తరగతి గదిలో

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు ఈమాట లో, మిగిలిన కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి. సౌమ్య రాసిన ప్రయోగాత్మక కథ తరగతి గదిలో…

—————-

గోడంత ఉన్న బోర్డు కాస్తా మెల్లి మెల్లి గా కుంచించుకు పోవడం మొదలయింది. బోర్డు పక్కనే ఉన్న ప్రొఫెసర్ ఆకారం మెల్లి మెల్లి గా కనుమరుగు కావడం మొదలుపెట్టింది. ఆయన గొంతుక క్రమంగా వినిపించడం తగ్గింది. ఇక పూర్తిగా చీకటి అయింది అనుకున్న క్షణం లో పక్కనే కూర్చున్న కిషోర్ డొక్క లో ఓ పోటు పొడవడం తో మెలుకువ వచ్చింది రాజేష్ కి. “చా! మంచి నిద్ర పట్టే టైం కి లేపావ్ కద రా వెధవా” అనబోయి నాలుక్కరుచుకున్నాడు రాజేష్. అప్పుడే తట్టింది తను క్లాసు లో ఉన్నాడు అని. కాస్త సిగ్గేసింది రెండో బెంచీ లో కూర్చుని మరీ ఇంత ఆదమరిచి ఎలా ఉన్నానా అని. వెంటనే నిటారు గా కూర్చుని బోర్డు వంక చూడడం మొదలుపెట్టాడు. ఈ ప్రాఫ్ అంటే తనకెంతో ఇష్టం అని ఎందరికో చెప్పాడు రాజేష్. అయినా నిద్ర పోతున్నాడు అంటే – ఏమిటి అర్థం? తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఇంతలో ప్రొఫెసర్ కంఠం ఖంగుమని మోగడం తో మళ్ళీ పాఠం పై దృష్టి పెట్టాడు. కానీ, రాత్రి నైట్ అవుట్ హేంగోవర్ ఇంకా వదల్లేదల్లే ఉంది. కాసేపటికే ఇందాకటి బోర్డు చిన్నదవడం, చూపుల్లో చీకటి నిండడం మళ్ళీ పునరావృత్తమైంది.

“ది నెట్వర్క్ హేస్ ఎ ఫ్యూ ప్రాబ్లంస్……” – తరువాత ఏం చెప్పారో రాజేష్ బుర్ర కి ఎక్కలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసి బెంచి పై వాలాడు. ఓ నిముషం పడుకున్నాడేమో. ఇంతలో అంతరాత్మ తట్టి లేపిందో లేక పడుకునే తరహా ప్రశాంతత లేదో గానీ … మళ్ళీ లేచాడు. ఓ సారి ప్రొఫెసర్ తల మీదుగా గోడ గడియారం చూసాడు. 6:30. ఓ క్షణం అర్థం కాలేదు. అదేంటి 10 కి కదా క్లాసు మొదలైంది? అనుకున్నాడు. ఓ అర క్షణం పట్టింది అది పని చెయ్యడం లేదు అన్న విషయం గుర్తు రావడానికి. తన వాచీ చూసుకున్నాడు. ఇంకొ ముప్పవు గంట. “హా! ఎందుకిలా ఔతోంది నాకు?” – వందో సారి అనుకున్నాడు. ఈ ప్రొఫెసర్ కి పిల్లల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. మామూలుగా అలాంటి అభిమానం పొందే వారు తక్కువ. తనూ ఆయనకి అభిమానే. అయినా ఎందుకిలా?? ఈసారి రాజేష్ మదిలో మెరుపు మెరిసింది. “ఇది ఎవరి అసమర్థతా కాదు … మనిషి శరీరం నిస్సహయత!” అని నిశ్చయించాడు. “ఆహా! ఏం వేదాంతం!” – తనలో తానే మురిసిపోతూ ఉండగానే మరో సారి దాడి – ఆవులింత. కళ్ళు మూసినట్లే మూసి వెంటనే మామూలుకంటే పెద్దగా తెరిచి బోర్డు వైపు చూడడం మొదలుపెట్టాడు. “ది జాబ్ ఈజ్ నాట్ ఓవర్ విత్ దిస్ సొల్యూషన్…..” – ప్రొఫెసర్ గొంతు. చివర విన్న వాక్యానికి, ఈ వాక్యానికి మధ్య ఎంత క్లాసు జరిగిందో ఊహించుకుని “ప్చ్!” అనుకున్నాడు రాజేష్.

“నిద్రా? క్లాసా?” – అన్న సందిగ్ధావస్త. “తల్లా? పెళ్ళామా?” అన్నట్లు ఉంది రాజేష్ కు. ఇన్నేళ్ళ స్టూదెంటు అనుభవం లో పవర్ పాయింట్లు ఉపయోగించని ప్రొఫెసర్ల క్లాసు లో పడుకోవడానికి ఓ విధానం కనిపెట్టాడు రాజేష్. వెంటనే దాన్ని పాటించడం మొదలుపెట్టాడు. అదేమిటంటే – ఆయన బోర్డు పై రాస్తున్నంత సేపు కళ్ళు మూసుకుని పడుకుంటాడు. రాయడం అవగానే టక్కున లేచి కూర్చుంటాడు. బోర్డు పైన చాక్పీసు కదిలే శబ్దం వినిపిస్తోందా లేదా అన్నది ఈ యుక్తి లో – “నిర్ణయాత్మక సమయం” అన్నమాట. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొఫెసర్ కి మనం పడుకున్నామా లేదా అన్నది తెలీదు అన్న భ్రాంతి లో జీవించగలగడం ఒకటి. రెండోది – అక్కడక్కడ అన్నా క్లాసు వింటే రేపొద్దున్న కనీసం “ఏమి చదువుకున్నావు?” అంటే జవాబివ్వడానికి పదజాలం అన్నా తెలుస్తుంది. – ఇవీ రాజేష్ ఆలోచనలు!నిద్ర పోకుండా ఉండడానికి చేసే వ్యర్థ ప్రయత్నాల్లో ఒకటైన – “నోటు పుస్తకం లో బొమ్మలు గీయడం” అన్న ప్రహసనం మొదలుపెట్టాడు. కానీ, మనసొప్పలేదు. “నిద్ర – ది డెవిల్” అని రాసి దాన్ని దిద్దడం మొదలుపెట్టాడు. ఈ దిద్దుడు లో కొన్ని క్షణాలు బానే గడిచాయి. కానీ, ఎందుకో తల ఎత్తిన రాజేష్ షాక్ కొట్టిన వాడిలా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కారణం తన పక్కనే ప్రొఫెసర్. ఆయన చేయి తను “నిద్ర-ది డెవిల్” అని రాసుకున్న పేపరు ని ఆనుకునే ఉంది. ఆయనేమో క్లాసుని ఉద్దేశించి – “నౌ, లెట్ అజ్ సీ ది ప్రాబ్లం ఆఫ్ స్టోరింగ్ దిస్ పాటర్న్” అంటున్నారు. అప్పటికి తట్టింది రాజేష్ కి ఆయన దీన్ని చూసి ఉండకపోవచ్చు అని. వెంటనే చేయి అడ్డం పెట్టి సీరియస్ గా రాసుకుంటున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. మరి ఆయన చూసారో లేదో కానీ, ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి ఆయనటు వెళ్ళగానే పక్కనున్న కిషోర్ వైపు తిరిగి ఓ వెధవ నవ్వాడు.

