తెల్ల కాగితం

కొల్లూరి సోమశంకర్


కొత్త పాళీ గారు తన బ్లాగులో సూచించిన కథలపోటీకి ప్రతిస్పందనగా కొల్లూరి సోమశంకర్ గారు పంపించిన కథ ఇది.


“బాబూ, అన్నం తిందూగాని రా”
అమ్మ పిలుస్తోంది. వంటింట్లోకి వెళ్ళాను. కంచంలో చూసాను. అది పేరుకే అన్నం. కానీ మేము తినేది ఉడికించిన నూకల ముద్ద. నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో బియ్యం ఉండవు. కూరగాయలు కూడా రెండు వారాలకొకసారి కొంటాం. ఎక్కువగా ఆకుకూరలే తింటాం. రెండు రోజుల నుంచి అమ్మ ఆకుకూరలు కూడా కొనడం లేదు. నూకల జావలో ఉల్లిపాయ ముక్కలు నంచుకోడం.. లేదంటే నూకల ముద్దని పచ్చికారంతో తినడం. ఇదే మా భోజనం!

నాకేడుపొస్తోంది. ఓ పదిరోజుల నుంచి మా ఇంట్లో అందరం కలిసి తినడం లేదు. నాకు, చెల్లికి పెట్టాక, మమ్మల్ని పడుకోబెట్టి అప్పుడు తింటున్నారు అమ్మానాన్న…! నిజంగా తింటున్నారో లేదో నాకు తెలియదు. చెల్లి గబగబా తినేసి, గ్లాసుడు నీళ్ళు తాగేసింది. నేను కూడా అదే చేసాను. కారంగా ఉన్నా తప్పలేదు.

స్కూలు తెరచి నెల రోజులవుతోంది. మేము ఇంకా పుస్తకాలు కొనుక్కోలేదు. టెక్స్ట్ బుక్స్ అయితే సెకండ్ హాండ్ వి కొంటాం. లేదంటే ఎవరైనా పై తరగతి కుర్రాడిని బతిమాలి తీసుకుంటాం. ఇప్పటికి ఒక్క లెక్కల పుస్తకం తప్ప, మిగిలినవన్నీ దొరికాయి. అయితే కొన్నింటికి ముందు పేజీలు, మరికొన్నింటికి వెనుక పేజీలు లేవు. టెక్స్ట్ బుక్స్ కొత్తగా కొనుక్కున్న వాళ్ళని అడిగి ఆ పేజీలు జిరాక్సు తీయించుకుందాంలే అని నాన్న అన్నాడు. ఇంక నోట్ బుక్స్ సంగతి చూడాలి.

నాకెప్పుడూ కొత్త నోట్ బుక్స్ ఉండవు. నాన్న ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ ఆఫీసులో ప్రింటర్ కి కార్బన్ పెట్టి ఉపయోగిస్తారట. వాడి పడేసిన ఆ కాగితాలను తెచ్చి పుస్తకంలా కుట్టి ఇచ్చాడు. ‘ప్రస్తుతానికి దీంట్లో రాసుకో. మెల్లిగా నోటుబుక్సు ఏర్పాటు చేస్తాను’ అని చెప్పాడు. నాన్న ఇంటికి వచ్చాక అడగాలి.

ఇంతలో యూనిఫాం సంగతి గుర్తొచ్చింది.
“అమ్మా… యూనిఫాం…”
“నాన్న వాళ్ళ ఫ్రెండు కొడుకు గిరి మీ స్కూల్లోనేగా చదివేది. ఆ అబ్బాయికి ఈ సారి కొత్త యూనిఫాం కుట్టిస్తున్నారట. పాత యూనిఫాంని నీకివ్వమని అడిగారు. వాళ్ళు ఒప్పుకున్నారట”
“అది కాదమ్మా… గిరన్నయ్య రెండేళ్ళు వాడాడు ఆ యూనిఫాంని….”
“అయితేనేం, ఎక్కడా కొంచెం కూడా చిరగలేదట. ప్రస్తుతానికి అది వాడుకో. పండగకి కొత్త యూనిఫాం తీసుకుందాం” అంటూ అమ్మ నన్ను బుజ్జగించింది.
ఇంతలో నాన్న రావడంతో, నన్ను పడుకోమని చెప్పి అమ్మ అక్కడ్నించి కదిలింది.

* * * * * *ఓ వారం రోజులు గడిచాయి. లెక్కల టెక్స్ట్ బుక్ దొరకలేదు. యూనిఫాం మాత్రం వచ్చింది. అమ్మ దాన్ని శుభ్రంగా ఉతికిచ్చింది. నోట్ బుక్స్ కోసం నాన్న ఓ ఆలోచన చేసాడు. పరీక్షలు పాసయి, పై తరగతికి వెళ్ళిపోయిన పిల్లలు అమ్మేసిన నోట్సులలో మిగిలిపోయిన తెల్లని పేజీలన్నింటిని తిరిగి కొన్నాడు. వాటిని పుస్తకాలుగా కుట్టి అట్టలు వేసి ఇచ్చాడు. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలన్న నా కోరిక తీరనే లేదు.
ఈ పూట స్కూలు ఆయిపోయి సాయంత్రం ఇంటికొచ్చాను. లెక్కల పుస్తకం ఎలా సంపాదించాలాని చూస్తున్నాను. అమ్మ తెలిసున్న వాళ్ళింట్లో అడిగిందట. అందరూ తమ చుట్టాల పిల్లలకి ఇచ్చేసామని చెప్పారుట. నాకేడుపొచ్చింది.
“అమ్మా, పుస్తకం తీసుకెళ్ళకపోతే మాస్టారు కొడతారేమో…” అన్నాను.
” ఏం కొట్టరులే. రేపు నేనొచ్చి చెబుతాను” అంది అమ్మ. కానీ నాకు భయం పోలేదు.
అప్పుడు అమ్మ నన్ను, చెల్లిని దగ్గరికి తీసుకుని, బోలెడు కథలు చెప్పింది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. “మీకు ఓ పద్యం నేర్పుతాను” అంటూ అమ్మ ఈ పద్యం చెప్పింది.

ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభాంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, యశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్

తర్వాత దాని అర్థం వివరించింది. ఇలా అమ్మ మాకు చాలా పద్యాలు నేర్పింది. వాటిల్లో నాకు చాలా వరకు కంఠతా వచ్చు.

* * * * * *మర్నాడు లెక్కల పీరియడ్లో మాస్టారు పుస్తకం గురించి అడగనే అడిగారు. నేను భయం భయంగా అమ్మ వచ్చి మాట్లాడుతుందని చెప్పా. ఆయన నాకేసి ఉరిమి చూసి, ‘ ఏడిసావు లే పో’ అని అన్నారు. కాసేపటికి మా అమ్మ వచ్చింది. ఆయనతో మాట్లాడి, ఆయన చేతిలో ఉన్న కొత్త లెక్కల పుస్తకాన్ని తీసుకుని బయటకి వెళ్ళింది.

తర్వాత తెలుగు పీరియడ్. మాస్టారు పాఠం చెబుతుండగా ఓ నోటీసు వచ్చింది. అవతలెల్లుండి డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని, పిల్లలందరూ శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకుని, అన్ని పుస్తకాలు తీసుకుని స్కూలికి రావాలని సందేశం. తెలుగు మాస్టారు ఇవన్నీ మాకు చెప్పి, ” ఒరే పిల్లలూ, వచ్చే డి. ఇ. ఓ గారు మిమ్మల్ని ఏదైనా వ్యాసం రాయమని అడగొచ్చు. ఓ ఠావు తెల్లకాగితం తెచ్చుకోండి. గుండ్రటి దస్తూరితో చక్కగా రాయండి” అంటూ మమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మిగతా మాస్టార్లందరూ కూడా ఇదే మాట చెప్పారు. ఏ పీరియడ్లోనైనా డి. ఇ. ఓ గారు రావచ్చని, కాబట్టి అప్పటివరకూ చెప్పిన పాఠాలన్నింటిని బాగా చదువుకుని రావాలని చెప్పారు. లెక్కల మాస్టారు నా టెక్స్ట్ బుక్ గురించి మళ్ళీ గుర్తు చేసారు.

ఇప్పుడు నా సమస్యలు రెండు. ఒకటి లెక్కల పుస్తకం, ఇంకోటి తెల్ల కాగితం…..
‘లెక్కల పుస్తకం సంగతి అమ్మ చూస్తానంది. ఠావు తెల్ల కాగితం నాన్నని అడగాలి’ అని అనుకుంటూ ఇల్లు చేరాను. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక తెల్లకాగితం గురించి అడిగాను. గడువు చెప్పేసాను. ఆయన ‘చూద్దాంలే’ అని అన్నాడు. నేను హాయిగా నిద్రపోయాను. ఆ రాత్రి మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చూస్తే, అమ్మ ఏదో రాస్తూ కూర్చుంది. తెల్లారింది. నేను స్కూలుకు, నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయాం. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, అమ్మ ఇంకా రాస్తూనే ఉంది. మమ్మల్ని చూసి, రాయడం ఆపి, పుస్తకాలు పక్కనబెట్టింది.
“కాళ్ళు చేతులు కడుక్కుని రండి, కాసిన్ని బఠానీలు తిని పాలు తాగుదురుగాని” అని అంది. అమ్మ కుడిచేతి వేలొకటి వాచిపోయి కనబడింది.
“ఏమైందమ్మా?” అని అడిగాను.
“ఏం లేదురా, చాలా సేపటినుంచి రాస్తున్నా కదా, అందుకే ఇలా అయ్యింది”
ఏం రాస్తోందో అని పరిగెత్తుకు వెళ్ళి గూట్లో పెట్టిన పుస్తకాన్ని చూసాను. నా లెక్కల టెక్స్ట్ బుక్ ని మక్కీకి మక్కీ తిరిగి నోట్సులో రాస్తోంది అమ్మ. దాదాపుగా అయిపోయింది. నేను అమ్మని చుట్టేసుకుని ఏడ్చేసాను.
“ఏడుపెందుకురా? డబ్బులు పెట్టి ఎలాగు పుస్తకం కొనలేకపోయాను. కనీసం చేత్తో అయినా రాసిద్దామని అనుకున్నాను….” అంటూ నన్ను ఓదార్చింది, తన కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా.
రాత్రి నాన్న వచ్చాక, తెల్ల కాగితం గురించి అడిగాను. ‘మర్చిపోయానురా, రేపు తెస్తాలే’ అని అన్నారు. నాకు నీరసం ముంచుకొచ్చింది. చెప్పిన గడువులోగా తెల్లకాగితాన్ని సంపాదించగలనో లేదో తెలియదు. ఇలాగే ఇంకో రోజు కూడా గడచిపోయింది. అమ్మ లెక్కల పుస్తకాన్ని పూర్తిగా రాసేసి, మాస్టారికి తిరిగిచ్చేసింది. అంత లావు పుస్తకాన్ని రెండు రోజులలో చేత్తో పూర్తిగా రాసేసినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. అమ్మ ఆయనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.

మొత్తానికి నాన్న నాకీ పూట ఓ ఠావు తెల్లకాగితం తెచ్చిచ్చాడు. వాళ్ళ ఆఫీసునుంచి తెచ్చాడట. ఇలా కొత్త కాగితాన్ని ఆఫీసునుంచి తీసుకురావడం నాన్నకి అస్సలిష్టం లేదట! కానీ నా గోల భరించలేక తెచ్చానని అమ్మతో అంటుంటే విన్నాను.
ఏమైతేనేం, నేనిప్పుడు బడికి ధైర్యంగా వెళ్ళగలను.

* * * * * *మర్నాడు ఉత్సాహంగా బడికి వెళ్ళాను. డి. ఇ. ఓ గారు వచ్చే రోజిది. ఆయన ఎప్పడొస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు పీరియడ్ మొదలైంది. మాస్టారు కంగారు పడిపోతున్నారు. పిల్లలందరినీ హెచ్చరిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయనకేదో గుర్తొచ్చింది. “ఏమర్రా? తెల్ల కాగితం తెచ్చుకున్నారా?” అని అడిగారు.

నేను తప్ప మిగిలిన అందరూ ‘తెచ్చుకున్నాం సార్’ అంటూ అరిచారు. ” ఏరా నువ్వెందుకు తెచ్చుకోలేదు?” అని గద్దించారు మాస్టారు. నేను ఏదో చెప్పబోయేలోగా, నా దగ్గరికి వచ్చి, నా నడ్డి మీద ఒక దెబ్బ వేసారు. అప్పటికిగాని ఆయన కోపం చల్లారలేదు.
తెల్ల కాగితం ఎందుకు తెచ్చుకోలేదని మళ్ళీ అడిగారు.

“తెచ్చుకున్నాను సార్! కాని ఇంటర్వెల్లో నాలుగో తరగతి చదువుతున్న శీను ఏడుస్తూ కనిపించాడు. ఎందుకేడుస్తున్నాడో అడిగాను. మీరు వాళ్ళ క్లాసులో కూడా చెప్పారట కదా సార్ – తెల్ల కాగితం తెచ్చుకోమని! ఎంత ప్రయత్నించినా వాడికి తెల్ల కాగితం దొరకలేదట. అందుకని నా తెల్లకాగితం వాడికిచ్చేసాను. నా దగ్గర కనీసం ఒక సైడు వాడిన కాయితాల పుస్తకం ఉంది. వాడికి అది కూడా లేదు సార్….” అని చెప్పాను.

మాస్టారు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏదో అనబోతుండగా హెడ్ మాస్టారు, డి. ఇ. ఓ గారు మా క్లాసులోకి వచ్చేసారు. పిల్లలందరూ ఆయనకి నమస్కరించి, తెల్ల కాగితాలు ముందేసుకుని ఆయన ఏదైనా చెబితే రాయడానికి సిద్ధమైపోయారు.
“పిల్లలూ, ఇది తెలుగు పీరియడ్ కదా, మీకెవరికైనా ‘ఏఱకుమీ కసుగాయలు’ అనే సుమతీ పద్యం వస్తే లేచి చెప్పండి. పద్యం చెప్పి అర్థం కూడా వివరించాలి…” అన్నారు డి. ఇ. ఓ గారు. నాకా పద్యం తెలుసు. అమ్మ ఎప్పుడో చెప్పింది. వెంటనే నేను లేచి ఆ పద్యం చదివి దాని అర్థం వివరించాను. వెంటనే ఆయన ‘శభాష్’ అని అన్నారు. హెడ్ మాస్టారు, తెలుగు మాస్టారు నాకేసి మెచ్చుకోలుగా చూసారు. కొన్ని క్షణాల తర్వాత డి. ఇ. ఓ గారు, హెడ్ మాస్టారు గారు మా గదిలోంచి వెళ్ళిపోడంతో వాన వెలసినట్లయ్యింది.

* * * * * *ఇప్పుడు నా దగ్గర రెండు వందల పేజీల తెల్ల కాగితాల లాంగ్ నోట్ బుక్స్ ఆరు ఉన్నాయి. మా తెలుగు మాస్టారు నాకు వాటిని బహుమతిగా ఇచ్చారు.

(సమాప్తం)

————————–

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 44 అనువాద రచనలు, 20 దాకా స్వంత రచనలూ చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 x 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

Posted in కథ | Tagged | 29 Comments

మార్చి గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
2. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
3. 2007 నవంబరు గడి, సమాధానాలు
4. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
5. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
6. 2007 జూలై గడి, సమాధానాలు
7. 2007 జూన్ గడి, సమాధానాలు
8. 2007 మే గడి, సమాధానాలు
9. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
10. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 1 Comment

ఫిబ్రవరి గడి సమాధానాలు

ఈసారి భైరవభట్ల కామేశ్వరరావు గారు, బ్లాగాగ్ని గారు తప్పుల్లేకుండా పూరించగా, నవతరంగం వెంకట్ గారి పూరణలో 6, ఆగంతకుడు గారి పూరణలో అంతకంటే ఎక్కువగానూ తప్పులు దొర్లాయి. అందరికీ అభినందనలు! కొత్తపాళీ గారు స్లిప్పులందించడంలో బిజీ ఐపోయి పూరణ పంపలేదు.

