడని వాన” అనే కవితా సంపుటే కాకుండా కొన్ని కథా సంకలనాలు కూడా ప్రచురించారు.
  • డా. జోగధేను స్వరూప్ కృష్ణ: ఇప్పుడో నది కావాలి (కవితాసంపుటి), Intangible cultural heritage of folk arts of Rayalaseema లను ప్రచురించారు.
  • తవ్వా ఓబుల్ రెడ్డి: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తవ్వా ఓబుల్ రెడ్డి ప్రవృత్తి రీత్యా కథారచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు.  20కి పైగా కథలు, 10 కవితలు, 200 వ్యాసాలు వివిధ పత్రికల్లో, ఆకాశవాణి ద్వారా ప్రచురితం, ప్రసారం అయ్యాయి.
  • స్వాతీ శ్రీపాద: అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు.
  • మూలా సుబ్రహ్మణ్యం: “ఏటిఒడ్డున” బ్లాగరి, అదేపేరుతో కవితా సంపుటిని ప్రచురించిన సుబ్రహ్మణ్యం గారు వివిద అంతర్జాల పత్రికల్లో కవితలు, కథలు, ప్రయోగాల ద్వారా సుపరిచితులు.
  • నూతక్కి రాఘవేంద్రరావు: తన పర్యాటక అనుభవాలూ, పిచ్చాపాటీ కబుర్లే కాకుండా కవితలు కూడా బ్లాగులో రాస్తున్న ఔత్సాహికులు.

ఆమని రాక

రచన: భైరవభట్ల కామేశ్వర రావు

ఎక్కడో అడవిలో
ఒక కొమ్మమాటు కోయిల పాట
వసంతమై వనమంతా పరుచుకుంటుందిట
ఇక్కడికది వినిపించదు
ఉగాది వచ్చిందని తెలిసేదెలా మరి?

మావిడాకులంత పవిత్రమైన ఆ చేతులతో
అమ్మ, పచ్చడి అందిస్తూ
తన పెదాలతో
శుభాకాంక్షల అక్షింతలు నాపై జల్లినపుడు
నా హృదయం పచ్చని అడవే అయిపోతుంది

ఉగాది వచ్చిందని
పాపం మరి తమ్ముడికెలా తెలుసేది?
అడవినీ అమ్మనీ వదిలి
వేరే ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపొయ్యాడే

చిగురించని వసంతం

రచన: కత్తి మహేష్

నీ తర్కం కాదనలేనని తెలుసు
అందుకే…
కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు

నీ ప్రేమను ప్రశ్నించే సాహసం చెయ్యలేను
అందుకే…
నా ప్రేమను కాదన్నా నొచ్చుకోలేదు

నీ మౌనాన్ని ఛేధించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్నినే  మౌనంగా విన్నాను

అయినా వసంతం రానేవచ్చింది
నా మదిలో కోయిల కాకున్నా
నీమౌనం కూసింది

మూగబోయిన మనసూ
ప్రాణం లేని తనువూ
వసంతం సాక్షిగా ఇక…
చిగురించే సాహసం చెయ్యలేవు

కామేశ్వర రావు: మంచి కవిత! తీసుకున్న అంశం బావుంది. కవిత పేరు ఇంతకుముందు విన్నదిలా ఉన్నా, కవితకి చక్కగా అతికింది. నాకు తోచిన కొన్ని విషయాలు:

“నీ ప్రేమను…” అన్న రెండో పేరా అక్కరలేదనిపించింది.

“నీ మౌనాన్ని ఛేదించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్నినే  మౌనంగా విన్నాను”
అన్నప్పుడు అక్కడ పదాలు చర్విత చర్వణంగా అనిపించాయి. చివరి వాక్యం –
“నిన్ను నిశ్శబ్దంగానే విన్నాను” అంటే బావుంటుందేమో.
“ప్రాణం లేని తనువూ” బదులు “ప్రాణం లేని తరువూ” అంటే ఎలా ఉంటుంది?

స్వాగత గీతిక

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

ఆమని ఆగమన స్వాగత గీతిక
పాడేందుకు స్వర తంత్రులు
సవరించుకొంటూ కొయిల
పూదేనియ జుర్రుకొనే
ఆత్రంలో ఆ తుమ్మెద
తుండం సరిచేసుకొంటూ రెక్కలు అల్లార్చుతూ
ఆ ఝూంకార స్వర రసాస్వాదానందానురక్తితో
లేలేత చిగురుల్లో పూబాలిక
స్నిగ్దత్వం సింగారించుకొంటూ
ఆ వసంతాగమన వేళ
మదన కేళీ విలసిత
మదుర భావ సంజనిత
మనస్విని ఆ జవ్వని
అర్ధ నిమీలిత నేత్రాలతో
అనుభూతులనాస్వాదిస్తూ
ఆమనినాహ్వానిస్తూ

ఆమని వగపు
రచన: స్వాతీ శ్రీపాద

ఏమూలకు చూపుసారించినా
రాతి గోడల శిలావృక్షాలు
బీడంతా పరచుకున్న ఆకుపచ్చ
కలల
మయసభలు
కృత్రిమత్వాన్ని కడుపారా త్రాగిత్రాగి
భళ్ళున కక్కేసినట్టు
ఏమూల చూసినా చిందరవందర శకలాలే
చీకటి రాత్రికి ఉరివేసి
ఉదయం సంబరం చేసుకుందామంటూ
వెలుగుల్ను వలువలుగా అనువదించుకుంటూ
తలుపు తట్టిన ఆమని మూగవోయేలా
వెల్లువలుగా ప్రవహించే
స్వార్ధం రక్తపుటేరులు

కోయిల గొంతు మూగవోయింది
నగరం ఒడినిండా
వగలు పోతున్న కాలుష్యాల
కౌగిట్లో ఉక్కిరిబిక్కిరై
ఊపిరందక మాట పెగలక
ఎలా పాడుతుంది స్వాగతగీతిక?

జీతవెచ్చాల సమీకరణాల్లో
మునిగితేలే ఐటి జీవాలకు
ఉగాదులెందుకు ?
ఉషస్సులెందుకు?
ఎంత జీతం? ఎంత మదుపు , ఎంత పొడుపు
అదేకదా రేపటి సౌకర్యాలకు పెట్టని అదుపు
ఏం కోల్పోతున్నారో ఏం పోగొట్టుకుంటున్నారో
రేపెప్పుడో పిల్లల లెఖ్ఖల్లో
వృద్ధాశ్రమాల జమాఖర్చులు చూసాక కాని
కదిలిపోయిన ఉగాదులు కళ్ళల్లో వెలగవు.
ఆమని రోదనా మనసులో ప్రతిధ్వనించదు.

రహస్య సృష్టి
రచన: బొల్లోజు బాబా

అంతవరకూ విడివిడిగా
ఎగిరిన తూనీగలు
జంటగా అదృశ్యమయ్యాయి.

గులాబీ రేకలపై కూర్చొని లేచిన
కోతులు కూడా కిచకిచమంటో
వనమంతా తిరుగాడుతున్నాయి.

ఇరు తనువుల్లో ఎగసిపడిన
మోహకీల
తన్మయత్వపు మంచుకొండపై
వెన్నెల పూలు పూయించింది.
పారవశ్యపు మైదానాలపై
నిశ్శబ్ధ సౌందర్యాన్ని వర్షించింది.

రాత్రి పగిలి, ముక్కలు చెదిరి
చీకట్లో కరిగి, వేకువలో అదృశ్యమయ్యింది.
నీ జడలో మల్లియల్లా.

నెమలీక నీలి కనులు
సగం తెరచీ, సగం మూసీ
ఆదిమ లౌల్యాన్ని ఆఘ్రాణిస్తున్నాయి.

వసంతం తన రహస్య అందాలతో
సృష్టిని సుసంపన్నం చేస్తోంది.

రవిశంకర్: మీ పద్యంలో గాఢమైన అనుభూతి ఉంది. కాని, ఎక్కువ పదచిత్రాలు వాడటంవల్ల కొంత గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, మోహకీల మంచుకొండపై వెన్నెలపూలు పూయించిందన్నప్పుడు అందులో వాడిన వివిధ పదచిత్రాల మధ్య సమన్వయం అంతగా కుదరదు. తన్మయత్వాన్ని మంచుకొండగాను, పారవశ్యాన్ని మైదానంగాను భావించటం కూడా అటువంటిదే. పదాల లాగే పదచిత్రాల వాడుకలో కూడా పొదుపు పాటించటం మంచిదని నా అభిప్రాయం. తుమ్మెదలు జంటగా అదృశ్యం కావటం, నెమలీక కళ్ళు అరమోడ్పులు కావటం బాగున్నాయి.

బాబా: మొదటి చరణం, తుమ్మెదల ప్రేమాయణం. రెండవ చరణంలో కోతుల బ్రీడింగ్ సీజన్‌లో రంప్ ఎర్రగా మారుతుంది. ఆ విషయాన్ని చెప్పాను. మూడవ చరణంలో ఆక్సీమోరాన్ లు ఉపయోగించాలని ప్రయత్నించాను. ఆదిమ లౌల్యమంటే అమీబా నుంచి మానవుని దాకా జరిగిన సృష్టి కార్య రహస్యమే.

భూషణ్:

అంతవరకూ విడివిడిగా
ఎగిరిన తూనీగలు
జంటగా అదృశ్యమయ్యాయి.

గులాబీ రేకలపై కూర్చొని లేచిన
కోతులు కూడా కిచకిచమంటో
వనమంతా తిరుగాడుతున్నాయి.

—————–
మంచి ప్రతిభ కనిపిస్తోంది, పద చిత్రాల ఎంపికలో, ఎత్తుగడలో. విశేషణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కవిత, వీలయినంత మూర్తం(concrete)గా ఉండాలి.
( ) లో ఉన్నవి అమూర్త విశేషణాలు: ఇవి ఎంత తగ్గితే అంత చిక్క బడుతుంది కవిత్వం.
[ ] లో ఉన్నవి ద్రుత పదబంధాలు: ఇవి తొలగిస్తే పాఠకుల ఊహకు పదును కలుగుతుంది.
{ } లో ఉన్నవి వ్యాఖ్యానాలు: కథ చివరలో నీతి, కవిత చివర వ్యాఖ్య వర్జ్యం.
[ } లో ఉన్నవి ప్రతిక్షేపాలు: విభక్తి ప్రత్యయాలు మార్చాలి (ఉదా:ల్లో–>లు)

కర్ణాటక సంగీతంలా, కలన గణితంలా కవిత్వాన్ని కూడా పాఠకులు, కవులు, విమర్శకులు
సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి కవి జీవిత కాలంలో ఒక్క నిర్దుష్టమైన, పరిపుష్టమైన కవిత రాయవలెనని ప్రతిజ్ఞ చేసుకోవాలి.దాని కోసం ఎంత దూరం పోవడానికైనా సంసిద్ధంగా ఉండాలి. అప్పుడు వద్దన్నా అద్భుత కవిత్వం జాలువారుతుంది.

మీలో ప్రతిభ ఉంది..వజ్రాన్ని సాన బెట్టాలి,మంచి కవిత్వం ,మంచి విమర్శ చదివి.
చివరి మాట: మీరు తక్షణమే ఒక మంచి కలం పేరు ఎంపిక చేసుకొండి.

తమ్మినేని యదుకుల భూషణ్.

—————————————-
ఇరు తనువు[ల్లో} ఎగసిపడి[న]
[మోహకీల]
(తన్మయత్వపు) మంచుకొండపై
వెన్నెల పూలు [పూయించింది.]
(పారవశ్యపు) మైదానాలపై
(నిశ్శబ్ధ సౌందర్యాన్ని) వర్షించిం[ది].

రాత్రి [పగిలి, ముక్కలు చెదిరి
చీకట్లో కరిగి, వేకువలో అదృశ్యమయ్యింది.]
నీ జడలో మల్లియ[ల్లా.]

నెమలీక నీలి కనులు
సగం తెరచీ, సగం మూసీ
(ఆదిమ లౌల్యాన్ని ) [ఆఘ్రాణిస్తున్నాయి.]

{వసంతం తన రహస్య అందాలతో
సృష్టిని సుసంపన్నం చేస్తోంది.}

బాబా: భూషణ్ గారికి, ఈమాట లోని మీ వ్యాసాలన్నీ చదివానండీ. నా కవితపై మీ వివరణ ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసినయ్ అండి. కొన్ని సందేహాలు.. మీ కభ్యంతరం లేకపోయినట్లయితే తెలుప గలరు. ఇది మనిద్దరిమధ్య సంభాషణ మాత్రమే కాకుండా, ముందుముదు మరెందరికో కూడా విషయావగాహనకు దోహదపడగలదని నా నమ్మకం.

