శివాజ్ఞ …

నమ్మకద్రోహంజగ్గడు ఆయింటిపైపే దృష్టి సారించివుంచి పది నిముషాలపైనే అయింది. ఆయింటి చుట్టూరావున్న ఖాళీ జాగాలో రకరకాల పూలమొక్కలు ఒక క్రమంలో ఉన్నాయి. ప్రహరీగోడకు దగ్గరగా వీధి గేటుకి ఇరుప్రక్కలా రెండు కొబ్బరిచెట్లు, పెరటివైపున్న దానిమ్మ చెట్లు, కరివేపాకుచెట్టు దూరంనుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయింటి ఆవరణంతా నీటుగావుంది. ఆ స్థలాన్నంతా ఆయింట్లోని ముసలాళ్లిద్దరూ జగ్గడిచేత శుభ్రంచేయించినరోజే వచ్చింది జగ్గడికో దురాలోచన. అది ఎలాగైనా ఈరోజు అమలుపరచాలనే స్థిర నిశ్చయానికొచ్చాడు. అందుకే గత రెండు రోజుల్నుంచి నిఘా వేసి ఆనుపానులు చూసుకున్నాడు. సరైన సమయమేదో తెలుసుకున్నాడు.

సరిగ్గా అప్పుడే ఆయింట్లోని హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. డైనింగ్‍టేబుల్‍ దగ్గర నిలబడి పరాంకుశం గారు బ్రెడ్‍ముక్కకి వెన్న రాశారు. షెల్ఫ్‍లోంచి భద్రంగా దాచివుంచిన కాగితంపొట్లం తీశారు. ఆపొట్లంలోని పొడిని బ్రెడ్‍ముక్క మీద జల్లారు. మరో బ్రెడ్‍ముక్క తియ్యబోతూ ఏదో గుర్తొచ్చి ఆగిపోయారు. వంటింట్లోవున్న భార్యనుద్దేశ్యించి, ‘శాంతా! చిల్లరలేక బేకరీవాడికి నిన్నటి బ్రెడ్‍కి బాకీ ఉండిపోయింది. షాపు తెరిచాడేమో చూసి వాడి బాకీ కూడ తీర్చేసి వస్తాను. అప్పుడు మనం బ్రెడ్ తిందాం.’ అని ఆమెకసలు వినిపించిందోలేదో కూడ పట్టించుకోకుండా అడుగు బయటకు వేశారు. డైనింగ్ టేబుల్ మీద బ్రెడ్‍ముక్క అలాగే పడి ఉంది. టేబుల్‍ పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది. బేకరీనుంచి తిరిగొచ్చేలోగా ఏ అవాంతరం ముంచుకొస్తుందో ఊహించలేకపోయారతను.

పరాంకుశంగారు చేతికర్ర ఊపుకుంటూ ఇంట్లోంచి బయటపడి పది నిముషాలు కావస్తోంది. లోపల శాంతమ్మగారొక్కరే ఉంటారని తెలుసు. అయినా జగ్గడు తను అనుకున్న పనిచెయ్యటానికి ఇంకా సరైన అదనుకోసం వేచివున్నాడు.

అప్పుడే పాలబ్బాయి బైక్ ఆయింటి ముందుకొచ్చి ఆగింది. పాలబ్బాయి రెండు పాలప్యాకెట్లు క్రేట్‍లోంచి తీసి పట్టుకుని గేట్లోంచి లోపలకి నడిచాడు.

ఆ యింటి మెయిన్‍డోర్ తీసేవుంది. కాని గ్రిల్ తలుపు వేసివుంది. పాలబ్బాయి, అలవాటు ప్రకారం ఇంట్లోకి చూశాడు. అప్పుడతడికి తెలీదు – ఆ మర్నాడు అతడలా మళ్లీ చూడలేడని!

హాల్లో ఎవరూ కనబడకపోయేసరికి కాలింగ్‍బెల్ నొక్కాడు. ‘శాంతమ్మగారూ!’ అని కేక వేశాడు.

ఆసమయానికి మరిగిన నీళ్ళు ఫిల్టర్‍లో పోయబోతున్నావిడ కాస్తా ఆ గిన్నెనక్కడే వదిలి గబుక్కున వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది.

వీధివైపు చూసి, ‘వస్తున్నానుండరా! రోజూ ఇంతే! ఒంటికాలిమీద నిలబడతావు. క్షణం ఆలస్యం చేశానంటే చాలు పారిపోతావు. మళ్ళీ అందరికి ఇచ్చుకుని రిటర్నులో కాని రావు. ఈలోగా అతను వచ్చేశారంటే; కాఫీ కాఫీ అని నా దుంప తెంచుతారు …’ అని వగరుస్తూ వచ్చి పాలప్యాకెట్లకోసం గ్రిల్‍లోంచే చెయ్యి బయటకు పెట్టింది.

ప్యాకెట్లందిస్తూ పాలబ్బాయి, ఆమెతో, ‘మీకొక్కరికేనమ్మా ఇలా ప్యాకెట్లు చేతికందిచడం. మిగిలినవాళ్లిళ్ళల్లో అయితే బెల్‍కొట్టడం ప్యాకెట్లు గుమ్మంలో పడేయడం. అంతే! అలా అయినా రెండు గంటలపైనే పడుతోంది అందరిళ్లల్లో ఇచ్చుకునేసరికి.’ అని వెనుదిరగబోయాడు.

శాంతమ్మగారు పాలబ్బాయి మాటలు వినిపించుకున్నట్టేలేదు. ‘ఒక్క క్షణం ఆగు! నువ్వొస్తే ఇమ్మనమని, అతను నీకివ్వాల్సిన డబ్బులు లెక్కకట్టి ఉంచారు. తీసుకెళుదువుగాని.’ అని హాల్లోకి నడిచారు.

అప్పటికే వాడు విసుగ్గా ‘ఇంకా రేపటికి కదమ్మా నెల పూర్తయేది. ఎల్లుండివ్వచ్చు కదా! ఇప్పుడెందుకంత తొందరా?’ అన్నాడు. అన్నాడే కాని అక్కడే నిలబడ్డాడు.

ఈలోగానే ఆవిడ డబ్బులతో తిరిగొచ్చి గ్రిల్‍లోంచే అందిస్తూ, ఏదో అశరీరవాణి ఆమెచేత పలికించినట్టు –

‘రేపెవడు చూడొచ్చార్రా! ఇవ్వాళ తీసుకెళిపోమన్నారు. తీసుకెళిపో!’ అని చెప్పి ఇంట్లోకి దోవ తీశారు.

డైనింగ్ టేబుల్ మీద బ్రెడ్‍ముక్క అలాగే పడి ఉంది. టేబుల్‍ పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది.

పాలబ్బాయి సంతోషంగా డబ్బులందుకుని, పరుగులాంటి నడకతో తన బైకువైపు సాగిపోయాడు.

పాలబ్బాయి బైకు కదలగానే జగ్గడు ఇదే అదనని తలచి శాంతమ్మగారొక్కరేవున్న ఆయింటి వైపు పైశాచికంగా కదిలాడు.

కొంతసేపటికి పరమేశంగారు బేకరీనుంచి తిరిగొచ్చారు. అలవాటు ప్రకారం గ్రిల్‍తలుపులోంచి లోపలికి చెయ్యి పెట్టి గడియ తీద్దామంటే; వీలు లేకుండా తలుపు వేసివుంది. ‘ఇదేంటి చెప్మా, ఎప్పుడు లేనిది ఇలా తలుపేసుక్కూచుంది!’ అని ఆశ్చర్యపోతూనే కాలింగ్‍బెల్‍ నొక్కారు.

కొంత జాప్యం తరవాత మెల్లగా తలుపు తెరచుకుంది. ‘శాంతా శాంతా’ అని పిలిస్తూ అడుగు లోపలకి వేశారు. అంతే! అమాంతం అతని తలపై పిడుగు పడ్డట్టయింది. కళ్లముందు జిగేల్‍మని మెరుపులు మెరిసినట్టయి ఏం జరిగిందో తెలిసేలోపు స్పృహతప్పింది.

తెలివివచ్చేసరికి డైనింగ్‍టేబుల్‍ దగ్గర కుర్చీకి తనని తాళ్లతో గట్టిగా కట్టిపడేస్తూ జగ్గడు కనిపించాడు. ఎదురుగా డైనింగ్‍టేబుల్‍కి అటువైపు కుర్చీకి శాంతమ్మ కట్టిపడేసి కనిపించింది. ఆమె మూతికి కూడ తన మూతికిలాగే ప్లాస్టర్‍ వేసివుంది. ఆమె కళ్లల్లో భయాందోళనల్ని మించి ఆశ్చర్యం అపనమ్మకం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘తరచు తనింటికి వచ్చి కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు ఆనందంగా తీసుకుపోయే జగ్గడేనా ఇంత ఘాతుకం చేసింది! నేన్నమ్మను!’ అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఎదురుగా డైనింగ్‍టేబుల్‍పై ఒక గుడ్డ పరచివుంది. ఆ గుడ్డపైన ఆమె ఒంటి మీద ఉండాల్సిన బంగారు వెండి నగలన్నీ కుప్పగా పోసి ఉన్నాయి. వాటితోపాటు బీరువాలో దాచివుంచిన నగలు, నగదు కూడ వేసి తన కళ్లెదురుగానే మూట కట్టాడు జగ్గడు. ఒక చేత్తో మూటపట్టుకుని అడుగు ముందుకెయ్యబోయాడు జగ్గడు.

అప్పుడు పడింది జగ్గడి దృష్టి – వెన్నరాసివుంచిన బ్రెడ్‍ముక్క మీద. నోట్లో నీళ్లూరాయి. అంతే! చటుక్కున ఆబ్రెడ్‍ముక్కని తీసుకుని ఆబగా కొరికాడు. సగం ముక్క చప్పున తిన్నాడు. ఏమైందో కాని, కళ్లు తిరిగినట్టయి దబ్బున పడ్డాడు. ఆ అదురుకి చేతిలోవున్న సగం కొరికిన బ్రెడ్‍ముక్క డైనింగ్‍టేబుల్‍పై ఎగిరి పడింది. అదే సమయానికి కరెంటు పోయింది. టేబుల్‍పైన తిరుగున్న ఫ్యాన్‍ ఆగిపోయింది.

అప్పుడు పరాంకుశం మనస్ఫూర్తిగా అనుకున్నాడు – ‘భగవాన్‍! ఎలాగైనా వీణ్ణి రక్షించు. మేము ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం కాని, హత్య చేద్దాం అనుకోలేదు. మా బంగారం పట్టుకుపోయి కరిగించేసుకున్నా ఫరవాలేదు కాని మా బ్రెడ్‍ తిని అరిగించుకోలేకపోతే కష్టం! వాడికంత పెద్ద శిక్ష వెయ్యకు భగవాన్‍! …’

పరాంకుశంకంటే ఒక మెట్టు ఉన్నతంగానే ఆలోచిస్తోంది అతడి భార్య శాంతమ్మ!

ఇద్దరూ నిస్సహాయ స్థితిలో నిస్త్రాణగా కుర్చీలకతుక్కుపోయివుండిపోయారు. అలా నీరసంతో నిద్రలోకి జారిపోయారు. ఒక్కసారిగా ఒంటికి తగిలిన ఫ్యాన్‍ గాలికి ఇద్దరికీ తెలివొచ్చింది. అప్పటికి రాత్రయిపోయింది. నేల మీద జారిపడిన జగ్గడు లేచి పారిపోయాడా లేదా అని ఉత్సుకతతో పరాంకుశం కళ్లు వెతికాయి. అతడి కళ్లకి చేతిలో మూటతో నేలకొరిగిన జగ్గడు చలనంలేకుండా కనిపించాడు.

తెల్లవారింది.

హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. ‘శాంతమ్మగారు! శాంతమ్మగారు!’ అన్న పాలబ్బాయి పిలుపు ఇద్దరికీ వినిపించింది. కాలింగ్‍బెల్‍ ధ్వని చెవులు చిల్లులుపడేలావుంది. కానీ ప్రతిస్పందించలేకపోయారు.

డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. పాలబ్బాయి వెనక్కి వెళిపోతున్నట్టనిపించింది. మళ్లీ రిటర్నులో వస్తాడేమో అనుకున్నారు శాంతమ్మగారు ఆశగా.

మళ్లీ పాలబ్బాయి తిరిగొచ్చేలోగా ఎలాగైనా మెయిన్‍డోర్‍ వరకు చేరితే చాలని తలచి పరాంకుశంగారు సాహసించారు. ఎక్కడలేని శక్తినీ తెచ్చుకుని కుర్చీతో సహా మెల్లమెల్లగా జరుగుతూ తలుపువైపు తోవ తీశారు.

ఆలస్యంగా వచ్చిన పాలబ్బాయి రెండోసారి కూడా కాలింగ్‍బెల్‍ నొక్కి తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు.

హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది.

డైనింగ్‍టేబుల్‍ మీద సగం కొరికిన బ్రెడ్‍ముక్క ఎండిపోయి పడి ఉంది.

రాత్రినుండి టేబుల్‍పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది.

* * *

Posted in కథ | Tagged , | 4 Comments

మృతజీవులు – 34

అతనికి అడుగడుగునా ఆకర్షణలు ఎదురై, నోరూరుతున్నదన్నమాట! కాని అతను వేచి ఉండాలి. కనక అతని స్థితి ఆలోచించుకోండి, ఒక వేపు పుచ్చకాయా, సామన్‌ చేపా, ఇంకోవేపు “రేపు” అనే తాపమూ అన్నమాట. ’తరవాత వాళ్ళేమైనా చెయ్యనీ, నేను కమిటీకి వెళ్ళి, అధికారులందర్నీ ఒక కొలిక్కి తెస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటాను’, అనుకున్నాడు.

వాడు నిజంగా వివేకహీనుడే, బుర్రలో జ్ఞానం లేదు గాని వల్లమాలిన సాహసం ఉంది, తెలిసింది కాదూ? ఇంకేం కమిటీ వద్దకు వెళ్ళాడు. ‘ఏం మళ్ళీ వచ్చావు? అదివరకే చెప్పాంగా? ‘  అన్నారు. ‘ఇక నాకు జరగదు. నాకు కట్లెట్లు కావాలి, ఫ్రెంచి ద్రాక్ష సారాయి కావాలి. నేను థియేటరుకు పోయి వినోదం చూడాలి – తెలిసింది కాదూ…’ అన్నాడు. ‘అందుకేమీ చేసేది లేదు; నువు ఓర్పు వహించాలనమాట. ప్రస్తుతానికి గడవటానికి కొంత ఇచ్చాం. ఉత్తరువులు వచ్చాక, నీకు తగిన పింఛను రాకపోదు. మన రష్యాలో అర్హుడైనవాడికి పరిగణన లేకుండా పోవడమనేది జరగదు.  కాని, నువు కట్లెట్లలోనూ, థియేటర్లలోనూ ఓలలాడదలిస్తే నన్ను క్షమించాలి. దానికయే ఖర్చు నువే సంపాదించుకోవాలి’ అన్నాడు డైరెక్టరు.

కాని మన కపేయ్కిన్‌ కు ఈగ కుట్టినట్టుకూడా లేదు. వాడు పెద్ద గలాటా చేసి అందరికీ బాగా అందించాడు. సెక్రటరీలను, గుమస్తాలనూ అందరినీ పడతిట్టేశాడు. ’మీరు అలాటివాళ్ళు, ఇలాటివాళ్ళు, మీ బాధ్యత మీకు తెలీదు’ అంటూ అందరినీ కడిగివదిలిపెట్టాడు. ఇంకో డిపార్టుమెంటునుంచి ఒక జనరలు చక్కా వచ్చాడు. ’అయ్యా, వీడు ఆయనను కూడా తగిలాడు. అల్లరి అల్లరి చేసేశాడు. అలాటి ముష్టి వెధవను ఏం చేసేట్టూ?’ గట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుందని డైరెక్టరు గ్రహించాడన్నమాట. ‘సరే, మేమిచ్చినది నీకు చాలలేదు గనక, నీ కేసు తీర్మానమయేదాకా మర్యాదగా ఆగగదలచలేదు గనక నీ బస మార్చేస్తాను. ఎవడురా అక్కడ? వీణ్ణి తీసుకుపోయి బొక్కలో నెట్టండి’ అన్నాడు.

మనిషి వాకిలి దగ్గర హాజరులోనేఉన్నాడు, తెలిసింది కాదూ? ఏడడుగుల మనిషి, ఇంతలావు పిడికిలి, కేవలం దంత వైద్యుడనుకోండీ.. ఇంకేం మన దాసరినీ, ఆ భటుణ్ణీ ఒక బండిలో ఎక్కించారు; ‘పోనీ, బండి ఖర్చు తప్పింది; అదే శానా’ అనుకున్నాడు కపేయ్కిన్‌. వాడు బండిలో పోతూ ‘ఇంకేం, నా ఖర్చు నన్నే చూసుకోమన్నారు గాదూ? అలాగే చూసుకుంటాను! ‘ అనుకున్నాడు. వాణ్ణి ఎలా తీసుకుపోయారో, ఎక్కడికి తీసుకుపోయారో నరమానవుడికి తెలీదు. కాప్టెన్ కపేయ్కిన్‌ జాడలు కాలగర్భంలో కలిసిపోయాయి. తెలిసింది కాదూ? కవులు చెప్పినట్టు వాడు అవ్యక్తంలో లీనమైపోయాడు; అయ్యా ఒక్క విషయం మనవి చెయ్యనివ్వండి, ఈ కథ యొక్క అసలు కీలకమేమంటే కపేయ్కిన్‌ మాయమైన రెండు నెలలకు ర్యజాన్‌ అడవుల్లో ఒక బందిపోటు ముఠా వెలిసింది. ఏమిటనుకున్నారో అయ్యా.. ఆ దొంగలముఠా నాయకుడు మరెవ్వరో కాదు……”

పోలీసు అధిపతి చప్పున అడ్డుతగిలి, “క్షమించాలి, ఇవాన్‌ అంద్రేయివిచ్, కాప్టెం కపేయ్కిన్‌కు ఒక చెయ్యీ, కాలూ లేవని మీరే అన్నారుగదా. మరి చిచీకవ్‌కు….” అన్నాడు.

పోస్టుమేస్టరు గట్టిగా అరిచి, నుదుటిమీద కొట్టుకుని, అందరు వింటుండగా బహిరంగంగా తాను గొర్రెనని ఒప్పుకున్నాడు. కథాప్రారంభంలోనే తనకీ సంగతి యెందుకు తట్టలేదో తెలియకుండా ఉందనీ, రష్యనులకు అంతాఅయాక జ్ఞానోదయ మవుతుందన్న సామెత అక్షరాలా నిజమనీ ఆయన అన్నాడు. అయితే మరొక నిముషం గడిచాక ఆయన తెలివిగా తప్పించుకోజూస్తూ, ఇంగ్లండులో కృత్రిమ అంగాలు అద్భుతంగా తయారు చేస్తున్నారనీ, ఎవరో కృత్రిమమైన కాళ్ళు కనిపెట్టినట్టు పేపర్లో వచ్చిందనీ, ఒక్క రహస్యపు మీట నొక్కితే చాలు, అవి మనుషులను ఎటో తీసుకుపోయి మాయం చేసేస్తాయనీ అన్నాడు.

