మృతజీవులు – 35

ఆఖరుకు అతను బండి తోలేవాళ్ల పేర్లు కూడా చెప్పాడు.

వాళ్ళు నెపోలియన్ గురించి కొంచెం సూచనగా అని, ఆ తరవాత లెంపలు వేసుకున్నారు. ఎందుకంటే, నజ్‌ద్ర్యోవ్ వెంటనే ఒక చాటభారతం ఎత్తుకున్నాడు; అంతా పచ్చిఅబధ్ధాలు, ఆ సోది ఆకును అందక, పోకను పొందకుండా ఉండటంచూసి వినేవాళ్ళు ఒక్క నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయారు. ఏదైనా పనికివచ్చే ముక్క బయటికి వస్తుందేమోనన్న ఆశతో పోలీసు అధిపతి ఒక్కడే మరికొంచెంసేపు ఆలకించి, చిట్టచివరకు విసుగెత్తి, “ఎందుకొచ్చిన దిదంతా ?” అనుకున్నాడు. “ఏంచేస్తేమటుకు ఎద్దు పాలిస్తుందా ?” అన్నారు అందరూ ఏకగ్రీవంగా. దీని ఫలితంగా అధికారుల పరిస్థితి మరింత అధ్వాన్నమయింది; చిచీకన్ ఎవరయినదీ తెలియనేలేదు. ఆ తరవాత జరిగిన సంఘటనలనుబట్టి మనిషి ఒక వింతప్రాణి అన్నది స్పష్టమయింది; అతడు ఇతరులకు సంబంధించిన అన్నివిషయాలలోనూ వివేకమూ, తెలివితేటలూ,  ఙ్ఞానమూ కనబరచి, తన సొంత విషయాలలో పనికిరాకుండా పోతాడు. జీవితంలో క్లిష్ట సమస్యలను ఎదుర్కోవటానికి అతను ఎంతో మనోబలంతోనూ, వివేకంతోనూ కూడిన సలహాలివ్వగలడు. పదిమందీ అతన్నిచూసి “ఆహా, ఎంత సునిశితమైన బుద్ధి! ఏమి పట్టుదలగల మనిషి !” అంటారు. కాని ఈ సునిశితమైన మనిషికే ఏదన్నా కష్టం వచ్చిపడనివ్వండి; అతని ప్రకృతి ఎలా మారుతుందో ! ఇంత తీర్మానమూ నీరుగారిపోయి పిరికిపందగా, అసహాయుడైన చంటి పిల్లాడులాగా, నజ్‌ద్ర్యోవ్ చెప్పినట్టుగా చవటలాగా అయిపోతాడు.

ఈ తర్జన భర్జనలూ, పుకార్లూ మిగిలినవాళ్ళకన్నా ప్రాసిక్యూటరు మీద గట్టి దెబ్బతీశాయి, దేనికోగాని వాటి ప్రభావం ఎందాకా వెళ్ళిందంటే, ఆయన ఇంటికివచ్చి అలోచిస్తూ అకస్మాత్తుగా “అర్థం పర్థం లేకుండా, చచ్చిఊరుకున్నాడు. పక్షవాతమే వచ్చిందో, పాడేవచ్చిందో గాని, బల్లముందు కూచున్నవాడు కాస్తా ముందుకు ఒరిగిపోయాడు. అలాటప్పుడు నలుగురూ చేతులు ఎగరేసి, “ఎంతపని జరిగిందీ !” అనటం సహజం. రక్తంతీసేస్తే బతుకుతాడేమోనని డాక్టరుకు కబురుచేశారు, కాని ఆత్మ వేరైపోయి కట్టె మిగిలిందని తెలుసుకున్నారు. ఆయనకు ఒక ఆత్మంటూ ఉండేదని అప్పుడే వారికి తెలిసి వచ్చింది, ఆయన బతికున్నంతకాలమూ ఆ సంగతి కప్పిపెట్టాడు. చిన్నవాడికి వచ్చినా, పెద్దవాడికి వచ్చినా చాలా భయంకరమైనదే. క్షణం కిందటిదాకా కదులుతూ, తిరుగుతూ, పేకాడుతూ, కాగితాల మీద సంతకాలుపెడుతూ ఉండిన మనిషి, లావుపాటి కనుబొమలూ, చిట్లే కన్నూ వేసుకుని తరచు అధికార్ల మధ్య మెలిసినవాడు ఇప్పుడు బల్లమీద పడుకుని ఉన్నాడు, ఆయన ఎడమకన్ను ఆడటం లేదు. ఒక్క కనుబొమమాత్రం ప్రశ్నార్థకంగా కొంచెం పైకి లేచి ఉన్నది. చచ్చినమనిషి దేన్నిగురించి ప్రశ్నిస్తున్నాడో, దేనికి చచ్చాడో, ఎందుకు బతికాడో __ దేవుడికే తెలియాలి.

“ఇదంతా అసందర్భంగా ఉందే ! ఇలా జరగటానికి వీల్లేదు ! అధికార్లు ఈ విధంగా దొడుచుకోవటమూ, ఇంత అయోమయంలో పడటమూ, చిన్నపిల్లలు కూడా తెలుసుకోగలవాటిని తెలుసుకోలేక పోవటమూ అసంభవం !” అనేకమంది పాఠకులు ఈమాట అని, అభూతకల్పన చేసినందుకు రచయితను తప్పుపడతారు, లేదా ఆ అధికార్లను బుద్ధిహీనులని తిడతారు. మనుషులు బుద్ధిహీనుడనే మాటను విరివిగా ఉపయోగిస్తారు, రోజుకు ఇరవై సార్లు పొరుగువాణ్ణి ఆ మాట అంటారు. అవతలివాడు పది విషయాలలో ఒకటింట బుద్ధితక్కువ వాడైతే చాలు, తొమ్మిది విషయాలలో సమర్థుడైనా వాడు బుద్ధిహీనుడికిందనే జమ.

పాఠకులకేం, వారు ఎత్తునకూచుని పైనుంచి అంతా చూస్తూ, కిందనడిచేదాన్ని విమర్శించగలరు; కింద ఉండేవాడు తన సమీపంలో ఉన్నది తప్పించి, ఇంకేమీ చూడలేడు. పాఠకుడు మానవచరిత్రలోనుంచి శతాబ్థాలకు శతాబ్థాలే అనవసరమని కొట్టిపారెయ్య గలడనుకుంటాను. ప్రపంచంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అలాంటి పొరపాట్లు ఈనాడు పిల్లలుకూడా చేయరు. చరమసత్యాన్ని అన్వేషించే మానవజాతి, తన ముందున్న సూటి అయిన రాజమార్గాన్ని విడిచిపెట్టి, వంకరటింకర దారులా, ఇరుకు సందులా, చొరరాని గొందులా పడి ఎన్నిసార్లు పోలేదు ! ఈ రాజమార్గం మిగిలిన అన్ని మార్గాలకన్నా విశాలమైనది. పగలు దానిపైన సూర్యుడు ప్రకాశిస్తాడు, రాత్రివేళ అనేక దీపాల కాంతితో అది వెలిగిపోతూ ఉంటుంది. అయినా, మానవులు దానినివదిలి అంధకారంలో నడిచారు. దైవకృపవల్ల వారికి ఙ్ఞానోదయం అయినప్పటికీ అనేకమార్లు తప్పుతోవలు తొక్కారు, పట్టపగలే కీకారణ్యాలు జొరబడ్డారు, ఒకరికళ్ళలో ఒకరు దుమ్ము చల్లుకున్నారు, క్షణభంగురాల వెంటతగిలి అగాధం అంచుకు వచ్చారు;

ఆ తరువాత ” బయటపడే మార్గమేమిటి ? ఏది దారి ?” అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ తరంవాళ్ళు అంతా స్పష్టంగా చూడగలరు; తమ తాతముత్తాతల అఙ్ఞానానికి ఆశ్చర్యపడి, అవహేళన చేస్తారు. కాని, ఆ చరిత్రలోకూడా దివ్యకాంతిరేఖలున్నాయనీ, ఆ చరిత్రలో ప్రతి అక్షరమూ తమని ఎలుగెత్తి పిలుస్తున్నదనీ, తమకేసి వేలుచూపుతున్నదనీ గ్రహించరు. ఈ తరంవాళ్ళు నవ్వుతూనే, అహంకరిస్తూనే కొత్తరకం పొరపాట్లు చేస్తారు, వాటినిచూసి ముందు తరాలవాళ్ళు నవ్వుకుంటారు.

చిచీకన్‌కు ఈ గొడవలేవీ కొంచెంకూడా తెలీదు. కర్మం చాలక అతనికి శైత్యం చేసి, మొహం పొంగరించింది, గొంతువాచింది; మారుమూల పట్టణాలలో ఉండే వాతావరణం ఈ జబ్బును విరివిగా అందరికీ పంచుతూ ఉంటుంది. అనుకోరాదుగాని, తనకు సంతతి ఏర్పడకముందే జీవితం అంతమైపోతుందేమోనన్న భయంతో అతను మూడు నాలుగు రోజులపాటు పక్క దిగకుండా ఉండటం మంచిదనుకున్నాడు. ఈ సమయంలో అతను అత్తిపళ్ళు వేసిన పాలు పుక్కిటబట్టి తరవాత ఆ అత్తిపళ్ళు నోట వేసుకున్నాడు, చెంపలకు హారతి కర్పూరమూ కీమోమిల్‌ వేసిన సంచులు కట్టుకున్నాడు. తోచడానికి గాను తానుకొన్న కమతగాళ్లందరి జాబితాలు మళ్ళీ తయారుచేశాడు. తన ట్రంకులోనుంచి ఒక పుస్తకం తీసి చదివాడు, తన పెట్టెలో ఉన్న రకాల కాగితాలూ; వస్తువులూ చూసుకున్నాడు. చదివినదే మళ్ళీ చదివాడు, ఇంతచేసినా అతనికి తోచక వెర్రెత్తింది. ఇదివరదాకా హోటలుబయట ఎప్పుడూ ఎవరిదో ఒక బండి నిలబడే ఉండేది, ఇప్పుడు అధికారులు ఒకరూ తనను చూడరాకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది – పోస్టుమాస్టరు లేడు, ప్రాసిక్యూటరు లేడు. అధ్యక్షుడూ లేడు. గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ అతను అలక్ష్యంగా భుజాలు ఎగరేశాడు. చివరకు అతను బాగుపడి బయటకు రాగలిగినందుకు చాలా సంతోషించాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా బయటకివెళ్ళే ప్రయత్నం సాగించాడు, తన పెట్టె తెరచి, గ్లాసులో నీళ్ళు పోసుకుని, గడ్డం చేసుకునే బ్రష్షూ, సబ్బూ తీసి గడ్డం చేసుకోసాగాడు. నిజానికి గడ్డం బాగా మాసింది. గడ్దం చేత్తో నిమురుకుంటూ అద్దంలో చూసుకుని, “అబ్బో, అడివిలాగయిందే! ” అనుకున్నాడు. నిజానికి, అడివి కాకపోయినా, చెంపలమీదా, గడ్డంకిందా బాగా పెరిగింది. గడ్డం చేసుకోవడం తోటే దుస్తులు వేసుకుంటూ, తొందరలో పడినంత పని చేశాడు. చివరకు డ్రెస్ చేసుకోవటం పూర్తి అయింది, మీద “ఉడుకులాం” చల్లుకుని, వెచ్చగా కప్పుకుని, ఎందుకైనా మంచిదని చెంపలు కప్పుకుని, కిందికిదిగి వీధిలోకి వచ్చాడు. పడి లేచినవాళ్లందరికీ ఉండేటట్టే అతనికి బయటికి వెళ్ళడం ఆటవిడుపులాగా ఉంది. ప్రపంచమంతా అతని కళ్లకు మందహాసం చేస్తున్నట్టుగా ఉంది – ఇళ్ళూ, పక్కగా వెళ్ళే పల్లె జనమూ, వాళ్ళు నిజానికి మొహాలు ముడుచుకునే ఉన్నారు, వారిలో ఒకడు అంతకుముందే తన తమ్ముడి గూబలు పగలగొట్టాడు కూడా. అతను ముందుగా గవర్నరును సందర్శించుతామనుకున్నాడు. దారిలో రకరకాల ఆలోచనలు అతన్ని ఆవేశించాయి: గవర్నరు కుమార్తె అతని మనసులో విడవకుండా మెదులుతున్నది, అతను రకరకాల పగటి కలలు కన్నాడు, చిట్టచివరకు తనను తానే అవహేళన చేసుకున్నాడు. ఈ విధమైన ఆలోచనలతో అతను గవర్నరు గారిల్లు చేరాడు. ముందుహాలులో అతను గబగబా పైకోటు విప్పెయ్యబోతుండగా అక్కడుండే బంట్రోతు, అతనికి ఆశ్చర్యం కలిగించేలాగ కలలోకూడా ఊహించనిమాట అన్నాడు: “తమరిని లోపలికి రానివ్వవద్దని సెలవయింది! “

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 35

విద్వాన్‌ విశ్వం

తెలుగునాట విద్వాన్‌ విశ్వం గారిది ప్రత్యేక స్థానం. వీరి జీవితంలో ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా కలిసిపోయాయి. ప్రాకృతం, సంస్కృతం, ఆంగ్ల భాషలను ఆకళింపు చేసుకున్న పాండిత్యం ఆయన సొంతం. వామపక్ష ఆలోచనలనూ, భారతీయ లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది విశ్వం.

ఛాందసమెరుగని సంప్రదాయవాది,

ఆవేశంలేని ఆధునికవాది,

మనసున్న మానవతావాది విశ్వం.

విద్వాన్‌ విశ్వం అనగానే చాలామందికి మాణిక్యవీణ కాలమ్‌ గుర్తుకువస్తుంది. అలాగే ఎంతోమందికి పెన్నేటిపాట, ఒకనాడు కావ్యాలు స్ఫురించవచ్చు. ఇంకొందరికి బాణుభట్టు కాదంబరి, కాళిదాసు మేఘసందేశం అనువాదాలు స్ఫురణకు రావచ్చు. అయినా, ఆంద్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకుడిగానే ఆయన సుప్రసిద్ధులు. విద్వాన్‌ విశ్వం మొదట సంస్కృత ప్రాకృతాలను లోతుగా అధ్యయనం చేసి తర్వాత ఉపాధ్యాయుడుగా స్థిరపడకుండా, రాజకీయ ప్రవేశం చేసి అటు తర్వాత పాత్రికేయుడుగా సంపాదకుడుగా మన్నన పొందారు.

పత్రికా రచయితగా విశ్వం సామర్ధ్యాన్ని, సృజనను ఆయన శీర్షికా వ్యాసాల ద్వారా చాలావరకూ బేరీజు వేసుకోవచ్చు. అయితే సంపాదకుడుగా ఆయన ప్రతిభ బోధపడాలంటే వారి నిర్వహణలో ఎటువంటి శీర్షికలు ప్రారంభమయ్యాయి, వాటి వస్తు సంవిధానాలు, అలాగే వాటి రచయితల ఎంపిక ఏవిధంగా ఉండేవో ఆయా సంచికలను సూక్ష్మదృష్టితో అధ్యయనం చేస్తే తప్ప బోధపడదు. నిజానికి తెలుగు పత్రికారంగంలో విశ్వం మాణిక్యవీణ కాకుండా మరో రెండు వీణలు ఉన్నాయి. గోరా శాస్త్రి వినాయకుని వీణ వాయించగా బాలాంత్రపు రజనీకాంతరావు విశ్వవీణను సవరించారు.

క్రీస్తుశకం 603 నుంచి 648 వరకు పాలన చేసిన శ్రీ హర్షవర్ధనునకు కృషి సమకాలికుడు అయిన ఆస్థానకవి బాణుడు. బాణుడు రచించిన ‘కాదంబరి’ మహా కావ్యాన్ని విద్వాన్‌ విశ్వం గారు తెలుగులో అందించారు. దానితోపాటు కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్రకు విశ్వం గారు అనువాదాలు చేశారు.

దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. తెలుపు-నలుపు శీర్షికలో విశ్వం భాష గురించి, పలుకుబడుల గురించి చేసిన చర్చ అప్పట్లో సాహిత్యవేత్తల్లో గొప్ప ఆసక్తిని రేపింది.

రాయలసీమ గత వైభవానికి గర్విస్తూ దాన్నే స్తుతిస్తూ ఆగిపోలేదు విద్వాన్‌ విశ్వం. విశ్వానికి – వల్లంపాటి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించినట్టు – ఆ కీర్తి పట్ల పలవరింతగానీ, వెర్రి వ్యామోహం కానీ లేవు. అందుకే, పెన్నేటి పాటలో ఇలా అంటారు –

ఇది గతించిన కథ; వినిపింతునింక

నేటి రాయలసీమ కన్నీటి పాట

కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు

కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు      అని చాలా వాస్తవిక చిత్రాన్ని పాఠకులకు అందిస్తారు.

స్థూలంగా పరిశీలిస్తే మాత్రా చందస్సు, సూక్ష్మంగా గమనిస్తే పద్యం సొగసు కనబడడం పెన్నేటిపాట గొప్పదనం. నిజానికి పద్యానికి మాత్రా ఛందస్సు జోడించి కవి కొత్తబాట వేశారు. తిప్పతీగె, రేణుగంప, తుమ్మతోపు, చిట్గీత, తంగేడు, పల్లేరు గాయలు, గూబమూల్గు తీతువు, పాపరకాయలు వంటి పద ప్రయోగాలతో పూర్తి సజీవ చిత్రణతో విశ్వం కవిత సాగుతుంది. చాలా సాధారణమైన పదాలు పద్యంలో చేరి అలవోకగా కలిసిపోతాయి.

