మా సాకలైవోరులు

-ఆదినారాయణరెడ్డి

ఏ కొంచమైనా విజ్ఞాన సంపద ఇప్పుడు మాకుందంటే దానికంతా మూలం తమ ఆశీర్వాద హస్తంతో మాకు విద్యాభ్యాసం ఆరంభించిన మా సాకలైవోరు(లు). వాళ్లకు మేమెప్పటికీ కృతజ్ఞులమే.

సుట్టిల్లు, సైక, దక్షిణం పక్క కొంత బిడువు జాగా, దీని రక్షణకు పారి గోడ – ఇదీ మాసాకలైవోరి గృహ ప్రాంగణం. మా పల్లెలో చాలా ఇళ్ళన్నీ ఇంతే. మాకు కూడా ఓ బోడిమిద్దె, రెండు సైకలు, రెండు పశువుల కొట్టాలు ఉండేవి.

మా సాకలైవోరి సుట్టింట్లో రెండు వాడలు, రెండు కుండల దొంతులు, రెండు నీళ్ళ కడవలు, నాలుగు మూకట్లు, రెండు ముంతలూ, పొంతబాన, కొన్ని బోకులు, సంగటిసట్టి, కూరబొప్పి, తెడుగట్టె, గుత్తికట్టె. చూరులో దూర్చిన (చొప్పించిన) సూరకత్తి, వాడల సందున భద్రంగా దాపెట్టిన ఒక కొడవలీ, ఇంకా భద్రంగా పాతగుడ్డలోచుట్టి దాపెట్టిన ఒక యాట కొడవలీ (ఇది తమ రైతులు దేవర్లకు మొక్కుకున్న మొక్కుబడి కింద పొట్టేండ్లనో, మేకపోతులనో, దున్నపోతులనో తలలు నరకటానికి ఉపయోగిస్తారు), పైన వాసానికి వేలాడదీసిన ఒక కుందేటి వల, పొయ్యిగడ్డ మీద ఒక బుడ్డీ, చిన్న దండెం, సైకలో – సౌడు బోసుకోవడానికి మట్టితో కట్టిన సుమారైన గాదె, అందులోనే పల్లెలనుండి తెచ్చిన మైల గుడ్డల మూటలు, గాదెనానుకొని ఎత్తుటరుగు, మిగిలిన స్థలమంతా తోకపిరికెడు మందాన పరచిన శుభ్రమైన ఇసుక. ఇదీ మా సాకలైవోరు ఇల్లు. ఆ పరచిన ఇసుకలో మాబడి.

తరగతుల విభజనలేదు. ఐవోరు ఉత్తరదిక్కు గోడకానుకొని దక్షిణదిక్కుకు మల్లుకోని కూర్చుండేవాడు. గోడకానుకొని ఓనమాల వాళ్ళు ఐవోరికి శానా దగ్గరగా. వాళ్ళ పక్కన కాదీర్గాలు, కావత్తులవాళ్ళు తూర్పువైపుకు, పద్యాలు,అమరం-గజేంద్రమోక్షం, ఉత్తర రామాయణం సదువుకొనేవాళ్ళు పడమర వైపు తిరిగి ఎదురెదురుగా కూర్చుంటే వీళ్లమధ్యలో ఐవోరు. ఐవోరికి ప్రత్యేకంగా కుర్చీలాంటిది యేమీలేదు. పిల్లోళ్ళతోపాటు ఇసకమీదనే కూచునేవాడు.

అక్షరాభ్యాసం ఇసుకలో ఓనమాలతో ప్రారంభం. ఐవోరు తాను ఇసుక మీద ‘ఒ’ రాసి, రెండుచేతులూ జోడించి దానిని చూపిస్తూ పిల్లోడు లేక పిల్ల చేత ఆ అక్షరాన్ని ‘ఒ’ అంటూ గట్టిగా తాను పలికి పలికించే వాడు. తర్వాత ఆ శిశువు వేలును తనచేతితో పట్టుకొని గట్టిగా పలుకుతూ పలికిస్తూ దిద్దించే వాడు.అలా అరుస్తూ దిద్దుకుంటూ కొండరు పిల్లలు అలాగే నిద్రబోయేవారు. బట్ట గానీ ఈతచాప గానీ అరుగుమీద పరిచి ఆబిడ్డను ఐవోరు పడుకో బెట్టేవాడు. ఆదారిన ఎవ్వరైనా వెళుతూంటే ఆ బిడ్డ తాలూకు ఇంటివాళ్ళకు చెప్పి పంపే వాడు. సాయత్రం తాము నేర్చుకున్న అక్షరాన్ని (అక్షరాలను) పిల్లలు రాసి రెండు చేతులూ జోడించి వొంగి చూపిస్తూ గట్టిగా పలుకుతూ అప్పజెప్పాల. కాదీర్ఘాల వరకు కూడా ఇసుకలోనే. తర్వాత పలకా బలపం. అవి కొనిచ్చే స్తోమతు లేని తల్లిదండ్రులు కూడా మాపల్లెలో ఉండే వారు. “అట్టే ఇస్కెలోనేరాపీ ఐవోరా” అనేవారు. “ఈసారి సంత గొదికీ తెచ్చాలే” అంటారు. సంతలేమో గడిచిపోతూ ఉంటాయి గానీ పలకా బలపం మాత్రం కొనలేరు. కొంతమంది సంపాదించింది కల్లుకు ధారవోసి కొనరు. అప్పుడు పిల్లల అమ్మగారు మొగునికి తెలీకుండా కొంత దాచిపెట్టుకొని తెచ్చిచ్చేవారు.

కాదీర్గాలు-కావత్తులు అయినతర్వాత ‘యెంతదయో దాసులపై’, ‘ఓయమ్మ నీకుమారుడు’ వంటి చిన్నచిన్న పద్యాలు, తర్వాత అమరం, గజేంద్ర మోక్షం, ఉత్తరరామాయణం చెప్పించే వాడు. అన్నమ్యాలప్పుడు (ఉదయం 9:30-10 మధ్య) పిల్లలందరినీ ఇళ్ళకు పొమ్మని తాను సాకిరేవుకుపోయి, ఇంటివాళ్ళు పల్లెలనుండి తెచ్చిన మైల బట్టలు కొన్ని ఉతికి, వారు పల్లెల్నుంచి పెట్టించుకొచ్చిన సంగటి తిని, మళ్ళీ మద్యాన్నం గాకముందే (11-30లోగా) బడికొచ్చేసేవాడు.

ఒకనాడు ఒకతను వచ్చి ఐవోరితో చెప్పిన మాట: “ఐవోరా ఐవోరా! మావోనికి నేను ఊలేసేదీ–కన్నుగొట్టేదీ– నేరిపిచ్చినా గానీ నువ్వు ‘జొన్న చేనుకాడ సొగసుకత్తెను జూసి’ పజ్జెం నేర్పిచ్చు”.

కొందరు పిల్లలు తమ జతలోనివారు గజేంద్రమోక్షం ఉత్తరరామాయణం స్థాయికెదిగినాగానీ తామేమో కావత్తులదగ్గరే వుండేవారు. వారి తల్లిదండ్రు లు “మావోణ్ణి బాగాకొట్టు ఐవోరా! నువ్వు కొట్టకనే మావోనికి సదువురాలా! మాయైవోరు మమ్మల్నెట్ట గొట్టేవోడనీ! అట్టగొడితేనేగదా సదువొచ్చేది?” అని ఐవోరికి ఉచిత సలహా లిచ్చేవారు.దెబ్బలు తినడంలో అప్పటికే రాటుదేలిన వారైనా ఆ పిల్లలు వాళ్ళ నాయననిచ్చిన సలహాతో యాడ మల్లా ఐవోరు సావగొడతాడో నని భయంతో బిక్కుబిక్కు మంటూ అందరివైపూ బెదురు చూపులు చూసేవారు. ఐవోరు కులస్తులు కొందరు వరసైనవారు బడికి వచ్చి తమపిల్లలకు ఏమి నేర్పించాలో ఐవోరికి చెప్పేవారు. ఒకనాడు ఒకతను వచ్చి ఐవోరితో చెప్పిన మాట: “ఐవోరా ఐవోరా!మావోనికి నేను ఊలేసేదీ–కన్నుగొట్టేదీ– నేరిపిచ్చినా గానీ నువ్వు ‘జొన్న చేనుకాడ సొగసుకత్తెను జూసి’ పజ్జెం నేర్పిచ్చు”.

సాయంత్రం నాలుగు బారల పొద్దుందనంగా ఒక్కొక్కరినీ ఆపొద్దు నేర్చు కున్నిందంతా అప్పగించమనే వాడు. ఇసుకలో అక్షరాలు నేర్చుకున్న పిల్లలు ఐవోరు రాసిచ్చిందంతా చెరిపేసి, ఐవోరు ముందు రాసి, రెండుచేతులూ జోడించి అక్షరాలను చూపిస్తూ గట్టిగా చెబుతూ అప్పగించేవారు. కాదీర్గాలూ, కావత్తులు అన్నీ అప్పగించుకొనేవాడు. తర్వాత పద్యాలు నేర్చుకున్న పిల్లలు గట్టిగా ఒక్కొక్క పాదమూ అప్పగిస్తూ వుంటే మిగిలిన చిన్నా పెద్దా పిల్లలందరు కూడా సత్తువకొద్దీ పలకాల. ఈపనంతా రెండుబారల పొద్దుందనంగా ఐపోతుంది. తర్వాత పాటలు పాడే వాళ్ళు ఎవరైనావుంటే పాడేవారు. మిగిలినవాళ్ళు పలికేవారు. మళ్ళ కొంతసేపు ఏవో ఆటలాడుకొన్నతర్వాత ఇండ్లకు పొమ్మనేవాడు.

ఉదయాన్నే ముందుగా వచ్చిన వారికి “శ్రీ” అనీ రెండవ వారికి “చుక్క” అనీ వ్రాసుకుంటారు. ఆ తర్వాత వచ్చే సంఖ్యను బట్టి ఒకటి రెండు వరుసగా వేసు కుంటూ పక్కన వారివారి పేర్లను వ్రాసుకుంటూ పోయే వారు. “శ్రీ-,చుక్క”వారికి దెబ్బలు పడవు. తక్కినవారికి సంఖ్యను బట్టి ఈత బెత్తంతో అన్ని దెబ్బలు వారి అర చేతిమీద సున్నితంగా కొట్టేవాడు ఐవోరు. ఆయన బడిలోకొచ్చిన తర్వాత వచ్చిన వారికి మరీ ఆలస్యంకింద పరిగణించి కొంచెం గట్టిగానే కొట్టేవాడు. చదువులో మొద్దుగా వుండేవారికైతే ఈశిక్షలు మరి కొంత ఎక్కువగానే వుండేవి. మరీ ఆలస్యంగా వచ్చే పిల్లలు ఐవోరు చేత దెబ్బలు తప్పించుకోవడానికీ, కనీసం తగ్గించుకోడానికి వారిపెద్దలను వెంట పిల్చకచ్చుకొనేవారు. ముఖ్యంగా అవ్వ, తాతలే ఎక్కువగా వచ్చి “ఐవోరా మావానికి కడుపు నొప్పిగా వున్నింద”నో “సద్దైపోయింటే ఉడుకు జేసిపెట్టేటప్పటికి రోంత పొద్దెక్కింది కొట్టగా కైవోరా ఐవోరా” అని ప్రాధేయపడేవారు. ఈశిక్షలు అన్నమ్యాలప్పుడు అన్నానికి వదిలేటప్పుడు అమలు జరుగేవి.

ఇంతకీ ఐవోరికిచ్చే జీతం నెలకు — ఓనమాల వాళ్ళు బొట్టూ, కాదీర్గాలూ కావత్తుల వాళ్ళు అర్ధణా, పాఠము, పద్యాలవాళ్ళు అణా, గజేంద్రమోక్షమూ ఉత్తర రామాయణము వాళ్ళు అడ్డగ. కొందరైతే “సరేపో ఐవోరా నీజీతానికొచ్చింది తిప్పలు. నిన్నట్నించి పొయ్యిలో పిల్లి లెయ్యల్యా. నువ్వేయేమైనా వుంటే యీ” అనేవాళ్ళు. ఇచ్చినా యీకున్నా పిల్లల్ని బడికి రావద్దని గానీ, ఎండలో నిలబెట్టడం గానీ చేసేవాడు గాదు. చదువు చెప్పడంలో ఏమాత్రమూ నాణ్యత తగ్గించేవాడు కాదు.

ఆట విడుపు రోజులలో (పున్నానికీ-అమావాస్యకీ) ఆటిడుపు పద్యం ఒకటి ఆ స్థాయి పిల్లలకు రాసిచ్చే వాడు. వారు దానిని రాత్రికి నేర్చుకొని మరునాడు అప్పజెప్పాల. ఐతే రాసిచ్చిన వెంటనే వారు గట్టిగా చదవడం మొదలు బెట్టే వారు. వీలైనంతవరకూ అప్పటికప్పుడే నేర్చేసుకొనేవారు. ఆటవిడుపు రోజు ఈడిగపల్లె పిల్లలు కొందరు ఇంటిలోని వేట కుక్కలను తీసుకొచ్చేవారు. ఆపిల్లలూ ఐవోరూ కలసి వేటకువెళ్ళేవారు. ఉడుములు, ఎంటవలు, ముంగిసలూ, ఉడతలూ వీలైతే కుందేళ్ళనూ వేటాడేవారు.

నేను ఆ బడిలో అచ్చులైనా పూర్తిగా నేరుకున్నానో లేదో నాకు సరిగా గుర్తు లేదు. తర్వాత నన్ను వీరబల్లె పేటకు ఎలిమెంటరీ స్కూలుకు పంపించినారు మాపెద్దలు. నా జీవితంలో అసంఖ్యాకంగా మానసిక ఒడిదుడుకులు, అనారోగ్యాలూ, కొన్ని సార్లు కోమా లోకి పోవడాలు జరిగినాయి. టీ బీ మెనంజిటీస్ అని ఒకజబ్బు వచ్చి మెదడు పైపొర కొద్దిగా తినేసిందని డాక్టర్లు చెప్పినారు. దానివలన చాలా జ్ఞాపకాలు లేకుండాపోయినాయి. కానీ నేను మా సాకలైవోరు బడిలో పలికి నేర్చుకున్న పద్యాలు ఇప్పటికీ అక్షరంకూడా పొల్లుపోకుండా గుర్తున్నాయి. ఉదాహరణకు ‘యెంతదయో దాసులపై’, ‘బంగారు పూలదుప్పటి’, ‘ధగధగ మెరయు కిరీటము’, ‘ఓయమ్మ నీకుమారుడు’, ‘జొన్న చేను కాడ’ వంటి చిన్నచిన్న పద్యాలే గాకుండా ఒక పెద్ద పద్యం

పటుతర వార్ధి దాటి బహు భంగుల సీతను గానలేక నే
దిటముగ రావణాసురుని దివ్య వనంబున చూస్తి రాఘవా
కటకట యేమి తెల్పుదును కాంత యవస్థలు చిత్తగింపుడీ
చిటికెన వ్రేలి యుంగరము సీతకు కంకణమాయె భూవరా!

కూడా నాకు జ్ఞాపకముంది. ఇది ఏ రామాయణం లోదో ఎవ్వరు రాశారో మాత్రం ఇంతవరకూ తెలియదు. చిన్నపిల్లలు కొత్త సంగతి యేదైనా నేర్చుకోవడానికి మా సాకలైవోరి బళ్లో వుండినటువంటి సానుకూల వాతావరణం ఒక ముఖ్యావసరమనుకుంటాను.

అసంఖ్యాకమైన కారణాలతో నాచదువు పాడైపోయింది. ఎన్నో వడిదుడుకుల అనంతరం వైవాహిక జీవితం – పిల్లలు కలగడం జరిగింది. వాళ్లు ఓనమాలు దిద్దడం కూడా సాకలైవోర్ల చేతులమీదుగానే జరిగింది. ఏ కొంచమైనా విజ్ఞాన సంపద ఇప్పుడు మాకుందంటే దానికంతా మూలం తన ఆశీర్వాద హస్తంతో మాకు విద్యాభ్యాసం ఆరంభించిన మా సాకలైవోరు(లు). వాళ్లకు మేమెప్పటికీ కృతజ్ఞులమే.

