చేతులారా..

-కొల్లూరి సోమశంకర్

“వీల్లేదు” నేను పట్టుపట్టాను. “జాతకాలు కలవకుండా పెళ్ళి జరగడం నేను ఉహించలేను. స్వయానా నేను జ్యోతిష్కుడిని, జాతకాలు పక్కాగా కలవడం ఎంత ముఖ్యమో తెలిసినవాడిని. నీకు తెలియదు. నువ్వింకా చిన్న పిల్లవి. జ్యోతిషం ఓ శాస్త్రం. దాని గురించి నీకు అవగాహన లేదు” అన్నాను నా కూతురితో. మా అమ్మాయి ఓపికగా వింటోంది.

“నాన్నా… జాతకాలు కలవడం గురించి నాకు తెలియదు. కాని నేను రవిని తప్ప వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోను.అతని జాతకంతో నా జాతకం కలుస్తుందా లేదానేది నాకవసరం లేదు. మేమిద్దరం ప్రేమిచుకున్నాం. అంతే” అంది.

“రవిని అతని జాతకం తెమ్మని చెప్పు. జాతకాలు కలిస్తే మీ పెళ్ళి జరుగుతుంది. లేకపోతే లేదు”

“నాన్నా, నువ్వో గొప్ప జ్యోతిష్కుడివి. కాదనను. అంత మాత్రాన నా జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు” నా కూతురి మాటలు తీక్షణంగా ఉన్నాయి. తను చికాకుగాను, కోపంగాను ఉంది.

ఒకరికి ఒకరుగా బ్రతకాలనుకున్న ఓ జంటని నేను విడదీయాలనుకోలేదు. కానీ ఏం చేస్తాం? విధి విలాసం మరోలా ఉంది. వాళ్ళ పెళ్ళి జరగడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సంకల్పానికి విరుద్ధంగా మనమేం చేయగలం?

“చూడమ్మా, నాకు కులమతాల, జాతి బేధాల, ధనిక-పేద… పట్టింపులు లేవు. నేను జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడిని కాబట్టి, దాన్నెలా ఉపయోగించాలో తెలిసినవాడిని కాబట్టే, నా కూతురు సరైన వ్యక్తిని పెళ్ళాడాలని తాపత్రయపడుతున్నాను. అంతే” అంటూ ఓ క్షణం పాటు ఆపాను. మా అమ్మాయి నా మీద నుంచి దృష్టి మళ్ళించి ఎక్కడో చూస్తోంది. నా మాటలు వినడానికి ఇష్టపడడం లేదు.

“జ్యోతిషం ఓ శాస్త్రం రా…అర్థం చేసుకో…అదో శాస్త్రం…” బ్రతిమాలాను.

“నాన్నా, రవి జాతకం ఉందో లేదో నాకు తెలియదు…”అంది విసుగ్గా.

“పరవాలేదు. అతను పుట్టిన తేది, సమయం తెలుసుకో. అతని జాతక చక్రం నేను వేస్తాను. నీ జాతకానికి నప్పితే, మీ పెళ్ళవుతుంది. నప్పకపోతే, ఈ విషయాన్ని మీరు ఇక్కడితో ఆపేయాలి. పెళ్ళయ్యే వరకు ప్రేమ బానే ఉంటుంది. అందుకే నిలకడలేని భావాలకు ప్రాముఖ్యతనీయకు” చెప్పాను.

“నాన్నా, రవి పట్ల నా ప్రేమ అశాశ్వతమైనది కాదు, నిలకడ లేనిదీ కాదు. అయితే ఇద్దరి పెద్దల అనుమతితోనే మేము పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. రవి వాళ్ళ అమ్మా నాన్నా ఒప్పుకున్నారు. నువ్వే అడ్డుచెబుతున్నావు. నువ్వు మనస్పూర్తిగా ఇష్టపడితేనే మా పెళ్ళి జరుగుతుంది, లేకపోతే……” మా అమ్మాయి గొంతులో దుఃఖం పొంగుకొస్తోంది.

“తల్లీ, నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. నాకు పొగరని, నేను మొండిపట్టు పడుతున్నానని నువ్వు అనుకోవచ్చు. కాని నాకు జ్యోతిషం, జాతకాల ప్రాముఖ్యత తెలుసు. నేను జోస్యం చెప్పిన ప్రతీది కచ్చితంగా జరిగింది. దాని ప్రాముఖ్యత తెలిసినవాడిని కాబట్టే, నా కూతురి జీవితంతో ఆటలాడాలనుకోవడం లేదు. నా వాదన సరైనదేనని నిన్నెలా ఒప్పించాలో నాకు అంతుబట్టడం లేదమ్మా” అన్నాను.

“సరే నాన్నా, రవి పుట్టిన తేదీ నాకు ముందే తెలుసు, సమయం తెలుసుకుని నీకు చెబుతాను…”అంది.

* * *

రవి పుట్టిన తేదీ, సమయము లభించాయి. నేను వాడే పంచాగం ప్రకారం అతని జాతక చక్రం వేసాను. దాని ద్వారా రవి నడవడిక, విద్య, ఇంకా ఇతర వివరాలు అర్థం చేసుకున్నాను. అమ్మాయిని పిలిచి అతని చదువు, ప్రవర్తన, కుటుంబం గురించి నేను గ్రహించినవి సరైనవేనా అని అడిగాను. అంత సరిగ్గా చెప్పగలిగినందుకు నా కూతురు ఆశ్చర్యపోయింది. రవి గురించి నాకు కొంత ముందే తెలుసు కాబట్టి ఈ వివరాలు చెప్పగలిగానని అంది. నేను మరింత స్పష్టమైన వివరాలు చెప్పాను. అవి కచ్చితంగా సరిపోయాయి.

“చూసావా, జాతకం ఆధారంగా మనిషి వివరాలు ఎలా తెలుసుకోవచ్చో, ఇక ఇప్పుడు నీ జాతకంతో పోల్చి చూడాలి” అన్నాను ఉత్సాహంగా.

“నా జాతకం కూడా ఉందిగా. నా వివరాలు ఎప్పుడూ చెప్పలేదే?” అంది మా అమ్మాయి కొంచెం సంశయంగా. “నిజానికి, నీ జాతకం నేనింకా రాయలేదు. నీకు 18 ఏళ్ళు నిండాక రాద్దామని ఆగాను. నా దగ్గర అన్ని వివరాలు ఓ పుస్తకంలో ఉన్నాయిలే” నా కూతురు మొహంలో ఆతృత కనపడుతోంది. తన ప్రేమ భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం వ్యక్తమవుతోంది.

* * *

మా అమ్మాయి పుట్టినప్పుడు నేను ఆసుపత్రి నుంచి మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను. ఆ రోజు తేదీ, జనన సమయం, తిథి, నక్షత్రం వంటి వివరాలు మా అక్క తన చేతి రాతతో ఓ నలభై పేజీల పుస్తకంలో రాసిపెట్టింది. విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి నేను ఆ పుస్తకాన్ని తీసుకుని, మా అమ్మాయి వివరాలతో జాతకం రాయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత, రవి జాతకంతో పోల్చి చూసాను. పొంతన కుదరలేదు. రవి జాతకం అమ్మాయి జాతకం పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పెళ్ళి జరగదు, జరిగినా ఆ బంధం కలకాలం నిలవదు. ఏం చేయాలో నాకర్థం కాలేదు. జాతకాలు కలవాలని ఇంతకు ముందు నేను దేవుడినెంతో ప్రార్థించాను. అది నాకెంతో ముఖ్యం. ఒకరికి ఒకరుగా బ్రతకాలనుకున్న ఓ జంటని నేను విడదీయాలనుకోలేదు. కానీ ఏం చేస్తాం? విధి విలాసం మరోలా ఉంది. వాళ్ళ పెళ్ళి జరగడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సంకల్పానికి విరుద్ధంగా మనమేం చేయగలం? ఈ విషయాన్ని మా అమ్మాయికి చెప్పక తప్పదు. నాకు ఇంతకంటే మరో మార్గం లేదు. నా జోస్యం ఎన్నడూ తప్పు కాదు.

* * *

అనుకున్నట్ట్లుగానే, ఈ విషయం చెప్పగానే అమ్మాయి నామీద ఎగిరిపడింది. “చూడమ్మా, నేనేం చేసేది, మీ వివాహానికి విధి అడ్డుచెప్పింది. లేకపోతే, జాతకాల పొంతన ఇంత దారుణంగా ఉండేది కాదు. నేను కచ్చితంగా చెబుతున్నాను, ఈ పెళ్ళి జరగదు. ఒకవేళ జరిగినా, మీరు కలకాలం కాపురం చేయలేరు”

“నానా, మా పట్ల విధి క్రూరంగా లేదు. దేవుడి సంకల్పం ఇదేనని నువ్వెలా చెప్పగలవు? నువ్వేమీ దేవుడివి కాదు. ఈ చెత్త జాతకాలని నేను నమ్మను…. ”

“నా జోశ్యం ఎప్పటికీ తప్పు కాదు. ఇదే దైవ సంకల్పం. మీ పెళ్ళికి నా ఆశీస్సులు ఉండవు, నన్ను క్షమించు”

మా అమ్మాయి ధుధుమలాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఏమైనా, నా అభీష్టానికి వ్యతిరేకంగా నడిచేందుకు అమ్మాయి ఇష్టపడలేదు. రవి తనకి నచ్చజెప్పడానికి చూసాడు, కాని అతని ప్రయత్నం వృధా అయ్యింది. చాలా రోజులు ఎదురు చూసాక, అతను వేరే వివాహం చేసుకున్నాడు. అప్పటికి నాకు ఉపశమనం కలిగింది.

* * *

ఓ రోజు మా అక్క మా ఇంటికొచ్చింది. మాటల సందర్భంలో మా అమ్మాయి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. రవితో పెళ్ళి కుదరనప్పటి నుంచి మా అమ్మాయి పెళ్ళి సంబంధాలంటేనే విముఖత వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని అక్కతో చెబుతూ, అమ్మయి ప్రేమ గురించి చెప్పాను.

“అక్కా, అదే దైవ సంకల్పం! దైవ సంకల్పమే జ్యోతిషం. రవితో అమ్మాయి పెళ్ళి జరగదని చెప్పాను, అదే నిజమైంది. అమ్మాయి పొద్దున్న 10గం.20ని.లకి ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టింది. కనీసం 10గం.25ని.లకి పుట్టినా, వాళ్ళ జాతకాలు కలిసేవి. ప్రాప్తం లేదు.మనిషి ఒకలా తలిస్తే, దైవం మరోలా తలుస్తాడు” అన్నాను నిట్టూరుస్తూ.

మాట్లాడుతూ, అక్క చేతి రాతతో అమ్మాయి జనన వివరాలు రాసున్న పుస్తకం అక్కకి అందించాను. దాన్నందుకుంటూ అక్క “మనం చేయగలిగినదేం లేదు” అంటూ నిట్టూర్చింది. పుస్తకంలోని పేజీలు అటూఇటూ తిప్పుతూ అక్క జ్ఞాపకాలలోకి జారుకుంది. ఉన్నట్లుండి………

“అమ్మాయి పుట్టిన సమయం ఎంతన్నావు? నేను 10గం.29ని. అని రాసాను. 10.20 కాదు. నా చేతి రాత నీకు గుర్తు లేదూ? నేనెప్పుడు తొమ్మిది తోక చిన్నగా రాస్తాను. అది సున్నాలా కనపడుతుంది. చిన్నప్పుడు మీరంతా నన్ను వెక్కిరించేవాళ్ళు కదా, మర్చిపోయావా?” అని అంది.

(రాజారామ్ బాలాజీ రాసిన Horro(r)scope కథకు ఇది అనువాదం. ఇది సులేఖ.కామ్‌లో ప్రచురింపబడింది. )

————————————–

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలను హిందీలోకి అనువదించారు. కొన్ని దినపత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి. 2006లో “మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో “4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు. వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com బ్లాగు చూడచ్చు.

Posted in కథ | Tagged , | 10 Comments

ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

తెలుగులో మాట్లాడినందుకు, ఒక పాఠశాలలో “తెలుగులో ఎప్పుడూ మాట్లాడను” అని రాసిన పలకను పిల్లల మెడలో తగిలించారు. ఈ మధ్య ఈ వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రంలోనే తెలుగు భాషకు జరిగిన అవమానం పట్ల ప్రజలు క్రోధం వెలిబుచ్చారు, బాధపడ్డారు. సమంజసమైన క్రోధమే. మాతృభాషలో మాట్లాడినందుకుగాను శిక్షనెదుర్కోవాల్సిన పరిస్థితిని మనం సహించాల్సివస్తోంది. భాషాభిమానులందరికీ బాధ కలిగించే సంఘటనే ఇది. కానీ ఈ సంఘటన ఆ పాఠశాలకే పరిమితమైనదా? రాష్ట్రంలో మరే బడిలోనూ లేదా? అసలు, సమస్య అదేనా?

తెలుగు తప్ప మరో భాష రాని పసికందులను ఇంగ్లీషులో చదువుకోవాలనే/మాట్లాడాలనే శిక్ష వేస్తున్నారు. ఎందుకు వాళ్ళకీ శిక్ష? ఎవరు వేస్తున్నారీ శిక్ష?

…………

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులు చెప్పేమాట!
పుట్టినప్పటి నుంచీ బిడ్డ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగే నేర్చుకుంటాడు. అతడు బువ్వ తింటాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కొడతాడు, పాడతాడు. అంతేగానీ హి డస్ నాట్ ఈట్, డస్ నాట్ ప్లే, డస్ నాట్ లాఫ్, డస్ నాట్ క్రై ఆర్ వీప్! తెలుగు భాషలో, తెలుగు వాతావరణంలో, తెలుగు సంస్కృతిలో మూడేళ్ళు పెరిగిన పిల్లవాడికి, బడిలో చేరగానే వాట్జ్స్యువర్నేమ్, వాట్జ్స్యువర్నిక్నేమ్ అంటూ మాట్లాడితే ఏమర్థమౌతుంది? మనల్ని హఠాత్తుగా స్వాహిలి మాట్లాడే వాళ్ళ మధ్య పడేస్తే మన పరిస్థితి ఏమిటి? “దప్పికతో నోరు పిడచకట్టుకు పోతోంది, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి” అని తెలుగులో ప్రాథేయపడితే, మంచినీళ్ళు ఇవ్వకుండా “నేనో తెలుగు గాడిదను” అనే బోర్డు మన మెడలో తగిలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంగ్లీషు బడిలోకి నెట్టబడిన ఆ కసుగాయల పరిస్థితీ అదే!

తెలుగులో బోధన జరిగేటపుడు, భాషతో పిల్లలకు ఇబ్బంది ఉండదు -వారికి భాష ముందే వచ్చు కాబట్టి. వాళ్ళకు అక్షరాలు రావంతే! పుస్తకాల్లోని విషయాన్ని చదవేందుకు, చదివినదాన్ని తిరిగి రాసేందుకూ ముందు పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలి. అవి బడిలో చేరగానే నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీషులో చదివే పిల్లలు ముందు ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలి. భాష నేర్చుకోవడమంటే చదవడం రాయడం నేర్చుకోవడం కాదన్న సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి.

మనిషి నుంచి మనిషికి సమాచార ప్రవాహం విషయంలో భాష ఎటువంటి పాత్ర పోషిస్తుందో “మాతృభాషలో ప్రాథమిక విద్య శాస్త్రీయ వివరణ” పుస్తకంలో డా. పమిడి శ్రీనివాసతేజ ఇలా రాసారు:
సంభాషణ లేదా సమాచార మార్పిడి అర్థవంతంగా జరగాలంటే ఇద్దరి వ్యక్తుల మనసుల్లో ముందుగానే భాషకు సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి ఉండాలి. బిడ్డ పుట్టినప్పటి నుండీ జరిగే ప్రోగ్రామింగే భాషాభివృద్ధి. మనకు తెలుగులో ప్రోగ్రామింగు జరిగితే తమిళులకు తమిళ భాషలో ప్రోగ్రామింగు జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ప్రోగ్రామింగు జరూగుతుందో దాన్ని మాత్రమే అర్థం చేసుకోగలరు.ఇతర భాషను అర్థం చేసుకోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి తీరాలి. అంటే ఆ భాషను నేర్చుకుని తీరాలి.
అంటే, మన కంప్యూటరుకు తెలుగు నేర్పకుండా పొద్దును చదవడానికి ప్రయత్నించడమెలాగో తెలుగు పిల్లలకు ఇంగ్లీషులో చదువు చెప్పడమలాంటిదే!

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, భాషావేత్తలు అనేక పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. మచ్చుకు:

ఐరాస పనుపున స్థానిక భాషలపై ఏర్పాటైన అంతర్జాతీయ నిపుణుల సమావేశం ఇలా అభిప్రాయపడింది: మాతృభాషలో విద్యాబోధనే పిల్లలకు మేలని గుర్తిస్తున్నారు. భాషాపరంగాను, సాంస్కృతికంగాను సంబంధం ఉన్న విద్యనే బోధించడం ఆవశ్యకమన్న భావన పెరుగుతోంది. అలాగే మాతృభాషలో చదువుకున్న పిల్లలు, పరాయి భాషలో చదువుకున్నవారి కంటే మెరుగ్గా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఉచిత నిర్బంధ విద్య అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన సంఘంవిద్యార్థి మొదటి ఐదేళ్ళ చదువు మాతృభాషలోనే సాగాల‘ని చెప్పింది. పిల్లలలో బహుభాషా ప్రావీణ్యాన్ని పెంపొందించాలని చెబుతూ, ‘మాతృభాషలో చక్కటి ప్రావీణ్యం ఉంటేనే ఇది సాధ్యపడుతుంద‘ని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 తన నివేదికలో చెప్పింది.

జాతీయ, అంతర్జాతీయ నిపుణులే కాదు, స్వయంగా మన రాష్ట్రప్రభుత్వం కూడా ఈ సంగతే చెబుతోంది. మాతృభాషలో బోధన జరిగితేనే పిల్లలు ఆసక్తిగా నేర్చుకోగలుగుతారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం 8 గిరిజన భాషల్లో చదువులు చెప్పించే ఏర్పాట్లు చేసింది. సర్వ శిక్షా అభియాన్ కింద ఈ ప్రయోగం చేసింది. ఆయా భాషల్లో పుస్తకాలు తయారుచేయించింది. దీనితో ఆయా గిరిజన తెగలకు చెందిన పిల్లలు బడికి హుషారుగా రావడం, బడి మానేసేవాళ్ళు తగ్గిపోవడం గమనించినట్టు ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. గోండు, సవర వంటి భాషలలో చదువు చెప్పించే ప్రభుత్వం తెలుగు భాషలో చెప్పించకపోవడం విచిత్రంగా లేదూ?

…………

పిల్లలను ఇంగ్లీషులో చదివించడం పట్ల మనకు ఎందుకంత ఆసక్తి?

దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి.

1. తెలుగులో చదివించాలంటే తగిన వసతులు లేవు: తెలుగులో చదువు చెప్పే పాఠశాలలే బహు తక్కువ. ఉన్నవాటిల్లో చదువు సరిగ్గా చెప్పరు. అందుచేత ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి మనకు ఏర్పడింది. ప్రభుత్వం మనకీ దురవస్థ కల్పించింది.

2.ఇంగ్లీషులో చదివితేనే మంచి ఉద్యోగాలొస్తాయి అనే మిథ్య: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియములో చదివించుకోవాలని తహతహలాడుతున్నారు అని ఒక వాదన ఉంది. నిజమే, తమ పిల్లలు బాగ చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని అందరికీ ఉంటుంది. కానీ, పిల్లలు ప్రాథమిక విద్యను తెలుగులో చదవడానికీ, వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్టువేరు ఇంజనీర్లూ కాలేకపోవడానికీ సంబంధం ఏమీ లేదన్న సంగతిని గ్రహించక అలా అనుకుంటాం.

ఈ కారణాల వలన, ఎంత ఖర్చైనా భరించి, పిల్లలను ఇంగ్లీషు బడుల్లో చదివిస్తున్నాం. ప్రభుత్వానికి ఇది బాగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల మీద వత్తిడి తగ్గిపోయింది గదా, మరి! ప్రజలు ఇంగ్లీషే కావాలని కోరుతున్నారు, అంచేత ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువు చెబుతామంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎటొచ్చీ పిల్లలే ఇంగ్లీషు శిక్షకు గురౌతున్నారు. వాళ్ళను ఈ శిక్ష నుంచి తప్పించే ఉపాయమేమీ లేదా?

ఉంది!

ప్రభుత్వ విధానాలను మార్చాలి, మనం మారడం కాదు.

తెలుగు భాషను, తెలుగు జాతినీ, తెలుగు సంస్కృతినీ కాపాడి, రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరికంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని గ్రహించాలి. తెలుగులో ప్రాథమిక విద్య ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? భాషాభిమానులు ఈ విషయమై వత్తిడి తేవాలి. మన భాషను మనం రక్షించుకోకపోతే మరెవరూ మనకోసం ఆపని చెయ్యరు.

“ఏను తెలుగు వల్లభుండ” అంటూ తెలుగు భాషను పోషించిన నృపుణ్ణి నేటికీ – 450 యేళ్ళ తరువాత కూడా – ఎల్ల జనులూ కొలుస్తున్నారు. అతడికి ముందు, అతడి తరువాతా అనేక వందల మంది పాలకులు వచ్చారు, పోయారు. కానీ రాయలొక్కడే మనకు జననాయకుడు. మన ప్రభుత్వాధినేతలు ఈ నిజాన్ని గుర్తెరగాలి.

-చదువరి

———————-

ఈ అంశంపై మీ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో ఆహ్వానిస్తున్నాం.

తెలుగు భాషపై పొద్దులో వచ్చిన వ్యాసాలను చూడండి.

Posted in సంపాదకీయం | Tagged , | 33 Comments

మతాలకు పాలకుల మద్దతు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది.

మతవిశ్వాసాలు కలిగినవారికి సామాన్యంగా వాటికి రాజకీయాలతో ప్రమేయం లేదని అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా మంచి మనస్తత్వమూ, సత్ప్రవర్తనా కలిగినవారంతా దేవుణ్ణి నమ్ముతారు. అంతేకాక తమ మంచితనానికి మతమే కారణమని భావిస్తారు. అయితే సామాన్యంగా దీనికి వ్యతిరేకమైన కారణం ఉంటుంది. మతాల్లోని మంచిలక్షణాలన్నీ వారి స్వభావం మూలంగానే రూపొందుతాయి. మంచివాళ్ళంతా దేవుణ్ణి నమ్ముతారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళంతా మంచివాళ్ళు కానవసరంలేదు. సిసిలీలోనూ, ఇటలీలోనూ పేరుమోసిన మాఫియా హంతకులూ, నేరస్థులూ కేథలిక్ మతాన్ని గట్టిగా నమ్మినవాళ్ళే. అసలు మతాలకూ పరలోకానికీ సంబంధమేమీ లేదు. ఉన్నదల్లా ఇహలోకపు సమస్యల గురించిన గొడవే.

ఇది ఈనాడు మొదలైనది కాదు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్ట్ నాగరికతల్లో దేవాలయ వ్యవస్థలూ, అర్చకవర్గాలూ తమ బలాన్ని పెంచుకున్నాయి. అక్షరాస్యత మొదలయిన యుగంలో అది పూజారివర్గాలకే పరిమితం అయి ఉండేది. గ్రహణాలూ, రుతువులనుబట్టి కురిసే వర్షాలూ, నైల్ నదికి కాలానుసారం వచ్చే వరదలూ వీటన్నిటి సమాచారమూ లెక్కకట్టి చెప్పగలిగిన అర్చకులు అదేదో దైవికశక్తి అని సామాన్యులను నమ్మించగలిగారు. విస్సన్న చెప్పిందే వేదమన్న పద్ధతిలో వీరు రోజువారీ జీవితాలను శాసిస్తూ, పాటు పడకుండా జీవించే మార్గానికి అలవాటుపడ్డారు. గుడ్డినమ్మకాలు పామరుల్లో ఎంత ఎక్కువగా వ్యాపిస్తే తమ అధికారం అంత పెరుగుతుందని వీరు త్వరలోనే గ్రహించారు. ఈనాటికీ పూజాది కార్యక్రమాల్లో ఇతరత్రా ఎంత బలమూ, అహంకారమూ ఉన్నవారైనా, పురోహితుడి అదిలింపులకు తల ఒగ్గినట్టే ఆధ్యాత్మికశక్తి పేరుతో అర్చకులు ప్రాచీనకాలంలోనే పెత్తనం చలాయించేవారు. ప్రాచీన ఈజిప్ట్ పాలకులలో కొందరు పాత దేవతలను ఈసడించుకుని కొత్త దేవతలనో, తమనే దేవతలు గానో ప్రతిష్ఠించుకునే ప్రయత్నాలు చేశారు. కాని అవేమీ సఫలం కాలేదు. రాజ్యాధికారమూ, మతాధికారమూ చెట్టాపట్టాలేసుకుని ఉంటేనే మంచిదని అనేక సందర్భాల్లో రుజువయింది.