కాని చిచీకవ్‌ కాప్టెన్‌ కపేయ్కిన్‌ అయిఉంటాడన్న విషయం అందరికీ అనుమానంగానే తోచింది. పోస్టుమాస్టరు కొంచం పప్పులో కాలువేశాడని వారు అనుకున్నారు. అయితే తగ్గిపోవడం ఏమాత్రమూ ఇష్టంలేక పోస్టుమాస్టరు చేసిన సూచనతో ఉత్సాహం పొందినవాళ్ళై, అంతకంటే కూడా అసంగతమైన సూచనలు చేశారు. వారు చెసిన ప్రజ్ఞాన్వితమైన సూచనలలో అతివిచిత్రమైనది ఒకటి ఏమిటంటే, చిచీకవ్‌ మారువేషంలో ఉన్న నెపోలియన్‌ అయిఉంటాడని! రష్యా యొక్క ఘనతా, విస్తృతీ చూసి ఎంతోకాలంగా ఇంగ్లీషువాళ్లకి కన్నెర్ర ఉందట – ఎన్నోసార్లు వ్యంగ్య చిత్రాలలో ఒక ఇంగ్లీషువాడు రష్యావాడితో సంభాషిస్తున్నట్టు చిత్రించారు; ఇంగ్లీషువాడు చేతిలో పట్టుకున్న తాడుకు ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క నెపోలియనుట: “చూసుకో, నాకు గనక కోపం వచ్చిందంటే, ఈ కుక్కను ఉసిగొల్పుతాను! ” అంటాడు ఇంగ్లీషువాడు. ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీషు వాళ్ళు నెపోలియనును సెంట్‌ హెలీనా ద్వీపం (ఖైదు) నుంచి విడిచిపెడితే అతను నిజంగా చిచీకవ్‌ కాకుండానే, చిచీకవ్‌లాగా వేషం వేసుకుని రష్యా అంతా తిరుగుతున్నాడేమో.

అధికారులు ఇదంతా పూర్తిగా విశ్వసించలేదనుకోండి; అయినా వారు ఆలోచనా నిమగ్నులై, ఎవరిమటుకు వారు వితర్కించుకుని, చిచీకవ్‌ను పక్కకుతిప్పి చూస్తే చాలావరకు నెపోలియన్ చిత్తరువులాగానే ఉంటాడని నిశ్చయించుకున్నారు. 1812 లో యుద్ధంలో పాల్గొని, నెపోలియనును స్వయంగా చూసిన పోలీసు అధిపతి, నెపోలియన్‌ చిచీకవ్‌ కన్న ఎత్తుండడనీ, ఆకారంలో నెపోలియన్ లావుగా ఉంటాడనడానికి వీలులేదుగాని, సన్నటివాడుమాత్రం కాదని ఒప్పుకుతీరవలసి వచ్చింది. బహుశా, పాఠకులలో కొందరు ఇది అసంభావ్యం అనగలరు; అత్యంత అసంభావ్యమని రచయిత వారితో ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నాడు; కాని దురదృష్టవశాత్తూ ఇదంతా ఇలాగే జరిగింది. చిత్రమేమిటంటే ఈ నగరం ఎక్కడో అడవుల మధ్య ఉన్నది కూడా కాదు, రెండు రాజధానులకూ దగ్గరిలో వున్నదే కూడానూ. అయితే ఇదంతా జరిగే నాటికి ఫ్రెంచి వాళ్లను తరిమికొట్టి ఎంతోకాలం కాలేదు. ఆరోజుల్లోమా భూస్వాములూ, అధికారులూ, వర్తకులూ, దుకాణదారులూ, అక్షరాస్యులూ, చివరకు నిరక్షరులైన రైతులూ కూడా ఎనిమిదేళ్లపాటు ఫక్తు రాజకీయవేత్తలై పోయారు. “మాస్కో వార్త”, “మాతృదేశరవి” పత్రికలను కసిగా చదివేవారు, అవి ఆఖరు పాఠకుడి చేతికి వచ్చేసరికి పీలికలు, వాలికలూ అయి ఉండేవి, ఇంకెందుకూ పనికి వచ్చేవి కావు; “ఓట్ ధాన్యం ఎలా అమ్ముతున్నారో?” , “నిన్న పడ్డ మంచులో ఏమైనా కాలక్షేపం చేశారా? “, “పత్రికలో వార్తలేమిటి? “, “నెపోలియనును ద్వీపంనుంచి మళ్ళీ వదిలెయ్యాలా?” అని ప్రశ్నించేవారు.

వర్తకులకు ఈ విషయం చెడ్డభయంగా ఉండేది. ఎందుకంటే మూడేళ్ళుగా ఖైదులో ఉన్న దైవజ్ఞుడొకడు చెప్పిన జోస్యాన్ని వారు పూర్తిగా నమ్మారు. ఈ దైవజ్ఞుడు ఎక్కడనుంచి వచ్చాడో ఎవరికి తెలియదు; ఆయన అట్టచెప్పులూ, గొర్రెతోలు దుస్తులూ, ముక్కి చేపల కంపుతో సహా ఊడిపడి నెపోలియన్‌ క్రీస్తు శత్రువనీ, సప్తసముద్రాల అవతల షష్టప్రాకారాల లోపల రాతికి గొలుసుకట్టి అతన్ని కట్టి ఉంచారనీ, కాని అతను కాలక్రమాన ఆ గొలుసు తెంచుకుని వచ్చి లోకమంతా జయిస్తాడనీ చెప్పాడు. ఇటువంటి జోస్యం చెప్పినందుకు అతన్ని తగినవిధంగా ఖైదులో పెట్టారు కాని అతను చేయవలసినంతా చేసి, వర్తకులను మభ్యపెట్టేశాడు. తరవాత ఎంతో కాలానికి వ్యాపారం లాభసాటిగా ఉన్నప్పుడు కూడా, వర్తకులు టీ తాగటానికి హోటలుకు వెళ్ళినప్పుడు క్రీస్తు శత్రువుగురించి మాట్లాడుకునేవారు. అధికారులలోనూ, పెద్ద తరగతి వారిలోనూ చాలామంది ఈ సంగతి మరచిపోలేకపోయారు. ఆ రోజులలో ఫాషనులో ఉన్న మిస్టిసిజం వలలో దగులుకుని వారు నెపోలియను నామాక్షరాలలో కూడా వారు గూడార్ధాలు, మాంత్రిక సంఖ్యలు కనిపెట్టారు. అందుచేత అధికారులు అదే ధోరణిలో ఆలోచించారంటే అందులో ఆశ్చర్యం లేదు; అయితే వారు త్వరలోనే కళ్ళు తెరిచి, తాము పెడతోవను పోతున్నామని గ్రహించి, ఇదంతా అర్ధంలేనిదని తెలుసుకున్నారు. వారు ఆలోచించి ఆలోచించి, చర్చించి చర్చించి, చిట్టచివరకు నజ్‌ద్రోవ్య్ నే మళ్ళీ సమగ్రంగా ప్రశ్నించటం వల్ల నష్టం ఉండదని నిర్ధారణ చేసుకున్నారు. చచ్చిపోయిన వాళ్లను గురించిన ప్రసక్తి మొదట తెచ్చినవాడు నజ్‌ద్రోవ్య్. అతనికీ, చిచీకవ్‌కూ మంచి స్నేహమని కూడా చెప్పుకున్నారు, అందుచేత నజ్‌ద్రోవ్య్‌కు అతని జీవిత వివరాలు కొంతవరకైనా తప్పక తెలిసి ఉండాలి, అందుచేత నజ్‌ద్రోవ్య్‌ ఏమి చెబుతాడో తెలుసుకోవాలని నిర్ణయం జరిగింది.

అధికారులైన ఈ పెద్దమనుషులు వింతవ్యక్తులు, ఆమాటకు వస్తే, ఇంకే వృత్తిలో ఉన్న పెద్దమనుషులైనా అంతే. నజ్‌ద్ర్యోవ్ అబద్ధాలకోరని వారికి స్పష్టంగా తెలుసు, అతను ఎంత అల్పవిషయం గురించి ఏది చెప్పినా నమ్మటానికి లేదు; అయినా వీళ్ళు అతన్ని ఆశ్రయించారు ! చాతనయితే మనిషితత్వం వివరించండి ! మనిషి భగవంతు డున్నాడని నమ్మడుగాని, తన ముక్కు గోక్కుంటే చచ్చిపోతానని నమ్ముతాడు; స్వచ్ఛంగా, నిర్మలంగా, అరటిపండు వలిచినట్టున్న కవిత్వాన్ని తోసిపారేస్తాడు, వాస్తవాన్ని కెలికి, వికృతం చేసి, కశ్మలం చేసిన ధూర్తుడి రచనలమీదికి ఎగబడి, ఆనంద పారవశ్యంతో, “ఆహా, ఇదే నిజమైన కవిత్వం, హృదయమర్మాలను ఆకళించుకున్న రచన !” అని కేకలేస్తాడు. బతికున్నన్నాళ్ళు డాక్టర్లను తృణీకరించి చివరకు ఉమ్మిరాచి మంత్రంవేసే అలగా స్త్రీ వద్దకుపోయి చికిత్సపొందుతాడు. ఇంకానయం, తన చికిత్సకు అడ్డమైన దినుసులన్నిటితోనూ ఔషధం తయారుచేసి అదే తనకు సరియయిన మందనుకుంటాడు, ఎందుకో దేవుడికే తెలియాలి.
అధికారులకు కొంత సమర్ధన లేకపోలేదు. నిజానికి, వారు ఇరుకునపడిపోయారు. నీటిలో మునిగేవాడు గడ్డిపోచనైనా పట్టుకుంటాడంటారు; గడ్డిపోచ ఒక ఈగనుకూడా రక్షించలేదని గ్రహించే అవకాశం వాడికి ఉండదు, తాను నూటయాభై, నూటఅరవై పౌనుల బరువుండికూడా గడ్డిపోచను పట్టుకుంటాడు. అలాగే మన మిత్రులు నజ్‌ద్ర్యోవ్‌ను పట్టుకున్నారు. వెంటనే పోలీసు అధిపతి అతన్ని సాయంకాలం పార్టీకిరమ్మని ఆహ్వానిస్తూ ఒక చీటీరాశాడు. పెద్దబూట్లూ, ముచ్చటగొలిపే ఎర్రని బుగ్గలూగల ఒక పోలీసువాడు తక్షణమే కత్తిమీద చెయ్యిపెట్టుకుని నజ్‌ద్ర్యోవ్ బసకు పరుగెత్తివెళ్ళాడు. నజ్‌ద్ర్యోవ్ అతి ముఖ్యమైన పనిమీద ఉన్నాడు. అతను గది దాటివచ్చి నాలుగు రోజులయింది, లోపలికి ఎవరినీ రానివ్వటంలేదు, కిటికీ ద్వారా భోజనం లోపలికి తీసుకుంటున్నాడు; అతను చిక్కి, పాలిపోయాడుకూడానూ. అతను చేస్తూ ఉన్నపని అత్యంతదీక్ష అవసరమైనటువంటిది; అనేకవందల పేకముక్కలలోనుంచి సులువుగా గుర్తించగల రంగును, మిత్రుడులాగా ఆదుకునేదాన్ని, తయారుచేయటం. కనీసం ఇంకొక రెండు వారాలదాకా అతనికీ పనిఉంటుంది. ఇంతకాలమూ తర్ఫీరి ఒక మాస్టిఫ్‌జాతి కుక్కపిల్లను ఒక ప్రత్యేకమైన బ్రష్‌తో దువ్వుతూ, రోజుకు మూడుసార్ల చొప్పున సబ్బుతో నీళ్ళు పోస్తున్నాడు.
తన ఏకాంతం భంగమయేసరికి నజ్‌ద్ర్యోవ్ మండిపడి, మొదట్లో పోలీసువాణ్ణి వెళ్ళి ఏట్లో పడమన్నాడు, కానీ చీటీ చదువుకున్నాక, పేకాడటానికి అనుభవం లేనివాడొకడున్నాడనీ, తాను డబ్బు గుంజవచ్చుననీ తెలిసి, అతను గది తలుపు తాళంపెట్టి, ఏదోవిధంగా దుస్తులు వేసుకుని బయలుదేరాడు. నజ్‌ద్ర్యోవ్ చెప్పిన విషయాలూ, ఊహలూ అధికారు లనుకునందానికి పూర్తిగా విరుధ్ధంగా ఉండటంచేత వారనుకున్నదంతా తారుమారయింది. అతనికి అష్పష్టత అన్నది పనికిరాదు, వాళ్ళ ఊహలు ఎంత అస్పష్టంగానూ, పిరికిగానూ ఉన్నాయో అతనివి అంత రూఢిగాను, ఖండితంగానూ ఉన్నాయి. ప్రతి ప్రశ్నకూ అతను తడువుకోకుండా సమాధానం చెప్పాడు; అనేకవేల రూబుళ్ళు ధారపోసి చిచీకన్ చచ్చిన మనుషులనుకొన్నట్టు అతను బల్లగుద్దిచెప్పాడు, అమ్మితే ఏమన్న ఉద్దేశంతో తాను అమ్మానన్నాడు. అతను గూఢచారా, ఏమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ అతను గూఢచారేనన్నాడు; తనతో బడిలో చదువుకునేటప్పుడు కూడా, అతన్ని చాడీఖోరని పిలిచేవాళ్ళనీ, తానూ ఇతర బడిపిల్లలూ మెత్తగా తన్నేసరికి అతని కణతలకు రెండువందల నలభై జలగలను పట్టించవలసి వచ్చిందన్నాడు. అంటే, అతను నలభయ్యే అందామనుకుంటే అదికాస్తా ఎలాగో రెండు వందల నలభై అయి ఊరుకుంది. అతను దొంగనోట్లు తయారుచేసే మనిషా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ అవునని సమాధానం చెప్పి, చిచీకన్ సమర్థతకు ఒక నిదర్శనం కూడా చెప్పాడు; అతని ఇంట్లో ఇరవైలక్షల రూబుళ్ళ దొంగనోట్లున్నట్టు తెలిసి ఇంటికి సీలువేసి, ఇద్దరేసి సిపాయిలను ఒక్కొక్క వాకిలి దగ్గరా కాపలా పెట్టారట, తెల్లవారేలోపల అన్ని నోట్లూ మార్చేశార్ట. మర్నాడు సీళ్ళుతీసి చూసేసరికి నోట్లు మంచివిగా మారి ఉన్నాయట … చిచీకన్ గవర్నరు కుమార్తెను లేవదీసుకుపోయే ఉద్దేశంలో ఉన్నాడా, అతనికి తాను ఈ విషయంలో సహాయపడుతున్నమాట నిజమేనా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ తాను సహాయపడుతున్న మాట నిజమేనన్నాడు, తన సహాయం లేకుండా ఏమీ జరిగిఉండేది కాదన్నాడు. ఈ మాట అన్నాక అతనికి తాను అనవసరమైన అబద్ధం ఆడాననీ, ఇందువల్ల తనకే అపాయం కలగవచ్చుననీ అనిపించింది, అయితే తన నోటికి కళ్ళెం వేసుకోలేక దాని చిత్తం వచ్చినట్టు పోనిచ్చాడు.అతను నోటిని అదుపుచేసుకోలేకపోవటానికి కారణమేమంటే అతని ఊహకు ఎన్నో చిత్రమైన వివరాలు స్ఫురించాయి, వాటిని వృథాచేయటం అతనికి సాధ్యం కాకపోయింది. ఉదాహరణకు, వివాహపు ఏర్పాట్లుజరిగిన చర్చిగల గ్రామంపేరు త్రుఖ్మచేప్క, పురోహితుడి పేరు ఫాదర్ సిదోర్; ఆయన పెళ్ళి చేసినందుకు డెభ్భైఅయిదు రూబుళ్ళు తీసుకుంటాడు, ఇంకా ఎక్కువ కావాలనేసరికి నజ్‌ద్ర్యోవ్ భయపెట్టాడు. మిఖాయిల్ అనే ధాన్యపు వర్తకుడికీ, ఇంకో పిల్లకూ చట్టవిరుద్ధంగా పెళ్ళిచేసినసంగతి పొలీసులకు రిపోర్టిస్తానన్నాడు; వధూవరులకు తన బండి వాగ్దానం చేసి మజిలీలలో గుర్రాల మార్పిడి కి కూడా ఏర్పాటు చేశాడు.
Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 34

ఒలికిన పాలు

సమయం తొమ్మిది దాటింది. టేబుల్ మీద ఒక ఆకారం. జీవం ఉంది అన్నదానికి సూచనగా చిన్న మూలుగు … కాదు.. అస్పష్టమైన మాటలు. కలవరింతలు. నిత్యం సెలైన్ బాటిల్ పై బ్రతికే రోగిలా ఉన్న టేబుల్ ఫేన్ టకటకలాడుతూ ఆగింది. సెలైన్ అయిపోయింది. కరెంటు పోయింది. కొద్ది సేపటికి లేచాడు భవానీ శంకర్.  మెల్లగా కనులు తెరిచాడు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది అతనికి. అదే టేబుల్, అదే ఫేను, అదే హాలు, అదే తను! ఏం మార్పులేదు. బెడ్రూం వైపు చూశాడు. చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు, పేపర్లు. సర్దాలి… వీలు చూసుకుని.

మెల్లగా లేచి బయట తలుపు తీశాడు.. తలుపు దగ్గర క్రిందంతా బంక బంకగా ఉంది. తెల్లని చారలు చారలు. చిరిగిన పాలపాకెట్ ను ఎత్తి చూశాడు. కాస్త పాలు ఇంకా ఉన్నాయి. క్రిందన ఇంకొక పాకెట్ ఉంది. ప్రక్క ప్రక్కనే ఉన్న రెండు పాలపాకెట్లలో ఒకటి మాత్రమే చిరిగింది. ‘ఎదురింటి పిల్లికి ఈ పాకెట్టునే చింపాలని ఎందుకు అనిపించింది. ఎందుకు ఈ పాలపాకెట్టుకే ఈ గతి పట్టింది? ఎందుకు తన జీవితమే ఇలా తగలడింది?’ చిరిగిన పాకెట్లో మిగిలిన పాలను కూడా అక్కడే ఒలకబోసి రెండవపాకెట్తో లోపలికి వచ్చాడు. మొబైల్ తీసి డయల్ చేశాడు. రింగవుతోంది. ‘ మీరు డయల్ చేసిన చందాదారుడు స్పందించుటలేదు…’ కసిగా నొక్కి ఆఫ్ చేశాడు. స్పందన… ఎందుకు స్పందించదు. తనకే ఎందుకు స్పందించదు. ఫోను పడేసి ఫ్రెష్ అయ్యాడు.  పాలు స్టౌ మీద పెట్టి కబోర్డ్ లో వెతికితే, సగం అయిపోయిన బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. అతను ప్రయత్నిస్తున్నాడు.  పాలల్లో బ్రెడ్డు ముంచుకుని తినడం . పాలచుక్క క్రింద పడకూడదు. బ్రెడ్డుముక్క పాలల్లో పడకూడదు. అతని దురదృష్టం ఈరోజు రెండూ జరిగాయి. ఛ! కనీసం ఈ పని కూడా చాతకాదు.

