గ్యాస్ కొట్టండి

jyothi.bmpఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.

————–

వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక తిరిగిచ్చేయాలి.

ముందుగా ఒక గృహిణి వచ్చింది…మరేనండి, మావారు నేను చెప్పిన మాట జవదాటరండి. జీతం రాగానే నా చేతికిచ్చి తన ఖర్చులకోసం మాత్రమే తీసుకుంటారు. నేను ఎంత ఖర్చు పెట్టినా ఏమనరు. మా ఇంట్లో అందరు నేను చెప్పిందే వేదం అంటారు. ( వాళ్ళాయన పచ్చి తాగుబోతు.సగం జీతం తాగుడు, అప్పులకే పోతుంది. సగం జీతంలోనే ఇల్లు గడవక మళ్ళీ అప్పులు. అంతా గోల గోల సంసారం)

ఇంజనీరింగు విద్యార్ధి…నేను చాలా సీరియస్సుగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. మంచి ఉద్యోగం సంపాదించాలి కదా.నాకు కాలేజీలో మంచి పేరుంది . జూనియర్స్ అందరు నన్ను ఎంతో గౌరవిస్తారు. డౌట్లన్నీ అడుగుతారు. (వీడస్సలు పుస్తకం ముట్టడు. పరీక్షలముందు ఆల్ ఇన్ వన్ కొనుక్కుని బట్టీ పడతాడు. ఎవరిని అడిగినా బండ బూతులు తిడతారు )

పనిమనిషి రాములమ్మ .. మరేనండి. నేను ఎవరింట్లో నన్నా పని పట్టుకున్నానంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. నలుగురున్న ఇల్లైతేనే చేస్తాను. జీతం ఐదొందలు. దసరాకి కొత్త చీర, నాలుగు పాత చీరలు , ఆదివారం పని చేయం. అందరు ఇంట్లోనే ఉంటారుగా చేసుకుంటారు. మేము కూడా ఇంట్లో టీవీలో సినిమాలు చూడొద్దేంటి. నెలకు రెండు సినిమాలు చూసే అలవాటు పనికి రాము. జ్వరం వస్తే కూడా పని చేయం. జీతం కట్ చేయొద్దు. అది బాలేదు ఇది బలేదు. అని అనొద్దు. మాట పడేదాన్ని కాదు.

క్లర్క్ శర్మ… మేము చాలా నిజాయితీగా పని చేస్తాము. తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా! ఏ పనైనా టైమ్ మీద పూర్తి చేస్తాము అయినా అందరూ మమ్మల్ని అపార్ధం చేసుకుంటారు.ఎంతైనా ప్రభుత్వోద్యోగులంటే అందరికీ అలుసే మరి..(సీట్లో కనిపించేది నెల మొదటిరోజు , ఎదైనా ఇన్స్పెక్షన్ ఉంటే . వెళ్ళేది పదకొండింటికి బయటపడేది నాలుగింటికే. ఇంట్లో చిట్టీల బిజినెస్ నడిపిస్తాడు మిగిలిన సమయంలో. ఆఫీసులో వచ్చే జీతం ,గీతం సరిపోదతనికి.

స్థానిక ఎమ్.ఎల్.ఏ … నా వార్డు ప్రజలే నాకు దేవుళ్ళండి. వాళ్ళ కోసం నా ఇంటి,ఫోను తలుపులు ఎప్పుడూ తెరిచేవుంటాయి. ఎప్పుడైనా ఏ సమస్య ఐనా నాకు చెప్పండి . వెంటనే స్పందించి ఆ సమస్య తీరుస్తాను. ఇది నా వాగ్ధానం. (ఏడిసినట్టుంది . అసలు ఎలక్షన్లప్పుడు, ఎదన్నా సన్మానం చేస్తామన్నప్పుడు తప్ప మళ్ళీ కనపడడు.)

ఇలా కొంతమంది గ్యాస్ కొట్టారు. సిలిండరు సగమే నిండింది. ఇక మీరు మొదలెట్టండి.ఎవరి గ్యాసుకు సిలిండరు నిండుతుందో వారికే అది సొంతం. ఖాళీ అయ్యాక సిలిండరు ఇచ్చేయాలండి మరి. హైదరాబాదులో గ్యాస్ సిలిండరు కెంత తిప్పలు పడాలో తెలిసిందే కదా! డబ్బులెట్టి బంగారం కొనడం సులువేమో గాని సిలిండరు దొరకడం అంత కష్టం.

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)
Posted in వ్యాసం | Tagged | 12 Comments

నవతరంగం

వెంకట్ సిద్దారెడ్డి
వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.

————–

తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!

అప్పుడప్పుడూ ఆవేశం ఆపుకోలేని అనీష్ లాంటి వాళ్ళు తెలుగు సినిమాని “Shame! Shame! Puppy Shame!” చేద్దామనుకున్నా “ఓ, పెద్ద దిగొచ్చాడండి. ఈ మాత్రం విషయం మనకు తెలియనట్టు. చూసీ చూడనట్టు మెలగుకోవాలి. మనదేం పోయింది. వాళ్ళ డబ్బులుపెట్టి సినిమాలు తీసేది మన ఆనందం కోసమేగా! పాపం లేటు వయసులో కూడా కుర్రాళ్ళలా నటించడానికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఢిల్లీ, బొంబాయిలనుండి వచ్చి పాపం ఇక్కడ బట్టలిప్పి ఎగురుతున్న ఆడ లేడీస్ చేసే సర్వీస్ అంతా ఇంతానా? ఎవరికోసం? ఇదంతా ఎవరికోసం? మన కోసం కాదేంటి? అయినా అంతంత పెద్దోళ్ళనలా దిగజార్చడం ఎంత మాత్రం సబబు కాదు. ఈ రోజు వాళ్ళనలా తీసిపారేస్తే రేపు మనకు రాజకీయనాయకులెక్కడ దొరుకుతారు? నేటి సినిమా స్టారే కదా రేపటి రాజకీయ నాయకుడు. అర్థం చేసుకోవాలి.” అని అతని ఆవేశాన్ని చల్లార్చేయడం జరుగుతుంది.

నిజంగానే మన తెలుగు సినిమాది దౌర్భాగ్య స్థితి. గత 20 ఏళ్ళలో మన తెలుగు చిత్ర పరిశ్రమనుంచి ఎన్ని మంచి సినిమాలు వెలువడ్డాయి అంటే, కనీసం ఇరవై మంచి సినిమాల (అంటే సంవత్సరానికొకటి) పేర్లయినా గుర్తుకు రాని అభాగ్య స్థితి మనది. తెలుగులో అసలే మంచి సినిమాలు లేవని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు.

సంవత్సరానికి షుమారు 200కు పైగా తెలుగు సినిమాలు నిర్మితమవుతున్నప్పటికీ అందులో కనీసం ఒక్క శాతమయినా మంచి సినిమాలుగా గుర్తించలేని దుస్థితి మనది. కానీ అక్కడో ఇక్కడో అప్పుడప్పుడూ కొంతమంది దర్శకులు ఎంతో కొంత నవ్యతను తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకందివ్వాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. 1980 కి ముందు వచ్చిన మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, సాక్షి, లాంటి ఎన్నో సినిమాలు తెలుగు సినిమాను కాసేపు ప్రకాశింపజేసినప్పటికీ అప్పటి సినిమాలను మారుతున్న సమాజం దృష్ట్యా ప్రామాణికాలుగా తీసుకోవడం కొంచెం కష్టమే! 1980 ల తర్వాత విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి వారు తమ తమ పరిధుల మేరకు తమ కంటూ ఒక శైలి, తమ సినిమాలకొక భాష, ఆ భాషకొక వ్యాకరణం సృష్టించుకున్నారు. కానీ అవన్నీ పాత మధురాలు. గత కాలపు స్మృతులు. జంధ్యాల అస్తమయంతో ఆరోగ్యకరమైన నవ్వులూ మాయమయ్యాయి. ఇప్పుడంతా వెకిలి హాస్యం. రెండర్థాల బూతు ప్రహసనం. విశ్వనాధ్, బాపూలు ఇప్పటికీ సినిమాలు తీస్తున్నప్పటికీ వృధ్ధ్యాప్య ప్రభావమో ఏమో గానీ అప్పటి సృజనాత్మకత ఇప్పటి సినిమాల్లో లోపించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు తన సినిమాలతో కొత్త ప్రయత్నాలకు నాంది పలికారు. ఒక “పుష్పక విమానం”, “ఆదిత్య-369”, “విచిత్ర సహోదరులు” లాంటి ఎన్నో సినిమాల ద్వారా కమర్షియల్ సినిమాల్లోనూ నవ్యతకు అవకాశం వుందని నిరూపించారు. మనకీ ఉన్నాడో నవ సినిమా నిర్మాత అని గర్వంగా చెప్పుకునేలా సినిమాలు తీసిన వంశీ గత కొంత కాలంగా (డిటెక్టివ్ నారద తర్వాత) formలో లేరన్నది నిజం. ఆ మధ్యలో “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను పునరుజ్జీవనం చేసే ఛాయలు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అది నిజం కాదని నిరూపించాయి.

1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” సినిమాతో తెలుగు సినిమా పునాదులు కదిలి నవ శకానికి నాంది పలికినప్పటికీ ఆ ట్రెండుని కొనసాగించే సత్తా కలిగిన దర్శకులు ఇప్పటికీ మనకి కరువయ్యారు కనకనే మన సినిమాలు ఇప్పటికీ పాత ధోరణిలో సాగిపోతున్నాయి. తెలుగు సినిమాలో కొత్త పోకడలకు, సాంకేతిక నైపుణ్యానికి నాంది పలికిన వర్మ, సినిమానో యజ్ఞంగా భావించి నవయువ దర్శకులకు స్ఫూర్తి కలిగిస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. కానీ కాలక్రమంలో సినిమాను కళాత్మక దృష్టితో కాకుండా కేవలం వ్యాపారంగా భావించి కుప్పలు తెప్పలుగా సినిమాలు తీయడంతో అతని ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇప్పుడు నామమాత్రమయ్యాయన్నది నిజం. వర్మ మొదలు పెట్టిన యజ్ఞాన్ని కొన్ని రోజులు కృష్ణ వంశీ కొనసాగించినప్పటికీ ఆయన సినిమాలు ఇప్పుడు కమర్షియల్ వెల్లువలో కొట్టుకుపోతున్న కాగితం పడవలు మాత్రమే!

