కవికృతి-౪

కవికృతి మూడవ భాగం లోని కవితలపై పవన్ కుమార్ గారి సమీక్ష
———————–

స్వాతీ శ్రీపాద -నీకు తెలుసా కవితపై..

ఉపమానాలే కవిత్వం కాదు, ఉపమానం కవితకు ఉత్ప్రేరకం కావాలే కానీ అది కవితకూ పాఠకుడికి మధ్య అడ్డు రారాదు. ఈ ఉపమానాల దొంతరల కింద పడి నలిగిపోతున్న కవితను బయటికి తీస్తే హృద్యంగా ఉంటుంది.

—————————————–

కత్తి మహేష్ కుమార్ కవితపై..

తర్కం కవిత్వం కానేరదు. భావావేశం ఉన్న చోట తర్కం వెనక్కి పోతుంది. కవైన వాడు యాంత్రిక జీవితాన్ని బయటికి తోసి తర్కాన్ని తుంగలో తొక్కి కవిత్వ సృజన చేస్తాడు.

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

— “నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు” అని భావావేశంతో మొదలెట్టి ఆ తర్వాత ఎంతో కష్టమైన సైన్సు, మాథ్సు,క్లాసుల్లోకి తీసుకెళితే ఎలా? రొమాంటిక్ సినిమా అని ప్రకటించి యాక్షన్ సినిమా కి తీసుకెళ్ళినట్టు (టైటానిక్ అని టెర్మినేటర్ 2 చూపినట్టు).

చాలా చెక్కేసి, తప్పకుండా తీసేయాల్సిన పంక్తులు తీసేస్తే కవిత ఇది:

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది
నీ శూన్యాన్ని…
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను

ఇంకా కాస్త సాన బడితే మంచి కవితవుతుంది.

Posted in కవిత్వం | Tagged , | 4 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – ఐదవ భాగం

కొత్తపాళీ:: కనీసం ఇంకో రెండు అంశాల్ని రుచి చూద్దాము. వర్ణనకి ఇచ్చిన రెండో అంశం, ఒక దృశ్యం. అదిలా ఉంది. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. ఫణి గారి వర్ణనా చాతుర్యం చూద్దాం

ఫణి:: చిత్తం.
చం.

అదియొక రైలు పెట్టె, మరి యందొక బాలుడు యౌవనుండు నా

ఎదురుగ నున్నవాడు కను లెత్తుచు దించుచు జూచుచుండె నో

మదనుని తోడు బుట్టువన మత్తును గొల్పెడు ముద్దరాలి నా

వదనము లోన కాననగు వద్దని జూచిన ప్రేమ భావముల్.

చం.

చదువునొ లేదొ గాని యొక చక్కని పుస్తక ముండె చేతిలో

అది తన మోము గప్పునటు లాయమ లీలగ త్రిప్పుచుండె నీ

రదతతి ఇందు బింబమును రాతిరి కప్పుచు తీయునట్లుగా

చదువుచు తీయుచుండె వనజాక్షియు వానిని రెచ్చగొట్టుచున్.

కం.

ఎచ్చటి కేగునొ యంచును

ఇచ్చికములాడి దాని మచ్చిక సేయన్

వచ్చును మదిలో జంకుచు

అచ్చటనే యుండిపోవు చచ్చర పడుచున్

చం.

హృదయము ముక్కలౌను మతి హీనుని సేయును కంటి చూపుతో

కదలిన గుండె జారు మది కమ్మును మైకము కాలి సవ్వడిన్

రొదరొద సేయు ముంగురులు రూపము జూచుచు సోలె బాలకుం

డదురుచు కూత కూయుచును హాసము సేయుచు సాగె రైలుయున్.

నరసింహారావు:: పాపయ్యశాస్త్రిగారిని జ్ఞాపకం చేసారే.

రాఘవ:: అదియొక రైలు పెట్టె అనగానే నాకు కరుణశ్రీ గురుతొచ్చారండీ. భలే సాగింది మీ వర్ణన.

రాకేశ్వరుఁడు:: టేషను వచ్చేసిందా ?

సనత్:: రైలు నడక లాగానే చుకు చుకు అన్నట్టు బాగా సాగింది నడక.. భేష్

రవి:: ఆ రైల్లో నాకూ వెళ్ళాలనుందండీ, ఇప్పుడే

కామేశ్వరరావు:: రవిగారూ, ఇందాకానేమో కట్నం ఎంతిస్తారన్నారు, ఇప్పుడేమో రైల్లో వేళ్ళాలనుందంటున్నారు… ఏంటి సంగతి? 😉

కొత్తపాళీ:: భలే భలే

రవి:: 🙂

చదువరి:: పద్యాలు బాగున్నాయి

పుష్యం::

అదిరెను మీదు వర్ణనము, ఆగక సాగె’ద’కార ప్రాసతో
పదములు సాగుచుండనిట పచ్చని చేలన రైలు బండిలా
సదరు కథందు నాయకుడు చక్కగ మీరని తోచుచుండె, పో!! 🙂

ఫణి:: ధన్యవాదాలండీ.

రాకేశ్వరుఁడు:: చంపకమాలలు బాగున్నాయి।

కామేశ్వరరావు:: “మదనుని తోడబుట్టువన” కొత్తగా ఉంది ఉపమానం! బాగుంది.

కొత్తపాళీ:: కామేశ్వర .. అవును, మన్మథుడి చెల్లెలన్న మాట

రాఘవ:: కామేశ్వరరావుగారూ, ఏదో తెలుగు పాటలో “నువు మదనుడి మఱదలివా” అని కూడ అడుగుతాడండీ ఒక కవి!

రవి:: కవి గాంచని అందాలు రవి గాంచును

సనత్:: లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అనుకునానే… రవి గారికి ఎరుకేనా… ఓహో..

కొత్తపాళీ:: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అభిమాన వర్ణన .. చికిలీ చేసిన మన్మథ బాణం అని

కొత్తపాళీ:: ఎందుకంటే ఈ రవి కవి కూడా కాబట్టి .. రవి కాననిది కవి కాంచుతాడు

రాఘవ:: 😀

చదువరి:: 🙂

కామేశ్వరరావు:: ఈ మధ్య వేరే కృష్ణమూర్తి తత్త్వం వంటబట్టించు కుంటున్నట్టున్నారు రవి 🙂

రవి:: రు.:) మొత్తానికి ఒక సరస ఊసరవెల్లి అని తేల్చా

కొత్తపాళీ:: గిరి, ఉన్నారా? మీ రైలు బయల్దేరుతుందా? పచ్చజెండా ఊపండి మరి

గిరి:: ఉన్నాను, ఇదిగో
వర్ణించేవాడు కూడా వరించాలని చూసేస్తున్నాడిక్కడ

ఈ పద్యాలు గిరి స్వరంలో..

ఉ.

నేనొక రైలుపెట్టి కడ నిల్చి ప్రయాణిక పట్టి చూచి, ఓ

హో నను గజ్జి లాగ దవునుంచు యదృష్టము నేడు నవ్వెనే,

కానుక పంపె కోమలిని, కళ్ళెదుటే తన సీటు వేసెనే,

ఈనిన గేద పెయ్యగని ఎంతగ త్రుళ్ళునొ నేడు తెల్సెనే

వ. యని మది తలంచుచు బోగిలోనికి అడుగిడితిని

తే.గీ

కుప్పిగంతు పర్యంతము గుండెకాయ

గాలితేలు వాలకముల కాలినడక

రైలుకూతల మరిపించు ఈలపాట

పువ్వుపూత లనిపించు నవ్వుమొగము

కం.

నాదే, నాదే, నాదే

నాదే, నీ యెదుటి కుర్చి నాదే, నాదే

నీదగ్గర కూర్చొను భా

గ్యోదయ జాతకము, నాదె యోగ్యత నాదే

“అమ్మాయా? అచ్చతెలుగు, పైగా పదహారణాల పంజాబి డ్రస్సు”

“హా, వీడెవడూ??”

సీ.

అమ్మాయి ప్రక్కన ఆషాఢభూతము మాగినపండుపై ఈగలాగ

తీయని చల్లపానీయము లోనున్న పూచిక పుల్లంటి పుడకలాగ….

కుదురుగా కూర్చుంది ఎదురుగా అమ్మాయి ముళ్ళున్న వబ్బాయి ముడ్డిక్రింద

కలువపూరేకుల కన్నులమ్మాయివి మందుతాగినవాడి మైక మిచట

తే.గీ

కోతివేషాలు వేయు కండూతిగాడు

పేలవపు నడత కలదు గాలిగాడు

ఈలొకటి వీడికి, మొహమా? సాలెగూడు

వీడి కెందుకు అమ్మాయి, వేస్టు గాడు?

కం.

“ఏంటో కొందరి వాలక

మేంటో, రైలెక్కి కుదురులేదూ, అమ్మాయ్

ఉంటే లోకమ్ తెలియదు,

అంటే అన్నానని ఎదురంటారేంటో”

చదువరి:: 🙂 🙂

రవి:: 🙂

సనత్:: వహ్వా,.. వెయ్యండో రెండు వీర తాళ్ళు…

కామేశ్వరరావు:: భలే! మళ్ళీ కరుణశ్రీనే వచ్చారే రైలుపెట్టెలోకి! 🙂

పుష్యం:: “దానబ్బ, పయోజగర్భ మొగనాలికి ఇంత విలాసమేటికిన్” అంటారు 🙂

చంద్రమోహన్:: 🙂

రాఘవ:: మళ్లీ కరుణశ్రీ కనుపించాడు…. నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి తరహాలో మొదటిపద్యపు మొదటి పాదం చూచి.

కొత్తపాళీ:: ఈనిన గేద పెయ్యగని ఎంతగ త్రుళ్ళునొ నేడు తెల్సెనే – ఏమి పోలిక బాస్

రాకేశ్వరుఁడు:: వ్యావహారికపద్యోద్యమమా?

చదువరి:: భైరవభట్ల గారన్నట్టు.. మీరు వాడుకభాషా పద్య దురంధరులు

సనత్:: గిరి గారూ! మీకు గోరోజనం కూసింత ఎక్కువే…

కామేశ్వరరావు:: “రైలుకూతల మరిపించు ఈలపాట” 🙂

కొత్తపాళీ:: ఉపమా గిరిధరస్య .. అనుకోవాలి ఇక మీదట

గిరి:: ధన్యవాదాలండీ

రవి:: గిరి గారి హీరో చూడబోతే, అక్కడే ఆ విలన్ని ఛావ చితక గొట్టేట్టున్నారు

సనత్:: కుదురుగా కూర్చుంది ఎదురుగా అమ్మాయి ముళ్ళున్న వబ్బాయి ముడ్డిక్రింద … భలే!