గత ఆరేళ్ళుగా రిసెర్చ్ స్కాలర్ గా ప్రముఖ ఐ.ఐ.టి లో చేస్తున్నాడు భవాని. ఏడాది బట్టీ క్యాంపస్ బయటన ఉంటున్నాడు. సింగిల్ బెడ్రూం హాల్ కిచెన్. ఐదేళ్ళ గడువు పూర్తికాగానే హాస్టలు ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తుందని అందులోకి తీసుకుంటానని ఆరునెలల నుండీ ఊరిస్తూనే ఉంది అతని గైడ్ స్పందన. పరిశోధన సాగటం లేదు. కావలసిన పరికరాలు తెప్పించడం కష్టంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా స్పందన నుండి స్పందనలేదు. తనతో చేరిన వాళ్ళందరూ ఇప్పటికే ఫారెన్లో సెటిల్ అయ్యారు. తానేమో ఇలా.. ! ఏకంగా మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదేమో. చిరిగిన పాకెట్లో మిగిలిన పాలు కనులముందు కదలాడాయి. ఉపయోగంలేదు. ఒంపేయాలి… తన జీవితాన్ని కూడా..!. ఎంతకాలం ఇలా ఉండగలడు. అసలు తనకు పి.హెచ్.డి వస్తుందా? గత ఆరేళ్ళు చేసినదంతా గుర్తుచేసుకుంటున్నాడు. ఏమాత్రం ఉత్సాహం కలగటంలేదు. ఏం చేశాడో ఎందుకు చేశాడో అసలేం చెయ్యాలనుకున్నాడో.. అన్నీ కనిపిస్తున్నాయి. అయితే మసక మసకగా కనుమరుగవుతున్న నక్షత్రాలలా…. అతని కలలు. తిట్టుకున్నాడు. గుర్తొచ్చినవాళ్ళందరినీ తిట్టుకున్నాడు.  ప్రొఫెసర్ స్పందనని తిట్టుకున్నాడు. ఐ.ఐ.టి ని తిట్టుకున్నాడు. భారత విద్యావిధానాన్ని తిట్టుకున్నాడు. పాలబ్బాయిని తిట్టుకున్నాడు. ‘అసలు ఏమిటి వాడి ఉద్దేశ్యం? అంతప్రొద్దున్నే పడేయకపోతే ఏంపోయింది. కాస్త ఆలస్యంగా రమ్మని ఎన్నిసార్లు చెప్పాడు. ఫోన్ తీశాడు. పాలవాడి నెంబర్ కి చేశాడు.

“హలో శేఖరేనా”

“ఆఁ! అవునండి.”

“నేను భవాని ని”

“చెప్పండిసార్ ”

“పాలపాకెట్లు ఎన్ని గంటలకు పెట్టావు? ”

“ఏడుగంటలకండి ”

“నీ కసలు బుద్ధుందా? నాకు ఆలస్యంగా తెమ్మని ఎన్ని సార్లు చెప్పాను? ఇంకెన్ని సార్లు చెప్పాలి ”

“అది కాదు సారు.. ”

“ఏది కాదు. ఈ రోజు నీవల్ల ఒక పాకెట్ పాలు నేలపాలయ్యాయి. నువ్వేమో తొందరగా తెచ్చి పడేస్తావు. ఆ ఎదురింటి పిల్లి వచ్చి పాకెట్టు కొరికి పడేస్తుంది.”

“….. ”

“ఏం మాట్లాడవేం? నీకు ఈ మధ్య బుఱ్ఱ తిరుగుడు ఎక్కువై పోయింది.”

“నేను ఆలస్యంగానే వచ్చానుసార్. అందరికీ ముందే ఆరు గంటలకే ఇచ్చేస్తాను. ఏడు గంటలకి బయలుదేరితే గానీ నేను పనిలోకి వెళ్ళలేను. బస్సు మిస్సైపోతుంది.”

“ఎదో వంక చెప్పి తప్పించుకోవడమే గానీ ఎదుటివాడి కష్టాలని అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు నా పరిస్థితేంటి?”

“సరే సారు, ఈసారి నుండీ లేటుగా పెడతాను ”

“అలాగే అంటావు. మళ్ళీ మామూలే ”

“లేదు సార్, ఈ సారి నుండీ తప్పకుండా లేటుగా వస్తా ”

ఫోను పెట్టేశాడు. రెండవ బ్రెడ్డుముక్కను తీసాడు. ఈసారి పాలల్లో ముంచలేదు. అన్యమనస్కంగా ఒక ముక్క కొరికి నోట్లో పెట్టుకున్నాడు.  అప్పుడు గుర్తొచ్చి పాలను కాస్త త్రాగాడు. బాగుందే! అదే రుచి. తేడా ఏమిటి? రుచిని ఆస్వాదిస్తూ ఆలోచిస్తున్నాడు. తేడా ఒక్కటే.. పద్ధతి! పాలల్లో ముంచి తీసుకుంటే తన నాలుక ఆ రెంటినీ ఒకేసారి గ్రహిస్తుంది. ఆ రుచి తనకిష్టం. కేవలం బ్రెడ్డు ముక్క పెట్టుకుని పాలకై వేచి చూడడం…తన నాలుక ఇష్టపడదు. కానీ క్షణం ఓపిక పడితే వాటి కంబైండ్ రుచిని అది పొందుతుంది. బ్రెడ్డుముక్కా క్రిందపడదు. పాలూ క్రింద పడవు. బహుశా జీవితం కూడా అంతేనేమో. ఏదో అర్థమయ్యీ అవ్వకుండా మనసులో మెదలసాగింది.

మన చేతిలో కొన్నుంటాయి బ్రెడ్డు ముక్కలా. కొన్ని పరిస్థితుల చేతిలో ఉంటాయి. మన చేతులోవి చేజారకుండా పరిస్థితులను మనకనుకూలంగా తెచ్చుకుని జాగ్రత్తగా … ఊహూఁ, తనకది రాదు. కుదరటంలేదు. పరిస్థితులను పట్టించుకోకుండా తన చేతిలో పని తను చెయ్యగలడా? అహం ఒప్పుకోదు. ఒకదానితో సంతృప్తి చెందదు. ఎవరినో ఒకరిని తిట్టుకోవాలి. దోషిని చెయ్యాలి. మనిషి తన సమస్య గురించి కన్నా దానికి ఎవరిని బాధ్యులను చెయ్యాలనేదానిమీద ఎక్కువ దృష్టి పెడతాడు. అహంకారం, ముందు వేలెత్తి బయటవైపు చూపిస్తుంది.  నిజానికి  పాలు ముఖ్యమే. అయితే ఇక్కడ పరిస్థితులు తన చేతుల్లో లేవు. ఎంతసేపు బ్రెడ్డుముక్క నోట్లో పెట్టుకుని ఎదురు చూడగలడు. చూడాలి. తప్పదు. తనకిష్టమైన రుచి ని ఆస్వాదించలేకపోవచ్చు. ఒకవేళ పాలు అయిపోయినా … కడుపులోకి ఏదో కాస్త వెళ్తుంది. ఆకలి తీరుతుంది. ఇక్కడ తన చేతుల్లో ఉన్నది తను ఇప్పటి వరకూచేసిన పరిశోధన. అవును. దానికి ఒక రూపు తీసుకురావాలి. ప్రోజెక్ట్, పేటెంట్, పేపర్స్ …

తను చేరినప్పుడు లక్ష్యం  ఏం పెట్టుకోవాలో స్పందన చెప్పింది. “మనమంతా ఒక టీం. నన్ను మీ ఫ్రెండ్ గానే ట్రీట్ చెయ్యండి.. ఈ మర్యాదలు అవీ నాకు పెద్ద ఇష్టంలేదు. కాల్ మీ స్పందన. దట్సాల్ ” మొదటిరోజు ఆమె మాటలు. ప్రోజెక్ట్ తన చేతుల్లో లేదు. కానీ పేపర్స్, పేటెంట్ల కోసం ప్రయత్నించగలడు. రిసెర్చ్ అవుతుందోలేదో. ప్రోజెక్ట్ వస్తుందోలేదో. వాటికి పరిస్థితులు అనుకూలించాలి. తన చేతిలో ఉన్నది ముందు మొదలెట్టాలి. కనీసం బ్రెడ్డైనా తింటే కాస్తైనా కడుపు నిండుతుంది. అంతే ఒక్కసారిగా అతనిలో ఒక వెల్లువ పొంగింది. సగం కొరికిన బ్రెడ్డు ముక్కను అలానే వదిలేసి, ఇన్స్టిట్యూట్ కి రివ్వున దూసుకుపోయాడు.

ల్యాబ్ లో పనిచేస్తున్నాడు భవాని శంకర్. తన దగ్గర ఉన్న డేటాని గ్రాఫ్లుగా మారుస్తున్నాడు. వాటికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నాడు. చేస్తున్నకొద్దీ అతనికి ఉత్సాహం పెరగసాగింది. కనీసం నాలుగు పేపర్లకు సరిపడా రిసల్ట్స్ అప్పటికే వచ్చాయి. ఏమో … పి.హెచ్.డికే సరిపోవచ్చేమో!  పేపర్లు తయారు చేస్తున్నాడు. ఆరోజు భవానీ నైట్ ఔట్ చేస్తున్నాడు. భవానీ శంకర్ జీవితంలో ఎన్నో నైట్ ఔట్లు ఉన్నాయి. మరెన్నో నైట్ ఔట్లు ఉంటాయి. భవానీ శంకర్  ప్రత్యేకమైన వ్యక్తి కాదు. అతని పరిశోధనా ప్రత్యేకమైనది కాదు. ఆ రాత్రికి కూడా ఏ ప్రత్యేకతా లేదు.

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి  మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రినుండీ టేబుల్ పైన ఫాన్‌ తిరుగుతూనే ఉంది.

Posted in కథ | Tagged , | Comments Off on ఒలికిన పాలు

కథ చెబుతారా? డిసెంబర్ 2011

కథ చెబుతారా - పొద్దు

 

“మీరూ సరితా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ” అడిగాడు హరీష్.

దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్.”మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే ” అన్నాడు.

“కానీ ఈ విషయం మీకు ముందే తెలుసుగా ” అసహనంగా అడిగాడు హరీష్.

“మీకూ ముందే తెలుసు .. కాదనగలరా ” సూటిగా అడిగాడు వినయ్.

ఈ సంభాషణకు తగ్గ … కథ చెబుతారా?

 

 

గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.

Posted in కథ | Tagged | Comments Off on కథ చెబుతారా? డిసెంబర్ 2011

అశ్వమేధం

“ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.”

లేప్‌టాప్ స్క్రీన్ మీద ఆ వాక్యాలని అరగంటనుంచి చూస్తున్నాడు నితిన్. అతని మస్తిష్కంలో మేలుజాతి జవనాశ్వాలు పరుగులు తీస్తున్నాయి. వాటికి ఱెక్కలు తొడిగి ఎగిరించాలని అతని ప్రయత్నం. అవి ముందుకూ వెనక్కూ పరిగెడుతున్నాయి. గుండ్రంగా తిరుగుతున్నాయి. చదరంగంలోని గుఱ్ఱపు దాట్లు కూడా వేస్తున్నాయి. కాని ఎంత ప్రయత్నించినా ఎగరడం లేదు!

ఆఫీసులో వారానికయిదు రోజులు నిప్పుతో చెలగాటం (దీన్నే ఇంగ్లీషులో ముద్దుగా firefighting అంటారు!). శరీరం, మనసు రెండూ అలసిసొలసి పోతాయి. అయిదురోజుల ఆ అలసటని రెండు రోజుల్లో తీర్చేసుకోవాలనే ఆరాటం. దాని కెన్నెన్నో మార్గాలు. సిమిమాలు, షికార్లు, పబ్బులు, పార్టీలు. ఆ లిస్టులో నితిన్ చేర్చుకున్న మరో ఐటం – సాహిత్యం. అతనికి కథలు చదవడం రాయడం ఒక మంచి మత్తు. అది మందు మత్తుతో కలిస్తే మరింత గమ్మత్తు.

పొద్దున సగం తిని వదిలేసిన సాండ్విచ్ టేబిల్ మీద ఎండిపోతూ పడుంది. పక్కనే సగం తాగిన బీర్ బాటిల్. తన గుఱ్ఱాలకి మరో గుక్కెడు కుడితి పట్టించాడు. కాస్త జోరుగా పరిగెట్టడం మొదలుపెట్టాయవి. స్క్రీన్ మీద వాక్యల వెంట అతడి కళ్ళు మరోసారి పరిగెత్తాయి. ఓ ఇంటర్నెట్ పత్రికవాళ్ళొక కథలపోటీ పెట్టారు. ఇచ్చిన సన్నివేశంతో మొదలుపెట్టి కథ రాయాలి. దానికోసం మంచి కథ రాసి పంపించాలని నితిన్ ప్రయత్నం. పరిగెడుతున్న గుఱ్ఱం ఒకటి ఒక్కసారిగా ఆగి, ముందు కాళ్ళు ఎగరేసి సకిలించింది. ఇలాంటి ఓపెనింగ్‌తో మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ అల్లేయ వచ్చు!

ఆ యింట్లో ఒక హత్య జరుగుతుంది. ఒక ఒంటరి వ్యక్తి హత్య. యిరుగుపొరుగుల వాళ్ళకి రెండ్రోజులకి కాని తెలియదు. తెలియదని పోలిసులతో చెపుతారు. వాళ్ళందరూ నిజమే చెపుతున్నారా? ఇంతకీ హత్య జరిగిన వ్యక్తి ఎవరు? ఎవరా హత్య చేసింది? రెండో రోజు పాలపేకెట్లు వేసేటప్పుడు అక్కడ పడున్న ముందురోజు పేకట్లు చూసికూడా పాల అబ్బాయికి ఏ అనుమానం రాలేదా?

పాలంటే గుర్తుకొచ్చింది! పొద్దున్న పాలపేకట్ తీసుకోనే లేదు. పాలబ్బాయి పడేసిన పేకట్ అలానే ఉండిపోయుంటుంది! రాత్రి యింటికి వచ్చి పడుకొనేసరికి రెండు దాటిపోయింది. దానితో మధ్యాన్నమయ్యే దాక పక్క దిగలేదు. ఇప్పుడింక తీసి లాభం లేదు. పాలు పాడయిపోయుంటాయి. నితిన్ తన ఆలోచనలను మళ్ళీ కథ వైపుకి తిప్పాడు. చివరివరకూ సస్పెన్స్ ఉండేందుకు కథని ఎలా నడపాలో ఆలోచిస్తున్నాడు. అంతలో…

హల్లో గడియారంలోంచి బయటికొచ్చిన పిట్ట ఏడుసార్లు కూసి మళ్ళీ లోపలకి దూరింది. “అబ్బో! ఏడయిపోయిందే” అనుకున్నాడు. ఇప్పుడిక వంటచేసుకొనే ఆసక్తి లేదు. బయటకి కూడా వెళ్ళాలని అనిపించడం లేదు. పిజ్జాహట్‌కి ఫోన్ చేస్తే సరి. ఇంటికి తెచ్చిస్తారు. సెల్‌ఫోను తీసి నంబరు కలిపాడు. మీడియం సైజ్ ఆర్డర్ చేసాడు, మరునాడు బ్రేక్‌ఫాస్టు‌కి కూడా సరిపోతుందని. మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. హత్య గురించిన ఆలోచనలే అతని బుఱ్ఱ నిండా తిరుగుతున్నాయి. ఎనిమిదవుతూ ఉండగా డోర్ బెల్ మోగింది. పిజ్జా వాడే అయ్యుంటాడనుకొని తలుపు తెరిచాడు. చూస్తే ఎదురుగా పక్కింటాయన. ఈ టైములో తలుపుకొట్టాడేమిటి చెప్మా అని అనుమానంగా చూస్తూ ఉంటే, చిన్నగా నవ్వుతూ, “ఏం లేదు మీరు వీకెండ్ సాధారణంగా పూనే వెళుతూ ఉంటారు కదా. మీ యింట్లో లైట్ వెలుగుతూ ఉంటే ఏమిటా అని తలుపుకొట్టాను. అంతే!” అన్నాడతను. ‘అబ్బో! ఈ కాలంలో పక్కింటి వాళ్ళ గురించి యింతగా పట్టించుకొనే వాళ్ళున్నారా!’ అని మనసులోనే ఆశ్చర్యపోయాడు నితిన్. తనూ చిన్నగా నవ్వి, “లేదండీ, ఈ వీకెండ్ వెళ్ళ లేదు” అని క్లుప్తంగా జవాబిచ్చాడు. పక్కింటతను తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతని చూపులో ఏదో అనుమానం ఉన్నట్టనిపింది. తలుపు వెయ్యబోతూ ఉండగా పిజ్జా మనిషి వచ్చేసాడు. అతడికి డబ్బు లిచ్చి పంపించేసి, లోపలకొచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆలోచనలు కథ వైపుకి మళ్ళాయి. తను సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నాడు కాని అందరూ అలాంటివే రాస్తారేమో, అని నితిన్‌కి అనుమానం వచ్చింది. అవును, ఆ ప్రారంభం చదవగానే ఎవరికైనా తట్టేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాటే. అబ్బే! అయితే యిది లాభం లేదు. అందరిలాగా తనూ రాస్తే తన కథకి ప్రత్యేకతేముంటుంది? అప్పుడు బహుమతి యెలా వస్తుంది? ఏదైనా వేరే విషయం ఆలోచించాలి, అనుకున్నాడు. అతని బుఱ్ఱలో గుఱ్ఱాలు మళ్ళా దౌడు తీయడం మొదలుపెట్టాయి.

