అహమ్!

-ఆదినారాయణరెడ్డి

మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను మనపూర్వులు ఎవరెవరు ఏయే విధంగా తెలియజేశారు? ఈ విషయంలో నాకు కల్గిన అతి పరిమితమైన జ్ఞానాన్ని తమ ముందు సమర్పించుకుంటున్నాను. పాఠకులైన తామందరూ తమకు గల అపార జ్ఞానాన్ని నాతో పంచుకొని నాకు మరింత తెలుసుకునే అవకాశమిస్తారని ఆశిస్తున్నాను.

…ఆకాశానికి కూడా అంతం “నేను” అని. దానినే “అహం” అనీ “ఆత్మ” అనీ అన్నారు. అంటే— అనంతమైనదీ, సర్వ బ్రహ్మాండాలనూ తనలో స్థితం చేసుకున్నదీ అని —మనం అనుకొనే ఆకాశం “నేను” ముందు పరిమితమే!

“నేను అనగా నా శరీరము” అని భావించడం సరియైన సమాధానము కాదు. శరీరము ఏర్పడక మునుపు దాని నిర్మాణము యొక్క ఆవశ్యకతకు ప్రేరేపణ ఏమిటి? కొందరు చెప్పవచ్చు.. తల్లిదండ్రుల శారీరిక సంపర్కమే కదా? అని. అది కొంతవరకు మాత్రమే సరియైనది. తల్లిదండ్రుల పరంపర, పంచ భూతాల పరంపర, ఖగోళం లోని మొత్తం పాలపుంతల పరంపర ఇవన్నీ కూడా సృష్టింప బడటానికి మూల శక్తి ఒకే ఒక్కటి. దానినే “అహం” అని ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతలో చెప్పారు.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః!
అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత మేవచ!!

అని.ఇంత వరకూ దీనికి అర్థం చెప్పిన చాలామంది – “అన్ని ప్రాణులలోనూ నేనే స్థితమై ఉన్నాను. ప్రాణులయొక్క మొదలు, మధ్య, అంతమూ (అంతం చేయువాడను),అంటే– సంహరించు వాడను నేనే” అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పారు. భూతానాం అన్నపదానికి ప్రాణులు అన్న అర్థాన్ని తీసుకున్నారు.

అయితే, “భూతానాం” అంటే “పంచభూతాలకూ” (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములన్నింటికీ) అని అర్థం చేసుకుంటే … భూమికి పరిమితి ఉంది. నీటికి పరిమితి ఉంది. అలాగే వాయువుకు, అగ్నికీ పరిమితం వుంది. అంతు లేనిదీ ఆరంభం కూడా లేనిదీ ఒక్క ఆకాశం మాత్రమే. కానీ శ్లోకంలో చెప్పినదేమిటంటే ఆకాశానికి కూడా అంతం “నేను” అని. దానినే “అహం” అనీ “ఆత్మ” అనీ అన్నారు. అంటే— అనంతమైనదీ, సర్వ బహ్మాండాలనూ తనలో స్థితం చేసుకున్నదీ అని —మనం అనుకొనే ఆకాశం “నేను” ముందు పరిమితమే!

“భూతానామంతమేవచ” అనగా ఆకాశంతో సహా పంచభూతాలు సమస్తమూ “అహం” (ఆత్మ/నేను) లో ఉన్నాయి అని అర్థం. అంటే పంచభూతాల సృష్టికర్త ఈ “నేను”. శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లుగా గీతలో పేర్కొనబడిన ఈ సత్యం … వాస్తవంగా వ్యాసమహర్షిచే సంకలనమైన ఉపనిషత్తుల సారం. (కృష్ణుణ్ణి బ్రహ్మాండ కుక్షింభరుడుగా, పరమాత్మగా భావించేవారికి ఈ భావం మింగుడుబడక పోవచ్చు. ఐతే కృష్ణుడు కూడా సాందీపని అనే గురువు వద్ద విద్య నభ్యసించిన ఒక శిష్యుడే అని తెలుసుకుంటే ఈ సమస్యకు సమాధానం లభిస్తుంది. ఈ శిష్యుడు తాను చదివి, గ్రహించిన చదువులలోని సారాన్నంతా సమయం వచ్చినప్పుడు అర్జునునకు ఉపదేశించి, పరమగురువుగా వెలుగొందినాడు. కానీ దీనినంతా మనకు ప్రసాదించినది మాత్రం సత్యమెరిగిన వ్యాసభగవానుడే) అందుకే కాబోలు సరస్వతీపుత్ర బిరుదాంకితులైన స్వర్గీయ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసంగిస్తూ, “వ్యాసమహర్షి ఆకాశం మొత్తాన్ని తన పిడికిట్లో ఇముడ్చుకున్న మహనీయుడు” అని కీర్తించారు.

ఇదే విషయాన్ని అదిగురువు శంకరాచార్యులు మరికొంత వివరంగా తెలియ జేశారు. అదేమిటంటే…నేను ఏదికాదు? నేనేమిటి? అనేదానికి పరిపూర్ణ వివరణ.

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే !
నచవ్యోమ భూమి ర్నతేజో నవాయుః
చిదానంద రూపశ్శివోహం శివోహం !!

అనగా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంటే వీటి యొక్క చైతన్యము (Consciousness) … ఇవి “నేను” కాదు. జ్ఞానేంద్రియములైన చెవి, నాలుక, ముక్కు, కన్ను – వీటియొక్క జ్ఞాన సంపత్తి “నేను” కాను. భూతసముదాయాలైన ఆకాశము, భూమి, తేజస్సు (అగ్ని), గాలి — ఇవేవి నేను కాను.

మరి నేనెవ్వరు అంటే … యే బంధానికి సంబంధము లేని శాశ్వత ఆనంద స్వరూపమైన శివాన్ని. ఈ గురువుగారు తనదైన శైలిలో “నేను”(ఆత్మ) “శివం” అన్నారు.

నమృత్యుర్నశంక నమే జాతిభేదా
పితానైవ మే నైవమాతా న జన్మ!
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్యా
చిదానందరూప శ్శివోహం శివోహం!!

సిసలైన “నేను”కు తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, జాతిభేదం లేదు. ఎందుకంటే అసలు జన్మే లేదు కాబట్టి – మృత్యువు కానీ, దాని వలన భయము కానీ లేవు. పుట్టలేదు. కానీ ఉంది. అదీ “నేను”-“అహం”-“శివం” “ఆత్మ” .

నజాయతేమ్రియతేవాకదాచిన్నాయంభూత్వాభవితావానభూయహా
అజో నిత్యశ్శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే

జన్మలేదు. మరణములేదు. భూత భవిష్యత్తులు లేవు. నిత్యము, శాశ్వతము, పురాతనమైనది ఆత్మ.

సర్వ నేనులు కూడా “నేను” (ఆత్మ) యందే ఆది, మధ్య, అంత్యములను పొందినట్లు భ్రాంతి కలుగుతుందేకానీ–వాస్తవం మాత్రం “నేను” లో జరిగే పరిణామక్రమమే!

ఒక ప్రార్థన ఉంది –

అనంతనామ ధేయాయ సర్వాకార విధాయనే
సమస్త మంత్ర వాచ్యాయా విశ్వైక పతయే నమహా

– అని. ‘అంతం లేని వాడు’ అనే పేరు గల్గిన వాడు అని ఒకర్థం. ‘ఇన్ని పేర్లు అని చెప్పడానికి వీల్లేనన్ని పేర్లు గలవా’డనేది మరో అర్థం. (రెండర్థాలూ సమంజసమే)ఇక అన్ని ఆకారములూ తనే. అన్యము లేదు. అంతా తనే. అన్నీ తనే. ఒక్కటే–.మహా కవి పోతన అంటాడు. “సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నే శరణంబు వేడెదన్” అని.(భాగవతం లోని గజేంద్ర మోక్షం ఘట్టం లోనిది) అన్నిమంత్రాలు కూడా తనే. ఈ అనంత విశ్వ పతి ఒక్కడే. ” నమహా ఆంటే–వందన మాచరిస్తున్నా నని కాదు.(“మహా”మమ కారం “న” లేదు. అంటే నేనన్నది లేదు). ఈ తాత్ కాలిక నేను అన్నది లేదు. ఉన్నదొక్కటే. ఈ అవగాహనే ఈ మంత్ర పరమార్థం. అలా కాకుండా నేను వందన మాచరిస్తున్నాను-అంటే మన శరీరం లోని ఒకానొక పరమాణువు మనకు నమస్కరించి నట్లుగా –అది మనకొక గుడి కట్టిస్తానని మొక్కు కున్నట్లుగా అదొక జోక్ గా ఉంటుంది.

పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులవారు.”భావము లోన బాహ్యము నందును” కీర్తనలో “అచ్యుతు డితడే ఆదియు నంత్యము” “హరిలోనివే బ్రహ్మాండంబులు”అంటారు.”బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అంటూ విశద పరుస్తారు. మరో రచనలో “పురుడు లేదుర నీకు పురుషోత్తమా” అంటారు -ఇలా వివిధ రీతుల్లో అనంత విశ్వశక్తి యొక్క ఏకత్వాన్ని వివరించడం జరిగింది.

జ్ఞానోదయానంతరం గౌతమబుద్ధుడు కూడా అంతా శూన్యం నుండే ఏర్పడిందనే చెప్పాడు. తెలిసో తెలియకో సాధువులనిపించుకున్న వారు వూతపదంగా చెప్పే మాట “అంతా మిథ్య” అని. ఇందు లోని పరమార్థ మేమిటో సైన్సు ప్రకారం నిరూపించ వచ్చునేమో కొంత పరికించి చూద్దాం. అనంత విశ్వంలోని ఏ పదార్థమైనా మూలకాలు లేకుండా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి మూలకము కూడా ఎలెక్ట్రాన్స్ , న్యూట్రాన్స్, ప్రోటాన్స్ (వీటిని ENP అందాం) అనే ఈ మూడూ ఆయా నిష్పత్తుల సమ్మేళనముతో ఏర్పడిందని కూడా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ నిరూపించి ఏ అభిప్రాయ భేదాలూ లేకుండా వున్నారు కదా! మరి మూలకాలకు మూలమైన ENP ల వుత్పత్తికి మూలం ఏది?

ఇంతవరకూ నిర్దిష్టంగా ఎవ్వరూ కనుగొన్న దాఖలాలు లేవు. ఎన్ని ఆవిష్కరణలు జరిగినా మూలము ఇదీ అని నిరూపించగలిగినా…. అన్నింటికీ మూలం మాత్రం అనంతమహా శూన్యమనే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మన అనుభవంలో గోవు జనితం గోవు, మేక జనితం మేక, మనిషి జనితం మనిషి, అలా దేనికి పుట్టింది ఆ జాతికి చెందుతుంది. కాబట్టి ప్రతి నిర్మాణానికీ మూలమైన ENP లు మహా శూన్య జనితాలైనప్పుడు. సర్వస్వానికీ మాతృక అనంత మహా శూన్యమే కదా! ఆవిధంగా మన అనుభవం ప్రకారం చూసినా గానీ శూన్య జనితాలైన సర్వస్వమూ కూడా శూన్యమే కదా! “అంతా మిథ్య” అన్నమన పూర్వుల మాట కేవల నిరాశావాదం కాదనీ, సాలోచనగానే వారు ఈ నిర్ణయానికి వచ్చివుంటారని మనం గ్రహించాలి.

————

ఆదినారాయణరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి రైతు. పీ.యూ.సీ వరకూ చదువుకున్నారు. పాఠశాల విద్యకు అంతటితో స్వస్తి చెప్పవలసి వచ్చినా సామాన్యశాస్త్రం, చరిత్ర, ఆధ్యాత్మికాంశాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. ఒక పల్లెటూర్లో, ఇప్పటిదాకా కంప్యూటర్ అంటే తెలియని ఒక వ్యక్తి, టెక్నాలజీ నేర్చుకొని ఇంత పూనికగా రాయడం e-తెలుగు సంఘానికి ఘనవిజయమే!

Posted in వ్యాసం | Tagged | 18 Comments

అక్షరాస్యత

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పటి సమాజం ఇలా ఉండేది కాదు. తమ అవసరాలను బట్టి మనుషులు సృష్టించుకున్న “అసహజమైన” వ్యవస్థల్లో లిపికూడా ఒక అంశం. తొలినాటి లిపులు ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆవిర్భవించాయి.

రంగు దారాలు
రంగుదారాలూ, ముడుల భాష

ఆధునికయుగంలో నిరక్షరాస్యత వెనకబాటుతనానికి ముఖ్యలక్షణం. “చదువురాని మొద్దు” ఎందుకూ కొరగానట్టే. అయితే అక్షరాలూ, లిపులూ అన్నీ ఎప్పుడో ఒకప్పుడు ప్రాథమికస్థాయిలో మొదలైన కొత్త పద్ధతులే. వ్యవసాయం, తొలి గ్రామాల్లో స్థిర జీవితం వగైరాలన్నీ మొదలైన తరవాత జనాభా పెరగడంతో బాటుగా వారి అవసరాలు కూడా పెరగసాగాయి. పరస్పర సంభాషణకు పనికొచ్చిన భాషలు నోటిమాటలుగా మొదలై, చాలా శతాబ్దాల పాటు సామాన్య ప్రజలమధ్య మౌఖిక స్థాయిలోనే కొనసాగాయి. శబ్దాలనూ, అవి సూచిస్తున్న సమాచారాన్నీ ఏదో ఒక రూపంలో నమోదు చెయ్యవలసిన అవసరం కొంతకాలం తరవాతగాని తలెత్తలేదు. ఎందుకంటే మననం చేసుకున్న విషయాలను గుర్తుంచుకోవటానికి మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఒకరు రాసిపెట్టిన సంగతులను ఇతరులు ఎంతకాలం తరవాతనైనా చదివి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో తరాలుగా ఒకే చోట, ఒకే రకమైన జీవితాలు గడపసాగిన మానవజాతికి ఇలా లిఖితరూపంలో భద్రపరచిన సమాచారం విలువైనదిగా పరిణమించింది. ఈ సంగతులను సులభశైలిలో వివరిస్తూ సుమారు 50 ఎళ్ళ క్రితం తిరుమల రామచంద్రగారు “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” అనే అద్భుతమైన పుస్తకం రాశారు.

రంగుపూసలు

రంగు పూసల సందేశాలు

ఎటొచ్చీ సమాచారవ్యాప్తికి అక్షరాలే ఉపయోగించక్కర్లేదు. అక్షరాలనూ, లిపినీ ఉపయోగించకుండానే రంగుదారాలూ, పూసలూ, ఈకలూ మొదలైనవాటితో ఆదిమతెగలు దూరప్రాంతాలకు సందేశాలు పంపుకునేవారు. దూరానున్నవారికి వినిపించే విధంగా డప్పుల మోతలూ, కనిపించే విధంగా గాలిలోకి ఎత్తుగా లేచే పొగలూ మొదలైనవి కూడా ఉపయోగించేవారు. ఆ తరవాత రాళ్ళ మీదా, ఇతర వస్తువుల మీదా బొమ్మలు చెక్కడం మొదలయింది.

గుర్తుంచుకోవలసిన సమాచారాన్ని రాసిపెట్టుకోవలసిన అవసరం బహుశా వ్యవసాయం కారణంగానే తొలిసారిగా కలిగి ఉంటుంది. పంట వివరాలనో, నాట్లకూ, కోతలకూ తగిన సమయాలనో నమోదు చెయ్యడానికి ప్రాథమిక రూపంలో భవిష్యత్తులో పనికొచ్చే విధంగా సంకేతాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ప్రపంచంలో అక్కడక్కడా రకరకాల లిపులు ఏర్పడ్డాయి. మెసపొటేమియా, ఈజిప్ట్‌, సింధునదీ ప్రాంతం, చైనా, మధ్య అమెరికా మొదలైన ప్రాంతాల్లో వేటికవిగా అక్షరసముదాయాలు పుట్టుకొచ్చాయి. అప్పట్లో రోజువారీ జీవితంలో కొంతమందికి అతి పరిమితంగానైనా రాయడం, చదవడం తప్పనిసరి అయి ఉండాలి.

మతసంబంధం కలిగిన తంతులకుకూడా లిపులు ఉపయోగపడి ఉంటాయి. సంఘంలో అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటివి రాయడం, చదవడం వచ్చిఉండేవి కనక చదువుకు ప్రతి సంస్కృతిలోనూ చాలా ప్రత్యేకత ఉండేది. అక్షరజ్ఞానానికి ప్రతీకలైన అధిష్ఠాన దేవతలుండేవారు. హిందువులకు సరస్వతీదేవిలాగానే ప్రాచీన మెసపొటేమియాలో మొదట ఎన్‌లిల్‌, తరవాత నబూ అనే దేవతలూ, ప్రాచీన ఈజిప్ట్‌లో ధ్వుతీ, అమెరికాలోని మాయా నాగరికతలో ఇట్జమ్నా మొదలైన దేవతలు ఆరాధించబడ్డారు. ప్రాచీన ఈజిప్ట్‌లో అక్షరాస్యత పూజారివర్గానికి పరిమితమై ఉండేది. భగవంతుడికీ, పాలకవర్గాలకూ సమీపంలో ఉండిన “వ్రాయసకాడు” సంఘంలో పరపతి కలిగి ఉండేవాడు. రాతపని చేసేవాడికి తక్కిన బరువు బాధ్యతలేవీ ఉండవనీ, అటువంటివారికి నిత్యమూ రాజుగారింటి భోజనం లభిస్తుందనీ, మంచి జీవితం, ఆరోగ్యం, సిరిసంపదలూ ఉంటాయనీ అభిప్రాయం ఉండేది. పూజలూ, తంతుల విశేషాలనూ, రాచవంశాల చరిత్రనేకాక కాలాన్ననుసరించి రుతువుల్లోనూ, వానలూ, వరదల్లోనూ కలిగే మార్పులనూ, వ్యవసాయానికి సంబంధించిన వివరాలనూ ఈ పూజారివర్గం నమోదుచేసి తమ “విద్యాధిత్యత”ను పామరుల ఎదుట చాటుకుంటూ ఉండేది. తక్కినవారెవరికీ సామాన్యంగా చదువుతో పనిపడేది కాదు. వారంతా ఈ పూజారులను అతీతశక్తులు కలవారని అనుకునేవారు.

రాత అనేది సామూహికవిజ్ఞానం. లిఖితరూపంలో పోగుచెయ్యడానికీ, గుర్తుంచుకోవలసిన విషయాలను ప్రజల్లో వ్యాప్తి చెయ్యడానికి పనికొచ్చిన సాధనం. ప్రపంచంలోని గొప్ప నాగరికతలెన్నో లిపులను జ్ఞాన వ్యాప్తికై సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాయి. చరిత్ర వివరాలనూ, సామాజిక, చట్టసంబంధిత నిబంధనలనూ, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలనూ, యుద్ధ తంత్రాలనూ, లిపిబద్ధం చేసి, తరవాతి తరాలకు అందించిన అక్షరాస్య సమాజాలు అంతులేని పురోగతిని సాధించాయి. దీనివల్ల లిపి ఆవిర్భావం అనేది నాగరికతకు ప్రతీకగా అనుకుంటాం కాని అది నిజం కాదు. దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో విలసిల్లిన గొప్ప నాగరికతల్లో అక్షరాస్యత మచ్చుకైనా ఉండేది కాదు. అలాగే ఎంతో ప్రగతినీ, ఔన్నత్యాన్నీ

గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.

సాధించిన రోమన్‌ సామ్రాజ్యం చివరకు హూణులవంటి బర్బరులవల్ల నాశనమైపోయింది. ఇలాంటివి కొన్ని తప్ప తక్కిన సందర్భాల్లో నాగరికులు అనాగరికుల్ని ఓడించి లొంగదీసుకోవటానికి తమ వద్దనున్న ఇతర సాధనాలతో బాటు విద్యాధిక్యతను కూడా ఉపయోగించుకున్నారు.
రాసే ప్రక్రియ మొదలయాక శబ్దాలకూ, వాటిని సూచించే సంకేతాలకూ నిర్దిష్టమైన సంబంధం ఏర్పడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగపడ్డాయి. అలాగే లేఖన సామగ్రి తయారుకావటానికి కొంత సాంకేతిక ప్రగతి అవసరమైంది. ఎన్నో శతాబ్దాలుగా నోటి మాటలకే పరిమితమై ఉండిన భాషలన్నిటికీ, లిపులూ, నిబంధనలూ, ఆ తరవాత వ్యాకరణనియమాలూ రూపొందాయి. ఒకరు రాసిపెట్టిన విషయాలను తక్కినవారు చదివి అర్థం చేసుకునేందుకు వీలుగా భాషలకు రూపురేఖలు ఏర్పడ్డాయి.

అంతమాత్రాన ప్రతి భాషకూ ఒక లిపి తయారయిందని కాదు. మన దేశంలో తుళు, కొంకణీ మొదలైన మాండలిక భాషల్లాగే ప్రపంచంలోని కొన్ని మాండలికాలకు లిపి ఉండదు. ఈ భాషలు ఒక్కొక్క ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ఇవి మాట్లాడేవారి సంఖ్య అంత తక్కువేమీ కాదు. వాటిలో ఉత్తమ సాహిత్యంకూడా తయారవుతుంది కాని ఏవో చారిత్రక కారణాలవల్ల వాటికి లిపులు ఏర్పడలేదు. గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.

ప్రాంతీయ భాషాభేదాలే కాక దేశభాషలుకూడా ప్రపంచీకరణ కారణంగా అంతరించిపోయే ప్రమాదం కనబడుతోంది. కంప్యూటర్ల వెల్లువలో ఎన్నో భాషలకు ప్రాచుర్యం తగ్గుతోంది. తెలుగువంటి భాషలను చదివేవారూ, రాసేవారూ క్రమంగా తగ్గిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరఫరా అవుతున్న సమాచారాన్ని తమ మాతృభాషలో చదివి, నేర్చుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. అందరికీ అర్థమయే సాంకేతిక పరిభాష తయారు కావటం లేదు. ఇవన్నీ భాషకూ, సంస్కృతికీ సంబంధించిన పరిమితులు.

అలాగే ఒక్కొక్క భాషలోని ఉచ్చారణ ననుసరించి అక్షరాలు రూపొందడం జరుగుతుంది. ఉదాహరణకు తమిళంలో క చ ట త పలు తప్ప భారతీయ భాషలన్నిటిలోనూ సామాన్యంగా ఉండే తక్కిన అక్షరాలు లేకపోవడంతో “కాంతి” అన్న పదానికీ, “గాంధి” అన్న పదానికీ రాతలో తేడా కనబడదు. అలాగే సంస్కృతం, హిందీ, మరాఠీ మొదలైన లిపుల్లో దక్షిణ భాషల్లో ఉన్నట్టుగా ఎ, ఒ అనే అక్షరాలూ, గుణింతాలూ ఉండవు. మరొకవంక కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో రాయాలంటే యాక్టర్‌, బ్యాంక్‌, థ్యాంక్స్‌ అని వికృతంగా రాయవలసివస్తుంది.