  1. అమూర్త భావనలు మీ విశ్లేషణ, ఇదివరలో ఆవకాయ.కాం లో అలోక్ గారి ఇచ్చిన వివరణలు నాబోటి వారికి ఎంతో ఉపయోగపడతాయి.
  2. ద్రుత పదబంధాలు తగ్గించటానికి మీ నుంచి మరిన్ని సూచనలు ఆశిస్తున్నాను సార్.
  3. వ్యాఖ్యానాలు తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో! 🙂
  4. ప్రతిక్షేపాలగురించి కూడా మీ నుంచి మరికొంత తెలుసుకోవాలని ఆశపడుతున్నాను సార్.

కలం పేరు పెట్టేసుకోవచ్చంటారా? అలానే సారూ. 🙂

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి- మొదటి భాగం

రాజకీయ రైలు

– కాజా సురేష్

పెరిగిపోతున్న జనాభా భారాన్ని మోస్తున్న భరతమాతలా, రాజకీయ రైలు మరో ఎలక్షను స్టేషనులోకి నెమ్మదిగా వచ్చి ఆగింది. పెళ్ళిళ్ళ సీజనులో జనరలు కంపార్టుమెంటులా, ఆంధ్ర దేశపు బోగీ, పదవీవ్యామోహపరులతో క్రిక్కిరిసి ఉంది.

చెన్నైలో రజనీకాంత్ కొత్త సినిమా విడుదల సందర్భంలోలా, రంగురంగుల నాయకుల పోస్టరులు, కరపత్రాలు, మైకుల శబ్దాలతో స్టేషనంతా గందరగోళంగా ఉంది. మీకిష్టమైన (అభి)రుచులలో, వేడి వాడి కబుర్లు దైవ”సాక్షి”గా, “ఈనాడు” మీకందించి మీలో “జ్యోతి”, “ప్రభలు” వెలిగిస్తామని రకరకాల పేపరు కుర్రాళ్ళు అరుస్తూ బోగీ చుట్టూ కలియ దిరుగుతున్నారు.

ఇక స్టేషను టీవీలలో సరేసరి – త్రివర్ణము, పసుపు, గులాబి, పచ్చ లాంటి వివిధ రంగులలెన్సుల నుండి వస్తున్న గాలిమేడల సీరియలు కబుర్లు, ఉచిత తాయిలాల వర్ణనలు, వెన్నుపోట్ల విశేషాలు, వాత్సాయనుడు సైతం సిగ్గుపడేలాటి అసభ్యపు మాటల తూటాలను, నోట్లో వేలేసుకొని, అతి శ్రద్దతో తమను తాము మర్చిపోయి చూస్తున్నారు వెర్రి జనం.

పంచె, లాల్చీ తొడుక్కుని, గాంధీ టోపీ పెట్టుకున్న ఒక ముసలి ఆసామి – ఏడు పదుల వయస్సు ఉండవచ్చు – తన ఇద్దరు కొడుకులతో రైలు దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో ఏదో తెలియని తేజం, పోరాటాలు జరిపిన పట్టుదల, తోటి మనుషుల పట్ల అంతులేని కరుణ, భావి తరాల పట్ల ఆశాభావం ప్రస్ఫుటమవుతున్నాయి.

కొడుకులిద్దరు కొంచెం నాగరికమైన (?) బట్టలు వేసుకున్నా, వాళ్ళంతా దారిద్ర్యరేఖకి దిగువున ఉన్నవాళ్ళే అన్న సంగతి ఇట్టే తెలుస్తున్నది. సినిమాహాలులో బాల్కనీ టికెట్టు ‘అయ్య’వారు ‘నేల’బ్బాయిని చూసినట్టు, మిగతా ప్రయాణికులు పెట్టిలోకి ఎక్కుతున్న వీళ్ళను అసహనంగా, చిరాకుగా చూశారు.

మరి కాసేపటిలో, TC నింపాదిగా బోగీలోకి అడుగుపెట్టాడు, అతని కోటు జేబుమీద తెలుగులోను, ఇంగ్లీషులోను, “మీ సగటు అమాయకపు వోటరు” అని రాసి ఉన్నది. మెట్ల దగ్గర, కింద కూర్చున్న వృద్దుని కుటుంబం వంక ఓరకంటనైనా చూడకుండా, బెర్తులలో దర్జాగా బైఠాయించిన బడాబాబుల దగ్గరికి నేరుగా వెళ్ళాడు.

కూపేలో కూర్చునివున్న ‘సార్రాజు’, “ఏమిసారూ బాగున్నారా?” అని కులాసాగా పలకరించాడు TCని. “మిమ్మలిని కలిసి అప్పుడే ఐదేళ్ళు అయిందా” అని విపరీతమైన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “క్రితంసారి మల్లే ఈతూరి కూడ నాకు మా పోరగాళ్ళకు కిటికీ కాడ సీటు ఇవ్వాలి మళ్ళా” అని, TC చేతిలో రెండు వారుణి పొట్లాలు ఒక సీమసారా సీసా పెట్టాడు. TC విపరీతమైన ఆనందంతో తూలుతూ, కొంచెము ఎదరగా, ఏదో గొడవ జరుగుతున్నచోటికి వెళ్ళాడు.

అక్కడ “రౌడీ రంగడు” నాటు బాంబులు, తుపాకులతో వీరంగం చేస్తూ కనబడ్డాడు. కిందపడ్డ రక్తపు మరకలు చూస్తే అప్పటికే రెండు మూడు మర్డరులు జరిగిఉండవచ్చునని సులభంగా తెలిసిపోతోంది. తన కండలు చూపిస్తూ, మీసాలు మెలేసి, కరుకుగా “ఏమి సారు ఇక్కడ కూర్చోవచ్చా?” అని ఉరుముతున్న గొంతుతో TCని అడిగాడు. “అంతకంటేనా” అని నీళ్ళు నములుతూ బదులిచ్చాడు TC.

“ఆడితో మనకెందుకుగాని ఓపాలి ఈడకి రారా” అని TCని పిలిచాడు అతనికి దూరపు చుట్టపు
వరసైన సుబ్బారావు. “మన కులపోళ్ళంటే బొత్తిగా ఈళ్ళకి ఇలువ లేకుండా పోయిందిరా. అందుకని నువ్వు నాతోపాటు మనోళ్ళందరికి సీటు ఇవ్వాలి” అని అవేశంతో గట్టిగా గొంతు బొంగురుపోయేట్టు అరిచాడు.

“నా కులపోళ్ళేనా తక్కువ తింది?” అని TC, వాళ్ళందరికి సీట్లే కాదు, మంచి మంచి బెర్తులుకూడా ఇచ్చి, ఆ సంతోషంలో కళ్ళవెంట వస్తున్న అనందబాష్పాలు తుడుచుకుంటూ ఇంకొంచెం ఎదరకి వెళ్ళాడు.

అక్కడ, మంద్రస్వరంలో వస్తున్న పాశ్చ్యాత్య సంగీతానికి అనుగుణంగా, కట్టేబట్ట కూడా బరువైన ఒక నాజూకు సుందరి, లయబద్దంగా ఆడుతూంటే, విలాసంగా చూస్తున్నాడు, తాబేదారు అప్పారావు. అశోకుడు రోడ్లు వేయించాడో లేదో, భగీరధుడు సురగంగను తెచ్చాడో లేదో తెలియదుగాని, ఈ ప్రబుద్దుడు మాత్రం నిస్సందేహంగా అనేక ప్రాజెక్టు పనులు పూర్తిచేశాడని సర్కారీ రికార్డుల కథనం.

“ఇదిగో టీసీ, నీకీ యాతనెందుకు గాని, ఈ కట్ట ఉంచుకొని సగము సీట్లు, బెర్తులు మాకిచ్చి ఇవాళ్టికి నువ్వు పండగ చేసుకో” అని ఒక నోట్ల కట్ట, యజమాని కుక్కకు ప్రేమతో బిస్కెట్టు విసిరినట్టు, TC వైపు విసిరాడు. మెరిసే కళ్ళతో ఆ డబ్బు తీసికొని, తన చొక్కాతో బెర్తులు తుడిచి, “సార్, మీరు ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, బోగీ చివరి, మెట్ల దగ్గిరికి బరువైన జేబులతో నెమ్మదిగా వెళ్ళాడు TC.

అక్కడ, కింద గొంతుక్కూచునివున్న వృద్ధుడిని చూసి “నీ దగ్గర సారాగాని, డబ్బుగాని ఏమైనా ఉందా? కనీసం నువ్వు మా కులపోడివేనా?” అని చిరాకుగా అడిగాడు. బిత్తరపోయిన చూపులతో ముగ్గురూ తల అడ్డంగా ఊపారు.

“ఐతే దిగిపోండి” అని కటువుగా (ఓ బూతు పదం జోడించి) చెప్పి, వాళ్ళు చెప్పేది వినకుండా దించేశాడు. రైలు ‘కూ చికు చికు చికు’ అనుకుంటూ చీకటిలో గమ్యము తెలియని భవిత వైపుకు వేగంగా వెళ్ళిపోయింది. ప్లాటుఫారం మీద ఒంటరిగా మిగిలిపోయారు, వాళ్ళు ముగ్గురు.

ప్రపంచంలోని అతి పెద్ద Democracy ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి వచ్చిన ఓ విదేశీ ఔత్సాహికుడు, “ఎవరు మీరు?, ఆ వోటరు మిమ్మల్ని ఎందుకు దించేశాడు?” అని అడిగాడు వాళ్ళను. “నా పేరు ‘దేశ భక్తి’, వీళ్ళిద్దరు ‘నీతీ నిజాయితీ’, ‘సమాజ సేవ’ అనే నా బిడ్డలూ”, దీనంగా బదులిచ్చాడు ఆ వృద్దుడు. అయోమయుంలో పడ్డ ఆ విదేశీయుడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు –

“ఇలాంటి వోటర్లు(TCలు), రాజకీయనాయకులు ఉన్న ఈ దేశపు ప్రజాస్వామ్యానికి ఆ దేవుడే దిక్కు”.

———————

కాజ సురేష్

సురేష్ కాజా స్వస్థలము కృష్ణా జిల్లా నూజివీడు. పిలాని, కాన్పూర్, డల్లాస్‌లలో ఉన్నత విద్యనభ్యసించి, ప్రస్తుతం డల్లాస్‌లో Software Consultant గా పని చేస్తున్నారు. తన ఆలోచనలను http://naazaada.wordpress.com అనే బ్లాగులో చూడవచ్చు.

Posted in కథ | Tagged | 7 Comments

కవిత్వం నుంచి కవిత్వంలోకి… ‘దారి తప్పిన పక్షులు’

(Telugu translation of Tagor’s Stray Birds by Bolloju Baba)

– నిషిగంధ

కవిత్వమంటే అనుభవించిన క్షణాల్ని అక్షరాల్లోకి అనువదించడం! ఆ అనువదించిన అక్షరాలని పట్టుకుని పాఠకుడు కవి పొందిన అనుభూతిని పొందగలిగినప్పుడే ఆ కవిత్వం సార్థకమౌతుంది.

కవికి కవిత్వం ఒక జీవన విధానంగా ఉండాలి. అంతే కానీ బ్రతుకుతెరువు కోసం రాయడం మొదలుపెడితే అనుభూతి పాలు తగ్గిపోయి అభూత కల్పనలు ఎక్కువైపోతాయి! ‘తత్త్వతః వస్తువు అలంకారాలుగా మారిపోవడమే కవిత్వం. అలాగని కవిత్వమంటే అర్థవైచిత్రిగాని, శబ్దవైచిత్రి కాదని’ అంటారు శేషేంద్ర శర్మ. అంటే క్లిష్టమైన పదబంధాలు, లోతైన భాషా పటిమతో మంచి కవిత్వం పుట్టదు. కవి యొక్క అనుభవాల పరంపర అభివ్యక్తమయ్యే రీతి కళాత్మకంగా, తమ హృదయాలకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పాఠకుడు అందులో తనని తాను ఆవిష్కరించుకోగలడు.

సరిగ్గా అలాంటి కోవలోకి వచ్చేదే విశ్వకవి రవీంద్రుని కలం నించి వెలువడిన కవితా సంకలనం, ‘Stray Birds’.  టాగోర్ గురించి, ఆయన రచనల గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పాలనుకోవడం సాహసమే అవుతుంది. చదవడానికి ఎంతో సరళంగా ఉంటూనే, గాఢమైన భావార్ద్రతను కలిగి ఉండటం వాటి ప్రత్యేకత! తన అక్షరాల్లో కనిపించే వేదాంత దృక్పథం, ఉపనిషత్తుల ప్రభావం అని చెప్పుకునే టాగోర్, తన రచనలన్నీ చాలావరకు బెంగాలీలోనే చేసినా, తర్వాత కొన్నింటిని స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. అలా తర్జుమా చేయబడినదే, 1916 లో అచ్చువేయబడిన ఈ ‘Stray Birds’ కవితా సంకలనం. క్లుప్తత, గుప్తత ఈ కవితల ప్రధాన లక్షణాలు. చైనా, జపాన్ పర్యటనా కాలంలో ఆయా దేశాల కవిత్వ ప్రభావంతో ఈ చిన్న చిన్న కవితలు రాసినట్టు చెబుతుంటారు. అందుకేనేమో అక్కడక్కడా ‘హైకూ’ ఛాయలు కనబడుతుంటాయి!