పిజ్జా తినడం పూర్తయ్యింది. రెండో బీరు సీసా ఖాళీ అయింది. ఈసారి నితిన్ ఆలోచనలు సమాజం మీదకి మళ్ళాయి. ఏదైనా సామాజిక సమస్య నేపథ్యంలో కథ రాస్తే అందరికీ సులువుగా ఎక్కుతుంది. పాఠకులనుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. సామాజిక సమస్య అనగానే నితిన్‌కి గుర్తుకొచ్చింది ట్రాఫిక్ సమస్య. లక్షలు ఖర్చుపెట్టి కారు కొనుక్కొని ఏం సుఖం? పెట్రోలు కన్నా దాని ధరే యెక్కువగా మండిపోతోంది. పోనీ ప్రయాణమైనా సాఫీగా సాగుతుందా అంటే అదీ లేదు. భయంకరమైన ట్రాఫిక్, దానికి తోడు దరిద్రగొట్టు రోడ్లు. రోజూ ఆఫీసుకి పదిహేను కిలోమీటర్లు ఆ ట్రాఫిక్‌లో ప్రయాణం చెయ్యడమంటే వైతరణి దాటడమే! రోజుకు రెండుసార్లు దాటాల్సి వస్తోంది. లేన్లూ పాడూ ఉండవ్. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా దూసుకుపోడమే. టూవీలర్ల వాళ్ళతో మరీ చిరాకు. ఇష్టమొచ్చినట్టు కార్లకడ్డంగా వచ్చేస్తారు, బొత్తిగా ట్రాఫిక్ సెన్సంటూ ఉండదు. మన ప్రభుత్వాలకి యీ సమస్య ఏమాత్రం పట్టదు, ఏం ఖర్మో! నితిన్‌లో ఆవేశం పెరుగుతోంది. మరో అర సీసాడు బీరు అతని ఆవేశానికి ఆజ్యమయ్యింది. నిద్రపోయే ప్రభుత్వమ్మీదా, రోడ్డంతా తమదే అనుకొనే బస్సువాళ్ళ మీదా, పక్కవాళ్ళని పట్టించుకోని ఆటోవాళ్ళ మీదా, రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు తుపుక్కు తుపుక్కని ఉమ్మేసే సెన్స్‌లెస్ జనాల మీదా – ఒకటేమిటి మొత్తం సమాజమ్మీదనే కోపం పొంగుకొస్తోందతనికి. ఈ ఇండియా తన జన్మలో బాగుపడదు. ఏదో పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కుదరడం లేదు కాని, లేదంటే ఎప్పుడో అమెరికాలో సెటిలైపోయేవాడు తను. మూడేళ్ళక్కడ ఉండి కూడా తిరిగి వచ్చేసాడు. అయినా ఇంకెంత, మరొక్క ఏడాది. ఆ తర్వాత ఎలాగైనా తిరిగి అమెరికాకి శాశ్వతంగా వెళ్ళిపోడమే. అంతదాకా ఎలాగో అలా యీ ఇండియాని భరించక తప్పదు… తన గుఱ్ఱాలు దారి తప్పుతున్నాయని గ్రహించాడు నితిన్. మళ్ళీ కథవైపుకి ఆలోచనలని మళ్ళించడానికి ప్రయత్నించాడు. అయితే, ఇచ్చిన ప్రారంభంతో తను ఆలోచిస్తున్న సమస్యల్ని ఎలా ముడిపెట్టాలో తెలియలేదు. ఆ ప్రారంభ సన్నివేశం కథకి ముఖ్యమైనదై ఉండాలి కదా. ఎలా? ఏదో పెద్ద గోడొకటి అడ్డంగా ఎదురైనట్లు గుఱ్ఱాలన్నీ ఆగిపోయాయి. లాభం లేదు వేరే దారి వెతకాలి, అనుకున్నాడు నితిన్.

ముచ్చటగా మూడు సీసాలు ఖాళీ అయ్యాయి. గుఱ్ఱాలు మళ్ళీ తమ పరుగు మొదలుపెట్టాయి. మరింత వేగం పుంజుకున్నాయి. మనసు వెరయిటీ కోసం తపిస్తోంది. వాట్ ఎబౌట్ సైన్స్ ఫిక్షన్? మరో గుఱ్ఱపు సకిలింత. యెస్! మంచి ఆలోచన. గొప్ప వెరయిటీ. ఆ గుఱ్ఱపు కళ్ళేన్ని గట్టిగా బిగించి దాన్ని జోరుగా పరుగెత్తించాడు.

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడతడు. సరిగ్గా గడియారం ఏడు గంటలు కొడుతోంది. నాలుగువారాలై జరుగుతోందిది! ప్రతి ఆదివారం సరిగ్గా యిదే కల. ఇదే సమయానికి! ఏంటీ విచిత్రం? ఎందుకిలా జరుగుతోంది? ఏవరో ఎక్కడనుంచో తనకిలా స్వప్న సందేశం పంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరై ఉంటారు? తనకే ఎందుకు పంపిస్తున్నారు? ఇలా పంపడం సాధ్యమేనా? ఈ విషయం తన గైడుతో మాట్లాడాలి. తాము చేస్తున్న టైం ట్రావెల్ ప్రయోగాలకీ వీటికీ సంబంధమేమైనా ఉందేమో! తాము ఊహిస్తున్నట్టుగా సమాంతర ప్రపంచాలు కనక ఉండి, కలలో మనకి కనిపించేవి వేరే యేదో సమాంతర ప్రపంచంలోని దృశ్యాలయితే, ఇదీ అలాంటిదే అయ్యుండవచ్చు. కాలంలో ప్రయాణం వేరే సమాంతర ప్రపంచంలోకి మాత్రమే సాధ్యం కాబట్టి, ఎలాగయినా అందులోకి వెళ్ళగలిస్తే?!

ఇప్పుడెక్కిన గుఱ్ఱం పంచకల్యాణిలా పరుగు తీయడం నితిన్‌కి మంచి హుషారుగా ఉంది. కాని ఆ హుషారుని బేజారు చేస్తూ ఓ ఆలోచన అడ్డంగా వచ్చి పడింది. ఇంత సైన్స్ ఫిక్షన్ని మన సగటు తెలుగు పాఠకులు తట్టుకోగలరా? అంతే! పరిగెత్తే గుఱ్ఱం ఒక్కసారిగా చతికిలపడింది. అబ్బే! తెలుగు పాఠకుల మీద అంత నమ్మకం పెట్టుకోడం కుక్కతోక పట్టుకొని గోదా రీదాలనుకోడమే. సామాజిక స్పృహా, ఉద్యమం, వాదం, మట్టీ మశానం.. వీటి చుట్టూనే తిరుగుతాయి కథలన్నీ. ఏ డయాస్పోరానో అయితే ఇహ ఇండియా గురించి నాస్టాల్జియాతో నిండిపోతుంది. ఈ మధ్య, చిన్ననాటి జీవితం గురించి పక్కా మాండలికంలో కథలు కథలుగా హోరెత్తించేయడం కొత్త ఫేషన్! ఎంతసేపూ ఏదో ఒక ఏమోషను గుండెల్ని పిండెయ్యాలనే అనుకుంటారు కాని, తమ ఆలోచనల్ని విశాలం చేస్తూ కొత్త కొత్త ఊహలకి ప్రాణంపోసే కథలని తెలుగు పాఠకులు ఎందుక్కోరుకోరు? నితిన్ మనసులో కసికి మరో సీసా ఖతం. ఛత్… అథోజగత్తులో ఉన్న పాఠకలోకం ఎప్పుడెదుగుతుందో! పోనీ ఎడిటర్లయినా మహా గొప్పగా ఉండేడిశారా అంటే అదీ లేదు! ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏ కాస్తో ఇంగ్లీషు సైన్స్ ఫిక్షన్ చదివినవారైతే – “ఆఁ… యిదేదో ఇంగ్లీషు కథకి కాపీయే” అని కొట్టిపారేసే ప్రమాదం కూడా ఉంది! కాబట్టి యిది చాలా రిస్కుతో కూడిన వ్యవహారమని నిశ్చయించుకున్నాడు నితిన్. అక్కడితో ఆ గుఱ్ఱపు పరుగు ఆగిపోయింది.

లోపలికెళ్ళిన ద్రవం మెల్లిగా ఉపద్రవం మొదలుపెట్టింది. కళ్ళేల పట్ట్లు తప్పిన గుఱ్ఱాలు కల్లు తాగిన కోతులవుతున్నాయి. నాన్సెన్స్! ఓ చిన్న కథ రాయడానికింత సేపాలోచించాలా! అక్కర్లేదు. కాని మాంచి పవర్ఫుల్ స్టోరీ కావాలనుకుంటున్నాడు తను. అందికే యింత తాపత్రయం. ఒక రచయితగా అది తన బాధ్యత! లేప్‌టాప్ ముందు కూర్చుంటే పని జరిగేలా లేదు. ఆరుబయట పిల్లగాలికి మనసు కాస్త చల్లబడి కొత్త ఊహలు ఊపిరిపోసుకోవచ్చు. మెల్లగా లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు, చేతిలో బాటిల్‌తో. ఎదురుగా బెంగుళూరు నగరం విశాలంగా పరుచుకుని ఉంది… ఈ నగరం శనివారం రాత్రి నిద్రపోదు! చీకటితో చెలిమిచేస్తూ చుట్టూ పరుచుకున్న నియాన్ లైట్ల కాంతి ఒక గమ్మత్తైన నిషానిస్తోంది… రాతిరనే విటునికోసం అలంకరించుకున్న వేశ్యలాగా కనిపిస్తోందీ నగరం… ఎన్నెన్ని చాటుమాటు కలాపాలని చీకటి ముసుగుతో కప్పేస్తోందో! నిజానికి పై-క్లాసు, లో-క్లాసుల వాళ్ళకి ముసుగు లవసరం పెద్దగా ఉండదు. చాటుమాటు వ్యవహారాలన్నీ మిడిల్-క్లాసు వాళ్ళవే… విలువల వలువలు, మొహమాటపు ముసుగులు, సంస్కారపు మాస్కులూ – అన్నీ ఎటుకీ కాని మధ్యవాళ్ళకే… బ్లడీ మిడిల్ క్లాస్… నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోలేని పిరికివాళ్ళు… హిపోక్రెట్స్… వీళ్ళనీ వీళ్ళ పనికిమాలిన విలువలని కడిగేస్తూ ఓ ఘాటయిన కథ రాసిపారెయ్యాలి… యెస్… అదీ చైతన్యస్రవంతి ధోరణిలో అయితే మరింత రంజుగా ఉంటుంది…

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది. టేబిల్ మీద ఒక బకాడీ బాటిల్, పక్కనే గ్లాసు. రెండూ ఖాళీగానే ఉన్నాయి. ఆ పక్కగా ఒక తెరిచి ఉన్న డైరీ. ఫ్యాన్ గాలికి పేజీలు రెపరెపలాడుతున్నాయి. టేబుల్ మీదకి పూర్తిగా ఒరిగిపోయి పడుకొని ఉందామె. కనురెప్పల మూసి ఉన్నా, వాటి వెనక మత్తు బరువు తెలుస్తోంది. ఆమె యిప్పుడు పూర్తిగా మరో ప్రపంచంలో విహరిస్తోంది. ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వేసిన ఆలోచనల వంతెనలు, ఆ డైరీ అంతా పరచుకొని ఉన్నాయి. అవి చదివితే ఆమె ఎవరో తెలుస్తుంది. కానీ చదివేవారెవరు?

ఆమె ఎవరై ఉండవచ్చు? ఎందుకీ లోకమంటే ఆమెకంత కసి? ఏ సంకెళ్ళను తెంచుకొనే ప్రయత్నమది? ఏ స్వేచ్ఛా మైదానాల వైపు ప్రయాణమది? మైదానం… చలం… రాజేశ్వరి… సగటు మధ్యతరగతి మగువ… ఆమె రాజేశ్వరి కాదు కదా? అదెప్పటి రాజేశ్వరి! కాదు కాదు… ప్రతి తరంలోనూ ఎందరో రాజేశ్వరులు… ఎన్నెన్నో కథలు… ఈ రాజేశ్వరి కథేమై ఉంటుంది? ఇప్పటి పరుగుల జీవితంలో ఆమె ఒక ఉద్యోగిని… పరువైన ఉద్యోగం… బరువైన ఉద్యోగం… తనకన్నా ఎక్కువ సంపాదించే మొగుడు… అన్నీ ఉన్నాయి… అయినా… ఏదో దాహం… తీరని దాహం… ప్రేమ కోసం… తన భర్తకి తనపై ప్రేమ లేదూ? ఏమో… అసలు కలిసుంటేగా తెలిసేది… అతనో చోట తనో చోట ఉద్యోగం… ఎప్పుడో నెలకోసారి రెండ్రోజుల హడావిడి కలయిక… దూరమైన ప్రేమని మరిచిపోడానికి ఎన్ని ప్రయత్నాలు… ప్రేమలేని క్షణాలని నిర్దాక్షిణ్యంగా చంపెయ్యడానికి… రకరకాల నిషాలు… కొత్తగా ఈ మధ్యనే పరిచయమైన అమీర్… కానీ అతనిచ్చేది మామూలు మత్తు కాదు… ప్రేమ మత్తు… తనకి దూరమైన ప్రేమసుధలో తనని ముంచెత్తే మత్తు… కానీ… మధ్యతరగతి విలువలు… ప్రపంచం… భర్త… ఆఖరికి తన మనసూ… అన్నీ అడ్డంకులే… విలాసాల జీవితాలకి విలువలేమిటి? నాన్‌సెన్స్!

ఒక్కసారి షాక్ కొట్టినట్టై తల విదించాడు నితిన్. ఏమిటిది? తన ఆలోచనలిలా సాగుతున్నాయేమిటి? పూనేలో పని చేస్తున్న భార్య గుర్తుకొచ్చింది. ప్రాజెక్ట్ పనుందని తన నీ వీకెండ్ రావద్దని చెప్పింది. ఈ సమయంలో తనెందుకు గుర్తుకొచ్చింది?! ఆమెకీ ఈ కథకీ సంబంధమేమిటి? అంతా కన్‍ఫ్యూజింగా ఉంది! బుఱ్ఱంతా గిఱ్ఱున తిరుగుతోంది. లోపలంతా అల్లకల్లోలమై గుఱ్ఱాలన్నీ పరుగులాపి భయంతో సకిలిస్తున్నాయి. సుడిగాలిలో చిక్కుకున్నట్టు అతలాకుతలమైపోతున్నాయి. ఒకటే తలపోటు. ఇక లాభం లేదు. కథ ముందుకి సాగదు. తూగుతూ గదిలోకి వెళ్ళి అమాంతం మంచమ్మీద పడిపోయాడు నితిన్.

సూర్యుడు నిద్రలేచినా నితిన్ ఇంకా మంచమ్మీద అలాగే పడుకొని ఉన్నాడు. ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచాడు నితిన్. తలంతా దిమ్ముగా ఉంది. మెల్లిగా లేచి ఫ్రెషప్ అయ్యాడు. ముందురోజు సంగతులన్నీ ఒక్కటొక్కటే జ్ఞాపకమొస్తున్నాయి. మళ్ళీ కథ చుట్టూ ఆలోచనలు ముసురుకోడం మొదలుపెట్టాయి. ఎలాగైనా రాయాలన్న పట్టుదల పెరిగింది. కాని గుఱ్ఱాలన్నీ మన్నుతిన్న పాముల్లా పడున్నాయి. అన్ని గుఱ్ఱాలనీ ఒకసారి పరిశీలనగా చుసాడు. ఇందులో తన పందెం గుఱ్ఱమేది? బాగ ఆలోచించిన మీదట, ఏదైనా సామాజికసమస్యే అన్నిటికన్నా సేఫ్ బెట్ అనిపించింది చివరికి. లేప్‌టాప్ తెరిచి మళ్ళీ కథ మొదటి సన్నివేశం చదివాడు. గుఱ్ఱం పరుగందుకొంది. సామాజికసమస్య బలంగా చూపించాలంటే ట్రాజెడీ అవసరం. ఆ యింట్లో ఏదో ట్రాజడీ జరిగింది. హత్య అయితే క్రైం స్టోరీ అవుతుంది. అదే ఆత్మహత్యయితే?! యెస్. ఆత్మహత్య… ఒక యువకుడి ఆత్మహత్య! కారణం? నిరుద్యోగమే అవ్వాలి! ఈ కాలంలోకూడా నిరుద్యోగసమస్య ఉందా? అనుమానం వచ్చింది నితిన్‌కి. ఆఁ ఉండకేం చేస్తుంది. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ..ఊ..ఊ..ఊ… ఉన్న దేశమేగా! తనకి తానే భరోసా యిచ్చుకున్నాడు. ఈ మధ్య చదివిన పేపర్లో వార్తలన్నీ ఒకసారి మననం చేసుకున్నాడు. సెజ్ పేరిట భూముల దురాక్రమణ, పంటలు పండక పొలాలని అమ్ముకొని కూలీలుగా మారుతున్న రైతన్నలు, అమెరికాలో రిసెషన్. అన్నీ వరసపెట్టి తలపుకొచ్చాయి. ఇంకేముంది, బ్రహ్మాండమైన కథ తయారైపోయింది! కొడుకుని ఇంజనీరింగ్ చదివించడం కోసం నానా అగచాట్లు పడే రైతు. చివరికి డబ్బుకోసం పొలాన్ని అమ్మేసి పట్నం వచ్చి కూలిపని చేసుకోడం మొదలు పెడతాడు. ఆఖరికా పొలంలో ఒక సాఫ్టువేర్ కంపెనీ వెలుస్తుంది. ఇంజినీరింగ్ పాసైన కొడుకు అదే కంపెనీలో సాఫ్టువేర్ ట్రైనీగా చేరతాడు. ఈలోపు రిసెషన్ దెబ్బతో ఆ కంపెనీలో లే ఔట్స్. ఆ యువకుడి ఉద్యోగం ఊడిపోతుంది. మరెక్కడా ఉద్యోగం దొరకదు. డిప్రషన్‌కి లోనై ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటాడు. యువకుడి ఆత్మహత్యతో కథ మొదలవుతుంది.

బాగుంది! సామాజికతతో పాటు సమకాలీనత కూడా ఉన్న కథ. నితిన్‌కి సంతృప్తి కలిగింది. ఈ కథని ఎవరు చెపితే బాగుంటుంది? యువకుడు, ఉత్తరంలో తనే చెప్పుకున్నట్టు రాస్తే? ఉఁహుఁ… అప్పుడు వర్ణనలకి పెద్దగా అవకాశముండదు. రసం పండదు! రచయితే చెప్పాలి. కానీ అందులో వెరయిటీ ఎముంటుంది? ఆఁ… రచయితకూడా కథలో పాత్రయితే? బాగుంటుంది. రచయిత, ఆత్మహత్య చేసుకున్న యువకుడి స్నేహితుడైతే చక్కగా కుదురుతుంది. కథ చివరన ఆ యింట్లోంచి – “నా చావుని నీ పేరుకోసం కథగా మారుస్తావా!” అనే అరుపు రచయితకి వినిపిస్తే? సూపర్! మాంచి పంచున్న ముగింపవుతుంది. కథకి ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది! కచ్చితంగా బహుమతి కొట్టేసే కథ అవుతుంది. నితిన్‌కి ఉత్సాహం పుట్టుకొచ్చింది. అదే ఊపులో కథ మొత్తం రాసేయాలని నిశ్చయిచుకున్నాడు. చకచకా లేప్‌టాప్‌లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి కథ ప్రారంభం టైప్ చెయ్యడం మొదలుపెట్టాడు…

“ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.”

Posted in కథ | Tagged | 1 Comment

పురాతన ఉషోదయం

ప్రకృతి పాఠం ఎప్పుడూ ఒకేలా  ఉండదు .