ఇక 21వ శతాబ్దపు మొదటి రోజుల్లో నాగేష్ కూకునూర్ తన “హైదరాబాద్ బ్లూస్” సినిమా ద్వారా కొత్త ప్రయోగం చేసారు. సినిమా అనగానే కోట్లకొద్దీ నిర్మాణవ్యయం, పేరుపొందిన నటీనటులు, ఫారిన్లో చిత్రీకరించిన పాటలు, సినిమాకు సంబంధం లేని కామెడీ ట్రాకులు అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వల్ప బడ్జెట్లో మంచి సినిమా తీసారు. కానీ తన సినిమాకు ప్రేక్షకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినా అక్కడక్కడా వున్న రస హృదయులు ఆ సినిమాను ఆదరించి చివరకు విజయాన్ని చేకూర్చారు. ఆ తర్వాత నాగేష్ చాలా సినిమాలు తీసినప్పటికీ తన మొదటి సినిమా “హైదరాబాద్ బ్లూస్” లోని అపూర్వతను మళ్ళీ సృష్టించలేకపోయరు. ఈ మధ్య కాలంలో అతను తీసిన “ఇక్బాల్”, “దోర్” సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పటికీ ఈ సినిమాలు గొప్ప సినిమాలని అంగీకరించడం కొంచెం కష్టమే! వారం వారం బాలీవుడ్ సినిమా పరిశ్రమనుంచి వెలువడుతున్న మసాల సినిమాలకంటే ఈ సినిమాలు వేరుగా ఉండడమే కాకుండా పెరిగిపోతున్న మల్టిప్లెక్స్ సాంప్రదాయానికి ఈ సినిమాల విజయమే సాక్ష్యం.

2002లో నీలకంఠ “షో” సినిమా ద్వారా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. కేవలం ఇద్దరి పాత్రధారులతో మంచి కథ, కథనాలతో నడీచే “షో” సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందకపోయినప్పటికీ నీలకంఠకు జాతీయ స్థాయిలో అవార్డును తెచ్చిపెట్టాయి. కానీ “షో” తర్వాత నీలకంఠ దర్శకత్వం వహించిన సినిమాల్లో కేవలం “మిస్సమ్మ” ఒక్కటే ప్రేక్షకాదరణ పొందింది. కానీ ఇంటెలిజెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందివ్వాలన్న తపన మాత్రం నీలకంఠలో బాగా కనిపిస్తుంది.

“హైదరాబాద్ బ్లూస్” చిత్ర విజయం స్ఫూర్తితో శేఖర్ కమ్ముల “డాలర్ డ్రీమ్స్” చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందినప్పటికీ, సినిమా నిర్మాతగా మాత్రం చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ళకు “ఆనంద్” సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఇండిపెండెంట్ సినిమాకు నాంది పలికారు. నిజానికి “ఆనంద్” సినిమా గొప్ప సినిమా కాకపోయినప్పటికీ యాక్షన్, వయొలెన్స్ మరియు ప్రేమ చిత్రాలతో విసిగి వేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకు నిజజీవితానికి దగ్గరగా సరళమైన రీతిలో ఆర్భాటాలు, హంగులు, హడావుడులకు దూరంగా మంచి సంగీతంతో కొత్తదనాన్ని అందించడంలో సఫలం కాగలిగారు. “ఆనంద్” తర్వాత శేఖర్ తీసిన “గోదావరి” సినిమాలో పాత్రల మనస్తత్వాన్ని అవగాహన చేయడం వరకూ బాగానే ఉన్నప్పటికీ సినిమాలో ఏదో లోపం కనిపిస్తుంది. అందుకేనేమో “ఆనంద్” లాగ ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. అంతమాత్రాన గోదావరి సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైందని చెప్పలేము. శేఖర్ కమ్ముల సినిమాలకు లభిస్తున్న ఆదరణకు ముఖ్య కారణం చదువుకున్న యువతీ యువకులు అర్థవంతమైన సినిమాకై వేచిచూడడమే అన్నది సత్యం.

“ఆనంద్” సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కేవలం ఐదు లక్షల వ్యయంతో షుమారు రెండు గంటల నిడివి కలిగిన సినిమాను తీసి డిజిటల్ సినిమాకు తెలుగులో పునాదులు వేశారు. కాకపోతే పాత రోజుల్లోని మూఢనమ్మకాల ఆధారంగా ఈయన రూపొందించిన సినిమా కేవలం అవార్డులు మాత్రమే సాధించగలిగింది కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా చేరలేదనడంలో సందేహం లేదు. అందుకు కారణం అతనెన్నుకున్న కథే అని చాలా మంది అభిప్రాయం. అంతే కాకుండా ఈ సినిమాలో ఏముందని అతనికన్ని అవార్డులొచ్చాయో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఒకప్పటి మన సాంప్రదాయాలను తెరకెక్కించడం మంచిదే కానీ అతనికిచ్చిన పదకొండు అవార్డులు అతనికే దక్కాయంటే అందులో అతని ప్రతిభతోబాటు, మంచి సినిమాలు రూపొందించే దర్శకులు కూడా కరువయ్యారన్న నిజం కూడా నిర్ధారణవుతుంది. అతని రెండో సినిమా అయిన “మాయా బజార్” రొటీన్ కి భిన్నంగా ఉండేలా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం అపజయం పొందిందనే చెప్పాలి. చాలా రోజులుగా అతను పని చేస్తున్న “ఏకాంత గీతం” సినిమా రూపొందాక గానీ ఈ దర్శకుని సత్తా ఏమిటో అంచనా వేయలేము.

వీరందరితోపాటు “ఐతే” సినిమా తీసిన చంద్రశేఖర్ ఏలేటి కూడా స్క్రీన్ ప్లే పరంగానూ, దర్శకత్వ పరంగానూ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. అందరూ కొత్తవాళ్ళతో మితిమీరిన వ్యయ ప్రయాసల జోలికి పోకుండా “ఐతే” ద్వారా మంచి ప్రయత్నమే చేసినప్పటికీ, ఇతని రెండో సినిమా “అనుకోకుండా ఒక రోజు”, ఆ తర్వాత వచ్చిన “ఒక్కడున్నాడు” సినిమాలు కాస్తంత విపరీత ధోరణిలో నడుస్తాయి. వెరైటీని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు కానీ ఆ వెరైటీ మరీ తెచ్చిపెట్టినట్టు ఉండకపోతే బావుంటుందన్న విషయం ఈయన గ్రహిస్తే మంచి సినిమాలు తీసే అవకాశం ఎంతో వుంది.

పైన పేర్కొన్న వాళ్ళు మాత్రమేకాకుండా “కోకిల” సినిమా తీసిన గీతాకృష్ణ, “కళ్ళు” సినిమా తీసిన MV రఘు, “దాసి” సినిమా తీసిన బి.నర్సింగరావు, “తిలాదానం” తీసిన KNT శాస్త్రి, “ఎల్లమ్మ” తీసిన మోహన్ కోడా, “వనజ” సినిమా తీసిన రజనీష్ లాంటి వారు చాలా మంది తెలుగులో మంచి సినిమాలను తీసుకొద్దామని ప్రయత్నం చేసారు. రాబోయే కాలంలో చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు సంవత్సరానికి ఒకటో అరో మాత్రమే కావడంతోనూ, ఇప్పటికీ మెజారిటీ సినిమాలు పాత ఫార్ములమీదే ఆధారపడి నిర్మితమవుతుండడంచేతనూ మన సినిమాలకొచ్చిన గడ్డురోజులు ఇప్పట్లో పోయే సూచనలేవీ కనిపించడంలేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు తమిళ, మళయాళం, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తమిళ సినిమాకి మహేంద్రన్, భారతీరాజా, బాలూ మహేంద్ర, బాలచందర్, మణిరత్నం, బాల, చేరన్, గౌతం మీనన్ లాంటి వాళ్ళు కన్సిస్టెంట్ గా మంచి సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అక్కడి దర్శకులే కాకుండా సూర్య, విక్రమ్, కమల్ హాసన్ లంటి స్టార్ ఇమేజ్ కలిగిన నటులు కూడా ఇమేజ్ చట్రం నుండి బయటకొచ్చి ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో గిరీష్ కాసరవెళ్ళి, నాగాభరణ, గిరీష్ కర్నాడ్, MS సత్యు, పుట్టణ్ణ కనగళ్, పట్టాభిరామిరెడ్డి, శంకర్ నాగ్ లాంటి దర్శకులు కమర్షియల్ సినిమాకు సమాంతరంగా తమ సినిమాలను రూపొందించడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ కూడా చూరగొన్నారు. ఇలాగే మలయాళం లో కూడా అదూర్ గోపాల కృష్ణన్, జాన్ అబ్రహాం, అరవిందన్, K R మోహనన్ లాంటి దర్శకులెందరో అర్థవంతమైన సినిమాలను రూపొందించారు. బెంగాలీ సినిమాల గురించి ఇక చెప్పనవసరం లేదు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, అపర్ణ సేన్ లాంటి ఎంతో మంది తమ సినిమాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. ప్రస్తుత హిందీ సినిమా పరిస్థితి మనకంటే ఘోరంగా ఉన్నప్పటికీ 1980 ప్రాంతాల్లో ఎంతో మంది దర్శకులు అద్భుత కళాఖండాలను మనకందించారు. శ్యాం బెనెగల్, సాయి పరాంజపే, గురు దత్, అమోల్ పాలేకర్, గౌతం ఘోష్, గోవింద్ నిహలానీ, మీరా నాయర్, కేతన్ మెహతా వంటి దర్శకులు తమ సమాంతర సినిమాలతో భారతీయ సినిమాకు మరో దృక్కోణాన్ని కల్పించారు.

హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా పరిశ్రమల్లో లాగా మన సినీ పరిశ్రమలో సమాంతర సినిమా (parallel cinema) కి అవకాశం లేనందువల్లనే తెలుగు సినిమాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోయింది. 21 వ శతాబ్దపు మొదటి దశాబ్దపు చివరి రోజుల్లో కూడా తొడ కొడితే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, కేరళలో బీభత్సం సృష్టించిన మన తెలుగు వాడి గురించి కనీసం వార్తగానైనా అందకపోవడం, గాల్లో ఎగిరే బైకులు, జీపులు, తను ప్రేమించిన అమ్మాయికోసం ప్రపంచాన్నే ఎదిరించడం లాంటి విపరీత ధోరణులు తప్ప, నవ్యతకు అవకాశం లేకుండా పోతోంది.