*

1 హె

*

2 కో

*

3 శ్రీ

రా

4

5మి

*

6 రా

7

డు

*

*

కృ

*

రు

*

*

త్రు

8 టు

యిన్

వన్

*

9

*

ష్ణ

*

10వం

11

పం

డు

బం

*

*

12లా

వా

దే

13 వీ

*

ణా

*

*

*

ల్యాణ్

*

*

14

డి

*

15 చా

రు

లు

*

16

*

17 వి

18

రా

19భా

రి

*

*

20 పా

21 కి

*

22

మా

ము

*

23 హై

24 కూ

25 హి

రా

26

కం

*

లు

*

27 వి

28 రా

టు

*

*

29

*

30 పై

*

31 స్వా

*

32 నా

లి

33 పా

34 గా

*

35 దాం

36

త్యం

*

37 తి

38 వి

రె

*

*

ను

*

39

రం

*

40 నా

వా

రు

*

41 బా

బు

42 మాం

ల్యం

తం

తు

నా

నే

నా

*

43 నె

ర్లు

వివరణలు:

అడ్డం:
2. కోలాటం ఆడేవారి హస్తభూషణం (2) కోల – కోలాటం ఆడేవారు రెండుచేతుల్లో రెండు కోలలు పట్టుకుని ఆడుతారు.
3 శ్రీమినర్వాలో మనం పానకం తాగే రోజు (3,3) శ్రీరామ నవమి – anaagram
6 పాపడు పాపం రాయిగా మారేను (3) రాపడు = రాయిగా మారు
8 సర్‌ – టూకీగా, ఒక ఒరలో రెండు కత్తులు (1,1,1) టూ ఇన్ వన్ – ఆధారం మొదట్లో ఆంగ్లసంబోధన సమాధానానికి పరోక్ష సూచన
12 జ్వాలాముఖి ఒకరు కంటే ఎక్కువైతే వ్యవహారాలు ఎప్పటికీ తెగవు, అందుకే బహువచనం తీసేసాం (4) లావాదేవీ – జ్వాలాముఖి అంటే లావా పొంగే అగ్నిపర్వతం. దాన్ని ‘లావా’ దేవి అనడం ఒక చమత్కారం.
14 దిక్కు తెలియని వేగం (2) వడి = speed, వేగం = velocity భౌతికశాస్త్ర నిర్వచనాలు.
15 రసాలు – రాజుగారి నేత్రాలు? (3) – రసం = చారు. చారులు రాజుగారికి కళ్ళు, చెవులు.
20 కులుకులొలికే కలికికి హంసతూలికల వాహనం (3) పాలకి = పల్లకి
22 లయ మారము అంటూ. అటూఇటుగా షోలాపూర్లో శక్తిపీఠం కనండి (5) షోలాపూర్లో శక్తిపీఠం ‘రమాలయము’
25 ప్రవక్త ప్రస్థానంతో కేలండరు మొదలు (5) మహమ్మదు ప్రవక్త మక్కా నుంచి మదీనాకు చేసిన ప్రస్థానం జరిపినప్పటి నుంచి హిజరా శకాన్ని లెక్కిస్తారు.
27 కొమ్ము విరిగిన దోమ కుత్తుక ఏలిక (4) మహాభారతంలో పాండవుల అజ్ఞాతవాసాన్ని ఉద్దేశించి విరాటుడి కొలువును దోమకుత్తుకతో పోల్చిన తెనాలి రామలింగడి పద్యం ప్రసిద్ధం.
29 అనుస్వారం తోడుంటే నా తరమయ్యేది. లేదే? ఎలాగ?(2) అనుస్వారం అంటే సున్నా.
32 పంటల్లో పాము తిరగలి ??(3) ‘నాగ’లి
35 జాయా-పతుల సంబంధం (3) జాయ అంటే భార్య.
37 ఇసుమున తైలము దీయుటకు శ్రమించె (3) “తివిరి ఇసుమున తైలము దీయవచ్చు…” పద్యం
39 వంట్లో బాణం దిగితే నడుం హ-రీ- మనదా? (2) వళ్ళు అంటే శరీరంలో నడుం అంటే మధ్య అక్షరమైన ‘రీ’ ఎగిరిపోయి శరం అంటే బాణం మిగిలింది.
40 మంచం పట్టీ కొంచెం సాగినా మదీయ శ్రీవారే (3) మంచం పట్టీ = నవారు. సాగితే ‘నావారే’ (మదీయ = నా యొక్క)
41 పసివాడి మీద అలా రుబాబు చేయకండి (2) పసివాడు = బాబు

నిలువు

1 హలో – మత్తెక్కించే కథానాయిక కాదోయ్- వెంటబడితే బతుకు బుగ్గే సుమా (3) కథానాయిక హీరోయిన్. హెరాయిన్ అనేదొక మాదకద్రవ్యం.
2 గీకువీరులు రాసేదే మంచానికి ఆధారం (2) geeks రాసేది code – కోడు. మంచానికి ఆధారం కూడా కోడే.
3 సంపెట భూపాలుడు (8) – శ్రీకృష్ణదేవరాయలు బిరుదు. (శ్రీకృష్ణదేవరాయల ఇంటిపేరు ‘సంపెట’).
4 సువాసన కోసం తల్లో పెట్టుకోడం మర్చిపోం (3) మర్చిపోం = మరువం. అతివలు ఈ ఆకులను సువాసన కోసం తల్లో పెట్టుకుంటారు.
7 వీడిల్లు బంగారంగానూ, మృత్యుంజయుడి తమ్ముడు వాయుదేవుడా? – శుభం (2,2) మృత్యుంజయుడంటే చిరంజీవి. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్. పవనుడు = వాయుదేవుడు, కల్యాణ్ = శుభసూచకం.
8 బంటు కానిది – తెబ్లాగరి ప్రవీణ్ కు ప్రీతిపాత్రమైనది – ఉత్సాహం మీరి తిరగబడింది (3) ఉబుంటు అనే లైనక్స్ వర్షన్ను ప్రవీణ్ లాంటి గీకువీరులు కొందరు వాడుతారు, దాని గురించి తమ బ్లాగుల్లో కూడా రాశారు.
9 బ్రహ్మ రాతలకి పలక (3,3) లలాట ఫలకం – బ్రహ్మ నుదుటి మీద రాస్తాడని ఒక నమ్మకం. లలాటమంటే నుదురు, ఫలకమంటే పలక.
11 ప్రశ్నతంత్రాల గారడీ మాంత్రికుడి జాగరిణాలు (4) – ప్రశ్నతంత్రాల గారడీ మాంత్రికుడు గణాచారి.
13 అలనాటి పెద్దనగారినుంచీ ఈనాటి కవులదాకా దీనిని వీడియుండలేరట (4) “కప్పురపు వీడెము…” కవిత్వరచనకు ఆవశ్యకమని పెద్దన ఉవాచ. వీడెము/వీడియము = తాంబూలం.
18 టిబెట్టులో వెనక్కి తిరిగిన మాలతి (2) టిబెటన్ బౌద్ధ సన్యాసిని లమా అంటారు. మాలతి పొట్టిపేరు మాల వెనక్కి తిరిగితే అదే ఆన్సరు.
19 కిరాతకుడై పొరబాటున కన్నతండ్రినే చంపబోయిన ఓ మహాకవి, కళారవి (3) భారవి. అతడు రాసిన ప్రసిద్ధ కావ్యం కిరాతార్జునీయం.
20 భగవంతుడికి భక్తులు పంపే S.O.S (2) పాహి అంటే సంస్కృతంలో కాపాడమని అర్థం. దైవప్రార్థనల్లో తరచు వచ్చే పదం.
23 యెస్‌, అమితాబచ్చన్లా, సన్నగా,… (3) హైటుగ “అమితాబ్ బచ్చన్ హైటు మీదొట్టు…” అని ఒక పాట కూడా ఉందికదా?
24 ఈవెనింగు బ్లాగర్లందరూ వీవెనింగు చేసే చోటు (3,3) బ్లాగరుల సౌకర్యార్థం కూడలి లో వీవెన్ కల్పించిన సౌకర్యం కూడలి కబుర్లు.
31 ముత్యపు చిప్పలు సావిరహే అని పాడేదెవరికోసమో? (4) వానచినుకు ముత్యపు చిప్పలో పడితే ముత్యమౌతుంది. స్వాతిముత్యం కావాలంటే మరి స్వాతివాన కురవక తప్పదు కదా? “సా విరహే తవదీనా…” జయదేవుడి అష్టపది.
34 తైలంకోసం ఎలా తిరిగినా ఒకటేగా? (3) తైలం తీయాలంటే గుండ్రంగా ‘గానుగా’డాలి.
38 సిగలో అత్తరులు.. .ఏవో అవి? (2) “సిగలో అవి విరులో…” అని మేఘసందేశం పాట.
40 అద్దంలో ఉత్తరకోస్తావారు ఎవరదీ (2) అద్దంలో కనిపించేది నేనే ఐతే ఉత్తరకోస్తా వ్యావహారికంలో నానే అంటారు.

Posted in గడి | Tagged | 1 Comment

విరహ విలాపాలేల రా…

-గార్ల సురేంద్ర నవీన్

.

మనసుపడ్ద పడతి చెంతచేరలేదన్న చింతేల
ఆమె లేని బ్రతుకు భారమన్న భావమేల
అహరహము తలచి వగచి దిగులొందుటేల
దేవీదాసుడిని దేవదాసు చేసెనన్న దు:ఖమేల
పొల్లులల్లే పడతి ప్రేమ కోసమింకా ప్రాకులాడుటేల
మనము రాయని రాతల కోసమింత క్షోభ యేల

ఓటమి వెంటే గెలుపున్నది
బాధ వెంటే సుఖమున్నది
కప్పిరి వెంటే ఉప్పరమున్నది
కన్నీరు వెంటే పన్నీరున్నది
అశాంతి వెంటే శాంతి ఉన్నది
ఆలజడి వెంటే ఆనందం ఉన్నది

చిత్రమైన దేవుడు..తనదగ్గరున్న ఎన్నెన్నో
వరాలను నీకు మొత్తంగా దత్త చెయ్యాలని
నీ వద్దనున్న నిక్రేపాలను నీకు గుర్తు చెయ్యాలని
నీ ప్రేమను లంచంగా తీసుకున్నాడు కాబోలు

అహ్లాద అరుణోదయాలున్నవి నీకోసమే
పక్షుల కిల కిలారావాలున్నవి నీకోసమే
చలచల్లని ఎర్రని సాయంకాలాలున్నవి నీకోసమే
వెండి వెన్నలనిచ్చే చందమామున్నది నీకోసమే

విశాల నీల గగనమున్నది నీకోసమే
హేమంతములో మబ్బులున్నవి నీకోసమే
మబ్బులపైన ఇంద్రధనస్సున్నది నీకోసమే
మట్టిని తడిపే ముసురున్నది నీకోసమే

ప్రపంచంలోని రంగు రంగుల పూలున్నవి నీకోసమే
చల్లగ వీచే పైరగాలున్నది నీకోసమే

అన్నిటి కన్నా…………
అంతటికన్నా……………….
అమోఘమైన
అద్భుతమైన
అపురూపమైన
దేవుడిచ్చిన ఈ మానవ జన్మ ఉన్నది మనకోసమే

—-

జి.ఎస్.నవీన్ గార్ల సురేంద్ర నవీన్ తన పూతరేక్స్ బ్లాగు ద్వారా నెజ్జనులకు సుపరిచితుడు. బ్లాగరిగానే కాక, వికీపీడియన్‌గా కూడా ప్రసిద్ధుడు. తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమా ప్రాజెక్టులో విశేషమైన కృషి చేస్తున్నారు. మదనపల్లె వాస్తవ్యుడైన నవీన్ బెంగళూరులో సాఫ్టువేరు ఇంజనీరుగా పని చేస్తున్నారు.

Posted in కవిత్వం | 3 Comments

2008 ఫిబ్రవరి బ్లాగోగులు

ఫిబ్రవరి – తెవికీపై ఈనాడు వ్యాసం వచ్చిన నెల. కూడలిలో ఉప్పెనొచ్చిందని వీవెనన్నారు. నల్లమోతు శ్రీధర్ తక్షణ సాంకేతిక సహాయంలో కూడా ‘సాయం చెయ్యండం’టూ జనం వెల్లువెత్తారు. అలాగే ఆ వ్యాసప్రభావంతో ఓ చక్కటి బ్లాగు బయటకొచ్చింది – తెలుగులో రాసే పద్ధతుల గురించి ఈనాడు వ్యాసం చదివాక తెలిసిందని శ్రీవిద్య చెబుతున్నారు. ఈనాడుకు జై!

— — — —

మీ బ్లాగు మంటనక్కలో ఎలా కనిపిస్తోందో చూసారా? బ్లాగు పాఠకుల్లో అయ్యీని (ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు) అస్సలు వాడనివారు కూడా ఉంటారు. వారికి మీ బ్లాగు చదవడంలో ఇబ్బంది ఉందేమో గమనించారా?

కొన్ని బ్లాగులు మంటనక్కలో చూస్తే, హల్లులూ గుణింతాలు విడిపోయి, ఎక్స్ప్లోడెడ్ వ్యూ లాగా కనిపిస్తూంటాయి (అయ్యీలో బానే ఉంటుంది). ఈ చెదిరిపోయిన అక్షరాలు పాఠకులను వికర్షించే ప్రమాదం లేకపోలేదు. వీవెన్ దీనికి ఓ మందు కనిపెట్టారు కూడా – ఇది బ్లాగు చదువుకునేవారికి తాత్కాలిక ఉపశమనాన్ని కలుగజేస్తుంది. కొన్ని బ్లాగుల వ్యాఖ్యలకు, కొన్నిటిలో బ్లాగు శీర్షికకు, ఈ చిట్కా కూడా పనిచేయదు. ఉదాహరణకు అభిషేక్ చౌదరి లో వ్యాఖ్యలు చూడండి. రాబోయే మూడో తరపు మంటనక్కలో ఈ ఇబ్బంది ఉండదని భోగట్టా. ఈలోగా మీ బ్లాగు పాఠకులకు ఈ ఇబ్బందిని తప్పించే మార్గాలున్నాయి:

1. మీ మూసలో ఎక్కడైనా జస్టిఫైడ్ (justified) అని ఉందేమో చూడండి. ఉంటే దాన్ని తీసెయ్యండి.
2. మీ మూసలో లెటరు స్పేసింగు, లెటరు హైటు లాంటివి ఉంటే వాటినీ తీసెయ్యండి.
పై రెండూ చేస్తే తిక్క దాదాపుగా కుదురుతుంది. అప్పటికీ ఫలితం లేకపోతే.. సాంకేతిక గురువులున్నారు.., వారిని అడగండి.

— — — —

ఇహ, ఫిబ్రవరి నెల బ్లాగుల సంగతి చూద్దాం..

జనవరి చివర్లో రాజశేఖరుపై చిరంజీవి అభిమానుల దాడి సంచలనం కలిగించింది. ఫిబ్రవరి చివర్లో ఉండవల్లి అరుణ్ కుమార్ అంబేద్కరుపై చేసిన వ్యాఖ్య ‘సం’చలనం కలిగించింది.

  • తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం తన కలగూరగంపలో ఈ విషయంపై సూటి విశ్లేషణ రాసారు. పాఠకుల స్పందనలు కూడా సూటిగానే ఉన్నాయి.
  • ఈ ఘటన మీదే కిరణ్ నిర్మొహమాటంగా ఓ జాబు రాసారు.
  • దీనిమీద విహారి తన చెణుకొకటి విసిరారు. ఆ జాబు ఇతర సమకాలీన విషయాల మీద కూడా అక్షింతలేస్తూ పోతుంది.
  • ఇదే విషయమై దిల్‌సే బ్లాగులో సాటి బ్లాగరులను పేర్లు పెట్టకుండా విమర్శించారు. “కొందరు బ్లాగరులు” అని రాస్తూ కొందరు కు క్రీగీత గీసారు.

రాజకీయాలపై వచ్చిన ఇతర జాబులు:

ఈ ఎన్నిక పెట్టెలో మీ వోటేసి ముందుకు సాగిపోండి.


