నవంబరు గడిపై మీమాట

నవంబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. అక్టోబరు గడి, సమాధానాలు
2. ఆగష్టు గడి, సమాధానాలు
3. జూలై గడి, సమాధానాలు
4. జూన్ గడి, సమాధానాలు
5. మే గడి, సమాధానాలు
6. ఏప్రిల్ గడి, సమాధానాలు
7. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 1 Comment

అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

గత సంచికలో తెలుగు వికీపీడియాలోని అంతర్గత ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో వికీపీడియా కాకుండా వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులను గురించి తెలుసుకుందాం. తెలుగులో వికీపీడియా కాకుండా ఇంకా నాలుగు వికీ ఆధారిత ప్రాజెక్టులున్నాయి. ఇవి వికీపీడియా అంతగా ప్రాచుర్యం పొందకపోయినా తెలుగులో వికీపీడియా కంటే ముందే పరిగెడుతున్నవి. తెలుగు వికీపీడియా అన్ని భాషల వికీపీడియాల్లో కెల్లా 35 స్థానములో ఉంటే, ఈ అనుబంధ ప్రాజెక్టులన్నీ సంబంధిత ప్రాజెక్టులలో భారతీయ భాషలలో కెల్లా మొదటి స్థానములో ఉండటమే కాకుండా, అన్ని భాషలతో పోల్చి చూసినప్పుడు వికీపీడియా కంటే మెరుగైన స్థానములో ఉన్నవి.

తెలుగు విక్షనరీ

తెలుగు విక్షనరీ ఒక బహుభాషా నిఘంటువు. సూత్రప్రాయంగా తెలుగు పదాలతో సహా ప్రపంచములోని అన్ని భాషా పదాలకు తెలుగులో వాటి అర్థం, వివరణ, వ్యుత్పత్తి, వాడుక తదితర పద విశేషాలన్నీ సమకూర్చబడుతాయి. ఇది సాధించగలమని నమ్మకం కుదరని వాళ్ళు కొరియన్ విక్షనరీలోని ఈ పేజీ చూడండి.

ప్రస్తుతం తెలుగు విక్షనరీలో కొన్ని పరిమిత భాషా పదాల వరకే ఎక్కువగా కృషి జరుగుతున్నా, మున్ముందు వాటిని ఇతర భాషా పదాలకు కూడా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే తెలుగు విక్షనరీలో 32 వేలకు పైగా పదాలు, వాటి అర్థాలు, వ్యాకరణ వివరాలు, ప్రయోగించే విధానం వగైరా వివరాలున్నాయి. బ్రౌణ్య ఆంగ్ల – తెలుగు నిఘంటువులోని పదాలన్నీ విక్షనరీలో చేర్చబడినవి. అంటే ఇప్పుడు మీరు బ్రౌణ్యాన్ని సులభంగా విక్షనరీలో శోధించవచ్చు. ‘ఇందులో గొప్పేముంది, బ్రౌణ్యం నాకు పలుచోట్ల లభిస్తుంది’ అని అనుకుంటున్నారా? పబ్లిక్ డొమైన్లో కల ఇతర నిఘంటువులన్నీ త్వరలోనే విక్షనరీలో చేర్చే ప్రయత్నంలో ఉన్నాము. అప్పుడు ఒకే పదానికి బ్రౌణ్యం, శంకరనారాయణ నిఘంటువు, వేమూరి వారి నిఘంటువు తదితర నిఘంటువులలో ఏకకాలములో చూసే సౌలభ్యము విక్షనరీతో చేకూరుతుంది.

అంతేకాక, ఒక పదానికి చెందిన పేజీలో అర్థం, భాషాభాగం, వ్యుత్పత్తి, సంబంధిత పదాలు మాత్రమే కాక, వీలైనవాటన్నిటికీ బొమ్మలు కూడా ఉంటాయి. వివిధ భాషలలో ఆ పదానికి అనువాదాలు ఉంటాయి. అలాగే ఒక తెలుగు పదానికి వివిధ ప్రాంతాలలో ఉండే మాండలిక పదాలను కూడా సమకూర్చుతుంది. సరళంగా ఒక్కమాటలో చెప్పాలంటే పదకోశానికి సంబంధించి వన్ స్టాప్ షాప్ కావాలన్నదే విక్షనరీ యొక్క లక్ష్యం. వివిధ నిఘంటువులు, అనువాద పదకోశాలు, వ్యుత్పత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు ఇలాంటివన్నిటినీ ఏకం చేయటం ఒక బృహత్కార్యమే. లక్ష్యం చాలా పెద్దది. కానీ, తెలుగువారందరమూ చేయికలిపితే సాధించగలమన్న నమ్మకం ఉంది. తెలుగు విక్షనరీ అన్ని భాషల విక్షనరీల్లోనూ 18వ స్థానములో ఉంది. ఈ సందర్భంగా తెలుగు విక్షనరీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సుజాత గారికి, ప్రదీపు గారికి నెనర్లు.

తెలుగు వికీసోర్స్

తెలుగు వికీసోర్స్ ఒక ఉచిత గ్రంథాలయము వంటిది. ఇదివరలో ప్రచురితమైన, కాపీహక్కుల గొడవ లేని గ్రంథాలను యథాతథంగా చేర్చే చోటు. యథాతథం అనే మాటకి ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఉంది. యాథాతథంగా ఉన్న గ్రంథానికి సభ్యులు తాత్పర్యాలు వ్రాసి తాత్పర్య సహిత సంచికను కూడా వికీసోర్సులో చేర్చే అవకాశముంది.

ఇలాంటి భావనపైనే ఆధారితమైన మిలియన్ బుక్స్ ప్రాజెక్టు (archive.org), scribd.comకు వికీసోర్స్ ఏ విధంగా భిన్నమైనది? ఈ రెండు ప్రాజెక్టులలో అనేక తెలుగు పుస్తకాలు ఉన్నా, తెలుగులో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి సాంకేతికత ఇంకా అంతగా అభివృద్ధి చెందక పోవటం మూలాన ఆ పుస్తకాలు ఫీడిఎఫ్, డీజేవీయూ మొదలైన ఫార్మాట్లలో ఉంటాయి. మనకు కావలసిన విషయము కోసం శోధించే అవకాశం లేదు.. పుస్తకమంతా తిరగేయవలసినదే. అలాగే ఒక పుస్తకములోని కొంత భాగాన్ని తీసుకోవాలనుకుంటే ఎత్తి రాసుకోవలసిందే (ముఖ్యంగా స్కాన్ చేసి పెట్టిన పుస్తకాలలో).

6,000 కు పైగా పుటలతో తెలుగు వికీసోర్స్, అన్ని భాషల వికీసొర్స్‌లలో కెల్లా 11 వ స్థానములో ఉన్నది. వికీసోర్స్ యొక్క పరిమాణము తెలుగు వికీపీడియాను అధిగమించి 40 మెగాబైట్లను చేరుకున్నది. వికీసోర్స్ ఈ స్థాయికి చేరటానికి మూలకారణమైన అన్వేషి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.

మరి, ప్రస్తుతానికీ ఆ వికీసోర్స్లో ప్రస్తుతం ఏయే పుస్తకాలున్నాయి?

అన్నమయ్య పాటలు, వేమన పద్యాలు, ఆంధ్ర మహాభారతం, కుమార శతకం, దాశరథీ శతకం వగైరా శతకాలు, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, వివిధ అష్టకాలు ఇంకా బోలెడన్ని .. గూగుల్లో తెలుగులో వెతికే అలవాటున్నవాళ్లు ఈ మధ్య వికీసోర్సు చాలా ఫలితాల్లో కనిపించడం గమనించే ఉంటారు.


తెలుగు వికీవ్యాఖ్య

తెలుగు వికీవ్యాఖ్య, హరివిల్లు బ్లాగరి శ్రీనివాసరాజు చొరవతీసుకుని ముందుకు రావటంతో ఇటీవలే పుంజుకుంటున్న ఒక కొత్త ప్రాజెక్టు. ఇది వివిధ విషయాలపై ప్రముఖ వ్యక్తులు చేసిన వ్యాఖ్యల సమాహారం. ఒక Quote book లాంటిదన్నమాట. ఇలాంటి ఆంగ్ల వ్యాఖ్యల సమాహారాలు అంతర్జాలంలో వివిధ సైట్లలో చూసే ఉంటాము. కానీ నాకు తెలిసినంతమటుకు, తెలుగులో వ్యాఖ్యల సమాహారం ఎక్కడా లేదు. కొన్ని వ్యాఖ్యల సమాహారాలు పుస్తక రూపంలో ఉన్నా, అలాంటి సమాచారంతో ఉన్న సమస్య ఏమిటో మీకు తెలిసిందే కదా . కావాలనుకున్నప్పుడు అందుబాటులో ఉండదు. కావలసిన వ్యాఖ్యను శోధించడం అంత సులువు కాదు. వికీవ్యాఖ్య రచయితలకు, కవులకు, బ్లాగరులకు నిఘంటువులాగే మంచి ఉపయుక్తమైన సాధనము. ఉదాహరణకి ఏదో టపానో, వ్యాసమో రాస్తూ, మహాత్మా గాంధీ, జిన్నాపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించాల్సి వచ్చినప్పుడు వికీవ్యాఖ్యలో మహాత్మా గాంధీ లేదా జిన్నా అని శోధిస్తే చాలు.

వికీవ్యాఖ్యలోని వ్యాఖ్యలు ఆయా వ్యాఖ్యాతలు లేదా రచయితల వారీగాను, రచనల వారీగాను, విషయము వారీగాను కూర్చి ఉంటాయి. ఉదాహరణకు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన వ్యాఖ్యలన్నీ కందుకూరి వీరేశలింగం పేజీలోను, కన్యాశుల్కంలోని వ్యాఖ్యలన్నీ కన్యాశుల్కం పేజీలోను, గిరీశం వ్యాఖ్యలన్నీ గిరీశం పేజీలోను, దున్నపోతుకు సంబంధించిన వ్యాఖ్యలు, సామెతలన్నీ దున్నపోతు పేజీలోను ఉంటాయి.

ప్రస్తుతానికి తెలుగు వికీవ్యాఖ్యలో 80 వ్యాఖ్యల పేజీలు ఉన్నాయి. తెలుగు వారికి అంతర్జాలములో ఈ అద్భుతమైన సాధనాన్ని తయారుచేసేందుకైనా, మనకు ఒక మంచి వ్యాఖ్య తారసపడినప్పుడల్లా ఇక్కడ చేర్చి సహాయపడదాం పదండి.

తెలుగు వికీబుక్స్

ప్రస్తుతం సుప్తావస్థలో ఉన్న ప్రాజెక్టు ఇది. కారణం: ఇది ఎందుకో ఇప్పటిదాకా సరిగా అర్థం చేసుకోలేకపోవటం. నడిపించే సారథి లేకపోవటం. వికీసోర్స్ ఉందిగా? మరి వికీబుక్స్ ఎందుకు? అని చాలా మందికి సందేహం కలిగే ఉంటుంది. వికీసోర్స్లో కేవలం ప్రచురితమైన పుస్తకాలను మాత్రమే చేర్చుతారు. వికీబుక్స్లో సభ్యులే పుస్తకాలను, వికీఫార్మాట్లో ఈ-పుస్తకాలను తయారుచేయవచ్చు. ఉదాహరణకు జ్యోతి గారు వంటల పుస్తకమొకటి తయారు చేయాలనుకుంటే వికీబుక్స్ సరైన స్థలం, అలాగే మన తంత్రసామాగ్రి (సాఫ్ట్‌వేర్) నిపుణులు తెలుగులో లినక్సును ఉపయోగించటం ఎలా? అని సొంతంగా ఒక ఈ-పుస్తకాన్ని ప్రకటించాలన్నా సరైన స్థలం వికీబుక్సే.

ఇలాంటివి రాసుకోవటానికి నా బ్లాగుంది కదా అని మీరు అనుకుంటే; వివిధ డిజైను కారణాల వల్ల పుస్తక ప్రచురణకి బ్లాగు అనువైన స్థలం కాదు. కొంత శ్రమపడి అనువుగా మార్చుకోవచ్చు కానీ, అనేకమంది సమన్వయముతో ఒక పుస్తకాన్ని రాస్తున్నపుడు, బ్లాగు సరైన రంగస్థలము కాదు. లేదు, నేను నా సొంత డిజైను, సొంత వెబ్‌సైటు నిర్వహించి ఒక ఈ-పుస్తకాన్ని ప్రకటిస్తానంటే అది మీ ఇష్టం. (మరి వికీబుక్స్‌లో ఉచితంగా స్థలము, అనంతమైన బ్యాండు విడ్తు)

ఇవి కాక తెలుగులో లేకపోయినా అంతర్జాలవాసులందరికీ ఒక మంచి వనరు, వికీమీడియా కామన్స్. ఇందులో కాపీహక్కులు లేని వివిధ ఫోటోలు, ఆడియో క్లిప్పింగులు ఉచితంగా లభ్యమౌతాయి. ఏదైనా ఒక విషయంపై మీ బ్లాగులోనో, వెబ్‌సైట్లోనో ఉపయోగించడానికి ఫోటోలు, రేఖా చిత్రాల కోసం వెతుకుతుంటే తప్పకుండా చూడాల్సిన సైటు ఇది.