ప్రస్తుత తెలుగు సినిమా యొక్క దీన స్థితికి కారణాలు అనేకం. అందులో కొన్ని:

  1. హిట్టయిన సినిమా కథనే మళ్ళీ మళ్ళీ వాడుకుని కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త సినిమాలు తీయడం
  2. ప్రతిభ కలిగిన నూతన నటీనటులకు అవకాశాలు లేకపోవడం
  3. సినిమాలు వారసత్వ సంపదగా భావించి కొంతమంది ఆజమాయిషీ చేయడం
  4. సినిమా తారలను కులాల ప్రాతిపదికగా ఆరాధించడం, దైవంతో సమానంగా పూజించడం
  5. తమ స్వార్ధం కొరకు సినిమాలను వినియోగించుకోవడం
  6. నవ యువ దర్శకులు కూడా పాత పధ్ధతులనే అవలంబించడం
  7. తెలుగులో ఉన్న సాహిత్యాన్ని సినిమాలుగా మలిచే ఆలోచన లేకపోవడం
  8. దర్శక నిర్మాతల్లో కళాదృష్టి లోపించడం
  9. వసుధైక దృక్పథం కలిగిన కథలు సృష్టించలేకపోవడం
  10. వ్యాపారాత్మక ధోరణి లోనే సినిమాలను చూడడం

పైన పేర్కొన్న కారణాలన్నీ సినిమాలు తీసే వారి కోణంలో మాత్రమే. సినిమాకి తీసే వాళ్ళు ఎంత ముఖ్యమో చూసే వాళ్ళూ కూడా అంతే ముఖ్యం. ఎవరేం చెప్పినా సినిమాకి ప్రేక్షకులు అవసరం. ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తీస్తున్నామని దర్శకులు, నిర్మాతలు తమని తాము మోసం చేసుకున్నా మనకిలాంటి నాణ్యతలేని సినిమాలే దిక్కవుతున్నాయంటే తప్పు ప్రేక్షకుల్లోనూ వుంది. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూడాలి. చెత్త సినిమాలను సానుభూతి లేకుండా నిరాకరించాలి. జాతి కుల మతాలకు అతీతంగా సినిమాలను మనం ఆదరించాలి. సినిమా అంటే కేవలం చవుకబారు వినోదం కాదని మనం గుర్తించాలి. చూస్తూ చూస్తూనే బుర్రకథ, హరికథ, నాటకం, తోలుబొమ్మలాట లాంటి కళలు మన కళ్ళముందు నుండి అదృశ్యమయ్యాయి. సంగీత పరంగా మనకిప్పుడు సినిమా పాటలే దిక్కయ్యాయి. శాస్త్రీయ సంగీతం మూగబోతోంది. తెలుగు సాహిత్యపు వెలుగులు గుడ్డిదీపాల్లా నిస్తేజంగా ఉన్నాయి. చిత్రకళకు ప్రోత్సాహం లేక కుంచెలు ఎండిపోతున్నాయి. శిల్పకళ, నృత్యకళల సంగతి ఇక సరే సరి. ఇప్పుడు మనకున్న ఒకే ఒక కళ సినిమా. సినిమా అంటే 64 కళల సమ్మేళనం అంటారు. కానీ నానాటికీ క్షీణించిపోతున్న కళలతోపాటు త్వరలో సినిమా కూడా కమర్షియల్ ఒరవడిలో కొట్టుకుపోయి చివరకు మనకు మిగిలేది అర్థం పర్థం లేని గోల మాత్రమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే మన సినిమాల్లో మార్పు అవసరం.

ప్రపంచంలోని అన్ని సినిమా పరిశ్రమల్లో జరిగినట్టే మనసినిమాల్లోనూ మార్పు సంభవించాలి. ప్రపంచ దేశాల్లోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలో 1980 ప్రాంతంలో విజృంభించిన సమాంతర సినిమా లాగా మన సినిమా పరిశ్రమలో కూడా కొత్త వాయువులు వీచాలి. అందుకు ముందుగా ప్రేక్షకులు మారాలి. ఫ్రాన్స్ లో ఎగసిన new wave గురించి తెలుసుకోవాలి. సోవియట్ రష్యా లో ఐసెన్‌స్టీన్ ఎడిటింగ్ ద్వారా చేసిన ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి. ఇటలీ లోని వాస్తవికతాధార సినిమాలు మనకి ప్రేరణ కావాలి. 1995 లో, డెన్మార్క్ లో చెత్త సినిమాలు తియ్యమని ప్రతిజ్ఞ పూని Dogme అనే కొత్త సినిమాను సిద్ధాంతపరిచిన దర్శకులు మనకు ఆదర్శం కావాలి. జర్మనీ, హాంగ్‌కాంగ్, ఇరాన్, అమెరికా, ఇంగ్లాండ్, తైవాన్ లాంటి దేశాల్లో ఏర్పడిన సినీ విప్లవాల నుంచి మనమూ పాఠాలు నేర్చుకోవాలి. యదార్ధమైన తెలుగు కథలు మన సినిమాలకు ఆధారం కావాలి. అన్నింటికీ మించి, మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ కావాలి.

“ఆఫ్ట్రాల్ సినిమానే కదా ? దీనికింత చర్చలు అవసరమా? ఇష్టం లేకపోతే చూడొద్దు. It is not an obligation, I say!” అని అనుకుంటే సరిపోదు. నిజమే!తెలుగు సినిమాలు చూడమని ఎవరూ ఎవర్నీ నిర్బంధించలేరు. కానీ సినిమాల్లేకుండా ఊహించలేనంత విధంగా మన జీవితాలు సినిమాలతో ముడివడిపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకూ “ఏ సినిమా షూటింగ్ మెదలయింది, ఏ సినిమా రిలీజ్ అయ్యింది, హిట్టయిందా, ఫ్లాపయిందా? , ఏ సినిమా ఎన్ని సెంటర్లలో వంద పడింది, ఎన్ని ప్రింట్లతో రిలీజయింది, కలెక్షన్లెంత, ఫలానా హీరో సినిమాలో పాటలెలా ఉన్నాయి” లాంటి విషయాలు మన దైనందిన జీవితంలో నిత్యం చోటు చేసుకుంటూనే వుంటాయి. “లేదే? మా జీవితాల్లో సినిమాకు మించిన విషయాలెన్నో ఉన్నాయి. సినిమాలు మా జీవితాల్లో పెద్దగా ప్రభావం చూపట్లేదే” అని మీరనుకుంటే ఇంతవరకూ చదివి మీ సమయం వృధా చేసుకున్నట్లే! ఇది సినిమాల గోల. సినిమా అంటే పడి చచ్చిపోయే వారి గోల. అన్నింటికీ మించి రొటీన్ రూట్లో పయనిస్తున్న సినిమా నావకు నవతరంగపు అలజడితో కొత్త దిశను నిర్దేశించాలన్న తపన. ఈ మార్పు ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అనేది చాల పెద్ద ప్రశ్న.

వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఇది మొదటి అడుగేమో! ఇంటర్‌నెట్ విప్లవంతో జ్ఞానం విస్తరించింది. ప్రజల మధ్య కమ్యూనికేషన్ సులభతరమైంది. DVD ల ద్వారా ప్రపంచ నలుమూలల నుండి వెలువడిన సినిమాలను చూసే అవకాశం కలుగుతోంది. ఈ మధ్యనే ఇంటర్‌నెట్ తెలుగులో కూడా లభ్యమవుతుంది. మన వాళ్ళూ ప్రపంచం నలుమూలలా వ్యాపించారు. లెక్కకు మించి ఫిల్మ్ ఫెస్టివల్స్, TV చానల్స్ ఉన్నాయి. మంచి సినిమా ప్రదర్శనకు సినిమా హాళ్ళే అవసరం లేదు. మంచి సినిమా తీయాలనుకునే వాళ్ళకు హద్దులు, పరిమితులు చెరిగిపోతున్నాయి. సినీ వీరాభిమనులారా నడుం బిగించి మరో అడుగు వేయండి. ప్రయాణానికి సిధ్ధం కండి. ఈ ప్రయాణానికి గమ్యం లేదు. This is a journey more important than its destination. పదండి ముందుకు. మరో ప్రపంచం పిలుస్తోంది.

పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)
Posted in వ్యాసం | Tagged | 36 Comments

జూన్ గడిపై మీ మాట

జూన్ గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. మే గడి, సమాధానాలు
2. ఏప్రిల్ గడి, సమాధానాలు
3. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 6 Comments

చరిత్ర, విజ్ఞానశాస్త్రం

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు. పొద్దులో ఈనెల అతిథి వ్యాసం రాయమని కోరగానే అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాం.

—————–

చరిత్ర అంటే ఏమిటి? మనలో చాలామందికి స్కూలు రోజులనుంచీ హిస్టరీ అంటే అయిష్టత ఏర్పడుతుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల చిట్టాలాగా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. జరిగిన విషయాల పూర్వాపరాలను సకారణంగా వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషించవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఒకదాని వెంట ఒకటిగా జరిగిన సంఘటనలకు సామాన్యంగా కార్యకారణ సంబంధాలుంటాయి. ఈ సంఘటనలన్నీ ఒకే ప్రాంతంలో జరగాలని కూడా లేదు. జరిగిన ప్రతిదానికీ ఎన్నో కారణాలుంటాయి. వీటి వెనక ఉన్న వ్యక్తిగత ప్రేరణలు ఎటువంటివైనా మొత్తం మీద అనేక సందర్భాల్లో బాహ్య పరిస్థితులే బలవత్తరంగా పనిచేసి ఉంటాయని చెప్పవచ్చు. వాటన్నిటినీ సహేతుకంగా, అనేక వైజ్ఞానిక పద్ధతుల్లో అధ్యయనం చేసి అర్థం చేసుకుంటున్నారు.

కేవలం పురాతత్వశాస్త్రానికి పనికొచ్చే అవశేషాలూ, శాసనాలూ మొదలైన ప్రత్యక్ష ఆధారాలే కాక భూగోళశాస్త్రం (జాగ్రఫీ), సామాజికశాస్త్రం (సోషియాలజీ), మానవ పరిణామ శాస్త్రం (ఆంత్రోపాలజీ) మొదలైనవన్నీ చరిత్ర గమనాన్ని విశ్లేషించడానికి పనికొస్తాయి. అలాగే మనిషి ఆవిర్భావానికి ముందు జరిగినవాటిని అర్థం చేసుకోవడానికి పురావృక్షశాస్త్రం (పేలియో బోటనీ), పురాజంతుశాస్త్రం (పేలియో జువాలజీ) మొదలైన ప్రత్యేక విజ్ఞాన పద్ధతులున్నాయి. ఆధునిక చారిత్రక విశ్లేషణలో భాషాశాస్త్రం నుంచి వాతావరణశాస్త్రం దాకా అనేక విషయాలలో కృషి చేస్తున్న ప్రజ్ఞావంతులు పాల్గొంటూ ఉంటారు. వీరందరి సహకారమూ లేకపోతే చరిత్రను గురించిన సమగ్రమైన దృక్పథం ఏర్పడదు. అందువల్ల ఒక్కొక్కప్పుడు చరిత్ర కూడా విజ్ఞానశాస్త్రంలాగే తయారవుతుంది.