ఉత్పత్తి సంబంధాలూ, కుటుంబ వ్యవహారాలూ, రాజకీయాలూ, నైతికప్రవర్తనా ఇలాంటి ఇహలోకపు విషయాలన్నిటిలోనూ, దేవతలూ, దెయ్యాల ప్రమేయం ఉంటుందని మతవిశ్వాసాలు నమ్మబలుకుతాయి. ఇటువంటి ఆర్థిక, తాత్విక చింతనలు రెండూ కలిసి సమాజంలోని సాంస్కృతిక దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయి. మతధోరణులే మన అవగాహననూ, సత్ప్రవర్తననూ శాసిస్తాయని అనుకోవడం పరిపాటి. ఇదొక సంప్రదాయంగా ఏర్పడి తరవాతి తరాలకు సంక్రమిస్తుంది. సమాజంలో వర్గాలు ఏర్పడినప్పుడు ఆర్థికంగా ముందున్న వర్గాలే ఈ తాత్వికచింతనను నిర్దేశిస్తూ ఉంటాయి.
సమాజాల్లో ఆర్థికబలం ఉన్న వర్గాలదే అధికారం అవుతుంది. ఎటువంటి మతవైఖరి తమకు అనుకూలమో ఆ వర్గాలకు బాగా తెలుసు. సుమేరియన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్ మొదలైన ప్రాచీన నాగరికతలలో కొన్నివేల ఏళ్ళ క్రితమే ఇటువంటి పరిణామాలు మొదలయాయి. ఆ కాలంనుంచీ అణగారిన వర్గాలన్నీ తాము గురవుతున్న దోపిడీకి తలవొగ్గి అదేదో దైవనిర్ణయమేనని నమ్ముతూ వచ్చారు. తమ కాళ్ళకు తామే బంధం వేసుకున్న పద్ధతిలో ఎన్నో శతాబ్దాలపాటు బడుగువర్గాలేవీ ఈ ‘దైవశాసనా’లను ధిక్కరించే ప్రయత్నంకూడా చెయ్యలేదు. అలా చేస్తే దైవికశక్తులు ఆగ్రహిస్తాయని వారు నమ్మారు. ఇదంతా సహజమేననీ, సామాజికసంక్షేమానికి తప్పనిసరిగా యథాస్థితిని కొనసాగించగలిగిన నియమాలన్నీ ఇలాగే ఉంటాయనీ వారికి అనిపిస్తూ ఉండేది.

‘పర’లోకం మాట ఎలాఉన్నా, ‘ఇహ’లోకంలోని విషయాల గురించిన వైఖరి ఎలా ఉండాలో నిర్వచించవలసిన బాధ్యతకూడా మతాధికారులకు ఉండేది. సమాజంలోని వ్యక్తులు పరస్పరం ఎలా సహకరించుకోవాలో, ఎటువంటి సాంఘిక నియమాలకూ, కట్టుబాట్లకూ లోనవాలో వారే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. విభిన్న వ్యక్తులూ, విభిన్న వ్యక్తిత్వాలతో కూడిన సమాజం సజావుగా నడవాలంటే కొంత క్రమశిక్షణ అవసరమవుతుంది. స్థిరజీవితాలు గడిపే వ్యవసాయసమాజాలు ఏర్పడ్డాక దీని ప్రాముఖ్యత పెరిగింది. ప్రజల మనోభావాలను మతపరంగా శాసించగలిగిన అర్చకవర్గం సమాజంలో బలమూ, రాజకీయ అధికారమూ ఎటువంటివారు హస్తగతం చేసుకుంటున్నారో గ్రహించి, వారికే వత్తాసుపలికే ధోరణిని అవలంబిస్తూవచ్చారు. రాజే దేవుడి అవతారమనీ, అతనికి తల ఒగ్గడం దైవనిర్ణీతమనీ బోధలు చెయ్యడం మనదేశంలోనేకాక పాత నాగరికతలన్నిటిలోనూ ఉండేది. ఎప్పుడో ఆటవికసమాజాల్లో ఉన్నట్టుగా ప్రజాసంక్షేమం కోసం బాధ్యతలు చేపట్టిన కులపెద్దల కాలం ముగిసింది. గారడీలూ, తంతులద్వారా చికిత్సకులుగా, గణాచార్లుగా మొదలైన పూజారులూ, పాలకులూ అధిక సంఖ్యాకులచేత శరీరశ్రమ చేయించి వాటి ఫలాలను పొందుతూ అధికారవర్గాలుగా కొనసాగారు. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ఎటువంటి నమ్మకాలనైనా జనబాహుళ్యంలో వ్యాప్తిచెయ్యడానికి వారు వెనకాడలేదు. దేవాలయాలకూ, రాజుకూ చెందిన ఆస్తులను దొంగతనం చేస్తే మరణశిక్ష విధించేవారు. వారికి చెందిన పశువులనో, గొర్రెలనో దొంగిలించడం పెద్ద నేరం. తగిన సాక్ష్యం లేకుండా బానిసలనుంచి వెండి బంగారాలు కొన్నవారు దొంగలుగా శిక్షకు పాత్రులయేవారు. బేబిలోనియాలో క్రీ.పూ. 1728 నుంచి 1686 దాకా రాజ్యంచేసిన హమ్మురబీ కాలంలోనే ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.

హామూరాబీ

హమ్మురబీ

చరిత్రలో ఏ యుగంలోనైనా విజ్ఞాన, సాంకేతికరంగాల్లో ప్రగతి కలిగినప్పుడల్లా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ, వాటినిబట్టి సామాజిక సంబంధాల్లోనూ చెప్పుకోదగ్గ మార్పులు కలుగుతూ ఉండేవి. ప్రకృతినీ, ప్రపంచాన్నీ గురించిన అవగాహనలో కొత్త వైఖరి తలెత్తేది. పాత నమ్మకాలన్నీ కాలంచెల్లినవి గానూ, తప్పులతడకగానూ అనిపించేవి. కొత్త భౌతికఅవగాహన ఉత్పత్తిసంబంధాలను తారుమారు చేసి, ఒకప్పుడు శాశ్వతమనిపించిన పాతకాలపు భావనలను చెత్తబుట్టలోకి నెట్టేస్తూ ఉండేవి. ఉదాహరణకు గ్రీస్లో క్రీ.పూ, ఏడో శతాబ్దంనాటికే వర్తకవాణిజ్యాలు పెరగడంతో మనిషే కేంద్రంగా ఒక కొత్త తాత్వికచింతన మొదలయింది. అంతకుమునుపు దేవతలకూ, దెయ్యాలకూ ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోయి భౌతికవాదదృక్పథం ఏర్పడింది. ఈ దశలోనే నిజమైన భౌతికశాస్త్రాలకూ, ప్రకృతి పరిశీలనలకూ మూలాలు ఏర్పడ్డాయి. ఈ ధోరణివల్ల పండిన పంటలోనూ, సంపాదించిన డబ్బులోనూ కొంత శాతం దేవాలయాలకు సమర్పించడం శుద్ధదోపిడీయేనని కొందరు విమర్శించేంతదాకా వెళ్ళింది.

సమాజంలో కూలీనాలీ చేసుకుని ఆహారోత్పత్తికీ, ఇతరరకాల ఉత్పాదకతకూ కాయకష్టం చేసేవారు నిత్యమూ తమకు కనబడుతున్న అసమానతను భరించాలంటే అదంతా చట్టబద్ధమేననీ, న్యాయసమ్మతమేననీ వారికి అనిపించాలి. ఇటువంటి నమ్మకాలను నెలకొల్పడమే పూజారివర్గాల పని. ఒకవంక పాలకుల శౌర్యపరాక్రమాలను అతిశయోక్తులతో కీర్తిస్తూ, వారి అధికారానికి దైవికమైన అనుమతి ఉన్నట్టుగా ప్రజల్ని విశ్వసింపజేయడమే వారి ధ్యేయం. మరొకవంక తాము ఎంత బలవంతులైనా దైవానికీ, దేవుడికి అనుసంధానం కుదిర్చే పురోహితులకూ లోబడే ఉంటామని రాజులు బహిరంగంగా చాటేవారు. ఇటువంటి ప్రచారం యథాస్థితి కొనసాగడానికి తోడ్పడుతూ వచ్చింది.

పోప్ రెండవ పయస్

పోప్ రెండవ పయస్

సమాజం ఇతరత్రా ఎంత పురోగతిని సాధించినప్పటికీ పాతసిద్ధాంతాలు నమ్మదగినవేనని ఆధ్యాత్మికవర్గాలు చెపుతూనే ఉంటాయి. యూరప్‌లో మధ్యయుగాల్లో పోప్‌వంటి మతాధికారులు క్రైస్తవదేశాలను జెరూసలేంమీద క్రూసేడ్ మతయుద్ధాలు చెయ్యమని ప్రోత్సహించిన కాలంలో మతానిదే పైచెయ్యిగా ఉండేది. 1458 నాటి పోప్ రెండవ పయస్ వంటివారు టర్కీమీద జరిగిన క్రూసేడ్లను సమర్థించారు. కాని సంస్కృతిక పునరుజ్జీవనం మొదలై, క్రైస్తవమతంలో చీలికలు ఏర్పడ్డాక ఆ మతాధికారుల బలం క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది.

మనదేశంలో మటుకు ఆధ్యాత్మికవాదులు ఎన్ని జిత్తులకైనా పాల్పడుతూ వస్తున్నారు. పాత కాలపు తంతులకు బెదరని, ప్రభావితంకాని ఆధునికులను బుట్టలో వేసుకునేందుకు చిత్ర విచిత్రమైన వాదనలను తెస్తున్నారు. అత్యాధునిక పరికరాలద్వారా అంతరిక్షంలో ఎంతో దూరాన ఏదో గామా విస్ఫోటనం కనబడిందన్న వార్తకుకూడా ఏ భగవద్గీతలోనో సాక్ష్యం ఉందని నిరూపించడానికి వీరు విశ్వప్రయత్నం చేస్తూఉంటారు. వర్ణవ్యవస్థకూ, కులవ్యవస్థకూ వత్తాసుగా వీరు ఏ వేదాన్నో, మనుధర్మ శాస్త్రాన్నో, భగవద్గీతనో ఉదహరిస్తారు. కళ్ళకు కనబడుతున్న అన్యాయాన్ని ఎవరూ ఎదిరించే ప్రయత్నం చెయ్యకుండా పునర్జన్మ సిద్ధాంతాలనూ, కర్మను గురించిన ప్రతిపాదనలనూ తెస్తూ ఉంటారు. సైన్సును నమ్ముకుంటే లాభంలేదనీ, వైజ్ఞానిక ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయనీ, ప్రాచీన ప్రవచనాలు మాత్రం శాశ్వతమనీ చెపుతారు. సైన్సులో అంతిమసత్యాలేవీ ఉండవనీ, కొత్త సాక్ష్యాలు లభించినప్పుడల్లా అవసరమైతే ఉన్న సిద్ధాంతాలను సవరించుకోవడానికి విజ్ఞానం వెనకాడదనీ సామాన్యులకు అర్థంకాదు. జాతకాలూ, పూజలూ, శాంతులూ సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెట్టగలవనే నమ్మకం అధికారవర్గాలు బుద్ధిపూర్వకంగానూ, భావవాదులు అవివేకంతోనూ ప్రచారం చేస్తారు. సమాజాన్ని తమ చెప్పుచేతలతో ఉంచుకోవాలంటే హేతువాదాన్నీ, భౌతికవాదాన్నీ ఎవరూ నమ్మకుండా చెయ్యడమే ముఖ్యమని వీరికి బాగా తెలుసు.

————————

కొడవటిగంటి రోహిణీప్రసాద్కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | Tagged | 6 Comments

దాపుడు కోక

— కేతు విశ్వనాథ రెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి

గత జనవరిలో కేతు విశ్వనాథరెడ్డి గారికి అజో-విభొ ప్రతిభామూర్తి పురస్కార ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా పొద్దులో కేతు దంపతులతో ఇంటర్వ్యూ ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. విశ్వనాథరెడ్డి గారి కథల్లో తనకు బాగా నచ్చిన కథ దాపుడుకోక అని శ్రీమతి కేతు పద్మావతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కారణంగా ఆ కథను పొద్దు పాఠకుల కోసం పునఃప్రచురిస్తున్నాం.

ఐతే ఈ కథ ప్రాధాన్యత అదొక్కటే కాదు. స్త్రీల సమస్యలను, స్త్రీ పురుషుల అసమానతలను మొదటి నుంచీ తన రచనల్లో బలంగా చిత్రిస్తూ వస్తున్న కేతు విశ్వనాథరెడ్డి గారు మహిళల సమస్యలను సహానుభూతితో చిత్రించడంలో ఎక్కిన మొదటి మెట్టు1972లో రాసిన దాపుడుకోక కథ.

1974లో తన మొట్టమొదటి కథల సంపుటి ‘జప్తు’లోని కథల గురించి “ఈ కథల్లో యితివృత్తం వాస్తవికంగా లేకపోతే, జీవిత వైరుధ్ధ్యాలు నాకింకా స్పష్టపడలేదని అర్థం. కథల ద్వారా నేనాశించిన ప్రభావం పాఠకుని మీద పడకుంటే శిల్పం నా చేతుల్లో వొదగలేదనే అర్థం.” అని ప్రకటించిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఈ కథ రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గార్ల నుంచి సాధారణ పాఠకుల దాకా ఎందరో బాగా ఇష్టపడినది. ఐతే కేతు విశ్వనాథరెడ్డి గారి చిరకాల మిత్రుడు, ఉత్తమ కథారచనకు గుర్తింపుగా రావిశాస్త్రి రచనా పురస్కారం పొందిన ప్రసిద్ధ కథారచయిత అయిన సొదుం జయరాం గారు అదే కథాసంపుటికి రాసిన ముందుమాటలో “దాపుడు కోక లో ఎమోషన్ సూపర్‌ఫ్లుయస్ స్థాయికి చేరుకుంది. ఆ ఎమోషన్ కూడా situation ను ఆశ్రయించి ఉత్పన్నం కాక, పదాల ద్వారా ఉత్పన్నమయింది. ఇది ఒక రకం శిల్పసంబంధమైన లోపమే.” అన్నారు.