———-

(అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ  వారు ప్రచురించిన సాహితీ విరూపాక్షుడు  విద్వాన్ విశ్వం అన్న పుస్తకం నుండి కొన్ని విశేషాలు)

Posted in వ్యాసం | Tagged | 10 Comments

కథాకథనం – 6

కథా రచన

కథ చదవగా తెలియవచ్చే వృత్తాంతం దాని భౌతిక రూపమనీ ఆ వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే విశేషమే అసలు కథ అనీ వెనక చెప్పుకున్నాం.

ప్రాణం, ప్రాణిలా ఉండే ఆ విశేషం, దాన్ని వ్యక్తం చేసే వృత్తాంతం కథ అయితే – ఆ విశేషం, వృత్తాంతం రెండూ వ్యక్తం అయ్యే విధంగా వాటిని చెప్పడం కథనం లేక కథ రాయడం.

కథ ఎలా రాస్తారనేది ఒకరు చెపితే తెలిసేది కాదు. ఎవరికి వారు గ్రహింపవలసేది. పద్ధతి చెప్పడానికైనా, ఒక కథకు పనికి వచ్చిన పద్ధతి ఇంకొక కథకు పనికి రావచ్చు – రాకపోవచ్చు. కాకపోతే అందుకు సంబంధించిన మెళుకువల గురించీ, రాసిన కొన్ని కథల పద్ధతుల గురించీ చెప్పుకోవచ్చు.

ఒక విషయం గురించి ఒకరు యింకొకరికి తెలియజెయ్యాలంటే నేరుగా చెప్పడం ఒక పద్ధతి. అలా కాకుండా చెప్పదలచిన దానిని వేరే మాటల ద్వారానో, చేష్టల ద్వారానో, ఇతరత్రానో ఎదుటివాళ్ళు గ్రహించేటట్టు చేయడం మరో పద్ధతి.

ఒక అన్నగారు తమ్ముడికి ఉత్తరం రాస్తూ వాళ్ళ అమ్మ మాటలుగా యిలా అంటాడు.

…చిన్నబ్బాయినీ పిల్లల్నీ చూసి ఆర్నెల్లు అయిపోయింది. వెళ్ళి కొన్నాళ్ళపాటు వాడిదగ్గర ఉందామనుకుంటున్నాను. ఒకసారి రమ్మని తమ్ముడికి రాయి – అంటోంది.

అని –

…ఆమెకు మీ మీద భ్రమ మళ్ళినట్టుంది. వీలు చేసుకుని నువ్వో అధవా మరదలో వస్తే బాగుంటుంది – అంటాడు.

దాని అర్థమేమిటీ?

అమ్మను మా వంతు ఆరు నెలలూ మేము భరించేసేము. ఇక నువ్వో నీ పెళ్ళామో వచ్చి ఆమెని తీసుకువెళ్ళండి.

సూటిగా అయితే యిలా చెప్పవలసిన తన ఉద్దేశాన్ని వేరే మాటల్లో అలా తెలియజేసేడన్నమాట. కొందరైతే అలా నేరుగా చెప్పేవారూ వుంటారు.

ఈ విధంగా ఉద్దేశాలను చెప్పడం, వేరే మాటల్లో వ్యక్తం చెయ్యడం – రెండూ లోకంలో ఉన్నాయి. వ్యక్తం చెయ్యడానికి వేరే మాటలే కాక యితర మార్గాలూ ఉన్నాయి.

ఒక అబ్బాయికి వెనకటి పరీక్షలన్నింటిలోనూ ఐదూ మూడూ నాలుగూ ఇలాంటి ర్యాంకులు వస్తూండేవనుకోడి. అబ్బాయి తండ్రి ప్రొగెస్స్ కార్డు మీద సంతకం చేసినప్పుడల్లా తెచ్చుకున్న ర్యాంకులకి మెచ్చుకుంటూనే – ‘క్లాసు ఫస్టు రావాలి. అప్పుడూ గొప్ప’ – అంటూ ఆ కొడుకుని ప్రోత్సహిస్తుంటాడు. చిస్వరికా ఫష్టు ర్యాంకు సాధించాడు కొడుకు.

ఆ కొడుకు తన విజయగర్వాన్నీ, ఆ తండ్రి తన ఆనందాన్నీ వారి వారి కుటుంబ సంబంధాలను బట్టి ఒకరికొకరు రకరకాలుగా వ్యక్తం చేసుకోవచ్చు.

ఒక యింట్లో –

ప్రతీసారి సందిగ్ధ విషయమైన తండ్రి మెప్పు ఇప్పుడు సందిగ్ధ విషయం కాదు. కాబట్టి ఆ కొడుకు ఒక తమాషా చేయవచ్చు. గపుచుప్పుగా కార్డును తండ్రి టేబిల్ మీద అతనికి కనబడేటట్టు పెట్టేసి ఆటల కోసం బయటకు పోతాడు. కొడుకు తెచ్చుకున్న ర్యాంకుల కన్నా అతడు తన విజయగర్వాన్ని ప్రకటించిన తీరు ఆ తండ్రికి మరింత ఆనందదాయకమవుతుంది. అందుకని అప్పటికప్పుడు బజారుకు వెళ్ళి ఖరీదైన కొత్త పెన్నొకటి కొని దానితోనే కార్డు మీద సంతకం చేసి ఆ కార్డును ఆ పెన్ను క్లిప్పుకు తగిలించేసి అక్కడే ఉంచేస్తాడు.

కొడుకు తన విజయగర్వాన్ని తండ్రికి వ్యక్తం చేసినంత హుందాగానూ తండ్రి తన ఆనందాన్ని కొడుక్కి వ్యక్తం చేసేడన్నమాట.

ఇంకో యింట్లో –

తండ్రి ఆఫీసు నుంచి యింటిఒకి వచ్చేలోగా తల్లితో గూడుపుఠాణీ చేస్తాడు కొడుకు. తండ్రి యింటికి వచ్చేసరికి –

‘హాయ్ డాడీ! ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏమిటో గెస్ చెయ్యండీ’ – అంటాడు సన్నీ.

డాడీ మమ్మీ వంక సహాయం కోసం ప్రాధేయపడుతున్నట్టు చూస్తాడు.

‘నో, మమ్మీ! నో. నువ్వు అటు తిరిగిపో. డోంట్ బి మీన్. అలా నవ్వకు. కళ్ళు మూసుకో – ‘ అందుకు తగ్గ చేష్టలతో అందుకు తగ్గ గొంతుతో అరుస్తాడు సన్నీ.

మమ్మీ – బిగపట్టిన పెదవులతో స్పష్టంగా నవ్వుతూ, పెద్దగా విచ్చి చూస్తున్న కళ్ళను సుతారంగా మూసేస్తూ, నోటి మీద వేలేసుకొని తల అదోలా కదుపుతూ ఆ చేష్టల ద్వారానే భర్తకేదో వ్యక్తం చేయబోతుంది.

అది గమనించిన కుర్రాడు ఎడంచేత వెనక్కు దాచిన కార్డును నేలమీదకు విసిరికొట్టి మారాం చేస్తాడు.

డాడీ విచార వదనం పెట్టి ఆ కార్డ్ ఎత్తి చూస్తాడు. చూడగానే మహానందాన్ని తెలియజేసే ఓ కేకపెట్టి, సన్నీని చేతుల్లోకి తీసుకుని గిరగిరా తిప్పి ముద్దు పెట్టుకుంటాడు.

ఇలా ఓ సీన్ క్రియేట్ చేసి తద్వారా ఆ కొడుకూ, తండ్రీ తమ విజయ గర్వాన్నీ, ఆనందాన్నీ హావభావ ప్రదర్శనల ద్వారా పరస్పరం వ్యక్తం చేసుకోవచ్చు.

కొందరిళ్ళల్లో పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అంతా ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. అలాంటి యింట్లో –

స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచీ అక్కడ పడేసి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని తండ్రి దగ్గరకెళ్తాడు అబ్బాయి.

తండ్రి ఏమిటని అడగడు. ఏమిటన్నట్టు చూస్తాడు.

కార్డు తండ్రి ముందుంచుతూ క్లాస్ ఫస్ట్ వచ్చిన విషయం చెపుతాడు కొడుకు. తండ్రి తన ముఖంలో ఏ భావం కనపడనీకుండా కార్డందుకొని మార్కులు పరిశీలిస్తాడు. అదయ్యాక – ‘ఇంకా బాగా చదువు. లెక్కల్లో నూటికి తొంబయ్యే వచ్చాయి. నూరు రావాలి – ‘ అంటూ పెన్ను తీసి సంతకం  చేస్తాడు. అబ్బాయి అలాగే అన్నట్టు తలూపి కార్డు తీసుకువెళ్ళిపోతాడు.

పై యిళ్ళల్లో తండ్రీ కొడుకుల్లాగ, వీరు తమ చేష్టల ద్వారానూ నాటకీయమైన హావభావ ప్రకటనల ద్వారానూ తమ తమ విజయానందాలను పరస్పరం వ్యక్తం చేసుకోకపోయినా మాటాడేటప్పటి వారి గొంతు మార్దవాల్లోనో కళ్ళ వెలుగుల్లోనో కారుడు యిచ్చి పుచ్చుకోడాల్లోనో ఎక్కడో ఎలాగో వీరిక్కూడా ఒకరి ఆనందం ఒకరికి తెలియవస్తుంది.

ఈ విధంగా –

సూటిగా అయితే – తనకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని కొడుకూ, చాలా సంతోషం అని తండ్రీ చెప్పుకోడం ద్వారా తెలియవలసే విషయాన్ని ఇతరేతర చేష్టల ద్వారా తెలియ జేయడం; లేదా సహజమైన ఒత్తి చూపులు, స్వరాలు ద్వారా తెలియజేయడం లోకంలో నిత్యం మనం చూస్తుంటాము.

కథలు పాతవీ కొత్తవీ మనం గమనిస్తే – చెప్పడంలో ఇవీ యిలాటివీ మనకి చాలా కనిపిస్తాయి.

పూర్వకాలపు కాశీ మజిలీలు, తెనాలి రామలింగం కథలు వంటి వాటికీ, నేడు పత్రికల్లో కథలుగా వచ్చేవాటికీ ప్రధానమైన తేడా గమనించండి.

అలనాటి కథలు నేరుగా చెప్పే పద్ధతిలో సాగుతాయి. నేటి కథలు సాధారణంగా వ్యక్తీకరణ పద్ధతిలో సాగుతాయి.

నాడు, నేడు అన్నది విషయానికి సంబంధించినవి కావు. చెప్పే పద్ధతికి సంబంధించినవి.

‘నేటి కథ’ సంకలనంలోంచి ఓ కథ తీసుకుందాం. ‘అసహాయత’ అనేది ఆ రచయిత రాసిన తొలికథ.

ఆ కథలో –

వీరయ్యది వనబ అనే పల్లెటూరు. బహు గిరిజన ప్రాంతపు కుగ్రామం. అతడో పేదకూలీ. అమాయకుడు. అతని కొడుకు తవిటయ్య. బుద్ధిమంతుడు. తెలివైనవాడు.

కొడుకుని పై చదువులకు పంపే శక్తిలేదు వీరయ్యకు. కులరీత్యా తన బిడ్డకున్న సదుపాయాల సంగతి అతనికి తెలియదు. వాళ్ళ ఊరి పంతులుగారు ఆ సదుపాయాల సంగతి చెప్పి కుర్రాడి పై చదువుల కోసం వాళ్ళని ప్రోత్సహిస్తాడు.

తవిటయ్యకు కాలేజీలో సీటు దొరికింది. హాస్టల్ సీటు కోసం వార్డెన్ గారి దర్శనం చేసుకుంటాడు. ఉన్న సీట్లన్నీ భర్తీ అయిపోయాయి; చేర్చుకోలేనంటాడు వారెడెను.

వీరయ్య తన గోడంతా చెప్పి బ్రతిమిలాడుతాడు. ఆఖరు సీటు ఆ ముందు రోజే నిండిపోయింది. వార్డెన్ చేయగలిగేదేమీ లేదు.

వీరయ్య ఊరివాడే వెంకయ్యగారు. బాగా భూవసతి ఉన్న రైతు.

నిన్న అతనొచ్చినట్టే వీరయ్యా అక్కడికొచ్చాడు. ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఏంచెయ్యాలో తెలియక తెలుసుకోడానికి తన ఊరి పంతులుగారి దగ్గరికి పరుగెత్తాడు వీరయ్య. వెంకయ్యగారు సంవత్సరాదాయం మూడు వేలని రాసిచ్చి కోటాలో ఆఖరు సీటు తన కొడుక్కి దక్కించుకున్నాడు.

యోగ్యత విషయానికొస్తే వెంకయ్యగారి మీద వీరయ్యకీ, వెంకయ్యగారి కొడుకు మీద తవిటయ్యకీ న్యాయం జరగాలి. కానీ జరగదు. మొదటివారిలాగ రెండోవారు జరిపించుకోలేక పోయేరు. వార్డెన్ జరిగించలేదు.

అదీ ‘అసహాయత’.

నేరుగా చెప్పుకుంటే యీ విశేషాన్నీ, పై వృత్తాంతాన్నీ పై చెప్పిన క్రమంలో చెప్పుకోవాలి. ‘చందమామ’ వంటి బాలల పత్రికలో తప్ప ఇప్పటి కథలు ఇలా వాటిని చెప్పవు.

‘అసహాయత’ కథ చదివితే వ్యక్తీకరణ పద్ధతిలో ఎలా చెపుతారో, ఎలా చెప్పొచ్చో తెలుస్తుంది.

నేటి సన్నివేశ చిత్రణలో నిన్నటి సంఘటనలు ఒకటి రెండున్నాయి.

నేటి సన్నివేశంలో వర్ణనలున్నాయి. వీరయ్య, తవిటయ్య, వాడెన్ పాత్రలున్నాయి. వాటి సంభాషణలున్నాయి. హావభావాల వివరణలున్నాయి.

ప్రస్తావనకొచ్చిన నిన్నటి సంఘటనల్లో పాత్రలుగా వీరేకాక్, పంతులుగారూ, వెంకయ్యగారూ ఉన్నారు. వారి చేష్టలున్నాయి.

ఇలా యీ పాత్రలూ,వారి చేష్టలతో కూడిన సంఘటనలూ, సన్నివేశాలూ, వారి మధ్య సంభాషణలూ, పాత్రల హావభావాలూ – తదితర వర్ణనలద్వారా పై వృత్తాంతం, అందలి విశేషంతో కూడిన కథా వ్యక్తమయ్యాయి.

‘అసహాయత’ కేవలం ఒక కథ చెప్పడమే కాక ఒక జీవిత వాస్తవాన్ని మన ముందుంచే ప్రయత్నం కూడా చేస్తుంది. దాని ప్రస్తావన వేరే వ్యాసంలో వస్తుంది.

అందాకా కథ చెప్పడం గురించి మాత్రమే చెప్పుకుందాం.

* కథ చెప్పడం రెండు రకాలు. ఒకటి నేరుగా చెప్పడం. రెండవది కథా సామాగ్రిని రమ్యంగా అమర్చడం ద్వారా కథను వ్యక్త్మ చేయడం.

*వర్ణనలూ, సన్నివేశాలూ వాటిలో పాత్రలూ, వాటి మధ్య సంభాషణలూ సంఘటనలూ – వాటి హావభావాల చిత్రణలూ ఇవీ, యిలాంటివి మరికొన్నీ కలిపి కథాసామాగ్రి అవుతాయి.

*వృత్తాంతం వృత్తాంతంగా ఉంటూనే అందులో ఇమిడి ఉన్న విశేషాన్ని వ్యక్తం చేసేది కూడా అవుతుంది.

*అలాగే వృత్తాంత నిర్మాణానికి ఉపయోగపడే సామాగ్రి అందులో భాగాలుగా ఉంటూనే వృత్తాంతాన్నీ, విశేషాన్నీ కూడా వ్యక్తం చేసేవవుతాయి.

 

Posted in వ్యాసం | Tagged , , | 2 Comments

ఇప్పుడైనా..

