నాలుగు కవిత్వపు మెతుకులు – 1


ఆధునికాంధ్రకవితాలోకంలో పెద్దగా పరిచయమక్కరలేని పేరు అఫ్సర్…

 

"ఇన్ని భాషలూ
ఇన్ని వ్యాకరణాలూ
ఇన్ని నిఘంటువులు
అన్నీ వొంటి మీది బట్టల్లా కనిపిస్తాయి
అన్నిటి కిందా
ఒకే ఒక్క శరీరం ఘోష!"

అఫ్సర్ కవిత్వం వినిపించే తత్వం ఇదేకదా అనుకొని పలకరించాం…

 

"చెరో మాటా మాట్లాడాం
ఎవరి భాషలో వాళ్లం
దూరాల్ని దగ్గిరగా 'నెట్టు'కొచ్చి…
మరిచిపోతున్న దేన్నో
మరింకోసారి గుర్తు చేసి!"

 

వలస అతనికి ప్రతిసారీ కొత్తదే
త్రిలింగదేశమంతా బాగా తెలిసినవాడు
భూగోళానికి రెండువైపులూ చూసినవాడు
పుట్టుకతోనే రెండు సంస్కృతుల సమ్మేళనం వొంటబట్టినవాడు

 

"అన్నీ విడిచి వచ్చిన వివస్త్ర ఆత్మ
వొంటి మీది తెల్లని వస్త్రం నా మనసుని విప్పదు
నీ భాషలోకి వొదిగిపోయాను
నా అన్ని వుద్వేగాలతో, నేనూ
ఆవేశాలతో"

 

తాను చెప్పకపోయినా తెలిసిపోతుంది
కవితల్లో చమత్కారమెంతుందో నేపథ్యంలో అంత సంఘర్షణ వుందని

 

కవులతో మాట్లాడితే వారి గురించి తెలిసేవి కొన్ని
మాటలయ్యాక వారి కవితలను చూస్తే మన గురించి తెలిసేవి కొన్ని

చదవండి అఫ్సర్‌గారితో ముఖాముఖి…

 

మొదటి భాగం


ముందుగా, మీకు సాహిత్య పరిచయం కలిగించిన వారి గురించి, ఆ విషయంగా మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది.?


మా నాన్నగారి ద్వారానే సాహిత్య పరిచయం. మాది కొంచెం ఆసక్తికరమయిన కుటుంబ చరిత్ర. మా అమ్మ తరఫు వాళ్ళంతా కమ్యూనిస్టులు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంలో, పార్టీ కోసం వున్నదంతా ధారపోసి, కట్టుబట్టలతో మిగిలారు. దానికి భిన్నంగా మా తాతయ్య గారు (ఆయన పేరే నాకు పెట్టారు) నిజాం కొలువులో కస్టమ్స్ అధికారి. అనేక భాషలలో పండితుడు కావడం వల్ల నిజాంకి ఇష్టపాత్రులయ్యారని ఆయన గురించి చాలా కథలున్నాయి. ఆయన పాండిత్యానికి ఇనాంగా నిజాం ఆయనకి ఎర్రుపాలెం దగ్గిర బంగారం పండే భూములు ఇచ్చారు. మా నాన్నగారి దాకా వచ్చే సరికి మాకు సెంటు భూమి కూడా మిగలలేదు. ఆయనకి పూర్తి వ్యతిరేకంగా మా నాన్నగారు నిజాం వ్యతిరేక పోరాటంలో నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. ప్రజా నాట్య మండలిలో, అ.ర.సం లో కీలక పాత్ర పోషించారు. నిజాం ఇనామ్ భూములన్నీ వదులుకున్నారు. విశాలాంధ్ర పత్రికలో చిన్న జీతానికి చేరారు. ఆ తరవాత ఉత్తర భారత దేశం వెళ్ళి అక్కడ హిందీ మహావిద్యాలయంలోచదువుకున్నారు. ఖమ్మం దగ్గిర చింతకాని దగ్గిర హిందీ పండిత్ గా చేరారు. ఆ చిన్న వూళ్లోనే నేను పెరిగాను.


మాది  ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబం. రెండు గదుల అద్దె ఇల్లు ఎప్పుడూ. నా ఎలిమెంటరీ చదువు కొంత ఉర్దూ మీడియం, కొంత తెలుగు మీడియం. చుట్టూ పుస్తకాల గుట్టలు వుండేవి కాబట్టి, బాగా చదవడం అలవాటు అయ్యింది. ఆ చిన్న వూరికి దాశరథి, పెద్దిభొట్ల, మోరియా, కవిరాజ మూర్తి లాంటి అప్పటి పెద్ద రచయితలు నాన్నగారిని కలవడానికి అప్పుడప్పుడూ వస్తూండేవారు. వాళ్ళు వున్నంత సేపూ నాకు పండగ లాగా వుండేది. ఇంట్లో చాలా సందడిగా వుండేది. “అఫ్సూర్యుడా, ఎలా వున్నావ్ రా?” అని దాశరథి ప్రేమగా పలకరించేవారు. తరవాత ఉత్తరాలు రాసేటప్పుడు కూడా ఆయన నన్ను “అఫ్సూర్యుడు” (అఫ్సర్ ప్లస్ సూర్యుడు కలిపి)  అనే పిలిచే వారు. నాకు ఉర్దూ అంటే ప్రాణంగా వుండేది. ఉర్దూ కవిత్వం ఎవరయినా చదువుతూ వుంటే ప్రాణానికి చాలా హాయిగా వుండేది. అమ్మ ముహర్రం పాటలు పాడేది. చాలా చిన్న వయసులో నేను ఖురాన్ చదువు పూర్తి చేశాను.  ఆ స్మృతి నా “గోరీ మా” కథలో వినిపిస్తుంది.


చింతకాని బడిలో మా నాన్న గారు విద్యార్ధుల కోసం “మధుర వాణి” అనే పేరుతో దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడపత్రిక ప్రతి నెలా రాయించి పెట్టే వారు. ఈ గోడపత్రిక బడికే పరిమితమయినా, విద్యార్ధుల రచనల మీద ఆయన చాలా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకొని మార్పులూ చేర్పులూ చేయించేవారు. అవన్నీ నేను గమనిస్తూ వుండేవాణ్ని. వొక రచనని ఎడిట్ చేసుకోగలగడం గొప్ప కళ అని నమ్ముతాను నేను, నా రచనా జీవితం వొక విధంగా ఆ ఎడిటింగ్ పాఠాల నించే మొదలయ్యింది.  కానీ, ఆయన అక్కడ వున్నంత కాలం నా కవిత్వం కానీ, చిట్టి కథలు గానీ వొక్కటి కూడా వేయలేదు.  ఆ గోడపత్రికలో రచన చూసుకోవాలని విద్యార్ధులందరికీ తహతహగా వుండేది. నేను రచన ఇచ్చినప్పుడల్లా, చదివి, నవ్వి “నువ్వు బాగా రాయాలంటే బాగా చదవాలి” అని నా రచనని పక్కన పెట్టేసే వారు. అప్పుడు నేను నాటకాల వైపు మొగ్గాను. నేనే పది మందిని కూడదీసి, కొన్ని సీన్లు రాసి, మా ఇంటి పక్కన కిలారు గోవిందరావు గారి గొడ్లపాకలో అయిదు పైసల టిక్కెటు మీద వాటిని వేసే వాళ్ళం. అయిదు పైసలు లేని వాళ్ళు అయిదు చీట్ల పేకలు ఇవ్వాలని రూల్. ఆ వచ్చిన పేకలతో బెచ్చాలు ఆడేవాళ్లం.


మేం – పట్టణం అంటే ఖమ్మం రావడం మా బతుకులో పెద్ద మలుపు. ఏడో తరగతి నించి నేను ఖమ్మం జ్యోతి బాల మందిర్ లో చదివాను. ఇక్కడ నా అదృష్టం బాగుండి నాకు మంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు  టీచర్లు దొరికారు. వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు, హిందీలోనూ నా చేత కవిత్వం రాయించడం మొదలు పెట్టారు. తెలుగులో నేను ఎంతసేపటికీ ఛందోబద్ధ పద్యాలు రాసే వాణ్ని. అవి నాన్నగారికి చూపిస్తే, “వచన కవిత్వం ఈ కాలం కవిత్వం” అనే వారు. కానీ, నేను పద్యాల నించి బయటపడలేకపోయాను. ఇప్పటికీ ప్రాచీనసాహిత్యం చదివినంతగా ఆధునిక సాహిత్యం చదవను. పద్యాల నించి బయటపడే సమయం వచ్చేసరికి నాకు కవిత్వం మీద ఆసక్తి పోయింది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీన పడింది. “సరిత” అని వొక మంచి సాహిత్య పత్రిక నడపాలన్న తపనతో మా నాన్నగారు “సాహితి ప్రెస్” అనేది పెట్టి నిలువునా మునిగిపోయారు.  నేను ట్యూషన్లు చెప్పుకొని స్కూల్ ఫీజ్ కట్టుకునే పరిస్తితి వచ్చింది.


ఆ పరిస్థితిలో నండూరి రామమోహనరావు గారు, నేను వొక చిన్న వ్యాసం రాసి పంపిస్తే, వెంటనే అచ్చు వేశారు. అచ్చయిన వారానికి నాకు పాతిక రూపాయలు పంపించారు. ట్యూషన్లు తగ్గించి, “ఆంధ్రజ్యోతి” కి నెలకి మూడు వ్యాసాలు రాసే వాణ్ని. ఆ తరవాత అప్పుడప్పుడే కొత్త రూపం ధరిస్తున్న “ఆంధ్రప్రభ” ఆదివారం లో అనువాదాలు మొదలు పెట్టాను. “ఆంధ్ర జ్యోతి” లో నండూరి రామమోహన రావు గారు నా వ్యాసాల్ని ఎడిట్ చేసే వారు, ఆయన నా వ్యాసాన్ని ఎట్లా మార్చి ఎట్లా వేస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాణ్ని. అవి వచనంలో  నా తొలి పాఠాలు. అలా పరోక్షంగా మొదలయిన ఆయన శిష్యరికం నా డిగ్రీ కాక ముందే ఆయన ప్రత్యక్ష శిష్యరికంలోకి తీసుకువెళ్లింది.


సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీషులో సీటు వచ్చింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండక నేను ఆంధ్రజ్యోతిలో చేరిపోయాను. సెంట్రల్ యూనివర్సిటీలో చేరమని, నెలకింతని తానే  కొంత డబ్బు ఇస్తానని  శివారెడ్డి గారు వొత్తిడి చేశారు. నా కాలేజ్ మిత్రులు నేను చదువు మానేస్తున్నందుకు కళ్ల నీళ్ళు పెట్టుకున్నారు, అనేక విధాలుగా నచ్చ చెప్పారు. యూనివర్సిటీ మెట్లు ఎక్కాలన్నది నా పెద్ద కల. అది వాళ్ళందరికీ తెలుసు.  అది ఇండియాలో ఎప్పుడూ సవ్యంగా తీరలేదు, అప్పుడప్పుడూ యూనివర్శిటీల ఆహ్వానాల మీద ప్రసంగాలు ఇవ్వడం తప్ప.