విజ్ఞానం మరికొన్ని సంగతులను కూడా పరిశీలిస్తుంది. సమాజానికి సంబంధించినంతవరకూ మనిషి నైజం ఎటువంటిది? ఇతరులతో మెలిగే పద్ధతీ, స్త్రీపురుషుల సంబంధాలూ, పిల్లలూ, కుటుంబం గురించిన భావనలూ ఎలా రూపొంది, మార్పులు చెందాయి? మానవ సమాజాలు ఏర్పడిన తొలి దశల్లో వారి ప్రవర్తనకూ, మానసిక అనుభూతులకూ సంబంధం ఉండేదనీ, సమాజపు కట్టుబాట్లూ, నీతినియమాలూ వాటివల్లనే రూపుదిద్దుకుని ఉంటాయనీ కొందరి అభిప్రాయం. ఈ అనుభూతులకు శారీరక కారణాలను విశ్లేషించే సామాజిక జీవశాస్త్రం (సోషియో బయాలజీ) మొదట్లో కొంత వివాదాస్పదం అయింది కూడాను.1 ఇందులో ఎన్నో విషయాలు విశ్లేషణకు లోనవుతాయి. ఉదాహరణకు ఎన్ని వేల ఏళ్ళు గడిచినా ప్రజలు సముదాయాలుగా ఏర్పడి జాతి, మతం, కులం, శాఖ వగైరా సాకులతో పరస్పరం కలహించుకోవడానికి కారణం ఆదిమానవులు వందా, రెండు వందలకు మించని తెగలుగా ఎంతో కాలం జీవించడమే కారణం అయి ఉండవచ్చనే ఒక అభిప్రాయం ఉంది.2 సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది ఒక మంచి ఆదర్శమే అయినప్పటికీ ఆచరణలో మనుషులు సంఖ్యాపరంగా ఒక స్థాయిని మించి ఇతరులను “అస్మదీయులు”గా భావించలేకపోవడానికి కారణం ఇదేనేమో.

మానవజాతి చరిత్ర ఎప్పుడు మొదలయిందో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే అది ఆదిమానవుల ఆవిర్భావం మీదా, ఇంకా చెప్పాలంటే అంతకు ముందు జరిగిన ప్రాణుల, క్షీరదాల జీవపరిణామం మీదా ఆధారపడే విషయం. మరొకటేమిటంటే ఈ చరిత్ర, లేదా దానికి పూర్వరంగం ఎక్కడెక్కడ, ఎప్పుడు, ఎలా మొదలయిందో అర్థం చేసుకోవాలంటే వివిధ ప్రాంతాల్లో యుగాలవారీగా జరిగిన భౌగోళిక మార్పులూ, వాతావరణపు వ్యత్యాసాలూ, నైసర్గిక పరిస్థితులూ అన్నీ లెక్కలోకి తీసుకోవాలి. వీటిని అధ్యయనం చేస్తే చరిత్రకు పునాదులు ఎలా ఏర్పడ్డాయో తెలుస్తుంది. ఇది మరొక రకమైన శాస్త్రీయ అధ్యయనం.

చరిత్ర మొదలవుతున్న తరుణంలో ప్రభావం కలిగించిన బాహ్య పరిస్థితులెటువంటివి? మానవుల నివాస స్థావరాలు ఏర్పడుతున్న దశలో ప్రాంతాలవారీగా మొక్కలూ, జంతువులూ పెరగడం అనేది పరోక్షంగా చరిత్రను నిర్దేశించిందని జారెడ్‌ డయమండ్‌వంటి పరిశోధకుల అభిప్రాయం.3 ప్రాచీన నాగరికతలు ప్రపంచంలో కొన్ని స్థలాల్లోనే ఎందుకు మొదలయాయో, వేటవంటివి మానుకుని పొలం సాగు చెయ్యగలిగిన అవకాశాలు అక్కడే ఎందుకు ఏర్పడ్డాయో శాస్త్రవేత్తలు చెప్పగలరు. అంటే హిస్టరీకి మూలకారణం జాగ్రఫీయే. ఇటువంటి పరిశీలనలవల్ల పంటమొక్కల్లోని జన్యుజాతులూ, అవి ఏపుగా పెరగగలిగేందుకు అవసరమైన పరిస్థితులూ శాస్త్రీయంగా వివరించబడ్డాయి.

మానవజాతి ఆవిర్భావం మొదట ఆఫ్రికా ఖండంలోనే జరిగింది గనక తొలి మానవులకు అంతకంతకూ వేటలో పెరుగుతున్న నైపుణ్యం అక్కడి వన్యప్రాణులకు అవగతం అయింది. అందువల్ల అవి పూర్తిగా అంతరించిపోకుండా నిలదొక్కుకోగలిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అలా కాకుండా తొలి మానవులు చాలా ఆలస్యంగా ప్రవేశించారు. రకరకాల ఆయుధాలను ప్రయోగించ నేర్చిన వారి ధాటికి అక్కడ అనాదిగా ఉంటున్న జంతువులన్నీ త్వరలోనే బలి అయిపోయాయి. వేటాడదగిన జంతువులు తగ్గిపోవడం, మనుషుల జనాభా పెరగడం వగైరా కారణాలవల్ల ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అప్పటిదాకా కేవలం వేటా, ఆహారసేకరణ పద్ధతుల మీదనే ఆధారపడ్డ మానవులకు క్రమంగా పొలం సాగు, జంతువులను మందలుగా పెంచడంవంటి ప్రత్యామ్నాయ పద్ధతులు తప్పనిసరి అయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతంలోనూ వన్యజాతి మొక్కల్లో సాగుపంటలుగా పరిణమించి, తగిన పోషణ నివ్వగలిగిన ధాన్యాలూ, మనుషులకు పనికొచ్చిన పెంపుడు జంతువులూ కొన్నే కనిపిస్తాయి. మాంసానికీ, పొలం దున్నడానికీ, రవాణా బళ్ళకు పూన్చడానికీ, ఉన్ని వంటి పదార్థాలను సరఫరా చెయ్యడానికీ కొన్ని జంతువులే సాధువులుగా తయారై, మందలలో పెరగగలవు. ఈ జంతువులూ, మొక్కలూ అన్నీ పశ్చిమాసియాలోనే మనుషులకు ముందుగా తారసిల్లాయి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లా కాకుండా అప్పట్లో సస్యశ్యామలమైన ఒక్క పశ్చిమాసియాలోనే అటువంటి జంతువులూ, ధాన్యాలూ పెరిగేవి.


ఒకప్పటి సస్యశ్యామల పశ్చిమాసియా ప్రాంతం

అందుచేత గొర్రెలూ, మేకలూ, పశువులవంటివి ఇతరులకన్నా ముందుగా పశ్చిమాసియావాసులకు మచ్చికకు ఎందుకు పనికొచ్చాయో మనకు ఈనాడు తెలుస్తోంది. ముఖ్యమైన ఆహారధాన్యాల వ్యవసాయంతో బాటు స్థిరనివాస క్షేత్రాలూ, అదనపు ఆహారోత్పత్తీ తలెత్తాయి. ఇవి మనుషుల జీవితాల్లో అపూర్వమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇటువంటి జంతువులూ, ధాన్యాలూ పెరగగలిగిన ప్రాంతాల్లోనే తొలి నాగరికతలకు బీజాలు పడ్డాయంటే అది యాదృచ్ఛికం కాదు. బేబిలోనియా (నేటి ఇరాక్), ఈజిప్ట్ మొదలైన నాగరికతల సామర్థ్యమంతా త్వరలోనే ఇతర పరిసర ప్రాంతాలకూ, పడమటి దిశగా యూరప్‌కూ పాకిపోయింది.

తూర్పు పడమరలుగా ఎక్కువ వైశాల్యం కలిగిన ఆసియా, యూరప్‌ ఖండాల్లో నాగరికతలు విస్తరించిన పద్ధతిలో అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో జరగకపోవడానికి వాటి నైసర్గిక స్వరూపం, వాతావరణ పరిస్థితులే కారణం. ఆసియా, యూరప్‌ ఖండాల్లో జంతువుల, ధాన్యాల పెంపకం పద్ధతులు త్వరలోనే అన్ని చోట్లకూ వ్యాపించగలిగాయి. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో మచ్చికకు పనికొచ్చే జంతువులూ, ధాన్యాలూ పెరగడమే తక్కువ; దానికి తోడుగా సమాచార వ్యాప్తికి ఎన్నెన్నో భౌగోళిక అవరోధాలు తోడయాయి. ఉత్తర, దక్షిణ దిశల్లో ఎక్కువ వైశాల్యం ఉన్న ఈ ఖండాల్లో అక్షాంశాన్ని బట్టి రుతువుల్లో కలిగే పెద్ద మార్పులూ, వివిధ ప్రాంతాలకు అడ్డుగా నిలిచిన ఎడారులూ, పర్వతాలూ మొదలైనవన్నీ అప్పటి ప్రజల మధ్య సంపర్కం పెంపొందడానికి ఆటంకాలుగా పరిణమించాయి.

మొత్తం మీద నాగరికత అనేది మొదలై, కాలూనుకుని మెరుగుపడడంలో తీవ్రమైన ప్రాంతీయ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ఇది శతాబ్దాల పాటు కొనసాగడంతో కొందరిది మాత్రమే పైచెయ్యి అయింది. నాగరికదశకు ముందుగా చేరుకున్న ఆసియా, యూరప్‌ ప్రజలకు ఇతర “ఆదిమ”తెగలను లోబరుచుకోవడం కష్టం అనిపించలేదు. మరొకవంక ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలన్నీ వెనకబడినవిగానే కొనసాగుతూ వచ్చాయి. వివిధ నగరాలూ, సామ్రాజ్యాలూ, సైన్యాలూ, యుద్ధాలూ తప్పనిసరిగా తలెత్తుతూ వచ్చాయి. తరవాతి కాలంలో ఉన్నతమూ, బలవత్తరమూ అయిన సామ్రాజ్యాలు విస్తరించడానికి ఇదే కారణమయింది. ఇదంతా చరిత్రకు భూమిక.