గతంతో పోలిస్తే నేటి సమాజం సమాచార సాధనాల మీదనే పూర్తిగా ఆధారపడుతోంది. నాగరికతలో భాగాలైన భాషలూ, లిపులూ అన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకదానితో ఒకటి పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. తమ తమ భాషల, లిపి, సాహిత్యాల ఆవిర్భావాన్ని గుర్తించి, అర్థం చేసుకున్న జాతులు తమ గుర్తింపునూ, ఆత్మగౌరవాన్నీ మరింత బాగా కాపాడుకోగలవు.

సుమేరియన్ లిపి

ప్రాచీన సుమేరియన్
కీలలిపి

లిపిని సృష్టించడం సులువైన పని కాదు. నాగరికతలోని తక్కిన అంశాల్లాగే ఇది కూడా మెసపొటేమియాలో సుమేరియన్‌ నాగరికతలో మొదట తలెత్తినట్టుగా తెలియవస్తోంది. స్థిరజీవితం మొదలుపెట్టిన నాలుగైదు వేల ఏళ్ళ తరవాత మానవసమాజంలో క్రమంగా ఎన్నో మార్పులు కలిగాయి. మనోభావాలను ప్రకటించటానికీ, తంతులూ వగైరాలను నిర్వహించటానికీ బొమ్మలు గీయడం ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ ఈనాడు మనం అభివర్ణించే సమాచారయుగం (ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌) వంటిది మొదలవడానికి చాలాకాలం పట్టింది. మారుతున్న పరిస్థితుల్లో రాత అనేది తమకు పనికొస్తుందనీ, రాసే నిపుణులను పోషించే అవసరం ఉందనీ అప్పటివారికి అనిపించి ఉండాలి. ఇటువంటి పరిస్థితులు మన దేశంలోనూ, క్రీట్‌, ఇతియోపియా మొదలైన ప్రాంతాల్లోనూ కూడా ఏర్పడ్డాయి కాని లిపి అనేది ముందుగా సుమేరియన్‌ నాగరికతలోనూ, మెక్సికోలోనూ స్వతంత్ర రీతుల్లో తయారైందని పరిశోధకుల ఉద్దేశం.

నాగరికతలోని ఇతర విషయాలలాగే ఒకచోట తయారైన లిపి త్వరలోనే పొరుగు ప్రాంతాలకు వ్యాపించడంతో తక్కినవారికి ఎక్కడికక్కడ మళ్ళీ లిపులను సృష్టించుకోవలసిన అగత్యం లేకుండా పోయింది. వివిధ ప్రదేశాల్లో ఈ అనుకరణ మక్కీకి మక్కీ పద్ధతిలోనూ, ఇతరుల స్ఫూర్తితో తమకు అనువైన పద్ధతిలోనూ కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఆధునిక యుగంలో టర్కీలోనూ, న్యూగినీ, అమెరికా వగైరాల ఆదిమ తెగల భాషలకు ఇంగ్లీష్‌ (రోమన్‌) లిపిని వాడడం జరిగింది. అలాగే రష్యాలోని కొన్ని తెగలు రష్యన్‌ (సిరిలిక్‌) లిపిని అనుసరించాయి. కొత్త లిపులని తయారుచేసుకోకుండా ప్రాచుర్యంలో ఉన్న అక్షరాలను వాడుకునే ఈ విధానం మక్కీకి మక్కీ పద్ధతి. ఇటువంటి అనుసరణలూ, అనుకరణలూ గతంలోనూ జరిగాయి. తొమ్మిదో శతాబ్దంలో గ్రీక్‌, హీబ్రూ లిపులను కొద్దిగా మార్చి రష్యన్‌ అక్షరాలను రూపొందించారు. అంతకు ముందు నాలుగో శతాబ్దంలో ఇంగ్లీష్‌తో సహా అనేక లిపులకు ఆధారమైన జర్మన్‌ అక్షరమాలను బిషప్‌ ఉల్ఫిలాస్‌ అనే వ్యక్తి ఎక్కువగా గ్రీక్‌ అక్షరాలనూ, కొన్ని రోమన్‌ అక్షరాలనూ కలిపి తయారు చేశాడు. క్రీ.పూ.1400 ప్రాంతాల క్రీట్‌లోని మినోవా నాగరికత తొలి గ్రీక్‌ అక్షరాలకు ఆధారం అయింది.

ప్రాచీన లిపులలో అప్పటివారు ఏం రాసేవారు? సుమేరియన్‌ వగైరా లిపుల్లో రాసినవన్నీ అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా, చదవడానికి జటిలంగా ఉండేవి. మొదట్లో నమోదు చేసిన సమాచార మంతా టెలిగ్రాఫ్‌ భాషలాగా పేర్లకూ, అంకెలకూ, కొలతలకూ, లెక్కలకూ, కొన్ని విశేషణాలకూ మాత్రమే పరిమితమై ఉండేది. ఎంతో అవసరమనిపించిన విషయాలను మాత్రమే ఇలా కష్టపడి రాసేవారు. ఎందుకంటే నోటితో ఉచ్చరించే శబ్దాలన్నిటికీ ప్రతీకలైన అక్షరాలు తయారవడానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. ఒకవంక సమాజ జీవితంలో పరిణామాలు జరుగుతూ ఉంటే, మనుషుల మధ్య జరిగే వ్యవహారాలూ, వ్యాపారాలూ జటిలం అవుతూ వచ్చాయి. ఎందరో వ్యక్తులకు సంబంధించిన ఎన్నో విషయాలను లిఖితరూపంలో నమోదు చేస్తున్నప్పుడు అపోహలకూ, అపార్థాలకూ అవకాశాలు లేకుండా చూసుకోవలసివచ్చింది. ఈ రోజుల్లో అవసరాలనిబట్టి కొత్తరకాల కంప్యూటర్‌ భాషలు తయారవుతున్నట్టే ప్రాచీన యుగాల్లో నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ రకమైన ఒత్తిడివల్ల లిపులు మెరుగుపడక తప్పలేదు. మొదట్లో మత, న్యాయ, చట్టపరమైన వ్యవహారాలకు మాత్రమే పనికొచ్చిన అక్షరజ్ఞానమంతా దేవాలయాల్లోనూ, రాజప్రాసాదాల్లోనూ పనిచేసే చాలా కొద్దిమందికి మాత్రమే ఉండేది. క్రీ.పూ.3000 ప్రాంతంలో మొదలైన సుమేరియన్‌ లిపిని చదివితే అదంతా రాచ, దేవాలయ వ్యవస్థలకు సంబంధించిన అధికారుల రచనలుగా దర్శనమిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్‌, క్రీట్‌, గ్రీస్‌, చైనా, ఉత్తర అమెరికా నాగరికతలన్నిటిలోనూ ఇదే కనిపిస్తుంది.

మధ్య అమెరికా

మధ్య అమెరికా ప్రాచీన లిపి

తొలి లిఖిత సాహిత్యానికి ప్రజాస్వామిక లక్షణాలేవీ ఉండేవి కావు. వృత్తిపరంగా రాయ, చదవ నేర్చినవారు ఒక్కొక్క చోటా 30, 40కి మించి ఉండేవారు కారు. సమాజంలో శ్రమవిభజన మొదలవడంతో అదనపు ఆహారోత్పత్తిని సాధించడం వీలైంది. కాయకష్టం చేసే వర్గం వేరవడంతో తిని, కూర్చోగలిగిన మరొక వర్గం ఏర్పడింది. ఇందులో కొందరు రకరకాల ప్రత్యేక వృత్తుల్లో నైపుణ్యం సంపాదించుకోగలిగారు. వాటిలో అక్షరాస్యత ఒకటి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడుతున్న కొద్దీ రాయడమనే నైపుణ్యానికి స్పష్టమైన వర్గ స్వభావం రూపొందసాగింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో తెలిశాక రాసే విధానం దానికి తగినట్టుగానే తయారైంది. రచనా పద్ధతి కూడా అందరికీ అర్థం కావలసిన అవసరం ఉండేది కాదు. అచ్చంగా పాలకవర్గాలకే పరిమితమైన ఆనాటి అక్షరజ్ఞానమంతా వారి వర్గప్రయోజనాలు కాపాడటానికీ, అలగాజనాన్ని పన్నులూ మొదలైనవాటితో అణిచిఉంచడానికీ ఉపయోగపడింది. పూజారులకూ, రాచవంశాలకూ ఎన్నో దైవిక శక్తులున్నట్టుగా ప్రజలను భ్రమ పెట్టటానికి పురాణాలు పనికొచ్చాయి. అక్షరాస్యత పెరిగిన వేల సంవత్సరాల తరవాత కూడా మత గ్రంథాల్లోనూ, పురాణాల్లో ఏముందో చదివి తెలుసుకోలేని పామరులకు విస్సన్న చెప్పిందే వేదమనేది మనకు తెలిసినదే. అందుచేత తొలి యుగాల్లో లిఖిత సమాచారాన్ని స్వప్రయోజనాలకు ఎలా వినియోగించుకునేవారో మనం సులువుగా ఊహించుకోవచ్చు.

అక్షరాస్యత కొద్దిమందికే పరిమితం కావడంతో ఏదైనా నాగరికత అంతరించినప్పుడల్లా విలువైన అక్షరజ్ఞానం మరుగున పడిపోతూ ఉండేది. సింధునది లోయలో అద్భుతమైన నగర నిర్మాణవ్యవస్థతో వర్ధిల్లిన నాగరికత ఆర్యభాషీయుల సంపర్కంతో క్రమేపీ నశించినట్టుగా పరిశోధకులు చెపుతారు. అక్కడి అవశేషాల్లో ముద్రికలమీద కనిపిస్తున్న లిపికీ, ఆ తరవాతి వేదకాలపు భాషకూ ఎటువంటి సంబంధమూ కనబడదు. క్రీ.పూ.1200 ప్రాంతంలో అతి ప్రాచీన గ్రీక్‌ నాగరికత కుప్పకూలిన తరవాత వారి లిపి కూడా అంతరించిపోయింది. మళ్ళీ నిరక్షరాస్యతే మిగిలింది. ఆ తరవాత మరొక 400 ఏళ్ళకు అదే ప్రాంతంలో మరొక గ్రీక్‌ నాగరికత తలెత్తడం, తమకు అనువైన పద్ధతిలో వారు మెరుగైన అక్షరమాలను రూపొందించుకోవడం జరిగాయి. గతంతో పోలిస్తే వారి జీవనశైలిలోనూ, జీవితావసరాల్లోనూ కలిగిన మార్పుల దృష్య్టా కొత్తపద్ధతిలో రాసే విధానం మరింత నిర్దుష్టంగా తయారైంది. అంతేకాదు; మారుతున్న ప్రజల జీవితావసరాలకు అనుగుణంగా రాసే విషయాల్లోకూడా మార్పు కలిగింది. నిజమైన సాహిత్యానికి నాంది ఇదే.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | 3 Comments

తెలుగు వికీపీడియా ప్రగతి – 2007

-రవి వైజాసత్య

ప్రకటన

కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తెలుగు వికీపీడియన్లకు, తెలుగు బ్లాగర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రితం నెల 9వ తేదీన నాలుగవ పుట్టిన రోజు పండగ జరుపుకున్న తెలుగు వికీ గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి గురించి ఒకసారి నెమరు వేసుకొని కొత్త సంవత్సర లక్ష్యాల గురించి తెలుసుకుందాం.

గత సంవత్సరం ప్రారంభంలో 26,000 వ్యాసాలతో భారతీయ వికీపీడియాలన్నింటిలో అగ్రస్థానములో ఉన్న తెవికీ సంవత్సరకాలంలో 12 వేలకు పైగా కొత్త వ్యాసాలను జోడించుకొని 38,000 పైచిలుకు వ్యాసాలతో ప్రథమ స్థానాన్ని నిలుపుకొంది. గత సంవత్సరంలో రెండు వేలమంది దాకా కొత్త సభ్యులు చేరారు. ఒక లక్షన్నర కొత్త మార్పులు చేర్పులు, దిద్దుబాట్లు జరిగాయి. మొదటి లక్ష దిద్దుబాట్లకు చేరుకోవడానికి మూడున్నర సంవత్సరాలు పడితే, రెండవ లక్ష దిద్దుబాట్లు జరగడానికి కేవలం ఐదున్నర నెలలే పట్టడం విశేషం. అంతేకాక మిత్రుల, ప్రోత్సాహకుల సద్విమర్శలను స్వీకరించి అటు విస్తృతితో పాటు ఇటు వ్యాసాల నాణ్యత పెంచడంలో కూడా విశేష కృషి జరిగింది.

2007 జూన్‌లో ప్రారంభించిన ఈ వారపు వ్యాసం మంచి ఆదరణ పొందింది. ఇప్పటిదాకా వికీపీడియా మొదటి పేజీలో ముఫ్ఫైకి పైగా మంచి వ్యాసాలు ఎంపిక చేసి ప్రదర్శింపబడ్డాయి. ఇంకా మరెన్నో మంచి వ్యాసాలు ముందువారాలలో ప్రదర్శించడానికి ఎంపికచేయబడి వరుసక్రమంలో ఉన్నాయి.

సుడోకు, మాయాబజార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హైదరాబాదు, తళ్ళికోట యుద్ధము, అక్షరధామ్, టి.జి.కమలాదేవి, మలేరియా, ఒమన్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, భారతజాతీయపతాకం, తోలుబొమ్మలాట, ఖోరాన్, మంగళగిరి, కె.వి.రెడ్డి, నర్తనశాల, రుక్మిణీదేవిఅరండేల్, ఖర్జూరం, రూపాయి, హిందూ పత్రిక, కన్యకా పరమేశ్వరి, సంఖ్య, హంపి, వైరస్, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము, సాలూరు రాజేశ్వరరావు, మహాత్మా గాంధీ, తులసి, రౌండు టేబులు సమావేశాలు, పశ్చిమ గోదావరి, పండు, నక్సలైటు, అంతర్వేది

మీరు ఈ వారపు వ్యాసాన్ని నేరుగా మీ ఈ-మెయిలుకే తెప్పించుకోవటానికి tewiki-maiku-subscribe@googlegroups.com చిరునామాకు ఒక సందేశం పంపండి.

2007లో కృషి జరిగిన రంగాలలో ఆర్ధిక శాస్త్రము, వైద్యము, జీవశాస్త్రము ముఖ్యంగా వృక్షశాస్త్రము, క్రికెట్టు, వివిధ క్రీడలు, క్రీడాకారులు, ముస్లిం మతం, హిందూ పుణ్యక్షేత్రాలు మొదలైన విషయాలలో సభ్యులు చాలా వ్యాసాలను జోడించారు. గ్రామాల వ్యాసాలకు మార్పులు చేర్పులు, సవరణలు దాదాపు పూర్తయ్యాయి. 2008 ఏప్రిల్ కల్లా అన్ని గ్రామాలకు గణాంకాలు చేర్చే పని ముగించగలమని ఆశిస్తున్నాము. వికీపీడియా అనుబంధ ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతంతా దాదాపు గత సంవత్సరంలో జరిగినదే. క్రితం సంచికలో వాటి విశేషాలు, ప్రగతి సమీక్షించుకున్నాం కాబట్టి వాటి గురించి వచ్చే సంచికలో సవివరంగా చెప్పుకుందాం.

2008లో రాసి కంటే వాసి మీదే ఎక్కువగా కృషి చెయ్యాలని అనుకుంటున్నాము. అయినా కొత్త వ్యాసాల ఉధృతిని ఆపలేము కదా. 2008 చివరికి తెలుగు వికీపీడియా మరో 12 వేల కొత్తవ్యాసాలను జోడించుకొని 50 వేల వ్యాసాల మైలురాయి చేరుతుందని అంచనా. దీనితో పాటు ఈ సంవత్సరాంతానికి 5 లక్షల దిద్దుబాట్లు, 8 వేల మంది సభ్యులకు చేరుకుంటుంది. ఇక నాణ్యతా పరంగా సంవత్సరంతానికి చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న వ్యాసాలు ఒక వెయ్యికి పైగా జత అవుతాయనుకుంటున్నాము. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలోని వ్యాసాలలో మొలకలు 50 శాతం పైగానే ఉన్నాయి. వాటిని 2008 చివరికి 30 శాతానికి తగ్గించగలమని అంచనా. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2009 సెప్టెంబరులో తెలుగు వికీపీడియా తొలి సిడీ వెర్షన్ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమౌతుంది.

ఈ లక్ష్యాలను సాధించగలిగితే తెలుగు వికీపీడియా ఈ కొత్త సంవత్సరంలో జోరుగా ప్రగతి సాధించినట్లే. అయితే వీటిని సాధించటానికి ఎప్పటిలాగే తెలుగు వికీపీడియన్లు, బ్లాగర్లు, తెలుగు భాషాభిమానులు, పండితులు, పాత్రికేయులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరి సహకారము కావాలి.

ప్రతి ఒక్కరూ వ్యాసాలే వ్రాయాల్సిన అవసరం లేదు. మీమీ ఆసక్తిని, వీలు బట్టి ఈ క్రింది జాబితాలోని ఏదైన ఒక పని చేసి కూడా తెలుగు వికీపీడియా మీకు తోచిన సహాయము చెయ్యవచ్చు.

  • వీలైనన్ని కంప్యూటర్లకు తెలుగు నేర్పించండి
  • నలుగురికీ మాట చేరవెయ్యండి – ఇంకా చాలా మందికి అంతర్జాలంలో వికీపీడియా అనే విజ్ఞానపు ఖని ఉందని తెలియదు. తెలిసినా, తెలుగులో వికీపీడియా ఉందని ఇంకా చాలామందికి తెలియదు.
  • తెలుగుకు సంబంధించిన విషయాలు వెతుకుతున్నప్పుడు గూగూల్లో తెలుగులో శోధించండి.
  • వికీపీడియాలో మీ ఊరి గురించి వ్రాయండి
  • అచ్చుతప్పులు కనిపిస్తే సంకోచించికుండా సరిదిద్దండి. – (ప్రతి వ్యాసం పైన “మార్చు” అనే లింకు పైన క్లిక్ చేసి దిద్దవచ్చు)
  • ఏదైనా విషయం గురించి మంచి సమాచారం కనిపిస్తే దాని గురించి వికీపీడియా సభ్యులకు కబురందివ్వండి. (teluguwiki@yahoo.co.in)
  • ఫోటోలు పంపించండి – ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు కానీ, పండుగులు, తెలుగు సంస్కృతి, మీ ఊరు మొదలిన విషయాలకు సంబంధించిన ఫోటోలు పంపించండి.
  • రూపురేఖలు మార్చెయ్యండి – మీకు CSS, HTML బాగా పరిచయముంటే వికీపీడీయా సైటును అందంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి.
  • సలహాలు సూచనలూ చెయ్యండి – ఉచిత సలహాలను మేము సీరియస్సుగానే తీసుకుంటాం!
  • మీ అనువాద పటిమను సానబెట్టుకోండి – సవాలుగా స్వీకరించి ఇతర భాషలలో ఉన్న ఒక వ్యాసాన్ని తెలుగులోకి అనువదించండి (ఇంగ్లీషు నుండే కానక్కరలేదు)
  • తెలుగు వ్రాతకు ఒక శైలి మాన్యువల్ రూపొందించడంలో సహకరించండి
  • స్క్రిప్టింగు తెలుసుంటే బాట్లు వ్రాసి పనులు సులువు చెయ్యండి.

——————–

రవి వైజాసత్య

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

పేజీలో పైనున్న వికీపీడియా ప్రకటన బొమ్మను వికీపీడియా సభ్యుడైన దేవా తయారు చేశారు.

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

మంది మన్నియమ్ – 5

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది చివరిది:

———

సూత్రము – 41 : అనన్యముగా శాసన విధేయమైన పౌరావళి.

వృత్తి :

(అ) అనన్యమనఁగా మఱుతలంపు లేకుండ.
(ఆ) శాసన విధేయత కేవలము ప్రభుత్వోద్యోగుల కుండవలసిన లక్షణముకాదు. అందరికిని ఉండవలెను. సామాన్యులలో శాసన విధేయత లేనిచో ప్రభుత్వోద్యోగులలో సైతమది మృగ్యమగును. ఏల ననఁగా వారు కూడ సామాన్యులలోనుండి వచ్చినవారే.
(ఇ) పరంపరాగతమైన సాంప్రదాయిక ప్రమాణముల పట్లఁ బ్రజలకున్న శ్రద్ధాభక్తివిశ్వాసములే ప్రభుత్వము పట్లను, దాని శాసనముల పట్లను విధేయతగా దశాంతరముఁ జెందుచున్నవి. కావున ప్రజల మత విశ్వాసములు ప్రజాస్వామ్యమునకు బలవర్ధకములే గాని తదన్యము కావు. దేనిపట్లను విశ్వాసము గాని, తాత్పర్యము గాని లేనివారినుండియే యే వ్యవస్థకైనను బెనుముప్పు పొంచియుండును. ఒకదానికిఁ దలయొగ్గుట నభ్యసించినవారు మరొకదానికిఁ దలయొగ్గుట మిక్కిలి సులభము. తద్భిన్నముగా -నొకదాని పట్లఁ దిరుగుబాటును బ్రోత్సహించినచోఁ బ్రజలు క్రమముగా నన్నింటిపైనను దిరుగఁబడెదరు. మానవ మనస్సొకచోట నొకవిధముగాను, వేఱోకచోట వేఱోక విధముగాను బ్రవర్తించునట్లు ప్రకృతి యేర్పఱింపక పోవుటయే దీనికిఁ గారణము.
(ఈ) సంప్రదాయమునకుఁ జక్కని ప్రత్యామ్నాయ మేర్పడినప్పుడు సంప్రదాయమును వ్యతిరేకింప నక్కఱలేకయే ప్రత్యామ్నాయము సుప్రతిష్ఠితమగును. ప్రత్యామ్నాయ మేర్పడనప్పుడు సంప్రదాయము నెంతగా వ్యతిరేకించినను గడకు దానినే యనుసరింపక తప్పదు.

సూత్రము – 42 : సేవోపజీవనమైన ప్రబల మధ్యతరగతి.

వృత్తి :

(అ) సేవ యనఁగా – చూ. ఈ యధ్యాయమునందలి 8 వ సూత్రమునకు వ్రాసిన వృత్తి.
(ఆ) సమాజమునందు నూటికిఁ దొంబదిమంది ధనికులే యయినను, అంతమంది దరిద్రులున్నను బ్రజాస్వామ్యమర్పడుట కడిఁది. అట్లు గాకనూటికిఁ గనీసము నలుబదిమంది చదివికొన్న మధ్యతరగతివారున్నప్పుడుప్రజాస్వామ్య సూత్రములను జక్కగాఁ బాటించుటకు వలనుపడును.
(ఇ) ఏల ననఁగా – ధనికులకు రాజకీయముల కన్న వ్యవసాయ వాణిజ్యములే ముఖ్యము. దరిద్రుల కెవరు పరిపాలించినను ఒక్కటియే. అట్లు గాక ప్రభుత్వ విధానముల నర్థము చేసికోగలదియు, వానిచేతఁ బ్రభావిత మగునట్టిదియు నగు విద్యావంత మధ్యతరగతి వర్గము రాజకీయ పరిణామములకు దీటుగా స్పందించును.
(ఈ) ఆ మధ్యతరగతి వ్యవసాయమునకో వాణిజ్యమునకో చెందినది కాక సేవావృత్తులకుఁ జెందినదై యుండుట లెస్స. సేవావృత్తులవారు తమ యజమానులను మెచ్చించు నిమిత్తము వివిధ విద్యలభ్యసించెదరు. చదివికొన్న మధ్యతరగతివర్గము తమను గమనించుచున్నదను భయము రాజకీయవాదులలో లేనిచోఁ బ్రజాస్వామ్యము రక్తికట్టదు.