మధ్యమధ్యలో నారాయణ రావు గారు “మీరు యూనివర్సిటీకి వెళ్లాలండీ. ఈ ఉద్యోగం మీకు సరయిన చోటు కాదు ” అంటూ అంటూనే వున్నారు. ఈ లోపు మిత్రుడు రమణ మూర్తి (త్రిపుర కథల పరిశోధకుడు) “కనీసం తెలుగు ఎమ్మే చదువు” అంటూ వొత్తిడి చెయ్యడం మొదలెట్టాడు. నేను వినని స్థితిలో కవి యాకూబ్ వొక ఎమ్మే అప్లికేషన్ ఫారం బెజవాడ పట్టుకొచ్చి, నా చేత నింపించాడు. పరీక్షలు నేను రాయలేనని మొండికేసినప్పుడు రమణ మూర్తి బలవంతంగా నన్ను పరీక్ష హాలులో కూర్చోబెట్టి, నేను పరీక్ష రాస్తున్నంత సేపూ తను కాంపస్ బయట నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే వాడు. ఆ తరవాత నేను పీ ఎచ్ డీ చెయ్యాలన్నది గోపి గారి ఆలోచన. నాయని కృష్ణకుమారి, వేటూరి ఆనందమూర్తి, కులశేఖరరావు  గారు ఆ ఆలోచనకి కాయితం రూపం ఇచ్చారు. ఎప్పటి మాదిరిగానే  సీతారాం, గుడిపాటి, కాసుల  ప్రతాప్ రెడ్డి, రామదాస్,  సైదాచారి, పొనుగోటి కృష్ణా రెడ్డి, వెలిదండ నిత్యానంద రావు, పులికొండ సుబ్బాచారి, ఎండ్లూరి సుధాకర్ ఆ కాలంలోనూ  నాకు గొప్ప అండ. సాహిత్యపరంగా అప్పుడు కొంత ఆరోగ్యకరమయిన వాతావరణం వుండేదని అనుకుంటాను. ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీతో పాటు అనేక చిన్న సాహిత్య బుల్లెటీన్లు, రచయితల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుబంధాలు, సాహిత్య సభలూ…ఆ వాతావరణంలో ఇప్పుడు కాస్త మేఘాలు కమ్ముకున్నాయి.  కవులూ రచయితల మధ్య అలాంటి సన్నిహిత వాతావరణం ఇప్పుడు వుందా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.


మీ కవితాసృజనకు ముందు సాహిత్యంతో  మీకున్న పరిచయం ఎలాంటిదో చెబుతారా?

— సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యం ప్రభావం ఎక్కువ. అమ్మ ముస్లిం అమరవీరుల కథలు చెప్పేది, ఇప్పటికీ నా కవిత్వంలో ఆ ప్రస్తావనలు వుంటాయి. మా తాత మహమ్మద్ సాలార్ (“రక్త కన్నీరు” ఫేమ్) ప్రజానాట్యమండలి నటుడు. గొప్ప గాయకుడు. చెరబండరాజు పాటలన్నీ పాడే వాడు. మార్క్సిజం వొక భావనగా అలా ఆ పాటల్లోంచి నా ఆలోచనల్లోకి చేరుకుంది. కుటుంబ నేపథ్యం వల్ల మార్క్సిజం, సంబంధిత సాహిత్యం నా జీవితంలో విడదీయలేని భాగం అయ్యింది.


సాహిత్యపరంగా రాయడం చాలా ఆలస్యంగా అంటే ఎనిమిదో తరగతిలో మొదలు పెట్టాను. పట్నం వచ్చాక వొక రకమయిన వొంటరితనంలోకి వెళ్లిపోయాను. ఆ వొంటరితనాన్ని నింపుకోవడానికి ఎక్కువ చదివే వాణ్ని, కొంత రాసేవాణ్ని. కానీ, రాయడం తక్కువే.


తొలి నాటి కవిత్వం కబుర్లు కొన్ని చెప్పండి?

ఎందుచేతనో కవిత్వంలోకి నేను ఆలస్యంగా అడుగుపెట్టాను. వ్యాసాలూ, చిన్న కథలూ, అనువాదాలూ ఎక్కువ చేసేవాణ్ని.  రాసిన తొలినాళ్ళ కవిత్వం నా డైరీలకి మాత్రమే పరిమితమయ్యింది. అలా డైరీలలో రాసిన కవిత్వం వొక సారి పొరపాటున చదివిన సీతారాం దాన్ని తీసుకు వెళ్ళి నన్నేమీ మాట్లాడ నివ్వకుండా నేరుగా  ప్రెస్ లో  ఇచ్చాడు. అదే “రక్త స్పర్శ” (1985).


ఇంటర్/ డిగ్రీ చదువుకునే రోజులలో ఇంగ్లిష్ కవిత్వం రాయడం వొక పిచ్చి. అలా వొక కవిత ‘మిర్రర్” కి పంపాను. ఆ కవిత చదివి అప్పటి ‘మిర్రర్’ ఎడిటర్ ప్రభా గోవింద్ వెంటనే వుత్తరం రాశారు. నెలకి వొక కవిత నేను పంపేట్టు, ఆ పత్రిక వాళ్ళు నాకు వంద రూపాయలు ఇచ్చేట్టు ఆ వుత్తరంలో వొప్పందం అయ్యింది. అలా ఏడాది పాటు రాశాక విసుగు పుట్టి, ఇంగ్లీషు  కవిత్వం మానేశాను.


1983 లో  ఆంధ్రజ్యోతి వారపత్రిక కథలపోటీ పెట్టింది. ఆ పోటీలో  “అడివి” అనే నా కథకి బహుమతి వచ్చాక నండూరి , పురాణం ఇద్దరూ నన్ను ఆంధ్రజ్యోతిలోకి తీసుకున్నారు. సాహిత్య వేదిక బాధ్యత అప్పజెప్పారు. అంతే…మళ్ళీ తెలుగు సాహిత్యంలోకి వచ్చి పడ్డాను. ఆంధ్రజ్యోతిలో పని చేసిన కాలం స్వర్ణయుగం. ఇప్పటికీ అప్పటి ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి నాకు.  నేను చూసిన గొప్ప వ్యక్తులలో మరచిపోలేని మనీషి నండూరి.


ఆ రోజుల్లో నండూరి అంటే చాలా గొప్ప ఎడిటర్. బయట ఎవరికయినా నేను నండూరి దగ్గిర పని చేస్తున్నానంటే నా గౌరవ మర్యాదలు పదింతలు పెరిగేవి. రోజూ ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ రోజులు మళ్ళీ రావు. ఆయన తన దగ్గిర వున్న పుస్తకాలు తెచ్చి ఇచ్చి నా చేత చదివించారు. తన దగ్గిరకి వచ్చిన ప్రతి రచయితనీ నాకు పరిచయం చేసే వారు. ఎవరయినా తనని సాహిత్య సభలకి పిలిస్తే, ’నేనెందుకు అఫ్సర్ వస్తాడు లెండి’ అని నన్ను వక్తగా పంపించేవారు. ఆకాశవాణిలో నాకు ప్రసంగాలు ఇప్పించేవారు. ఆంధ్రజ్యోతిలో నాకు వచ్చే జీతం మరీ అన్యాయంగా వుండేదన్న భావన లోంచి ఆయన వివిధ రకాలుగా డబ్బు వచ్చే ఇతర పనులు కూడా అప్పజెప్పే వారు. అందులో భాగమే ఈ ఆకాశవాణి ప్రసంగాలు.  ఆ దశలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఉషశ్రీ, రావిశాస్త్రి, చాసో, ఆరుద్ర, అజంతా, రోణంకి నాకు సన్నిహితంగా తెలిశారు.

మొదటి రేడియోప్రసంగం మల్లాది రామకృష్ణశాస్త్రి కథల మీద – మొదటి సారి రేడియో స్టూడియోలోకి  పోగానే నాకు వణుకు మొదలై,  గొంతు పెగల్లేదు. ‘ఒరే నాయనా, ఈ సారికి పోనివ్వు. రేపటి నించి పొద్దున్నే లేచి కృష్ణా నది ఒడ్డుకి వెళ్ళి, ఈ ప్రసంగం అంతా పెద్ద గొంతుతో ఆ కృష్ణమ్మకి వినిపించు. నీ గొంతు ఎంత పెద్దది అయితే అంత! వచ్చే సారి నువ్వు శ్రీపాద గురించి మాట్లాడాలి. నీ గొంతు పెరిగితే నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. అయినా, నోరు లేకుండా ఎట్లా బతుకుతావు రా నువ్వు?!” ఆయన వెటకారంగా అన్నారా అని నేను నండూరి దగ్గిర బాధ పడితే, ఆయన నవ్వి “సరే. వెటకారమే అనుకో. కానీ దాన్ని కాస్త సీరియస్ గా కూడా తీసుకో. వొక ప్రయత్నం చెయ్యి, తప్పేమీ లేదు కదా! అయినా, నువ్వు ఇకనయినా కాస్త మాట్లాడ్డం నేర్చుకోవాలి. మౌనశంఖం లా వుండొద్దు. కానీ, ఉషశ్రీ ఆ మాట వెటకారంగా అనలేదులే! ఆయన అలాగే మాట్లాడతారు.” అన్నారు. నా మానసిక ఇబ్బందిని పక్కన పెట్టి, ఉషశ్రీ  చెప్పినట్టే నేను ఆదివారాలు  పొద్దున్నే లేచి నా ప్రసంగం కాయితాలు తీసుకుని, కృష్ణ నది ఇవతలి వొడ్డున నిలబడి అవతల మంగళగిరి కొండ అదిరిపోవాలన్నంత ఆవేశంగా వాటిని బిగ్గరగా చదివే వాణ్ని. అలాంటి పనులు తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, అది ఎంత మంచి సాధనో ఆలస్యంగా అయినా అర్ధం అయ్యింది. అతి కొద్ది కాలంలోనే నేను అలా ఆకాశవాణికి నిలయ విద్వాంసుడిని అయిపోయాను, కానీ ఏ నాడూ “నిలవ విద్వాంసుడి”ని కాలేదు. ప్రతి సారీ వొక కొత్త అంశం ప్రసంగానికి తీసుకునేవాణ్ని, వాల్మీకి నించి టాగోర్ దాకా, నన్నయ నించి నగ్నముని దాకా కవిత్వ సీమలో ఎల్లలు లేకుండా సంచరించాను. ఆ క్రమంలో బాగా చదవాల్సి వచ్చింది. “పది పుస్తకాలు చదువు, వొక పేజీ రాయి” అన్నది నండూరి మాట.  శ్రీకాంత శర్మ గారు ప్రసంగం  ప్రతి దగ్గిర చాలా పట్టింపుగా వుండేవారు. ప్రతి వాక్యం పట్టి పట్టి చదివే వారు, మొహమాటం లేకుండా మార్పులు చెప్పే వారు.