ఎ.బి.కె. ప్రసాద్ గారన్నట్లు నేటి కథా-నాయకుడు కేతు విశ్వనాథరెడ్డి. ఆయన పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే కథలు కొన్ని ఉన్నాయి – నమ్ముకున్న నేల, కూలిన బురుజు, అమ్మవారి చిరునవ్వు, రెక్కలు, పీర్ల సావిడి, జప్తు, దాపుడుకోక, … ఇలా. ఐతే ఆయన రాసిన కథల్లో మీకు బాగా నచ్చినవి, ప్రత్యేకించి అధ్యయనం చేయదగ్గవైనపటికీ మిగతా కథలంతగా ప్రసిద్ధం కానివి అయిన కథల గురించి తెలిపితే వాటిని ముందుగా పరిచయం చేస్తాం.

~~~~~~~~~~~~~~~~~~~~~~

“సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా” అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.

“నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు.” చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.

“అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!”
పద్దెనిమిదేళ్ల పల్లెటూరు చెన్నమ్మ సీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది.
వుట్టి పాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంలో హొయలు లేవు. వొళ్లో పైట మరుగున పాలు తాగుతున్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్లోంచి జారి పోతూ కెవ్వు మంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.

* * * * *

నాయనా! నాకోక! దాపుడు కోక!
చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరుస్తున్నదో అర్థం కాకపోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఆడవాళ్ల సీట్ల వైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడి వున్నవాళ్ల తలల మధ్య నుంచీ నిక్కి చూస్తూ “యేంటమ్మా, యేంజరిగింది?” అన్నాడు. చెన్నమ్మకు వాళ్లనాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగుమింగుకుంటూ అవమానభారంతో పైటలాక్కుంటూ అంది.

“మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నాగుడ్డల మూటె- దాపుడు కోకున్న మూటె మర్చిపోయినా”

టిక్కెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్లనూ, మొరటువాళ్లనూ అదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్ చెన్నమ్మ అరుపులకు మండిపడ్డాడు. ‘కూచో’ అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు. గొర్రెపిల్లను రక్షించటానికి వచ్చిన గొర్లకాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలిమీద లేచాడు.

“యేందయ్యా మీ గోల. వూరిదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంది? ఆ మూటేదో తెచ్చుకునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మంట్లేదు. నీకోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డీయస్సీవా? బ్రేకినిస్పెక్టరువా?”

కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డీయస్సీ కాదు. బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు. బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.

“ఆమాత్రం జాగ్రత్త అఖ్కర్లా? ఆ మూటను యాడమర్చిపోయినావు? ఆ మాటెలో యేమున్నాయి?”

“మనూర్నుంచి వచ్చిన బస్సులో మర్చిపోయినా, అంత గుంపు దోసుకొస్తుంటే దిక్కుతెలీట్లేదు నాయనా? వూపిరాడక పిల్లోడు యేడ్చినాడు. తొందరగా దిగడంలో మర్చిపోయినా. దిగి మళ్లా ఆ బస్సులో యెదికితే దొరుకుతాదేమో?”

తండ్రి వైపూ, కండక్టరు వైపూ దీనాతిదీనంగా చూస్తూ, చుట్టూ వున్న వాళ్లను సిగ్గుతో చూస్తూ చెన్నమ్మ సంజాయిషీ చెప్పింది.

“యే బస్సులో యేం?” కండక్టరు కరిచాడు.

“కడబ్బస్సులో” చెన్నమ్మ బెరుకుగా సమాధానమిచ్చింది.

“పెద్ద పెద్దయి మర్చిపోయినోళ్లతో కూడా మాకిబ్బంది లేదు. మీరు మా దుంపదెంచుతారు – నానా రకాల మూటల్తో వచ్చి.”

తనేమిటో మర్చిపోయి కండక్టరు విసుక్కున్నాడు. కండక్టరు విసుక్కోకపోవడానికి చెన్నమ్మ ఖరీదైనది కాదు. సానుభూతితో పరామర్శించడానికి చెన్నమ్మ అందమైనది కాదు. మర్యాదగా మాట్టాడానికి చెన్నమ్మ బస్సు వోనర్లతో సంబంధముండే యే అధికారి భార్యా కాదు. బంధువూకాదు. బస్సులోని వారెవరో సానుభూతి ప్రకటించారు.

“పోనీలే పాపం, బస్సు నిలబెట్టు, వాళ్లు దిగుతారు. మూటె దొరుకుతుందేమో. అది నైటాల్టు బస్సేకదా? అక్కడే వుంటుంది.”

వీరయ్య కొంత ధైర్యం తెచ్చుకొని బ్రతిమాలాడు.

“నీకు పుణ్ణెముంటుంది. మా టిక్కెట్టు డబ్బులు వెనక్కి యిచ్చి యిక్కడ దించు. మూటె దొరికితే యేరే బస్సులో వస్తాం.”

“నీకేమన్నామతిబోయిందా? టికెట్టు రాసినాం. బస్సు వూరు దాటి రెండు మైళ్లొచ్చింది. యిప్పుడు టికెట్టు డబ్బులడుగుతావా? యింకా పొద్దుటూరు చేరినాకా అడగాలా? నీదేం బోయింది? యిట్లా అయితే మేమూ, మావోనరూ దివాలా తీయాల్సిందే.” కండక్టరు స్వామి భక్తిని ప్రకటించాడు.

వీరయ్య ప్రాధేయ పడ్డాడు. “మళ్లా రావడానికి డబ్బుల్లేవు. నీకు పున్నెముంటుంది. ఇక్కడే దించి డబ్బులీ, దిగిపోతాం బాబ్బాబూ”

“డబ్బుల్లేవు డబ్బుల్లేవు యిదొక తంతయింది. నీకేం మా చెకింగు పట్టుకున్నాడంటే నా ఉద్యోగం వూడ్తుంది. డబ్బు వాపసేమీ రాదు. కావాలంటే దిగండి.” కండక్టరు చీదరించాడు.

వీరయ్య కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. “దిగితే మళ్లా సార్జీలకు లేదు. పోతే పోనీలే మన కరమ.”

“నా దగ్గర మూడు రూపాయలుంది. సార్జీలకు సరిపోతాది. దిగుదాం”, చెన్నమ్మ కండక్టరు వైపు భయంతో చూస్తూ అంది.

కండక్టరు “దరిద్రపు రూటని” వదరుకుంటూ “హోల్డాన్” అని కేక వేశాడు. బస్సు ఆగింది. వీరయ్యా, చెమ్మన్నా దిగారు. చంకలోంచి జారిపోతున్న కొడుకును పైకి లాక్కుంటూ త్వరత్వరగా అడుగులు వేస్తూంది చెన్నమ్మ. వీరయ్య దిగులుగా అనుసరిస్తున్నాడు.

నాకోక
దాపుడు కోక
ముప్పయి రూపాయల కోక
పేటలో కొనుక్కున్న కోక
కలుపు తీయటానికి పోయి
నిమ్మసెట్లలో పాదులు తొవ్వటానికి పోయి
కట్టపడి డబ్బు కూడబెట్టుకుని
కొనుక్కున్న కోక
తనకెంతో ఇష్టమైన కోక
అరచేతి వెడల్పు నల్లంచు యెర్రకోక
మొగుడికి సానా యిష్టమైన కోక
యీ కోక కట్టుకుంటే సినిమాల్లో సావిత్రిలా వుంటావని మొగుడంటే
రోజూ కట్టుకోబుద్దయే కోక కానీ
వుతకలకు కట్టుకుంటే సిరిగి పోతుందని భయపడి
రోజూ కట్టుకోని కోక
పిల్లోడు పుట్నెప్పున్నించీ కట్టుకోని కోక
పిల్లోన్ని సంకలో యేసుకున్నప్పుడు వాడుచ్చలు పోస్తే పాడయిపోతాదని కట్టుకోని కోక
నలుగురూ మెచ్చుకున్న కోక
తన దాపుడు కోక
కరమ యెవడన్నా యెత్తకపోయినాడేమో!
పుట్టింట్లో అందరికీ సూపియ్యాలనుకున్నానే
తిరిగి వూరికి పోయినప్పుడు మొగుడేవంటాడోని
పుట్టింట్లో సెల్లెలికిచ్చి వచ్చినావని అరుస్తాడేమో!
ఆ కోకలేకపోతే
సినిమాలకు పోయేదెట్లా?
పండగలకెట్లా
రామేశ్వరం తిర్నాలకెట్లా?
పెండ్లిండ్లకెట్లా?
నలుగుర్లో తిరిగేదెట్లా?
మళ్లా కొత్తది కొనేదెట్లా?
ముప్పై రూపాయి కట్టం
సీరె కోసం కట్టంలో
నిమ్మ సెట్ల పాదులు తొలికెతో తొగీ తొగీ
సేతులు కాయలు కాసినాయి.

చెన్మమ్మ మనసు బాధతో నిండిపోయింది. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు. కష్టం తెలిసిన కన్నీళ్లు. పేద కోరిక కారుస్తున్న కన్నీళ్లు.

“సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా” అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.

“నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు.” చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.

“పిల్లోంతో నువ్వేం బాధ పడతావు గాని, అదిగో అక్కడుండు. నేను యెదికి తెస్తా.” వీరయ్య చెన్నమ్మను వో బంకు నీడలో వొక పక్కగా నిలబెట్టి బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సంతా వెతికాడు – సీటు సీటు పైనా కిందా – కన్పడలేదు. బస్సులో చెత్త వూడుస్తున్న కుర్రవాణ్ణి అడిగితే “అట్లాంటి మూటే కనపళ్లే”దన్నాడు. బస్సు దగ్గర వున్న వొకరిద్దర్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవరునూ, కండక్టరునూ అడుగుదామనుకున్నాడు. కానీ డ్రైవరు యింటికి పోయినాడట. కండక్టరు కలెక్షను డబ్బులు వోనరు కివ్వడానికి పోయినాడట – బస్సు క్లీనరు చెప్పాడు. వీరయ్య హతాశుడై తిరిగి వచ్చి కూతురును వోదార్చటానికి ప్రయత్నిస్తూ వేదాంతం చెప్పాడు.

“దొరకలా, యెంతెతికినా దొరకలా, యాడెతికినా దొరకలా, యెవర్నడిగినా దొరకలా, పొద్దున్నే యెవల్ల మొకం చూసి బయల్దేరినామో, మన కరమ, యేం సేస్తాం. యెవడో యెత్తకపోయినాడు. మనకంటే దరిద్దరం ముండా కొడుకు. అయినా మనలాంటోళ్లం జాగర్తగా వుండాల. యేందన్నా పోగొట్టుకుంటే తిరిగి సంపాయించుకునే గతి లేదు. పోతే పోనీలే వూరికి పోయినాక చూస్తాం”

బస్సులో పడిన అవమానాన్ని తలచుకుంటూ, నడిచి వచ్చిన శ్రమను అనుభవిస్తూ, మరొక చీర అట్లాంటి చీర – కొనలేం. దరిద్రాన్ని తలపోసుకుంటూ, అల్లుడేమనుకోకుండా అట్లాంటిదే మరొక చీరను కొని కూతురు కిచ్చే వుపాయాన్ని ఆలోచిస్తూ వీరయ్య కూతురును వోదారుస్తున్నాడు. అంతలో వాళ్లకు కొంచెం దూరంలో వొక తాగిన వాడు బండ బూతులు తిడుతూ తూలుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వాడి చేతిలో యేదో యెర్రటి బట్ట. వాని వెంట మరొకడు తరుముతూ వస్తున్నాడు.

“వొరే యెదవ నాకొడకా, యాడకు బోతావురా. గొంతుదాకా వుద్దర సారాయి తాగుదామను కున్నావా?”
సారాయి తాగిన వాడి చేతిలో వున్న వస్తువును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సారాయి తాగిన వాడు గట్టిగా పట్టుకున్నా, కొంత సడలి బట్ట అంచులు జారినాయి.

“నాయనా! అదిగో అదే నాకోక, నాదే ఆకోక, అదే నా దాపుడు కోక.”

చెన్నమ్మ తండ్రితో బిగ్గరగా చెప్పి వాళ్ల దగ్గరకు ఆదుర్దాతో పరుగెత్తుతోంది. వీరయ్య గాబరా పడుతూ వాళ్ల దగ్గరకు చేరాడు. వాళ్లింకా పెనుగులాడుతూనే వున్నారు. సారాయి తాగిన వానితో పెనుగులాడుతున్న వాడంటున్నాడు.

“రేయి నాదగ్గర టోకరా యేస్తావా? తాకట్టు పెట్టినట్టు పెట్టి పనికి రానివన్నీ నామీదేసి యీ కోక లాక్కొని పోతావా – నదురుగా వుందని. తాగిన పద్దరాములు సారాయైనా కక్కు, లేదా యీకోక నాకివ్వు. తోత యీరా దొంగ నాకొడకా”

“నాకోక, నాదే దాపుడు కోక మిగతా పిల్లోడి గుడ్డలూ అయ్యి యాడ్నో?” చెన్నమ్మ దీనంగా గొణుగుతోంది.
వీరయ్య వాళ్ల దగ్గరకు భయం భయంగా వెళ్లి అన్నాడు.

“యీ కోక మాయమ్మిది. బస్సులో మరిసిపోయింది.”

“అదే నేననుకుంటాండ, యా నాకొడుక్కు కోకెక్కడిదీ అని, బస్సులో కొట్టేసినాడన్నమాట! వొరేయి యిడవరా కోక.”

సారాయి తాగిన వాడు నంగి నంగిగా అన్నాడు “ర్రేయి నాసంగతి తెలీదా. యిడు. యిది నా కోక. నా పెండ్లాందిరా.”

యిద్దరూ గట్టిగా పెనుగులాడుతున్నారు. అరుపులు, తిట్లతో. వీరయ్య చీరను విడిపించడానికి తానూ ప్రయత్నించాడు. పెనుగులాటలో చీర పర్రున చిరిగింది. చెన్నమ్మ యెర్రకోక, నల్లంచు యెర్ర దాపుడు కోక చిరిగి పీలికలైంది. లభస యింకా ఎక్కువైంది. వాళ్లు కొట్టుకుంటున్నారు. వీరయ్య చిరిగిన చీర వంక నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు.

చెన్నమ్మ కలలకూ, ఆశలకూ, ప్రేమకూ, గర్వానికీ, ఆనందానికీ నిలయమైన దాపుడు కోకను, చెన్నమ్మ గుండెకు ప్రతిరూపమైన యెర్ర కోకను వాళ్లది కాని చెన్నమ్మకోకను వాళ్లు నిర్దాక్షిణ్యంగా చించి పారవేశారు. చెన్నమ్మ దాపుడు కోక పీలికలైంది.
“నా దాపుడు కోక”

చెన్నమ్మ కిందపడిన పీలికల్ని పట్టుకొని రోదిస్తోంది. చంకలో పసివాడు అమ్మ వెక్కిళ్లకు శృతి పెడుతున్నాడు.

* * * * *

కథాంతరంగం

నాకు నచ్చిన కథ అంటే చెప్పలేను. అయితే రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మగార్లు బాగా ఇష్టపడ్డ నా కథ ‘దాపుడు కోక’. యిందులో నూటికి నూరుపాళ్లు నా అభిప్రాయాలు ప్రతిఫలించకపోయినా చాలా మంది మెచ్చుకున్న కథ ఇది. మా ఊరు వెళ్లడానికి ఎర్రగుంట్లలో బస్సెక్కాను. అదే బస్సులో మా వూరి యాదవుల అమ్మాయి ఉంది. ఆమె తన చీరల మూటతో ఎక్కుతుండగా ఎవరో ఆమూటను దొంగలించారు. ఆమె చాలా హృదయవిదారకంగా ఏడ్చింది. ఈ సంఘటన నన్ను సుమారు పాతికేళ్లు వెంటాడింది. దీనినే 1972లో కథగా రాశాను. — కేతు విశ్వనాథ రెడ్డి

————————-

“కేతు విశ్వనాథ రెడ్డి” ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త మరియు పత్రికా సంపాదకుడు. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథ రెడ్డి కథలు (1993-2003) కథాసంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి, క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటినవల.

Posted in కథ | Tagged | 8 Comments

2009 అక్టోబరు గడిపై మీమాట

2009 అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

Posted in గడి | Tagged | 7 Comments

2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు

నా విద్యార్ధులు నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తోండేవారు… సులభంగా ప్రశ్నలిచ్చాననుకుంటే రాయలేక, కష్టంగా ఇస్తే బ్రహ్మాండంగా రాసి. గడి పూరకులు కూడా అలాగే ఆశ్చర్య పరుస్తున్నారు. ఈసారి గడిని ఎవ్వరూ సరిగా నింపలేకపోయారు. అలా అని కష్టంగా ఉందని కూడా ఎవరూ అన్నట్లు లేదు. కానీ తక్కువ తప్పులతో నింపినది మైత్రేయి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు. ఆతర్వాత మైత్రి, జ్యోతిగార్లు. ఇతర ఔత్సాహికులు శ్రీలు, సుధారాణి పట్రాయని, భమిటిపాటి సూర్యలక్ష్మి, స్వాతి శ్రీపాద మరియు స్వాతి గార్లు.

వర్ణక్రమ దోషాలు పట్టించుకోలేదు, పున్నమి, పౌర్ణమి లాంటి పదాలని ఒకటిగా పరిగణించాం. కాకిణి (ఇది ఒక తూనిక యూనిట్) అందరినీ ఇబ్బంది పెట్టింది. అంతకీ గడిలో బంగారం తూచడానికే వాడాం. బంగారం ధర ఎక్కువగా పెరగడంవల్ల రమణులెవ్వరూ తూచలేకపోయారు. ముస కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టినట్లుంది. ఈవివరణలు చూసాకా నామీద ముసముస లాడరనిఆశిస్తన్నా. దీపావళి శుభాకాంక్షలతో

సత్యసాయి కొవ్వలి

1

2 కా

3ది

ము

ను

4 లు

X

5

కి

6 లిం

7

X

8 సా

X

X

9 కే

10 రి

X

11 డా

డి

12

13

రం

X

14 పౌ

ర్ణ

మి

X

15

16

X

X

17 ము

X

18

X

X

యా

X

19

ణి

20 ద్వీ

21 పం

X

22 బో

23 నా

24 ర్వం

X

25 మా

X

26

చె

27బ్లా

టింగ్

పే

పర్

X

28

29 ము

రు

30

X

31 సం

చీ

గు

X

రు

X

32 స్వా

మి

ర్ధ

X

33 చా

34

35

X

36

తి

ధ్య

X

37 వా

ము

38 కా

రం

X

39

40

X

చి

X

41 కు

ను

X

కి

X

X

42మా

కం

దం

X

43 ను

44 వ్వు

లు

X

45

ణి

46 మా

47

హా

X

క్ష

X

48 కు

49 థా

X

X

50 పి

రం

X

51 యం

త్రా

లు

X

52 కో

తి

కొ

మ్మ

చ్చి

X

అడ్డం వివరణలు

1 సనకాదిమునులు

నస పెడతారా, మౌన సజ్జనులు వంటి ఆధారాలతో దినములు కాసను లోని అక్షరాలని క్రమం లో పెట్టి చూడండి.

5 సకిలింత

గుర్రం అరుపు (గురగుర) ని సకిలింత అంటారు కదా. ఆవలింత అని రాసి సూచించాం.

8 సాన

కత్తులు చాలా (గ్రామ్యంలో సాన) పదును పెట్టడం అంటే సాన పెట్టడమే కదా.

9 కేసరి

హనుమంతుడికి తండ్రి, ఒక మధుర పదార్థం రవ్వ కేసరి కీ, కుంకం కేసరిపువ్వు లకి లంకె కేసరి కదా

11 డాడి

ఆంగ్ల పిత డాడి కదా

12 స మ రం

యుధ్ధానికీ, శృంగారానికీ సంధానం సమరమే కదా

14 పౌర్ణమి

గురుచంద్రుల (దత్తస్వామిది, వ్యాసుడు, గురునానక్ వంటి గురువుల) జన్మతిథి పౌర్ణమే కదా

15 గధ

ఈగాడిద వెనక్కాళ్ళతో తంతే ..తిరగేయమని సూచన, . ధగ ధగ మెరుపు అంటాంకదా, ధగ తిరగేస్తే గధ .. హిందీ లో గాడిద కదా

17 ముర

కృష్ణుడు చంపినది ముర అనే అసురుడిని, చంద్రగుప్తుడి తల్లి ముర

19 మ ణిద్వీపం

తొమ్మిది ప్రాకారాల (నవావరణాలు) ఉన్న దేవి నివాసం మణిద్వీపం

22 బోనా ల పర్వం

బోనాల పండుగని బోనాల పర్వం అని రాయాలని భాషలు మారిన భోజనాల పండుగ అని సూచించాం

26 రపచె

దుప్పటి పరవమంటే చేసె అంటే పరచె (చేసె అని ఉంది కదా). అస్తవ్యస్తం అనడం వల్ల అక్షరాల నటూనిటూ చేయాలని భావం

27బ్లాటింగ్పేపర్

ఇంగ్లీషు వాడి ఇంకు పీల్చే కాగితం అంటే బ్లాటింగ్పేపర్ అని వేరే చెప్పాలా

28 సము రుఅ

హర్షాన్ని అరుసము అని కూడా అంటారు. అంత తబ్బిబ్బవాలా అనడం వల్ల అక్షరాలు తారుమారయ్యాయని భావం

31 సంచీ

సంచీ ఉంటే కదా కూరలూ, సరుకులూ తేగలిగేది

32 స్వామిసమర్ధ

అక్కలుండని కోటలో (అక్కలకోట) అక్కలకీ, అన్నలకీ దిక్కయ్యే సామర్థ్యం ఉన్న ఈ పెద్దాయనుంటాడు అంటే స్వామి సమర్ధ అని.

33 చార

గీతలని చారలంటాం కదా

34 లగ

లగలగలగ అని అని చూడండి గలగలలే

36 ఆతిధ్య

కన్నడావాళ్ళు చివరలో అకారాంతాలు వాడతారు. ఆతిథ్యం వాళ్ళ పడికట్టులో ఆతిథ్య అవుతుంది.

37 వాముకారం

వాముకారం తెలుగువాళ్ళకి బాగా తెలిసిందే కదా

39 స మత

మత అంటే సమానత్వ.

41 కును

కు మళ్ళీ వస్తే కునుకు అవుతుంది కదా

42మాకందం

మాకందం అంటే మామిడి అని.

43 నువ్వులు

నువ్వులొదిలేయడం అన్నది ఒక జాతీయం కదా

45 మణిమాల

హారం అంటే మాల ..ప్రియమణి అని ఇవ్వడం వల్ల మణిమాలని సూచనగా చెప్పాం

48 కులకథా

కులకథలు మనకితెలిసినవే

50 పిత

11 అడ్డం డాడి కానీ తెలుగాయన అనడం వల్ల పిత అని సూచన

51 యంత్రాలు

సాయంత్రాలే కాదు 24 గంటలూ కార్మికుల చేతిలో నలగ్గలవి యంత్రాలు కదా

52 కోతికొమ్మచ్చి

రాధాగోపాలీయుడు (ముళ్ళపూడి వెంకటరమణ) ఈమధ్యన స్వాతి వార పత్రిక లో రాస్తున్నది కోతీ కొమ్మచ్చి అన్న శీర్షికతో. బ్రహ్మచారీ శతమర్కటః ..సంసారీ ఏకమర్కటా అనడంద్వారా శీర్షిక పేరు సూచించాం.

నిలువు వివరణలు

1 సరసము

రసపట్టు (సరసం) లో తర్కం కూడదని ఉందికానీ రచయితల సంఘం (రసం) ఉండకూడదని లేదే

2 కాసా రం

చెరువు (=కాసారం) లో దిగితే కారం పెడుతుందా

3 దిన

రోజు (దినం) ని తలపింపచేసే సంగీత దర్శకుడు

4 లుకేమి యా

కంటిచూపుతో చంపగల హీరోలు లుక్కేసి కేన్సరు తెప్పించలేరా మియాజాన్ .. దట్టంగా ఉన్న అక్షరాలు చూడండి

5 సరిగమ

ప్రియుడు సంగీతమైతే ఈనాలుగింటి తర్వాత ప్రియురాలు నాట్యం చేస్తే వచ్చేవి గాజుల గలగలలే కదాసరిగమలూ, గలగలలూ అన్నకొత్తజీవితాలు సినిమా పాట గుర్తొచ్చిందా?

6 లిండా

ఎన్నిరాశుల (సన్సైన్లు) పుణ్య ఫలమో ఈ గుడ్మేన్ ఒక అమ్మాయి .. లిండా గుడ్మేన్ పేరు గుర్తొచ్చుండాలే

7 తడి

త్తడి, తడి, పుత్తడి, తడిలోని చివరి పార్శ్వాన్ని తడిమాయి .. బోల్డక్షరాలుచూడండి.

13 మ రబోటింగ్

యంత్రం (మర) తో నడిచే బోటు లో విహరించడం (బోటింగ్). తెలుంగ్లీష్ ప్రక్రియ అంటే రెండు భాషలూ పదంలో ఉన్నాయని