చదువరి:: ఈ పద్యాలు చదివితే.. ఓహో పద్యం రాయడం ఇంత తేలికా అని అనేసుకుంటారు నాబోటివాళ్ళు!

కొత్తపాళీ:: పుష్యం, హబ్బ పయోజగర్భుని గుర్తు తెచ్చారూ, మన కాంపుర వాసిని గుర్తుందా?

పుష్యం:: yes 🙂

రాకేశ్వరుఁడు:: పద్యాల్లో ఆర్యా సినిమా తీద్దాం గిరిగారు ।

ఫణి:: 🙂

గిరి:: ఈనిన గేదె పోలిక – మొదటిసారి రైల్లో పరిసరాల్లో అమ్మాయి ఉందంటే, అలాంటి అనుభవానికి లోనైన వాడి ఉద్వేగం హాస్యంగా చెప్పాలంటే – నాకు అదే తట్టింది

కామేశ్వరరావు:: నిజంగా ఈ పద్యంలో ఉపమానాలు చాలా బాగున్నాయి! మనసులో కసంతా బయటపెడుతున్నాయ్!

……………………………………….

కొత్తపాళీ:: గిల్లీ, దండా, అష్టా, చెమ్మా – వసంతకాల వర్ణన – కామేశ్వర్రావుగారి ముచ్చటైన పూరణ వినిపించమని కోరుతున్నాను

కామేశ్వరరావు:: అలాగేనండి

ఈ పద్యం కామేశ్వరరావు గారి అమ్మాయి శ్రీవాణి స్వరంలో..

మ.కో

మత్తకోకిల మంజులస్వన మష్టదిక్కుల మ్రోయగా

గుత్తుగుత్తుల పూలదండల ఘుంఘుమల్ ప్రసరింపగా

హత్తుకైతల చెమ్మగిల్లి హృదంతరమ్ములు పొంగగా

క్రొత్తయేడు వసంతరాయలు కొల్వు తీరెను చూడుడీ!

రాఘవ:: ఎవఱో కనబడుటలేదూ…

కొత్తపాళీ:: ఇందులో దత్తపదులు ఎక్కడ దాగున్నాయో కనిపెట్టిన వారికో స్పెషల్ వీరతాడు 🙂

రాఘవ:: అష్ట – దండ – చెమ్మ – గిల్లి

సనత్:: కొత్త ఆవకాయ్ ఘుమఘుమ లాగా బావుందండీ మీ పద్యం..

రవి:: మినీ పీ హెచ్ డీ ఇక్కడికిక్కడే ఇవ్వచ్చు

కామేశ్వరరావు:: వసంతానికీ రాయలకీ పోలిక చూపించే ప్రయత్నం

కొత్తపాళీ:: వసంతం నిజంగా ఋతురాజే కదా

రాకేశ్వరుఁడు:: మత్తకోకిల అందం మత్తకోకిలదే గానీ దానిలో దత్తపదులెప్పుడు జారుకున్నాయబ్బా… నేను రెండు సార్లు పోల్చి చూసుకున్నాను ఈ ఏ సమస్యాయని, తెలియలేదు। !!!

ఫణి:: అధ్భుతంగా ఉంది.

చదువరి:: హాయిగా పాడుకునేట్టుగా ఉంది పద్యం

కొత్తపాళీ:: రాకేశ్వర, అదే ఈ పూరణలోని మహత్యం. పదాల్ని విరవకుండానే అంత లాఘవంగా పొదిగేశారు పద్యంలో.

రవి:: ఇది కామేశ్వరరావు గారి చమత్కారం. ఆయనకు పరీక్ష పెడితే, తిరిగి ఆయన ఇచ్చిన రిటార్టు.

గిరి:: బావుంది

రవి:: మీరే వెతుక్కోండని

రాకేశ్వరుఁడు::

మత్తకోకిల ఎత్తుకొన్నరు మత్తకోకిల తోడనే
ఉత్తపద్యము కాదులేయిది ఉత్తమం యిది పద్యమే!
మొత్తమున్ యిక వ్రాయ లేనులె ముత్తెమంటిది పద్యమున్

కామేశ్వరరావు:: విరవలేదు కలిపేసాను కూడా, “చెమ్మగిల్లి”లో 🙂

చదువరి:: 🙂

గిరి:: మత్తకోకిల నడకే నడక – మీరు నడిపించిన తీరే తీరు

కొత్తపాళీ:: గిరి, మత్తకోకిల నడవదు. కూస్తుంది. అంచేత పద్యంలో ఉండేది లయ, నడక కాదు 🙂

గిరి:: కొత్తపాళీ గారు, సరే – కూతే కూత, కూయించిన తీరే తీరు అని చదువుకోండి.

……………………………………..

కొత్తపాళీ:: కాసేపు జాలమహిమని తల్చుకుని మనందరం పరిచయం కావడానికి మూల కారణమైన తెలుగు బ్లాగుల్ని గుర్తు చేసుకుందాం. చదువరి గారూ కూడలి, హారం, జల్లెడ, పొద్దు – బ్లాగుల ప్రశస్తి గురించి సీసం

చదువరి:: ఒక్క క్షణం..

సీ.

ఈ పద్యాలు చదువరి స్వరంలో..

బహుళంగ బ్లాగంగ బ్లాగ్గంగ పొంగంగ ఒడుపుగా కూడలి ఒడిసి పట్టు

టప టపా లెన్నియో టపటపా రాలంగ టకటకా హారమ్ము టముకు వేయు

వేలాది బ్లాగుల్ల వేవేల వ్యాఖ్యల్లు! జాలాన జల్లించు జల్లెడదియె

పద్యాల పుష్పాలు పరికింప పొద్దెక్కె పొద్దువైపే జూచు పూల పగిది

తే.గీ

దిక్కు చూపించ కూడలి రెక్కమాను

తారలా లింకు హారాన తళుకు లీన

జాల జగమందు జల్లెడ జాడ జూప

పొద్దు చేరంగ వచ్చు ఏ పొద్దు నైన

కొత్తపాళీ:: బాగు బాగు

చంద్రమోహన్:: రెండు రెండు సార్లు తెచ్చారు దత్త పదులని. డబుల్ ధమాకా!

ఫణి:: భేష్!

రవి:: ఎత్తుకోవడమే చాలా అందంగా ఉంది.

కొత్తపాళీ:: ha ha ha .. two for one sale

రాఘవ:: చదువరిగారనిపించారు

రవి:: గుర్రం తోలుతున్నట్టుంది

పుష్యం:: చాలా బాగుంది.

కామేశ్వరరావు:: దత్తపదాలని ద్విగుణికృతం చేసి మరీ పూరించారే! చాలా బాగుంది!

సనత్:: బాగు బాగు.. బ్లాగు బ్లాగు

మురళి:: కూడలి రెక్కమాను వహవ్వా

గిరి:: double whammy

రాకేశ్వరుఁడు:: చదువరి గారు మీ ముంగటేటి సీసపద్యాలు కూడా ఇంతే బాగున్నాయి। వచ్చేయేఁడు కూడా మీరు సీసపద్యాలు తప్పకవ్రాయగలరు।

కొత్తపాళీ:: రవీ, మీ పద్యం

రవి:: చిత్తం

సీ.

ఈ పద్యాలు రవి స్వరంలో..

మురిపెంపు మాటల ముత్యపు కూడలి ఇంపగు హైకూల కెంపు గూడు

అచ్చమౌ కైతల పచ్చల హారము పుష్యరాగపు పస పుస్తకాలు

వివిధపు వార్తల వింతనౌ జల్లెడ కథల గోమేధిక కాణయాచి

ధాటియౌ చర్చల ధీటగు వజ్రము కొంగ్రొత్త తలపుల కొత్త పొద్దు

తే.గీ

నిడివి చిన్నదౌ ట్విట్టరు నీలమణియె

విధవిధపు ఛాయచిత్రాలు విద్రుమాలు

నేటి యుగమున వచ్చిన మేటి రవ్వ

తెలుగు బ్లాగు, జాలము నందు వెలుగు లీను

రాఘవ:: హైకూతలు కూడ కూస్తున్నారే రవికోకిలవారు!

రవి:: అయిపోయింది. మరీ ఉత్ప్త్రేక్ష్యాలంకారాలెక్కువయాయేమో తెలియదు

కొత్తపాళీ:: హ హ హ, రాఘవా

పుష్యం:: ‘పుష్యరాగపు’ — ఎవరైనా పిలిచారా నన్ను?? 🙂

రాఘవ:: ఏమండోయ్ పు.శ్యాం. గారూ, మిమ్మల్ని కాకాపడుతున్నారు.

మురళి:: భేష్!నిడివి చిన్నదౌ ట్విట్టరు నీలమణియె

రాకేశ్వరుఁడు:: అన్నమయ్య ముద్దుగారే యశోద పాట గుర్తుతెచ్చింది

కొత్తపాళీ:: ఎక్కువవడం ఏంటి, పద్యం మొత్తం ఉన్నదే ఉత్ప్రేక్షలయితే .. అదీ ఒక సొగసే

చదువరి:: ఇచ్చిన సమస్యకు సరిగ్గా సరిపోయింది పూరణ!

గిరి:: భలే పొదిగారు పద్యంలో రాళ్ళన్నీ

రవి:: 🙂

కొత్తపాళీ:: చివరిగా .. బాలకవి రాఘవ వర్ణన. రాఘవా .. మీ పొద్దు సీసం ..

రాకేశ్వరుఁడు:: బాలకవి – యుగాటాబి కిడ్డింఙ్మీ 🙂

రాఘవ:: అవధరించండి

సీ.

ఎవ ఱేమి చెప్పిన నెట కేగవలయునో వివరించు కూడలి వీధిపెద్ద

పలుకుల ముత్తెముల్ పైఁడి తీవెనుఁ గుచ్చ నచ్చంగఁ దెలుఁగింటి హార మమరు

మాటలందునఁ గొప్ప మాటలఁ జల్లించి చదివించు జల్లెడ మొదటిజల్లు

సరసోక్తి మేల్కొల్పి సారస్వతపు పెనునిద్దుర వదిలించు ప్రొద్దుపొడుపు

ఆ.వె.

అజుని సృష్టియైన నిజవసుంధర కాదు

గాధిసుతుని సృష్టి కానె కాదు

మనుజ లోకమందు మఱి యేమి టన్నచో

నాక మిద్ది బ్లాగు లోక మిద్ది

మురళి:: బహుబాగున్నది మీ సుద్ది:)

కొత్తపాళీ:: భలే భలే ..

ఫణి:: అదిరింది.

గిరి:: అద్ది

రాకేశ్వరుఁడు:: ఱ వుంది । చాలు ఈ పుటకు పులావు తిన్నట్టే.