ఇంకో ప్రేరణ: పురాణం గారి ఇంట్లో “సాక్షి” సాహిత్య మిత్రుల సమావేశాలు జరిగేవి. రావిశాస్త్రి, చాసో, ఇస్మాయిల్, స్మైల్, కాళీపట్నం, భమిడిపాటి, అజంతా, పెద్దిభొట్ల, టీ ఎల్ కాంతా రావు, రామమోహన్ రాయ్…ఇవి కొన్ని పేర్లు మాత్రమే…ఎందరో ఈ “సాక్షి” క్లబ్ కి వచ్చే వారు. కొన్నిసార్లు ఈ సమావేశాలు అర్ధరాత్రి దాటేవి.  చిత్ర విచిత్రమయిన వాగ్వివాదాలు జరిగేవి.  వాటన్నిటికి నేను మూగ సాక్షిని మాత్రమే, ఎంత సేపటికీ మౌనంగా వుండేవాణ్ని. “ఏదయినా మాట్లాడ వయ్యా స్వామీ, నువ్వు మాట్లాడవూ, తాగవూ?!” అని పురాణం గారు పోరే వారు. నాకు చచ్చేంత బిడియం. “అఫ్సర్…కాయితం మీద కొమరం పులి. ఎదురుగా వుంటే బిక్కు బిక్కు పిల్లి” అని నండూరి నా మీద ఆశుకవిత్వం చెప్పడం గుర్తు. ఈ భయాన్ని చెదరగొట్టిన వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఉషశ్రీ మాత్రమే. ఆ తరవాత నన్ను బలవంతంగా రాజమండ్రిలో సాహిత్య వేదిక ఎక్కించి, ప్రసంగం చెప్పించిన సతీష్ చందర్. ఆ ప్రసంగం తరవాత వొకాయన వచ్చి “మీరు మహమ్మదీయులు అంటే నమ్మలేకపోయానండీ! మీ పలుకు ఎంత స్వచ్ఛంగా వుంది!” అన్నారొకాయన. నిజానికి నేను మహమ్మదీయుడిని అన్న భావం నాకు ఆ కాలంలో ఏ కోశానా లేదు. అది 1990 తరవాత వచ్చిన మార్పు మాత్రమే. నాకు నేను వొక ముస్లిం గా కనిపించడం 1990లోనే మొదలయ్యింది – యానాం వెళ్ళి వచ్చాక, “యానాం వేమన ఏమనే…” కవిత రాశాక.


నేను కవిత్వం రాయడానికి ముందు కథకుడిని, వ్యాస రచయితని. వ్యాసం రాయడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. నేను రాసిన వ్యాసాలు ప్రతి పంక్తీ చదివి, “ఇలా రాయ్” అని దాదాపూ నా చెయ్యి పట్టి రాయించారు నండూరి, పురాణం. ఎప్పుడయినా కవిత్వం రాస్తే, పురాణం కోప్పడే వారు “ నీలో మంచి వచన రచయిత వున్నాడు. ఆ కవిత్వం రాసి వాడి కొంప ముంచకు” అనే వారు. కానీ, వద్దు అన్నది చెయ్యడం నా వ్యక్తిత్వ లక్షణం. చివరికి ఆయన అన్నంత పనీ చేశాను.


ఇంకా కవితా సృజనకి ముందు నా సాహిత్య పరిచయం ఎక్కువగా వచన సాహిత్య పఠనం మాత్రమే. హై స్కూల్ దాకా తెలుగు క్లాసిక్స్ అంటే ప్రాణం. హై స్కూల్ సెలవుల్లో ఇంట్లో ఇక చదవాల్సిన పుస్తకాలు ఏమీ దొరక్క మార్క్స్, ఎంగెల్స్ చదవడం మొదలు పెట్టాను. నా పఠన ప్రయాణంలో అది అనుకోని మజిలీ. మార్క్స్ రచన ఏది కనిపిస్తే అది చదవడం మొదలు పెట్టాను.  నిజానికి మార్క్స్ భార్య జెన్నీ మార్క్స్ జీవితం ఆధారంగా ఒక కల్పిత మార్క్స్ ఆత్మ కథ రాసి మిత్రులకి వినిపించే వాణ్ని. అది నా మొదటి సృజనాత్మక వచన రచన.


ఇంటర్/ డిగ్రీ…. ఆ అయిదేళ్లూ నేను విపరీతంగా చదివిన కాలం. కానీ, కవిత్వం చదివే వాణ్ని కాదు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ  నవలా సాహిత్యం ఏది దొరికితే అది చదివాను. భారతీయ సాహిత్యం ముఖ్యంగా బెంగాలీ, తమిళం, కన్నడ నించి వచ్చిన అనువాదాలు ఎక్కువ ఇష్టంగా చదివే వాణ్ని. ఖమ్మం లైబ్రరీ, మా సిద్ధార్థ కాలేజీ లైబ్రరీలో తక్కువ పుస్తకాలే వున్నా, మంచి పుస్తకాలు వుండేవి. ఖమ్మం ప్రభుత్వ కళాశాల లైబ్రరీ పెద్దది. అక్కడ గొప్ప ఇంగ్లీష్ సాహిత్యం అంతా దొరికేది. ఇవిగాక, హీరాలాల్ మోరియా సొంత  లైబ్రరీ నాకు అత్యంత ఇష్టమయిన చోటు. మోరియా గారు ఎవరికీ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లనిచ్చే వారు కాదు, ఆయన నా కోసం వొక కుర్చీ, టేబులు ఏర్పర్చి, ‘బేటా, నువ్వు ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని చదువుకున్నా పర్లేదు. కానీ, వొక్క పుస్తకం బయటికి ఇవ్వను.  ఇక్కడే తిను, టీ తాగు” నేను ఆ ఇంట్లో కూర్చొని ఎన్ని పుస్తకాలు, పాత పత్రికలు చదివే వాణ్ణో లెక్క లేదు. మోరియా గారి భార్య, ఆయన కూతురు సాధన గంటకోసారి నాకు టీలూ, తినుబండారాలు తెచ్చి పెట్టే వారు. సాధన నా కంటే వొక ఏడాది పెద్దది, కానీ ఆమె ఇంగ్లీషులో రాసేది, అవి నేను తెలుగు అనువాదం చేసే వాణ్ని. ఇంటర్ లో మార్కులు సరిగ్గా రాలేదని సాధన ఆత్మ హత్య చేసుకుంది. నేను అతిదగ్గిరగా చూసిన వ్యక్తి అలా చనిపోవడం నాకు చాలా రోజులు నిద్రలేకుండా చేసింది. ఇది జరిగాక ఇంకో మిత్రుడు కుటుంబ సమస్యల వల్ల రైలు కింద తల పెట్టాడు, అదే సంవత్సరం నాకు అతి బాగా తెలిసిన, నాతో చింతకానిలో బాల్యంలో ఆడుకున్న వొక అమ్మాయి కాలేజీలో టీజింగ్ తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. తన భర్తతో పడక పెద్దక్క ఇల్లు చేరింది. రక రకాల  ఈ వరస సంఘటనలు నన్ను ఇంకా అంతర్ముఖిని చేశాయి. చాలా కాలం దాదాపూ నోరు పడిపోయిందన్నంత పని అయ్యింది.


కానీ, మోరియా గారు “ఇంకా చాలా వుంటాయి జీవితంలో- ఇది మొదలు అంతే!” అని నన్ను రొటీన్ లోకి నెట్టారు. కానీ, మొత్తం మీద నా జీవితం నడక నిదానించింది. అప్పుడు పుస్తకాలు నాకు గొప్ప అండ. వొక విస్మృతి కింద దాక్కోవాలి అన్న తక్షణ భావంతో గంటల తరబడి పుస్తకంలో తలదాచుకునే వాణ్ని, ఆ మృత దేహాలు గుర్తుకు  రాకుండా – కీట్స్, ఇలియట్, ఆల్బర్ట్ కామూ, కాఫ్కా, నీషే నాకు స్నేహితులయ్యారు. కానీ, నేను బాగా  పారిపోతున్నానన్న స్పృహ నాకు వుండేది.


జీవితం ఏకాంతంలో లేదు, సామూహికతలో వుంది. నేను పెరిగిన పల్లె నాకు సామూహికతే నేర్పింది.  ఈ స్పృహ వల్ల కొద్దికాలంలోనే నేను విద్యార్థి రాజకీయాల వైపు మళ్ళాను. కాలేజీకి అప్పట్లో శ్రీ శ్రీ, శివారెడ్డి, హెచ్చార్కే, వరవరరావు, కత్తి పద్మారావు, కేవీ రమణా రెడ్డి, టీ ఎల్ కాంతా రావు, పి. పుల్లయ్య (ఇప్పుడు ప్రసాద్) లాంటి వాళ్ళు వక్తలుగా వచ్చేవారు. నేను మళ్ళీ మార్క్సిస్టు బాటలోకి మళ్ళాను. విద్యార్థి రాజకీయాలలో నిండా కూరుకుపోయాక, ఇక నేను పార్టీలో ఫుల్ టైమర్ కావాలని వొత్తిడి మొదలయ్యింది. అప్పటికే పార్టీలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. కుల, మత రాజకీయాలు వున్న చోట నాకు కాస్త కూడా వూపిరాడదు. ఇంత పోరాడీ మళ్ళీ, అదే బురదలో కూరుకుపోవడం ఏంటీ అనుకున్నాను. రాజకీయాలకు స్వస్తి చెప్పాను. మళ్ళీ చదువు. మళ్ళీ సాహిత్యం. మళ్ళీ అంతర్ముఖ పర్వం.


ఆ దశలో నా కుటుంబ నేపథ్య ప్రభావం వల్ల తెలంగాణా ఉద్యమం వైపు ఆలోచనలు తిరిగాయి. తెలంగాణా ఉద్యమం ఏం చేసింది? అన్న ప్రశ్న మొదలయ్యింది. ఆ ప్రశ్నే నా బతుకు బాటని తీర్చి దిద్దింది.  తెలంగాణ ఉద్యమ సాహిత్యం మీద పరిశోధన చెయ్యాలి అన్న ఆలోచన అక్కడే వచ్చింది. మోరియా గారి ఇంటి పక్కనే వున్న విజ్ణాన నికేతనం లైబ్రరీలో సాహిత్య సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల తరవాత మళ్ళీ మోరియా గారి ఇంట్లో కబుర్లూ కాలక్షేపాలు వుండేవి. ఇవి నా లోపలి రచయితకి ప్రాణం పోశాయి.