16 ధ ణిర

కొండ భూమికి భారమా (ధరణికి గిరి భారమా అన్నపాట నోట్లోఆడుండాలే) అని పాడడానికి ముందు బాగానే ఉంది కానీ చివరికి భారమేననిపిస్తోంది ఈమార్పులు (పదం అటూ ఇటూ అయ్యిందని సూచన) చూస్తే (3)

18 స లపర్

గంధకం అనడం చేతకాక గనదగం అనడం ఫేషన్ అయిపోయింది. ఇంగ్లీషు (సల్ఫర్) లో కూడా దీన్నలాగే పలుకుతారా…. గనదగం మూసలో రాస్తే సలపర్ అవుతుందికదా.

20 ద్వీపసంచారం

19 అడ్డం (మణిద్వీపం) లో తిరగడాన్ని (సంచారం) ఇలాగే అంటారు మరి

21 పంచెచీర

మగ (పంచె) ఆడ కట్టు బట్ట (చీర) పక్క పక్క

23 నాపేరు

బికారి కాదు సత్యసాయి నాదారి ఎడారీ కాదు .. నాపేరు బికారి, నా దారి ఎడారి పాట గుర్తొచ్చిందా

24 ర్వం సమిధ్య

ఇది మిథ్య, అది మిథ్య .. పైది, కిందదీ కూడా. వెరసి తాఅం (అంతా నితిరగేస్తే) మిథ్య అంతా అంటే సర్వం

25 మా రుమవాను

మొదలంతా ఊరుకుని మళ్ళీ పెళ్ళా (మారుమనువా) అని పెళ్ళి ముహూర్తానికి చివరొచ్చి తడబడతావేం (చివరి అక్షరాలు తిరగేయాలనిసూచన)

27బ్లా గులసమాహారం

తెలుగింటి కూడలి కూడలి డాట్ ఓఆర్జీ చూడండి తేలిసిపోతుంది

29 ముస

కోపం వచ్చి ఇది రెండు సార్లాడితే (ముసముస లాడడం) పంది అరుపు (ముస) లా వినిపిస్తుందిట (2)

30 అర్ధము

సగం, ధనం రెండూ అర్ధం.

32 స్వాతిచినుకులు

స్వాతి వాన చినుకులు ముత్యం చిప్పలలో పడి ముత్యాలు అవుతాయనికదా నమ్మకం

35 గ మకం

మన సంగీతం వినడంలో తమకం కలిగించే వణుకు

38 కాకిణి

బంగారం ఇవ్వడానికి అలా కాకి గోల చేస్తావేంటి రమణి 10 చిన్నమెత్తులు కాకిణి అవుతుంది.

40 తదంక్షయం

కాల్గేట్ వాడినా కూడా నమిలే పళ్ళ(దంతం) వెనుక (తిరగేయమని సూచన) దాక్కుని ఉంటుందా ఇది కాల్గేట్ యాడ్ చూసారా.

41 కులుకకో

కదలకుండా నడవవో (కులుకకో) అంటే కులుకులాడి ఊరుకుంటుందా.. అయినా చెప్పి చూద్దాం

44 వ్వుల

ఇంగ్లీషు దొరసాని ప్రేమలో (లవ్వు) పడితే జీవితం తలకిందుల్చేసేస్తుంది (తిరగేయమని సూచన)

46 మాపిచ్చి

ముని మాపు వేళిచ్చి పగలిమ్మంటే మీరేం చేస్తారు మాపిచ్చిగానీ వేరే చెప్పక్కర్లేదనుకుంటా

47 లత

తెన్నేటి బంగారు (హేమ) తీగె (లత) చిన్నగా(పేరు పూర్తిగా రాయక్కర్లేదని సూచన) ఇలా కిందికి పాకింది

49 థాతి

ఈరోజు ఏంటి .. తిథి.. విదియా, తదియా అని అడిగితే ఈరోజుదా అని అలా తలకిందులై (తిరగేసి రాయాలని అంటే .. థాతి) తెల్లబోతావేంటి? (తిథా)

Posted in గడి | Tagged | Comments Off on 2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు

మృతజీవులు – 28

-కొడవటిగంటి కుటుంబరావు

ఏడవ ప్రకరణం

ముసలాయన కళ్లుపైకెత్తి , తాపీగా, “క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడకాదు,” అన్నాడు.

“మరెక్కడ?”

“క్రయశాఖలో.”

“ఆ క్రయశాఖ ఎక్కడున్నది?”

“ఇవాన్ అంతో నవిచ్ బల్ల దగ్గిర.”

“ఇవాన్ అంతో నవిచ్ ఎక్కడ?”

ముసలాయన మరొక మూలగా వేలు విసిరాడు. చిచీకవ్, మానిలవ్ లు ఇవాన్ అంతోనవిచ్ దగ్గిరికి వెళ్లారు. ఇవాన్ అంతోనవిచ్ అప్పటికే ఒక్కసారి వెనక పక్క చూసి, క్రీగంట వారి కేసి చూసి మరుక్షణం తాను చేస్తున్న రాత పనిలో పరిపూర్ణంగా నిమగ్నుడై పోయాడు.

“కమతగాళ్ల కొనుగోలు వ్యవహారాలు చూసేది ఈ బల్ల వద్దనే నేమో దయచేసి తెలుపుతారా?”

ఇవాన్ అంతోనవిచ్ కి ఈ ప్రశ్న వినపడ్డట్టే లేదు. ఆయన జవాబు చెప్పకుండా తన కాగితాలలో ముణిగి పోయాడు. ఈయన అనుభవశాలి అనీ, కుర్ర గుమాస్తాల లాగా అతివాగుడూ, మంద బుద్ధీ కలవాడు కాడనీ చూడగానే తెలిసిపోతున్నది. ఇవాన్ అంతోనవిచ్ వయసు నలభైకి పైబడ్డట్టు కనబడింది. ఆయన జుట్టు నల్లగానూ, దట్టంగానూ ఉన్నది. ఆయన ముఖాంగాలు స్ఫుటంగా ఉండి ముక్కు వద్దకు దారితీస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ముఖం “కూజా మూతి” అని వర్ణించబడే లాటిది.

“దయచేసి చెప్పండి, కమతగాళ్ల కొనుగోలు వ్యవహారాలు చూసేది ఇక్కడేనా?” అన్నాడు చిచీకవ్.

కూజామూతి తిప్పి ఇవాన్ అంతోనవిచ్ “అవును” అన్నాడు. కాని తన రాతమాత్రం మానలేదు.

“అయితే నేను వచ్చిన పని వినండి. నేను ఈ జిల్లాలో అనేక మంది భూస్వాముల వద్ద కమతగాళ్లను కొన్నాను. క్రయదస్తావేజు ఇదుగో, మిగిలిన వ్యవహారాలు పూర్తి చెయ్యటమే తరువాయి.”

“అమ్మేవాళ్లు హాజరులో ఉన్నారా?”

“కొందరు హాజరులో ఉన్నారు, మిగిలిన వాళ్లు నాకు అధికార పత్రాలిచ్చారు.”

“దరఖాస్తు తెచ్చారా?”

ఆ గదిలో ఒక విశాలమైన కుర్చీ మీద అధ్యక్షుడు సూర్యుడిలాగా ఏకాంతంగా కూచుని ఉన్నాడు. ఆయన ముందున్న బల్ల మీద రెండుతలలగద్ద (జారుసామ్రాజ్య చిహ్నం), రెండు లావుపాటి పుస్తకాలూ ఉన్నాయి.
…..
వారు లోపలికి అడుగుపెట్టగానే అధ్యక్షుడు ఒంటరిగా లేడనీ జంట తలల గద్ద చాటున సబాకివిచ్ కూచుని వున్నాడనీ తెలియవచ్చింది.

“దరఖాస్తు కూడా ఉన్నది. అందుకని నేకోరేది… కాస్త తొందరలో ఉన్నాను… అందుచేత, మాటవరసకు, ఈ వ్యవహారం ఇవాళ పూర్తి అయే అవకాశం ఉన్నదా?”

“ఇవాళ !… ఇవాళ కాదు. విచారణ జరిపి, ప్రతిబంధకాలేమైనా ఉన్నాయేమో చూడాలి,” అన్నాడు ఇవాన్ అంతోనవిచ్,

“అధ్యక్షులు ఇవాన్ గ్రెగోర్యెవిచ్ నాకు ఆప్తమిత్రుడంటే ఒక వేళ పనితొందరగా అవుతుందేమో…”

“ఇవాన్ గ్రెగోర్యెవిచ్ ఒక్కరితో కూడిన పని కాదే. ఇంకా చాలామంది ఉన్నారు,” అన్నాడు ఇవాన్ అంతోనవిచ్ మొరటుగా. ఇవాన్ అంతోనవిచ్ సూచన గ్రహించి,

“ఇతరులకు నష్టం కలుగబోదులెండి. నేను ఉద్యోగం చేసిన వాణ్ణే, వ్యవహారకాండ నాకు తెలుసు,” అన్నాడు.

ఇవాన్ అంతోనవిచ్ కొంచెం మెత్తబడి, “ఇవాన్ గ్రెగోర్యెవిచ్ వద్దకు వెళ్ళి ఆర్డరు వేయించుకోండి. మాచేతిలో ఏమీలేదు,” అన్నాడు.

చిచీకవ్ జేబులోనుంచి ఒక నోటు తీసి ఇవాన్ అంతోనవిచ్ కెదురుగా ఉంచాడు. ఆయన దాన్ని చూడనైనా చూడకుండా దాని పైన ఒక పుస్తకం పెట్టాడు. చిచీకవ్ ఆయనకు దాన్ని గురించి హెచ్చరిక చేయబోయాడు, కాని ఆయన తల ఆడించి హెచ్చరిక అవసరం లేదన్నట్టు సూచించాడు.

“ఇడుగో, ఇతను మీకు ఆఫీసు చూపిస్తాడు,” అంటూ ఇవాన్ అంతోనవిచ్ తలవిసిరి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని సూచించాడు. ఈ న్యాయదేవతార్చకుడు ఎలాటి త్యాగాలు చేశాడో ఏమోగాని, ఆయన మోచేతి వద్ద కోటు చిల్లులుపడి లోపలి లైనింగ్ కనిపిస్తున్నది. ఈ త్యాగానికి బహుమానంగా ఆయనకు చర్చి రిజిస్ట్రారు పదవి ఇచ్చారు. వెనుకటికి డాంటీని వర్జిల్ తీసుకుపోయినట్టుగా ఈ వ్యక్తి మన మిత్రులను ఒక గదికి తీసుకుపోయాడు. ఆ గదిలో ఒక విశాలమైన కుర్చీ మీద అధ్యక్షుడు సూర్యుడిలాగా ఏకాంతంగా కూచుని ఉన్నాడు. ఆయన ముందున్న బల్ల మీద రెండుతలలగద్ద (జారుసామ్రాజ్య చిహ్నం), రెండు లావుపాటి పుస్తకాలూ ఉన్నాయి. ఈ కొత్త వర్జిల్ ఈ గది అంటే ఎలా బెదిరిపోయాడంటే ఆయన లోపలికి అడుగుపెట్ట సాహసించలేదు. ఆయన వెనక్కు తిరిగేసరికి ఆయన కోటు వీపు దాళ్ళుపడి చాపలాగా ఉన్నది. అందులో ఒక కోడి ఈక చిక్కుకొని ఉన్నది. వారు లోపలికి అడుగుపెట్టగానే అధ్యక్షుడు ఒంటరిగా లేడనీ జంట తలల గద్ద చాటున సబాకివిచ్ కూచుని వున్నాడనీ తెలియవచ్చింది. అతిథులు రావటం చూసి అధ్యక్షులు పెద్దగా ఆశ్చర్యం ప్రకటించి, ఎంతో చప్పుడయేలాగా తన కుర్చీ వెనక్కుతోసి లేచాడు. సబాకివిచ్ కూడా లేచి నిలబడి, అన్ని వైపులనుంచీ దర్శనమిచ్చాడు. అధ్యక్షుడు చిచీకవ్ ను ఆలింగనం చేసుకున్నాడు; గది ముద్దులతో మారు మోగింది. ఇద్దరూ పరస్పర క్షేమసమాచారాలు అడుక్కున్నారు. ఇద్దరూ నడుమునొప్పితో బాధపడుతున్నట్టు స్పష్టమయింది. తిని కూర్చోవటం వల్లనే అది కలిగిందని నిర్ధారణ చేసుకున్నారు. అమ్మకం గురించి అధ్యక్షుడితో సబాకివిచ్ అదివరకే చెప్పేసినట్టుంది; అధ్యక్షుడు మన కథానాయకుణ్ణి అభినందించాడు. చిచీకవ్ కు కొంచెం బిడియం వేసింది; ఎందుకంటే, తాను ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గిర క్రయం చేసిన పెద్దమనుషులిద్దరూ ఇప్పుడు ఒక చోటనే ఉన్నారు. అతను అధ్యక్షుడికి తన కృతజ్ఞత తెలిపి, సబాకివిచ్ కేసి తిరిగి “మీరెలా ఉన్నారు?” అన్నాడు.

“దేవుడి దయవల్ల నాకే జబ్బూ లేదు” అన్నాడు సబాకివిచ్. నిజంగా ఆయనకే రోష్టూ లేదు కూడానూ. ఇనుముకైనా శైత్యభారం చేసి దగ్గు పట్టుకోవచ్చుగాని, ఆయన శరీరతత్వం అద్భుతమైనది.

“అవును; మీ ఆరోగ్యం లోక ప్రసిద్ధం. మీ నాన్న గారు కూడా మీలాగే గట్టి మనిషి” అన్నాడు అధ్యక్షుడు.

“అవును; ఆయన ఎలుగుబంటికి జవాబు చెప్పేవారు” అన్నాడు సబాకివిచ్.

“మీరైనా ఎలుగుబంటిని ఒంటరిగా పడగొట్టగలరనుకుంటాను-తలచుకుంటే” అన్నాడు అధ్యక్షుడు.

“లేదు, నావల్ల కాదు. మా నాన్నగారు నాకంటె బలశాలి,” అని ఒక్క నిట్టూర్పు విడిచి సబాకివిచ్, “అబ్బే, ఈనాటి వాళ్ళు వెనకటి వాళ్ళకి తీసికట్టే; మాటవరసకి, నా
జీవితం తీసుకోండి. ఏమున్నాదందులో…?” అన్నాడు.

“మీ జీవితానికే మొచ్చింది?” అన్నాడు అధ్యక్షుడు.

సబాకివిచ్ తల అడ్డంగా తిప్పుతూ, “అంతా లోటే, అంతా లోటే! మీరే చెప్పండి, ఇవాన్ గ్రెగోర్యెవిచ్. నాకు యాభై ఏళ్ళు, నా జన్మలో జబ్బు చేసి ఎరుగను; కనీసం ఏ గొంతునొప్పో, నెత్తురుగడ్డో, రాచపుండో వచ్చి ఉండకూడదూ?… ఇది నా మంచికి రాలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇందుకు అనుభవించక తప్పదు” సబాకివిచ్ పెద్ద విచారంలో మునిగిపోయాడు.

“ఏం మనిషి!” అనుకున్నాడు చిచీకవ్. “ఇంకా దేనికి గునుస్తాడో?’ అనుకున్నాడు అధ్యక్షుడు.

“నేను తమకొక ఉత్తరం తెచ్చాను” అంటూ చిచీకవ్ ప్ల్యూష్కిన్ ఉత్తరం జేబులోనుంచి తీశాడు.

“ఎవరి దగ్గిరనుంచి?” అంటూ అధ్యక్షుడు సీలుతీసి, “ఓహో, ప్ల్యూష్కిన్ నుంచా! అయితే యింకా కరుడుగట్టి బతికేవున్నాడన్న మాట. ఏం గ్రహచారం! ఒకప్పుడెంత తెలివిగలవాడు, ఎంత సంపన్నుడు! ఇప్పుడు…” అన్నాడు.

“వాడు కుక్క, లుచ్ఛా! కమతగాళ్ళందర్నీ తిండికి మాడ్చి చంపేశాడు” అన్నాడు సబాకివిచ్.

“నిరభ్యంతరంగా, నిరభ్యంతరంగా! అతని తరపున వ్యవహరిస్తాను. ఈ క్రయం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడా, తరవాతనా?” అన్నాడు అధ్యక్షుడు ఉత్తరం చదివి.

“ఇప్పుడే. సాధ్యమైతే, ఇవాళే పని పూర్తి చేయించమని కూడా తమర్ని వేడుకుంటాను; ఎందుకంటే, రేపు నేను వెళ్ళిపోతున్నాను. దస్తావేజులూ, దరఖాస్తూ పట్టుకొచ్చాను” అన్నాడు చిచీకవ్.

“దానికేమీ అభ్యంతరం లేదు. కాని మీరు ఏమైనా చెప్పండి; మేం మిమ్మల్ని ఇంతట్లో వెళ్ళనిచ్చేది లేదు. ఈ వ్యవహారం ఇవాళ పూర్తి అవుతుంది. అయినా, మీరు మాతో కొంతకాలం ఉండాలి.ఇప్పుడే అర్డరు రాసేస్తాను” అంటూ ఆయన ఒక గది తలుపు తెరిచాడు. ఆ గదినిండా గుమాస్తాలున్నారు. వాళ్ళను తుట్టెలో పనిచేసే తేనెటీగలలో పోల్చవచ్చు- తేనె తుట్టెలకూ, కోర్టు వ్యవహరాలకూ పోలికే ఉండాలి గాని.

“ఇవాన్ అంతోనవిచ్ ఉన్నాడా అక్కడ?”

“అవును, ఉన్నాడు” అని అవతలినుంచి జవాబు వచ్చింది.

“దయచేసి ఇక్కడికి పంపండి.”

“కూజామూతి” ఇవాన్ అంతోనవిచ్ తో పాఠకుడికి అదివరకే పరిచయమయింది. అతను అధ్యక్షుడి గది ప్రవేశించి వినయంగా వంగాడు.

“ఇదిగో, ఇవాన్ అంతోనవిచ్, ఈ క్రయ దస్తావేజులన్నీ తీసుకుని…”

సబాకివిచ్ అడ్డం వచ్చి, “ప్రతి దస్తావేజుకూ కనీసం ఇద్దరేసి సాక్షులుండాలన్నది మరచిపోవద్దు, ఇవాన్ అంతోనవిచ్. ప్రాసిక్యూటరుకు కబురుపెట్టు. అతడికి పనేమీ లేదు, బహుశా ఇంటోనే ఉంటాడు. అతని పని యావత్తూ ముక్త్యారు జలతూల చేసి పెడతాడు-అంత దురాశాపరుడైన దుర్మార్గుడు మరి పుట్టబోడు! మెడికల్ బోర్డు ఇన్‌స్పెక్టరుక్కూడా పనేమీ లేదు, ఇంటి దగ్గిరే ఉండవచ్చు, పేకాటకు వెళితే ఏమోగాని. ఇంకా దగ్గిర్లో చాలామంది ఉన్నారు, త్రుఖాట్చవ్ స్కీ, బ్యెగూష్కిన్-భూభారమేగాని, పని ఏమీ లేని వాళ్లు!” అన్నాడు.

“అలాగే, అలాగే” అంటూ అధ్యక్షుడు, వారందరినీ పిలుచుకు రావటానికి మనిషిని పంపాడు.

“నేను మిమ్మల్ని మరొకటి కూడా కోరాలి. నేనింకొక స్త్రీ వద్ద కూడా క్రయం చేశాను, ఆవిడ వకాల్తా గల మనిషి, పెద్ద ప్రీస్టు ఫాదర్ కిరిక్ కుమారుడు, ఇక్కడే ఉన్నాట్ట” అన్నాడు చిచీకవ్.

“అవశ్యం. ఆయనను కూడా పిలిపిద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది. మీ పుణ్యం ఉంటుంది, గుమాస్తాలకు మామూళ్లివ్వకండి. నా స్నేహితులకు మామూళ్లు లేవు” అంటూ అధ్యక్షుడు ఇవాన్ అంతోనవిచ్ కి ఏదో ఉత్తరువిచ్చాడు, అది ఆ పెద్దమనిషికి నచ్చినట్టు లేదు. ఈ కమతగాళ్ల కొనుగోలు అధ్యక్షుడి ప్రాణానికి ఘనంగా కనిపించింది, ముఖ్యంగా ఆయనను అకర్షించినది లక్ష రూబుళ్లకు చేరబడిన కొనుగోలు మొత్తం. అయన చిచీకవ్ మొహం కేసి కొంతసేపు తృప్తిగా చూసి,”సాధిస్తే అలా సాధించాలంటాను, పావెల్ ఇవానవిచ్! మొత్తంమీద గట్టిపనే చేశారు!” అన్నాడు.

“నది ఉన్నది. చెరువుకూడా ఉందిమరి” అంటూ చిచీకవ్ సబాకివిచ్ మొహం కేసి చూశాడు. ఆయన మొహంలో ఏ మార్పూ లేకపోయినప్పటికీ అది, “అబద్ధాలాడుతున్నావు, అక్కడ నదీ లేదు, చెరువూ లేదు, అసలు భూమీ లేదు!” అంటున్నట్టుగా ఉన్నది.

“చేశాను మరి!” అన్నాడు చిచీకవ్.

“భేషైనపని, నిజంగా భేషైనపని.”

“అవును. ఇంతకన్న మంచిపని చెయ్యలేనని నేనే ఎరుగుదును. ఏమైనా మనిషి యొక్క ఆశయాలు స్పష్టంగా ఉండవు, ఏదో ఒక గుర్తు చూసుకుని పట్టుదలగా నిలబడాలి, అంతేగాని పసితనపు ఊహాపోహలను బట్టి పోరాదు.”

ఇలా అని అతను అవకాశం పురష్కరించుకుని యువకుల విశాల దృక్పథాన్ని గట్టిగా తిట్టేశాడు -అందులో అక్రమం ఏమీలేదు కూడానూ, కాని గమనించదగిన సంగతి ఏమిటంటే, మాట్లాడుతున్నంత సేపూ అతని మాటలలో దృఢమైన నమ్మకం లేదు, “ఒరే, అబ్బీ, అబద్ధాలాడేస్తున్నావు, జోరుగా ఆడేస్తున్నావు!” అని తనలో తాను అనుకుంటున్నట్టుగా ఉన్నది.

చూస్తే వారి మొహాలలో ఏం కనపడిపోతుందో అన్న భయంతో అతను సబాకివిచ్ కేసిగాని, మానిలవ్ కేసిగాని చూడలేదు. అయితే అతని భయానికి తావులేదు. సబాకివిచ్ ముఖంలో సంభాషణకు ముగ్ధుడైపోయి, గాయనీమణి ఫిడేళ్లతో పోటీపడి ఉచ్ఛస్థాయిలో పిట్టకన్న హెచ్చు స్వరం పలికించినప్పుడు సంగీతాభిలాషి అయిన యువకుడు ఆడించినట్టుగా, తల ఆడించసాగాడు.

“ఇంతకూ మీరు కొన్నది ఎలాటివాళ్లను ఇవాన్ గ్రెగోర్యెవిచ్ కి చెప్పరేం? ఎలాటి మనుషులను సంపాదించారని మీరైనా అడగరేం, ఇవాన్ గ్రెగోర్యెవిచ్? వాళ్లూ కమతగాళ్లంటే! రత్నాలు! మా బళ్లు తయారుచేసే మిఖేయెవ్ ని అమ్మాను తెలుసా?” అన్నాడు సబాకివిచ్.

“మీ మిఖేయెవ్ నే అమ్మేశారా? నేను మిఖేయెవ్ ని ఎరుగుదును, మంచి పనివాడు. వాడు నా చిన్నబండిని బాగుచేసి పెట్టాడు… అదేమిటి, వాడు పోయాడని చెప్పారే…”

“ఎవరు? మిఖేయెవ్ పోయాడా? పోయింది వాడి అన్న, వాడికేం వాడు పిడిరాయిలాగున్నాడు, ఇంకా మరింత బాగున్నాడు. ఆ మధ్య నాకు ఒక బండి చేసి పెట్టాడు. మాస్కోలో అలాటి బండి చెయ్యలేరు. వాడు నిజంగా జారు దగ్గర పని చెయ్యవలసిన మనిషి” అన్నాడు సబాకివిచ్ కొంచెం కూడా కంగారుపడక.

“అవును, మిఖేయెవ్ పనిమంతుడు. వాణ్ణి ఎలా పోనిచ్చారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు అధ్యక్షుడు.

“ఒక్క మిఖేయెవే అయితే బాగానే ఉండును! నా వడ్రంగి స్తిపాన్ ప్రోచ్కి. ఇటుకలు చేసే మిలూష్కిన్, బూట్లు కుట్టే మక్సీమ్ తిల్యాత్నికవ్ – అందరూ వెళ్లిపోయారు. అందర్నీ అమ్మేశాను,” అన్నాడు సబాకివిచ్. వీళ్లందరూ ఎస్టేటుకు అవసరమైన పనులుచేసే వాళ్లేగదా, ఎందుకమ్మేశారని అధ్యక్షులు అడిగితే, “ఏం చెప్పమన్నారు. నా బుద్ధి తక్కువే. ‘పోనీ అమ్మేద్దాం’; అనుకున్నాను. బుద్ధి తక్కువై అమ్మేశాను!” అంటూ విచారగ్రస్తుడిలాగా తలవం చేసి, “నా జుట్టు నెరుస్తున్నదేగాని, ఇంకా బుద్ధి రాలేదు,” అన్నాడు.

“అయితే చూడండి. పావెల్ ఇవానవిచ్. మీరు భూమి కొనకుండా కమతగాళ్ళను ఎందుకు కొంటున్నారూ? వాళ్లను మరెక్కడికైనా తరలిస్తారా?”

“అవును.”

“అలా అయితే ఫరవా లేదు. ఏ ప్రాంతానికీ?”

“ఖెర్సోన్ రాష్ట్రానికి.”

“ఓ అక్కడ బంగారం వంటి భూమి!” అంటూ అధ్యక్షుడు ఆ ప్రాంతంలో నవనవలాడుతూ పెరిగే గడ్డిని వర్ణించి, “చాలినంత భూమి సంపాదించారా?” అన్నాడు.

“ఆ నేను కొన్న కమతగాళ్లకు సరిపడినంతా ఉన్నది.”

“అక్కడ నదిగాని, చెరువుగాని ఉందా?”

“నది ఉన్నది. చెరువుకూడా ఉందిమరి” అంటూ చిచీకవ్ సబాకివిచ్ మొహం కేసి చూశాడు. ఆయన మొహంలో ఏ మార్పూ లేకపోయినప్పటికీ అది, “అబద్ధాలాడుతున్నావు, అక్కడ నదీ లేదు, చెరువూ లేదు, అసలు భూమీ లేదు!” అంటున్నట్టుగా ఉన్నది.

సంభాషణ జరిగే సమయంలో సాక్షులు ఒకరొకరే వచ్చారు. వారిలో పాఠకుడికి పరిచయంగల ప్రాసిక్యూటరూ, మెడికల్ బోర్డు ఇనస్పెక్టరూ, త్రుఖాట్చెవ్ స్కీ, బ్యెగూష్కిన్, భూభారమని సబాకివిచ్ నిర్వచించిన ఇతరులూ ఉన్నారు. వారిలో కొందరిని చిచీకవ్ ఎరగడు. సంఖ్య భర్తీకావటానికి ఆఫీసు గుమాస్తాలను కూడా చేర్చారు. ఫాదర్ కిరిల్ కొడుకేగాక ఫాదర్ కిరిల్ ను కూడా రప్పించారు, ప్రతి సాక్షీ సంతకం చేసి, తన హోదా, అర్హతలూ నమోదు చేశాడు. కొందరి అక్షరాలు నిటారుగా ఉన్నాయి, కొందరివి వాలి ఉన్నాయి, మరికొందరివి బొత్తిగా తలకిందులుగా ఉండి, రష్యను అక్షరమాలకు చెందనివి లాగున్నాయి. పాఠకుడికి సుపరిచితుడైన ఇవాన్ అంతోనవిచ్ శీఘ్రంగా పని ముగించాడు. దస్తావేజులు రాయటమూ, సరిచూడటమూ, పుస్తకంలో కాపీ చెయ్యటమూ, మిగిలిన తంతూ అయిపోతుంది. నూటికి అరవంతు ఫీజూ, గెజెట్ లో ప్రకటనకు ఖర్చులూ గుణించిన మీదట చిచీకవ్ బహుకొద్దిగానే ఇవ్వ వలసి వచ్చింది.

వ్యవహారకాండ ముగిశాక అధ్యక్షుడు, “ఇక విక్రయానికి ప్రోక్షణ చెయ్యటమే దిగబడి ఉంది,” అన్నాడు.

“నేను సిద్ధంగానే ఉన్నాను. ఫలానప్పుడని చెప్పండి. ఇలాటి మిత్రులకోసం రెండు మూడు షాంపేన్ బుడ్లన్నా మూతలు తియ్యక పోవటం భావ్యంగా ఉండదు,” అన్నాడు చిచీకవ్.

“లేదు, మీరు పొరపాటుపడ్డారు. షాంపేన్ ఖర్చు మాదీ. అది మా విధి. మీరు మాకు అతిథి, సత్కారం చెయ్యవలిసింది మేమూ. నేనొకటి చెప్పనా, ఏమర్రా? మనం ఏం చేద్దామంటే, ఈపళంగానే పోలీసు అధిపతి ఇంటికి పోదాం. అతడు ఇంద్రజాలికుడు. అలా చేపల బజారుగుండా వెళుతూనూ, సారా దుకాణం పక్కగా వెళుతూనూ ఇలా కన్ను మలిపాడంటే చాలు మనకు అద్భుతమైన విందు దానంతట అదే సిద్ధమవుతుంది. సరదాకి పేకాటకూడా వేద్దాం!” అన్నాడు అధ్యక్షుడు.

అలాటి సూచనకు ఎవరు మాత్రం కాదంటారు గనకా. చేపల బజారనేసరికే సాక్షులకు ఆకలి పుట్టుకొచ్చింది; వారంతా తమ టోపీలనూ, కుళాయిలనూ చేతపట్టుకున్నారు. అధ్యక్షుడి ఆఫీసు మూత పడింది. వాళ్ళు గుమాస్తాల గదుల మీదుగా వెళ్ళేటప్పుడు “కూజా మూతి” ఇవాన్ అంతోనవిచ్ చిచీకవ్ ను చూసి మర్యాదగా వంగి, రహస్యంగా “మీరు లక్ష రూబుళ్లు పోసి వెట్టివాళ్ళను కొని, నా శ్రమకు ఇరవై అయిదు రూబుళ్ళే ఇచ్చారు” అన్నాడు.