పుష్యం:: రాకేశ్వర – ‘పలావొక్కింతయు లేదని అన్నట్టున్నారు – మీకెక్కడ దొరికింది??

రాకేశ్వరుఁడు:: ఱ చూడండి- అచ్చం పులావునిండిన ప్లేటులా లేదు 🙂

కొత్తపాళీ:: విశ్వామిత్రులు ఇప్పటికే నిష్క్రమించారు, లేకపోతే ఆయనకి కోప మొచ్చేది

కామేశ్వరరావు:: చాలా సొగసుగా సాగింది!

రాఘవ:: 🙂

రవి:: ఇందులో కూడా ఉత్ప్రేక్ష్యలున్నాయి. నాక మిద్ది 🙂

రాఘవ:: 🙂

కామేశ్వరరావు:: స్వర్గముండేది పైనే కదా 🙂

చదువరి:: బ్లాగులోకం స్వర్గమంటారైతే? 🙂

రాఘవ:: మిద్దె అంచుల్లో నాకమంటారా! 🙂

కొత్తపాళీ:: కామేశ్వర, మిద్దెక్కితే, స్వర్గమే నంటారా?

కొత్తపాళీ:: రాఘవ LOL. ha ha ha

చదువరి:: రాఘవ:: 🙂

కామేశ్వరరావు:: 🙂

రాఘవ:: 😀

రవి:: బ్లాగు లోక మిద్ది అని కూడా అన్నారు. 🙂 అంటే, బ్లాగులోకపు మిద్దె లో నాకముంటుందని భావం.

కొత్తపాళీ:: అవున్లే, అవన్నీ గగన విహారియౌ రవికి తెలుస్తాయి

రాఘవ:: పండితులు ఎన్ని అర్థాలైనా తీయగలరు.

రవి:: బ్లాగు పండితులు? 🙂

చంద్రమోహన్:: బ్లాండితులు!

రాఘవ:: చంద్రమోహనులవారూ, మీరు ఒక అడుగు ముందుకు వేశారే! 🙂

పుష్యం:: ఎన్నో అర్ధాలని పిండేవారిని ‘పిండితు’లంటారేమో ..

రాకేశ్వరుఁడు:: 🙂

రాఘవ:: హిహ్హిహ్హీ 😀

సనత్:: భలే భలే

కామేశ్వరరావు:: పుష్యంగారు- హహహ!

చదువరి:: పిండితులు – భలే! 🙂

కామేశ్వరరావు:: మొత్తానికి బ్లాగ్లోకాన్ని ఆకాశానికెత్తేసారు!

రవి:: ఉట్టి కెగిరిందండీ. స్వర్గానికి ఎగురలేదు

కొత్తపాళీ:: మిత్రులారా, మనం పెట్టుకున్న గడువు ముగిసింది. మీ అందరి సరస కవిత్వ ధారలో నాలుగ్గంటలు మునకలేసి దిక్కు తెలీకుండా కొట్టుకుపోయినాయి

మురళి:: సమయపాలనలో మనం తెలుగువారనిపించుకుంటున్నాం!

రాఘవ:: 🙂

రవి:: 🙂

కొత్తపాళీ:: ఈ సారి పూరణల్లో వందకి పైగా పద్యాలు వచ్చాయి. అన్నీ ఇక్కడ ప్రదర్శించడం అసాధ్యం

రవి:: వచ్చే యేడాది ప్రశ్నపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?

కొత్తపాళీ:: ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించిన మీకందరికీ పేరు పేరునా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పలువురు కవిమిత్రులు వారివారి పనుల వల్ల ఈ ప్రత్యక్షసభలో పాల్గొనలేక పోయారు. పొద్దులో ఈ సభా కార్యక్రమ విశేషాల్ని ప్రచురించినప్పుడు, సభలో చెప్పకుండా ఉండిపోయిన మరికొన్ని రసవత్తరమైన పద్యాల్ని కూడా ప్రస్తావిస్తాము.

ఆహూతులై వచ్చిన ప్రేక్ష అతిథులకి కూడా నమస్కారాలు తెలియ చేసుకుంటున్నాను

చదువరి:: సభను రసవత్తరంగా జరిపించిన మీకూ మా నెనరులు.

సనత్:: మాకీ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు

కామేశ్వరరావు:: ఎప్పటిలా చాలా చక్కగా నిర్వహించిన బ్లాగ్రాయల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

చంద్రమోహన్:: అద్భుతమైన కవిత్వాస్వాదనం! నెనర్లు!

కొత్తపాళీ:: రాఘవా, ఏమైనా స్వస్తి పద్యం చెబుతారా?

రాఘవ::

రక్తి కట్టెను సభ రతనాలె పద్యాలు

గనులు గాని మీరు కవులు కారు

పద్యవిద్య నేడు హృద్యమయ్యెను గాన

వందనములు మీకు వందనములు

రాఘవ::

మంగళము సభాపతికిని
మంగళమగుగాక సభకు మహినిఁ గవులకున్
మంగళము సర్వజనులకు
మంగళమయ మూర్తియైన మాధవుడిడుతన్