————

కొన్ని పదాల వివరణలు:

  • సైక: రెండంకణాల కొట్టం
  • పారి: ప్రహరి
  • వాడలు: కొన్నిచోట్ల వీటిని కాగులు అని అంటారు
  • పొంతబాన: పొయ్యి గడ్డకు యడం పక్కన ఇది ఉంటుంది. దీని నిండుగా నీళ్ళుంటాయి. దీనికీ మరో గడ్డకు మధ్యన కుండ పెట్టి వండు కుంటారు. వంటతోపాటు ఈ బానలో నీళ్ళు కూడా వేడెక్కుతాయి.
  • బోకులు: పాత్రలు
  • సంగటిసట్టి: కుండ
  • కూరబొప్పి: కూర వండుకునే మట్టిపాత్ర
  • తెడుగట్టె: సంగటి కెలుక్కొనే తాడికర్ర
  • గుత్తికట్టె: పుల్లగూర రుద్దుకొనేందుకు… నాగరీకులు దీనిని పప్పుగుత్తి అని అంటారు
  • బుడ్డీ: కిరసనాయిలు దీపం
  • అడ్డగ: రెండణాలు-రూపాయిలో 8వ వంతు

——

ఆదినారాయణరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి రైతు. పీ.యూ.సీ వరకూ చదువుకున్నారు. పాఠశాల విద్యకు అంతటితో స్వస్తి చెప్పవలసి వచ్చినా సామాన్యశాస్త్రం, చరిత్ర, ఆధ్యాత్మికాంశాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. తనకు చదువు నేర్పిన పంతులుగారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు!

Posted in వ్యాసం | Tagged , | 9 Comments

మార్చి పోస్టుల మార్చిపాస్టు

– చదువరి

కవిసార్వభౌముడు శ్రీనాథుడు స్వర్గానికొస్తున్నాడని తెలిసి బృహస్పతి గుండె గుభేలుమందట -“దివిజ కవివరు గుండియలు డిగ్గురుమన్నవట“. అటువంటి నివాళి నేడు శోభన్‌బాబుకూ దక్కింది -విహారి రాసారు: సోగ్గాడు శోభన్‌బాబు స్వర్గానికొస్తున్నాడని ఇంద్రుడికి బెంగ పట్టుకుందట. భేష్!

మన మిమిక్రీ వీరులకు ఎన్టీయార్, ఏయెన్నార్, కృష్ణ, శోభన్‌బాబుల గొంతులు అభిమాన వస్తువులు. కురుక్షేత్రం సినిమాలో శోభన్‌బాబు కృష్ణుడిగానూ, కృష్ణ అర్జునుడిగానూ నటించారు. ఆ సినిమా వచ్చిన కొత్తలో మిమిక్రీ కార్యక్రమాల్లో శోభన్ కృష్ణుడు ఓ ఆకర్షణ. “అర్జునా, అర్జునా, అర్జునా! చంపేదెవరు చచ్చేదెవరు..? వేసెయ్ బాణం, తీసెయ్ ప్రాణం” అంటూ శోభన కృష్ణుణ్ణి అనుకరించేవారు. (ముమ్మారు సంబోధించటం శోభనునికి అలవాటని తెలిసిందే కదా!) ఇకపై మిమిక్రీల్లో ఎస్వీయార్, ఎన్టీయార్ వంటి దిగ్దంతులతో పాటు శోభన్ బాబు కూడా స్వర్గం నుండి పాల్గొంటాడు.

తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం, జ్యోతి కూడా నటభూషణుడికి తమ నివాళి ఘటించారు.

—————-

తెలుగు బ్లాగులు రెండో దశ విస్తరణలో ఉన్నట్టున్నాయి. ఇప్పటి వరకు కూడలి, జల్లెడ, తేనేగూడు, తెలుగుబ్లాగర్స్ వంటి వాటికే పరిమితమైన బ్లాగు కూడళ్ళు, ఇప్పుడు విస్తరిస్తున్నాయి. oneindia.com, blagkut, వెబ్ దునియా వంటి ఇతర చోట్ల నుండి కూడా బ్లాగులు వస్తున్నాయి, బ్లాగులను సంగ్రహించడమూ జరుగుతోంది. తెలుగు బ్లాగులు నిదానంగా తరువాతి స్థాయికి చేరే సూచనలివి.

ఈ విషయమై గత eతెలుగు సమావేశంలో ఒక చర్చ కూడా జరిగింది. బ్లాగు అనగానేమి అనే చర్చలో ఉపచర్చగా ఇది జరిగింది. బ్లాగుల్లో రాసే విశేషాలు మరింత స్థానికంగా, బ్లాగరి నిజ జీవితానికి మరింత దగ్గరగా, మరింత వాస్తవికంగా ఉండాలని అన్నారు. బ్లాగు పాఠకులు వాడుకోగలిగే అంశాలకు ప్రాముఖ్యత నివ్వాలని పెద్దలన్నారు.

జల్లెడ వారు బ్లాగుల జల్లింపు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తూ కొత్త విశేషాలు తీసుకొచ్చారు. మనక్కావలసిన జాబులను ఆర్టీయెస్సులో కూడా చూసుకోగలిగే ఏర్పాటు, జాబులకు రేటింగునిచ్చే ఏర్పాటు వీటిలో ఉన్నాయి.

దీనికి తగ్గట్టే బ్లాగుల రేటింగుల గురించి, డిగ్గటం గురించి విహారి, దీప్తిధారలో, జ్యోతిలో జాబులొచ్చాయి.

————

ఇక కూడళ్ళ లోంచి, బ్లాగుల్లోంచి, జాబుల్లోకి వెళ్దాం.

కొత్తపాళీ ఒక చిన్న ఇతివృత్తాన్ని ఇచ్చి బ్లాగరుల్లో మంచి కథన కుతూహలం కలిగించారు. ఈ ఆహ్వానాన్ని కాదనలేక కాలుదువ్వి బరిలో దూకిన ప్రముఖులెవరెవరో చూడండి. ఈ పోటీలో బహుమతి సాధించిన రమ్యకు మా అభినందనలు.

బ్లాగుల్లో ప్రాక్టికల్ జోకు లాంటిది ఒకటి ఈ నెల నమోదయింది. అదో మూడు జాబుల శృంఖల. నెటిజెన్ స్పీక్ లో వచ్చిన ఈ గొలుసులో చివరిది ఇది.

శివరాత్రి సందర్భంగా:
శివరాత్రి సందర్భంగా రెండు పద్యాల జాబులొచ్చాయి.

సాక్షి పత్రికపై
సాక్షి పత్రిక ఈ నెలే వెలువడింది.బ్లాగరులు దీనిపై విశ్లేషణలు వ్యాఖ్యానాలూ రాసారు. ఇప్పటివరకూ వచ్చిన జాబులన్నీ కూడా ఈ అంశాన్ని పైపైన స్పృశించినవే; కూలంకషమైన విశ్లేషణ ఇంకా రాలేదు. త్వరలో వస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి ఈ అంశంపై వచ్చిన జాబులివీ:

సాధారణ అంశాలు:

రాజకీయాలు:
ఈ నెల రాజకీయ జాబుల్లో తెలంగాణ అంశం వెలుగులో ఉంది. జాబులూ, వాటిపై వ్యాఖ్యలు కూడా వాడిగా, వేడిగా ఉన్నాయి.


భాష, సాహిత్యం:


సాంకేతికం:

హాస్యం:

కొవ్వలి సత్యసాయి ప్రవేశపెట్టిన తెలుగు జేసింది” మా ఈనెల బ్లాగు మాట!

కొత్త బ్లాగులు:

  • సుజాత మనసులో మాట చెబుతున్నారు. పుస్తకాల పట్ల ఆమెకు గల ప్రేమను తెలిసికొనేందుకు ఈ బ్లాగులోని మొదటి జాబు చదవండి.
  • సాహితీ ఝరి చూసారా? పద్యాలు, వచన కవిత్వం, సమస్యా పూరణం.. వెరసి రాఘవేంద్రశర్మ సాహితీఝరి. ఈ బ్లాగు పాతదే.. పొద్దుకు ఇది కొత్త!
  • Srisuja: (http://gunturmirchi-srisuja.blogspot.com/): గతంలో పాత్రికేయ వృత్తిలో ఉన్న గృహిణి రాస్తున్న బ్లాగు ఇది. చమత్కార ధోరణిలో, చక్కగా ఉంది.
  • రామ, శాంతి కలిసి రాస్తున్న బ్లాగు రామ-శాంతి. వారు రాసిన జాబుల్లో మా బడి రేడియో అనే జాబు మా ఎంపిక. హిట్ కౌంటరులోని హిట్లను చమత్కారంగా ఘాతాలు అని పిలుస్తున్నారు.
  • “మా అమ్మ నాకే కాక నాబ్లాగుకి కూడా పేరెట్టింది” అని పరిచయం చేసుకుంటూ శ్రావ్య వరాళి బ్లాగులోకంలోకి అడుగుపెట్టింది. eతెలుగు మీటింగేమంత బాగా జరగలేదనీ చెప్పింది. పెద్దలు గంభీరంగా ఆశీః వచనాలు చదివినా.., ప్రస్తుతం ఆ బుడత ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు – మీటింగు ఎలా జరపాలో తెలిసికొనేందుకు!


ఈనెల బ్లాగు:
వారణాసి వెంకట రమణ రాస్తున్న కబుర్లూ-కాకరకాయలూ మీరు చదివారా? నవ్వించేలా హాస్యం రాయగల బ్లాగరుల జాబితాలోకి రమణ చేరిపోయారు. ఎప్పుడో 2007 సెప్టెంబరు నుండి రాస్తున్నారు. ఆయన రాసిన డైసీలూ, ఇంపలూ ఆ బ్లాగులోని గొప్ప జాబుల్లో ఒకటి. alimony అనే మాటకు అర్థం ఆయన బ్లాగు చదివాకే తెలిసింది. అది కాదు విశేషం.. నేను ఓ ప్పది సంవత్సరాలపాటు ఆ మాట వాడకపోయినా, పదకోండో యేట దానర్థం అడిగితే ఠక్కున చెప్పెయ్యగలను. అది చదివిన వారెవరైనా చెప్పగలరు. చూడండి!

ఈనెల జాబులు:

  1. సాంకేతికులు, అసాంకేతికులను మనమెరుగుదుము. కానీ నసాంకేతికులు కూడా ఉంటారని నిడదవోలు మాలతి చెబుతున్నారు. ఆమె రాసిన “నసాంకేతికాలు” ఈ నెల జాబుల్లో ఒకటి.
  2. తిథులు, నక్షత్రాలు, రాశులు మొదలైన వాటి గురించి వినని భారతీయులుండరు. కానీ వాటి గురించి తెలిసిన వారు, అవెలా ఏర్పడతాయో తెలిసిన వారు మాత్రం అరుదు. ఈ విషయమై నాగమురళి రాసిన ఈ జాబు చాలా విశేషాలు చెబుతుంది. మా ఈనెల జాబుల్లో ఇదొకటి.
Posted in జాలవీక్షణం | Tagged , , | 5 Comments

కలంకలల ఘలం ఘలలు

కలంకలలు

“ఈ బ్లాగు చూసారా” అంటూ కొన్ని నెలల క్రితం ఓ స్నేహితుడు వేగు పంపారు. “లేదు, మీరు చెప్పారుగా, చూస్తా” అని అలవాటైన సందేశాన్ని అలవోకగా వేళ్ళు సన్నాయి నొక్కులు మీటటమూ, కనిపించిన లింకునల్లా మొక్కుబడిగా నొక్కడానికే పుట్టిన మూషికరాజం కలంకలలు అన్న లింకుని తెరవటమూ ఉత్తరక్షణంలో సమాంతరంగా జరిగిపోయాయి. కళ్ళు రెండూ బ్లాగుని, బ్లాగు రూపు రేఖలని తమలో ఇముడ్చుకొనే ప్రయత్నంలో ఉండగానే, “Impractically dreamy, Fantastically imaginative, Dangerously instinctive & Stubbornly reticent” అన్న స్వపరిచయాన్ని రుచి చూసిన పెదవులు కనీకనిపించకుండా విచ్చుకొని, “Redundantly repetitious అని కూడా చేరిస్తే పోలా” అని ఒకదానితో ఒకటి గుసగుసలాడుకొన్నట్టు లీలగా ఇప్పటికీ గుర్తు. కానీ …

ఎందుకనో భ్రుకుటి మాత్రం ముడిపడింది. ఆ వాక్యాన్ని నాలుగైదుసార్లు ముందునుంచీ వెనక్కీ, వెనకనుంచీ ముందుకీ పరిశీలించిన కళ్ళు రెండూ కుంచించుకొని, పాదరసంలా పరుగులు తీసే మెదడుని పట్టి లాక్కొచ్చి, ఆ వాక్యంపై బంధించటానికి తమ ప్రయత్నం తాము చేశాయి. కొన్ని క్షణాలపాటు అక్కడే గిరికీలు కొట్టిన మెదడు – “How beautiful!” అని తన నిర్ణయాన్ని పెదవులపైకి పంపింది. అంతకు ముందే స్వాతిశయాన్ని ప్రకటించిన పెదవులు రెండూ, సిగ్గుతో ముడుచుకోలేక చిర్నవ్వులు చిందించాయి.

తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి ఫణీంద్ర కుమార్. ఓ పది సంవత్సరాల తర్వాత మనమంతా – “ఓ ఆయనా – ఒకప్పుడు వారు మా తోటి బ్లాగరే” అనే రోజు తప్పకవస్తుంది. ఒక సుప్రసిద్ధుడైన రచయిత బ్లాగు మొదలెట్టటం కంటే, ఒక తోటి బ్లాగరు సుప్రసిధ్ధుడవటమే కదా కాంక్షించవలసింది?

సిందూరం రంగులో ఉన్న బ్లాగు మకుటం, ఏ భేషజమూలేని విషయసూచిక, చదువుకోటానికి వీలుగా తెరకి ఎడంపక్కనంతా, ఏ హంగులూ లేకుండా – కళ్ళకి ఏమాత్రమూ శ్రమలేకుండా చదువుకోగలిగే ఖతిపరిమాణం – ఇవన్నీ చూడగానే ఈ బ్లాగు ఏదో సీరియస్సు బ్లాగే అని తోచింది. “బయటపెట్టని రచన, అది ఎంత చిన్నదైనా, గుండెలమీద కుంపటిలాంటి ఇబ్బందిని కలగజేస్తుంది. ఇపుడు నాకో మాధ్యమం దొరికింది, కాబట్టి బయటకు సాగనంపేస్తున్నాను” అన్న వాక్యాలు చదవంగానే, ఈ బ్లాగు సామాన్యమైన బ్లాగు కాదని అర్థమయ్యింది. అప్పటి నుంచీ, కలంకలల బ్లాగారాధకులలో నేనూ ఒకణ్ణైపోయా.

ఈ మధ్య పొద్దు సంపాదకులు “కలంకలల బ్లాగుపై మీరో సమీక్ష రాసి పంపకూడదూ” అనడిగారు. “నా వల్లకాదు, ఆయన రాసే చాలా విషయాల గురించి నాకస్సలు అవగాహన లేదు, ఆయన తరచుగా ప్రస్తావించే కాఫ్కా, నబకోవ్ వంటివారి రచనలు నేనెప్పుడూ చదవలేదు, నాకు ఫిక్షను మీదంతాసక్తీ లేదు. కాబట్టి దుర్నిరీక్ష్యమైన ఆ బ్లాగుని నేను సమీక్షించలేను, కాని ఆ బ్లాగుపై నాకు గల అభిరుచిని ఆచితూచే ప్రయత్నం మాత్రం చెయ్యగలను” అని విన్నవించుకున్నాను. “ప్రొసీడైపోండి” అన్నారు పొద్దు చోదకులు.

కావున, ప్రియమైన పాఠకులారా – కలంకలలపై ఇదంతా “నాగొడవ” మాత్రమే సుమా!

****

హైదరాబాదులో, ఒక ఎడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఫణీంద్రకుమార్‌ గారు రాస్తున్న కలంకలలు బ్లాగు నిజంగానే మెదడుకి మేత. ఈ బ్లాగులో ఉన్న సాహిత్య వ్యాసాలనీ, కథలనీ, కవితలనీ, పుస్తక పరిచయాలనీ, అనువాదాలనీ ఒకటికి మూడు సార్లు చదవాలి. ఒకటోసారి – ఆ టపాలోని శైలి విన్యాసాలని ఆస్వాదించడానికి, రెండోసారి ఆ వ్యాసంలోగాని, కథలోగాని విషయాన్ని ఆకళింపు చేసుకోటానికి, మూడోసారి ఆ రచనలోని లోయలూ, గుట్టలూ, శిఖరాలు అధిరోహించుకుంటూ ప్రయాణం చేసి, దాని శిఖరాగ్రాన ఒంటరిగా, ధైర్యంగా, సాలోచనగా ప్రపంచాన్ని పరికిస్తున్న ఒక సౌందర్యారాధకుడిని కలుసుకోవటానికి చదవాలి.

అందరూ రాయగలరు. చాలా మంది రాస్తారు, రాస్తున్నారు. కాని రచనలు చేసే సామర్థ్యం కొంతమందికే ఉంటుంది. ఆపైన, రచనని ఒక తపస్సుగా సాధన చేసే శక్తీ, ఆసక్తీ, అంకితభావమూ మాత్రం కోటికొకరికి మాత్రమే లభించే వరమో, శాపమో.

తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవటం ద్వారా – రాసేవారినుంచీ, రాయగలిగేవారినుంచీ రచయిత వేరుపడతాడు. ఏదో బుర్రకి తోచింది, అనాలోచితంగా రాసేసే వాళ్ళ రాతల్లో, వారు కూర్చే వాక్యాల్లో పదాలు – భోజనాలు అయింతర్వాత తూము దగ్గర పనిమనిషికోసం ఎదురుచూస్తూ అస్తవ్యస్తంగా పడున్న అంట్లగిన్నెల్లా ఉంటాయి. అంతోఇంతో సాధన చేసే వారి రచనల్లోనైతే అవే పదాలు – వీధికొళాయిముందు వరసగా పేర్చిన సిల్వరు బిందెల్లా ఉండొచ్చు. అవే పదాలు ఒక మధురాతంకం రాజారాం, మరో ముళ్ళపూడి, ఇంకో మల్లాది చేతుల్లో అయితే – స్కూలు గంట కొట్టగానే, నీలం నిక్కర్లూ, తెల్ల చొక్కాల స్కూలు యూనిఫారములలో గుత్తులు గుత్తులుగా, మైదానంలో ఆడుకోటానికి సందడిగా వడి వడిగా పరుగులెత్తుకొంటూ పోతున్న పసిపాపలని గుర్తుకు తెస్తాయి. అందుకే వీరి శైలి – కోవెలకెళ్ళే దారిలో జట్లు జట్లుగా నడుస్తున్న ముత్తైదువుల పూల సజ్జల్లోంచీ కొద్దిగా తొంగి చూస్తూ, కన్నుగీటుతూ మనతో పరాచికాలాడే కనకాంబరం దండలలాగనో , అమ్మ చంక అనే ఒక సుఖాసనాన్ని అధిరోహించి, ఆమె భుజం మీదనుంచీ వెనక వచ్చే వాళ్ళతో పలకరింపుగా, చిలిపి చేష్టలు చేసే చిన్నపిల్లల్లాగనో ఉంటుంది.

ఈ వాక్యాలు చదువుతూంటే ఏమనిపిస్తోంది? గణతంత్ర దినో్త్సవం నాడు, రాజమార్గంలో సగర్వంగా, నేపథ్యంలో వినవస్తున్న మిలటరీ బాండ్‌ కి అనుగుణంగా అడుగులు వేస్తూ, రాష్ట్రపతి ముందు – ఒక్క క్షణం ఆగి, వీరోచిత వందనం సమర్పించి వెంటనే ముందుకు సాగిపోయే భారత సైనిక బృందాలు చేసే కవాతు గుర్తుకు రావటం లేదూ?

ఫణీంద్రకుమార్ గారికి కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది, ఆ శైలికో విశిష్టతుంది. “ఇంత పెద్ద వాక్యాలు చదువుకోవటం కష్టంగా ఉంది” అని ఓ పాఠకుడు మొరపెట్టుకొంటే, దానికి సమాధానంగా ” ఒక వాక్యం మొదలు పెట్టామంటే పాఠకుడ్ని ఒక ఆలోచన మీదనో, దృశ్యం మీదనో ఆద్యంతం ఊరేగించి పుల్‌స్టాప్ దగ్గిర పల్లకీ నుంచి సంతృప్తుడిగా క్రిందకు దించాలన్నది నా సిద్థాంతం” అన్నారు ఫణీంద్ర. ఆ మాటలకి నిలువెత్తు సాక్ష్యాలు ఆయన రచనలలో ఎన్నో చోట్ల మనలని పలకరిస్తాయి.

నడిచే కవితలో “ఓ స్వయం సమర్థిత సౌందర్య సంవర్తమా నన్నిలా నీ సమాంతర ప్రపంచంలోకి లాగేసి ఏం చేయజూస్తున్నావు?”

మరోచోట “మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్పలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

నేను సాహిత్యాన్ని అన్న కాఫ్కా రచనని తెలుగులోకి చేసిన అనువాదంలో “ఇలా స్వప్నాల్లో బాధ్యతారాహిత్యంగా తమ ఖడ్గాలు ఝుళిపిస్తూ, అమాయకంగా శయనిస్తున్నవారిని యథేచ్ఛగా పొడుస్తూపోయే ఈ పురాతన యుద్ధవీరుల విచ్చలవిడి విహారాన్ని ఎవరు సహిస్తారు?”

ఈ వాక్యాలు చదువుతూంటే ఏమనిపిస్తోంది? గణతంత్ర దినో్త్సవం నాడు, రాజమార్గంలో సగర్వంగా, నేపథ్యంలో వినవస్తున్న మిలటరీ బాండ్‌ కి అనుగుణంగా అడుగులు వేస్తూ, రాష్ట్రపతి ముందు – ఒక్క క్షణం ఆగి, వీరోచిత వందనం సమర్పించి వెంటనే ముందుకు సాగిపోయే భారత సైనిక బృందాలు చేసే కవాతు గుర్తుకు రావటం లేదూ?

ఈ బ్లాగులో, ప్రతి పదానికి ఓ నిర్దేశిత స్థలమూ, ఆకారమూ, లక్ష్యమూ ఉంటుంది, అంతేకాకుండా ప్రతిపదానికి తన పక్కనున్న పదాలతో పరిచయమూ, బాంధవ్యమూ ఉంటాయి. అవన్నీ ఒక వాక్యంలో తమ తమ నిర్దేశిత కార్యాన్ని రచయిత అభీష్టానుసారం నిర్వహించి, పాఠకుడి ముందోక్షణం తలలు వంచి, తరువాత వస్తున్న వాక్యానికి దారి చేస్తూ ముందుకు సాగిపోతాయి. పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో. అవి పయనించే దారిలో ఎదురైన ఒక బాటసారి మాత్రమే పాఠకుడు.
****

తరువాతి పేజీ >>

Posted in జాలవీక్షణం | Tagged , | 13 Comments

పరివ్యాప్త (కవితా సంకలనం)

పరివ్యాప్త, స్త్రీ సమస్యలను ఒకచోట కూర్చిన కవిత్వ ప్రయత్న సంకలనం. ఇందులో అనేక స్త్రీ సమస్యలు వున్నాయి. భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభ – వీటన్నిటిపై స్పందించిన 100 మంది కవులు, కవయిత్రులు వున్నారు. వీరిలో లబ్ద ప్రతిష్టుల నుండి విద్యార్థుల వరకూ వున్నారు. కొత్త, పాత కలయికలతో నాలుగు తరాల కవులున్నారు. కొత్తవారికిది ప్రోత్సాహమే అయినా సమస్యాత్మక అలోచనాధారకు కొంచెం విఘాతం కలిగే అవకాశంవుంది. ఇందులోని కొన్ని కవితలు వివిధ పత్రికలలో ముద్రింపబడినప్పటికీ మొత్తంగా చూసినప్పుడు పత్రికల్లో వచ్చినవి తక్కువే కనిపిస్తాయి. సంపాదకురాలు వ్యయప్రయాసలకోర్చి ఒక్కచోట చేర్చడం, వాటిని సంకలనంగా తేవడం అభినందనీయం. స్త్రీ సమస్యలు అనగానే పురుష వ్యతిరేకత కాదు అని తనముందుమాటలో చెప్పుకున్నట్టు “మానవీయ స్పర్శ” తో చూడవలసిన అవసరాన్ని తెలియజేసాయి, ఇందులోని కవితలు. ఇంకా ఇందులో స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పే కవితలు, అమ్మగురించి చెప్పే కవితలు, వివిధ సంఘటనలకు స్పందించిన కవితలు, వేదనలు, నిర్వచనాలు, ముందడుగు వేయటానికి స్ఫూర్తినిచ్చే కవితలూ కనిపిస్తాయి.

స్త్రీల సమస్య అనగానే నాకు కొందరు స్త్రీల జీవితాలు గుర్తుకు వచ్చాయి…
నాయనమ్మ – వందయేళ్ళనాటి మాట.. మతం మార్పిడి, వెలివేత, దాడులు, వలస, వైధవ్యం, పిల్లలపోషణ, వాళ్ళచదువులు – వీటి వెనుక ఆమె కోల్పోయిన, పొందిన స్వేచ్ఛ.
అమ్మ – చదువు, వివాహం, కానుపుల వెంబడి కానుపులు, తరచుగా బదిలీలు, చాలీచాలని ఆర్థిక వెసులుబాటు – వీటి మధ్య నలిగిపోయిన మనసు స్వేచ్ఛ.
అవివాహితలుగా వున్నకొందరు – ఆర్థిక అస్థిరత, ప్రేమ వంచన, సమాజపు సూటిపోటి మాటల మధ్య జీవితం వెళ్ళదీస్తున్న జీవితం
గృహనిర్బంధపు జీవితం – ఇల్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియకుండా నిర్బంధింపబడిన వాళ్ళు వున్నారు – వాళ్ళు కోల్పోయిన స్వేచ్ఛ.
కొన్ని వేశ్యా జీవితాలు – బలవంతంగా మార్చబడే జీవితాలు, ప్రోత్సాహకంగా మార్చబడే జీవితాలు, మోసపూరితంగా మార్చబడే జీవితాలు, సరదాగా మార్చబడే జీవితాలు, ధనార్జన కోసం మార్చబడే జీవితాలు.

నాకు తెలిసిన జీవితాలు వేరొకరికి ఎలా తెలిసాయా అనేది ప్రశ్న. వ్యక్తులు, సందర్భాలు, స్థలాలు మారవచ్చుకాని సమాజంలోవున్న పరిస్థితులు ఒకేలా వున్నాయనిపిస్తుంది.
ఈ కవితల్ని చదువుతున్నప్పుడు తలెత్తే ప్రశ్నలెన్నో! రూపంలో ఎలావున్నా.., ఇంకా స్త్రీ సమస్యలకు నిర్వచనాల్ని వెదుక్కోవడం శోచనీయం.

వీటన్నిటికీ పురుషుడే కారణమా? పురుష ఆధిక్యతే కారణమా? అక్షరాస్యత లోపమా? అజ్ఞానమా? ఇంకా ఏమైనానా??
ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆలోచనల్తో బుర్రవేడెక్కుతుంది.
మరి అప్పుడప్పుడూ బయటపడే మానసిక వికృత ప్రవృత్తులకు ఏది కారణం? – అలోచించవలసిందే.

  • నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే ప్రవృత్తి విద్య నేర్పే దామోదర్ జ్ఞానాన్ని కప్పివేసింది.
  • ఇదే రకమైన ప్రవృత్తి మనోహర్ వుదంతం.
  • వీరికి భిన్నంగా వెలుగుచూసిన వుదంతం, తిరుపతిలో ఉన్నత విద్యాసంస్థలలో బోధనచేసే (పేరు గుర్తురావటంలేదు) స్త్రీ వేశ్యా వృత్తిని ప్రోత్సహించడమే కాకుండా, కేంద్ర బిందువుగా మారటం.

ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి విద్య ఎంతవరకూ సమస్యల్ని తీరుస్తుంది అనేది సందేహమే.
కొందరు బయట పడుతుంటారు. బయటపడకుండా వేధించే వాళ్ళగురించి ఏమిటి??
ఈ విషయాలను, పరిస్థితులను చూస్తున్నప్పుడు లోపం ఎక్కడున్నదనే ప్రశ్న తలెత్తుతూ వుంటుంది.

పురుషాధిక్య భావజాలం, స్త్రీ ని భోగ వస్తువుగాను, సంతాన పునరుత్పత్తి సాధనంగానూ మాత్రమే చూడటం – ఇవి ప్రధాన కారణాలు కావచ్చు.
లింగ వివక్షతను అర్థంచేసుకోవటంలోని భావజాలాన్ని మార్చుకోవలసిన అవసరంవుంది. సమాజం లో వేళ్ళూనుకుపోయిన భావ జాలాల దృష్ట్యా చూస్తే కొన్ని రకాల స్త్రీ సమస్యలకు కేవలం పురుషుడే కాదు, స్త్రీ కూడా కారణం అని తోస్తుంది. ఈ కొత్త కోణం నుండి స్త్రీ సమస్యలని పరిష్కరించే దిశగా అడుగులువేయటానికి, ఇప్పటికే నడిచివెళ్ళిన వారి అడుగుజాడలు వెతుక్కోవటానికి ఈ సంకలనం ఉపయోగపడుతుందని, ఉపయోగపడాలని అభిలషిస్తున్నాను.

పరివ్యాప్త
లోపలిపేజీల్లోకి తొంగిచూస్తే..

కలలప్రియదర్శిని (జాన్ హైడ్ కనుమూరి) 120పే

“ఆదినుంచి
వర్గవర్గాలుగా విభజింపబడ్డ భూమిపై

నీ శ్వాస కేర్‌మన్నప్పుడే

అవమానం కొండచిలువై

మింగాలని ప్రయత్నిస్తోంది

మింగలేనప్పుడు

ఆశలపండేదో తినేటట్టుచేస్తుంది

నడుస్తున్న దేహం వెనుక

నీడలా వెంటాడుతుంది”

బహుశ ఈ సంకలనం సారాంశం ఇదే అనిపిస్తుంది. అయితే ఛేదించే మార్గాలు, ప్రయత్నాలు, ప్రయత్నాన్వేషణలు వ్యక్తపరచిన కొన్ని పాదాలను చూద్దాం.

సంఘటనలు: సమయసమయాలలో జరిగే సంఘటనలు కాలపరిస్థితికి, మనోభావానికి అద్దం పడుతుంటాయి. ఆ సందర్భంలో స్పందించి రాసిన కవితలు సామాన్య పాఠకులకు తీవ్రంగా అనిపించినా సమస్య యొక్క తీవ్రతను, తత్వాన్ని తెలియచేస్తాయి.

ప్రతి – ఘటన – జ్వలిత (172పే) తస్లీమాపై దాడి

“పగటి నక్షత్రంలా కవితాక్షర దేహంతో
స్వేచ్ఛకోసం చేసే నాదం

నీకు అతివాదమయ్యిందా”

అని ప్రశ్నిస్తుంది.

దుఃఖైర్లాంజి – ఎండ్లూరి సుధాకర్ (159పే) ఖైర్లాంజి సంఘటన

“పైట జారితేనే ఉలిక్కిపడి
పాతివ్రత్యానికి భంగం కలిగిందనుకొనే
కలనాంగలు కదా!
సాటి స్త్రీ స్తనాలను
గొడ్డళ్ళతో అడ్డంగా నరుకుతుంటే
అడ్డుపడాల్సిందిపోయి
తల్లీకూతుళ్ళని
కళ్ళెదుటే మానభంగం చెయ్యమని
మంత్రాలు పలికిన నోళ్ళతో
మద్దతు ఎలా పలికారమ్మా”

అని ప్రశ్నిస్తాడు

బాల్స్ ఓన్లీ షుడ్ బౌన్స్ – వంశీ కృష్ణ (156పే) టెన్నిస్ బ్రా మోడలింగ్
టెన్నిస్ తారల దుస్తులపై బాల్స్ బౌన్స్ అనే నినాదంపై చెలరేగిన వివాదానికి స్పందించిన వంశీ కృష్ణ తీవ్రస్వరంతోనే నిరసనను తెలియచేసారు.

“అవున్నిజమే!
బంతులు మాత్రమే ఎగరాలి
యవ్వనోధృతిలో గర్వపడే ఆ రెండు మాంసఖండాలు మాత్రమే ఎగరాలి

.. అంటూ

ఆ రెండూ
‘బ్రా’ల మార్కెట్‌ను నూరుశాతం కైవసం చేసుకొనే
విక్రయ వ్యూహాలు మాత్రమే!

.. అని మార్కెట్ రహస్యాని తెలియచేస్తాడు

పదకొండుమంది స్త్రీలు– అరసవిల్లి కృష్ణ (136పే)
గిరిజన స్త్రీలపై పోలీసుల అత్యాచారాన్ని నిరసిస్తూ రాసిన కవితయిది.

అస్తిత్వం ఒక ప్రశ్న – దేవదానం రాజు (75పే)
ఉత్తర్ ప్రదేశ్ లో సంతాలీ ఆడపిల్లల్ని వేడుక జరిపి చంపేస్తారనే వార్త

మిగతా కవితలలో కొన్ని ఇలావున్నాయి

కవులు తమతమ కలాలకు

పదుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది

ఊరికే మనసులో మధనపడకుండా!

అంటారు శ్రీగిరిరాజు విజయలక్ష్మి(100పే).

మనమిప్పుడు పచ్చినిజాల్ని

నిక్కచ్చిగా మాట్లాడుకుందాం

……

మరింత బహిరంగంగా బరితెగించి

విపరీతంగా మాట్లాడుకోవాలి

ఈ సందర్భం ప్రకృతి విస్ఫోటిస్తున్న

కల్లోలిత దృశ్యాలది….