సూత్రము – 43 : సమాజములో సుస్పష్టమైన శ్రమవిభజనము.

వృత్తి :

ఈ పని వీరు చేయఁదగును, ఆ పని వారు చేయఁదగును అని పనులనుబంపిణీ చేసికొనుటయే శ్రమవిభజనము.
(అ) నాగరికతా విజ్ఞానములు బాగుగా ముందునకుఁ బోయిన సమాజములయందును, జనసంఖ్య వేల లెక్కను దాఁటి కనీసము లక్షల మట్టమునకుఁజేరికొన్న సమాజములయందును, ఏటేటఁ గ్రమము దప్పక యాహార వనరులను బ్రసాదించు ప్రకృతిసంపద యున్న దేశములందును మాత్రమే శ్రమవిభజన సాధ్యము.
(ఆ) శ్రమవిభజనమున్నచోటఁ బ్రత్యేక నైపుణ్యములకున్ను, వానికి సంబంధించిన విద్యార్హతలకున్ను, వానిని సంపాదించువారికిన్ని ఒక విశిష్టమైన విలువయేర్పడును. పనిసేయించు నాయకులెవరైనను గావచ్చును గాని పనినిబ్రత్య క్షముగాఁ జేయువాఁడు మట్టుకు ఆ పనికి సంబంధించిన విద్యలోఁబ్రత్యేక నైపుణ్యమున్ను విద్యార్హతయుఁ గలిగినవాఁడే యయి యుండవలెనన్నది ప్రజాస్వామ్య నియమము. మాటిమాటికిని మారిపోవు ప్రజా స్వామ్యప్రభుత్వముల యస్థిరత నడుమ ప్రజాస్వామ్యమును సుస్థిరముగా నిలువఁబెట్టుచున్నది ఈ నియమమే.
(ఇ) శ్రమవిభజనమున్నచోట హక్కులను గూర్చియు బాధ్యతలను గూర్చియు ఖచ్చితమైన లక్ష్మణరేఖలేర్పడును. హక్కులను గాలరాఁచువారి పట్లను,బాధ్యతలను విస్మరించువారి పట్లను సమాజమునందు ద్వేషముండును.అటువంటివారికి శిక్షలు కూడ నుండును. అటువంటి వాతావరణము నాయకులచేతను, అధికారుల చేతను భయభక్తులతోఁ బనిచేయించుటకు మిక్కిలియనుకూలము.

సూత్రము – 44 : చొఱవ గల ప్రజలు.

వృత్తి :

ప్రతి విషయమునందును బ్రభుత్వ సహాయమును బ్రతీక్షింపకయు, నపేక్షింపకయుఁ స్వతంత్రమైన చొఱవఁ దీసికొను తత్త్వము గల ప్రజలున్నచోటఁ బ్రజాస్వామ్యము వర్ధిల్లును.
(అ) ప్రజలటువంటి స్థితికి రావలెనన్నచో నంతకుముందు ప్రజాసంక్షేమమేధ్యేయముగాఁ బరిపాలించిన ప్రాజ్ఞ నిరంకుశులైన దేశభక్త రాజులు గాని, దేశభక్త నియంతలు గాని యా దేశమున కుండియుండవలెను.
(ఆ) ప్రభుత్వ సహాయమును ధనరూపములోఁ గాని, వస్తురూపములోఁగాని, యనుకూల శాసనముల రూపములోఁ గాని, ప్రత్యేక కేటాయింపులరూపములోఁ గాని యాశించు పరాన్నభుక్ పరాధీన ప్రజలు లక్షలాదిగానున్న దేశము నందుఁ బ్రజాస్వామ్యము నడువదు. ప్రజలీ విధముగా భిక్షాపాత్రఁ జేపట్టి ప్రతిదానికిన్ని ప్రభుత్వమును దేవిరించు స్థితిలో నుండుటచేఁబాలక వర్గములు అడ్డు అదుపు లేనివై నిరంకుశముగాఁ జెలరేఁగిపోవును.అదియును గాక, భిక్షగాళ్ళను మఱియు బానిసలను నానాప్రాతిపదికములాధారముగా విడఁగొట్టుట మిక్కిలి తేలిక.
(ఇ) ఇట్లు ప్రభుత్వసహాయముల కెదురుసూచు సమాజములందు దానినివిరివిగాఁ బోందువారున్ను, బోత్తిగాఁ బోందనివారున్ను అని యిరుతెఱఁగులజనవర్గము లేర్పడును. కావునఁ బ్రభుత్వసహాయమును మిక్కుటముగాఁబోందువారి నిరంకుశత్వము తక్కుంగలవారికిఁ గంటగింపై యది తిరుగుబాటులకుఁ , గనీసము వర్గవైషమ్యములకుఁ దఱచుగా దారితీయును.
(ఈ) స్వతంత్రమైన చొఱవ లేనిచోట నెన్నికలలోఁ బోటిపడుటకున్నుసుప్రతిష్ఠితులైన వారికిఁ బోటిగా వ్యాపారములను నడుపుటకున్ను సైతముతగినంతమంది మనుష్యులు దొరుకరు.

సూత్రము – 45 : పట్టింపులకుఁ బరోక్షపాత్ర.

వృత్తి :

పట్టింపులనఁగాఁ గొన్ని నమ్మకముల మూలమున మనస్సులో నేర్పడు సున్నితత్వములు.
(అ) నమ్మకములకున్ను పట్టింపులకున్ను ప్రజాస్వామ్యము వ్యతిరేకము కాదు.ఏ పట్టింపును గాని యది నిషేధింపదు. కాని వానికిఁ బ్రభుత్వ వ్యవహారములలో బహిరంగ వ్యక్తీకరణమిచ్చుట యనేకములైన చిల్లర సమస్యలకు దారితీయును. కనుక వానికిఁ బ్రత్యక్షపాత్ర లేనటువంటి వాతావరణము నందుఁబ్రజాస్వామ్యప్రయోగము సత్ఫలితములిచ్చునని తాత్పర్యము.
(ఆ) ప్రజలందరికిని ఒకే విధమైన పట్టింపులు లేకపోవుట వలన వాని బహిరంగ వ్యక్తీకరణముచే ౌ్ఛుర్షణమేర్పడును. మతవిశ్వాసములున్ను పట్టింపులలో భాగము. ప్రజలందరున్ను ఒకే మతమునకఁ జెంది, యొకే దేవు నారాధించుచు, ఒకే విధమైన యుపాసనము జేయువారైనను, వారి వారి యాధ్యాత్మికానుభవములందును, దర్శనములందును బెక్కు వ్యత్యాసము లుండును. కనుక నొకరి పట్టింపు నామోదించి వేఱోకరి పట్టింపును దీఱిక సేయుటవివాదహేతువగును.
(ఇ) ప్రజాస్వామ్యమునందు దేశమునకంతటికిని ఒక యాధికారిక భాషవలెనె యొక యాధికారిక మతమును సైతము ప్రకటింపవచ్చును. కానియప్పుడు కూెడ విశ్వాసములను నేరుగాఁ బరిపాలన రంగములోనికిఁ దెచ్చుట కభ్యంతరమగును.
(ఈ) దేవుని పేరిటఁ గాని, పవిత్ర గ్రంథముల పేరిటఁ గాని ప్రమాణ స్వీకారములు సేయుటకున్ను, ప్రభుత్వ కార్యాలయాదికములలో నియమిత వేళలయందుఁ బ్రార్థనాదికములను నిర్వర్తించుటకున్ను ప్రజాస్వామ్య మడ్డుపడదు. కాని విశ్వాసములాధారముగాఁ బరిపాలన పరమైన నిర్ణయములుదీసికొనుట కభ్యంతరమగును.
(ఉ) పరిపాలనమునందుఁ బ్రతికూల జోక్యమును గలిగించికొననంత వరకుఁ బ్రజలలోఁ బట్టింపులుండుట ప్రభుత్వమునకున్ను మంచిదే. ప్రభుత్వయంత్రాంగపు సేవలు లభ్యము కాని చోట్ల సైత మట్టి విశ్వాసములు ప్రభుత్వయంత్రాంగము వలెనె పనిసేయుచుఁ బ్రజలను వారి హృదయాంతరాళమునుండియే యదుపాజ్ఞలలోఁ బెట్టునని గ్రహించునది.

సూత్రము – 46 : స్వేచ్ఛ.

వృత్తి :

ఒక కుటుంబము గాని, యట్టి యసంఖ్యాక కుటుంబముల సమూహములు గాని తాము తాముగా బ్రదుకుటకున్ను , సంఘముగా నేర్పడుటకున్ను , తాము తాముగా నాలోచించుటకున్ను, ప్రవర్తించుటకున్ను, పనిసేయుటకున్ను, ఆనందించుటకున్ను, తమకుఁ బ్రకృతి ప్రసాదించిన శక్తిసామర్థ్యములను మరియుఁ దమ పరిసరములలోని వనరులను దమ యిష్టప్రకారము వినియోగించుటకున్ను, వెచ్చించుటకున్ను మరియు నేతtసర్వ విపర్యయమునకున్ను ఆటంకములు లేకపోవుట స్వేచ్ఛ.
(అ) ఎల్ల హక్కులున్ను స్వేచ్ఛయందే పర్యవసించును.
(ఆ) స్వేచ్ఛ యున్నసమాజములందుఁ బ్రజాస్వామ్యమేర్పడును. ప్రజా స్వామ్యము స్వేచ్ఛనుగాని, హక్కులను గాని ప్రసాదింపదు కాని యున్న స్వేచ్ఛను మఱియుఁదన్మూలకమైన హక్కులను శాసనబద్ధము గావింప వచ్చును.

సూత్రము – 47 : సమానత్వము.

వృత్తి :

ఒకే ప్రజాస్వామ్యమునందలి మనుష్యులెల్లరును సమానులు. ఎవ్వరైనను, ఎంతవారైనను బుట్టుకతో నితరుల కంటె నెక్కువ గాని, తక్కువగాని కారు. మనిషికిని మనిషికిని మధ్య సమానత్వము నంగీకరింపని దేశమునఁ బ్రజాస్వామ్య మేర్పడదు.
(అ) ఏ వ్యక్తియు సమష్టి లేకుండఁ దానొక్కఁడే బ్రతుకలేఁడు. సమాజములేకుండ నతని జ్ఞానము గాని, నైపుణ్యము గాని యక్కరకు రావు. వ్యక్తియశాశ్వతము. సమాజము శాశ్వతము. అందువలన నొకఁ డెంతటి వాఁడయినప్పటికిన్ని, సమాజమున కెంతగా సేవఁ జేసినవాఁడైనప్పటికిన్ని, ఒకవిశిష్టుఁడుగా మన్నన పొందవచ్చును గాని, సమాజమున కంటె మాత్రమెట్టి పరిస్థితులలోను గొప్పవాఁడు కాఁడు. సమాజమునందు అందరునుఅటువంటివారే కనుక నందరును సమానులు.
(ఆ) అందరును సమానమే కనుక, నెన్నికలలో నందరి యీకోళ్ళ విలువయు సమానము. పౌరహక్కులు సమానము. రాజకీయ హక్కులు సమానము. సామాజిక కర్తవ్యములు సమానము. పన్నులు సమానము. అవకాశములు సమానము. ఉద్యోగముల కర్హతలు సమానము. విధులు సమానము. ఒకే విధముగాఁ బనిసేయువారందరికిన్ని చెల్లింపులున్ను, ననుమతులున్ను సమానము. నేరనిర్ధారణపద్ధతి సమానము. విచారణపద్ధతి సమానము. నేరములకు విధించు శిక్షలు సమానము.
(ఇ) ఈ సూత్రము – ప్రభువులు ప్రజల నెట్లు మన్నింపవలెనో చెప్పునుగాని సమానత్వమున కొక పరిమాణమును నిర్ణయించుటకుఁ బూనికొనదు.మచ్చునకు – అందరికిని ఆస్తి సంపాదించు హక్కు సమానముగాఁ గలదనిచెప్పును గాని యందుల కొక సర్వసామాన్యమైన యుత్తరావధిని ఖరాఖండిగాఁ బేర్కొనదు.
(ఈ) రాజకీయ సూత్రమగుటం జేసి రాజకీయేతర రంగములలో నిదిబహుళముగాఁ గద్దు. గుణోత్తరతా నిదానమునందు సమానత్వ విచారణరద్దు.
(ఉ) యంత్రాదికములు లేకపోవుట వలన నాగరికతా నిర్మాణమునకై కార్మికవర్గపు శారీరికశ్రమ మీఁద మిక్కిలి యాధారపడు సమాజములలో నీ విధమైన సమానత్వమును, మఱియు దాని నాధారముగాఁ జేసికొన్న ప్రజాస్వామ్యమును ఆచరణమునందుఁ బెట్టుట షుమారుగా నసాధ్యము.

సూత్రము – 48 : సమానులు సమానుల మధ్య సమానులు.

వృత్తి :

అందరును దమ సాటివారి నడుమ మట్టుకే సమానులు. ఇదియపవాదసూత్రము. అనఁగా దీని ముందటి సూత్రమునకు మినహాయింపు. అనఁగా – నందరును తమవంటివారి మధ్య మాత్రమే సమానులు.
(అ) ఒకఁ డితరులతో సమానమగునా? కాదా ? యనునది – ఆతఁడు ఏవ్యవస్థలో భాగమై యున్నాఁడ ను విషయముపై నాధారపడి యుండును.ఆతఁడు తాను పుట్టిపెరిగిన దేశపుఁ బ్రజాస్వామ్య వ్యవస్థలో భాగమై, యచ్చటనివసించుచున్నప్పుడు తక్కుంగల తన తోడి పౌరులెల్లరితోడను సమానుఁడు. ఆతఁడే పరాయి దేశమునకుఁ బోయినప్పుడు అచ్చటి ప్రజాస్వామ్యమునందలి సభ్యులతో సమానుఁడు కాఁడు.
(ఆ) కుటుంబ వ్యవస్థలోఁ గొడుకు తండ్రితో సమానుఁడు కాఁడు. పదవతరగ తి చదువుచున్న యొక చట్ట తన తోడి చట్టలతో మాత్రమే సమానుఁడు.పరిపాలకుల నడుమ వాణిజ్యవేత్త యసమానుఁడు. పారిశ్రామికవేత్తలనడుమఁ గార్మికుఁ డసమానుఁడు. కేవిచ్చి ప్రయాణించువారి నడుమఁనదివ్వకుండఁ బ్రయాణించువాఁ డసమానుఁడు. నైపుణ్యము గల వారి మధ్యనదిలేనివాఁ డసమానుఁడు. అనఁగా నర్హతయే పరిగణనలోనికి వచ్చుననిభావము.
(ఇ) ఆ యర్హతను గొన్నిపట్టుల శ్రమించి సంపాదింపవలసి యుండును.మఱికొన్నిపట్టుల నది పురుషకారమున కతీతమై విధివిలానముగా నొనఁగూడవలసి యుండును.

: ప్రకరణాంత గద్య :

ఇది సకలసూరిసమ్మతిపాత్ర హరితసగోత్రపవిత్ర శ్రీ తాడేపల్లి భానుమతీ వెంకటేశ్వర పుణ్యమిథున తృతీయ పుత్త్ర శ్రీ లలితా మహామాతృనిర్ణిబంధ కృపాకటాక్ష వీక్షణైక సంపద్యమాన బహుభారతీగాత్ర శ్రీమాన్ లలితాబాలసుబ్రహ్మణ్యము రచించిన మందిమన్నియమను నభినవరాజనీతి తంత్రమునందుఁ బర్యాలోకనాఖ్యమగు నాఱవ ప్రకరణము.

Posted in వ్యాసం | Tagged | Comments Off on మంది మన్నియమ్ – 5

లెట్ ఇట్ గో

-రమ్య గీతిక

విశాలమైన రోడ్డు, నాల్గు వైపులా అంతా అదే. కనుచూపు మేరా ఏమీ లేదు. రోడ్డు పై మనుషులంతా పరిగెడుతున్నారు – రకరకాల వాళ్ళు, అన్ని వయసులవాళ్ళు, ప్రక్కలకి చూడకుండా, వాళ్లతో కల్సి తనూ వేగంగా పరిగెడుతూ వుంది. ఆది అంతం లేని పరుగు. మనసు, శరీరం అలసిపోతున్నాయ్. హాయిగా తీరిగ్గా కూచుంటే బావుండు. మెల్లిగా పరుగాపి నిల్చోవటానికి ప్రయత్నించింది. నెట్టేస్తూ అందరూ వాళ్ళతో కల్సి పరిగెడితే తప్పించి వారి ముఖాలు గుర్తు పట్టలేనంత వేగంగా దూసుకు పోతున్నారు. ఒక్కతే ఒంటరిగా అయోమయంగా… ఉహు వద్దు. ఒంటరితనం భరించలేను. పరిగెత్తాలి అందరితో కల్సి జీవితాంతం ఇలాగే. చమటలు కారి పోతున్నాయ్, శరీరం స్వాధీనం తప్పుతోంది, లేని శక్తిని కూడదీసుకుంటూ మళ్లీ పరుగు. ఇంకా ఇంకా.. హమయ్య ఇప్పుడు ఒంటరితనం లేదు, ఆలోచనలూ లేవు. అసలు నేనే లేను.. పరుగొక్కటే! రన్‌ రన్‌ రన్‌.. ఠంగ్ ఠంగ్ ఠంగ్.. ఏంటో మోగుతోంది. అబ్బ పరిగెత్తలేక పోతున్నా, ఒక్కసారి అందరం కూర్చుంటే బాగుండు. మళ్లీ ఏదో మోగుతోంది. ఇదేంటి రోడ్డు చుట్టు గోడలు? వాళ్ళందరూ ఏరి! ఏ.సి. లోనూ నిలువెల్లా చమటలు, గొంతెండి పోతోంది. కాలింగ్ బెల్ మోత. కలా..!

అయోమయంగా లేచి వెళ్లి పాల పాకెట్ తీసుకుని చిల్లర్ లోపలేసి బెడ్ పై ఒరిగి కళ్లు మూసుకుంది. శ్రీకాంత్ లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్నట్టున్నాడు. అదంతా కలా, తను నిద్ర పోయిందా! ఎన్ని రోజులైయింది, నిద్ర పట్టి! అసలీరోజు ఏవారం? తారీకెంతో? ఏదైతే ఏంటిలే. శ్రీకాంత్ బయల్దేరినట్టునాడు.

“శైలూ వెళుతున్నా..”
“ఊ…”

డోర్ లాక్ చేసుకుని వెళుతున్న చప్పుడు. టిఫిన్‌, భోజనం అన్నీ బైటే. తిరిగొచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది. ఇంట్లో టిఫిన్‌ తినటానికి పట్టే టైమ్‌ లో ఓ ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యొచ్చంటాడు. ఆఫీస్ లోనే ఏదో ఒకటి తినెయ్యొచ్చు. మొన్నటిదాకా తనూ అంతేకదూ! ఇప్పుడు బయటేమీ తినలేకపోతోంది, వండడానికి ప్రయత్నిస్తే ఆ వాసనలకి వికారం; తినలేదు.

ఇప్పుడు అమ్మమ్మ ఉంటే తను చేసిన గోంగూరతో అన్నం, పులిహోర…. ఏవో పిచ్చి కోరికలు.
ప్రెగ్నెన్‌సీ, పాపాయిని పెంచటం మధురమైన అనుభవాలని చదివిందే.. మరి ఇదేంటి ఇంత నరకంగా ఉంది! ఎవరన్నా సపోర్ట్ గా ఉంటే బాగుండనిపిస్తుంది. ఏవో భయాలు, అనుమానాలు, సంశయాలు.., పంచుకోవటానికి ఎవరన్నా కావాలి. ఒంటరితనం దుర్భరంగా ఉంది. బెడ్ రెస్ట్ తప్పనిసరి అన్నారు. లేకపోతే ఇప్పుడు ఆఫీస్ లో వుండేది. ఊహ తెలిసాక ఇంట్లో ఇన్ని రోజులుండటం ఇదే మొదటి సారి. ఇంకా ఐదు నెలలు ఇంట్లో ఒంటరిగా…

చిన్నప్పుడు అమ్మమ్మ ఎప్పుడైనా వస్తే ‘మీ ఇంట్లో ఉండలేనే శైలూ. మీ అమ్మా నాన్నా, నువ్వు అంతా బైటి కెళతారు, బయటివారితో మాట్లాడ కూడదంటారు’ అనేది కదూ, ఆమె వున్న వారం రోజులూ హడావిడీ చేసేది. ‘కిటికీలు తలుపులూ మూసుకుని ఎలా వుంటున్నారో! నాకైతే ఊపిరాగి నట్టుంటుంద’ని అన్నీ బార్లా తెరిచుంచేది. వంటగది చప్పుళ్లతో సందడిగా ఉండేది. తనకి అన్నం ముద్దలు కలిపి పెట్టేది, కథలు చెప్పేది.

‘ఎంత పెద్ద ఉద్యోగం, బిజీ ఐతే మాత్రం ఒక్క పిల్ల చాలంటావేమిటే , ఇంకొక్కరుంటే దానికి తోడూ ఇంట్లో సందడీ ఉంటాయి’ అని అమ్మతో ఎప్పుడూ అనేది.

ఓసారి, ‘ఈ వూళ్లో మన వాళ్లున్నారటే వెళ్దాం’ అని, ‘వాళ్లెవ్వరూ మాకు తెలియదు నువ్వు ఎవరిళ్ళకిపడితే వారిళ్ళకి వెళ్లొద్దం’టూ విసుక్కుంటున్న అమ్మని లెక్క చేయకుండా, ‘ఆ తెలుసుకుంటే వాళ్లే తెలుస్తారు’ అని తనని తీసుకుని బయల్దేరింది. పది నిమిషాల్లో బంధుత్వాలు తిరగేసి మరగేసి వరుసలు కలుపుకొని వారికి దగ్గరి చుట్టమై పోయింది.