జిహ్వకో రుచి అన్నట్లు మీకు వికీపీడియాలో వ్రాయటం అంతగా రుచించకపోయినా మీ అభిరుచికి తగ్గట్టు పై ప్రాజెక్టులలో ఒకదాన్ని ఎంచుకొని తెలుగుకు ఉడతాభక్తి సేవ చేయగలరని ఆశిస్తున్నాం.

రవి వైజాసత్య(http://saintpal.freehostia.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments

రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

పొద్దు పాఠకులందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పొద్దులో ప్రారంభసంచిక నుంచి మూడు నెలలపాటు సినిమా శీర్షిక నిర్వహించిన సుగాత్రి ఈ నెల అతిథి. అతిథి వ్యాసంతోబాటు చందుపట్ల శ్రీధర్ గారి కార్పొరేట్ ఆ(కా)సుపత్రి కవిత కూడా అందిస్తున్నాం.

ఈ నెల రచనలు:

కౌంతేయులు (అతిథి)
కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)
కుటుంబరావు కథల్లో వాస్తవికత (వ్యాసం)
మృతజీవులు – 9 (మృతజీవులు)
నేనూ మీ లాంటి వాడినే (కథ)
జగజ్జేత ఆనంద్! (వ్యాసం)
గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

Posted in ఇతరత్రా | Comments Off on రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

కౌంతేయులు

-సుగాత్రి

రామాయణంలోని పాత్రలతో పోలిస్తే మహాభారతంలోని పాత్రలు మరింత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ అవే మనకు వాస్తవికంగా, సహజంగా, ఇప్పటి పరిస్థితులకు తగినవిగా తోస్తాయి. ఎందుకంటే రామాయణం ఏ పుణ్యకాలంలోనో నివసించిన ఆదర్శప్రాయమైన వ్యక్తులు, వారి జీవితాలను వర్ణిస్తే, మహాభారతం ఒక సంధికాలంలో ధర్మానికీ-అధర్మానికీ మధ్య గుంజాటనపడిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. ఆ సంధికాలంలోని పరిస్థితులే కొంచెం అటూ-ఇటూగా ఈ కాలానికి వర్తిస్తాయి. ఆ కారణం వల్లే మహాభారతంలోని పాత్రల గురించి మనం కూలంకషంగా అర్థం చేసుకోవడం అవసరం కూడా.

పైగా మహాభారతం యొక్క విశిష్టత ఏమిటంటే తవ్వితోడినకొద్దీ జల ఊరినట్లు తరచిచూసినకొద్దీ కొత్త అర్థాలు బోధపడుతాయి. వాటిలో ప్రతిదీ ‘ఇదే నిజమేమో/ఇదీ నిజమేనేమో’ అనిపిస్తుంది.

ఐతే ఇంత వాస్తవికంగా, మనలాంటివాళ్ళే అనిపించే పాత్రలు, సన్నివేశాలు కూడా వాటిలో దేవుడి మహిమలు, ప్రత్యక్ష ప్రమేయమూ ఎక్కువయ్యేకొద్దీ మనకర్థం కాని మిస్టరీలుగా మిగిలిపోతారు. అలాంటప్పుడు ఈ దేవుళ్ళ పాత్రలు ఏవో కొన్ని ఇబ్బందికర వాస్తవాలను మరుగుపరచేటందుకే రంగప్రవేశం చేశాయేమో అని కూడా అనిపించకమానదు. ముఖ్యంగా పాండవుల పుట్టుక విషయంలో.

పాండవులు కురువంశానికి చెందిన పాండురాజు కొడుకులు. ఇక్కడ మహాభారతంలోనే వివిధ రకాల కొడుకులను గురించి ఏముందో చూద్దాం. ఆదిపర్వం పంచమాశ్వాసం లో షట్ పుత్రులుగా ఔరసుడు (= ధర్మపత్ని యందు పుట్టినవాడు), క్షేత్రజుడు (= తన అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు), దత్తకుడు (= తల్లిదండ్రులచేత దత్తత ఇవ్వబడ్డ పుత్రుడు – అదే కులానికి చెందినవాడు), కృత్రిముడు (= స్వయం నిర్ణయం చేయగలిగి ఉండి తనంత తానుగా దత్తత వచ్చినవాడు), గూఢోత్పన్నుడు (= తనకు తెలియకుండా తన భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు), అపవిద్ధు (= దత్తతచేసుకున్న అనాథ) లను పేర్కొన్నారు. వీరే కాక కృతక, స్వయందత్త, పౌనర్భవ, సహోధ, పుత్రిక-పుత్రులను కూడా స్మృతుల్లో పేర్కొన్నారు.

ఇక్కడ పాండవులు పాండురాజుకు ఏ రకమైన కొడుకులు? క్షేత్రజులని అందరికీ తెలిసిన విషయమే. పాండవుల తండ్రులు దేవతలని చెప్పే నమ్మశక్యంగాని మాటలను పక్కనబెట్టి వాస్తవిక దృష్టితో ఆలోచిస్తే వాళ్ళెవరో మానవమాత్రులేనని, కొన్ని బలమైన కారణాల వల్ల వారెవరన్నది రహస్యంగా ఉంచారని స్పష్టమౌతుంది. ఆన్ని విషయాలనూ బాహాటంగా చెప్పిన మహాభారతంలో ఈ ఒక్క విషయం ఇంత రహస్యంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది ? ఆని ఆలోచిస్తే అప్పటి సామాజిక పరిస్థితులు, ఆచారవ్యవహారాలు కొంతవరకు అర్థమవుతాయి.

కురువంశపు అసలు వారసులైన ధార్తరాష్ట్రులుండగా, కురువంశానికి సంబంధించని వారితో (వంశాంకురం లేనప్పుడు మాత్రమే ఆపద్ధర్మంగా ఉపయోగపడే నియోగ పద్ధతి ద్వారా) కుంతి కన్న పాండవులు కురువంశానికి చెందిన వాళ్ళుగా ఆమోదించబడలేదా? అందుకే వాళ్లనెవరూ కౌరవులని పిలవలేదా? లేక పాండవుల జననం వర్ణధర్మానికి అనుగుణంగా జరగలేదనా?

భారతీయ ఇతిహాసాల్లో వర్ణాశ్రమధర్మాలకు పెద్దపీట వేశారు. వర్ణధర్మానికి సంబంధించినంత వరకు వర్ణాంతర వివాహాలు రెండురకాలు:
అనులోమ వివాహం: ఒక పురుషుడు తన వర్ణానికి చెందిన స్త్రీని గానీ, లేదా అంతకంటే కింది వర్ణానికి చెందిన స్త్రీని గానీ పెళ్ళాడితే అది అనులోమ వివాహం. అనులోమ వివాహాలు సంఘామోదం పొందినవి.

ప్రతిలోమ వివాహం: ఒక పురుషుడు తన వర్ణాని కంటే ఉన్నత వర్ణానికి చెందిన స్త్రీని పెళ్ళాడితే అది ప్రతిలోమ వివాహం. ప్రతిలోమ వివాహాలు సంఘామోదం పొందనివి. ప్రాచీన ధర్మశాస్త్రాలు నిమ్నవర్ణాలకు చెందిన పురుషులు అగ్రవర్ణాలకు చెందిన స్త్రీలను తాకినందుకే శిక్ష విధించాలని నిర్దేశించాయి. బ్రాహ్మణకన్య అయిన (శుక్రాచార్యుడి కూతురు) దేవయాని తనను పెళ్ళాడమని వర్ణవ్యవస్థలో తన కంటే ఒకమెట్టు కిందున్న క్షత్రియుడైన రాజు యయాతిని కోరినప్పుడు అతడు పెళ్ళాడకపోవడానికి కారణం అది ప్రతిలోమ వివాహం అవుతుందనే.

నియోగం: భర్త వల్ల సంతానం పొందలేకపోయిన స్త్రీ వంశాన్ని నిలపడం కోసం భర్త సోదరుడి వల్ల సంతానవతి కావడాన్ని నియోగ అంటారు. మొదట్లో ఇది అగ్రవర్ణాల్లో మొదలైనా తర్వాతికాలంలో కిందివర్ణాలకు విస్తరించి తర్వాత్తర్వాత కింది వర్ణాలకే పరిమితమైంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అంబిక, అంబాలికలకు నియోగపద్ధతిలో పుట్టినవారే!

మొదటి నుంచి మనం పరిశీలించినట్లైతే వ్యాసుడు ఒక మహర్షికి, ఒక శూద్ర కన్నెకు పుట్టినవాడు. ఐనా అది అనులోమ సంబంధం కాబట్టి ఆయన ఒక మహర్షిగానే గుర్తించబడ్డాడు. తర్వాత ఈ మహర్షి అంబ, అంబిక, అంబాలికలకు పుత్రసంతానం ప్రసాదించాడు. అది అనులోమమే గాక నియోగం కూడా. దానికీ అభ్యంతరం లేదు . తర్వాతి తరంలో కౌరవుల పుట్టుకలో ఎటువంటి మతలబులూ లేవు. శంతనుడి తర్వాత కురువంశంలో ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి. బహుశా దుర్యోధనుడి అభిజాత్యానికి ఇదీ ఒక కారణం కావచ్చు.

ఐతే ఆ కాలంలో అనులోమ సంబంధం ద్వారా పుట్టిన సంతానానికి ఉన్న హోదా ప్రతిలోమ సంబంధం ద్వారా పుట్టిన సంతానానికి లేదు. ఇంతవరకు మనం పరిశీలించిన సంబంధాల్లో ప్రతిలోమ సంబంధం ఒక్కటి కూడా లేదు . అందుకే వాటిని గురించి బాహాటంగా చెప్పారు. కురువంశానికి సంబంధించి సంతానం విషయంలో దేవతల ప్రస్తావన మొదటిసారిగా కుంతి విషయంలోనే వస్తుంది. ఆమెకు పెళ్ళికి ముందే అక్రమంగా పుట్టినవాడు కర్ణుడు. అంతకు ముందు మత్స్యగంధికి వ్యాసుడు కూడా పెళ్ళికి ముందే అక్రమంగా పుట్టినవాడే ! ఐనా అక్కడ ఆమె శూద్రస్త్రీ కావడం వల్లా , అంతకంటే ముఖ్యంగా అది అనులోమం కాబట్టీ ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఇక్కడ దైవసంతానమని చెప్పడానికి కారణం కుంతి రాచకన్నె కావడమొక్కటే కాక అది ప్రతిలోమ సంబంధం కావడం కూడా ఒక బలమైన కారణం అనిపిస్తుంది.

పాండురాజుకు సంతానయోగం లేకుండా పోయింది . సరే! అదే కుటుంబంలో వెనుకటితరంలో అదే సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? నియోగపద్ధతిలో సంతానాన్ని పొందారు. ఇప్పుడూ అదే పని ఎందుకు చెయ్యలేదు? అని ప్రశ్నించుకుంటే అసలు నియోగ చేయదగినవారెవరున్నారు? అనే ప్రశ్న వస్తుంది. ధృతరాష్ట్రుడున్నాడు. కానీ ఆయన గుడ్డివాడు. వాళ్ళమ్మ గర్భాదానమప్పుడు కళ్ళు మూసుకుంటేనే గుడ్డివాడు పుట్టాడు (అని కనీసం వాళ్ళ నమ్మకం). ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి (నియోగ) పాటిస్తే గుడ్డివాడికి ఎలాంటి కొడుకులు పుడతారో నని భయపడి ఉండొచ్చు (గాంధారికి అటువంటి లోపాలేవీ లేని నూటొక్క మంది మంది సలక్షణమైన సంతానం అప్పటికి ఇంకా పుట్టలేదు). లేదా గాంధారి అందుకు ఒప్పుకొని ఉండకపోవచ్చు. (రామాయణంలోని స్త్రీపాత్రలతో పోలిస్తే మహాభారతంలోని స్త్రీపాత్రలు దృఢమైన వ్యక్తిత్వం కలవారు కావడం గమనించదగ్గది.) ‘నియోగిం’చడానికి విదురుడున్నాడు కానీ దాసీపుత్రుడాయె! విదురుడు వ్యాసమహర్షి పుత్రుడే ఐనా దాసికి పుట్టినవాడు. ఆ కారణం వల్లే రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కుంతి కడుపున కూడా విదురుడి పుత్రులే పుడితే వాళ్ళకు కూడా రాజ్యార్హత ఉండదు. అందువల్ల వ్రతం చెడకుండా ఫలం దక్కాలంటే యోగ్యుడైన పరపురుషుడెవరి ద్వారా ఐనా సంతానం పొంది, ఆ రహస్యం ఎవరికీ తెలియకుండా ఏ దేవుడి పేరో చెప్తే సరిపోతుంది. ఇది గతంలో కుంతీ ‘కుమారి’ కాలుజారినప్పుడు చేసినపనే కద? అందుకే ఊరికి దూరంగా వనవాసం పేరుతో క్యాంపేయడం.

ఐతే ఒక కొడుకుతో తృప్తిపడలేక పోయారా దంపతులు. ఉన్నదెలాగూ నిర్జనారణ్యంలోనే కాబట్టి, సాకుగా చూపడానికి దేవతలున్నారు కాబట్టి పరపురుషుల ద్వారా ఒకరి తర్వాతొకరంటూ మొత్తం ముగ్గురు కొడుకులను కన్నది కుంతి.