 

పాదాల కింద  భూగోళం

శిరస్సు పైన ఆకాశం

రెండింటి  మధ్య ఆయుధం !

 

గుడి గంట  వినపడగానే గువ్వల గుంపు

ఆకాశానికి పందిరివేసి పల్లవి అందుకునే

పురాతన  ఉషోదయం….

కల కనడానికి  బాగానే ఉంటుంది !

 

రోజూ లాగే కాలం గడవదు

కొన్ని కాలనాగు వలయాలు

ఇంకొన్ని కాలకూట ప్రళయాలు

నువ్వు  చూసేది, వినేది మాత్రమే నిజం కాదు

జననం లేకుండా… మరణం లేకుండా…

ఇంకొక మాయాలోకం  పని చేస్తుంటుంది

అదృశ్యంగా!

 

చరిత్ర ఇప్పుడు మారింది .

దానికి నీ రక్తం కావాలి …నీ  దేహం  కావాలి .

అదిప్పుడు

నీ  కంకాళంపై వాలే రాబందు !

 

నడి రాత్రి  ఆకాశపు వెలుగులు

దూరంగా  రాలిపోయే  నక్షత్రాలు

చంద్రుడి చుట్టూ  రాహు కేతువులు

మర్రి కొమ్మల్లో కూసే  తీతువులు

ఇవాళ కూడా ఎప్పటి  లాగే కళ్ళనిండా కల్లోలం

వర్షం కుండపోతగా  నీలో కురుస్తూనే ఉంటుంది ….!

 

నడి అడివిలో  నూకల వల  పరిచిన వైనం

మనం ఇప్పుడు వాలడం కాదు …

ఫైపైకి ఎగరడం నేర్చుకోవాలి …

 

నెత్తుటి పూలు తెలియని ఉషోదయం

ఇప్పుడొక కల మాత్రమే!

మనిషి నేర్వని  పాఠం ఎప్పుడూ  ఒకటి  మిగిలే  ఉంటుంది!

Posted in కవిత్వం | 3 Comments

మల్లంపల్లి సోమశేఖర శర్మ

తెలుగునాట చరిత్ర, శాసనాలు, శిల్పకళ, వాస్తు వంటివాటిపై ఎన్నదగ్గ కృషి జరిపి తన రచనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన ప్రజ్ఞాశాలి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి జయంతి (డిసెంబరు 9) సందర్భంగా ఆయన గురించినవి, రచించినవీ కొన్ని సంగతులు ఇక్కడ సమీకరిస్తున్నాం.

———-

ప్రతిభామూర్తులు అనే పుస్తకం 1991లో వెలువడింది. 130 మంది ప్రముఖ తెలుగు వ్యక్తుల రేఖామాత్ర పరిచయం దీనిలో ఉంది. ఈ పుస్తకంలో మల్లంపల్లి సోమశేఖర శర్మగారి గురించి పరిచయ వ్యాసంలో ఇలా ఉంది:

“తెలుగువాళ్ళ చరిత్ర సంస్కృతులను గూర్చి ప్రస్తావన రాగానే ముందుగా స్మరణకు వచ్చే పేరు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారిది. ఆయన ఏది వ్రాసినా అది శర్మదంగానే ఉంటుంది. తెలుగువారి చరిత్రను శాసనాల నుంచి వెలికి తీసిన మహామనీషి శ్రీ సోమశేఖరశర్మ. తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి సంపుటంలో ఒక్క చేతిమీదుగా ఆయన సుమారు 50 అంశాల గురించి వ్రాశారు. ఇక ప్రతి పుట ఆయన ఉపజ్ఞా శోభితంగా పరిష్కృతమని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.

కొమర్రాజు లక్ష్మణ రావు పంతులు గారికి చరిత్ర, శాసన పరిశోధనలో చిన్ననాడు సహాయకుడిగా ఉండి ఆయన వారసత్వానికి నూటికి నూరుపాళ్ళు అర్హులైన వారు శర్మగారు. ఆధునిక కాలంలో ఆంధ్రుల చరిత్రకు ప్రామాణిక సామగ్రిని అందించిన వారు శర్మగారు. చరిత్ర రచనా శైలీ నిర్మాతలలో ఆయన ప్రముఖులు. ఆంధ్రదేశంలో ఎక్కడ, ఏ మూల, ఏ శాసనపు ఉనికిని గూర్చి తెలిసినా ఆయన అక్కడకు రెక్కలు కట్టుకుని వెళ్ళేవారు. శాసనపరిశోధనకే ఆయన జీవితం అంకితమైంది. లిపిశాస్త్ర పరిజ్ఞానంలో ఆధునికులలో శర్మగారి పేరు అగ్రగణ్యం. అమరావతీ స్థూపం గురించి దాని అట్టు పుట్టు ఆనవాళ్ళ గురించి తవ్వి తలకెత్తి ఆంధ్రులకు  ఎన్నో విషయాలు తెలియజేశారు.

చరిత్ర రచనలో సిద్ధ హస్తులే కాక నవలలు, నాటకాలు, శ్రవ్య రూపకాలు రచించారు శర్మగారు. రెడ్డిరాజులను గూర్చి వారు వ్రాసిన గ్రంథాలే నాటికి నేటికి కొలమానాలుగా వినుతి కెక్కాయి. ఆంధ్రుల చరిత్రను ఆదికాలం నుంచి ఆంగ్ల రాజ్య స్థాపనం వరకు వారు ఆకాశవాణి ప్రసంగాలుగా రూపొందించారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి గొప్ప జాతీయ వాది నిర్వహించిన దేశమాత పత్రికలో పనిచేయడం సోమశేఖర శర్మగారి చిన్నతనంలో గొప్ప స్ఫూర్తి నిచ్చి ఉంటుంది. అటు తర్వాత, చరిత్ర చతురానన చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రదేశ చరిత్రకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ పనిలో ఆ విధంగా సోమశేఖర శర్మగారికి అభిరుచి పెంపొంది ఉంటుంది. ప్రాకృతం, సంస్కృతాలలో దిట్టమైన పాండిత్యం అప్పుడే ఆయనకు లభించడానికి అవకాశమున్నూ కలిగింది. శర్మగారి చరిత్ర రచనకు ఇతరుల చరిత్ర రచనకూ ఉండే ముఖ్యమైన భేదం ఏమంటే రాచవంశాల అనుక్రమ కథనం కాక ఆనాటి ప్రజాజీవన పరిణామాల అధ్యయనం ముఖ్యమన్నది ఆయన దృష్టిగా ఉండేది. అందువల్ల ఆయన కొమర్రాజు వారి నుంచి కాశీనాథుని వారి వరకు గొప్ప చరిత్ర పరిశోధకుడుగా, తత్వవేత్తగా గుర్తింపు పొందాడు. రెండువందలకు పైగా వివిధ విషయాలను గురించి ఆయన అమూల్యమైన వ్యాసాలు వ్రాసినట్లు వేత్తలు గుర్తించి ఆయన చరిత్ర పరిశోధన కృషిని తమకు దారిదివ్వెగా స్మరిస్తారు. మల్లంపల్లివారు గొప్ప శాసన పరిశోధకులేకాక చారిత్రకేతివృత్తాలతో రమ్యమైన చిన్న కథలు కూడా ఎన్నో రచించారు. వాటిలో ఆయన సృజనాత్మక ప్రతిభ వెల్లివిరుస్తూ ఉంటుంది. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మినుమించిలిపాడు. తల్లితండ్రులు నాగమ్మ, భద్రయగారలు. సోమశేఖర శర్మ జననం 1891, కాలగతి 1963.

——————————————

 (‘బుద్ధుడు; జీవితం-అవగాహన‘ అను వ్యాస సంకలనం నుండి)

–   శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

“మహాయానం మూలంగానే బౌద్ధంలో కళకు తావేర్పడింది. నాగార్జునాచార్య శ్రీపాదులు ఎంతటి తాత్విక విచారశీలియో, ఎంతటి లోక హితైషియో అంతటి కళాప్రియుడు. ధనకటక మహా చైత్యం చుట్టూశిల్పచిత్ర రత్నాలతో పొదిగిన మహా ప్రాకారం నిర్మించినది ఆయనే అని టిబెట్టు దేశచరిత్రలు చెపుతవి. ఈ ప్రాకరములోని ప్రతి శిల్పచిత్రమూ జీవం ఉట్టిపడుతూ నిన్ననో, మొన్ననో చెక్కినట్లు కళకళలాడుతూ ప్రాత:కాలంలో విరిసిన నవమల్లికా కుసుమంలాగ అచ్చస్వచ్ఛంగా ఉంటవి. ధనకటక మహాచైత్య ప్రాకారంలోని శిల్పచిత్రాలే కాదు, నాగార్జునుని కొండ, గుమ్మడిదుర్రు, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ఈ మొదలైనచోట్ల ఉన్న స్తూపశిల్ప చిత్రాలు కూడా ధనకటక ప్రాకార శిల్ప చిత్రాలకు తీసిపోయేవి కావు. తెలుగుదేశంలో బౌద్ధం అవతరించి తెలుగుజాతిని కళావంతము చేసింది; తెలుగు శిల్పికృతులలో అమృతం చిలికింది. అందువల్లనే అంతకు పూర్వపు బౌద్ధ క్షేత్రాలలో స్తూపశిల్ప చిత్రాలు వట్టి నీరస ప్రతిమలయితే తెలుగు మహాయానమవతరించి ఆదిమ బౌద్ధము స్వరూపస్వభావములనే పూర్తిగా మార్చివేసింది. హీనయాన బౌద్ధుడు తన నిర్వాణమునకే తన సంసార దు:ఖ విమోచనమునకే తన అర్హత పదమునకే కృషి చేసే స్వార్ధపరుడు. మహాయానవాది అట్లు కాదు. అతనికి అవలోకితేశ్వరుడు ఆదర్శము. అతడు బోధిసత్వుడు, మహాయానులలో బోధిసత్వులనేకులు ఉదయించారు. వేరు వేరు మన: పరిణితులు గల వేరువేరు వ్యక్తులు నిర్యాణం సాధించడం కోసం తోడ్పడేటందుకు వచ్చినవారు బోధిసత్వులు. నిర్వాణం పొందుటకు సిద్ధంగా ఉండికూడా లోకంలోని ప్రతి వ్యక్తీ నిర్వాణం పొందితే కాని తనకక్కరలేదని నిరాకరించి సర్వలోక హితైషియై ప్రవర్తించాడు బోధిసత్వుడు. ఇటువంటి బోధిసత్వులు జనులకు తోడ్పడుటకు సృజింపబడినవారు వందలూ వేలూనూ. అందుచేతనే మహాయానానికి బోధిసత్వయానని కూడా పేరు వచ్చింది. బౌద్ధం విశ్వవ్యాప్తి పొందింది మన తెలుగు దేశంలో కృష్ణానదీ తీరాన మహాయానం రూపొందిన తరువాతనే.  అందువల్లనే నాగార్జునాచార్య్లవారు బుద్ధుని తరువాత బుద్ధుడంతటి వాడయినాడు. మహాయానం వచ్చి బుద్ధుణ్ణి భగవంతుణ్ణి చేసి అతనికి లోకోత్తర శక్తులు ప్రసాదించింది. బుద్ధపురాణం వెలసింది.”

———

కందుకూరి వారి ఆంధ్ర కవుల చరిత్రములో ముందుమాటగా వ్రాసిన వ్యాసంలో కొన్ని భాగాలు…

కవిచరిత్ర పరిశోధన

మల్లంపల్లి సోమశేఖర శర్మ

చరిత్ర పరిశోధన అనేది – అది దేశచరిత్ర పరిశోధన కానీండి, వాఙ్మయ చరిత్ర పరిశోధన కానీండి – చాలా కష్టతరమైన కార్యం ఇప్పటికీని. వాఙ్మయ చరిత్ర వ్రాయాలంటే ముందు ఆయాకవుల, వారు రచించిన కృతుల కాలం నిర్ణయించడం అత్యంతావసరం. ఇది ముందు నిర్ణయమైతేనేకాని మన ఆంధ్ర సాహిత్య క్రమ పరిణామం తెలుసుకొనేందుకు వీలుపడదు. ఒక్క వాఙ్మయ చరిత్రకే కాదు, దేశ చరిత్రకైనా కాల నిర్ణయ ప్రణాళిక చాలా అవసరం. కాల పరిగణనలోని ముందు వెనుకలు, పూర్వోత్తరాలు నిర్ణయమైతే కాని జాతి ఏయే కాలాలలో ఎట్టెట్టి పరిణామ వికాసాలు పొందిందో, భాషా వాఙ్మయాలలోను, మతంలోను, కళలలోను ఎప్పుడెప్పుడుడెట్టి మార్పులు వచ్చినవో, ప్రజాభిరుచి ఎట్లా మారుతూ వచ్చిందో తెలియదు. కాల పరిగణన విద్య చరిత్రకు వెన్నెముక వంటిది.

కవులు గ్రంథాలైతే వ్రాశారుకాని వారు తమ జీవిత చరిత్రలు వ్రాసుకోలేదు. వారు తమ జీవిత చరిత్రలకంటెను తమ కృతులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే కృతి సప్త సంతానాలలో ఒకటి. అది పుణ్యకార్యమూ, కీర్తి దాయకమూ గనుక. కొందరు కవులు తమ కృతులను తమ యిష్టదైవముల పేర చెప్పినా చాలా మంది తమ కాశ్రయ మిచ్చినవారికి, తమ్ము పోషించినవారికి అంకితమిచ్చి కావ్య ప్రారంభంలో సువర్ణతిలకాయమానంగా ఉండేటట్టు కృతి భర్తృ వంశాన్ని అభివర్ణిస్తూ వచ్చారు. దాన్ని అనుసరించి – మనకు దేశ చరిత్ర లేకపోయినా కొందరు కృతిభర్తలైన భూపతుల చరిత్రలు తెలుస్తాయి. కొందరు కవులను గురించి, వారి పోషకులను గురించీ – నిజమో అబద్ధమో తెలియని – కొన్ని కథలూ, గాథలూ ప్రచారంలో ఉండేవికదా. వాటిని తగిన ఆధారాలతో పరిశీలించి సాధ్యమైనంతవరకు అబద్ధపు కథలూ, గాథలనూ విడదీసి నిజమయిన వాటిని స్వీకరించడం కవి చరిత్రకారుల విద్యుక్తధర్మాలలో ఒకటి. మన దేశంలో పూర్వకాలమందు – పద్దెనిమిదవ శతాబ్దం వరకూ కూడా గ్రంథాలన్నీ తాటియాకులమీద గంటంతో వ్రాయడం పరిపాటిగా ఉండేది. గ్రంథాలే కాదు అన్ని విధాలైన పత్రాలకు తాళపత్రాలే వాడకం. కారణం –  అప్పటికి ఇంకా మనదేశానికి కాగితం రాకపోవడమే. వచ్చినా అది అరుదుగా దొరికే పీచు కాగితం, ధర ఎక్కువ. తాటాకు కొమ్మలు రెండు కొట్టి తీసుకువస్తే కృతి రచించుటకు కావలసినంత ఆకు! ఇది ఎక్కడపడితే అక్కడ దొరికే వస్తువు; కానీ కర్చు లేనిది. ఎటు వచ్చీ ఆకులు చక్కగా కత్తిరించి రచన చేయుటకు తగినట్లు అందంగా వాటిని సంతరిచాలి. వ్రాయుటకనువుపడే తాళపత్ర గ్రంథనం కూడా పూర్వం ఒక కళగా రాటుదేరింది.

దక్షిణ భారతంలో పూర్వ ప్రబంధాలన్నీ తాళపత్రాలమీద వ్రాసినవే. భారత, భాగవత, రామాయణాదులకు తరువాత ప్రజాహృదయాకర్షకములైనవి ప్రబంధాలు, శతకాలున్ను. అట్టి కృతులు చదవాలని ఆశగొన్న సంపన్నులు లేఖకులకింతయని ధాన్యభృతి యిచ్చి మాతృకలకు పుత్రికలు వ్రాయించుకొని చదువుకొనేవారు. చదవాలని ఆసక్తి ఉన్నవారికే గ్రంథం దొరికేది; అదయినా చాలా కష్టం మీదే. ఈ విధంగా పూర్వకాలంలో తాటాకుల మీద గంటంతో ముద్దులు మూటగట్టేటట్టు ముచ్చటగా వ్రాయగల ముసద్దీ వ్రాయసకాండ్రకు విలేఖకత్వం ఒక వృత్తిగా ఏర్పడింది. మన దేశంలో ముద్రణ యంత్రం వచ్చిన తరువాత  ఈ కష్టం  తీరిపోయింది. అప్పటినుంచి ఒక్కొక్క గ్రంథానికి కావలసినన్ని ప్రతులు తయారయి సులభమైన మూల్యానికి దొరుకుతూ వచ్చాయి. మద్రాసులో 1772వ సంవత్సరంలో ముద్రాయంత్రం ప్తతిష్ఠితమైనా 1800ల ప్రాంతానగాని తెలుగులో పుస్తకం అచ్చవలేదు. అచ్చయినవైనా క్రైస్తవమత గ్రంథాలే. మొట్టమొదట ముద్రణ యంత్రాన్ని మనదేశానికి తీసుకువచ్చినవారు మిషనరీలే; అది క్రైస్తవ మత ప్రచారం కోసమే. తరువాత మనదేశంలో ఉన్నతోద్యోగాలు చేయవలసి వచ్చిన సివిలియన్లు తెలుగు నేర్చుకోవలసిన అవసరం కలగడం వల్ల ఆంగ్లేయులు వ్రాసిన తెలుగు వ్యాకరణాలు అచ్చవుతూ వచ్చాయి.