ఉత్తరాలు రాయడం చాలా ఇష్టంగా వుండేది. ఇంగ్లీష్ కవిత్వ రచన వల్ల ఉత్తరాది రచయితలతో చాలా స్నేహాలు వుండేవి. వాళ్ళతో స్నేహం వల్ల పెద్ద నగరాల్లో వుండే రచయితలు అప్పుడప్పుడూ పుస్తకాలు పంపే వాళ్ళు. అలా నిస్సిమ్ ఏజెకీల్ తో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాను. ఆయన కవిత్వం చదవడం, మననం చేసుకోవడం కాస్త సరదాగా వుండేది. ఇప్పుడు చేత్తో ఉత్తరాలు రాసే అదృష్టం లేకపోవడం దురదృష్టం.


ఒక పల్లెటూరిలో పుట్టడం ఒక కవిగా మీకు లాభించిందనుకుంటున్నారా? లేక సాహితీ మిత్రుల సాంగత్యంలో మరింత బాగా రచనలు చేసేవాణ్నని భావిస్తున్నారా?

చింతకాని అనే వూరు  నా బాల్యంలో లేకపోతే, రచయిత కావడం సంగతి అటు వుంచండి, నేను కనీసం ఈ మాత్రం మనిషిగా కూడా మిగిలేవాణ్ణే కాదు. ఆ వూరిని నేనింకా పూర్తిగా నా రచనల్లోకి తేలేదు గానీ, ఇంకా చాలా రాయాల్సింది వుంది. కానీ వొక ఆలోచనా జీవిగా ఆ వూరు నా ఇడియాలజీ. నా థియరీ. నా పరిశోధన చూస్తే మీకు ఈ విషయం అర్ధం అవుతుంది. ‘గోరీమా” కథలో ఆ వూరి గురించి కొంత మాత్రమే రాశాను. సాహిత్య పరంగా అంటే పుస్తకాల నించి నేను పెద్దగా స్ఫూర్తి తీసుకోలేను. అనుభవం నాకు గొప్ప స్ఫూర్తి అనిపిస్తుంది. ఆ వూరే లేకపోతే నా బతుకు అసంపూర్తిగా, నా రచనా జీవితం అరకొరగా వుండేది. నాకు ప్రదేశాలు, వాటి చుట్టూ వుండే మనుషులూ, వాళ్ళ అనుభవాలు గొప్ప పుస్తకాలు. అందుకే నా కవిత్వంలో కూడా ప్రదేశాలు ఎక్కువ కనిపిస్తాయి, అది యానాం కావచ్చు, మాడిసన్ కావచ్చు. కానీ,  నేను ఎక్కడికెళ్లినా వొక పల్లెటూరి సరుకునే అనుకుంటా. దూసుకుపోయి మాట్లాడ్డం నా వల్ల కాదు.  హైదరాబాద్ వెళ్ళినా, అమెరికాలో వున్నా నాకు వొక పల్లెటూరు కావాలి. హైదరాబాద్ లో నేను ఎక్కువ కాలం వుండలేకపోవడానికి కారణం అక్కడి శృతి మించిన నగర వాతావరణం. అదనంగా సాహిత్య జనాభా మరీ ఎక్కువ కావడం. హైదరాబాద్ గొప్ప నగరం. అందులో నా పల్లెటూరి మొహానికి చోటు ఎప్పటికీ లేదు. హైదరాబాద్ గురించిన ఈ ambiguity ఇప్పుడిప్పుడే కాస్త తొలగుతోంది. వొక దూరం, వొక దగ్గిర తనం, వొక తెలియని అయిష్టం, తెలిసీ తెలిసినట్టున్న ఇష్టం , హైదరాబాద్ నా వాస్తవంలోంచి చేజారిపోతున్నదన్న బాధ ఇప్పటి నా తాజా అనుభూతి. దీనికీ అక్కడి రాజకీయ పరిస్తితికి కొంత సంబంధం వుంది. ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా వుండాలన్న కోరిక కూడా లోపల్లోపల బలంగా వుంది. కానీ, నాకు మౌలికంగానే  రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. అందుకే, నేను తెలంగాణ సాంస్కృతికత మీదా, హైదరాబాద్ సాంస్కృతికత మీదా, ఆ విలువల అన్వేషణ మీదా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాను.
 

ఇక అమెరికా వచ్చాక నేను వున్న రెండు వూళ్ళు- మాడిసన్, ఆస్టిన్ – నా పల్లెటూరి మొహానికి బాగా సరిపోయాయి. కాబట్టి, సాహితీమిత్రుల సాంగత్యంలో నేను మరింత మంచి రచనలు చేయగలను అని చెప్పలేను. నికార్సైన మానవ ప్రపంచం, నిజమయిన మానవ విలువలు  సాహిత్యలోకంలో లేవనుకుంటా, రోజువారీ యుద్ధం చేసే సామాన్యుల లోకంలో వున్నాయి. అందుకే వున్న చోటే పదిలం అని నా “వలస” లో రాసుకున్నాను.  వున్న వూరుతో ఎంత అనుబంధం వుంటే అంత బాగుంటుంది. అది చింతకాని కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనంతపురం కావచ్చు, మాడిసన్ కావచ్చు, ఆస్టిన్ కావచ్చు, ఏ ఇసక ఎడారి అయినా కావచ్చు. ఇక్కడి గాలిలో, ఇక్కడి చెట్లలో, ఇక్కడి నీళ్ళలో, ఇక్కడి మనుషుల్లో నేను కలిసిపోవాలి. ఆ కలిసిపోవడంలోని ఆనందం, అంతకన్నా గొప్ప అనుభవం ఏ పుస్తకమూ ఇవ్వదూ, ఏ రచయిత సన్నిధీ ఇవ్వదు. "స్థావరం నా సమాధి. జంగమం నా ఇలాకా” అని “ఊరి చివర” లో వొక చోట రాశాను. జీవితం ఎప్పుడూ అద్దె ఇల్లు బతుకు మాత్రమే….కాబట్టి, ముందు నాకు ఇప్పుడు వున్న ఈ క్షణం, ఈ  ఊరు బాగుండాలి, అప్పుడు నా నోరు బాగుంటుంది. నా కవిత్వమూ బాగుంటుంది – బాగున్నా లేకపోయినా అది కనీసం నాకు తృప్తినిస్తుంది.

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

Posted in వ్యాసం | Tagged | 42 Comments

ఖననం

చూరు కింది తడి ఎండలో పిట్టలు స్నానానికి రాక ముందు,

కొండల నీడలు ఊరి మీద పడడానికి చాల ముందు,
నాకున్న ఒకే ఒక తోలు పెట్టెలో
ఎముకల వేణువులు సర్దుకుని,
కాంతి తగ్గిన చుక్కల గొడుగు నీడల్లో నడుస్తూ,
అతడి వెంట ఎందుకు వెళ్లానో… ఇద్దరం మరిచిపోయాం.
మాటల నిప్పుల మీద కాల్చిన
మొక్కజొన్న పాటలు వింటూ,
ఊరు మరిచిన ఈగ నయ్యాను,
మస్తిష్కం మడతల కింద
మర్మర ధ్వనులుండిపోయాయి.
వానా కాలంలో చెట్లు ఎందుకలా ఏడుస్తాయో,
ఎండా కాలంలో లోపల్నుంచి
ఎందుకు దహనమవుతాయో
తెలుసుకుందామని చాల మందిని అడిగినట్టే అతడినీ అడిగాను.
జవాబు కావాలంటే చావును వరించాలంటే,
అదెంత భా‍గ్యమని,
తోలు పెట్టెలో ప్రాణాలు సర్దుకుని బయల్దేరాను.
రంధ్రాలు ఎలా మూసి తెరిచినా ఎముకలు మోగవు.
మొక్కజొన్న పొత్తులు చల్లారి పోయి
చెవుల-గాయాలవుతున్నాయి.
అతడొక నిర్విరామ కార్యశీలి.
అందిన సత్యం ఉన్న వాడు.
అపజయాలు దాటుడురాళ్లైన వాడు.
తోలు పెట్టెలు పోగు చేస్తూ ఇంకెటో వెళిపోయాడు.
అస్థికలు ఖననం చేసే చోటు కోసం
వెదుక్కుంటూ నేను.
Posted in కవిత్వం | 2 Comments

శాపగ్రస్త మండూకము – పేదరాశి పద్యము కథ

సంక్షిప్త కథ

సకలైశ్వర్య వైభవాలతో తులతూగుతున్న ఒక రాజునకు సంతానలేమి అనబడే తీరని లోటు. రాజోద్యానవనంలో ఒకనాడు అతడికి మనుష్యుల పగిది మాట్లాడగలిగే కప్పతో పరిచయము. పెళ్ళీడుకి వచ్చిన పిదప పాపని యొక కప్పకే ఈయవలెనని నుడివి కప్ప అతనికి పసిపాపని యొసగుట. రా జందులకు సమ్మతించుట. పిల్లని అల్లారుముద్దుగా పెంచిన రాజు కప్పకు చేసిన ప్రతిన మరచుట. తిరస్కృత మండూకము అదను చూచి రాకుమారితో పరిచయము పెంచుకొనుట. వారి స్నేహము గాఢానుబంధమగుట. రాకుమారి ఇతర రాకుమారుల యెడ ఉత్సాహము చూపకపోవుట వలన స్వయంవరములు చెడుట, రాజునకు మిక్కిలి ఆతురుత కలుగుట. తుదకు రాజునకు వింత స్నేహము గూర్చి తెలియుట. ఇరువురిని విడదీయు ప్రయత్నమూని రాజు ఉద్యానవనిలో ముళ్ళపొదలు నాటించుట. కప్పందు చిక్కుకొన రాకుమారికి యెడబాటు కలుగుట. దుస్సాధ్యమౌ యెడబాటుకు రాకుమారి బాధపడి ఉద్యానవని కరుగుట. ప్రాణాపాయ స్థితి బడి యున్న కప్పను రక్షించి సాకుట. కప్ప రాకుమార్తెను వివాహమాడుమని కొరుట. రాకుమార్తె సమ్మతించుట. వివాహమాడిన మరుక్షణమే కప్పకు శాపవిమోచనమగుట. ఇరువురును సుఖముగ వర్థిల్లుటయే కథాసారాంశము.

******************************************

1. క.

శ్రీమన్మంగళ నామా,
శ్రీమన్మనోబ్జ విలసిత శ్రేయోధామా,
శ్రీమధ్ధశరథరామా,
మా మానసవీథిని నిలుమా రఘురామా!

2. వ.
ఆని యిలువేలుపును మదిఁ దలచి, నేను చెప్పఁదలఁచుకున్న కథ యేమిటంటేని…
3. తే.

భరత వాఙ్మయ వాహినీ ప్రథిత బాల
నీతికథలు పలుదిశల జాతి-దేశ
భేద మారయక పెరసి పేర్మిఁ బడసె
ఫెయిరి గాథల కైవడిఁ బేరుకెక్కె.

4. క.

వెళ్ళగ వెళ్ళగ వేఱ్వే
రూళ్ళకు నోళ్ళం బడన్ దొలుత నా కథలం
దూళ్ళును మాఱెన్, బాత్రల
పేళ్ళును మాఱెన్ బదపడి పెంపును హెచ్చెన్.