అని మాట్లాడవలసిన అవసరాన్ని అనిశెట్టి రజిత గుర్తుచేస్తున్నారు.

కనురెప్పల మాటున దాచుకున్న ఉప్పెనలని

ఆపి ఆపి గొంతు నరాలు తెగిపోతున్నాయి

ఎప్పుడో గుండె పగిలేతీరుతుంది …

అంటారు అనామిక (84పే)

ఇపుడున్న సామాన్య స్త్రీల గురించి శిలాలోలిత ఇలా అంటారు

“ఉదయం

అతడు…

ప్యాంటూ చొక్కా తొడుక్కొని వెళ్తాడు

ఆమె

ఇంటిని కూడా తొడుక్కొని వెళ్తుంది

నడుస్తున్న ఇల్లులా వుంటుంది”

… అనగనగా ఓ ఇల్లు (112పే)

ప్రపంచీకరణ నేపథ్యంలో దాంపత్యంకూడా కార్పొరేట్ అయిపోతున్న బాధను జ్వలిత ఇలా వెలిబుచ్చారు

సూర్యచంద్రుల కాపురం

– రాత్రింబవళ్ళ స్నేహం
నాకు సూర్యోదయంతో బతుకుతెరువు

నీకు చంద్రోదయంతో సుఖం కరువు

దాంపత్యానుబంధం అమావాస్య కారుచీకటి

కోరికలను కంట్రోల్‌చేసే రిమోట్ ఐదంకెల వేతనం

-కార్పొరేట్ దాంపత్యం (123 పే)

అమ్మకళ్ళు (46పే) గురించి అందంగా చెప్పిన మెహజబీన్ పదాలు

కలల శాలువాకప్పుకొని

నాన్నతో ఏడడుగులు నడిచినప్పుడు

అమ్మకళ్ళు స్వప్ననిక్షేపాలు

అక్షరాలు తెలిసిన అమ్మ

నిర్దాక్షిణ్యంగా గాయపడినప్పుడు

అమ్మకళ్ళు భాషకందని భావాలు.

స్త్రీని మహోన్నత శక్తిగా తనదైన శైలిలో మనముందుంచారు కె. శివారెడ్డి కాంక్షారణ్యంలో (45పే)

“పెద్దపులిలాంటి ఆమె, పుణ్య నదిలాంటి ఆమె
పొగరుమోతు పద్యంలాంటి ఆమె

ఆమె మన తహ తహ మన తపన

తనివితీరని దాహం

మనచేతగానితనాల అవతల మోగుతున్న జేగంట

రాత్రిపగలు రగులుతున్న అగ్నిగుండం

నిప్పుల జడివాన మనల్ని అల్లుకున్న పురాస్మృతి

… అంటూ

శివుడామె ముందు కూర్చుని

తపస్సుచేస్తున్నాడు

ఒక ప్రాకృతిక జ్ఞానాన్నివ్వమని

శరీరంతో స్వర్గారోహణ

ఎలాచెయాలో చెప్పమని

“పరివ్యాప్తమవుతున్న స్త్రీవాద కవిత్వం” అంటూ కొండేపూడి నిర్మల,

“నడిచేదీ నడిపించేదీ పరివ్యాప్త” అని రామాచంద్ర మౌళి

సరికొత్త కవితా సంపుటి పరివ్యాప్త అంటూ చేకూరి రామారావు రాసిన పరిచయవాక్యాలు వున్నాయి.

స్త్రీ సమస్యలను అర్థంచేసుకొనే నేపథ్యంలో చదవాల్సిన పుస్తకం


– దొరుకుచోటు:

అన్నిపుస్తక కేంద్రాలలోను మరియు –
జ్వలిత (విజయకుమారి దెంచనాల)
గవర్నమెంటు ఉన్నత పాఠశాల,
రామవరం, కొత్తగూడెం
-507 101.
సెల్ నం. +9989198943

——————-

జాన్ హైడ్ గారు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’, గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ‘ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. జాన్ హైడ్ గారి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.

Posted in వ్యాసం | Tagged , | 5 Comments

ఫోటో చెప్పే కథలు – అలా-ఇ-మీనార్

అలా-ఇ-మీనార్, ఢిల్లీ

అలా-ఇ-మీనార్

ఈ ఫోటోలో ఉన్న కట్టడం పేరు అలా-ఇ-మీనార్. భారతదేశాన్ని ఏలిన ముస్లిం పాలకుల్లో అక్బర్, షేర్షాల తర్వాత అంతగొప్పవాడిగా అలాఉద్దీన్ ఖిల్జీని చరిత్రకారులు పేర్కొంటారు. అతడి సైనిక విజయాలే కాకుండా అతడు చేపట్టిన పరిపాలనా, సైనిక, ఆర్థిక సంస్కరణలు అతడికి ఆ స్థాయిని తెచ్చిపెట్టాయి. ఐతే అతడికి తాను సాధించిన విజయాలతో తలచుకున్నదేదైనా చేసెయ్యగలననే గర్వం పొడసూపింది.

అతడు చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినవి/విరమించుకున్నవి:

1. మహమ్మదు ప్రవక్తలాగే ఒక కొత్త మతాన్ని స్థాపించడం.
2. విశ్వవిజేత కావడం.

ఈ బొమ్మలోని నిర్మాణం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఢిల్లీలోని World Heritage site ఐన కుతుబ్ కాంప్లెక్స్ లో ఇది ఒక భాగం. కుతుబ్ మీనార్ కంటే రెండింతలు ఎత్తైన మీనార్ కట్టాలని సంకల్పించి అలాఉద్దీన్ ఖిల్జీ మొదలుపెట్టిన నిర్మాణం. 160 మీటర్లు అనుకున్నది కాస్తా కేవలం ఇరవైనాలుగున్నర మీటర్ల వరకూ వచ్చి ఆగిపోయింది. (కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు/239 అడుగులు.)

——-

(ఫోటో & కథనం: త్రివిక్రమ్)

Posted in కథ | Tagged | 4 Comments

మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

జానపద సాహిత్యంగానూ, నోటి పాటల రూపంలోనూ వేల ఏళ్ళుగా ప్రజలలో తరతరాలుగా ప్రాచుర్యంలో ఉన్న అలిఖిత సంప్రదాయం ఆధునిక నాగరికతకు పూర్వపు సంస్కృతిలోని ఒక ముఖ్యమైన అంశం. దీని ప్రభావం ఆ వెనకగా వచ్చిన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. మన దేశంలో వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, బౌద్ధమత రచనలూ, ప్రాచీన కాలపు గ్రీస్‌, యూరప్‌లోని ఇతర దేశాల సాహిత్యమూ, మెక్సికో మతాచారాలూ, చైనా న్యాయశాస్త్రమూ, వేల ఏళ్ళనాటి ఈజిప్ట్‌ ఆధ్యాత్మికవాదమూ అన్నీ ఒకనాటి మౌఖిక సంప్రదాయాల మీద ఆధారపడినవే. మన ప్రాచీనులకు అక్షరాస్యతకన్నా జ్ఞానమే ముఖ్యం. ప్రసిద్ధ వైయాకరణుడైన పాణినికే అక్షరజ్ఞానం ఉండేది కాదని కొందరంటారు. తమ జ్ఞానాన్ని లిపిబద్ధం చెయ్యడం అవసరమని చాలామంది అనుకోలేదు. జ్ఞాపకశక్తికీ, కంఠస్థం చెయ్యడానికీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. సులువుగా గుర్తుండడానికి విషయాలను శ్లోకాలుగానూ, గీతాలుగానూ నేర్పేవారు. రచనాపద్ధతులు వ్యాప్తిలోకి వచ్చాక కూడా, అరుదుగా, ఏ రాజవంశాల చరిత్రను శాసనాలుగా చెక్కడానికో లిపిని వాడేవారు.

…వేదపఠన పద్ధతి వగైరాల్లో ఉత్తర భారతదేశానికీ, దక్షిణాదికీ తేడాలుండవు. అలాగే బౌద్ధమత విషయాల్లో వివిధ దేశాలవారు ఒకే పఠనపద్ధతిని పాటిస్తారు. ఆధునికులు నమ్మకపోవచ్చుగాని వీటిని తు.చ. తప్పకుండా వప్పచెప్పకపోతే మహాపాపమని తలిచేవారు కనకనే ఇవన్నీ వేల సంవత్సరాలు గడిచినా నిర్దుష్టంగా కొనసాగుతున్న సంప్రదాయాలు.

వివిధ దేశాల్లో ఆధ్యాత్మిక, తాత్విక విషయాలను లిపిబద్ధం చెయ్యడం అపరాధంగా భావించబడేది. నాగరికత అభివృద్ధి అయిన తరవాతకూడా కొందరు ప్రాచీనులు తమకు లభించిన మౌఖిక వారసత్వాన్ని లిఖితరూపంలో నమోదు చెయ్యరాదని అనుకునేవారు. అక్షరాలు కనిపెట్టాక కూడా అవి నేర్చుకోవడం హానికరమనే అభిప్రాయం ఉండేది. ప్రజలు అక్షరాలను మాత్రమే గుర్తుంచుకుని అవి నేర్పుతున్న విషయాలను మరిచిపోగలరన్న హెచ్చరిక ప్రాచీన ఈజిప్ట్‌ మత సంప్రదాయంలో కనబడుతుంది. ప్రసిద్ధ గ్రీక్‌ తత్వవేత్త ప్లేటోకూడా చర్చకే ప్రాధాన్యతనిస్తూ చదవడం, రాయడం పరిమితమైన ప్రయోజనాన్నిస్తాయనీ, జ్ఞాపకశక్తిని నశింపజేస్తాయనీ అన్నాడు. వ్యక్తిగత చర్చలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సత్యాన్వేషణ కావించే ప్రవృత్తికై మనసు మీదనే ఆధారపడాలి కాని పుస్తకాల మీద కాదు.

లిఖిత సాహిత్యాన్ని నిరాకరించినవారిలో కెల్ట్‌ జాతులుండేవి. క్రీస్తు శక ప్రారంభంలో ఐర్లండ్‌ మొదలైన ప్రాంతాల్లో నివసించిన కెల్ట్‌ జాతుల్లో “పండిత” వర్గానికి డ్రూయిడ్‌లనే పేరుండేది. ప్రాచీన అగ్నిదేవతలనూ, ఇతర వేల్పులనూ ఆరాధించే ఈ డ్రూయిడ్‌లు తమ తెగలకు సంబంధించిన పూజలూ, తంతులూ నిర్వహిస్తూ, ప్రాచీన సంప్రదాయాలనూ, గాథలనూ, పాటలనూ ఎరిగినవారై ఉండేవారు. ఇవన్నీ తరతరాలుగా ఎన్నో శతాబ్దాలుగా వారికి వారసత్వం రూపంలో అంది వస్తూ ఉండేవి. వీరిలో కొందరికి ద్రష్టలుగానూ, జ్ఞానులూ, ప్రవక్తలూ, పూజారులుగానూ, గారడీ విద్యలు తెలిసినవారుగానూ గుర్తింపు ఉండేది. ఇదంతా ఆటవిక లక్షణాలతో కూడుకుని ఉండేది. తరవాతి యుగాల్లో రూపొందిన మతాలకు ఇదొక పూర్వదశ.

గమనించవలసిన దేమిటంటే ఈ ఆటవిక పూజారులకు ఉండిన ప్రత్యేకతల్లో గాథలను పాడి వినిపించగలిగిన నైపుణ్యం ముఖ్యమైనది. మెక్సికో, దక్షిణ అమెరికాలతో సహా ప్రపంచ నాగరికత లన్నిటిలోనూ ఊరూరా తిరుగుతూ, కథలూ, గాథలూ పాడి వినిపిస్తూ తిరిగే ప్రవక్తలూ జానపద గాయకులూ ఉండేవారు. తమతమ జాతుల సంప్రదాయాలనూ, రాజవంశాల చరిత్రనూ ఏకరువుపెడుతూ జాతిలో సమైక్యతనూ, సంఘీభావాన్నీ కలిగించేవారు. లిఖిత సాహిత్యమూ, అక్షరాస్యతా లేని సామాన్యులకు జ్ఞాన విజ్ఞానమంతా ఈ రూపంలోనే అందుతూ ఉండేది. కెల్ట్‌జాతి ప్రజలు ఇంగ్లండ్‌లోని వేల్స్‌ ప్రాంతంలోనూ, స్కాట్లండ్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లండ్‌, స్పెయిన్‌, టర్కీవంటి ప్రదేశాల్లోనూ ఉండేవారు. ఫ్రాన్స్‌ను లోబరుచుకున్న రోమన్‌ సామ్రాజ్యం అక్కడి ప్రాచీన మతసంప్రదాయాలని తుడిచిపెట్టి తమ దేవతలకు స్థానం కల్పించింది. అటువంటి ప్రాంతాల్లో ఆ తరవాత క్రైస్తవ మతం ప్రవేశించింది. ఐర్లండ్‌లో మాత్రం క్రైస్తవ సంప్రదాయం నెలకొనే దాకా డ్రూయిడ్‌ల పెత్తనమే కొనసాగింది. వారి అలిఖిత గాథల గురించిన వివరాలన్నీ క్రైస్తవ రచనల ద్వారానే మనకు లభిస్తున్నాయి.

పురాణం చెప్పే పంతులైనా, సోదెమ్మలైనా, బుడబుక్కలవాళ్ళైనా ఒకరు చెప్పడం, తక్కినవారు వినడం ప్రధానంగా ఉండేది. గౌతమ బుద్ధుడివంటి ప్రవక్తలుకూడా రచనలకన్నా తమ బోధనలకే ప్రాధాన్యతనిచ్చారు. మన ప్రాచీన విద్యల్లో వ్యాకరణ నియమాలనుంచి ప్రతిదీ సులువుగా గుర్తుండే సూత్రపద్ధతి ద్వారా నేర్పబడేది. మన సంప్రదాయంలో ఇటువంటివి నేర్పడంలోనూ, నేర్చుకోవడంలోనూ ఎంత శ్రద్ధ వహించేవారంటే వేదపఠన పద్ధతి వగైరాల్లో ఉత్తర భారతదేశానికీ, దక్షిణాదికీ తేడాలుండవు. అలాగే బౌద్ధమత విషయాల్లో వివిధ దేశాలవారు ఒకే పఠనపద్ధతిని పాటిస్తారు. ఆధునికులు నమ్మకపోవచ్చుగాని వీటిని తు.చ. తప్పకుండా వప్పచెప్పకపోతే మహాపాపమని తలిచేవారు కనకనే ఇవన్నీ వేల సంవత్సరాలు గడిచినా నిర్దుష్టంగా కొనసాగుతున్న సంప్రదాయాలు.

వర్ణ విచక్షణ కారణంగా వలస పాలకులు ఆఫ్రికా అంతటినీ అనాగరికమైన చీకటి ఖండంగా అభివర్ణించారు కాని అది నిజం కాదు. అక్కడ విలసిల్లిన ఎన్నో ప్రాచీన నాగరికతలన్నీ సాక్ష్యాలు మిగలకుండా రూపుమాసిపోయాయి. అక్కడి అలిఖిత సంప్రదాయాలను కొనసాగించే గ్రియోట్‌ గాయకులు ఎన్నో శతాబ్దాల చరిత్రనూ, గ్రామాల స్థలపురాణాలనూ, వంశాల చరిత్రనూ కంఠతాపట్టి చెపుతూ ఉంటారు. పశ్చిమాఫ్రికా మొదలైన ప్రాంతాల్లో అనుకున్నదానికన్నా వెయ్యేళ్ళు ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్టుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి. లిఖిత సాహిత్యం మొదలైన కాలానికి అప్పటిదాకా ఉన్న శ్రుత సంప్రదాయమే ప్రాచీన విషయాలకు ఏకైక ఆధారంగా ఉండేది. సమాజం మారుతున్న కొద్దీ గత కాలపు వివరాలకు మార్పులూ, చేర్పులూ జరగకుండా, పొరబాట్లు దొర్లకుండా, వ్యక్తుల మీద ఆధారపడకుండా వాటిని నిర్దుష్టంగా ఎక్కడో అక్కడ నమోదు చెయ్యడం అవసరమని అనిపించింది. అప్పటినుంచీ పవిత్ర గ్రంథాల రచనలు ప్రపంచమంతటా మొదలయాయి.

..వడగళ్ళు అనే మాట రాయడానికి ఒక గారె బొమ్మనూ, దాని పక్కనే కాసిని గళ్ళనూ గీసే పద్ధతి పెట్టుకోవచ్చు. ఈ బొమ్మలకూ, వడగళ్ళకూ సంబంధం లేకపోయినా వడనూ, గళ్ళనూ గుర్తించినవారు ఆ పదాలను కలిపి చదువుకోగలుగుతారు. కొన్ని లిపులు ఈ పద్ధతిలో రూపొందాయి.