టాగోర్ రచనలు చాలానే తెలుగులోకి అనువదింపబడినా ఎప్పటికీ నిలిచిపోయేవిగా గీతాంజలి, రాణీఘాట్, గోరా వంటి వాటిని చెప్పుకోవచ్చు.

అడపాదడపా కొంతమంది ఒకటీ రెండు పద్యాలను తెలుగీకరిస్తూనే ఉన్నా బహుకాల విరామం తరువాత టాగోర్ రచించిన ఈ  కవితా సంకలనం ‘Stray Birds’ మొత్తం ‘దారితప్పిన పక్షులు ‘ గా తెలుగులోకి అనువదింపబడినది. అనువాదకుడు మరెవ్వరో కాదు, పదచిత్రాలతో మనల్ని తరచూ సాహితీయానం చేయించే బొల్లోజు బాబా గారు.

ప్రకృతి, ఈశ్వరుడు, స్నేహం, ప్రేమ, మొదలైన వివిధ విషయాలను టాగోర్ చిన్న చిన్న కవితలలో స్పృశించాడు. ఈ చిట్టి కవితలలో కొన్ని, ఒక్క లైనుకే పరిమితమైనవి కూడా ఉన్నాయి. ‘దారితప్పిన పక్షులు’  పేరు వినగానే ఇదేదో వేదనా స్వరమేమోనన్న సంకోచం. కానీ మొత్తం 326 కవితలున్న ఈ సంకలనంలో చతురత, ఆరాధన, వేదాంతం, భక్తి ఇత్యాది భావాలన్నీ కలగలిసి, మంద్రస్వరంలో సాగుతున్న అద్భుతమైన పాటనేదో వింటున్న అనుభూతి కలుగుతుంది! వీటిలో లీనమవుతుండగానే, ఇవి పక్షులు కావు దారితప్పిన కవి ఆలోచనలు, భావాలు అన్న విషయం సుస్పష్టమవుతుంది.

నిజమే కదా! మన ఆలోచనలు కూడా పక్షులంత స్వతంత్రంగా విహరిస్తాయి. ఎక్కడెక్కడో తిరిగిన గువ్వలన్నీ చివరికి గూటికే చేరినట్లు ప్రాపంచిక విషయాలన్నిటినీ స్పృశించిన ఈ ఆలోచనా స్రవంతి కూడా కవి హృదయంలోకి ఒదిగిపోతుంది. అక్షరాలుగా జారి పాఠకులకి విశేషాలను వినిపిస్తుంది!

అనువాద రచన, పైగా ఇది యథామాతృకానువాదం. యథేచ్ఛానువాదం కాదు! అందులోనూ ఈ సంకలనంలోనివి చిన్న చిన్న కవితలు. ఇదే economy of words ని వేరే భాషలోకి తర్జుమా చేయడం అంత సులువు కాదు. అసలు రచనలోని అంతఃస్సూత్రాన్ని అవగాహించుకోవడమే కాదు అందులోని భావం, శిల్పం చెడకుండా అనువదించడం, అదీ సహజత్వానికి ఏమాత్రం దూరం కాకుండా చూడగలగడం కష్టసాధ్యమే!!

చిన్న కవితలలో పదాలను ఆచితూచి ప్రయోగించాలి. ఉన్న పరిధిలోనే ఉన్మీలనం చెందగలిగి ఉండాలి. అంటే కలం పట్టుకున్నవారికి భాషా ప్రావీణ్యమేకాదు, పదాల ప్రయోగంలో నైపుణ్యం ఉండాలి! ఇది సాధించడానికి ఇరు భాషల మీదా పట్టు ఉండాలి. వేరే భాషలో ఉన్న కవిత్వాన్ని అనువదించేప్పుడు భాషా ప్రయోగం కుదరకపోతే, ఆయువుపట్టైన రసజ్ఞతా భావం లోపించి కవిత్వం వచనమైపోయే ప్రమాదం ఉంది. బాబా గారి కవితలు చదివిన వారెవరికైనా ఆయన ప్రతిభ మీద ఏమాత్రం సందేహం కలుగదు. అనువాద వాసనలు ఇసుమంతైనా తగలని చిక్కని కవిత్వాన్నే మనకందించారు!

టాగోర్ సాహిత్యంతో, ముఖ్యంగా కవిత్వంతో పరిచయమున్న వారెవరికైనా తెలుస్తుంది ఆయన ఎన్ని రకాల సూచికలు, ఉపమానాలు, పద చిత్రాలు ఉపయోగించారో! బాబా గారి అనువాదం చదువుతుంటే ‘టాగోర్ మాతృకలో ఎలా వ్యక్తపరిచి ఉంటాడో!?’ అన్న కుతూహలం ఎక్కడా కలుగదు. మన నేపథ్యానికి తగినట్టుగా అనువాదకుడు పరిచిన పదజాలంలో ఒదిగిపోతూ మనమూ ఆ పక్షుల వెనకే చేతనాచేతనలను మరచి సంచరించడం మొదలుపెడతాము!

1

వేసవిలో దారితప్పిన పక్షులు, నాకిటికీ పై వాలి
పాటలు పాడి ఎగిరిపోయాయి.
పాటలు లేని శిశిర పత్రాలు
తల్లడిల్లి నిట్టూరుస్తో నేలరాలాయి.

అంటూ మొదలుపెడుతుండగానే కవి మాయమైపోయి అతని అనుభవాలు, అనుభూతులే మన కళ్ళముందు నిలుస్తాయి! ఇది ఆత్మాశ్రయ కవిత్వమా లేక అనుభూతి కవిత్వమా అంటూ ఒక వర్గానికి పరిమితం చేయలేము. కానీ ప్రధానంగా మూడు కవితా వస్తువులు కనబడతాయి: ప్రాపంచిక విషయ జ్ఞానం (Philosophy of life), భక్తి / ఆరాధన, ప్రకృతి.

ముందుగా ప్రాపంచిక విషయ జ్ఞానం గురించిన కవితలనే తీసుకుంటే వీటిలో మౌలికాంశాలను స్పృశించే తాత్త్వికాలోచన కనిపిస్తుంది.

14

సృష్టి రహస్యం రాత్రి చీకటిలా ఒక అద్భుతం.
జ్ఞానం యొక్క మాయలు
ఉదయపు మంచు పొగ వంటివి.

రాత్రి చీకటి అంటే గాఢమైన నిశ్శబ్దం. చుట్టూ ఉన్న ప్రపంచంతో డిటాచ్మెంట్ కలిగించే అలౌకిక స్థితి. రసానుభూతుల సంఘర్షణ నించి విరామం దొరుకుతున్నప్పుడే నిశ్శబ్దంగా ఒక మొగ్గ మెల్లగా విచ్చుకుంటుంది. అదే సృష్టి రహస్యం. అంతా జరుగుతూనే ఉంటుంది. కానీ రాత్రి చీకటిలా అస్పష్టంగా, అద్భుతంగా! జ్ఞానం మనల్ని మనం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో మన లోపల, బయట ఉన్న అనేకాంశాలు తేటతెల్లమౌతుంటాయి. ఉదయకాలపు పొగమంచు కిరణాల స్పర్శతో కరిగిపోయినట్లు, జ్ఞాన సముపార్జన ప్రాపంచిక విషయాలపై అప్పటివరకూ ఉన్న భ్రాంతిని కరిగించివేస్తుంది.

20

శ్రేష్ఠమైన దాన్ని నేనెన్నుకోలేను.
శ్రేష్ఠమైనదే నన్ను ఎన్నుకొంటుంది.

మనకు అనువైనది, అవసరమైంది తనంతట తానే మనల్ని చేరుకుంటుంది. అదే అన్నిటికంటే విలువైనది. అలవికాని వాటికోసం వృధా ప్రయాస కూడదనే హెచ్చరిక ఇందులో కనబడుతుంది.

45

అతను తన ఆయుధాలను
తన దేముళ్లుగా చేసుకొన్నాడు.
అతని ఆయుధాల విజయం, అతని ఓటమే.

ఆయుధాలకు ఉన్నత స్థానం ఆపాదించడం, వాటితో సాధించిన విజయమేదైనా వ్యక్తిగత ఓటమిగానే పరిగణించాలంటున్నారు. స్వీయప్రతిభతో చేజిక్కించుకోలేని ఏ విజయమూ మనది కాదు.

మనిషి ఆత్మజ్ఞానం గురించి ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న ఆవేదనను వేరొక కవితలో ఇలా వ్యక్తపరిచాడు.

52

చరిత్రలో మానవుడెక్కడా
తనని తాను బయలు పరచుకోలేదు.
యుద్ధాలతోనే గడిపేసాడు.

48

మిణుగురులుగా
అగుపించటం పట్ల
తారలు భీతినొందవు.

సూర్యునికంటే తేజోవంతమైనవి తారలు. అయినా అవి తమ పరిధులను దాటి వచ్చి విశ్వానికి తమ స్వయంప్రకాశాన్ని ప్రదర్శించాలనుకోవు. యావత్ ప్రపంచం దృష్టిలో కేవలం మిణుకు మిణుకుమనే మిణుగురు పురుగులవలె కనిపించినప్పటికీ తమ తమ స్థానాల్ని వదలక నిలుచుంటాయి. అదేవిధంగా ప్రపంచానికి జ్ఞానుల అంతర్గత శక్తి అవగతమవ్వక వారిని చిన్నచూపు చూసినా, చెదరక స్థిరచిత్తంతో ఉంటారు.

పేదవారని, అధికారబలం ఉన్నవారని, గొప్పవారని, బిచ్చగాళ్ళనీ లేకుండా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు తటస్థపడే ఆఖరి అతిథి మృత్యువు. మనకి మృత్యువు అంటే భీతి. అదొక అత్యంత దుఃఖకరమైన ఘట్టం. మృత్యురహిత ప్రపంచమెందుకు లేదా అని వాపోతుంటాము. కానీ టాగోర్ మాటల్లో మృత్యువు ఎలా ఉంటుందో చూస్తే:

99

మృత్యువనే ముద్ర జీవితం అనే నాణానికి
యోగ్యతనిస్తుంది.
అపుడు మాత్రమే దానితో
ప్రియమైన వాటిని కొనగలం.

మనకి కావాల్సినది మరణరహితమైన సమాజం కాదు, దుఃఖరహితమైన సమాజం. మృత్యువే లేకుంటే మనం చేసే ఏ పనికీ ప్రాధాన్యత ఉండదు. అచ్చు, బొమ్మ ముద్రింపబడని నాణెం లానే!

మన జీవితానికి అర్థాన్ని, ప్రయోజనాన్ని కలుగజేసేది మృత్యువే!
ఇంకొక కవితలో..

222

మృత్యువు ఒక పగులు కాదు
అందుకే ప్రపంచం కారిపోదు.

మృత్యువు ప్రపంచాన్ని నిర్జీవం చేయదు. నిరంతరంగా కొత్తని సృష్టించే అవకాశాన్నిచ్చే అమరత్వం అది!

అసలైన కవికి పరిధి ఉండదు. ఒకేరకమైన వాద కవిత్వానికే కట్టుబడి ఉండాలనుకోడు. స్థూలంగా కవితా వస్తువు జీవితమే అయినా సూక్ష్మంగా పరిశీలిస్తే అవి అనేకానేకం. అనంతం!

ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రకృతిలో తడిసి మైమరిచిపోవాలని అనుకోని కవి ఉండడేమో! ప్రకృతి వ్యక్తపరిచే విభిన్న ప్రేమవల్లరిని చూస్తూ, ఆమె ప్రతి కదలికనీ, ఆ కదలిక తనపై ముద్రించే అనుభూతినీ తనే ప్రేక్షకుడిలా చూసుకుంటూ, అదేదో ప్రపంచానిక్కూడా అనుభవమయ్యేలా చూపాలని తపిస్తాడు.

30

చంద్రమా! దేనికై ఎదురుచూస్తున్నావూ?
“సూర్యునికి వందనమిడి ఆయనకు దారివ్వటానికై”

రాత్రికి రాజుననే అతిశయపు సెగలు ఏ కోశానా చిందించని చందమామ, తన అధిపతి సూర్యుడేనన్న విషయం ఏమరపాటుకి రానివ్వడేమో! అందుకే జాబిలి సన్నిధిలో ఎప్పుడూ మనం చల్లదనాన్నే ఆస్వాదిస్తాము.

65

చిన్నారి గడ్డి పోచా!
నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ
పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది.

సూక్ష్మమైన, సున్నితమైన గడ్డిపోచకు విలువేమిటని తీసిపారేస్తాము. కానీ ధరణి అంతా ఆ సున్నిత పాదాల కిందే ఒదిగి ఉంది కదా!