తరవాతి కాలంలో కూడా ప్రతి సంఘటనకూ భౌతిక ఆధారాలు కనబడతాయి. ఫలానా దేశంలో ఫలానా వంశపు రాజ్యపాలన ఎలా మొదలయింది వగైరా ప్రశ్నలకు శాస్త్రీయవివరణ దొరకవచ్చు. బాబర్‌వంటి ఫలానా రాజు మనదేశం మీదికి దండెత్తి వచ్చాడని చరిత్ర చెపుతుంది. ఎంత గొప్పగా వర్ణించినప్పటికీ యుద్ధాలన్నీ పెద్ద ఎత్తున జరిగిన సాయుధ దోపిడీలే. ఇలాంటివన్నీ కేవలం “పుర్రెకో బుద్ధి” అన్న పద్ధతిలో జరిగి ఉండకపోవచ్చు. మనం గుర్తుంచుకోవలసినదేమిటంటే బాబర్‌ అయినా, చెంఘిజ్‌ఖాన్‌ అయినా తన ప్రాంతంలో తలెత్తిన సామాజిక పరిస్థితులవల్లనే దండయాత్రలు చెయ్యవలసి వచ్చింది. వీటికి సామాన్యంగా వ్యక్తిగత కారణాలు ఉండవు. ఉన్న పరిస్థితులు అసంతృప్తికి దారితీసినప్పుడే మార్పులు అవసరమౌతాయి. కూడూ, గుడ్డా వగైరాలకు లోటు కలిగితే తప్ప ప్రాణాలకు తెగించి ఎవరూ పోరాడరు. ప్రజలను కదిలించటానికి మతవైషమ్యాలూ, జాతివైరాలూ పనికొచ్చినప్పటికీ నిజమైన కారణాలన్నీ భౌతిక అవసరాలకు సంబంధించినవే. భౌగోళిక ప్రతికూలతలవల్లనే వనరుల్లో ఇబ్బందులు కలిగేవి. జనాభా పెరిగి, అంతకంతకూ పరిమితమైపోతున్న వనరుల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ట్రోయ్‌ నగరాన్ని గ్రీకులు ముట్టడించడానికి కేవలం ఒక “రాణీ ప్రేమపురాణం” కారణం కాకపోవచ్చు. ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఆహారోత్పత్తి తగినంతగా జరగకపోవడం, జనాభా పెరగడం మొదలైనవన్నీ భౌగోళిక కారణాలవల్లనూ, వాతావరణంలో కలిగిన మార్పులవల్లనూ తలెత్తుతాయి. ఆధునిక విజ్ఞానం ద్వారా అప్పటి భౌతిక పరిస్థితులను మనం అంచనా వేసుకోవచ్చు. ప్రజల మధ్య జరిగిన (జరగనటువంటివి కూడా) సంఘర్షణల వల్లనే చరిత్ర రూపొందుతూ వచ్చింది. అలాంటప్పుడు చరిత్ర అనేదాన్ని కూడా విజ్ఞానశాస్త్ర పద్ధతిలోనే విశ్లేషించాలి.

చరిత్ర అంటే గతాన్ని గురించే కదా అనుకోవచ్చు కాని సామాజికశాస్త్ర దృక్పథంతో పరిశీలిస్తే ఉన్న పరిస్థితులనుబట్టి భవిషత్తులో ఏమవుతుందో ఊహించబుద్ధి అవుతుంది. ప్రపంచపు షేర్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టదలుచుకున్నవారు ఏ దేశం పరిస్థితి ఎలా మారబోతోందో వీలున్నంత ఖచ్చితంగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఒక్కొక్కప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోవడం, అధికారంలోకి వచ్చిన వ్యక్తి అనూహ్యమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపడం జరుగుతూ ఉంటుంది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి ముందు జరిగిన భారత పాకిస్తాన్‌ యుద్ధ కాలంలో ఇందిరా గాంధీ రాజకీయ వైఖరీ, ఆ తరవాత ఆమె హత్యా చరిత్రని ఎలా మార్చాయో మనకు తెలిసినదే. మరొకవంక పశ్చిమదేశాల ఉద్యోగాలు కొన్ని మన దేశానికీ, ఇతర ప్రాచ్య దేశాలకూ రెక్కలు కట్టుకు వెళుతున్న ధోరణినిబట్టి ఎటువంటి మార్పులు కలుగుతాయో కొంతవరకూ చెప్పవచ్చు.

ప్రాచీన అవశేషాలను గురించిన పరిశోధనల్లో శాస్త్రవిజ్ఞానం అనేకరకాలుగా పనికొస్తుంది. వేల ఏళ్ళనాటి శవాలు అరుదుగా మంచుకొండల్లో దొరికాయి. ఈజిప్ట్ పిరమిడ్లలో ప్రాచీన వ్యక్తుల కళేబరాలు లభించాయి. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి ఎక్స్‌రే యంత్రాలు మొదలైన ఆధునిక పరికరాలెన్నో ఉపయోగపడుతున్నాయి. అనేక రకాల వైజ్ఞానిక పద్ధతులను ఒకేసారి ఉపయోగించి, చరిత్రను అవగాహన చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవశేషాలు సేంద్రియ పదార్థాలు కలిగినవైతే వాటి వయసును కార్బన్ డేటింగ్ మొదలైన పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. భూమిమీది వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండేది కాదు. వేల సంవత్సరాల క్రితం అందులో ఎటువంటి వాయువులుండేవో తెలుసుకోవాలంటే అవి కరిగిన నీటిని పరిశీలించాలి. ఈ సాక్ష్యాలన్నీ ఆనాటి నీరు ఘనీభవించి దిగబడిపోయిన ధ్రువప్రాంతపు మంచుదిబ్బల అంతర్భాగాల్లో దొరుకుతాయి. అక్కడ లోతుగా తవ్వి తీసిన మంచుకడ్డీలను పరిశీలించినప్పుడు గతాన్ని గురించిన ఎన్నెన్నో వాతావరణ విశేషాలు తెలుస్తాయి.


1991లో ఆల్ప్స్ మంచుకొండల్లో లభించిన 5200 ఏళ్ళనాటి శవం, వైజ్ఞానిక పరిశీలనలు

భౌతిక పరిణామాలే జీవపరిణామాలకు ప్రేరణ. వీటిలో స్థానికంగా ప్రకృతి వైపరీత్యాలని కలిగించిన అగ్నిపర్వతాల పేలుళ్ళూ, భూకంపాలూ, వరదలేకాక, ఆకస్మికంగా భూమిమీదికి వచ్చిపడిన ఉల్కలూ మొదలైనవన్నీ మొత్తం జీవరాశి మీద తీవ్రమైన ప్రభావాలని కలిగించాయి. ఇంత అకస్మాత్తుగా కాకుండా భూమి సగటు ఉష్ణోగ్రత తగ్గుతూ పోయే పరిస్థితులను కలిగించేవి హిమయుగాలు. వాటివల్ల భూమి ఉపరితలం 10 నుంచి 30 శాతం దాకా మంచుతో కప్పబడిపోతుంది. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించాక దాని మొత్తం చరిత్రలో 15 నుంచి 20 శాతం హిమయుగాలుగానే గడిచింది. వీటిలో కొన్ని హిమయుగాలు కోట్ల సంవత్సరాలూ, మరికొన్ని ఎన్నో వేల సంవత్సరాల తరబడి కొనసాగాయి. గతంలో 80-60, 46-43, 35-25 కోట్ల సంవత్సరాల కిందట ఇవి కనీసం నాలుగుసార్లు వచ్చాయి. ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా వీటిలో కాస్త హెచ్చుతగ్గులు కలుగుతూ ఉండేవి కాని మొత్తంమీద శీతలస్థితే ఎక్కువ. మంచు హిమానీనదాల రూపంలో (గ్లేసియర్స్‌) ఇతర ప్రాంతాలకు చొచ్చుకువస్తూ ఉండేది. హిమయుగాల్లో ఈ హిమానీనదాలు భౌగోళికంగా పెద్ద మార్పులు కలిగించేవి.


హిమయుగాల చరిత్ర (కోట్ల సంవత్సరాలలో)

హిమయుగాల్లో చివరిది 16 లక్షల ఏళ్ళ క్రితం మొదలై 10 వేల ఏళ్ళ క్రితం అంతమైంది. ఇది సరిగ్గా మానవుల పరిణామ కాలానికి సరిపోతుంది. హిమయుగాలు వచ్చినప్పుడల్లా దాటరాని కొన్ని జలసంధులూ, జలాశయాలూ గడ్డకట్టుకుపోవడంతో వాటిపై నడిచి వెళ్ళడం వీలయేది. మంచు ఎక్కువగా ధ్రువాల్లో పేరుకుపోవడంతో సముద్రమట్టాలన్నీ తగ్గిపోతూ ఉండేవి. ప్రస్తుతం పడవలు లేకుండా దాటరానివిగా అనిపిస్తున్న కొన్ని ప్రాంతాలు అప్పట్లో లోయలలాగా అనిపించేవి. అందుచేత వానరాలకు భిన్నంగా రెండుకాళ్ళ నడక మొదలుపెట్టిన తొలిమానవులు ఎంత దూరమైనా కాలినడకన వెళ్ళగలిగారు. యూరప్‌ ఉత్తర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడటంతో మనుషుల, జంతువుల సంచారం సులువుగా జరిగి ఉంటుంది. ఈ వలసలవల్ల అనేక ప్రాంతాలు మనుషులకూ, జంతువులకూ కూడా నివాసయోగ్యం అయాయి.


హిమయుగాలలో మంచుతో కప్పబడిపోయిన ఉత్తర యూరప్

ఆ తరవాత మంచు కరిగి, మధ్యనున్న ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని సందర్భాల్లో తిరుగు ప్రయాణాలు వీలవలేదు. ఇటువంటి సంఘటనలన్నీ తరవాతి చరిత్రను కొంతవరకూ మార్చగలిగాయి.

ఆహారసేకరణకై ఆదిమానవుల బృందాలు సగటున ఎనిమిది సంవత్సరాల కొక మైలు దూరానికి కదులుతూ క్రమంగా భూఖండాలన్నిటినీ ఆక్రమించారు. అప్పట్లో తూర్పు ఆఫ్రికానుంచి పశ్చిమాసియాకూ, అరేబియానుంచి మనదేశానికీ కాలినడకన వెళ్ళడం వీలయేది. మహా అయితే కొన్ని రుతువుల్లో చిన్నచిన్న తెప్పలు అవసరమయేవేమో. అలాగే నేటి ఇండో చైనా ద్వీపకల్పం, ఇండొనేషియా ప్రాంతాలూ అన్నీ ఒకటిగా ఉండేవి. తూర్పుకేసి నడిచిన తొలి మానవులు న్యూగినీ, ఆస్ర్టేలియా మొదలైన ప్రదేశాలన్నిటినీ సులువుగా చేరుకోగలిగారు. హిమయుగం అంతమై సముద్రజలాల మట్టం పెరిగిన తరవాత ప్రస్తుతపు తీరరేఖలన్నీ రూపుదిద్దుకున్నాయి. అప్పటికే వివిధ ప్రదేశాలకు చేరుకున్న ప్రజలు నౌకాయానాలూ, ఇతర రవాణా సౌకర్యాలూ కనిపెట్టినదాకా ఎక్కడికక్కడే బందీలలాగా మిగిలిపోయారు.