ఆయనటు వెళ్ళగానే మళ్ళీ నిద్ర మొదలైంది. కళ్ళు మూతలు పడుతూండగా కిషోర్ పక్కన ఉన్న రంజన్ తన్ను చూసి ఓ వెటకారపు నవ్వు లాంటిది నవ్వం లీలగా కనిపించింది. కోపం వచ్చింది రాజేష్ కి ..తనమీదే. అయినా మైకం గెలిచింది. కళ్ళు మూసుకున్నాడు. కానీ, చెవులు మూసుకోలేకపోయాడు. అటు పక్క బెంచి అమ్మాయిల గొణుగుళ్ళు, వెనకెవరో సందేహ నివృత్తి బాపతు జనాల గొంతుకలు, ఇక్కడ ప్రొఫెసర్ సమాధానమూ, పేజీలు తిప్పే శబ్దాలూ – అన్నీ చేరి రాజేష్ ని స్థిమితంగా పడుకోనివ్వలేదు. లేస్తూ ఉండగా చూసాడు పక్క బెంచీ లీల, కళ గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు. “నన్ను గురించే అయి ఉంటుంది” – అనుకున్నాడు. “చీ! వీళ్ళకేం పనీ పాటా లేదు. క్లాసు వినకుండా నా గురించి ఎందుకో?” అనుకున్నాడు…. తనది ఊహ మాత్రమే అన్న విషయం మరిచి. నిట్టూర్పో, అబ్బురమో తెలీని ఓ చూపు ఒకటి కదలాడింది రాజేష్ కళ్ళల్లో.
“నిద్రొస్తోంది రా …” – పక్కనున్న కిషోర్ గొణిగాడు రాజేష్ తో. రాజేష్ కి ఇది నిజమో వ్యంగ్యమో అర్థం కాలేదు.
“వచ్చి నాకా చెప్తున్నావు?” అన్నట్లు చూసాడు. వెంటనే బోర్డు వైపు కి తిరిగాడు.
“అసలు క్లాసు లో నిద్రపోతావా? తప్పు కదూ??”
“నిద్రొస్తే నిద్రపోక ఏంచెయ్యాలోయ్?”
“పక్కన వాళ్ళ ఏకగ్రత దెబ్బతినదూ నువ్వు నిద్రపోతే?”
“ఇక్కడ పక్క వాళ్ళ గోలే నన్ను నిద్రపోనివ్వడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోను??”
“ఎందుకు రా …. ఎందుకు రా ఇలా తయారయ్యావు?”
“అది తరువాత ఆలోచిస్తా గానీ … ముందు ప్రొఫెసర్ తో సహా అందరూ నిశ్శబ్దం పాటించడానికి
మార్గాలేమైనా ఉంటే చెప్పు. తెలుసు కదా .. శబ్దం ఉంటే నాకు నిద్ర రాదు”
– రాజేష్ లో రెండు భిన్న ధ్రువాలు ఇలా సంఘర్షించుకుంటున్నాయి. సంభాషించుకుంటున్నాయి.

మళ్ళీ ఓ సారి మత్తుగా కళ్ళు తెరిచాడు రాజేష్. తల ఎత్తి తదేకంగా బోర్డు వైపు చూసాడు. “డిడ్ యు నోటీస్ దిస్ తింగ్?” – ప్రొఫెసర్ క్లాసు ని అడిగిన ప్రశ్నకి బుద్ధిగా తలఊపాడు. బోర్డు పై ఏదో ఈక్వేషన్ రాసి ఉంటే దాన్ని దించాడు పుస్తకం లోకి. మరో సారి గడియారం చూసాడు. ఇంకో 20 నిముషాలు. ఎక్కడో చిన్న చలనం రాజేష్ లో. కాసేపన్నా విందాం అనుకున్నాడు. చెవులు రిక్కించి వినడం మొదలుపెట్టాడు. కానీ, వినలేకపోయాడు. ఏమన్నా అర్థమైతే కద! అక్కడేదో సూత్రాన్ని డిరైవ్ చేస్తున్నారు. మన వాడు మొదటి లైను వద్ద పడుకుని చివరి లైను వద్ద లేచాడాయే. “ఓ మాథెమటిక్స్!!” – రాసి దాన్ని దిద్దాడు కాసేపు – ప్రొఫెసర్ ఇటు వైపు కి రారు అని నిర్థారించుకుని. నిట్టూర్పో, అబ్బురమో తెలీని ఓ చూపు ఒకటి కదలాడింది రాజేష్ కళ్ళల్లో.
“నిద్రొస్తోంది రా …” – పక్కనున్న కిషోర్ గొణిగాడు రాజేష్ తో. రాజేష్ కి ఇది నిజమో వ్యంగ్యమో అర్థం కాలేదు.
“వచ్చి నాకా చెప్తున్నావు?” అన్నట్లు చూసాడు. వెంటనే బోర్డు వైపు కి తిరిగాడు.

“అసలైతే ఈ గంటన్నర లో ఎంత బాగా పడుకుని ఉండొచ్చు? నువ్వొట్టి అసమర్థుడివి. క్లాసు లో పడుకోవడం కూడా చేతకాని దద్దమ్మ వి”
” ఈయన క్లాసు లో కూర్చోవడమే ఒక అదృష్టం అంటారు. ఇలాంటి క్లాసు లో ఇలా చేసావంటే నీ అంత వెదవ ఎవరూ ఉండరు.”
– రాజేష్ లోని ఇద్దరూ రెండు రకాలుగా తిడుతున్నారు. “చా! ఏ విధంగా చూసినా నేను వేస్ట్ ఫెలో నే నా??” – దిగులు గానూ, కోపం గానూ అనుకున్నాడు రాజేష్.