మఙ్గలాశాసనపరైర్మదాచార్యపురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైస్సత్కృతాయాస్తు మఙ్గలమ్

~~~~~~~~~~~~~~~~~

కవిసమ్మేళనంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని తమతమ పూరణలను సమర్పించడమే కాకుండా సాటి కవుల పూరణలను, సరస సంభాషణలనూ ఆస్వాదించి, సద్విమర్శలు చేసి, ఇతరులు చేసిన విమర్శలను సహృదయంతో స్వీకరించి సమ్మేళనాన్ని విజయవంతం చేసిన కవివరులందరికీ పొద్దు నెనరులు తెలుపుతోంది. కోరిన వెంటనే తమ పద్యాలను పాడి రికార్డు చేసి మాకు పంపించినందుకు కూడా వారికి నెనరులు తెలుపుకుంటున్నాం.

సదస్సులో ఉత్సాహంగా పాల్గొని, పద్యాల మంచిచెడులను నిశితంగా పరిశీలించిన రసహృదయులైన ప్రేక్షకులకు పొద్దు నెనరులు తెలుపుతూ, భావి సమ్మేళనాలలో తమతమ పద్యాలను వినిపించేందుకు సన్నద్ధం కావలసినదిగా కోరుతోంది.

ఈ పద్య కవి సమ్మేళనాన్ని నిర్వహించడంలో -సమస్యలను రూపొందించడం నుండి, కవులకు ప్రేక్షకులకు ఆహ్వానాలు పంపించడం, వందకు పైగా వచ్చిన పూరణలను పరిశీలించి యోగ్యతానుసారంగా సమ్మేళనంలో సమర్పించేందుకు ఎంచడం, సమ్మేళనాన్ని కడు సమర్థవంతంగా నిర్వహించడం వరకు అన్ని పనులనూ నారాయణస్వామి (కొత్తపాళీ) గారు స్వయంగా సమన్వయపరచారు. వారి ఉత్సాహ, ప్రోత్సాహాలే ఈ కవిసమ్మేళనాల విజయం వెనుక ఉన్న చోదకశక్తి. వారికి పొద్దు శతథా నెనరులు తెలుపుకుంటోంది.

…………………

నిర్వహించిన విధానం:

  • కొత్తపాళీగారు ముందుగా ఆసక్తిగల కవులకు, ప్రేక్షకులకూ ఆహ్వానాలు పంపించారు.
  • ఆ తరువాత పాల్గొనదలచిన కవులకు సమస్యలు, దత్తపదులు, అనువాదం, వర్ణనాంశాల జాబితాను పంపించారు.
  • ఈ జాబితాను పంపించాక, సుమారు రెండు వారాల గడువు ఇచ్చారు. గడువు లోపు కవులంతా తమ పూరణలను కొత్తపాళీగారికి పంపించారు.
  • గడువు తరువాత 2010, మార్చి 13 శనివారంనాడు, అంతర్జాలంలో పొద్దు ఏర్పాటు చేసిన కబుర్ల గదిలో (చాట్ రూమ్) కవులంతా కొత్తపాళీ గారి అధ్యక్షతన సమావేశమయ్యారు. అప్పటివరకు వచ్చిన పూరణల్లోంచి ఉత్తమమైన వాటిని ఎంచిపెట్టుకున్న కొత్తపాళీ గారు ఒక్కొక్క సమస్యనూ తీసుకుని ఎంపిక చేసిన పద్యాన్ని సమర్పించమని కోరుతూ ఉంటే ఆయా కవులు తమ పద్యాలను సభలో సమర్పించారు.

సదస్యులు చేసిన సరస సంభాషణలు సభ ఆహ్లాదంగా నడవడంలో దోహదపడ్డాయి. సందర్భోచితంగా కవులూ ప్రేక్షకులూ ఉటంకించిన సాహిత్య విశేషాలు సభకు వన్నె చేకూర్చాయి. సభ విశేషాలను సాధ్యమైనంతవరకు, దేన్నీ వదలకుండా ప్రచురించడానికే ప్రయత్నం చేసాం. ఈ సమ్మేళనంపై, పద్యాల బాగోగులపై రసహృదయులైన మా పాఠకుల నుండి స్పందనలను కోరుతున్నాం.

————————–

(ఇంతటితో వికృతి ఉగాది పద్యకవి సమ్మేళనం నివేదిక సంపూర్ణం)

Posted in కవిత్వం | Tagged , | 6 Comments

మృచ్ఛకటికం – రూపక పరిచయం

రవి (బ్లాగాడిస్తా)

మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది.

కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి. రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయపదాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి రూపక సాహిత్యాన్ని రూపక ఉపరూపకాలుగా విభజించారు. రూపకాలు మొత్తం పది. అవి – నాటకం, ప్రకరణం, భాణం, ప్రహసనం, డిమం, వ్యాయోగం, సమవకారం, వీధి, అంకం, ఈహామృగం.

పై ఆర్యోక్తి, కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలాన్ని గూర్చిన పొగడ్త. అయితే, ప్రాచీన సంస్కృత, ప్రాకృత సారస్వతంలో భారతీయ, ప్రపంచ సారస్వతంలోనే వైవిధ్య విలసితమై అపూర్వంగా నిలిచి పోయే ప్రకరణం అనబడే రూపకాంతరం – మృచ్చకటికం (ఇకపై సౌలభ్యం కోసం ప్రకరణం, నాటకం రెంటినీ ఒకే అర్థంలో వాడుతున్నాను).

ఇదో వైవిధ్యమైన నాటకం. సంస్కృత రూపకాలకు గ్రీకు రూపకాలు ఆధారమని డా|| వెబర్, డా|| విండిష్, రాహుల్ సాంకృత్యాయన్ వంటి పండితులు వాదించినప్పటికీ, భరతుని నాట్యశాస్త్రం, పాణిని నటసూత్రాలు గ్రీకు రూపకాలకు పూర్వమే బాగా వ్యాప్తి చెందాయని మరికొంతమంది (వింటర్నిట్చ్ తదితరులు) పండితులు అనేక ఋజువులు ప్రతిపాదిస్తున్నారు. గ్రీకు, భారతీయ నాటకాల మధ్య ప్రస్ఫుటమైన వైరుధ్యాలు ఈ ఋజువులకు ఆలంబనగా నిలుస్తున్నాయి. మౌలికంగా గ్రీకు నాటకాలు విషాదాంతాలు, వాస్తవిక జీవన ప్రతిబింబాలూ అయితే, భారతీయ నాటకాలు ఉదాత్త జీవన బోధకాలు, సుఖాంతాలూనూ.

మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది. ఈ ఉల్లంఘనాంశాలలో మొదటిది – ఈ నాటకం పేరు. నాట్యశాస్త్రం ప్రకారం, ప్రకరణం పేరు నాయికా నాయకులకు సంబంధించినదై ఉండాలి. (ఉదా: మాలతీమాధవం) ఇది ఈ నాటకంలో ఉల్లంఘించబడింది. మృత్ + శకటికం, మృచ్ఛకటికం అయింది. శకటం అనకుండా శకటికం అన్నారు కాబట్టి, (మృత్) శకటానికి సంబంధించిన లేదా “చిఱు శకటం” అని వ్యుత్పత్తి చెప్పుకోవాలి. మృచ్ఛకటికం అంటే – చిన్న మట్టి బండి. పాత్రధారులకన్నా, నాటకానికి హృదయంగా భాసిల్లే నాటక సందర్భంలోని ఓ నిర్జీవమైన వస్తువు ద్వారా ఈ నాటకానికి జీవం పోయడం ఈ నాటకంలో కనిపిస్తున్నది. భాస మహాకవి “ప్రతిమ” నాటకం కూడా ఈ ధోరణికి ఓ ఉదాహరణ.

ఈ నాటకంలో ముఖ్యంగా రెండు కథలు ఉన్నాయి. ఒకటి ప్రధాన కథ, మరొకటి నేపథ్య కథ. చారుదత్తుడనే నిర్ధన బ్రాహ్మణుడు, వసంతసేన అనబడే గణికల మధ్య ప్రేమకు సంబంధించినది-ప్రధాన కథ అయితే, దుష్టుడైన అవంతీ రాజు పాలకుని తిరుగుబాటుదారులు పదవీచ్యుతుణ్ణి చేసి ఆర్యకుడనే గోపాలక యువకుణ్ణి రాజును చేయడం – నేపథ్యకథ. సుఖాంతమైన ప్రేమకథ ఒకటయితే, చెడుపై మంచి జయించటం అన్న నీతికి ప్రతీక మరొకటి. ఈ రెండవది అంతర్లీనమైన సందేశం. ఈ నాటకం ఐదు విషయాలలో సుఖాంతం అని నాటకం చివరన వచ్చే “లబ్ధా చారిత్ర శుద్ధిశ్చరణ నిపతితః ..” అన్న శ్లోకంలో వివరించబడింది. వాటిని సూచిస్తూ నాటకం మొదట్లో సూత్రధారుడు కొన్ని సూచనలు చేస్తాడని ఎమ్. ఆర్. కాలే గారి వివరణ.

కథ

పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, కౄరుడు. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు నివసిస్తుంటాడు. ఇతడు దానధర్మాలు చేసి దరిద్రుడయిన వాడు, సుందరుడు, సచ్ఛీలుడు. ఇతడికి ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడూ ఉంటారు. వసంతసేన ఆ నగరంలోని గణిక ప్రముఖురాలు. ఈమె చారుదత్తుడిపైన మనసు పడుతుంది. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి వెంటబడతాడు. ఓ ఘట్టంలో అతణ్ణుండి తప్పించుకుందుకు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో జొరబడుతుంది. తననో దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడి కిస్తుంది. చారుదత్తుడు ఆ నగల బాధ్యతను తన సహచరుడు మైత్రేయుడికి అప్పజెపుతాడు.

ఈ రూపకం యొక్క కథాసంవిధానం గురించి పండితులు ఎన్నో రకాల ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా, తిరిగి ఇంకొక విధంగా, మరో కోణంలో ఆవిష్కృతమయే విలక్షణ కథాసంవిధానం ఈ రూపకం సొంతం.

శర్విలకుడనే చోరుడు ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేసి, ఆ నగలను అపహరిస్తాడు. ఈ శర్విలకుడికొక ప్రేయసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు. వసంతసేన పరిచారిక అయిన మదనిక. ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసమే శర్విలకుడు చౌర్యానికి పాల్పడ్డాడు. అపహరించిన నగలను తీసుకుని శర్విలకుడు వసంతసేన ఇంటికి వెళ్ళి, మదనికను కలిసి, జరిగింది చెబుతాడు. మదనిక భయపడి, ఆ నగలు తన యజమానురాలివేనని, ఆమే స్వయంగా వాటిని చారుదత్తుని వద్ద దాచిందనీ చెప్పి, చౌర్యారోపణ పాలుబడకుండా “చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి, నగలను ఒప్పజెప్ప”మని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటునుంచి వసంతసేన ఈ సంభాషణ వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను, చారుదత్తుడు నగలను అందజేయడం కోసం పంపాడని, నగలు తీసుకొమ్మని వసంతసేనకు అందజేస్తాడు. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి, మదనికను శర్విలకుడితో సాగనంపుతుంది. శర్విలకుడు మదనికను తీసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో, తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడిచేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి, ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించడం కోసం పథకం రచిస్తూ బయలుదేరతాడు.