88

“నీవు ఈ తామరాకు క్రింద ఉన్న పెద్ద మంచుబిందువువి.
నేను పైన ఉన్న చిన్నదాన్ని”
కొలనుతో మంచుబిందువు అన్నది.

ఇది చదవగానే ముందు మంచుబిందువు స్వాతిశయమే కనిపించినా తరచి చూస్తే కొలనుకీ, మంచుబిందువుకీ ఉన్న సమన్వయం ఎంత చక్కగా అవగతమౌతుందో! రెండిటినీ నియంత్రించే శక్తి కిరణాలది.

100

ఆకాశంలో ఒక మూల
ఆ మేఘం వినమ్రంగా నిలుచుంది.
ఉదయసంధ్య
దానికి తేజో కిరీటాన్ని కట్టపెట్టింది.

124

చంద్రునితో సూర్యుడు పంపించిన
ప్రేమలేఖలకు తన జవాబును
గరికపై కన్నీళ్ళతో రచించింది – రాత్రి.

ఒకనాటి ఉషోదయాన పైన ఆకాశం, కింద భూమిలో ఒకేసారి మనకు తెలియకుండానే మమేకమవుతామేమో! ప్రకృతి వర్ణన అంటే శబ్దాడాంబరంతో, అలంకారాలు చేర్చి ఇంత పొడవుగా సాగే కవితలే మనకి ఎదురౌతాయి. చిన్న చిన్న పదాలతోనే టాగోర్ మనకందించిన తాదాత్మ్యత మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేయక మానదు.

ముఖ్యంగా రెండవ కవితలో కనిపించే గాఢానుభూతి గుండెను తడి చేయకమానదు. చంద్రుడిని సూర్యుడు తన ప్రేమలేఖగా రాత్రి కోసం పంపడమన్న భావనే మనసులో మాధుర్యాన్ని నింపుతుంటే, తన ప్రియతముడు సూర్యుడిని కలుసుకోలేని తన అశక్తతకు చింతిస్తూ కన్నీళ్ళను మంచుబిందువులుగా గడ్డి చివుళ్ళపై వదిలి వెళ్ళే, రాత్రి ఉదాత్తమైన ఆరాధనను మనకు పరిచయం చేస్తున్నది.

185

వానలు నిండుకున్న
శరత్కాల మేఘాన్ని నేను
నా నిండుతనమంతా
పండిన వరిచేలల్లో ఉంది.

శరదృతువులో మేఘాలకు తళుకులీనే మెరుపులుండవు. గంభీరమైన గర్జన స్వరముండదు. తమ ఆడంబరాన్నంతా పంటచేలల్లోకి ఒలకబోసేసి అన్నీ త్యజించిన పాత్రల్లా పారదర్శకంగా చెదురుమదురుగా పడి ఉంటాయి. వాటి జీవాన్ని పీల్చుకుని పెరుగుతున్న చేలన్నీ ఆ మేఘాలను మందహాసంతో పలుకరిస్తుంటాయి. ఇంతలా ప్రకృతిలో లీనమవ్వడం సాధ్యమేనా అనిపిస్తుంది.

ఇక ఈశ్వరుని ప్రసక్తి లేని రవీంద్రుని రచన లేదేమో! మనలో ఎవరినైనా ఈశ్వరుడెవరని అడిగితే వెంటనే అలవోకగా చెప్పలేము. నిరాకారుడని, సాకారుడని, నిర్గుణుడని, ఒక్కడని, లేదా అనేకులలో ఒకడని ఎన్నెన్నో రకాలుగా చెప్తాము. టాగోర్ ఇలాంటి తర్కాల జోలికి పోకుండా తనకు అవగతమయ్యే ప్రియసఖుడు, తండ్రి, గురువుల రూపాలలో ఈశ్వరుడిని చూసుకున్నాడు. ఒక ‘గీతాంజలిని’ సమర్పించుకున్నాడు. ఈ సంకలనంలో ఈశ్వరుడు మన వద్ద నించి నిజానికి ఏమి ఆశిస్తాడో విశదపరుస్తున్నాడు.

67

ఈశ్వరుడు గొప్ప గొప్ప రాజ్యాల వల్ల
విసుగునొందునేమో కానీ
చిన్న చిన్న కుసుమాల వల్ల కాదు.

215

తన సుమాలనే తిరిగి
మానవుని కాన్కలుగా పొందటానికై
ఈశ్వరుడు కాచుకొని ఉన్నాడు.

ఈశ్వరుడు మనపై కురిపించే దయ, ప్రేమ, కరుణ, స్నేహానికి మనం బదులుగా ఇవ్వాల్సిన కానుకలు ధనము, విలువైన వస్తువులు కాదు నిర్మలము, కోమలము అయిన పూలు మాత్రమే అని ప్రవచిస్తున్నాడు. ఇహలోకంలో మనం అనుభవించే ప్రతీది ఈశ్వరుని సృష్టే. అలా ఆయన సృష్టించిన పుష్పాలను తిరిగి ఆయనకే సమర్పించినప్పటికీ ఆనందంగా స్వీకరిస్తాడు!!

170

ఈ నిశ్శబ్ధ ఘడియలో
నా హృదయ ఖాళీ పాత్రను ముంచాను.
నీ ప్రేమతో అది నిండింది, ప్రభూ.

247

“నిన్నే గానం చేస్తూ పూజించటమెలా?”
సూర్యుని అడిగింది ఓ చిన్ని పూవు.
“స్వచ్ఛమైన నీ నిశ్శబ్దం ద్వారా”
బదులిచ్చాడు సూర్యుడు.

ఇంతకంటే సరళమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు ఎవరు చూపించగలరు! ప్రభువు ప్రేమను పొందడానికి నిశ్శబ్ద స్మరణకి మించిన మార్గం లేదంటున్నాడు. భగవద్గీత గురించి ఓషో ఇలా అంటాడు “గీత చదివిన ప్రతిసారీ మనం భూమిమీద కాకుండా ఏవో దివ్యలోకాలలో ఉన్న అనుభూతిని పొందుతాము. ఎందుకంటే గీత ఆ లోకాలకి సంబంధించినది!” సరిగ్గా అలాంటి పారవశ్యమే మనకు రవీంద్రుడు ఈశ్వరునిపై రాసిన కవితలు చదువుతున్నప్పుడు కూడా కలుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

గుప్పెడు అక్షరాలతో భావారణ్యాన్ని సృష్టించడం అంటే ఏమిటో ఈ కింది, రెండులైన్ల చిన్న చిన్న కవితలు చదివితే తెలుస్తుంది. కవితకి తగిన వస్తువు. వస్తువుకి తగిన కల్పన. ఉదాత్త కవిత్వ లక్షణాలన్నీ ఈ కవితల్లో ఉన్నాయి. వీటిలోని మాధుర్యాన్ని తగినరీతిలో ఆస్వాదించగలుగుతున్నాము అంటే బాబా గారి అనువాద పటిమ వల్లనే! హైకూ ఛాయలు కొంచెం ఎక్కువగా కనిపించే వీటిని చదువుతుంటే సమయాన్ని స్థంభింపజేయడం అంటే ఏమిటో అనుభవమౌతుంది!

22

నేనున్నాను అనుకోవటం
ఒక నిరంతరమైన అద్భుతం
అదే జీవితం.

24

శ్రమకు విశ్రాంతి
కంటికి రెప్పలా ఉంటుంది.

118

స్వప్నం మాట్లాడే భార్య
నిద్ర మౌనంగా భరించే భర్త

157

రహస్యంగా పూలను పుష్పించే రాత్రి
మెచ్చుకోళ్లను పగలుకు వదిలేస్తుంది.

262

ఈ గలగలలాడే ఆకులు, నా హృదయాన్ని
చిన్నారి శిశువు చేతివేళ్లలా స్పృశిస్తున్నాయి.

కవితా వస్తువు ఏదైనా టాగోర్ కవితల్లో అధికార స్వరం ఉండదు. రణగొణ ధ్వనులు ఉండవు. హృదయాన్ని ఆవిష్కరించే సున్నితత్వం  ఉంటుంది. గానంలో లీనమైన ధ్యానం ఉంది. బాబా గారి కలం కూడా ఆ సున్నితత్వాన్ని బహు జాగ్రత్తగా అందిపుచ్చుకుంది! బాబా గారి పదాల్లో టాగోర్ ప్రతిస్పందించిన వ్యవస్థలన్నీ మనకు సజీవమై సాక్షాత్కరిస్తాయి. అందుకే ఆయన అనువాదకుడి కంటే ఉన్నత పాత్రనేదో పోషించారనిపిస్తుంది! విశ్వకవిగా టాగోర్ లో జీవన వాస్తవికతను చిత్రించే నైపుణ్యంతో పాటు అంతఃలోక వీక్షణ, నూతన దృష్టి, ఉత్తమాభిరుచితో కూడిన భావుకత కనబడతాయి. అందుకే ఆయన రచనలన్నీ విభిన్న పరిస్థితులకి తట్టుకుని నిలబడగలిగాయి.
భావకవి టాగోర్ మస్తిష్కంలో రూపుదిద్దుకున్న ‘Stray Birds’ లో కొన్ని మనస్సుని స్పర్శిస్తాయి. మరికొన్ని కొత్త దృష్టిని పరిచయం చేస్తాయి. ఇంకొన్ని అంతర్లోకాలకు ప్రయాణం చేయిస్తాయి. కవితలన్నీ పూర్తయ్యేసరికి మనకు తెలీకుండానే ఆలోచనాస్థాయి పెరగడం గమనిస్తాము. ఈ సంకలనంలోని కవితా సౌందర్యాన్ని తెలుగులో తేటతెల్లం చేసేందుకు సంకల్పించి, కృషి చేసిన బాబా గారికి ప్రత్యేక శుభాభినందనలు.

————-
బాబాగారి తెలుగు అనువాదపు e-పుస్తకాన్ని ఉచితంగా దించుకోవచ్చు.

Posted in వ్యాసం | Tagged | 17 Comments

కథా మాలతీయం – 2

స్వాతి:

మిమ్మల్నిప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు, సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమయిన సంఘటనలు, అబిమాన రచయితలు, వారి రచనల్లో మీకు నచ్చిన అంశాలు.

మాలతి:
నేను లైబ్రరీసైన్స్ డిప్లొమా చేస్తున్నరోజుల్లోనే, అంటే 1961లో నరసింహరాజుగారు కేవలం రచయిత్రులకథలు సంకలనంగా వేయడానికి పూనుకున్నారు “కల్పన” అన్నపేరుతో ‘62లో ప్రచురించారు. తెలుగు సాహిత్యచరిత్రలో రచయిత్రులకథా సంకలనాల్లో తొలిసంకలనం ఇదే. నాకథ సంకలనాల్లోకి ఎక్కడం కూడా అదే మొదలు.

మాయింట్లో ప్రోత్సాహం మాటకొస్తే, మాయింట్లో అట్టే మాట్లాడేరకాలు కాదని చెప్పేను కదా. ఎప్పుడు చూసినా ఎవరిపనుల్లో వాళ్లుండేవారు. నాపాట్న నేను ఏ చెట్టుకిందో, చెట్టుమీదో, డాబామీదో కాలక్షేపం చేసేదాన్ని. అంచేత మాయింట్లో ఎవరేనా నేను కాబోయే రచయిత్రిని అని పట్టించుకున్నారా అన్న ఆలోచనా లేదు, తెలిసిందీ కాదు నాకు.

కాకపోతే, ఒకసారి నాపుట్టినరోజుకి మాఅక్కయ్య readers digest చందా కట్టింది నాపేరుమీద. అలాగే మానాన్నగారు మేం గుంటూరులో వున్నప్పుడు విజయవాడలో ఆంధ్రప్రభ ఆఫీసుకి తీసుకెళ్లారు. అప్పట్లో నీలంరాజు వెంకటశేషయ్యగారు సంపాదకులు. మానాన్నగారు నన్ను పరిచయం చెయ్యడం, ఆయన అలాగా అన్నట్టు తలూపడం మాత్రమే గుర్తు నాకు.

మాఅమ్మకి కూడా నామీద ఏదో ప్రత్యేకాభిమానం వుందేమో. నేనే అలా అనుకున్నానో, అందరు పిల్లలూ అలాగే అనుకుంటారో నాకు తెలీదు. ఇదివరకే చెప్పేను, యస్సెల్సీ అయింతరవాత కొన్నాళ్లు వూరికే వున్నానని. ఆరోజుల్లో మాఅమ్మ ఎక్కడికేనా బయల్దేరితే, “పద” అనేది. నేను మాటాడకుండా, లేచి ఆవిడవెంట వెళ్లేదాన్ని. అంతే కానీ, ఈకాలప్పిల్లల్లాగ, ఎక్కడికీ, ఎందుకూ, నేను రాను అనలేదు ఎప్పుడూను.