[poll=2]

ఫిబ్రవరిలో వచ్చిన ఇతర జాబులు:

సినిమా:

హాస్యం:


సాంకేతికం:
తెలుగు బ్లాగుల్లో సాంకేతిక విషయాల గురించి క్రమం తప్పకుండా రాసేవాళ్ళలో నల్లమోతు శ్రీధర్ ప్రముఖుడు. ఎప్పటిలాగానే ఈ నెల కూడా పలు విషయాలను స్పృశించారు. కింది రెండూ మా ఎంపికలు:

సాహిత్యం:

కొందరు బ్లాగరులు పేజీకి కాగితం అని వాడుతున్నారు. అది సరైన మాట కాదు.. పేజీ లేదా పుట అనొచ్చు.

  • వీడ్కోలు చదివారా? గొడవ ఫణీంద్రదైనా పాఠకుల మనసు భారం కాక మానదు!
  • అలై పొంగెరా అనే పాట గురించి కొత్తపాళీ విశ్లేషణ చదవండి
  • శ్రీరామమూర్తీ-సిరచ్ఛేదం అంటూ వింజమూరి విజయకుమార్ మూడు భాగాల కథ రాసారు.
  • కొల్లూరి సోమశంకర్ వృక్షప్రేమికుడు అనే కథను రాసారు. గతంలో ఆంధ్రజ్యోతిలో అచ్చైన కథ ఇది.
  • కథ రాయమంటూ కొత్తపాళీ ఒక ఇతివృత్తాన్ని ఇచ్చారు. ఆ ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని మార్చి 15 లోగా కథొకటి రాసి ఆయనకు పంపాలి. మీరూ పాల్గొనండి. గడువు దగ్గర పడింది.
  • తిరిగొచ్చిన గిరి: పద్యాలు రాయడం ఆయనకు నల్లేరుపై నడక. మామూలు సంభాషణలను కూడా పద్యాలుగా మలచే ఒడుపు ఆయనకు బాగా తెలుసు. ఇంగ్లీషులో కూడా వృత్తాలు రాయగల అసాధ్యుడు. ఆయన మామూలుగా రాసిన వాక్యాల్లో కూడా ఏ ఛందం దాగుందోనని వెతుక్కునేవారూ లేకపోలేదు. కొంత విరామం తరవాత గిరి తిరిగి చురుగ్గా రాయడం మొదలుపెట్టారు. ఈ నెల రాసిన పద్యాల్లో ఓ పద్యంలో యవ్వనంపొలంపిక్కుల (ఇంకా ఆ బ్లాగు చూడని వాళ్ళు, ముందు ఈ మాటకర్థమేంటో కనుక్కోండి.. ఆ తరవాతే బ్లాగు చూడండి) గురించి రాసారు చూడండి. రోజుకో పద్యం చొప్పున – ఒక్కోరోజు రెండు కూడా – రాసే గిరి, ఒక్కోసారి వేగానికి నాణ్యతను బలిపెడుతూంటారు. మరింత నాణ్యమైన పద్యాలు రాయగలరని మా నమ్మకం!
  • తెలుగును నిర్దయగా కు’ల్ల’బొడుస్తున్నవారిపై తేటగీతి వారు’నా’స్త్రం ఎక్కుపెట్టారు, చూడండి.
  • సంస్కృతశ్లోకంలో, ఒక పాదంలోని సగభాగాన్ని పట్టుకుని రానారె ఒక జాబు రాసారు. దానికి వచ్చిన వ్యాఖ్యలు విజ్ఞానాన్ని పంచాయి. అక్కడి వ్యాఖ్యాతల్లో సూర్యప్రకాష్ ఎవరో తెలియ రాలేదు.
  • జాన్‌హైడ్ కనుమూరి రెండు సంతాప కవితలు రాసారు
  • వివిధ పత్రికల్లో తాను రాసిన కవితలను విశాఖతీరాన బ్లాగులో చేర్చారు.

బ్లాగుల గురించిన జాబులు..

blogger.com లో ఇప్పుడు నేరుగా తెలుగులో రాసే సౌకర్యం వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్క్రిప్టు వాడి తెలుగు రాసేవారికి దీనితో పని లేదు. మంటనక్కలో పద్మ వాడిగానీ, వేరే పద్ధతుల ద్వారా RTS లో రాసి తెలుగులోకి మార్చేవారు గానీ బ్లాగరులోని ఈ కొత్త అంశంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే RTS నుండి తెలుక్కి మార్చడంలో దాని పద్ధతి వేరుగా ఉంది.

సముద్రానికి ఆటుపోటుల్లాగా ఒరెమూనాకూ ఆటుపోట్లుంటాయి. కొన్నాళ్ళు మౌనంగా ఉండే ఈ బ్లాగు ఒక్కసారిగా చైతన్యం పొంది జాబుల వరద సృష్టిస్తుంది. ఫిబ్రవరి మొదటి పది రోజులూ ఒరెమూనా జాబులతో పోటెత్తింది. బ్లాగులు అనగానేమి? బ్లాగులతో ప్రమాదాలేమిటి? బ్లాగులెలా రాయాలి? ఇలా అనేకానేక బ్లాగు సత్యాల గురించి చావా కిరణ్ తన గొలుసుకట్టు జాబుల్లో వివరించారు. “మీ బ్లాగునకు మీరే సుమన్!” అని కిరణ్ రాసిన మాట ఈ నెల బ్లాగు మాట!

శోధన సుధాకర్ తాను మెచ్చిన బ్లాగుల జాబితా ఒకదాన్ని తయారుచేసి, ఓ జాబుగా రాసారు. ఈమధ్య ఈ జాబితాలు బాగానే వస్తున్నాయి. వీవెన్, రానారె, కొత్తపాళీ, దీప్తిధార, తెలుగువాడిని మొదలైన వారు గతంలో రాసారు. (ఇలాంటి జాబులు సున్నితమైనవి. చదివేవాళ్ళు చూసి వదిలెయ్యాలి, అంతే! అది లేదేంటి, ఇది లేదేంటని అంటూ ఉంటే ఆ జాబితా పెరిగిపోతుంది. అందులో ఉన్నవే మంచివీ, మిగతావి కాదు అని ఆ బ్లాగరి ఉద్దేశం కాదు అని గ్రహించాలి) భవిష్యత్తులో తెలుగు బ్లాగుల చరిత్ర రాస్తే గీస్తే ఇలాంటివి మంచి ముడిసరుకవుతాయి.

బ్లాగ్వీక్షణం అనే వరస జాబుల్లో సీబీరావు తాను మెచ్చిన జాబుల గురించి రాస్తున్నారు. ఈ నెల రెండు జాబులు రాసారు. ఫిబ్రవరిలో కొత్తగా బ్లాగులోకంలోకి అడుగుపెట్టిన బ్లాగు విలాపము లో వెరైటీ ఏంటంటే.. ఇప్పటి దాకా రాసిన జాబులన్నీ కూడా బ్లాగు, కూడలి గురించే!. URL కూడా చూడండి.. క్రయింగ్ బ్లాగ్ – విలపించే బ్లాగు! సరదాగా రాస్తున్న విలాపాలివి!

ప్రసార మాధ్యమాలు:
ప్రముఖుల మరణవార్తలను పత్రికలు, టీవీలూ వెలిబుచ్చిన తీరును ఇద్దరు బ్లాగరులు నిలదీసారు. తెలుగువాడిని తనశైలిలో తూర్పార పట్టగా, పూలవాన రవికిరణ్ పూల చెండుతో ఛెళ్ళుమనిపించారు.

ఇతరత్రా..

  • మామూలుగా పాత జ్ఞాపకాల జాబులు నచ్చని వారుండరు. అలాంటి జాబులు చదువుతూ, తమ తమ చిన్ననాటి విశేషాలను నెమరు వేసుకోని వారు అరుదు. అలాంటి జ్ఞాపక జాబుల్లో ఎన్నదగినది సరిగమలులో వచ్చిందీ నెల. ఎండాకాలం సెలవుల మజాను తిరగదోడారు సిరిసిరిమువ్వ.
  • తాడిమేటి రాజారావు తన వీధి సినిమా జ్ఞాపకాలను రేగొడియాలు బ్లాగులో చూపించారు.

ఈనెల మిస్సయిన ప్రముఖ బ్లాగులు:
త్రివిక్రమ్ బ్లాగు రాసి కొన్ని నెలలైపోయింది. పొద్దుకు అంకితమైపోయి బ్లాగు రాయడం పూర్తిగా మర్చిపోయిన త్రివిక్రమ్, మళ్ళీ చురుగ్గా బ్లాగాలని కోరుతున్నాం. అలాగే అందం బ్లాగును నవతరంగం ముంచేసింది. రాధిక, కల్హర కూడా ఈ నెల ఏమీ రాయలేదు. వాగ్విలాసం రాఘవ కూడా ఏమీ రాయలేదు. అందుకుగాను ఆయనకు తగు శిక్ష విధించాం.

కొత్త బ్లాగులు:

  • “ఎల్లుండి” అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే తెలుగుపద్యం బ్లాగు చూడండి. ప్రజలభిమానించిన తెలుగు పద్యాల గురించి భైరవభట్ల కామేశ్వరరావు చక్కగా వివరిస్తున్నారు. భైరవభట్ల వారు గతంలో పొద్దులో గడిని తయారు చేసారు. పద్యాల గురించి తెలిసికోవడం కోసం ఈ బ్లాగును చూస్తూ ఉండండి.
  • శారదమ్మ సరస్వతిలా అంతర్వాహినిలా ప్రవహిస్తోందని చెబుతున్నారు చిన్నమయ్య. ఈ వాహినిని బయటికి తెచ్చే ప్రయత్నమే మాటవరసకి! దీనిపై ఓ కన్నేసి ఉంచండి.
  • ఫిబ్రవరిలో మొదలై దూసుకెళ్తున్న బ్లాగు: జాహ్నవి

ఈనెల జాబులు:

  1. తెలుగు బ్లాగుల్లో ఇప్పటి వరకూ తెలంగాణ అంశంపై వచ్చిన అత్యుత్తమ జాబుల్లో ఒకటి. ఈనెల జాబుల్లో ఇది మొదటిది.
  2. ఎండి ఎడారైపోతున్న పంటపొలాలను, తలుచుకుని ఓ రైతుబిడ్డ రాసిన ఈ జాబుకు మా రెండో స్థానం
  3. శ్రీవారికి ప్రేమలేఖ” ఈనెల మా అత్యుత్తమ బ్లాగుల్లో మూడోది. పైన ఉదహరించిన “వీడ్కోలు” జాబు చదివాక, ఇది చదివితే మనసు కాస్త నిమ్మళిస్తుంది.

ఈ నెల బ్లాగు: తూలిక వారి తెలుగు బ్లాగు.
ఈ బ్లాగును నిడదవోలు మాలతి రాస్తున్నారు. చక్కటి భాష, పాఠకుణ్ణి పట్టుకు కూచ్చోబెట్టి చదివించే శైలి ఆమె సొంతం! చాలా విరివిగా కూడా రాస్తారు. మిరపకాయ బజ్జీల కబుర్లు, ఇక్ష్వాకుల కాలం నాటి తన గడియారం కథా, ‘నీరుగారి’పోతున్న కుళాయిని బాగు చేయించిన ప్రహసనం, ఈనెల జాబుల్లో కొన్ని. తాను గతంలో రాసి ప్రచురించిన కథలను కూడా తన బ్లాగులో పెడుతూ ఉంటారు. చాలా చమత్కారంగా రాస్తారు. ఓ జాబులో పైప్ డాక్టరని పిలిచే ప్లంబరు గురించి ప్రస్తావిస్తూ “ఈమధ్య అందరూ డాక్టర్లే. పైప్ డాక్టర్, రగ్ డాక్టర్, … అంటూ ఈడాక్టరేటులు ఎవరికి వారే పట్ట ప్రదానాలు చేసేసుకుంటున్నారు. డాక్టర్లెవరూ ప్లాస్టక్ ఫిక్సర్-అప్పర్‌, బ్రెయిన్ రిపేరర్‌లాంటి టైటిల్సు వాడుతున్నట్టు లేదింకా!” అని చమత్కరించారు. [ఈ మధ్య ఆంధ్ర దేశంలో రాజకీయ డాక్టర్లు అనే రకం తయారైందన్న విషయం అమెరికాలో ఉంటున్న మాలతి గారికి తెలిసిందో లేదో!!]

బ్లాగరులకు ఒక సూచన:
మీ బ్లాగుల నుండి ఇతర బ్లాగులకు ఇచ్చే “లింకులు ఎలా ఇవ్వాలి” అనే విషయమై ఓ సూచన.. ఇక్కడ చూడండి, ఇక్కడ నొక్కండి లాంటి మాటలు రాసి వాటికి లింకులు తగిలించేస్తూ ఉంటాం. సాంకేతికంగా ఇందులో తప్పేమీ లేదు. కానీ బ్లాగు గురించి రాసే వాక్యంలోనే తగు పదానికి లింకు పెట్టడం మెరుగైన పద్ధతి. ఉదాహరణకు, మీరు పొద్దుకు లింకు ఇవ్వదలచారనుకోండి.. తెలుగులో ఉత్తమ అంతర్జాల పత్రిక అనో ఆన్‌లైను గడి కలిగిన ఏకైక తెలుగు వెబ్ పత్రిక అనో రాసి ఆ పదాలకు లింకు తగిలించాలన్న మాట. దీంతో, ఆన్‌లైను గడి అనేమాటను వెదకబోయినపుడు సెర్చి ఇంజనుకు పొద్దు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గత నెల ప్రశ్నలు:
గత నెల మేమడిగిన ప్రశ్నలూ వాటి సమాధానాలూ:

  1. అత్యధికంగా బ్లాగులు (జాబులు కాదు) కలిగిన బ్లాగరి ఎవరు?: జ్యోతి గారని చెప్పారు కొందరు. కానీ, మేమడిగింది జాబుల గురించి కాదు – బ్లాగుల గురించి అడిగాం. ఈ గౌరవం సైకం రాజుకు చెందుతుంది. ఆయనకు ముప్ఫైకి పైగా బ్లాగులున్నాయి.
  2. అక్షరాల పరిమాణంలో అతిపెద్ద బ్లాగు శీర్షిక కలిగిన బ్లాగు ఏది?: కొత్త బంగారు లోకం అని అన్నారు. అయితే ఆ శీర్షికలో అక్షరాలు పొడుగే.. కానీ సన్నగా ఉంటాయి. వయ్యారంగా ఉంటాయి. వెంకటరమణ బ్లాగు చూడండి.. ఎత్తుకు తగ్గ లావుతో, దృఢంగా, గంభీరంగా ఉంటాయి. అంచేత వెంకటరమణ బ్లాగు మా ఎంపిక.

మార్చి జాబుల కోసం ఎదురు చూస్తూ..

-పొద్దు

Posted in జాలవీక్షణం | Tagged , | 14 Comments

రాఘవ వాగ్విలాసము – పరిచయము

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

పద్యాల గురించి చెప్పేముందు పద్యాలకీ నాకూ ఉన్నట్టి అనుబంధమేమిటో, చెప్పటానికి నాకు అర్హత ఉందో లేదో తేల్చే ప్రయత్నమే ఈ పరిచయం. సాధ్యమైనంతవరకూ అందరికీ అర్థమయ్యేలా నేడు వాడుకలో ఉన్న వ్యావహారికభాషలోనే రాయడానికి ప్రయత్నిస్తాను, అవసరమైతే వ్యాకరణాన్ని (ప్రస్తుతానికి) పక్కన పెట్టి.