హిమయుగాలలో మరింత విస్తృతంగా ఉండిన ఆస్ట్రేలియా

సముద్రాలు అడుగంటటంతో ఈనాడు ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న న్యూగినీ ద్వీపాలూ, దక్షిణాన ఉన్న టాజ్మేనియా అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. ఇప్పటిలాగా మధ్యలో సముద్రాలుండేవి కావు. అటు తూర్పు ఆసియాలో వియత్నాం, చైనా తూర్పు తీరప్రాంతాలూ, బోర్నియో అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. విస్తృత ఆసియా తూర్పు కొసకూ విస్తృత ఆస్ర్టేలియా పడమటి ప్రాంతాలకూ మధ్య సముద్రం చిన్నదిగా ఉండేది. అలాగే ఆసియా ఈశాన్య ప్రాంతపు కొసకూ అలాస్కాకూ మధ్య బెరింగ్‌ జలసంధి ఉండేదికాదు. ఈ కారణంగా కొన్ని ప్రాంతాలకు ప్రజలు కాలినడకన వలసపోగలిగారు. మరికొన్ని చోట్ల పడవల తయారీ జరిగినదాకా సంపర్కం ఏర్పడలేదు. ఇవన్నీ నాగరికత అభివృద్ధినీ, వ్యాప్తినీ చాలా ప్రభావితం చేశాయి. ఈ విషయాలన్నీ వైజ్ఞానిక పద్ధతుల్లో పరిశీలించి తెలుసుకున్నవే.


బెరింగ్ జలసంధి – నాడు, నేడు

పెద్ద హిమయుగాలేకాక గత కొన్ని శతాబ్దాలుగా మరికొన్ని చిన్న హిమయుగాలు కూడా తలెత్తుతూ వచ్చాయి. ఇవి కొన్ని శతాబ్దాలపాటు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. వీటిలో కొన్ని రెండు మూడువందల ఏళ్ళపాటు కొనసాగుతాయనీ శాస్త్రవేత్తలు అంటారు. ఉదాహరణకు క్రీ.శ. 1150-1460 మధ్యలోనూ, 1560-1850 మధ్యలోనూ యూరప్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. 1816లో యూరప్‌లో వేసవి అనేది రానేలేదట. 1812లో రష్యాపై నెపోలియన్‌ సేనలు జరిపిన దాడి విఫలం కావడానికి విపరీతమైన చలి కూడా ఒక ముఖ్యకారణమయింది. చిన్న హిమయుగాలవల్ల వ్యవసాయంలో మార్పులూ, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఒత్తిళ్ళూ, వలసలు వెళ్ళడాలూ, కళలూ, సాహిత్యంలో పరిణామాలూ ఇలా ఎన్నో పరివర్తనలు కలిగాయి. ముఖ్యంగా తిండిగింజల ధరవరలూ, తాత్కాలికంగా ఏర్పడిన కొరతలూ, కరువులూ సామాన్యులను చాలా బాధించాయి. తమ జీవితాలు ఎందుకిలా అస్తవ్యస్తం అవుతున్నాయో అప్పటివారికి అర్థం కాలేదు. ప్రకృతి పగబట్టినట్టుగా మాత్రమే అనిపించింది. ఇవన్నీ తరవాతి కాలంలోని వివిధ పరిణామాలకు కారణమయాయి.

చరిత్రను విజ్ఞానంగా పరిగణించగలమా? అసలు శాస్త్ర విజ్ఞానానికీ చరిత్రకూ తేడాలేమిటి? విజ్ఞానశాస్త్రాలకు కొన్ని సూత్రాలుంటాయి. అవి సర్వత్రా వర్తిస్తాయి; లేదా పరిస్థితులనిబట్టి కొన్ని మినహాయింపులుంటాయి. అందువల్ల ప్రయోగ ఫలితాలను నిక్కచ్చిగా ఊహించి చెప్పవచ్చు. పైకెగరేసిన బంతి భూమిమీదా, చంద్రుడిమీదా ఎంత వేగంతో వచ్చిపడుతుందో లెక్క కట్టవచ్చు. భౌతిక, రసాయనశాస్త్రాలకిది వర్తిస్తుంది కాని, జీవశాస్త్రం వంటివాటిలో పెద్ద ఎత్తున సేకరించిన సమాచారాన్ని బట్టి స్థూలంగా మాత్రమే అంచనా వెయ్యవచ్చు. ఎందుకంటే అటువంటి నమూనాల్లో మార్పు చెందగలిగిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మూల భౌతిక ప్రేరణల్లోని స్వల్ప వ్యత్యాసాలు విభిన్న ఫలితాలని కలిగిస్తూ ఉంటాయి. చరిత్రవంటి విషయాల్లో ఇది మరీ అసాధ్యం అనిపిస్తుంది. వీటిలో సామాన్యంగా గడిచిపోయిన విషయాలని శాస్త్రీయంగా వివరించడం సులువుగా అనిపిస్తుంది గాని, ముందుగా ఊహించి చెప్పడం కష్టమే. జరిగిన సంఘటనల్లో వ్యక్తుల పాత్ర లేదని కాదు. ఉదాహరణకు దండయాత్రలు ఏ కారణంవల్ల జరిగినప్పటికీ వాటిని ముందుండి నడిపిన అలెగ్జాండర్‌, చెంఘిజ్‌ఖాన్‌, నెపోలియన్‌, హిట్లర్‌ తదితరుల సాహసం, స్వభావం, శక్తిసామర్య్థాలూ మొదలైనవన్నీ చరిత్రని తీవ్రంగా ప్రభావితం చేసినమాట నిజమే.

రాజకీయ నాయకులూ, ముఠాలూ పాతకాలపు సంఘటనలను గుర్తు చేసి, వాటిని ఈనాటి పరిస్థితులకు ఏదోలా అన్వయించి, విద్వేషాలు రగిల్చి, ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉండడం చూస్తాం. ఇందులోని అశాస్త్రీయ అంశాలేమిటో మనం తెలుసుకోవాలి. సంఘర్షణలు అనివార్యమైనవే అనుకున్నప్పటికీ వాటికి గల భౌతిక కారణాలేమిటో శాస్త్రీయవిజ్ఞానం మాత్రమే సరిగ్గా తెలియజెయ్యగలదు.

1. E. O. Wilson, Sociobiology: The New Synthesis, Belknap Press, 1975
2. Robert Wallace, The Genesis Factor (New York: Morrow and Co., 1979)
3. Jared Diamond, Guns, Germs, and Steel: The Fates of Human Societies, W. W. Norton & Company (1999)

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ (http://rohiniprasadkscience.blogspot.com)
Posted in వ్యాసం | Tagged | 17 Comments

మే గడి సమాధానాలు

సిముర్గ్

సరైన సమాధానాలు పంపినవారు:

తప్పుల్లేకుండా: బి. కామేశ్వర రావు
ఒకటి రెండు తప్పులతో: సత్యసాయి, స్వాతి కుమారి
మూడు నాలుగు తప్పులతో: కొత్తపాళీ, శ్రీరామ్
అసంపూర్తిగా పంపిన వారుః చిట్టెళ్ల కామేష్, చరసాల ప్రసాద్

ప్రయత్నించినవారందరికీ అభినందనలు!

1క కా 2వి 3క లు     4ఋ ష్య 5మూ 6కం  
  7ను సి   8హె మ్మిం గ్వే   9ల 10బ
గొ   వీ   11ము     12దం చు     13డ
ట్టు   ధి   ళ్ళ   14వే   15రి 16సా బా
  17ల     పూ   వి     టర్   గ్ని
18చ చ్చి 19వా డి 20క ళ్ళు 21చా 22రె డే 23సి  
    గు   ళం   24సో జా   25గ 26డి
27స 28మ     29కం 30ద   31కా ని ని
32భా స్వ రం   33ష్టి   34డ రు   ట్ల  
35మ తి   36కౌ ము ది     లు   37గో 38డ
ర్యా   39రా     40ప 41వే     42త్రం
  43కా ర్త వీ ర్యా ర్జు ను డు     వి

ముఖ్యమైన ఆధారాలకు వివరణః

అడ్డం:

  • 7. “నువ్వు చూసి” పదంలో రెండు చివర్లా చూస్తే “నుసి” – పాతకొయ్య నుంచి రాలేది.
  • 24. “సోజా రాజకుమారీ సోజా” అనేది సైగల్ పాట. అందువల్ల = సో (ఆంగ్లం), పోమ్ము = (జా), పడుకో = సోజా(2)
  • 27. సరమ అనేది హిందూ పురాణాల్లోని ఒక కుక్క పేరు.
  • సరమ కథ పూర్వగాథాకల్పతరువు (రచయిత: ఆర్వీయార్) లో ఉన్న ప్రకారం: “దేవతల శునకం. ఇంద్రుడు గోమేథం చెయ్యబోయేడు. కొన్ని గోవుల్ని తెచ్చేడు. సరమను వాటికి కాపలా ఉంచేడు. దనుజులు వాటిని యెత్తుకుపోయేరు. సరమ దనుజుల దగ్గర లంచం పుచ్చుకుంది. అంచేత అవి దారితప్పేయని బొంకింది. అప్పుడు దాన్ని ఇంద్రుడు తన్నేడు. అది పారిపోయింది. దాన్ని తరుముకుంటూ ఇంద్రుడు వెళ్ళేడు. అక్కడ ఇంద్రునికి రాక్షసులు కనిపించేరు. వాళ్ళను సంహరించేడు .”

    నండూరి రామమోహనరావుగారి విశ్వదర్శనంలో ఉన్న ప్రకారం ఇంద్రుడి దూతిగా గోవులెత్తుకొపోయిన పణులు అనే అనార్యులతో దౌత్యం నడిపి గోవులని రక్షించిన దేవతా శునకం సరమ.