ఆరోజుల్లో తలుచుకుంటే ముచ్చటగా అనిపించే ఒక సంఘటన – మాఅమ్మగారి గురువుగారు ఒకావిడ వుండేవారు సత్యనారాయణమ్మగారు అని. చిన్నతనంలోనే భర్త వదిలేస్తే. తమ్ముడిఇంట్లో వుండి, వేదాలూ, ఉపనిషత్తులూ చదువుకుని, ఇతరులకి బోధిస్తూ వుండేవారు. మా అమ్మ నన్ను వాళ్లింటికి వెళ్లి, ఆవిడ చెప్తుంటే, రాసుకుని రమ్మని పంపేది. అంచేత నేను సాయంత్రాలు వాళ్లింటికి వెళ్లి ఆవిడ డిక్టేషను రాసుకొచ్చేదాన్ని. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆరోజుల్లో ఒకసారి ఆవిడ ‘శ్చ’ అన్నచోట ‘చ్చ’ అని పలికేరు. నేను సంస్కృతం చదువుతున్నాను కనక ఆవిడ తప్పు పలుకుతున్నారు అని నాకు తెలిసింది. నేను ఆమాట చెప్పకుండా తలొంచుకుని రాస్తూ చ్చ కాకుండా శ్చ అని రాసేను. ఆవిడ అది చూసి, “శ్చ కాదు చ్చ, చ్చ” అన్నారు ఒత్తి పలుకుతూ. నేను రాసింది కొట్టేసి ఆవిడ చెప్పినట్టు చ్చ అని మళ్లీ రాసేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనసంస్కతిలో ప్రశ్నించడం లేదు చెప్పింది వినడమే తప్ప, మనకి మనం ఆలోచించుకోడమే కానీ “మీరు తప్పు” అని ఎదటివారిని ఎత్తి చూపడం లేదు. ఇప్పటికీ నాతత్త్వం ఇదే. ఎవరేనా ఏదైనా చెప్తే వెంటనే ప్రతివాదాలు చెయ్యలేను.

ఆ తరవాత 1956లో ఆంధ్రాయూనివర్సీటీలో ఇంగ్లీషు ఆనర్సులో చేరాను. ఆక్లాసులో విజయలక్ష్మి పరిచయం అయింది. విజయవాడనించి వచ్చి, హాస్టల్లో వుండి చదువుకుంది. అచిరకాలంలోనే మేం ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. తరుచూ మాయింటికి వచ్చేది. ఒకసారి వాళ్లమ్మ తనని చూడ్డానికి విశాఖపట్నం వచ్చారు. తను ఆవిడని మాయింటికి తీసుకొచ్చింది.

మనిళ్లలో ఆరోజుల్లో కొత్తగా వచ్చినవారికి ఇల్లు చూపడం ఒక సాంప్రదాయం. మనకి దాపరికాలు లేవు కదా. అలాగే మాఅమ్మ ఆవిడకి ఇల్లంతా చూపుతూ వంటింటిలోకి కూడా తీసుకెళ్లింది. నాకు తికమక అయింది. వాళ్లు వెళ్లిపోయనతరవాత మాఅమ్మతో అన్నాను, “వాళ్లు క్రిస్టియనులు అని చెప్పేను కదా” అని. దానికి మాఅమ్మ, “ఎవరయితేనేమిటి. శుభ్రంగా పసుపుకొమ్ముల్లా వున్నారు” అంది. శరీరచ్ఛాయమాట కాదు ఆవిడ అంటున్నది.

నేను ఎందుకలా అన్నానంటే మాఅక్కయ్యకి ఆచారాలు మహపట్టింపు. తనకి అబ్రాహ్మణ స్నేహితులు చాలామందే వున్నా వారింట పచ్చిమంచినీళ్లేనా తాగేది కాదు. వాళ్లు కూడా ఏం అనుకునేవారు కాదు. తను నన్ను హేళన చేసేది నాస్నేహితులగురించి. అంచేత నాకు భయంగా వుండేది ఈవిషయంలో.

1961లో డిప్లొమా అయింతరవాత బిలాస్పూర్‌లో ఒకసంవత్సరం మారెండో అన్నయ్య సీతారామారావు దగ్గర వున్నాను. అక్కడ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరరుగా పనిచేశాను. అప్పుడే కృష్ణమూర్తిగారితో పరిచయం అయింది. వాళ్ల తమ్ముడు ఆయనదగ్గర వుండేవాడు. తరుచూ మాయింటికి వస్తూ వుండేవాడు. వయసులో నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడు కనక తినడానికి ఏదేనా పెడుతుండేదాన్ని అప్పుడప్పుడు. ఒకసారి ఏదో తెలుగు సినిమాకి వెళ్లేడుట, మర్నాడు మధ్యాన్నం మాయింటికొచ్చి, “సినిమా చూస్తూంటే మీరు గుర్తొచ్చారండీ” అన్నాడు. ఎందుకంటే ఆసినిమాలో అమ్మాయిపేరు లతట. అందులో మరొక పాత్ర “మా లత” అంటాడు. “మాలత అనగానే మాలతి గుర్తొచ్చింది” అన్నాడు. అంతవరకూ రోజూ వచ్చిపోయే కుర్రాడు ఆమాటతో నాకు ఆత్మీయుడు అయిపోయాడు. వయసులో చిన్న అయిన అబ్బాయితో పెంచుకునే ఆత్మీయతల కథే “ఆడమనసు” కథ. అంటే అచ్చంగా అలాగే జరిగిందని కాదు. సుమారుగా అదే విషయంమీద రాసిన మరో కథ “మా మే స్త్రీత్త్వమ్”. కథల్లో వాస్తవికతమీద చెప్పవలసింది చాలావుంది. తరవాత చెప్తాను. ఈరెండు కథల్లో ప్రధానాంశంగురించి మాత్రం ఒకమాట ఇక్కడ చెప్తాను.

అందరు రచయితలూ ఏం చేస్తారో నాకు తెలీదు కానీ, నాకు కథకి సాధారణంగా ప్రేరణ ఒక్కవాక్యం, ఒక్క క్షణం స్పందన చాలు. ఆతరవాత మిగిలిన కథ అంతా కట్టుకథే. ఒక్కొక్కప్పుడు ఇతరసమయాల్లో జరిగిన ఇతర అనుభవాలూ, సంఘటనలూ ఈకథలో చోటు చేసుకోవచ్చు, పైకథలో “ఆడవాళ్లు తొందరగా ఆత్మీయతలు పెంచుకుంటారు. అది భరించడం కష్టం. అబ్బాయిలు చిన్నతనంలో అలా వుంటారు కానీ పెద్దయినకొద్దీ ఇతరవ్యాపకాలమీదకి పోతుంది వారి దృష్టి. అంచేత ఈ సౌహార్ద్రత తగ్గిపోతుంది” అని చెప్పడానికి ప్రయత్నించేను. ఇప్పుడు కొన్ని బ్లాగుల్లో కవితలు చూస్తుంటే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఆర్ద్రత నింపుకున్నభావాలు అందరికీ వుంటాయి. వెలిబుచ్చేవిధానంలోనే తేడాలు.

1962లో ఢిల్లీ వెళ్లేను లైబ్రరీసైన్సులో మాస్టర్స్ డిగ్రీకోసం. అదే మొదటిసారి నేను ఇల్లు వదిలి బయటికి వెళ్లడం. ఖర్చులు పెట్టుకోలేక, శలవులకి ఇంటికి రాలేదు మొత్తం ఏడాది చదువు పూర్తయేవరకూ. మధ్యలో మధ్యప్రదేశ్‌లో మాఅన్నయ్య వున్నాడు. తిరుగుప్రయాణంవేళ మాఅమ్మ మాఅన్నయ్యకి రాసింది, “మధ్యలో దాన్ని అక్కడ దిగమనకు, తిన్నగా ఇంటికి రమ్మను” అని. మేం అయిదుగురం అయినా, నేను ఒక్కదాన్నే మాఅమ్మవెనకే తిరుగుతూ వుండేదాన్ని సర్వవేళలా, సర్వావస్థలయందూ.

నాఢిల్లీరోజులు తలుచుకున్నప్పుడు, నాగురించి నాకు తెలిసే మరోవిషయం అందరూ చేసినపనీ, అందరూ చేస్తున్నారు కదా అనీ చెయ్యడం ఎప్పుడూ లేదు. కావలిస్తే ఉలిపికట్టె అనుకోండి. కానీ, కథలకి అదే బలం నన్నడిగితే. అందరూ చెప్పినమాట కాక ఇంకా చెప్పగలిగినది ఏదైనా వుంటేనే కథ రాయాలి అని నా నమ్మకం. లేదా, తెలిసినవిషయమే అయినా అందరూ నిర్లక్ష్యం చేస్తూంటేనూ, అలా నిర్లక్ష్యం చేయదగని విషయం అయితేనూ కథల్లో చెప్తాను. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఏడాదిపాటు ఢిల్లీలో వున్నా, తాజ్ మహల్ చూడ్డానికి వెళ్లలేదు. మీరు స్టుపిడ్ అంటే అనండి. అందరూ వేలంవెర్రిగా అదేపనిగా మాటాడుతుంటే నాకు turn off అయిపోయిందది!

మాఅమ్మ ఎక్కువ మాటాడేది కాదు కానీ, మాట్లాడినప్పుడు మాత్రం పదునుగా వుండేవి ఆవిడ భాషణలు. నాభాషలో పదును కూడా కొంతవరకూ మాఅమ్మదగ్గర్నుంచే వచ్చింది. ఈమధ్య చాతకపక్షులు నవలలో “కింద పెడితే పంటలుండవు, మీదపెడితే వానలుండవు” అన్నవాక్యం చదివి నవ్వుకున్నానన్నారు తెరెసా. అది మాఅమ్మదగ్గర్నించి వచ్చిందే. అలాగే మరోకథలో “మప్పొచ్చు కానీ తిప్పలేం” అన్నది. అలవాటు చేసేయడం తేలికే కానీ ఆ అలవాటు మళ్లీ మానిపించడం కష్టం అన్న అర్థంలో.

భాషవిషయంలో నాకు రెండో మార్గదర్శకం రావిశాస్త్రి కథలు. నేను రెండోసారి చదవగల కథలు రావిశాస్త్రివి మాత్రమే. ఆ కథల్లో ప్రతిమాటా తూచి వాడినట్టుంటుంది. చమత్కారం, ఎత్తిపొడుపూ, వ్యంగ్యం – ఏ కోణం తీసుకున్నా ఎంతో ప్రతిభావంతంగా తోస్తుంది ఆ పదవిన్నాణం. రావిశాస్త్రిగారు ఇంగ్లీషుమాటలు వాడినప్పుడు కూడా “ఈరోజుల్లో అందరూ అలాగే మాటాడతారు” అని కాక ఒక ప్రత్యేకకోణం దృష్టిలో పెట్టుకుని వాడినట్టు అనిపిస్తుంది నాకు. మరోలా చెప్పాలంటే వాడిన ప్రతిపదానికీ ఒక విలువ వుండాలి. ఒక అర్థం స్ఫురించాలి. మాటలకున్న బలం నాకు తెలిసింది వీరిద్దరిమూలానే.

ఆనర్సురోజుల్లో చదివిన ఇంగ్లీషునవలల్లో నన్ను బాగా ఆకట్టుకున్నవి థామస్ హార్డీ, మరీ కొరెల్లీ అని చెప్పేను కదా. హార్డీ కథల్లో, Mayor of Casterbridge వంటి నవలల్లో మనసంస్కతిలోగల కర్మ వేదాంతం కనిపిస్తుంది. మన జీవితం మనచేతుల్లో లేదన్న సంగతి నామనోఫలకంమీద గట్టిముద్రే వేసింది. ఇంతకాలం తరవాత తిరిగి చూసుకుంటే నాఅనుభవాలు కూడా అదే చెప్తున్నాయి. ఆయనకథల్లో మలుపులఛాయలు నాకథల్లో కనిపించొచ్చు.

కొరెల్లీ నవలల్లో నాకు బాగా గుర్తుండిపోయిన నవల Sorrows of Satan. ఇందులో ప్రథానాంశం మానవజీవితాలు మంచిచెడులమధ్య సంఘర్షణే అయినా, చెడుకి ప్రతీక అయిన Satan మనిషి చెడుని కాక మంచిని ఆశ్రయిస్తే, తాను (సాతాను) పరాజితుడయి, తనదుష్టశక్తులనుండి విముక్తి పొంది వుండేవాడనీ, అలా కాక మనిషి చెడునే ఆశ్రయించడం మూలంగా తనకి కూడా విముక్తి లేకుండా చేసాడనీ విచారిస్తాడు. ఇందులో కూడా హార్డీ కథల్లోలాగే మానవవిలువలు మనసంస్కృతిలో కంటే భిన్నంగా లేవు అనిపించింది నాకు.