చిచీకవ్ కూడా రహస్యంగానే “వాళ్ళు ఎలాటి మనుషులనుకున్నారు. ఒట్టి నాసిరకం. అందులో సగం విలవ కూడా చెయ్యరు” అన్నాడు. అతను మొండిఘటమనీ, ఇంకేమీ ఇవ్వడనీ ఇవాన్ అంతోనవిచ్ కనిపెట్టాడు.

“ఆ ప్ల్యూష్కిన్ దగ్గిర మనుషుల్ని కొన్నారేం?” అని సబాకివిచ్ రెండో చెవిలో రహస్యంగా అడిగాడు.

“మీరు వరబేయ్ ని ఎందుకు ఇరికించారూ?” అన్నాడు చిచీకవ్.

“ఏ వరబేయ్?” అన్నాడు సబాకివిచ్.

“ఆడది; ఎలీజవిత్ వరబేయ్. ఆమె పేరుచివర అకారం ఎగరగొట్టేశారు కూడా.”

“లేదు. నేను వరబేయ్ నెవర్నీ ఇరికించలేదు” అంటూ సబాకివిచ్ సాగి, మిగిలినవాళ్ళను కలుసుకున్నాడు.

అందరూ కలిసి పోలీసు అధిపతి ఇంటికి చేరారు. ఆయన నిజంగా ఇంద్రజాలికుడే. కావలిసినదేమిటో తెలుసుకోగానే ఆయన పాలిష్ చేసిన ఎత్తుబూట్లుగల చురుకైన పోలీసు జవానునొకణ్ణి పిలిచి, వాడి చెవిలో రెండంటే రెండేమాటలు ఊది “అర్థమయిందా?” అన్నాడు. ఆ వెంటనే, అతిథులు చీట్లాడుతుండగా, చేపల బజారు నుంచి రకరకాల చేపలు-వండినవీ, ఎండువీ, ఊరినవీ వచ్చి దిగాయి. తరవాత వంటశాలనుంచి ఇతర వంటకాలు వచ్చాయి. ఈ పోలీసు అధిపతి ఒక విధంగా నగరానికి తండ్రి వంటివాడు, మహోపకారి. పౌరులమధ్య ఆయన తన కుటుంబం మధ్య ఉన్నట్టే మసులుకుంటూ, బజారు దుకాణాలన్నిటినీ తనవిగానే చూసుకునే వాడు. మొత్తం మీద ఆయన సరియయిన స్థానానికి సరి అయిన మనిషి, తన ధర్మాన్ని బహుచక్కగా అర్థం చేసుకున్నవాడు. ఆయనే ఆ ఉద్యోగంకోసం సృష్టి అయాడో, ఆ ఉద్యోగం ఆయనకోసం సృష్టి అయిందో చెప్పటం కష్టం. ఆయన తన విధులను ఎంత బాగా నిర్వర్తించాడంటే ఆయన రాబడి ఆయనకు ముందుండినవారి రాబడికి రెట్టింపయింది, దానితో పాటు ఆయన నగరం యొక్క ఆదరాన్ని కూడా సంపాదించాడు. ఆయనకు గర్వంలేదనీ, తమ పిల్లలకు “గాడ్ ఫాదర్” గా ఉంటాడనీ వర్తకులకు ఆయన మీద ప్రత్యేకించి ఇష్టం; ఆయన వారితో చాలా దోస్తీగా, కలుపుగోలుగా ఉండేవాడు, ఒక్కొక్కసారి వారిని ఘోరంగా పిండినా ఆ పని ఎంతో చాకచక్యంగా చేసేవాడు. ఆయన ఒక్కో మనిషిని భుజంమీదతట్టి, నవ్వి, టీ పోసి, వచ్చి డ్రాఫ్ట్స్ ఆడతానని వాగ్దానంచేసి, క్షేమసమాచారాలన్నీ విచారించి, వ్యాపారం ఎలా సాగుతున్నది, ఎందుకు ఏమిటని అడిగేవాడు. ఏ బిడ్డకుగాని సుస్తీగాఉన్నట్లు తెలిస్తే మందు చెప్పేవాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే చాలా సరదా అయిన మనిషి. ఆయన తన పందెపు స్లెడ్జిలో వెళుతూ ఉత్తరువులిస్తూ, మధ్యమధ్య వారితో, వీరితో సంభాషించేవాడు: ‘ఇదుగో, మిఖ్యేయిచ్! మనం ఏదో ఒకరోజు వీలుచూసుకుని ఆ రబ్బర్ పూర్తి చెయ్యాలి’. అవతలిమనిషి టోపీ చేతిలోకి తీసుకుని “అవును; అలెక్సేయ్ ఇవానవిచ్, పూర్తి చెయ్యాలి” అనేవాడు. “ఏమోయ్,ఇల్యా పరమోనిచ్! ఒకసారి వచ్చి నా దౌడుగుర్రాన్ని చూస్తావూ! అది పందెంలో నీ గుర్రాన్ని ఓడిస్తుంది. నీ గుర్రాన్ని పందెపు బండికి కట్టు; ఒకసారి వదిలిచూస్తాం.” దౌడు గుర్రాలంటే పిచ్చిగల ఆ వర్తకుడు ఆనందంతో చిరునవ్వు నవ్వి, గడ్డం నిమురుకుని “వదిలిచూద్దాం, అలక్సేయ్ ఇవానవిచ్!” అనేవాడు. మామూలుగా అలాటి సమయాల్లో, టోపీలు చేతబట్టుకుని నిలబడే దుకాణదార్లుకూడా “అలెక్సేయ్ ఇవానవిచ్ భలేవాడు!” అన్నట్టుగా ఒకరినొకరు సంతోషంతో చూసుకునేవారు. ఇంతకు ఆయన ప్రజాదరణ పుష్కలంగా సంపాదించుకున్నాడు. “అలెక్సేయ్ ఇవానవిచ్, తనవంతు తాను తిన్నా నిన్ను ముంచడు” అనేవారు వర్తకులు.

పోలీసు అధిపతి వంటకాలు సిద్ధంగా ఉన్నాయని గమనించి, భోజనం అయాక ఆట సాగింతామన్నాడు. అతిథుల ముక్కులకు వంటకాల వాసన కమ్మగా తగులుతూనే ఉన్నది; వాళ్ళందరూ లేచి ద్వారంగుండా భోజనాల గదిలోకి వచ్చారు – ఆ వాకిలినుంచే సబాకివిచ్ కొంతసేపుగా పెద్ద పళ్ళెంలో పెట్టివున్న స్టర్జిన్ చేప కేసి చూస్తున్నాడు. అందరూ తలా ఒక గ్లాసు ముదురురంగు వోడ్కా తాగారు; అలాటి ముదురు ఆకుపచ్చరంగు సైబీరియాలో దొరికే రత్నాలలో మాత్రమే గోచరిస్తుంది; ఆ రత్నాలను మలిచి సీల్ జంతువుల బొమ్మలు చేస్తారు. ఆ తరవాత అతిథులందరూ, చేతుల్లో ముళ్ళ చెంచాలు పట్టుకుని ఎవరి కిష్టమైన వస్తువుమీద వారు ప్రతాపం చూపించసాగారు – కొందరు ఊర చేపలమీద, కొందరు ఎండు సామన్ చేపలమీదా, మరికొందరు జున్ను అచ్చులమీదా. సబాకివిచ్ ఈ క్షుద్ర పదార్థాలన్నింటినీ విడిచి పెట్టి స్టర్జిన్ చేపదగ్గిర తిష్ఠవేసుకుని ఒక పావుగంట లోపల దాని అంతు తేల్చాడు. ఆ తరవాత పోలీసు అధిపతి, స్టర్జిన్ జ్ఞాపకం వచ్చి, “అన్నట్టు, ఈ ప్రకృతి వింతను గురించి ఏమంటారు. మహాశయులు?” అంటూ ముళ్ల చెంచాతో, ఇతరులను వెంట బెట్టుకుని దాన్ని సమీపించి, ఆ ప్రకృతివింత తోక తప్ప ఇంకేమీ మిగలలేదని తెలుసు కొన్నాడు. సబాకివిచ్ చల్లగా జారుకుని, తానేమీ ఎరగనట్లు, కొంచెం ఎడంగా ఉన్న పళ్లెందగ్గరికిపోయి తన ముళ్ల చెంచాను ఒక చిన్న ఎండు చేపలో గుచ్చాడు. స్టర్జిన్ తో కడుపు నిండిపోయి సబాకివిచ్ ఇంకేమీ తినక, తాగక, వెళ్లి ఒక వాలుకుర్చీలో కూర్చుని మొహం చిట్లిస్తూ, కళ్లు ఆర్పసాగాడు. పోలీసు అధిపతి సారా విషయంలో ఏమాత్రమూ వెనక్కు తీసేరకం కాదు; టోస్టులకు అంతు లేకపోయింది, మొదటి టోస్టు ఖెర్యాన్ భూస్వామి అరోగ్యానికని పాఠకుడు సులువుగా ఊహించవచ్చు, తరువాత అతని కమతగాళ్ల అభ్యుదయానికీ, కొత్తచోటవారి సుఖనివాసానికీ, తరవాత అతనికి భార్య కానున్న స్త్రీ రత్నానికీ తాగారు. ఈ చివరటోస్టుకు చిచీకవ్ సంతోషంతో మందహాసం చేశాడు. అందరూ అతనిచుట్టూ మూగి, మరొక్క పక్షంరోజులన్నా ఉండిపొమ్మని అతన్ని బతిమాలారు: “ఏమిటిది,పావెల్ ఇవానవిచ్! మీరేమన్నా చెప్పండి, ఇలా వెళ్ళిపోవటం వుందే, సామెత చెప్పినట్టు, ఉత్తపుణ్యానికి పొయ్యి ఆర్పుకోవటమే. గడపతొక్కీ తొక్కకుండానే తిరిగిపోవటమా? అలాకాదు, మాతో కొంత కాలం గడిపితీరాలి. మీకు సంబంధం చూస్తాం. ఇవాన్ గ్రిగోర్యెవిచ్, మనం సంబంధం చూస్తాంగదూ?”

“తప్పకుండా చూస్తాం!” అని అధ్యక్షుడు అన్నాడు. “మీరు కాళ్ళూ చేతులా కొట్టుకునేదిగాక, తప్పక పెళ్ళి చేసేస్తాం! ఇక్కడికి వచ్చేసినాక ఇక మీ యిష్టం ఏమీలేదండి! మేం ఒకంతట వదిలే వాళ్లంకాము!”

చిచీకవ్ ఇకిలిస్తూ, “కాళ్లూ చేతులా కొట్టుకోవటం దేనికీ? పెళ్లి ఏమంత… వధువే దొరకాలిగాని!” అన్నాడు.

“దొరుకుతుంది, దొరుకుతుంది! ఆ భయం ఏమీలేదు. అంతా మీకు కావలసినట్టు అమరుతుంది.”

“సరే, అయితే, ఇకనేం…”

“బ్రేవో, ఉండిపోతున్నాడు. హుర్రా హుర్రా, పావెల్ ఇవానవిచ్! హుర్రా!” అని అందరూ కేకలుపెట్టారు.

అతని గ్లాసుకు తమ గ్లాసును తాకించటానికి అందరూ చిచీకవ్ చుట్టూ మూగారు. అతను తన గ్లాసుతో అందరి గ్లాసులూ తాకాడు. “మళ్ళీ, మళ్ళీ” అంటూ కొందరు అతని గ్లాసును తమ గ్లాసులతో చాలాసార్లు తాకారు. మరికొందరు తోసుకువచ్చి మూడో సారికూడా తాకారు. అందరికీ ఉత్సాహం బాగా ఎక్కిపోయింది. నిషామీద ఉన్నప్పుడు అధ్యక్షుడు భలే సరదా మనిషి, ఆయన చిచీకవ్ ను అనేక మార్లు ఆలింగనం చేసుకుని, “నా ప్రాణం, నా వరహాలు!” అన్నాడు. ఆయన చివరకు చిటికెలు వేసి అతని చూట్టూ నృత్యంచేస్తూ, అందరూ పాడేపాట “ఇలాటివాడివి, అలాటివాడివి, కామరిన్ స్కి బైతుగాడ” అనేది కూనిరాగం కూడా తీశాడు. షాంపేన్ అయాక, వాళ్లు హంగేరియన్ ద్రాక్షసారాయి బుడ్లు కొన్ని తెరిచారు. దానితో వాళ్ళ ఉత్సాహం మరింత రెచ్చింది. ఇంకా మజాలో పడ్డారు. పేకాటమాట ఎవరికీ జ్ఞాపకం లేదు. వాళ్లు తర్కించుకున్నారు, అరిచారు, అన్ని విషయాలూ మాట్లాడారు. రాజకీయాలను గురించి, సైనిక విషయాలను గురించీ, ప్రగతిభావాలు ప్రకటించారు; అలాటి భావాలు తమపిల్లలే మరొకప్పుడు ప్రకటించినట్టయితే వాళ్ళను చితకబొడిచి ఉందురన్నమాట. ఎన్నో క్లిష్టసమస్యలను అక్కడే పరిష్కరించిపారేశారు.

చిచీకవ్ అంత ఉల్లాసం ఎన్నడూ ఎరగడు. అతను తాను అప్పుడే నిజమైన ఖెర్యాన్ భూస్వామి అయిపోయినట్టు భావించుకున్నాడు, తాను చేయదలచిన అభివృద్ధిని గురించీ, మూడుపంటల పద్ధతిగురించీ, దాంపత్య సౌఖ్యం గురించీ మాట్లాడాడు. అతను సబాకివిచ్ ముందు, షార్లెట్ కు వెర్థర్ రాసిన లేఖాగీతం చదవసాగేసరికి సబాకివిచ్ వాలుకుర్చీలో కూచుని కళ్లు ఆర్పాడు, ఎందుకంటే స్టర్జిన్ తిన్నప్పటినుంచీ ఆయనకు నిద్రమత్తుగా వున్నది. తనమీద తనకు వశం తప్పిపోతున్నట్టు గ్రహించి చిచీకవ్ వెళ్లిపోవటానికి బండి అడిగాడు, ప్రాసిక్యూటరుగారి పందెపు బండి ఇస్తానంటే సరేనన్నాడు. ప్రాసిక్యూటరుగారి బండివాడు సమర్థుడేనని దారిలో రుజువయింది. ఏమంటే, వాడు ఒకచేత్తోనే బండితోలుతూ, రెండవ చెయ్యి వెనక్కు చాచి బండిలో ఉన్న పెద్దమనిషి పడిపోకుండా పట్టుకున్నాడు.

ఈవిధంగా మన కథానాయకుడు హోటలు చేరుకున్నాడు. అతనింకా వధువును గురించీ, గులాబీరంగుగల ఆమె శరీరచ్ఛాయను గురించీ, కుడిబుగ్గలో సొట్టగురించీ, ఖెర్యాన్ లో ఎస్టేటు గురించీ, పెట్టుబడి గురించీ అర్థంలేని వాగుడు వాగుతూనే ఉన్నాడు. ఎస్టేటు నిర్వహణకు సంబంధించిన ఉత్తరువులు కొన్ని సేలిఫాన్ కు కూడా ఇవ్వబడ్డాయి. కొత్తగా వచ్చిన కమతగాళ్లందరినీ ఒకచోటికి చేర్చి రోల్-కాల్ తీసుకోమని సేలిఫాన్ ఆదేశించబడ్డాడు. వాడు మాటాడకుండా ఈ వాగుడు చాలసేపు విని, బయటికివచ్చి పెత్రూష్కతో, “నువు వెళ్లి యజమాని దుస్తులు విప్పు!” అన్నాడు. పెత్రూష్క అందుకు ఉపక్రమించి, యజమాని బూట్లు ఊడదీయబోయి, యజమానినే మంచం మీదినుంచి కిందికి లాగేసినంతపని చేశాడు. ఎలాగైతేనేం బూట్లు వచ్చాయి, యజమాని దుస్తులు విప్పటంకూడా సక్రమంగా జరిగింది. అతను అటూ ఇటూ చాలాసార్లు పొర్లాడు, మంచం ఘోరంగా కిరకిరలాడింది. చివరికతను నిజమైన ఖెర్యాన్ భూస్వామిలాగే నిద్ర పోయాడు.

ఈలోపుగా పెత్రూష్క తన యజమాని ఇజారూ, కోటూ బయటి నడవాలోకి తీసుకుపోయి, వాటిని టోపీల స్టాండుమీద పరిచి, కొట్టి, బ్రష్ చేసి నడవ అంతా దుమ్ముతో నింపేశాడు. వాడు వాటిని తీయబోతూ పిట్టగోడ మీదుగా చూసేసరికి గుర్రాలశాల నుంచి వస్తూ సేలిఫాన్ కనిపించాడు. వారిద్దరి చూపులూ కలిశాయి, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. యజమాని నిద్రపోతున్నాడు, వాళ్ళు తమపని చూసుకోవచ్చు. వెంటనే పెత్రూష్క ఇజారూ, కోటూ లోపల ఉంచి, కిందికి దిగి వెళ్ళాడు. తాము వెళ్ళే పని గురించి ఒక్కమాట కూడా అనకుండా, దారిలో యితర విషయాలను గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరారు. వాళ్ళు ఎంతో దూరం పోలేదు, వాళ్ళు వెళ్ళినది వీధి అవతలివేపున, హోటలుకు ఎదురుగాఉన్న ఇంటికే. ఒకపొట్టి ద్వారంలోని మాసిపోయిన అద్దాల తలుపుకుండా వెళ్ళి వాళ్లు దాదాపు నేలమీది గదిదాకా దిగారు. అక్కడ బల్లలవద్ద అనేక రకాలవాళ్లూ, గడ్దాలు చేసుకున్న వాళ్ళూ, చేసుకోనివాళ్ళూ, సాదా గొర్రెతోళ్ళు ధరించినవాళ్ళూ, కేవలం షర్టులు మాత్రమే వేసుకున్న వాళ్ళూ, అక్కడక్కడా బొచ్చుతో వేసిన పైకోట్లు వేసుకున్న వాళ్లూ కూచుని ఉన్నారు. అక్కడ పెత్రూష్క సేలిఫాన్లు ఏం చేశారో దేవుడికే తెలియాలి. కాని ఒకగంట అయాక మళ్ళీ కలుసుకుని, మాటా పలుకూ లేకుండా, ఒకరిపట్ల ఒకరు ఎంతో శ్రద్ధచూపుతూ మలుపులు తిరిగేటప్పుడు ఒకరినొకరు సాయపడుతూ వచ్చారు. ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా ఒక పావుగంట సేపు శ్రమించి వాళ్ళు ఎలా గైతేనేం మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకున్నారు. పెత్రూష్క తన పొట్టి మంచం దగ్గిరనిలబడి, ఎటుగా పడుకుంటే బాగుంటుందా అనుకొని నిమిషం సేపు ఆలోచించి, చివరకు మంచానికి అడ్డంగా, కాళ్లు నేలమీదనే ఉండేలాగ పడుకున్నాడు. తాను అక్కడ పడుకోరాదనీ, నౌకర్లు పడుకునే గదిలోనో, లేకపోతే గుర్రాలశాలలలోనో పడుకోవాలని తట్టక, సేలిఫాన్ కూడా ఆ మంచం మీదనే, పెత్రూష్క పొట్టమీద తలపెట్టి పడుకున్నాడు. ఇద్దరికీ ఒక్క క్షణంలోనే నిద్ర పట్టేసింది; ఇద్దరూ మంద్ర స్థాయిలో గట్టిగా గురక పెట్టసాగారు. దీనికి జవాబులాగా, పక్క గదిలో పడుకున్న వాళ్ల యజమాని ముక్కులోనుంచి సన్నని ఈలలాటి శబ్దం తెప్పించాడు. తరువాత కాస్సేపటికి అంతా మాటుమణిగింది. హోటలు సుషుప్తిలో మునిగిపోయింది. కజాన్ నుంచి వచ్చిన లెఫ్టినెంటు గదిలో మాత్రం ఇంకా దీపం వెలుగుతూనే ఉన్నది. అతనికి బూట్ల పిచ్చి ఉన్నట్టుంది, అదివరకే నాలుగు జతలు కొని ఇప్పుడు అయిదోది తొడిగి, అదేపనిగా చూసుకుంటున్నాడు. ఎన్నోసార్లు అతను వాటిని విప్పేసే ఉద్దేశంతో పక్క వద్దకు వెళ్లాడు, కాని విప్ప బుద్ధి కాలేదు. అవి నిజంగా బాగా తయారుచేసినవి. అతను చాలాసేపు కూచుని, కాళ్లు ఎత్తి చాలా అందంగానూ, కుదురుగానూ చేసిన బూటు మడమలను పరీక్షించుకున్నాడు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 28

బతుకు బండి

-పాలగిరి విశ్వప్రసాద్

బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది.

దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పుడే కదుల్తా ఉంది.

ఉరుకులు, పరుగులతో ప్లాట్‌పారమ్‌ మీద కొచ్చిన సారధికి బతుకు చేజారిపోతాన్నెట్టనిపించింది. ఒక చేతిలో ట్రంకు పెట్టె, భుజం మింద మూడేళ్ళ పిల్లది. ట్రంకు పెట్టె మింద చెయ్యేసుకొని తన వెంటే పరుగెత్తుకొస్తోన్న ఐదేళ్ళ కొడుకు. వడివడిగా అడుగులు వేయాలంటే కష్టంగా ఉంది. ఎదురుగా దాటిపోతోన్న కంపార్ట్‌మెంట్‌ వైపు చిన్న పరుగు తీసినాడు.

అప్పుడే కంపార్ట్‌మెంట్‌ డోర్‌ వేయబోతోన్న వ్యక్తిని తోసుకొని చేతిలోని పెట్టెను, భుజం మింది పిల్లను తేడా లేనట్లు పెట్టెలోకి విసిరేసినాడు. ఈ హఠాత్పరిణామానికి తూలి వెనక్కి పడబోయిన అవతల వ్యక్తికి, జరిగేది తెలిసేసరికి అర నిమిషం పట్టింది. అప్పటికే ఒక ట్రంకు పెట్టె, మూడేళ్ళ చింపిరి పిల్ల, ఐదేళ్ళ మట్టి గొట్టుకుపోయిన పిల్లాడు తమ ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లోకొచ్చి పడినారు. వీటికి తోడు మాసిన గడ్డంతో, రంగు వెలిసిన షర్టుతో, ముడతలు పడ్డ జీన్‌ ప్యాంటుతో కంపార్ట్‌మెంట్‌లోకి జొరబడబోతోన్న యువకుడు. అవతలి పెద్దమనిషికి గజ్జి కుక్కో, ఊరపందో మీదకు తోసుకొస్తోన్నట్లనిపించింది. ఆ పెద్దమనిషి ఒక చేత్తో డోర్‌ వేయబోతూ, మరో చేత్తో ట్రంకు పెట్టెను బయటికి విసరాలని ప్రయత్నం చేస్తున్నాడు. లోపల పిల్లలు ఏడుపందుకున్నారు. లోపలున్న పెద్దమనిషి ఇంగ్లీష్‌లో, తమిళంలో కసురుకొంటున్నాడు. పట్టుకొన్న కడ్డీ నుండి సారధి చేతిపట్టును విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలు అలవి గాకుండా ఏడుస్తున్నా, ఆపెద్ద మనిషికి లోపల పిల్లలున్నరనే స్పృహ కూడా లేదు. ఎక్కబోతోన్న బికారి యువకుడిని ఎక్కనివ్వకుండా తలుపు వేయడమే ధేయ్యంగా ఉంది.

ప్లాట్‌ఫారమ్‌ ఇంకొక నాలుగు బారలు మాత్రమే ఉందని గమనించగానే సారధికి తెగింపొచ్చింది. బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది. వెంటనే చాకు మడిచి జేబులో పెట్టుకుందామనుకున్నాడు. కానీ, ప్రమాదమింకా దాటిపోలేదనిపించిందేమో ! చాకు చేతిలో అట్లే పట్టుకుని, కసి నిండిన చూపుల్తో నిలబడినాడు.

అవతలి వ్యక్తి బెదిరిపోయి, గొడవెందుకనుకున్నట్లు వెనక్కు తిరిగినాడు. రైల్వే డిపార్ట్‌మెంటునూ, మనుషుల్లో పెరిగిపోతోన్న అరాచకత్వాన్నీ అరవంలో తిట్టుకుంటూ, గొణుక్కుంటూ పోయి తన సీట్లో కూర్చున్నాడు. అంతవరకూ నిటారుగా నిలబడి ఉన్న సారధి, గాలి తీసిన బుడగ మాదిరి డోర్‌ పక్కనే కూలబడిపోయినాడు.
ఏడుస్తోన్న పిల్లల్ను దగ్గరకు తీసుకొన్నాడు. పిల్లదాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని, కొడుకును ట్రంకు పెట్టె మీద తలవాల్చి పడుకోబెట్టి, వాడి వీపు మీద చెయ్యేసుకొన్నాడు. తుఫాను తర్వాత గూటికి చేరిన తల్లి రెక్కల కిందా దాక్కున్న గువ్వపిల్లల మాదిరి, పిల్లలిద్దరూ ఏడుపు చాలించి ఒదిగి పోయినారు.
రైలు వేగం పుంజుకొంది.

బయట తుపాను వల్ల పట్టిన ముసురు మెల్లగా వర్షంగా మారుతోంది. అరవ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులూ సారధి వంక ఉక్రోషంగా చూస్తోన్నారు. ఆ పెట్టెలో ఉన్న కొద్దిమంది కూడా చాలా ఖరీదైన మనుషులుగానే ఉన్నారు. అరవ వ్యక్తి, తన యెదురుగా ఉన్న ‘ సఫారీ వాలా ‘తో ఇంగ్లీష్‌లో ఏదో అంటున్నాడు – సారధి లాంటి బికారి మనుషుల గురించేనేమో !… ఇట్లాంటోళ్లు అవకాశమొస్తే ఎట్లా దోచుకుంటారో …. అవసరమైతే ఖూనీలు కూడ చేస్తారనీ… సభ్య సమాజంలో ఇట్లాంటోళ్లు ఎంత ప్రమాదకరమో – ఇటువంటి మాటలే ఏవో చెబుతోన్నట్లుంది. ఆ సఫారీ వాలా మిలట్రీ వాడి మాదిరి గుబురు మీసాలతో, బలిష్టంగా ఉన్నాడు. అనాసక్తంగా వింటున్నాడు. సారధికి స్పష్టంగా వినిపించక పోయినా, కొంత అర్థమవుతానే ఉంది.

పాత జీవితానికి గుర్తుగా నిలబడిన ‘బటన్‌ చాకు ‘ను వచ్చేటప్పుడు పారేయలనుకున్నాడు. మళ్ళా యెందుకో అనాలోచితంగానే జేబులో వేసుకొచ్చినాడు. ఇప్పుడదే ఉపయోగపడిందానుకున్నాడు. ఇప్పుడు కూడ దాన్ని బయటికి తీయాలనుకోలేదు. తప్పని సరయింది. తనను ఆ పరిస్థితికి తీసుకొచ్చినందుకు “ఈ అరవోళ్ళంతా ఇంతే ” అని గొణుక్కున్నాడు. ఇదే నాలుగేళ్ళక్రితమైతే ” ఈ డబ్బుతో బలిసిన నా కొడుకులంతా ఇంతే ” అనుకునేవాడు.

వాళ్ళ మింద నుండి చూపులు తిప్పి, సారధి తలుపు గుండా బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట సన్నని వాన కురుస్తోంది. తేమ తేమగా ఉన్న రాళ్ళు, గుట్టలు, చెట్లు, స్తంభాలు వెనక్కు పరుగెత్తుతున్నాయి. దూరంగా ఉన్న పలెటూళ్లు మాత్రం నిదానంగా వీపు చాటుకు పోతున్నాయి. పిల్లలిద్దరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. వాళ్లను చూస్తోంటే సారధికి మనసంతా బాధతో నిండిపోయింది. ఆప్యాయంగా ఇద్దర్నీ చెరో చేత్తో నిమిరినాడు. విచారంగా మళ్ళా బయటికి చూస్తా కూర్చున్నాడు.
గడిచిన జీవితమంతా అస్తవ్యస్తంగానే గడిచింది. అట్లా జరగడానికి తన ప్రమేయమెంతుందో … సమాజం ప్రమేయమెంతుందో, అతను బేరీజు వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు అతనున్న పరిస్థితిలో తప్పంతా తనదేనేమోననే సందిగ్థంలో ఉన్నాడు. చేజేతులా పొరబాట్లు చేశానేమోననే పశ్చాత్తాపంతో అతనికి మనసు మరింత బరువెక్కుతోంది. ఏడుస్తామనిపిస్తా ఉంది.
రైలు లయబద్ధంగా దూసుకుపోతోంది.