” ఒరే, ఈ చివరి 10 నిముషాలన్నా విను రా!” – కిషోర్ గొణిగాడు.
“వీడో సిన్సియర్ అవతారం తగిలాడు నాకు. ఇలాంటి వాళ్ళ వల్లే నాకు నేనే లోకువౌతున్నా!” – కసిగా అనుకున్నాడు రాజేష్.

“స్టూడెంట్స్, ఐ హేవ్ అ అసైన్మెంట్ ఫర్ యు టుడే….” ప్రొఫెసర్ గొంతు వినబడగానే చకచకా పెన్ను పేపరు తీసి కిషోర్ రాసుకోవడం మొదలుపెట్టాడు. దానితో రాజేష్ కి కూడా రాయక తప్పింది కాదు. ఏదో ఆ ప్రశ్న రాసుకున్నాడు. ఇంతలో కిషోర్ –

” కానీ, ఇది ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఇదిగో … ఈ ఈక్వేషన్ ఉందే, సార్ ఇది పూర్తిగా చెప్పలేదు అనిపిస్తోంది నాకు. నీకేమనిపిస్తోంది?” అన్నాడు పుస్తకం లో ఏదో చూపిస్తూ. “నీ పుస్తకం చింపి నీ మొహం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది” – అనడాన్ని బలవంతాన నిగ్రహించుకున్నాడు రాజేష్.

మళ్ళీ ఆవులింత ….. ఇంక చిరాకు దాచుకోలేకపోయాడు రాజేష్.
“ఒరే, నేను వెళ్ళిపోతా రా ఇంక.” – లేవబోయాడు.
“ఇంకో 5 నిముషాలు కూర్చోరా బాబూ! నువ్వూ, నీ నిద్రా కాదు గానీ!” – కిషోర్ ఆపాడు.
– “ఇంక నుంచి రాత్రుళ్ళు సమయానికి పడుకోవాలి. పొద్దున్న సమయానికి లేవాలి.”- ఓ వెయ్యో సారో, లక్షో సారో అనుకున్నాడు. అనుకుంటూ మళ్ళీ కళ్ళుమూసాడు.

” వి విల్ స్టాప్ హియర్. వి విల్ మీట్ ఆన్ సాటర్డే..” – వెళుతూ వెళుతూ ప్రొఫెసర్ అన్నమాటలకి “హుర్రే!” అని ఎగరాలనిపించింది రాజేష్ కు. కానీ, “హమ్మయ్య!” అని మాత్రం అనుకుని లేచాడు.

” బంగారం లాంటి క్లాసు పాడు చేసుకున్నావు కద రా!” – అని ఒక వైపు నుంచీ
“పోతే పోనీ, మార్చి కాకుంటే సెప్టెంబర్” – అన్న వెటకారం మరోవైపు నుంచీ
– మనసు లోని ఇద్దరూ దాడి చేస్తూ ఉంటే – “మీరిద్దరూ నోర్లు మూయండి. నాకు నిద్రొస్తోంది అసలే…” అంటూనే మరో క్లాసు వైపుకి దారి తీసాడు రాజేష్.

——————-
గమనిక: ఇది కథేనా? అన్న సందేహం వచ్చే అవకాశం ఉంది దీన్ని చూస్తే. అయితే, నేను అర క్షణం లో నిర్ణయించుకుని ఓ గంట లో టైపు కొట్టి, వెంటనే పంపాను. ప్రయోగాత్మకంగా రాసాను. ఏ విషయం మీదైనా కథ రాయగలమా లేదా అని తెలుసుకునే ప్రయత్నం లో ఇదో అడుగు మాత్రమే అని గమనించగలరు.

-V.B.సౌమ్య (http://vbsowmya.wordpress.com)
Posted in కథ | Tagged , | 21 Comments

బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ

తెలుగు బ్లాగుల్లో చరసాల గారి అంతరంగానిదో విశిష్ట స్థానం. పొద్దు లో తెలుగుబ్లాగులను సమీక్షించే ఉద్దేశంతో ప్రారంభించిన బ్లాగు శీర్షిక శ్రీకారం చుట్టుకున్నది అంతరంగంతోనే!! మాటల్లో సూటిదనానికి, నిశితమైన విశ్లేషణకు చిరునామా అంతరంగం. అంతరంగం బ్లాగరి చరసాల ప్రసాద్ గారి అంతరంగావిష్కరణ బానిసత్వం గురించి:

—————

అసలీ బానిస పదం భాష పుట్టినప్పుడే పుట్టినట్లుంది. బానిసత్వం మనిషికి వూహ తెలిసినప్పటి నుండి వుంది. బలవంతుడు బలహీనుణ్ణి చెరపట్టడం అనాది నుండీ వుంది.
మన ఇతిహాసాల్లో, పురాణాల్లో చెలికత్తెల వ్యవహారం వుంది. దాస దాసీల గురించి వుంది. కూతురికి పెళ్ళి చేసినప్పుడు తనతో పాటు తన చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం వుంది. వజ్రవైఢూర్యాలతో పాటు దాసదాసీలను కానుకగా ఇవ్వడం వుంది. ఈ బానిసల జీవితమంతా యజమానుల సేవలోనే గడిచిపోతుంది. వారికంటూ స్వంత జీవితముండేది కాదు. పిల్లలను కనే హక్కు, పెళ్ళి చేసుకునే హక్కు లేదు.

రోమన్ సామ్రాజ్యంలో

యుద్ధాలలో బందీలుగా చిక్కిన వారిని చాలా మట్టుకు చంపేసేవాళ్ళు. పౌరులను కూడా చంపడమో, బందీలుగా పట్టుకోవడమో చేసేవాళ్ళు. ఇలా బందీలుగా దొరికిన వాళ్ళు బానిసలుగా అమ్ముడయ్యేవారు. బలవంతులు, పరాక్రమ వంతులను గ్లాడియేటర్స్ గా మార్చేవారు. ఈ గ్లాడియేటర్ క్రీడను మన కోళ్ళ పందేలతో పోల్చవచ్చు. పందెం కోడిని పెంచినట్లే వీళ్ళకు మంచి తిండి పెట్టి, ఒక్కోసారి వాళ్ళకు బానిస స్త్రీలను కూడా సరఫరా చేసేవారు. కోళ్ళ ఫారం లాగా ఇలాంటి గ్లాడియేటర్లని పెంచే సముదాయాలు వుండేవి, వీరికి యుద్ధ మెళకువలు నేర్పి ప్రతిరోజూ అభ్యాసం చేయించేవారు. ఒక్కోసారి ఇటువంటి అభ్యాసాలలో కూడా కొందరు చనిపోయేవారు. యుద్ధాలలో వీరమరణం చెందడం గౌరవప్రదంగా భావించినట్లే ఈ గ్లాడియేటర్ పోరాటాలలో మరణించడం గౌరవప్రదమైనదని వాళ్ళకు నూరిపోసేవారు. ఒకే యజమాని దగ్గర గ్లాడియేటర్లు స్నేహితులుగా మెలిగిన వారైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడి చనిపోయేవాళ్ళు.