నాకు గుర్తున్నంతవరకూ నాకు అసలు పద్యం రాద్దామనిపించింది నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు. అప్పుడు మతిహీనుడు అని ఒక పాఠం ఉండేది. అందులో “గర్గుఁడను విప్రుఁడొకరుడు దుర్గారాధనముఁ బెక్కు దొసగులబడచున్…” అని ఒక కంద పద్యం ఉంది. అది చూసి ఎందుకోగానీ నాకు కూడా ఒక పద్యం రాయాలనిపించింది. బహుశా నేను మా నాన్నగారి వద్ద చిన్నప్పటినుంచీ విన్న అనేక చాటువులదో లేదా పోతన భాగవత పద్యాలదో ప్రభావం కావచ్చు. మొత్తానికి ఎలా రాయాలో అప్పటివరకూ ఎక్కడా చదవలేదు. అప్పుడు నా బుర్రకి తోచినట్టుగా అదే పాఠంలో ఉన్న ఏదో రెండు మూడు కందపద్యాలు గమనించాను. ఏదో లీలగా అర్థమైంది. ఏమని? మొదటి పాదం చిన్నది, రెండోది పెద్దది. మళ్లీ మూడోది చిన్నది, నాల్గోది పెద్దది అని. ఒక పద్యం తీసుకుని ఒక్కో పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కపెట్టాను. ప్రతీ పాదానికీ అన్నే అక్షరాలు వచ్చేలా ఒక కందపద్యం రాసేశాను, ఏకలవ్యుడి మీద. ఎందుకో అప్పట్లో ఏకలవ్యుడిమీద బాగా గురి ఉండేది (ఇప్పుడు లేదని కాదు). అన్నట్టు మరో విషయం. ఇంకా చిన్నప్పుడు, అంటే ఎనిమిదో తరగతిలోకి రాకముందే, బహుశా నాల్గో తరగతిలో అనుకుంటాను, అప్పట్లో పద్యాలు బట్టీ పట్టి రాయాల్సి వచ్చేది పరీక్షల్లో. పద్యం మొత్తం బట్టీ కొట్టేసినా మళ్ళీ దాన్ని పాదాలకింద విడగొట్టి రాయాలి కదా, అసలే చిన్నతనమేమో అక్కడ వచ్చేది చిక్కంతా. పైగా క్లాసులో ఫస్ట్ రావాలి, మనని టీచరు మెచ్చుకోవాలి అన్న ధ్యాస తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు.


యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ.

అలా ఒకసారి క్వార్టర్లీ పరీక్షలకి చదువుతూంటే ఎందుకో ఎలానో స్ఫురించింది పాదాలుగా విడగొట్టడానికి ఒక టెక్నిక్. ప్రతీ పాదానికీ రెండో అక్షరం ఒకే గుణింతంలోంచి వస్తోంది. దొరికిందిరా జుట్టు అనుకున్నాను. కానీ కొన్ని పద్యాలకి ఇలా కుదరట్లేదు. కుదరకపోతేనేం? భలే భలే, నాకు తెలియదేంటి? పరీక్షల్లో అలాంటి పద్యాలు అడిగేవారేకాదు. ఏవో కొండపల్లి చేంతాడంత పద్యాలే అడిగేవారు. మీకూ గుర్తుండే ఉంటుంది, ఉదాహరణకి “పెంపునఁ దల్లివై … … … … దాశరథీ కరుణాపయోనిధీ” అని ఇచ్చి పూరించమనేవారు. అలా దానిని ప్రాస అని పిలుస్తారని తెలియకపోయినా ప్రాస గురించి ముందే తెలియడం వలన నేను ఏకలవ్యుడిమీద రాసిన పద్యంలో ప్రాస ఉండేలానే రాసాను. ఇంకో విషయం. మా చిన్నప్పుడు (నేను ఏడో తరగతి చదవడం అయ్యింతర్వాతనుంచీ) మా ఊళ్ళో — అన్నట్టు చెప్పనే లేదు కదూ మాది అమలాపురంలెండి — భారతీయ శిక్షణా మండలి వాళ్ళు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించేవారు. వాళ్ళు కూడా పద్యాలు పాటలూ నేర్పేవారు. ఆ పద్యాల్లో ఎక్కువ సుమతీ శతకం లోవి.

అప్పుడు వాళ్ళు నేర్పిన పద్యాలు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక టెక్నిక్ స్ఫురించిందండోయ్. ఒక ఉదాహరణ చెప్తాను. “ఇచ్చునదె విద్య … వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ”, “ఎప్పుడు సంపద కలిగిన … గప్పలు పదివేలు జేరుఁ గదరా సుమతీ” లాంటి పద్యాల్లో సుమతీ అన్న పదానికి ముందు కదరా, వసుధను, నిక్కము లాంటి పదాలు వాడినప్పుడు మాత్రం పెద్ద తికమకగా ఉండేది ఏది ఎక్కడ వస్తుందో గుర్తుంచుకోడానికి. అప్పుడు గమనించిన విషయం — గప్పలు వస్తే గదరా అని వచ్చింది, వచ్చునదే వస్తే వసుధను వచ్చింది అని. బద్దెనగారు నాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోడానికి వీజీగా ఉంటుందని అలా రాసారేమో అనుకున్నాను. అందువల్ల ప్రాసకుదిరేలా రాయడమైతే రాసాను గానీ యతిని గాలికొదిలేశాను. దానిని యతి అంటారని ఒక సంవత్సరన్నర పోయినతర్వాతగానీ తెలియలేదు నాకు. యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ.

సాయంత్రం నాన్నగారు ఆఫీసునుంచి వచ్చాక ఎగురుకుంటూ వెళ్ళి “నాన్నోయ్ నేనొక పద్యాన్ని రాశాను” అని చూపించాను. అది చూసి, అప్పుడు ఆయన చలపతిరావుగారి సులభవ్యాకరణం తెచ్చి చూపించారు. అందులో చందస్సు విభాగాన్ని తీసి, అసలు గణాలు అంటే ఏమిటో కందపద్యం అంటే ఎలా ఉంటుందో చెప్పారు. భరనభభరవ ఉత్పలమాల, నజభజజజర చంపకమాల అని ఆయన అప్పుడు చెప్పినవి ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పుడు అర్థమైంది నేను రాసినదాన్ని పద్యం అనరని. తర్వాతరోజునుంచీ స్కూల్లో నేను పద్యం రాసిన ఊసెత్తితే ఒట్టు. అలా పద్యాలు రాయడం తాత్కాలికంగా పక్కనపెట్టినా ఎప్పటికైనా అన్నీ నేర్చేసుకుని నాన్న మెచ్చుకునేలా పద్యం రాసెయ్యాలని మాత్రం మనసులో ఉండిపోయింది.

తర్వాత తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మేష్టారు రామకృష్ణగారు. ఆయన దగ్గర ఉన్న చనువుకొద్దీ ఆయన తెచ్చుకున్న పుస్తకాలు కెలికే మంచి అలవాటొకటి ఉండేది నాకు. అలా ఒకరోజు పదోతరగతి పాఠ్యపుస్తకం చూసాను. అందులో ఎక్కడో కందపద్యం గురించి ఉందని చూశాను. ఇంకేం? కోతికి మళ్ళీ కొబ్బరికాయ దొరికింది. మొత్తం చదివేశాను. నాకు పూర్తిగా అర్థంకాలేదు. అందువల్ల దీనికన్నా ముందు ఏమేం చెప్పారా అని చూసాను. గణాలు విభజన ఆటవెలది తేటగీతి ఇంకా ఏవేవో ఉన్నాయ్. ఓపిగ్గా కూర్చుని అన్నీ చదివేశాను. ఇంక ఏదో ఒక పద్యం రాయడమే తరువాయి. సందర్భమో? అప్పుడు వచ్చింది ఆగష్టు పదిహేను. వారంరోజులు కుస్తీపట్టి ఛత్రపతి శివాజీ నేతాజీ గాంధీ లాంటివాళ్ళ పేర్లు వచ్చేలా ఛచ్ఛీచెడీ ఒక ఆటవెలది రాసాను భారతదేశంమీద (నాకా పద్యం ఇప్పుడు గుర్తులేదు). దాన్ని మా క్లాసులో డెకరేట్ చేసాను కూడా. అలా ఆటవెలదితో ప్రారంభం. తర్వాత అష్టదిగ్గజాలమీద ఒకటి రాసాను. ఈ రెండూ ఏదో తవికల్లా వచ్చాయి. అందం లేదు, పలుకుతుంటే ఒక పొందిక లేదు, సొగసు సంగతి సరేసరి. పదాలకి నడ్డి విరగ్గొట్టి బలవంతాన ఒక మూలన ఇరికించినట్టుగా అనిపించేది. అప్పుడు చిన్నప్పట్నుంచీ నేర్చుకున్న ఆటవెలదులన్నీ చదివాను. ఒక నడక బోధపడింది. ఇక మొదలు ఏ పండగ వచ్చినా సరే పద్యం రాసెయ్యాల్సిందే. పైగా మా రామకృష్ణగారు కూడా ఆ పద్యాన్ని క్లాసులో పైకి చదివి నా చేత అర్థం చెప్పించి చప్పట్లు కొట్టించేవారు. అది చాలదూ అప్పట్లో మళ్ళీ మళ్ళీ రాయాలని అనిపించడానికి?


నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్య:స్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు.

ఆటవెలదులైపోయిన తర్వాత నేను డైరెక్టుగా దూకింది మళ్ళీ కందం మీదకే. ఆ విధంగా ఛందోబద్ధంగా నేను రాసిన మొదటి కందం — “అందరి పూజలు పొందుచు కొందరికే నీదియైన కరుణను వొసగన్, నీదయ నాపై కలుగగ వందన మిదియే రఘువర వందన మిదియే” అని. హమ్మయ్య. ఈసారి నాన్న ఈ పద్యాన్ని చూసి (ఒక్క చిన్నదోషం మినహాయించి) బాగుందిరా అన్నారు. ఇంకేం ఏనుగెక్కేసినంత సంబడం. ఆ తర్వాత ఒక సీసపద్యం, రెండో మూడో ఉత్పలమాలలు, మరో రెండు ద్విపదలూ రాసాను. ఇదంతా నేను స్కూల్లో ఉన్నప్పటి మాట.

స్కూల్లో ఉన్నప్పుడే కొత్తగా పదమేదైనా తెలిస్తే దాన్ని గుర్తుంచుకోవడానికని పద్యాలు రాసేయడం ఒకటి మొదలైంది. ఒకసారి అలాగే పదో తరగతిలో ఉండగా “ఆపగ” అన్నది కూలంకషకి పర్యాయపదమని చదివాక “ఉ. ఆపగ పారినట్లు మది నా హరి మీదనె కల్గు భక్తియూ ఏ పగ కల్గకుండ ఇల ప్రేమను పంచెడిదైన స్నేహమూ మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయూ ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా” అని పద్యం రాసి మా మిత్రుడు బందా కార్తికేయకి ఇచ్చాను.

నాకు మొదటి నుంచీ కందాలంటే అభిమానమెక్కువ. రెండో క్లాసులో ఉండగా రాగయుక్తంగా కందాలని వప్పజెప్పానని మా టీచరమ్మ క్లాసులో నాచేత మిగతా వాళ్ళకి చెప్పించేది కూడా. కందాలమీదున్న ఆ అనుబంధంవల్ల నేను ఇంటర్లో ఉన్నప్పుడు అన్నీ కందాలే రాసాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్య:స్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు కందాలంటే ఉన్న అభిమానం ఎంత ఎక్కువంటే మూడేళ్ళ క్రితం వరకూ నేను ఎప్పుడూ ఒక్క తేటగీతి కూడా రాసి ఎరుగను.

అలానే నేను ఇంటర్లో ఉన్నపుడు ఒకసారి మాడగుల నాగఫణిశర్మగారు ఇచ్చిన ఒక కందపద్య సమస్యని కూడా పూరించి దూరదర్శన్ కి పంపించాను (అదేమిటోగానీ నేను వీక్షించిన మొదటి, చివరి సమస్యాపూరణం కార్యక్రమం అదే). ఇప్పటికీ నన్ను బాధపెట్టే విషయం ఏమిటంటే నేను అప్పుడు పూరించిన పూరణగానీ, పోనీ ఆ సమస్యగానీ ఇప్పుడు నాకు గుర్తులేవు. అంతకు ముందు రాసిన చాలా పద్యాలు కూడా ఎక్కడ రాసానో గుర్తులేదు, ఏమైపోయాయో తెలియదు. సరీగ్ఘా అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవ్వకూడదనే ఈ మధ్యన నేను రాసిన పద్యాలని వాగ్విలాసమనే నా బ్లాగులో ప్రచురించడం మొదలుపెట్టాను (కొన్ని ప్రచురించకుండా కేవలం సేవ్ చేసిన పద్యాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం).

నేను చదివిన పుస్తకాలా? నేను చాలా బద్ధకిష్టుని. నేను పాఠ్యపుస్తకాలలో తప్పితే ఎక్కడా పద్యాలు చదివే వాడినేకాదు. ఏదో ఈ మధ్యనే మా సగోత్రీకుడైన పోతనగారి భాగవతంతో శ్రీకారంచుట్టి పూర్వకవులు రాసిన కావ్యాలు చూడడం మొదలుపెట్టాను. అందులో మొదటి స్కంధమే పూర్తికాలేదనుకోండి ఇంతవరకూ.

ఇక మా కుటుంబ నేపథ్యమంటారా? మా తాతగారైన ముక్కు శ్రీరామచంద్రమూర్తి గారికి తెలుగు సంస్కృతాలు చక్కగా వచ్చును. మా పెదతాతలు ఇద్దరూ ఉభయభాషాప్రవీణలేనట. మా పెదనాన్నగారు కూడా బోలెడు పద్యాలు రాసేవారట ఆయన చిన్నతనంలో. నా ప్రథమగురువైన మా నాన్నగారికి పద్యాలన్నా సంగీతమన్నా ఆసక్తి మెండు. నాకు తెలిసి ఆయన పద్యాలు రాద్దామని ఎప్పుడూ ప్రయత్నించనే లేదు. ఏవో కొన్ని కవితలు మాత్రం రాసారు.

ఈ మధ్య నేను రాసినవాటిలో నాకు సంతృప్తినిచ్చినవి అర్థనారీశ్వర పంచాక్షర స్తోత్రాల ఆంధ్రీకరణలూ, అవి కాక కొన్ని పద్యాలూను.

మరో విషయం ఏంటంటే నాకు సరైన సమయంలో తగిన ప్రోత్సాహం లభించింది కాబట్టిగానీ లేకపోతేనా అసలు నాకు పద్యాలు రాయగలిగే శక్తెక్కడిది? నాకు ప్రోత్సాహాన్నందించిన వారికందరికీ ముఖ్యంగా మా నాన్నగారైన త్రినాథశర్మగారికీ, విజయ మేడమ్‌కి, రామకృష్ణ మేష్టారికి, రామ్మోహన్ మేష్టారికి, మా తాతగారైన బ్రహ్మశ్రీ మంగళంపల్లి రామనరసింహమూర్తిగారికీ నేను ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

చివరిగా ఒక్క మాట. నా గురించి ఇంత విన్నాక కూడా మీకింకా నేను పద్యాల గురించి చెప్పే విషయాలమీద ఆసక్తి నిలిచే ఉంటే ఆ సంగతులన్నీ తప్పకుండా మరో మారు ముచ్చటించుకుందాం.

————–

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

Posted in వ్యాసం | Tagged , , | 5 Comments

అంతర్జాల పత్రికలు

అంతర్జాలంలో అనేక తెలుగు పత్రికలు వెలుగు చూస్తున్నాయి, విజయవంతంగా నడుస్తున్నాయి. తొలినాళ్ళలో అంతర్జాల పత్రికలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. సాహిత్య వ్యాసాలు, కథలు, పాత గ్రంథాల సమీక్షలు, పద్యాలు మొదలైనవి ప్రధానంగా ఈ పత్రికల వస్తువులు. పాఠకుల అభిప్రాయాలను ప్రచురించాలంటే పత్రిక తరువాతి సంచిక వరకు ఆగవలసి వచ్చేది. యూనికోడు ప్రాచుర్యం పొందని ఆ రోజుల్లో అంతర్జాల పత్రికలన్నీ బొమ్మలూ. PDFల రూపంలోనే ఉండేవి. మామూలు అచ్చు పత్రికనే కంప్యూటర్లో చూస్తున్నట్లుండేది.