సారధి పుట్టింది బ్రాహ్మణ కులమే అయినా, ఛాందస సంప్రదాయాల ప్రభావం అతని మింద ఏమీ లేదు. చిన్నప్పుడే తల్లి తండ్రులు పోవడంతో – పెంచిన జేజమ్మ, అబ్బ తనను గారాబంగానే పెంచినారు. గారాబం కారణంగా సంప్రదాయాలను బలంగా అతనిలో నాటలేక పోయినారు. ఒకసారి సారధి ఏడెనిమిదేళ్ళ వయసున్నప్పుడు తన సావాసగాళ్ళను ఇంట్లోకి తీసుకురావడం – వాళ్ళకు కూడా తమ గ్లాసులతోనే మంచి నీళ్ళిస్తే, వాళ్ళు నోట కరుచుకొని తాగడం – సారధి జేజమ్మ అది చూసి, “అసలు మన గ్లాసుల్తో నీళ్లెందుకిచ్చినావ్‌ ? అట్లా ఇవ్వకూడ” దని సారధిని చీవాట్లు పెట్టడం జరిగింది. అంతే ! సారధి మూడ్రోజులు అన్న పానీయాలు ముట్టలేదు. సారధిలో ఆ సున్నితత్వం వయసుతో పాటు పెరుగుతానే వచ్చింది.

అప్పట్నుండి ముసలి ప్రాణులు, సారధి ఎవరిని పిల్చుకొచ్చినా ఇంట్లోకి రానిచ్చేవారు. తినేవేమైనా ఉంటే సారదితో సమానంగా తమ గిన్నెల్లోనే అతని స్నేహితులకు కూడా పెట్టేవారు. తమ పల్లె నుండి పొలం కౌలు డబ్బు తీసుకువచ్చే గొల్ల చెన్నయ్య మాత్రం తమ యింట్లోకి వచ్చేవాడు కాదు. బయట వసారాలో కూర్చునేవాడు. భోజనానికి విస్తరి తెచ్చుకునే వాడు. పల్లె నుండి తమ యింటికి వచ్చేటప్పుడే నీళ్ళు తాగడానికి చెంబుకూడా తనే తెచ్చుకునేవాడు. అతను తిని లేచినాక ఆ తావులో జేజమ్మ నీళ్ళు చల్లేది.

పెరిగే వయసులో యిది కొంత గమనించినా, తన స్నేహితులపట్ల ఏ తేడా కనపడక పోవడంతో సారధి మీద కట్టుబాట్లు, సంప్రదాయాల నీడ పడలేదు. తల్లిదండ్రుల్లేని పిల్లాడు బాధ పడకూడదని వాళ్ళు సారధిని దేనికీ నిర్బంధ పెట్టేవాళ్ళు కాదు. ఆరకంగా సారధికి ‘అగ్రవర్ణ అహం ‘ అంటలేదు. ఇంటర్మీడియట్‌లో శ్రీశ్రీ ని, చలంను చదివి ఆవేశంతో కవితలు అనుకుని ఏవో రాసుకునే వాడు. సాధారణంగా విద్యార్థులు చేసే పోకిరి చేష్టలు సారధి చేసేవాడు కాదు. అట్లాంటి వాళ్లెవరూ అతనికి స్నేహితులుగా తారసపడలేదు – లేక ఇతనే తనకు తెలియకుండానే… అట్లాంటి వాళ్ళకు దూరంగా జరిగినాడేమో !, తన అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్లతోనే స్నేహం చేసినాడేమో ! వాళ్ళలో కృష్ణ చైతన్య ఒకడు. కృష్ణ చైతన్య తండ్రి పెద్ద ఆస్తిపరుడని చెప్పుకునేవారు కాలేజీలో. అతను సారధి రాసుకున్న కవితలు చూసి
ముచ్చటపడేవాడు. ఇంటర్‌ తర్వాత కృష్ణ చైతన్య దూరమయిపోయినాడు. అతను కర్ణాటకలో ఇంజినీరింగ్ చేరినాడని తెలుసుగానీ, తర్వాత్తర్వాత సంబంధాలు తెగిపోయినాయి.

రైలు వేగం తగ్గి నిలబడే ప్రయత్నంలో ఉంది. ఏదో స్టేషన్‌ వస్తోంది. సారధి తొంగి చూసినాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో ఉన్న ‘ తాడిపత్రి ‘ అనే బోర్డు దాటి, ప్లాట్‌ఫారమ్‌ మీద నిలబడింది. బయట వర్షం కురుస్తానే ఉంది. ప్లాట్‌ఫారమ్‌ చిత్తడి చిత్తడిగా ఉంది. బయటున్న చిత్తడి వాతావరణాన్ని చూసి పెట్టెలోని వాళ్ళెవరూ దిగే ప్రయత్నం చేయడం లేదు.

అరవ వ్యక్తి కొరకొరా చూస్తోన్నాడు – “ఇంక దిగిపో” అన్నట్లున్నాయి అతని చూపులు. దిగి జనరల్‌ కంపార్ట్‌మెంట్‌కు పోదామనిపించింది సారధికి. కానీ, బయటున్న చిత్తడిలో … ఇద్దరు పిల్లల్ని వెంటేస్కొని, పెట్టె వెదుక్కుంటూ పోవడం … వీటన్నిటికీ మానసికంగా సిద్ధంగా లేడు. అదీగాక ఆ వ్యక్తి తనను కంపార్ట్‌మెంట్‌లోకి రాకుండ అడ్డుకున్న వైనం గుర్తొచ్చింది. ‘ పొరబాట్న తను ఎక్కలేకపోయుంటే?’ తను తన ఊర్లో అక్కడే – తన పిల్లలు దాటి పోయిన రైలులో… ఎంత దారుణం జరిగేది ?…. సారధికి ఒక రకమైన మొండితనం ఆవహించింది. తను అక్కడే ఉండడం ద్వారా ‘ అరవోని ‘కి మనశ్శాంతి లేకుండ చేయాలనుకున్నాడు.
అరవ మనిషి నుండి చూపులు తిప్పుకొని, పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు.

రైలు కదిలింది. అతని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. బయటి వాతావరణం మాదిరే తన మనసులో కూడా ముసురు పట్టింది. డిగ్రీ చదివిన కాలమే సారధి జీవితంలో పెద్ద మలుపు. మంచికో, చెడుకో ఇప్పుడు సారధికున్న వ్యక్తిత్వమూ – సంస్కారమూ ఆ కాలంలోనే బలపడినాయి. అప్పుడే ప్రతాపరెడ్డితో పరిచయమయింది. అతను రాడికల్‌ – తన క్లాస్‌మేటే. క్లాసులకు ఎప్పుడూ హాజరయేవాడు కాదు. అప్పటికే ప్రతాపరెడ్డికి ఉద్యమ నాయకులతో పరిచయముండేదని, ఆ తర్వాత్తర్వాత తెలిసింది. ప్రతాపరెడ్డితో రాడికల్స్‌ తప్ప మిగిలిన విద్యార్థులు అంత చనువుగా ఉండేవారు కాదు. అట్లాంటిది సారధికి మాత్రం అతనితో పరిచయం, అతి తొందరగా స్నేహమయింది.

ప్రతాపరెడ్డి అప్పట్లో సారధికి అర్థమయీ… కాని, విషయాలేవో చెప్పేవాడు. ‘ఇది దోపిడీ సమాజమనీ – ఉన్నవాడు లేని వాని మింద చూపే మంచితనం, జాలి ఎక్కడైనా ఉంటే అది వాడి దోపిడీకి రక్షణగా సృష్టించుకున్నదే గానీ, వాస్తవం కాదనీ – రెండు వర్గాల మధ్యన ఘర్షణ ఉందనేది మాత్రమే వాస్తవమనీ-అది పోవాలంటే ‘ఆర్థిక సమానత్వం’అంటే ‘ సమ సమాజం’ రావాలనీ… ఇట్లాంటివే – తమ పార్టీ సిద్దాంతాలన్నీ వల్లె వేస్తుండేవాడు. ప్రతాపరెడ్డి చెప్పేదేదో వినేవాడుగానీ వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం సారధి ఎప్పుడూ చేయలేదు. ప్రతాపరెడ్డి సాహచర్యం వల్ల వ్యక్తిగా అతని ప్రభావం మాత్రమే సారధి మింద ఉన్నింది. దానికి తోడు స్వభావసిద్ధమైన ఆవేశం, సున్నితత్వం ఉన్నింది. అంతేగానీ, పార్టీయో… సిద్ధాంతాలో సారధిని ప్రభావితుడ్ని చేయలేదు.

ప్రతాపరెడ్డి – ‘ మన దేశంలో మను ధర్మాల్ని, చాతుర్వర్ణ వ్యవస్థల్నీ రచించి దోపిడీ వ్యవస్థను విస్తార పరిచింది బ్రాహ్మణులేననీ, ఆతర్వాత పాలకులుగా వచ్చిన అగ్ర కులాల వాళ్ళు అందుకు ఇతోధికంగా తోడ్పడ్డార ‘నీ – చెప్పినప్పుడు సారధికి తమ అగ్ర కులాల మీద అంతులేని కోపం వచ్చేది. ఒకానొక ఆవేశ సమయంలో సారధి తన ఒంటి మీదున్న ‘ గాయిత్రి ‘ని తెంచి మురిక్కాల్వలో పారేసినాడు. మాంసం తిన్నాడు. అందువలన బ్రాహ్మణత్వం మంట కలిసిందని తృప్తిపడినాడు. ఇవన్నీ తెలిసి ఊరి దగ్గర ముసిలివాళ్ళిద్దరూ ఘొల్లుమన్నారు. సారధి అబ్బ మనశ్శాంతి కరువై మంచం పట్టినాడు. సారధి రెండవ సంవత్సరం పరీక్షలు రాసి వచ్చేసరికి చివరి ఘడియల్లో ఉన్నాడు.

ఇన్నాళ్ళూ తన చదువెట్లా సాగిందో, కుటుంబమెట్లా గడిచిందో సారధికి పట్టలేదు. తీరా ఇప్పుడు చూస్తే చేతులు కాలినయ్‌. తన అబ్బ చేసిన అప్పులకు పల్లెలో ఉన్న భూమి చాలలేదు. ఇల్లు కూడా అమ్మి, అప్పు కట్టి మిగిలింది బ్యాంక్‌లో వేసినాడు. ఇదంతా చూసి అశాంతితోనే ముసిలోడు కన్ను మూసినాడు. అంతే ! తను మళ్ళా ఫైనలియర్‌కు కాలేజీకి పోయే అపకాశం లేక పోయింది. ఒక కొట్టంలో అద్దెకుండాల్సి వచ్చింది.

రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. గుంతకల్లు జంక్షన్‌. వర్షంపడుతూనే ఉన్నా, ప్లాట్‌ఫారమేమో రధ్దీగానే ఉంది. అరవ మనిషి కిటికీ నుండి అటూ ఇటూ చూస్తున్నాడు. టికెట్‌ కలెక్టర్‌ కోసమో ? పోలీసుల కోసమో ? – తన మింద కంప్ష్లెంట్‌ ఇచ్చి బయటికి గెంటాలని చూస్తోన్నట్లుంది. సారధి భయపడ్డాడు. పిల్లల వంక చూసినాడు. నిద్ర లేచి, తన వైపే చూస్తోన్న పిల్లను ఒళ్ళో నుండి ఎత్తి ట్రంకు పెట్టె మింద కూర్చో బెట్టినాడు.

కంప్ల్షెంట్‌ చేయడానికి ఎవరూ కనపడకపోయేసరికి అరవ మనిషికి అసహనం కలిగిందేమో ! విసురుగా లెట్రిన్‌ వైపు అడుగులేసినాడు. కాళ్ళు జాపుకొని కూర్చున్న పిల్లవాడి కాళ్ళకు తన బూటు కాళ్ళను తగిలిస్తూ, అరవంలో ఏదో అన్నాడు. ‘ పెట్టెలో ఎక్కింది కాక, తోవకడ్డంగా ఈ దరిద్రమేంది ? ‘ అంటున్నాడేమోననిపించింది సారధికి.

సారధి నోరెత్తక పోవడం, ఆవ్యక్తి అహాన్ని కొంత తృప్తి పరిచినట్లుంది. చిర్నవ్వు నవ్వుకుంటా లెట్రిన్‌లోకి నడిచినాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా పిల్లవానికి బూట్లు తగిలిస్తా పోయినాడు. సారధికి భగ్గుమనింది. ఒక్కపోటు పొడిస్తే…. !
ఆవేశాన్ని అణుచుకోవడనికి పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకొని మునగ దీసుకున్నాడు.

రైలు కదిలింది.
సిద్ధాంతాలు అన్నం పెట్టవు. ఏదో ఒక ఉద్యోగం చేయాలి. బ్రాహ్మణులనే గౌరవమున్న ఆయిలు మిల్లు ఓనరెవరో సారధికి ఉద్యోగమిచ్చినాడు – అదీ అతని జేజమ్మ ద్వారా.

సారధికి పనిలో శ్రద్ధ ఉన్నా, యజమాని పట్ల వినయం లేదు. వినయానికీ, బానిసత్వానికీ తేడా తెలుసుకోని ఆవేశం ఉన్నింది. ఉన్నవాడిని తనకే శత్రువుగా చూసే దృష్టి ఉండేది. అందువల్ల అతన్ని పనిలో నుండి తీసేయడానికి ఆ ఓనర్‌ కెంతో కాలం పట్టలేదు.
అప్పుడు కూడ సారధి ‘తనను తీసేసిన కారణమేమిటో చెప్పా’లని నానా గొడవ చేసినాడు. అతను బయటికి గెంటించినాడు. ఆ ఉక్రోషంతో, సందులో ఒంటరిగా పోతున్న మిల్లు ఓనర్‌ తలపగలగొట్టినాడు. ఆసందర్భంలో సారధికి పోలీసుల ఆతిథ్యం ఘనంగానే లభించింది. ఆ చావు దెబ్బల నుండి కోలుకొని మామూలు మనిషి కావడానికి రెన్నెళ్ళు పట్టింది. ఆకాలంలోనే ‘బటన్‌ నైఫ్‌’ ఒకటి సంపాదించి పెట్టుకొని తిరగడం మొదలు పెట్టినాడు. అప్పట్లో, ‘ ఇంక తన బతుకు అలజడిగానే ఉంటుం ‘దనే ఆలోచనా లేమితో, ఆవేశంతో అట్లా ప్రవర్తించే వాడేమో !

చుక్కాని లేని అతని జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చాలనే ఆశతో జేజమ్మ పెళ్ళి ప్రయత్నాలు చేసింది. సారధికి మాత్రం పెళ్ళి మీద ఆసక్తేం లేదు. సారధి కాలేజి జీవితం, ప్రస్తుత జీవితం తెలిసిన సద్భ్రాహ్మణులెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. దోపిడీ వ్యవస్థను ఎదిరించే మనుషుల్లో తానూ ఒకడిననీ…. మామూలు మనుషుల కన్నా తను భిన్నమని… సారధి తనంత తాను అనుకునే వాడు. సమాజం దృష్టిలో మాత్రం సారధి వంటి వాడికి, రౌడీ షీటర్‌కు పెద్ద తేడా లేదు. అందుకే ముసలామె ఎంత పట్టుదలగా ప్రయత్నించినా, ఆఖరి నిమిషంలోనైనా వచ్చిన సంబంధం వెనక్కు మళ్లేది.

చివరకు, ‘పెళ్ళి కెదిగిన కూతురు చస్తే బాగుండున’నుకునే తల మాసిన బ్రాహ్మణుడెవరో పిల్లనిచ్చినాడు. ఇంక ఈ లోకంలో నాకేం బాధ్యతలు లేవన్నట్లు జేజమ్మ దాటిపోయింది. సారధి, అందమైన భార్య పొందులో కొన్నాళ్ళు సుఖాన్నే అనుభవించినాడు. కొడుకు పుట్టేంత లోపల, ఆ రెండేళ్ళలో భార్య మీద చేయి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు కారణాలు వింటే, జనమంతా అతనికి కొంచెం పిచ్చి ఉందని అనుమానపడతారు.

తనకు తెలిసినది భార్యకు చెప్పి ఒప్పించే ఓర్పు అతనికి లేదు. ఆమె మారాలంటాడు. ఉన్నట్లుండి ఈ సమాజం మారిపోవాలనుకుంటాడు. అది అసాధ్యం అని ఎవరన్నా అంటే – తననే ఉదాహరణగా చూపి చూడమంటాడు. తను బ్రాహ్మణత్వాన్ని ఎంత సులభంగా మంట గలిపిందీ చూడమంటాడు. తను ఎంత వేగంగా మారిందీ చూడమంటాడు. అన్ని విషయాల్లోనూ, అందర్లోనూ ఆ మార్పు రావాలనుకుంటాడు. అట్లా రాకపోవడం చూసి సహించలేకపోయాడు. అతని అసహనానికి సమాజంలో వీసమెత్తు కదలిక కూడా రాలేదు గానీ, భార్య మాత్రం తరచూ దెబ్బలు తినేది…

భార్య జ్ఞాపకాలు మెదిలేసరికి సారధి కళ్ళల్లో నీళ్ళు కదలాడినాయి.
తండ్రి ఎందుకో ఏడుస్తున్నాడని, పిల్లలిద్దరూ బిక్కమొహం వేసి చూస్తున్నారు… వాళ్ళను చూసి సారధి కళ్ళు తుడుచుకున్నాడు.
సాగిపోవడమే ధ్యేయంగా రైలు దూసుకుపోతోంది.

తను బతుకు వేటలో తంటాలు పడ్తోన్నప్పుడే – తను డిగ్రీ చదివిన ఊరిలో జరిగిన మునిసిపల్‌ ఛైర్మన్‌ హత్యలో ప్రతాపరెడ్డి హస్తమున్నట్లు పత్రికల్లో చూసినాడు. తర్వాత అతను ‘ అండర్‌ గ్రౌండ్‌ ‘కు పోయి తంబళ్ళపల్లి ప్రాంతంలో ఉద్యమ నేతగా పన్జేస్తున్నాడని తెలిసింది. మరికొన్నాళ్లకే పోలీసుల ‘ బూటకపు ఎన్‌కౌంటర్‌ ‘లో చనిపోయాడని కూడా తెలిసి వచ్చింది.

ఈ వార్త తెలిసినపుడు సారధికి తాను ఈ ప్రంచంలో ఒంటరి వాడినయ్యాననిపించింది. రెండు మూడ్రోజులు మామూలు మనిషి కాలేకపోయినాడు. అతని లోపలి సున్నితత్వానికెక్కడో దెబ్బ తగిలింది. క్రమేణా నమ్మకాల పట్ల కొంత సడలినాడు. అందుకు కారణం కూడా సులభంగానే అర్థమవుతుంది. సారధిలో ఉన్నది సిద్ధాంతాల మీద నమ్మకం గాదు – ప్రతాపరెడ్డి ప్రభావమే ! ఇప్పుడతను లేడు. అదీగాక, ఇప్పుడు సారధికి జీవించడం ఒక పోరాటమయిపోతోంది. అలసిపోతున్నాడు. ఇన్నాళ్ళూ ఒక మనిషి తోడు ఉన్నాడనే మానసిక తృప్తీ, ధైర్యం ఒకటి ఉండేది. ప్రతాపరెడ్డి పోవడంతో అదీ పోయింది. అయినా తనకు అలవాటు లేని వినయ విధేయతలు చూపలేక, ఏ మిల్లులో కూడా దినకూలీగా కూడా శాశ్వతంగా నిలవలేకపోయినాడు.

ధనవంతులను తనకే శత్రువుగా చూసే దృష్టి మాత్రం మారుతా వచ్చింది. ‘మంచి తెలివితేటలుండాయ్‌. ఎందుకు వృధా చేసుకుంటావ్‌ ? బుద్ధిగా పని చేసుకుంటే వృద్ధిలోకొస్తావ్‌’ అని వాళ్లు పైకి చెప్పే మాటలను వినే స్థితికి వచ్చినాడు. తన పట్ల ఎంతో ఓర్పు, సహనం చూపిన ధనవంతుల్ని కూడా చూసినాడు. ‘తనకు పని వట్ల నిబద్ధత, తెలివితేటలున్నాయి. వాటిని విడిచి పెట్టుకోలేక ఆ ధనవంతులు తన పట్ల ఓర్పు చూపుతున్నారు ‘ అనేంత లోతుకు, గతంలోలాగా అతని ఆలోచనలిప్పుడు పోవడం లేదు.

అమాయకురాలైన భార్యను చూసినపుడు జాలి కలుగుతోంది. కొడుకు పుట్టిన తర్వాత… ప్రతాపరెడ్డి చావు తర్వాత… తనలో వస్తోన్న మార్పు వల్ల ఆమె అంటే జాలి ఎక్కువవుతోంది. ఆమెకు ఏనాడూ కడుపునిండా తిండి పెట్టలేకపోయినాడు. పైగా ఆమె కష్టాన్నే తిన్నాడు కూడా. ఇంటిని అమ్మగా మిగిలి వున్న సొమ్ము ఈ కాలంలోనే హారతి కర్పూరమయి పోయింది. రెండో కాన్పులో తన భార్య విపరీతమైన నొప్పులకు గురయింది. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించడానికి స్థోమత లేదు. తనకు మంచి మాటలు చెప్పిన పాత యజమానులందర్నీ అర్థించినాడు. ఎవరూ ఉపయోగపడేంత సాయం చేయలేదు. ప్రభుత్వాసుపత్రిలో నిబంధనలన్నీ పూర్తయి, చేర్చుకుని – డాక్టరు నిక్కుతా నీల్గుతా వచ్చేసరికి ఆమె తన జీవన పోరాటం చాలించింది. లోపలున్న ఆడబిడ్డను మాత్రం బయటికి తీసి బ్రతికించగల్గినారు.

సహజంగా అయితే, సారధిలో ప్రతాపరెడ్డి నాటిన ప్రభావం పట్ల జరుగుతున్న సడలింపు – భార్య చావుతో మళ్ళా బలపడాల్సింది ! కానీ, పసి పిల్లల పట్ల అతను అంతకన్నా బలమైన మమతాను రాగాలను ఏర్పరుచుకున్నాడు. నమ్మినదాని కోసం సారధి తను వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధపడతాడు. అది ‘ త్యాగం ‘ అనుకొని భరించే స్థితిలో ఉన్నాడు. అయితే దాని వలన తన అట్టడుగు పొరల్లో వున్న ప్రేమ హృదయం ఛిద్రం కాకూడదు – అంటే అతను ప్రేమించేవాళ్ళు వ్యధ చెందకూడదు. అట్లా జరిగేట్లయితే తన నమ్మకాల్ని మార్చుకునేంత బలహీనుడు.

రైలు మెల్లగా ఏదో స్టేషన్‌లో నిలబడింది. బయట వర్షం పడతానే ఉంది. అరేబియా, బంగాళాఖాతాల్లో ఒకేసారి తుఫాను లేచినట్లుంది.

అరవ మనిషి లేచి బయటికి పోవడానికి, డోర్‌ వైపు అడుగులేసినాడు. అది గమనించి సారధి ముందు జాగ్రత్తగానే పిల్లల్ను, పెట్టెను సర్దుకొని ద్వారానికి అడ్డు తొలగినాడు. అతని వినయం పట్ల ఆ మనిషి తృప్తి పడినాడేమో ! ఏదో అనబోయిన మనిషి, ఏమీ అనకుండా బయటికి పోయినాడు. అతను కంప్లైంట్‌ యిచ్చి వస్తాడేమోనని సారధి భయపడినాడు. మనసులో బెదురుగా ఉంది… అయినా గత్యంతరం లేదు – డోర్‌ దగ్గరే అయినా, పిల్లలు పండుకోవడానికి అనుకూలంగా, శుభ్రంగా ఉంది… సారధికి కదలాలనిపించలేదు. టీ. సీ.నో, పోలీసో వచ్చినప్పుడు చూడొచ్చనుకున్నాడు. డోర్‌ దగ్గరకి వచ్చిన తోపుడు బండి నుండి ఇడ్లీ ప్యాకెట్లు తీసుకొని పిల్లలకు చెరి ఒకటి ఇచ్చినాడు.

అరవ మనిషి ఏవో ప్యాకెట్లతో వచ్చినాడు. అప్పుడే మిలట్రీ సఫారీవాలా లెట్రిన్‌ వైపు వెళ్ళబోతున్నాడు. కూర్చున్న పిల్లల్ని లేపి, తనూ నిలబడి – అరవ మనిషికీ, మిలట్రీ సఫారీవాలాకు దారి యిచ్చినాడు.

రైలుకదిలింది. చీకటి పడింది. ఈదర గాలి కొడుతోంది. సారధి డోర్‌ వేసినాడు. ఇడ్లీ తిని పిల్లలు పడుకున్నారు. పెట్టె నుండి దుప్పటి తీసి పిల్లల మీద కప్పి, తను ఒదిగి కూర్చున్నాడు.

దూరంగా మినుకు మినుకుమంటున్న దీపాలు మెల్లగా రైలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. క్రమక్రమంగా వేగాన్ని పుంజుకొంటున్నాయి. సారధిలో ఆలోచనలు ముసురుకొంటున్నాయి.

పిల్లల మీదున్న గాఢానురక్తి అతన్ని పూర్తిగా మార్చింది. ఒకవైపు పిల్లల పోషణ వల్ల దినమంతా పనిచేసే అవకాశం దొరకలేదు. అందువల్ల కడుపు నిండేంత సంపాదన ఎప్పుడూ లేదు. దానికి తోడు పిల్లల కోసం ఆస్పత్రి వంటి అదనపు ఖర్చులు. ఇంతకు ముందు నిర్లక్ష్యంగా తిరిగిన వూర్లోనే – మిల్లర్లను ఎదిరించిన వూర్లోనే – ఇప్పుడు విధేయుడై తిరిగినాడు. ఇంతకాలం ‘ తప్పు ‘ చేశానన్న భావం అతనిలో అణువులా పుట్టి అనంతమైంది. దాంతో సారధి యజమానుల ముందు మరింత కుంచించుకు పోయే వాడు… వాళ్ళలో కూడా జాలి, కరుణ, మానవత్వం అనేవి ఉన్నాయనుకొన్నాడు. అన్నిటికీ పరిష్కారం ఆర్థిక సమానత్వమే అన్న ప్రతాపరెడ్డి మాటలు అతని మదిలో అట్టడుగుకు చేరుకున్నాయి. దోపిడీకి ఆర్థిక అసమానతలు కాకుండా – మనుషుల్లోని నైజం, అవకాశాలు మాత్రమే కారణమేమో అనే సందేహమొస్తోంది.
ఆర్థిక సమానత్వం వచ్చినా మనుషుల మధ్య ఈర్ష్యా, ద్వేషాలుంటే ఏం లాభం ? అనిపించేది. మనుషుల మధ్య మానవత్వం, కృతజ్ఞత వంటి బంధాలుండాలనుకునే కొత్త ఆలోచనలు మదిలో చోటు చేసుకున్నాయి.

ఆ మానవత్వాన్ని, కృతజ్ఞతా భావాలను ఏ వర్గపు మనుషుల్లోనైనా సాధించడానికి మంచితనమూ, సహనమే మార్గం – అనుకునే స్థితి వచ్చింది. ఇట్లాంటి మారుతున్న సమయంలోనే ఇంటర్‌లోని తన క్లాస్‌మేట్‌ ఒకడు అదాటు పడినాడు. అతనే గుర్తుపట్టి పలకరించినాడు. అతను కొంత గుర్తుచేసేవరకూ సారధికి అతనెవరో గుర్తు రాలేదు. జ్ఞాపకాలు అయిన తర్వాత సారధిని ఇప్పటి వివరాలడిగినాడు. చెప్పడం అయిష్టంగానే ఉన్నా, అవతలి వ్యక్తి అడిగినందుకు క్లుప్తంగా… ఆస్తి అప్పులకు పోవడం… భార్యపోవడం … ఇద్దరు పిల్లలు… జీవితంలో ఇంకా స్థిరపడలేకపోవడం… వీటి గురించి చెప్పినాడు.

అతనన్నాడు – “ఇట్లయిపోయినావేంరా ? అప్పట్లో నీ ఇంటలిజెన్స్ చూసి ఏ ఐ.ఏ.యస్‌. వో అవుతావనుకునేవాళ్ళం” అని బాధ పడినట్లే చెప్పి, తర్వాత తను బ్యాంకాఫీసర్‌ కావడం – తన ఆదాయ వివరాలు – ఇప్పుడు సమాజంలో తనకున్న పొజిషన్‌ – ఇవన్నీ కలగలుపుతూ ‘బతకడం’ గురించి చిన్న లెక్చరిచ్చినాడు. ఒకప్పుడు – కాలేజిలో ఇతనిలాంటివారంతా సారథి తెలివితేటలను అబ్బురంతో ఆరాధనతో చూసినవాళ్ళే.

ఇదే నాలుగేళ్ళ క్రితమైతే ఆ మిత్రుడు చెప్పిన ‘బతకడం’ గురించిన ఉపన్యాసాన్ని ఏకిపారేసేవాడు. “ఐ.ఏ.యస్‌.నో, ఐ.పి.యన్‌.నో అయి డబ్బుండే దోపిడీ వర్గాలకు కాయిలి కాయాల్నా ?” అని అడిగే వాడు. కానీ ఇప్పుడు ఆ మిత్రుడి ‘ఆప్త’ వాక్యాలను నిర్లిప్తంగానే ఆయినా ఓర్పుగా విన్నాడు. అసహనం చూపలేదు.
పోయేటప్పుడు ఆ మిత్రుడు – “ఇంటర్‌లో కృష్ణచైతన్య నీకు మంచి మిత్రుడు కదూ ! వాళ్ళ ‘కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ‘ బాగా అభివృద్ధి అయి మంచి పార్మింగ్ లో ఉంది. ఒకసారి అతన్ని కలుసుకో… కనీసం ఉత్తరం రాయి !” అని కృష్ణ చైతన్య అడ్రసిచ్చి పోయినాడు.