సంవాహకుడనేవాడు చారుదత్తుడి వద్ద పరిచారకుడిగా ఉండి, చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్టకూటికై తపిస్తూ, జూదవ్యసనపరుడయి పరిభ్రమిస్తుంటాడు. ఇతడు ఓ జూదంలో పది సువర్ణాలను ప్రత్యర్థికి బాకీపడి, అవి చెల్లించలేక, పారిపోతూంటాడు. పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన ద్యూతకుడనే మరొక జూదరి పట్టుకుని చితకబాదుతాడు. దెబ్బలకు తాళలేక పారిపోతూ, సంవాహకుడు ఓ ఇంటిలో జొరబడతాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకుని, ధనం ఇచ్చి సంవాహకుణ్ణి విడిపిస్తుంది. ఆ సంవాహకుడు విరక్తి చెంది, బౌద్ధ శ్రమణకుడవుతాడు.

వసంతసేన నగలు పోయిన తర్వాత, ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దారిద్ర్యానికి తోడు అపవాదూ వచ్చి పడబోతున్నదనీ చారుదత్తుడు క్రుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత, ఆ నగలకు పరిహారంగా వసంతసేనకు తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకొమ్మని చెబుతుంది. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికి ఇచ్చి అతని ద్వారా వసంతసేనకు అప్పజెబుతాడు చారుదత్తుడు.

తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని, జరిగిన విషయాలన్నిటినీ విశదీకరించే ఉద్దేశ్యంతో, వసంతసేన శర్విలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను, చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్నీ తీసుకుని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం పూట వెళ్తుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట విశ్రమిస్తుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంటిలో బాలుడు రోహసేనుడు ఓ మట్టిబండితో ఆడుతూ, తనకు సువర్ణశకటం కావాలని మారాం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఊరడించి, ఈ నగలతో నువ్వూ సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని, నగలను ఆ మట్టిబండిలో పెట్టి పిల్లవాడిని సముదాయిస్తుంది.

ఆ తర్వాత –

శకారుడి బండిని చారుదత్తుడు తనకోసం పంపిన బండిగా పొరబాటు పడి వసంతసేన పుష్పకరండకమనే ఉద్యానవనానికి బయలుదేరుతుంది. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కిందనుకుంటాడు. తనను వరించమని వసంతసేనను హింసిస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆమె గొంతు నులుముతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆమె చనిపోయిందని తలచి శకారుడు – ఆమెను హత్య చేసినది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద, వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయనిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరిపడంలో భాగంగా, అతడిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వధ్యశాలకు తీసుకొని వెళుతుంటారు.

ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు (ఇదివరకటి సంవాహకుడే) రక్షించి, ఉపచర్యలు చేసి బయటకు తీసుకువస్తాడు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడ చేరి, న్యాయాధికారులకు విషయం వివరించి అతడిని విడిపిస్తుంది. శకారుడికి జనం బుద్ధి చెపుతారు. ఈ లోగా ధూతాంబ అగ్నిప్రవేశం చేయబోతుంటే, చారుదత్తుడు వచ్చి, ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడిని, మరో నగరానికి రాజును చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు.

Posted in వ్యాసం | Tagged | 12 Comments

కవికృతి -౩

కత్తి మహేష్ కుమార్:

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు
న్యూటన్ సూత్రం తప్పిందా?
లేక…
నీలేమి శూన్యంలో
సూత్రమే మారిపోయిందా!

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది
నీ శూన్యాన్ని…
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మంటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను

అప్పుడు తెలిసింది…
కన్నీరుకార్చే మగాడికి షర్టెంత అవసరం అని.

పెరుగు రామ కృష్ణ:

రుమాలైనా ఎంతో అవసరం..
చొక్కా లేకున్నా..
కన్నీళ్లు ఆపడం ఎవరితరం మిత్రమా..?

స్వాతీ శ్రీపాద:

నీకు తెలుసా ………..

కృత్రిమత సీతాకోక చిలుకల్ను కత్తిరించుకుని

కాగితపు నవ్వుల్ను పెదవులమీద అతికించుకు

చూపుల గాలాలను తప్పించుకుంటూ

మనసు దరిని ఒరుసుకుంటూ సాగే

మౌన ప్రవాహాల ఉపరితలంపై ఊగిసలాడే

ఉషోదయం తొలి పలకరింపులు

ఇవేనా? ఇవేనా నా చుట్టూ తెరిచి పరచుకున్న పుస్తకాల పుటలు

నిన్నటి చీకటి కీనీడలో

విరగబూసిన ముళ్ళగోరింట పూల గుసగుసలేకాని

ముళ్ళపొదల్లో నిలువెల్లా గాయపడి

రక్తాక్షరాలు స్రవించే

అంతరంగపుటలజడుల జాడైనా తెలుసా నీకు?

కంటి రెప్పల చిమ్నీల మీద

ఒంటిగా ఎదురుచూస్తూ

రాత్రి గుడ్లగూబల ఆహ్వాన హస్తాల్లో

కుండపోతగా కురిసే వెక్కిళ్ళ జడివానలో

సొమ్మసిల్లిన క్షణాలు తెలుసా?

దూరంనించి గూగుల్ భూగోళాన్ననీ

లోలోనకు పాకితే తప్ప

లోయల గుప్పిళ్ళు వీడవనీ

పర్వతాల పందిళ్ళూ రూపు దిద్దుకోవనీ

ముదురాకుపచ్చ ముద్దమందారపు కొమ్మల్లా

పెళుసనిపించే సౌకుమార్యం నీకేం తెలుసు?

పగిలిన స్వప్న శకలాల్ను ఏర్చి కూర్చి

పునర్నిర్మించుకున్న ఈ జీవన సౌధంలో

ఏపక్క తడిమినా ఆనాటి రాగాలేననీ

నీకు తెలుసా?

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

కో హం

-హెచ్చార్కె

ఏడుపు వస్తోంది
ఎట్నుంచి ఎటో వెళ్తూ
ఒక పాడువడిన పాకలో
తల దాచుకున్నాను
ఇక్కడెవరో నివసించిన,
పిల్లల్ని కని పెంచిన,
చనిపోయిన గుర్తులు
నేను దేన్ని వెదుక్కుంటున్నాను?
ఎక్కడ పోగొట్టుకున్న ఆశను?
ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో
తెలియనివ్వకుండా
కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి

దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు
బండి చక్రాల రాపిడిలో
ఇక తిరిగి రాదల్చుకోలేదనే లోహ ధ్వని
విషాదంగా మోగుతున్న ఎద్దుల మెడ గంటలు
ఇష్టం లేని ప్రయాణం, అమావాస్య రాత్రి
కాసేపు ఇక్కడ మజిలీ చేయరాదా?
అంతగా నొచ్చుకుని వెళ్లడమెందుకు, ఆగిపోరాదా?
అయినా, నాకెందుకు ఏడుపు?
రేపటి సంగతి రేపే అనుకుని నిద్రపోరాదా?

అడ్డదిడ్డంగా పరుచుకున్న గడ్డి పక్కలో
ఎంత వెదుక్కున్నా దొరక్కుండా
గుచ్చుకుంటున్న గుండు సూది
జవాబు కోసం ఒక్కొక్క గడ్డిపోచను తీసి
చూసి పారేయడానికే ఈ రాత్రి చాలేట్టు లేదు
అంధకారంతో కలిసి వెలుగు ఉంటుంది గాని,
కళ్లు కనపడ్డానికి అవసరమైనంత కాంతిని
పిండుకోడానికి ఈ చీకటి చాలేట్టు లేదు

Posted in కవిత్వం | 26 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – నాల్గవ భాగం

కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య –
రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్

విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట

కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ చెప్పండి

గిరి:: ఇదిగో

మ.కో

“షణ్ముఖా ప్రియశిష్య రమ్మిటు, జాగుచేయక చెప్పవోయ్,

రాణ్మహేంద్రవరమ్మదేమిటి, రత్నగర్భమదేమిటీ?”

“రాణ్మహేంద్రవరమ్ము పట్నము, రత్నగర్భము సాగరమ్”

“రాణ్మహేంద్రవరమ్ము నీటినలంకరింప నదేమగున్?”

“రాణ్మహేంద్రవరమ్ము చేరును రత్నగర్భునిచెంతకున్”

“షణ్ముఖా ప్రియశిష్య సత్తమ, సంతసించితి నిక్కమోయ్”