ఇలాటిదే మరో నవల magnificent obsession. ఇందులో కూడా ఫలాపేక్ష లేకుండా ఇతరులకి సాయం చెయ్యడం. నిజానికి ఫలాపేక్ష వుంది కానీ ఆ ఫలం తనకి కాదు. వేరే ఎవరయినా ఆపదలో వున్నప్పుడు ఆదుకుని, అప్పు తీర్చాలి అన్న నియమం ప్రధానాంశం ఆనవలలో. మనసంస్కృతిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అప్పు తీర్చేసుకోడాలు లేవు. మనసంస్కృతిలో నిత్యజీవితంలో సాయం ఒక భాగం. ఎవరికి ఎప్పుడు సాయం కావలిస్తే అప్పుడు ఎవరో ఒకరు ఆదుకుంటారు. అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు నవనాగరీకప్రపంచంలో ఇది మారిపోయింది. ఎక్కడికక్కడే అప్పులు తీర్చేస్తున్నారు.

చెప్పొచ్చేమాటేమిటంటే, ఇలాటితర్కం నాకు భిన్నసంస్కతుల్లో భిన్నత్వాన్ని కాక అంతర్లీనంగా వున్న ఐక్యత అర్థం చేసుకోడానికి తోడ్పడింది. అమెరికా వచ్చేక ఇది మరింత స్పష్టం అయింది.

హాస్యం, శైలిలో చమత్కారం చదివి ఆనందించడానికి ముళ్లపూడి వెంకటరమణ, భమిడిపాటి కామేశ్వరరావు, మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం వంటివి చాలా పనికొచ్చేయి. ఇంగ్లీషుపుస్తకాల్లో ఓహెన్రీ, పి.జి. ఓడ్‌హౌస్ పేర్లు గుర్తుకొస్తున్నాయి.

ఓడ్‌హౌస్‌కథల్లో, ఒక కథలో తండ్రి కొడుక్కి ప్రతిరోజూ ఒకమంచి పని చెయ్యమని చెప్తాడు. ఆ అబ్బాయి సరేనంటాడు. ఒకరోజు ఏం చెయ్యడానికీ కనిపించక, తంఢ్రిబూట్లు పాలిష్ చేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే బూట్లు నల్లవి, ఎదురుగా వున్న పాలిష్ బ్రౌను. తను చెయ్యాల్సింది మంచిపనే కదా అని ఆనల్లబూట్లకి బ్రౌన్ పాలిష్ వేసేస్తాడు ఆ అబ్బాయి. అంటే ఫలితాలు సరిగ్గా చూసుకోకుండా, చెయ్యాలి కనక చేస్తున్నాను అని చేస్తే ఇలాగే వుంటాయి అంటాడు రచయిత. నాకు ఇందులో మంచిపాఠం కనిపించడంచేత ఇప్పటికీ గుర్తుంది.

స్థూలంగా చెప్పాలంటే, నేను చదివిన పుస్తకాలు ఏమిటి, ఏపుస్తకంలోంచి ఏం కోట్ చెయ్యగలనూ అని కాక, ఆపుస్తకం స్థూలంగా నామనసులో వేసినముద్ర ఏమిటి అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. నాకు చాలా విషయాలు జ్ఞాపకం వుండవు. కానీ ఆవిషయాలు నాలో విడమర్చి చెప్పలేనంతగా లీనం అయిపోయి “ఈనాటి నేను”గా అర్థం చేసుకోవాలి.

చాలామంది పండితులకీ నాకూ అదే తేడా. వాళ్లందరూ పేజీలకి పేజీలు ఒప్పచెప్పేయగలరు. పాండిత్యానికి అదే చిహ్నం అంటారు. నాకలా కాదు. నేనెంత చదివేను అన్నది కాక ఆచదువుమూలంగా నావ్యక్తిత్వం ఎలా రూపురేఖలు దిద్దుకుంటోంది అన్నదే నాకు ప్రధానం.

Posted in వ్యాసం | Tagged | 8 Comments

తొలి మానవుల మనోవికాసం

– కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మతాలూ, నమ్మకాలూ పుట్టుకురావడానికి మునుపు మనుషుల ఆలోచనలు స్పష్టతను సంతరించు కోవడానికి లక్షల సంవత్సరాల ఎదుగుదల అవసరమయింది. నరవానరాలకూ, మనుషులకూ తేడాలు ఒక్కసారిగా తలెత్తలేదు. అతినింపాదిగా జరిగిన ఈ పరిణామం మనుషులను క్రమంగా తక్కిన జంతువులనుంచి వేరుచేసింది. తత్ఫలితంగా కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు ఏర్పడసాగాయి. జంతువుల్లాగా కాకుండా మనిషికి భావప్రపంచం అనేది ఒకటుంటుంది. దీనికి కారణం మనిషి మెదడులో జరిగిన అభివృద్ధి. మనిషికి రెండుకాళ్ళ నడక అలవాటై, చేతులకు “స్వేచ్ఛ” లభించడంతో బుద్ధివికాసం మొదలైందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇందులో “ఆధ్యాత్మికశక్తుల” ప్రమేయం లేకపోవడమే కాదు; అతి సామాన్యమైన భౌతికకారణాలే ప్రేరణలుగా పనిచేశాయి.

ఆస్ట్రలోపితెకస్
ఆస్ట్రలోపితెకస్‌ జాతి

మానవజాతి ఆవిర్భావానికి తొలి దశలో ఆఫ్రికాలో సుమారుగా 50 లక్షల ఏళ్ళ క్రితం ఆస్ట్రలోపితెకస్‌ అనే జాతి ఒకటి ఏర్పడిందనీ, రెండుకాళ్ళతో నడిచిన తొలి ప్రాణులు ఆ జాతివారేననీ శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. ఆ తరవాత చాలా కాలానికి అసలు సిసలు ఆధునికులనదగిన హోమో సేపియన్స్‌ అనే మానవజాతి పుట్టి 2 లక్షల సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుందని వారి ఊహ.
సుదీర్ఘమైన ఈ వ్యవధిలో నరవానరదశను దాటిన మానవులకు మరే ప్రాణికీ లేని అనేక ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి. వాతావరణం చల్లబడి, వానలు తగ్గి, వృక్షసంపద ఒక్కసారిగా క్షీణించడంతో చెట్ల చాటు కరువైన ఈ జాతివారికి రెండుకాళ్ళ మీద నడవడం, ప్రాణరక్షణకై పరిగెత్తడం, మైదానాల్లో ఎత్తుగా పెరిగిన రెల్లుపొదల్లో నిలబడి పొంచి ఉన్న క్రూరమృగాల జాడను పసికట్టి ప్రాణాలు దక్కించు కోవడం వగైరాలన్నీ నిత్యజీవితంలో భాగాలైపోయాయి. ఈ క్రమంలోనే ముందుకాళ్ళు రెండూ చేతులుగా మారిపోయి మెదడులో అపూర్వమైన అభివృద్ధికి ప్రేరణనిచ్చాయి. ఇటువంటి మార్పులు ఇతర ప్రాణుల్లో కలగలేదు. వీరికి దాయాదులనదగిన తోకలేని వాలిడికోతులూ, మానవులుగా పరిణమించజాలని (పేరు తెలియని) ఎన్నో నరవానరజాతులూ చెట్లలోనే ఉంటూ అప్పట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండిపోవడంతో అవి ఈ రకమైన ఒత్తిడికి గురికాలేదు. ఉన్న శరీర లక్షణాలు పరిసరాలకు అనువైనవిగా ఉన్నంతకాలమూ వాటిలో మార్పు కలగకపోవడం జీవపరిణామపు లక్షణం కనక అవన్నీ కొద్దిపాటి మార్పులతో కొనసాగాయి.
ఆహారం కరువైన పరిస్థితిలో ఆస్ట్రలోపితెకస్‌ జాతివారు జంతువుల కళేబరాలను తినడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో వారికి వేటాడటం తెలియదు కనక అవన్నీ క్రూరమృగాలు తినగా మిగిలినవీ, ఇతరత్రా లభిస్తున్నవీ అయి ఉండేవి. అందువల్ల వారికి ప్రోటీన్లూ, పోషకపదార్థాలూ లభించి వారి జాతి వృద్ధి చెందసాగింది. ఈ ఆహారాన్వేషణలో చిన్నచిన్న రాతిముక్కలతో ఎముకలనుంచి మాంసాన్ని గీక్కుతినడానికి వీలుగా ఉండేది. క్రమంగా వారే చేతులతో రాళ్ళను చెక్కి పనిముట్లను తయారుచేసుకోసాగారు. చేతులనేవి ప్రత్యేక అవయవాలుగా రూపొందినది ఒక్క మానవజాతిలోనే. వారి మెదడులోనూ, అవయవాల్లోనూ అభివృద్ధి కలగడానికి అదే కారణమయింది.
ఒక్క రాతిపనిముట్ల తయారీనే తీసుకుంటే అది నరవానరానికి ఎంత క్లిష్టమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. మొదటిది అటువంటి పరికరం అవసరమనీ, భవిష్యత్తులో వాడవలసి వస్తుందనీ అనిపించడం. తరవాత దాని తయారీకి సరిపోయే రాళ్ళ గురించి ఆలోచించి, వాటికై వెతకడం. పనికొచ్చే శిలను ఒక చేత్తో పట్టుకుని మరొకచేత్తో దాన్ని గట్టి రాతితో చెక్కడం. ఒడుపుగా చెక్కి, దానికి పిడినీ, పదునైన అంచునూ తయారుచెయ్యడం. వీటిలో ప్రతి ఒక్క చర్యా మెదడును ఎంతో అభివృద్ధిపరిచి ఉండాలి. అంతేకాదు, ఈ పరికరాలవల్ల ప్రాణులకు మేలైన ఆహారం లభించి, వాటి సంతతి వృద్ధిచెంది ఉంటుంది. వాటిలో బుద్ధిహీనులకు మరణమే ప్రాప్తించి ఉంటుంది. ప్రకృతిలో ఉత్పాతాలూ, క్రమంగా కలిగిన ప్రతికూలమార్పులూ ఈ ప్రాణులను కూటి కోసమే కోటి విద్యలూ అన్న పద్ధతిలో ముందుకు నెట్టాయి. తల వెనకాల కాంతి చక్రం తిరుగుతున్న ఏ దేవుడూ వారిని కాపాడలేదు. చావుతప్పి, కన్ను లొట్టపోయినట్టు లక్షల సంవత్సరాలపాటు జరిగిన ఈ పరిణామ క్రమంలో చచ్చినవి చావగా మిగిలిన జీవాలు మెరుగైన తెలివితేటలు సంపాదించుకుని తమ సంతానాన్ని నిలుపుకోగలిగాయి.
మెదడూ, శరీరలక్షణాలూ ఎప్పటికప్పుడు మారుతూ, ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ పరిణామాలని ముందుకు నెట్టాయి. గుంపులుగా, తెగలుగా ఏర్పడి, కలిసి వేటాడుతూ, కలిసి జీవిస్తూ కొనసాగిన ఆదిమానవులకు జంతువుల స్థాయిలో కూతలూ, కేకలూ సరిపోలేదు. భాష అవసర మయింది. అవసరమే కాదు, కొన్ని పరిస్థితుల్లో అది చావుబతుకుల సమస్య అయి ఉండాలి. అందుకనే మనకు భాష ఒక సంప్రదాయంగా దక్కింది. దానితో బాటు నాగరికతా, మతాలూ అన్నీ వచ్చాయి. గమనించవలసింది ఏమిటంటే ఇవన్నీ జన్యుపరంగా రాలేదు. బాహ్యపరిస్థితుల ఒత్తిడివల్ల పుట్టుకొచ్చాయి. ఇటువంటి కష్టాలు పడని నరవానరాలన్నీ మనకు అంత భిన్నమైనవి కాకపోయినా వీటిలో ఏ ఒక్క ప్రత్యేకతనూ సాధించలేకపోయాయి. ప్రకృతినీ, ప్రపంచాన్నీ అవగాహన చేసుకుంటూ ఉండవలిసి రావడం మనిషిజాతికి మాత్రమే తప్పనిసరిగా పరిణమించింది. కోతి తరహా బతుకునుంచి వేరు పడ్డాక మనిషికిక “వెనుతిరిగే” అవకాశమే లేదు.
మనిషికి ప్రపంచాన్ని గురించి అవగాహన మొదలైన ప్రాచీనయుగంలో మెదడు పూర్తిగా ఎదగలేదనేది తెలిసినదే. బతకడమే కష్టంగా అనిపించిన ఆ తొలి యుగాల్లో మనుషులు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి తమకున్న పరిమితమైన అవగాహనతో ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ప్రకృతిశక్తులదే పైచెయ్యిగా, ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకంగాకూడా ఉండేది. చిన్నచిన్న సముదాయాలుగా జీవిస్తూ, ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, తమ అనుభవాలను పోగుచేసుకుని తరవాతి తరాలకు అందిస్తూ వచ్చారు. అనుభవమే ఆచరణకు ఆధారమైంది. జంతువుల్లాగా ఎప్పటికప్పుడు ఎదురయే పరిస్థితులకు స్పందించడంతో ఊరుకోకుండా, జరిగిన, జరగబోతున్న విషయాలను గురించి కూడా ఆలోచించగలగడం మనిషిజాతికి మాత్రమే పరిమితమైన ఒక కొత్త లక్షణంగా రూపొందసాగింది. ఈ పరిణామాలవల్ల కళ్ళకు కనబడుతున్న వస్తుగతమైన యదార్థతతో సంబంధం లేకుండా, కేవలం మనసులో పుట్టుకొచ్చి, అవ్యక్తమూ, అమూర్తమూ అనిపించే నైరూప్యభావాలు మనుషుల ఊహల్లో మెదలసాగాయి. ఇటువంటి “భావప్రపంచం”లోకి అడుగుపెట్టిన మానవజాతికిక తిరుగులేకుండా పోయింది. మొదట్లో ఇటువంటి “అసాధారణ” శక్తులు రోజువారీ జీవితానికి ఉపయోగపడ్డాయి.
సొలూత్రే
స్విట్జర్లండ్‌లోని సొలూత్రే ప్రాంతం