అతి ప్రాచీన కాలంలో పాలస్తీనాలోనూ, బేబిలోన్‌ ప్రాంతంలోనూ అలిఖితాలుగా ప్రాచుర్యంలో ఉండిన జుడాయిజమ్‌ సూత్రాలను క్రీ.శ. మూడో శతాబ్దంలో యూదు మతబోధకులు గ్రంథస్థం చేశారు. ఆధునిక పరిశోధనల్లో వివిధప్రాంతాలలో చెల్లాచెదురుగా జీవిస్తున్న యూదుమతస్థుల సంప్రదాయాలను సేకరించే ప్రయత్నాలు మొదలయాయి. మరుగున పడిపోతున్న హీబ్రూ భాషలోని పదాల ఉచ్చారణా, పాత ఆచారాలూ, అన్నిటినీ పరిరక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయి. లిపి ఆవిర్భావానికీ, పుస్తకాల తయారీకీ కొంత సాంకేతిక ప్రగతి అవసరం కావడం వల్లనే బైబ్‌ల్‌, కురాన్‌, జెంద్‌ అవెస్తా మొదలైన తొలి మత గ్రంథాలన్నిటికీ అంతులేని విలువా, వాటి పట్ల ఎనలేని భక్తీ ఉండేవి. ఎందుకంటే అప్పట్లో అవి గ్రంథరూపంలో వెలిసిన విజ్ఞానసర్వస్వాలు.

ఈ రోజుల్లో చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు తప్పడం, చదవనేర్చినవారు కూడా టీవీ ముందు గుడ్లప్పగించి కూర్చోవడం జరుగుతోంది. ఈ ఆధునిక “నిరక్షరాస్యత” కారణంగా మళ్ళీ మౌఖిక, దృశ్య, శ్రవణ సంప్రదాయాలకు ప్రాముఖ్యత పెరిగినట్టుగా అనిపిస్తోంది. కాని ఈ యుగంలో సమాచారం, విజ్ఞానం, పనికిరాని చెత్తా అంతా పర్వతాల ప్రమాణానికి పెరిగి కంప్యూటర్లూ, ఇంటర్నెట్‌ వగైరా అనేక మాధ్యమాలద్వారా లభ్యం అవుతోంది. పుస్తకాల మాట ఎలా ఉన్నా సమాచారం, సంపర్కం లేకుండా మానవ సమాజాలకు ఆనాడైనా, ఈనాడైనా జరగదు.

లిపుల వ్యాప్తి మొదలయాక పరిస్థితులు క్రమంగా మారుతూవచ్చాయి. ప్రపంచంలోని ఆధునిక లిపులలో ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్‌వంటి భాషల్లో హల్లులకూ, అచ్చులకూ వేరువేరు అక్షరాలుంటాయి. ఏ మాట రాయాలన్నా 26 అక్షరాలలో అవసరమైనవాటిని పక్కపక్కనే రాస్తూపోవాలి. అచ్చు లేని హల్లులను క్‌, గ్‌ వగైరాలుగా ఉచ్చరించాలి. ప్రతి అక్షరాన్నీ ఉచ్చరించడానికి అచ్చులు కావాలి. తెలుగువంటి భారతీయ లిపుల్లో ఉచ్చరించగలిగిన సిలబల్‌ అక్షరాలు రాయవచ్చు. అక్షరం స్వరూపం మారదు కాని గుణింతాలు మారుతూ ఉంటాయి. ఈజిప్ట్‌ వంటి కొన్ని ప్రదేశాల ప్రాచీన భాషల్లో అచ్చులు వాడేవారు కారు. అన్నీ హల్లులే. సందర్భాన్ని బట్టి పదాలను ఉచ్చరించాలి. ఆ ఛాయలు కొన్ని ముస్లిమ్‌ పేర్లలో ఇప్పటికీ కనిపిస్తాయి. మహ్మద్‌, మహమద్‌, మహమ్మద్‌, ముహమ్మద్‌, మొహమ్మద్‌, మహ్మూద్‌, మెహమూద్‌ ఇలాంటివన్నీ కొద్ది వ్యత్యాసాలతో పలుకుతారు. చైనా, జపాన్‌ మొదలైన భాషలన్నీ రేఖామాత్రంగా కనిపించే బొమ్మలవంటివిగా మొదలయాయి. కనబడుతున్న వస్తువులను వర్ణించడానికి చిత్రలిపిని వాడడం సులువు. కుక్క అనే పదాన్ని సూచించడానికి చిన్న కుక్క బొమ్మను గీయవచ్చు. చదివేవారు దాన్ని చూడగానే కుక్క అనో, తమ భాషలో ఆ అర్థాన్ని సూచించే మరొక మాటనో ఉచ్చరిస్తారు. మరొక పద్ధతిలో ఒక పదంలో వినబడే అక్షరాలను బట్టి వాటికి ప్రతీకలైన బొమ్మలు గీసుకోవడం వీలు. ఉదాహరణకు వడగళ్ళు అనే మాట రాయడానికి ఒక గారె బొమ్మనూ, దాని పక్కనే కాసిని గళ్ళనూ గీసే పద్ధతి పెట్టుకోవచ్చు. ఈ బొమ్మలకూ, వడగళ్ళకూ సంబంధం లేకపోయినా వడనూ, గళ్ళనూ గుర్తించినవారు ఆ పదాలను కలిపి చదువుకోగలుగుతారు. కొన్ని లిపులు ఈ పద్ధతిలో రూపొందాయి. ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో పరిణామం చెందాయి.

ఈనాటి భాషల్లో ఎడమనుంచి కుడివైపుకు రాసేవే ఎక్కువగా కనబడతాయి కాని ఉర్దూ, అరబిక్‌ వంటివన్నీ వ్యతిరేక దిశలో సాగుతాయి. తూర్పు దేశాల్లో నిలువుగా రాసే సంప్రదాయం కూడా ఉండేది. దీనికీ, ప్రాచీనులు తొలి యుగాల్లో చేసిన ప్రస్థానాలకూ సంబంధం ఉందని కొందరంటారు. మొదట నమోదు చేసిన వివరాల్లో ప్రతిరోజూ సూర్యబింబం స్థానాన్ని సూచించేవారని ఈ ప్రతిపాదన చెపుతుంది. మన దేశంలో ఎక్కువ మంది దక్షిణంగా ప్రయాణించారు కనక సూర్యబింబం స్థానాన్ని మొదటగా ఎడమ కొసలో గీయవలసివస్తుంది. ఆ తరవాత రోజు గడిచిన కొద్దీ కుడి వైపుకు రాస్తూ పోవాలి. మధ్య ఆసియాలో ప్రజలు ఉత్తరంగా వెళ్ళారనీ, చైనా మొదలైన ప్రాంతాల్లో పడమటి దిక్కుగా ప్రయాణించారనీ, ఆ కారణంగా అక్షరాలు రాసే పద్ధతి రూపొందిందనీ అంటారు. ఆదిమయుగాల్లో సూర్యుడిని ఆరాధించేవారు కనక ఇది నిజమేనేమో.
మరొక సిద్ధాంతం ఈజిప్ట్‌లోని పెపైరస్‌ కాగితాలమీద ఆధారపడినది. నైల్‌ నది ప్రాంతంలో విరివిగా పెరిగే రెల్లుగడ్డి వంటి పెపైరస్‌ను కాగితాల తయారీకి వాడేవారు. ఇది ఎండాక చుట్టచుట్టుకుని ఉండేది. కుడిచేత్తో రాసేటప్పుడు దీన్ని ఎడమచేత్తో తెరుస్తూ పోవాలి. ఇలా చెయ్యాలంటే కుడి నుంచి ఎడమకు రాస్తూపోవడమే వీలుగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నిటిలోనూ నిజంగా ఏం జరిగిందో ఊహించాలే కాని ఖచ్చితంగా చెప్పడం వీలవదు.

లిపుల్లో అన్నిటికన్నా ప్రాచీనమైనవి క్రీ.పూ.3000 ప్రాంతాల సుమేరియా, ఈజిప్ట్‌ నాగరికతల్లో ఆరంభమైనట్టుగా తెలుస్తోంది. మెసపొటేమియాలో ఎన్నో శతాబ్దాలుగా గొర్రెల, మేకల పెంపకానికీ, వ్యవసాయానికీ సంబంధించిన లెక్కల కోసమని ఆవంలో కాల్చిన మట్టిబిళ్ళలు వాడేవారట. ఇవి అనేక ఆకారాల్లో తయారయేవి కనక ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినప్పుడు గుర్తుంచుకోవడం వీలయేది. ఆ తరవాత బంకమట్టి మెత్తగా ఉన్నప్పుడు బిళ్ళలమీద పుల్లతో గుర్తులు గీసుకోవడం మొదలైంది. కాల్చిన తరవాత ఈ గుర్తులు ఎన్నేళ్ళైనా చెరిగిపోకుండా ఉండేవి. ములుగర్రతో గీసిన ఈ రచనా పద్ధతిని కీల లిపి (క్యూనీఫాం) అంటారు. రాయవలసిన సమాచారం పెరిగిన దశలో దీన్ని పైనుంచి ఎడమ వెైపున మొదలుపెట్టి కుడి వైపుకు పంక్తులుగా రాసేవారు. ఈనాటి మనవంటి లిపులన్నిటినీ ఇదే పద్ధతిలో రాసి, చదువుతాం. తమ అవసరాల కారణంగా అప్పటివారు రాసే పరికరాలూ, పద్ధతులూ అన్నీ స్వతంత్రంగా సృష్టించుకోవలసివచ్చింది. లిపికై ఎన్నో శతాబ్దాల తరబడి జరిగిన ప్రయత్నాలు ఇటువంటివే.
సుమేరీన్ కీల లిపి
సుమేరియన్‌ కీల లిపి

ఈ కాలంలోనే ఈజిప్ట్‌లో మొదలైన రాత పద్ధతుల్లో ఏడెనిమిది వందల రకాల గుర్తులుండేవి. దాదాపు మూడున్నర వేల ఏళ్ళపాటు కొనసాగిన ఈ లిపికి లెక్కలేనన్ని నమూనాలు చరిత్రకారులకు లభించాయి. కుడినుంచి ఎడమకు సాగే ఈ రాతలో అన్నీ బొమ్మలవంటి గుర్తులే. వీటిలో కొన్ని గుర్తులు శబ్దాలకూ, మరికొన్ని భావనలకూ ప్రతీకలుగా ఉండేవి. వీటిలో అచ్చులుండేవి కావు కనక వీటిని ఎలా ఉచ్చరించేవారో మనకు తెలియదు. ఎడమ వైపున గీసిన గుర్తుల ఆధారంగా చదివేవారికి సందర్భమూ, ఉచ్చారణా తెలుస్తూ ఉండేవి. సుమేరియన్‌, ఈజిప్ట్‌, మధ్య అమెరికా నాగరికతల్లో వేటికవిగా రూపొందిన ఈ లిపులన్నిటిలోనూ మొదట బొమ్మలు సరిగ్గా గీసినా, రానురాను అవి రేఖామాత్రపు సూచకాలుగానే రూపొందాయి. ఈనాటికీ ఏ లిపిలోనైనా అక్షరపు స్వరూపానికి స్వతహాగా అర్థమేమీ ఉండదు. వంకరటింకర గీతలన్నీ ఏయే అక్షరాలకు ప్రతీకలో తెలిశాక ప్రజలు వాటిని చూడగానే పోల్చుకుని చదవడం, ఆ శబ్దాలను బట్టి భావాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది.
ఈజిప్టు లిపి
ఈజిప్ట్‌ రచనా పద్ధతి

క్రీ.పూ. 1300 ప్రాంతాల చైనాలో స్వతంత్ర పద్ధతిలో మొదలైన లిపిలో శబ్దాలను సూచించే మూడు నాలుగు వేల గుర్తులుంటాయి. మెక్సికోలో రాసే పద్ద్ధతులు క్రీ.పూ. 600కు మునుపే మొదలైనట్టుగా తెలుస్తోంది.
చైనీసు లిపి
క్రీ.శ. ఏడో శతాబ్దపు చైనాలిపి

ఈ విధంగా అక్కడక్కడా మొదలైన లిపులు కూడా తక్కిన సాంస్కృతిక అంశాలలాగే భౌగోళిక పరిస్థితులకూ, అవరోధాలకూ లోనవుతూ వ్యాప్తి చెందగలిగాయి. మధ్యధరా సముద్రంలోని క్రీట్‌ దీవిలో మొదలైన అక్షరాస్యత పసిఫిక్‌లోని టోంగా దీవిలో రూపొందలేదు. పశ్చిమాసియాలో మొదలైన లిపులు అరేబియాకూ, ఇతియోపియాకూ వ్యాప్తి చెందగలిగాయి కాని మెక్సికో నాగరికతలోని లిపి పద్ధతులు దక్షిణ అమెరికాకు అందలేదు.
మధ్య అమెరికా ప్రాంత లిపి
మధ్య అమెరికా ప్రాంతపు లిపి

నాగరికతలు లిపులనూ, లిపులు నాగరికతలనూ ప్రభావితం చేసుకున్నాయి. మొదట్లో ఇదంతా పాలక వర్గాలకే పరిమితం అయినా వీటివల్ల ప్రజల జీవితాలు త్వరితమైన మార్పులు చెందడంతో చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది. పంతొమ్మిదో శతాబ్దంలో ప్రపంచపు ప్రాచీన లిపులను పరిశీలించిన యూరపియన్‌ పరిశోధకులు తమ లిపులను పోలినవాటిని ఉన్నతమైనవిగానూ, తేడాగా ఉన్నవాటికి తక్కువరకంగానూ పరిగణించేవారు. లిపులన్నీ మెసపొటేమియాలో మొదలైన అక్షరాలనుంచి పుట్టుకొచ్చినవే అని అనేవారు. తరవాతి పరిశోధనల్లో ఇరాన్‌, చైనాలమధ్య ఉన్న విశాలప్రాంతంలో మధ్యస్థంగా అనిపించిన లిపుల దాఖలాలేవీ దొరకలేదు. మధ్య అమెరికాలో దొరికినదాన్ని అసలు లిపిగానే అంగీకరించని వైఖరిని తరవాతి కాలంలో సరిదిద్దుకున్నారు. ఈజిప్ట్‌లోనూ, సింధునది ప్రాంతంలోనూ తలెత్తిన రచనాపద్ధతులు స్వతంత్రమైనవిగా అనుకోవడం మొదలైంది. ఇప్పటి దృక్పథం మారడంతో అక్షరాస్యత ఏ మాత్రమూ లేని సమాజాలు కూడా ఉన్నతమైన నాగరికతను సాధించాయని ఒప్పుకుంటున్నారు.

మాటలను పలకడం, రాయడం అనేవి వేరువేరని ఈనాడు ఎవరూ భావించరుగాని ఇది కొన్ని శతాబ్దాల తరబడి జరిగిన పరిణామాల ఫలితమే.

————————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

Posted in వ్యాసం | Tagged | 1 Comment

మృతజీవులు – 16

“చంపేస్తున్నావు. ఇంకా నవ్వలేను” అంటూ నజ్‌ద్ర్యోవ్ ఇంకా నవ్వాడు.
“ఇందులో హాస్యం ఏమీ లేదు. నేను వస్తానని మాట ఇచ్చాను”

“కాని, అక్కడికి వెళ్ళావంటే నీకేమీ బాగుండదు; వాడు లుబ్ధాగ్రేసరుడు. నీ నైజం నాకు తెలుసు. అక్కడ చీట్లాటా, బాన్-బాన్ సీసా దొరుకుతాయనుకుంటున్నావుగామాలు, శుద్ధ పొరపాటు. సబాకవిచ్ ను తగలేసిరిలెస్తూ; మా ఇంటికి వచ్చెయ్యి. స్టర్జిన్ కూర తినిపిస్తాను. తప్పుడు ముండాకొడుకు పనోమరేవ్ వంగి వంగి దణ్ణాలు పెడుతూ ‘తమ కోసం ప్రత్యేకంగా తెప్పించాను. కావలిస్తే సంత అంతా తిరిగి చూడండి; ఇలాంటి చేప దొరకదు’ అన్నాడు.వాడు దొంగవెధవే అనుకో, ఆమాట వాడి మొహానే అనేశాను. “మా సర్కారు కాంట్రాక్టరొకడూ, నువ్వొకడివీ – మీ ఇద్దరిలాంటి మోసగాళ్ళు మరి ఉండరు?’ అన్నాను. నవ్వుతూ గడ్డం నిమురుకున్నాడు; బండవెధవ. నేనూ కున్షిన్నికోవూ ప్రతిరోజూ మధ్యాహ్నం వాడి దుకాణంలోనే భోంచేసేవాళ్ళం. అన్నట్టు నీకింకో సంగతి చెప్పటం మరిచాను. నువ్వు చూస్తే వదిలిపెట్టవు. అయితే పదివేల రూబుళ్ళిచ్చినా నేను దాన్ని ఇవ్వను; ముందే చెబుతున్నాను.ఒరేయ్, నర్ఫీరి! కుక్కపిల్లను పైకి తీసుకురా.. భలే కుక్కపిల్ల. ఎవరో ఎత్తుకొచ్చి ఉంటారు; అసలు యజమాని అయితే చచ్చినా అమ్మడు. హ్వస్తీరెవ్ తో మారకం వేసుకున్నాను చూడూ, ఆ అడగుర్రాన్నిచ్చి ఈ కుక్కపిల్లను తీసుకున్నాను.”