ఇప్పుడు తనకైతే దగ్గరి వాళ్ల వివరాలే తెలియదే! చరిత్ర తెలుసు – షాజహాన్‌ తల్లికి అన్న ఎవరో తెలుసు, తన వారెవరో తెలియదు. అమ్మమ్మ ఆ తరువాత ఎప్పుడొచ్చిందీ గుర్తుకు లేదు. మళ్లీ రాలేదనుకుంటా, కొడుకు దగ్గరే ఉండేది, చనిపోయినప్పుడు అమ్మే ఓ మూడు రోజులు వెళ్లినట్లు గుర్తు, పరీక్షలుండి తను వెళ్ల లేదు. ఇప్పుడెందుకో బాగా గుర్తొస్తూంది. ఆ మెత్తని ఒడిలో పడుకోవాలని ఉంది.

బెల్ మోగుతోంది. మంగ వచ్చినట్టుంది. తలుపు తీసి ముఖం కడుక్కుని ఓ బ్రెడ్ ముక్క తింటూ స్టవ్ పై టీ పడేసింది. మంగ వెలిసిపోయిన పంజాబి డ్రెస్ వేసుకుంది. సింకులో గిన్నెలు తోముతోంది.

“మంగా లంగా ఓణీ వేసుకోవా?”
“ఇప్పుడియ్యే పేషనండి. ఇదైతే పనిచేసుకోటానికి ఈలుగా వుంటది”

మంగకి టీ ఇచ్చి కప్పు పట్టుకుని హాల్లోకి వచ్చి టి వి ఆన్‌ చేసింది. ఏదో సీరియల్. అత్త, కోడలు, ఆడపడుచు ఒంటి నిండా నగలు, కారిపోయేంత మేకప్. క్లోజప్ లో మొహాలు, వెనక దడ దడా సంగీతం.

ఈ రోజు డేటెంతో? చెకప్ కెళ్లాలి ఒంటరిగా…. ఒక్కసారిగా ఏకాకి ఐపోయినట్టుగా ఉంది. తనకు తెల్సిన వారంతా గుంపుగా ఉన్నా ఒంటరిగానే బ్రతుకుతున్నారు. చిన్నప్పటి నుండీ ఒంటరిగానే అన్నీ చేసుకుంది. ఎన్నడూ కలగని ఫీలింగ్ ఇప్పుడెందుకు! ఈ టైంలో హార్మోన్స్ తేడాల వల్ల ఇలావుందేమో.

మంగ మిషిన్‌ లో బట్టలు పడేసి హడావిడిగా గదులు ఊడ్చేస్తోంది.

“ఎందుకు మంగా తొందర, ఇంటికెళ్లి ఏం చేస్తావ్?”
“ఇప్పుడు టీవీలో అక్క మొగుడు సీరియలండి. తొరగా ఎల్లి చూడాల.”

ఛానల్స్ అన్నీ మార్చి మార్చి, ఆఫ్ చేసి బెడ్ రూం లోకి వచ్చి పడుకుంది.

బీపి పెరిగినట్టుంది, కన్‌సీవ్ అయ్యిందనగానే ఎంత సంతోష పడ్డారు తను, శ్రీకాంత్! మొదట ఓనెల మామూలుగానే ఆఫీస్ కెళ్లింది. తరువాత బీపి, షుగర్ ఇంకేవేవో కంప్లైంట్స్. ఈ టైమ్‌ లో కొందరికి ఇలాగే అవుతుంది, డెలివరీ తరువాత నార్మల్ అవచ్చు, పూర్తి రెస్ట్ లో ఉండాలన్నారు. అమ్మకి ఫోన్‌ చేస్తే, ‘ఇప్పుడు లీవ్ పెడితే, నీ డెలివరీకి లీవ్ ఉండదు, డెలివరీ టైంకి ఇక్కడికిరా. ఇప్పుడు నేను చాలా బిజీ’ అంది.

ఊహ తెల్సినప్పటి నుండి ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే మొదటి సారా? ఓసారి టైఫాయిడ్ వచ్చి ఉంది కదూ, అప్పుడూ ఒంటరిగా ఉండలేక కాస్త తగ్గగానే కాలేజ్ కి వెళ్లి పోయింది. స్కూలు, కాలేజి , కోచింగ్ లు, ఎంట్రన్స్ లు. టైం వేస్ట్ చెయ్యొద్దు, అన్నింట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. అంతే మరో ఆలోచనే లేదు.

చిన్న వయసు లోనే మంచి ఉద్యోగం. దానికి ప్రతిగా పోగొట్టుకున్నవి జీవితం, స్పందన. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ అనుభూతులూ జ్ఞాపకాలూ లేవు. తన కోసమే తనకేం వచ్చు. కమ్మగా వండుకు తిందామంటే వంట సరిగా రాదు, పడుకుందామంటే నిద్రా రాదు ఇంకా వేరే ఏమన్నా చేయటానికి టైమూ లేదు, ఆసక్తీ కోరికా చచ్చిపోయాయి.

చాలా చిన్నప్పుడు కారణం లేకుండానే మనసు సంతోషంతో పొంగిపోతూ వుండేది, అది ఎప్పుడు ఎక్కడ పోగొట్టు కుంది? పెద్దయ్యే కొద్ది ఎంత సీరియస్ గా, బిజీ గా వుంటే అంత గొప్ప, గౌరవం.

పనైనట్టుంది, మంగ పిలుస్తోంది. పంపించి తలుపేస్తూ కారిడార్ లోకి తొంగి చూసింది. ఎవరూ లేరు. ఎప్పుడన్నా లిఫ్ట్ సౌండ్. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా బిజీ, పది దాటితే వాచ్ మన్‌ తప్పించి ఎవరూ ఉండరు. క్రింద తారస పడితే, కొందరు చిరునవ్వుతో చూస్తారు, కొందరు అదీ లేదు. అంతే, ఈ ఫ్లాట్స్ లో పరిచయాలు ఎవరి గూడులో వాళ్లు.

తలుపేసి వచ్చి కూర్చుంది. సజీవ సమాధి అయినట్టుగా వుంది. ఏదో వికారం.. వాష్ బేసిన్‌ దగ్గరికి పరిగెత్తింది. తిన్న బ్రెడ్, టీ వాంతయి పోయింది. కళ్లు తిరుగుతున్నాయి. మెల్లిగా వచ్చి బెడ్ పై ఒరిగింది.

మధ్యాహ్నం తినడానికేమీ లేనట్టుంది, మంగతో ఏవన్నా తెప్పించుకోవాల్సింది. రాత్రికి శ్రీకాంత్ ఏవన్నా తెస్తాడు. కాస్త నయం, మంగ లేకపోతే ఇంకా కష్ట మయ్యేది. ఇక్కడున్న ఫ్యాక్టరీలకే వెళతారు. ఇంటి పనులకు మనుషులు దొరకటం కష్టం.

ఒంటరితనం దుర్భరంగా ఉంది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు అది వెయ్యి రెట్లు అధికంగా అన్పిస్తుందేమో! ఇంకా ఐదు నెలలు.. తర్వాత.., పాపాయి. అప్పుడూ ఎవరూ వుండరేమో తోడుగా. ఉన్నా.., ఒక నెల. తరువాత ఇద్దరి పనీ చేసుకోగలదా? ఇలాగే ఇంట్లో బందీలా ఉంటే, తప్పకుండా పిచ్చెక్కుతుంది. ఒక నెల పాపాయి క్రెష్ కి, తను ఉద్యోగానికి. ఇంక ఈ పాపాయి క్రెష్ లో, స్కూల్ లో, కాలేజ్ లో పెరిగి పెద్ద దౌతుందేమో. ఆడపిల్లయితే పెద్దయ్యాక తనలాగే ఈ నరకమూ తప్పదేమో. ఓ జీవి పుట్టటం, చదువు, ర్యాంకులు, ఉద్యోగాలు – వీటి కోసమేనా, చుట్టూ అందరూ ఎలా ఉంటే అలా… మనసు చంపుకొని పెంచాలి, ఉహూ వద్దు ఇప్పటి ఈ జీవన విధానంలో బందీగా ఉన్న తనకి అసలు పిల్లలు వద్దే వద్దు. డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం ఫోన్‌ చెయ్యటానికి లేచింది.

——————

“చదవటం, నేర్చుకోవటం అంటే నాకు ఇష్టం. నేనింకా విద్యార్థినే. ఇంకా తెల్సుకోవలసింది ఉంది. నా చుట్టూ ఉన్న వారి సంతోషానికి పొంగిపోతాను, దుఃఖాన్ని చూసి కన్నీరవుతాను. అవే నేను రాసే కథలవుతాయి.” అని అంటారు రమ్యగీతిక. నివేదన పేరుతో బ్లాగు రాస్తూంటారు.

Posted in కథ | Tagged , | 20 Comments

‘సినిమా’లో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి:

(రచనాకాలం: 2003 వ్యాసకర్త: పాలగిరి విశ్వప్రసాద్)


ఈ సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…!

తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు.

తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి లు పుట్టింది కడపజిల్లా పులివెందుల తాలూకా ఎద్దులయ్యగారి కొత్తపల్లెలోనే. తెలుగు చిత్రసీమ కీర్తిపతాకాన్ని ఎగురవేయడంలో వీరితో

ఈ సినిమా రంగం ‘కర్నూలు పట్టణ నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు (పర్యాటక ప్రాముఖ్యత ఉన్న చారిత్రక కట్టడమిది) పరిసర ప్రాంతం మనుషుల ఊచకోతలకు నిలయం‘ అనే ఒక దుర్మార్గపు భావనను సీమలోనే ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువతలోనే ముద్ర వేయగలిగింది.

చేయికలిపిన కె.వి.రెడ్డి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వాసి. ఇటువంటి కళాతపస్వులను సినీరంగానికి అందించిన రాయలసీమ సంస్కృతిపై అదే చిత్రసీమలో ప్రస్తుతం ఊచకోత కొనసాగుతోంది.

“సీమ ఫాక్షనిజం” పేరుతో ఇటీవల పుంఖానుపుంఖంగా విడుదలైన సినిమాలు-సీమవాసులకే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ సినిమా రంగం ‘కర్నూలు పట్టణ నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు (పర్యాటక ప్రాముఖ్యత ఉన్న చారిత్రక కట్టడమిది) పరిసర ప్రాంతం మనుషుల ఊచకోతలకు నిలయం‘ అనే ఒక దుర్మార్గపు భావనను సీమలోనే ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువతలోనే ముద్ర వేయగలిగింది. కక్షల సంస్కృతి వాసనే సోకని కడప జిల్లాలోని ఒంటిమిట్ట (ప్రఖ్యాత చారిత్రాత్మక కోదండరామస్వామి దేవాలయానికి ఈ ఊరు ప్రసిద్ధి) లో నిరంతరం మనుషుల ఊచకోతలున్నాయని సీమలోనే ఉన్న అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల యువత భ్రమపడుతోంది.

ఈ సినిమాలు చూసిన కర్నూలు వాసులు తక్కిన రెండు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాల్లో ఈ దుస్సంస్కృతి ఉందని భావిస్తున్నారు. అనంతపురం వాసులు కడప, కర్నూలు జిల్లాల్లో ఈ జాడ్యం ఉందని భావిస్తున్నారు. కడప వాసులు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ దుర్మార్గం ఉందని భావిస్తున్నారు. అంటే సీమజిల్లాల్లో ఎక్కడా లేని ఒక క్రూరమైన హింసా దృశ్యాన్ని తెరకెక్కించి సీమసంస్కృతికి ఆపాదించడంలో సినిమా ఎంత బలంగా ముద్రవేసిందో గమనించవచ్చు. సీమజిల్లాల యువతలోనే ఈ ముద్ర పడిందంటే ఇక ఈ సినిమాలు చూసిన ఇతర ప్రాంతీయులు సీమ జిల్లాలపై ఎంతటి దురభిప్రాయం ఏర్పరచుకుని వుంటారో స్పష్టమవుతున్నది.

రాయలసీమకే పరిమితమైన గ్రామకక్షల సంస్కృతి ఇక్కడ ఉన్న మాట నిజమే. ఐతే ఇది సీమకంతటికీ చెందిన సంస్కృతి కాదు. ఈ గ్రామకక్షల సంస్కృతి సీమ జిల్లాలన్నిటా విస్తరించిలేదని చరిత్ర చెపుతోంది. కేవలం కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిసే రేనాటి తాలూకాల్లో మాత్రమే ఈ గ్రామ కక్షలు కనిపించేవి. ఆనాటి ఆ గ్రామకక్షలకూ, నేడు ఆంధ్రదేశమంతటా విస్తరించిన ‘పొలిటికల్ ఫాక్షనిజం’ కూ ఏమాత్రం పోలిక లేదు. సీమలోనే ఒక ప్రాంతానికే పరిమితమైన ఆనాటి విలక్షణమైన “గ్రామకక్షలు” ప్రస్తుతం పూర్తిగా సమసిపోయాయి. ఈ విలక్షణ గ్రామకక్షలకు ఫాక్షనిజం అనే పేరు పెట్టడం కూడా అవగాహనారాహిత్యమే. ఇదొక కుట్రగా సీమవాసులు భావిస్తున్నారు.

80వ దశకంలో రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని పత్రికలు ప్రవేశపెట్టిన పదం ‘ఫాక్షనిజం’. సీమకే పరిమితమైన ఈ గ్రామకక్షలను బ్రిటిష్ కాలం నుండి కూడా వ్యవహారికంలో ‘పార్టీ’ అని పిలిచేవారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారితో “మీ ఊర్లో పార్టీ ఎలా వుంది?” అని అడగడం ఇక్కడ పరిపాటిగా ఉండేది. ఈ గ్రామకక్షల్లో ముఠాతత్వం, నేరప్రవృత్తి ఏ కోశానా కనిపించదు.

ఈ కక్షల సంస్కృతిలో జరిగిన హత్యలు నేరప్రవృత్తితో జరిగినవి కావు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని ఈ విలక్షణ కక్షలకు ఒక చరిత్ర ఉంది. చరిత్ర పునాదుల నుండి ఉద్భవించిన ఒక సామాజిక జాడ్యమిది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన పాలెగాళ్ళ వ్యవస్థ నుండి సంక్రమించిన భావజాలం వల్ల ఇక్కడి జనంలో పంతం, ప్రత్యర్థిపై మాత్రమే క్రౌర్యం ప్రదర్శించే మనస్తత్వం మానసికంగా రూపుదిద్దుకున్నాయి.

మరోవైపు పిలవకపోయినా వచ్చే కరువు కాటకాల వల్ల ఈ ప్రాంతంలో దైన్యమైన బతుకులు ఉండేవి. ఈ భౌతిక స్థితి, ఈ మానసిక స్థితి కలగలిపి ఒక విలక్షణ కక్షల సంస్కృతికి బీజం వేశాయని చెప్పవచ్చు. ఈ సంస్కృతి కూడా అంతో ఇంతో స్థిరమైన భూమి కలిగి ఉండి, కరువు కారణంగా అటు ఆ భూమి పండకా, ఇటు దౌర్భాగ్యమైన వలసపోయే అవకాశమూ లేని పరిస్థితులున్న రేనాటి ప్రాంతంలో పునాదులు వేసుకుంది.

సీమకే పరిమితమైన ఈ గ్రామకక్షల్లో ఒక సంప్రదాయం, ఒక యుద్ధనీతి కనిపించేవి. ఆడవాళ్ళ జోలికీ, ఆస్థుల జోలికీ, పశువుల జోలికీ ఎంతమాత్రం పోయేవారు కారు. 70వ దశకంలో కడప జిల్లాలోని రైల్వే కోడూరు, చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఎక్కడో ప్రత్యర్థులు ఒక వర్గానికి చెందిన ఆవుల పొదుగులు కోసిన ఉదంతం విని, రేనాటి ప్రాంతంలోని గ్రామస్థులు ‘పార్టీ కోసం పొదుగులు కోసే నా కొడుకులు…వాళ్ళేం మనుషులు?’ అని ఈసడించుకున్న సంఘటనలున్నాయి.

అయితే ఆ తరువాత్తరువాత 80వ దశకంలో పొలిటికల్ ఫాక్షనిజం సీమజిల్లాలతోబాటు ఆంధ్రదేశమంతటా విస్తరించాక, చీని చెట్లను తెగనరకటం, వాములు తగలబెట్టడం, ఇళ్ళు పీకడం, పచ్చటి పైర్లను నాశనం చేయడం వంటి అవలక్షణాలు పొడచూపాయి. అయితే ఈ అవలక్షణాలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి దిగుమతి అయిన ‘పొలిటికల్ ఫాక్షనిజం’ తోబాటు ఈ ప్రాంతానికి దిగుమతైనవే. ఈ పొలిటికల్ ఫాక్షనిజం లోనే మాఫియా తత్వం, ముక్కూమొగమెరుగని వారిని కూడా ఊచకోత కోయడం వంటి అవలక్షణాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అవలక్షణాలతో కూడిన… ఆంధ్రదేశమంతటా – ఆ మాటకొస్తే దేశమంతటా ఉన్న పొలిటికల్ ఫాక్షనిజాన్ని సినిమా తెరకెక్కించి ‘సీమ ఫాక్షనిజం’ అని పేరు పెట్టడం కన్నా దుర్మార్గమైన పని మరొకటి లేదు.

సీమకే పరిమితమైన ఆనాటి గ్రామకక్షల గురించే చెప్పుకోవలసి వస్తే వాటిలో స్వార్థం, ధనదాహం మచ్చుకు కూడా కనిపించవు. కేవలం తమ మాట చెల్లుబాటు కావాలనే భూస్వామ్య భావజాలం నుండి వచ్చిన ఆధిపత్య ధోరణి మాత్రమే కనిపించేది. సీమ గ్రామకక్షల అగ్నిలో పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాలు కూడా ఆర్థికంగా మాడిమసైన దృష్టాంతాలు సీమ జిల్లాల్లో కోకొల్లలు. ధనదాహం ఈ కక్షల్లోనే లేదనేందుకు ఇదొక బృహత్తర తార్కాణం.

గ్రామ పార్టీలు ఒక చారిత్రక దశగా 1980ల నాటికే ముగింపుకొచ్చాయి. వాటి శకలాలు ఇంకా అక్కడక్కడా ఉన్నమాట వాస్తవమే అయినా అవి కూడా పూర్తిగా సమసిపోయే దిశలో ఉన్నాయి. ఇప్పటి పొలిటికల్ ఫాక్షనిజంతో మమేకమై వికృతరూపంలో అప్పుడప్పుడూ ఎక్కడో ఒక చోట బయటపడుతున్నాయి.

ముగిసిన ‘సీమపార్టీల’ చరిత్ర, వాటి మూలాలపై ఏ మాత్రం అవగాహన లేని సినీ రచయితలూ, దర్శకులూ తమ పైత్యంతో సీమ సంస్కృతికి వికృతరూపం చెక్కుతున్నారు. వ్యాపారలాభాల కోసం ఒక హింసాత్మక సినిమా కథకు సీమ ప్రాంతాల, సీమ మనుషుల పేర్లు పెట్టి సినీ పండితులు ఒక మోనోటెర్రరిజం సృష్టిస్తున్నారు. ఒక హీరో, ఒక దర్శకుడు, ఒక నిర్మాణ సంస్థ ఎప్పుడైతే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని వారిపై తమ ప్రభావాన్ని చూపగలుగుతారో, అటువంటి హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు సామాజిక బాధ్యత తప్పనిసరి. చిత్రసీమలో బాధ్యత కలిగివుండాల్సిన అటువంటి అగ్ర నిర్మాతలూ, అగ్ర హీరోలే ఇటువంటి వక్రీకరణలు తీయడం దురదృష్టకరం.

వక్రీకరణలు సాగుతున్నదిలా…

ఈ క్రూర సన్నివేశం, ఒకప్పుడు సీమలో ఉన్న గ్రామ కక్షల్లో కాదుగదా… నేడు అన్నిప్రాంతాల్లో విస్తరించి ఉన్న ‘పొలిటికల్ ఫ్యాక్షనిజం’లో కూడా ఎక్కడా కనిపించదు. ఈ జిల్లాల్లో 80వ దశకంకు ముందున్న ‘గ్రామపార్టీల’ సంస్కృతిలో ప్రత్యర్థి కుటుంబానికి చెందిన యువతిని పొరపాటున ఇవతలి పార్టీలోని యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, ఆ గ్రామంలో ఆ పెళ్ళి కారణంగా గ్రామ పార్టీయే సమసిపోయిన నైతిక-మానవతా విలువలు సాక్షాత్కరించిన సందర్భాలున్నాయి.

రాయలసీమ ఫ్యాక్షనిజం పేరుతో వచ్చిన కొన్ని పదుల చిత్రాల్లో రచయితల, దర్శకుల పైత్యం యధేచ్ఛగా స్వైరవిహారం చేస్తూనే ఉంది. అగ్రహీరోల చిత్రాలనే పరిశీలిస్తే…
‘సమరసింహారెడ్డి’ అనే సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కూతురు, మరో ఫ్యాక్షనిస్టును (హీరో బాలకృష్ణ) ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. (ఫ్యాక్షనిస్టు, ఫ్యాక్షనిజం అనే పదాలు రచయిత ఉద్దేశ్యంలోనివి కావు. అవి సినీపండితులు ఆపాదించినవి – యధాతథంగా వాడబడ్డాయి). ఈ పెళ్ళిని కూడా ఆ ఫ్యాక్షనిస్టు తండ్రే ప్రోత్సహిస్తాడు. తీరా పెళ్లి చేసుకొని వచ్చాక – ‘ఇన్నాళ్ళూ ఆ సమరసింహారెడ్డిపై పగ సాధించలేక కుమిలిపోతున్నాను. ఇప్పుడు వాడి పెళ్ళామైన నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా.’ అంటూ కన్న కూతురిని పొడిచి చంపుతాడు.

ఈ క్రూర సన్నివేశం, ఒకప్పుడు సీమలో ఉన్న గ్రామ కక్షల్లో కాదుగదా… నేడు అన్నిప్రాంతాల్లో విస్తరించి ఉన్న ‘పొలిటికల్ ఫ్యాక్షనిజం’లో కూడా ఎక్కడా కనిపించదు. ఈ జిల్లాల్లో 80వ దశకంకు ముందున్న ‘గ్రామపార్టీల’ సంస్కృతిలో ప్రత్యర్థి కుటుంబానికి చెందిన యువతిని పొరపాటున ఇవతలి పార్టీలోని యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, ఆ గ్రామంలో ఆ పెళ్ళి కారణంగా గ్రామ పార్టీయే సమసిపోయిన నైతిక-మానవతా విలువలు సాక్షాత్కరించిన సందర్భాలున్నాయి.

మరో అగ్రహీరో నటించిన ‘ఇంద్ర’ సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కొడుకును ప్రత్యర్థి ఫ్యాక్షనిస్టు (హీరో చిరంజీవి) ఒక లారీ ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఇది తెలిసిన ఆ బాలుని తండ్రి (ఫ్యాక్షనిస్టు) – ‘ప్రత్యర్థి ప్రాణభిక్ష పెట్టిన కొడుకు నాకెందుకురా!’ అంటూ కన్న కొడుకును కత్తితో తల నరికి చంపుతాడు. కన్నకొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి ఏడుస్తూ వుంటే ‘ఎందుకే ఏడుస్తావు? ఇలాంటి కొడుకులను నూరుమందిని పుట్టించే సత్తా నాకుంది.’ అని, ఆ క్రూర విషాద సన్నివేశంలో జుగుప్సాకరమైన మాట అంటాడు.