అంతవరకూ సారధికి కృష్ణచైతన్య జ్ఞాపకం కూడా లేడు. డిగ్రీలో ప్రతాపరెడ్డి పరిచయం తర్వాత కృష్ణచైతన్య మీద సారధికి ఏర్పడిన అభిప్రాయం – ‘కృష్ణచైతన్యకు సంగీతం, సాహిత్యం వంటి కళల మింద ఆసక్తి ఉంది. ఆ కళాంశ ఉన్నవాళ్ళనూ, చదువులో తెలివి తేటలు చూపే వాళ్ళనూ అతను ఆరాధానగా గౌరవంగా చూసేవాడు. ఆ రెండూ ఉన్న తన పట్ల అతని అభిమానం అటువంటిదే. డబ్బున్నవాడు కాబట్టి తను అభిమానించే వాళ్ళ కోసం ‘మంచినీళ్ళ ప్రాయం’గా డబ్బు ఖర్చు చేసే మంచితనాన్ని చూపేవాడు. అతని మంచితనం అంతవరకే పరిమితం. సమాజం మిందకి మళ్ళేంత విస్తృతమైంది కాదు’- ఈ అభిప్రాయం ఏర్పడిన తర్వాత క్రమంగా సారధిలో కృష్ణ చైతన్య దాదాపు మరుగున పడిపోయినాడు.

ఇప్పుడు తనున్న పరిస్థితిలో హైద్రాబాద్‌ పోయి కృష్ణచైతన్యను స్వయంగా కలిసేంత స్థోమత లేదు. అయినా, ఇన్నేళ్ళలో … స్వంత జీవితం-స్వంత వ్యాపారంలోకి దిగిన ఆ కృష్ణ చైతన్య స్వభావం ఏ రకంగా రూపుకట్టిందో ! … అవుతుందో కాదో తెలియని పనికి ఎవర్నో ఒకర్ని దేబిరించి అప్పు చేయడం కూడ తలకు మించిన భారమే !
అయినా ఆశ చెడ్డది కాబట్టి సారధి తన పరిస్థితిని క్లుప్తంగా చెబుతూ, ఒక పర్సనల్‌ లెటర్‌ రాసి- ఆ కవర్‌లోనే కంపెనీకి ఒక అప్లికేషన్‌ పంపినాడు. ఆశ చంపుకొంటున్న రెండో నెలలో ‘చైతన్య కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నుండి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌తో పాటు కృష్ణచైతన్య ఉత్తరం వచ్చింది. అది ఉత్తరం కూడా కాదు – చిన్న నోట్‌. ‘ప్రస్తుతం – చైతన్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ – షోలాపూర్‌ వద్ద ఏదో ఫ్యాక్టరీ నిర్మాణపు పనిని తీసుకొని, పని ముమ్మరంగా ఉన్నందున తను షోలాపూర్‌ లోనే ఉన్నట్లూ.. సారధి రాసిన ఉత్తరం హైద్రాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌కు రాయడం వల్ల, అక్కడి నుండి షోలాపూర్‌లో తనకు చేరేసరికి ఆలశ్యమయిందనీ… వెంటనే ఆర్డర్‌ టైపు చేయించి పంపిస్తున్నాననీ.. షోలాపూర్‌లోనే వచ్చి జాయినింగ్ రిపోర్ట్‌ ఇవ్వాలనీ.. ‘ చిన్న నోట్‌ రాసి ఉంది.

సారధికి మనసంతా కృష్ణచైతన్య పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మానవత్వం, కృతజ్ఞతలకు పేదా, ధనిక బేధం లేదనుకున్నాడు. అవి మనిషి స్వభావాన్ని బట్టి ఉంటాయనుకొన్నాడు. ‘స్వభావం’ మనిషిలో రూపుదిద్దుకోవడానికి కారణాలేమిటనేంత లోతుకు సారధి ఆలోచించడం మానుకున్నాడిప్పుడు. ఇప్పుడు సారధి జీవితంలో సాగుతున్న పయనం ఆ దారి వైపే. సూపర్‌ వైజర్‌ ఉద్యోగం… జీతం మూడు వేల పై చిలుకు… సారధి మనసులో కృష్ణచైతన్యకు ఏ వందోసారో మళ్ళా కృతజ్ఞత చెప్పుకున్నాడు.

రైలు ఏదో స్టేషన్‌లో నిలబడింది – కీచుమంటూ. బయట కన్నడం వినబడుతోంది. రాయచూరేమో ! ఎవరైనా దిగడమో, ఎక్కడమో జరుగుతుందని ద్వారానికి అడ్డం తొలిగి లేచి కూర్చున్నాడు సారధి. కంపార్ట్‌మెంట్‌లో ఎవరూ కదల్లేదు. జోగుతున్నారు. బయటి నుండి ఈ పెట్టెలోకి ఎవ్వరూ ఎక్కలేదు. రైలు కదిలింది.

కిటికీల నుండి బయటపడిన లైట్ల వెలుతురు, ఎత్తుపల్లాల మింద పడి ఎగిరెగిరి పడ్తోంది. రైలు వేగం పుంజుకునే కొద్దీ మరింత వేగంగా ఎగిరి పడ్తోంది. పిల్లల మీదున్న దుప్పటి సర్ది, సారధి మళ్ళా ట్రంకు పెట్టె మీద ఒదిగిపోయినాడు. మెలుకువొచ్చేసరికి మరొక స్టేషన్‌.

సారధి మెలుకువ వచ్చినపుడు సర్దుకొని కూర్చోవడం – పెట్టెలోని వాళ్ళను, ముఖ్యంగా అరవ వ్యక్తిని ఒకసారి చూడడం – తిరిగి రైలు కదలగానే పండుకోవడం. అరవ వ్యకికి మెలుకువ వచ్చినపుడు కసిగా తన వైపే చూస్తోన్నట్లు సారధికి అనుమానం “తను చాకు చూపించకుండా ఉండాల్సింది” అని నొచ్చుకున్నాడు. “అయినా, వాళ్ళ కసి చూపుల్ని భరిస్తోనే ఉన్నా గదా ! వినయంగా వాళ్ళ రాకపోకలకు అడ్డం లేకుండా ఒదుక్కొంటున్నా గదా !” అనుకుని సమాధానపడ్డాడు.

ఇట్లాంటి ఆలోచనలు కొంతసేపు. మరికొంతసేపు గతం గురించి. మరోసారి పిల్లల భవిష్యత్తు గురించి – ‘ ఇప్పటికైనా తన బతుకు గాడిలో పడింది. ఇప్పటికి ఈ ఉద్యోగం సరిపోతుంది. పిల్లల్ని చదివించుకోవచ్చు. తన పూర్తి కాని డిగ్రీని పూర్తి చేయాల. కృష్ణచైతన్యకు విధేయుడిగా ఉండి, తన తెలివి తేటల్తో అదే కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకోవాల. పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాల. ‘ ఆలోచనలు ఎక్కడో మొదలయి, మరెక్కడో తెగిపోతున్నాయి.

రైలు మజిలీ వచ్చినపుడు నిలబడుతోంది. మళ్ళా కదిలిపోతోంది. ఎంతమందిని ఎక్కడికి మోసుకుపోతోందో!… మనుషుల్లోని ఎన్నెన్ని ఘర్షణలను ఏ ఒడ్డు చేర్చడానికో!… అలుపు లేకుండా పరుగెత్తుతోంది. వాడి, గుల్బర్గా అన్నీ దాటిపోయినట్టున్నాయి. తన మజిలీ దగ్గరయ్యేకొద్దీ మనసులో ముసురు తగ్గి, మరేదో వెలుతురు తెరపి పొడచూపుతోంది. సారథి మగతగా నిద్రలోకి జారుకునే సమయంలో…

రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. ఉలిక్కిపడి లేచినాడు. పెట్టెలో అందరూ లేచినారు. బయటికి చూస్తే ఏ స్టేషనూ లేదు. మసిబూసినట్లు చిక్కని చీకటి. దూరంగా ఏదో పల్లెటూర్లో మినుకు మినుకుమంటున్న గుడ్డి దీపాలు. ఈ చిట్టడవి ప్రాంతంలో ఎందుకాగినట్లు ? ఎవరైనా చెయిన్‌ గుంజినారేమో ! ఎందుకో చెప్పేవాళ్ళు లేరు. చీకట్లోకి, ఎవరూ పెట్టెలు దిగడం లేదు. రైలు మళ్ళా కదిలింది.

‘తాను ప్యాసింజర్నేననీ, చాలా దూరం నుండీ వాళ్లతో పాటే వస్తున్నాననీ, బందిపోటును కాద ‘ని చెప్పమని అరవ వ్యక్తిని వేడుకొంటున్నాడు. సారధి బందిపోట్లతో జమ కట్టబడి శిక్షింపబడుతుండడం, కొంచెం అన్యాయమని పించిందేమో అరవ మనిషికి – ఏదో చెప్పడానికన్నట్లు ముందుకడుగేసినాడు. అతని భార్య జబ్బ పట్టి ఆపి ఏదో సైగ చేసి గొణిగింది, ‘మనకెందుకు దోవన పోయే దరిద్రం’ అన్నట్లు.

లయబద్ధమైన శబ్దం, రైలు వేగంతో పాటు పెరుగుతోంది.
అందరూ తిరిగి మగతలోకి జారుకుంటున్న సమయంలో, కంపార్ట్‌మెంటు అవతలి డోర్‌ వైపు నుండి నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయినారు. చేతుల్లో రివాల్వర్‌, బాకులు ఉన్నాయి. అందరూ ఒకేరకం దుస్తులు వేసుకొన్నారు. కంపార్ట్‌మెంటులో కలకలంరేగింది. సారధి లేచి కూర్చొన్నాడు. పిల్లలు లేచి ఏడ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లిద్దర్నీ అక్కున చేర్చుకొని సారధి జరిగేది చూస్తున్నాడు. వారిలో రివాల్వర్‌ పట్టుకొన్న వ్యక్తి అందర్నీ బెదిరిస్తున్నాడు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకొనేది మరాఠీ భాషేమో ! ప్యాసింజర్లను హిందీలో హెచ్చరిస్తున్నాడు – ఎవర్నీ కదలొద్దని హెచ్చరిస్తోన్నట్లుంది.

ఇద్దరు మనుషులు జోలెలు పట్టుకుని అందరి దగ్గరికి పోయి నగలు, డబ్బు వేయమని బెదిరిస్తోన్నారు. “ఏ మోటీ ! తుమా›రే బదాన్‌ సే మాల్‌ ఉతారో !” – లావుగా ఉన్న వృద్ధ స్త్రీ తన ఒంటి మీదున్న నగల్ని ఒలిచిస్తోంది. ఆమె మొహంలో అంతు లేని భయం. మరో ఆగంతకుడు అరవ మనిషిని చూస్తూ, “ఏయ్‌ బఫూన్‌ ! అప్నా సూట్‌కేస్‌ దిఖావ్‌ !” అంటున్నాడు. ఎదురుగా ఉన్న బక్కపల్చని మనషిని, “అరే ! దుబ్లే పహిల్వాన్‌ ! తేరేకో అలగ్ కహీ నాహై క్యా ?” అని గుడ్లురుముతున్నాడు.
బాకులు చేతబట్టి ముగ్గురు మనుషులు ఈ పని చేస్తోంటే, రివాల్వర్‌ పట్టుకున్న వాడు పైన పర్యవేక్షిస్తున్నాడు.

ప్యాసింజర్లందరి మొహంలో విపరీతమైన భయం చోటు చేసుకుంది. పడుచు అమ్మాయి నగ తీసిస్తోంటే, ఆమె రొమ్ము మింద బాకుతో సుతారంగా గుచ్చుతూ, వెకిలి నవ్వు నవ్వుతున్నాడొకడు. అది చూసి మిలట్రీ సఫారీవాలా సహించలేక, ఏదో అనబోతూ పైకి లేవబోయినాడు. అతని మొహం పగిలింది.

సారధికి అయోమయంగా ఉంది. తన జోలికి ఎవరూ రావడం లేదు. అప్పుడప్పుడూ రివాల్వర్‌ పట్టుకొన్నవాడు మాత్రం తన వైపు చూస్తోన్నాడు. సారధికి ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి… ఇదే దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు అమ్మాయిల్ని, వాళ్ళ మగవాళ్ళ యెదుటే అమానుషంగా బలాత్కరించిన సంఘటన… నడుస్తున్న రైలులో నలభై ఐదు మందిని పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన కిరాతకత్వం… రైళ్ళలో , మానవత్వం మచ్చుకైనా కానరాని రాక్షస్సుల దుశ్చర్యలు – పేపర్లలో చదివినవి, విన్నవి… ఏవేవో కళ్ల ముందు కదుల్తున్నాయి.

రివాల్వర్‌ పట్టుకొన్న వ్యక్తి సారధికి వీపు యిచ్చిన మరుక్షణమే, జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ తీసి మిందపడ్డాడు. రివాల్వర్‌ మిందనే లక్ష్యంగా మింద పడ్డ అతని దెబ్బకు, రివాల్వర్‌ ఆగంతుకుని చేయి జారి ఎగిరి పడింది. మిలట్రీ సఫారీవాలాకు తుపాకులతో అనుబంధమున్నట్లుంది. వెంటనే రివాల్వర్‌ చేతికి తీస్కొని, సారధి పట్టులో గింజుకుంటున్న ఆగంతుకుని తలకాయ కాన్చినాడు. మిగిలినవాళ్ళలో ఒకడు మిందకు దూకబోయినాడు. సఫారీవాలా చేతిలోని రివాల్వర్‌ అతని వైపు తిరిగి పేలడం – తిరిగి పట్టులో ఉన్న ఆగంతుకునికి గురి పెట్టబడటం – రెప్పపాటు కాలంలో జరిగిపోయినయ్‌.

బుల్లెట్‌ దెబ్బతో చెయ్యి చిట్లిపోయిన మనిషి కుప్పలా కింద కూలబడినాడు. మిగిలిన ఇద్దరూ జోలెల్ని జారవిడిచి కాలికి బుద్ధి చెప్పినారు. పరుగెత్తుతున్న రైలు ద్వారం నుండి రెండు పెట్టెల మధ్యకు దాటుకొన్నారు. వాళ్ళు ఎక్కడికి దాటుకున్నారో ! ఏమైపోయినారో ! చీకట్లో ఏమీ అంతుబట్టడం లేదు. వాళ్ళు మాయమవుతూనే అందరూ చిక్కిన ఆగంతుకులిద్దర్నీ చుట్టుముట్టినారు. అక్కడి సాహసంలో తాము కూడా భాగస్వాములవ్వాలనే ఉత్సాహం అందర్లో పెల్లుబికింది. సారధి పట్టులో ఉన్న ఆగంతుకుడు గుంపు పట్టులోకి వచ్చినాడు. సారధి ఆ గుంపు నుండి పక్కకు తప్పుకొని తన పిల్లల దగ్గరకు చేరినాడు. అందరూ ఆగంతుకులను తలా ఒక గుద్దు గుద్దినారు. నోటికొచ్చి నట్టు తిట్లూ, శాపనార్థాలూ కురిపిస్తున్నారు. వాళ్ళందర్నీ మిలట్రీ సఫారీవాలా కమాండ్‌ చేస్తున్నాడు. ‘ఆ హోల్డాల్‌ కుండే తాడు ఇటివ్వండి… మీ సూట్‌కేస్‌ ఛెయిన్‌ తీయండి….. అమ్మా మీ నాప్కిన్‌ ఇటివ్వండి….. ‘ అని ఆదేశాలిస్తున్నాడు. అతని ఆదేశాల ప్రకారం అందరూ కలిసి వాళ్ళిద్దర్నీ కట్టి పడేసినారు.

ఎవరో చెయిన్‌ గుంజుదామన్నారు. ప్రమాదం దాటిపోయింది గదా ! రైలు నిలబెట్టి చేసేదేముంది ? ఒకేసారి స్టేషన్‌లో ఒప్పచెబుదామన్నారెవరో ! అందరూ మిలట్రీ సఫారీవాలాను అభినందించారు. అతని ‘ గురి ‘ని అబ్బురపడుతూ ప్రశంసించినారు. మిలట్రీ మనిషిలా కనిపిస్తున్న అతను, నిజంగానే మిలటరీ కమాండర్‌ గా చేసినానని చెప్పగా, అందరికీ అతని మీద మరింత గౌరవం పెరిగింది. మిలట్రీ కమాండర్‌ చిర్నవ్వుతో అభినందనలను స్వీకరిస్తోన్నాడు. అక్కడ అతనొక బెటాలియన్‌ కమాండర్‌ –
తామంతా సైనికులమన్న వాతావరణం అలుముకొంది. కొన్ని నిమిషాల క్రితం ‘చావు భయంతో కొయ్య బొమ్మలమైపోయినా’ మన్న వాస్తవం మర్చి పోయినారు. జరిగిన దాని పట్ల- ‘అమ్మో ! ఏమై యుండేదో ? ఏమైపోయేవాళ్ళమో ‘ అని తెచ్చి పెట్టుకున్న భయాన్ని ప్రదర్శిస్తూ… జరుగుతున్న దానిపట్ల ఆశ్చర్యాన్నీ… ఘనకార్యాన్ని సాధించిన సంతోషాన్నీ కలగలుపుతూ ముచ్చటించు కొంటున్నారు. జరిగినదాన్ని తిప్పి తిప్పి కథలుగా చెప్పుకుంటున్నారు. అంతా కలగాపులగంగా ఉంది.
ఏదీ కాబట్టని రైలు చెక్కు చెదరని వేగంతో చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోతోంది.

సారధిని ఎవరూ పట్టించుకోలేదు. అతన్ని తమతో పాటు ఒక సైనికునిగా కూడా గుర్తించలేదు. సారధి చేసిన పనికి ఉనికినిచ్చి, ప్రచారం చేయడానికి సారధి స్థాయి మనుషులెవరూ లేరు. సారధి దాని కోసం ఆశించనూ లేదు. బెదిరిపోయిన తన యిద్దరు పిల్లల్ని సముదాయించుకొంటున్నాడు. మూడేళ్ళ పిల్లది ముద్దు ముద్దు మాటలతో ఏదో అడుగుతూ ఉంటే, ఓర్పుగా ఏదో చెబుతున్నాడు.

రైలు వేగం తగ్గి, స్టేషన్‌లో నిలబడింది. మిలట్రీ కమాండర్‌ కిందకు దిగిపోయినాడు. ఏ స్టేషన్‌ అయిందీ తెలియడం లేదు. తెల్లవార వస్తోంది. ఐదారు నిమిషాల్లో టకటకమని ఏడెనిమిది మంది పోలీసులూ, ఎస్సై వచ్చినారు. దిగిపోయిన మిలిట్రీ కమాండర్‌ పోలీసుల వెంట రాలేదు. వివరాలు చెప్పి వీళ్ళను పంపి పెద్ద మనిషి హోదాలో స్టేషన్‌లోనే కూర్చున్నాడేమో !

పెట్టెలో ఉన్నవాళ్ళంతా కలగాపులగంగా పోలీసుల్తో మాట్లాడు తున్నారు. ఇంగ్లీష్‌లో, హిందీలో, అరవంలో, కన్నడంలో ఎవరికొచ్చిన భాషలో వాళ్లు, తలా ఒక పోలీసుతో మాట్లాడుతున్నారు. తెలుగు వాడు సారధి ఒక్కడూ ఏమీ మాట్లాడలేదు. ఎస్‌.ఐ. ఏదో మాట్లాడి ఒకరిద్దరు మగవాళ్ళను తన వెంటరమ్మన్నాడు.అంతవరకూ – జరిగిన సాహసంలో తాము భాగస్వాములమని నింపుకొన్న ఉత్సాహం అణిగిపోయింది. పోలీసుల చేతుల్లో తమ తల పెట్టి, సమయం వృధా చేసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. కానీ ఎస్సై చేయి చూపించి రమ్మన్న యిద్దరూ అయిష్టంగా కదిలారు.

పోలీసులు, అగంతుకులను రెక్కలు విరిచి లాఠీల్తో పొడుస్తా పెట్టె నుండి దింపినారు. చివరగా పెట్టె దిగుతున్న ఎస్‌.ఐ. సారధినీ, అతని అవతారాన్నీ చూసి ఎవర్నో అడుగుతున్నట్లు ‘యే కౌన్‌ ‘ అన్నాడు. ఎపరూ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఎవరి మాటల్లో వాళ్ళున్నారు. సారధి బిత్తర చూపులు చూడడం మినహా ఏం మాట్లాడలేదు.
“తుమ్‌ కౌన్‌ ?” ఎస్సై రెట్టించాడు.
“సాబ్‌… సార్‌…” తడబడినాడు.

దిగిపోయిన పోలీసు, లోపలికొచ్చి లాఠీతో ఒక్కటిచ్చినాడు. తండ్రి మింద దెబ్బ పడేసరికి పిల్లలు ఏడుపందుకున్నారు. సారధి తడబడుతూ – ‘ ఉడ్యోగంలో చేరడానికి పోతు ‘న్నానని తనకు తెలిసిన హిందీ, ఇంగ్లీషులను కలగలిపినాడు.

“ఆప్‌ కా టికెట్‌ బతావ్‌ ?”

టికెట్టడిగేసరికి సారధి గుండెల్లో రైళ్ళు పరుగెత్తినయ్‌. నీళ్లు నమిలినాడు.
“అరే కుత్తే ! అవ్‌లాద్‌ ! బాత్‌ క్యోం చాప్తే హో ?” అంటూ పోలీసు, సారధి తొడలమీద లాఠీతో మోదినాడు. సారధి ప్యాంటు జేబులో ఏదో ‘ ఠఖ్‌ ‘ మని తగలడంతో, పోలీస్‌ అతని జేబులో చేయి పెట్టి తీసినాడు.

తనను తన పిల్లల్నుండి విడదీయకుండా కాపాడిన చాకు… తనకింతవరకూ రక్షణగా ఉన్న చాకు… “జేబ్‌ మే ఛురీ క్యోం రఖా, బద్మాష్‌ ?” ఎస్సై చూపులు క్రూరంగా ఉన్నాయి. సారధికి ఏడుపోస్తోంది. ఒక్కడు కూడా సారధికీ, పోలీసులకూ మధ్య జరుగుతున్న సంఘనటలో కల్పించుకోలేదు. ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది దృష్టిలో సారధికి గుర్తింపు లేదు. సారధిని గుర్తించాల్సినంత అపసరమూ వాళ్ళకు రాలేదు. మొదటి నుండీ సారధి ఉనికితో పరిచయమున్న వాళ్ళు – అరవ మనిషీ, అతని కుటుంబ సభ్యులూ, మిలట్రీ కమాండర్‌ మాత్రమే. అందుకే ఒక అపరిచితుని కోసం సాక్ష్యాలు, సలహాలూ ఇచ్చి, చిక్కుల్లో ఇరుక్కోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు- ఆ ఫస్ట్‌ క్లాస్‌లో. పోలీసులతో జోక్యం… ప్రయాణంలో కాలయాపన జరగడం… ఇవన్నీ… ఎందుకొచ్చిన గొడవ అనుకొని, అసలీ తతంగంతో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారంతా.

సారధిలో ఒకవైపు కోవం, మరోవైపు ఏడుపు తన్నుకొస్తున్నాయి. అరవ మనిషి మాత్రం అంతా గమనిస్తున్నట్లే ఉంది. సారధి అతని వైపు ఆశగా చూసినాడు. అది నెరవేరలేదు. “రాస్కెల్‌ ! నాకు కత్తి చూపించి మా ఫస్ట్‌క్లాస్‌ కంపార్టుమెంటు ఎక్కుతావా? నేను నిన్నేమీ చేసుకోలేని అసమర్థుడ్ని చేసినావు కదూ, ఇంత దూరం ! నీకీ శాస్తి కావాల్సిందే!” అన్నట్లుచూసి మొహం తిప్పుకొన్నాడు. అతని అహం పూర్తిగా చల్లారుతోన్నట్లుంది.

సారధి భయంతో, ఏడుస్తోన్న పిల్లల్ని దగ్గరకు తీసుకొన్నాడు. ద్వారం బయట పోలీసుల చేతుల్లో ఉన్న అగంతుకుడు అకస్మాత్తుగా, “హమారా హీ ఆద్మీ హై సాబ్‌” అన్నాడు. వాడు సారధిని ‘మా మనిషే’ అనగానే, సారధి వీపు మీద లాఠీలు కదంతొక్కినాయి. మెడబట్టి సారధిని రైలు పెట్టె నుండి కిందికి తోసినారు. పిల్లల ఏడుపు కర్ణకఠోరంగా ఉంది. సారధి బ్రతిమాల్తోన్నాడు.. టికెట్‌ లేకపోవడం గురించీ….చాకు ఉండడం గురించీ… ఏవో కారణాలు, సంజాయిషీలు చెప్పుకుంటా తనకు తెలిసిన హిందీ, ఇంగ్లీష్‌లో వేడుకొంటున్నాడు.

‘తాను ప్యాసింజర్నేననీ, చాలా దూరం నుండీ వాళ్లతో పాటే వస్తున్నాననీ, బందిపోటును కాద ‘ని చెప్పమని అరవ వ్యక్తిని వేడుకొంటున్నాడు. సారధి బందిపోట్లతో జమ కట్టబడి శిక్షింపబడుతుండడం, కొంచెం అన్యాయమని పించిందేమో అరవ మనిషికి – ఏదో చెప్పడానికన్నట్లు ముందుకడుగేసినాడు. అతని భార్య జబ్బ పట్టి ఆపి ఏదో సైగ చేసి గొణిగింది, ‘మనకెందుకు దోవన పోయే దరిద్రం’ అన్నట్లు. అది పోలీసులు గమనించినా పట్టించుకోలేదు. ఒక మనిషిని ‘దోషి’ గా నిర్ధారించడానికైతే పోలీసులు అందరి మిందా జులుంచూపి చివరకు ఆ మనిషిని ‘ దోషి ‘ ఇతడే అనే నిర్ధారణ చేయించుకుంటారు. అదే – ‘ నిర్దోషి ‘ అనే సందేహం వచ్చినా నిర్ధారించుకోవడానికి తమ వైపు నుండి ఏ ప్రయత్నమూ చేయరు. పైగా తమకొక ‘ క్రిమినల్‌ ‘ తగ్గిపోతాడేమో నన్నట్లుంటారు.

అంతవరకూ అరవ మనిషిని ‘అరవోడు’ అని మాత్రమే అనుకుంటున్న సారధి మనసు ఇప్పుడు ‘డబ్బుండే నా కొడుకు ‘ అనుకునే మార్పుకు సిద్ధమౌతోంది. కేవలం – వాడి అహాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తించాల్సొచ్చిన తన చిన్న నేరానికి, వాడు ఇంత అమానుషానికి బలి చేయడం సారధి సహించలేక పోతున్నాడు. కాని ఏమీ చేయలేని నిస్సహాయత అతనికి ఏడుపు తెప్పిస్తోంది. ఏడుపు మొహంతో అందర్నీ బ్రతిమాల్తూనే ఉన్నాడు. సారధి వేడుకోళ్ళు ఏవీ పన్జేయడం లేదు. అతను పిల్లల కోసం వెనక్కు గుంజుకుంటూ వుంటే, పోలీసులు ముందుకు తోసుకుంటూ, కొట్టుకుంటూ పోతున్నారు. పిల్లల్ని అక్కడే ఉండక, తనవెంట రమ్మని సారధి అరుస్తున్నాడు. పిల్లలిద్దరూ ఏడుస్తూనే ప్లాట్‌ ఫారమ్‌ మీదికి దిగినారు.

కొడుకు – ఏడుస్తూ తండ్రి వెంట పరుగెత్తాలని చూసినాడు. చంటి పిల్లను విడిచి పెట్టలేక తిరిగి వెనక్కొచ్చి పిల్ల దగ్గర ఏడుస్తా నిలబడినాడు. సారధి ఉక్రోషం పట్టలేక “ఒరేయ్‌ ! డబ్బుండే నాకొడకల్లారా ! మీకు మానవత్వం, కృతజ్ఞతా లేవు.. రావు” అని అరుచుకుంటూ పోలీసుల చేతుల్లో గుంజుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలున్నారనే ఇంగితపు ఆలోచన చేసే సహనం ఎంత మాత్రం లేని పోలీసులు, ఆగంతుకులతో పాటు సారధిని కూడ ఈడ్చుకు పోతున్నారు. పసిపిల్లలిద్దరూ వెర్రి చూపులతో దిక్కులు చూస్తూ గొంతెండిపోయేటట్టు హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉన్నారు.

ఆ చీకట్లో వాళ్ళను పట్టించుకొనే మానవత్వం, తీరికా ఆ ప్లాట్‌ ఫారమ్‌ మింద ఎవరికి లేవు.