పుడుతూనే

ఉగ్గుపాలతో పాటు విషం తాగి విశ్రమించిన జీవితాలివి

మెలికలు తిరిగుతూ కూడా బాధే సౌఖ్యమనే దౌర్భాగ్యం మనది

నిలువునా వ్యాపించిన సాంప్రదాయం మత్తులో

భయం మందు తాగి తూలుతున్న అస్థిపంజరాలు మనవి

గిడసబారి మరుగుజ్జులైన ఆత్మలు ఆవహించిన శరీరాలు మనవి

మన వాస్తవాలు భూతద్దంలో చూపే శిలాజాలైన  భావాలు

అవాస్తవాలకు అలంకారాలద్ది భ్రమే నిజమనే సంస్కృతికి నిలువుటద్దాలు

పదాల సొగసుల్లో పదియుగాల అనుభవాలు పండిస్తూ

నిజానికి సమాధులు తవ్వే తత్వం

 

నేను మాత్రం …నేను మాత్రం

ఎక్కిన విషం విదిలించేసుకుని కళ్ళువిప్పిన నూతన తేజస్సును

ఆధునికత నెన్నుదుటన ప్రజ్వలించే సూర్యబింబాన్ని

వ్యక్తిత్వం పీల్చుకుంటూ, గాయపరచే ముళ్ళపొదలను నరుక్కుంటూ

స్రవిస్తున్న రక్తాశ్రువులతో కొత్తదారులు వేసుకుంటూ

ప్రేమ పూల తివాసీ పరచే నూతన శకాన్ని నేను

++

నాకంతా తెలుసని అనుకుంటాను

భౌతిక శాస్త్రం  ఔపోసనపట్టినా, గెలాక్సీలు , గ్రహాలు ,దూరలూ తీరాలూ ఓ పక్కన

మనను మనం మభ్య పెట్టుకునే వాస్తుశాస్త్రాలు, జాతకాలు రుద్రాభిషేకాలూ మరోపక్క

ఎటు చూస్తే అటు మొగ్గే మేధస్సు

విశ్వం అణువణువునా అదేం చిత్రమో

సస్య శ్యామలం సహృదయ భావనే

అదే  లేకపోతే

ఋతువులు పరిభ్రమణ ఏదిశకో

అడవులు  మేఘాల వెంటబడి

బ్రతిమాలో బామాలో బెదిరించో  వర్షించమంటాయా

కొమ్మ కొమ్మ రోజంతా వేడికి మాడి మాడి

గరళాన్ని తాగి అమృతాన్ని ఆవిష్కరిస్తూ

దినుసులకు ఊపిరి పోస్తుందా

విశ్వసమాజం అణువణువూ పరోపకారాన్నలదుకుంటుందా?

ఇప్పుడైనా ఒక్కసారి కళ్ళువిప్పి

చెక్కని సూత్రాలు జీవితాన చెక్కుకోలేక పోతే

ఏముంటుంది విషం తలకెక్కిన తరువాత

చచ్చుబడిన మానవ జాతి కాక

Posted in కవిత్వం | 5 Comments

కథ చెబుతారా? జనవరి 2012

కథకు నేపథ్యం – ‘ ప్రయాణం ‘.

ఆ సందడి, ఆ మనుషులు, సంఘటనలు ..

ప్రేమయాత్రలో, తీర్థయాత్రలో…గాలిలో తేలుస్తారో, రైలు లో పరుగెత్తిస్తారో ..

ఏమేమి చేస్తారో, ఎవరెవరిని చూపిస్తారో..మీయిష్టం !

 

సరదాగా నవ్వులతో  సాగిపోవాలి అన్నదే మా ఆంక్ష, ఆకాంక్ష.

 

గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.

Posted in కథ | Comments Off on కథ చెబుతారా? జనవరి 2012

సత్యప్రభ – 4

7 వ ప్రకరణం.

మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది.

“ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.” అని మహారాజు పలికాడు.

“ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.” అని చెప్పాడు మహామంత్రి.

“రెండు కారణాలచే ఈ సమస్య ఈ రాజకులంలో చర్చింప బడాల్సి ఉంది. రాజకులం ఉత్తరువు పొందకుండా రాజకుమారులపై గాని, రాజకుమారికలపై గాని, సామంత రాజులపై గాని, రాజ స్నుషలపై గాని, సామంత రాజ పత్నులపై గాని, దండార్హమైన నేరాన్ని, ఆరోపింఛే అభియోగాన్ని తీసుకొని రావడానికి వీలు లేదని నిబంధన ఉంది. చంద్రప్రభా దేవి సామంత రాజ పత్ని, రాజకులం ఉత్తరువు లేనిదే, మోసానికి ఆమెపై అభియోగం తెచ్చుట సాధ్యం కాదు. ఇది మొదటి కారణం.రెండవ కారణం ఏమిటంటే, అభిషిక్తుడయిన సామంత రాజు సరి అయిన వారసుడు కాడని ఎవరైనా రాజధర్మాసన సన్నిధిలో వ్యాజ్యం తెచ్చుటకు ముందుగా రాజకులం ఉత్తరువు పొంది ఉండాలి.

సచివుని మాటలు విన్న మహారాజు తనలో ఇట్లను కొన్నాడు.! ‘ ఇన్నాళ్లు మహామంత్రిగా పని చేసినా చిన్న మామయ్యకి రాజకులంతో సంబంధించిన నిబంధనలు కూడ చక్కగా తెలియవు. ఏదో మోరతోపు కొట్టుకొని పోతున్నాడు.

“సచివుడు చెప్పినది వాస్తవమే,” అని ప్రకాశంగా అన్నాడు మహారాజు.

“అది వాస్తవమే అయితే — ”

“మీరు నిబంధన చూడలేదా ? ఐతే అని అంటున్నారు ?”

“ముసలి వాణ్ని — మరచి పోయాను.”

“అయితే మీ వాక్య శేషాన్ని ముగించ వచ్చును.”

“ఈ సమస్యని విచారించడానికి మహాప్రాడ్వివాక తృతీయమైన రాజకులానికే అధికారముండును. న్యాయ సూత్రాలతో సంబంధించి ఉంది కదా ఈ సమస్య ?”

“ఇట్టి సమస్యలను చర్చించునపుడు న్యాయ సూత్రాలతో పని లేదు. ఔచిత్యం మాత్రమే చర్చించ బడుతుంది. అందువలన ఈ సమస్య అంతరంగిక శాఖకే సబంధించింది.” అని చెప్పాడు సమయోచితంగా సచివుడు.

“నిజమే ! ఇక చర్చని సాగించవచ్చును” అన్నాడు మహారాజు.

రూప చంద్రుడే మాట్లాడాడు.

“వృధ్ధురాలును, పూజ్యురాలును అయిన చంద్రప్రభా దేవిని న్యాయస్థానంలో నిలబెట్టి, విచారించడం అనుచితం. అలా అని విచారించడానికి వుత్తరువు ఇవ్వనప్పుడు శాంతిసేనా దేవికి అపారమైన నష్టం కలుగు తుంది.. ఆదిలో రాజకులాన అపవిధ్ధ పుత్రుడు, ఔరస పుత్రి కంటే కూడ ముఖ్య వారసుడు అని నిర్ణయింప బడింది. ఆ విషయం తిరుగ విచారించ వలసిన అవసరం ఉండదు. కాని వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుల వారి అపవిధ్ధ పుత్రుడు కానప్పుడు, ఆ రాజకుల తీర్మానం శాంతిసేనా దేవిని బంధింపదు కదా ! అతడు అపవిధ్ధ పుత్రుడు కాడని రుజువు పరుస్తానని భర్తృదారిక వ్రాసి ఉన్నారు.దానికి రాజకులం అవకాశం ఇవ్వనప్పుడు న్యాయ ప్రకారంగా ఆమెకి రావలసిన ఒక గొప్ప మండలం ఆమెకి రానీయకుండా చేయడ మౌతుంది. అంతకంటే ఆమెకి నష్టం ఏముంటుంది ? ఒకరి గౌరవాన్ని రక్షించడానికై మరొకరికి అపారమైన నష్టం కలిగించడమా, లేక ఒకరి న్యాయమైన హక్కుని కాపాడడానికి ఇంకొకరి గౌరవానికి హాని కలుగ జేయడమా అన్న విషయన్నే రాజకులం ఇప్పుడు తీర్మానించ వలసి ఉంది. ఈ రెండింటిలో ఏది మేలు ? ఇదే మనకిప్పుడు చర్చనీయాంశం !”

మహారాజు మహామంత్రిని చూసి , “చిన్న మామయ్యా ! మీ అభిప్రాయం ఏమి ?” అని అడిగాడు.

“శాంతిసేనా దేవి విన్నపం త్రోసి వేయడం ఏ విధంగా తప్పో నా కింకా బోధపడడం లేదు.”

“ఆమె విన్నపాన్ని త్రోసివేస్తే ఆమెకి నష్టం ఉందదనా మీ తాత్పర్యం ?”

“వీరేశ్వర భట్టారకుడు అపవిధ్ధుడు కాకపోయిన, కృత్రిమ పుత్రుడు కావచ్చును. ద్వాదశవిధ పుత్రులలో ఎవడైనా సరే కుమార్తె కంటె ముఖ్యుడని రాజకులం ముందే నిర్ణయించింది. అలా వుండ శాంతిసేనా దేవికి న్యాయమైన నష్టం కలుగుతుందని మన మెట్లు నిర్ధారణ చేయగలం ?”

“మేఘస్వామి భట్టారకుల వారు పిల్లవాడు అపవిధ్ధుడనే ఎంచి, తన భార్యకి పెంచుకోవడానికి అనుఙ్ఞ యిచ్చారు..చెల్లెలి కుమారుని భార్య గుప్తంగా తీసుకొని వచ్చిందని తెలిసినట్లయితే అనుఙ్ఞ నిస్తారా ? అందు వల్ల ఆ పిల్లవాని కృతిమత్వ విషయంలో తండ్రికేమిన్నీ సంబంధం లేదు. ఆ పిల్లవాడు చంద్రప్రభా దేవికి మాత్రమే కృత్రిమ పుత్రుడు కావచ్చు. అంతేకాని మేఘస్వామి భట్టారకుల వారికి కృత్రిమ పుత్రుడు ఎట్లగును ?” అన్నాడు సచివుడు.

“కాబట్టే ఇది క్లిష్టమైన న్యాయ సమస్య ! దీన్ని మనం కొన్ని క్షణాలలో నిర్ణయించడం సాధ్యం కాదు. ఆలోచించడానికి వ్యవధి అవసరం,” అన్నాడు మహామంత్రి.

“క్లిష్టమైన ఈ న్యాయ సమస్యని ఆలోచించడానికి రాజధర్మాసనం ఉండనే ఉంది. అది దాని పని. పాక్షికంగా నైనా శాంతిసేనా దేవి సింహాసనం పొందే అవకాశం వున్నప్పుడు, ఆ అవకాశాన్ని ఆమెకి మనం ఎందులకు ఇయ్యకూడదు! చంద్రప్రభా దేవి గౌరవ భంగం ఒక్కటే దీనికి అడ్డుగా ఉంది. అందువల్ల ఏ తప్పు మేలా అని మనం ఇప్పుడు నిర్ధారణ చేయాలి.”

“చిన్న మామయ్యా ! క్లిష్ట సమస్యలను విచారించ వలసిన ఆవశ్యకత లేదు కాబట్టి, మీరు వ్యవధి తీసుకొనక్కర లేదుని నా మతం ! శాంతిసేనా దేవి విన్నపం త్రోసివేయాలా, లేక అంగీకరించాలా ? ఆ విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి.”

సునందునికి ఆ రాత్రి పాపరాత్రిగా కనిపించింది.. మహారాజు మనస్సు తనకి అనుకూలంగ లేదు. అయిన అతడు తన ప్రయత్నాన్ని వదలకుండా ఇలా అన్నాడు-

“మహాప్రభో ! శాంతిసేనా దేవికి, వీరేశ్వర భట్టారకుల వారికి ఇద్దరికీ నష్టం లేని మార్గాన్ని అన్వేషించడానికే నేను వ్యవధి కోరాను. సచివుడన్నట్లు వృధ్ధురాలును, పూజ్యురాలును అగు చంద్రప్రభా దేవిని న్యాయస్థలానికి ఈడ్చుకొని రావడం గాని, సుమారు ఇరవై రెండేండ్లు శ్రీవారి స్వహస్తాలతో ఇచ్చిన రాజ్యన్ని అనుభవిస్తున్న వీరేశ్వర భట్టారకుల వారిని పదభ్రష్టుని చేయుట గాని నాకు సమ్మతాలు కావు.”

మహామంత్రి మాటలకు మిక్కిలి దాక్షిణ్య వంతుడైన మహారాజు లొంగిపోతాడేమోనని సచివుడు భయపడ్డాడు. వానికి ఒక విచిత్ర తత్కాల యుక్తి స్ఫురించింది. దానిని వాడు త్వరగా రాజ సన్నిధానంలో బహిరంగ పరిచాడు !

“మహాప్రభో ! చంద్రప్రభా దేవికి గౌరవ హాని లేకుండా విచారణ చేయుటకు ఒక ఉపాయం ఉంది.”

మహారాజు మిక్కిలి ఆతురతతో,”అది ఏది ?” అని ప్రశ్నించాడు.

“చంద్రప్రభా దేవి చెల్లెలు చంద్రముఖిన్నీ, ఆమె భర్త ధనపతిన్నీ ఇప్పటికీ జీవించి ఉన్నారు. వారు దేవిని తప్పు త్రోవ పట్టునట్లు ప్రోత్సహించి తమ పిల్లవానిని పార వేసి, ఆమెని పెంచునట్లు చేశారని వారిపై ఆరోపించిన దేవికి గౌరవ హాని కలుగదు.”

“ఈ సంవిధానం బాగుంది,” అని మహారాజు మహామంత్రిని చూసి,”చిన్న మామయ్యా ! మీరేమంటారు ?” అని ప్రశ్నించాడు.

సునందునికి, చంద్రప్రభా దేవికి, గౌరవ హాని అగునని చింత ఏ మాత్రము లేదు. అతని ఘోష అంతా అల్లునికి రాజ్యభ్రంశం కాకూడదనియే ! తన మాటకు మహారాజు బదులు చెప్పక ముందే సచివుడు మధ్యలో కలుగ జేసుకొని మాట్లాడి ప్రభువును ఆ గాలిలో ఎగురగొట్టుట మహమంత్రికి కోపాన్ని కలుగ జేసింది. అయినను ఆ వృధ్ధ మంత్రి తన కొస ప్రయత్నాన్ని విడువ లేదు.

“మహప్రభో ! నేను సంధిని గురించే ఆలోచిస్తున్నాను.”

“ఇప్పుడు శాంతి సేనా దేవి విన్నపం అంగీకరించినంత మాత్రాన, సంధికి అవకాశం పోదు. అంగీకరించ వచ్చునా, లేదా ? అన్నదే మీరు ఇప్పుడు చెప్పాలి.”

“అంగీకరించే పక్షంలో విచారణ తప్పకుండా జరుగుతుంది. విచారణలో శాంతిసేనా దేవికి జయం కలిగితే వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుని పుత్రుడు కాడని స్థిరపడుతుంది. తనకొక కర్మనడిపించు పుత్రుడు వున్నాడని తృప్తితో వారు దివంగతులయ్యారు. ధర్మాసనపు తీర్పు అందులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి పుంసంతతిని మనం తుడిచి వేసినట్లే అవుతుంది. కాబట్టి వ్యవధి కావాలంటున్నాను.”

సుచంద్రునికి ఇంత సేపటికి తన మహామంత్రి తత్వం బోధపడింది. అతడు తన కూతురు ద్వారా, ఏదో ఎత్తు పన్ని తన్నంగికరింప జేయడానికి వ్యవధి కోరుతున్నాడని తలంచాడు. అందువలన మహామంత్రికి వ్యవధి ఇవ్వకుండా ఉండడానికే మహారాజు తీర్మానించు కొన్నాడు. ఆ నిశ్చయంతో ఇలా అన్నాడు.

“ఇప్పటి పని ఇప్పుడే ముగిసి పోవాలి. సంధికి మంచి మార్గం మీకు తోచినప్పుడు నాకు చెప్పండి. నేను దానికి అనుకూలంగా ప్రయత్నిస్తాను.”

“తండ్రి పుత్రుడని విశ్వసించిన ఒక పిల్లవానిని అతని పరోక్షంలో, అతని పుత్రుడు కాదని నిర్ణయించ డానికి ఏ న్యాయస్థానానికీ హక్కు లేదని నా మతం. కాబట్టి శాంతిసేనా దేవి విన్నపాన్ని త్రోసి వేయ వలసిందే !”

మహారాజు సచివుని ముఖం చూసాడు.

“మేఘస్వామి భట్టారకులు వీరేశ్వర భట్టారకుని పెంపకాన్ని, పుత్రార్థం అంగీకరించారో, ధర్మార్థం అంగీక రించారో మనకి తెలియదు. వారు వీరేశ్వర భట్టారకుని తన పుత్రునిగా ఎప్పుడూ ప్రకటించ లేదు. ఉపనయనాన్ని ఆచార్యుల చేత చేయించారు గాని, స్వయంగా చేయించ లేదు. కాబట్టి వారు తన జీవిత కాలంలో అతనిని (వీరేశ్వర భట్టారకుని ) తన పుత్రునిగా విశ్వసించడం సంశయ గ్రస్తం ! కనుక శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరించాలని నా మతం.”

“తండ్రి భ్రాంతితో విశ్వసించినా, దాన్ని న్యాయస్థానం మన్నించి తీరాలని నిర్భంధం కలదా, అన్న విషయమే సంశయగ్రస్తంగా ఉంది. కాబట్టి నేను సచివునితో ఏకీభవించి, శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరిస్తున్నాను. ఆమె విన్నపం రాజకులంలో అంగీకరింప బడినట్లున్నూ, ఆమె మోసమునకై చంద్రప్రభా దేవిపై కాకుండా, చంద్రముఖి దంపతులపై అభియోగం తెచ్చుకోవచ్చునని కౌండిన్య ధర్మపాలునికి రేపు ప్రాతఃకాలానికి సందేశాన్ని పంపండి.”

మహారాజు సుచంద్రుని నిర్ణయాన్ని విన్న పిమ్మట సునందుని వెన్నెముక విరిగినట్లయింది. ‘ అనాధ పద్మావతీ ! ఇంక నిన్ను ఎవరు రక్షిస్తారు ? వెర్రికుక్క విషం వలె చిత్రకూట రాష్ట్ర సింహాసనోత్తరాధికారి సమస్య తిరిగి బయలు దేరింది. ఇప్పుడేం చేయాలి.? ’ అని అతని మనసు శోకించింది. బహిరంగంగా –

“ఆఙ్ఞాప్రకారం అలాగే చేస్తాను.” అన్నాడు దీనంగా.