ఇక విదురుడి సంగతి: విదురుడు సాక్షాత్తూ వ్యాసమహర్షి పుత్రుడు. మహారాజైన తన సోదరుడినే నిరంతరం అంటిపెట్టుకుని ఉన్న విదురుడికి తాను దాసీపుత్రుడు కావడం వల్లనే రాజ్యాధికారం పొందలేకపోయాడని తెలుసు కానీ అందుకు అసంతృప్తి చెందినట్లు ఎక్కడా బయటపడలేదు. అతడు పాండవపక్షపాతి అన్నదీ మొదటి నుంచీ అర్థమౌతూనే ఉంటుంది. పెద్దల సభలో ఒక పెద్దమనిషిగా మసలుకున్నంతవరకే తనకు గౌరవం లభిస్తుందని, మహారాజుకు సవతి సోదరుడైనంత మాత్రాన లేదా సర్వగుణ సంపన్నుడైనందున తాను సింహాసనమెక్కాలనుకుంటే దాసీపుత్రుడైన తనను సమర్థించేవాళ్ళెవరూ ఉండరనీ అతడికి బాగా తెలుసు. అతడు ఎప్పుడూ ధృతరాష్ట్రుడి సాంగత్యం వీడలేదు. ఆ గుడ్డిరాజు తన సలహాలను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అవకాశమొచ్చినప్పుడల్లా నీతులు బోధించేవాడు, సలహాలిచ్చేవాడు. అంతేగానీ అతడు ఎప్పుడూ అతడి మాటకు ఎదురుచెప్పలేదు.

పాండవుల పట్ల తనకున్న ప్రేమను ప్రకటించే విషయంలో మొదట్నుంచి విదురుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ద్రౌపదీస్వయంవరంలో పాండవులు గెలుపొందే వరకూ పాండవులను కాపాడుకొస్తున్నా వారికి బాహాటంగా సాయమెప్పుడూ చెయ్యలేదు. వాళ్ళు వారణావతానికి వెళ్ళేటప్పుడు కూడా వారికి పొంచి ఉన్న ప్రమాదం గురించి అందరి ముందూ చెప్పినా అది ఇతరులెవ్వరికీ అర్థం కాకుండా చాలా నిగూఢంగా, యుధిష్టిరుడికొక్కడికే అర్థమయేటట్లు మాట్లడుతాడు. దానికి కారణం తానే కౌరవసభలో వారిమీద ఆధారపడి ఉండడం, పాండవులకు బలగం లేకపోవడమే!

పాండవుల పట్ల అతడి అభిమానం ద్రౌపదీస్వయంవరం నుంచి కౌరవపాండవులు హస్తినకు వస్తున్నప్పుడు బయటపడుతుంది. అతడు అద్భుతమైన శ్లేష వాడి ధృతరాష్ట్రుడితో అంటాడు: “కౌరవులకు జయము జయము”. పాండవులు బతికే ఉన్నారని అప్పటికింకా తెలియని ఆ గుడ్డిరాజు సహజంగానే అందరిలాగే కౌరవులంటే తన పుత్రులనే అనుకున్నాడు. ఆనందాతిరేకంతో “ద్రౌపదిని లోపలికి తీసుకురండి. దుర్యోధనా! నీ భార్యకు ఆభరణాలు తెసుకురా!” అని హడవుడి పడిపోతాడు. అప్పుడు విదురుడు చల్లగా అసలు విషయం చెప్తాడు. ధృతరాష్ట్రుడు విదురుడు ఊహించినట్లే నిరాశ చెందినా సర్దుకుని “నా తమ్ముడి కొడుకులు, నా సొంత కొడుకులు వేరువేరు కాదు. అందరూ నాకు సమానమే” అంటాడు. దానికి సమాధానంగా విదురుడు “మహారాజా! మీ బుద్ధి ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.” అని ముక్తాయింపు ఇస్తాడు. అతడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకున్నది అదే!

టెక్నికల్ గా పాండురాజు కొడుకులు, ధృతరాష్టుడి కొడుకులు అందరూ కురువంశం వారే కాబట్టి అందరూ కౌరవులే ఐనా కౌరవులుగా గుర్తింపు పొందింది మాత్రం ధార్తరాష్ట్రులైన దుర్యోధనాదులే! అందువల్ల ధృతరాష్ట్రుడే కాదు ఆ స్థానంలో ఎవరున్నా తప్పుగా అర్థం చేసుకుంటారని విదురుడికీ తెలుసు. ఎప్పుడూ పొల్లు మాటాడి ఎరుగని విదురుడు తెలిసితెలిసీ అంత పెద్ద శ్లేష వాడాడంటే పాండవులు కూడా కురువంశం వారేనని గుర్తుచేయడమేగాక వారిని కూడా కౌరవులుగా గుర్తించాలని అతడు లోపల్లోపల బలంగా కోరుకుంటున్నాడన్నమాట. మరి ఆ వాస్తవాన్ని, ఆ కోరికను అతడు అంతకుముందెప్పుడూ ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడైనా స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోయాడు? ఎదుటివారెవరైనా, వారికి తన మాటలు నచ్చినా, నచ్చకపోయినా నిష్కర్షగా చెప్పే విదురుడు ఈ ఒక్క విషయంలోనే ఎందుకు డొంకతిరుగుడుగా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ విషయాన్ని కదిపితే పాండవుల తండ్రులెవరనే చర్చ మొదలౌతుంది. అది మరుగుపరచడానికే గదా వాళ్ళ ప్రయత్నమంతా?

ఇక ధృతరాష్ట్రుడు పాండవులు తన తమ్ముడి బిడ్డలై ఉంటే తన కొడుకును అంత గుడ్డిగా వెనకేసుకువచ్చేవాడు కాదేమో? అతడిలో ఈ ద్వైధీభావం కడదాకా కొనసాగింది.

ధర్మజుడు-విదురుడు:

విదురుడికి పాండవులతో, ప్రత్యేకించి యుధిష్టిరుడితో ఉన్న ఆ అనుబంధం కేవలం బంధుత్వం వల్లనే అనుకోలేం. ధర్మజుడు-విదురుల మధ్యనున్న సంబంధం కృష్ణార్జునులవలె స్నేహసంబంధం కాదు, దుర్యోధన-కర్ణులవలె దాత-హితుల సంబంధం కాదు. అంతకు మించిన అనురాగబంధమేదో వాళ్ళిద్దరినీ కలిపి ఉంచింది. అదేమిటి? రక్తసంబంధమా? ఇద్దరూ ధర్మశాస్త్రంలో నిష్ణాతులే. ఇద్దరూ శాంతికాముకులే. పెద్దగా యుద్ధవిద్యలు రానివారే. విదురుడికి తనకు అర్హమైనదేదో తనకు దక్కలేదు. ధర్మజునికి దక్కినా దానికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించవలసివచ్చింది. రాజు కావడానికి అన్ని విధాలా అర్హుడైన తాను ధృతరాష్ట్రుడి వంటివాడిని సేవిస్తూ అతడి పుత్రవాత్సల్యాన్ని భరిస్తూ, అతడి ఆవేశకావేషాల్ని సహిస్తూ బ్రతకవలసివచ్చినందుకు విదురుడు బాధపడినట్లు ఎప్పుడూ బయటపడలేదు కానీ అడవులపాలైనప్పుడు ధర్మజుడు మాత్రం ఆక్రోశించాడు.

పైగా విదురుడు సాక్షాత్తూ యమధర్మరాజు అవతారం. యుధిష్టిరుడు స్వయంగా ఆ యమధర్మరాజు కుంతీదేవికి ప్రసాదించిన పుత్రుడు!
వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా స్వయంగా వ్యాసుడే చెప్తాడు: అదీ ఎప్పుడు? విదురుడు కూడా చచ్చిపోయాక!

విదురుడు చనిపోయిన తర్వాత వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు: “విదురుడు నా యోగశక్తుల ద్వారా జన్మించిన యమధర్మరాజు అవతారం. అతడు తన యోగశక్తులతో ధర్మజుణ్ణి పుట్టించాడు. ధర్మజుడే విదురుడు – విదురుడే ధర్మజుడు. ధృతరాష్ట్రా! ఇంతకాలం విదురుడు నిన్ను సేవించినట్లే ఇక మీదట ధర్మజుడు నిన్ను సేవిస్తాడు.”

ఇక వీళ్ళిద్దరి సంబంధాన్ని మరింతగా తేటతెల్లం చేసే సంఘటన విదురుడి మరణానంతరం జరుగుతుంది. విదురుడు సన్న్యసించి యతిగా మారి ఆహారము, బట్టలు త్యజించి అడవిలో ఎవరూ రాని చోటుల్లో తిరుగుతున్న సంగతి తెలిసి ధర్మజుడు అతడున్న చోటికి ఆరాటంతో పరిగెత్తుకుంటూ పోతాడు “విదురా! ఆగు!! నేను… నీ ధర్మజుణ్ణి.” అంటూ. విదురుడు వెళ్ళి వెళ్ళి ఒక చెట్టుకు చేరగిలబడి ధర్మజుణ్ణి చూస్తూ తన యోగశక్తులతో ఒక్కో అవయవం ద్వారా అతడిలో ప్రవేశిస్తాడు. ఆ విధంగా విదురుడు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన మేధస్సును ధర్మజుడికిస్తాడు. ఉపనిషత్తుల్లో సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే తండ్రి తన ఆఖరిక్షణాల్లో కొడుకుకు తన శక్తులను అందజేస్తాడని ఉంది.

ఇక భీముడి లక్షణాలను బట్టి చూస్తే అతడు ఏ ఆటవికజాతి సంతానమో అన్న సందేహం కలగడం సహజమే. ఈ అనాగరిక లక్షణాలు దగ్గర్నుంచి చూసిన దుర్యోధనుడికి అతడంటే అసహ్యమూ, చిన్నచూపూ ఉండడం కూడా సహజమే. భీముడు ఏ ఆటవికజాతి సంతానమో అనడానికి కొన్ని ఆధారాలు:

అతడి అసాధారణమైన బలం,
చిన్నప్పుడే కాళ్ళు చేతులు కట్టి లోతు నీళ్ళలో పడేసినా చులాగ్గా చేపపిల్లలాగ ఈదుకురాగలిగిన సహజ సామర్థ్యం,
విష ప్రభావం అతడిమీద పెద్దగా లేకపోవడం,
గంధమాదన పర్వతంపై పువ్వులకోసం కీకారణ్యంలోకి జంకూగొంకూ లేకుండా చొచ్చుకుపోయిన మొండిధైర్యం,
అడవిలో అందరినీ కాపుగాసే చురుకుదనం,
రాక్షసకన్య (హిడింబ) తో ప్రణయం, వారికి పుట్టిన ఘటోత్కచుడు రాక్షసుడే కావడం.
ఆవేశాన్ని, మనసులో మాటను దాచుకోని నిర్మలత్వం,
తనవారిపై అతడు చూపిన అవ్యాజమైన ప్రేమ,
సమయ, సందర్భాలను లెక్కచేయక అన్యాయాన్ని ఎదిరించే ఆవేశం,
కీచకుణ్ణి చంపిన తీరు,
దుశ్శాసనుడి రక్తం రుచిచూడడం.

ఇవి పెంపకం ద్వారా అలవరచుకున్న లక్షణాలు కావు. ఎందుకంటే వీటిలో ఒక్కటీ నాగరికులైన రాచబిడ్డలకు తగిన లక్షణం కాదు. అతడితోబాటు అడవిలో పుట్టి పెరిగిన ఇతర పాండుపుత్రులకు కూడా అబ్బలేదు. అంటే ఈ లక్షణాలు అతడి జీన్స్ లోనే ఉన్నాయనుకోవాలి.

భీముడి సంగతిలా ఉండగా రాచపుట్టుక పుట్టి అంత:పురంలో పూర్తిగా రాజభోగాలతో పెరిగినవాడు దుర్యోధనుడు. రాజ్యానికి తానే అసలైన వారసుణ్నని విశ్వసించినవాడు. కర్ణుణ్ణి చేరదీసిన దుర్యోధనుడికి కులద్వేషం ఉందనలేం. ఐతే “అన్ని విధాలా” కురువంశానికి సరైన వారసుడిగా తానుండగా రాజ్యాన్ని కురువంశంతో నేరుగా సంబంధం లేనివాళ్ళతో, నాగరికసమాజానికి దూరంగా పుట్టిపెరిగిన అడవిమనుషులతో రాజ్యం పంచుకోవలసి రావడం అతడు సహించలేనిది. శంతనుడి కాలం నుంచి వారసత్వం విషయంలో ఇలాంటి పేచీ ఎప్పుడూ ఏర్పడలేదు. పాండవులు నిజానికి పాండురాజు కొడుకులు కాదని అతడికి తెలియకుండా ఉండదు. అలాగే దేవతల పుత్రులని నమ్మేంత అమాయకుడూ కాడతను. పైగా రాజ్యం పాండవులకు అప్పగిస్తే భీముడిది తనమీద పైచేయి అవుతుంది. అది అతడు భరించలేడు.