~~~~~~~~~~~~~~~

తొలిముద్రణ: రచన, జన్మదిన ప్రత్యేక సంచిక , ఏపిల్ర్‌ – జూన్‌ 1998
(కథాపీఠం పురస్కారం పొందిన కథ)

———————————————–

పాలగిరి విశ్వప్రసాద్విశ్వప్రసాద్ ఒక ప్రముఖ కథారచయిత. ఆయన రాసిన కథల సంపుటి “చుక్కపొడిచింది“. “నాకు వ్యవసాయం ఇష్టం. రాజకీయం ఇష్టం. నాకు అమాసి వచ్చినప్పటి నుంచీ నా జీవితం ఆ రకంగానే మొదలు పెట్టినా. కానీ, కొనసాగలేకపోయినా. తన చుట్టూ ఉన్నవాళ్ళ (సమాజం) కోసం పాటుపడాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన పాత తరం వారి భావాలు నావి… అవి రాజకీయంలో ఎదగనీయలేదు. పైగా ఆర్థికంగా రోజురోజుకూ కృశింపజేసినాయి. కడపజిల్లా గ్రామాల్లో ‘రాజకీయ’మంటే ‘గ్రామాధిపత్యమే’నన్న నిర్వచనంగా మారిపోయింది. రాజకీయం ఎంచుకున్న నేను మా ఊర్లో గ్రామాధిపత్యం నిలబెట్టుకోవాలనుకునే వారికి అనివార్యంగా ప్రత్యర్థిగా మారినా. గ్రామకక్షల్లో ప్రత్యక్షపాత్రా తప్పలేదు.” అనే పాలగిరి విశ్వప్రసాద్, పార్టీలు వదిలించుకుని కడపకు వచ్చి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు.

Posted in కథ | Tagged , , , | 1 Comment

పిల్లల్లో మానసిక ఒత్తిడి

– తుమ్మల వరూధిని

ఒత్తిడి, స్ట్రెస్, ఈ రోజులలో పిన్నల నుండి పెద్దల దాకా అందరిని పట్టి పీడిస్తున్న సమస్య. ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన. ఈ ఆందోళనకి ముఖ్య కారణం మనం చేయాలనుకునే దానికి, చేసేదానికి మధ్య పొంతన లేకపోవటం. ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావడం సహజం. ఈ ఆందోళన పనిని శ్రద్ధగా చేసేందుకు ఓ ఇంధనంలాగా సహాయపడుతుంది. కానీ అదే ఆందోళన శృతి మించితే ఒత్తిడిగా మారుతుంది. నెలల వయస్సు నుండి మనిషికి జీవితంలో ప్రతి దశలో ఒత్తిళ్ళు తప్పవు. ఓ నాలుగు మాసాల పిల్లవాడికి కూడా తనకి ఉండే ఆందోళనలు, ఒత్తిళ్ళు తనకి ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ ఆందోళన, ఒత్తిడి కొంతమంది పిల్లలలో తీవ్రమైన మానసిక సమస్యలకి దారి తీయవచ్చు. ఒత్తిడి అనేది బయటనుండే రానక్కర్లేదు – ముఖ్యంగా చిన్న పిల్లలలో బయటి ఒత్తిళ్ల కన్నా అంతర్గత ఒత్తిళ్లే ఎక్కువ. ఓ పాలు తాగే పాపడికి తల్లి కాసేపు కనపడకపోతే ఆందోళన. ఓ మూడు సంవత్సరాల పిల్లవాడికి తల్లిని వదిలి పాఠశాలలో ఓ గంట కూర్చుని రావటం ఓ భయానక అనుభవం. ఈ వయస్సు పిల్లలలో చాలా మందికి బడికి వెళ్లటం అతి పెద్ద సమస్య. ఈ భయాలకి తోడు తన భావాలని, అభిప్రాయాలని సరిగ్గా వ్యక్తీకరించలేని నిస్సహాయత; ఈ నిస్సహాయతే ఆందోళనకి, ఆ పై ఒత్తిడికి దారితీస్తుంది.

ఇంకొంచం పెద్దయ్యాక విద్యాపరమైన ఒత్తిళ్ళు, సామాజిక పరమైన ఒత్తిళ్ళు మొదలవుతాయి. మనకి సాధారణంగా కనపడే విషయాలు కూడా పిల్లలకి సమస్యాత్మకంగా కనిపిస్తుంటాయి. వీటికి తోడు తల్లిదండ్రులకి పిల్లల చదువుపై ఉండే అతి శ్రద్ధ, అన్నిటిలో తమ పిల్లవాడు ఆందరికన్నా ముందు ఉండాలనే ఆకాంక్ష, దానికి తగ్గట్టుగా ఇప్పటి పోటీ ప్రపంచం, ఆ పోటీ ప్రపంచంలో వారి వయస్సుకి, సామర్థ్యానికి మించిన లక్ష్యాలు, ఆ లక్ష్యాలని చేరటంలో అడ్డంకులు, వైఫల్యాలు అన్నీ కలిసి అందమైన బాల్యాన్ని కఠినం చేస్తున్నాయి. ఇప్పటి పోటీ ప్రపంచంలో పిల్లలకి తమకిష్టమైన ఆటలు ఆడుకోవటానికి కాని, తమకిష్టమైన ఇతర సృజనాత్మక విషయాల మీద దృష్టి పెట్టటానికి కాని సమయం చాలక (లేక) తమలో తాము వ్యాకులపడుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిళ్లకు తోడు ఏడు నుండి పది సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు ప్రపంచంలోని బాధలన్నీ తమ బాధలుగానే భావిస్తారు. ఈ వయస్సులో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు పడే ఆందోళనలు వీరిపై చాలా ప్రభావం చూపుతాయి. ఇంట్లో అమ్మా నాన్న పోట్లాడుకున్నా, అమ్మకి నాన్నకి ఆఫీసులో ఏ చిన్న సమస్య వచ్చినా, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురైనా, కుటుంబసభ్యులకి ఎవరికైనా ఆపద సంభవించినా అవి అన్నీ తమ సమస్యలే అని భావిస్తుంటారు. బయటి ప్రపంచంలో సంభవించే ప్రతి సమస్యని తమకి అన్వయించుకుంటుంటారు. ఉదాహరణకి టి.వి.లో ఎక్కడో యుద్ధమో, ఉగ్రవాద దృశ్యాలో చూసి అవి తమకి అన్వయించుకుని ఆందోళన పడుతుంటారు. భూకంపం, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల గురించిన వార్తలు విన్నా ఆ దృశ్యాలు చూసినా విపరీతంగా భయపడిపోతుంటారు. తమ భద్రత గురించి, తమ కుటుంబసభ్యుల మరియు ఆత్మీయుల భద్రత గురించీ ఆందోళన చెందుతుంటారు. వీటికి తోడు కుటుంబంలో అనుకోకుండా సంభవించే కొన్ని సంఘటనలు వీరి మీద చాలా ప్రభావం చూపుతుంటాయి, ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరు మరణించటం లేదా తల్లిదండ్రులు విడిపోవటం లాంటివి పిల్లలమీద జీవితాంతం ప్రభావం చూపుతాయి. ప్రతిదానికి ఇతరులతో పోల్చుకోవటం, తమని తాము తక్కువగా అంచనా వేసుకోవటం లాంటివి కూడా ఈ వయస్సులో మామూలే. ఇది చాలదన్నట్లు పెద్దవారు కూడా అస్తమానం తమ పిల్లలని మరింత చురుగ్గా ఉండే పిల్లలతో పోల్చి మాట్లాడుతూ ఉంటే ఇక చెప్పనక్ఖర్లేదు.

పిల్లలలో ఒత్తిడిని గుర్తించటం: పిల్లలలో ఒత్తిడిని గుర్తించటం చాలా క్లిష్టమైన పని. మానసిక ఒత్తిడికి గురయిన పిల్లలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరీ చిన్నపిల్లలలో ఈ ఒత్తిడి నోట్లో వేలు పెట్టుకోవటం (థంబ్ సకింగ్), జుట్టు మెలిపెట్టుకోవటం (హెయిర్ ట్విర్లింగ్), ముక్కు గిల్లుకోవటం (నోస్ పికింగ్), లాంటి ప్రవర్తనా సమస్యల ద్వారా బయటపడుతుంటుంది. కొంచం పెద్ద పిల్లలలో అబద్ధాలు చెప్పటం, తోటి పిల్లలని కొట్టటం, హింసించటం, పెద్దవాళ్ళని ఎదిరించటం, రోజువారీ పనులు మరచిపోవడం, నిదుర లేమి, నిద్రలో మూత్ర విసర్జన, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారు. అలాగే, చదివినదేదీ గుర్తుండకపోవడం, ఒకవిధమైన నిరాశ, నిరాసక్తి, ఏమీ చేయాలనిపించక పోవటం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏదో కోల్పోయిన భావన, తోటివారితో కలవలేకపోవడం, ఆత్మనూన్యతా భావం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొంతమంది పిల్లలలో ఈ ఒత్తిడి మూలాన పీడ కలలు, అతి భయం, చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా స్పందించటం, అకస్మాత్తుగా చదువులో వెనకబడటం, తమని తాము హింసించుకోవటం లాంటివి కూడా సంభవిస్తుంటాయి. పిల్లల మానసిక ఒత్తిడి స్థాయిని బట్టి, వారు పెరిగే వాతావరణాన్ని బట్టి, తల్లితండ్రులతో వారికున్న సంబంధబాంధవ్యాలను బట్టి ఈ లక్షణాలు ఉంటాయి.

పిల్లలు ఒత్తిడిని అధిగమించాలంటే: కుటుంబ వాతావరణం, పెద్దల ప్రవర్తన, వారందించే ప్రోత్సాహం, సహాయ సహకారాలు పిల్లలు ఒత్తిడి అధిగమించేందుకు సహకరిస్తాయి. పిల్లలలో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి, ఇలాంటి ప్రవర్తనలు పిల్లలలో సహజమే కదా అని వదిలేయకూడదు. ముందుగా పిల్లలకి మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా మెలగాలి. ఎప్పుడూ పిల్లలకి అందుబాటులో ఉండాలి. పిల్లలు స్వేచ్చగా తమ మనసులోని మాట చెప్పే విధంగా ప్రోత్సహించాలి, వారి మాటలు మనసుపెట్టి శ్రద్ధగా వినాలి. పిల్లలు తమకి ఎంత ముఖ్యమో వారికి తెలియచెప్పాలి. వారికున్న సమస్యకి కారణాలు, దానికున్న పరిష్కార మార్గాల గురించి వారితో చర్చించాలి. వారి స్నేహితులతోటి, ఉపాధ్యాయులతోటి ఎప్పటికప్పుడు సంప్రదిస్తుండాలి. వారికి ఇష్టం లేని వ్యాపకాలను, వారి వయస్సుకి మించిన లక్ష్యాలను వారి మీద రుద్దటం మానివేయాలి. వారి అభిరుచులను సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని వారికి లక్ష్యాలను నిర్దేశించాలి. పిల్లలు టి.వి.లో ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారో తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి. తల్లిదండ్రులు కుటుంబసమస్యల గురించి పిల్లల ముందు చర్చించటం, వాదులాడుకోవటం లాంటివి వీలైనంతవరకు జరగకుండా చూసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కొన్ని సహజమైన సమస్యలు, ఒత్తిళ్ళ గురించి వారికి ముందే ఒక అవగాహన కలిగించాలి. కోపం, భయం, బాధ, ఒంటరితనం, ఆందోళన, ఇలాంటివన్నీ జీవితంలో చాలా సాధారణం అన్న విషయం వారికి తెలిసేటట్లు చేయాలి. ఉదాహరణకి – పరీక్షలు, పోటీలు, సాధారణ ఆరోగ్య సమస్యలు, డాక్టరు దగ్గరికి వెళ్ళటం మొదలైన వాటి గురించి వారితో ముందుగానే చర్చించి వారికి ఒక అవగాహన కలిగించాలి. అలా అని వారి లోపాలను పదే పదే ఎత్తి చూపకూడదు. అవగాహన కల్పించటానికి, ఎత్తిచూపించటానికి మధ్య ఉన్న తేడాని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు తమ సమస్యల గురించి తల్లిదండ్రులతో గాని వేరే ఇతర కుటుంబసభ్యులతో గాని చర్చించటానికి ఇష్టపడరు; అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ సమస్యలగురించి పిల్లలతో చర్చించి వాటిని తాము ఎలా ఎదుర్కుంటున్నారో తెలియచేస్తే పిల్లలలో కొంత మార్పు రావటానికి ఆస్కారం ఉంటుంది. మంచి పుస్తకాలు కూడా పిల్లలకి మంచి నేస్తాలు. కొంతమంది పిల్లలు పుస్తకాలు చదవటం ద్వారా వాటిలోని పాత్రలకి తమని తాము అన్వయించుకుని తమ సమస్యలకి వాటిద్వారా పరిష్కారం పొందుతుంటారు. ఈ ఒత్తిడి మరీ శృతిమించినా, తీవ్రమైన ప్రవర్తనా లోపాలు కనిపించినా మానసిక నిపుణులను సంప్రదించాలి.

————————–

Posted in వ్యాసం | Tagged | 3 Comments

తడి

-స్వాతీ శ్రీపాద

రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ.

కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి పోయిన పైరు, వాన రైతు కళ్ళ చెరువుల్ను అలుగులు పొంగేలా నింపి వెళ్ళడం – ఇవీ కథ ఆరంభానికి పునాదులు. కరువుకుతోడు మనుషులమధ్య ఆరిపోని పగలు. కడుపు నిండకున్నా కసి తీరాలి, పైరు పండకున్నా పంతం నెగ్గాలి – ఇదీ చెన్నమ్మ కుటుంబ పరిస్థితి. ఆమె కొడుకు సుబ్బన్న కేసు గెలవాలి, లాయర్ కు ఫీజ్ కట్టాలి. అందుకు ఆమె చేతి కడియాలు కావాలి. తల్లి మౌనాన్ని ఆశ్రయించింది. అవుననదు, కాదనదు. కళ్ళలో తడి చెంపలపైకి జారింది. తిండి సొక్కలేదు. కంటికి నిద్ర రాలేదు. అక్క కుటుంబానికీ తమ కుటుంబానికీ మధ్య అనుకోని వైరం. శనక్కాయల పైరుకు కావలసిన తడి కారణంగా తగువులు. ఒకడ్ని చూసి ఒకడు పొలాల్ను తడి చేసుకున్నారు. ఏదైతేనేం పది రోజుల్లో మరోసారి నీటి తడి అవసరం పైరుది. సగం నేలకు కూడా చాలలేదు ఏటి నీళ్ళు, ఇంజన్లు తెచ్చి చెరువు మొత్తం ఎండబెట్టారు. ఒట్టి చేసారు. వాన కోసం ఎంత ఎదురు తెన్నులు చూసినా నీళ్ళ దారి కనబడలేదు.

ఊళ్ళో ఉన్న ఒక్కబావి నరసింహారెడ్డిది. అతనితో బేరం కుదుర్చుకున్నారు. చెరువులో తమ పొలం పక్కనున్న గుండంలో ఉన్న కొన్ని నీళ్ళు అక్కకొడుకూ అడిగాడు. తన్నుమాలిన ధర్మానికి పోలేదు సుబ్బన్న- ఆమె కొడుకు. ఆమె అక్క కొడుకు రంగన్నకు ఎదిగొస్తున్న పైరు కళ్లముందే ఎండుతోందనే ఆవేదన ఒకపక్క, గుండంలోని నీళ్ళు ఏ ఒక్కరి సొత్తూ కాదన్న ఉక్రోషం ఇంకొక పక్క. దాంతో మొదలు అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న ఆ రెండు కుటుంబాల మధ్య – కొట్టుకోవడాలు, తలలు పగలగొట్టుకోవడాలూ. దాంతో మనవడూ రెచ్చిపోయి పెద్దమ్మ కొడుకు, అతని కొడుకు తలలు పగలగొట్టాడు. ఇక ఇరుపక్షాల వారు కేసులు పెట్టుకున్నారు. పెద్దిరెడ్డి, రామిరెడ్డి కొమ్ముకాసి ఇరుపక్షాలకు అండగా నిలబడ్డారు – నిప్పుల్లేకుండా కొంపలు కాల్చేందుకు.

ఇన్నిరోజులూ అన్యోన్యంగా సంసారాలు నెట్టుకొచ్చిన అక్కాచెల్లెళ్ళు ఒకరి నొకరు ఓదార్చుకోలేరు. ఒంటిమీద గాయాలు మానినా తడిలేక పైర్లు ఎండినా నీటి గుండాలు ఒట్టిపోయినా ద్వేషాలు మాత్రం ఇంకిపోలేదు. చెరొక నాయకుణ్ణి వెంటేసుకుని లాయర్ల చుట్టూ తిరిగారు రంగన్న, సుబ్బన్న. రంగన్న కూతురి పెళ్ళికని కొనిపెట్టిన బంగారం అమ్మేస్తే అరెకరం మడి కయ్యను నష్టానికి అమ్ముకున్నాడు సుబ్బన్న. మళ్ళీ వానల సమయం వచ్చినా కేసు సాగుతూనేవుంది. పెట్టుబడులకు అప్పులు తెచ్చారు. వాన రాక, పంట లేక అప్పులపాలయారు ఇద్దరూ. అర్ధరాత్రి నిద్ర రాక కడియాలు తీసుకుని అక్క ఇంటికి పడుతూ లేస్తూ బయల్దేరింది చెన్నమ్మ. నర్సింహా రెడ్డి ఇంటి వరకు వచ్చేసరికి దీని కంతటికీ కారణమైన అతన్ని శాపనార్థాలు పెట్టింది. అతని బోరుబావి మీద రైతులంతా ఎగబడటం వల్లే అతనికి ముప్పై వేల ఆదాయం వచ్చింది. ఈ సారీ అదే ఉపాయం ఆలోచించినా రైతులకు అర్థమైంది. చీకట్లో అక్కను నిద్రలేపి ఇంట్లోకి పిలిచింది. రంగన్నకు మెళుకువ వచ్చి ఇద్దరు తల్లులనూ చూసి ఆశ్చర్య పోయాడు. కడియాలు అక్క చేతిలోపెట్టి రంగన్నకు జెప్పి కేసు కొట్టేయించమని కోరింది చెన్నమ్మ. కడియాలమ్మి లాయర్ కిచ్చి పగలు పెంచుకునే బదులు కేసు కొట్టేస్తే పగలుండవు. ఎవరూ గెలవవద్దు ఎవరూ ఓడనూ వద్దు.. అక్క చెల్లెళ్ళిద్దరూ బావురుమన్నారు. ఆమె రాక ఎండిపోతున్న బ్రతుకుల మీద చివరి తడిలా తోచింది రంగడికి. కడియాలు చెన్నమ్మ చేతులకు తొడిగింది ఆమె అక్క.

ఇదీ కథ. కథ అంతా తడిచుట్టూ తిరుగుతూంటుంది. చేలకు కావలసిన తడి, చేతులు తడపటం, చేతుల్లో తడారి పోవడం, కళ్ళలో తడి, నీళ్ళ తడి … ఇలా నానార్థాలతో వాడినా చదువరుల కంటతడి పెట్టించే కథ ఇది. చిన్న విషయాలకే పగలూ పట్టింపులూ , తలలు బద్దలు కొట్టుకోవడాలు కుటుంబాలను భ్రష్టు పట్టించి కోర్ట్ ల చుట్టూ తిరగడాలూ మానవ నైజాన్ని మనిషి బలహీనతల్ను ఎత్తిచూపుతోంది. చిన్నపాటి రైతులను అడ్డం పెట్టుకుని బొక్కసాలు నింపుకునే దళారీ పెద్దమనుషుల తీరు తెన్నులు, గొడవలు రేకెత్తించి వినోదం ఆదాయాలతో సంబరపడే దుర్మార్గపు మనస్తత్వాలను అద్దం పట్టి మరీ చూపించారు రచయిత. తన సహజ ధోరణిలో అతి సహజంగా పెల్లుబికి వచ్చిన కవిత్వ ధోరణులు కథలో ఇమిడిపోయి కొత్త అందాన్నిస్తాయి కథకు. కళ్ళెదుట కనబడే వాస్తవాన్ని అతి హృద్యంగా చిత్రించారు రచయిత. హృదయాన్ని చెమ్మగిల్లజేసే కథ “తడి”.

తడి, కొత్త దుప్పటి సంకలనం లోని కథ. కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

———————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

Posted in వ్యాసం | Tagged , | 8 Comments