మగ వాళ్ళ పరిస్థితే అలా వుంటే ఇక ఆడ బానిసల సంగతి చెప్పక్కర లేదు. ఇంటి పనుల దగ్గరనుండీ వంటి పనుల వరకూ వారిని వుపయోగించుకొనే వారు.

గ్రీసులో…

గ్రీకు నాగరికతలో బానిసలు ప్రధాన పాత్ర వహించారు. ఇళ్ళల్లో, గనుల్లో, పొలాల్లో, ఓడల్లో మామూలు పనుల నుండీ అతి ప్రమాదకరమైన పనులన్నీ చేసేవారు.

ఇంచుమించు గ్రీకు జనాభా అంతమంది బానిసలు కూడా వుండేవారట. ఎంతమంది బానిసలను కలిగివుంటే అంత గొప్పవారుగా పరిగణించబడేవారు. యుద్ధాల్లో బందీలుగా చిక్కిన వారిని, ఓడిపోయిన పౌరులనీ బానిసలుగా అమ్మేవారు. ఒక్కోసారి అక్రమ సంబంధాల వల్ల పుట్టిన పిల్లలని ఏ తోవపక్కనో పడేస్తే గుర్తించిన వారు ఆ పిల్లలని బానిసలుగా పెంచుకొనేవారు. అప్పుతీర్చలేనప్పుడు, కష్టకాలంలో ధనం అవసరమైనప్పుడూ తమ స్వంత పిల్లలనే బానిసలుగా అమ్మేయడమూ కద్దు.

ఈజిప్టు లో

ఇక్కడ కూడా చరిత్రకు అందని రోజులనుండీ బానిసత్వం వుంది. బానిసలతోనే పిరమిడ్లు నిర్మించి వుంటారని కూడా నమ్ముతున్నారు. పెద్ద పెద్ద ప్రభుత్వ వుద్యోగులూ, పూజారులూ ఎక్కువ మంది బానిసలను వుంచుకొనేవారు. యుద్ధాలలో గెలిచి తెచ్చిన యుద్ధఖైదీలను రాజు వివిధ వుద్యోగులకూ, దేవాలయాలకూ అప్పగించేవాడు. వ్యాపార లావాదేవీల్లో బానిసల మారకమూ వుండేది. బానిసలకూ యజమానులకూ మధ్య సత్సంబంధాలు వున్న సందర్భాల్లో యజమానులు బానిసలని పెళ్ళి చేసుకొని బానిసత్వం నుండి విముక్తి కలిగించడము వుండేది. యజమాని చనిపోయిన సందర్భాల్లో మిగిలిన ఆస్తిలానే బానిసలనూ వారసులు పంచుకొనేవారు. పంచుకోలేని సందర్భాల్లో నెలలో పనిరోజులని పంచుకొనేవారు. ఉదాహరణకు ఒక బానిసను ఇద్దరు పంచుకోవలసి వచ్చినపుడు పదిరోజులు ఒకరిదగ్గరా, ఇంకో పది రోజులు ఇంకొకరి దగ్గరా పనిచేయాలి.

బానిసలు పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించబడ్డా యజమానులకీ వారిపట్ల చూపవలసిన బాధ్యతలు వుండేవి. బానిసల పిల్లలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత యజమానిదే. పిల్లలతో కష్టమైన పనులు చేయంచకూడదు. ఇంకా కోర్టుల్లో బానిసలను మిగతా పౌరుల్లా చూడకపోయినా వారి సాక్ష్యానికీ విలువ ఇచ్చేవారు.

19 వ శతాబ్దంలో కట్టిన సూయెజ్ కాలువ తవ్వకానికి కూడా అర్థ బానిసలని వుపయోగించుకున్నారు. అదెలా అంటే అప్పుడున్న ఈజిప్టు ప్రభుత్వం సూయెజ్ కాలువ నిర్మాణానికి కావలిసిన కార్మికులను సరఫరా చేస్తానని సూయెజ్ కాలువ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. ఒక్కో గ్రామంలో యాభైమందిని కలిపి ఒక గుంపుగా తయారు చేస్తుంది. ఏ గుంపు ఏ నెలలో సూయెజ్ కాలువ కొరకు (ఉచితంగా) పనిచేయాలో నిర్దేశిస్తుంది. ఆ పనిచేసిన వారందరికీ ఆహారం తప్ప మరేమీ భృతి ఇవ్వడం వుండదు. నిర్దేశించిన సమయం తర్వాత ఇంకో గుంపు వచ్చి ఈ గుంపు స్థానంలో పని చేస్తుంది. ఇలా కొన్ని లక్షల మంది పది పన్నెండేళ్ళపాటు పని చేస్తే సూయెజ్ కాలువ తయారయ్యింది. ఒక అంచనా ప్రకారం కనీసం లక్ష మంది ఈ కాలువ పనిలో మరణించి వుంటారు.

అమెరికాలో…

బానిసత్వం ప్రపంచం నలుమూలలా వున్నా ఒక్క అమెరికాలో వున్న బానిసత్వమే అందరినీ ఆకర్షించింది. బహుశా అమెరికాలో బానిసత్వం పూర్తిగా వ్యాపారాత్మకంగా నడవడం వల్లనేమో! లేక చట్టబద్ధమైన బానిసత్వం అప్పటికే ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన యూరోపియన్ దేశాలలో నిషేధించబడటం వల్లనేమో!

అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడి పొలాల్లో మొరటు పనులు చేయలేక మొదట స్థానిక రెడ్ ఇండియన్స్‌ను బానిసలుగా వాడకోవడం మొదలేట్టారు. అయితే వీరు లొంగి వుండకపోవడం వల్లా, భౌగోళిక పరిసరాలు వారికి కొట్టిన పిండి గనుక తప్పించుకుపోవడం కూడా ఎక్కువగా వుండేది. అప్పుడు ఆఫ్రికా నీగ్రోల మీద వీరి కన్ను పడింది. అప్పటికే నౌకలమీద దూర దేశాలు వెళ్ళడం సాధ్యమయివుండటం వల్ల నల్లవారిని పట్టుకొని అమెరికాలో అమ్ముకొనే దళారులు ఎక్కువయ్యారు. యూరోప్ నుండి వచ్చిన తెల్లవారికి అమెరికా దక్షిణ ప్రాంతపు వేడికి తట్టుకోవడం, తట్టుకొని పొలాల్లో పని చేయడం దుర్భరం అయ్యింది. ఇలాంటి చోట్ల నల్లవారు బాగా పని చేసేవారు.