భీముడికి నాగులతో ఉన్న అనుబంధం ఇక్కడ గమనించదగ్గది. ప్రాచీన భారతదేశంలో ఈ నాగజాతి వాళ్ళు ఒక రకం తెగ – కొంతవరకూ ఆటవికులు. ఈ ఆటవికతెగ క్రమంగా తమ హోదా పెంచుకంటూ వచ్చి చివరకు చాతుర్వర్ణ వ్యవస్థలో కలిసిపోయారు. పరమశివుడి మెడలోని నాగుపాము, వినాయకుడి కడుపును కలిపి కుట్టిన పాము, అతడి ఏనుగు తల (నాగ అనే మాటకు పాము, ఏనుగు అని రెండర్థాలున్నాయి), ఆకాలంలో నాగజాతి వారికి ఉన్న ప్రాబల్యానికి చిహ్నాలే అని చరిత్రకారులు చెప్తారు. సమస్త భూభారాన్నీ తన భుజస్కంధాలమీద మోస్తున్న ఆదిశేషుడు నాగుడే. ఇవే కాక ఇంకా నాగుల ప్రస్తావన మన పురాణాల్లో చాలా చోట్ల వస్తుంది. ఏతావాతా భీముడి తండ్రి ఎవరో ఈ నాగజాతికి చెందిన మహాబలాఢ్యుడై ఉండాలి. అర్జునుడి భార్యల్లో ఒకతె ఐన ఉలూచి కూడా నాగకన్యే.

తరచి చూస్తే పాండవుల్లో అర్జునుడొక్కడే అసలు సిసలు రాచబిడ్డేమో.. అతడికి ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి – కీర్తి, కాంత, కనకం మీద వ్యామోహం, ఎంత సేపూ తన గురించి తప్ప పక్క వాళ్ళగురించి అసలు పట్టించుకోక పోవడం, ఏ కృష్ణుడి దన్నో లేకపోతే కూలబడిపోవడం, తాను పైకి రావడం కోసం ఇంకో ఏకలవ్యుడిని పడగొట్టటం లాటివి, పైగా బిరుదులు. ఇంద్రుడు అంటే రాజు అనే అర్ధం ఉంది కాబట్టి — ఇతడు ఏ రాజు కొడుకో అయి ఉండే అవకాశం ఉంది. ద్రౌపది పట్ల అతడికి గల ప్రేమ కూడా అనుమానాస్పదమే. అతడికి ఎంతసేపూ తాను మత్స్యయంత్రాన్ని కొట్టి వీరుణ్ణనిపించుకోవాలనే ఆరాటమే తప్ప ద్రౌపది మీద అతడేనాడూ అనురాగం చూపినట్లు లేదు. పైగా ద్రౌపదితో పెళ్ళయాక కూడా ఊళ్ళమీద పడి ఊరికొకర్ని పెళ్ళాడి ద్రౌపదికి సవతులుగా తెచ్చాడు. ఇదీ (బహుభార్యాత్వం) నాగరిక రాజుల లక్షణమే. భీముడొక్కడే ద్రౌపదిని పెళ్ళాడాక తర్వాత పెళ్ళిచేసుకోలేదు.

కుంతి-విదురుడు:

విదురుడు వంశాన్ని నిలపడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మజుడికి తండ్రి అయ్యాడన్న విషయం గమనించాలి. పాండురాజుకు అప్పటికే ఒక కొడుకైనా ఉండి ఉన్నట్లైతే విదురుడు ఒప్పుకునేవాడు కాదు. ఆ తర్వాత కూడా అతడు కుంతి అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గమనిస్తాం. పాండవుల వనవాసమప్పుడు కుంతి విదురుడింట్లోనే ఉంది. కర్ణార్జునులు తొలిసారి తలపడినప్పుడు ఆమెను సాంత్వనపరచిందీ విదురుడే! ఐతే అంతమాత్రం చేత ధర్మజుడు పుట్టిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యా సంబంధం కొనసాగిందని అనుకోవడం విదురుడి వ్యక్తిత్వాన్ని అవమానించడమే అవుతుంది.

దుర్యోధనుడు పాండవులకి రాజ్యం నిరాకరించడానికి కారణాలు (?)

పాండవుల పుట్టుక వెనుక నున్న కారణమే బహుశా దుర్యోధనుడు వాళ్ళకి రాజ్యాధికారం నిరాకరించడానికి కారణమేమో? అసలు హస్తినకు రాజు పాండురాజైనప్పుడూ, ధృతరాష్ట్రుడు అతడి ప్రతినిధిగా మాత్రమే పరిపాలన సాగిస్తున్నప్పుడు యుధిష్టిరుడికి రాజ్యం అప్పగించకుండా అర్ధరాజ్యం మాత్రమే ఇచ్చి, అదీ ఎక్కడో ఉన్న ఇంద్రప్రస్థానికి పంపడమేమిటి? ఆయన పంపితే భీష్మాదులు మిన్నకుండడమేమిటి? యుధిష్టిరుడికే నిజంగా రాజ్యార్హతుంటే , కురువృద్ధులందరూ పాండవులకి అర్ధరాజ్యమివ్వడమనే సంధి మంత్రానికి సమ్మతించేవారా ? ధృతరాష్ట్రుడు పెద్దలు, మంత్రుల మాటలని పెడచెవిని పెట్టగలిగేవాడా ? అందరికీ కుంతి పెద్దకొడుకు పుట్టుక రహస్యం తెలిసినా – వారి అభిజాత్యం కాపాడడానికే, ఈ సంగతి ఎక్కడా ప్రస్తావించకుండా మిన్నకుండిపోయేరా? ధృతరాష్ట్రుడు పాండవులమీద పుత్ర ప్రేమ చూపించినా, నిజంగా వాళ్ళకి రాజ్యార్హత లేదు కాబట్టే , అంతగా తన పిల్లలవైపు మొగ్గు చూపించాడా? ధృతరాష్ట్ర్రుడు ధార్మికంగానే రాజ్యంచేసినట్టు అనిపిస్తుంది, తన మంత్రుల, సన్నిహితుల, పెద్దల మాటని అతనెన్నడూ పెడచెవిన పెట్టిన ధాఖలాలు లేవు. పాండవులు అడవిలో పుట్టినా, వాళ్ళ జన్మరహస్యం అప్పటి పెద్దలందరికీ, అందులోనూ రాజైన ధృతరాష్ట్రుడికి తెలియదనుకోడానికి లేదు. ఈ సంగతి తెలిసిన శకుని – దుర్యోధనుడికీ సంగతి చెప్పి ఉండవచ్చు.

దుర్యోధనుడు – అన్నగా తన తమ్ములందరినీ బాగానే చూసుకొన్నాడు. స్నేహానికి ప్రాణం పెట్టాడు. గురువులని, పెద్దలనీ గౌరవించాడు, ప్రజలని కూడా పీడించినట్టేమీ ఆధారాలేమీ లేవు. మరి, ఇంత మంచివాడు, ఒక్క పాండవుల పట్ల ఎందుకలా ప్రవర్తించినట్టు ?

ధర్మయుద్ధమైన కురుక్షేత్రంలో చాలామంది రాజులు, సామంతులు దుర్యోధనుడి పక్కనుండి యుద్ధం చేసారు – వారందరికీ కూడా దుర్యోధనుడి నిర్ణయంలో ధర్మమే కనిపించి ఉండాలి కదా?

భీష్ముడు, ద్రోణుడు మొదలైన కురు వృద్ధులు కూడా ఎంతగా శాంతి కాముకులైనా, పాండవ పక్షపాతులైనా, చివరకి ఆ కాలంనాటి ధర్మాన్ననుసరించి దుర్యోధనుడి మాటకెదురు చెప్పలేకపోయుండవచ్చు.

ఏతావాతా ఈ ధృష్టితో పరిశీలిస్తే, అప్పట్లో రాజలోకమంతా ఈ విషయంలో రెండుగా చీలినట్టుగా కనిపిస్తుంది. ఈ చీలిక చివరికి శ్రీకృష్ణ, బలరాములలో కూడా కనిపిస్తుంది. నవయుగ నిర్మాతైన కృష్ణుడు – కాలంచెల్లిన ఒక సాంఘికాచారం కన్నా, అర్హతున్నవాళ్లకే పట్టం కట్టడానికి నిర్ణయించుకొన్నట్టుగా కనిపిస్తుంది. కానీ, ఆచార పరాయణులు, సాంఘిక నియమాలనే ధర్మ సూత్రాలుగా భావించేవాళ్లంతా – కొందరు మౌనంగాను, మరికొందరు బాహాటంగానూ ధుర్యోధనుడి పక్షం వహించి ఉండవచ్చును.

ఏ ధర్మమూ ధుర్యోధనుడి పక్షంలో లేకపోతే, కురుక్షేత్రం ధర్మయుద్ధమెలా అవుతుంది? ఇది రెండు – విరుద్ధమైన ధర్మాల మధ్య జరిగిన పోరాటమేగాని, ధర్మానికి – రాజ్యకాంక్షకి మధ్య జరిగిన యుద్ధం కాదేమో.

ఉపసంహారం:

ఆస్తి కోసమో, ఐదూళ్ళ కోసమో అన్నదమ్ముల బిడ్డల మధ్య యుద్ధం జరగడం ఒక వాస్తవం. దాని చుట్టూ శతాబ్దాల తరబడి కవులనేక మంది అల్లిన కథ మన ముందు మహాభారతమనే పేరుతో ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆధారం చేసుకుని శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రం అడ్డేయడాన్ని, సైంధవ వధను కల్పించిన కవుల కల్పనాచాతుర్యం అమోఘం. మహాభారతాన్ని ఒక పవిత్రగ్రంథంగా భావించి పూజించడమో, లేక అభూతకల్పనగా కొట్టిపారేయడమో కాకుండా దీంట్లోని వాస్తవాలను జాగ్రత్తగా ఏరుకునే ప్రయత్నాలు విరివిగా జరగాలి.

Reference: Yuganta by Iravati Karve

-సుగాత్రి

ఈ నెల అతిథి సుగాత్రి సాహిత్యం(http://sahityam.wordpress.com) బ్లాగరి. పొద్దు ప్రారంభసంచికల్లో సినిమా శీర్షిక నిర్వహించారు.

Posted in వ్యాసం | Tagged | 13 Comments

కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!

-చందుపట్ల శ్రీధర్

sridhar.jpg

ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి.

భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి.

ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు.

ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది.

డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు.

యిటు జరగండి.

స్ట్రెచర్లోంచి యెవరో బిగ్గరగా అరుస్తూ చేతులు చాస్తున్నారు.

సెలైన్ బాటిల్లోంచి రాలే వొక్కో బొట్టూ

చావు లోకాలకి ఒక్కో మెట్టూ కడుతోంది.

రిసెప్షన్ లో క్యాష్ కౌంటర్ రాకాసి నాలుకల్ని చాస్తోంది.

పరుపులపై పరచిన దుప్పట్ల మీద జీవితాలు

మరకలుగా మారుతున్నాయ్.

మీరు యేమీ అడక్కండి.
కన్సల్టెంట్ డాక్టర్ ఖర్మ యోగం అప్పచెబుతాడు.మీరు మాట్లాడరాదంటాడు.
రౌండ్స్ కొచ్చిన ప్రతీ ట్రెయినీ డాక్టరూ పెదవి విరుస్తున్నాడు.

నర్సులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడల్లా నవ్వుల్ని అతికించుకుంటున్నారు.
కౌంటర్లో నిలబెట్టి ఒంట్లోని ఒక్కో కండనీ కోసి బిల్లులుగా చెల్లేసి ముఖాన కొడుతున్నారు.
పడక మంచాలన్నీ పాడెలాగ మూల్గుతున్నాయ్ .

ఇక్కడ దీనులు మూకుమ్మడిగా దాడి చేసే అపనమ్మకాల్ని కన్నీటి ఆసిడ్లతో కడిగేసికుంటున్నారు.

ఆర్తనాదాలనన్నిటినీ కడుపులో దిగమింగుకుంటున్నారు..

పరామర్శకుల హృదయాలు బిక్కుమంటో నరాల్ని దారాలుగా ముడేసుకుంటున్నాయి.
పంటి బిగువున గట్టిగా బిగపట్టిన ఆనవాళ్లు యేవో అలలు అలలుగా తేలుతున్నాయ్.

యిప్పుడు ప్రార్థన చేయండి.

యిక్కడ మనిషికీ నమ్మకానికీ యెప్పుడూ యుద్దమే !
మహ్మదూ-యేసూ-రాముడూ-
మెయిన్ గేటు దగ్గిరే ఆగిపోయారు.

పిలవరేం!

అప్పుడప్పుడూ పరామర్శలు కొన్ని క్షణాల్ని బ్రతికిస్తున్నాయ్ .

అయ్యో! యేం చేస్తున్నారేం! ?

యెవరినీ కదపకండి.

యిక్కడి దుఖమంతా లుంగలు చుట్టుకుని

మీ నరాల్లోకి ఎగబాకి మీ నిద్రారాత్రులన్నీ అల్లకల్లోలమవుతాయ్.

వుండండి! ఎఱ్ఱబల్బు వెలిగింది.

హుష్ ! సైలెన్స్

. . .

. . .

స్కానింగ్ అయిపోయింది .

సారీ గుండె ఆగిపోయింది.

బిల్లులు కట్టండి.

బిచాణా ఎత్తేయండి.
పేషెంట్….నెక్స్ట్!