మరో మూడు నాల్గు దశాబ్దులకుగాని ఆంధ్రులు అచ్చు ఉపయోగం తెలుసుకోలేకపోయారు. అప్పుడయినా దాన్ని మాస, వార, పక్ష పత్రికల కెక్కువగా ఉపయోగించుకొన్నారు కాని తమ గ్రంథాల ముద్రణకు కాదు. ముందుగా అచ్చయినవి భారత, భాగవతాలే. అందువల్ల 1850 నాటికి అచ్చయిన తెలుగు కృతులు మృగ్యంగానే ఉంటూ వచ్చాయి.
ఇక తాళపత్ర గ్రంథాలు సంపాదించడమంటే బహు వ్యయప్రయాసలు. ఇప్పటివలె అప్పుడు పుస్తక భాండాగారాలు ఉండేవి కావు. తంజావూరు నాయకరాజులు స్వయంగా కవులూ, కవిజనాశ్రయాలూ అయినందువల్ల ఆంధ్రభాషాభిమానులైన వారు  స్వోపయోగం నిమిత్తం కొన్ని కొన్ని ప్రాచీనాంధ్ర కావ్యాలు, ఇతర గ్రంథాలు సేకరించీ, ప్రతులు వ్రాయించీ ఉంచారు. వారి అనంతరం తంజాపుర రాజ్యం పరిపాలించిన మహారాష్ట్ర మహీపతులు కూడ తమ రాజ్యంలో తెలుగు రాజభాష అయినందువల్లనూ, సంగీతానికనువైన
భాష అవడంవల్లనూ సంగీత, సాహిత్యాభిమానులైనవారు తెలుగునేర్చుకొని, తెలుగులో గ్రంథాదులు రచించి ప్రాచీనాంధ్ర తాళపత్ర గ్రంథాలను ఇమ్మడిగా, ముమ్మడిగా సంపాదించి, మాతృకలకు పుత్రికలు వ్రాయించి తమ సరస్వతీ మహలు పుస్తక భాండాగారంలో పదిలపరిచి సంచయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధంగానే కల్నల్ కాలి మెకెంజీ తన సొంత సొమ్ము వ్యయపరచి దేశభాషలలో రచించిన తాళపత్ర గ్రంథాలనెన్నిటినో సేకరించాడు. అతని మరణానంతరం ఆయన భార్య వద్ద ఈ గ్రంథాలనన్నిటినీ కొని కుంపిణీ ప్రభుత్వం వారు మద్రాసు సెంటుజార్చి కోటలో జాగ్రత్త చేశారు. తరువాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే కుంపిణీ సివిలు ఉద్యోగి తెలుగుభాష నేర్చుకొని దాని మాధుర్యాది గుణాలకు ఉల్లసిల్లి సొంతధనం వెచ్చించి తెలుగులో ఉన్న కావ్యాలను కొన్నిటిని కొనీ, మరికొన్ని పండితులకు బత్తెకర్చు లిచ్చి పంపి వాటికి పుత్రికలు వ్రాయించి తెప్పించీ చాలా సేకరించాడు.  జీర్ణావస్తలో ఉన్న తాళపత్ర గ్రంథాలకు కొన్నిటికి ప్రతులు వ్రాయించాడు. పండితులను పెట్టి నిర్దుష్టపాఠాలు నిర్ణయించి కొన్ని కావ్యాలు పరిష్కరించాడు. ఇవన్నీ మద్రాసు తాళపత్ర లిఖిత గ్రంథ భాండాగారంలోనే ఉన్నాయి.

———-

అంకితం మల్లంపల్లి సోమశేఖర శర్మకు
విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్రప్రశస్తి)

 

నీ వనుకోనులేదు మఱి నే నిది చెప్పనులేదు కాని అ
న్నా! వినవయ్య నేఁటి కిది నా చిఱుపొత్తము నీకు నంకితం
బై వెలయింపఁజేతు హృదయంబులు నీకును నాకు మాతృ దే
శావిల దుఃఖదారితములై శ్రుతి గల్పె విషాదగీతికన్

 

‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు రాని యీ పాడుకాలాన బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర మూషరక్షేత్ర వర్షోదక మయి
చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు స్థానమైనట్టి లోకాన నుండి
నీ యచ్ఛతర కమనీయశీల జ్యోత్స్న అడవి గాసిన వెన్నెలగుచు జెఁలగిఁ

 

అంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగ
తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగు
నాఁటి పూర్వచరిత్ర కాణాచి యెల్ల
త్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు

 

కొదమతుమ్మెద ఱెక్కల గుస్తరించు
మీనముల నీ ప్రసన్న గంభీర ముఖము
కన్నులంటగ గట్టినట్లున్న నిన్ను
మఱచి పోలేను జన్మజన్మములకైన

 

ఇది నీకై యిడినట్టి నా యుపది, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదనై యాంధ్రవిరోధికంఠ దళన ప్రారంభసంరంభ మే
చు దినాలన్ మఱి తోడిసైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశం బని యైన జెప్పుటకు లేవే నాఁటి స్వాతంత్ర్యముల్

 

Posted in వ్యాసం | Tagged , | 3 Comments

కథా కథనం – 5

కథ  – వస్తువు ఎంపిక

కథకి విషయం ఎరిగిన జీవితం నుండే, అర్థమైన జీవితపరిధి నుండే తీసుకోవాలంటే ముందుగా కనిపించేవి –

పెళ్ళిచూపులు. సంతలో పశువులా ఆడపిల్లని పరిశీలించడం. కట్నకానుకల విషయంలో మగపెళ్ళివారి ఏనుగు దాహాలు. సకాలానికి కట్నం సొమ్ము సమకూడక పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవడాలు. కాపరానికొచ్చిన కోడళ్ళని ఇంకాతే, అనే వేధింపులు. పిల్ల తండ్రి అత్తవారిని కాళ్ళూ, గడ్డం పట్టి బతిమాలడాలు. కథ చివర ఒకటో, రెండో ఆత్మహత్యలు. ఈ మధ్య ఇందులో కొత్తదనం – ఇంటిల్లిపాదీ కలిసి నోరులేని కోడల్ని కిరసనాయిలు పోసి కాల్చీడం.

లేదా –

నిరుద్యోగుల నిస్సహాయత. ఇంటర్వ్యూల కోసం గాజూ, పూసా తాకట్లు. ఆ ఉద్యోగాల్ని ఆదికి ముందే ఎవరో కొనేసుకోడం. ఉత్తరాయణం, దక్షిణాయణం మహిమలు. చేతికొచ్చిన ఉద్యోగాలు ఏ ఫోన్‌కాల్ దెబ్బకో ఎగిరిపోడం.

అదీ కాకపోతే –

రోడ్‌సైడ్ రోమియోల అల్లర్లు. మెత్తని చెప్పుతోనో, నిజం చెప్పుతోనో జవాబులు.  చీకట్లో వేధించింది ఎవరినో కాదు సొంత చెల్లెమ్మనే.

ఇంకోరకంగా –

బిచ్చమెత్తుకునే దైన్యం. ఎంగిలి విస్తళ్ళకెగబడే  ఆకలి కడుపులు. గత్యంతరం లేక కడుపులు నింపేందుకు పడుపు వృత్తి. రెక్కలమ్ముకున్న నేరానికి పక్కలోకి లాగే కామందులు. పసందైన పిల్ల పరువాల కోసం పరవళ్ళు  తొక్కే ఇంటి యజమానులు. పారేసుకున్న వస్తువులకోసం పనిపిల్ల మీద నేరాలు మోపే యజమానురాళ్ళు.

ఇంక ప్రేమల  విషయానికొస్తే –

ప్రేమకోసం పవిత్రమైన ప్రేమలు. ఆస్తికోసం, అంతస్థుల కోసం అపవిత్రమైన ప్రేమలు. ఆడపిల్ల అనుభవం కోసం సాగే టక్కరి ప్రేమలు. కాల్జారిన ఆడపిల్ల కెదురయ్యే కష్టాలు. కడుపొచ్చిన అమ్మాయిలు కార్చే కన్నీళ్ళు. ప్రేయసి పెళ్ళామయ్యాక ప్రేమలో వచ్చే మార్పులు.

ఇవీ, ఇలాంటివే ముందుగా ప్రతీ కొత్త రచయితకీ కనిపిస్తాయి.

ఇవన్నీ రాయదగ్గ విషయాలే.   అందుకు సందేహం ఏం లేదు. అయితే వీటి ఒక్కొక్కదాని మీదా కొన్ని వందల కథలు ఆ మాటకొస్తే కొన్ని వేల కథలు ఇంతకుముందే ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసేశారు. ఇప్పుడు మళ్ళా మనం రాస్తే పత్రికలవాళ్ళు వేసుకోరు. అధవా – కథలు కరువయ్యో, కథ చెప్పే తీరు బాగుందనో, ఏ పత్రికైనా వేస్తే కథ వేసిన వాణ్ణీ రాసినవాణ్ణీ కూడా తిట్టుకుంటారు – చదువుకునే పాఠకులు.

చాలామంది రచయితలు తమ కథలు తప్పిస్తే యితరులు రాసినవి చదవరు. అందువల్ల – ఒకరు రాసిందాన్ని మళ్ళా మనమూ రాయడం, ఆ రాయడంలోనైనా కొత్తదనం కరువవడం, తరచూ జరుగుతుంది. విషయం పాతదే అయినా చెప్పే పద్ధతీ కథ నడిపిన తీరూ కొత్తగా ఉంటే – కొంతలో కొంత చదువుతారు. ఇతరులు రాసింది చదివుంటే దానికి భిన్నంగా రాసే ప్రయత్నం చేయొచ్చు. ఆ పని చేయకపోడం వల్ల పాతకథే పాత పద్ధతిలోనే చెప్పి కథ తిరిగొస్తే ఆశ్చర్యపోడం, కథ కాపీ కథలా ఉందంటే బాధపడడం జరుగుతుంది.

పసిబిడ్డలవంటి వాళ్ళు నిన్న చెప్పిన కథ ఇవాళ చెపితే వినరు. పాత పాటలే అయినా ఎన్నోసార్లు ఎందరినోటో విన్నవే అయినా, ఓ కొత్త గొంతు కొత్త కొత్తగా ఆలపిస్తే వినగలుగుతాం.

అందుకని కథలు రాయదలుచుకున్న వాళ్ళు, కనీసం తొలిదశలోనైనా, తక్కినవాళ్ళు రాసే కథలు విధిగా చదవాలి. ఇతరులు రాయని కథలు వారెవరూ రాయని పద్ధతిలో రాయాలి.

జీవితాన్ని గమనించడంలోనూ, కథా వస్తువుని ఎన్నుకోవడంలోనూ, విషయాలను పరిశీలిలంచి విశేషాన్ని గ్రహించడంలోనూ, లోక పరిపాటిగా కొట్టుకుపోకుండా మీ పద్ధతొకటి మీరు ఏర్పరచుకోవాలి.

సమస్యలంటే మన సమస్యలు మాత్రమే సమస్యలు కావు. ఉద్యోగావకాశాల కోసం చదువుకున్నవాళ్ళు ఏడాదికో, ఆర్నెల్లకో ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌కి వెళ్తారు. సంవత్సరంలో రెండుసార్లో, మూడుసార్లో ఇంటర్వ్యూల కెళ్తారు. ప్రతి రోజూ ఏరోజు కారోజే మేస్త్రీల చూట్టూ, కాంట్రాక్టర్ల చుట్టూ పనికోసం తిరుగుతూ, ‘రేపురా, మాపు కనబడు’ అని వాళ్ళచేత తిప్పించుకొనే రోజువారీ కూలీలను, లేబర్‌కాలనీలలోనూ పనులు జరిగే కొన్ని కొన్ని కూడళ్ళలోనూ ఏ రోజయినా కొన్నివేల మందిని మనం చూడొచ్చు. షాపుల్లోనూ, హోటళ్ళలోనూ చిన్న చిన్న కార్ఖానాలలోనూ రకరకాల పనులుచేసే వాళ్ళున్నారు. వాళ్ళూ జీతాల వాళ్ళే. వాళ్ళ సమస్యలూ సమస్యలే!

హింసలూ, కష్టాలు అన్నవి మనమూ మనవాళ్ళూ అనుభవించేవే కావు. వేధింపులూ, అవమానాలూ, అపహాస్యాలూ చదువుకునే ఆడపిల్లలకి మాత్రమే పరిమితాలు కావు. సినిమాలాళ్ళ దగ్గర, శ్రీరామనవమి వంటి సంబరాల్లో దేవాలయాల దగ్గర, దివ్యక్షేత్రాలలో, తీర్థాలు జరిగేచోట, స్నానఘట్టాలలో – అన్ని తరగతుల వాళ్ళూ అన్ని వయసుల వాళ్ళూ అల్లర్లకూ, ఆగడాలకూ గురి అవుతారు. పసిగుడ్డును వదిలి పనిలోకి వెళ్ళే సమస్య ఉద్యోగస్థులైన దంపతులకే పరిమితం కాదు. రోడ్డుపనీ, మట్టిపనీ, రాతిపనీ చేసే వేలాది కూలీ దంపతులకీ, పాచిపనీ, వంటపనీ చేసి ఇల్లు గడుపుకొనే ఎందరో పేద ఇల్లాళ్ళకీ కూడా అది హృదయశల్యమైన సమస్యే.ఇంటిపనీ, బయటి పనితో వాళ్ళూ నలిగిపోతారు.

ఆకలీ, దాని బాధకు తట్టుకోలేక ఒళ్ళమ్ముకోడం వయసులో ఉండే ఆడవాళ్ళకే పరిమితం కావు. అమ్ముకోడానికి అందాలూ, వయసులూ లేని వాళ్ళూ, ఉన్నా అందుకు మనసంగీకరించక హింసలు భరించేవారు ఇతరత్రా చాలామంది ఉన్నారు. కడుపాకలికే కాక తదితరమైన ఆకళ్ళకు – అమ్ముకోడం తప్ప మరోమార్గం లేని స్థితి ఆడవాళ్ళలోనూ, యిటీవల మగవాళ్ళలో కూడా వుంది.

చెయ్యని నేరాలకి శిక్షలనుభవించే స్థితి పాచిపనులు చేసుకునేవారికీ, ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసుకునేవారికే పరిమితం కాదు. లారీ ట్రాన్స్‌పోర్టు వంటి రవాణా సంస్థలూ,గోడౌన్లూ, వేర్‌హౌసులూ, సూపర్ బజార్లూలా ఎక్కడెక్కడైతే సొత్తుంటుందో, ఎక్కడెక్కడ పైవాడు కిందవాడూ కలిసి ఆ సొత్తుతో వ్యవహరిస్తుంటారో, అక్కడక్కడల్లా యీ స్థితి ఉంటుంది.

మనుష్యుల ఆనందాలకీ, ఆవేదనైకీ, కష్టసుఖాలకీ, కన్నీళ్లకీ, దిగుళ్ళకూ, గుండెలు పగిలిపోడాలకీ – వయసులో ఆడామగా ప్రేమలూ, వాటి గుడ్డి తనాలూ, వాటి పొరలూ, అవి విడిపోడాలూ, వాటి మైకాలూ, అవి తొలిగిపోడాలూ, వాటి నమ్మకాలూ, వాటి నమ్మకద్రోహాలు ఇవే కావు – బాల్య స్నేహాలూ, స్నేహితుల మధ్య పొరపొచ్చాలూ, భాయీభాయీగా తిరిఏవాళ్ళు చీకట్లో కత్తులు దూసుకోడాలూ, రక్తసంబంధం, పేగు సంబంధం వంటివి బలీయమైన యింకేదో సంబంధానికి వీగిపోడాలూ – ఇలాంటివి కూడా కారణాలు కాగలుగుతాయి.

వస్తువుని ఎన్నుకునేటప్పుడు – కళ్లెదుట కనిపించిందనో, ఇతరులు రాసేరు కాబట్టి మనం రాయవచ్చనో, పాత వస్తువుల్నే పట్టుకోకుండా తమ చూపును కొత్తవాటి కోసం నలుదిశలా ప్రసరిస్తే ఇలాంటివి చాలా దొరుకుతాయి.

బద్ధకం వల్లగాని లేదా తెలియమివల్ల గాని కొత్త రచయితలు తరచూ చేసే మరో తప్పు ఏమంటే – వార్తల్లో వచ్చే సంఘటనమీదా, తాజా తాజా సంఘటనలమీదా, తద్దినాల సన్నివేశాల మీదా కథలు రాయబోతారు.

ఆగస్టు పదిహేనొస్తే జండా వందనం మీదా, సెప్టెంబరు ఐదొస్తే గురు పూజ మీదా, అక్టోబర్లో దసరా మామూళ్ళ మీదా, నవంబరులో దీపావళికి దశమ గ్రహాల మీదా, సంక్రాంతికి అత్తామామగార్ల కష్టాలమీద – ఇలా సాగుతాయి కథలు. ఏళ్ళ తరబడి హాస్యం, వ్యంగ్యం రాసినవారే ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటే తప్ప యిలాంటి తద్దినాల మీద కొత్తగా నాలుగు విసుర్లు విసరటం కష్టమవుతుంది. అంచేత కొత్తవాళ్ళు తద్దినాలతో కథా రచన ఆరంభించడం మంచిపని కాదు.

ఊళ్ళో ఏ సమ్మో, హర్తాళో, పెద్ద నిరసన ప్రదర్శనో జరిగితే దాన్ని ఎద్దేవా చేస్తూ రాసేయడానికి తలపడతారు కొత్తవాళ్ళు. వేలూ, లక్షల మంది ప్రయోజనాలతో ముడిపడి సాగే సంఘటనలవి. మీకు తాగడానికి కప్పు కాఫీకి ఇబ్బంది అయ్యిందనో, పీల్చడానికి ఒక సిగరెట్ దొరకలేదనో, చూడ్డానికి ఓ సినిమా లేకపోయిందనో దుగ్ధకొద్దీ అందుమీదా దానికి వ్యతిరేకంగా కథ రాయబోతారు. ఆ ఉద్యమ స్వభావమో, దానిని నడిపే శక్తుల స్వరూపమో తెలిసి రాయడం వేరు. అలాంటివి ఉంటాయనే సంగతి కూడా తెలియని వారు దాని మీద రాయబోవడం తగదు కదా!?

అలాగే వార్తల్లో వచ్చినవీ, రానివీ, పదుగురి దృష్టిని ఆకర్షించే (ఆకర్షించగల) సంఘటనమీద – విన్నదో, కన్నదో, చదివిందో ఆధారంగా కథ రాయబోతారు. అది కూడా ఏం మంచి పద్ధతి? మనబోటి వాళ్ళు తెలుగు రచయితలే కొన్ని వేల మందుంటారు. మనలాగే వాళ్ళలో ఏ కొందరు దాన్ని కథ చేయబోయినా, ఎవరు ఎవర్ని కాపీ కొట్టారో తెలియని కాపీ కథగా అనిపిస్తుంది – సంపాదకులకీ, పాఠకులకీ. కాబట్టి ఇది కూడా రచయితలు తెలుసుకొని ఉండాలి.

అంటే –

* మనకు అందుబాటులో విడిగా దొరికిన విషయం మీద చప్పున కథ రాయబోవడం అంత మంచి పనికాదు. అలా రాస్తే పాడిందే పాడినట్టో, కాపీ కొట్టి రాసినట్టో సంపాదకులూ, పాఠకులూ పొరపడే అవకాశం ఉంది. అలా జరిగితే కథ వేసుకోరు. వేసుకున్నా చదవరు.

* మన చూపుని కాస్త నాలుగు పక్కలూ మళ్ళించే అలవాటు చేసుకుంటే కొత్తవైనా కాకున్నా కొత్తవాటిలా కనిపించే వస్తువులు కోకొల్లలుగా దొరుకుతాయి.

* సీజనల్ కథలు రాసి మెప్పించడం కష్టం. ప్రతి ఏడూ ఆ విషయం మీద వచ్చిన కథలు చాలా చదివుంటారు పాఠకులు.

* తీసుకున్న విషయం కొత్తదవునా కాదా? దాన్ని ఎలా రాస్తే కొత్తగా ఉంటుంది? – ఈ విషయాలు తెలుసుకోడానికైనా ఇతరులు దేనిమీద రాసేరో, ఎలా  రాసేరో తెలియాలి తెలుసుకోవాలి… అంటే విధిగా చదవాలి.