గుంపులుగా చేరి వేటాడసాగిన తొలి మానవులు పథకం ప్రకారంగా తమకన్నా ఎన్నోరెట్లు పెద్దవైన జడల ఏనుగులనూ, పెద్ద ఎలుగుబంట్లవంటి క్రూరమృగాలనూ మాట్లువేసి పట్టుకుని చంపగలిగారు. కొంతవరకూ ఇవన్నీ ఇతర జంతువులుకూడా చెయ్యగలవు. ఎలుక కోసం కంత దగ్గర పిల్లి కాచుకుని కూర్చోగలదు. తోడేళ్ళ గుంపులు చాకచక్యంగా వేటాడగలవు. కానీ మనుషుల విషయంలో ఇది ఉన్నతమైన స్థాయికి చేరుకుంది. స్విట్జర్లండ్‌లోని సొలూత్రే ప్రాంతంలో గుర్రాల శవాల గుట్టల ఆనవాళ్ళు కనిపించాయి. అవన్నీ ఎత్తైన కనుమకు దిగువన పడిఉన్నాయి. ఇది ఆదిమానవులు పథకం ప్రకారం చేసిన పనేనని పరిశీలకులు భావిస్తున్నారు. తమంతట తాముగా గుర్రాలు అంత ఎత్తునుంచి దూకవు కనక వాటిని వారు తరిమి ఉండాలి. వందలేసి గుర్రాలను భయపెట్టి, మరొక దారి లేకుండా చేసి, ఎత్తయిన కొండమీది నుంచి లోయలో పడేట్టుగా తరిమి చంపగలిగారంటే వారి ఊహాశక్తి ఎంతగా ఎదిగిందో అర్థమౌతుంది.

horsehunt
గుర్రాలను తరిమి చంపిన ఊహాచిత్రం

రెండుకాళ్ళమీద నడవడం ప్రారంభించిన మానవజాతికి శరీరనిర్మాణంలో అపూర్వమైన మార్పులు కలిగాయి. అప్పటివరకూ తక్కిన జంతువులకన్నా ఎక్కువ మనోవికాసం పొందవలసిన అవసరం వారికి కలగలేదు. వారి జీవనశైలి ఇతర ప్రాణులకు భిన్నమైన దిశలో సాగడం మొదలుపెట్టేసరికి ఆలోచనలకు తొలిసారిగా ప్రాముఖ్యత ఏర్పడింది. మొదట్లో అదంతా తాత్కాలికమైన ప్రాణరక్షణ కోసమే అయినా, రానురాను పరిసరాలని గమనించడం, వాటిలోని మార్పులను ముందుగా పసికట్టడం, ఏం జరగబోతుందో ఊహించుకోగలగడం, ఇవన్నీ ఉంటే తప్ప బతకడం అసాధ్యమయే పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిని గురించి అర్థం చేసుకుంటూ, అజ్ఞానం, అయోమయం, భయాలూ, అనుమానాలూ అన్నీ కలగలిసి, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే దుర్భరజీవితం గడిపిన తొలి మానవులు ప్రతిదాన్నీ వింతగా, అద్భుతంగా పరిగణించారు. తమ గురించీ, బాహ్యప్రపంచాన్ని గురించీ, వాటి రెండిటికీ ఉన్న సంబంధాన్ని గురించీ అస్పష్టమైన అవగాహనతో మొదలైన మానవజీవితాల్లో ఎక్కువ భాగం “బతికి బట్టకట్టడం”తోనే సరిపోయింది. ప్రకృతికి భయపడే స్థితినుంచి దాన్ని గురించి కొంతైనా అర్థం చేసుకునే స్థితికి ఎదగడానికే మనిషి సర్వశక్తులూ ఒడ్డవలసివచ్చింది. ఈ క్రమంలోనే వారి మనోవికాసం ప్రారంభమైంది. అందులో నిత్యజీవితాలకు ఎంతో అవసరమైన పరిజ్ఞానంతోబాటు అర్థంలేని భయాలూ, ఆందోళనలూ కూడా చోటుచేసుకున్నాయి. దేవుడూ, దెయ్యాలూ వగైరాల గురించి అప్పుడు కలిగిన కొన్ని అపోహలూ, తప్పుడు భావనలూ ఈనాటికీ కొనసాగుతున్నాయంటే మనిషి మనస్సు ఎంతగా “దెబ్బతిందో”ననిపిస్తుంది. దీనికి తోడుగా నేటి సమాజంలో అజ్ఞానాన్ని ప్రోత్సహించే శక్తులకు కొదవలేకపోవటంతో మరింత గందరగోళం ఏర్పడుతోంది.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

కథా మాలతీయం – 1

నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో  ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా ప్రచురించారు. ఇది చాలు, ఆవిడ  బ్లాగ్లోకంలో ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చెప్పటానికి.

పొద్దులో ఆవిడ అంతరంగ ఆవిష్కరణని ప్రచురించాలని సంప్రదించినప్పుడు దీని పట్ల పాఠకులకి ఆసక్తి ఉంటుందా అని సందేహించారు. కానీ రచయిత్రిగా, స్త్రీ గా తన అనుభవాలూ, ప్రఖ్యాత రచయితలతో సాన్నిహిత్యం వల్ల కలిగిన పరిణితి, ఖండాంతర జీ్వన విధానాల్లో పరిశీలన వీటి సారాంశం నేటి తరం పాఠకులకి తప్పక పనికొస్తాయనే  వాదనను ఒప్పుకుని ఇది రాయటానికి అంగీకరించారు.

స్వాతి(పొద్దు సంవర్గం నుండి):
ముందుగా మీ స్వపరిచయం, పుట్టి పెరిగిన ప్రాంతం,సాహిత్యాభిరుచి ఎలా ఏర్పడింది, మిమ్మల్ని నిజజీవితంలో ప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు,కథలకు సాహిత్యానికి సంబంధించి ముఖ్యమైన సంఘటనలు:

మాలతిః

మొదట పొద్దువారికి నా ఆలోచనలూ, ఆనుభవాలూ, ఆశయాలూ, కోరికలూ, (కదాచితుగా ఆవేదనలూ) అన్నీ ఒకచోట పెట్టడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరొక హెచ్చరిక. నేను ఇక్కడ రాయబోయే నా పూర్వరంగంమీద ఈనాటి ఆలోచనలప్రభావం ఎంతో కొంత వుంటుంది తప్పకుండా. అంచేత కొన్నివిషయాల్లో ఆనాడు ఇలాగే ఆలోచించి అలా చేసేను అని ఖచ్చితంగా చెప్పలేను. చెప్పడానికి ప్రయత్నిస్తాను అని మాత్రమే చెప్పగలను.

నా సాహిత్యవ్యవసాయం నావ్యక్తిత్వంలో చాలా పెద్దభాగం. నేను కూడా ఆనాటిఅందరు ఆడపిల్లల్లాగానే చాలా మప్పితంగా – పెద్దలయందు భయభక్తులతోనూ, పిన్నలయందు ఆదరాభిమానాలతోనూ – పెరిగాను. నేను మాట్లాడ్డం తక్కువా, వినడం ఎక్కువా. “నిజంగా చెప్పవలసింది లేకపోతే మాట్లాడ్డం ఎందుకూ? నోటితుప్పర్లు దండుగ”, అనీ ఆయుఃక్షీణం అనీ అనేది మాఅమ్మ. రెండోది మాటకి మాట జవాబు చెప్పకుండా, ఆలోచించుకోడం. చిన్నప్పట్నుంచీ ఆలోచించడం నా ప్రవృత్తిగా వుంటూ వచ్చింది.

తోటిపిల్లలతో ఆడుకోడం తక్కువ. విశాఖపట్నంలో మహరాణీపేటలో మాడాబామీద చాపేసుకుని వెల్లకిలా పడుకుని యారాడ కొండమీద లైట్‌హౌస్ వెలుగులు పంచలో గోడమీద మెరుస్తుంటే మెరుపుకీ మెరుపుకీ మధ్య విరామం లెక్కపెడుతూనో, పిట్టగోడదగ్గర నిలబడి సముద్రపు హోరు వింటూ, అరవిరసిన సంపెంగమొగ్గలు లెక్కపెడుతూనో గడిపిన గంటలే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చినవి.

పుస్తకాలు కూడా చదవేదాన్ని. మానాన్నగారు పుస్తకాలూ, పత్రికలూ బాగానే కొనేవారు.
నా వ్యక్తిత్వం ఇప్పుడు నేను ఉన్నట్టు రూపు దిద్దుకోడానికి కారణం కొంతవరకూ మాఇంట్లోనూ సంఘంలోనూ కూడా ఆనాటి వాతావరణమే. నాకు పదేళ్లు వచ్చేవరకూ మేం అడయారులో వుండేవాళ్లం. మానాన్నగారు థియొసాఫికల్ సొసైటీవారి స్కూల్లో లెక్కలమేష్టరుగా పని చేశారు. ప్రఖ్యాత నాట్య విదుషి రుక్మిణీ అరండేల్ ఛాయామాత్రంగా గుర్తున్నారు. ఆనీబెసెంటు అప్పటికి లేరనుకుంటాను కానీ ఆమె బొమ్మ బాగా గుర్తు. ఆ సొసైటీ తాలూకు మౌలికభావనల ప్రభావం మానాన్నగారిమీద   వుందనుకుంటాను. ఆయన గానీ మా అమ్మ గానీ ఆడపిల్ల అని నన్ను కించపరిచేవిధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మరిన్ని వివరాలకి నాబ్లాగులో టపాలు, “నేనూ, నారచనలూ”, “కథలవెనక కథలు” చూడండి. డా. వాసా ప్రభావతిగారు “నేనూ, నారచనలూ” అన్న శీర్షికతో పుస్తకరూపంలో పబ్లిష్ చేస్తున్నారు. అందులో నావ్యాసం అదే శీర్షికతో వుంది. కొన్ని మార్పులతో నేను నా బ్లాగులో పెట్టేను.

సమాజంలో ప్రతివారూ చదివి విజ్ఞానవంతులు కావాలని భారీఎత్తున పత్రికలూ, సంఘసంస్కర్తలూ ఘోషించిన రోజులు అవి. అంచేత నేను అప్పట్లో బాగానే చదివేదాన్ని. అందుబాటులో వున్న తెలుగుపుస్తకాలే కాక ఆర్ధర్ కానన్ ‌డాయిల్, అగాథా క్రిస్టీ, ఓహెన్రీ కథలూ, నవలలతోబాటు ఇతర పుస్తకాలు లైబ్రరీనించి తెచ్చుకుని చదివేదాన్ని.  మా అమ్మ చదవమందని భగవద్గీత, భక్తవిజయంలాటి మతపరమైన పుస్తకాలూ చదివేను. నేను హైస్కూల్లోనూ కాలేజీలోనూ సంస్కృతం అభిమానభాషగా తీసుకోడంచేత కుమారసంభవం, మాళవికాగ్నిమిత్రంలాటి కావ్యాలు చదివేను. యూనివర్సిటీలో ఇంగ్లీషు ఆనర్సు చేసినప్పుడు థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్ వంటి వారి రచనలమీద అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా ఆరోజుల్లో నన్ను చాలా ఎక్కవగా ఆకట్టుకున్నది బ్రిటిష్ రచయిత్రి Marie Corellie. ఆవిడ రచనల్లో వ్యంగ్యంపాలు ఎక్కువ మిగతా రచయిత్రులలో కంటే. ఈ రచనలగురించి ఇప్పుడు నన్ను అడక్కండి. ఆపేర్లు మాత్రమే గుర్తున్నాయి నాకు. కానీ వారి ప్రభావం నారచనల్లో అంతర్లీనమయి కనిపించవచ్చు.