-చందుపట్ల శ్రీధర్

కవి స్వపరిచయం: వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా ఆయన అక్షరాలు తిలక్కి కనబడితే – నాకు మాత్రం తెలుగు అక్షరాల వెంబడి పరుగులు తీయటం ఎంతో ఇష్టం. పట్టా తీసుకుంది ఇంజనీరింగ్ లో(’99).ప్రస్తుత ఉద్యోగం ADE (APGENCO). ఇష్టంగా చదివేది సాహిత్యం. సంతృప్తిగా రాసుకునేది కవిత్వం ( http://sridharchandupatla.blogspot.com/). నిజాల కోసం చరిత్రని (http://theuntoldhistory.blogspot.com/) వెతికే పనిలో పడ్డ్డాను ప్రస్తుతం ( తత్త్వ శాస్త్రమన్నా, దోస్తోయేవ్ స్కీ అమాయక హీరో కలలన్నా ఇంకా చలం ( http://chelam.blogspot.com/) అన్నా తెలుగు అక్షరమన్నావల్లమాలిన అభిమానం.

Posted in కవిత్వం | 5 Comments

కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి

ఈరోజు ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి సందర్భంగా ఆయన కథల్లోని వాస్తవికత గురించి ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శారదగారి వ్యాసం అందిస్తున్నాం. దాంతోబాటే యథావిధిగా కొ.కు. గారి అనువాదరచన మృతజీవులు తొమ్మిదో భాగంతోబాటు హృశీకేశ్ పండా రాసిన ఒరియా కథ Bonsai కి ప్రముఖ అనువాదకుడు, తెలుగుబ్లాగరి అయిన కొల్లూరి సోమశంకర్ గారి అనువాదం ‘నేనూ మీ లాంటి వాడినే’, ఇటీవలే ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ గెలిచిన విశ్వనాథన్ ఆనంద్ గురించి రానారె రాసిన వ్యాసం ‘జగజ్జేత ఆనంద్’ కూడా అందిస్తున్నాం.

ఈ నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)

కుటుంబరావు కథల్లో వాస్తవికత (వ్యాసం)
మృతజీవులు – 9 (మృతజీవులు)
నేనూ మీ లాంటి వాడినే (కథ)
జగజ్జేత ఆనంద్! (వ్యాసం)

గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం (అతిథి)
నుడికారము – మరికొన్ని కోణాలు (వ్యాసం)
మృతజీవులు – 6 (మృతజీవులు)
తెవికీ ప్రగతి నివేదిక (వికీ)
అక్షర పద్య విన్యాసాలు (వ్యాసం)
పల్ప్ ఫిక్షన్ (సినిమా)
మృతజీవులు – 7 (మృతజీవులు)

Posted in ఇతరత్రా | Comments Off on కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి

జగజ్జేత ఆనంద్!

-రానారె (http://yarnar.blogspot.com)

గతనెలలో మన క్రికెట్ జట్టు 20-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారం రోజులకే క్రీడాప్రపంచంలో మరో చరిత్రాత్మక సంఘటన జరిగింది. భారతదేశానికే చెందిన క్రీడాకారుడు ఒకరు జగజ్జేతగా నిలవడమేగాక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ క్రీడ మనదేశంలో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగం కాగా ఆ క్రీడాకారుడు…

విశ్వనాథన్ ఆనంద్.
ఎలాంటి సందేహాలకూ తావులేకుండా చదరంగ క్రీడా ప్రపంచపు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన విజేత.

1972లో అమెరికా దేశీయుడు బాబీ ఫిషర్ తరువాత ‘మొదటి స్థానము (ర్యాంక్) మరియు విశ్వవిజేతగా గుర్తింపు’లను ఒకేసారి సాధించి నిలుపుకొన్న రష్యనేతరుడు ఆనంద్. చదరంగం క్రీడలో 35 సంవత్సరాలపాటు కొనసాగిన రష్యన్ల ఆధిపత్యానికి గండికొట్టిన భారతీయుడు ఆనంద్.
క్రీ.శ.2000 లో నాకౌట్ పద్ధతిలోనూ, 2007లో రౌండ్-రాబిన్ పద్ధతిలోనూ చదరంగ కిరీటం కోసం నిర్వహింపబడిన ప్రపంచస్ఠాయి పోటీల్లో ఒక్క ఓటమి కూడా ఎరుగకుండా నిలిచిన ఒకే ఒక్క క్రీడాకారుడుగా విశ్వనాథన్ ఆనంద్ చరిత్ర సృష్టించాడు. 1995లో గారీ కాస్పరోవ్ తరువాత రెండవస్థానం లోనూ, 1998లో అనతోలీ కార్పోవ్ తరువాతి స్థానంలోనూ నిలిచిన ఆనంద్ ఇటీవలి విజయాన్ని తన క్రీడాజీవితంలోనే అత్యంత ఘనమైనదిగా భావించడానికి కారణాలున్నాయి.

క్రీ.శ.2000వ సంవత్సరంలో సాధించిన విజయాన్ని కొందరు చదరంగ ప్రపంచప్రముఖులు నిఖార్సయిన విజయంగా పరిగణించలేదు. కారణం ఏమిటంటే, ఈ పోటీలు అప్పటికే కాస్పరోవ్ ని నిలువరించి చదరంగ రంగంలో సరికొత్త రారాజుగా అవతరించిన వ్లాదిమిర్ క్రామ్నిక్ గైర్హాజరీలో జరగడమే. (1993లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ చదరంగ సమాఖ్య(FIDE)పై తిరుగుబాటు చేసి పోటీగా ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ (PCA) ఏర్పాటుచేసుకున్నాడు. తిరిగి ఆ రెండు సంస్థలూ 2006లో ఏకమయ్యే వరకు ప్రపంచ చదరంగపోటీలు వేర్వేరుగానే జరిగాయి.) ఈ మారు మాత్రం అటువంటి సందేహాలు మచ్చుకైనా లేవు. ఏడేళ్ల క్రితం ఆనంద్ ఎదుర్కొన్న శక్తులకన్నా ఈసారి ప్రత్యర్థివర్గం బలమైనది. క్రామ్నిక్ తో సహా ప్రపంచ చదరంగ హేమాహేమీలందరూ బరిలో ఉన్నారు.

“నిలకడగా (consistent) విజయాలు సాధించడం ఈ భారత మేధావి ప్రత్యేకత. రెండు ప్రపంచస్థాయి పోటీలు, రెండు ప్రపంచ కప్పులు, అనేక ప్రముఖస్ఠాయి పోటీల్లోని విజయాలు సంప్రదాయ (classical) మరియు మెరుపువేగపు (rapid) విభాగాల్లో ఆనంద్ యొక్క బహుముఖ పాటవాన్ని బయల్పరచే ప్రబలనిదర్శనాలు. ప్రపంచ ర్యాంకింగ్ అనేది ఒక క్రీడాకారుని ఫామ్ కూ నిలకడతనానికీ కొలబద్ద అయితే దశాబ్దకాలానికి పైగా మొదటి మూడు స్ఠానాల్లో నిలిచిన ప్రత్యేకత విశ్వనాథన్ ఆనంద్ సొత్తు. అంతేగాక, 2002 మే నెల నుండీ జరిగిన ఏ టోర్నమెంట్లోనూ మొదటి మూడు స్థానాలకంటే తగ్గి నిష్క్రమించడం జరగలేదు.

స్వతహాగా వేగవంతమైన అతని ఆటతీరు — ప్రపంచ వేదికపై ఆనంద్ తనదైన ముద్రను వేసిన తొలినాటి నుండి ఉజ్వలంగా కొనసాగుతూనే వస్తోంది. పావులను కదిపే సమాలోచనలో గత కొద్ది నెలలుగా కాస్త ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్న విషయం వాస్తవమే ఐనా, అతని ఆటతీరు తన ప్రాభవాన్ని కోల్పోలేదు. “బహుశా నేనిప్పుడు చదరంగం బల్లపై మరిన్ని ఎక్కువ అంశాలను చూస్తున్నానేమో” అంటూ విశ్లేషిస్తారు చిచ్చరపిడుగుగా (lightning kid) పేరొందిన ఈ మేథావి. గత కొన్నేళ్లుగా నల్లపావులతో ఆనంద్ విజయాలు పెరుగుతుండగా తెల్లపావులతో అపజయాలు అరుదుగానే మిగిలిపోయాయి. అతని విజయము, శైలి, స్వతహాగా గల ఆకర్షణల కలబోత భారత చదరంగానికి దేశంలో ఏ ఇతర వ్యక్తిగత క్రీడకూ లేనివిధంగా ఒక ఆరాధనీయమైన రూపాన్నిచ్చాయి.

భారతదేశపు తొలి జూనియర్ ప్రపంచ విజేత మరియు తొలి భారత గ్రాండ్ మాస్టర్ గా 1987లో అవతరించిన నాటినుండీ దేశ చదరంగంలో వచ్చిన నిశ్శబ్దవిప్లవానికి ఆనంద్ సూత్రధారి. అత్యంత మేథోపూరితమైన ఈ క్రీడను సమర్థవంతంగా ప్రచారం చేసేవిధంగా ప్రసారమాధ్యమాలను బానగిల్లజేసి క్రీడాజర్నలిజాన్నే మార్చివేసిన ఘనత విశ్వనాథన్ ఆనంద్ కే చెందుతుంది.
భారతదేశంలో ఆనంద్ కంటే ముందు చదరంగం క్రీడపట్ల ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. తమిళనాడుకు చెందిన మాన్యుయెల్ ఆరన్ మనదేశానికి చెందిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్. (ఈయన క్రికెటేతర క్రీడలకు మరే పత్రికా ఇవ్వనంత విస్తృత కవరేజీ ఇచ్చే హిందూ పత్రికకు చెస్ కంట్రిబ్యూటర్ గా పనిచేశాడు.) ఐతే భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ గా (ఆసియాలో రెండో గ్రాండ్ మాస్టర్) తన విజయాలతో దేశంలో వేలాదిమంది యువచదరంగక్రీడాకారులను ఉత్తేజితులను చేసిన ఘనత ఒకేఒక్కరికి చెందుతుంది. ఈనాడు మన దేశంలోని పదహైదు మంది గ్రాండ్ మాస్టర్లకూ, వివిధ వయసుల విభాగాలకు చెంది ప్రపంచ మరియు ఖండాంతర విభాగాల్లో ఛాంపియనులైన అనేకులకూ అంతెందుకు బడికెళ్లే పసివారికీ తెలుసు ఆ స్ఫూర్తి ప్రదాత ఎవరో!

విశ్వనాథన్, సుశీల దంపతులకు 1969 డిసెంబరు 11న చెన్నైలో జన్మించిన ఆనంద్ ఆరవ యేట తన తల్లి వద్ద చదరంగంలో తొలి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. తండ్రి పేరిట ‘విశీ’ అని ఇంట్లో పిలువబడే విశ్వనాథన్ ఆనంద్ తండ్రి ఒక రైల్వే అధికారి. తండ్రి ఉద్యోగరీత్యా ఫిలిప్పీన్స్ లోని మనీలాకు వెళ్ళాల్సిరావడం ఆనంద్ కు కలిసొచ్చింది. అక్కడ చదరంగం బాగా ప్రజాదరణ ఉన్న క్రీడ. అక్కడ టెలివిజన్ కార్యక్రమంలో రోజూ మధ్యాహ్నం చదరంగం ఎత్తుగడలు చర్చించేవారు. ఆ కార్యక్రమం చివర్లో ఒక చిక్కుప్రశ్న ఉండేది. ఆనంద్ తల్లి ఆ చర్చనంతా నోట్స్ రాసి కొడుకుకిచ్చేది. ఆనంద్ ఆ చిక్కుముడులు విప్పి బోలెడన్ని చదరంగ పుస్తకాలు గెల్చుకున్నాడు. ఇప్పటిలాగ ఇంటర్నెట్, ఆన్లైన్ చెస్ అవకాశాలు లేని రోజుల్లో ఆ పుస్తకాలే ఆనంద్ ప్రతిభకు పదునుపెట్టాయి.

1980లో చెన్నయ్ కి తిరిగివచ్చాడు ఆనంద్. అప్పటి నుంచి ఆనంద్ జైత్రయాత్ర మొదలైంది. విసుగూవిరామం లేకుండా కొత్తశిఖరాలు అధిరోహిస్తూనే ఉన్నాడు. జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ విభాగంలో 1983లో విజేత కావడం తొలినాళ్లలో ఘనవిజయం. అప్పటికి ఆనంద్ వయసు పద్నాలుగేళ్లు. 2007 సెప్టెంబరు 29న మెక్సికో సిటీలో ప్రపంచ ఛెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ గెలుపొందిన ఆనంద్ వయసు ముప్ఫైఏడేళ్లు.

1985లో అర్జున అవార్డు, 1987లో పద్మశ్రీ, నేషనల్ సిటిజన్స్ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2000లో పద్మభూషణ్, 1997, 98, 2003, 04లలో ఛెస్ ఆస్కార్ అవార్డులను పొందాడు. స్పెయిన్లో గవర్నమెంట్ ఆఫ్ లాన్జెరోట్ అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే ‘జేమియో డి ఓరో’ అనబడే అత్యున్నత గౌరవాన్ని 2001 ఏప్రిల్ 25న పొందాడు. 1998లో స్పోర్ట్ స్టార్ పత్రికవారి సహస్రాబ్ది పురస్కారం (Millennium Award) పొందాడు.

ప్రస్తుత తాత్కాలిక తారారాధనాయుగంలో, నడమంత్రపు కీర్తినిచ్చి అదేపనిగా ఆకాశానికెత్తే ఈ క్రీడా ప్రపంచంలో… మరే భారతీయ క్రీడాకారుడూ సమీప భవితలో చేరుకోలేని ప్రతిభాకీర్తిశిఖరంపై విశ్వనాథన్ ఆనంద్ ఒక్కడై నిలిచివున్నాడు.