5. ఆ.

అవ్వికల్ప కథల నాశ్చర్యజనకంబు
శాపగ్రస్తుడయ్యు కూపమండు
కమ్ము రూపుఁ దాల్చి కలఁత డెందము కుందు
రాకుమారు గాథ రండు వినుఁడు.

6. చ.

అనగఁ యనంగ రాజొకఁడు, హార్ధము మీఱగ భృత్యులన్ విధే
య నగరి వాసులన్ సతతమాప్తుల భంగిఁ దలంచి న్యాయపా
లన భువినేలుచుండ , సకలైశ్వరికంబులు భోగభాగ్యముల్
ధనకనకంబు లేఁపుగ పృథగ్విధిఁ గల్గె నపత్యవర్జముల్.


7. మ.

ఒకనాఁడా ధరణీశుఁడేఁగెడు విహారోద్యాన మార్గానఁ దా
బెకబెక్కాడెడు మండుకం బొకటి గాన్పింపన్నటన్నిల్చి తా
బెకబెక్కాడెఁ బరాచకమ్మెనిచి, పృథ్వీనాథ ! సంతాన సి
ద్ధి కొఱయ్యెన్నని కుందకోయి యని నుడ్వెన్ గప్ప నిస్సంతుతోన్.

8. క.

అటునిటుఁ జూచె చకితుఁడయి
యెటుదీ యశరీరవాణి ? యిటదని మదిలోఁ
దుటతుట వడుచు తటాకము
తటి కేఁగె తుదకు తెలియక తారణవిధమున్.


9. తే.

అంత నొక మండుకము రాజు చెంత గెంతి
బెకబెకా యని మాట్లాడితి కనుక నిను
తుష్టుఁ జేయు నిమిత్తము తొందఱిల్లి
మర్త్యభాషణ జేసితి మనుజవర్య.

10. వ.
అది విని రా జమితాశ్చర్యమునకు లోనయ్యు దానిఁ గప్పిపుచ్చి, తన సంతానరాహిత్యము మండూకమున కెటులఁ దెలిసినదో తెలియక యదియే ప్రశ్నము నడుగగా-

11. ఆ.

భాష నేర్వఁగల్గువాఁడను మనుజుల
సంగతుల తెలిసికొనంగలేనె ?
గొడ్డువోయె గృహము బిడ్డపాపలలేమిఁ
దల్లడిల్లునీకు తపనఁ దీర్తు.

12. వ.
అది విని యా భూపాలుడు..  

13. శా.

మర్మంబున్నది, తెల్పు తెల్లముగ నీ మాయోపదేశంబు నే
ధర్మాత్మంబని యెట్లునమ్మగలనే ? తథ్యంబుగా నెద్దియో
తీర్మానించుక వచ్చినావిట కనెన్, ధీయుక్త యేమంటివో ?
కూర్మిం జూపుట నేఱమో ? యుపకృతుల్ ఘోరాపరాధంబులో ?

14. క.

అని పల్కి మఱల నెమ్మది
నెనరున వివరించి కప్ప నెమ్మిన్ దెలిపెన్
మనుజునకున్ నిజతర్షము
ననునయ మొప్పం దన పను లనుకూలింపన్.

15.ఆ.

ఒక ముని కరుణింపఁ జికచిక చక్కని
పాపను వరకృపగఁ బడసినాను
దాని నీకొసగెదఁ గానిఁ బెండ్లికి దానిఁ
దోయసూచకమున కీయవలయు.

16.తే.

అనుచు కొంత దవుకు గెంతి యచట పొత్తి
ళులఁ బరుండిన పసిపాఁప నెలమిఁ జూపె
చూడ ముచ్చటౌ చక్కని చుక్కఁ బాఁపఁ
జూసి రాజు వాగ్దానము జేసె నచటె.

17.క.

ఎప్పటి పెండ్లి విశేషమొ ?
యెప్పటి కీ పట్టి యట్టి ఈడుది యగునో ?
యిప్పటి ప్రతినలు గుఱుతిడి
క ప్పప్పటికున్నఁ జూతు కర్తవ్యంబున్.

18.వ. అని మది నెంచి వాగ్దాత మిక్కిలి సంతుష్టుఁడై పొత్తిళ్ళలోని పాఁపను దన సౌధమునకు తీసికొనిపోయి, లేకలేక యింట వెలిఁగిన దీపము గాన నామె నల్లారుముద్దుగాఁ బెంపసాఁగెను. చిరకాలమున కా రాకుమారి యుక్తవయస్కురాలయినది.   

19.క.

కొలది వసంతముల కడ మ
ఱల భూపాలు డల వనిఁ దరలె వాహ్యాళిన్
దలఁ ద్రిప్పడు మండూకపు
కొలనిన్ గనఁడే నిలువఁడె కొంతయు నచటన్.

20.వ. రాజు తన ప్రతిన మఱచినాడని యూహించి వర్షసూచకము బాధపడి-

21. ఆ.

మనసువడ్డఁ బలు ప్రమాణములుఁ గుదుర్చు
మనసు తీఱిన మఱుక్షణమె మఱచుఁ
బ్రతినఁ బూని పిదపఁ బ్రతినివర్తితుఁడౌట
క్రొత్త గాదు మర్త్యు చిత్తవృత్తి.

22.ఆ.

తానొకటిఁ దలఁచిన దైవ మొం డొనఱించుఁ
వింత గాదిది విధి విలసనంబు
భీరు విడుములందు బేలవడి వగవ
ధీరబుద్ధి నిలచు ధిక్కరించి.

23.వ. అని తలఁచి, మనసు దిటవు చేసికొన్న కొలఁది దినములకు…

24.మత్త.

రాకుమార్తెకు ప్రీతిపాత్రపు రత్నహారము మాయమై
శోకమున్ గలిగింప, సుందరి శోభ తగ్గెను, తండ్రి యు
ద్రేకి యయ్యెను, సేవకుల్ పలుదిక్కులన్ బడి రెంతకున్
గాకపోయిరి సిద్ధులంతట హారమే కఱిపూసయై.

25.ఉ.

దూరమునుండి యా గొడవ తోయనివాసి కన్పట్టి నిక్కఁమౌ
గూఱిమి జూపనిద్దె యనుకూలితమైన నెపమ్ముగాఁ గనెన్
జేఱెను రాకుమారి కడఁ జేతును నీకు సహాయ మమ్మి, నీ
కోరిక తీర్చు కార్యము నకుంఠిత దీక్షఁ దలంతు నే ననెన్

26.సీ.

కప్ప మాట్లాడెనా ? కలగంటినా ? యని చిగురుబోడిఁ దన ముంజేయి గిల్లు
కొనె, గిల్లిఁ నటునిటుఁ గని తెలతెలబోయె, తెల్లబోయి మఱల తేఱిపాఱఁ
జూచి, నాకేలఁ జే సూచెదవు చిఱుగప్పా మర్త్యుల పగిది భాషలాట
నేర్పరివై నీవు నేర్పుగ సాయంబనిం దలచి వెఱఁగు వొందుచుండె.

27.తే.

కన్నులింతవి చేసిన కన్నెనటనె
నిల్వ వదిలి గెంతుచుఁ బోయె నెటకొ నబ్బె
కబెకము తిరిగి వచ్చెను కఱచి తెచ్చె
నోట,రాకొమరి కడకు నేవళమును.

28.మ.

క్షణకాలంబున చెప్పె నప్పడతి – దుస్సాధ్యంబుగా నెంచి మా
పనివారల్ కొఱగానివారయిన సద్భావంబుతో వచ్చి యం
తనె జింతన్ దగ రూపుమాపు నుపకృత్యం బెన్ను రీతిన్ ఘటిం
చిన మండూకమ, చెప్పుమే విధిని నీ స్నేహంబు దీర్పందగున్

29.క.

విని మండూకము, స్నేహితుఁ
డని నను నీవరసినఁ దగు ననెను నెనరుతో
ననుదినమును నిజగృహమున
ననుమతి నిచ్చినఁ దగుననె నతి వినయముతోన్.

30.వ. పడతి కా మాట లమితముగా నచ్చినవి. ఆ దినము నుండి రూపవతియైన రాకుమారియు మండుకమును స్నేహితులయినారు. వారి నెయ్యము కొలఁది దినములకే ప్రగాఢస్నేహముగా మారినది.   

31.ఆ.

రాజు వాక్కు నిష్ప్రయోజనమైనను
రాకుమార్తె కాదరాభిమాన
పాత్రమైతిఁ జాలుఁ బ్రతిన యూనెన్ దండ్రి
దీర్చునేమొ పట్టి తెలియకుండ

32.వ. కప్ప యానందమున కవధులే లేవు. రాకుమారి మందిరమునకు వచ్చి విచిత్ర కథలు గాథలు ననుదినము కొంగ్రొత్త రీతులలో నాశ్చర్యాతిరేకమును గలిగించుచుఁ జెప్పుచుండ.

33.క.

ఈ కప్ప కింత జ్ఞానం
బే కతమున నబ్బె ననుచు వివేకించుకొనన్
భేక మసాధారణమని
యా కొమ్మకుఁ గొన్నినాళ్ళ కవగతమయ్యెన్.

34.వ. ఇన్ని వింతలును విశేషాలును ఏలాగు తెలిసితివని యబ్బురపడి-  
35.క.

ఎక్కడ నేర్చితి కూర్చితి
వెక్కడి చిత్రాతి చిత్ర హేలాకథలో
దిక్కుల తెరువరివై యే
దృక్కులఁ జూచితి తెలుపుమ తెప్పునఁ దెలియన్.

36.క.

యడిగినను బదులిడక పద
పడి మఱియొక కథనము వడి వడి నుడువంగన్
కడ కిఁక జతనము వృథ యని
విడచెను పడచుది విడుచుటె విధి యనిపించన్.

37.ఉ.

అంతట రాకుమారికి స్వయంవర వేడుక చేయఁబూనె, శ్రీ
మంతుల ధీరకార్య సుసమర్థుల మాన్యుల వీరశూర సా
మంతుల కీర్తిశాలిధృతిమంతులఁ బల్వురఁ జేఱఁబిల్చె, భూ
కాంతుడు, శ్రేష్ఠునెంచి వరకాంతకుఁ దోడుగఁ గట్టఁబెట్టఁగన్.

38.ఉ.

వచ్చిరి దాఁపువారు మఱి వచ్చిరి దవ్వుల రాజరాజులున్
వచ్చిరి దారుదారె జనవంద్యులు వచ్చిరి పెండ్లియాడ వా
ర్వచ్చిన దారిఁ బోవలసి వచ్చెను వచ్చిన వారినెవ్వఱిన్
మెచ్చదు నచ్చదెవ్వఱిని మేల్పడి వచ్చిన మేదినీశులన్.

39.వ.