వెబ్2.0 వచ్చాక, బ్లాగులూ, వికీలూ వెల్లువెత్తాక, అంతర్జాల పత్రికల ధోరణి మారిపోయింది. అభివృద్ధి చెందిన సాంకేతిక సౌలభ్యాలు, తగ్గిపోయిన ఖర్చులు, పత్రికలకు చోదకాలయ్యాయి. ముఖ్యంగా, కంటెంటు మేనేజిమెంటు విషయంలో జరిగిన సాంకేతిక పురోగతి కారణంగా అంతర్జాల ప్రచురణ చిటికెల మీద పని అయిపోయింది. బ్లాగుల కారణంగా వెలికివచ్చిన కొత్త తరపు నెజ్జనుల ప్రతిభ ఈ పత్రికలకు ముడిసరుకయింది. అచ్చు పత్రికలకు అలవాటు పడిన పాత తరం రచయితలు అంతర్జాలంలో చురుగ్గా రాయడం ఇంకా మొదలు కాలేదు. అయితే, అంతర్జాల పత్రికల ప్రగతి గమనిస్తూ ఉంటే వాళ్ళూ జాలంలో చిక్కుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

వెబ్ పత్రికలకు, అచ్చు పత్రికలకూ ముఖ్యంగా రెండే తేడాలు.

1. ఫోటోలు బొమ్మలు లేకపోవడం: ఔత్సాహిక రచయితలున్నారు గానీ, ఔత్సాహిక చిత్రకారులూ, పొటిగరాపు పంతుళ్ళు లేకపోవడము, వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి రావటం, వెబ్ పత్రికలన్నీ కూడా ధనాపేక్ష లేనివే కావడం దీనికి ప్రధాన కారణం.

2. ప్రకటనలు లేకపోవడం: దీనికి ప్రధాన కారణం ప్రకటనలిచ్చేవారు లేకపోవడం (అసలిదే కారణమని కొందరంటారు)

మరో రెండు తేడాలు :
3. ప్రసిద్ధులైన రచయితలు అచ్చు పత్రికలకు అందుబాటులో ఉన్నంతగా వెబ్ పత్రికలకు ఉండరు.

4. వెబ్ పత్రికల పాఠకులు అచ్చు పత్రికల కంటే తక్కువ.

*** *** *** *** ***

ఈమాట!

వస్తునాణ్యత పరంగా వెబ్ పత్రికలు అచ్చు పత్రికలకు తీసిపోయినవేమీ కాదు. కొండొకచో వెబ్ పత్రికలే ముందంజలో ఉన్నాయి. అలాంటి పత్రికల్లో పేరెన్నికగన్నది ఈమాట! తెలుగు వెబ్ పత్రికల్లో వయసు రీత్యానూ, పరిణతి రీత్యానూ పెద్దది – ఈమాట. ఎప్పుడో యూనికోడు ప్రాచుర్యంలోకి రాకముందే పుట్టిన ఈ పత్రిక కాలంతో పాటు రూపునూ, సాంకేతికతనూ మార్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ, అదే సమయంలో తన రచనల స్థాయిని కాపాడుకుంటూ వస్తోంది.

ఈమాట

ఈమాట ద్వైమాసిక సాహితీ పత్రిక. చాలా స్పష్టమైన ఆశయాలు కలిగినది.

సంపాదకవర్గం:
వేలూరి వేంకటేశ్వరరావు, కె.వి.ఎస్. రామారావు, సురేశ్‌ కొలిచాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి ఈమాటను నిర్వహిస్తున్నారు.

“అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి తోడ్పడింది” అనే మాట ఈమాటకు చెందినంతగా మరో పత్రికకు చెందదు. తెలుగు సాహిత్యానికి నెట్లో ఉన్న ప్రధాన వనరుల్లో ఈమాట ఒకటి. ఈమాట కూడబెట్టినంత సాహితీ సంపద అంతర్జాలంలో మరో తెలుగు పత్రిక చెయ్యలేదు. ఇప్పటి వరకూ వచ్చిన యాభై పైచిలుకు సంచికలను ముందేసుకుని కూచ్చుంటే సాహిత్య భోజనులకు అజీర్తి చెయ్యడం ఖాయం! ఈమాట గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు డౌనులోడు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.

కళ్ళకింపైన చక్కని మూసను ఈమాటకు వాడుతారు. పత్రిక వెనుక గట్టి సాంకేతిక వర్గం కూడా ఉన్నట్టుంది.., ఈ వర్డ్ ప్రెస్ మూసకు మార్పుచేర్పులు చేసి చాలావరకు తమకనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. యూనికోడులోనే కాక, మూడు ఇతర రూపాల్లోనూ ఈమాట లభిస్తుంది.

ఇందులో వచ్చినన్ని పరిశోధనాత్మక వ్యాసాలు ఇంకెక్కడా రాలేదేమో. ఆంగ్లంలో ఎకడెమిక్ జర్నల్ తరహాలో ఈ పత్రికని నడుపుతున్నారు. ప్రతి రచనా, ముందుగా ముగ్గురు సమీక్షకులు పరిశీలిస్తారు, అవసరమైన చోట్ల మార్పుచేర్పులకు సూచనలు ఇస్తారు.

ఎప్పుడో ఎనిమిదేళ్ళ కిందటే ఆడియో వ్యాసాలను అందించిన ఘనత ఈమాటది. ఈమాట అచ్చులోనూ వస్తే, మరింత మంది పాఠకులకు చేరువయ్యే అవకాశం ఉంది.

*** *** *** *** ***

సుజనరంజని

కాలిఫోర్నియా బే ఏరియా తెలుగువారి సాంస్కృతిక సంస్థ, సిలికానాంధ్ర వారి పత్రిక ఇది. మాసపత్రిక. 2004 జనవరి నుండి ప్రచురితమౌతోంది. ప్రతి నెలా ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తారు. మామూలు అచ్చు పత్రిక భావన కలుగజేస్తుంది. తెలుగు సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రిక ఇది.

సుజనరంజని

పద్య సమస్యలిస్తూ పాఠకుల నుండి పూరణలను కోరే “పద్యం హృద్యం” శీర్షిక సుజనరంజని ప్రత్యేకత! మరే పత్రికలోనూ లేని శీర్షిక ఇది. గళ్ళ నుడికట్టును కూడా ఇస్తారు కానీ, దాన్ని డౌనులోడు చేసుకుని ప్రింటు తీసి, ఆపై పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. సుజనరంజని యూనికోడులోనే కాక, పీడీయెఫ్ గా కూడా లభిస్తుంది.

సంపాదకబృంద సభ్యులు:
తాటిపాముల మృత్యుంజయుడు
తల్లాప్రగడ రావు
ప్రఖ్య వంశీకృష్ణ
తమిరిశ జానకి
కూచిభొట్ల ఆనంద్
డా.జుర్రు చెన్నయ్య

శీర్షికా నిర్వాహకులు: కాకుళవరపు రమ, పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం

తాము స్వయంగా తయారుచేసుకున్న సాఫ్టువేరును, మూసను వాడుతున్నారు. సైటు మిగతా పత్రికలతో పోలిస్తే నిదానంగా లోడవుతుంది. బహుశా బొమ్మలు ఒక కారణం కావచ్చు. పత్రికలో అచ్చుతప్పులు పంటికింద రాళ్ళలాగా తగులుతూ ఉంటాయి. పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజెప్పేందుకు సరైన వీలు లేదు. ఈ మధ్య ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు కానీ పాఠకుల స్పందన తరువాతి సంచికలోనే వస్తుంది. అంతర్జాల పత్రికల్లో ఇది లేకపోవడం లోటే గాక, చిత్రం గానూ అనిపిస్తుంది.

*** *** *** *** ***

ప్రజాకళ

ప్రజాకళ అక్టోబరు 2006 లో మొదలైంది. దీన్నొక మాస పత్రికగా తీసుకురావాలనేది పత్రిక పెట్టిన కొత్తలో వారి ప్రయత్నం. ఈ మధ్య కాలంలో తమ ఉద్దేశ్యాన్ని మార్చుకుని ప్రతి వారం ఏదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనేది తమ కోర్కె అని చెప్పారు. అయితే ఆ ప్రయత్నాలు ఇంకా కార్యరూపానికి రాలేదు. కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను పరిచయం చేస్తారు.. “ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలనేది” కూడ వారి కోర్కె.

ప్రజాకళ

సాజీ గోపాల్ నేతృత్వంలో ప్రజాకళ వస్తూంది. అయితే పత్రికలో ఆ వివరాలను ప్రచురించలేదు. “అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము.” అని మాత్రం రాసారు. ఈ విషయమై ఒక ప్రముఖ పాఠకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమూ ఇవ్వలేదు. బహుశా ఆ ప్రశ్నకు అక్కడే సమాధానం ఇవ్వకపోవడంలో తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసేందుకే ఆ ప్రశ్నని తీసెయ్యకుండా, అలాగే ఉంచేసినట్టున్నారు. (ఆయనకు సమాధానాన్ని నేరుగా ఈమెయిలుకు పంపి ఉండవచ్చు.)

ప్రజాకళ వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరును వాడుతున్నది. ఉచితంగా దొరికే మూసను వాడుతున్నారు. మొదటినుండీ ఒకే మూసను వాడుతూ వస్తున్నారు. పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది.

*** *** *** *** ***

ప్రాణహిత

ప్రాణహిత 2007 జూలైలో మొదలైంది. “ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం.” అని చెబుతూ.., “ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం.” అని తమ సంకల్పాన్ని చెప్పుకున్నారు. ఎక్కడా స్ఫుటంగా ప్రస్తావించనప్పటికీ ప్రాణహిత ప్రధానంగా తెలంగాణా ప్రాంత అంశాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ప్రాణహిత

ప్రాణహిత సంపాదకవర్గం: నారాయణ స్వామి, హిమబిందు, మమత, జయప్రకాశ్, చైతన్య, జి. ఎస్. రాంమోహన్ (హైదరాబాద్)

ప్రాణహితది ఆహ్లాదకరమైన రూపం. వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరులో, ఒక చక్కటి మూసను కొని, వాడుతున్నారు. మొదటి నుండీ దాన్నే వాడుతున్నారు. పత్రిక పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది

పాఠకులకు ప్రజాకళ, ప్రాణహిత పత్రికలలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. వారి సాహితీ దృక్పథం, ప్రచురిస్తున్న వస్తువుల్లో ఉన్న సారూప్యత అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. రెండు పత్రికల్లోనూ ఉన్నత విలువలతో కూడిన వ్యాసాలు వస్తున్నప్పటికీ, తమకో ప్రత్యేక గుర్తింపును, ఒక బ్రాండును స్థాపించుకోవడంలో ఇదొక అడ్డంకి. ఈ రెండు పత్రికల గురించిన పేజీలను చూస్తే వీటి సామ్యం అవగతమౌతుంది.

*** *** *** *** ***

కౌముది

వెబ్‌లో ప్రచురితమౌతున్న మరో మాస పత్రిక కౌముది. ప్రముఖ రచయిత, కిరణ్ ప్రభ (పాతూరి ప్రభాకరరావు), ఆయన భార్య కాంతి ఈ పత్రికకు నిర్వాహకులు. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు.



యూనికోడు యుగంలో మొదలైనప్పటికీ, కౌముదిని పీడీయెఫ్, బొమ్మల రూపాల్లోనే ప్రచురిస్తున్నారు. పాఠకుల స్పందన వెంటనే కనిపించదు.

*** *** *** *** ***

భూమిక

భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాలానికెక్కింది. “తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా” భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే! ప్రసిద్ధులైన స్త్రీలు భూమికలో ముఖ్య భూమికలు నిర్వహిస్తున్నారు.

భూమిక

భూమికలో రచనలు ఎక్కువగా స్త్రీకి సంబంధించినవే. కాల్పనిక రచనలు తక్కువగానూ, వాస్తవ విషయాలకు సంబంధించిన రచనలు ఎక్కువగాను ఉంటాయి.

కేవలం రచనలతోటి సరిపెట్టడమే కాకుండా, స్త్రీలకు మాటసాయం చేసే ఉద్దేశ్యంతో భూమిక ఒక హెల్ప్‌లైన్ ను కూడా నిర్వహిస్తోంది.

*** *** *** *** ***

నవతరంగం

తెలుగు పత్రికలలో పసి కూన ఇది. పొద్దు లాగానే ఒక వేళాపాళా లేకుండా వచ్చే పత్రిక. సినిమా కోసమే ప్రత్యేకించిన పత్రిక. సినిమా విమర్శకుడిగా పేరొందిన వెంకట్ సిద్ధారెడ్డి మరి కొందరు ఔత్సాహికులతో కలిసి స్థాపించిన పత్రిక. రాకేశ్వరరావు, మంజుల, దేవరపల్లి రాజేంద్ర కుమార్, సౌమ్య, ప్రసాద్, శ్రీరామ్ మొదలైనవారు ఇతర రచయితలు. నిష్పాక్షిక సినిమా సమీక్షలకు నెలవుగా నవతరంగం పేరు పొందుతోంది. నవతరంగం అనే పేరుతో తమ సైటు కొత్త ఆలోచనలను, కొత్త భావాలను తెస్తుంది అని చెప్పదలచినట్టున్నారు. బహుశా వెంకట్ కు న్యూవేవ్ సినిమా పట్ల ఉన్న అభిమానం ఆయనచేత ఈ పేరు పెట్టించి ఉండవచ్చు.

నవతరంగం

ఇది కూడా వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరు ఆధారంగా నడిచే పత్రికే! మామూలుగా ఉచితంగా దొరికే మూసల జోలికి పోకుండా, నవతరంగం తన మూసను కొని మరీ వాడుతోంది. ఆ విధంలో ఒక అసౌకర్యానికి గురౌతోంది. పదే పదే రూపును మార్చుకోవడానికీ, ప్రయోగాలకూ ఖర్చు పెరిగిపోతోంది. (తమరి విధేయ పత్రిక ఈ ప్రయోగాలకు పెట్టింది పేరని పాఠకులకు తెలియంది కాదు). సైటు చాలా త్వరగా లోడవుతుంది.

పత్రికలో బాగా కనిపించే తేడా.. దానికున్న పోర్టల్ రూపమే! ఇటీవలి వ్యాసాల సంక్షిప్త పరిచయం మొదటి పేజీలో కనిపిస్తాయి. ఎంచుకున్న శీర్షికలలోని సరికొత్త వ్యాసాల మొదటి వాక్యాలు మొదటి పేజీ అంతా పరుచుకుని ఉంటాయి.

ఫోకస్, భారతీయ సినిమా, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మొదలైన వర్గాలున్నాయి. ఇవి వర్గాలు.. శీర్షికలు కావు. ఒక్కో వ్యాసమూ ఒకటి కంటే ఎక్కువ వర్గాలోకి చేర్చారు. అది సహజమే. కానీ ఆ వర్గాలనే పైనున్న లింకులుగా పెట్టడంతో ఒకే వ్యాసం ఒకటి కంటే ఎక్కువ లింకుల్లో ఉంటోంది. పైనున్న లింకులు ఆ లింకులకే ప్రత్యేకమైన వ్యాసాలను చూపిస్తే బావుంటుంది. వర్గాలను పేజీలో మరోచోట పెట్టొచ్చనుకుంటాము.

ఇకపోతే… నవతరంగంలో ఉండాల్సినవీ, అక్కడ లేనివీ – ఫోటోలు. ఒక సినిమా పత్రికలో పాఠకులెక్కువగా ఆశించేది ఫోటోలను. నవతరంగం, నవతరపు సినిమా పత్రికైనప్పటికీ అది అవసరమే! పత్రిక మరింత పుంజుకునేటప్పటికి ఆ లోటూ తీరవచ్చు.

నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా – తమ రచనలని, ప్రచురించుకొనే సౌకర్యం కలిగిస్తోంది. ఇది ఓ కొత్త ప్రయోగం.

సాటి ఉత్సాహవంతులను కలుపుకుని వెంకట్ సిద్ధారెడ్డి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనట్టే! పాఠకుల స్పందన కూడా బావుంది. తెలుగు సినిమాపై నిజాయితీతో కూడిన విమర్శ కరువైన ఈ రోజుల్లో ఇది అవసరమైన ప్రయోగం. ఉత్సాహవంతులు, కార్యకుశలురూ అయిన నవతరంగ చోదకులు మరిన్ని కొత్త శీర్షికలతో పత్రికను నిత్యనూతనంగా ఉంచుతారని ఆశించవచ్చు.