‘ ఇన్నాళ్లకి ఇతని దశ తిరిగింది. ’ అని సచివుడు లోలోపల సంతోషించాడు.

“చిన్న మామయ్యా ! రేపు మహారాఙ్ఞి వర్ధంత్యుత్సవం. కనుక ఉత్సవం ముగింఛే వరకు ఈ రాత్రి రాజకుల చర్యలను ఆమె చెవిలో వెయవలదు.”

“చిత్తం” అన్నాడు మహామంత్రి.

సచివుని ఉద్దేశం నెరవేరింది. మహామంత్రి పలుకుబడి ఈ విధంగా ఆ రాత్రి భూస్థాపితం కావింప బడింది. దానికి పునర్జీవితం వచ్చే ఆశ కూడా అంతగా కన్పట్టుట లేదేమో !

===========

8 వ ప్రకరణం.

మరునాడు మహారాఙ్ఞి లీలావతీ దేవిగారి వర్ధంత్యుత్సవం జరిగింది. ప్రాతఃకాలంలో మహావైభవంతో ఆయుష్య హోమం నెరవేర్చబడింది. హోమానంతరం కోటలోని మైదానం ముందు, ఆమె పురస్త్రీలందరికీ దర్శన మిచ్చింది. మధ్యాహ్నం బీదలకు, బ్రాహ్మణులకు సంతర్పణలు జరిగాయి. భోజనానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత అంతఃపురం లోని పెద్ద కచ్చేరి సావిడిలో సాక్షర నారీ సభ సమావేశ మయింది. ఆ వర్షపు వర్ధంతిలో భగవతి శుభ్రాంగి గురుకులంలో చదువుకొని కవిత్వం చెప్పగల కన్యకల కవిత్వ పరీక్ష జరుగునని ముందే చేటీ జనాధ్యక్షురాలు భృంగాలక ప్రకటించి ఉండింది..రాజధానిలోని చదువుకొన్నస్త్రీలందరూ సభలో సన్నిహితులయ్యారు.

నారీ సభా ప్రేక్షణార్థం కూడిన పురుషుల ఆసన పంక్తులు ఒక ప్రక్కగా ఉన్నవి. పదునేడుగురు పెద్ద మనుష్యులు ఆ భాగం మొదటి పంక్తిలో ఆసీనులై ఉన్నారు ఆ పంక్తిలో మధ్య మహారాజ సుచంద్ర భట్టారకుడు కనక సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. అతని దక్షిణ పార్శ్వమందు కుమార శక్తిధరుడు, వామ పార్శ్వమందు కుమార భోగనాధుడు కూర్చొని ఉన్నారు..భోగనాధునికి కుడివైపుగా చిత్రకూట మహా మండలేశ్వరుని కుమారుడు దండనాయక రణేశ్వరుడు, మహామంత్రి సునందుడు, రాష్ట్రీయుడు వీరనందుడు, మహా సమాహర్త హేమచంద్రుడు, కోశాధ్యక్షుడు గుణాకరుడు, దూతసామంతుడు విశాలాక్షుడు, దండనాయక చండసేనుడు, కూర్చొని ఉన్నారు. శక్తి ధరునికి ఎడమవైపు వరుసగా సేనాపతి రణంధరుడు, పురోహితుడు వాణీధరుడు, మహా ప్రాడ్వివాక సత్యవ్రతుడు, సచివ రూపచంద్రుడు, బ్రహ్మకుల పరిషత్పతి ధర్మపాలుడు, ఆచార్య విషమ సిధ్ధి, ఆచార్య భవనంది కూర్చొన్నారు.

నారీ సభలో ప్రత్యేకంగా అమర్చ బడిన వేదికలో మధ్యన కనకాసనమున లీలావతీ దేవి కూర్చొని ఉన్నది. ఆమె దక్షిణ పార్శ్వమందు భగవతి శుభ్రాంగి, వామ పార్శ్వమున యోగిశ్వరి ధవలాక్షి కూర్చొని ఉన్నారు. ఇద్దరు చేటికలు చామరములతో రాణిగారికి విసురుతున్నారు.

సమ ప్రదేశంలో వేయబడ్డ ఆసన పంక్తులలో మొదటి పంక్తిలో పదముగ్గురు స్త్రీలున్నారు.మధ్యన ఉన్నత కనకాసనంలో రథినీ కుమారి కూర్చొని ఉంది. ఆమె కుడి పార్శ్వములో వరుసగా ఉన్మత్త సిధ్ధ కవీశ్వరి రాజకాళి, సత్యప్రభ, మణిమాల, మధువాణి, ఆమె సవతి తల్లి కాంతామణి, నాగకన్య పర్ణిని కూర్చొని ఉన్నారు.సత్యప్రబా రథినుల ప్రయత్నం వల్ల రాజకాళి ఆ సభకి వచ్చింది. ఆమె మాటిమాటికీ వెళ్లి పోవడానికి ఉంకిస్తున్నా, సత్యప్రభా రథినులు ఆమెను ఆపుచేస్తున్నారు.

రథినీ కుమారికి ఎడమ వైపున వరుసగా ఫలిని, భానుమతి, వీర సింహుని చెల్లెలు విలాసవతి, కనక వల్లి, విశాలాక్ష పుత్రి కుముదాక్షి, ధరణి, కూర్చొన్నారు. భృంగాలక, ధారావతి, ఙ్ఞానేశ్వరి, చంపావతి, పద్మాక్షి, కాత్యాయని, కామసేన మొదలైన పురనారీ మణులు కూర్చొని ఉన్నారు.

ఒక్క ఆంధ్ర సామ్రాజ్యమే కాదు, భరత ఖండ మంతటి సౌందర్యం ఆ నారీ సభ యందు కేంద్రీకృత మయిందని చెప్పవచ్చును. సౌందర్య తత్త్వఙ్ఞుడైన రాజసచివుడు రూపచంద్రుడు ఏమంటున్నాడో (స్వగతంగా) గమనిద్దాం.

‘ఈ రథినీ కుమారి శరీర ప్రభ జ్యోతిర్మయామృతం అని చెప్పక తప్పదు. ఈమె ముఖం శీతల దివాకర మండలం అని చెప్పడం సరి అయినది. ఈమె తన జ్యోతిస్సుతో సభాశాల నంతటినీ ముంచి వేస్తూంది ! ఈమె సౌందర్యం మనుష్య జాతి దుర్లభం. ఈమెను ఒకమారు చూసిన మహేంద్రుడు తన వేయి కండ్లు సార్థకాలయ్యాయని తలంచ గలడు.’

‘ఈ సత్యప్రభ చక్కదనం మాత్రాతీతం. వ్యాయామ విభక్తాలైన ఈమె అంగాల సౌష్టవం నిరుపమానం. ఈమెకు స్వయంవరమే చాటిస్తే, ఇంద్రాగ్ని యమ వరుణులు మరొకమారు భూమికి దిగక మానరు. శ్రీశైల మహా మండలేశ్వరుని ఏక పుత్రి రత్నప్రభను పెండ్లాడి, మహామండలేశ్వర పదవి పొందడం కంటె, ఈమెను పెండ్లాడి సామాన్య గృహస్థునిగా ఉండడమే మహాభాగ్యమని నా తలంపు.’

‘ఈ మణిమాల బ్రాహ్మణ జాతికి కీర్తి తెచ్చిన దివ్య లావణ్యవతి. వికసించిన పద్మం లాగ ఉన్న ఈమె ముఖమందు మహాలక్ష్మి వాసం చేస్తూంది. చతుర్ముఖుడు గాని ఈమెను చక్కగా నిదానించి చూస్తే, అతనికి తిలోత్తమ స్మరణకి రాక మానదు.’

‘ఈ ఫలిని పోతపోసిన శరశ్చంద్ర చంద్రిక. భూమికి దిగిన భారతీ తేజోంశము. మూర్తీభవించిన ప్రసన్నత. ఈమెను మహేశ్వరుడు వీక్షిస్తే చిరకాలం నుండి తాను తలపై మోస్తున్న గంగాదేవిపై కొంచెం అవఙ్ఞత వహించకుండా ఉండలేడు.’

‘ఈ మధువాణి స్థిరయై భూమిపై సంచరించు విద్యుల్లత. ప్రాణాలతో వెలసిన బంగారు బొమ్మ. బంగారనికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది. ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఈమెనే గాని నారాయణుడు ఒకసారి అవలోకిస్తే తాను వక్షప్రదేశంలో ధరించు మహాలక్ష్మిని పరిహసింపక మానడు.’

’ఈ ధరణి అధికాలంకారాలు లేక పోయినా, చక్కగా అలంకరించుకొన్న సంపన్న కన్యలను మించి శోభిస్తూంది. ఈమె జ్యోతిష్మద్విశాల నేత్రాలు ఈమె ముఖానికి అలంకారాలు. ఈమె శ్యామలంగా ఉన్నా లావణ్య తరంగ మాలిని. కృష్ణ ద్వైపాయన ముని ఈమెను ఒకసారి చూస్తే., తన జయేతిహాస నాయిక పాంచాలి ఇంకొకసారి భూలోకానికి దిగిందని వర్ణింపక మానడు.’

’ఈ పర్ణిని స్వర్గము నుండి మన లోకానికి పంపిన అచ్చర. ఈమెను చూసినా, ఈమెతో మాట్లాడినా ఈమె సంగీతాన్ని విన్నా, మనుష్యుల పుణ్యఫలం కొంత వ్యయం కాక మానదు. ఈమెను ఒకసారి దర్శించునెడల నలకూబరుడు రంభపై ఇంచుక అనాదరణ చూపక మానడు.’

‘ఈ భానుమతి వేదిగతాగ్ని జ్వాలవలె పవిత్ర మూర్తి. ఈమెను చూస్తే చాలు వైశ్వానరుడు‘ తన ప్రియకాంత స్వాహాదేవి అని భ్రమ పడక మానడు.!’

‘ఈ కనక వల్లి అభిమాన దేవత వలె సౌందర్యన్ని పోషిస్తూంది. ఈమె కోటీశ్వరుని ఏకైక పుత్రిక కాబట్టి ఈమెకు చెంద వలసిన మహా సంపద ఈమె సౌందర్యపు వెలను హెచ్చిస్తూంది.’

‘ఈ కన్యా నవకం శ్రీకాకుళ నగరంలో అమూల్య రత్ననవకం. నగరంలోని యువకులు వీరిలో ఒకరినైనా చూడని దినం దుర్దినమని తలస్తారు. వీరి ప్రభావం వల్ల శుభ్రాంగీ గురుకులానికి కీర్తి వచ్చింది. మహిమ హెచ్చింది. జనులకది యాత్రా స్థలమైంది. కృష్ణానదీ యాత్రకు వచ్చిన ప్రతీ వ్యక్తిన్నీ ఈ తొమ్మిది దేవతా విగ్రహాలని దర్శించి పోవలసిందే !’.

’ఈ కుముదాక్షి నయవేత్త విశాలాక్షుని చేతి జృంభకాస్త్రము. ఈమె చూపులు మదన జృంభకాస్త్ర జ్వాలలే అగును..విశాలాక్షుడీ అస్త్రాన్ని కుమార భోగనాధుని సాధించుటకై దాచి ఉన్నాడు. ఈమె తండ్రి వద్దనే సర్వ విద్యలను అభ్యసించింది. గురుకులం లోని తొమ్మిది రత్నాలకి తీసిపోని పదవ రత్నమిది !’

‘ఈ రాజకాళి సౌందర్యం మలిన వేషం వల్ల నివురు కప్పిన నిప్పు వలె ఉంది. ఈమె నోరెత్తిన చెవులు కల వారందరూ లొంగి పోవలసిందే! ఈ మె కంఠంలో సర్వేశ్వరుడుంచిన మాధుర్యం అపారం! ఈమె విశాల నేత్రాల లోని జ్యోతిస్సు, ఆకర్షణ శక్తి అత్యద్భుతం. ఈమె కవిత్వం లోని భావాలు అత్యంతం రమణీయాలు!’

‘ఉన్నత వేదికపై కూర్చొన్న మువ్వురిలో ఒకతె (లీలావతి ) తన సౌందర్య ప్రతాపంఛే ఆంధ్రేశ్వరుని వశం చేసుకొని ఈ గొప్ప సామ్రాజ్యాన్ని ఏలుతూంది. మరొకతె ( ధవలాక్షి ) తన సుందర ముఖభాగ్యం చేతనే ఆబాల గోపాలాన్ని శాసిస్తూంది. కీర్తి మాత్రం ఈమె యోగ మహిమకు వచ్చింది ! ఈమె ఇంకా అవివాహితగా ఉండడం చింతాకరం ! ఇంకొకతె ( శుభ్రాంగి ) జటావల్కల ధారిణియై, మూర్తీభవించిన విరక్తవలె కన్పడుతూంది. అలా ఉన్నా ఈమె సౌందర్యం నేత్ర్ర్పరణ కావించుతూనే ఉన్నది.!’

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 4

సీరియల్ కిల్లర్లు

సాయంకాలమైంది.

ఈసురోమంటూ, బండీడ్చుకుంటూ అంకులు షాపుకు చేరాను. నా కోసమే ఎదురుచూస్తున్నట్టు కూచ్చున్నాడు వాడు. అంకులంటే నిజంగా అంకులు కాదు.. అంకినీడు వాడి పేరు. ఎవరినీ పేరు పెట్టి పిలిచే అలవాటు లేని చదువుకునే రోజుల్లో వాడికా పేరు పెట్టాం. ప్రస్తుతం వాడీ కంప్యూటరు హార్డువేరు కొట్టు పెట్టుకుని బతుకెళ్ళదీస్తున్నాడు.

“ఏరా మందేద్దామా” అన్నాడు నేను వెళ్లగానే.

టీవీ సీరియళ్ళు చూసీ చూసీ చిరాకొచ్చేసిందో, మందేసి చానా రోజులైందోగానీ.. సరే, పద అన్నాన్నేను.

‘ఉండాగు తమ్ముడొస్తాడేమో చూద్దాం’ అన్నాడు. మేం ముగ్గురం దాదాపు రోజూ కలుస్తూనే ఉంటాం.

ఇలా అంకులు అంటూండగానే అలా తమ్ముడొచ్చాడు. తమ్ముడు ఎర్రగా, పొట్టిగా, సన్నగా ఉంటాడు. వీడి అసలు పేరు సుధాకరు. ఎరిగిన వాళ్ళందరూ తమ్ముడనే పిలుస్తారు. ఎరగని వాళ్ళక్కూడా వాణ్ణి చూస్తే తమ్ముడనే అనాలనిపిస్తుంది. అంటారు కూడాను. కానీ, వాడికి మాత్రం ఆ మాటంటేనే అసహ్యం.  వాడు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ అసహ్యించుకునేది “తమ్ముడు” అనే మాటనే -టీవీ సీరియళ్ళ కంటే కూడా. దానిక్కాస్త ఫ్లాష్‌బ్యాకుంది.

కాలేజీలో ఉండగా మా అందరి కామన్ కలల రాణి తనూజ వీణ్ణోరోజు “తమ్ముడూ, మా క్లాసురూములో నా మినీడ్రాఫ్టరు మర్చిపోయాను తెచ్చిపెడతావూ” అని అడిగింది. ఆ రాత్రి మొదటిసారి వాడు ఆత్మహత్య చేసుకోబోతే మేం అడ్డం పడ్డాం. ఇక ఆ రోజు నుండి వాణ్ణి మేం తమ్ముడనే పిలిచే వాళ్ళం. (కొందరు బామ్మర్ది అనీ పిలిచేవారులెండి.) సామ దాన భేద దండోపాయాలన్నీ వాడినా గానీ, వాడు మా చేత ఆ పిలుపు మానిపించలేక పోయాడు. చివరికి సంధి చేసుకున్నాడు.. మేం నలుగురమూ (వాడూ మరో ముగ్గురం కలిసి ఒక గదిలో ఉండేవాళ్ళం) ఉన్నప్పుడు తప్ప మరెప్పుడూ వాణ్ణి అలా పిలవకూడదు అని. పాపమని ఒప్పేసుకున్నాం. కానీ పాటించిన పాపాన పోలేదెప్పుడూ!

అయితే త్వరలోనే వాడు మరో రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది.. ఓ ఆదివారం చుట్టుపక్కల జనాభాను పోగుచేసి క్రికెట్టు ఆడుతున్నాం. తమ్ముడు మాంఛి స్వింగులో ఉన్నాడు. స్వింగు బౌలింగుతో అల్లల్లాడిస్తున్నాడు.. బ్యాటింగు చేస్తున్న మా ఇంటి ఓనరు రెండో కొడుకు ‘తమ్ముడన్నయ్యా! కాస్త మెల్లగా బౌలింగు చెయ్యవా, ప్లీజ్!’ అని ప్రార్థించాడు. వాడి వేడుకోలుకు వీడు కరుణిస్తాడేమో అనుకున్నాం గానీ వీడు ఏకంగా నీరుగారి పోయాడు. అది మొదటిసారి. ఆ తరవాత నాల్రోజులకనుకుంటా.. మా పనిమనిషి “తమ్ముడుసారూ, రేపు పనికి రానండీ” అని చెప్పింది. అది రెండోసారి. ఆ రెండు సార్లూ వాడి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపేసిన మేం, చిట్టచివరి హెచ్చరిక జారీ చేసాం.. ఈసారి అలా అడ్డంపడము అని. ఇక ఆ తరవాత వాడూ ఆ ప్రయత్నం చెయ్యలేదు. కాబట్టే.. ఇదుగో, ఇప్పుడిలా మా ఎదుట వగరుస్తూ నిలబడ్డాడు.