“షణ్ముఖ ద్గురువర్య నేటికి చాలు ప్రశ్నలు, లేనిచో

“రాణ్మహేంద్రిని నేను చేరెద రత్నగర్భుని పొట్టలోన్”

విశ్వామిత్ర:: గిరిగారూ, మాలికాప్రియులు ..

చదువరి:: ఔను, ఎంచేతో గిరిగారు నాలుగు పాదాల్తో సరిపెట్టలేరు.

రవి:: 🙂

విశ్వామిత్ర:: సరిపెట్టలేకపోవటం కాదండీ దాతృత్వం

కొత్తపాళీ:: విశ్వామిత్ర, అవును, నిజమే, ఎంతైనా గిరిధరుడు వనమాలి కూడా కదా, మాలలే మాలలు

రాకేశ్వరుఁడు:: 😀 అయ్యో సుబ్బయ్యో ఎంత పంజేసావయ్యో

కొత్తపాళీ:: గిరీ, ఎప్పటికైనా మీరు, సంభాషణలన్నీ పద్యాల్లో ఉండేట్టు ఒక సినిమా తియ్యాలి

రాఘవ:: కొత్తపాళీగారూ, భలే మాట చెప్పారు.

కామేశ్వరరావు:: అవునండీ! పద్యాలలో సంభాషించడం గిరిగారికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది!

కొత్తపాళీ:: రాఘవ కవీంద్రా, మీ పూరణ

రాఘవ:: అవధరించండి
మ.కో

మృణ్మయంబగు పృథ్విపైన సమీరణాహతమైన ప్రా

వృణ్ముహుర్వృషదంబుదంబు విరించియై కనఁ గౌతమిన్

వ్రాణ్మదేభసమానయానము ఱాల మీఁదుగఁ జేయుచున్

రాణ్మహేన్ద్రవరమ్ముఁ జేరెను రత్నగర్భుని చెంతకున్

రాకేశ్వరుఁడు:: వ్రాణ్మదేభసమానయానము ఱాల మీఁదుగఁ – భావకవితల్లో కూడా తెప్పించలేరండీ ఇంత భావాందం।

గిరి:: ఇదీ, పూరణంటే. చిక్కుని, దుష్కరప్రాసని భలే విడదీసారు

రాఘవ:: గోదారమ్మ రాజమండ్రి చేరి తర్వాత సాగరాన్ని చేరుతుంది కదా అని…

కొత్తపాళీ:: వ్రాణ్మదేభసమానయానము .. అనగా నేమి. పటము గీచి భాగములు గుర్తింపుము – ఐదు మార్కుల ప్రశ్న

రాకేశ్వరుఁడు:: సమీరణాహతమైన – సముద్రం నుండి వచ్చినదనా?

చదువరి:: రాఘవ గారూ, అర్థం చెప్పాలండీ..

కామేశ్వరరావు:: రాఘావార్యా, మీ పద్యానికి తిరుగు లేదండీ! నిజం చెప్పొద్దూ, మీ పూరణ చూసి స్పర్థతోనే నేనూ పూరణని ప్రయత్నించాను 🙂

రాఘవ:: సమీరణుడు అంటే వాయువు. ఆహత – కొట్టబడి

రాకేశ్వరుఁడు:: దంబుదంబు ఏమియందంబు।

రవి:: గోదారికి వరదొచ్చినట్టుందండీ

రాఘవ:: 🙂

ఫణి:: చక్కగా ఉందండి.

రాఘవ:: అసలు పద్యాలంటే రామరాజభూషణుడే వ్రాయాలండీ. ఏమి అలంకారాలూ, ఏమి సొగసూ. అబ్బో. ఆయనలా వ్రాయటం ఆయనకే చెల్లింది.

కొత్తపాళీ:: రాజ భూషణుడు కదా! తెలుగు పంచ కావ్యాల్లో వసు చరిత్ర ప్రౌఢకావ్యం అంటారు

రాఘవ:: అర్థం:: మట్టితో నిండియున్న భూమిమీద గాలిచేత కొట్టబడిన వానమబ్బు వర్షించి గోదావరిని పుట్టించింది. ఆ గోదావరి సొగసుగా ఱాళ్లమీదుగా ప్రవహించి ప్రవహించి రాజమండ్రి చేరి తర్వాత సాగరంలో కలిసింది.

చదువరి:: 🙂 బహు బాగు!

రాకేశ్వరుఁడు:: మదేభము = మత్తేభము ?

రాఘవ:: ఔను. రెండూ ఒకటే.

రాకేశ్వరుఁడు:: అటజని గాంచె పద్యం గుర్తుకు వచ్చింది।

శ్రీరామ్:: ప్రావ్రుణ్ముహుర్ అంటే?

రాఘవ:: ప్రావృట్ అంటే వర్షర్తువు. ముహుః మళ్లీ. వర్షర్తువులో మళ్లీ మళ్లీ కురిసే (వృషత్) మేఘము (అంబుదంబు).

శ్రీరామ్:: రాఘవా,,.నెనర్లు

కొత్తపాళీ:: కామేశ్వర్రావు గారు, మీ పూరణ కూడా

కామేశ్వరరావు:: అలాగే
మ.కో

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో..

ద్విణ్మనోऽశని రామభద్రుడు దీక్ష వారధి గట్టి, వి

భ్రాణ్మహాబల విక్రమమ్ముల రావణున్ బరిమార్చి, తా

ఘృణ్మతిన్ కపి వీరులన్ బ్రతికింపగా గొని దేవతా

రాణ్మహేంద్ర వరమ్ము, చేరెను రత్నగర్భుని చెంతకున్

రాఘవ:: కామేశ్వరరావుగారూ, అసలు దేవతారాట్ అని కూడ విడగొట్టవచ్చు అన్న ఆలోచన నాకు రాలేదండీ మీ పూరణ చూచేవఱకూ.

చంద్రమోహన్:: రాకేశ్వర ఊరు హుష్ కాకీ చేసేశారు

సనత్ కుమార్:: భలే..

చదువరి:: దేవతారాట్ విరుపు ఉంది చూసారూ.. బ్రహ్మాండం !

రాకేశ్వరుఁడు:: కామేశం గారు ణ్మ ప్రాసను జటిలత్వము లేకుండానే భలే ఛేదించారే

ఫణి:: రాముడు సముద్రాన్ని చేరాడు. బాగుంది.

కొత్తపాళీ:: దీనిలో ఇంకో సౌందర్యం, పద్యం నడక చెడకుండా ఉండి ఇంకా సౌందర్యం ఇనుమడించింది

కామేశ్వరరావు:: నాకు విరుపుల మీదే దృష్టి ఉంటుందెప్పుడూ 🙂

చదువరి:: 🙂

కొత్తపాళీ:: ఏమోలెండి, పెద్దన గారు కదా, పరుపుల మీద ఉందేమో దృష్టి అనుకున్నాము ఇప్పటిదాకా 🙂 ఆయన హంసతూలికా తల్పం అడిగాడు కదా కవిత రావాలంటే.

(గతంలో జరిగిన భువనవిజయం కవిసమ్మేళనంలో కామేశ్వరరావు గారు అల్లసాని పెద్దన పాత్ర పోషించారు – సం.)

రాఘవ:: విరుపులు విరుల్లా అందంగా ఉండేలా చూచుకోవడం కూడ మీకు భలే తెలుసునండీ.

రాకేశ్వరుఁడు:: నాకు అసలు విరుద్దామనే ఆలోచనే రాదు।

రాకేశ్వరుఁడు:: దీన్ని మాత్రంమీరు నడ్డివిరగగొట్టారు

కామేశ్వరరావు:: అటు పిమ్మట రామాయణం చక్కగా రక్షించింది. 🙂

చంద్రమోహన్:: మత్తకోకిల నడక కూడా కొత్తగాఉంది ఈ పద్యంలో!

రాఘవ:: చంద్రమోహన్ గారూ, దీర్ఘసమాసాలవల్ల కొంచెం ఠీవి పెరిగి నడక మారిందండీ.

సనత్ కుమార్:: రాఘవా, కామేశ్వరరావు గారూ.. మీ ఈద్దరికీ చెరో లక్ష వరహాలు

రాకేశ్వరుఁడు:: చెబుతా చెబుతా నా పూరణ।

తర.

నునుపురాతికి, కొండ పిండిగ నుజ్జు జేసిరి మానవుల్

వనములన్నియు కామదైత్యికి వండి పెట్టిరి అంధులై

ఇనుముకై గనులెన్నియో యిలహృద్యమందున ద్రవ్విరీ

అనిల సంద్రములంతయుం గడు హాలహాలముఁ నింపిరీ

మ.కో

షణ్మహారిపుమాయలోఁ బడి జ్యా వినాశముఁ జేసిరీ

షణ్మహాక్షమఖండవాసులు స్వచ్ఛవాయువు లంతటా

విణ్మయమ్మును నింపఁగా, యిలఁ వేడి సంద్రము పొంగగాఁ

రాణ్మహేంద్రవరమ్ము జేరెను రత్నగర్భుని జెంతకున్

రాకేశ్వరుఁడు:: ఇది futuristic పూరణ 🙂

కొత్తపాళీ:: హమ్మ్ .. మొత్తానికి విలయం తప్పదంటావు

రాఘవ:: గ్లోబలు వార్మింగు మళ్లీ వచ్చిందే?

కామేశ్వరరావు:: Global warming!

చంద్రమోహన్:: అనిల సంద్రములు? హాలహాలము?

ఫణి:: లావా.

రాకేశ్వరుఁడు:: విద్యార్థి కల్పతరువులో హాలహాలము ఇచ్చారు।

రాకేశ్వరుఁడు:: అనిలసంద్రముల్ – ద్వంద్వసమాసం

రాఘవ:: రాకేశ్వరులవారూ, హాలహలము విన్నాను కానీ హాలహాలము వినలేదండీ.

శ్రీరామ్:: సమాసం దుష్టం…

రాకేశ్వరుఁడు:: కామేశ్వరరావుగారు, కామరాక్షసికొండి పెట్టిరి – అచల సంధి !

రాఘవ:: మిశ్రమనుకోవాలి. తప్పదు.

శ్రీరామ్:: 🙂

రాకేశ్వరుఁడు:: శ్రీరామ – యా అవునుకదా

కామేశ్వరరావు:: 🙂

చంద్రమోహన్:: అనిల సంద్రములంతటన్ అంటే స్పష్టత వస్తుందేమో

శ్రీరామ్:: మరే

చంద్రమోహన్:: అంతయున్ అంటే అవే కర్తలైపోతున్నాయి

గిరి:: రాజమండ్రి 2012 అన్నమాట

కొత్తపాళీ:: ఈ సారి పూరణల్లో పర్యావరణ ప్రస్తావన బలంగానే ఉంది

రాఘవ:: భలే. ఏమైనా, చక్కటి సమస్య ఇచ్చినందుకు రాకేశ్వరునికి పెద్ద నమస్కారం. అలాగే ఈ సమస్యకి నా పూరణ గోదావరీమాతకు అంకితం.

నరసింహారావు:: బాగుందండీ మీ పూరణ

చదువరి:: చక్కటి భావన !

…………………..

కొత్తపాళీ:: ముందుకి పోదాం… ఈ కవితా గోష్టిలో, కేవలం సమస్యలు సాధించడం, చమత్కారమే కాక, కవిత్వం ధార కట్టాలనేది కూడా మా ఆశయం. ఈ ఆశయానికి రూపకల్పన చేస్తూ మూడు నించీ ఐదు పద్యాల్లో కొన్ని అంశాలని వర్ణించమని కోరాము. ముందుగా కామేశ్వర్రావుగారిని ద్రౌపది వర్ణన వినిపించమని కోరుతున్నాను.

కామేశ్వరరావు:: చిత్తం
తే.గీ

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో..

ధర్మసూనుని మహనీయ ధర్మదీక్ష

వాయునందను పటుతర పౌరుషమ్ము

జిష్ణు సుతుని యచంచల కృష్ణభక్తి

నకులసహదేవు సౌందర్య నయ గుణములు

పంచనదములుగా సంగమించు నామె

సహజ “లావణ్య” విలసిత సాగరమ్ము!

శా.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో..

ఆ రోషాయుత నేత్ర విస్ఫురదుదగ్రార్చిస్స్పులింగమ్ము లే

పారీభావ ప్రచండకోప బడబాజ్వాలోల్లసత్ కీలలో!

ఆ రాజన్యసతీ శ్లథోచ్చలిత కేశాగ్రమ్ములేయే ప్రతీ

కారేచ్ఛా క్షుభితాంతరంగ పటురంగత్తుంగ భంగమ్ములో!

ఉ.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో..

ఆమె యెడందలోతు తెలియన్ దరమే అల బ్రహ్మకైన! ఏ

దో మిరుమిట్లు గొల్పు మెఱుపున్నది ఆమె స్వభావమందు, ఏ

దీ మిగిలింది యీమెకు తుదిన్? మృతపుత్రుల గర్భశోకమే!

ఈమె చరిత్ర భారతము, ఎన్నగ నద్దియు నర్ణవమ్మెగా!