*** *** *** *** ***

చాలా వరకూ వెబ్-పత్రికలన్నీ – సాహిత్యానికి, లేదా ఏవో కొన్ని సామాజికాంశాలకీ పరిమితమైపోయాయి. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ప్రపంచం నలుమూలలా – ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు, తెలుగులో రాయటం చాలా తేలికైపోయింది. పత్రిక పెట్టడానికి కాని ఖర్చు కూడా లేదు, ఉత్సాహం, రాయాలనే పట్టుదలా, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉంటే చాలు. కాబట్టి, రాబోయే కాలంలో – ఎకనామిక్సు, పొలిటికల్ సైన్సు, సైన్సులు, సోషియాలజీ మొదలైన రంగాలలో – నైపుణ్యం ఉన్నవారు కొంతమంది – నవతరంగం తరహాలో ఒక చోట చేరి, ఆయా అంశాలలో తెలుగులో రాస్తే బావుటుంది. ఇప్పటికే, కొంతమంది – భాషా శాస్త్రం, కంప్యూటర్ సైన్సు, టెక్నాలజీ, సైన్సు మొదలైన విషయాలలో, ఉన్నత స్థాయి రచనలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే, తెలుగు అంతర్జాలం, వెబ్-పత్రికలు – ప్రింటు మాధ్యమాలకి ప్రత్యామ్నాయంగా ఎదగటం, తమ ఉనికిని స్థిర పరుచుకోవటం ఖాయం.

-పొద్దు

Posted in వ్యాసం | Tagged | 10 Comments

మృతజీవులు – 15

నాలుగవ ప్రకరణం

భోజనశాల వద్దకు వచ్చేసరికి చిచీకవ్, గుర్రాలకు విశ్రాంతి అయినట్టు అవుతుందనీ, తాను ఏదైనా పలహారం చెయ్యవచ్చుననీ ఆలోచించి, సేలిఫాన్ తో చెప్పి బండి ఆపించాడు. ఇలాంటి వాళ్ళ జఠరశక్తి, ఆకలీ చూసి కథకుడు అసూయ చెందుతాడంటే, అందులో అసత్యం లేదు. పీటర్స్‌బర్గ్ లోనూ, మాస్కోలోనూ ఉండే ఘరానా మనుషులు అస్తమానమూ ‘రేపు ఏం తిందామా, ఎల్లుండి మధ్యాహ్నం ఏం తిందామా’ అని ఆలోచించటంతో కాలం వెళ్ళబుచ్చుతూ, భోజనం ఆరంభించబోతూ మాత్రలు మింగుతారు; ఆ తరువాత ఆయిస్టర్లూ, లాబ్‌స్టర్లూ, ఇతర వింత ఆహారాలూ తిని, ఆ తరువాత ఆరోగ్యం బాగు చేసుకునేటందుకు కారల్స్‌బాదో, కాకససో పోతారు. అలాటివాళ్ళంటే కథకుడికి అభిప్రాయం లేదు, అసూయా లేదు. నిజంగా అసూయ పడదగిన ఘనమైన అదృష్టం గలవాళ్ళు మధ్యరకానికి చెందినవాళ్ళు. వాళ్ళు ఒక మజిలీలో తుంటిమాంసం తింటారు, ఇంకో మజిలీలో వండిన పంది పిల్లను తింటారు.

ముసలావిడ తనకు సబాకవిచ్ మాత్రమేగాక, మానిలవ్ కూడా తెలుసుననీ, సబాకవిచ్ కంటే మానిలవ్ పెద్దమనిషి అనీ, మానిలవ్ వస్తూనే కోడినీ, దూడమాంసాన్నీ, ఉంటే గొర్రె కార్జాన్నీ తెమ్మని అన్నిటినీ కొంచమే రుచి చూసి వదిలేస్తాడనీ, సబాకవిచ్ ఏదో ఒక్కటే అడిగి, తెచ్చినదంతా తుడిచేసి తినడమేగాక, ఒక ప్లేటు ఖరీదుకే మారువడ్డన కూడా కావాలంటాడనీ చెప్పింది.

మరోదానిలో ఉల్లిపాయలతో సాసేజి వేపుడు తింటారు. ఆ తరువాత మీరెప్పుడు కోరితే అప్పుడు భోజనానికి కూచుని , ఏమీ జరగనట్టుగా చేపల ‘సూప్’ జుర్రేసి, చేపల ‘పాటీ’లు కూడా తినేస్తారు. వాళ్లను చూస్తుంటేనే ఆకలి పుట్టుకొస్తుంది. ఇలాటి మధ్యతరగతి పెద్దమనిషికుండే జీర్ణశక్తికోసం ఎందరో ఘరానా మనుషులు తీసుకొన్న కమతగాళ్ళలోనూ, ఎస్టేట్లలోను సగంభాగం,-తాకట్లున్నవయేది, లేనివయేది- దేశీయ పద్ధతిలోనూ, విదేశీ పద్ధతిలోనూ చేసిన అభివృద్ధులతో సహా, ఏ క్షణాన అయినా ధార పోసేస్తారు. కాని చిక్కేమిటంటే ఈ మధ్యతరగతివాడి జీర్ణశక్తి డబ్బుతోగానీ, ఎస్టేట్లను అమ్మితే గాని వచ్చేది కాదు -ఆ ఎస్టేట్లు అభివృద్ధి పొందినవయేది, పొందనివయేది.

వయసుచేత నలుపెక్కిన ఆ చెక్కల భోజనశాల తాలూకు వసారా ఇరుకుగా ఉన్నా ఆగంతకులను ఆకర్షించజాలి ఉన్నది; అది పాతకాలపు చర్చి కొవ్వొత్తుల పంపిణీలో మలచిన కర్రస్థంభాల మీదనిలిచి ఉన్నది. మొత్తం ఇల్లంతా రష్యను సేద్యగాళ్ళ గుడిసెల పంపిణీలోనే తయారయింది. అయితే ఆ గుడిసెల కన్న పెద్దది. కిటికీల చుట్టూనూ, చూరుకిందా కొత్తగా కర్రనగిషీలు అమర్చారు, నల్లటిగోడలమీద ఇవి కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కిటికీ రెక్కలపైన పూలతొట్టెల బొమ్మలు వేశారు.

చిచీకవ్ ఇరుకైన మెట్లమీదుగా ముందు గదిలోకి వెళ్ళేటపుడు తలుపు కిర్రున తెరుచుకున్నది; నదరైన రంగుగల చీటీగౌను ధరించిన లావుపాటి ఆడమనిషి ఎదురువచ్చి, “ఇలా దయచేయండి!” అన్నది. లోపలిగదిలో మామూలు మిత్రబృందం ఉన్నది. రహదారి పొడుగునా ఎన్నో భోజనశాలలున్నాయి, ప్రతి ఒక్క భోజనశాలలోనూ ఈ మిత్రబృందం విధిగా ఉంటుంది – అది ఏమిటంటే, మురికి పట్టిన సమొవార్, నున్నటి జాజిచెక్క గోడలూ, ఒక మూల త్రికోణాకారం గల అలమారులో కప్పులూ, టీ పాట్‌లూ, పూజా విగ్రహాల ముందు ఎర్రని, నీలం రంగుపట్టీలకు వేళ్ళాడే పాదరసం బుడ్లూ, ఇటీవలనే కూనలను పెట్టిన ఒక పిల్లీ, రెండు కళ్ళను నాలుగుగానూ, ముఖాలను బన్‌లలాగానూ చూపే అద్దమూ, దేవుడి విగ్రహాల ముందుంచిన సువాసనగల ఆకులూ, పూలూ – అవి ఎంతగా వాడిపోయి ఉంటాయంటే వాటిని వాసనచూస్తే తుమ్ములు పట్టుకుంటాయి.

“వండిన పందిపిల్ల ఉన్నదా?” అని చిచీకవ్ ఆడమనిషిని అడిగాడు.
“ఉన్నది”
“ముల్లంగీ, పుల్ల మీగడా వేసినదేనా?”
“ముల్లంగీ, పుల్లమీగడా వేసినదే”
“అయితే పట్టుకురా”

ఆడమనిషి వెళ్ళి ఒక ప్లేటూ, ఒక నాప్కిన్ తెచ్చింది. ఆ నాప్కిన్ బాగా గంజిపెట్టి అట్టలాగా ఉండి పరిస్తే పరుచుకోవటంలేదు. తరువాత ఒక కత్తీ – దాని ఎముకపిడి పాతబడి పసుపు పచ్చగా ఉన్నది. కోసేభాగం పెనసళ్ళు చెక్కుకునే చాకులాగా ఉన్నది – రండే పళ్ళుగల ముళ్ళచంచా, బల్లమీద పెడితే పక్కకు ఒరిగబడే ఉప్పుతొట్టీ వచ్చాయి.

మన కథానాయకుడు తన అలవాటు ప్రకారం ఆవిడతో సంభాషణ ప్రారంభించి ఆ భోజనశాలను ఆమె స్వయంగా నడుపుతున్నదో లేక యజమాని వేరే ఉన్నాడో, ఈ భోజనశాల మీద ఏమాత్రం రాబడి వస్తున్నదో, వాళ్ళ కొడుకులు వాళ్ళతో కలిసి ఉంటున్నారో, విడిగా ఉంటున్నారో, పెద్దవాడికి పెళ్ళయిందో, బ్రహ్మచారో, వాడి భార్య మంచి కట్నం తెచ్చిందో, లేదో, పెళ్ళికూతురి తండ్రి ఈ సంబంధం చూసి తృప్తిపడ్డాడో లేక పెళ్ళికి కట్నకానుకలు సరిగా ఇవ్వలేదని కినిశాడో – అంతా ఆరా తీశాడు. ఆ చుట్టుపక్కల మంచి భూస్వాములున్నారా అని అతను అడిగాడని వేరే చెప్పనవసరము లేదు. రకరకాల భూస్వాములున్నట్టు తెలుసుకున్నాడు: బ్లహీన్, సచికాయెవ్, మిల్నోయ్, చిప్రాకవ్, కర్నలూ, సబాకవిచ్.

“ఓహో, నీకు సబాకవిచ్ తెలుసన్నమాట!” అన్నాడతను. ముసలావిడ తనకు సబాకవిచ్ మాత్రమేగాక, మానిలవ్ కూడా తెలుసుననీ, సబాకవిచ్ కంటే మానిలవ్ పెద్దమనిషి అనీ, మానిలవ్ వస్తూనే కోడినీ, దూడమాంసాన్నీ, ఉంటే గొర్రె కార్జాన్నీ తెమ్మని అన్నిటినీ కొంచమే రుచి చూసి వదిలేస్తాడనీ, సబాకవిచ్ ఏదో ఒక్కటే అడిగి, తెచ్చినదంతా తుడిచేసి తినడమేగాక, ఒక ప్లేటు ఖరీదుకే మారువడ్డన కూడా కావాలంటాడనీ చెప్పింది.

అతను ఆ విధంగా కబుర్లు వింటూ పందిపిల్లను పూర్తిచెయ్యబోతున్న సమయంలో బయట బండి చక్రాలు సమీపించే చప్పుడు వినబడింది. కిటికీలోనుంచి బయటికి తొంగి చూసేసరికి ఒక తేలిక రంగుబండి, మూడు మంచి గుర్రాలతో వచ్చి భోజనశాల వెలుపల ఆగటం కనిపించింది. అందులోనుంచి ఇద్దరు దిగారు: ఒకడు పొడగరి, తేలిక రంగు జుట్టు కలవాడు; రెండోవాడు కొంచెం పొట్టి, అతని జుట్టు నల్లగా ఉన్నది. పొడుగువాడు ముదురు నీలం రంగు జాకెట్, అంచుల వెంబడి నగిషీ కుట్టుకలది ధరించాడు. పొట్టివాడు సాదాగా జెర్కిన్ వేసుకుని ఉన్నాడు. దూరాన మరొక చచ్చురకం బండి కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నది. అందులో ఎవరూ లేరు. దాన్ని నాలుగు గుర్రపు తట్లు ఈడ్చుకు వస్తున్నాయి; వాటి మెడపట్టీలు చినిగి ఉన్నాయి, పగ్గాలకు తాళ్ళున్నాయి. పొడుగువాడు వెంటనే మెట్లెక్కి పైకి వచ్చాడు, కాని పొట్టివాడు వెనకనే ఉండిపోయి, బండిలోపల దేనికోసమో తడుముతూ, నౌకరుతో ఏదో మాట్లాడుతూ, దూరాన ఉన్న బండిని చెయ్యి ఊపి పిలిచాడు. అతనిది ఎక్కడ విన్న గొంతులాగా చిచీకవ్ కు వినిపించింది. అతన్ని చిచీకవ్ మరింత శ్రద్ధగా పరికించేటంతలో పొడుగాటివాడు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. అతను చాలా ఎత్తున్నాడు, మొహం చిక్కిపోయినట్టుగా ఉన్నది. అతని మీసాలు ఎర్రగా ఉన్నాయి. అతని మొగం చూస్తే తుపాకీ మందుతో కాకపోతే కనీసం పొగాకు పొగతో పరిచయం ఉన్నవాడులాగా ఉన్నాడు. అతను చిచీకవ్‌ను చూసి సగౌరవంగా వంగాడు. అంత గౌరవంగానే చిచీకవ్ కూడా వంగాడు.

“నా దగ్గర ఇంకొక్క ఇరవై రూబుళ్ళుంటేనా! ఇరవై రూబుళ్ళే ఉంటే పోయినదంతా గెలిచేసుకునేవాణ్ణే. నాది గెలిచేసుకోవటమేమిటి, ముప్ఫైవేలు జేబులో పెట్టేసుకుని ఉందును, ఒట్టు” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అప్పుడు ఇలాగే అన్నావు. యాభై రూబుళ్ళిస్తే అది కాస్తా పోగొట్టుకున్నావు.” అన్నాడు పొడుగాటివాడు.

“అది పోవలసింది కాదు, నిజానికి. ఆ వెధవపని చెయ్యకపోతే పోయి ఉండవు. ఆ దిక్కుమాలిన ఏడుపైన పందాలు రెట్టింపయినాక కూడా నేను రెండింతలు కాయకుండా ఉంటే, బ్యాంకును దివాలా తీయించి ఉందును.”

వాళ్ళు వెంటనే ఒకేసారి సంభాషణ ప్రారంభించి కిందటిరోజు వానకురిసి రోడ్డుమీది దుమ్ము అణగారి పోవటం చాలా మంచిదయిందనీ, ప్రయాణం చల్లగానూ, ప్రాణానికి సుఖంగానూ ఉన్నదని ఒకరికొకరు తెలుపుకుని ఇంకా ఆప్యాయంగా మాట్లాడుకుని ఒకరినొకరు పరిచయం చేసుకునే యత్నంలో ఉండగా నల్లజుట్టువాడు ప్రవేశించి, టోపీ తిసి బల్లమీద విసిరివేసి, దర్జాగా వేళ్ళతో జుట్టు కెలుక్కున్నాడు. అతను మంచి కుదిమట్టమైన మనిషి, చెక్కిళ్ళు ఎర్రగానూ, దంతాలు మంచు తెలుపుగానూ, పుస్తీలు నల్లగానూ ఉన్నాయి. అతన్ని చూస్తే పాలూ, గులాబీలూ స్ఫురిస్తున్నాయి. అతని ముఖంలో ఆరోగ్యం తాండవిస్తున్నది.

అతను చిచీకవ్‌ను చూసి చేతులు ప్రక్కకు చాస్తూ, “హా,హా,హా! నువ్విక్కడ ఎలా వెలిసావు?” అన్నాడు ఆశ్చర్యంతో.

చిచీకవ్ నజ్‌ద్ర్యోవ్ ను గుర్తించాడు. ఇతను మన కథానాయకుడికి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇంట తటస్థపడి, కొద్ది నిముషాల్లోనే భాయి భాయి అయిపోయి, ప్రోత్సాహం ఏమీ అవసరం లేకుండానే “నువు, నువు” అని మాట్లాడాడు.

అతనిప్పుడు “ఎక్కడికి పోతున్నావు?” అని అడిగి సమాధానం కోసం ఆగకుండానే, “ఇప్పుడే సంతనుంచి వస్తున్నానోయ్; అభినందించు, నన్ను దోచేశారు. నమ్ముతావో లేదోగాని ఇంత నిలువుదోపిడీ నా కెన్నడూ జరగలేదు, నేనిక్కడికి బాడుగ గురాలతో వచ్చానంటే నమ్ము. వాటిని ఒకసారి చూడు!” అన్నాడు.