రేవు పట్టణాల్లో బానిసల సంతలుండేవి. ఇక్కడ బానిసలని కట్టేసో లేక గుపులుగానో వుంచేవారు. అక్కడికి వచ్చిన బేర గాళ్ళు వాళ్ళ పళ్ళు చూసి, మచ్చలు చూసి, చిన్న చిన్న పరీక్షలు పెట్టి ఎంత ధర వెచ్చించవచ్చునో ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఆ తర్వాత జరిగే వేలం పాటలో వారిని వేలం పాడి కొనుక్కొనేవారు. ఇలా కొనుక్కున్న బానిసలను దూర ప్రాంతానికి తరలించాలంటే మధ్యమధ్యలో బస చేయాల్సి వస్తుంది కదా, అందుకని వూరూరికీ బానిసల కారాగారాలు వుండేవి. కొద్దిపాటి రుసుము చెల్లించి బానిసలను ఇక్కడ వుంచి మరుసటి రోజు తీసుకపోవచ్చును.

బానిసను పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించారు. బానిసని కొట్టేటప్పుడు పొరపాటున మరణించినా లేదా కావాలని చంపినా చట్టం యజమానిని దండించదు. యజమానికి సౌలభ్యంగా ఎన్నో బానిస చట్టాలు వచ్చాయి. ఏ బానిసైనా యజమానిని వదిలి పారిపోతే, ఆ బానిసని పట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయం చేస్తుంది.

బానిసలని శిక్షించడానికి శిక్షా కేంద్రాలుండేవి. బానిస సరిగ్గా వినయం చూపట్లేదనో, చెప్పినంత పనిచేయలేదనో కారణాన ఈ శిక్షా కేంద్రాలకు పంపేవారు. ఇక్కడ యజమాని చెప్పిన శిక్ష కొద్దిగా రుసుము తీసుకొని అమలు జేసేవారు (కొరడా దెబ్బలు కొట్టడం లాంటివి).
అయితే బానిసత్వానికి అనుకూలంగా వున్నట్లే వ్యతిరేకంగా ఎందరో వుండేవారు. బానిసల అవసరం లేని, పారిశ్రామిక ఉత్తరాదివారు బానిసత్వాన్ని వ్యతిరేకించారు. పారిపోయిన బానిసలకు రహస్యంగా సహాయం చేసి సరిహద్దు దాటించేవారు (అప్పుడు సరిహద్దులోని కెనడాలో బానిసత్వం లేదు).

చివరికి ఈ అభిప్రాయ భేదాలు చిలికి చిలికి అంతర్యుద్ధానికి దారి తీశాయి. లింకన్ దృఢ నాయకత్వంలో జరిగిన ఈ అయిదేళ్ళ పోరాటంలో ఉత్తరాది రాష్ట్రాలు గెలిచి బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాయి.

అయినా… పందొమ్మిదవ శతాబ్దం 60వ దశకంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉద్యమం లేవదీసేవరకూ నల్లవాళ్ళకి ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక బస్సులూ, బెర్తులూ వుండేవి. కింగ్ జూనియర్ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా వుద్యమించి నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు సాధించారు.

ఇలా ప్రతిచోటా అనాదిగా బానిసత్వం వుంది. బలహీనుణ్ణి బలవంతుడు వాడుకోవడం, పెత్తనం చెలాయించడం వుంది. అందుకేనేమో శ్రీశ్రీ “ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” ఆంటారు.

ఇక మన దేశం విషయానికి వస్తే…

అలెక్జాండర్ ది గ్రేట్ తో వచ్చిన ఏరియన్ అనే పెద్దాయన “అదేం చిత్రమో గానీ ఇండియాలో బానిసనేవాడు లేడు. ఇక్కడ బానిసలే లేరు.” అని తన “ఇండికా” లో వ్రాసుకొన్నారు. బహుశా అప్పటి సామాజిక చిత్రాన్ని తన పాశ్చాత్య కళ్ళతో చూడటం వల్ల పాశ్చాత్య తరహా బానిసత్వం లేదని ఆశ్చర్యపోయేడేమో గానీ బానిసత్వం ఇండియాలో అప్పుడూ వుంది ఇప్పుడూ వుంది.

వేదకాలంలో యాగాలలో మనిషిని బలిచ్చే సంప్రదాయం వుంది. శునశ్శేపుని వృత్తాంతం ఇందుకు వుదాహరణ. అయితే మనదేశంలో బానిస వ్యవహారం ఇతర దేశాలకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇతర దేశాల్లో డబ్బు పెట్టి బానిసను కొని అతనికి స్వేచ్చని ఇచ్చేవారు. బానిసలు వున్నత పదవులూ నిర్వహించేవారు. బానిసలను బహిరంగ మార్కెట్లలో విక్రయించేవారు. అయితే ఇండియాలో ఇలాంటివి జరిగినట్లు పెద్దగా ఆధారాలు లేవు. నాకు తెలిసి ఒక సత్య హరిశ్చంద్రుడి కథలోనే “అమ్మడం” అనే ప్రసక్తి వస్తుంది. ఆ కథలో ఒక రాజే తన భార్యను అమ్మి, తనకు తాను అమ్ముడు పోవడమే వింత! ఈ కథను బట్టి అలా అమ్మడం అప్పటికే వున్నట్లు అనుకోవచ్చు. లేదంటే హరిశ్చద్రుడు అమ్ముతానంటే ప్రజలు తిరస్కరించడమో, అది అతి హేయమైన చర్యగా పరిగణించి కొనడానికెవరూ ముందుకు రాకపోవడమో జరగాలి.

పాశ్చాత్య తరహా బానిసత్వం ఇక్కడ లేక పోవడానికి, వున్నా ఎదగకపోవడానికి కారణం బహుశా వ్యవస్థీకృతమైన కుల వ్యవస్థ అయ్యుండవచ్చు.

కుల వ్యవస్థలో బానిస వ్యవస్థలోలాగే వృత్తి పనుల వాళ్ళు వున్న వాళ్ళకి వూడిగం చేస్తారు. కులాచారం, కుల ధర్మం పేరుతో ఏ కులంలో పుట్టిన వాణ్ణి ఆ కులానికి సంబంధించిన పనికి పరిమితం చేశారు. ఇదేమని ప్రశ్నించే వీలులేకుండా “కర్మ” సిద్ధాంతము పేరుతో ఎవరికి వారు లోబడి వుండేలా చేశారు.