రాఘవ:: ద్రౌపది వచ్చేసరికి మీరు కూడ మాలికలు అల్లారే! శార్దూలం అద్భుతమండీ. మొత్తానికి చిఱు ధ్వనికావ్యంగా ఉంది.

గిరి:: మీ పద్యం చదివాక ఇంద్రుణ్ణి జిష్ణు అని కూడా అంటారని తెలిసింది

రవి:: నాకిప్పుడే తెలిసింది

చంద్రమోహన్:: శార్దూలం అద్భుతం.

కామేశ్వరరావు:: రాఘవా, నెనరులు.

శ్రీరామ్:: మొదటిపద్యంలో అద్భుతమైన భావం!!!

చంద్రమోహన్:: భారతంలోని “దుర్వారోద్యమ బాహు విక్రమ…” పద్యాన్ని మించినట్లుంది

గిరి:: విస్ఫురదుదగ్రార్చిస్స్పులింగమ్ము

సనత్ కుమార్:: క్షుభితాంతరంగ పటురంగత్తుంగ భంగమ్ములో….భలే.

కామేశ్వరరావు:: ద్రౌపదిని వర్ణించాలనగానే, ఆ శార్దూలం అలా పరవళ్ళు తొక్కింది

రవి:: కొంచెం విశ్వనాథ వారి ఛాయ కనిపించింది (ఏదో మిరుమిట్లు గొల్పు మెఱుపున్నది..)

కామేశ్వరరావు:: రవిగారు, సరిగ్గా పోల్చుకున్నారు!

చంద్రమోహన్:: ద్రౌపదిని సాగరంతో పోల్చడం బాగుంది

కామేశ్వరరావు:: శ్రీరాం గారు నెనరులు. మొదటి పద్యంలో ఆ సముద్రంతో పోలికనే చివరిదాకా తీసుకురావడానికి ప్రయత్నించాను.

రాఘవ:: 🙂

కొత్తపాళీ:: రవి 🙂

ఫణి:: భర్తల గుణాలు ఆమెలో ప్రకాశిస్తున్నాయి. అధ్భుతంగా ఉందండి.

చదువరి:: అద్భుతం!

పుష్యం:: శార్ధూలం చాలా బాగుందండీ..చాలా సార్లు ప్రత్నించాను కానీ. సంస్కృతం లేకుండా శార్ధూలం చాలా కష్టమనిపించింది.

గిరి:: కామేశ్వరరావు గారు, నకుల సహదేవులు – అందము, తెలివి యేనా?

కొత్తపాళీ:: రాఘవ కూడా మంచి వర్ణన చేశారు. రాఘవా, మీ వర్ణన కానివ్వండి

రాఘవ:: అవధరించండి
శా.

శ్రీమద్భారతసంహితార్ణవపు లక్ష్మీరూప ధర్మేతర

క్షేమభ్రాంతి దురాత్మకాననమహాకీలాభ భాస్వత్కురు

స్త్రీమందారముఁ బౌరుషప్రకట శాంతీచ్ఛాజ్వలచ్చిత్త రా

మామూర్తిన్ దలతున్ బవిత్రతకుఁ ధర్మాసక్తికిన్ శక్తికిన్

సీ.

ద్రుపదుఁడు ప్రజకై క్రతువుఁజేయ కూతురై పుట్టె తా నగ్ని నద్భుతపు మూర్తి

పాండవర్షభులకుఁ బట్టమహిషియౌటఁ గననయ్యె గాఢశృంగారమూర్తి

ధార్తరాష్ట్రజ్యేష్ఠదర్పంబునుం జూచి హాయిగా నవ్వెడి హాస్యమూర్తి

పదిమందిలోఁ బరాభవమంది కృష్ణుని నార్తిఁ బిలచు కరుణార్ద్రమూర్తి

తే.గీ

వికటుఁ గీచకుఁ గాంచుచో భీతమూర్తి

భీమకరగతాసువులను వీరమూర్తి

అర్జునసతియై బీభత్సయైనమూర్తి

తల్లి నిండుగా శాన్తవాత్సల్యమూర్తి

ఉ.

కృష్ణవసుంధరాజనిమహర్షికి ద్రౌపది క్షేత్రపౌత్రియై

కృష్ణగఁ బుట్టి కుంతియను కృష్ణకు ముద్దులకోడలై మఱో

కృష్ణుఁడు పాండుపుత్రుఁడు కిరీటిమనస్సరసీరుహాలియై

కృష్ణుని భక్తురాలయి సుకృష్ణకచేక్షణ వెల్గె భారతిన్

సనత్ కుమార్:: భలే.

గిరి:: గొప్పగా ఉంది

కొత్తపాళీ:: సుకృష్ణకచేక్షణ ??

ఫణి:: అంతా కృష్ణ మయం. 🙂

శ్రీరామ్:: భేష్!

నరసింహారావు:: బావుందండి. ఆహా !

కామేశ్వరరావు:: అద్భుతం రాఘవా!

కొత్తపాళీ:: కచ అంటే జుత్తు కదా

రాఘవ:: చక్కటి నల్లటి వెండ్రుకలూ కండ్లూ

చంద్రమోహన్:: శభాష్

రవి:: నవరసాల పద్యం భలే ఉంది

గిరి:: ధర్మేతరక్షేమ భ్రాంతి – వివరించండి

కొత్తపాళీ:: ఓ, కృష్ణ విశేషణం రెంటికీ వొప్పిందా, సరే.

కొత్తపాళీ:: వర్ణనలో ఇచ్చిన రెండో అంశం ఒక దృశ్యం

సనత్:: అద్భుతం రాఘవా!

చదువరి:: భలే! బాగుంది.

రాఘవ:: ధార్తరాష్ట్రులకు అధర్మం క్షేమంగా ఉన్నట్టు భ్రాంతి కలిగించి చివఱికి ధర్మమే గెలిపించిన శక్తి

రాకేశ్వరుఁడు:: కామేశం గారిదీ, రాఘవదీ రెండూ అద్భుతంగా వున్నాయి, ఈ మధ్య గరికిపాటివారి మహాభారతంలో ద్రౌపది మాన సంరక్షణాఘట్టమే జరిగింది। ఈ వర్ణనాంశము చాలా ఉచితము।

గిరి:: లోతుగా ఆలోచిస్తేగానీ బోధపడినిది

రాఘవ:: కామేశ్వరరావుగారూ, అన్నీ వచ్చాయే. అద్భుత, శృంగార, హాస్య, కరుణా, భీతి, వీర, బీభత్స, శాన్త, వాత్సల్య

కొత్తపాళీ:: రౌద్రం .. కరుణ అనేది రసం కాదు

కామేశ్వరరావు:: కొత్తపాళీగారు, “కరుణ” రసం కాదు కాని “కరుణా” రసమే అనుకుంటాను.

రాఘవ:: 😀

చంద్రమోహన్:: కొత్తపాళిగారు, కరుణ రసమే! “ఏకో రసః, కరుణ ఏవ” అన్నాడు భవభూతి

కొత్తపాళీ:: కామేశ్వర, భలే

రాఘవ:: పైగా, వాల్మీకి రామాయణంలో ప్రధానరసం కరుణారసమే అని అంటారు కూడాను.

సనత్:: భలే..

కొత్తపాళీ:: చంద్ర, నిజమే, ఆ నానుడి నేనూ విన్నాను

రాకేశ్వరుఁడు:: సరసంగానుంది

గిరి:: నవరసరంగానుంది

రాఘవ:: స్వరససిద్ధి కలిగించాడు మా రాముడు 🙂

రాకేశ్వరుఁడు:: రాముఁడు రాఘవుఁడు రఘుకూల్ఉడితఁడు 🙂

Posted in కవిత్వం | Tagged , | 6 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం

కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ.

చదువరి:: ఒక్క క్షణం..
ఉ.

చదువరి గొంతులో ఈ పద్యం వినండి

“మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే

తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె పెళ్ళివేళ, చా

ల్చాలిక” యంచు నల్గు తన స్వామిని మారము సేయు బాలుడన్

పోలికగాంచి భార్య పతి పొంతకు చేరెను నూరడించగా

కొత్తపాళీ:: కథాకళించ .. భలే! నవ్వితె బదులు, నవ్విన అంటే ఇంకొంచెం గంభీరంగా ఉంటుంది.

రాకేశ్వరుఁడు:: ఇది కూడా ఆ తెలుగు – తూలికేనన్నమట! ఎంతైనా తెలుగుతూలిక తెలుగుతూలికే! భేష్

రవి:: కథాకళించ – బహు బాగు

కొత్తపాళీ:: am sure Malathi garu will be glad to hear that 🙂

రాఘవ:: తూలితే కథాకళించడం భలే భలే బాగుందండి.

గిరి:: దివ్యవాణి రాజేంద్రప్రసాదులను గుర్తుకు తెచ్చిందీ పద్యం

చదువరి:: గిరి- 🙂

శ్రీరామ్:: బాపూ గాంచనిచో…..

కామేశ్వరరావు:: 🙂

కొత్తపాళీ:: రాకేశ్వర, మీ పద్యం చెప్పండి. తరవాత.. సనత్ గారు, సిద్ధంగా ఉండండి మీ పూరణతో

రాకేశ్వరుఁడు::

ఉ.

మాలిక నాదు యిష్టసఖి మానిక కాపురమీ చిరాకు నీ

తూలిక ఆపుకోని పతితో, పడిసచ్చిన తాగుఁబోతుతో

చాలిక నీదు కాపురము, చక్కగ నిద్దరు లేచిపోదుమే

పోలిక లేదు ఆ నిదురపోతుకు నాకును నమ్మిరా చెలీ

కామేశ్వరరావు:: రాకేశ్వరా, మొత్తానికి మీరు చాలా డేంజరస్ ఫెలోలా ఉన్నారే 🙂

విశ్వామిత్ర:: ఈ హారకుడు ఉత్తరభారతీయుడా?

రాకేశ్వరుఁడు:: అవును, ఎలా చెప్పేశారు విశ్వామిత్రుల వారూ?

గిరి:: పెళ్ళికాని వాళ్ళకి దత్తపదులు జాగ్రత్తగా ఇవ్వాలి

రాఘవ:: మళ్లీ దాదాపు వ్యావహారికభాష! 🙂

రాకేశ్వరుఁడు:: వ్యావ’హారక’భాష!

కామేశ్వరరావు:: 🙂

కొత్తపాళీ:: ఇక్కడ చిన్న శాస్త్రచర్చ .. ఉవాచ అనేది ఆంగ్లంలో క్రియాపదానికి నామవాచక రూపమైన gerund లాంటి ప్రయోగమా అని

రాకేశ్వరుఁడు:: హారకః + ఉవాచ సంధి జరిగాక రెండుపదాలుగా వ్రాస్తారా ఒక పదంగానా?

రాఘవ:: ఒకే పదంగా వ్రాస్తారు. హారకఉవాచ అనీ.

కొత్తపాళీ:: సంధి అంటేనే రెండు విడి పదాలు ఒకటి అవ్వడం

కామేశ్వరరావు:: అప్పుడు “హారకఉవాచ” ఒకటే పదం అవుతుంది.

కొత్తపాళీ:: సనత్, మీ పద్యం. దీని తరవాత, కామేశ్వర్రావుగారు మీ శివుని వర్ణనతో సిద్ధంగా ఉండమని కోరుతున్నాను.

సనత్ కుమార్::
ఉ.

సనత్ సమర్పించిన ఈ పద్యం ఆయన గొంతులోనే..

ఉ.

పోలిక జెప్ప నా తరమె? పూవులు దత్తపదమ్ము లాయె ! “మం

చాలిక పూరణల్” గ సరసాల రసాలను జూపె ! వర్ణనల్

తూలిక లిచ్చె ! నాశువులు త్రోవ సుమమ్మయె ! జాల తోటకున్

మాలి కదా ఇతండు ! మధు మాసపు వేళల ! కొత్తపాళి రో !!

రాఘవ:: సరసకవే మీరు!

సనత్ కుమార్:: మంచమ్మీద ఆమాత్రం స-రసం గా ఉండకపోతే ఎట్టా??

కొత్తపాళీ:: ఐతే పలుగూ పారా సిద్ధం చేసుకో మంటారు? సరసంగానే ఉంది. వచ్చేది వసంతం కదా, తోట పని తప్పదు. వసంతం నేల వ్యవసాయానికీ, కావ్య సుక్షేత్ర వ్యవసాయానికీ కూడా అనువైన సమయమే.

విశ్వామిత్ర:: పద్యప్రియ వనమాలి

గిరి:: కొత్తపాళీని polish చేసేసారు

రాఘవ:: గిరిగారూ, నిజమే.

గిరి:: బావుంది

ఫణి:: కాకా పడుతున్నారు అద్యక్షులవారిని:) బాగుందండి.

విశ్వామిత్ర:: కవిపోషణతో పాటు – రచనకూడా కాస్త తరచుగ చేస్తే…

సనత్ కుమార్:: కొత్తపాళి గారు ముచ్హెంగా మూడోసారి సమర్ధవంతంగా ఈ అంతర్జాలవనంలో కవితా సుమాలను వికసింపజేస్తున్నందుకు ధన్యవాదాలతో…

కొత్తపాళీ:: మంచి రసవత్తరమైన పూరణ

శ్రీరామ్:: ఔను…స’రస’మైన పూరణ