స్వయంవర వేడుక ముగిసినది కాని వివాహమహోత్సవము మాత్రము జఱుగలేదు. ఈలాగు రెండు స్వయంవరాలు ముగిసిన పిమ్మట రాజున కనుమాన మేర్పడినది.  

40.శా.

పేరాశల్ మదిఁ గూర్చి భూవిభుల సత్ప్రీతిన్ స్వతంత్రించి నే
రారమ్మంటి, మహత్త్వ ధీయుతలు విభ్రాజుల్ ఘనుల్ వచ్చినా
రీ రాజ్యమ్ము స్వయంవరోన్ముఖుల వర్జించెన్ వరింపన్ గటా
నారీశ్రేష్ఠ నిరాకరించె కడకున్నాకెంత గో డయ్యెనో !

41.క.

కనుగొనవలె నెందులకీ
వినుతాంగిఁ బలువుఱ నిట్లు వెడలించెనొ యీ
యనుమానము దీఱ ముదిత
యనుఁగుఁ జెలిగత్తెల నడుగ ననునయమబ్బున్.

42.వ. పిదపఁ జెలికత్తెల ద్వారమున మండూక స్నేహితమును గూర్చి రాజు తెలుసుకొని-

43.చ.

ప్లవమును బ్రత్యహంబుఁ దన ప్రక్కకుఁ గూర్మిని జేఱఁదీయు న
న్వివరముఁ గన్నరాజు కడు విహ్వలుఁడై ప్రతిచర్యగాఁ బ్లవం
గ వనిని ముళ్ళకంచెల విఘాతము లేర్పఱిచెన్, గృతార్థుడ
య్యె వెతలు దెచ్చి యెడమేర్పడఁ గుందిరి మిత్రులిర్వుఱున్

44.సీ.

వఱువాత మేల్కొని వచ్చెనా నుడువుల ప్రావృషిజమ్మని పాఱఁ జూచు
తరువాత మధ్యాహ్న మరుదెంచు లెమ్మని యనునయించుకొనును దనను దానె
సాయంత్రమా మాట సాయంబు రాదేమె చేఱరమ్మని నీవె చెప్పుమనును
రేరాజు వచ్చెలే మారాము జేయకే శాలూరమా ! యిఁక చాలు ననును

45.ఆ.

ఎదురు సూచి చూచి కుదురులేని మనసు
కొలఁది దినము లిటుల గుందుచుండి
వెతికి చూడ నెంచె వెడలి యుద్యానము
స్నేహితున్ మఱలను సేకరింప

46.వ. వెడలిన రాకుమారి కుద్యానవనములోఁ గొలని ప్రక్కన ముళ్ళపొదలోఁ జిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో నున్న కప్ప కనఁబడినది. తనలోఁ దాను మాటలాడుకొనుచు బాధపడుచున్న కప్పను జూచి రాకుమారి హృదయము ద్రవించిపోయినది.     

47.క.

కప్పనుఁ గానే విధివశు
కప్పగఁ బ్రతికితిఁ దుదకిఁకఁ గానలఁ  బడి నే
కప్పగ చత్తునొ కద నా
క ప్పరమేష్ఠి విధి వ్రాయు కారణమేమో !

48.వ. మాటలాడు స్థితిలో లేని మిత్రుని రాకుమారి యరచేతఁ దీసికొని నెమ్మదిగాఁ దన మందిరమునకుఁ గొంపోయినది.    

49.శా.

అయ్యయ్యో ! ప్రియమిత్రమా ! యెటుల నీవా తుప్పలన్ జిక్కితో ?
కుయ్యాలింపను లేకపోతిని గదే, కూళాత్ము రాలైతినే,
అయ్యా ! బాధను మాన్పలేని యసహాయన్ నన్ను మన్నింపుమా,
నెయ్యంబుబ్బ సపర్యఁ జేతు సఖుడా ! నిన్ సాఁకి కాఁపాడెదన్

50.ఆ.

నీ యవస్థఁ జూచి నిల్వలేకున్నాను
దూట్లు వడ్డ మేని పా ట్లడంచి
స్వస్థత బడయింతు బల్మి చేకూఱుతు
చెల్లఁబోకు నీవు చెలిమికాఁడ !

51.వ. కాని-  
52.తే.

వే సపర్యలు జేసియున్ వీసమంత
గుణము ఛాయ లేవియు పొడఁగొనవు తనకుఁ
గప్ప నివ్విధి చూడలేక తెగబడని
శోకసంతప్తు రాలయ్యె సుందరాంగి.

53.వ. కోలుకొని మఱల గెంతుచుఁ దిరుగాడు కప్పను జూచు యాశ నిరాశ యని వగచినది.
54.క.

నచ్చిన బండము నెద్దియొ
తెచ్చిన సంతోషము గొనుఁ దెఱపియుఁ గలుగున్
దెచ్చెద నీకేది వలయుఁ
జెచ్చెరఁ జెప్పుమని వేఁడెఁ జేడియ ప్లవమున్

55.వ. దాఁచుకున్న బాధలును, చెప్పకున్నఁ  గోర్కెలును, ఆప్తుల వద్ద దాఁగునా ? రాకుమార్తె యట్లు గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁగాఁ , దుదకుఁ గప్ప-  

56.క.

ఉన్నది నాకొక కోరిక, యిన్నాళ్ళుగఁ దీఱని దది, యెటు లది తీఱున్
దెన్నెఱుఁగక నేఁ దెలుపను,
చిన్నది కాదది, సులువుగఁ జెప్పఁగ లేనే.

57.వ. చిన్నదో, దొడ్డదో నీ మది నున్నది యున్నట్లు తెల్పుమనెను రాకుమారి. నా ప్రియసఖుఁడవు నీవు, నీ కోరిక తీర్చెదనని ప్రమాణము చేసినది.  

58.ఆ.

ఇన్నినాళ్ళు దాఁగి యున్న నా కోరిక
చెప్పెద విను మనసు విప్పెద విను
మేవగించుకోక, యిందువదన, ప్రేమ
తోడ నన్నుఁ బెండ్లి యాడఁగలవె?

59.వ. ఈ వింతకోరిక విని రాకుమారి అవాక్కయ్యినది. కొలది సేఁపటికి తేఱుకొని యాలోచించినది.

60.ఉ.

పాయగ లేని బంధనము, ప్రత్యుపకారపు వాంఛలేని స
ద్వ్యాయతమైన స్నేహితము, వాచెలిమై మదిఁ నిల్చె నిత్యమే
మాయలు మర్మముండని యమాయక చిత్తము ప్రాణపాత్రమున్
వే యననేల ? గాయముల వెక్కు సహాయు నుపేక్ష సేతునా?

61.వ. రోయక బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో, చిన్ని పూదండ చిన్నిమెడకు వేసి.

62.ఉ.

భళ్ళున కప్పయున్ సురిగె, బమ్మెరవోయితి నేమొ యంచుఁ దా
పుల్లవడన్ లతాంగి, తలపోయని వింతగ కండ్ల ముంగిటన్
జల్లని చూపులున్ మిసిమి ఛాయ లతాంతశరాస్త్రు రూపముం
జెల్లుచు నిల్చె సుందరుఁడు చెంగటఁ బ్రాణముగొన్న ప్రేమయై

63.వ. దగ్గఱకు వచ్చి 

64.తే.

కోపవశమునఁ దెప్పున శాపవశుని
చేసి, వెండియు శాంతిల్లి సిధ్ధుడొకఁడు
శాపము తొలఁగుఁ దెన్నుగఁ బాఁపవైన
నిన్ను నాకిచ్చె నమ్మవే నీరజాక్షి !

65.తే.

నిండు మనసుతోఁ గరుణించి నీవు పెండ్లి
యాడ వీడెను గ్రహణమై నాఁడు మ్రింగి
నా బ్రతుకుఁ జీఁకటి సేసినట్టి దుష్ట
రాహువంటి శాపము నేఁడు రాకుమారి !  

66.వ. అది విననంతనే ఆశ్చర్యములో మునిగియున్నది. సరిక్రొత్తగా సిగ్గులో మునిఁగిపోయినది రాకుమారి. ఆ సమయమునకే అక్కడకు వచ్చి చేఱిన రాజు వారిని జూచి, వివరము కన్గొని యమితానంద భరితుడయ్యి, నేఱక చేసిన పాపములకు తనను క్షమింపుమని రాకుమారుని అడిగెను. రాకుమారుఁడు దొడ్డ మనసుతో రాజుని క్షమించినంతనే, రాజు వారిర్వుఱికి శాస్త్రోక్తముగా వైభవోపేతముగా వివాహము జఱిపించినాఁడు.

రాకుమారియు, రాకుమారుడును కలకాలము సుఖముగా జీవించినారు.

శుభమస్తు. 

Posted in కవిత్వం | 7 Comments

జాడ

ఇక్కడ నిన్నుకలుస్తాను

 

బహుశా ఒకే శిక్షకు గురయిన ఇద్దరు నేరస్తులు మాట్లాడుకుంటున్నట్టుగా, వేళ్ళను కాసింత లోపలికి జొనిపి కొసలకంటిన నెత్తుటిమరకలనూ,కనుకొలుకులలో  ఆరని తడిని ఏదో గొప్ప పనిలో పడి యధాలాపంగా  తుడుచుకుంటున్నట్టుగా
 

ఇక్కడ నిన్ను కలుస్తాను
 

మాటలలో పడి,  ఉత్తి మాటలతో మాటాడీ మాటాడీ చివరకు ఎదురుబొదురుగా కూర్చుని అసహాయపునీడ అద్దంలో  ఎవరినివారు చూసుకుంటూ    మోకాళ్ళ నడుమ తలకాయలిరికించుకుని నేలపై వేళ్ళతో ఏవేవో గీతలు గీస్తూ  ఉన్నట్టుండీ దిగ్గున లేచిపోయే ఆ ఇద్దరినీ చూసి పెగిలీపెగలని సన్నని నిట్టూర్పేదో నీకు మాత్రమే తెలిసిన అర్థంతో నీ నుంచీ తొలుచుక వచ్చేందుకు వేదన పడుతున్నప్పుడు
 

ఇక్కడ నిన్ను కలుస్తాను
 

కేవలం కవిత్వం  కోసం, కవిత్వం తప్ప మరేమీ కనపడక గుంపులో తల్లి చేతిని విడవకుండా ఒక అప్రమత్తత ఏదో సన్నని వణుకై తన బలహీనపు వేళ్ళతో  పట్టుకొనజూసే పిల్లవాడిలాగా ఒకింత బేలగా,ఇంకా నిను కని పెంచిన తల్లి ముందరయినా దిగంబరంగా సాగిలబడగల ధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ,  అపుడపుడయినా జీవితం ముందర భుజాల మీద చేతులు వేసుకుని మాటాడే వాడొకడికోసం వెతుకులాడుతూ
 

ఇక్కడ నిన్ను కలుస్తాను

Posted in కవిత్వం | 2 Comments

ఒక నిజ రేఖ మీద…..