ఈ క్రూరాత్మకమైన సన్నివేశం కూడా సీమ పార్టీల్లోనే కాదు, ఇప్పటి ఆంధ్రదేశంలో వున్న పొలిటికల్ ఫ్యాక్షనిజంలో కూడా ఎక్కడా కనిపించదు. సీమ గ్రామపార్టీల్లో ఆడవాళ్ళ జోలికి, చిన్నపిల్లల జోలికి ప్రత్యర్థులే వెళ్ళరు. అవతలివారు జైళ్ళపాలై ఉన్నప్పుడు కూడా గ్రామంలో ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలే వ్యవసాయ పనులను నిరాటంకంగా చేసుకునే జీవనపోరాటానికి ఏ ‘పార్టీదారు’లూ అడ్డుతగలరు. అటువంటిది, కేవలం ప్రత్యర్థి రక్షించాడనే ఒక దుర్మార్గ కారణంతో కన్న కొడుకులను చంపుకునే హీనాతిహీనమైన సంస్కృతిని సృష్టించడమే ఒక పైత్యం కాగా, దాన్నిసీమవాసులకు ముడిపెట్టడం పూర్తిగా భావదారిద్ర్యమే.

మరో అగ్రదర్శకుడు నిర్మించిన ‘అంతఃపురం’ సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కొడుకు ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. ఫ్యాక్షన్స్‌తో సంబంధం లేని ప్రశాంత జీవితం నుండి వచ్చిన ఆ హతుని భార్య తన రెండేళ్ల కుమారుని తీసుకుని -‘ఈ గ్రామం విడిచి వెళ్లిపోతా’ నంటుంది. దీనికి ఆ ఫ్యాక్షనిస్టు ససేమిరా ఒప్పుకోడు. మనవణ్ణి గుంజుకొని, కోడలును బంధించి చిత్రహింస పెడతాడు. ఆమె తప్పించుకొని కొడుకుని తీసుకుని పారిపోతూంటే, తన మందీ మార్బలాన్ని పురమాయించి ఆమెను పట్టుకుంటాడు. నడి బజారులో అందరూ చూస్తుండగా తన కోడల్ని జుట్టు పట్టుకుని ఈడ్చి, కాళ్లతో తన్ని -‘కావాలంటే నువ్వు పో… మా మనవణ్ణి ఇవ్వను. వీడు పెరిగి పెద్దవాడై వీడి తండ్రిని చంపిన వాళ్లని చంపాలి’ అంటాడు. నా బిడ్డను నాకివ్వమని ఆ కోడలు ఆక్రోశిస్తే -‘నీ కొడుకా?… నాకొడుకు నీ పక్కలో పడుకుంటే పుట్టినాడు ఈ బిడ్డ’ అంటాడా ఫ్యాక్షనిస్టు.

సినిమా రచయితల అవగాహన లేమికి, మితిమీరిన పైత్యానికి ఈ దృశ్యం, ఈ సంభాషణలు మరో ఉదాహరణ. సీమ గ్రామ పార్టీల్లో, పార్టీ నాయకుల్లో ప్రధానంగా వుండేది భూస్వామ్య భావజాలం. అటువంటి భావజాలం వున్న గ్రామ పార్టీ నాయకుల్లో తమ కుటుంబ సమస్యలను నడిబజారులో పెట్టి, ఇంటి కోడలును కొట్టే మామలుండడం కలికంలోకి కూడా కానరాదు.

మరో అగ్రహీరో నటించిన ‘ప్రేమించుకుందాం..రా!’ సినిమాలో ఆ గ్రామ ఫ్యాక్షన్‌కు సంబంధంలేని నగర యువకుడు (హీరో వెంకటేశ్) ఫ్యాక్షనిస్టు కూతురును ప్రేమించి తీసుకుపోతాడు. ఆ ఫ్యాక్షనిస్టు అప్పటినుండి ఆ కుటుంబంపై పడి నానా బీభత్సం సృష్టిస్తాడు. ఆ యువకుని తల్లిదండ్రులు స్వయంగా ఆ ఫ్యాక్షనిస్టు దగ్గరకు వెళ్లి -‘వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దమనసు చేసుకొని పెళ్లి చేయండి’ అని అర్థిస్తే, ‘రాయలసీమలో ప్రేమలేందిరా! ఇక్కడ ప్రేమలూ గీమలూ లేవు. పగ ప్రతీకారాలే’ అంటూ వాళ్లిద్దరినీ తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు.

‘రాయలసీమలో ప్రేమలేందిరా!’ – అనే మాట సీమ ప్రాంత గ్రామనాయకుని నోట చెప్పించడమే రచయిత అవగాహనలేమికి పరాకాష్ట. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో బతుకుపోరాటం సాగుతున్నదే మానవసంబంధాలపై ఆధారపడి. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారిన దుస్సంస్కృతి ఇప్పటికీ రాయలసీమలో పూర్తిగా అడుగిడనే లేదు. అలాంటి సీమ పేరు బెట్టి తీసిన ‘గ్రామ పార్టీ’ల నేపథ్యంలో ‘ఇక్కడ ప్రేమలూ గీమలూ లే’వని పలికించడం ఈ ప్రాంత విలువలను ఊచకోత కోయడమే.

విభిన్న ఫ్యాక్షన్ కథ పేరుతో వచ్చిన ‘యజ్ఞం’ సినిమా సైతం ఇందుకు మినహాయింపుకాదు. ఒక క్రూరుడైన(?) ధనవంతుని కూతురును, అతని దగ్గరే జీతగాడుగా పని చేస్తున్న హీరో ప్రేమించి, ఆమెను దక్కించుకునేందుకు పోరాడే ఒక సాధారణ సినిమా ప్రేమకథకు ‘రాయలసీమ’ ముసుగు తొడిగి మరిన్ని అపార్థాలను జనంలోకి ఇంజెక్ట్ చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల ఫ్యాక్షన్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ ఇలాంటి పైత్యాన్ని ఆపాదించుకున్నవే. ప్రస్తుతం సీమ జిల్లాల్లో ఎక్కడా కనిపించని క్రూరదృశ్యాలను తెరకెక్కించి సీమవాసులకే తెలియని ఒక విష సంస్కృతిని – ‘మన సంస్కృతి ఇదీ’ అని సీమవాసులే అపోహపడేంత బలంగా సాంస్కృతిక విధ్వంస సృష్టి జరుగుతోంది.

సాహిత్యంలో మూలాలను రికార్డు చేయకపోవడమే …!

రాయలసీమకే పరిమితమైన విలక్షణమైన గ్రామపార్టీల మూలాలను సృజించే రచనలు సీమరచయితల నుండి తొలినుండీ లేకపోవడమే, ఒక రకంగా ఇప్పటి వక్రీకరణలకు కారణ మనిపిస్తోంది. ఆంధ్రదేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆయా విలక్షణ జీవన విధానాలను రికార్డు చేసిన రచనలు ఆయా ప్రాంత రచయితల నుండి వెలువడ్డాయి. అయితే, ఆ కొరత రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి అనాదిగా పరిమితమైన కరువు, కక్షల మూలాలను విశదీకరించే రచనలు 80వ దశకం ప్రారంభం వరకూ దాదాపు లేవనే చెప్పవచ్చు. 80కి ముందు కరువును కొంతమంది సీమరచయితలు అక్కడక్కడా ఉటంకించినా, సమగ్రంగా మూలాల అన్వేషణలోకి వెళ్లలేదు. గ్రామపార్టీల అంశం విషయానికొస్తే అసలా అంశాన్నే ప్రాచీన సాహిత్యంలో సృజించిన దాఖలాలు లేవు. వెనుకబడిన ఈ ప్రాంతంలో ఆధునిక సాహితీరంగాల ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. ఆధునిక కథ, కవితవంటి ప్రక్రియలు వచ్చిన తరువాత కూడా ఈ ప్రాంత రచయితలు ఈ ప్రాంతానికే పరిమితమైన ‘విలక్షణ’ సమస్యలను రికార్డు చేయలేదు.

80వ దశకానికి ముందు సీమ నుండి వచ్చిన రచనలు అభివృద్ధి చెందిన ప్రాంతాల రచనల ప్రభావంతో ఎక్కువగా మధ్యతరగతి జీవన సమస్యలనే అధికశాతం తమ రచనల్లో ప్రతిబింబించాయి. కేతు విశ్వనాధరెడ్డి, వై.సి.వి. రెడ్డి వంటివారు ఒకటీ రెండు కథల్లో ఈ ‘గ్రామపార్టీ’లను సృజించినా, పూర్తిగా వాటిపైనే దృష్టి కేంద్రీకరించలేదు. గ్రామపార్టీలో స్వయంగా కూరుకుపోయిన సొదుం జయరాం లాంటి కథారచయిత ఈ గ్రామ పార్టీల మూలాలను తడుముతూ కథలు రాయకపోవడం తీరని కొరతే. పొలిటికల్ ఫ్యాక్షనిజంతో సంబంధాలుండి సీమ సంస్కృతిని బాగా అధ్యయనం చేసిన ఎం.వి.రమణారెడ్డి లాంటి రచయిత వీటి జోలికిపోలేదు. 80వ దశకం తరువాతనే సీమ సంస్కృతిపై కథలు వస్తున్నా, అవి కూడా ఎక్కువగా కరువును ప్రతిబింబిస్తున్నాయి. కానీ మరో కోణమైన గ్రామపార్టీలను అక్షరబద్ధం చేయడం లేదు. ఈ పరిణామం వల్లే సినీ పరిశ్రమలో నేడు సీమతో పరిచయం లేని సినీ రచయితలు, ఇక్కడ ఎప్పుడో సమసిపోయిన గ్రామ పార్టీల నేపథ్యాలను తెరకెక్కించడంలో తమ పైత్యాన్ని తమ ఇచ్ఛానుసారం వెళ్లగక్కుతున్నారు.

స్వానుభవం, అధ్యయనం ఉన్న రచయితలకే ఇక్కడి గ్రామ పార్టీల మూలాలను పట్టుకోవడం సాధ్యం. అటువంటిది, ఈ సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…!

************************************************************************
పాలగిరి విశ్వప్రసాద్
వ్యాసకర్త గురించి: విశ్వప్రసాద్ ఒక ప్రముఖ కథారచయిత. ఆయన రాసిన కథల సంపుటి “చుక్కపొడిచింది“.
“నాకు వ్యవసాయం ఇష్టం. రాజకీయం ఇష్టం. నాకు అమాసి వచ్చినప్పటి నుంచీ నా జీవితం ఆ రకంగానే మొదలు పెట్టినా. కానీ, కొనసాగలేకపోయినా. తన చుట్టూ ఉన్నవాళ్ళ (సమాజం) కోసం పాటుపడాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన పాత తరం వారి భావాలు నావి… అవి రాజకీయంలో ఎదగనీయలేదు. పైగా ఆర్థికంగా రోజురోజుకూ కృశింపజేసినాయి. కడపజిల్లా గ్రామాల్లో ‘రాజకీయ’మంటే ‘గ్రామాధిపత్యమే’నన్న నిర్వచనంగా మారిపోయింది. రాజకీయం ఎంచుకున్న నేను మా ఊర్లో గ్రామాధిపత్యం నిలబెట్టుకోవాలనుకునే వారికి అనివార్యంగా ప్రత్యర్థిగా మారినా. గ్రామకక్షల్లో ప్రత్యక్షపాత్రా తప్పలేదు.” అనే పాలగిరి విశ్వప్రసాద్ పార్టీలు వదిలించుకుని కడపకు వచ్చి పాత్రికేయుడుగా పనిచేస్తున్నాడు.

Posted in వ్యాసం | 13 Comments

తూర్పూ పడమరల కబుర్ల కబుర్లు

-సత్యసాయి
త్రివిక్రమ్ గారు నాకు ఫోను చేసి కొపా గారితో చాటింగు చేస్తే ఆ సంభాషణని పొద్దులో ప్రచురిస్తామనగానే ఏనుగెక్కినట్లైంది. కొద్దిగా సంకోచించినా- అవతలున్నది అతిరథుడు కదా- పొద్దు వార్షికోత్సవాలలో నేనూ భాగస్వామిని కాగల అవకాశం వదులుకో దలుచుకోలేదు. మా సంభాషణ 2 దఫాలుగా సాగినా మొదటిది కొపా గారికి నచ్చక పోవడం, ఆఫైలు నిండా ఆ ఆ ఆ ఆ మాత్రమే మిగలడంవల్లనూ మూడవ దఫా చాటింగ్ చేయాల్సి వచ్చింది. అందుకే అనుకున్నదానికన్నా ఆలస్యం అయింది. అదీకాక వారానికొకసారే మాఇద్దరికీ అవకాశం దొరికేది. ఒకవారం కుదరకపోతే (రెండు సార్లు నా ఇంటర్నెట్ మొరాయించింది) మళ్ళీ ఇంకోవారం ఎదురు చూపులే శరణ్యం. .

తెలుగులో అంతర్జాల మాధ్యమంలో కబుర్లు చెప్పుకోవడం ఆనందదాయకమే అయినా కొద్దిగా కష్టమే అని చెప్పాలి. కొత్త యాహూ మెస్సంజర్ లో తెలుగులో మన బ్లాగులే మాదిరే చాటింగు చేయచ్చు. కానీ ఆంగ్లటైపింగంత వేగంగా తెలుగులో చేయలేకపోవడం సాంకేతికపరమైన ఇబ్బంది. తప్పనిది. మొదటి దఫా కాస్త కష్టమైనా రాను రానూ – దగ్గీ దగ్గీ సులభంగా దగ్గగలిగనట్లు – చాటింగు వేగం పెరిగింది. అదీకాక, మొదటి సారి చాటింగు పూర్తయే సరికి మాఇద్దరి మధ్యా మంచి అవగాహన కూడా ఏర్పడింది.

ఏం మాట్లాడుకోవాలన్న విషయం పొద్దు పూర్తిగా మాఇద్దరికే వదిలేయడం ద్వారా బాధ్యత పెరిగింది. కొపాగారు సూచించినట్లు నా తూర్పు, ఆయన పడమర అనుభవాలను కలబోయడంతో ప్రారంభించి, అనేక విషయాలు మాట్లాడుకున్నాం. చివరకి సంగీతం మీదకి, అక్కడినుండి బ్లాగుల మీదకి మళ్ళిన మా సంభాషణని పొద్దు కల్పించిన అవకాశానికి నెనర్లు చెప్పడంతో ముగించలేక, ముగించలేక ముగించాం. ఒకందుకు పోస్తే ఒకందుకు తాగామన్నట్లుగా పొద్దు ఒకందుకు మాకీయవకాశమిస్తే, మామధ్య మంచి స్నేహమేర్పడందులకు మాకు పనికొచ్చింది.

ఇద్దరు బ్లాగర్ల మధ్య సంభాషణ వేరేవారికి ఏరకంగా పనికొస్తుందన్న సందేహం మొదట నాకు కలగక పోలేదు. ఇదే సందేహం విజ్ఞులకీ కలిగే అవకాశం ఉంది. కానీ, ఒకసారి పరికించి చూచిన మీదట మామధ్య దొర్లిన విషయాలు వ్యక్తిగత అనుభవ జన్యాలైనా ప్రాక్పశ్చిమ దేశాల మధ్యనున్న సారూప్య, వైవిధ్యాలను – అన్నిటినీ స్పృశించలేక పోయినప్పటికిన్నీ – మా సంభాషణ బయల్పరచిందని అర్ధమైంది. అన్నింటినీ మించి, కనీసం వేరే వ్యక్తులు ఏంమాట్లాడుకున్నారోనన్న ‘కుతూహలాన్ని‘ తీరుస్తుందని నమ్ముతున్నా. :)) మీరందరూ గమనించే ఉంటారు- చాటింగులో మన భావాలు మెదిలేంత వేగంగా మన వేళ్ళు అక్షరాలని పేర్చలేవు. అందుకని ప్రశ్న, జవాబు పక్కపక్కన ఉండవు. ఒక సినిమాలో తుత్తి సుబ్రహ్మణ్యం అనే హాస్యనటుడు ఎదుటివాళ్ళు వేసిన ప్రశ్నకి ఒక ప్రశ్నాకాలం ఆలస్యంగా సమాధానం చెప్తోంటాడు. దాంతో ప్రతీ ప్రశ్నకీ జవాబు సరిగ్గా జోడించకపోతే కొంపలు మునిగే సమాధానాలొస్తుంటాయి. ఇక్కడా అంతే. ఉదాహరణకి మామధ్య జరిగిన సంభాషణ తునక చూడండి (దుడ్డు అక్షరాలు నా వ్యాఖ్యలు).

kotta pali: నగరంలో కార్లు విపరీతంగా ఉంటాయా? ప్రతి వాళ్ళకీ కారుంటుందా?

satyasaik: నేను చాలా వాటిని చూసా (నేను చూసినవి కార్లు కాదు – ఈసమాధానం ముందడిగిన ప్రశ్నది)

kotta pali: బౌద్ధాన్ని జనం ఇంకా ఫాలో అవుతున్నారా? సంతోషం.

satyasaik: ప్రతీ ఇంటికీ రెండు, మూడు కూడా (ఏంటీ రెండు, మూడు బౌద్ధాలా?)

అందువల్ల, మా సంభాషణని కొద్దిగా అటూనిటూ అమర్చి, అక్కడక్కడ దొర్లిన ముద్రారాక్షసాలని సవరించి ప్రకటించాల్సి వచ్చింది. కొపా గారు కూడ ఈ కూర్పులని హర్షించారు.

సత్యసాయి కొవ్వలి

Posted in వ్యాసం | Tagged | Comments Off on తూర్పూ పడమరల కబుర్ల కబుర్లు

తూర్పూ పడమర – 3

కొవ్వలి సత్యసాయి
      ………………….. ……….                

బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి కబుర్లలో మూడో భాగం వినండి. రెండో భాగం ఇక్కడ, మొదటి భాగం ఇక్కడా ఉన్నాయి.

———

సత్యసాయి: ఒక అమెరికా ఆయన మా వివి మేగజైన్ లో వివి లో సీరియస్ నెస్ లేకపోవడాన్ని తిట్టాడు
కొత్తపాళీ: ఆయనకి ఏఁవి సీరియెస్నెస్ కావలిట?
సత్యసాయి: కొరియావాళ్ళు మ్యూజిక్ చాలా ఇష్టపడతారు. వివి లో ఎప్పుడూ పండగ వాతావరణమే

ఈ కబుర్లు చెప్పుకోవటంలో తమ అనుభవాలు, కొవ్వలి సత్యసాయి గారి మాటల్లో.. వచ్చే సోమవారం!