ఆనంద్ అధిగమించిన కొన్ని మైలురాళ్ళు-పొందిన కొన్ని పురస్కారాలు:

1983 – జాతీయ సబ్ జూనియర్ టైటిల్

1984 – ఇంటర్నేషనల్ మాస్టర్

1986 – జాతీయ సీనియర్ టైటిల్,

– అర్జున అవార్డు,
1987 – ప్రపంచ జూనియర్ టైటిల్ (తొలి ఆసియా వాసి)

– గ్రాండ్ మాస్టర్ హోదా (రెండో ఆసియావాసి)

– పద్మశ్రీ (పొందిన తొలి టీనేజర్)
– నేషనల్ సిటిజన్స్ అవార్డు

– సోవియెట్ లాండ్ నెహ్రూ అవార్డు
1998 – స్పోర్ట్ స్టార్ పత్రికవారి సహస్రాబ్ది పురస్కారం (Millennium Award)

1992 – భారతదేశపు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న తొలి గ్రహీత

1994 – ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానం (విజేత కాస్పరోవ్)

1997 – చెస్ ఆస్కార్ విజయం (98, 2003, 04లలో కూడా)

2000 – ప్రపంచ చదరంగ విజేత

– పద్మభూషణ్

2001 – పద్మవిభూషణ్

– స్పెయిన్ దేశపు అత్యున్నత అవార్డు ‘జేమ్స్ డి ఓరో’

2003 – రాపిడ్ చెస్ ప్రపంచ విజేత

2007 – ప్రపంచ చదరంగ విజేత

– చదరంగ చరిత్రలో చెస్ రేటింగ్స్ లో 2800 ఎలో పాయింట్లు దాటిన నాలుగో ఆటగాడు (ఇతరులు: గ్యారీ కాస్పరోవ్, వ్లాదిమిర్ క్రామ్నిక్, వెసిలీన్ తొపలోవ్)

………………………………………………

విషయ సేకరణ: ది హిందూ, ఎన్వికీ, ఈభూమి వారపత్రిక ల నుండి.

……………………………………………….

Posted in వ్యాసం | 1 Comment

నేనూ మీ లాంటి వాడినే

నాకు నాలుగేళ్ళు వచ్చేసరికే, మా అమ్మని, రెండు గాడిదలని వదిలి మా నాన్న చనిపోయాడు. అమ్మదింకా అప్పటికి చిన్న వయసే కాబట్టి మరో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ, కట్నంగా ఒక గాడిదని తనతో తీసుకుపోయింది. నాన్నకి సొంత భూమంటూ ఏదీ లేదు. నాన్న చావు, అమ్మ రెండో పెళ్ళి తర్వాత, మా మురికి వాడ యజమాని నన్ను అక్కడి నుంచి తరిమేసాడు. నా మేన మామ, అతడి భార్య నన్ను చేరదీసారు. మిగిలిన ఆ ఒక్క గాడిదను వాళ్ళు ఉంచేసుకున్నారు.

ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ ‘ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారి అద్దాల బోర్డు ఉంది. ఓ బట్టల సబ్బు కంపెనీ వ్యాపార ప్రకటనల కోసం ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఈ పుస్తకంలో నా పేరు కూడా ఉంది. ఆ బోర్డు పైన నా నీడ పొడుగ్గా పడుతోంది. ఓ బండి నన్ను దాటుకుంటూ వెళ్ళింది. నా నీడ ఇంకా పొడుగయ్యింది. అదృశ్యమయ్యేముందు నీడలు మరీ పొడుగవుతాయి.

ఈ ఏడాది నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతోంది. ఆ మేరకు ఉత్తరం కూడ వచ్చింది. ఏం లాభం? నేను ఏ భాషలోను చదవలేను. నా మిత్రులు నాకు చదివి వినిపించారు. ఇదే నా స్థలం! రాధు కిళ్ళీకొట్టు పక్కన. నేనిక్కడ అందరినీ నవ్విస్తాను. ఉత్సాహపరుస్తాను. నిజానికి నేను నోరు తెరవక్కరలేదు. పెదాలు కదిలిస్తే చాలు, జనాలు విరగబడి నవ్వుతారు. కాని ఈ పిల్లలు జాలి లేని వాళ్ళు. వీళ్ళు రాక్షసులే! నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతారు. జుట్టు పట్టి లాగుతారు. నేను ఎదురుతిరిగితే, దూరం నుంచి రాళ్ళు విసురుతారు. వీళ్ళ కారణంగా నేను స్వేచ్ఛగా తిరగలేను.

మా మావయ్య నన్ను చక్కగా చూసుకుంటాడు. ఇక అత్త అయితే అమ్మే! వీళ్ళే లేకపోతే నేనీపాటికి ఏ సర్కస్ కంపెనీలోనో ఉండేవాడిని. ఓ సారి ఓ కంపెనీ వాళ్ళు నాకు లక్షరూపాయలు ఇస్తామని మా అత్తకి, మామకి ఆశ చూపారు. ఎన్ని జన్నలెత్తినా, అంత పెద్ద మొత్తాన్ని కళ్ళజూడరేమో. కాని మా అత్త ఒప్పుకోలేదు. “వరుసగా పదడుగులు సరిగా వేయలేడు, సర్కస్ లో తాడు మీద ఎలా నడుస్తాడు? ఓ పెద్ద జోకర్ కాళ్ళమధ్యనుంచి కిందకి పడిపోతే? పులి నోట్లోకి వెళ్ళి తిరిగిరాగలడా? మేజీషియన్ పెట్టెలోంచి బయటకు రాగలడా?” అంటూ మా అత్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

హిందీ సినిమాలలో ప్రయత్నిద్దామని ఓ సారి బొంబాయి కూడ వెళ్ళాను. కాని ఫలితం లేకపోయింది. ఊరంతా తిరిగి, వట్టిచేతులతో ఇల్లు చేరాను. క్రిందటి ఏడాది ఓ టి.వి. బృందంలో హాస్యగాడిగా చేరి కొంచెం డబ్బు సంపాదించాను.

మా అత్తని, మావయ్యని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. ఇప్పుడు నా వయసు 23 ఏళ్ళు. వీళ్ళ మీద ఆధారపడి ఎంత కాలం బతకడం? ఓ సారి తినుబండారాల కొట్టు పెట్టాను. అత్త పదార్థాలు చేసిస్తే, నేను వాటిని అమ్మేవాడిని. చుట్టుపక్కల పిల్లలంతా తిని పోయేవారు. డబ్బులిచ్చేవారు కాదు. పిల్లలు ప్రతీసారి తినేసి పరిగెత్తేవారు. నన్నేదో మోసగించాలని వారి ఉద్దేశ్యం కాదు. నేను వాళ్ళని వెంటబడి తరిమితే చూడాలని వారి కోరిక. ఈ వ్యాపారంలో నేను నష్టపోయాను.

ఓ సారి మా నగర మేయర్ నన్ను చూసారు. అప్పటికే నా పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. నాకు మేయర్ సన్మానం చేసారు. కాని నాకది అవమానంగా తోచింది. “ఈ అబ్బాయి రికార్డు పుస్తకాలలోకి ఎక్కగానే సరికాదు, గౌరవప్రదమైన జీవితం గడపడానికి మనమందరం తోడ్పడాలి” అంటూ మేయర్ గంభీరంగా ప్రకటించారు. ఆ మాటలకి నేను పొంగిపోయాను. ఏదైనా మంచి అవకాశం వస్తుందేమోనని చాలా కాలం వేచిచూసాను. కాని అటువంటిదేదీ జరగలేదు. మేయర్ మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాను. నేను ఒంటరిగా వెళ్ళలేను. నాతో పాటు ఎవరో ఒకరు తోడు రావల్సిందే. పైగా బస్సులలో అసలు వెళ్ళలేను. ఆటోలో వెళ్ళాల్సిందే. మరి డబ్బులో? అంత మొత్తం నేనెలా భరించగలను? విసిగి వేసారిపోయాను.

నాకు సినిమాలంటే ఇష్టం. అమితాబ్ బచ్చన్ నా అభిమాన హీరో. ఎంత పొడుగ్గా ఉంటాడో కదా! హీరోయిన్లలో నాకెవ్వరూ నచ్చరు. నాకు నటీమణులు నచ్చరు. నాకున్న స్నేహితులంతా మగవాళ్ళే. మా అత్తని మినహాయించాలి. ఆమె నా పాలిట దేవత! కిళ్ళీ కొట్టు యజమాని రాధు నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం చాలా సమయం కలసి గడుపుతాం. అలాగే లతీఫ్ కూడ. లతీఫ్ దర్జీ. నా బట్టలు ఉచితంగా కుట్టిపెడతాడు. గుడ్డముక్కలు అత్త కొంటుంది. అయినా నా శరీరానికి ఏ మాత్రం గుడ్డముక్క కావాలేంటి?
నాకు ఇంకో మిత్రుడున్నాడు. వాడి అసలు పేరు చెప్పను. ‘రాహు’ అనుకుందాం. వాడో వెధవ. దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. వాడెంత సమర్ధుడంటే, రెండు సన్నని చేపలని పిడికిళ్ళలో పెట్టుకుని, బూజు పట్టిన గొట్టాలని అవలీలగా ఎక్కిదిగగలడు.

కాలక్షేపం కోసం నేను టి.వి. చూస్తాను. పేపరు చదవలేను, కాని మావయ్య వార్తలను పైకి చదువుతుంటే వింటాను. ఓ రోజు మా పేటలో ఏవో సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. నన్ను కొన్ని చేష్టలు చేయమన్నారు. చేసాను. ప్రతిఫలంగా కొంత డబ్బిచ్చారు. ఓ సారి మా టి.వి. బృందానికో పెద్ద అవకాశం వచ్చింది. ప్రదర్శన కొనసాగుతోంది. మా బృందంలో ఓ గాయని కూడ ఉంది. ఆమె పేరు మీరా. ఆమె పాటలు పాడుతుంటే, మధ్యలో నేను కుప్పిగెంతులు వేసి ప్రేక్షకులని నవ్విస్తున్నాను. స్టేజికి వెనుకగా కట్టిన తెరమీద నా నీడ పడి, పెరుగుతూ తరుగుతూ ప్రేక్షకులకి వినోదం పంచుతోంది. అందరూ చప్పట్లు కొట్టారు. మీరా కూడా. విరామ సమయంలో పాట ఆగింది, కాని వాయిద్యాలు ఆగలేదు. అందరూ చూస్తుండగా మీరా తెర వెనక్కి నన్ను లాక్కెళ్ళింది. ఏదో విశేషమైన అంకం కాబోలని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఒకరో ఇద్దరో ఈలలు కూడ వేసారు.

“నిన్నొక మాట అడగనా?” అంది మీరా జీర గొంతుతో. మళ్ళీ తనే మాట్లాడుతూ,
“ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను. కాని ధైర్యం చాలలేదు. నీ సమాధానం ‘సరే’ అయితే ఇప్పుడే చెప్పేయ్. ‘కాదు’ అయితే మాత్రం ఇప్పుడే చెప్పకు. నేను తట్టుకోలేను. నా హృదయం బద్దలవుతుంది” అని అంది. మా నీడలు తెరమీద పడి, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్న సంగతి ఎదురుగా కూర్చున్న అందరికీ తెలుస్తోంది.
నేను ఆసక్తిగా ఆమెకేసి చూసాను.
“నా హృదయం నీకర్పించాను. నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగింది మీరా. ఇంత అప్యాయంగా నాతో మాట్లాడినవారెవ్వరూ లేరు. నేను కరిగిపోయాను.
నేను పిల్లి మొగ్గ వేసాను. డ్రమ్స్ వాయించే కుర్రాడి భుజంపైకెక్కి, డ్రమ్‌ని రెండు సార్లు మ్రోగించాను. తర్వాత మీరా దగ్గరికి పరిగెత్తాను. ఆమె గౌను అంచుని ముద్దాడాను. ఆమె వాయిద్యకారులున్న వైపు నడిచింది. వాళ్ళలో ఒకడు మైక్ పట్టుకుని, “ఏమన్నాడు?” అని అడిగాడు.
ప్రేక్షకులు కూడా ” ఏమన్నాడు?” అంటూ కోరస్ గా అరిచారు.

ఆ వంచకి, మైక్ అందుకుని, “నేను అతడిని నన్ను పెళ్ళిచేసుకుంటావా అని అడిగాను” అంటూ వీక్షకులకి చెప్పింది. నా వీపు ప్రేక్షకులకి కనపడేలా నిలుచున్నాను. “జవాబు ఏం చెప్పాడు?” అంటూ ప్రేక్షకులు గోల గోలగా అడిగారు. నాకు సిగ్గేసింది. నా ముఖం మాడిపోయింది. నా శరీరం ఎదగలేదు నిజమే, కాని బుద్ధి ఎదిగింది. ఆమె నన్ను గేలి చేసిందని గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు. ఇక్కడి జనాలను నవ్విస్తూ, నేను చనిపోయుంటే, నేను నా చివరి క్షణాలలో ఎవరిని తలుచుకునుండే వాడినో తెలుసా? అమ్మ కన్నా ఎక్కువైన అత్తని కాదు, దేవుడి లాంటి మావయ్యని కాదు, ఆఖరికి నా మిత్రబృందాన్ని కూడా కాదు. మీరాని ! అటువంటిది – ఎంతటి విద్రోహం?