1

గుడ్డితనాన్ని చెక్కుతున్నావ్ నువ్వు అదే పనిగా, అదే ధ్యాసగా తెరుచుకునే లోపే

కంటి మీద రెప్పల్ని ఇనప చువ్వలు చేస్తున్నావ్ అదే పనిగా, అదే ధ్యాసగా

వొక మోసపు నగిషీ చూపుని కిరాయికి తెచ్చుకున్నావేమో,

నీ కళ్ళ కింద ఇంకే ఆకాశాలూ, ఇంకే నేలా విచ్చుకోవడం లేదింక. పద్యం నీకొక భద్ర గది.

అది నాకు నిప్పు చేతుల నెగడు.
 

2

మంచు ముక్కని చేతుల్లోకి తీసుకుని ఒకానొక గడ్డ కట్టిన గుండ్రటి/నున్నటి లోకాన్ని

చూస్తూ చూస్తూ యెక్కడెక్కడికో జారుకుంటూ పోవాలని నీకనిపిస్తుందా,

అదే మంచు ముక్కలో నేను

గడ్డకట్టిన ఆకలి రాత్రుల్ని

చూపుని దడి కట్టిన ఇనప ఊచల్ని చూస్తాను.

కల కనే కళ్ళన్నీ రాల్చుకున్న అడివి

ఒక నిజ రేఖ మీద వూగుతున్న దొమ్మరిని నేను.
 

3

ఒక గుహలోకి చూపు మడిచి అదొక్కటే దిక్కు అనుకుంటున్నావ్ నువ్వు.

ఏడు ఆకాశాల నాలుగు దిక్కుల మూడు లోకాల చౌరాస్తా నేను.

Posted in కవిత్వం | 9 Comments

మతాల స్వరూపాలు

మతభావనలు, మనిషికీ నరవానరానికీ తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే భావించవచ్చు. ప్రాథమికస్థాయిలో, సముదాయాలుగా గుహల్లో తలదాచుకుని, వేటాడుతూ బతికిన ఆదిమానవులకు ఆహారసేకరణ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపకంగా ఉండేది. ఏదైనా జంతువును మాటువేసి చంపగలిగినప్పుడు వారికి ఆ జంతువుపట్ల కృతజ్ఞతాభావం కలిగేదేమో. తమ కడుపులు నింపి, తమ ప్రాణాలు కాపాడిన ఆ ప్రాణి తమను భవిష్యత్తులోకూడా 'కరుణించాలని' వారు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు. ప్రాంతాన్నీ, తెగనీబట్టి ఒక్కొక్క జంతువు ఆదిమానవులకు పూజనీయంగా తయారయింది. ఇప్పటికీ పాతపద్ధతులను విడనాడని చాలా ఆటవికతెగలకు చిహ్నాలుగా టోటెమ్ జంతువులు కనిపిస్తాయి. వారు వాటిని ఆరాధిస్తారు. తమ తెగకు వాటిని గుర్తుగా భావిస్తారు.
 

తరవాతి దశల్లో ఇటువంటివాటి విగ్రహాలను తయారుచేసి పూజించడంకూడా మొదలయింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలా ఒకొక తెగకీ ఒకొక జంతువు ప్రతినిధి కావడం, ఈ తెగలమధ్య పోటీలు పెరిగి కొట్లాటలు జరగడం ఆరంభమయింది. ప్రాచీనమతాలలో ఒకటైన యూదుమతంలోనూ, ఆ తరవాత వచ్చిన ఇస్లాంలోనూ ఈ విగ్రహారాధనను గర్హించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది దైవశాసనాలను తీసుకొచ్చిన మోసెస్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా భగవంతుడనేవాడికి రూపం ఏదీ ఉండదని చెప్పవలసివచ్చింది. ఎందుకంటే ఎటువంటి రూపాన్ని ఆమోదించినా కొందరికి సంతోషమూ, తక్కినవారికి ఆగ్రహమూ కలిగే ప్రమాదం ఏర్పడింది. నిత్యమూ చిహ్నాల పేరుతో కయ్యాలకు కాలుదువ్వే తెగలన్నిటినీ ఏకం చెయ్యడానికి 'నిరాకారుడైన' భగవంతుణ్ణి నిర్వచించడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.
 

మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కాని పురోహిత, అర్చక, ఋత్విజుల వర్గాలు ఈ సమస్యను మరొక పద్ధతిలో పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు శివుడినో, పశుపతి నాథుణ్ణో ఆరాధించేవారు సర్పాలను ఆరాధించేవారితో పోట్లాడకుండా ఉండడానికి పాములను శివుడి మెడలో వేశారు. అలాగే ఎద్దును శివుడికి వాహనం చేశారు. ఈ విధంగా విడిగా ఉన్న తెగలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రాచీనకాలంలోనే విజయవంతంగా జరిగాయి. మరొకవంక ఆదిశక్తిని స్త్రీరూపంలో పూజించే సంప్రదాయం, శివుడితో వైరం పెట్టుకోకుండా ఆమెను శివుడి భార్య అన్నారు. రానురాను ఈ కుటుంబం మరింత విస్తరించడంతో వినాయకుణ్ణి (ఏనుగును ఆరాధించే తెగ) వాళ్ళ కొడుకుగా పేర్కొన్నారు. దక్షిణాదిలో ఎప్పటినుంచో ఆరాధిస్తున్న వేల్ మురుగన్ (కుమారస్వామిని) మరొక కుమారుడన్నారు. హిందూసంప్రదాయంలో పాతనమ్మకాలను త్యజించడం అనేది ఎప్పుడూ, ఎక్కడా జరగదు. ప్రాచీనకాలపు నమ్మకాలన్నిటికీ ఏవో భాష్యాలూ, వివరణలద్వారా కొనసాగించడమే కనబడుతుంది.
 

ఆర్యభాషీయులు క్రీ.పూ. 1400-1200 ప్రాంతాల సింధునది ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు ఆరాధించినది తమ ప్రాణాలు కాపాడే అగ్నినీ, ప్రకృతిదేవతలైన వరుణుడినీ, సూర్యుడినీ (మిత్రుడు) మాత్రమే. ఆ తరవాత వీరి ప్రాధాన్యత తగ్గింది. ఆర్యభాషీయులకు సమకాలికులుగా మన దేశానికి వచ్చి, ఏవో అభిప్రాయభేదాల కారణంగా తిరిగి వెళ్ళిపోయిన ఇండోఇరానియన్ భాషీయులు ఋగ్వేద కాలానికి చెందిన పార్శీ మతగ్రంథం జెంద్ అవెస్తా రాసుకున్నారు. అందులో అసుర శబ్దానికి చాలా గౌరవం ఉండేది. సృష్టికర్తను అహురమజ్ద అనేవారు. వారికి దైవ అనే శబ్దం పాపిష్టిది. మన దేశంలో స్థిరపడ్డవారు మాత్రం ఈ పదాలకు వ్యతిరేకార్థాలు ఆపాదించుకున్నారు. జెంద్ అవెస్తాలో మహనీయుడుగా పేరు పొందిన జొరాస్టర్ (జరతుష్ట్ర) కశ్మీరుకు చెందినవాడనీ, అతన్నే మనవాళ్ళు వశిష్ఠుడంటారనీ కొందరి అభిప్రాయం.
 

ఆర్యభాషీయులు మన దేశంలో స్థిరపడ్డాక వారికి ఇంద్రుడు గొప్ప దేవత అయాడు. కాని కొంతకాలానికి వేటమీదా, ఏరుకుతినడంమీదా మాత్రమే ఆధారపడిన ఆ ప్రజలు ముందు పశుపాలననూ, ఆ తరవాత వ్యవసాయాన్నీ వృత్తిగా స్వీకరించారు. ఆ దశలో ఇంద్రుడి ప్రాభవం తగ్గి 'గోపాలుడైన' కృష్ణుడికీ, 'హలధరుడైన' బలరాముడికీ ఆదరణ పెరిగింది. అంతేకాక అడుగడుగునా ఇంద్రుడు కృష్ణుడి చేతిలో పరాభవం చెండడం చూస్తాం. ఇదంతా అప్పటి సమాజంలో తలెత్తిన మార్పులకు ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. క్రీ.పూ.2400 ప్రాంతాల మొదలైన సింధునాగరికత నాటినుంచీ ఉన్న శివుడి ఆరాధన మటుకు కొనసాగింది.
 

అతిప్రాచీనదశలో హిందూదేవతలమధ్య తలెత్తిన విభేదాలు ఏనాడో సమసిపోయాయి. మళ్ళీ క్రీ.శ. ఎనిమిదోశతాబ్దం తరవాత వైదిక, అర్చకవర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండిన భగవదార్చనకు ప్రజాస్వామిక లక్షణాలు ఏర్పడ్డాయి. క్రైస్తవమతంలో ఆ తరవాత జరిగిన పెనుమార్పులన్నీ మనదేశంలో ఎప్పుడో మొదలయాయి. వీరశైవులుగానూ, వైష్ణవులుగానూ బ్రాహ్మణేతరులు చాలామంది అధికసంఖ్యలో దేవతార్చనలు మొదలుపెట్టారు. కేవలం సంస్కృత మంత్రాలేకాక హిందీ, తమిళం, కన్నడం, తెలుగువంటి స్థానికభాషల్లో భక్తిగీతాలూ, పాటల రచన జరిగింది. పురాణాల అనువాదం జరిగింది. సమాజంలో అంతకంతకూ జరుగుతూవచ్చిన మార్పులు మతస్వభావాలను కూడా ప్రభావితం చేశాయి.
 

ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఏ మతంలోనైనా ప్రార్థన చేసే పద్ధతి ఆటవికదశనే తలపిస్తుంది. ఎక్కువగా దేవుడి పేరు తలుచుకోవడమే చూస్తాం. అది పిలుపే. ఎన్నో సార్లు పిలిస్తేగాని పట్టించుకోని సాటిమనిషిని పరిగణించినట్టే భక్తులు ప్రవర్తిస్తారు. సామాజిక కారణాలవల్ల తలెత్తిన జీవితసమస్యల పరిష్కారానికై 'ఆకాశంవేపు' చూడడం మనుషులకు అలవాటయింది. అలాంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని పక్కనపెడితే దానివల్ల చాలామందికి మనశ్శాంతి కలుగుతుందనే విషయంలో సందేహమేమీ లేదు. పట్టణంలోని వ్యవస్థ సరిగా లేదని అధికారులకు విన్నవించుకున్న పద్ధతిలోనే భక్తులు ప్రవర్తిస్తారు. అతని 'దయ' ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. లేకపోతే లేదు. మన బాధ్యతల్లా విన్నవించుకోవడమే!
 