కొత్తపాళీ: కానీ అతనన్నది నిజమే. క్లాసుల్లోనూ, చదువుకి సంబంధించిన సందర్భాల్లోనూ వీళ్ళు చాలా గంభీరంగానే ఉంటారు. నేను అధ్యాపక సహాయకుడిగా కొన్ని అండర్‌గ్రాడ్యుయేట్ క్లాసులు చెప్పాను .. జోకేసినా జనాలు నవ్వేవాళ్ళు కాదు! ఎక్కడి మ్యూజిక్?
సత్యసాయి: ఎక్కువ పాప్. సాయంత్రం అయితే వాళ్ళ సాంప్రదాయ వాయిద్యాలతో వివిని మ్రోత మోగిస్తారు
కొత్తపాళీ: అలాగా? సంతోషం! ఇక్కడ ఏ పండగ చేసినా వారాంతాల్లో మాత్రమే.
సత్యసాయి: ఒకసారి టీవీలో హిందీపాట పాడారు
కొత్తపాళీ: నిజమా???
కొత్తపాళీ: పిల్ల, అంటే విద్యార్ధుల, సంగీత బృందాలు బాగానే ఉంటాయ్. వివి చుట్టుపక్కల బార్లలో క్లబ్బుల్లో ఈ పిల్ల బృందాలకి ఛాన్సిస్తూ ఉంటారు. ఇది కాక వివికి సంబంధించిన విద్యార్ధి సంఘాల పార్టీలు.
సత్యసాయి: వీళ్ళ పాతకాలం పాటలు రవీంద్ర సంగీతానికి దగ్గర పోలికలు కనిపిస్తాయి
కొత్తపాళీ: Interesting
సత్యసాయి: వీళ్ళ పాతపాటలు ఎక్కువ యుధ్ధం, విడిపోవడం- మెలాంకొలీ- నేపధ్యంలో ఉంటాయిట
కొత్తపాళీ: అవును. చైనీయులు కూడా అంతే.
కొత్తపాళీ: సంస్కృతికంగా చాలా వరకూ చైనా నించి దిగుమతి చేసుకున్నారేమో కదా? చైనీయ సాంప్రదాయ సంగీతం తొంభై శాతం మోహన రాగానికి విభిన్న రూపాలే.
సత్యసాయి: అన్నట్లు మా వివి లో చైనా వివి వాళ్ళు వచ్చి శాస్త్రీయ కచ్చేరీ ఇచ్చారు.
సత్యసాయి: అమ్మాయిలు లంగా జాకెట్ల తో వచ్చి మన హిందోళం గట్రా రాగచ్ఛాయలతో భలే వీనుల విందు (కనులకు కూడా) చేసారు
కొత్తపాళీ: వేషాలు కూడ వేసుకున్నారా? ఆపెరా లాగా?
సత్యసాయి: వేషాలు కాదు వాళ్ళ సాంప్రదాయ దుస్తులట
కొత్తపాళీ: అలాగా? బాగుంది.
కొత్తపాళీ: నేను ఏనార్బరు వచ్చాక విదేశీ (ఎక్కువ జపనీయ) ప్రదర్శనలు బాగా చూశాను. అన్నట్టు నా మొదటి సంవత్సరంలో ఒక తైవానీయుడి సిద్ధాంత గ్రంధం ఇంగ్లీషు దిద్దిపెట్టాను. కృతజ్ఞతగా అతను చైనా టవును (ఫిలడెల్ఫియాలో బుల్లి చైనా టవును ఉండేది) దింసం మధ్యాన్న భోజనం తినిపించాడు. ఏం తిన్నానో గుర్తు లేదుగానీ మొత్తానికి చాలా వింత రుచులు రుచి చూసినట్టు గుర్తు.
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా నగర ఆర్కెస్ట్రా ప్రపంచ ప్రఖ్యాతి గన్నది.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: హాలు కూడా బహు పురాతనమైనది, అద్భుతమైన ధ్వని నిర్మాణము (acoustics). కొంతమంది మహానుభావుల సంగీతం వినే అవకాశం దక్కింది అక్కడ.
సత్యసాయి: ఆఁహాఁ
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా నగరం మధ్యలో ఫెయిర్‌మౌంట్ పార్క్ అని ఒక పేద్ధ పార్కు. ప్రపంచంలో ఒక నగరం మధ్యలో అంత పెద్ద పార్కు ఇదేనట. పైన కప్పు మాత్రం ఉండి, చుట్టూ గోడలు లేని ఆడిటోరియం ఒకటి ఆ పార్కులో ఉంది. దీన్ని మాన్ సెంటర్ అంటారు. ఆర్కెస్ట్రా వాళ్ళు వేసవిలో ఈ మాన్ సెంటర్లో వారానికి రెండు ప్రోగ్రాములు వాయిస్తారు.
సత్యసాయి: అలాగా
కొత్తపాళీ: వచ్చే వారం ప్రోగ్రాములకి ఈ సోమవారం పేపర్లో ప్రకటన పడేది. ఆ ప్రకటన కత్తిరించి పంపిస్తే, గేలరీలో రెండు టిక్కెట్లు ఉచితంగా ఇస్తారు. అలా చాలా కచేరీలు చూశాను.
సత్యసాయి: ఇదేదో బాగుందే
కొత్తపాళీ: వివి విద్యార్ధులకి సినిమాలకి కూడా కొంత తగ్గింపు ఉండేది. ఐడి చూపిస్తే చాలు. వివి వదిలిపెట్టక, ఉద్యోగం వచ్చాక, పూర్తి ఖరీదు పెట్టి సినిమా టిక్కెట్లు కొనడం చాలా కష్టంగా ఉండేది.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: వివి వదిలిపెట్టాక వివి వదిలిపెట్టాక
సత్యసాయి: టికెట్ ధరెంత?
కొత్తపాళీ: అప్పట్లో మామూలు సినిమా ధర ఐదు ఆరు డాలర్లు ఉండేది.
సత్యసాయి: ఖరీదే!
కొత్తపాళీ: ఇప్పుడూ ఎందిన్నర నించీ పది దాకా ఉంది. మీకు తెలుసా, ఇక్కడ హాళ్ళలో ఒకటే క్లాసు, ఒకటే ధర.
కొత్తపాళీ: అవును.
కొత్తపాళీ: ఈలోపల మీరేవన్నా చెప్పండి. నేను కొంచెం నమలడానికి ఏమన్నా తెచ్చుకుంటా.
సత్యసాయి: హతవిధీ- నేల టికెట్ కొని కుర్చీకెగబాకే ఛాన్సు లేదా
సత్యసాయి: మన దేశంలో ప్రాంత భేదాల్లేకుండా లేకి తనం అలవాటు చేసుకున్నామనుకుంటా
కొత్తపాళీ:
సత్యసాయి: కోయిన్ కి దారం కట్టిఅమెరికాలో పబ్లిక్ ఫోన్లనితెగ వాడారని విన్నా
కొత్తపాళీ: ఆఁ కరక్టే. సమయానికి గుర్తు చేశారు.
సత్యసాయి: మా అమ్మ ఫారిన్ రిటర్న్ డు
కొత్తపాళీ: Oh, really?
సత్యసాయి: మా తమ్ముడి దగ్గర ఉండే ఆయా (గుజరాతీ) ఫేమిలీ గురించి తెగ చెప్పేది
కొత్తపాళీ: భారతానికి తక్కువ ఖరీదులో పిలవటానికి కాలింగ్ కార్డులుండేవి.
కొత్తపాళీ: ఎవడో మధ్యవర్తి గాడు, ఎవరివో నెంబర్లని మాలాంటి వాళ్ళకి సగం ధరకి అమ్మేసేవాడు.
కొత్తపాళీ: అది మనం ఏ నంబర్నించి పిలుస్తున్నామో రికార్డు చేసేది. అందుకని మన ఇంట్లోంచి పిలవకుండా వీధి ఫోన్లనించి చేసేవాళ్ళు.
కొత్తపాళీ: అలాగే .. ఫిలడెల్ఫియాలో లోకల్ రైళ్ళుంటాయి. Automatic turnstile దగ్గిర టోకెన్ వెయ్యాలి లోపలికి వెళ్ళేందుకు. జనాలు (మనవాళ్ళే కాదు) దాన్ని కూడా మోసం చెయ్యాలని చూసేవాళ్ళు.
సత్యసాయి: ప్రైవేట్ కాస్ట్, బెనిఫిట్కి పబ్లిక్ కాస్ట్ బెనిఫిట్కీ తేడా వల్ల ఇవే సమస్యలు
సత్యసాయి: క్రియేటివ్ జీనియస్లు: ((
కొత్తపాళీ: ఫిలడెల్ఫియాకి ఒక పది పదిహేను మైళ్ళ దూరంలో లాంగ్వుడ్ గార్డెన్సని ఉంటాయి. ఒకప్పుడు ఆ కుటుంబం వాళ్ళ ఎస్టేటు ఇది, ఇప్పుడు ట్రస్టు కింద పెట్టి పబ్లిక్ జనాల్ని చూడనిస్తున్నారు .. ఊరికే కాదు, టిక్కెట్టు మీదే. చాలా అద్భుతంగా ఉంటుంది. నన్ను చూడ్డానికి వేరే ఊళ్ళనించి వచ్చిన స్నేహితులందర్నీ వరసబెట్టి ఇక్కడికి తీసుకెళ్ళేవాణ్ణి. లేదంటే వాళ్ళ ఆసక్తిని బట్టి నలభై మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటిక్ సిటీ కేసినోలకి! ఒకసారి కాంపూరు సహాధ్యాయిలు ఇద్దరు వొచ్చారు. కేసినోకైతే నేను రాను మీరు పోయిరండి అన్నా. పోయి రాత్రంతా ఆడి తెల్లారి వచ్చారు. ఏవిరా, నష్టం ఎంత అన్నా.
సత్యసాయి: బట్టలున్నాయా
కొత్తపాళీ: ఒక మిలియన్ వంద డాలర్లు అన్నాడు.
సత్యసాయి: ఐమీన్ మిగిలాయా
కొత్తపాళీ: అదే చెబుతున్నా ..
కొత్తపాళీ: ఒక మిలియన్ వందేవిటి అన్నా.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: ఏవుందీ. ఒక మిలియనైనా గెలవాలనే సంకల్పంతో వెళ్ళాము. చెరొక యాభయ్యీ పోయినై. అన్నాడు
సత్యసాయి: ఆపర్ట్యూనిటీ కాస్ట్
కొత్తపాళీ: yup
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా చాలా చారిత్రాత్మక నగరం, అందమైన నగరం ఐనా, ఎందుకో సినిమాలెక్కువ తియ్యరిక్కడ. కొన్ని ప్రఖ్యాతి గాంచిన సినిమాలకి నేపథ్యం వహించింది. “మన” వాడు ఎం. నైట్ శ్యామలన్ సినిమాలన్నీ నగరంలోనో, నగర శివార్లలోనో జరుగుతుంటాయి.
సత్యసాయి: ఐసీ..
కొత్తపాళీ: టాం హాంక్స్ నటనకి గుర్తింపూ, ఎయిడ్స్ సమస్య మీదికి జనుల దృష్టీ తెచ్చిపెట్టిన సినిమా పేరే “ఫిలడెల్ఫియా” అనుకోండి. కండల యోధుడు సిల్విస్టర్ స్టెల్లోన్ నటించిన “రాకీ” వరుస సినిమాలు కూడా ఈ ఊళ్ళోనే జరుగుతాయి.
సత్యసాయి: ఐసీ
కొత్తపాళీ: కరణ్ జోహార్ ఘోరకృత్యం “కభి అల్విద నా కెహనా”లో క్లైమాక్సు సీను మా వివికి కూతవేటు దూరంలో ఉండే 30వవీధి రైల్వే స్టేషనులో జరుగుతుంది. అవీ ఫిలడెల్ఫియా విశేషాలు.
సత్యసాయి: రామాయణంలో పిడకల వేట. సిల్విస్టర్ స్టెల్లోన్ అనగానే నాకు శ్రీదేవి గుర్తొస్తుంది
కొత్తపాళీ: Huh?
సత్యసాయి: ఆకాలంలో ఆయనంటే ఇష్టమని ఏదో ఇంటర్వ్యూ లో చెప్పింది
కొత్తపాళీ: అలాగా?
సత్యసాయి: చివరికి ”bony” కపూర్ ని చేసుకుంది
కొత్తపాళీ: Now, that is “iron”y!!!
సత్యసాయి: కండలొదిలేసి
కొత్తపాళీ: మీరేవన్నా అడిగేదుంటే అడగండి.
సత్యసాయి: అన్నట్లు మీరు కొత్తపాళీ అని మీ బ్లాగుకి ఎందుకు పెట్టారంటారు.: పాళీయే కొత్తది ఇంకు పాతదే అనా 
కొత్తపాళీ: శ్రీమతి సలహా.
సత్యసాయి: కరణేషు…మంత్రీ. అంటే ఆప్షన్ లేకపోయిందా 
కొత్తపాళీ: అదీ నిజమే అనుకోండి. అనుల్లంఘనీయము గదా ఉత్తమార్ధాజ్ఞ.
కొత్తపాళీ: ఇంతకుముందు నా పేరుతో అంతర్జాలంలో పదేళ్ళ పైబడిన చరిత్ర ఉంది.
సత్యసాయి: కొత్తపాళీ పేరుతోనా?
కొత్తపాళీ: కాదు, నా సొంత పేరుతో.
సత్యసాయి: ఇది వార్తే
కొత్తపాళీ: వార్తేముంది, ఆ పూట ఇస్మాయిల్ (శ్రీకృష్ణదేవరాయలు) తన పరిశోధనతో బయటపెట్టాడుగా!
కొత్తపాళీ: బ్లాగు మొదలు పెట్టినప్పుడు .. ఈ కొత్త ప్రయత్నం ఇదివరకటి చరిత్రతో సంబంధం లేకుండా ఒక కొత్తదనంతో ఉండాలని అనిపించింది.
సత్యసాయి: అలాగా నాకు గుర్తు లేదు.. హతోస్మి
కొత్తపాళీ: ఏం పర్లేదు.
కొత్తపాళీ: మొదట Classical Telugu Poetry in Translation (http: //telpoettrans.blogspot.com) మొదలు పెట్టాను.
కొత్తపాళీ: అప్పుడు బ్లాగరి పేరు Observer Eccentric అని ఉండేది.
కొత్తపాళీ: ఉత్తమార్ధానికి నచ్చలేదు. ఇంతలో ఒక శ్రేయోభిలాషి కూడా చూసి, అంత చక్కటి బ్లాగు రాస్తూ, ఇదేం పేరు అన్నాడు. అప్పటికే మా ఆవిడ కొ.పా.కి లాబీ చేస్తూండింది. తాపీ ధర్మారావు గారి పుస్తకం ఉంది ఈ పేరుతో.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఆయన తన దృక్పథం ఎలామారుతూ వచ్చిందో, అప్పణ్ణించీ ఆయన రచన కొత్తపాళీ ఎలాగయ్యిందో అని రాసిన పీఠిక నాకు చాలా నచ్చింది. నాక్కూడా వర్తిస్తుందని అనిపించింది. అలా ఖాయం చేశాను. తెలుగు బ్లాగ్గుంపులో ఎప్పుడో ఒకసారి సీబీరావుగారి ప్రశ్నలకి సమాధానంగా ఇదంతా చెప్పాను. పాతపద్యాల అనువాదమే కాక నేను రాయదల్చుకున్న విషయాలు వేరేవి కూడా ఉన్నాయి అనుకుని అప్పుడు కొత్తపాళీ, విన్నవీకన్నవీ ప్రారంభించాను.
సత్యసాయి: ఇప్పుడు బ్లాగర్లు చాలామందయ్యారు – మంచి ట్రెండ్
కొత్తపాళీ: అవును. కానీ జనాల మెప్పుకోసమే కాక బ్లాగర్లు కొంత నిజాయితీతో రాయాలని నా కోరిక. అలాగని ప్రతిదీ హృదయభాను టపా కానక్కర్లేదు. ఈ మధ్య విరివిగా రాస్తున్న వారిలో విశాఖ తీరాన, తెలుగు “వాడి”ని నిశితంగా రాస్తున్నారు.
సత్యసాయి: అవును మెప్పుకోసం కాక మనకోసం మనం వ్రాసుకోవడమే ఉత్తమ పద్ధతి
కొత్తపాళీ: కొత్తగా వస్తున్న మిగతావన్నీ కొంత వినోదాన్ని కలిగిస్తున్నా .. ఒక వ్యక్తిగా ఒక రచయితగా వారి అంతరార్ధమేవిటో, వారి సొంత ఆలోచనేవిటో వ్యక్తం కావట్లేదని నా వేదన. ఆ నిజాయితీ లోనించే సామాజిక ప్రయోజనమూ నెరవేరుతుందని నాకెందుకో వెర్రి నమ్మిక.
సత్యసాయి: అవును
సత్యసాయి: తెలుగుకి అంతర్జాలంలో వచ్చిన ప్రాభవానికి కృషిచేస్తున్నచేసిన వారెందరో మహానుభావులు
కొత్తపాళీ: అవును, చావా కిరణ్, వీవెన్ వంటి వారి కృషి మరువలేనిది.
సత్యసాయి: చాలా సార్లు మనం ఒక్కళ్ళం సరిగా ఉంటే మాత్రం లాభమేమిటి అని మా అమ్మాయి ప్రశ్నిస్తుంది- కనీసం మనవంతు చెత్త తగ్గుతుందని నా భావన
కొత్తపాళీ: ఇవ్వాళ్ళేవిటో కబుర్లలో పడి అలసట కూడా తెలీలేదు. ఇక్కడ పన్నెండుపావు దాటింది. మనం ఇంకో 15 .. 30 నిల్లో ముగిద్దామా?
సత్యసాయి: అలాగే.. ఈవేళకి మనకి చాటింగ్ పద్దతి అబ్బినట్లుంది-
కొత్తపాళీ: అంతే కాదు, కిరణ్ ని చూసి నేనూ బ్లాగు రాయాలనే స్ఫూర్తి పొందినట్టు, మనల్ని చూసి ఇంకొకరు స్ఫూర్తి పొందొచ్చు.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఇందాక మిమల్ని అడిగాను, మీరింకేవన్నా అడగదల్చుకున్నారా అని.
సత్యసాయి: అడగాను కాబట్టే ఇన్ని విషయాలొచ్చాయికదా
సత్యసాయి: బయటికి
కొత్తపాళీ: అలాగే.
కొత్తపాళీ: నాదొక ప్రశ్న. మీ బ్లాగులో వినిపిస్తున్న నాటకురింజి గురించి చెప్పండి. తెలుగు వారికి ఎంత సేపూ మోహనం, హిందోళం లేకఫొతే ఆనందభైరవి, మధ్యమావతి. ఒక సారెప్పుడో చెవులకి హెడ్ ఫోన్లు పెట్టుకుని మీ బ్లాగు తెరిస్తే నాటకురింజి వయొలిన్ వినబడింది. ఎల్. సుబ్రమణ్యం వాయించిందనుకుంటా. దాని గురించి అప్పటి మీ కొత్త టపాలో వ్యాఖ్య కూడ పెట్టాను.
సత్యసాయి: అదా. అప్పుడు ఒకసారి పెట్టా
కొత్తపాళీ: నాకది బాగా గుర్తుండి పోయింది.
సత్యసాయి: అప్పుడప్పుడు మారుస్తూండాలని అనుకుంటూ నే బద్ధకించా
కొత్తపాళీ: భరతనాట్యంలో ఒక తమిళ వర్ణం ఉంది నటరాజు వైభవాన్ని వర్ణిస్తూ .. చాలా MAJESTIC గ ఉంటుంది. .
కొత్తపాళీ: నా దగ్గిరున్న సంగీతమంతా, చాలా భాగం కేసెట్ల రూపంలో ఉంది. మెల్లగా డిజిటైజ్ చెయ్యాలి
సత్యసాయి: నాకూ అదే ప్రోజెక్ట్ కొన్నేళ్ళుగా ఉంది
కొత్తపాళీ: అవును. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి కొంచెం sensitive గా ఫీలవుతున్నా. అలాగా? మీ ఫేవరెట్లెవరు? నాకీ మధ్య కాలంలో సంజయ్ అంటే బాగా ఇష్టం.
సత్యసాయి: మహారాజపురం సంతానం. For all seasons and times.
కొత్తపాళీ: పాత కాలపు వాళ్ళు శెమ్మంగూడి, ఎండీ రామనాథన్, కేవీ నారాయణస్వామి.
కొత్తపాళీ: సంతానం అంటే 1980ల్లో గొప్ప పిచ్చిగా ఉండేది. ఆయన పాడిన నను పాలింపా కానీ, మోహన రామా కానీ విన్నారా? మోహన రాగం ఆయన సొంతం!!
సత్యసాయి: యే.. (yes in korean)
కొత్తపాళీ: ఆ తరవాత ఎండీఆర్ పరిచయమయ్యి ఆ క్రేజు తగ్గింది. నాకొక లక్షణముంది .. జబ్బో వరమో తెలీదు.
సత్యసాయి: ఈమధ్యకాలంలో నిత్యశ్రీమహదేవన్ – ఆడవాళ్ళలో
కొత్తపాళీ: Really? You find her good?
కొత్తపాళీ: perhaps I should give her another try!
సత్యసాయి: she is the role model for my daughter
కొత్తపాళీ: kool!
సత్యసాయి: మీవరం ఏమిటో
కొత్తపాళీ: నేను బయటికి పాడలేను కానీ తరచుగా విని ఉన్న సంగీతం ఒక్కొక్క సారి బుర్రలోనే స్టీరియో మోగుతున్నట్టు క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది.
కొత్తపాళీ: Whole musical passages run through my head
కొత్తపాళీ: అలా ఒక సారి నా లాబు నించి డిపార్టుమెంటు వేఫుకి నడుస్తున్నాను వీధిలో.
కొత్తపాళీ: మదిలో ఎండీఆర్ పాడిన శహన “గిరిపై నెలకొన్న రాముని” మెదుల్తోంది. అనుపల్లవి అలా పైకెగిసిపోతుంది చూడండి ..”నిలబడి విసరుచు ..” అన్న దగ్గిర. అంతే ఒకటే కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా. నిలబడలేక వీధిపక్కనున్న సిమెంటు బెంచీ మీద కూచుండి పోయాను కాసేపు. దు: ఖం కాదు.
సత్యసాయి: ఆర్ద్రత?
సత్యసాయి: మీ వరం బెటర్ – నేనైతే ప్రదేశస్పృహ లేకుండా పాడుతూనే ఉంటా-విజిల్ కూడా- ఆఫీసని కూడా లేకుండా
సత్యసాయి: ఇంక మనం ముగించే సమయమిదే- ఏమైనా అడగాల్సినవి ఉన్నాయా
కొత్తపాళీ: hmm.. not much
సత్యసాయి: ముగించాలని లేకపోయినా ముగించాల్సి రావడం కొద్దిగా కష్టమే
కొత్తపాళీ: yup
సత్యసాయి: యే… త్రివిక్రముడికి చెందుతుందీ క్రెడిటంతా
కొత్తపాళీ: అవును. అయన పుణ్యమూ, పొద్దు పుణ్యమా అని మనం మంచి స్నేహితులమయ్యాము.
సత్యసాయి: అవును..
కొత్తపాళీ: ప్రస్తుతానికి ముగిస్తా.
సత్యసాయి: శుభరాత్రి (మీకు)
కొత్తపాళీ: మీకు bon journo (Italian)

సమాప్తం.

Posted in వ్యాసం | Tagged | 6 Comments

తూర్పూ పడమర – 2

కొవ్వలి సత్యసాయి
      ………………….. ……….                

బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి కబుర్లలో రెండో భాగం వినండి. మొదటి భాగం ఇక్కడ ఉంది.

———

సత్యసాయి: సంగీత, సాహిత్య, నాట్యాది రంగాల్లో మీకు అభిరుచి ఎప్పుడు, ఎలా కలిగింది
సత్యసాయి: అమెరికాలో ఇన్నాళ్ళున్నాకా మన దేశం మీద దాని భవిష్యత్తు మీదా ఎలాంటి అభిప్రాయాలూ, ఆశలూ ఉన్నాయి?
సత్యసాయి: మీ అభిమాన రచయిత(త్రి) ఎవరు?, ఎందుకు?
కొత్తపాళీ: First one is simple to answer. Second one is a lot more complicated, so I’ll pass for now. Third – there is no one like that. I like several writers for different reasons, but no single all-time favourite.
కొత్తపాళీ: మా నాన్నగారు తమిళులు. మా అమ్మ తెలుగు. వాళ్ళ పెళ్ళై విజయవాడలో సెటిలయారు ..అప్పుడు ఒకటో రెండో సంగీత సభలుండేవి.
సత్యసాయి: ఇంటరెస్టింగ్
కొత్తపాళీ: అలా మా నాన్నగారి నుంచి మా అమ్మకి అంటింది సంగీతంలో ఆసక్తి. మేమంతా పుట్టి కుటుంబం పెరిగి మా చదువులూ గోలా .. దీంట్లో వీళ్ళు కచ్చేరీలు మానేశారు. మా అప్ప (నాన్నగారు) ఎప్పుడన్నా రేడియోలో పెట్టినా మేం గోల చేసి జనరంజనికి మార్చేసేవాళ్ళం. ఆయనకైనా, సంగీతం లేకపోతే పని జరగదన్న లాంటి మనిషి కాదు, ఏదో కొంత అభిమానం అంతే.
సత్యసాయి: ఉఁ
కొత్తపాళీ: నాకు సుమారు పదేళ్ళప్పుడు మా అప్ప చాలా అకస్మాత్తుగా పోయారు. అప్పటికే ఒక అక్కా, అన్నయ్యా ఇంజనీరింగ్ కాలేజీలకి హాస్టళ్ళకి వెళ్ళారు.
సత్యసాయి: అయ్యో
కొత్తపాళీ: ఇంకో రెండేళ్ళల్లో ఇంకో అక్కకీ పెళ్ళై అత్తారింటికి వెళ్ళింది. మా అమ్మా నేనూ మిగిలాం. నాకు సుమారు పదమూడేళ్ళప్పుడు మా అమ్మ ఒక చిన్న గ్రామఫోన్ కొన్నది. అప్పుడే పెద్ద భోషాణం లాంటి డిజైను పోయి బుల్లి బ్రీఫ్ కేసు లాంటివి వచ్చాయి. మా అమ్మ తన మిగతా బాధ్యతలన్నిటితోనూ .. తన నెలసరి బడ్జెటులో ఒక రెండు రికార్డులకి స్థానం కేటాయించి క్రమం తప్పకుండా కొనేది. మొదట బాలమురళీ పాడిన రామదాసు కీర్తనలు, ఎమ్మెస్ భజగోవిందం ..ఇత్యాది,
సత్యసాయి: మెచ్చుకోవాలి
కొత్తపాళీ: ఇలా మొదలైంది. ఇదిలా ఉండగా .. ఒక్క పెట్టున విజయవాడలో సంగీత సభల ఉధృతం పెరిగింది. సభ్యత్వ రుసుము హాస్యాస్పదం. గొప్ప గొప్ప విద్వాంసుల్ని తెచ్చేవాళ్ళు. హాళ్ళన్నీ ఖాళీగా ఉండి దారిన పోయే వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చి కూర్చో పెట్టేవాళ్ళు. మరొక పక్క సంగీత కళాశాలలో నేదునూరి గారు ప్రిన్సిపాలుగా వచ్చారు. నేను 82లో కాలేజికి వెళ్ళే లోపలే అప్పటి స్టార్లందరినీ నేరుగా విన్నాను.