బహిరంగంగా వేలం వేసే పద్ధతికి ఋజువులు తక్కువగా వున్నా పరిచారకులనీ, చెలికత్తెలనీ దానంగా ఇవ్వడం మాత్రం అన్ని కాలాలలోనూ వుంది. ఆడపిల్లకు పెళ్ళి చేసి ఆమెతో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం నిన్నా మొన్నటి వరకూ నడిచిన వ్యవహారమే.

ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా వుండేదేమో తెలియదు గానీ తెలంగాణాలో “ఆడబాప” ఆచారం వుండేది. (ఇప్పుడు కూడా వుందా?) పెళ్ళికూతురుతో పాటు ఓ దాసి కూడా వెళ్ళేది. ఆ అల్లుడికి పెళ్ళికూతురు మీదలాగే ఈ దాసి మీద కూడా హక్కులుండేవి. ఇంకా అధ్వాన్నమైన భాగమేమంటే ఇంటికి వచ్చిన అతిథుల కోర్కెలు కూడా ఈ ఆడబాపలు తీర్చాలి. ఈ ఆడబాపలకు పుట్టిన ఆడపిల్లలు మళ్ళీ ఆడబాపలుగా ఇంకో ఇంటికి వెళితే మగబిడ్డలు జీవిత పర్యంతమూ ఆ యింటిపనులు చేస్తూ పనివాళ్ళుగా (బానిసలుగా) వుండేవారు.

ఇప్పటికీ బాకీలు తీర్చలేక కొడుకునో, కూతురునో పనిలో పెట్టడం జరుగుతూ వుంది. ఏళ్ళకేళ్ళు పనిచేసినా వడ్డీ తీరని సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీవితాంతం బానిసగా పడివుండటం తప్ప వారి జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడో అక్కడ ఒకటీ అరా వార్తా పత్రికల ద్వారా తెలిస్తే తప్ప ప్రజల్లో వీటి గురించి పెద్దగా పట్టింపు లేకుండా వుంది.

-చరసాల ప్రసాద్ (http://blog.charasala.com)
Posted in వ్యాసం | 15 Comments

ఈ వారంలో మొన్నటి సరదా ప్రశ్నల తర్వాత ఇప్పుడు తాజాగా కబుర్లు అందిస్తున్నాం. ఆస్వాదించగలరు. మరిన్ని రచనలు మిమ్మల్ని త్వరలో పలకరించనున్నాయి.

-పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

కబుర్లు

దైవభక్తి గలవాళ్ళు మృదుస్వభావులుగా ఉంటారనే నమ్మకంతో థాయ్‌లాండు ప్రభుత్వం ప్రార్థనాలయాలకు తరచుగా వెళ్ళే చిన్నపిల్లలకు ప్రోత్సాహకంగా 1000 బాత్ లు (1250/-) నగదు బహుమతి ఇస్తోంది.

ధ్యాన౦తో ఏకాగ్రత, మనశ్శా౦తి సిద్ధిస్తాయని మనకు తెలుసు. కాని విశాఖ ప్రజలు ఈ ధ్యాన౦ ద్వారానే ప్రభుత్వ౦పై తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ప్రజల సమస్యలను పరిష్కరి౦చట౦లో ప్రభుత్వ౦ నిర్లక్ష్య౦ చూపుతోందని ఆరోపిస్తూ సర్వోదయ మ౦డలి మార్చి 13న విశాఖపట్న౦లో ఇరవైనాలుగు గ౦టల పాటు ధ్యాన సత్యాగ్రాహాన్ని నిర్వహించింది. నగర పాలక స౦స్థ కార్యాలయ౦ ఎదుట ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ౦లో విద్యాధికులు ఎక్కువ స౦ఖ్యలో పాల్గొనడ౦ గమనార్హ౦. హి౦స, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, నిరాదరణకు గురవుతున్న స౦స్కృతి, రైతుల ఆత్మహత్యలు, ల౦చగొ౦డితన౦ వ౦టివి పెరిగిపోతున్నాయని ప్రజల దృష్టికి తీసుకువచ్చే౦దుకే ఈ కార్యక్రమ౦ చేపట్టినట్లు సత్యాగ్రహ నిర్వాహకులు తెలిపారు.

గుజరాత్ పోలీసులు ఇకమీదట అహమ్మదాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారు రూపొందించిన సుగంధభరితమైన, చీకట్లో సైతం మిలమిల మెరిసే యూనిఫార్మ్ ను ధరించబోతున్నారు. రోజంతా విధినిర్వహణలో భాగంగా ఎండలో, వానలో, దుమ్ములో తిరిగి తిరిగివచ్చే పోలీసుల దుస్తులు నలిగిపోయి, దుమ్ముకొట్టుకుపోయి, చెమటవాసనతో ఉంటాయి. అలా ఉండకూడదనే రాష్ట్రప్రభుత్వం ఈ ఆలోచన చేసిందట.

“ఈ పోలీసుల వేధింపులు పడలేకున్నాం. ఆ ఇచ్చేదేదో ప్రభుత్వానికే ఇస్తాం. మాకీ వేధింపులు తప్పించండి.” అన్న వ్యభిచారుల వేడుకోలును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించింది. మీరు చేస్తున్నది చట్టవ్యతిరేకమైన పని కాబట్టి పన్నువెయ్యలేమని
చెప్పింది.

ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్సులో హోటళ్ళు, బార్లు కస్టమర్లకు కండోములను అందుబాటులో ఉంచకపోతే 650 డాలర్లు జరిమానా విధిస్తారట.

యూఎస్ స్టేట్ ఆఫ్ నేవాడా అసె౦బ్లీ సభలు ఈ మార్చి ప౦తొమ్మిదిన హి౦దూ గీతంతో ప్రారంభమయ్యాయి. అమెరికా రాజకీయాల్లో భారత్ కు చె౦దిన వారి స౦ఖ్య రోజురోజుకూ పెరుగుతు౦డడ౦తో 1864లో ప్రార౦భమైన ఈ సభలో మొట్టమొదటి సారిగా హి౦దూ గీతాన్ని ఆలపి౦చారు.