చిచీకవ్ ఆ ఆడగుర్రాన్ని గానీ, హ్వస్తీరెవ్ ను గానీ ఏ జన్మలోనూ ఎరగడు.

ఆ సమయంలో ఆడమనిషి పొట్టివాణ్ణి సమీపించి, “ఏమన్నా భోంచెయ్యరా బాబూ?” అని అడిగింది.

“వద్దు ఏమీ వద్దు. ఎంత జల్సా చేశామనుకున్నావోయ్. పోనీ ఒక గ్లాసు వోద్కా ఇయ్యి. మీ దగ్గర ఏ రకం ఉన్నది?”

“సుగంధ విత్తులు వేసినది”

“నాక్కూడా ఒక గ్లాసు ఇయ్యి” అన్నాడు పొడుగాటివాడు.

“థియేటరులో ఒకనటి కోయిలలాగా పాడింది. కున్షిన్నికోవ్ నా పక్కనే కూచుని ఏరవల్సిన పువ్వు అన్నాడు. యాభై అంగళ్ళయినా ఉన్నాయనుకుంటాను. ఫినార్దీ నాలుగ్గంటల సేపు పిల్లిమొగ్గలు వేశాడు.” అతను ఆడమనిషి చేతినుంచి గ్లాసు అందుకున్నాడు. ఆమె మర్యాదగా వంగింది.

పర్ఫీరి కుక్కపిల్లను తీసుకురావటం చూసి, అతను “ఆఁ, ఇలా ఇయ్యి” అన్నాడు. పర్ఫీరి కూడా తన యజమాని లాగే జెర్కిన్లాటిది ధరించి ఉన్నాడు. అయితే, అది దూది కుక్కినది, జిడ్డు ఓడుతున్నది.

“ఇలా తెచ్చి దాన్ని కిందపెట్టు”

పర్ఫీరి కుక్కపిల్లను కిందపెట్టేసరికి అది నాలుగు కాళ్ళూ చాచుకుని, నేలను వాసన చూసింది.

“ఇదుగో కుక్కపిల్ల” అంటూ నజ్‌ద్ర్యోవ్ దాని వీపు పట్టుకుని పైకి ఎత్తాడు. అది బాధగా మూలిగింది.

నజ్‌ద్ర్యోవ్ కుక్కపొట్టను జాగ్రత్తగా పరీక్షించి పర్ఫీరితో, “నేను చెప్పినట్టు చెయ్యనే లేదే! దువ్వెనతో దువ్వాలని తోచనే లేదా?” అన్నాడు.

“దువ్వానే”

“అయితే మరి దీనికి ఈగలెందుకున్నాయి?”

“నాకు తెలీదు, బండి నుంచి పట్టాయేమో”

“అబద్ధం, అబద్ధం. నువు దీన్ని దువ్వనేలేదు. వెధవా, నీ వంటివే దీనికి పట్టించి ఉంటావు కూడానూ. ఒక్కసారి చూడు చిచీకవ్, ఎంతమంచి చెవులో చూశావా? పట్టుకు చూడు”

“ఎందుకూ? చూస్తేనే కనిపిస్తున్నాయి. మంచి జాతిది” అన్నాడు చిచీకవ్.

“అలా కాదు. దీన్ని తీసుకో, చెవులు పట్టుకు చూడు.”

అతని తృప్తి కోసం దాని చెవులు తడువుతూ చిచీకవ్, “అవును, పెరిగాక మంచి కుక్క అవుతుంది” అన్నాడు.

“దాని ముక్కు చూడు చల్లగా ఎలా ఉందో, పట్టుకో”

అతను ఏమనుకుంటాడోనని చిచీకవ్ దాని ముక్కు తాకుతూ, “అవును, బాగా వసిపట్టుతుంది” అన్నాడు.

“ఇది నిజమైన బుల్‌డాగ్. ఎంత కాలం నుంచో నాకు బుల్‌డాగ్ ను సంపాదించాలని. ఇదిగో పర్ఫీరి, దీన్ని తీసుకుపో” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

పర్ఫీరి దాన్ని చంకలో పెట్టుకుని తీసుకుపోయాడు.

“చూడు చిచీకవ్ నువు నావెంట బయలుదేరితీరవలసిందే. ఎంతోలేదు, మూడుమైళ్ళు. క్షణంలో వెళ్ళి వాలతాం. ఆ తరువాత కావాలంటే సబాకవిచ్ వద్దకు పోదువుగానిలే”

చిచీకవ్ ఆలోచించాడు: “పోనీ నెను నజ్‌ద్ర్యోవ్ ఇంటికి పోతేనేం? ఇతనూ మరొకడిలాటివాడేగా, పైగా డబ్బు పోగొట్టుకుని ఉన్నాడు. వాలకం చూస్తే అన్నిటికీ సంసిద్ధుడల్లే కనిపిస్తాడు. అటువంటి వాడు మననుంచి ఏమీ తీసుకోకుండా ఏదైనా ఇచ్చెయ్యగలడు.”

అతను నజ్‌ద్ర్యోవ్ తో “సరే పోదాం పద.అయితే ఒక్క షరతు: నన్ను నిలబెట్టెయ్యగూడదు, నాకు చాలా పని ఉన్నది.” అన్నాడు.

“బాగుందోయ్ బుజ్జిగాడా భేషుగ్గా ఉంది. ఉండు, ఇందుకొక ముద్దు పెట్టు!” నజ్‌ద్ర్యోవ్, చిచీకవ్ లు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు.

“భేష్! ముగ్గురమూ కలిసి బయల్దేర్దాం”

“వద్దు, నన్ను వదిలిపెట్టండి, నేనింటికి పోవాలి” అన్నాడు పొడుగువాడు.

“అదేమీ కుదరదు. నేను నిన్ను వెళ్ళనివ్వను”

“నా భార్య ఊరుకోదు. నువు ఈ పెద్దమనిషి బండిలో వెళ్ళు.”

“వద్దు వద్దు ఆ మాట ఎత్తకు”

ఈ పొడుగాటి మనిషి స్వభావం గలవాళ్ళు మొట్టమొదట్లో దృఢనిశ్చయం కనబరుస్తారు.మనం నోరు మెదపకముందే వాళ్ళు వాదించటం ప్రారంభిస్తారు: వాళ్ళు అనుకున్నదానికి విరుద్ధమైనదేదీ ఆమోదించరనీ, అవివేకాన్ని వివేకంగా ఆమోదించరనీ ఇతరులు చెప్పినట్టు సుతరాము వినరనీ అనిపిస్తుంది.కాని కొసకి వారి తీర్మానమంతా నీరుగారి పోతుంది. వాళ్ళు కాదన్నదాన్ని వాళ్ళే ఆమోదిస్తారు. అవివేకాన్ని వివేకమని ఒప్పుకుంటారు. ఇతరులు ఎలా ఆడిస్తే అలా ఆడతారు – ఆరంభశూరులు.

“చాల్లే” అంటూ పొడుగువాడు మారు మాటాడక మిగిలినవాళ్ళవెంట బయలుదేరాడు.

“వోద్కాకు డబ్బులివ్వలేదు బాబూ” అన్నది ఆడది.

“అవునమ్మా, అవునమ్మా! ఏమోయ్, నాబదులు డబ్బిస్తావా, నా జేబులో చిల్లిగవ్వ లేదు”

“ఎంత ఇవ్వాలి?” అన్నాడు అతని బావ.

“ఇరవై కోపెక్కులేనండి”

“ఇంకా నయం సగమియ్యి, చాలు”

“చాలా తక్కువ బాబూ”, అంటూ ఆడది, ఇచ్చిన డబ్బు కృతజ్ఞతతోనే స్వీకరించి, గబగబా వెళ్ళి తలుపు తెరిచి పట్టుకున్నది. వోద్క ఖరీదు ఉన్నదానికి నాలుగింతలు చెప్పి ఉండటంచే, ఆమెకు నష్టమేమీ రాలేదు.

ప్రయాణీకులు బళ్ళలో ఎక్కి కూచున్నారు. దారిలో సంభాషణ సాగేటందుకు వీలుగా చిచీకవ్ బండి, మిగిలిన ఇద్దరూ ఎక్కిన బండి పక్కపక్కగా నడిచాయి. బక్కచిక్కిన బాడుగ గుర్రాలు లాగే నజ్‌ద్ర్యోవ్ బండి మధ్యమధ్య ఆగుతూ వెనకగా వచ్చింది. అందులో పర్ఫీరి కుక్కపిల్లను పెట్టుకుని కూచున్నాడు.

వాళ్ళమధ్య సాగిన సంభాషణ పాఠకునికి అంతగా పట్టేది కాదు గనక, నజ్‌ద్ర్యోవ్ గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే అతను ఈ గాధలో నిర్వహించబోయే పాత్ర అల్పమైనది కాదు.

నజ్‌ద్ర్యోవ్ స్వభావం గురించి పాఠకుడికి ఇదివరకే కొంత తెలుసు. అటువంటి వాళ్ళు అందరికీ తగులుతూనే ఉంటారు. వాళ్లను చలాకీ మనుషులంటాం. చిన్నప్పుడు బడిలో చదివేటపుడు కూడా అలాటివాళ్ళు స్నేహపాత్రులుగా భావించబడతారు. వాళ్ళతో స్నేహం చేసేందుకు బొప్పెలు కడితే ఏంగాక, వాళ్ళ ముఖాలలో బోళాతనమూ సూటి అయిన స్వభావమూ , సాహసమూ స్ఫురిస్తుంది. వాళ్ళు ఇతరులతో సులువుగా స్నేహం కలిపి మరుక్షణంలోనే చిన్ననాటి నుండి ఎరిగినట్టుగా సంబోధిస్తారు.వాళ్ళు ఆజన్మ మిత్రులు కాబోలనుకుంటాం. కాని ఆ సాయంకాలం లోపునే కొత్త స్నేహితులకు వాళ్ళతో చచ్చే తగాదా అవుతుంది. వాళ్ళు అమితంగా మాట్లాడేవాళ్ళూ, సుఖ లంపటులూ, సాహసికులూ అయి ఉండి ప్రతిదానికీ మేమున్నామని వస్తారు. పద్దెనిమిది, ఇరవై ఏళ్ళప్పుడు ఎలా ఉండేవాడో, ముప్పైఅయిదో ఏటకూడా అలాగే ఉండి నజ్‌ద్ర్యోవ్ సుఖాల కోసం బతుకుతున్నాడు. పెళ్ళి అయినాక కూడా అతనిలో మార్పు రాలేదు, దానికి తగ్గట్టే ఆ భార్యకూడా పెందలాడే ఉత్తమ లోకాలు చూసుకున్నది, ఇద్దరు చిన్నపిల్లలు మిగిలారు. వాళ్ళు తండ్రికి ఏమాత్రమూ పట్టలేదు. వాళ్లను చూసుకోవటానికి ఆకర్షణీయమైన ఒక చిన్న ఆయా ఏర్పాటయింది. అతను ఇంటి పట్టున ఒక్కరోజుకు మించి ఉండేవాడు కాడు. చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరంలో ఎక్కడ సంత జరిగినా, సంబరం జరిగినా నృత్యోత్సవం జరిగినా రెప్పపాటులో వెళ్ళి అక్కడ వాలి, పేకాట దగ్గర పేచీలు పెట్టటమూ తగాదా చెయ్యటమూ చేసేవాడు; అలాటి వాళ్ళు పేకాట అంటే ప్రాణాలిచ్చేస్తారు.
(ఇంకా ఉంది)

————
-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 16

ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

భైరవభట్ల కామేశ్వర రావు

ఇంటర్నెట్టు సమాచార ప్రచార రంగంలో ఒక విప్లవాన్ని తెచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించు ఒక దశాబ్ద కాలంగా ప్రచార సాధనంగా అది ఎంత విస్తృతిపొందిందో కూడా మనకి ఎఱుకే.

ప్రత్యేకించి, ఇంటర్నెట్లో తెలుగు వాడుక, గత నాలుగైదేళ్ళలో ఎంతో పెరిగింది. ఒకటో రెండో ఉండే ఈ-పత్రికల సంఖ్య ఇంచుమించు పదికి చేరుకుంది. తెలుగు సైట్లూ, పోర్టళ్ళూ కూడా చాలా పుట్టుకొచ్చాయి. బ్లాగుల సంగతి సరే సరి! ఇవన్నీ తెలుగు సాహిత్యానికి కాస్తో కూస్తో తమదంటూ సేవలనందిస్తూనే ఉన్నాయి. కథలూ, కవిత్వమూ, విమర్శా ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియలూ ఇంటర్నెట్లో మనకి దర్శనమిస్తున్నాయి. ఈ సాహిత్య సంపద, గణించ తగ్గ పరిమాణానికి పెరిగిందని నా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, దీని గురించి ప్రత్యేకంగా పరిశీలనా పరిశోధనా జరగాల్సిన సమయం వచ్చిందని నేననుకొంటున్నాను. ఆ దిశగా ఒక బుల్లి అడుగు, ఈ వ్యాసం. ఇది పరిశోధనా వ్యాసం కాదు, ఇది ఏ మాత్రమూ సమగ్రం కాదు. కేవలం నా పరిధిలోకి వచ్చిన అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయి కాబట్టి, నేను వెలిబుచ్చే అభిప్రాయాలు పరిపూర్ణ సత్యాలు కాకపోవచ్చు. చెయ్యాల్సిన పరిశోధన విషయం, అందరి దృష్టికీ తీసుకురావడమే నా ముఖ్యోద్దేశం.

“అసలు ఇంటర్నెట్లోని కవిత్వాన్ని గురించి ప్రత్యేకించి పరిశీలించాల్సిన అవసరం ఏముంది? కవిత్వం కవిత్వమే, అచ్చు పత్రికల్లో వస్తే ఏమిటి, ఇంటర్నెట్లో ఉంటే ఏమిటి?” అన్న ప్రశ్నలు ఎవరికైనా రావొచ్చు. సామాజిక పరిస్థితులూ, కవుల స్థితిగతులూ, ప్రచార మాధ్యమాలూ – ఇవన్నీ కవిత్వ రూపాన్నీ, వస్తువునూ ప్రభావితం చేస్తాయన్న విషయం ఆధునిక విమర్శకి కొత్త కాదు. ప్రాచీన, ఆధునిక కవిత్వాన్ని ఈ దృష్టితో చాలామంది పరిశీలించారు కూడా. ఇదే కోణంలోంచి, ఇంటర్నెట్లో వస్తున్న కవిత్వాన్ని కూడ పరిశీలించవచ్చు.

ప్రస్తుతం ఇంటర్నెట్టు అత్యధికంగా, ఉన్నత విద్య కలిగిన వాళ్ళకీ, సాఫ్టువేరు రంగంలో పనిచేసే వారికీ, పట్టణాల్లో, విదేశాల్లో నివసించేవాళ్ళకీ అందుబాటులో ఉంది. కాబట్టి, ఆయా వర్గాల్లోని ప్రజల అభిరుచులకి తగ్గ కవిత్వమే ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళకి దగ్గరగా ఉన్న జీవితమే కవితా వస్తువు అవుతోంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవన సరళీ, పుట్టిన ఊరివో పెంచిన తల్లిదండ్రులవో చిన్ననాటి జ్ఞాపకాలూ, ప్రకృతి ఆరాధనా, ప్రేమా, తాత్విక చింతనా – ఇవీ ప్రధానమైన వస్తువులు. రాజకీయ సాంఘిక అంశాలు వస్తువులుగా ఉన్న కవిత్వం తక్కువే. అది కూడా ప్రజాకళ, ప్రాణహిత, భూమిక వంటి కొన్ని పత్రికలకి మాత్రమే పరిమితం. ఈ పత్రికలు కొన్ని నిర్దిష్ట భావాలకీ, ప్రయోజనాలకీ నిబద్ధమైన పత్రికలు. ఈమాట, కౌముది వంటి పత్రికల్లో అలాటి నిబద్ధత ఏదీ కనిపించదు. కానీ వాటిల్లో సమకాలీన సామాజిక అంశాలపై వస్తున్న కవిత్వం ఇంచుమించు హుళక్కే. అచ్చు పత్రికల్లో విరివిగా కనిపించే తెలంగాణా, దళిత, మైనారిటీ, స్త్రీ వాద కవిత్వాలు ఇంటర్నెట్లో చాలా కొద్ది మోతాదుల్లోనే కనిపిస్తున్నాయి. గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే కవిత్వం అసలు కనబడదు.