* ఒకరు రాసిందే రాసినా ఒకరు రాసినట్టే రాసినా పాఠకులు చదవరు.

Posted in కథ | Tagged , , | Comments Off on కథా కథనం – 5

సత్యప్రభ – 3

5 ప్రకరణం.

సత్యప్రభ 3 - పొద్దు

కడపటి మాటలు మహామంత్రికి పోయిన ప్రాణానికి జీవం పోసినట్లు అయింది. కాని ఉత్తర విషయాల పట్ల చర్చ ఎట్లు ముగుస్తుందో అని అతడు ఆందోళన చెందాడు.

గజవీరుని జాబు విన్నప్పుడు  సుచంద్రుని  అంతఃకరణలో  తాను  రాజకార్యాలలో  తగినంత శ్రధ్ధ  తీసుకొనక పోవడం నిజమే అని తోచింది.. మహామంత్రి చర్యను  గురించి కూడ అనుమానం కలిగింది. అతడు లంచగొండియే కానప్పుడు , అతనికి అంత గొప్ప సంపద పట్టడానికి  హేతువేమిటని  మహారాజు మనసులో శంక పుట్టింది. శివంకర సంఘం వారు మహామంత్రి  విరోధులే గాని రాజ విరోధులు కారని  అతనికి  స్ఫురించింది. మహామంత్రి  రాష్ట్రీయులు  తండ్రి  కొడుకు లిద్దరున్నూ చేరి  పట్టుబట్టి  శివంకర సంఘాన్ని  విప్లవ సంఘంగా  ప్రకటింప చేసినది  అన్యాయమేనేమో  అని ఆ ప్రభువు తటపటాయించాడు .శాంతిసేన  జాబు  ప్రభువును  మరింత కల్లోల పరచింది. చంద్రప్రభ  మోసమే చేసినట్లయితే  వీరేశ్వరుని పదభ్రష్టుని  చేసి, శాంతిసేనకు సింహాసనాన్ని ఇచ్చి  వేయాలని  అతనికి తత్కాలం ఒక భావం పుట్టింది.

పార్థివుని  ముఖచ్ఛాయలో నుండి  సచివుడు  లోపలి  భావాన్ని పసి గట్టాడు. సుమారు  ఇరవై రెండు సంవత్సరాలు  నిరంకుశంగా రాజకులంలో  విజృంభిస్తున్న  మహామంత్రి  పతాకను  ఆ దినం దింపి వేయ వచ్చునని  అతడు  ఆశించాడు.  రాజుగారి  ముఖం  తనకి అనుకూలంగా  లేదని  మహామంత్రి కనిపెట్టక పోలేదు. మంత్రాలోచనకు  మరి  రెండు రోజులు  వాయిదా  వేయాలను కొన్నాడు. వాయిదా  పడితే  అంతః పురం  లోని  తన  సమ్మోహనాస్త్రం  రాజాంతః కరణాన్ని మార్చి వేయ గలదని  అతని  ఆశ !

సచివుడు  లేఖా  పఠనాన్ని ముగించి, ఆసనంపై  కూర్చొన్నాడు. కొన్ని క్షణాలు  ఆ రంగ స్థలం నిశ్శబ్దంగా ఉండింది. మహారాజే ప్రసంగ ద్వారాన్ని తెరచాడు.

“చిన్న మామయ్యా ! నిశంభు నాగుని  జాబుకు  ప్రత్యుత్తరం  ఏ విధంగా  ఇవ్వాలి ?”

“ఈ విషయాన్ని సంపూర్ణ  మంత్రి సదస్సులో చర్చిస్తే  బాగుంతుందని నా  మతం. మనం  విప్లవ సంఘాన్ని సులభంగా అణచి వేయగలమా లేదా, అన్న విషయంలో  రాష్ట్రియునితోనూ, సేనాపతి తోనూ చర్చింప వలసి ఉంది. నిశంభునికి  పర రాజుల  మద్దత్తు  కలదేమో  అనే సంగతిని  ఆలోచించడానికి  దూతసామంతుని  సహాయం అవసరం. అలాగే పన్నులు  తగ్గించడానికి అవకాశం  కలదా అనే సమస్య  మహాసమాహర్త  తేల్చవలసి ఉంది.” అన్నాడు మహామంత్రి.

“ విప్లవ సంఘాన్ని  ఆణచడానికి  మనలో  సామర్థ్యం  ఉన్నప్పుడు నిశంభునితో  సంధి చేసుకోకూదదనేనా మీ భావం ?” అని ప్రశ్నించాడు మహారాజు.

“మహాప్రభో ! అది  రాజనీతి ! సాధ్య శతృవుతో  సంధి  అకార  లేదని నీతివేత్తలు అంటారు. నిశంభుడు  ధర్మాన్ని అనుసరించి  చిత్రకూట రాజ్యాన్ని తనకి ఈయమని కోరలేదు.వాడు కోరేది న్యాయం కాదు. తన  క్రౌర్యంచే  రాష్ట్రాన్ని  గాసిపెట్టి, భయాన్ని  పుట్టించి ఇప్పుడు వాడు తన  క్రూర చర్యలని ఆపడానికి  ప్రతిఫలంగా రెండు ప్రాంతాల్ని కోరుతున్నాడు ! వాని క్రూర చర్యలని  ఆపడానికి మనకి  శక్తి  ఉన్నప్పుడు  వానికి మనం ఎందుకు లొంగాలి ?”

“వాని క్రూర చర్యలని ఆపే  శక్తి మనకి ఉందా, లేదా  మీ  అభిప్రాయం ఏమిటి ?”

“ఉందనే నా అభిప్రాయం ! అయినా రాష్ట్రీయ, సేనాపతులని కూడా  ఈ విషయంలో  సంప్రదించడం  బాగుంటుందని నా మతం.”

అన్ని విషయాలపై చర్చ వాయిదా వేయించేందుకే  మహామంత్రి  ఇలాంటీ ధోరణీ అవలంబించినాడు. ప్రథమ విషయం తక్షణమే ఆలోచించడంలో అతని కెలాంటి ప్రతిబంధకం లేదు. కాని మొదటి దానికి వాయిదా పడితేనే గాని తక్కిన రెండు విషయాలు వాయిదా వేయించడానికి హేతువు దొరకదు. ఊ గుట్టు మహారాజు కనిపెట్టక పోయినా సచివుడు తెలుసుకొన్నాడు.ఆ సమయం తప్పితే రాజుగారి వేడిని చతురు రాలైన రాణి చల్లార్చి వేస్తుందని  సచివుడు తలంచాడు. ఆ పుణ్య కాలాన్ని వృథాగా పోనివ్వ కూడదని  కూడా తలంచాడు. మాట్లాడడానికి తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.

ఇంతలో రాజు సచివుని ముఖాన్ని చూసాడు. ఆ చూపు ‘నీవు మాట్లాడు అన్నట్లు  సూటిగా కనిపించింది. పిమ్మట  సచివుడు , మహమంత్రి  సూచనని  నిర్మొహమాటంగా ఈ విధంగా ఖండించాడు.’

“మహాప్రభో ! నా శాఖలో ఇతరుల జోక్యాన్ని నేను సహింప జాలను.మన రక్షిదళం శక్తి  లేనిదని చెప్పడానికి రాష్ట్రియినికి అధికారం లేదు. చోరులను పట్టడాం అతని పని గాని, చేతకాదని  చెప్పడం అతని పని కాదు.అతనికి చేత కానప్పుడు మర్యాదగా పనిని విడిచి  పెట్టాలి. రాష్ట్రియుడింకా పనిలో ఉన్నందున తన రక్షక దళం విప్లవ సంఘాన్ని అణచి వేయగలదని నమ్మకమున్నట్లే అని మనం  ఎంచ వచ్చును. సేనాపతి కూడా రాజాఙ్ఞని అనుసరించి పోరవలసిన  వాడే గాని, నాకు చేత కాదని యుధ్ధాన్ని తప్పించుకొను అధికారం అతనికిలేదు. దూత సామంతునికి , పర రాజుల మద్దత్తు నిశణ్భునికి ఉందని తెలిసి ఉంటే అతను ఇదివరలోనే  శ్రీవారి ఎదుట మనవి చేసి ఉండేవాడు. ఇప్పుడు క్రొత్తగా అతని అడగ వలసిన  ప్రమేయం లేదు. సంధిమ్ అవసావసరాలని చర్చించే అధికారం ఇద్దరికే  ఉంది. పర రాజులతో సంధి  సూత్రాలని ఆలచించాల్సి ఉన్నప్పుడు దూత సామంతుడును , దేశీయ విప్లవకారులతో సంధి సూత్రాలని ఆలోచించ వలసి ఉన్నప్పుడు  సచివుడున్నూ  రాజకులంలో  అధికారులై  ఉన్నారు. దీనిలో మహాసమాహర్త గాని మరి ఏ ఇతర శాఖా మంత్రి గాని,జోక్యం చేసుకోవడం రాజకుల సాంప్రదాయానికి విరుధ్ధం. ఇప్పటి  ఆలోచనలో  శాఖాంతర  సంబధ్ధ విషయాలు  అంగభూతంగా  చర్చకు వచ్చేటప్పుడు  సర్వ శాఖాధికారి  మహామంత్రి ఉండనే  ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఈ రాజకులం లోనే  చర్చింపబడ వలెను.పూర్ణమంత్రి సదస్సు కూర్చనవసరం లేదు.

“ఇంత  గొప్ప సమస్యని మనం ఇద్దరం  మాత్రమే  భాద్యత వహించి చర్చించుట  అంత మంచిది కాదు.” అని

చెప్పాడు మహామంత్రి..

రాజుగారికి  ఇంకా  తన మహమంత్రి  తత్త్వం  బోధపడ  లేదు. వాస్తవంగా క్లిష్ట సమస్య కాబట్టి  మహామంత్రి పూర్ణమంత్రి  సదస్సును సూచిస్తున్నాడని తలంచాడు.  సచివుని వాదం కూడ  అతనికి యుక్తి యుక్తంగా తోచింది. కాబట్టి ఇద్దరినీ గౌరవిస్తూ  నరపతి ఇలా అన్నాడు !

“యథావిధిగా  ఈ చర్చ జరిగి పోనీండి. కొసకి మన తీర్మానం అమల్లో  పెట్టే సమయంలో  నా  కేమైనా సంశయం  కలిగినప్పుడు, నా అసాధారణ  అధికారాన్ని  ఉపయోగించి  పునరాలోచనకి సంపూర్ణ  మంత్రి సదస్సుని  సమావేశం చేస్తాను.”

ఈ సూచన మహామంత్రికి ప్రియంగా ఉంటుందని  మహారాజు  తలంచాడు. మహామంత్రి  రాజుగారి  సూచనకు బదులేమిన్నీ  చెప్పలేక  పోయాడు. తాను  పరాజితుని వలె  మానసికంగా క్రుంగి  పోయాడు.సచివుడు సంతోషించాడు. ఆలోచనా  కండ ఆరంభ మయింది. శాఖామంత్రి  ముందుగా మాట్లాడాడు.

“మహాప్రభో ! అట్లే కానీయండి. నిశంభు నాగుడు  పంపిన  మూడు షరతులలో  ఒకటి కూడా మనకు ఆచరణ సాధ్యం కాదు. చిత్రకూట రాష్ట్రాన్ని  మీ నాన్నగారు బాబయ్య గారికి  ఇచ్చారు. వారి వారసుడు  ఇప్పుడు దానిని అనుభవిస్తున్నాడు. అతని వారసత్వం సరైనదేనా , వంచనా లబ్ఢమా  అనే విషయం ఈ సమస్యలో  ముఖ్యమయినది  కానేరదు. ఎట్లయినా  మేఘస్వామి భట్టారకుల వారి  వారసులు  అనుభవించ  వలసినదే , ఆ రాష్ట్రం ! దానిని  ఇంకొకరికి ఇచ్చివేయటం దత్తాపహార మవుతుంది. పార్వతీయ  ప్రాంతం  శ్రీవారి జయచిహ్నం. అనేకాంధ్ర వీరుల రక్తానికి ప్రతిఫలంగా  వచ్చింది ఆ ప్రాంతం. నిశంభుని  మాటపై పన్నులు  తగ్గించడం  మనకి  కీర్తికరం  కాదు. ఆ క్రూరుడైన  దొంగ  మహారాజ  సుచంద్రుల  వారి ప్రభుత్వంచే  బాధపడే  ప్రజలను  ఉధ్ధరించానని తాను డాబులు  కొట్టుకొనడాని కిన్నీ,  మన ప్రభుత్వ కోశాన్ని దుర్బలం చేయడాని కిన్నీ  వేసిన ఎత్తుగడ  ఇది !”

మహామంత్రికి కూడా నిశంభునితో  సంధి ఇష్టం లేదు. తాను రూపచంద్రుని సమర్థించిన , అంతటితో  ఆ  విషయం  ముగిసి, ఇతర  విషయాల  చర్చకి  తావిస్తుంది ! అది అతనికి ఇష్టం లేదు. ప్రథమ విషయ  విచారణలో కాలాన్ని పొడిగించి  చాల రాత్రి  అయిందను  మిషచే అనంతర  విచారణకు వాయిదా  వేయించాలని  అతడు మరొక  ఉపాయాన్ని  ఆలోచించి  సచివుని సూచనకు అడ్డుపెట్టి  ఇలా అన్నాడు.!

“నిశంభుడు పంపిన షరతులు మనకు అంగీకారం కాకపోవచ్చును.అయినప్పటి కిన్నీ,వారి సంధి సూచనలను మనం పూర్తిగా  తిరస్కరించడం  మంచిది కాదు. వేరు సంధి  షరతుల్ని  మనము వానికి  పంపాలి. అవి ఏ విధంగా ఉండాలో  మనం  ఇప్పుడు  ఆలోచించాలి.”

“సుమారు కోటి కార్షాపణములు (రూపాయలు) తక్కువ  లేకుండా  సర్కారు వారి సొత్తుని నిశంభుడు అపహరించాడు. వాడు అపహరించిన  ప్రజల సొమ్ము దానికి ద్విగుణంగా ఉంటుంది. నూరు మందికి తక్కువ లేకుండా మన రక్షక భటులు  వాని అనుచరుల చేత చంపబడ్డారు. సామాన్య ప్రజలలో కూడ ఎన్నో హత్యలు  వానిచే  కావింపబడ్డాయి. ఈ తప్పులకి వాడు, వాని అనుచరులు  దారుణమైన రాజదండనం  పొందతగి  ఉన్నారు. తాను ఇక మీద తన దుశ్చర్యలకి  స్వస్తి చెప్తానని  వాడు అంగీకరించి నప్పుడు అతని సంఘాన్ని క్షమించడమే మనం వానికి సూచించే సంధి షరతుగా ఉండాలి.”

“ఈ సూచన అయ్యా, నీతో మాకు సంధి పొసగదు అని చెప్పడానికి పర్యాయ  పదం !” అని నవ్వాడు మహామంత్రి.

“అయితే  మీ ఉద్దేశమేమి ?” అని ప్రశ్నించాడు మహారాజు.

“మన రాజ్యంలో నాగుల సంఖ్య మిక్కుటంగా ఉంది. వారికి ఇంకా కాకుల, మంథనాధ వంశాలపై  భక్తి అంతరించ లేదు.”

“నేను అడిగితే మీరు సూచించే సంధి షరతు,” అని చటుక్కున మహామంత్రి కాల విలంబన సూత్రానికి అడ్డుకర్ర వేసాడు మహారాజు.

దొరికి పోయిన దొంగవలె  మహామంత్రి  ఇలా అన్నాడు.

“ఏదైనా ఒక సంస్థానాన్ని సృష్టించి నిశంభునికిచ్చి, వానిని సామంతునిగా స్థాపించిన మనకంత నష్టం ఉండదను కొంటాను.”

“ఇద్దరొక సంస్థానంతో తృప్తిని ఎట్లు పొందగలరు ?” ఎదురు ప్రశ్న వేసాడు రూపచంద్రుడు.

“వారిద్దరూ భార్యాభర్తలై ఉంటారని నా ఊహ !”

“రాష్ట్ర మధ్యంలో వారికి సంస్థానాన్ని ఇవ్వడం చాలా అపాయకరం. అక్కడ నాగుల సంఖ్య అధికంగా ఉంది. అతడు సమయం చూసుకొని పునర్విప్లవాన్ని లేవతీయడానికి  అవకాశాలుంటాయి. పార్వతీయ ప్రాంతాన్ని ఒక మహా మండలంగా ఏర్పరిచి వారికి సామంత రాజ్యంగా ఇచ్చిన  బాగుంటుంది. ఇదే నా అభిమతమైన సూచన. పార్వతీయ ప్రాంతంలో నాగుల సంఖ్య చాలా స్వల్పం.” అని చెప్పాడు సచివుడు.

“పార్వతీయ  ప్రాంతంలో భర్తృదారిక  రథినీ కుమారిని  మహామండలేశ్వరిగా  అభిషేకించిన  బాగుండునని  మేము  ఇది వరలో తలంచుతున్నాము. వివాహానంతరం ఆమె ఒక  మహామండలేశ్వరిగా ఉండడం వాంఛనీయం,” అన్నాడు  మహామంత్రి.

“ఆ అడవులకి కుమారిని  పంపడం నాకిష్టం లేదు,” అన్నాడు రాజు.

“సర్కారు వారి  జయచిహ్నమైన  పార్వతీయ  ప్రాంతాన్ని ఇతరులకి  స్వాధీన పరచడం యుక్తం కాదని  ముందు చెప్పిన సచివ  మహాశయుడు  ఇప్పుడు దానిని విడిచి  పెట్ట  వచ్చునని చెప్పడం అబ్బురంగ ఉంది,” అన్నాడు మహామంత్రి.

“స్వతంత్రంగా  ఇవ్వకూడదనే నే నన్నాను. సామంత రాజ్యంగా ఇచ్చినప్పుడు మన అధికారం ఉండనే ఉంటుంది.”

“సచివుడు చెప్పిన  సూచన బాగానే ఉంది. ఇరావతీ నిశంభు లిద్దరూ సంధికి అంగికరించే పక్షంలో  వారికి సామంత  రాజ్యంగా  పార్వతీయ మహా మండలాన్ని  ఇచ్చివేయ వచ్చును. దంపతులై కలిసి  రాజ్యం చేసుకోవడమో , లేక  రెండు మండలాలుగా  విభజించు కొనడమో  వారి ఇష్టం ! ” అని మహమంత్రిని చూసి, “ ఈ సంగతిని  రేపు ప్రాతఃకాలమందు యోగీశ్వరి  ధవళాక్షికి  ప్రభుత్వ పరంగా  మీరు తెలియ  పరచండి.దీనికి పునరాలోచన  అవసరం లేదు,” అని ప్రథమ  విషయ ఆలోచన  ఘట్టానికి  పరిసమాప్తి  చేసాడు మహారాజు.

“ఆఙ్ఞ ప్రకారం అలాగే  చేస్తాను” అని  హీన స్వరంతో  చెప్పాడు  మహామంత్రి.