రామభక్తి మొదలైంది దక్షిణభారతదేశం లోనా? ఔనంటున్నారు సువీరా జైస్వాల్ అనే చరిత్రకారిణి. రామాయణాన్ని ఆర్య-ద్రవిడపోరాటంగా కొందరు పేర్కొంటుంటే ఆ ద్రవిడుల గడ్డగా భావించబడే దక్షిణభారతదేశంలోనే రామభక్తి పురుడుపోసుకోవడం విచిత్రం కాదా? (The Hindu మార్చి 12)

భారత సాహిత్యానికి చేసిన కృషికి గానూ కాశ్మీరీ కవి రెహ్మాన్ రాహికి ప్రతిష్టాత్మక 2004-05 స౦వత్సరానికి గాను జ్ఞాన్ పీఠ్ అవార్డు దక్కి౦ది.

ఇల్లు ఇరకటం-ఇల్లాలు మరకటం అని సామెత. కానీ ఇల్లు ఇరకాటమైనందుకే తల్లి కాలసర్పమైంది ఒక రష్యన్ యువకుడి పాలిట. మాస్కోలోని ఒక సింగిల్ రూం అపార్ట్‌మెంట్ లో తమ తమ ‘పార్టనర్స్’ తో నివసిస్తున్నారు 42 ఏళ్ళ తల్లి, 17 ఏళ్ళ ఆమె కొడుకు. ఆ రెండు జంటలూ ముందునుంచే గొడవలు పడుతూ ఉండేవారట. ఆ కొడుకు గర్ల్ ఫ్రెండ్ గర్భవతయ్యాక గొడవలు మరీ ఎక్కువైపోయి ఆ తల్లి ఏకంగా తన కొడుకును చంపెయ్యమని ఒక మాజీ నేరస్థుడిని పురమాయించగా ఆ విషయం అతడే పోలీసులకు చెప్పి ఆమెను అరెస్టు చేయించాడు!

Posted in వ్యాసం | Tagged | 2 Comments

సరదా ప్రశ్నలు

సరదా శీర్షికలో ఈసారి జ్యోతి గారు ఒక ఫోటోకు వ్యాఖ్య రాయమనడమే గాక మరి మూడు ప్రశ్నలు సంధించారు. వాటికి మీరెంత చమత్కారంగా సమాధానాలివ్వగలరో చూసుకోండి.

-పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on సరదా ప్రశ్నలు

సరదా

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఇప్పుడు మీ వంతు.

——————–

ప్రశ్నలు అడగమన్నారుగా! ఐతే కాసుకోండి. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ కొట్టండి. చూద్దాం.

ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
జ.

ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
జ.

ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
జ.

త్వరపడండి……..

——————–

జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 9 Comments

ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారందరికీ సర్వజిత్తు నామ సంవత్సర శుభాకాంక్షలు!

కొత్త సంవత్సరంలో మీకందరికీ సుఖ సంతోషాలు, శుభ శాంతులు కలగాలని ఆశిస్తున్నాం!

Posted in ఇతరత్రా | 1 Comment

గడి

పొద్దులో గళ్ళనుడికట్టు – గడిని సమర్పిస్తున్నాం. మీ సమాధానాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురుచూస్తాం.

Posted in గడి | Tagged | 20 Comments

అందచందాలు, శోధన

అందచందాల గురించి ఓ మంచి శీర్షిక పొద్దులో లేకపోవడం ఓ వెలితే! అది గ్రహించిన జ్యోతి తన సరదా శీర్షికలో అటువంటి కార్యక్రమమొకదాన్ని ప్రవేశపెట్టదలచారు. ఈ సారి పాఠకుల సందేహాలు కొన్నిటికి సమాధానాలు రాసారు. అలాంటి ప్రశ్నలు, సందేహాలు ఉన్నవారు పొద్దుకు రాస్తే జ్యోతి గారు సమాధానాలిస్తారని తెలియజేసుకుంటున్నాము.

ప్రముఖ బ్లాగు, శోధన గురించిన సమీక్షను కూడా ఈ సారి ప్రచురించాం. స్వీకరించండి!

ఇకపోతే శనివారానికల్లా ప్రచురించాల్సిన కొత్త శీర్షిక మంగళవారం – మార్చి 13 – దాకా వాయిదా వెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. మాపట్ల కినుక వహించక ఓపిక వహించగలరు.

Posted in ఇతరత్రా | Comments Off on అందచందాలు, శోధన

నిశిత ‘శోధన’

 

శోధన తెలుగు బ్లాగుల్లో శోధనది ఓ ప్రత్యేక స్థానం. రాసికీ వాసికీ కూడా ఎన్నదగ్గది. పలువురు బ్లాగర్లే కాక, బ్లాగు సంఘాలు కూడా అంగీకరించిన మాట ఇది. ఈ బ్లాగులోని జాబులు క్లుప్తంగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, సమకాలీన విషయాల గురించి ఉంటాయి, తెలుగు సాహిత్యం గురించి ఉంటాయి.

శోధన 2005 మార్చి 31 న మొదలైంది. చాన్నాళ్ళపాటు నిదానంగా నడుస్తూ వచ్చిన బ్లాగు, 2006 మధ్యలో వేగం పుంజుకుంది. ప్రస్తుతం తెలుగులో అత్యంత ఎక్కువ జాబులు క్రమం తప్పకుండా ప్రచురించేవాటిలో ఇది ఒకటి. నెలకు 20 దాకా జాబులను వెలయించే బ్లాగు, శోధన. రాసి మెండుగా ఉన్నంత మాత్రాన, నాణ్యతలో లోపమేమీ లేదు. చక్కటి భాషలో, విభిన్న అంశాల గురించి, ఒరిజినలు జాబులు ఉండే బ్లాగు ఇది.

సామాజికాంశాలు: శోధనను శోధించేటపుడు ముందుగా పరిశీలించాల్సింది సామాజికాంశాల గురించి. సమకాలికమైన రాజకీయ, సామాజిక అంశాలు శోధన నిశిత దృష్టిని దాటిపోవు. మందుల షాపుల వాళ్ళు సమ్మె గానీ, రోడ్లపై ప్రజల అక్రమశిక్షణ, ప్రభుత్వ అక్రమ చొరబాట్లు, ఎన్నికలు, అవినీతి, రాజకీయ సిత్రాలు,.. అన్నీ శోధన బ్లాగులో చోటు చేసుకుంటాయి. ఈ అంశాలపై శోధన వ్యాఖ్యలు చురుక్కుమంటూ ఉంటాయి. మచ్చుకు కొన్ని..