ఇలా అంటూ అతను చిచీకవ్ తలను కిటికీవైపు వంచేసరికి కిటికీ చట్రం కొట్టుకున్నంత పని అయింది.

“ఆ గుర్రపు తట్లను చూశావా? దిక్కుమాలినవి, ఇక్కడికి పాకి వచ్చాయనుకో. నేను అతని బండిలో ఎక్కవలసి వచ్చింది.”

ఈ మాట అంటూ నజ్‌ద్ర్యోవ్ తన అనుచరుణ్ణి చూపాడు.

“మీ ఇద్దరికీ పరిచయం అయిందా ఏం? మా బావ, మిఝాయెవ్! ఉదయమల్లా నీసంగతే మాట్లాడుకున్నాం. మనకు చిచీకవ్ కనిపిస్తాడు, అన్నాను. ఏమోయ్ నన్ను ఎలా గొరిగారో నీకెలా తెలుస్తుంది! ఏమనుకున్నావో, నా నాలుగు గుర్రాలనూ పోగొట్టుకోవడమే కాక సమస్తమూ ఒడ్డేశాను. చూడు నా గడియారమూ గొలుసూ కూడా పోయాయి.”

చిచీకవ్ అతనికేసి చూసి గడియారమూ, గొలుసూ లేకపోవడం గమనించాడు. అతని పుస్తీలలో కూడా ఒకటి రెండో దాని కన్న కొంచెం తరిగిపోయినట్టుగా అనుమానం వేసింది.

“నా దగ్గర ఇంకొక్క ఇరవై రూబుళ్ళుంటేనా! ఇరవై రూబుళ్ళే ఉంటే పోయినదంతా గెలిచేసుకునేవాణ్ణే. నాది గెలిచేసుకోవటమేమిటి, ముప్ఫైవేలు జేబులో పెట్టేసుకుని ఉందును, ఒట్టు” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అప్పుడు ఇలాగే అన్నావు. యాభై రూబుళ్ళిస్తే అది కాస్తా పోగొట్టుకున్నావు.” అన్నాడు పొడుగాటివాడు.

“అది పోవలసింది కాదు, నిజానికి. ఆ వెధవపని చెయ్యకపోతే పోయి ఉండవు. ఆ దిక్కుమాలిన ఏడుపైన పందాలు రెట్టింపయినాక కూడా నేను రెండింతలు కాయకుండా ఉంటే, బ్యాంకును దివాలా తీయించి ఉందును.”

“దివాలా తీయించలేదుగా” అన్నాడు పొడుగువాడు.

“దివాలా తీయించలేదంటే మరి, కూడని సమయంలో ఏడు మీద రెట్టింపు కాశాను. మీ మేజరు గొప్ప ఆటగాడనుకున్నావు గామాలు!”

“ఆటగాడో కాదో నిన్ను గెలిచాడూ!”

“అదోలెక్కా? అతన్ని గెలుస్తానుండు. పందెం రెట్టించడూ, అప్పుడు చెబుతాను ఆయన సంగతి. ఆయన ఏపాటి ఆటగాడో అప్పుడు తెలుస్తుంది. కాని మొదటిరోజు ఎంత బాగుందనుకున్నావు, చిచీకవ్ మిత్రమా! సంత చాల అద్భుతంగా ఉందిలే. అంతజనం ఎన్నడూ రాలేదని వర్తకులే అన్నారు. నేను గ్రామం నుంచి తెచ్చిన సరుకంతా భలే ధరకు అమ్ముడయింది. అబ్బాయ్, ఎంత వేడుకనుకున్నావ్! ఇప్పుడు కూడా తలుచుకుంటే… తస్సదియ్య. నువుకూడా ఉండవలసింది! ఏమిటనుకున్నావ్, పట్నానికి రెండు మైళ్ళలో అశ్వదళం విడిసి ఉంది. దాని తాలూకు నలభైమంది ఆఫీసర్లూ, ఒక్కడు బీరుపోకుండా, పట్నంలోనే ఉన్నారంటే నమ్ము. ఇక తాగాం చూసుకో… స్టాఫ్ కాప్టెన్ పత్స్యేలుయెవ్… భలేమనిషి… భలే పుస్తీలోయ్! అతను బోర్దో (ద్రాక్ష సారాయి) అనటానికి బర్దాష్క అంటాడు. వెయిటర్ కొంచెం బర్దాష్క పట్టుకురా అంటాడు. లెఫ్టినెంట్ కువ్షిన్నికోవ్… ఆహా ఎంత మంచివాడోయ్! అంతసేపూ మేమిద్దరమే కలిసే ఉన్నాం. పనోమరెవ్ మాకు ఎంతమంచి ద్రాక్ష సారా ఇచ్చాడనుకున్నావ్! భలే మోసగాడు తెలుసా? వాడి దుకాణంలో ఏమీ కొనగూడదు. వాడు ద్రాక్షసారాలో మంచి గంధం చెక్కా, బిరడాచెక్క నుసీ వేస్తాడు, పళ్ళరంగు కూడా కలుపుతాడు, ఛండాలుడు. కాని, వాళ్ళకు స్పెషల్ గది ఒకటున్నది. అందులోనుంచి ఒక ప్రత్యేకమైన సీసా తెచ్చాడో, స్వర్గానికి బెత్తెడులో ఉన్నామన్నమాటే. షాంపేన్ తాగాం… దానిముందు గవర్నరెందుకు?- పళ్ళనుంచి తీసిన సారావతు. ఉత్త క్లికో షాంపేను కాదు, క్లికో – మత్రాదురా, అంటే క్లికోకు రెండింతలన్నమాట. ఫ్రెంచి ద్రాక్ష సారా కూడా తెచ్చాడు. దానిపేరు బాన్-బాన్. మంచి వాసన- గులాబీల వాసనా, ఇంకా అన్ని వాసనలున్నూ. భలే సరదాగా ఉందిలే. మా తరవాత వచ్చిన ఒక జమీందారు షాంపేన్ కావాలని దుకాణానికి మనిషిని పంపాడు. ఊరంతా గాలించినా ఒక్క బుడ్డీ లేదు. సైన్యానికి చెందిన ఆఫీసర్లు అంతా తాగేశారు. నేనొక్కణ్ణే భోజనాల దగ్గర పదిహేడు బుడ్లు తాగేశాను తెలుసా?”

అతనితో కలిసి దాదాపు డాన్సు పార్టీలన్నిటికీ వెళ్ళాం. ఒక అమ్మాయి డ్రెస్సు వేసుకున్నది చూసుకో; కుచ్చులూ, కూర్పులూ ఇంకేమేమిటో ఉన్నాయి. నేను చూసి తస్సదియ్యా!” అనుకున్నాను. కువ్షిన్నికోవ్ మటుకు, గడుసువెధవ;

“చాల్లే, పదిహేడు బుడ్లు తాగటం నీ తరం కాదు”? అన్నాడు పొడుగువాడు.
“నిజంగా తాగానంటే!”
“ఏమన్నా అనుగాక, పదిబుడ్లు కూడా తాగలేవని నేనంటాను”
“పందెం ఏమైనా వేస్తావా?”
“దేన్ని పందెం వెయ్యమన్నావు?”
“పట్నంలో కొన్న తుపాకీ పందెం వెయ్యి”
“వెయ్యను”
“కాస్త వేద్దూ”
“నా కిష్టం లేదు”
“పందెం వేశావో తుపాకీ కాస్తా పోతుంది, నీ టోపీ పోయినట్టే. చిచీకవ్ మిత్రమా, నువ్వక్కడ లేకపోతివికదా! లెఫ్టినెంట్ కువ్షిన్నికోవ్‌ను వదిలిపెట్టి ఉండే వాడివి కావని చెప్పగలను. మీ కిద్దరికీ అంత బాగా అతికిపొయ్యేది. అతను పబ్లిక్ ప్రాసిక్యూటరు లాగానూ, పట్నంలో ఉన్న ఇతర పిసినార్ల లాగానూ ఠోలీ ఖర్చయినప్పుడల్లా గజగజలాడే రకం కాదు. ఏ ఆట ఆడదామన్నా అతను సిద్ధమే. అయ్యో, చిచీకవ్! నువ్వు వచ్చి ఉండకూడదూ? పంది లాగా ఎందుకు రాకపోవాలీ, పశువుల వ్యాపారీ! ఒక్క ముద్దుపెట్టు బంగారు నాయనా, నువ్వంటే నాకెంత ఇష్టం! మిఝాయెవ్, అదృష్టం మమ్మల్ని ఒకచోటికి తీసుకువచ్చింది చూసుకో! నిజానికి అతనెవరు, నేనెవర్ని? ఎక్కణ్ణుంచో వచ్చినవాడు అతను; ఇక్కడ ఉంటున్నవాణ్ణి నేను… అన్నట్టు, ఏమోయ్! ఎన్ని బళ్ళనుకున్నావ్? నేను జూదమాడి రెండు పొమేడ్ బుడ్లూ, ఒక పింగాణీ కప్పూ, ఒక గిటారూ గెలుచుకున్నాను. మళ్ళీ ఆడేసరికి, ఆరు రూబుళ్ళకు పైగా పోయాయి. దాందుంపతెగ! ఆ కువ్షిన్నికోవ్ ఏం రసికుడనుకున్నావు. అతనితో కలిసి దాదాపు డాన్సు పార్టీలన్నిటికీ వెళ్ళాం. ఒక అమ్మాయి డ్రెస్సు వేసుకున్నది చూసుకో; కుచ్చులూ, కూర్పులూ ఇంకేమేమిటో ఉన్నాయి. నేను చూసి తస్సదియ్యా!” అనుకున్నాను. కువ్షిన్నికోవ్ మటుకు, గడుసువెధవ; ఆమె పక్కన చేరి ఫ్రెంచిలో ఆమెను తెగ మెచ్చుకున్నాడు… వాడు పనిపాట్లు చేసుకునే ఆడవాళ్ళను మాత్రం ఊరికే పోనిచ్చాడనుకున్నావా? అదంతా పువ్వులేరటంట, మంచి మంచి చేపలూ, ఎండు స్టర్జిన్ చేపలూ అమ్మాయి. ఒకటి కొన్నాను కూడాను. ఇంకా నయం, డబ్బుండగానే కొనబుద్ధి పుట్టింది. ఇంతకూ నీ ప్రయాణం ఎక్కడికీ?”

“ఎవరినో చూడబోతున్నాను” అన్నాడు చిచీకవ్.
“ఎవరినో చూడకపోతే ఏం ముణిగిపోయింది? నాతో మా ఇంటికి వచ్చెయ్యి”
“ఎలా రాను? నాకు పని ఉన్నది”
“ఓయబ్బ పనిట! ఇంకేం లేదూ? కుంకుడుకాయ నురుగు ఇవానిచ్ గాడా?”
“నాకు నిజంగా పని ఉన్నది; అవసరమైనది కూడానూ”
“అబద్ధమాడుతున్నావు, పందెం! నువు చూడబోతున్నది ఎవరినో చెప్పు చూస్తాం!”
“సబాకవిచ్ ని”
ఈ మాట వినగానే నజ్‌ద్ర్యోవ్ పెద్దపెట్టున నవ్వసాగాడు. మంచి ఆరోగ్యం కలవాడే అంత బలంగా నవ్వగలడు. ఆ నవ్వుకు పళ్ళన్నీ బయటపడి, దవడలు ఆడిపోతాయి. ఆ నవ్వుకు మూడు గదుల అవతల నిద్రపోతున్నవాడు కాస్తా అదిరిపడి లేచి, కళ్ళు పెద్దవి చేసి “ఇంకేం? మంచి ఊపులో ఉన్నాడు!” అనుకుంటాడు.

ఈ నవ్వు చిచీకవ్ ను కంగారు పెట్టింది. “ఇందులో నవ్వటానికేముందీ?” అన్నాడతను.

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 15

సంపాదకీయం

జయీ భవ!

ఉగాది
అసలుసిసలు తెలుగు పండుగ, ఆంధ్రులను ప్రకృతితో మమేకం చేసే పర్వదినం ఉగాది. వేపపువ్వుకు కూడా ఒక ప్రయోజనాన్ని కల్పించిన, ఆ వగరు రుచిని నాలుకలమీదకు చేర్చే పండుగ బహుశా ప్రపంచంలోనే ఉగాది ఒక్కటి. కొత్తబట్టలు, నగలు కంటె రానున్న పన్నెండు నెలలూ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు అనుచానంగా పంచాంగశ్రవణం మీద ఉత్సుకత చూపే “తెలుగులు” అంతకంటే ఉత్సాహంగా కవిసమ్మేళనాలూ జరుపుకుంటారు. కవిపుంగవులూ భావిని అంతా సస్యశ్యామలమూ, సతతహరితమే అని అనునయ గీతాలు పాడుతారు ఈ దినాన. ఏనాట కలిసిందో గాని సాహితీవేత్తలకూ, ఉగాదికి సావాసం, ఆంధ్రులు అంతర్జాతీయపౌరులయినా ఆ సత్సాంగత్యం నిత్యనూతనంగా సాగుతూనే ఉంది.

ఉగాది వస్తుంది అనగానే సాహితీకృషీవలురు పలువురు ముద్రణారంగాన్ని ముఖ్యంగా పత్రికాప్రపంచాన్ని సుసంపన్నం చేస్తారు. కధలు, కవితలు, వ్యాసాలు, నవలలు, అనువాదాలు, విమర్శలు, పద్యాల తోరణాలతో పండగరోజు తెలుగుభాషామతల్లిని శోభాయమానంగా అలంకరిస్తారు. పత్రికారంగం కూడా అన్నిసాహితీప్రక్రియల్లో పోటీలు నిర్వహించి, కొన్ని వందలరూపాయల నుంచి, అక్షరాలా లక్షరూపాయలవరకూ నగదు పురస్కారాలను విజేతలకు అందజేస్తుంది. అచ్చుపత్రికలు, పోర్టల్సు, వెబ్ పత్రికలు రానున్న ఉగాదికి అన్ని సాహితీవిభాగాల్లోనూ పోటీలు ఇప్పటికే ప్రకటించాయి. గోరంత విత్తు కొండంత చెట్టయినట్లు సరదాగా మొదలయిన తెలుగు బ్లాగులు క్రమంగా సమాంతర సమాచార, సాహితీవేదికలుగా రూపాంతరం చెందిన విషయం సభ్యసమాజం సగౌరవంగా గుర్తించి, బ్లాగరుల వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తుంది.. ఈ ఉగాది రచనల పోటీల్లో విజేతలుగా నిలిచే అర్హత మన బ్లాగర్లలో చాలా మందికి ఉంది. ఆలస్యం అమృతం విషం అన్నట్లు మన వారు కలాలు తీసుకుని కార్యరంగంలోకి దుమకటమే ఆలస్యం.

.

జయీ భవ!

-దేవరపల్లి రాజేంద్ర కుమార్

Posted in సంపాదకీయం | 1 Comment

ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె!

తెలుగు రైతు
సినుకు కోసం..
(పై ఫోటో www.worldproutassembly.org నుండి)
. ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె

కన్నీటి చుక్కకానకట్ట లేకపాయె

యేడ్చి యేడ్చి గొంతుకెండి పాయె

దప్పిక్కి యెండిపోయిన నాలిక లెక్కన

సీలికలైన భూమి

బక్క సిక్కి పోయిన భూమి

యాడికి పోయి సెప్పాలీ గోడు

యెవరికి సెప్పాలీ గోడు

. రేతిరి మబ్బు పట్టిందిలే

ఇంక ఆకాశం చిల్లుల్లోంచి

నీటి సుక్కలు కార్తాయి లెమ్మని

ఆశతో కన్నుమూస్తే

తెల్లారి లేస్తే

ఏముంది ఒక్క తడి బొట్టు లేదు

ఊరికే ఉరవడం తప్ప….