అంతేకాక, ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపించే చాలామంది మంచి కవుల కవిత్వం అచ్చు పత్రికల్లో అసలు కనిపించకపోవడం ఆశ్చర్యం!
ఇదంతా చాలా సహజమైన విషయంగానే కనిపిస్తుంది, దీని గురించి ఇంతలా అనుకోవాల్సిన అవసరం ఏమిటీ అని కూడా అనిపిస్తుంది. అయితే, దీని వల్ల ఒక ప్రమాదం పొంచున్నదని గుర్తించాలి. “(ఇంటర్నెట్టు) కవులకూ, పాఠకులకూ”, “(అచ్చు పత్రికల) కవులకూ పాఠకులకూ” మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వారు రెండు భిన్న వర్గాలుగా విడిపోయి, రెండు సమాంతర సాహిత్య వ్యవస్థలు ఏర్పడే పరిస్థితికి ఇది దారితియ్యవచ్చు. ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు మార్గాలను ఆలోచించాలి. ఇంటర్నెట్టు కూడా అచ్చు పత్రికలంత విస్తృతిపొంది, అన్ని వర్గాల ప్రజలకీ అందుబాటులోకి వస్తే, అలాంటి పరిస్థితి కలగకపోవచ్చు.

ఇక రూపం విషయానికి వస్తే, అచ్చు పత్రికలకీ, ఇంటర్నెట్టుకీ పెద్దగా తేడా కనిపించదు. అప్పుడప్పుడూ పద్య కవిత్వం, గేయాలూ కనిపించినా అధిక శాతం వచన కవితలే. కౌముది పత్రికలో ప్రతి నెలా “రస రేఖలు” శీర్షికతో పద్యాలు ప్రచురిస్తున్నారు. అవి భావకవిత్వం విడిచిన అడుగుల గుర్తుల్లా ఉంటున్నాయి. చాలా మంది బ్లాగుల్లో పద్యాలు రాస్తున్నారు కానీ, వాటిని కవిత్వం అనలేం.

రూపంలో “ఈ-కవిత్వాని”కీ “ఆ-కవిత్వాని”కీ మధ్య నాకు కనిపించిన పెద్ద తేడా – ఆ-కవిత్వంలో కనిపించేటంత సంక్లిష్టత ఈ-కవిత్వంలో కనిపించదు. పద చిత్రాలూ, ఉపమానాలు కనిపించినంతగా ప్రతీకాత్మకత, అధివాస్తవికత కనిపించవు. దీనికి కూడా కవి, పాఠకుల అభిరుచులే కారణమనుకోవాలి.

అచ్చు పత్రికల్లో సాధ్యంకానిదీ, ఇంటర్నెట్లో సాధ్యమైనదీ ఒకటుంది – కవి తన కవితని సొంతంగా చదివి/పాడి వినిపించడం. ఇంటర్నెట్టు పాఠకులు శ్రోతలు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అదనపు సౌకర్యాన్ని ఎవరూ ఉపయోగించుకుంటున్నట్టు లేదు. కొంత కాలం కిందట ఈమాట ఇలాటి ప్రయోగం చేసింది కానీ అదంత విజయవంతం అయినట్టు లేదు, ఎందుకో! ఈ తరహా కవిత్వ ప్రచురణ విజయవంతమై వ్యాప్తి పొందితే, కవిత్వ రూపంలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.

ఇక కవిత్వ స్థాయి గురించి. ఇదెప్పుడూ వివాదాంశమే! కవిత్వం నాలో కలిగించే, మిగిల్చే అనుభూతీ, చెప్పిన విధానంలోని విలక్షణత – ఇవీ కవిత స్థాయిని నిర్ణయించడానికి నేనుపయోగించే తూకపురాళ్ళు. వీటితో కొలిస్తే, ఇంటర్నెట్లో ఎక్కువ శాతం, తక్కువ స్థాయి కవిత్వమనే నాకనిపిస్తుంది. అయితే ఆ తక్కువ శాతం ఎక్కువ స్థాయి కవిత్వం, గొప్ప కవిత్వమే! అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిస్థితికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి, ఎక్కువ శాతం కవులు “సీరియస్” కవులు కాకపోవడం. ఇక్కడ “సీరియస్” కవులంటే, కవిత్వ రచనని తమ ప్రధానమైన వృత్తిగా లేదా ప్రవృత్తిగా తీసుకొని, నిర్విరామంగా సాధన చేస్తూ రాసేవాళ్ళు. ఇంటర్నెట్లో కవిత్వం రాసేవాళ్ళలో ఎక్కువమంది ఈ తరహాకు చెందిన వారు కారు. తమ బిజీ జీవితాల్లో కొంత ఆటవిడుపుగా, అలవోకగా కవిత్వాన్ని రాసేవారే ఎక్కువ.

ఇక రెండవ కారణం, కవితల ప్రచురణ విధానం. ముఖ్యంగా మూడు రీతుల్లో కవిత్వ ప్రచురణ జరుగుతోంది, ఇంటర్నెట్లో. ఒకటి వ్యక్తిగత బ్లాగులు, రెండు పోర్టళ్ళు, మూడు పత్రికలు. వ్యక్తిగత బ్లాగుల్లో ఎడిటింగు (వేరొకరి ద్వారా) అయ్యే ప్రసక్తే లేదు. పోర్టళ్ళలో కొద్దిగా ఉన్నా, అది ప్రచురణ స్థాయిని, యోగ్యతను నిర్ణయించడానికి కాదు, అనర్హమైన వాటిని నివారించడానికి మాత్రమే. కాబట్టి ఈ రెండు రీతుల్లోనూ, చాలానే తక్కువ స్థాయి కవిత్వం ప్రచురించ బడుతోంది. చాలమంది బ్లాగుల్లోనూ, తెలుగుపీపుల్.కాం వంటి పోర్టళ్ళలోనూ వచ్చే కవిత్వాన్ని చూస్తే ఈ సంగతి స్పష్టం అవుతుంది. వీటిల్లో బొత్తిగా కవిత్వం లేదని కాదుకానీ, వాటి ధ్యేయం మంచి కవిత్వాన్ని ప్రచురించడం కాదుకాబట్టి, అందులో అలాటి కవిత్వాన్ని ఆశించలేం. ఆవకాయ.కాంలో కొంతవరకూ మంచి కవిత్వమే కనిపిస్తోంది. అయితే అది చాలావరకూ అనుభూతి కవిత్వానికి పరిమితం అయిపోతోంది. ఎక్కువగా మంచి కవిత్వం, రివ్యూ ఎడిటింగూ ఉండే ఈ-పత్రికల్లోనే వస్తోందని చెప్పొచ్చు. అయితే వీటిల్లో కూడా, బహుశా కొత్తవాళ్ళని, ముఖ్యంగా ప్రవాసంలోని తెలుగువాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాస్త రాజీ ధోరణి కనిపిస్తోంది. ఉన్న పత్రికల్లోకెల్లా ఈమాటలోనే కాస్త మంచి కవిత్వం వస్తోందని నా అభిప్రాయం. అయితే, అందులోకూడా, కొంత కాలం క్రితం ఉన్న స్థాయి ఇటీవల కనిపించడంలేదు. అఫ్సర్, మహెజబీన్, విన్నకోట రవిశంకర్, యదుకుల భూషణ్, చంద్ర కన్నెగంటి వంటి చెయ్యితిరిగిన కవుల కవిత్వం ఒకప్పుడు ఎక్కువగా కనిపించేది. ఇప్పుడెందుకో, అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. అలా అని కొత్తవాళ్ళెవరూ బాగా రాయటం లేదని కాదు నా ఉద్దేశం. కొత్త వాళ్ళలో చాలా మంచి కవిత్వం రాస్తున్న వాళ్ళు లేకపోలేదు.

మొత్తం మీద కవిత్వ స్థాయిని పెంచడానికి దారుల్ని అన్వేషించాలి. నాకు తోచిన కొన్ని మార్గాలు:
1. అచ్చు పత్రికల్లో కన్నా, ఇంటర్నెట్లో కవులూ, పాఠకులూ ఒకరికొకరు సంభాషించుకోడం సులువు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. మంచి చర్చలు జరగాలి.
2. కౌముదిలో విన్నకోట రవిశంకర్ నిర్వహిస్తున్న “మంచి కవితతో కొంచెం సేపు” లాంటి శీర్షికలని కొత్తకవులు విధిగా చదివి, అందులోని మంచిని గ్రహించాలి.
3. చెయ్యి తిరిగిన కవుల రచనలు మరింత ఎక్కువగా ఈ-పత్రికల్లో ప్రచురించాలి.
4. ప్రసిద్ధ కవులు, విమర్శకుల ద్వారా “ఆన్లైన్ వర్క్ షాప్”లు నిర్వహించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
5. ఇంటర్నెట్లో కవిత్వం వస్తున్నంతగా, దానిపై విమర్శ కనిపించటం లేదు. ఇంటర్నెట్లోని విమర్శకులు ఈ ఖాళీని పూరించడానికి కృషి చెయ్యాలి.

మంచి కవిత్వం రాయాలనుకొనే కవులకి, విన్నకోట రవిశంకర్ కవితాత్మకంగా ఇచ్చిన సూచన “పద్యం కోసం” అన్న ఈ-కవిత చదివి ఆ తత్వాన్ని కవులందరూ జీర్ణించుకొందురుగాక!

———–

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. రాయగల శక్తి ఉన్నవారు కూడాను. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగును ఇటీవలే మొదలుపెట్టి ప్రఖ్యాతి గాంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.

Posted in వ్యాసం | 8 Comments

OpenID: సర్వాంతర్యామి

ఈ వ్యాసం సాంకేతిక సమాచారంతో కూడుకున్నది కావడం వలన, అనేక ఇంగ్లీషు మాటలు అనివార్యంగా వాడవలసి వచ్చింది. పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

అంతర్జాలంలో అనేకానేక సైట్లలో మీకు ఖాతాలుంటాయి. రకరకాల పేర్లు, సంకేతనామాలతో ఖాతాలు తెరవడం, వాటిలో లాగిన్ అయి పనులుచేసుకోవడం, అప్పుడప్పుడు ఖాతా వివరాలు మర్చిపోయి తిప్పలు పడటం దాదాపు నెజ్జనులందరికీ అనుభవమే! పైగా సైట్లలో లాగిన్ అయ్యేటపుడు, మీ రహస్య సమాచారాన్ని అంతర్జాలంలో సురక్షితంగా తీసుకువెళ్ళడం ఆయా సైటుల బాధ్యత. కొందరు SSL అనే పద్ధతిలో సురక్షితంగా తీసుకువెళ్తారు గానీ, చాలామంది ఆ పద్ధతిని అనుసరించరు.

OpenIDఇలా సైటుకో ఖాతాను, పూటకో ఖాతాను సృష్టించుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు తలపెట్టిన విధానమే.. OpenID- మీ విశ్వవ్యాప్త గుర్తింపు. ఈ ఒక్క ఓపెన్ ఐడీయే వందల వేల ఖాతాల పెట్టు! మీ ముక్కూ మొహమెరుగని ఏ సైటుకైనా వెళ్ళి, అక్కడ ఖాతాలాంటిదేమీ లేకుండానే దర్జాగా లాగినై, కుర్చీ వేసుక్కూచ్చుని కబుర్లు చెప్పొచ్చు – ఆ సైటు ఓపెన్ఐడీని అనుమతిస్తే చాలు!

క్లుప్తంగా OpenID అంటే ఇది

OpenID ఇచ్చే సైటు ఒకదానిలో మీరు ఖాతా తెరుస్తారు. ఈ సైటే ఓపెన్ ఐడీ ప్రొవైడరు.
ఆ సైటు మీకు గుర్తింపు నిస్తూ మీకొక URL ను కేటాయిస్తుంది. ఈ యూఆరెల్లే మీ OpenID!

ఇహ OpenID అనే ఈ URL ను పట్టుకుని మీరు దర్జాగా ఏ సైటుకైనా వెళ్ళి లాగినై పోవచ్చు. అయితే ఇక్కడో ముఖ్య విషయం.. మీరు లాగిన్ అవదల్చుకున్న సైటు ఈ ఓపెన్ఐడీ ని అనుమతించాలి. అప్పుడే మీరు లాగిన్ కాగలరు. ప్రపంచవ్యాప్తంగా వర్డ్‌ప్రెస్, బ్లాగర్ వంటి అనేక సైట్లు ఈ ఓపెన్ఐడీ ని సపోర్టు చేస్తున్నాయి. ఇప్పుడు సపోర్టు చెయ్యని సైట్లు రేపు చేస్తాయి; చెయ్యక తప్పదు. ఎందుకంటే ఈ ఓపెన్ఐడీ వాడుకరులకు అనేక ఇబ్బందులను తప్పించి వారికి సమాచారభద్రతను కల్పిస్తున్నది.

OpenID ఎవరు నెలకొల్పారు?

ఓపెన్ఐడీ ఎవరి సొంతమూ కాదు. అది ఓపెన్‌సోర్స్ సమాజం నుండి ఉద్భవించింది. ఎవరైనా ఓపెన్ఐడీ ని తెచ్చుకోవచ్చు. ఎవరైనా ఓపెన్ఐడీ ప్రొవైడరు కూడా కావచ్చును. ఓపెన్ఐడీ ని అభివృద్ధి పరచే ఓపెన్‌సోర్స్ సమాజానికి చట్టపరమైన ఉనికి కోసం గాను ఓపెన్ఐడీ ఫౌండేషను అనే సంస్థ (OIDF) 2007 జూన్‌లో ఏర్పడింది. ఓపెన్ఐడీ ని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనను వ్యాప్తి చేసిన సంస్థలు ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేసాయి. Typepad, Movable Type, మొదలైన సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలు దీన్ని నెలకొల్పిన వారిలో ఉన్నాయి.

OpenID ని ఇచ్చేదెవరు?

blogger.com, WordPress.com మొదలైన బ్లాగు సైట్లు కూడా ఓపెన్ఐడీ ప్రొవైడర్లే! అంతేకాక, ప్రత్యేకించి కొన్ని సైట్లు ఓపెన్ఐడీ ప్రొవైడర్లుగా అవతరించాయి. సెక్యూరిటీ రంగంలో ప్రసిద్ధి గాంచిన వెరిసైన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. మీ ఓపెన్ఐడీని మీకు నమ్మకమున్న ఏ సంస్థనుండైనా పొందవచ్చు. ఒక సంస్థ నుండి మరోదానికి ఎప్పుడైనా మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఓపెన్ఐడీని తెచ్చుకునే పద్ధతిని ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఈ ఉదాహరణలో వెరిసైన్ సంస్థ ద్వారా ఓపెన్ఐడీ పొందే విధానాన్ని చూద్దాం.

  1. వెరిసైన్ వారి OpenID పేజీకి వెళ్ళాలి – https://pip.verisignlabs.com/
  2. అక్కడ మీ వాదుకపేరు, సంకేతపదం, మీ పేరు, ఊరూ వంటి వివరాలనిచ్చి ఖాతాను తెరవాలి.
  3. ఖాతా తెరిచే ప్రక్రియ పూర్తి కాగానే, మీకు మీ ఓపెన్ఐడీ ఇస్తుంది. అది URL రూపంలో ఉంటుంది, ఇలాగ.. http://yourname.pip.verisignlabs.com

అంతే! మీ ఖాతా సిద్ధమైనట్లే. మీరిక మీ ఓపెన్ఐడీ ని వాడటం మొదలుపెట్టవచ్చు.

దాన్ని ఉపయోగించడం ఎలా?
OpenID250×250మీరు ఏదైనా సైటులో లాగిన్ కాదలచుకున్నారనుకోండి..ఉదాహరణకు పొద్దులో ఈ వ్యాసానికి మీ వ్యాఖ్య రాద్దామనుకున్నారనుకోండి. ముందు ఈ సైటు ఓపెన్ఐడీ ని అనుమతిస్తున్నదో లేదో చూడండి. (పొద్దు ఓపెన్ఐడీ ని అనుమతిస్తుంది. ఓపెనైడీని అనుమతించే సైట్ల ఈ జాబితాలో పొద్దును చూడవచ్చు) అనుమతించే పనైతే ఆ సంగతిని లాగిన్ ఫారములోనే తెలియజేస్తుంది. అలాంటి సైట్లలో మీ ఓపెన్ఐడీ ని మాత్రమే – అంటే మీ URL ను – ఇస్తే చాలు. మీరాపని పని చెయ్యగానే..