స్కూటరు స్టాండేసి, జేబుగుడ్దతో మొహం తుడుచుకుంటూ, “ఛిచ్ఛీ, ఎదవ బతుకైపోయిందిరా” అన్నాడు.

నిరంతరం ఎవడో ఒకణ్ణి తిట్టడమో, తన్నుతాను తిట్టుకోడమో వాడి అలవాటు. అంచేత, మేం పెద్దగా పట్టించుకోలేదు. చీమ కుట్టడమో, ఈదురుగాలికి జుట్టు రేగిపోవడమో లాంటి బీభత్సం జరిగుంటుంది లెమ్మని అనుకున్నాన్నేను. ఎలాగూ వాడే చెబుతాడుగదా అని మాట్లాడకుండా అలాగే చూస్తున్నాం. వాడు మాకు చెప్పిందిదీ.. ఎస్సార్ నగర్ లైట్ల దగ్గర ఆగినపుడు వెనకనున్న ఆటోవాడు తల బయటకు పెట్టి ‘తమ్ముడూ రెడ్ లైటు పడింది కదా.. మరి ఆగావేంటి? పోదాం పద, లేదా స్కూటరు కాస్త పక్కకు తియ్యి, నేను పోతా’ అని అన్నాడట. ఆటోవాడు కూడా ’తమ్ముడ’న్నాడని వాడి బాధ. అంకినీడుకీ ఆ సంగతి అర్థమైంది. కానీ అర్థం కానట్టు నటిస్తూ, తమ్ముడి బాధను  ఇంకా ఎగదోస్తూ.. “ఇందులో కొత్తేముందిరా తమ్ముడూ? ఈ ఆటో వాళ్ళంతా అంతేగదా, కాస్త ఆగి, గ్రీను పడ్డాక ఎల్దామనుకోరు, రెడ్డున్నపుడే అడ్డంగా పోదామని చూస్తారు” అని అన్నాడు, నవ్వాపుకుంటూ.

“నువ్వు నోరుముయ్యి, నా ఏడుపు అది కాదని నీకు తెలుసు, అసలు మీ మూలానే కదూ ఇది జరిగింది. చూడు.. ఆటోవాళ్ళకు కూడా తెలిసిపోయింది నా పేరు.” అని పెద్దగా అరిచాడు. నేను వాడి భుజం మీద చెయ్యేసి, దగ్గరగా లాక్కుని, అనునయంగా నిమిరాను. వాడు మెత్తబడి మెల్లగా, డగ్గుత్తికతో “ఈ తమ్ముడు అనే మాట వింటేనే విరక్తి కలుగుతోందిరా. చివరికి మా ఆవిడ, బుడ్డాడు కూడా అలాగే పిలుస్తారేమోనని హడిలిపోతున్నాన్రా, సూరిగా” అని అన్నాడు. నేను వాణ్ణి మరింత పొదవుకోని, సాధ్యమైనంత మృదువైన గొంతుతో “పోనీలేరా తమ్ముడూ, కష్టాలు మనిషిగ్గాక మానుకొస్తాయా” అని సముదాయించబోయాను. వాడు నన్ను విదిలించుకోని, నావంక ఓ సారి వైరాగ్యపు చూపు చూసి, మళ్ళీ “ఛిచ్ఛీ ఎదవ బతుకు, నే బోతా” అని స్కూటరు స్టార్టు చెయ్యబోగా మేమిద్దరం వాడికడ్డం పడి, తీసుకుపోయి అంకినీడు కార్లో కూలేసి, నేరుగా తీసుకుపోయి బార్లో కూలేసాం.

బార్లో..

ఒక వారగా ఉన్న ఓ టేబులు దగ్గర కూర్చున్నాం.  తాగడానికో రకం, తిండానికో రెండు రకాలు చెప్పాం.

పక్క టేబులు దగ్గర ఇద్దరు కూచ్చుని ఉన్నారు. చెయ్యి జాచితే అందేటంత దూరంలో ఉంది, ఆ టేబులు. వాళ్ళ మాటలు చక్కగా వినబడుతున్నాయి. ఇద్దరినీ పరీక్షగా చూసాను. అ గుడ్డెలుతురులో నాక్కనబడిందిదీ.. నేను కూచ్చున్న వరుసలోనే కూచ్చున్నవాడు ఏదో చెబుతున్నాడు. ఎదురుగా ఉన్నవాడు వింటున్నాడు. చెప్పేవాడి మొహం చాలా దయనీయంగా ఉంది. మొహం కంటే కూడా వాడి మాటను బట్టే అతడు దయనీయంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడో ఇంకాస్సేపటిలోనో ఏడ్చేటట్లే ఉన్నాడు. వినేవాడు ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టుగా మొహం పెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి, ముక్కులు పొంగించి దయనీయుడి వంకే చూస్తున్నాడు.

హారరుడు అంటున్నాడు.. “అలా అయితే ఆపేసెయ్యకపోయావా?”.

ఈలోగా మందొచ్చింది. మావాళ్ళు ఛీర్స్ చెప్పి మొదలెట్టేసారు. నేనూ అందుకుని కొద్దిగా చప్పరించాను. తమ్ముడేదో అంటున్నాడు. అది వినేలోగా దయనీయుడి మాట వినబడింది..

“అదీ అనుకున్నారా.., కానీ మా ఆవిడ ఊరుకోనంటోంది” అని అన్నాడు.
హారరుడు “ఊరుకోక ఏంచేస్తుందట?” అన్నాడు
“విడాకులిస్తానంటోంది.”
“ఈ మాత్రానికే విడాకులా?” అని ఆశ్చర్యపోయాడు హారరుడు.
“ఏం చెప్పమంటావురా, అలా తయారయింది నా పరిస్థితి” అని, తలపట్టుకున్నాడు దయనీయుడు.

ఆ సంభాషణకు తలా తోకా దొరకలేదు గానీ ఆసక్తికరంగా ఉంది. అయితే నాకివి అలవాటే. కుస్తీ పట్టైనా సరే.. పజిల్ను సాల్వు చెయ్యడమంటే సరదా నాకు. వాళ్ళ సంభాషణ కొనసాగింది..

“మరి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?”
“అది అర్థం కాకే కదా నీకు మందు పోయిస్తోంది.”
“పోనీ ఆపకు. ఆపాల్సిన అవసరం ఏంటసలు?”
“మళ్ళీ అదేమాట అంటావేంట్రా.. ఎంత వత్తిడి వస్తోందో చెబుతున్నా కదా!”

బారంతా సిగరెట్టు పొగతోటీ, జనం కబుర్లతోటీ నిండిపోయింది. ముందే వెలుతురు తక్కువ.. దానికి తోడు ఈ పొగ కూడా కలిసి ఆ హాలంతా అప్సష్టంగా ఉంది. వీళ్ళిద్దరూ మాట్టాడుకునే విషయం అంతకంటే అస్పష్టంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది. దయనీయుడు ఇంకా అంటున్నాడు..

“ఇప్పటికే హెచ్చరిస్తూ 16 ఫోనులొచ్చాయి”
“ఎహె! ఎవరో బెదిరించి ఉంటారు లేరా, ఈ మాత్రానికే భయపడితే ఎలా”
“మొదట నేనూ బెదరలేదురా. కానీ మానవహక్కుల కమిషనుకు రాసి నాకు ఉరిశిక్ష వేయిస్తామంటున్నార్రా ”
“మానవ హక్కుల కమిషనా? అదేంటి? ఎక్కడుందది?”
“…”

మనూళ్ళోనే ఉందండి, రిటైర్డు జడ్జి దానికి చైర్మను” అప్రయత్నంగా నేను వాళ్ళ సంభాషణలోకి జొరబడిపోయాను.
“థాంక్సండి, మరి వాళ్ళు నాకు ఉరేస్తారంటారా?” అని దయనీయుడు నన్నడిగాడు.
“అసలు మీరు చేసిన తప్పేంటి?” అని అడుగుతూ మరింతగా కలగజేసుకున్నాను.

అతడు అటూ ఇటూ చూసి, దగ్గర్లో వినేవారు ఎవరూ లేరని నిర్ధారించుకుని కొద్దిగా ఇసుంటా జరిగి, నా జబ్బ పట్టుకుని నన్ను కాస్త అసుంటా లాక్కోని, నా చెవిలో.. “మీరు రైలుపట్టాలు చూస్తారా?” అని అడిగాడు.
“పద్దాక చూడను గానీ, ఎప్పుడన్నా ఊరికెళ్ళేటపుడు స్టేషనులో చూస్తాను” అని చెప్పాను.
నన్నో పిచ్చి వెధవను చూసినట్టు చూసి, “ఆ పట్టాలు కాదు సార్, రైలుపట్టాలు.. రైలుపట్టాలు సీరియల్” అన్నాడు.

“ఓ అదా, వెగటు చానల్లో వచ్చే జిగట సీరియలా, నే జూణ్ణు” అన్నాను పళ్ళు కొరుకుతూ.

ఇప్పుడు ఈ దయనీయుడి సంగతంతా అర్థమై పోయింది నాకు. వీడు కూడా రైలుపట్టాల బాధితుడే, ఆ సీరియలంటే భయమేసి, ఇంటికెళ్ళకుండా ఈ బారులో దూరి కాలం గడిపేస్తున్నాడన్నమాట గురుడు! సీరియలు పెట్టొద్దంటే వాళ్ళావిడ ’రాజీనామా’ ఇస్తానంటోంది అని తెలుస్తూనే ఉంది. అతగాణ్ణి వెంటనే ఓదార్చాలని అనిపించింది.

“పర్లేదులెండి, మీరు కాస్త శాంతపడండి, ఏదో ఒకరోజున ఆ డైరెక్టరుకు గుండెపోటొచ్చి చావకపోడు. లేదా ఎవడో ఒకడు వాణ్ణి లేపెయ్యకపోడు. అప్పుడు మనందరం జాలీగా మందెయ్యొచ్చు.” అని అన్నాను.

అప్పటిదాకా నా జబ్బుచ్చుకు కూచ్చున్నవాడల్లా ఏదో పామును పట్టుకున్నవాడిలాగా ఒక్కసారిగా వదిలేసి, వెనక్కు జరిగిపోయాడు. అటుదిరిగి ఏదో గొణుక్కుంటున్నాడు.

ఇంతలో హారరుడు నాతో, “మీరనే ఆ డైరెక్టరు వీడే సార్” అని అన్నాడు.

నేను తేరుకునేలోగానే దయనీయుడు నావైపు దిరిగి, చేతులు జోడించి, “సార్, నేను సీరియలును ఆపేద్దామనే అనుకుంటున్నానండి, కాని ఆ సీరియల్లోని నటులు, చానెలు వాళ్ళూ ఒప్పుకోడం లేదండి. ఆపితే ప్రాణాలు తీస్తామంటున్నారు. చివరికి మా ఆవిడ కూడా ఒద్దంటోంది.. ఆపేస్తే నాకు విడాకులిచ్చేస్తానంటోంది.” అనేసి వలవలా ఏడవడం మొదలెట్టాడు.

సీరియల్ కిల్లర్లుమావాళ్ళిద్దరు కూడా ఈ సంభాషణలో లీనమైపోయారు ఎప్పుడో. ఆ టేబులుకు దగ్గరగా జరిగి కాస్త ముందుకు వంగి దయనీయుణ్ణే చూస్తున్నారు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఎదటోడి మీద పడటానికి సిద్ధమౌతున్న వస్తాదుల లాగా చూస్తున్నారు. వాడెవడో తెలిసిపోయాక వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టయింది మాకు మరి.

దయనీయుడు మమ్మల్ని గమనించినట్టున్నాడు. మా ఉద్దేశాలు కూడా చూచాయగా గ్రహించినట్టు ఉన్నాడు. వెంటనే సంధి చేసుకుంటే మంచిదని రంగంలోక దిగాడు. ఏడుపాపి, అంకినీడు వైపు తిరిగి, “అదికాదు తమ్ముడూ, సీరియలు ఆపకపోతే నన్ను మానవ..”

తమ్ముడు అనేమాట అంకినీడును బైపాసు చేసి, సూటిగా పోయి ఒరిజినల్ తమ్ముడి గుండెలో నాటుకుంది. వాడు వెన్వెంటనే స్పందించాడు..

“ఎవడ్రా నీకు తమ్ముడు? నేను నీకు తమ్ముణ్ణంటరా? నా తాత వయసుంది నీకు, నేన్నీకు తమ్ముణ్ణా?” అంటూ లేచి ఊగిపోతూ వీరంగం మొదలెట్టాడు తమ్ముడు. అప్పటికే మూడు గుండ్రాలు అయినట్టున్నాయి, మావాడికి పట్టపగ్గాలు లేవు. పైగా ఈ దయనీయుడు టీవీ సీరియలు దర్శకుడని తెలిసాక, ఇక వాడికి ఇసుమంత గౌరవం కూడా ఇవ్వనక్కరలేదని తెలిసిపోయిందాయెను!

తమ్ముడి ధాటికి మేమే నిశ్చేష్టులమైపోయాం.. ఇహ దయనీయుడి సంగతి చెప్పేందుకేముంది!

మా వాడికి జీవితంలో అన్నిటికంటే అసహ్యకరమైనది తమ్ముడు అనే మాట అని చెప్పాను కదా.. రెండో అసహ్యకరమైన మాట డైలీ సీరియళ్ళు. పాపమీ దయనీయుడు మొదటి రెండు అసహ్యాలనూ కెలికాడు. ఇహ ఈ దర్శకుడి పని ఐపోయిందనే అనుకున్నాను. నేను తేరుకుని, వాణ్ణి సమాధానపరుస్తూ, ‘తమ్ముడని మాటవరసకే గదా అన్నాడు, పైగా ఆ అన్నది కూడా నిన్నుగాదు.. అంకినీణ్ణి’ అని చెప్పి ఊరుకోబెట్టి, దయనీయుడి దయనీయ పరిస్థితిని వాడికి వివరించాను.

నేను ఇలా అంటూండగానే తమ్ముడు -ఆ మధ్య సీరియళ్ళ గురించి మేం మాట్లాడుకున్న సంగతులను గుర్తు చేసుకున్నాడు.”అవునొరే అంకులూ, మన భాస్కరు గాడి చేత అరెస్టు చేయించి, ఎన్‌కౌంటరులో చంపించేద్దామనుకున్నామూ.., ఈణ్ణేగదూ!” అని అన్నాడు.

అదిరిపడ్డాడు దయనీయుడు.

అంకినీడుక్కూడా అది గుర్తొచ్చి మాంచి కిక్కిచ్చింది. “కాదు కాదురా.. నే జెబుతానుండు” అంటూ గొంతు సవరించుకుని, గ్లాసెత్తి ఓ గుక్క వేసుకుని సిగరెట్టు వెలిగించుకున్నాడు.

దయనీయుడు ఎంతో ఉత్కంఠతో అంకినీడు వంకే చూస్తున్నాడు. హత్యానేర విచారణలో వాదోపవాదాలన్నీ అయ్యాక, తీర్పు కోసం జడ్జి వంక చూసే ముద్దాయి చూపది.. వాణ్ణి చూస్తూంటే నాకూ భలే సర్దాగా ఉంది.

తృప్తిగా ఓ దమ్ము లాగి, తీరుబడిగా వెనక్కి జారగిలబడి, కాళ్ళు జాపుకుని అంకులిలా అన్నాడు “..అలా చేద్దామని అనుకున్నది ఆ కథ రాసినాణ్ణి, అందులోని లేడీ విలన్నీ! ఈణ్ణి కాదు.”

దయనీయుడి మొహంలో ఓ సాంత్వన, గొంతులో చిన్న నిట్టూర్పు.

అంకులు అక్కడితో ఆపలేదు. ఓ క్షణం ఆగి ఇలా అన్నాడు.. “ఈణ్ణి ఏం చేద్దామని అనుకున్నామంటే.. అరెస్టు చెయ్యకుండానే, స్టేషనులోనే పడేసి, అన్నం నీళ్ళు పెట్టకుండా, మొత్తం ఎన్ని ఎపిసోడ్లు తీసాడో అన్ని సార్లు లాఠీచార్జీ చేసి, ఈడు సచ్చాక, తుపాకీతో కాల్చేసి, అపైన ఉరేసి, ఆ తరవాత మురిక్కాలవలో పారేయిద్దామనుకున్నాం” అని అన్నాడు.

“ఔనౌను నిజమేరోయ్, ఇప్పుడు గుర్తొచ్చింది” తమ్ముడు ఊపులోకి వచ్చేసాడు. “నీకు భలే గుర్తురా అంకులూ” ఆరాధనా భావంతో అన్నాడు. దయనీయుడు ఇప్పుడో ఇంకాసేపుట్లోనో స్పృహ తప్పేవాడి లాగా కనబడ్డాడు.

“అదిసరే. సూరిగా! మానవ హక్కుల సంఘమంటాడేం దీడు? దానికీ సీరియళ్ళకీ సంబంధం ఏంటి?” అన్నాడు అంకులు. అంకులడిగిన ప్రశ్నతో దయనీయుడిపై నుంచి చూపు తిప్పుకోక తప్పింది కాదు నాకు.