  • 40. “పదవే” అని తొందరపెడుతున్న మోహనాంగి. నడుం కంటికి కనబడదు?
  • ఈ ఆధారానికి ఆధారం “పదవే” అనే పదం. నడుం అంటే మధ్య అక్షరమైన . “పదవే”లో అది కాస్తా పోగా మిగిలింది ‘పవే’.

  • 43. రాముడికన్నా ముందు కార్తవీర్యార్జునుడు, వాలి రావణుడిని ఓడించినవారు. కార్తవీర్యార్జునుడికి వెయ్యిచేతులు.

నిలువు:

  • 1. చివరి కట్టు గొడవపెట్టకుండా విప్పండి (4)
  • ఇదొక anagram. ఆధారంలో “చివరి” అనేది మనకి కావలసిన మాటకి అర్థం. తర్వాతొచ్చే కట్టుగొడవ లోని మొదటి నాలుగక్షరాలు కలగలపాల్సిన అక్షరాలు. “విప్పండి” అనే మాట ‘ఇదొక anagram’ అని సూచిస్తుంది. దీన్ని కామేశ్వరరావు గారు, కొత్తపాళీ గారు మాత్రమే సరిగా పూరించారు.

  • 4. సత్యవతి కొడుకు = వ్యాసుడు. వ్యాసుడు విభజించినవి వేదాలు, అందులో మొదటిది ఋగ్వేదం.
  • 11. కంటకాలు = ముళ్ళు, అందగాడు = రమణ (ముళ్లపూడి) (4).
  • 21. వాయిలీనం చాసో రాసిన ఒక సుప్రసిద్ధమైన కథ. చాసో నోట్లో ఎప్పుడూ ఉండే చుట్ట కూడా ప్రసిద్ధమే..
  • 39. వృద్ధిపొందిన చంద్రకళ

    చంద్రకళల గురించి యజుర్వేదంలో ఇలా ఉంది:
    సినీవాలి: అమావాస్య,
    రాకా: చంద్రోదయం నుంచి పున్నమి వరకు వృద్ధి చెందే దశ(శుక్ల పక్షం),
    అనుమతి: పున్నమి,
    కుహు: పున్నమి నుంచి అమావాస్య వరకు(కృష్ణపక్షం).

    బ్రౌను నిఘంటువులో రాకా అంటే ఇలా ఉందిః The day of full moon. purnacandrudugalapunnama. rakacandrudu the full moon.
    రాకేందుబింబం, రాకేందువదన అనే పదాలు ప్రకాశవంతమైన పున్నమిచంద్రుణ్ణి ఉద్దేశించినవే. సినీవాలి పేరుతో ఆరుద్ర ఒక కావ్యం రాశారు. అందువల్ల ఈ పదాలు-అర్థాలు తరచు వెలుగుచూస్తుంటాయి.

  • 41. అక్రమంగా ప్రవర్తించిన ఒక రాజు. తెగ్గోస్తే కదా పృథువు పుట్టేది? (వేను) (2).
  • వేనుడనేవాడు ఒక గొప్ప రాజు. ఐతే అతడు తర్వాత దుష్టుడుగా మారడంతో కొంతమంది ఋషులు కోపించి అతణ్ణి చంపేస్తారు. అతడి తొడను మథించి అతడిలోని దుష్టత్వాన్నంతా తొలగిస్తారు. తర్వాత అతడి చేతిని మథించగా శ్రీమహావిష్ణువు అవతారమైన పృథువనే గొప్పరాజు పుడతాడు. వేనుడు అనే పేరులో ‘డు’ను తెగ్గోశాం ఇక్కడ.

Posted in గడి | Tagged , | 1 Comment

మే నెల పొద్దుపొడుపులు

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల)

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి)

బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ)

సింధువు (కవిత)

షరా మామూలే… (కథ)

షడ్రుచుల సాహిత్యం (వ్యాసం)

గడి (గడి)

మారిషస్‍లో విశేషపూజ (కబుర్లు)

బ్లాగ్బాధితుల సంఘం (సరదా)

డా.హాస్యానందం నవ్వులు (సరదా)

Posted in ఇతరత్రా | Comments Off on మే నెల పొద్దుపొడుపులు

కబుర్లు, సరదా

ఈసారి కబుర్లు కాస్త విభిన్నంగా మీ ముందుకు వస్తున్నాయి. తెలుగు డయాస్పోరా మీద విశేష పరిశోధన చేసిన డా||టి.ఎల్.ఎస్. భాస్కర్ గారు చెప్పే ప్రవాసంధ్ర కబుర్లు ఈ శీర్షికలో ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకమీదట ఆయన వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారి భాష, సంస్కృతి గురించి తాను గమనించిన విశేషాలు, తన అనుభవాలు, అనుభూతులు తరచు పొద్దు పాఠకులతో పంచుకుంటారు.

బ్లాగులు రాయడం, చదవడం మీకొక వ్యసనంగా మారుతోందా? తస్మాత్ జాగ్రత్త! మీ భార్య/భర్త బ్లాగుబాధితుల సంఘంలో చేరక ముందే కళ్లు తెరవండి. ఈ సంఘం గురించి వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మజ సరదా శీర్షికలో సీరియస్ గా వివరిస్తోంది.

ముచ్చటగా మూడోమాటః గడి గడువు ఇంకో వారం రోజుల్లో ముగియనుంది. నింపి పంపాలనుకుని మర్చిపోయినవాళ్ళు త్వరపడండి.

-పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on కబుర్లు, సరదా

మారిషస్‍లో విశేషపూజ

డా.టి.యల్.యస్.భాస్కర్ తెలుగు డయాస్పోరాకు సంబంధించిన అంశాలలో అధ్యయనం చేస్తున్నారు. తీరిక వేళల్లో telugudiaspora.com అనే వెబ్సైటు నడుపుతూ ప్రస్తుతం Encycloapeadia of Telugu Diaspora తయారు చేయడం లో నిమగ్నమై ఉన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారి సంస్కృతి, భాష గురించి తన అనుభవాలు, అనుభూతులు ఇక్కడ వివరిస్తున్నారు. తెలుగు డయాస్పోరా గురించి పొద్దులో ఆయన చెబుతున్న కబుర్లలో ఇది మొదటిది.

———————

“జో అచ్యుతానంద జో జో ముకుందా!”


ఈ కీర్తన వింటే ఎంతో హాయిగా ఉంటుంది కదా! మా సమన్విత్ కి ఇప్పుడు ఆరు నెలలు నిండి ఏడో నెల వచ్చింది. ఈ మధ్యనే ఈ కీర్తన కూడా బాగా గుర్తుకు వస్తోంది. ఎప్పుడయినా వాడు పడుకోకపోతే ఈ కీర్తనని పాడమని మా అవిడని అడుగుతాను. ఎప్పుడో ఈ కీర్తనని చిన్నప్పుడు నా మేనత్తలు పాడటం బాగా గుర్తు. తరువాత చాలా సార్లు కేసెట్లో కూడా విన్నాను. కాని ఈ కీర్తనని సామూహికంగా ఒక 60-70 మంది గుడిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ముందు ఆలపిస్తుంటే…ఆహా…ఎంత హాయి…ఆ వేంకటేశ్వర స్వామికి…వింటున్న మనకి…(విద్యుత్ దీపాలన్నీ ఆపి స్వామి వారి సన్నిధి లో ఉన్న ఒకే ఒక దీపం వెలుగుతూ…). అయితే పాడుతున్న ఏ ఒక్కరికీ తెలుగు రాదండి…నమ్మశక్యంగా లేదా? అయితే ఇక చదవండి…

***

శుక్రవారం, సాయంత్రం 5 గంటలు కావొస్తుంది. ‘6 గంటలయితే అంతా నిశ్శబ్దమే’ అని చెప్పిన రామ నరసింహులు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే టేబిల్ మీద ఉన్న నా నోటు పుస్తకం, కెమేరా పట్టుకొని విష్ణు మందిరం ప్రాంగణంలోనే నేనుంటున్న అతిథి గృహం నుంచి గబగబా గుడి వైపు పరిగెత్తా. మారిషస్ దేశంలో ఉన్న సెయింటు పియర్లో ఉన్న ఈ విష్ణు మందిరం 1923 లో కట్టించారు. విగ్రహమూర్తులు అంతకన్నా ముందే పూజింపబడుతూ ఉన్నా, 1923 లో మండేసర్ ఆల్మా షుగర్ ఎస్టేట్ అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన లూయి డి సోర్నే సహకారంతో, విష్ణు మందిరానికి ప్రస్తుత రూపు వచ్చింది. 1923కు ముందు, తరువాత మన తెలుగు వారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.

ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 దాకా స్వామి వారి విశేష పూజ జరుగుతాది. ఉద్యోగ రీత్యా మరియు ఇతరత్రా కారణాల వలన వారమంతా ఎంత బిజీగా ఉన్నా, శుక్రవారం 6 గంటలకి అందరు పూజకి సమావేశం అవుతారు.

6 గంటలకి సమావేశం అయిన తరువాత, మొదటగా భజన ఉంటాది. దీన్ని భజన గుంపు నిర్వహిస్తారు. భజన గుంపు ప్రతీ మంగళవారం సమావేశమై మనము చెప్పుకున్న శుక్రవారపు సంకీర్తనకి అభ్యాసం చేస్తారు. భారతదేశం నుంచి తెప్పించుకున్న ఆడియో కేసెట్ల నుంచి తీసుకుని, రోమన్ స్క్రిప్టులో వ్రాసి, పాడటానికి వీలుగా చేసుకుంటారు. కీర్తనల/పాటల పత్రాలని శుక్రవారం సమావేశంలో ముందుగా పంచిపెడతారు కూడా. భజన జరుగుతున్నపుడు సమావేశం అయిన మన తెలుగు వారందరూ కీర్తనలని/పాటలని రోమన్ స్క్రిప్టులో చూసి పాడతారు. అలాగే, భజన గుంపు వారు, ఆసక్తి చూపిస్తున్న వారికి కీర్తనలు, పాటలు నేర్పి శుక్రవారం పూజలో పాడటానికి వీలు కల్పిస్తారు. ఈ గుంపులో మృదంగం, తబలా, వయోలిన్ వంటి అంశాలలో కూడా శిక్షణ ఇస్తారు. ఇలా ఎంతో మంది గాయకులను, వాయిద్యకారులను తయారుచేసారు. సమారు 40 నిమిషాల పాటు జరిగే ఈ భజనలో అందరూ చాలా చురుగ్గా పాల్గొని పాడతారు. విచిత్రం ఏమిటంటే వీరిలో 90 శాతం మందికి పాడుతున్న దానికి అర్థం తెలీదు! కానీ ఎంతో భక్తితో దైవ సన్నిధిలో తెలుగులో పాడటాన్ని వీళ్ళు ఒక వరంగా భావిస్తారు.