అరచడమే తప్ప ఆదుకోవడం తెలీని వాళ్ళే సుట్టు పక్కల

సినుకు ఊసే లేదనే నిజం కల అయితే ఎంత బాగుండేది

. కలలు కనడానికే ఉన్న కళ్ళు

నీళ్ళతో తడిసిపోయిన కళ్ళు

ఆశ నిరాశల మధ్య టపటపమని కొట్టుకునే కళ్ళు

వానకోసం చూసిచూసి విసిగి వేసారిన కళ్ళు

. చల్లగాలి వత్తే చాలు మట్టి వాసన

మట్టి వాసనొస్తే చాలు పడింది సినుకని ఓ సంబడం

ఎంతో సేపు లేదు సంతోషం

సినుకు కెంత కోపమని…

పడదు… పడదు…

ఏంపాపం చేసినామని, ఏం నేరం చేసినామని

మబ్బులన్నీ యాడ దాక్కున్నాయో

కప్పలమ్మ నీకెమైనా తెలుసా

. నాసిన్నపుడు

కుండపొతగా వర్షంకురిస్తే

మా ఊరి అయ్యోరు కట్టిచ్చిన కాగితప్పడవలు

ఈదిగుండ పారే నీళ్ళలో ఇడిసి ఆడుకునే రోజులు

నా పిల్లలకు సెప్తే….

నాయన అబాద్దాలడతాండాడని నగుకున్నపుడు

మా ఆడదాని కండ్లలో జాలి సూపులు

ఆ చణాన నేను సచ్చినా బాగుండేది.

కలం కాగితప్పడవల్లో ఒడ్డు దాటడానికి

ఆశ తెడ్డు ఆధారం..

నిరాశ తుఫానులో చిక్కుకున్న పడవ గట్టెక్కేదానికి

ఆకాశం తప్ప దిక్కెవరు..

ఇట్లా ఎందుకు జరుగుతాండాదో నీకేమైనా తెలుసా కప్పలమ్మ…

. అప్పట్లో కుండపోతలుగా వాన పడేది

వద్దంటే వాన

కళకళలాడే చెరువులు

ఎగసిపడే కాలువలు

ఆకాశానికి భూమికి తాకుతూ ఏసిన పందిరిలా వాన

ఆకాశాన్ని లాగేసి తనతో కలుపుకునేకి

భూమి పేనిన నీటి చుక్కల తాడులా వాన

బయటకు రానిచ్చేది కాదు

మట్టి మిద్దెలు గదా కొంపంతా నీళ్ళే

బొటుకు బొటుకు పడతాంటే సత్తు గిన్నెలు ఇంటినిండా పరిచి

బొటుకు బొటుకు పడతాంటే గిన్నెల్లో సంగీతం టప్ టప్ అని….

ఆడదానికి ఒకటే పని

అంత వాన

మట్టి నీళ్ళ చారికలు చారికలు

ఇళ్ళంతా తడిసిపోయి ఇంట్లో ఆడది విసుక్కునేంత వాన

భూమికి బొక్కలు పెట్టేకి ఆకాశం ఏసిన బాణాల్లెక్కన

వాన…..అంత వాన…

తూముల్లోంచి జోరున వాన నీళ్ళు

చించెరువు కట్టకాడ బాయికి పోయి

నీళ్ళు ఏంతెత్తావ్ లెమ్మని

ఇంటి తూము నీళ్ళు కడవలకెత్తుకుపోయే రోజులు

గోనె సంచి నెత్తినేసుకుని చేని కాడికి పోయి చూత్తే..

. వానకు నాని అప్పుడే తానమాడిన పడుచుపిల్ల మాదిరిగా ఉండేది భూమి

పచ్చగా సెట్లన్ని చిన్న గాలికి ఊగుతాంటే తడిసిపోయి

జోలెలో పడుకొని నవ్వుకునే సంటోడి లెక్కన ఉండేది భూమి

వద్దంటే వాన

వాన వెలిసినంక నీటి సుక్కల్తో నిండిన అద్దం మాదిరిగ ఆకాశం

పసుపు పూసి నీళ్ళు పోసుకున్నట్లు పచ్చగా భూమి

యావైపు చూసిన పచ్చ పచ్చనే

పండు ముత్తైదువు అప్పుడు భూమి

ఎంతమందికి అన్నం పెట్టేది

ఎంతమందిని అక్కున చేర్చుకునేది

ఎంతమందిని ఓదార్చేది

అన్నపూర్ణమ్మ తల్లి అప్పుడు భూమి

పచ్చని చీర కట్టుకుని గాలికి రెపరెపలాడే పైట చెరగు

మాదిరిగా పైర్లు ఊగుతాంటే

చేనిగట్టు మీద కూకుని చూడబుద్దయ్యేది ఎంత సేపైన

ఇసుమంతైన ఇసుగేసేది కాదు

కంటికింపుగా ఉండేది

. ఊరికే కూకోక పోతే

వచ్చి పని చేయరాదు అంటూ

చేతులూపి పిలిచినట్లు ఊగే పైర్లు

గుంపులు కట్టి ఆడుకునే పిళ్ళోల్ల మాదిరి ఊగే పైర్లు

పిచ్చికలు, పక్షులు

తనని పట్టుకునేకి వస్తాంటే

తప్పిచ్చుకునే మాదిరి అటు ఇటు ఊగే పైర్లు

దోబూచులాడే పైర్లు

దాగుడుమూతలాడే పైర్లు

సేని గట్టున కూకుని చూత్తాంటే

ఎంతసెపైనా చూడబుద్దయ్యేది

ఇసుమంతైన ఇసుగేసేది కాదు

కంటికింపుగా ఉండేది…

. అప్పట్లో ఎంత పని!

చేతి నిండా పని

నాట్లు వేసేది మొదలుకుని కలుపు తీసే దాకా

కోతలు మొదలు కొని ఊర్పుల దంకా

తూర్పార పట్టే దాకా

పని.. పని.. పని…

కట్టం తెలీకుండా పనిలో పాటలు

పాటలే పాటలు.. ఎన్ని పాటలు

నవ్వుతూ పనిలో మునిగి కట్టం తెలీకుండా

పని.. పని.. పని..

. పురిటి నొప్పుల్తో విలవిలలాడే భూమి

పండిన పంట ఇంటి నిండా

గాదెలనిండా

పొంగుతున్న పాలగిన్నెల్లా నిండుగా

ఇంటినిండా బస్తాలు

నిడుగా ముస్తాబయ్యి ఉండే ఇండ్లు

ఏం బెంగలేకుండా

ఇంటి కాడ కట్ట మీద కూకుని

యేదాంతం మాట్లాడుకునేంత సుకం

కడుపునిండా ఇంత తిని, కంటినిండా ఇంత నిదర ….

. ఇదంతా కల అయిపాయే

బతుకు కలవరం అయి పాయే

సెబితే నమ్మవుగాని

-ఆ కలకలం లేదు

-ఆ నిండుదనం లేదు

-ఆ ఆనందం లేదు

యాడ సూసినా దరిద్రమే

నవ్వంటే యెట్లా ఉంటుందో మరిచిపోయి చాన్నాళ్ళయింది

ఇట్లా ఎందుకైందో నీ కేమైన తెలుసా కప్పలమ్మా !

నీకు పెళ్ళి సేత్తే వాన కురుత్తదని సెప్తే..

బిడ్డ పెండ్లి ఎట్లా చెయ్యలేనని

గుండెల కుంపటి ఆర్పలేనని

కట్టం కాడ గబుక్కున రాలిపోతానని

తెలుసుకొని

నీకు పెండ్లి సేత్తే వానా కురుత్తే

ఇంత ఎనకేసుకుని ఇంటికి మామిడాకులు కడదామనుకుని

ఆశతో నీకు పెండ్లి సేత్తే

ఆశ అంతకంతకూ పెరిగిపాయే

గాలి ఊదిన బుడగమాదిరి

ఆశ అంతకంతకూ పెరిగిపాయే

ఎంత సేపు బుడగ నిలుత్తాది

వాన సినుకు లేకపాయే

బిడ్డ పెండ్లి ఎట్లా సెయ్యలేను

నీ పెండ్లైనా చేసిన తృప్తి మిగిలింది..

నమ్మకాలే జీవితాన్ని వమ్ము సేత్తండాయి

నమ్మకం సాలెగూడు మాదిరి

దూరానికి అందంగా కనిపించి చిక్కించుకుంటుంది

వమ్మయిందో.. చిక్కి శల్యం సేస్తుంది

. అయ్యోరు బారతంలో విరాట పర్వం చదివితే

వానొత్తదంటే ఊరంతా కలిసి చందాలేసుకుని

బాపనయ్యతో మాట్లాడి

బారతం చదివిత్తే

వాన సినుకేమో గాని

బాపనయ్య సంబరాలకు అప్పులో అప్పు పెరిగిపాయే

పూజలో కర్పూరంలా కాలం కరిగిపాయే గాని

వాన మాత్రం రాక పాయే

బారత బాగోతాలకు కాలం సెల్లిపోయే రోజులు

ఇలువల్లేని రోజులు,

దరమం కుంటుతాంటే వానలొత్తాయా

అంతా బ్రమ

మంత్రాలకు సింతకాయలు రాల్తాయేమో గాని

మబ్బు రాతిగుండె మాత్రం కన్నీళ్ళు కార్చదు…

. గంగమ్మ కనికరిత్తది జాతర సేస్తే అని

అయిన కాడికి

బందువులందరిని పిలిచి ఇంటినిండుగా సంబరం….

ఊరుఊరంతా సంబరం..

అమ్మతల్లికి కోటి దండాలు

తప్పెట్లు తాళాలు

తందనాలు, ఊరేగింపులు

నూటొక్క బిందెల నీళ్ళు గుమ్మరించి

గంగమ్మకు తానం పోత్తె….

దున్నలు, జీవాలు, కోళ్ళు

బలిచ్చి రగత దాహం తీర్చినా

మాదాహం తీరక పాయే

బాయి ఎండిపాయే

వాన సినుకు లేకపాయే

శివుని కొప్పులో గంగమ్మ కులుకుతానే ఉండాది..

రకతంతో భూమి యెర్ర బారింది కాదాని

ఇన్ని నీళ్ళు కొట్టి భూమిని కడుగుదామని

ఆకాశానికి ఆలోచన రాదు.

భూమి వాడిపోయి పగుల్లు పోతానే ఉంది..

మా గొంతులు ఎండుతానే ఉండాయి

దప్పిక నోళ్ళు తెరిచినట్టు పగుల్లు పోయిన భూమి

నాలుక యెండి పోతాంటే బయటికి సాపి..

-నీళ్ళ కోసం తపించే భూమి

-తడి కోసం తపించే భూమి

-ఒక్క సుక్క నీటి బొట్టుకు ముకం వాచి పోయిన భూమి

-గొంతెండిపోతాంటే

గుక్కెడు నీళ్ళు పొయ్యలేని

నీ బతుకు ఓ బతుకేనా

అని నిలదీసి అడిగే భూమి!

-గట్టు మీద కూకొనేకి మనసొప్పక

దూరంగా నిలబడి సూత్తాంటే

ముండమోపి లాగా ఎండిపోయిన భూమి!

-సూడ బుద్ది కాక తలపక్కకు తిప్పుకుంటే

యేరు దాటింతరువాత తెప్ప తగలేసే రకమని

అనుకుంటాదేమోనని బెంగ

యెండిపోయి కండలేక జీవం పోయి

గుండెనిండుగా బాదతో

బరువుగా తలవంచుకున్నట్టున్న భూమి!

సూడబుద్దేయ్యక తలపక్కకు తిప్పుదామంటే

మనసొప్పదు గదా!

. వానల్లేకపోతే పాయే

భూమిలో నీళ్ళు యెలికి తీత్తామని

నీటికోసం జూదం..

అయ్యోరు వాస్తు చూసి ఈడ తవ్వుకోమంటే

నూరడుగులు అమ్మ గుండెలో లోతుగా గునపాలు

బోరు బాయికి…

అడుగు అడుక్కి తవ్వుతాంటే

తల్లి రొమ్ము గుద్దుతాండావని

భూమి బాద పడతాదేమోనని బెంగ

తల తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముతో

నూరు అడుగులు తవ్వినా..

ఇన్నూరు అడుగులు తవ్వినా…

అడుగు అడుక్కి ఉన్న ఆశ పోయింది

నీళ్ళు ముకానికి చిమ్ముతాయనుకుంటే

సెమట తుడిచి ఇంత సల్లదనం కురిపిత్తాయనుకుంటే

సివరికి ఇంత పెద్ద బండ

గుండె గుబేలు మనేలా

నెత్తిన ఇంత పెద్ద బండ

చెంప చెళ్ళుమనిపించింది

వాస్తూ లేదు అయ్యోరు లేడు…

ఇదేందయ్యో అని అడిగితే

నీ పేరు మీద బలం లేదని మళ్ళ బుకాయింపు

యాడికని నమ్మేది..

మడుసుల్ని నమ్మేకంటే మాను న్నమ్మేది మేలని

ఊరికే అన్నారా ..!

నమ్మ బలికినోడు నట్టేట ముంచేత్తాంటే

బతుకునిచ్చే తల్లి రొమ్ము ఎండిపోతాంటే

ఎవర్నేమని లాబం

భూమినండా బోరు బాయిలే, నీళ్ళు లేని బోరు బాయిలే!

ఈడ పడతాది తవ్వు

అదిగో ఆడపడతాది తవ్వు

ఇంకొంచెం ముందు పడతాది తవ్వు

ఆశ…ఆశ… మినుకుమినుకుమనే ఆశ…

జూదం…ఆశ..

ఆశ..జూదం…

. మళ్ళీ మట్టి వాసన

గమనించావా కప్పలమ్మా

ఆశ.. పైనుండి ఓ చినుకు

మళ్ళీ ఓ చినుకు

తేనే తుట్టెలోంచి తేనె బొట్టులా

ఒక్కో చినుకు

వరుసగ చినుకులు, చినుకులు, చినుకులు

వాన…వానా… ఆశ…

. అరువుకు తెచ్చిన విత్తనాలు

భూమి తల్లికి గోరు ముద్దల్లా అందించి

పంట కోసం యెదురు చూస్తూ

ఆశగా.. ఆశగా…

ఆకాశం కనికరించినా

అవకాశం కలిసిరావద్దు…

కల్తీ విత్తనాలు, కల్తీ యెరువులు…

ఒక్కసారిగా మనసు కుదేలుమంది

గుండె గుబేలుమంది…

భూమికి పచ్చ చీర కప్పుదామనుకున్న ఆశ….

నిరాశ అయితే ఒక్కసారిగా జీవితం కూలిపోతుంది..

మనిషి కల్తీ, మనసు కల్తీ, బతుకు కల్తీ…

మనిషే ప్రకృతిని పొట్టన పెట్టుకుని

భస్మాసుర హస్తం ….

తన నెత్తి మీద తానే నిప్పు పెట్టుకుంటూ…

యెదుటి వాడి గుండెల్లో గునపాలు కుచ్చుతూ

బతుకంతా ఇంతే…

కొన ఊపిరి ఆగిపోతూ

ఇప్పటికి చాలు…

గాలిలో కలిసిపోయి,

ఇప్పటికి చాలు…

మళ్ళి పుడతాను,

సినుకై మళ్ళి పుట్టి భూమికి పచ్చచీర కప్పుతాను…

————-

స్వరూప్ కృష్ణమూర్తి

డా. జోగధేను స్వరూప్ కృష్ణ, ఎం.ఏ., ఎం.ఫిల్, పి.హెచ్.డి, కడప జిల్లా ప్రొద్దటూరు లోని ఎస్. సి. ఎన్. ఆర్. కళాశాలలో తెలుగు శాఖలో రీడర్ గా పని చేస్తున్నారు. ఇప్పుడో నది కావాలి ( కవిత సంపుటి), Intangible cultural heritage of folk arts of Rayalaseema లను ప్రచురించారు. వీరి స్వంత వెబ్ సైటు – http://renatisuryachandrulu.com. 24fps.co.in లో కూడా రాస్తూంటారు. సుజనరంజనిలో కళా జానపదం శీర్షికను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రసంగాలు, తెవికీలో రాయడం, కవితలు రాయడం వీరి ఇతర వ్యాసంగాలు.

——————

గమనిక: పేజీలో పైన ప్రచురించిన తెలుగురైతు ఫోటోను వరల్డ్‌ప్రౌట్అసెంబ్లీ.కామ్ (http://www.worldproutassembly.org/) నుండి తీసుకున్నాం.

Posted in కవిత్వం | 11 Comments