ఇదంతా మతభావనలను వెక్కిరించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. సంగతేమిటంటే తక్కిన విషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించేవారుకూడా మతం విషయంలో హేతువాదవైఖరిని విడనాడతారని మనం గమనించవచ్చు. అంతేకాక తాము స్వయంగా పరిష్కరించుకోగల ఎటువంటి సమస్యకూ వారు 'దైవసహాయం' కోసం ఎదురుచూడరు. తెలియనివీ, అస్పష్టంగా అనిపించేవీ, చిక్కుముడిలాగా తమనను సవాలుచేసేవీ అయిన కష్టాలు ఎదురైనప్పుడే ఈ భక్తి వెల్లడవుతుంది.
 

మనిషికి అనాదిగానూ, అనుభవపూర్వకంగానూ అలవడిన కార్యకారణసంబంధం మతం విషయంలో బలంగా పనిచేస్తుంది. 'ఎవరో ఒకరు తిప్పకపోతే' తారలచుట్టూ గ్రహాలూ, అణువులోని న్యూక్లియస్‌చుట్టూ ఎలక్ట్రాన్లూ ఎలా తిరుగుతాయి? ఏదైనా 'తనంతట తానుగా' ఉనికిలోకి వస్తుందనే భావనను చాలామంది జీర్ణించుకోలేరు. ఏ భగవంతుడు ఏ వర్క్‌షాప్‌లో కూర్చుని అన్నిటినీ సృష్టిస్తాడో ఎవరికీ తెలియనప్పటికీ అలాంటిదేదో జరుగుతుందని జనం నమ్ముతారు.
 

మనిషికన్నా శక్తివంతుడైన ఒక పాతకాలపు భగవంతుణ్ణి ఆమోదించలేని పాశ్చాత్యులు ’ఇదిగో పులి అంటే అదిగో తోక' అన్న పద్ధతిలో గ్రహాంతరజీవుల గురించీ, ఫ్లయింగ్ సాసర్ల గురించీ వదంతులు లేవనెత్తుతారు. తమతమ సంస్కృతీసంప్రదాయాలనుబట్టి తమను చుట్టుముట్టిన బాధలనుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక జనం రకరకాలుగా భ్రమలకు లోనవుతారు. మరణించిన తరవాత ఏమవుతుందో తెలియక అయోమయానికి లోనవడం మరొక ఇబ్బంది. తక్కిన కీటకాలూ, జంతువులూ, సాధారణప్రజలేకాక కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసిన 'యుగ పురుషులు' సైతం చనిపోయాక నామరూపాలు లేకుండాపోతారని తెలిసినప్పటికీ 'మరణాంతర జీవితం' గురించిన ఆశలు మనుషుల మనసుల్లో బలంగా పాతుకుని ఉంటాయి.
 

మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.

Posted in వ్యాసం | Tagged | 21 Comments

నాకోసం నా ప్రియురాలు

 

పెరటిమొక్కలకు నీళ్ళు పోస్తూ
అదిలిస్తూ కాకులను
పదునెక్కే ఎండలో
 

నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది
 

ముదురునీలపు ఆకాశం
వెదురు పొదల గలగల
కదిలే లాంతరు నీడలు
 

నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది
 

నదీ తీరాన
మృదువైన చేతులతో
ఇసుకగూళ్లు కడుతూ

సుదూరపు కొండల నడుమ
కుంకుతున్న సూర్యుడు
 

నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది

Posted in కవిత్వం | 5 Comments

ఎవరు జేసిన కర్మ …

ఇప్పుడు నడుస్తున్నది స్పెషలిస్టుల, ప్రొఫెషనలిస్టుల యుగం.

కుక్క చేసేపని కుక్క చెయ్యాల, గాడిద చేసేపని గాడిద చెయ్యాలని పాత సామెత. 

ఈ సామెత వెనకున్న కథ మనకందరికీ తెలిసిందే. తరతరాలుగా మనం వింటూ వచ్చినదే. 
 
 
బళ్లో అయ్యవారు కథ చెబుతున్నాడు…
చాకలివారికీ గాడిదజాతికీ మధ్య బంధం తెగే కాలం దాపురించింది కాబట్టో యేమో, వివరంగా చెబుతున్నాడు.
 
అనగనగా ఒక ఊరిలో ఒక కుక్కనూ ఒక గాడిదనూ పెంచుకుంటున్నాడు ఒక చాకలివాడు. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసేది. గాడిద చాకిరేవుకూ ఇంటింటికీ బట్టలు మోసేది. ఒకరోజు పగలంతా బాగా పనిచేసి అలసిపోయి పొద్దుగూకగానే నిద్రపోయినాడు చాకలి. అదే అదనుగా ఒక దొంగ ఆ ఇంట్లో దూరి బట్టలు కాజెయ్యబోతున్నాడు. కడుపునిండా తిన్నదేమో కుక్క, మెదలకుండా పడి నిద్రబోతోంది. దొంగ వచ్చినట్టు తన యజమానికి తానే తెలియజెయ్యాలనుకున్నది గాడిద. క్షణమైనా నిలుకు లేకుండా గట్టిగా ఓండ్రపెట్టసాగింది. మాంచి నిద్రలోవున్న చాకలి మేలుకునేలోగా దొంగ పరారయినాడు. కుక్క మెల్లగా నిద్రలేచింది. కళ్లు నులుముకుంటూ లేచి చుట్టూ చూసిన చాకలికి అనుమానించాల్సిందేమీ అగుపడలేదు. బంగారంలాంటి తన నిద్ర చెడగొట్టిందని గాడిదమీద అతనికి విపరీతమైన కోపంవచ్చింది. దుడ్డుకర్రతో గాడిద వీపున వాతలు తేలేటట్లు కొట్టి, వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాడు.
 
 
బళ్లో అయ్యవారు ఈ కథ చెప్పి, పిల్లలను తేరిపారా చూస్తూ ఇందులోని నీతి ఏమిట్రా అన్నాడు. 
 
"ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాల సార్"
"అట్లా కాకపోతే!?"
"వీపున వాతలు పడతాయి సార్"
"ఏమి పడతాయీ?"
"వాతలు పడతాయి సార్"
అయ్యవారు తృప్తిపడ్డాడు. 
 
      ******      ******      ******
 
"దెబ్బలు తింటే తిన్నదిగానీ దొంగతనం జరగకుండా ఆపిందికదా సార్?", అడిగాడొక నల్లటిపిల్లవాడు. 
 
అయ్యవారు ఆలోచనలోపడినాడు. 
 
ఒక నిమిషం గడిచింది. ఇంకో కథ చెప్తా వినండన్నాడు. 
 
అనగనగా ఒక ముంగిస. ఆ ముంగిసను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు ఒక రైతు. ఒకనాడు ఆ రైతు, రైతు భార్య, యేడాది వయసున్న తమ కొడుకును ఇంట్లో ఊయలలో పెట్టి పొలానికి పోయారు. ఆ బిడ్డ వైపుగా ఒక పెద్ద పాము రావడాన్ని చూసింది ముంగిస. పాముతో హోరాహోరీ పోరాడింది. చివరికి దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికిచంపి వాకిటి బయట కాపలాగా కూర్చొంది. పొలంనుండి వచ్చిన రైతుదంపతులకు రక్తసిక్తమైన నోటితోవున్న ముంగిస, వాకిట్లో రక్తపుధారలు కనిపించాయి. తమ బిడ్డను చంపేసిందనే అనుమానం రావడంతో భోరున యేడ్చింది రైతు భార్య. తన చేతిలోని దుడ్డుకర్రతో ముంగిస తలపై బలంగా ఒక్క దెబ్బవేశాడు రైతు. గుండె చిక్కబట్టుకుని ఒక్క అడుగు లోపలికి వేశాడు. హాయిగా నిద్రపోతున్న తమబిడ్డ, ముక్కలైన పాము శరీరమూ కనిపించినాయతనికి. బయటికొచ్చి చూస్తే, తలపగిలి చచ్చి పడివుంది ముంగిస.
 
 
అయ్యవారు ఈ కథ చెప్పి, నల్లటి పిల్లవానితో అన్నాడు, ఇందులోని నీతి ఏమిట్రా?
"ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాల సార్"
 
"పాముతో పోట్లాడటమూ చంపడమూ ముంగిస చేసే పనేకదా?" 
 
పిల్లవాడు ఆలోచనలో పడ్డాడు. ఒక నిమిషం గడిచింది. 
 
"కోపంలో బాధలో ఏ పనీ చెయ్యకూడదు సార్."
 
అయ్యవారు తృప్తిపడ్డాడు.

ఈ కథల్లోని కుక్క, గాడిద, ముంగిస మాత్రమేగాక చాకలి, రైతు, రైతుభార్య, పాము వంటి పాత్రలన్నీ ఏదో ఒక సందర్భంలో – ప్రయత్నపూర్వకంగానో యాదృచ్చికంగానో – అందరికీ స్వయంగా అనుభవంలోకి వచ్చేవేకదా!
 
      ******      ******      ******

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే …
 
ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలనే పాఠం నేర్చుకున్న గాడిద ఒకటి మొన్న నాతో మాట్లాడింది.
 
ఇప్పుడు తనకు పనే దొరకడం లేదంటూ వాపోయింది పాపం!

కుక్కలా మొరగడం శ్రద్ధగా సాధన చెయ్యమనిచెప్పి సెలవు తీసుకున్నాను.

 
      ******      ******      ******
Posted in ఇతరత్రా | 1 Comment

చరిత్రలో రాయలసీమ

రాయలసీమ చరిత్ర గురించిన సంక్షిప్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. భూమన్ రచించిన ఈ వ్యాసం  మొదట రాయలసీమ ముఖచిత్రం అనే భూమన్ గారి వ్యాసాల సంకలనం లో ప్రచురితం అయింది. భూమన్ గారి అనుమతితో ఆ వ్యాసాన్ని  "రాయలసీమ వైభవం"లో ప్రచురించారు. కె.ఎస్.రూరల్ మీడియా మరియు రాయలసీమ ఆర్ట్ థియేటర్స్ తరపున తవ్వా ఓబుల్ రెడ్డి సంపాదకత్వంలో 2008 లో వారు ప్రచురించిన గ్రంథమే రాయలసీమ వైభవం.

Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

తమకరందం


ఆశలాంటి ఆకాశాన్ని..
కాసేపైనా కప్పుకోనివ్వక
ఆరాటపు మబ్బులు.


విశ్వగానంలో వాయులీనమవకుండా
విశృంఖల ఉద్రేకాలకి
మృణ్మయ దేహపు హద్దులు.
 

విషాదాగ్నిలో
వియోగ వీక్షణాల్ని విదిలిస్తూ
కంటిరెప్పల జంట తపస్సు.
 

సంయోగ సహయోగాల్లో వివశివమెత్తిన
వాఙ్మయపు నిశ్వాసల బరువు మోయడానికి..
అచ్చుల పిచ్చి ఆసరా.


కోట్లాది అణువుల లయవిన్యాసపు ఫలశృతిగా
సుఖమయ గంధాలనూ
రసహీన స్వప్నాలనూ
సగపాలుగా విరగ్గొడుతూ కన్నీటి ఉప్పదనం.

Posted in కవిత్వం | 2 Comments