“ఏంలేదురా, పోలీసులు జనమ్మీద కాల్పుల్లాంటివి జరిపినపుడు అవి మానవ హింస కిందకు వస్తాయి కదా, వాటిని నేరాలుగా భావించి ఈ కమిషను కేసులు పెట్టి విచారిస్తుందన్నమాట.” అన్నాను.

“ఓహో, ఆఫ్టరాల్ పోలీసు కాల్పులకే విచారణలు జరగ్గా లేంది, ఈ సీరియల్ కిల్లర్లను కోర్టులకీడవ లేకపోవడమేంటి! ఏరా తమ్ముడూ?” అన్నాడు అంకులు.

“ఎబ్బే.. లాభం లేదురా! ఈ కోర్టులు మరీ సున్నితంగా ఉంటాయి. మహా అయితే పదేళ్ళ జైలు శిక్షో, యావజ్జీవమో వేస్తాయి. ఇలాంటి ఘోరమైన సీరియల్ కిల్లర్లకు ఖచ్చితంగా ఉరి వేస్తారనుకో! కానీ, వీళ్ళకు ఉరి కూడా చిన్న శిక్షేరా. పైగా ఏ రాష్ట్రపతో మధ్యలో అడ్డం పడి శిక్ష తప్పించినా తప్పించొచ్చు. వీళ్ళకల్లా మనమనుకున్నదే రైటు!” అన్నాడు తమ్ముడు.

దయనీయుడు లేచి నుంచున్నాడు, మళ్ళీ కూచ్చున్నాడు. అటువైపు తిరిగాడు, మళ్ళీ ఇటు తిరిగాడు. హారరుడి చేతులు పట్టుకున్నాడు, వదిలేసాడు. నన్ను చూసి, లేచి నుంచున్నాడు, తిరిగి కూచ్చున్నాడు. ఏమనుకున్నాడో కుర్చీని నా వైపు జరుపుకున్నాడు. గొంతులోనుండి అదో రకమైన శబ్దం, గురకలాగా. పూడుకుపోతున్న గొంతును పెకలించుకుంటూ.. “సార్, సీరియలును ఆపేసే మార్గం లేకగానీ, లేదంటే ఎప్పుడో ఆపేసి ఉండేవాణ్ణి సార్! ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడా ఎవడైనా? మీరే ఆలోచించండి సార్” అని దీనంగా మొహం పెట్టాడు.

ఈసారి హారరుడు కూడా తన కుర్చీని మా టేబులుకు దగ్గరగా జరుపుకుని మా ముగ్గురినీ ఉద్దేశించి “అయ్యా మావాణ్ణి చూసారు కదా ఎలా వణికి పోతున్నాడో. వాడి మీద దయదలచండి. పోనీ, ఆ సీరియలును ఆపించే మార్గమేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి, వెంటనే ఆపేస్తాడు” అని అన్నాడు

ఓ ఘోరకలిని ఆపే అవకాశం వచ్చినందుకు దాన్ని సద్వినియోగ పరచుకోవాలనిపించింది మాకు. తమ్ముడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు..

“ఈ మధ్య జన్మ నక్షత్రాన్ని బట్టి రత్నాలు, వజ్రాలు పెట్టుకోమనే కార్యక్రమం ఒకటొస్తోంది, చూసావా?”
“అవును, చవట చానల్లో వస్తోంది కదా..చూస్తూంటాన్సార్”
“వాడి చేత.. ‘రైలుపట్టాలు సీరియల్లో నటిస్తే ఎవరైనా సరే మటాషై పోతారు. అలా పోకుండా ఉండాలంటే మా వద్ద మాత్రమే దొరికే కోటి రూపాయల విలువైన వజ్రపుటుంగరం పెట్టుకుంటే ఏం కాదు’, అని చెప్పించు. గాలి జనార్దనరెడ్డి తప్ప మరొకడు, కోట్లు పెట్టి ఉంగరం కొనుక్కో(లే)డు కాబట్టి, మీవాళ్ళు సీరియల్లో నటించడం మానేస్తారు” అని అన్నాడు.

ఇంకేముంది, ఆ డైరెక్టరు మావాడి కాళ్ళ మీద పడిపోయి “మంచి ఐడియా సార్. అలాగే చేస్తాను సార్. ఇది వర్కౌటయ్యేటట్టే ఉంది సార్. ఉంటాన్సార్. వస్తాన్సార్” అని అనుకుంటూ హారరుడితో కలిసి హడావుడిగా వెళ్ళిపోయాడు.

అంకులు ఏదో అంటున్నాడు. నాకదేం వినబడ్డం లేదు. త్వరలో ఈ సీరియల్ ఆగిపోద్ది గదా అనే ఆలోచన నాకు మత్తెక్కిస్తోంది.

Posted in కథ | Tagged | 10 Comments

వెన్నెల మేనా..

కలల మెట్ల మీదకొలువు దీరిన జంటబొమ్మలంవెలిసిపోని ఒకే ఆత్మలం – మనం.చల్లగాలులకు పంటగట్ల కెళ్ళిసరసంగా ఒక చెరకు గడ పెరకిఈ మొదలు నువ్వు – ఆ చివర్న నేనూరస మాధుర్యాలను చెరిసగంగా ఆస్వాదించాల్సిన ప్రేమికులం. 

సందె వేళ –

నే సిగ కట్టి, నువ్ చిట్టిచేమంతుల చెండు చుట్టి

మొగలేఱు అద్దంలో మనం – మురుసుకుంటూంటే..

ఫక్కుమన్న చుక్కల భరతం పట్టాలని – పరుగులు తీసే కోడెగాళ్ళం.

 

ఒకరి చేతుల మీద ఒకరంగా

జంట పిట్టలకు మల్లే.. గాల్లో తేలుతూ

పిల్లపక్షులకు ఈత నేర్పాల్సిన ఈడుగాళ్ళం

 

కన్రెప్ప పాటే జీవితం.

కలసి పంచుకునే సంతోషాలే – శాశ్వతం.

 

నలుపు తెలుపు ‘కల’నేత వస్త్రాలు ధరించిన దేహాలం మనం.

చీకటి చీలినప్పుడో..వెలుగు విరిగినప్పుడో..

ఎవరికి వారం ఒకరొకరంగా విడిపోవాల్సిన వాళ్ళం.

 

మనకంతా తెలుసు జీవన సారం.  ఔనా?

మరి ఈ కాసిన్ని క్షణాలకే

తూర్పుకి తలపెట్టుకుని నువ్వూ, పడమరకి ముఖం తిప్పుకుని నేనూ..

ఇలా శతృశిలలకు మల్లే బ్రతుకుతున్నామెందుకనీ?

ఏమో, ఇపుడెందుకులే ఆ సంగతులూ..

పండగపూట అనుకోడాల్నూ !

 

ఒట్టు.

ఈ చలి కాలం నుంచైనా మనం.. సరికొత్త జంటలౌదాం.

పుష్యంలో రాలే నిశాపుష్పాల తడుద్దాం.

 

సంకురాతిరి సాక్షిగా –

పూటకో వెన్నెల పక్క

ఇంటెనక జొన్నమొక్క పక్క

కొండ మీద తళుక్కుమన్న వెండి చుక్క

నీ నవ్వే-

నా వలపు వాకిట బంతి పూ రెక్క.

 

కాలమొక కలం. ఆకాశాని కేది అంతం!

మనమధ్య మంచు తెరలు మాసాక, ఇక కథంతా సుఖాంతం.

ఇలా క్షణం క్షణం జీవితం  –  సంక్రాంతి సంబరం.

Posted in కవిత్వం | Tagged | 5 Comments

మనిషిలోపలే…

హిందీ మూలం: రాజీవ్ పత్థరియా

తెలుగు అనువాదం: కొల్లూరి సోమ శంకర్

రోజూలానే ఈ రోజు కూడా రాకేష్ నిద్ర లేవడం ఆలస్యమైంది. ఆఫీసుకు వెళ్ళడానికి త్వరగా సిద్ధం అవుతుండగా అతని మొబైల్ మోగింది.

“హలో సార్, నేను కులూ నుంచి మాట్లాడుతున్నాను. రాత్రి కురిసిన కుంభవృష్టికి హైడల్ ప్రాజెక్ట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చాల మంది కార్మికులు నీళ్ళల్లో కొట్టుకుపోయారు. నష్టం తీవ్రంగా ఉంది” అంటూ సమాచారమిచ్చాడు స్ట్రింగర్ నారాయణ సింగ్.

పొద్దున్నే ఇలాంటి వార్త వినాల్సివచ్చినందుకు విసుక్కుంటూ, “సోదంతా ఎందుకు? ఎంతమంది పోయారో చెప్పు.నేనక్కడికి రావడం అవసరమా, లేదంటే నువ్వు రిపోర్ట్ చేసి పంపించగలవా?” అని అలవాటుగా అనేసాడు రాకేష్.

మీడియా మ్యాడ్నెస్

“క్లౌడ్ బరస్ట్ అయిన చోట నాలుగు నుంచి ఐదు డజన్ల మంది కూలీల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరూ మిగల్లేదు. సహాయకార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటిదాక ఎనిమిదో పదో శవాలు దొరికాయి. మీరు ఫోటోగ్రాఫర్‌ని తీసుకుని రండి. ఈ లోపల నేను స్పాట్‌కి వెడతాను”

“సరే నారాయణ, నువ్వెళ్ళు. నాకు రావడానికి రెండు గంటలు పడుతుంది. నేను ఫోటోగ్రాఫర్‌ని తీసుకుని వస్తాను…”అంటూ సంభాషణ ముగించాడు.

తర్వాత ఫోటోగ్రాఫర్‌కి ఫోన్ చేసి, జంక్షన్ వద్ద సిద్ధంగా ఉండమని చెప్పాడు. జరిగినది ఘోరమైన ప్రమాదం, టాక్సీ తీసుకుని అక్కడి దాక వెళ్ళాలంటే ఎడిటర్ గారి అనుమతి అవసరం. పైగా కవరేజ్ సందర్భంగా ఆయన సలహాలు తీసుకోవాలి. రాకేష్ ఎడిటర్‌కి ఫోన్ చేసాడు.

“సార్, లఖీంపూర్ ప్రాజెక్ట్ దగ్గర కుంభవృష్టి వలన వందలాది కూలీలు  నీటిలో కొట్టుకుపోయారట… నేనక్కడికి బయల్దేరుతున్నాను.. ” అన్నాడు.

“దారుణమైన ప్రమాదం.  ఈ వార్త అన్ని ఎడిషన్లలలోనూ రావాలి. అంతే కాదు సైడ్ స్టోరీ, ప్రాజెక్ట్ మానేజ్‌మెంట్ తీసుకున్న కార్మికుల రక్షణ చర్యల గుట్టు విప్పే కథనం, అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి ఇంకో కథనం కావాలి.ఆ, ఫొటోలు కూడా చక్కగా ఉండాలి. కుదిరితే మానవీయ కోణంలోంచి ఓ స్టోరీ డెవలప్ చెయ్. నువ్వు బయల్దేరు, నేను నీతో మొబైల్ ద్వారా టచ్‌లో ఉంటాను. నువ్వు తిరిగి రాగానే,  హెడ్‌లైన్స్ కోసం మేటర్ ఫైల్ చెయ్యి…..” అన్నాడు ఎడిటర్.

ఆయన సూచనలు వింటూ, “అలాగే సార్, మీరు చెప్పినట్లే చెస్తారు సార్… యస్ సార్” అంటూ తలాడించాడు రాకేష్.అతని దృష్టికోణం నుంచి చూస్తే, ఈ వార్త చాలా ముఖ్యమైనది. వందలాది మంది మృతికి సంబంధించినది.

టాక్సీ మాట్లాడుకుని, ఫోటోగ్రాఫర్ అనిల్‍ని ఎక్కించుకుని, లఖీంపూర్ ప్రాజెక్టు ప్రాంతానికి తొందరగా తీసుకువెళ్ళమని డ్రైవర్‌కి చెప్పాడు.

“సార్, టివి చానెళ్లలో ఈ వార్త స్ర్కోలింగ్ వస్తోంది. 48 మంది చచ్చిపోయారని ఒక చానెల్ చెబుతుంటే, మరో దాంట్లో 150  మంది చనిపోయారని వస్తోంది. ఒకరి అంకెలు మరొకరితో సరిపోవడం లేదు. ఓ ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం నా కెరీర్‌లో ఇదే మొదటి సారి….” అన్నాడు అనిల్.

“మిత్రమా, ఇంతమంది చనిపోతే పేపర్లో మెయిన్ న్యూస్ అదే అవుతుంది. స్పేస్ కూడా చక్కనిది దొరుకుతుంది.నువ్వు తీసే ఫోటోలు ఎలా ఉండాలంటే, అన్ని ఎడిషన్లలోనూ నీవే కనీసం మూడు ఫోటోలుండాలి. ఆరు నుంచి ఎనిమిది ఫోటోలు రీజినల్ ఎడిషన్‌లో రావాలి. ” అన్నాడు రాకేష్.

“సార్, మెయిన్ ఎడిషన్‌లో వచ్చే ఫోటోల క్రింద నా పేరు తప్పకుండా వేయించండి”

“అలాగే బ్రదర్, ఎడిటర్ గారితో చెప్తాను. నువ్వు కష్టపడి మంచి ఫోటోలు తీయ్యాలి…” అని చెప్పి తను ఆలోచనల్లో నిమగ్నమయ్యాడు రాకేష్. ఆ దుర్ఘటన వార్తని ఎంత అద్భుతంగా ప్రెజంట్ చెయ్యాలో ఆలోచించుకుంటున్నాడు.

చిన్నప్పుడు శవాలని చూస్తేనే భయపడే రాకేష్ ఇప్పుడు ప్రతీ వార్తని చనిపోయిన వారి సంఖ్యతో కొలుస్తున్నాడు. బహుశా, కాలక్రమంలో రొటీన్‌గా పని చేయడం అతనిలో మానవీయ సంవేదనల్ని అణచివేసిందేమో? పత్రికల యుగంలో తీవ్రంగా నెలకొని ఉన్న పోటీ వలన రాకేష్ బుర్రలో ఎప్పుడూ ఎక్స్‌క్లూజివ్ న్యూస్ గురించిన ఆలోచనలే పరిభ్రమిస్తుంటాయి. నిన్న రాత్రి కూడా అతను  అలాంటి ఆలోచనలే చేస్తున్నాడు – ఏ రాజకీయ నాయకుడిదైనా లేదా ఏ ప్రభుత్వాధికారిదైనా గుట్టు రట్టు చేయాలని ! ప్రతీ రోజూ ఎదో ఒక రహస్యాన్ని బయటపెడుతూ, అతను విసిగిపోయాడు. కానీ ప్రభుత్వం చెవులకి అవేం ఎక్కడం లేదు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం లేదా అధికారులు ఓ విచారణా సంఘం వేస్తారు, కొంత కాలానికి అందరూ దాని గురించి మర్చిపోతారు. వార్తా ప్రపంచంలో ఇప్పుడు అతను కూడా సామాజిక ప్రయోజనాలు విస్మరిస్తూ, ఏదో వార్తల సేకరణకే ప్రాముఖ్యత నిస్తున్నాడు. తన వార్త సమాజానికి మేలు చేస్తుందా, చేటు చేస్తుందా అనేది అతనికి అనవసరమై పోయింది. పత్రికా రంగంలో ప్రవేశించిన కొత్తలో ఏదైనా దుర్ఘటన లేదా ప్రమాదం గురించి వార్త రాయాల్సివస్తే, అతను ఆసుపత్రికి వెళ్ళేవాడే కాదు. తన సహోద్యోగులని పంపేవాడు. ఒక వేళ ఆసుపత్రికి వెళ్ళాల్సివచ్చినా, అతను డాక్టరు గారి గదిలో కూర్చునేవాడు, అతని మిత్రులు గాయపడిన వారిని పరామర్శించేవారు….అతనికి వార్త దొరికేది.

ఈ రోజు చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో రాకేష్‌ బుర్రలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటున్నాయి.హఠాత్తుగా అతని మనసులో ఓ ప్రశ్న మెదిలింది – “నేను మొదట విలేఖరినా? మనిషినా? నాకూ సమాజానికి ఉన్న సంబంధం విలేఖరి లేదా పత్రిక సంబంధమేనా? నేను కేవలం సంచలనాలను వెల్లడించడానికే పుట్టానా?”

ఇటువంటి ప్రశ్నలు అతని మనసులో ఉదయించడం ఇదే మొదటిసారి.