భజన తరువాత ఆచార్యుల వారి ప్రవచనం ఉంటాది. మనం పూజారి అంటాం. వేంకటాచార్యుల వారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి విష్ణు మందిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ శుక్రవారం ఒక 10-15 నిమిషాల పాటు ప్రవచనం ఉంటాది. మన పురాణాల నుంచి సమాచారాన్ని సమీకరించి వాటిలో ఉన్న నీతిని కొన్ని కధల ద్వారా చెప్తారు. వేంకటాచార్యుల వారి తెలుగు ప్రవచనాన్ని అక్కడున్న అందరికీ సుపరిచితులైన సంజీవ అప్పడు గారు ఫ్రెంచి క్రియోల్ లోకి అనువదించి అందరికీ అర్ధం అయ్యేటట్టు చూస్తారు. అన్నిటికన్నా వారి పూర్వీకుల భాష అయిన తెలుగు వినటంలో వారు చాలా అనందం పొందుతారు. కొన్ని అరుదైన సందర్భాలలో వేంకటాచార్యుల వారు మన ఆచార వ్యవహార పద్ధతులను ఆంగ్లంలోకి అనువదించి చెప్తారు. ఆచార్యుల వారు మన తెలుగు వారు వాడే ఫ్రెంచి క్రియోల్ కూడా నేర్చుకొనే ప్రయత్నం ఆరంభించారు. ప్రవచనం తరువాత హారతి ఉంటాది. మహా విష్ణువుని దీవెనలు అందరికి…

తరువాత గుడిలో అన్ని విద్యుత్ దీపాలు ఆపేస్తారు. శ్రీ మహా విష్ణువుని సన్నిధిలో ఒక అఖండ దీపం వెలుగుతున్న సమయంలో అందరూ…

“జో అచ్యుతానంద జో జో ముకుందా!” కీర్తనను ఆలపిస్తారు. ఎంత బాగా పాడతారో…

తరువాత గుడి తలుపులు మూసి, అక్కడ ఉన్న ప్రాంగణంలో ప్రసాదాన్ని పంచిపెడతారు. ఒక్కో శుక్రవారం ఒక్కో కుటుంబం వారు ప్రసాదం బాధ్యత తీసుకొంటారు.

శెలవా మరి!…ఇంకోసారి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం.

TLS భాస్కర్ (http://telugudiaspora.com)
Posted in వ్యాసం | Tagged | 4 Comments

బ్లాగ్బాధితుల సంఘం

jyothi.bmpఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.

————–

*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .

ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !.

మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు అంటే ఇష్టం ..సరే ..బానే ఉంది. ఆరునెలల క్రింద వరకు మా వారు ఆఫీసు నుండి రాగానే హాయిగా కబుర్లు చెబుతూ నేను చేసిన పకోడీలు తింటూ టీ త్రాగి పేపర్ ఓసారి తిరగేసి ..వంట చేస్తున్న నాతో కబుర్లాడుతూనే పిల్లల హోంవర్క్ చేయించేవారు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి లేదా అలా వాకింగుకి వెళ్ళి వచ్చేవాళ్ళం . అప్పుడప్పుడు సెకండ్ షోకి కూడా వెళ్ళేవాళ్ళం. కాని ఇప్పుడు???.

అసలు ఎవడు చూపించాడో కాని ఈ తెలుగు రాయడం . బ్లాగు రాయడం. ముందు నెట్ సెంటర్ కెళ్ళి రెండు మూడు గంటలు కూర్చునేవారు. తరువాత వాయిదా పద్ధతిలో కంప్యూటర్ కొన్నారు. రాగానే బట్టలు మార్చుకుని మొహం కడిగి ఏమోయ్ టీ అంటూ ఆర్డరేసి దాని ముందు సెటిల్ అయ్యేవారు. కొత్తలో అది ఎలా వాడాలో నేర్చుకుని మెల్లగా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుని బ్లాగులు చదవడం మొదలెట్టారు. ఒక మంచిరోజు చూసి బ్లాగు మొదలెట్టి రాయడం మొదలెట్టారు. నేను వంటతో సతమతమవుతూ పిల్లల హోంవర్క్ చేయించేదాని. పోనీలే మన మాతృభాష కదా మంచిదే అని…టిఫిన్ లేకుండానే టీ ఇచ్చినా అలాగే కూర్చునేవారు. చూద్దాం అడుగుతారో లేదో అని నేను ఎన్ని రోజులు చూసా! ఊహూ…సర్లే నాకే పని తప్పింది అని ఊరకున్నా.

ఆఫీసులో అన్ని బ్లాక్ చేసి ఉంటాయంట. అందుకే ఇంటికి రాగానే ముందుగా కంప్యూటర్ స్విచ్చి ఆన్ చేస్తూ చెప్పులు విప్పుతారు. ముందుగా తను రాసిన టపాకు వచ్చిన కామెంట్స్ చదవడం , తర్వాత కూడలి, తేనేగూడు ఇలా అన్ని మెయిల్స్ చూసేసరికి రెండుగంటలు. అయన వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో , ఎవరెలా ఉన్నారో ఎమీ పట్టదు. ప్చ్ ….ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నారా? ఆడవాళ్ళం ఒకసారి ఒకే పని చేయం కదండీ. నా పని చేస్తూనే ఆయన మీద ఓ కన్నేసి చూస్తుంటా. ఎవరైనా ఆడాళ్లతో చాటింగ్ గట్రా చేస్తున్నారేమో అంత ధీర్ఘంగా కూర్చుంటే అని సందేహం కూడా కలిగింది. పోనీలే పోనీలే అని ఊరుకుంటే ఈ బ్లాగ్పిచ్చి పెరుగుతూనే ఉంది. పైగా ఇంటికొచ్చిన ప్రతి వారితో బ్లాగులగురించి ముచ్చట్లు. మా తమ్ముడికి కూడా చెప్పబోతుంటే వాడిని పంపేసా వెళ్ళరా మీ ఆవిడ ఎదురుచూస్తుందని. నా కష్టాలు తెలిసి తెలిసి వేరొకరిని పడనిస్తానా.

ఇవన్నీ చేసి నా వ్రేళ్ళు లాగుతున్నాయి కాస్త జండూబామ్ రాయవే అంటారు రాత్రి ..తిక్క రేగి నేను పెట్టను అని పడుకుంటా .మీరే చెప్పండీ. ఇదేమన్నా బావుందా. ఆ కంప్యూటర్ నాకు సవతి అయినట్టుంది . ఎప్పుడో దాని కనెక్షన్లన్నీ పీకి పడేస్తాను. కాని అన్నేసి వేలు పోసి కొన్నది కదా మనసు రాదు. రాసుకోండి, చదువుకోండి నేనొద్దనను. మరీ అలా నన్ను పిల్లలను గాలికొదిలేసి అందులోనే మునిగిపొమ్మన్నారా? ఇలాగే మా కాలనీలో నాలాంటి బాధితులు ఓ పదిమంది దొరికారు. సరే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మేమందరం ఏకమై ఆలోచించాలి. అని సంఘం పెట్టుకున్నాము.

ఓ రోజు ఒకతను వచ్చి “నేను కూడా బ్లాగ్బాధితుడినే . నన్ను చేర్చుకోండి మీ సంఘంలో” అన్నారు . ఆశ్చర్యపోయాము. ఆడాళ్ళవల్ల కూడా బాధింపబడే మొగుళ్ళూన్నారా అని. అతను చెప్పింది విని వెంటనే చేర్చుకున్నాం ..ఇంతకీ ఏమన్నాడో తెలుసా?? “నేను ఆఫీసుకెళ్ళాక బోరు కొడుతుందంటే నా కంప్యూటర్ నేర్పించా … మెల్లిగా బ్లాగు రాయడం నేర్చుకుంది. ప్రొద్దున లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ కూడలి చూస్తుంది. అప్పటికింకా ఎవరూ లేవరు . తర్వాత వంట పనీ అదీ త్వరగా పూర్తి చేసి నేను ఆఫీసుకెల్లేది ఆలస్యం మళ్ళీ ఆన్ చేసి అన్నీ చదువుతూ కూర్చుంటుంది. ఇల్లు సర్దేది లేదు . దుమ్ము దులిపేది లేదు. మద్యాహ్నం కాస్త పడుకుంటుందేమో. తన బ్లాగులో కొత్త కొత్త విషయాలు రాయడానికి పుస్తకాలు కొనిమ్మని నాతో పోరు .నేను తెచ్చినవి నచ్చలేదంటే తననే తీసికెళ్ళి దుకాణంలో వదిలేసి చూసుకో నేను బిల్లు కడతా అని పేపర్ చదువుతూ కూర్చున్నా. పోనీలే మాతృభాషాభిమానం కదా అని . ఇప్పుడు పలు రకాల టిఫిన్లు చేయదు. ఎక్కడికన్నా వెళదామంటే మీరెళ్ళండి నేను రాసుకోవాలి . అంటుంది. ఒక్కడిని పార్కుకో సినిమాకో వెళ్ళనా. ఏం చేయాలో తోచటం లేదు . కాస్త మీరన్నా ఉపాయాలు చెప్పండి. మా సంసారాన్ని నిలబెట్టండి.” అంటు వాపోయాడు .

ఇది చదివే వాళ్ళంతా మా సంఘం గురించి మీ భార్యలకు కాని, భర్తలకుకాని చెప్పరని తెలుసు. కాని వారి వద్దకు ఎలా చేరాలో మాకు తెలుసు కాని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము . బ్లాగులు రాసుకోండి ఎవరూ వద్దనరూ. అందులోను మన తేనెకన్నా తీయనైన మాతృభాష. కాని కాస్త మీ భార్యలు , భర్తలు, పిల్లల గురించి పట్టించుకోండి. ఇలాగే ఉన్నారనుకోండి . పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.

పద్మజ
ప్రెసిడెంట్…

Posted in వ్యాసం | Tagged | 10 Comments

అతిథి, వివిధ, కవిత

ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు రాసిన తెలుగు వర్ణ నిర్మాణం (phonology) మొదటి భాగం గతవారం చదివారు. ఆ వ్యాసం రెండవ భాగం ఇప్పుడు అందిస్తున్నాం. బ్లాగరులు పాటించవలసిన బ్లాగునియమావళి గురించి సుధాకర్ ‘వివిధ’ లో వివరిస్తున్నారు. వాటితో బాటే స్వాతి కుమారి కవిత “సింధువు” మీ కోసం.

-పొద్దు

Posted in ఇతరత్రా | 1 Comment