ఈ కబుర్లు చెప్పుకోవటంలో తమ అనుభవాలు, కొవ్వలి సత్యసాయి గారి మాటల్లో.. వచ్చేవారం!

సత్యసాయి: సంగీత సాహిత్యాలకి విజయవాడ ఆకాశవాణి చాలా సేవ చేసింది
కొత్తపాళీ: అప్పుడప్పుడూ రేడియో సంగీత సమ్మేళన్ కచేరీలు కూడ జరిగేవి.
కొత్తపాళీ: సరే ఇంక రేడియోలో కచేరీలకి చెప్పక్కర్లేదు.
సత్యసాయి: ఉఁ
కొత్తపాళీ: ఈ సంగీతాస్వాదన ప్రస్థానంలో నేనూ మా అమ్మా తోటి ప్రయాణికులం. రాగాలు గుర్తు పట్టడం, ఒక రాగానికి అనేక కృతుల్ని ఉదహరించడం .. ఇవన్నీ ఒక ఆటగా ఉండేవి మాకు.
కొత్తపాళీ: సంగీతాన్ని విని ఆనందించడం అనే భిక్ష పెట్టినందుకు మా అమ్మకి ఎప్పటికీ చేతులెత్తి నమస్కరిస్తుంటాను నేను.
కొత్తపాళీ: వైనల్ రికార్డుల తయారీ ఆగిపోయే సమయానికి ఆవిడ నాలుగొందల పైన కర్ణాటక సంగీతం, ఇతరత్రా రెండొందల రికార్డులు సేకరించింది.
సత్యసాయి: గ్రేట్
కొత్తపాళీ: తాను కొంత ఆర్ధికంగా నిలదొక్కుకున్నాక, కొన్ని సభలకి బాగా ఆర్ధికంగా సహాయం చేసింది. సంగీత కళాశాలలో మృదంగానికి ప్రైజు లేదని ఒక వార్షిక బహుమతి ఏర్పాటు చేసింది.
సత్యసాయి: మెచ్చుకోతగ్గ విషయం
సత్యసాయి: మా స్వగ్రామం తణుకులో ఆంజనేయస్వామి గుళ్ళో హరికధలు, బుర్రకధలు, కచ్చేరీలు ప్రతి యేటా జరిగేవి. మా అమ్మా నాన్న మమ్మల్ని తీసుకు పోయే వారు
కొత్తపాళీ: బలే గుర్తు చేశారు. ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథలు కూడా.
కొత్తపాళీ: నాట్యం కూడ అప్పుడు చాలానే చూశాను కానీ, ఏమీ అర్ధం కాలే .. ఆసక్తీ అంతంత మాత్రమే.
కొత్తపాళీ: నేర్చుకోవటం 1997లో మొదలైనాకే, దాని మీద అభిరుచీ, మెళకువలూ నెమ్మదిగా పెంపొందాయి.
కొత్తపాళీ: అవును, మనకి ఆసక్తి ఐన వాటిల్ని పిల్లలకి కూడా పరిచయం చెయ్యాలి.
సత్యసాయి: డైయింగ్ ఆర్ట్స్
కొత్తపాళీ: హరికథలు మళ్ళీ కొంత రెవైవ్ అవుతున్నట్లుంది?
సత్యసాయి: అన్నట్లు ముగించే ముందు ఒక విషయంచెప్పాలి.
కొత్తపాళీ: చెప్పండి.
సత్యసాయి: ఇందాకా పండా అనే ఆయన కలిసాడన్నా కదా.
కొత్తపాళీ: గుర్తుంది
సత్యసాయి: ఆయనా, నేనూ Institute of Economic Growth, Delhi లో 1986-89 ప్రాంతంలో పని చేసాం. సుమారు 15 సంవత్సరాల తర్వాత దేశం కాని దేశంలో ఒకే చోట ఒకటిన్నర సంవత్సరాలు తిరిగి కలిసి పని చేయడం కాకతాళీయాల్లో కాకతాళీయం.
కొత్తపాళీ: నిజంగా వింతే. నేనూ ఆమధ్య ఒక పాత స్నేహితుడిని ఇలాగే కలిసా. 3-4 ఏళ్ళకే అనుకోండి.
సత్యసాయి: ఆయన అక్కడ ఒక సెమిష్టరు క్రితమే జేరడం వల్ల నాకు కొత్త చోటన్న భావనే కలగలేదు. నా ఆహార విహారాల సమస్య, కమ్యూనికేషన్ సమస్య తీరిపోయాయి. దైవం మానుష రూపేణా అన్న వాక్యమెంత నిజమో మరోసారి తెలియవచ్చింది.
కొత్తపాళీ: అవును. నిజమే.
సత్యసాయి: శుభరాత్రి.
కొత్తపాళీ: శుభదినం.

09-12-07
సత్యసాయి: శుభోదయం
కొత్తపాళీ: శుభోదయం
కొత్తపాళీ: మాకు చీకటి వాలేసింది .. అసలే అమవస నిశి! 
సత్యసాయి: క్రితం సారి మనం మీ సంగీతాది కళాభినివేశం గురించి మాట్లాడుకుంటూ ఆపేశాం
కొత్తపాళీ: అదా. దాన్లో కంటిన్యూ అవుదామా? దేశాల చర్చకి వద్దామా?
కొత్తపాళీ: ఎందుకంటే .. మొన్ననే రానారెతో కలిసి డాన్సు గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. మరీ జనాలకి కలాపోసన ఓవరుడోసై పోతుందేఁవోనని
సత్యసాయి: మీరు చాలా మంది బ్లాగర్లని కందాల్లోకీ, సీసాల్లోకీ దింపిన ఘనులు. అవంటే మీకు మక్కువ ఎలా కలిగిందో చెప్పాక దేశాలమీద పడదాం
కొత్తపాళీ: అలాగే
కొత్తపాళీ: పద్యాల మీద మక్కువ కలగటానికి కారణం మొదటగా మా తాతయ్య. బాగా పసితనంలో ఆయన దగ్గిర పెరిగాను. అక్షరాభ్యాసం చేయించి అప్పుడు మళ్ళీ మా అమ్మా అప్పాకి అప్పగించాడు. ఆయన తన చిన్నప్పుడు గురువుగారింటో ఉండి తెలుగు పంచ కావ్యాలూ చదువుకున్నారు.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: పోతన భాగవతం వంటి పురాణాలు మధ్యాన్నం పూట, రాత్రి భోజనాలయ్యాక పైకి చదివి అర్థం చెబుతుండేవారు. సుమతీ శతకం పద్యాలు, వేమన పద్యాలు కొన్ని ఆటలాడిస్తున్నట్టే వల్లె వేయించేవారు. అదీ మొదలు.
కొత్తపాళీ: ఇంక మా అమ్మా వాళ్ళింటికొచ్చాక మా చిన్నక్క, తనప్పుడూ 9 చదువుతుండేది, తనతో పాటు ఛందస్సు మూల సూత్రాలు నేర్పింది.
సత్యసాయి: రాకేశ్వర, ఊకదంపుడాది బ్లాగరులు ఆటవెలదులతో, కందాలతో – సీసాలు కాసేపు పక్కన పెట్టినట్లున్నారు- ఆడుకుంటూంటే నాకైతే తెగ అసూయ
కొత్తపాళీ: అసూయెందుకు, మీరూ మొదలెట్టండి. 
సత్యసాయి: సాటి మొగాడిగా అది సహజమనుకుంటా!?
సత్యసాయి: మా స్కూళ్ళలో తెలుగు ఒక తద్దినంగా ఉండేది- అందుకే వంటబట్టలేదు
కొత్తపాళీ: : P
కొత్తపాళీ: నేను ఆరు చదువుతుండగా మాకు గ్లామరు తార వంటి తెలుగు టీచరు వచ్చారు.
సత్యసాయి: ముదితల్ నేర్పగ రాని విద్య గలదె…. 
కొత్తపాళీ: ముదితల్ నేర్పిన నేర్వగ రాని విద్య గలదె అనండి
కొత్తపాళీ: అదీ కత.
సత్యసాయి: ఇక దేశాలకొస్తే…మనవాళ్ళు అమెరికా వెళ్ళాలనుకోవడం సహజం. వెనక్కి వద్దామనుకున్నా రాలేరని చరిత్ర చెబుతోంది. అక్కడి మాయ ఏంటంటారు?
కొత్తపాళీ: ఇదివరకు ఉన్నత విద్య ఆకర్షణ.
కొత్తపాళీ: అదీ కాక అమెరికా వెళ్ళటం అంటే అదేదో సాధించినట్టు అప్పటి విద్యా కేంద్రాల్లో (ఇప్పుడు సామాన్య సమాజంలో కూడా) ప్రబలి ఉన్న అపోహ ఒకటి.
సత్యసాయి: అది సరైనదే ననుకుంటా అప్పటి మనవిద్యా ”లయాల” పరిస్థితి చూస్తే
కొత్తపాళీ: ఈ మధ్యకాలంలో డబ్బు ఆకర్షణ. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వసతులు డబ్బూ ఉన్నా, అమెరికాలో నానా జాతుల్ని అంగీకరించినట్టుగా ఇంకే దేశంలోనూ అంగీకరించరనేది ఒక వాస్తవం.
సత్యసాయి: ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నారా?
కొత్తపాళీ: ఓ, తప్పకుండా
కొత్తపాళీ: 90లలో చూసుకున్నా భారతంలో నగరాల్లోనే కొన్ని ప్రాథమిక వసతులు .. పాలు సమృద్ధిగా దొరకటం, వంట గాసు, ఇటువంటివి కష్టంగా ఉండెవి
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఇక్కడ ఇటువంటి వసతులకి మరిగిన మన జనాభాకి ఆ రోజుల్లో మాతృదేశాన్ని తిరిగి చూస్తే నీరసంగా నిరసనగా ఉండేది.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: 2000 సం తరవాత వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రపంచమంతటా మౌలికమైన మార్పులు జరుగుతున్నాయి.
కొత్తపాళీ: అమెరికా ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.
సత్యసాయి: మీకుమొదటిసారి వెళ్ళీ వెళ్ళగానే కలిగిన ఫీలింగ్స్??
కొత్తపాళీ: ఈ మధ్య కాలంలో భారతం నించి ఇక్కడికి వచ్చే వారు కూడా దీర్ఘ కాలిక ప్రణాళికలతో కాకుండా ఉన్నంతలో కొంత డబ్బు మూట కట్టుకు పోదాం అన్న దృష్టితో వస్తున్నారు. లేదా, దీర్ఘకాలిక దృష్టి ఉన్న వారు వచ్చిన కొన్నాళ్ళకే స్వంత వ్యాపారాలు మొదలెడుతున్నారు. ఇవన్నీ పదేళ్ళ క్రితం లేని పరిణామాలు.
కొత్తపాళీ: ఒక్క నిమిషం ఓపిక పట్టండి. దీన్లో ఇంకో ముఖ్యమైన పాయింటుంది. అది కుటుంబాలు (భార్య పిల్లలూ) ఎలా ఫీలవుతారనేది.
సత్యసాయి: ఇది శుభపరిణామ మనుకుంటున్నా. మీరేమంటారు?
కొత్తపాళీ: స్త్రీలకి ముఖ్యంగా మాతృదేశంలో ఊహించలేని స్వేఛ్ఛ ఇక్కడి జీవనంలో అనుభవమైంది.
కొత్తపాళీ: దాంతో, వెనక్కి వెళ్ళటం అని మొగుడెప్పుడన్నా అనుకున్నా, ఈమె ఒప్పుకోదు.
సత్యసాయి: వైస్ వెర్సా?
కొత్తపాళీ: దీనికి exceptions ఉన్నారు, కానీ సామాన్యంగా ఇదీ పరిస్థితి.
కొత్తపాళీ: కుటుంబం అంటూ ఉన్నాక వెనక్కి వెళ్ళాలి అనుకుంటే భార్యా భర్తలిద్దరికీ దాన్ని గురించి ఒక shared vision ఉండటం చాలా అవసరం. నాకు తెలిసి తిరిగొచ్చిన కుటుంబాల్లో ఇది నిజం.
కొత్తపాళీ: పిల్లల వయసు పది దాటకపోతే అక్కడ తొందరగా ఎడ్జస్టవుతారని ఏవో సిద్ధాంతాలు వినిపిస్తుంటాయి. ఏదైనా, తల్లిదండ్రులు పిల్లలతో ఈ విషయాలు కూలంకషంగా చర్చిస్తుండాలి.
సత్యసాయి: అక్కడస్వేచ్చ అన్నారు – ఇంట్లో ఉండేవాళ్ళు పాతవాళ్ళే కదా?
కొత్తపాళీ: స్త్రీకెప్పుడూ ముఖ్య సమస్య మొగుడితో కాదు. ఆమె దారిని ఆమెని బతకనిస్తే నూటికి తొంభై తొమ్మిది సార్లు ఆమె మొగుణ్ణి బానే మేనేజ్ చేసుకోగలదు.
కొత్తపాళీ: మనవాళ్ళు మన సమాజంలో అలా బతకనివ్వరు – అదీ గోల.
సత్యసాయి: అవును – కానీ సమాజం ముఖ్యం వ్యక్తి కాదనే ఓరియంటల్ సంస్కృతిలో అది తప్పేది కాదనుకుంటా?
కొత్తపాళీ: ఆ ప్రశ్న నెత్తుకుంటే socio-anthropo-historical చర్చలోకి పోతాం ఇప్పుడు, వొదిలెయ్యండి.
సత్యసాయి: కొరియాలో కూడా మనలాగే అత్తా, ఆడపడుచుల ఆరళ్ళు, మగపిల్లాడంటే ఉన్న అతి గారాబం ఉన్నాయని – ఇప్పడుతగ్గాయట- తెలిసి మనలా ఎందరో అని పించింది
సత్యసాయి: మీకుమొదటిసారి వెళ్ళీ వెళ్ళగానే కలిగిన ఫీలింగ్స్??
కొత్తపాళీ: gimme a sec. just checking the file-save feature
కొత్తపాళీ: మొదటి సారి ఫీలింగ్స్.
సత్యసాయి: మొన్నటి అనుభవంతో తరచూ కాపీ పేస్టు చేస్తున్నా
కొత్తపాళీ: yeah, me too
సత్యసాయి: సేవ్ కూడా: -)
కొత్తపాళీ: దిగిన మొదట్లో చాలా excitedగా ఉన్నా. ప్రతిదాన్ని గురించీ ఆసక్తి.
కొత్తపాళీ: కనబడిన అందరితో గడగడా మాట్లాడెయ్యాలని ఉండేది.
కొత్తపాళీ: అమెరికన్లు చాలా open and friendly అనుకునే వాళ్ళం. అది అపోహే అని నెమ్మదిమీద తెలిసింది.
సత్యసాయి: వింతగా ఉందే
కొత్తపాళీ: నేను దిగటం ఫిలడెల్ఫియా నగరంలో, నడిబొడ్డున. అది మరి అమెరికాలో పది పెద్ద నగరాల్లో ఒకటి కదా. దిగిన మర్నాడు ఇంటినించి వివికి రోడ్డుమీద నడిచి వెళ్తుంటే .. సుమారు మైలు దూరం నడకలో ఒక్ఖ మనిషి ఎదురైతే ఒట్టు!
కొత్తపాళీ: ఇది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో. ఇది నన్ను చాలా ఆశ్చర్య పరిచింది.
సత్యసాయి: అవును మనని రాసుకుంటూ జనాలు నడవక పోతే రోడ్డుమీదున్నట్లే ఉండదు
కొత్తపాళీ: అఫ్కోర్సు, రోడ్డు మీద కార్లు చాలానే వెళ్తున్నయ్యి, పాద చారులై ఎదురు పడ్డ వాళ్ళెవరూ లేరని నా ఉద్దేశం. అదేదో కాశీ మజిలీ కథల్లో రాకుమారుడూ మంత్రికుమారుడూ వేరే రాజ్యానికి వెళితే అక్కడ వీధుల్లో పట్టపగలు ఎవరూ తిరక్కపోవటం .. ఏదో గండభేరుండ పక్షి భయం వల్ల .. అలాంటి కథేవన్నా ఉందా అనిపించింది!
సత్యసాయి: హ..హ.. హ… జానపదాలు బాగా ఔపోసన పట్టేరే
కొత్తపాళీ: ఇప్పుడింకా మర్చిపోయాను చాలా కథలు. ఇదివరకు నాలిక చివర ఉండేవి.
కొత్తపాళీ: ఇక్కడి సమయపాలనా, మనుషులు చెప్పిన దాన్ని నిఝంగా నమ్మి పాటించటం మొదట్లో నాకు జీర్ణమయ్యేవి కావు.
సత్యసాయి: సాంస్కృత్యాఘాతం (cultural shock?)
కొత్తపాళీ: అవును.
కొత్తపాళీ: ఇది జీర్ణించుకుని అవలంబించటానికి నాకో సెమిస్టరు కాలం పట్టింది.
కొత్తపాళీ: నేను తిరిగి భారతంలో నివాసమున్నప్పుడు అక్కడ జనాలకి నా ఈ పద్ధతులు అర్ధమై చచ్చేవి కావు. నువ్వు మరీ అమెరికనువైపోయావు అని నిష్ఠూరమడేవాళ్ళు. నిజమే ననిపించింది.
సత్యసాయి: నాకాశ్చర్యం కలిగేదేమిటంటే మన పూర్వీకులు సమయపాలనా, వాక్యపాలనా బాగా చేసేవారు –
సత్యసాయి: ఇప్పుడేమో ఇలా తయారయ్యాం
కొత్తపాళీ: వాక్య పాలన చెయ్యక పోవటం, మరీ పూర్వకాలం సంగతేమో గానీ ఇటీవలి చరిత్రలో బ్రిటీషు పాలన కింద మగ్గటం వల్ల వచ్చిందని నా అనుమానం.
కొత్తపాళీ: సమయపాలన సంగతేమో – అదసలు పాశ్చాత్య సాంప్రదాయమని నా అనుమానం.
సత్యసాయి: కాదనుకుంటా- మన ముహూర్తాల వెనక సమయపాలనే ఉద్దేశ్యమనుకుంటా – షెడ్యూలింగ్-
సత్యసాయి: ఇప్పుడు దాన్నే ప్రతీదీ వాయిదా వేయడం కోసం వాడుకుంటున్నాం
సత్యసాయి: అటు పశ్చిమం (అమెరికా) ఇటు తూర్పు (కొరియా, జపానులు) సమయానికిచ్చిన విలువ వల్లే పైకొచ్చారనుకుంటా
కొత్తపాళీ:
కొత్తపాళీ: మీకెలాగో మొత్తానికీ ఐరనీ అంటే ప్రీతి అల్లే ఉందే?
సత్యసాయి: అలా అనిపించిందేం? కానీ ఇందులో ఐరనీ లేదు
కొత్తపాళీ: how so? ఒకదానికి నిర్దేశించిన పద్ధతిని సరిగ్గా దాని వ్యతిరేకానికి ఉపయోగించటమే కదా ఐరనీ! సరే పోనివ్వండి. నేను అప్పటికే సర్వభక్షకుణ్ణి కావటం వల్ల తిండి పెద్ద ఇబ్బంది కాలేదు. చదువూ పెద్ద ఇబ్బంది కాలేదు. అయ్యయ్‌టీ కాన్పూరు తరవాత ఈ చదువు పేలవంగానే ఉండేది. మొదట్లో ఇంకో పెద్ద ఇబ్బంది అమ్మాయిల్తో. ఇందాకే చెప్పాను కదా, సాధారణంగా అమెరికన్లు కొంచెం ముభావంగానే, ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారని
సత్యసాయి: అవును
కొత్తపాళీ: కొద్ది పాటి పరిచయమయ్యాక, వివిల్లో ఐతే మరీనూ .. అమ్మాయిలొచ్చేసి అబ్బాయిలతో బుజాలు రుద్దుకోటం చేసేస్తుంటారు.
సత్యసాయి: ఎంతకష్టం
కొత్తపాళీ: వాళ్ళకది పెద్ద విషయంగా అనిపించదు. మనకేమో కొత్తకావటంవల్ల ఇబ్బందిగా ఉండేది.
సత్యసాయి: స్వానుభవం (కూడా అదే)
కొత్తపాళీ: కష్టమే మరి – అది అనుభవించితే తెలుసునులే
సత్యసాయి: అర్ధం చేసుకోగలను. అందులో మీ వయస్సుకూడా అలాంటిదే కదా!
కొత్తపాళీ: ఈ మాత్రం భాగ్యానికి మన వెధవాయలు కొందరు, ఇంకేముంది, ఆ పిల్లకి తనంటే ఇష్టం అనుకుని జొల్లు కార్చుకుంటూ ఆమె చుట్టూ తిరిగి చివరికి ఛీ కొట్టించుకుని, గడ్డం పెంచి దేవదాసు వేషం వెయ్యటం కూడా నేనెరుగుదును.
సత్యసాయి: బీద వాళ్ళు – పూర్ ఫెలాస్
కొత్తపాళీ: ఆ తరవాత .. ఈ శ్వేతవనితల గుండెలు పాలరాతి బండలు అని డైలాగులు చెప్పేసి, హాయిగా పది లక్షల కట్నంతో అమ్మానాన్నా కుదిర్చిన వెంకటసుబ్బలక్ష్మిని చేసుకుని .. వాళ్ళెందుకు బీదవాళ్ళు?: ))
సత్యసాయి: గెడ్డం గీసుకోవడానికి ఖర్చయిన మేరకు బీదవాళ్ళే కదా
కొత్తపాళీ: : ))
కొత్తపాళీ: ఒక సారి .. సందర్భం ఏవిటో గుర్తులేదు .. డిపార్టుమెంట్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయి తన చేత్తో నా చెంప నిమరబోయింది. నేను అసంకల్పితంగా .. అదేదో పాము నా మీద పడబోతున్నట్టు చటుక్కున వెనక్కి తగ్గాను. ఆ అమ్మాయి విస్తుబోయింది. తనేదో చెయ్యరాని పని చేసిందేమో అన్నట్టు చాలా క్షమాపణలు చెప్పింది.
సత్యసాయి: మన కండిషనింగ్.
కొత్తపాళీ: ఇలా ఉండేవి తొలి రోజుల అనుభవాలు.

Posted in వ్యాసం | Tagged | 1 Comment

మృతజీవులు – 13

చిచీకవ్ మొహమాటపడరాదని నిశ్చయించుకున్నట్టు అదివరకే తెలుసుకున్నాంగద, అందుచేత అతను టీ కప్పు తీసుకుని, అందులో ఇంటి కాపుసారా కొంచెం పోసుకుని ఈ విధంగా సంభాషణ సాగించాడు:

“మీ గ్రామం చాలా బాగుందమ్మా. ఇందులో ఎంతమంది ఉంటారు?”