ఇంతలో టాక్సీ లఖీంపూర్ చేరుకుంది. అక్కడి నుంచి లింక్ రోడ్డు మీదుగా ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళాలి. “సార్, ఇదే లఖీంపూర్, మనం ఎటువైపు వెళ్ళాలి?” అడిగాడు డ్రైవరు. కొంచెం ముందుకు పోనివ్వమన్నాడు అనిల్. వాళ్లు కొంచెం ముందుకు వెళ్ళేసరికి సహాయక చర్యల కోసం వచ్చిన ఓ వ్యాన్ కనపడింది. మరో వైపు రోడ్డు మీద ఆహారం కోసం వంట చేస్తున్నారు. తుంపరగా కురుస్తున్న వర్షంలో వణుకుతూన్న జనాల ముఖాలపై దుఃఖం చిహ్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రిలీఫ్ కాంప్ దగ్గర ఆగి ప్రమాదం ఎక్కడ జరిగింది, దాని తీవ్రత ఎంత.. మొదలైన వివరాలను సేకరించాడు రాకేష్. విరిగిన వంతెనని దాటుకుంటూ, టన్నెల్ వైపు ప్రయాణం సాగించాడు. అనిల్ కూడా ఫోటోలు తీసుకుంటూ రాకేష్‌ని అనుసరించాడు. మిగిలి ఉన్న సామాన్లను పట్టుకొని, శోకాలు తీస్తున్న బాధితులెందరో దారిలో ఎదురయ్యారు. మానవత్వాన్ని గుర్తు చేసే హెచ్చరిక అయినప్పటికీ, అతను దాన్ని పట్టించుకోలేదు. అతనో విలేఖరి.జనాల దుఃఖంతో పనిలేదతనికి, కావల్సిందల్లా వార్త మాత్రమే.

ఇంతలో కాశ్మీరు నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న పనివాళ్ళ బృందం ఒకటి రోదిస్తూ అతనికి ఎదురయ్యింది. కాశ్మీరు లోని తీవ్రవాదం, ఈ ప్రమాదం రెండిటినీ జోడిస్తూ ఓ ఆర్టికల్ రాస్తే బాగుంటుందని రాకేష్‌కి అనిపించింది. ఆ గుంపులో ఉన్న ఓ మధ్య వయస్కుడిని ఆపి ప్రశ్నించసాగాడు.అతని పేరు మీర్ భక్ష్.  ఎవరి దిష్టో తగిలి కాశ్మీరం అల్లకల్లోలంగా ఉంటోందట.  పొట్టపోసుకోడానికి, నాలుగు రాళ్లు సంపాదించుకోడానికి, కుటుంబాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడట. కానీ దురదృష్టం నీడలా వెంటాడిందట. కూతురి పెళ్ళి కోసం నాలుగు నెలలుగా కష్టపడి దాచుకున్న డబ్బంతా వరదలో కొట్టుకుపోయిందట. అంతే కాదు వాళ్ళ ఆత్మీయుడుషకీల్ భాయ్ కూడా జలసమాధి అయ్యాడట…. ఏడుస్తూ చెప్పాడతను. మీర్ భక్ష్ వెక్కిళ్ళు పెడుతూంటే, అతనితో పాటు తడిసిన దుస్తులతో ఉన్న మిగతా కాశ్మీరీలందరూ కూడా రోదించసాగారు. కానీ రాకేష్‌కి ఇదంతా చిరాకుగా ఉంది. కాని అతనికి వార్త కావాలి, కాబట్టి తప్పనిసరై వాళ్ళ గోడుని వింటున్నాడు.

ఇంతలో మీర్ భక్ష్ పక్కనే నిలబడి ఉన్న తన్వీర్ అహమ్మద్ అందుకున్నాడు – “మేమంతా సర్వనాశనమైపోయాం సార్. మాది, షకీల్ భాయ్‌ది ఒకే ఊరు. అతనికి పదేళ్ళ వయసున్న కొడుకున్నాడు. వాడి గుండెలో ఏదో చిల్లుందట. ఆ కొడుకు వైద్యం కోసమే ఇంత దూరం పనికి వచ్చాడు. పైగా షకీల్ భాయ్‌కి ఇంకో సంతానం కూడా కలగబోతోంది. కానీ ఈ కాళరాత్రి  మా వాడిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో చోట్ల వెదికాను, కానీ దొరకలేదు. ఇప్పుడే కంపెనీ వాళ్ళు చెప్పారు,షకీల్ భాయ్ శవం కింద దొరికిందట… మేమందరం క్యాంప్‌లోకి వెడుతున్నాం….”

వర్షం ఆగేట్టు లేదు. కానీ ఓ మంచి కథనం రాయడానికి అవసరమైన సమాచారం రాకేష్‌కి ఇంకా దొరకలేదు.ముందుకు వెడితే దొరుకుతుందనే ఆశతో ముందుకు వెళ్ళాడు.

ఓ రాయి దగ్గర మధ్యవయస్కుడైన నేపాలి పురుషుడు, ఓ స్త్రీ కూర్చుని కనపడ్డారు. బహుశా, దుఃఖం వలన వారికి చలి తెలియడం లేదేమో.

“కిందకి వెళ్ళి, దుప్పట్లు వగైరా తీసుకోవచ్చుగా. తినడానికి కూడా ఇస్తున్నారు, ” అంటూ రాకేష్ వాళ్ళని పలకరించాడు.

నేపాలీ ఏడుస్తూ… “సాబ్, మేమెలా వెళ్ళగలం సాబ్, మా కొడుకు ఆ రాళ్లకింద ఇరుక్కుపోయాడు. వాడిని బయటకు తీయించండి సార్.. దేవుడు మీకు మేలు చేస్తాడు…” అంటూ చెప్పాడు. రాకేష్ కొంచెం ముందుకు వెళ్ళి చూసాడు. ఒక పెద్ద రాతిబండ కింద సగం శరీరం చిక్కుకుపోయి నిస్సహాయంగా పడి ఉన్న ఓ యువకుడు కనిపించాడు. అతని కాళ్ళు మాత్రమే బయటకి కనబడుతున్నాయి. తన్నుకొస్తున్న ప్రవాహంలో అతని కాళ్ళకి వేలాడుతున్న పాంటు కూడా కొట్టుకుపోయింది. ఇంతటి దారుణమైన చావుని చూసాక ఎవరైనా సరే, ఇకముందు ఇలాంటి పనులు చేయమని ఒట్టేసుకుంటారు, దేవుడిని తిట్టుకుంటారు. కానీ రాకేష్ ఇవేమీ చేయలేదు. ఆ నేపాలీ బయోడేటా సేకరించడం మొదలుపెట్టాడు. ఇంతలో రగ్గులు పంచుతూ ఒక ప్రభుత్వోద్యోగి కనబడ్డాడు. చలికి వణికిపోతున్న ఈ ఇద్దరు నేపాలీలకి రగ్గులివ్వమని చెప్పాడు రాకేష్. నగ్నంగా ఉన్న శవంపై కప్పడానికి ఇంకో రగ్గుని తీసుకున్నాడు.  ఇంతలో అనిల్ అన్నాడు – “సార్, టైం నాలుగు గంటలవుతోంది, మనం హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళాలి”.  రాకేష్ లోపల ఉన్న మనిషి కొద్దికొద్దిగా బయటపడుతుండేసరికి అతనిలోని విలేఖరి గద్దించాడు. తను తీసుకున్న రగ్గుని నేపాలీ చేతిలో పెడుతూ, “మీవాడిపై కప్పండి” అన్నాడు.

“సాబ్, నా కొడుకుని రాళ్ళకింద నుంచీ బయటకి తీయించండి సాబ్…” అంటూ నేపాలీ కాళ్ళావేళ్ళాపడ్డాడు. అతని వెంటే ఉన్న స్త్రీ కూడా ” మా బిడ్డని బయటకి తీయించడయ్యా” అంటూ ప్రాధేయపడసాగింది.  “నేను కిందకి వెళ్ళి,యంత్రాలని, కొంతమంది మనుషులని పంపిస్తాను” అని చెబుతూ రాకేష్ అక్కడి నుంచి కదిలాడు.

రాకేష్, అనిల్ వేగంగా రోడ్ వైపు నడవసాగారు. ఈ శవాలతో రాకేష్‌కి ఎటువంటి సంబంధమూ లేదు, అన్నీ పోగొట్టుకుని జీవచ్ఛవాలలా మిగిలిన, వారి రోదనలతోనూ సంబంధం లేదు. అతని మనసంతా కవరేజ్ ప్లాన్ తయారీలో నిండి ఉంది. ఇంతలో అతని దృష్టి శిధిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి శవాలను జె.సి.బి మెషిన్ ద్వారా ఏరుతున్న సహాయక సిబ్బందిపై పడింది. ఓ శవాన్ని బయటకి తీస్తుంటే, దాని కాలు వేలాడసాగింది. ఆ దృశ్యాన్ని చూసిన రాకేష్‌లోని విలేఖరి చటుక్కున మేల్కొన్నాడు. అనిల్‌ని పిలిచి దాన్ని ఫొటో తీసుకోమన్నాడు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో శవాలని వెలికితీయడానికి అంతకంటే మెరుగైన పద్దతి ఇంకోటుండదని రాకేష్‌కి తెలియనిది కాదు,అయినా పాలకులకి వ్యతిరేకంగా రాయడానికి ఏదో ఒకటి కావాలి. అంతే. అతనికి కావల్సిన మసాలా దొరికింది. రిలీఫ్ క్యాంప్‌లో ఉన్న శవాల సంఖ్య రెట్టింపయ్యింది. కంపెనీ గెస్ట్ హౌజ్ లోనే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేసారు. దాని ముందే తెల్లటి గుడ్డలు కప్పిన శవాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం జిల్లా మేజిస్ట్రేటు, పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి రాకేష్ వెనుదిరిగాడు. మొబైల్ సిగ్నల్స్ అందే చోటుకి వచ్చేసరికి ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. “ఎడిటర్ గారు నీ గురించి అడుగుతున్నారు, ఆయనకి ఫోన్ చేయి” ఇదీ ఆ కబురు. “ఇప్పుడే చేస్తాను”అంటూ రాకేష్ ఫోన్ పెట్టేసాడు. ఎడిటర్‌కి చేయబోతుండగానే, ఆయనే చేసారు.

“రాకేష్ ఎక్కడున్నావు? చాలా సేపటి నుంచి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వార్త అన్ని ఎడిషన్లలోనూ రావాలని నీకు తెలుసుకదా, త్వరగా పంపించు”

పొద్దున్నుంచి ఏమీ తినకుండా, తాగకుండా పనిచేస్తున్న రాకేష్‌కి బాస్ మాటలు కాస్త బాధ కలిగించాయి. కానీ వినయంగా మాట్లాడుతూ, “సార్, కవరేజ్ కోసం నేను ఎంత దూరం వచ్చానో మీకు తెలుసు. ప్రమాదం జరిగిన చోటు ప్రాజెక్ట్ ఏరియా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి మేము కాలినడకన వెళ్ళాల్సివచ్చింది.  ఇంకో రెండు గంటల్లో ఆఫీసుకి వచ్చి మీకు మెయిన్ న్యూస్ పంపిస్తాను, దాంతో పాటు ఫొటోలు కూడా. ఆ తర్వాత లోకల్ పేజీల కోసం స్టోరీలు తయారు చేస్తాను…” అన్నాడు.

“సరే, చేసేదెదో త్వరగా చెయ్యి. నేను ఎక్కువ సేపు వెయిట్ చేయలేను…” అంటూ ఫోన్ కట్ చేసారు ఎడిటర్. విలేఖరి అయిన కారణంగా మానవత్వానికి మైళ్ళ దూరంలో ఉండిపోయిన రాకేష్‌ తన ఉద్యోగాన్ని తిట్టుకుంటూ, “ఏ ఆఫీసులోనైనా గుమాస్తాగా పనిచేసినా బాగుండేది. ఇంత కష్టపడ్డా కూడా ఒక్క ఫోన్ కాల్ మొత్తం మూడంతా పాడు చేసింది” అని అనుకున్నాడు. ఇంతలో అతనికి స్ట్రింగర్ నారాయణ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆసుపత్రిలో చేరిన కార్మికుల జాబితా సంపాదించాడట. జిల్లా అధికారులు తయారు చేసిన జాబితా కూడా సాధించగలిగాడట.

“సరే, రెండు లిస్ట్‌లలో పేర్లు, అడ్రసులు సరిచూసుకో. అన్నీ సక్రమంగా ఉండాలి. సహాయ కార్యక్రమాల వివరాలు ఉండాలి… వాటిని ఫాక్స్ చేయ్…” అంటూ ఆదేశించాడు రాకేష్.

చివరికి ఆఫీసు చేరి వార్తలందించాడు రాకేష్. పనయ్యాక, ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి అతనికి నిద్ర రావడానికి బదులుగా, శవాల గుట్టలు, లేదంటే హృదయ విదారకంగా రోదిస్తున్న జనాల వదనాలే కనబడ్డాయి. ముఖ్యంగా బండరాళ్ళ కింద చిక్కుకుని మరణించిన ఆ నేపాలీ యువకుడి శవం మాటిమాటికి గుర్తొస్తోంది. “నన్ను బయటకి లాగకపోతే పోనీ, కానీ నీలోని మానవత్వం కూడా బండరాళ్ళకింద అణిగిపోతోంది. దాన్నితప్పకుండా పైకిలాగు” అని ఆ శవం చెబుతున్నట్లు భ్రమ పడ్డాడు రాకేష్. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించలేకపోయాడు.

పొద్దున్న లేస్తూనే పేపరు పట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజు పత్రికలోని వార్తలన్నీ రాకేష్ పేరు మీదే. మెయిన్ ఎడిషన్ లోని లీడ్ న్యూస్ దగ్గర నుంచి, లోకల్ ఎడిషన్‌లో పేజీల లీడ్, బాటమ్ స్టోరీస్.. వరకూ అన్నీ రాకేష్ సేకరించిన వార్తలే.ప్రమాదం యొక్క భయంకరమైన ఫొటోలను సైతం ముద్రించారు. కొంత సేపయ్యాక, కవరేజ్ చక్కగా చేసినందుకు మిత్రుల దగ్గర నుంచి, పై అధికారుల దగ్గర నుంచి ఫోన్లలో అభినందనలు రాసాగాయి. కానీ రాకేష్ ఆత్మ మాత్రం ఆ నేపాలీ యువకుడి చుట్టూ తిరగసాగింది. విలేఖరిని కాకుండా ఉంటే కష్టాల్లో ఉన్న వాళ్లకి ఎంతో కొంత సాయం చేసేవాడిని కదా అనుకుంటూ బాధపడ్డాడు. “కనీసం అంతిమ సంస్కారాల కోసం కొడుకు శవాన్ని ఆ తల్లిదండ్రులకి అప్పగించైనా ఉండేవాడిని” అని అనుకున్నాడు. కానీ హెడ్‌లైన్స్‌కి బందీ అయినతను ఇంతకంటే ఏమీ చేయలేకపోయాడు.  మనిషై ఉండి కూడా మానవత్వాన్ని ప్రదర్శించడంలో లోభత్వం కనపరిచినందుకు అతనికి దుఃఖం తన్నుకువచ్చింది.

Posted in కథ | Tagged | 1 Comment

అమంగళమప్రతిహతంబయ్యెడిన్..

గమనిక: ఈ కథ చదివేప్పుడు కథాగమనానికి అడ్డుపడుతూ చిప్పగుర్తులలో (Brackets) ఏవేవో అదనపు విషయాలు చెప్పవలసి వచ్చింది. వాటిని ఒగ్గేయచ్చు, లేదా కలిపి చదువుకోవచ్చు, లేదా వాటినే చదువుకోవచ్చు. అదంతా పాఠకుల ఇచ్ఛ. – రచయిత

*********************************************************
Year – 2131
Month – November.

లేదా శకసంవత్సరం 2043. ఖరనామ సంవత్సరం,కార్తీకమాసం.
*********************************************************

హరీష్ ఒక – “ఆఫ్టర్ మారీడ్ లైఫ్” కౌన్సిలరు. ఇదేదో మునిసిపల్ కౌన్సిలర్ లాంటిది కాదు. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే అనేక అధునాతన ఉద్యోగాలలో ఇదొకటి. దీనికి కావలసిన క్వాలిఫికేషన్., ఏదో ఒక మాస్టర్స్ డిగ్రీ, నగరంలో ఖరీదైన కోచింగు సెంటర్లో తీసుకున్న కోచింగు. కోచింగు అంటే చీప్ గా లెక్కించరాదు. ఒక కోటి రూపాయల ముడుపు చెల్లించుకుని ఒరగబెట్టిన ఒక ప్రొఫెషనల్ విద్య. విడాకులు తీసుకుందామన్న జంటలకు రకరకాల దారులు చూపడం, కుదరకపోతే  విడాకులు ఇప్పించడం, ఆ తర్వాత లీగల్ వ్యవహారాలు అన్నీ చూసి సర్దుబాటు చేసెయ్యడం వృత్తిలో భాగాలు.

హరీష్, వినయ్ ఇద్దరూ వయసు తేడా ఉన్నప్పటికీ చిన్నసైజు స్నేహితులు. జీవితం అంతా ఆన్లైన్ మీద నడుస్తూంటూంది కాబట్టి – స్నేహితులనే పదానికి అర్థం కుంచించుకుపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఒకే కోచింగు సెంటర్లో వేరు వేరు కోర్సులకు డబ్బు తగలెట్టారు కాబట్టి ఆ పదం వాడవచ్చు.

తెలుగునాట ’నా ప్రేమే నీ దౌర్భాగ్యం’ – క్లుప్తంగా NPND – అనే తెలుగు సినిమా పరమ భీభత్సంగా హిట్టయి, ’పది’ రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. సినిమా రాకముందే డీవీడీ కూడా వచ్చేసింది. ఆ సినిమా మిత్రులిద్దరికీ నచ్చింది. అంతే !కనెక్ట్ అయిపోయారు. ప్రియురాళ్ళ పేర్లు ఒకేలా ఉండడం అన్న కాన్సెప్టుతో ఆ సినిమా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది.సినిమా నచ్చడంతో తెలుగు సినిమా అభిమానులైన వినయ్, హరీష్ తమ జీవితానికి ఆ కాన్సెప్టును అన్వయించుకున్నారు.ఇద్దరూ డేటిమొనీ (డేటింగ్ + మేట్రిమొనీ)లో  ’సరిత’ అనబడే పేరు గల అమ్మాయిలనే  ఇద్దరూ వెతికి పట్టుకుని కొన్ని నెలలు ’అర్థం’ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు.