పొద్దు మీ URL ను పట్టుకుని సంబంధిత సైటుకు – అంటే pip.verisignlabs.com కు – వెళ్ళి, ‘అయ్యా ఈ ఫలానా URL లో ఉన్న వ్యక్తిni మీరెరుగుదురా’ అని అడిగి, నిర్ధారణ చేసుకుని వస్తుంది. ఈ సందర్భంగా ఒక్క సంగతి గుర్తుంచుకోవాలి. ఏ కంప్యూటరు, ఏ బ్రౌజరు నుండి మీరు పొద్దులోకి లాగిన్ అవదలచారో ఆ కంప్యూటరు, ఆ బ్రౌజరుల నుండి మీరు మీ ఓపెన్ఐడీ ఖాతాలోకి లాగిన్ అయి ఉండాలి. లాగిన్ కాకపోతే అవమని pip.verisignlabs.com మిమ్మల్ని అడుగుతుంది. లాగిన్ అయి ఉన్నా కూడా.., మీగురించి పొద్దుకు చెప్పేముందు వెరిసైన్ మీ అనుమతి తీసుకుంటుంది.. “ఏంటి, ఫలానా వారు మీ గురించి అడుగుతున్నారు, చెప్పమంటారా” అని. అప్పుడు మీరు సరేనంటే, “అవునండీ, ఫలానావారికి మా దగ్గర ఓపెనైడీ ఉన్న మాట నిజమే” అని అదే పొద్దుకు చెబుతుంది. ముందుముందు పొద్దులో మీరు లాగిన్ అవదలచినపుడు మీ అనుమతి అడిగే పని లేకుండా మీరు సెట్ చేసుకోవచ్చు.

OpenID కి ఏయే సైట్లు మద్దతునిస్తున్నాయి?
AOL, Google, IBM, Microsoft, Orange, Verisign, Yandex, Yahoo మొదలైన సైట్లు ఓపెన్ఐడీ ప్రొవైడర్లుగా పనిచేస్తున్నాయి. రాబోయే మూడో తరపు మంటనక్కలో ఈ సౌకర్యం అంతర్గతంగానే ఇమిడ్చి ఉంది.

ఓ కిటుకు:
మీరు pip.verisignlabs.com లో ఖాతా తెరిచాక వాళ్ళిచ్చే myname.pip.verisignlabs.com అనే చేంతాడంత పొడుగైన URL ను రాసే పని లేకుండా నేరుగా మీ బ్లాగు URL నే వాడుకునే ఏర్పాటూ ఉంది. దానికి కింది పద్ధతిని పాటించాలి.

  • ముందు myname.pip.verisignlabs.com అనే మీ ఓపెన్ఐడీని తెచ్చుకోండి.
  • తరువాత మీ బ్లాగు index.html పేజీలోని < head > విభాగంలో కింది కోడును చేర్చండి.

<link href=’http://pip.verisignlabs.com/server’ rel=’openid.server’/>
<link href=’http://yourname.pip.verisignlabs.com’ rel=’openid.delegate’>

అంతే.., ఇకనుండీ సైట్లలో లాగిన్ అయ్యేటపుడు myname.pip.verisignlabs.com అని కాక, మీ బ్లాగు URL నే ఇవ్వవచ్చు. అలా ఇచ్చినపుడు పొద్దు ముందు మీ బ్లాగుకు పోయి, అక్కడి నుండి myname.pip.verisignlabs.com కి వెళ్ళి సంగతి కనుక్కొస్తుంది.

ఓ విషయం: పొద్దులో మీరు వ్యాఖ్య రాయాలంటే మీ ఈమెయిలైడీ ఇవ్వడం తప్పనిసరి కదా. ఇప్పుడు మీ OpenID ఇస్తే, ఈమెయిలు ఐడీ ఇవ్వకపోయినా పరవాలేదు. ఓపెన్ఐడీ నిర్ధారణ సమయంలో మిమ్మల్ని అడుగుతుంది.. “పొద్దు మీ ఈమెయిలు ఐడీ అడుగుతూంది ఇమ్మంటారా” అని. మీరు ఒద్దంటే మానేస్తుంది. ఇదో సౌకర్యం వాడుకరికి! అయితే ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగాత్మకమే!

ఓపెనైడీకి సంబంధించిన లింకులు: ఈ వ్యాసం రాయడం కోసం ఈ లింకులలోని సమాచారాన్ని వాడుకున్నాం.

  1. ఓపెనైడీ గురించి చెప్పే అధికారిక సైటు.
  2. ఓపెనైడీని వాడటం ఎలా? – సామాన్యుల కోసం
  3. గీకుల కోసం
  4. మీ ఓపెనైడీ సరైనదో కాదో తెలుసుకునే చోటు

చివరగా..
నెజ్జనులకున్న ప్రధాన సమస్యను ఓపెన్ఐడీ పరిష్కరిస్తుంది. వెంటనే మీ OpenID ని తెచ్చుకోండి. సాంకేతికంగా ముందంజలో ఉన్న తెలుగు బ్లాగరుల్లో ఈ సరికే ఈ ఓపెన్ఐడీని వాడుతున్నవారు కొందరు ఉన్నారు.

———-

-పొద్దు

Posted in జాలవీక్షణం | Tagged , , | 9 Comments

భూమాత పరి’తాపం’

సంపాదకీయం

త్రివిక్రమ్

భూతాపం
వికీపీడియా కామన్స్ నుండి

మార్చి నెల వచ్చిందంటే చాలు అందరి గుండెల్లో గుబులు – ఈసారి ఎండలు ఎట్లా ఉండబోతున్నాయో అని. కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలలోనే రాత్రిళ్ళు చలి తగ్గకపోయినా పగటిపూట విరగ గాసిన ఎండలు ఎడారి వాతావరణాన్ని తలపించాయి. వాతావరణంలోని ఈ విపరీత మార్పులకు ఒక ప్రధాన కారణం భూగోళం ఏటికేడాదీ వేడెక్కుతూనే ఉండడం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. స్థానిక ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మామూలే ఐనప్పటికీ ఇటీవలి 50 సంవత్సరాల్లో భూగోళం మునుపెన్నడూ లేనంత వేగంగా వేడెక్కడం, ఆ వేడికి కారణం మానవ జనిత ఉష్ణకారక వాయువులే (anthropogenic Green House Gases) అని తేలడం ఆందోళన కలిగించే విషయాలు. ఈ గ్రీన్ హౌస్ వాయువుల్లో అతి ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్ (CO2). నీటి ఆవిరి, మీథేన్ (CH4), ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ మరికొన్ని GHGలు. బొగ్గుతో పనిచేసే (థర్మల్) పవర్ ప్లాంట్లు, ఆటోమొబైళ్ళు ఎక్కువ కార్బన్ డయాక్సైడును గాలిలోకి వదులుతాయి. పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక గడచిన రెండున్నర శతాబ్దాలలో వాతావరణంలో CO2, CH4 సాంద్రతలు క్రమంగా 31% మరియు 149% పెరిగాయి.

వాయు సాంద్రతలకు సంబంధించి ఆధారాలున్న ఆరున్నర లక్షల సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ లేదు. భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2 కోట్ల సంవత్సరాల కాలంలో CO2 సాంద్రత ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. CO2 పరిమాణంలో 75% పెరుగుదలకు కారణం ఇంధన వినియోగం కాగా మిగిలిన 25% అడవుల నరికివేత వల్ల సంభవిస్తోంది. ఈ పోకడలను బట్టి చూస్తే రానున్న శతాబ్దకాలంలో భూమి ఉష్ణోగ్రత 1.1 నుంచి 6.40C పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఉష్ణకారక వాయువులను ప్రస్తుత స్థాయిలోనే స్థిరీకరించగలిగినా రానున్న వందేళ్లలో ప్రకృతిలో విపరీత పరిణామాలు సంభవిస్తాయని అంటున్నప్పటికీ భూ ఉపరితలమ్మీద మూడొంతుల భాగాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రాలకు ఉష్ణాన్ని తమలో ఎక్కువకాలం పట్టి ఉంచే స్వభావం ఉండడం వల్ల ఈ విపరిణామాలు మరో వెయ్యేళ్ళు తమ ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు .

గత 2000 సంవత్సరాలలో ఉష్ణోగ్రత తీరుతెన్నులు (వికీపీడియా నుంచి)

ఇక ఉష్ణకారక వాయు ఉద్గారాలలో నియంత్రణ పాటించకపోతే…

భూగోళం ఇదే వేగంతో వేడెక్కితే ఏమౌతుంది? దావాగ్నులు చెలరేగుతాయి. ఎండాకాలాలు సుదీర్ఘమౌతాయి. కరువు కాటకాలు తీవ్రమౌతాయి. తుఫాన్లు, వరదలు విజృంభిస్తాయి, సహజసిద్ధమైన మంచుదిమ్మెలు (గ్లేసియర్లు) కరిగిపోతాయి. సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంతాలను ముంచేస్తాయి. అడవులు, పొలాలు, జనావాసాల్లో కొత్తకొత్తరకాల క్రిములు, వ్యాధులు వ్యాపిస్తాయి. పగడాలదీవులు, పర్వతీయ, సముద్రతీర అడవులు (మాంగ్రూవ్ లు), గడ్డిభూములు నశించడం వల్ల అనేకరకాల జీవులు నశిస్తాయి. జీవావరణంలోని వైవిధ్యం, సమతులనం దెబ్బతింటుంది. గ్లోబల్ వార్మింగ్ పోకడను అరికట్టకపోతే 2050 కల్లా పదిలక్షలకు పైగా జీవులు అంతరించిపోతాయని ఒక అంచనా.
సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే ఉత్తరధ్రువ ప్రాంతంలో ఏటా 9శాతం చొప్పున మంచు పరిమాణం తగ్గిపోతోంది.

గ్లోబల్ వార్మింగ్ వర్షపాత పరిమాణాన్ని, తీరుతెన్నులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల ఏటికేడాదీ భూవాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించి అసాధారణ ఉష్ణోగ్రతా, అతిశీతల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడే ప్రమాదముంది. అత్యుష్ణ ప్రభావాలు (heat waves) మరింత తీవ్రంగా, మరింత తరచుగా ఏర్పడుతాయి. (2003లో అత్యుష్ణ ప్రభావం వల్ల ఐరోపాలో ఇరవై వేల మందికి పైగా, మనదేశంలో 1500 మందికి పైగా చనిపోయారు.) దానిమూలంగా పంటలు పండక తీవ్రమైన ఆహారకొరతా, నీటికరువూ ఏర్పడి చాలా జనావాసాలు నివాసయోగ్యంగాక ప్రజలు భారీయెత్తున వలసలు పోవడమో, లేక పరిమిత వనరుల కోసం అపరిమితమైన పోటీ ఏర్పడి యుద్ధాలు, అరాచకాలకు పాల్పడడమో జరిగే ప్రమాదం కూడా ఉంది. ఉష్ణమండలానికే పరిమితమైన వ్యాధులు మరింత తీవ్రమౌతాయి, ఇతరప్రాంతాలకూ వ్యాపిస్తాయి.
CO2_1000_2000

గత వెయ్యేళ్లలో వాతావరణంలో CO2 పరిమాణంలో వచ్చిన మార్పు (గ్రీన్ హౌస్ వ్యాసం నుంచి)

Temp_1000_2000

అదే కాలంలో ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు (గ్లోబల్ వార్మింగ్ అడ్వైజర్ వెబ్సైటు నుంచి)

మరి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం ఏం చేస్తున్నాయి?

GHG ఉద్గారాలను నియంత్రించడానికి 1992లో రయో డి జనీరోలో జరిగిన ధరిత్రీసదస్సులో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ననుసరించి రూపొందించిన క్యోటో ప్రోటోకాల్ 16 ఫిబ్రవరి, 2005 న అమల్లోకి వచ్చింది. ఈ ప్రోటోకాల్ ప్రపంచదేశాలను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు (Annex I, Non-Annex I) అని రెండు రకాలుగా విభజించింది. Annex I దేశాలు సమష్టిగా 2012 లోపల తమ GHG ఉద్గారాలను 1990 నాటి స్థాయి కంటే 5% తక్కువకు పరిమితం చేసుకోవాలి. దీనిలో ఒక్కో దేశానికి ఒక్కో నిర్దేశిత లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోలేని దేశాలు తాము అధికంగా వదిలిన ప్రతి టన్ను GHG ఉద్గారానికీ ఒప్పందం మలిదశలో 1.3 రెట్లు emission allowances ని చెల్లించవలసివస్తుంది. ఐతే దీంట్లో వాటికి మళ్ళీ ఒక వెసులుబాటుంది: Non Annex I దేశాల్లో GHG ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే ప్రాజెక్టుల్లో Clean Development Mechanism (CDM) ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా, Annex I దేశాల నుంచి Joint Implementation, Excess Allowances లాంటి మరికొన్ని పద్ధతుల ద్వారా కార్బన్ క్రెడిట్స్ ని “కొనుక్కోవచ్చు”. అంటే Non Annex I దేశాలు ఇప్పటికిప్పుడు తమ GHG ఉద్గారాలను తగ్గించుకోవలసిన అవసరం లేనప్పటికీ అలాంటి ప్రాజెక్టులను చేపట్టినట్లైతే CDM ద్వారా ఆ దేశాలకు “కార్బన్ క్రెడిట్స్” వస్తాయి. ఆ క్రెడిట్స్ ను అవి ఆ ప్రాజెక్టుల్లో సహకారమందించే Annex I దేశాలకు “అమ్ముకోవచ్చు.” కార్బన్ క్రెడిట్స్ ని కొనుక్కున్న దేశాలు తమ GHG ఉద్గారాలను లక్ష్యాన్ని దాటి ఆ మేరకు పెంచుకోవచ్చు.

ఐతే Annex I లో ఉన్న అమెరికా లాంటి దేశాలు క్యోటో ప్రోటోకాల్ కు మోకాలడ్డుతూ “ప్రస్తుతం మేమే ఎక్కువ GHG లను వదుల్తున్నాం. సరే, భవిష్యత్తులో ఇండియా, చైనాలు కూడా మాతో పోటీ పడి వదలకపోవు కదా? అలాంటప్పుడు మేమెందుకు పరిమితులు విధించుకోవాలి? మేమే ఎందుకు కార్బన్ క్రెడిట్స్ కొనుక్కోవాలి? వాళ్ళెందుకు లాభపడాలి?” అని వితండవాదం చేస్తూ, ఈ ప్రోటోకాల్ కు దూరంగా ఉన్నాయి. దేశాలను రెండు వర్గాలుగా విభజించడాన్ని కూడా ఆ దేశాలు ఒప్పుకోవడం లేదు. “కంపు మేం చేశాం, కడగడానికి అందరూ రండి” అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. (2002లో అమెరికా CO2 ఉద్గారం 577 కోట్ల టన్నులు కాగా భారతదేశం 110 కోట్ల టన్నులు. అమెరికా జనాభా భారతదేశ జనాభాలో మూడో వంతనుకుంటే తలసరి ఉద్గారాల్లోని తేడా సుస్పష్టం.)

మనమేం చేయగలం?

ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించడం ద్వారా మనం భూగోళానికి ఎంతో మేలు చేసినవారమౌతాం. మరోవైపు ప్రధాన ఇంధన వనరు, కాలుష్య కారకం ఐన పెట్రోలు మీదే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులైన అణువిద్యుత్తు, సౌరవిద్యుత్తు, పవన, సాగర శక్తి లాంటివాటిని వినియోగంలోకి తెచ్చేలా, GHG ఉద్గారాలను నియంత్రించే చట్టాలను రూపొందించి అమలుచేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తిసుకురావాలి. నిజానికి కావలసింది దూరదృష్టితో ఆలోచించి పర్యావరణ విపరిణామాలను అరికట్టే దిశగా గట్టి చర్యలు తీసుకునే నాయకత్వం. రాజకీయనాయకుల్లో అలాంటి చిత్తశుద్ధి కరువైనప్పుడు ప్రజలే వారిపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. ఉదాహరణకు పోయినేడాది సిడ్నీ, ముంబాయి నగరాల్లో ఇంధన వినియోగాన్ని ఒకగంటసేపు ఆపివేయడం ద్వారా ఆయా నగరాల వాసులు ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించడంలోను, తమ భావాన్ని అందరికీ తెలిసేలా వ్యక్తపరచడంలోను కృతకృత్యులయ్యారు. హైదరాబాదులో కూడా ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ అన్ ప్లగ్ (బత్తీ బంద్) కార్యక్రమాన్ని నిర్వహించడానికి TMAD సంసిద్ధమౌతోంది.

ఇవి కూడా చూడండి:

Posted in సంపాదకీయం | 4 Comments