పుస్తకాలు చదవమని ప్రోత్సహించిన మా అమ్మే ఒకోసారి, “ఎందుకలా ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటావు. బ్రెయను చెడిపోతుంది” అనేది. (మా అమ్మ బుర్ర అనకుండా బ్రెయిను అనడంవల్ల అనుకుంటాను ఈ వాక్యం నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది.) ఇప్పుడు తల్చుకుంటే నాకు అనిపిస్తుంది ఆవిడ మాటల్లో సత్యం. మెడికల్ వ్యావహారికంలో కాదు కానీ “బ్రెయిను చెడిపోలేదు కానీ బతుకు చెడిపోయింది” అనిపిస్తోంది ఇప్పుడు .  ప్రశ్నలు “అతి” అయినప్పుడు నిత్యజీవితంలో వాస్తవాలు కంటికానవు. ఒకొకప్పుడు అనర్థాలకి దారి తీస్తాయి. ఆహారం, నిద్రాలాగే మెదడుకి పెట్టే మేత కూడా మితంగానే వుండాలి జీవతం సుగమం కావాలంటే. నా ఈ సిద్ధాంతం మీకు చాలా చోట్ల మళ్లీ మళ్లీ కనిపిస్తుంది ముందు ముందు. ఎందుకంటే ఇది నాకథ కనక!

నేను కథలు రాయడం, ఏదో పత్రికకి పంపడమే కానీ ఖచ్చితంగా ఎలా మొదలయిందో చెప్పలేను. ఈమధ్యనే నా తొమ్మిదో క్లాసులో క్లాసుమేటు, శాంత, అమెరికా వచ్చి, వాళ్లస్నేహితులఇంట్లో తెలుగుజ్యోతిలో నాకథ చూసి, బ్రహ్మానందపడిపోతూ, మాలతిని నాకు తెలుసు అందిట. ఆ యింటాయన వెంటనే ఇంటర్నెట్ ఎక్కేసి, నా నెంబరు ఆరా తీసి, నన్ను పిలిచేసారు. తను చెప్పింది నేను ఆరోజుల్లో మూడు కథలు రాసేననీ, అందులో ఒక కథపేరు చాదస్తం అనీ. అందులో ఒక వైదికబ్రాహ్మణుడి చాదస్తపు అలవాటు హేళన చేస్తూ రాసేననీ, అందుకు మా ఇంగ్లీషుమాస్టారికి చాలా కోపం వచ్చిందనీ. అదే నారాతల తొలిఅనుభవం అనుకోవాలి.
“కథల అత్తయ్యగారు” అన్న టపాలో నాకు కథలయందు గల ఆసక్తిగురించి రాసేను. కానీ కథలంటే ఆసక్తిలేని పిల్లలెవరు. అయితే నావిషయంలో కాలక్రమం చూస్తే, నేను 8వ క్లాసువరకూ మంగళగిరిలో వున్నాను (1950), ఆ వెంటనే, 1951లో, 9వ క్లాసులో గుంటూరులో వుండగా మూడు కథలు రాయడం చూస్తే, అత్తయ్యగారి కథనప్రభావం కొంతవరకూ నామీద వుందనే అనుకోవాలి.  అందులో చమత్కారం ఏమిటంటే, అత్తయ్యగారు సద్బ్రాహ్మణులు. సదాచార సంపన్నులు. మరి ఆవిడ చెప్పినకథలూ, వారి ఆచారవ్యవహారాలు చూసిన నేను, ఆమెయందు ఎంతో గౌరవం, అభిమానం గల నేను, ఒక ఆచారాన్ని హేళన చేసే కథ ఎందుకు రాసేను అంటే సమాధానం అది నావ్యక్తిత్వంలో భాగమే అయివుండాలి. మా అమ్మా, నాన్నగారూ కూడా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం నాకు కల్పించేరు.

ఆతరవాత నారచనావ్యాసంగంలో చెప్పుకోదగ్గ సంఘటన 1961లో నేను ఆంధ్రాయూనివర్సిటీలో లైబ్రరీసైన్సు డిప్లొమా క్లాసులో చేరినప్పుడు జరిగింది. అప్పటికి చాలాకాలంగానే నేను కథలు రాస్తున్నా నన్నెవరు గానీ గుర్తు పడతారని అనుకోలేదు అంతవరకూ.

ఎంచేతో జ్ఞాపకంలేదు కానీ నేను మొదటిరోజు క్లాసుకి వెళ్లలేదు. రెండోరోజు క్లాసు అయిన వెంటనే, ఒకాయన నాబల్లదగ్గరకొచ్చి “మీరు నిన్న రాలేదు కదా. ఇదుగో నోట్సు” అని ఓకాయితం నాబల్లమీద పెట్టేరు.నేను అడక్కుండా ఆయన అలా నోట్సు ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది.అప్పటికింకా థాంక్సులు వాడకంలోకి రాలేదు. పేరు చెప్పడం కూడా అలవాటు కాదనే అనుకుంటాను. కానీ ఆరోజు మాత్రం నేను ఆకాయితం తీసుకుని, “నాపేరు మాలతి” అన్నాను.

ఆయన వెంటనే “నాకు తెలుసు. మీరు ఈక్లాసులో చేరబోతున్నారని రావిశాస్త్రిగారు చెప్పేరు” అన్నారు.ఆరోజు నాకు కలిగిన ఆశ్చర్యం ఇప్పటికీ అలేగే వుంది మనసులో. రావిశాస్త్రిగారు మా వీధిలోనే రెండోచివర వుంటారని నాకు తెలుసు కానీ వారింట్లో “మాట్లాడుకునేంత సబ్జెక్టుని” అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనకెలా తెలిసిందో నాకు తెలీదు.

ఇంతకీ ఆనోట్సు ఇచ్చినవారి పేరు గణపతిరాజు నరసింహరాజు గారు. (ఆయన పూర్తిపేరు చాలా పెద్దదిలెండి. పొడి అక్షరాలలో జి.వి.యస్.యల్. యన్. రాజుగారు). ఇప్పటికీ నన్ను స్నేహపూర్వకంగా పలకరించే ఆప్తమిత్రులే ఆయన.

అలా ఆరోజు “ఓహో, సుప్రసిద్ధరచయితలు నన్ను గుర్తు పట్టేరన్నమాట” అని తొలిసారిగా తెలుసుకున్నాను.
ఆ తరవాత నరసింహరాజుగారి ప్రోత్సాహంతోనే విశాఖసాహితి మీటింగులకి కూడా వెళ్లేను. కాస్త గుర్తున్నవి ఒకటి రంగనాయకమ్మగారింట్లో జరిగింది, రెండోది బలివాడ కాంతారావుగారింట్లో జరిగిందీను మూడో మీటింగు విశాఖ రీడింగురూం జరిగింది.  (అప్పటికి నావయసు ఇరవైనాలుగో, ఇరవై అయిదో) ఆ మీటింగులో నేను కాళీపట్నం రామారావుగారిని చూసి, వారికథని విమర్శించేనని ఆయనే చెప్పేరనీ రిసెర్చి స్కాలరు, బోనాల సుబ్బలక్ష్మి, చెప్పేరు 2002లో విశాఖ సాహితి మీటింగులో చెప్పేరు.

ఇంతకీ ఇదెందుకు చెప్తున్నానంటే, అప్పుడప్పుడు నాటపాలమీద వ్యాఖ్యలలో “మాకు రాయడానికి ధైర్యం లేదండి” అంటారు. నా అభిప్రాయంలో ఎవరేనా “ఒకకథకి ఎలా స్పందించేరు అన్నది చెప్పడానికి వయసు ఆటంకం కానక్కర్లేదు” అని. “చెప్పిందెవరూ అన్నమాట కంటె చెప్పింది ఏమిటి” అన్నది ముఖ్యం అని. అలాగే ఆ చెప్పినమాటకి నేను ప్రతిస్పందనగా చెప్పగలిగింది ఏమైనా వుంటే అవతలివారు పెద్దవారా చిన్నవారా అన్న అనుమానం పెట్టుకోకుండా చెప్తాను. నాకు ఈ స్ఫూర్తి కలిగించినవారు తెలుగుబ్లాగరులే.

స్వాతి: మీ సైటు,బ్లాగు పేర్ల లో ఉన్న ‘తూలిక ‘ కథ ఏమిటి?

మాలతి: అది ఎలా వచ్చిందంటే – ఇక్కడ, (మాడిసన్‌లో) ఎండాకాలంలో ఫార్మర్స్ మార్కెట్ అని ప్రతి శనివారం వుంటుంది. చుట్టుపక్కల పల్లెలనించీ రైతులు అప్పటికప్పుడు కోసుకొచ్చిన కూరలూ, పళ్లతోపాటు, ఇతరవస్తువులు కూడా అమ్మకానికి తీసుకొస్తారు. ఆరైతులు నిరాడంబరంగా, నిష్కల్మషంగా కనిపిస్తూ మన పల్లెల్లో రైతులని గుర్తుకి తెస్తారు. ఆ అనుభూతికోసం అక్కడికి వెళ్తాను. అలా ఒకసారి వెళ్లినప్పుడు నెమలి ఈకలు కనిపించేయి. (మళ్లీ తరవాత ఎప్పుడూ కనిపించలేదు, విచిత్రం.). డాలరుకొకటి చొప్పున మూడు ఈకలు కొన్నాను.

ఆ తరవాత తూలిక ప్రారంభించినప్పుడు (వివరాలకి నా టపా కథలవెనక కథలు చూడండి,) మన పూర్వకవులు గంటం పుచ్చుకు రాయడం గుర్తొచ్చింది. నేను అనువాదం చేయదల్చుకున్నవి పాత కథలు కనక, (50,60 దశకం) కనక ఆబొమ్మ బాగుంటుందనిపించింది. ఎదురుగా నెమలి ఈక కనిపించింది. సరే ఆ ఈక పుచ్చుకు, గాజులేసుకుని, మాఆఫీసులో నా స్నేహితురాలిచేత (నా డైరెక్షనులో) నా చెయ్యి ఫొటో తీయించేను. అప్పుడే నా సైటుకి తూలిక అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆతరవాత చాలామంది ఆ బొమ్మా, పేరూ కూడా బాగున్నాయని మెచ్చుకోడంతో అదే నా లోగో అయిపోయింది. ఇప్పటికీ నా బెస్టుఫొటో అదేనేమో! తూలిక గురించిన విషయాలు విస్తృతంగా రెండు టపాల్లో చర్చించేను. 1. నా సాహిత్య దృక్పథం. 2. నేనూ, నారచనలు.

సంబంధిత టపాలు.
1. నేనూ, నారచనలూ
2. నా సాహిత్యదృక్పథం
3. కథల అత్తయ్యగారు.

Posted in వ్యాసం | Tagged | 14 Comments

అభ్యుదయం

– స్వాతీ శ్రీపాద

“మీరు చాలా అందంగా వుంటారు”
వసుమతికి నవ్వొచ్చింది. కాని నవ్వలేదు.
ఏం అనాలో అర్థం కాలేదు. అయిష్టంగా చిరునవ్వు విసిరింది.
పొగడ్త ఎంత సంతోషాన్నిచ్చినా మరీ ఇంతలా అతిశయోక్తి చెప్పనఖ్ఖర్లేదుగా!
అయినా తనేమయినా పదహారేళ్ళ పాపాయా పొగడగానే పొంగిపోయి ఒళ్ళుమరచిపోడానికి? ఐదు పదులు దాటిన వయసు. కాదంటే జుట్టింకా నెరవలేదు. ఒంటి బిగి సడలలేదు. చెక్కిళ్ళపై మెరుపులు తగ్గలేదు. యౌవనంలో అడుగు పెట్టాక వయసు కొన్నేళ్ళపాటు ఒకే చోట పాతుకు పోయినట్టు… కనీసం పదేళ్ళయినా చిన్నదానిగా కనిపిస్తానని ఆమెకు తెలుసు. అయినా అతనలా పొగడటం మనసుకు నచ్చటం లేదు. Continue reading

Posted in కథ | 8 Comments

జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

– డి. హనుమంతరావు

ఆ మధ్య టి.వి.లో ఒక ప్రకటన చూసాను. కొత్తగా విడుదలైన కంప్యూటర్‌ ప్రకటన అది. అది కొని ఇంట్లో పెట్టిన ఓ ఇల్లాలు దానికి కుంకుమతో బొట్టుపెట్టి నిమ్మకాయ+మిరపకాయలు వేలాడదీస్తుంది. కుటుంబ సభ్యుల చప్పట్లతో ప్రకటన ముగుస్తుంది. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా దానికి సాంప్రదాయాలను ఎలా జోడించి ప్రచారం చేస్తున్నారో ఈ ప్రకటన ద్వారా తెలుసుకోవచ్చు. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 4 Comments