ఆ తర్వాత జంటలకు ఆన్ లైన్లో పెళ్ళి జరిగింది. డేటిమొనీ.కాం లో అదివరకే రిజిస్టర్ చేసి ఉన్నారు కాబట్టి, శాస్త్రోక్తంగా ఆన్లైన్ లోనే తమ తమ ఫోటో లను పంపి కాశీయాత్ర, మాంగల్యధారణ, సప్తపది, నాగవల్లి ఇత్యాది వివాహసంబంధ శుభకార్యాలను ’శాస్త్రోక్తంగా’ ఘనంగా నిర్వహించుకున్నారు.ఆ వెబ్ సైటులో రిజిస్టరు చేసుకుంటే చాలు. వధూవరుల తరపున ఆ సంస్థవాళ్ళు అన్ని కార్యక్రమాలను తలనెప్పుల్లేకుండా ఏనిమేషన్ ప్రక్రియ ద్వారా చేసేస్తారు. ఆ తర్వాత ఆ కంటెంటును ఎవరికి షేర్ చేయాలో వారి పేరు కంప్యూటరుకు చెబితే చాలు. వారికి చేరుతుంది. వధూవరులకు చల్లవలసిన అక్షతలు కూడా ఆ సంస్థ కలెక్ట్ చేసుకుని వధూవరులిద్దరికీ పార్సెల్ చేస్తుంది.అలాగే ఆహూతుల గిఫ్ట్ లు కూడా డోర్ డెలివరీ చేయబడతాయి. ఆ తర్వాత సోడెక్సో భోజన పత్రాలు ఆహూతులకు పంపి వారికి ఇష్టమొచ్చిన హోటల్లో పెళ్ళిభోజనం చేసెయ్యమని చెప్పేశారు. ఇలా పెళ్ళి ఘనంగా జరిగింది.

అలా జరిగిన పెళ్ళి విజయవంతంగా నాలుగు నెలలు కొనసాగింది. పెళ్ళయిన నాల్గవ నెలలో ఓ రోజు అశుభసూచకంగా హరీష్ ఎడమకన్ను అదిరింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య పొద్దస్తమానం బతకడం వల్ల రేడియేషన్, దాని వల్ల కళ్ళు అదరడం పాత జబ్బే. అయితే ఆ రోజు కొంచెం  ఎక్కువగా అదిరింది – బుల్ డోజర్ కంకరరోడ్డు మీద వెళ్ళినట్టు. బోనస్ గా ఎడమభుజమూ అదిరింది. తన భార్య తనకోసం ఆర్డర్ చేసిన భోజనం పార్సెల్ విప్పి చూశాడు. అంతే! అందులో ’గోంగూర’ ఉన్నది! అదొక భయంకరమైన అనుభవం. హరీష్ కు గోంగూర అంటే చిన్నప్పట్నుంచీ అలర్జీ. గోంగూరను తినటం కాదు, చూస్తేనే అతనికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పెళ్ళికి ముందు చాటింగులో చాలా ఇంపార్టెంటు విషయాలు మాట్లాడుకున్నప్పటికీ, ఈ విషయం ఎంచేతనో సరితకు చెప్పడం మర్చిపోయాడు. నిజానికి హరీష్ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఈ విషయం ఉన్నది. అయితే సరిత సరిగ్గా ఆ విషయం గమనించకపోవడంతో కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ వచ్చి పడింది. పెళ్ళి తర్వాత ఇద్దరికీ ’ప్రొఫెషనల్’ పనులు ఉండటం వల్ల కలుసుకుని మాట్లాడుకోవడం కుదరలేదు.

భవిష్యత్తు వివాహాలు, విడాకులు

ఆ రోజు రాత్రి ఒంటిగంట. సరిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి రాత్రిపూట ఆఫీసులో పని సర్వసాధారణం.

హరీష్ మైన్యూట్ పీసీని సెల్ ఫోన్ మోడ్ లో తెరిచి ’మైన్యూట్ మెసేజ్’ చేస్తూ సరితతో చాట్ చేయసాగాడు. వారి సంభాషణ ఇలా సాగింది.

(మైన్యూట్ మెసేజ్ అంటే తను అనుకున్న పదం మొదటిఅక్షరం మాత్రమే టైపిస్తాడు. కంప్యూటర్ అతను కీబోర్డును ఎంత బలంతో నొక్కాడన్న దాన్ని బట్టి అతని మానసిక స్థితిని అంచనా వేసి అతను నొక్కిన లెటర్ కు అనుగుణమైన పదాన్ని సూచిస్తుంది.దాన్ని యూజర్ ఓకే  చేస్తాడు.అలాగేకీబోర్డు, కెమెరా  కలిపి చిహ్నాన్ని నిర్ణయిస్తాయి.అది మెసేజ్ కు జోడించబడుతుంది. ఇక్కడ కథ నడవడం కోసం కొంత కంప్యూటరు, కొంత మామూలు భాష కలగలిపిన సంకరభాషలో చెప్పుకుందాం)

“ఈ రోజు నువ్వు పంపిన భోజనంలో గోంగూర ఉంది. ఇదెలా జరిగింది?”  (చివర్న వేలి తాకిడిని బట్టి అసహనపు గుర్తు జోడించింది కంప్యూటరు)

“చాలా బిజీగా ఉంటూ కూడా నీకోసం మీల్స్ ఆర్డర్ పంపాను. గోంగూర ఉండటం పెద్ద నేరమేం కాదే!”(స్పేస్ బార్ పై వేలు కొన్ని మైక్రోసెకన్లు ఎక్కువగా కదలాడ్డం వల్ల అయోమయం, నిర్లక్ష్యం సింబలొకటి తగిలించబడింది)

“నాకు దాన్ని చూస్తే అలర్జీ అని నా ప్రొఫైల్లో స్పష్టంగా రాశాను.” (స్థిరత్వాన్ని సూచించే సింబలు-చూపుడు వేలు ఊనిక ఎక్కువ)

కీబోర్డు, వెబ్ క్యామ్ ’చట్టం’లా తమపని తాము చేసుకుపోతున్నాయి.

“గమనించలేదు. మర్చిపొండి, ఇప్పుడేమయిందని” (నిర్లక్ష్యం, ఆశ్చర్యం – తల ఎగురవేయడాన్ని కెమెరా కన్ను చూసేసింది)

“హౌ కెన్ ఐ? ఐ కాన్ట్” (విస్మయం! అనంగీకారం!కెమెరా కన్ను పరిధి దాటి ఊగిన తల )

“వాట్ టు డూ నౌ?” (అసహనం – చేతులు తెరుచుకోవడం గమనించిన కెమెరా)

“మనిద్దరికీ చెల్లుబాటు కాదు. ఇద్దరి అభిరుచుల్లో తేడా ఉన్నా, పెళ్ళయిన తర్వాత వర్కవుట్ చేద్దామని అన్నావు. ఇప్పుడు నా ప్రొఫైలే చూడలేదంటున్నావు.” (కోపం, విభ్రాంతి – కళ్ళు డీకోడ్ చేసి కనుక్కున్న కెమెరా, వేళ్ళు బలం రుచి చూసిన కీబోర్డు!)

“షిట్! ఆర్యూ క్రేజీ?” (నిర్లక్ష్యం, కోపం, బాధ వగైరా పక్క బొత్తాముకు పాకిన కీబోర్డు నొక్కుడు)

అంతే! హరీష్ అరికాలిమంట నెత్తికెక్కింది. ఆంగ్లభాషలో అతనికి నచ్చని ఏకైక పదం అది. ఇదివరకు సరితతో ఆ విషయం చెప్పాడు. ఆమె తన ప్రొఫైల్ చూడడం మొదటి తప్పయితే షిట్ అనడం అంతకన్నా పెద్ద తప్పు.

“మనకూ మనకూ వర్కవుట్ అవదు. లెట్స్ డిపార్ట్. ఇట్స్ బెటర్” – (సింబల్ లేదు. కారణం కీబోర్డు బొత్తాము తెగింది! కెమెరా క్రాష్ అయింది)

“ఓకే. ఏజ్ యూ విష్” – అని చెప్పి సరిత చాట్ బంద్ చేసింది.

హరీష్ కంప్యూటర్ లో నీలితెరలు క్రమ్మడంతో అది చూడలేకపోయాడు.

– ఆ తర్వాత హరీష్ ,సరిత  – వీరి జీవితంలోనూ నీలినీడలు కమ్ముకుని  విడాకులు మంజూరయాయి. రీజన్ – “కమ్యూనికేషన్ గేప్” అని చెప్పారు.

**********************************************************

రెండవ విడాకుల కథ:

వినయ్, సరిత పెళ్ళికి ముందు ఆన్లైన్ లోనే ఫోటోలు చూసుకోవడం, వాయిస్ చాటులు చేయడం, వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ల ద్వారా పక్కపక్కన కూర్చున్న ’అనుభూతి’ చెందడం వంటివి చేశారు. ఇలా మూడు నెలలు ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. రోజస్తమానం పని చేస్తున్నప్పటికీ, పెళ్ళయిన తర్వాత కనీసం నెలకు ఒక్కరోజయినా కలిసి ఉండాలని తీర్మానించుకున్నారు. అయితే (భార్యల దృష్టిలో) చాలామంది మగవాళ్ళలాగే వినయ్ ప్లానింగు లేని మనిషి కావడంతో, పెళ్ళయి నాలుగు నెలలయినా ఒక రోజయినా కలిసి గడపడం ప్లాన్ చేయలేకపోయాడు.

(మళ్ళీ భవిష్యద్దర్శనం: భార్యాభర్తల ఆఫీసులు వందలమైళ్ళ దూరంలో ఉంటాయి కాబట్టి పెళ్ళయినా ఎవరి ఆఫీసుల దగ్గర వాళ్ళు ఇళ్ళు అద్దెకు తీసుకుని ఉంటారు. వీకెండ్సు కూడా అలిసిపోయి బయటకు కదలలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మొగుడుపెళ్ళాలు కలిసి భోజనం చేసే సందర్భం కూడా అరుదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరూ కలిసి ఉండడం కుదరదు. అందుకూ అనేక కారణాలు )

పెళ్ళికి ముందు తను చూసిన అమ్మాయిలో అన్నీ ఉత్తమ గుణగణాలు ఉండటం, అవే గుణగణాలు పెళ్ళయిన తర్వాత నశించటం (లేదా లేనట్టు రియలైజ్ అవడం) పురుషులకు సంబంధించిన కాలాతీతమైన ప్రకృతిధర్మం. ఈ ధర్మం తన ప్రభావాన్ని వినయ్ పై చూపించింది.ప్రస్తుతం వినయ్ ప్రకృతిధర్మాన్ని అప్రకృతిక న్యాయంతో జయించే ప్రయత్నంలో ఉన్నాడు. (చదువరులారా, ఖంగారుపడకండి. వినయ్ విడాకులకోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పవచ్చాను)

వినయ్ కు హరీష్ పెళ్ళి పెటాకులైందని ఇదివరకే తెలుసు. దానికి కారణం కమ్యూనికేషన్ గేప్ అని కూడా విన్నాడు. తన విడాకులకు కారణం కూడా ప్రొఫెషనల్ ప్రెషర్ కాదని, కమ్యూనికేషన్ గాపేనని అతని అనుమానం. అంచేత ఆన్లైన్లో విడాకుల ప్రయత్నానికి కారణం – అలానే చూపాడు. హరీష్ మాత్రం వినయ్ సరిత ల మధ్య కమ్యూనికేషన్ గేప్ లేదని భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంతో – ప్రస్తుతం

హరీష్, వినయ్ ల మధ్య కాన్ఫరెన్సు కాల్ జరుగుతూంది.

“మీరూ సరితా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు” అడిగాడు హరీష్.

దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్. “మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే” అన్నాడు.

“కానీ విషయం మీకు ముందే తెలుసుగా” అసహనంగా అడిగాడు హరీష్. (మా జంట లాగా మీకు కమ్యూనికేషన్ గేప్ లేదు కదా అని దాని అర్థం)

“మీకూ ముందే తెలుసు.. కాదనగలరా?” సూటిగా అడిగాడు వినయ్. (“విడాకులు తీసుకోడానికి ముందు మీరు సరితకు గోంగూర గురించి చెప్పారుగా” – అని అర్థం)

“తెలుసనుకోండి. ఇగో అన్నది ఒక్క మారు వచ్చిన తర్వాత సంసారం కొనసాగిస్తే – ఆ ఇగో మల్టిప్లై అవుతుందని కేస్ స్టడీలు అనేకం చెబుతున్నాయి.ఐ థింక్ అవర్ కేస్ ఈజ్ జెన్యున్” – సమర్థించుకున్నాడు హరీష్. ఎంతైనా తన ప్రొఫెషనే అది.

“అవుననుకోండి!” – నీళ్ళు నమిలాడు వినయ్.

“పెళ్ళంటే కలుసుకుని మాట్లాడుకోవడం, అమ్మాయి సిగ్గుపడటం, అబ్బాయి పూలు తీసుకువచ్చి అమ్మాయి తలలో తురమడం గట్రా చాలా ఓల్డ్ ఫేషన్. ఇవన్నీ బూర్జువా ఆలోచనలు. మన తరం ఎంతో ముందుకు సాగింది. ఇలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అలాటి ఊహలను రానివ్వకండి. ఏదైనా సహజమైన సమస్యలుంటే మాట్లాడుకోవచ్చు” – హరీష్ అన్నాడు. (సహజం అసహజమనే అర్థం సంతరించుకుని ఆధునికత అనే అలంకరణ చేసుకున్న ది)

వినయ్ మాట్లాడలేదు. తన తరం బూజుపట్టిన భావాలను వదిలించుకుని అభివృద్ధిపథంలో దూసుకెళ్ళింది. అయినా తనకు పెళ్ళి, భార్య – వీటి మీద సెంటిమెంట్స్ రావడమేమిటి?ఇది తన వీక్ నెస్సా?

“కొంపతీసి మీలో శృంగారభావాలు వచ్చినయ్యా? అలా ఒకవేళ మనసులో ఉన్నా బయట అనకండి. భార్యతో శృంగారభావాలు ఉండవచ్చుగాక. అయితే వాటిని డిమాండు చేయటం స్త్రీ వ్యతిరేకచట్టం కిందకు వస్తుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనతరానికి కృత్రిమ గర్భధారణ అనే అయాచిత వరం ఉంది. భార్యమీద శృంగారభావన పెంచుకొని అనవసర కాంప్లికేషన్స్ లో ఇరుక్కోకండి” – లోగొంతుతో వివరిస్తూ వారించాడు హరీష్. (భవిష్యత్తులో దేనికైనా భార్యను అర్థించడం తప్ప, డిమాండు చేయటం నేరమవుతుంది.)

మరెలా? తనూ, సరితా ఆఫీసులకు లీవ్ పెట్టుకుందామంటే కనీసం ఐదేళ్ళ ముందే అప్లికేషన్ పెట్టాలి. అంతవరకూ వేచి చూసే ఓపిక వినయ్ కు అస్సలు లేదు.

హరీష్ వైపు చూసి సాభిప్రాయంగా తలూపాడు వినయ్. కొత్తగా సవరించిన రూల్సు ప్రకారం విడాకులు ఎప్పుడు కావలసినప్పుడు, కారణాల్లేకుండా మంజూరు చేయబడతాయి. అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టుకు కన్సల్టింగు ఛార్జెస్ ఇచ్చుకోవాలి. ఇంకొన్ని లీగల్ ఫార్మాలిటీస్. ఎలానూ హరీష్ చూసుకుంటాడు.

– కొన్ని రోజులకు విడాకులు మంజూరయాయి.

*********************************************************

పల్లెలో ఒకానొక ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్న వినయ్ తాతకి ఓ రోజు ఎవరో మెసేజ్ పంపారు. మనవడు పెళ్ళి చేసుకున్నట్టు, ఆ తర్వాత కుదరకపోవడంతో విడాకులు తీసుకుంటున్నట్టు. నిజానికి అలాంటివి చెప్పడం నిషిద్దం. అయితే ఎలానో లీక్ అయింది. ముసలాయన కొట్టుమిట్టాడాడు. తనకే ఏదో అయినట్టు ఉక్కిరిబిక్కిరయ్యాడు. గతించి పుణ్యం కట్టుకున్న అర్ధాంగి గుర్తొచ్చిందేమో. ఏదో చెప్పాలనుకున్నాడు. వినేవాళ్ళు లేరు!  ఆ రోజు రాత్రి ఆయన నిదురలోనే శాశ్వతంగా నిదురపోయాడు.

*********************************************************

తర్వాత రోజు వినయ్ కు తండ్రి ద్వారా మెసేజ్ వచ్చింది. తాత గారు స్వర్గస్థులయారని. వినయ్ కాసేపు చూసి ఆ మెసేజ్ ను స్పామ్ లోకి నెట్టేశాడు.

*********************************************************

వాళ్ళిద్దరికీ మరో బంధం వచ్చేవరకూ ఈ కథ అప్రతిహతం.

Posted in కథ | Tagged | 4 Comments