మీరా హుషారుగా చెబుతోంది – ” అతడు సరేనన్నాడు. మనం ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అని అడిగాడు”

అంతే అక్కడ ఒక్కసారిగా, నవ్వులవాన కురిసింది. జనాలందరూ హేళనగా పగలబడినవ్వారు. వాళ్ళల్లో మా అత్త, మావయ్య కూడ ఉన్నారు.
మోసగాళ్ళు. అందరూ మోసగాళ్ళే! మీరా, అత్త, మావయ్య, రాధు, లతీఫ్……. అందరూ! గడ్డిలో దాక్కున్న పాములు! వాయిద్యకారులు గట్టిగా మ్రోగించి ప్రేక్షకులని మరింత రెచ్చగొట్టారు.

నేనింకా అలాగే నిలబడి ఉన్నాను. మీరా నన్ను వెర్రి వెధవని చేసింది. నేను మరుగుజ్జునే కావచ్చు. కాని నా గుండె చిన్నది కాదే? మాములు మనుషులకి ఉండే పరిమాణంలోనే నా గుండె కూడ ఉంది. వర్షాకాలంలో కురిసిన వానంతా కలసి నా కళ్ళలో సముద్రమైంది. నా కళ్ళ లోంచి జారుతున్న నీటి బొట్లని చూడండి. వాటి పరిమాణాన్ని గమనించండి. ప్రపంచంలోని ఏ మనిషి కళ్ళనుంచైనా కారే నీటి బిందువుల పరిమాణమే కదా అవి? లేదంటే అవింకా చిన్నవని మీరు భావిస్తున్నారా?

* * *

ఒరియా మూలం: హృశికేశ్ పండా
ఆంగ్లం: లిపి పుష్పనాయక్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్. కథారచయిత మరియు అనువాదకుడైన ఈయన గతంలో కొన్ని దిన పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించారు. వ్యాసాలు రాసారు. ఈయన సొంత కథలు, అనువాదాలు వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. మంచి కథలు ఎక్కద చదివినా, వాటిని తెలుగు లో కి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.

Posted in కథ | Tagged , | 6 Comments

కుటుంబరావు కథల్లో వాస్తవికత

-శారద

సాధారణంగా, ఒక్కొక్క రచయితకీ ఒక్కొక్క ప్రత్యేకతా, తమదైన సంతకంలాంటి శైలీ వుంటాయి. రంగనాయకమ్మ గారి సూటి దనం, మధురాంతకంగారి సున్నితమైన శైలీ, మనకు చదవగానే అదెవరి కథో పట్టి చెప్తాయి. క్రమం తప్పకుండా చదివే పాఠకుడు తన అభిమాన రచయితని పేరు లేకున్నా పోల్చుకోగలడు. ఇరవైయవ శతాబ్దపు నాలుగో దశకంలో ఆరంభమైన సాహిత్య ప్రస్థానంలో కుటుంబరావుగారు రాసిన కథలూ నవలల్లో శైలీ, నేర్పూ ఆయనని గొప్ప కథకులలో ఒకరినిగా నిలబెట్టాయి.

సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించే రచనలే పాఠకుల అభిమానాన్ని చూరగొని పది కాలాలపాటు నిలబడతాయి. అందుకే స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాతా మన దేశంలో వున్న రాజకీయ పరిస్థితులకి అద్దం పడుతూ, వాటితోపాటే పరిణామం చెందుతూ వచ్చిన మధ్య తరగతి జీవితాల్ని అన్ని కోణాల్నించీ పరిశీలిస్తూ, విశ్లేషించిన ఆయన రచనలు ఇప్పటికీ ఎక్కువగా చదవబడుతున్నాయి. కథలో సామాజిక వాతావరణంతో పాటు, పాత్రలు కూడా నిజ జీవితానికి దగ్గరగా, నేల మీద నడుస్తేనే పాఠకులు ఆ పాత్రలతో తమను తాము అయిడెంటిఫై చేసుకోని కథలో లీనమవగలరు. సమకాలీన సంఘపు నియమాలనీ, రాజకీయ సూత్రాలనీ, ఆర్ధిక సమీకరణాలనీ నిర్మొహమాటంగా, నిజాయితీగా విమర్శిస్తూ, నిజ జీవితంలో మనకినిత్యం ఎదురయ్యే పాత్రలే ఆయన రచనలని పట్టిస్తాయి.

“నిజమైన సాహిత్యం” అనే వ్యాసంలో, సాహిత్య ప్రయోజనం ఉద్బోధా కాదూ, కళావిష్కరణా కాదూ, అంటూ ఆయన ఇలా వివరించారు.
“….జీవితాన్ని విమర్శించటం, అలంకరించటం, సాహిత్యం చేయగల ఉత్తమ కార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం. ఏ కాలపు జీవితాన్ని విమర్శించేది ఆ కాలపు సాహిత్యం. నేటి జీవితాన్ని విమర్శించలేనిదీ, నేటి భావాలను సంస్కరించలేనిదీ, నేటి జీవితాన్ని అలంకరించలేనిదీ నేటి సాహిత్యం కాదు …..”

ఈ నమ్మకంతోటే, ఆయన సమకాలీన సమాజంలో స్త్రీ-పురుష సంబంధాలనూ, ఆర్ధిక అసమానతలనూ, రాజకీయ శక్తులనూ, పిల్లల పెంపకంలోని సూక్ష్మాలనూ, వేటినీ వదలకుండా, విమర్శించి విశ్లేషించారు. తనకు తెలిసిన మధ్య తరగతి మాత్రమే కాక ఈ కథల్లో ఎన్నో వర్గాలని గురించి ఆలోచన రేకెత్తించారు. ఇన్నిరకాల పాత్రల్లోనూ, అంతర్లీనంగా ఒక స్వాతంత్ర్య కాంక్ష ప్రవహిస్తూనే వుంటూంది.

మార్క్సిస్టు సిధ్ధాంతాల మీద ఎంతో అభిమానం వున్నా ఆయన, మనిషికి వుండే ప్రబలమైన స్వేఛ్ఛా కాంక్షని హై-లైట్ చేసారు. ‘నీకేం కావాలి?’ లోని కస్తూరి అయినా, ‘స్వేఛ్ఛ ‘ లో ఇల్లు వదలి పారిపోయిన భార్య అయినా, వాళ్ళ మనుగడా, భద్రతా, సంఘంలో గౌరవం కంటే వాళ్ళ స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలకే ఎక్కువ విలువ ఇచ్చారు. చాలా వరకు కుటుంబరావు గారి పాత్రలు ఇలా తమ వ్యక్తిత్వాలని ప్రకటించుకునే ప్రయత్నంలో వుంటాయి. తనకి కావాల్సిందీ, అక్కరలేనిదీ నిర్ణయించుకునే శక్తిని మనిషినించి హరించే ఏ సాంఘిక స్థితి అయినా గర్హనీయమే. నిరాకరించే అవకాశం వుండి కూడా ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఆయన కథలన్నిటిలోనూ ఈ ఘర్షణ మనకి కనపడుతూనే వుంటుంది.

సాంఘిక నియమాలూ, ఆర్ధిక నీతులూ కత్తుల బోనులో నిలబెట్టినప్పుడు మనిషికి ఏ రకమైన స్వేచ్చ కూడా లేదని ఆయన ‘మనుషులకు గల స్వేఛ్ఛ ‘లో ఉద్ఘాటించారు. ఆ కథలో జబ్బు పడ్డ పని మనిషిమీద తారకం జాలిపడి డబ్బివ్వబోతే, ఆ పని మనిషి తల్లి తీసుకోదు, తమ నీతిని తాకట్టు పెట్టుకోవలసి వస్తుందనే భయంతో. మనిషికి మనిషి సహాయ పడాలనే వున్నా చుట్టూ వున్న కళ్ళకు కనపడని నీతి నియమాలేవో పడనివ్వటంలేదు. వాటి స్వరూపాన్నీ, ప్రభావాన్నీ ప్రశ్నించాలన్న ఆలోచన రేపారు. ఆ సందర్భంలో తారకం అతని తండ్రి తో అంటాడు, “పనిమనిషికి హెచ్చు డబ్బిచ్చే స్వేఛ్ఛ మనకు లేదూ, తీసుకునే స్వేఛ్ఛ ఆమెకు లేదూ,” అని. ఇలా చుట్టు వున్న పరిస్థితులని ప్రశ్నించే కొంచెం ఐడియలిస్టిక్ పాత్రలు కొన్ని సార్లు అసహజంగా వున్నాయా అన్న విమర్శకి సమాధానం ఇస్తూ ఆయన, ‘ కథకుడు సమస్యనిగురించి చర్చించటమే కాదు, ఆ సమస్యని పరిష్కరించగల పాత్రల గురించి కూడా రాయ గలగాలి ‘ అన్నారు.

స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలకంటే ముందు మనిషికి కావలిసింది ఆహారం. ఆ తరువాతే సాహిత్యమైనా, సంస్కారమైనా. ఈ అవసరాలే మనిషిని శాసించి, నడిపిస్తాయి. తిండి కరవైనప్పుడు మనిషి ఏం చేస్తాడు? ‘తిండి దొంగ ‘ లో వెంకాయమ్మ, ‘అట్టడుగు ‘ లో గణపతిల ప్రవర్తనకి మనం అసహ్యించుకోలేం. ఆకలికున్న శక్తి అటువంటిది అని మాత్రం అనిపిస్తుంది. తీర్చుకొని తీరాల్సిన అవసరాలకీ, స్వేఛ్ఛా కాంక్షకీ నడుమ సంఘర్షణలోంచే జీవితం పుడుతుందేమో. ‘తిండి దొంగ ‘ లో వెంకాయమ్మ కూతురింట్లో తినుబండారాలు దొంగ తనం చేసి ఆకలితో మాడుతున్న కొడుక్కివ్వటానికి అర్థ రాత్రి బయలుదేరుతుంది. ‘అట్టడుగు ‘ లో గణపతి దుర్భరమైన దారిద్ర్యాన్ని, ‘ అన్ని రకాల విశ్వాసాలనూ వదిలేసి,… బియ్యం అమ్మీ, డబ్బు వడ్డీలకిచ్చీ, డబ్బున్న వాళ్ళని పొగిడీ, కూలి జనాన్ని తిట్టీ…’ జయిస్తాడు. పరిస్థితుల చేతిలో మనిషి బానిస అనిపించే ఇలాటి కథలు ఇప్పటికీ మనం నిజ జీవితంలో చూస్తూనే వుంటాము.

కుటుంబరావుగారి కథల్లో ఆయన గాఢంగా నమ్మిన కమ్యూనిస్టు సిధ్ధాంతాలతో పాటు, జీవితానికి అతి దగ్గరగా అనిపించే ఆయన పాత్రల్లోని వాస్తవికత కూడా మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ‘పంచకళ్యాణి ‘ లోని లలితా, ‘సవతి తల్లి ‘ లోని బామ్మా, ‘అనుభవం ‘ లోని పార్వతీ మాత్రమే కాదు, ఏ పాత్రని గురించి ఆలోచించినా, “ఈ మనిషిలాంటి మనిషి నాకిదివరకే తెలుసు” అని మనం చాలా సార్లు అనుకోకుండా వుండలేం.

కథల్లో సామాజిక వాస్తవికతతో పాటు, పాత్రలు చాలా బిలీవబుల్ గా, సాధారణంగా వుండటం వల్లనే కాబోలు, ఆయన రచనలకీ, చెహోవ్ రచనలకీ అంత సారూప్యం. రచయిత తన కథల్లోని పాత్రల మనస్తత్వాలని నిజ జీవితంలోని మనుషులకి అంత దగ్గరగా చిత్రీకరించరాలంటే, చుట్టూ వున్న మనుషులనీ, వాళ్ళ ప్రవర్తనలోని మంచి చెడుల్నీ, ఆ ప్రవర్తననీ ఆలోచనలనీ ప్రభవితం చేసే సంబంధ బాంధవ్యాలనీ, వాటిని తిరిగి శాసించే సంఘ శక్తులనీ అన్నిటినీ మైక్రోస్కోపులో పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ వుండాలి. ఆ పరిశీలనలో, విశ్లేషణలోనే రచయిత పరిపక్వతా, మేధస్సూ బయట పడేవి. నిజానికి, ఇటువంటి విశ్లేషణా, అవగాహనలే సాహిత్యానికి పరమావధి అన్నారాయన.

విభిన్న వర్గాలకి చెందిన స్త్రీ పురుషుల గురించి రాయటం ఒక ఎత్తయితే, పిల్లలనీ వాళ్ళ అవసరాలనీ అర్ధం చేసుకొని రాయటం ఒక ఎత్తు. కుటుంబరావు గారు పిల్లల మనసుల గురించీ, వాళ్ళ అవగాహన గురించీ, ఆలోచించటానిక్కూడా స్వతంత్ర్యం లేని స్త్రీ జాతి పిల్లలని పెంచడాన్ని గురించీ లెక్క లేనన్ని కథలు రాసారు. చాలా వరకు ఆయన స్త్రీ పురుషుల ప్రవర్తన కృత్రిమమైనది గానూ, పిల్లల ప్రవర్తనా, ఆలోచనా స్వఛ్ఛమైనదిగానూ చిత్రీకరించారు. పిల్లలకు సంఘ నియమాలతో పని లేదు, సంబంధ బాంధవ్యాలలోని లాభ నష్టాలతో పని లేదు. ఇతర వర్గాల నించి ఆత్మ రక్షణ చేసుకోవాలసిన అవసరం లేదు. అందుకే వాళ్ళ ప్రవర్తన చాలా నిజాయితీగా, తర్క బధ్ధంగా వుంటుంది.