  • “నకిలీ ఎరువు అమ్మితే అయిదు వందల జరీమానా లేదా ఆరు నెలల ఖైదు…దాదాపు ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కు విధించే శిక్షతో సమానం. కాని ఆ నేరం విలువ ఒక నిండు ప్రాణం కావచ్చు….” –కోడి ప్రేమ
  • “అయితే ఏంటంటా గొప్ప? తొమ్మిది రోజులు కష్టపడి, కిలోల కొద్ది ఆభరణాలు ధరించి, రక రకాలుగా ఊరేగి నిద్ర కూడా లేకుండా భక్తులకు అలసి సొలసి దర్శనమిస్తే తొమ్మిది కోట్లు వచ్చాయి పాపం.” “…స్వామీ వింటున్నారా? ఈ నగరంలో మందుబాబులందరూ కలసి అక్షరాలా రోజుకు మూడున్నర కోట్లు మధుపాత్రకు సమర్పిస్తారు…. అంటే తొమ్మిది రోజులలో ముప్ఫైరెండు కోట్లు…:-)…పాపం గాంధీ గారు కూడా ఈ రాబడి ఒక్క రోజు ఆపలేకపోయారు.” –శ్రీవారి ఆదాయం : తొమ్మిది కోట్లు
  • “…మీరు మీ వీ.ఐ.పి వాహనాలలో వస్తే మేమందరం గంటలు ఆగి మరి దారి ఇస్తున్నామే? మరి మీరు మా జీవిత గమనాన్ని ఎందుకు స్థంభింప చేస్తారు?” – తెరాస బందు గురించి నల్ల రాజకీయాలు లో
  • “పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే, కనీసం మధ్య తరగతి ప్రజలు “అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా” అని సంతోష పడతారు.” – మండుతున్న ధరలపై పావుకిలో పేరు మార్చాలి లోని వ్యంగ్యోక్తి

సుధాకర్ సామాజిక స్పృహకు, ఆలోచనా దృష్టికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే!

శోధన లో తరచూ కనిపించే ఇతర అంశాలు, భాష, సాహిత్యం. ఈ బ్లాగరి, పుస్తకాలు బాగా చదువుతారనిపిస్తుంది. పుస్తకాల గురించి కొన్ని టపాల్లో ప్రత్యేకించి రాసారు. ఒక జాబులో ఇలా రాసుకున్నారు.. “ఎప్పుడు బ్లాగు చెయ్యాలన్నా, ఎవేవో పిచ్చి పిచ్చి విషయాలు, పనికి రాని రాజకీయాలు బుర్రలో కొట్టుకుని చివరకి నా చేతి పైన విజయం సాధించి వాటి గూర్చి రాయించుకునేవి. వాటిని జయించాలంటే, ఒకటి మన సంఘం లో కుళ్లు పట్టించుకోకూడదు. (ఇది మనకు కష్టమయిన పని). రెండవది, తెగ పుస్తకాల తో సావసం చెయ్యటం. నేను రెండవ మార్గం ఎంచుకున్నాను.

సుధాకర్ “దర్గామిట్ట కథలు” పుస్తకంపై పొద్దులో సమీక్షా వ్యాసం రాసారు.

శోధన బ్లాగరుల అభినందనలే కాక బ్లాగు సంఘాల పురస్కారాలనూ అందుకుంది.

  • 2006 జూలై లో భాషా ఇండియా వారి ఉత్తమ తెలుగు బ్లాగు పురస్కారాన్ని గెలుచుకుంది.
  • 2006 సంవత్సరానికి ఇండీబ్లాగీస్ వారి ఉత్తమ తెలుగు బ్లాగు పురస్కారాన్ని గెలుచుకుంది.

నాణ్యత పరంగా శోధనకు లభించిన కితాబులివి. సుధాకర్ శోధనతో పాటు మరో తెలుగు బ్లాగు, ఓ ఫోటో బ్లాగు, మూడు ఇంగ్లీషు బ్లాగులు కూడా రాస్తారు. అవి:

శోధన గురించి రాసాక, ఇక శోధకుడి గురించి కొంత..
సుధాకర్
సాఫ్టువేరు నిపుణుడైన సుధాకర్, తన సాంకేతిక ప్రజ్ఞను నెట్లో తెలుగు వ్యాప్తికై వినియోగిస్తూ కింది పనులు చేపట్టారు.

  • ఫైరుఫాక్సు బ్రౌజరు కోసం తెలుగు పట్టీని సృష్టించారు. వివిధ తెలుగు వెబ్ సైట్ల లింకులన్నీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందించారు.
  • ఈ-తెలుగు సంఘం కార్యదర్శిగా ఉంటూ సంఘం రూపు దిద్దుకునేందుకు కృషి చేసారు. సంఘం చేపట్టిన పలు అంశాలను http://wiki.etelugu.org వెబ్ సైటులో సమన్వయపరచే బాధ్యతను స్వీకరించారు.
  • ఈమధ్యే పొద్దులో వివిధ అనే శీర్షికను నిర్వహించే బాధ్యతను చేపట్టారు.

కంప్యూటరు , సాఫ్టువేరు, ఇంటర్నెట్టు వ్యవహారాల గురించి తెలుగులో రచనలు పెద్దగా లేవు. తెలుగు బ్లాగరులు ఎక్కువ మంది కంప్యూటరు నిపుణులే గానీ, వారి సాంకేతిక రచనలు ఎక్కువగా ఇంగ్లీషులోనే ఉంటూ ఉంటాయి. (సాంకేతికాలను ఇంగ్లీషులో రాయడం సౌకర్యంగా ఉండడం ఒక కారణం కావచ్చును.) తెలుగులో అటువంటి రచనలు విస్తృతంగా రావలసిన అవసరం ఉంది. అందుగ్గాను అటు సాఫ్టువేరులోను, ఇటు తెలుగు భాషలోను చెయ్యితిరిగిన వారు పూనుకోవాలి. అదృష్టవశాత్తు, తెలుగు బ్లాగరుల్లో అటువంటి సమర్థులు చాలానే ఉన్నారు. హైదరాబాదులో మైక్రోసాఫ్టు యూజరు గ్రూపును నిర్వహించే సుధాకర్, వారిలో మొదటి వరుసలో ఉంటారు. శోధనలో సాంకేతిక విషయాలు రాసినప్పటికీ అవి కేవలం స్పర్శామాత్రమే! ఈ సాంకేతిక విషయాల కోసం ఓ బ్లాగును ప్రత్యేకించి గానీ లేక శోధనలోనే గానీ విస్తృతంగానూ, వివరంగానూ సుధాకర్ రాయాలని పొద్దు కోరిక. (ఆ ‘బాధ్యత‘ ఆయనకు ఉందని కూడా పొద్దు భావన)

Posted in జాలవీక్షణం | Tagged | 6 Comments