“భగవంతుడి నిర్ణయాన్ని గురించి గునిసి లాభంలేదు… వాళ్ళను నా కిచ్చెయ్యండి, నస్తాస్య పెత్రోవ్న”.

“ఎవరినండి?”

“ఆ చచ్చిపోయిన వాళ్ళనే”

“ఎలా ఇచ్చేదీ?”

“అదెంతపనీ? పోనీ కావలిస్తే అమ్మండి. నేను డబ్బిచ్చుకుంటాను.”

“కొంచెం తక్కువగా ఎనభయ్యండి. కాని, రోజు లేమీ బాగా లేవు, ఏం చెప్పను? కిందటేడు కూడా పంటలు పాడయాయి” అన్నది ఇంటావిడ.

“కమతగాళ్ళు దృఢంగానే కనిపిస్తారు. వాళ్ళ ఇళ్ళు కూడా గట్టిగానే ఉన్నాయి. అన్నట్టు తమ పేరడగడం మరిచాను… రాత్రి అంత పొద్దు పోయి వచ్చి…”

“కరబోచ్క”.

“చాల సంతోషం. తమ సొంత పేరు? తండ్రి పేరు?”

“నస్తాస్య పెత్రోవ్న”

“నస్తాస్య పెత్రోవ్నా? చాల మంచి పేరు. మా పెద్దమ్మ, మా అమ్మ అక్క, పేరు నస్తాస్య పెత్రోవ్న”.

“మరి మీ పేరు? మీరు పన్నులు వసూలు చేసే అసిసరనుకుంటాను?”

“కాదండమ్మ. పన్నుల అసిసరు ఎంతమాత్రమూ కాదు, ఊరికే సొంతపని మీద తిరుగుతున్నాను”, అన్నాడు చిచీకవ్ మందహాసం చేస్తూ.

“అయితే మీరు వర్తకులన్నమాట! ఎంత పొరపాటయిందీ, నా దగ్గర ఉన్న తేనెను ఆ బేరగాడికి చౌకగా ఇచ్చేశాను. ఒకవేళ మీరు తీసుకుని ఉండేవారేమోనండీ”.

“మీ తేనె నేను కొని ఉండను.”

“అయితే ఏం కొనేవారు? నారా? కాని, మరి నా దగ్గర నార చాలా కొంచమే ఉంది; ముక్కాలు మణుగు కంటే ఉండదు.”

“నేను కొనేది మరోటండమ్మా! మీ వద్ద ఉండే కమతగాళ్ళెవరైనా చచ్చిపోయారా?”

ముసలావిడ నిట్టూర్చి, “పద్దెనిమిది మందండి! మంచివాళ్ళు; అందరూ పనిచేసేవాళ్ళే. ఈ మధ్య కొందరు పుట్టారు. కాని వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటీ? అంతా పిల్లకారు. మరి అసిసరు వచ్చి, మనిషికింత చొప్పున పన్ను కట్టమన్నాడు. ఒకవంక కమతగాళ్ళు చచ్చినా, వాళ్ళు బతికున్నట్టే పన్ను అచ్చుకోవాలి. కిందటివారం నా కమ్మరివాడు కాస్తా తగలబడిపోయాడు. మంచి తెలివిగలవాడు, తాళాలపనికూడా చేసేవాడు.”

“ఇళ్ళు కాలాయండీ?”

“దేవుడి దయవల్ల అది మాత్రం లేదండి. అది మరింత నష్టమై ఉండేది; అతను ఉట్టిపుణ్యానికే అంటుకున్నాడండి. తెగతాగేసరికి లోపల మంట ప్రారంభమైంది. అతని ఒంట్లో నుంచి నీలం రంగు మంట వచ్చింది. రగులుకుని రగులుకుని బొగ్గయిపోయాడు;అంతకంటె ఇంకేమీ చెప్పలేను. ఎంతో తెలివైన కమ్మరి. ఇప్పుడేమయిందీ? గుర్రాలకు లాడాలు వేసేవాళ్ళు లేరు, నేనెక్కడికీ కదలటానికి లేకుండా పోయింది.”

“అంతా విధి నిర్ణయమమ్మా!” అన్నాడు చిచీకవ్ నిట్టూర్చుతూ. “భగవంతుడి నిర్ణయాన్ని గురించి గునిసి లాభంలేదు… వాళ్ళను నా కిచ్చెయ్యండి, నస్తాస్య పెత్రోవ్న”.

“ఎవరినండి?”

“ఆ చచ్చిపోయిన వాళ్ళనే”

“ఎలా ఇచ్చేదీ?”

“అదెంతపనీ? పోనీ కావలిస్తే అమ్మండి. నేను డబ్బిచ్చుకుంటాను.”

“అదెలా? నాకు నిజంగా మీ రనేది అర్థం కావటం లేదు. వాళ్లను భూమిలోంచి తవ్వుకు పోవాలనుకోవటం లేదు గద?”

ముసలావిడ అయోమయంలో ఉన్నదని చిచీకవ్ గ్రహించి, తనకు కావలసిందేమిటో వివరించక తప్పదనుకున్నాడు. ఈ అమ్మకం కేవలం కాగితం పైన మాత్రమే జరుగుతుందనీ, వాళ్ళు బతికి ఉన్నవారి కింద పేర్కొనబడతారనీ అతను సంగ్రహంగా చెప్పాడు.

“మరి వాళ్ళు మీకెందుకు పనికివస్తారూ?” అని ఆవిడ అతనికేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది.

“అదంతా నా గొడవ”

“వాళ్ళు చచ్చారని మీకు తెలుసుగా”

“బతికున్నారని ఇప్పుడెవరన్నారూ? వాళ్ళు చచ్చిపోయారు గనకనేగా మీకు నష్టం కలిగిందీ? వాళ్లకు మీరు పన్నిచ్చుకుంటున్నారుగా? మీకా శ్రమా, ఖర్చూ లేకుండా చేస్తాను; తెలిసింది గాదూ? ఇదంతా చెయ్యటమే గాక, మీదుమిక్కిలి పదిహేను రూబుళ్ళు కూడా ఇచ్చుకుంటాను. ఇప్పుడు తెలిసిందిగా?”

ముసలావిడ సంకోచిస్తూ, “నాకు గొడవగా ఉంది. అసలు నేను చచ్చినవాళ్లను ఎన్నడూ అమ్మలేదు.”

“అవునుమరి. అసలు మీరు అమ్మితేమటుకు కొనేవాళ్ళెవరు? వాళ్ళవల్ల ఎలాటి ప్రయోజనం గాని ఉండవచ్చునని మీరుగాని అనుకోవటం లేదు గద?”

“లేదు; నేనలా అనుకోవటం లేదు. చచ్చిన వాళ్ళవల్ల ప్రయోజనమేమిటి? వాళ్ళు ఎందుకూ పనికిరారు. వాళ్ళు చచ్చిపోయారే అనే నా బాధ.”

“ఈవిడకు బుర్ర ఉన్నట్టు లేదు” అని తనలో అనుకుని, చిచీకవ్ పైకి, “చూడండమ్మా, మీరే న్యాయం ఆలోచించుకోండి. వాళ్ళు బతికి ఉన్నట్టే లెక్కగట్టి పన్నులిచ్చుకుని మీరు నష్టపోతున్నారా…” అన్నాడు.

“అయ్యొ బాబూ! చెప్పకండి, ఆ కిందటి వారమే అసిసరుకు బహుమానాలు గాక, నూటయాభై రూబుళ్ళిచ్చుకున్నాను.” అన్నది ముసలావిడ అతన్ని ముగించనివ్వకుండా.

“చూశారాండమ్మా! ఇక చూచుకోండి, మీరు అసిసరుకు బహుమానాలివ్వనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ పన్ను ఇక నేను కడతాను – మీరు కట్టరు. పన్నులన్నీ నేనే కట్టుకుంటాను. విక్రయం ఖర్చులు కూడా నేనే భరిస్తాను, తెలిసింది కదూ?”

ముసలావిడ ఆలోచించింది. ఈ వ్యవహారం లాభసాటిగానే ఉన్నట్టు కనిపిస్తున్నది, కాని అసాధారణంగానూ, అసహజంగానూ ఉండటం చేత కొనేమనిషి తనను ఎక్కడ మోసగిస్తాడోనని ఆమెకు చెడ్డ భయం పట్టుకున్నది. అతను ఎక్కడినుండి ఊడిపడ్డాడో కూడా తెలియదాయె, అపరాత్రి వేళ దిగాడు కూడాను.

“ఏమండమ్మా? ఏమిటిమరి? బేరం ఖరారేనా?” అని చిచీకవ్ అడిగాడు.

“చెడ్డ ఒట్టండీ, నేనెన్నడూ చచ్చినవాళ్ళను అమ్మి ఎరగను. ఆ కిందటేడు ఇద్దరు బతికున్నవాళ్ళను, ఆడపిల్లలను, ప్రటోపవన్ కు అమ్మిన మాట నిజమే. ఒక్కొక్కతెకూ నూరేసి రూబుళ్ళు తీసుకున్నాను. కొన్నవాడూ సంతోషించాడు. మంచి పనిమంతురాళ్ళూ, బల్లమీద పరచే నాప్కిన్లు కూడా నేయగలరు.”

“ఛీ! ఎలా చంపుకుతిన్నది, పాపిష్టి ముసలిముండ!” అనుకుంటూ, కాస్సేపు సేదతీర్చుకుని అతను తనపెట్టె తెరిచాడు.

“మరి ఇది బతికున్నవాళ్ళ వ్యవహారం కాదు, నాకు కావలసింది చచ్చినవాళ్ళు.”

“ఏమో ఇదంతా చూడగా నాకు నష్టం వచ్చేలాగుంది. ఒకవేళ మీరు నన్ను మోసగిస్తున్నరేమోనండి… వాళ్ళకింక ధర వస్తుందేమో.”

“చూడండమ్మా… మీరన్నదానిలో అర్థమేమన్నా ఉందాంట! వాళ్లకి ధరేమిటి? మట్టేగదండీ. వాళ్ళు మట్టి అయిపోయారు. తెలిసింది కాదూ? ఎంత పనికిమాలిన వస్తువన్నా తీసుకోండి, గుడ్డపీలికను తీసుకోండి – దానికి కూడా విలువ ఉన్నది, గుడ్డపీలికలు కొని వాటితో కాగితం తయారు చేస్తారు. కాని నేనడిగేది బొత్తిగా ఎందుకూ పనికిరానివి. మీరే చెప్పండి; వాటివల్ల ఏమిటి ఉపయోగం?”

“అందులో అబద్ధం ఏమీ లేదు. వాళ్ళు ఎందుకూ పనికిరారు. నేను సంకోచించే దెందుకంటే వాళ్ళు చచ్చిపోయారే అని.”

‘ఛీ, వట్టి కొయ్య బుర్ర’, అనుకున్నాడు చిచీకవ్, ఓర్పు లేకుండా పోతూ. ‘ఇటువంటి మనిషితో ఎలా సమాధానానికి రావటం? చిర్రెత్తించేస్తున్నదే పాడుముండ!’ అతని జేబులోంచి చేతిరుమాలు పైకిలాగి నుదుటిమీది చెమట అద్దుకున్నాడు. నిజానికి చిచీకవ్ కు కోపం రావటం లేదు; ఎంతేసి పెద్దమనుషులూ, రాజ్యవేత్తలూ కూడా బేరం దగ్గర కరబోచ్క లాగే ప్రవర్తిస్తారు. అయితే అతని బుర్రలోకి ఒక అభిప్రాయం ప్రవేశించాక, దానికి తిరుగు ఉండదు. మనం ఎంత సహేతుకమైన వాదనలు చేసినప్పటికీ, గోడకు తగిలిన రబ్బరు బంతుల్లాగా అతనికి దూరంగా పోతాయి.

చిచీకవ్ నుదురు తుడుచుకున్నాక ఆవిడను మరొక ధోరణిలో దారికి తెద్దామనుకున్నాడు.

“ఏమండమ్మా, మీరు నా మాటలు అర్థం చేసుకోకుండా ఉండటానికైనా ప్రయత్నిస్తున్నారు, లేదా ఏదో ఒకటి మాట్లాడాలని అయినా మాట్లాడుతున్నారు. మీకు పదిహేను రూబుళ్ళ నోట్లిస్తున్నాను – బోధపడిందా? అది డబ్బేగద. కావాలంటే రోడ్డుమీద దొరకదు గద. మీరు తేనెను ఎంతకు అమ్మారు చెప్పండి?”

“పూడ్ (మణుగు) పన్నెండు రూబుళ్ళు చేసి అమ్మాను.”

“పాపం మూటగట్టుకుంటున్నారండమ్మా, మీరు పన్నెండు రూబుళ్ళ ధరకు అమ్మలేదు.”

“ఒట్టు, అలాగే అమ్మాను”

“సరే చూడండి. అది ఒక వస్తువు -తేనె. మీరు దాన్ని ఒక ఏడాది పాటు ఎంతో శ్రమదమాలు పడి పోగు చేసి ఉండాలి, ఎన్నో తేనెటీగలను చంపి ఉండాలి, చలికాలమంతా వాటికి నేలమాగళిలో మీరే ఆహారం పెట్టి ఉండాలి. మరి చచ్చిపోయినవాళ్ళు ఈలోకానికి చెందినవాళ్ళు కూడా కారే. వాళ్ళ కోసం మీరేమీ శ్రమ పడలేదు, వాళ్ళను ఈ లోకం నుంచి తీసుకుపోయి మీకు నష్టం కలిగించాలని దేవుడు నిర్ణయించాడు. తేనె విషయంలో అంటే మీరు పడిన శ్రమకు ప్రతిఫలంగా పన్నెండు రూబుళ్ళు తీసుకున్నారు. కాని ఈ విషయంలో ఊరికినే, ఉట్టుడియంగా, పన్నెండు గాదు, పదిహేను రూబుళ్ళు వస్తున్నాయి, అవి కూడా వెండి కాదు, నీలం రంగు నోట్లు”

ఇంతా విడమర్చి చెప్పినాక ముసలావిడ తప్పకుండా సరేనంటుందని చిచీకవ్ అనుకున్నాడు.

“నేను అనుభవం లేని విధవరాలిని. తొందరపడడం మంచిది కాదు, బేరగాళ్ళు రాబోతారు, వాళ్ళ నడిగి ధరలు ఎలా ఉన్నదీ తెలుసుకుంటాను.”

“సిగ్గుచేటండమ్మా, సిగ్గుచేటు. మీరేమంటున్నారో కాస్త ఆలోచించండి. వాళ్ళను ఎవరు కొనబోతారు? ఎవరికిగాని వాళ్ళవల్ల ఏం ప్రయోజనం?”

“ఏమో, ఒకవేళ వాళ్ళతో కూడ ఏదన్నా పని ఉండవచ్చునేమో..” అంటూ ఆవిడ మధ్యలో ఆగి, దీనికి అతను ఏమనేస్తాడేమోనని భయపడుతూ, నోరుతెరుచుకుని అతనికేసి చూసింది.

“చచ్చినవాళ్ళతో పనా? ఇంకా నయం! మీ కూరమళ్ళలో దిష్టిబొమ్మలుగా పెట్టి పిచ్చికలను భయపెడదామనా ఏం?”

“ఓయి జగదీశ్వరా! మీవి ఎలాంటి అఘాయిత్యం మాటలు!” అన్నది ముసలావిడ తనమీద సిలువ వేసుకుంటూ.

“వాళ్ళతో మీకేం పని ఉండబోతోంది? కావలిస్తే వాళ్ళ అస్తికలూ గోరీలూ అన్నీ మీరే ఉంచుకోండి. మార్పిడి అంతా పత్రంలోనే ఏమంటారు మరి? ఏం చేద్దామని? అటోఇటో తేల్చండి.”

ముసలావిడ మళ్ళీ యోచించింది.

“మీ ఉద్దేశ్యం ఏమిటి, నస్తాస్య పెత్రోవ్న?”

“ఏం చెయ్యాలో నా కేంపాలు పోవటం లేదు. ఇదంతా ఎందుకు, నార అమ్మేస్తాను, కొనుక్కోండి”

“నారా! తస్సదియ్య, నేనింకోటి అడుగుతూంటే, నాకు నార అంటగట్టాలని చూస్తున్నారా? నార, నారే, మరొకసారి వచ్చినపుడు నార కూడా కొంటాను. ఇంతకూ ఏమంటారు, నస్తాస్య పెత్రోవ్న?”

“అయ్యయ్యో, ఇటువంటి విడ్డూరమైన అమ్మకం నేనెలా చేసేది!”

చిచీకవ్ ఓర్పు దీనితో పూర్తిగా అడుగంటిపోయింది. అతను కోపోద్రేకంతో కుర్చీని నేలకేసి కొట్టి, ఆవిడను సైతాను వాత పడమన్నాడు.

సైతాను పేరు వినేసరికి ముసలావిడకు ముచ్చెమటలు పోశాయి.
“అమ్మో వాడిపేరెత్తకండి, వాణ్ణి దేవుడు రక్షించ! ఆ కిందటి రాత్రల్లా నాకు కలలో సైతానే. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాక, అదృష్టం చూసుకుందామని పేకముక్కలు తీశాను; అందుకు శిక్షగా ఈశ్వరుడు వాణ్ణి పంపి ఉంటాడు. వాడు భయంకరంగా ఉన్నాడు; వాడి కొమ్ములు మా ఎద్దు కొమ్ములకన్న కూడా పొడుగున్నాయి.”

“ఇంకా నయం, డజన్ల కొద్దీ సైతానులు కనపడవలసింది; లేకపోతే ఏమిటి? పోనీ పాపం కదా అని మీకు సాయపడదామనుకున్నాను; పేదది దారిద్ర్యం అనుభవిస్తున్నదే అనుకున్నాను… మిమ్మల్నీ, మీ గ్రామాన్నీ మహమ్మారి ఎత్తుకుపోనీ, నాకేం?”

ముసలావిడ అతనికేసి బెదిరి చూస్తూ, “ఎంత ఘోరమైన మాటలంటున్నారు!” అన్నది.

“ఏం చెయ్యను; మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియటం లేదు. మీ ధోరణి చూడబోతే – నీచంగా పోల్చాననుకోకండి – గడ్డిమేటులో కుక్కవంతుగా ఉన్నది. అది తినదు, ఇంకొకరిని తిననివ్వదు! మీ దగ్గర ఎన్నో సరుకులు కొందామనుకున్నాను. అందుకంటే, నాకు సర్కారు కంట్రాక్టులున్నాయి…”

ఇది అతను యధాలాపంగా, నిరుద్దేశ్యంగా ఆడిన అబద్ధమే అయినా, అద్భుతంగా పనిచేసింది. సర్కారు కంట్రాక్టులనేది నస్తాస్య పెత్రోవ్నను మంత్రం లాగ ఆకట్టింది. ఆవిడ ఇంచుమించు బతిమాలే దానిలాగా, “మీరెందుకలా ఆగ్రహించుకుంటున్నారు. మీది ఇంత కోపిష్టి స్వభావమని ముందే తెలిస్తే మీకసలు ఎదురే చెప్పకపోదును”, అన్నది.

“కోపం కూడా ఎందుకు? ఈ బేరమంతా కలిసి ఒక మురిగిపోయిన కోడిగుడ్డు విలువ చెయ్యదు, ఈ భాగ్యానికి కోపం కూడానా ?”

“సరే అలా అయితే పదిహేను రూబుళ్ళ నోట్లకు వాళ్ళను మీకు అమ్మేస్తాను! అయితే ఒకటి, మీరు ఆ కంట్రాక్టులన్నారే, నావద్ద ధాన్యం గాని, పిండిగాని, మాంసంగాని కొనేప్పుడు నన్ను మోసగించకండి బాబూ”.

“ఎందుకు మోసగించుతానండమ్మా? ఎన్నడూ చెయ్యను.”, అంటూ అతను తన మొహాన దిగగారే చెమటను తుడుచుకున్నాడు. అమ్మకం వ్యవహారం పరిష్కారం చెయ్యటానికీ, ఇతర విషయాలు చూడటానికీ బస్తీలో ఆమెకు తెలిసిన లాయరుగాని, ఆమె తరపున వకాలతా పొందదగిన మిత్రుడుగాని ఉన్నాడా అని అడిగాడు.

“దానికేం భాగ్యం! పెద్ద ప్రీస్టు ఫాదర్ కిరిల్ కొడుకు కోర్టు గుమాస్తాయేగా!” అన్నది ముసలావిడ. అయితే అతనికి వకాలతా ఇస్తూ ఒక ఉత్తరం రాసివ్వమని చిచీకవ్ అడిగి, పని తెమలటానికి గాను తానే రాసిపెడతానన్నాడు.

ఈలోపల ముసలావిడ తనలో, “ఇతను సర్కారు తరపున నా దగ్గర ఉండే పిండీ, పశువులూ తీసుకుంటే బాగుణ్ణు, ఇతన్ని ఎలాగయినా మంచి చేసుకోవాలి. నిన్నటి బాపతు మిగిలిపోయిన తడిపిండి ఉన్నది. నేనువెళ్ళి ఫితీన్యతో అట్లు వెయ్యమని చెబుతాను. గుడ్లతో మడత అట్లు వేయమంటే బాగుంటుంది. మావాళ్ళు వాటిని బాగా చేస్తారు;దబ్బున అవుతాయి కూడాను” అనుకున్నది.

ఈ పనులన్నీ చేయించటానికీ, వీలయితే ఇంకా ఇతర వంటకాలు కూడా జత చేయించటానికీ ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఈలోపల తనపెట్టెలోనుంచి అవసరమైన కాగితాలు తీసుకునేటందుకు చిచీకవ్ తాను కిందటి రాత్రి నిద్రపోయిన డ్రాయింగ్ రూములోకి వెళ్ళాడు. ఈ గది అదివరకే తుడిచి శుభ్రం చేసి ఉన్నది. ఈకల పరుపులన్నీ అవతలకు వెళ్ళిపోయాయి. సోఫాకు ఎదురుగా బల్లమీద భోజనపు ఏర్పాట్లు చేసీ ఉన్నాయి. అతను తన పెట్టెను ఎత్తి ఆ బల్లమీద పెట్టి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే, నదిలో మునిగినట్టుగా అతని ఒళ్ళంతా చెమట ప్రవాహాలే; అతని షర్టు మొదలుకొని కాలి తొడుగులదాకా ఒంటిమీది బట్టలన్నీ తడిసి ముద్ద అయాయి.

“ఛీ! ఎలా చంపుకుతిన్నది, పాపిష్టి ముసలిముండ!” అనుకుంటూ, కాస్సేపు సేదతీర్చుకుని అతను తనపెట్టె తెరిచాడు.

ఈపెట్టె వైనం గురించీ, దీని లోపలి పంపిణీ గురించీ కొందరు పాఠకులు తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారని కథకుడికి గట్టి నమ్మకం. అలాగే వారినెందుకు తృప్తిపరచగూడదూ?

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 13