“…పిల్లల ఉద్రేకాలు కూడా పాటించటం వల్ల జీవితం బాగు పడుతుందేమో కానీ, చెడి పోదు. చిన్న పిల్లల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ఞానయుతంగా వుండవు గానీ, అంత మూఢంగా కూడా వుండవు…” అన్నారాయన, “ఆడ జన్మ” అనే కథలో.

చాలా చోట్ల కుటుంబరావు గారి కథల్లో ఇలాటి కాలాతీతమైన వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి. అసలు కంటే కొసరు ముద్దని, కథ కంటే ఇలాటి వ్యాఖ్యానాలు మెచ్చు కుని ఆలోచించే వాళ్ళు చాలా మందే వుండి వుంటారు. ఈ వ్యాఖ్యానాలలో మనకు జీవిత సత్యాలు గోచరిస్తాయి.

“పెళ్ళికి పెద్దలు” అనే కథలో ఆయన,
“జీవితం కాళ్ళ జెర్రి లాటిది. వెయ్యి కాళ్ళతో నడుస్తుంది, అయితే తేడా ఏమిటంటే, కాళ్ళ జెర్రికి చక చకా నడిచిపోవటం తెలుసు. జీవితానికి తెలీదు…” అంటారు. “సవతి తల్లి” కథలో, “..పరిస్థితులతో సంఘర్షణ పెట్టుకోదలచిన వాళ్ళు సాధారణంగా ఆత్మ విమర్శకి పూనుకోరు. పరిస్థితులతో రాజీ పడే వారే తరచు దానికి సిధ్ధ పడతారు, ” అంటారు. మొదటిసారి చదవగానే కాంట్రడిక్టరీగా అనిపించినా, అది నిజమేననిపిస్తుంది, మనకి మళ్ళి ఆలోచిస్తే.

సునిశిత పరిశీలనతో పాటు, సున్నితమైన హాస్యంకూడా కుటుంబరావు గారి కథల్లో కనపడుతుంది. అయితే ఎక్కువగా “సిట్యుయేషనల్ కామెడీ” కన్నా, భాష, భావాలతో ఎక్కువ హాస్యం పండిచారు. “మగవాడి దౌర్జన్యం”, “పెళ్ళికి పెద్దలు”, “పతివ్రతా మహిమ”, “దుష్ట గ్రహం”, లాటి కథల్లో మధ్య తరగతి హిపోక్రసీ మీదా, అర్ధం లేని భావ జాలం మీదా లలితమైన సెటైర్లు వేసారు.

సాహిత్యాన్ని కేవలం ఉబుసుపోకకో, సరదాకో కాక, ఆలోచింప చేసే ప్రక్రియగా నమ్మే చదువరులకూ, రచయితలకూ కుటుంబరావుగారి సాహిత్యం మంచి నీళ్ళ బావి లాటిది. ఆయన రచనలు చదివినప్పుడల్లా కొత్త అర్ధాలనిస్తాయి. వాటిల్లో కనిపించే జీవన సూత్రాలు సజీవమైనవీ. ఆ సూత్రాల గురించి అర్ధం చేసుకోవాల్సిన అవసరం మనకెంతైనా వుంది.

—————————————-

apweekly.comలో నలుపు-తెలుపు అనే కాలమ్ నిర్వహిస్తున్న శారద గారు అనేక తెలుగు రచనలను thulika.net కోసం ఆంగ్లంలోకి అనువదించారు. సునిశితమూ, సున్నితమూ ఐన కొ.కు. గారి శైలి తనకిష్టమనీ, తాను మార్క్సిజమ్, ఫెమినిజమ్ వగైరా ఏ ఇజాన్నీ పూర్తిగా ఆమోదించలేననీ అంటారు.

Posted in వ్యాసం | Comments Off on కుటుంబరావు కథల్లో వాస్తవికత

మృతజీవులు – 9

చివరకతను కొంత ఉద్రేకంతో ఇలా అన్నాడు:

“వంశ గౌరవంగాని, హోదాగాని లేని నాకు మీరు ఈ విలువ లేని మనుషులను ఇచ్చి ఎంత మహోపకారం చేస్తున్నారో మీకేం తెలుసు! నేను ఎన్ని కష్టాలుపడ్డాను! తుఫానులో చిక్కిన నావలాగ…ఎంత అవమానానికీ, ఎంత దురన్యాయానికీ గురి అయ్యాను, ఎన్ని రకాల దుఃఖాలు అనుభవించాను! ఎందుకు? న్యాయంగా వర్తించినందుకు, నా అంతరాత్మ ఆదేశాలను పాటించినందుకు, దిక్కులేని వితంతువులకూ, అనాథ శిశువులకూ సహాయం చేసినందుకు!…”

ఈ మాటలంటూ అతను చేతి రుమాలుతో ఒక కన్నీటిచుక్క తుడుచుకున్నాడు కూడా.

మానిలవ్ హృదయం కరిగిపోయింది. స్నేహితులిద్దరూ ఎంతోసేపు ఒకరి చేతులు ఒకరి నలుపుకుంటూ, మౌనంగా నీరు నిండిన కళ్ళతో ఒకరి నొకరు చూసుకుంటూ కూచున్నారు. మానిలవ్ మన కథానాయకుని చేతులు విడవకుండా పట్టుకుని, ఎంత ఆప్యాయంగా నొక్కాడంటే, అతనికి తన చేతులను ఎలా విడిపించుకోవాలో తెలియలేదు. చిట్టచివరకు అతను చేతులను ఉపాయంగా విడిపించుకుని, సాధ్యమైనంత త్వరగా అమ్మకం పత్రం రాసుకోవటం మంచిదని అని, తన టోపీ తీసుకుంటూ సెలవిప్పించమన్నాడు.

“అదేమిటి? అప్పుడే వెళ్ళిపోతారా?” అన్నాడు మానిలవ్, చప్పున స్ఫురణకు వచ్చినట్టూ, కొంచెంగా భయపడినట్టూ.

ఆ క్షణంలోనే మానిలవ్ సతి ఆ గదిలోకి వచ్చింది.

“లీజంకా, పావెల్ ఇవానొవిచ్ వెళ్ళిపోతారట”, అన్నాడు మానిలవ్ దైన్యంతో.

“మనం ఆయన్ని బాధపెట్టి ఉంటాం”, అన్నది మానిలవ్ సతి.

చిచీకవ్ తన గుండే మీద చెయ్యి పెట్టుకుంటూ, “అమ్మా, ఇదుగో, మీతో కాలక్షేపం చేసిన ఆనందం ఇక్కడ దాచుకుంటాను! నా మాట నమ్మండి, మీరున్న ఇంట్లో కాకపోయినా, మీ సమీపంలోనైనా శాశ్వతంగా నివసించటం కన్నా నాకు హెచ్చు ఆనందం ఉండబోదు.”, అన్నాడు.

ఈ ఆలోచన మానిలవ్‌కు దివ్యంగా తోచింది. “చూడండి, పావెల్ ఇవానొవిచ్, మనం ఇలా కలిసి ఒకే ఇంటగానీ, ఒకే చెట్టు నీడన గాని జీవిస్తూ తత్వ విచారంలో జీవితం గడిపితే ఎంత బాగుంటుంది!”, అన్నాడాయన.

“అంతకంటే స్వర్గమేముంటుంది?” అన్నాడు చిచీకవ్ నిట్టూర్చుతూ. అతను మానిలవ్ సతి చెయ్యి ముద్దు పెట్టుకుని, “అమ్మా, సెలవు!… ప్రియమిత్రమా, సెలవిప్పించండి. నేను అడిగినది మాత్రం మరువకండి!” అన్నాడు.

“ఎంత మాటా! మనం మళ్ళీ రెండు రోజుల్లో కలుసుకుంటాంగా!” అన్నాడు మానిలవ్.

ఆల్కైడ్స్, తెమిస్టోక్లస్ లు చేతులూ, ముక్కూ లేని ఒక కొయ్య సిపాయి బొమ్మను ఏదో చేస్తూండటం చూసి చిచీకవ్, “నాయన్లారా, వెళ్ళొస్తాను. మీకోసం బహుమానాలు తేలేదని ఏమీ అనుకోకండి, నాకసలు మీరున్న సంగతి కూడా తెలియదు. ఈసారి వచ్చేటపుడు తప్పక తెస్తాను, నీకు కత్తి తెస్తానోయ్, కత్తి నీకిష్టమేనా?”

“ఇష్టమే” అన్నాడు తెమిస్టోక్లస్.

“మరి నీకు డోలు తెస్తాను. దోలు నీకిష్టమేగదూ?” అన్నాడు చిచీకవ్ వొంగి ఆల్కైడ్స్ తో.

ఆల్కైడ్స్ తలవంచుకుని రహస్యంగా “ఇష్టమే” అన్నాడు.

“ఇంకేం నీకు డోలు తెస్తాను, మంచి డోలు. అది ఏమంటుందో తెలుసా? టర్ ర్ -టర్ – ట-ట-ట అంటుంది. వస్తాను, నాన్నా వస్తాను!” అంటూ అతను కుర్రాడి తలమీద ముద్దు పెట్టుకుని,కుర్రాళ్ళ అమాయకపు కోరికలను గురించి తల్లిదండ్రుల ఎదుట నవ్వే తీరుగా మానిలవ్ దంపతుల కేసి చూసి నవ్వాడు.

వారు మెట్లదాకా వెళ్ళినాక మానిలవ్, “మీరు ఉండిపోవడం మంచిది, పావెల్ ఇవానొవిచ్! ఆ వాన మబ్బులు చూశారా?” అన్నాడు.

“అవి చిన్న మబ్బులేగా?” అన్నాడు చిచీకవ్.

“అయితే మరి సబాకవిచ్ ఇంటికి దారి తెలుసా?”

“మిమ్మల్నే అడుగుదామనుకుంటున్నాను”

“మీ సెలవైతే ఇప్పుడే మీ బండీ వాడికి దారి చెబుతాను”

మానిలవ్ అంత మర్యాదగానూ బండీ వాడికి వెళ్ళవలసిన దారి వివరించి చెప్పాడు.

రెండు అడ్డదార్లు వదిలేసి మూడోది పట్టుకోవాలని తెలుసుకుని బండీవాడు “పట్టుకుంటాంలెండి దొరా!” అన్నాడు.

చిచీకవ్ బండి ఎక్కి వెళ్ళిపోతుంటే భార్యాభర్తలిద్దరూ మునివేళ్ళమీద నిలబడి చలాసేపు వీడ్కోలు చెప్పి, చేతి రుమాళ్ళు ఊపారు.

మానిలవ్ బండి దూరాన అదృశ్యమైనదాకా నిలబడి, అది కనబడకుండా పోయినాక కూడా మెట్లమీదనే ఉండి పైపు కాల్చుకున్నాడు. చివరకాయన లోపలికి వెళ్ళి బల్లవద్ద కూచుని, తన అతిథిని సంతుష్టపరచినందుకు నిష్కల్మషమైన ఆనందం పొందుతూ, ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచనలు ఇతర విషయాలపైకి పోయి పోయి చివరికెక్కడ తేలాయో భగవంతుడికే తెలియాలి. స్నేహితులతో కాలక్షేపం చెయ్యటంలో గల పరమానందాన్ని గురించి ఆయన ఆలోచించాడు. స్నేహితుడితో ఒక నదిఒడ్డున నివసిస్తే బాగుంటుందనుకున్నాడు. ఆ నది మీదుగా ఒక వంతెన అవతరించింది. ఆ తరువాత ఒక బ్రహ్మాండమైన భవనం ప్రత్యక్షమైంది, దానిపై గల బురుజు ఎంత ఎత్తుగా ఉన్నదంటే, దానిపైన నిలబడి చూస్తే మాస్కో నగరం కనిపిస్తుందన్నమాట; తరువాత ఆయన సాయంకాలం వేళల అక్కడ కూచుని టీ తాగుతూ ఇంపైన గోష్టి జరిపినట్టు ఊహించుకున్నాడు; తానూ చిచీకవ్ కలిసి మంచి బండిలో ఏదో పార్టీకి వెళ్ళినట్టూ అక్కడ అందరూ తమ మంచితనమూ, సంస్కారమూ చూసి ముగ్ధులైనట్టూ; తమ గాఢమైన మైత్రిని గురించి జారు చక్రవర్తి విని తమ ఇద్దరినీ జనరల్స్‌గా నియోగించినట్టూ, ఆ తరువాత ఇంకేమేమో జరిగినట్టూ తనకే అర్థం కాకుండా ఊహించుకున్నాడు.

చిచీకవ్ కోరిన విడ్డూరమైన కోరిక జ్ఞాపకం వచ్చేసరికి ఆయన ఊహలన్నీ పటాపంచలయాయి. ఆ కోరికను ఆయన మెదడు జీర్ణం చేసుకోలేక పోయింది. దాన్ని గురించి ఎంత తల పగలగొట్టుకున్నా అది ఆయనకు అవగాహన కాలేదు. అందుకని రాత్రి భోజనాలకు వేళ అయేదాకా ఆయన అలాగే పైప్ కాలుస్తూ కూచుండి పోయాడు.

—————

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 9