“కౄరుడైన  నిశంభునితో  సంధి  నాకు ఇష్టం లేనప్పటికీ  జటాముని  సంధిని ఆశించుట వల్లనూ, చిన్న  మామయ్య కొసకి  సంధికి  సలహా  ఇచ్చినందు వల్లనూ  నే నొక  విధమైన సంధి మార్గానికి వచ్చాను.”

కడపటి మాటలు మహామంత్రికి  పోయిన  ప్రాణానికి జీవం పోసినట్లు  అయింది. కాని ఉత్తర  విషయాల  పట్ల చర్చ  ఎట్లు  ముగుస్తుందో  అని అతడు ఆందోళన చెందాడు.

====================

6 ప్రకరణం.

మంతనపు ద్వితీయ ఘట్టం ప్రారంభ మయింది. కొన్ని క్షణాల వరకు  రాజకులం  నిశ్శబ్దాన్ని వహించింది. అనంతరం  మహారాజు  నిశాత  దృష్టితో  మహామంత్రిని  చూసి ఇలా  అన్నాడు.

“చిన్న మామయ్యా ! శివంకర  సంఘ నాయకుని  జాబుని  గమనించారా ?”

“గమనించాను, నన్ను  దూషించడమే  ఆ జాబు  ముఖ్యోద్దేశమని తెలుస్తోంది.”

“దానికి  మనం ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో విచారించండి. శివంకర  సంఘం  ముఖ్యోద్దేశాలేవో కనుక్కోవడం  చాల అవసరం. నేను వారి ప్రతినిథితో మాట్లాడవచ్చునా, కూడదా ? మీ అభిప్రాయం చెప్పండి.”

రెండు మూడు క్షణాలు ఆలోచించి మహామంత్రి  ఇలా అన్నాడు.

“ఒక షరతుని  వారంగీకరించిన, శ్రీవారు వారి ప్రతినిధితో మాట్లాడ వచ్చును.”

“ఆ షరతేది ?” అని ప్రశ్నించాడు రాజు.

“గజవీరుడు తన సంఘంతో బయటపడి వచ్చి అందరిని క్షమాబిక్ష కోరినచో వారి ప్రతినిథితో శ్రీవారు  మాట్లాడ వచ్చును.”

సుచంద్రుడు రూపచంద్రుని చూచాడు. వెంటనే  రూపచంద్రుడు ఇలాగు మాట్లాడాడు.

“శివంకర సంఘం నుండి ఎలాంటి వాఙ్ఞూలాన్ని పుచ్చుకోకుండానే రాజకులం ఆ వీర యువకుల సంఘాన్ని విప్లవ సంఘంగా  ప్రకటించింది.”

“అర్థోక్తిలో  సునందుడు అడ్డుపడి , “రాజకుల చర్యల్ని విమర్శించడానికి సచివునకు అధికారం లేదు.” అని ఖండించాడు.

“సచివునకు  వ్యక్తిగతంగా  అధికారం లేదు. ఇప్పుడు సచివుడు  రాజకులంలో కూర్చొన్నాడు. అతడు చేయు విమర్శనము రాజకులంచేసినట్లే ఎంచ వలెను. ఒక రాజకులం చేసిన  నిర్ణయాన్ని మరొక రాజకులం  సందర్బానుసారంగా  విమర్శించ వచ్చునన్న  నిబంధన అభ్యనుఙ్ఞను ఇస్తుంది.”

“ఔను తప్పు లేదు, మీ వాదన సాగనివ్వండి” అన్నాడు మహారాజు.

మహామంత్రి తన స్థితి చెడిపోయిందను కొన్నాడు. తన మాట యిదివరలో రాజకులంలో ఎన్నడూ ఖండింప బడలేదు. ఈ రాత్రి సచివునిచే అది (తన మాట) తెలకపిండి ముక్క కంటె అన్యాయంగా విరిచి వేయబడింది. ‘ఈ భట్టు వానికి కండ్లు నెత్తి మీదికి వచ్చాయి. వీణ్ని నేనే ఉద్యోగంలో వేయించాను. ఛీ! రాజుల్ని నమ్మకూడదు. అనేక సంవత్సరాలు తమ్మాడించన వారిని కూడ పాములు కరవడం కద్దు. రాజులు కూడ అలాంటివారే !’ అని  లోలోపల ఆ మహామంత్రి  విలపించాడు.

“మహాప్రభో! శివంకర సంఘం వాస్తవంగా సక్రమాందోళన సంఘమే కాని విప్లవ సంఘం కాదేమో! దాని స్వరూపాన్ని తెలుసుకోడానికి భట్టారకుల వారు ఏల ప్రయత్నించ రాదు ! తమ నిజస్థితిని వెల్లడించుకోడానికి వారికొక అవకాశం ఏల ఇవ్వకూడదు ? మన ఆంధ్ర దేశంలో వేడి రక్తం గల వేలకొలది యువకులు శివంకర సంఘంలో సభ్యులుగా ఉన్నారని వినికిడి. అపరాధాన్ని న్యాయస్థానంలో నిర్థారించక ముందే ఒక రాజకుల ప్రకటనని ఆధారం చేసుకొని వారి నందరినీ  నిష్కారణముగా వధించ వలసినదేనా? గజవీరుడు వ్రాసినట్లు  వారు దేశానికి, మన కుండినుల ప్రభుత్వానికి భక్తులనే నా తలంపు. శ్రీరామచంద్రుడు ప్రజలు తన కృత్యాన్ని విమర్శించినంత మాత్రాన వారిని విప్లవ కారులుగా ప్రకటించెనా? ప్రత్యుత వారి విమర్శని పాటించి తన ప్రియకాంతను అడవుల పాలు చేసాడు. ప్రభుత్వ విమర్శనం కాని, రాజచర్యా విమర్శనం కాని  రాజద్రోహం కాదని  నా మతం. రాజుని వధించడానికో, లేక పదభ్రష్టుని చేయడానికో యత్నించడమే రాజద్రోహమవుతుంది.”

సచివుని ఉపన్యాసాన్ని విని మహారాజు మహామంత్రిని చూచి ఇలా  అన్నాడు, “సచివుని వాదం నాకు నచ్చింది. ఏకాదశీ స్థిరవారం నాడు, సాయంకాల కృత్యాలు తీర్చుకొన్న తరువాత, శివంకర సంఘ ప్రతినిధి మాతో, ఈ విమానం షష్ట భూమికలో – సాధారణంగా  విదేశ దూతలతో మాట్లాడు గదిలో – కలిసి మాట్లాడవచ్చునని, రేపు కాణ్వ శుకనాసునికి తెలియ పరచండి.”

“ఆఙ్ఞా ప్రకారం లాగే చేస్తాను.” అని సన్నగిల్లిన స్వరంతో మహామంత్రి చెప్పాడు.

ఆ సన్నని స్వరం  సునందుని మనః కష్టాన్ని ఉచ్చస్వరంతో  చాటినట్లయింది. ఆ గదిలో  ఇరవై రెండు సంవత్సరాలు విజృంభించిన రాజకుల  కేసరి  ఈ రాత్రి  ఘోర పరాజయాన్ని  పొంది, పిల్లివలె  ఆసనంలో  క్రుంగి పోయింది.

అనేక  వర్షాలనుండి, సమయానికి వేచి ఉండిన  సచివుడు, ఈ రాత్రి గొయ్యి తీసి పాతి పెట్టేయాలని నిర్ణయించుకొన్నాడు. ఇప్పటికి అందులో సగం  పని పూర్తి  అయింది.

===============

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 3

గాజు ముక్క

[one_half][dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]అ[/dropcap]నగనగా ఒక ఊళ్ళో ఒక తాగుబోతు. అర్థరాత్రి బాగా తాగి సీసా రోడ్డుప్రక్క విసిరి పారేసాడు. తెల్లారేక ఒక కుర్రవాడు అటుపోతూ, పగిలిన సీసాలో ఒక గాజుముక్కను ఏరుకు ఇంటికివెళ్ళాడు. ఇంట్లో తిడితే బుద్ధిగా ఇంటిప్రక్క చెత్తకుప్పదగ్గర పడేశాడు. అది చూశాడు పక్కింటి మరో కుర్రవాడు. వీడు ఇటు తిరగగానే అలా వచ్చి ఆ గాజుముక్కని తీసుకోబోయాడు. అంతే వీడు మళ్ళీ ఇటు తిరిగాడు. ఇంకేముంది నాదంటే నాది అని కొట్లాట. అది ముదిరి పెద్దవాళ్ళ మధ్యకు పోయింది. ఎంతైనా ఇరుగుపొరుగు వాళ్ళుకదా! చివరికి ఒకామె చెయ్యీ నోరూ పారేసుకుని గాజుముక్క సంపాదించి కొడుకుతో లోపలికిపోయింది. ఇంకో ఆమె ఆవేశంలో, పాలవాడు తీసుకుపోతున్న పాలసీసాని విరగగొట్టి తనకొడుక్కి ఇంకో గాజుముక్క ఇచ్చి లోపలికి పోయింది. ఇద్దరు పిల్లలూ ఎంచక్కా గాజుముక్కలు బ్యాగుల్లో దోపుకుని స్కూలుకిపోయారు.

కొద్దిరోజులలో అది దేశమంతటా వ్యాపించింది. ప్రజలనాడికి అనుగుణంగా అనేకమంది పోటీదార్లు నాణ్యమైన ‘ఆ గాజుముక్క’లు తమవే అని ప్రకటనలు మొదలుపెట్టారు. కొందరు కాస్తముందుకు వెళ్ళి వీటిపై పరిశోధనలను కూడా మొదలెట్టారు. వేరొకప్రక్క ‘ఆ గాజుముక్క’ ఇంట్లో ఉంటే శుభకరమన్న నమ్మకం ఎలాగో వ్యాపించింది.

స్కూలులో ఆరోజు క్లాసు జరుగుతున్నంతసేపూ ఈ గాజుముక్కలు అందరి చేతుల్లోనీ తిరిగాయి. ఆ మర్నాడు క్లాసులో ప్రతివాడిదగ్గరా ఒకొక్క గాజుముక్క. అందులో, మూడేళ్ళు డింకీలు కొట్టిన ఒక పెద్ద చిన్నపిల్లవాడు, తన గాజుముక్కే అన్నిటికన్నా మంచిదని ఒప్పించాడు. అంతే కాదు తనవాళ్ళందరికీ అలాంటి గాజుముక్కే తెచ్చుకోమని ఆజ్ఞ జారీ చేశాడు. తన స్నేహితులు అనడానికి అది గుర్తు అన్న మాట. అదిలేనివారందరూ శత్రువులన్నమాట.

ఒక తండ్రి కొడుకు గోల భరించలేక, ఒక గాజు సీసాల కొట్టువాడిని బ్రతిమాలి అలాంటి గాజుముక్కే తయారు చేయించాడు. విషయాన్ని పసిగట్టిన ఆ కొట్టు వాడు, హుటాహుటిని అటువంటి అచ్చు ఒకటి తయారు చేయించి, కొన్ని గాజుముక్కలు ఆ స్కూలు దగ్గర అమ్మకం మొదలుపెట్టాడు. అలా అలా ‘ఆ గాజుముక్క’ అన్ని స్కూళ్ళకూ విస్తరించింది.

ఒక యువకుడు తన ప్రియురాలికి కానుక ఇద్దామనుకున్నాడు. ఈ ‘ఆ గాజుముక్క’ని చూస్తే అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. పెళ్ళయ్యాక తమకు పుట్టే పాపాయికోసం అని చెప్పి ‘ఆ గాజుముక్క’ కానుకగా ఇచ్చి ప్రియురాలి మోముపై నునుసిగ్గులు చూడాలని అతడి ఊహ. ఆ విధంగా పిల్లలకు పరిమితమైన ‘ఆ గాజుముక్క’ యువకులకు తాకింది.

కొద్దిరోజులలో అది దేశమంతటా వ్యాపించింది. ప్రజలనాడికి అనుగుణంగా అనేకమంది పోటీదార్లు నాణ్యమైన ‘ఆ గాజుముక్క’లు తమవే అని ప్రకటనలు మొదలుపెట్టారు. కొందరు కాస్తముందుకు వెళ్ళి వీటిపై పరిశోధనలను కూడా మొదలెట్టారు. వేరొకప్రక్క ‘ఆ గాజుముక్క’ ఇంట్లో ఉంటే శుభకరమన్న నమ్మకం ఎలాగో వ్యాపించింది. దానిపై వేరొకవిధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈలోగా ఒక చిత్రకారుడు శివుడు ‘ఆ గాజుముక్క’నుండి జారుతున్న విషాన్ని త్రాగుతున్నట్లు చిత్రించాడు. విష్ణువు అందరికీ అమృతాన్ని పంచాడని అయితే కేవలం దేవతలే సత్యాన్ని గ్రహించి ఆ గాజుముక్కతో త్రాగారని అందుకే అది పనిచేసిందని, రాక్షలుసు మామూలుగా త్రాగారని అందుకే పని చెయ్యలేదని ఒక స్వప్రకటిత ‘వేదశ్శాస్త్ర పురాణేతిహాస రహస్య భేది’ అయిన ఉద్దండపండితుడు శెలవిచ్చారు. స్టార్ హొటళ్ళల్లో ‘ఆ గాజుముక్క’ను కూడా చెంచాలతో పాటు పెట్టడం మొదలెట్టారు. అలా దైనందిన జీవితంలో ‘ఆ గాజుముక్క’ భాగమైపోయింది.
[/one_half]ఒక పిల్లవాడు నేను ‘ఆ గాజుముక్క’తో కాదు స్పూన్ తో తింటానని మారాం చేస్తున్నాడు. కోడలు తప్పంతా నాగరికత తెలియని అత్తామామలదేనని విసుక్కుంది. స్పూన్ వాడకూడదని చెప్పింది. ఆ కుర్రవాడు ‘ఆ గాజుముక్క’తో తింటూ ఉంటే కోసుకున్న పెదవిని చూపాడు. తన పిల్లవాడు ఇంత అప్రయోజకుడయ్యాడే అని ఆ మాతృహృదయం తల్లడిల్లి ‘ఆ గాజుముక్క’తో తినడానికి కోచింగ్ కి పంపింది. అలా అది ఒక విద్యావిషయకంగా మారింది. ఈలోగా చిన్నపిల్లలకు కోసుకోని ప్లాస్టిక్ అంచులున్న ‘ఆ గాజుముక్క’లను ఒక ప్రముఖ కంపెనీ విడుదలచేసింది.

మార్కెట్లో కొన్ని పుస్తకాలు… ” ఆ గాజుముక్క ఫేమిలీ పేక్ .. కుటుంబానికి ఒక వరం “, ” 30 రోజులలో ఆగాజుముక్కతోతినడం “, ” ఆ గాజుముక్కకు 100 ఉపయోగాలు “, “ఆ గాజుముక్కతో వంటచేసే విధానం “, “ఆ గాజుముక్కతో తినడం.. శాస్త్రీయ విశ్లేషణ”, “నా గాజుముక్క… స్వీయ చరిత్ర “, “గాజుముక్కాట – జాతీయ క్రీడ? “
మరొకప్రక్క ‘ఆ గాజుముక్క’ అంచుల దగ్గర పరమాణువుల క్రియాశీలత పై ఒకరికి డాక్టరేట్ వచ్చింది. వాటి సాంద్రత, రంగుల ప్రభావం, ఆ ఆకారం యొక్క వైశిష్ట్యం మొదలైన అంశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయ్. ప్రప్రధమంగా ‘ఆ గాజుముక్క’ పాఠ్యాంశాన్ని ‘ కట్టింగ్ ఎడ్జ్ ‘ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా విచ్చేసిన ఒక అగ్రరాజ్య దూతకు మన ప్రధానమంత్రి స్వయంగా ఒక ‘ఆ గాజుముక్క’ను బహూకరించారు. ” ఇది రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు ప్రతీక ” అని ఇరుదేశాలవారు కొనియాడారు. ‘ఆ గాజుముక్క’ల ఖరీదు అమాంతం పెరిగిపోయాయి. విదేశీ ‘ఆ గాజుముక్క’లు “ స్టేటస్ సింబల్” గా మారాయి.

ఈలోగా పొరుగురాజ్యం నుండి కొన్ని కంపెనీలు నాణ్యమైన ‘ఆ గాజుముక్క’లను తక్కువధరకే మన బజారులోకి తెచ్చారు. ఇది కన్నుకుట్టిన అగ్రరాజ్యం, తన చెప్పుచేతల్లో ఉండే అంతర్జాతీయ వస్తు నిర్దేశక సంస్థ ద్వారా ప్రపంచంలో తమ కంపెనీల ‘ఆ గాజుముక్కలు’ తప్ప ఇతరులవి నాసిరకమైనవని, ప్రమాదకరమైనవని, పర్యావరణానికి హాని కలిగిస్తాయని ప్రకటించారు. ‘ఆ గాజుముక్క’ల పేటెంట్ కూడా వివాదాస్పదంగా మారింది.

భారతదేశంలో ‘ఆ గాజుముక్క’ పరిశ్రమ మూతపడే స్థితికి వచ్చింది. దీనిని నిరశిస్తూ ఆత్మాభిమాన నినాదంతో ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం కూడా అగ్రరాజ్యాల దురహంకారాన్ని సహించేదిలేదని స్పష్టం చేశాయి. ఆ విధంగా భారతీయులను ఏకం చేసిన మహత్తరశక్తిగా ‘ఆ గాజుముక్క’ ఉద్భవించింది. స్వతంత్ర దినోత్సవంలో ‘ఆ గాజుముక్క’ను గాంధీగారి బొమ్మ ముందు పెట్టి నివాళులిచ్చే ఆనవాయితీ మొదలయ్యింది. మెల్లగా మార్కెట్లో ‘ఆ గాజుముక్క’ల విక్రయం తగ్గింది. అందునా ‘దేశవాళీ ఆ గాజుముక్కలు’ కనిపించటంలేదు. అప్పుడప్పుడు ‘ ఆ గాజుముక్క’ పరిశ్రమవాళ్ళు ఆత్మహత్యల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నష్టపరిహారాలు ప్రకటిస్తూనే ఉన్నారు.
మెల్లగా ‘ ఆ గాజుముక్క’ యొక్క పుట్టుక అగ్రరాజ్యంలోనే జరిగిందని, వారి సహృదయం వల్లనే మన దేశం బ్రతుకుతున్నదని, వార్లేకపోతే ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణ మనవాళ్ళు కలలోనైనా ఊహించలేరనీ ప్రగాఢమైన నమ్మకం ప్రబలిపోయింది. దేశం స్వస్థితికి వచ్చింది.

అదీ ‘ ఆ గాజుముక్క’ కథ. మన నిత్యజీవితంలో ఇలాంటి ‘ ఆ గాజుముక్కలు’ ఎన్నో ఉన్నాయి.

అసలు జీవితమే ఒక ‘ఆ గాజుముక్కే’మో! ఏ తాగుబోతు పడేసిపోయిన సీసా ముక్కో?!

————–

Posted in సంపాదకీయం | Tagged | 6 Comments