సనత్ కుమార్:: దత్త పదాల్లో వేర్వేరు పువ్వుల్ని దండగా కడితేనే అందం కదా…

……………………………….

కొత్తపాళీ:: ఈ కవి సమ్మేళనాల్లో ఎప్పుడూ ఉండే దత్తపది, సమస్యలే గాక, అనువాదం అనే అంశం ఒకటి ప్రవేశ పెట్టాం గత ఏడాది. ఈసారి ఇచ్చిన అనువాదాంశాల్లో ఒకటి కాళిదాసు కుమారసంభవంలో ధ్యానంలో కూర్చున్న శివుని వర్ణన. కాళిదాసు శ్లోకాల్ని ఢీ అంటే ఢీ అనగల సొగసైన పద్యాల్ని, శివుని మంగళాకృతిని రూపుగడుతూ కామేశ్వర్రావుగారు రచించారు. కామేశ్వర్రావుగారు, కానివ్వండి.

కామేశ్వరరావు:: అవధరించండి
తే.గీ.

ఈ పద్యాన్ని కామేశ్వరరావు స్వరంలోనే వినండి

సర్ప సంధానితోన్నత జటభరమ్ము

శ్రవణమున వ్రేలు రుద్రాక్షసరయుగమ్ము

గళ రుగతి కజ్జలితమౌ మృగాజినమ్ము

తనరు నా యోగమూర్తి సదాశివమ్ము

చం.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలోనే

అరవిడియున్న కంటితుదలందొక సన్నని కాంతిరేఖ ప్ర

స్ఫురితముగాగ పక్ష్మములు భ్రూకుటి నిశ్చల వృత్తినొందగా

స్థిరముగ కంటిపాపలతి తీక్ష్ణత జూడగ నాసికాగ్రమున్

పరమశివుండు నిస్తుల తపస్స్థితి నుండెను సిద్ధయోగియై

తే.గీ.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలోనే

వర్ష సంరంభ విరహితాభ్రమ్ము వోలె

లహరులడగిన నిశ్చల హ్రదము వోలె

ఆంతర మరున్నిరోధియై హరుడు వెలిగె

వాతశూన్యస్థలీ స్థిర జ్యోతి వోలె

సనత్ కుమార్:: అద్భుతం…అద్భుతం… అద్భుతం… అత్యద్భుతం…

శ్రీరామ్:: ఏమి పట్ట్టు!

రాఘవ:: భలేగా తెనింగించారండీ. మీ విద్యకు నమస్కారం.

కొత్తపాళీ:: రాఘవ, విద్య ఒక్కటే సరిపోదు, కవి హృదయం కావాలి, కవితా ధార కావాలి

గిరి:: కళ్ళకు కట్టినట్టు – అంటే ఇదే

చంద్రమోహన్:: అద్భుతమండీ

విశ్వామిత్ర:: మొన్న అపర పెద్దన – ఇవేళ అపర శ్రీనాధుడు

ఫణి:: పరిపూర్ణత, రసానందము అనుభవమయ్యాయండీ మీ పద్యాలలో. అంత్యానుప్రాసం అద్భుతంగా ఉంది.

చంద్రమోహన్:: ఇలాంటి రచనే శ్రీనాధునిది చూసి, “మా డు,ము,వు,లు మాకిచ్చి మీ సంస్కృతం మీరు తీసుకోండి” అన్నాడట పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.

రాకేశ్వరుఁడు:: చంద్రమోహనం గారు, అవును ఛేదించడానికి చాలా జటిలంగానుంది।

కామేశ్వరరావు:: చంద్రమోహన్ గారు, కాని శ్లోకాలలో పదాలు రాకుండా చాలా వరకూ జాగ్రత్త పడ్డానండీ 🙂

చంద్రమోహన్:: అవును. అందుకే ఈ రచన కావ్య గౌరవం పొందింది.

శ్రీరామ్:: వాతశూన్యస్థలీ… ఇది మూలం లోని భావమేనాండీ?

కామేశ్వరరావు:: శ్రీరాం గారు, అవును.

రవి:: వాతనిష్కంపమివ ప్రదీపం – కాళిదాసు చెప్పిన మాటకు వాతశూన్యస్థలీ స్థిరజ్యోతి వోలె -అద్భుతం!

కొత్తపాళీ:: అరవిడియున్న కంటితుదలందొక సన్నని కాంతిరేఖ – చక్కటి తెలుగు నుడికారం

శ్రీరామ్:: అంటే తర్కంకూడదన్నారనుకోండి….కానీ గాలి లేకుండా ఎలా వెలుగుతుందా అని

రాకేశ్వరుఁడు:: శ్రీరాము గారు, అప్పటికింకా ప్రాణవాయువు కనుగొనలేదేమో 🙂

కొత్తపాళీ:: శ్రీరామా .. యోగ విద్యలో స్వతస్సిద్ధంగా లోపల అగ్ని ఉంటుంది. దాన్ని శివుడు ప్రాణం (వాయువు, ఊపిరి) తో లయింప జేస్తే అందులోంచి ప్రణవనాదం ఉద్భవించిందని శాస్త్రం.

కామేశ్వరరావు:: శ్రీరాం గారు, ఇక్కడ “వాత” అంటే “wind”, “air” కాదు.

శ్రీరామ్:: కామేశ్వరరావు గారు….ఔనండి..

రాకేశ్వరుఁడు:: కొత్త పాళీ గారు, నేననుకోవడం – అది గాలి వీయని చోటనే అర్థం

కొత్తపాళీ:: యోగాగ్ని వాయువు లేకుండా స్వయంభువుగా ఉంది శరీరంలో

రాకేశ్వరుఁడు:: కానీ అస్సలు గాలేలేని చోటు కాదని। గాలిలేని చోటు అనే వూహ మనం పిజిక్సు చదువుకొని అబ్బుకున్నది।

కొత్తపాళీ:: రాకేశ్వర, కావచ్చును. కానీ ఇక్కడ సమాధిలో కూర్చున్న శివుడు యోగి కూడా కాబట్టి, వాయు, వాత అనే వాటికి యోగ సంబంధమైన అర్ధాలు కూడా స్ఫురిస్తున్నాయి

రాఘవ:: పంచభూతాలకు అతీతుడాయన. గాలి ఉందా లేదా అని చూడడం అనవసరం.

కొత్తపాళీ:: రాఘవ, మంచి పాయింటు

శ్రీరామ్:: అదే నేను అన్వయం చేసుకున్నా కానీ….ఏదో రంధ్రాన్వేషణ

రాకేశ్వరుఁడు:: అవును ఇది చాలా మంచి పాయింటు, కాళిదాసుని వూహ ఏమిటో మఱి।

రవి:: గాలి లేని చోటు – ఆక్సిజను లేని చోటు అని కాదేమో

కామేశ్వరరావు:: ఇక్కడ “మరున్నిరోధము” అంటే ప్రాణాయామము.

విశ్వామిత్ర:: “మరున్నిరోధము” అంటే ప్రాణాయామము. -హమ్మో -ఇదేదో మన్మధుడి సంబంధించింది అనుకున్నా

కొత్తపాళీ:: మరుత్ ని నిరోధించడం .. బాగుంది

శ్రీరామ్:: ఉపమాగారి ఉపమానాల్లో వంకలు వెతకడం.. అనవసరం!

కామేశ్వరరావు:: అద్భుతమైన ఉపమానాలు కాళిదాసుకే చెందాయి. ఆయనకి మరొక్కసారి శత సహస్ర వందనములు.

…………………………

కొత్తపాళీ:: మనం ఇలా ద్వైత స్ఫూర్తిలో ఉండగా .. అదే దారిలో ఇంకో సమస్య – ఒకటి ఒకటి కూడి ఒకటెయగును – రవిగారు దీన్ని చాలా గంభీరంగా పూరించారు .. రవీ మీ వాగర్ధాల పద్యం వినిపించండి

రవి:: ఆజ్ఞ
ఆ.వె

రవి గొంతులో ఈ పద్యం వినండి

వాక్కు అర్థమునది వాణియగు విధము

శూలి గౌరి కూర్మి శుభములొప్ప

భవహరములుఁ జేరి ప్రణవమౌ భంగిని

ఒకటి ఒకటిఁ గూడి ఒకటెయగును

ఫణి:: అద్భుతంగా ఉంది.

చంద్రమోహన్:: చాలా బాగుంది! కాళిదాసు స్ఫూర్తితోనా!

రవి:: అవునండి, కర్టెసీ కాళిదాసు!

కామేశ్వరరావు:: ఆహా! కాళిదాసుని తలచుకోగానే “వాగర్థావివ…” పద్యం వచ్చేసింది!

సనత్ కుమార్:: గంభీరమైన భావంతో సమస్యని చాల సులభంగా పూరించేశారే..

రాఘవ:: పార్వతీపరమేశ్వరుల ప్రణయం ప్రణవమౌతుందీ అంటున్నారా! అమ్మో, ఏమి ఊహ! భలే.

రాకేశ్వరుఁడు:: భవహరములు ఏమిటి? లేదా ఎవరు?

రవి:: భవానికి, హరానికి ముందు అంటే సృష్ట్యాదిని ప్రణవం అని భావన

రాకేశ్వరుఁడు:: గౌరికి + ఊరిమి ?

కామేశ్వరరావు:: రాకేశ్వరా, మీరీ మధ్య సంధుల్లో చిక్కుకున్నట్టున్నారు 🙂

కొత్తపాళీ:: కూరిమి = కూర్మి అంటే ప్రేమతో అని

కొత్తపాళీ:: చాలా బావుంది, రవి

గిరి:: మంచి పూరణ

చదువరి:: చాలా బాగుంది పద్యం

రవి:: ధన్యోస్మి

కొత్తపాళీ:: పుష్యం గారు, మీ పూరణ. తరువాత విశ్వామిత్ర గారిది ఒక దత్తపది

పుష్యం:: చిత్తం
ఆ.వె

లక్ష లంచమడగ, లక్ష రూప్యములివ్వ

మరొక లక్ష కోరె, ఏమిటనిన,

“బల్లక్రింద లెక్క బడిలోన నేర్పరోయ్,

ఒకటి ఒకటి కూడి ఒకటె అగును!!”

విశ్వామిత్ర:: ఆటవెలదితో అద్వైతం.. అద్భుతం

శ్రీరామ్:: విశ్వామిత్ర….ఇదీ మీ ఫాం 🙂

రాఘవ:: పు.శ్యాం. గారూ, భలే.

గిరి:: ఒకటి పది కూడినా ఒకటే అయ్యే లెక్క అది – బాగుంది

రాకేశ్వరుఁడు:: @గిరి : )

రాకేశ్వరుఁడు:: 🙂

రవి:: శ్యాం గారు, ఇందాక కట్నం మాటెత్తలేదు, ఇప్పుడేమో బల్ల కింద చేయంటున్నారు.

చంద్రమోహన్:: ఆహా! లంచానికి కొత్త ఫార్ములా

కొత్తపాళీ:: మంచి చమత్కారం శ్యాం

రాకేశ్వరుఁడు:: అది బల్లక్రింది అద్వైతం లెండి

గిరి:: బల్లక్రింది అద్వైతం 🙂 హ హా

పుష్యం:: ధన్యోస్మి

విశ్వామిత్ర:: లంచానికి తోడు మోసం .. కలి ప్రభావం అనుకుంటా

సనత్ కుమార్:: బల్లకింద ఉండేది అద్వైతం మాత్రమే.. ద్వైతమూ, విశిష్టాద్వైతమూ ఎక్కడా కనిపించవు.. 😉

కొత్తపాళీ:: మాసు, బాసు, కింగు, కేడీ – మన్మథుని గురించి – విశ్వామిత్రులు కానివ్వండి

విశ్వామిత్ర::

మ.

అరయన్నాతని బాణమాసుదతి ఆస్యాలంబహాసంబగున్

విరులేలా? విలుగాను భాసురపు మోవేయొప్పువేరేటికిన్

గురులందాగెనొ, డెందెమందొ, కలికింగూడీనిమేషంబునన్

శరమున్ గొట్టగ నన్ను, చిక్కెదనొ? ఈశా! వానికే డిల్లుచున్!

సనత్ కుమార్:: భలే..

కొత్తపాళీ:: దత్తపదిలో ఇచ్చిన పదాల్ని ముచ్చటగా విరవడంలో మీకు మీరే సాటి

రాఘవ:: మొత్తానికి మన్మథుడు ఎక్కడ నక్కాడో పట్టేశారన్నమాట.

కామేశ్వరరావు:: చాలా బాగుందండీ! మన్మథుని పేరెత్తకుండానే అతని కీలకాన్ని చెప్పేసారు!

రవి:: ఆ పేరుతో సినిమాలు ఎలా ఉన్నా , మీ పద్యం మాత్రం భళీ

రాకేశ్వరుఁడు:: ఆస్యాలంబు – అహా – awesome + బగున్!

గిరి:: నాకు ఎప్పుడో చంద్రమోహన్ గారు చెప్పిన లంగూడి ప్రహసనం గుర్తుకు వచ్చింది – రాకేశుని కింగూడి సంధి చూస్తే

విశ్వామిత్ర:: నెనరులండి

శ్రీరామ్:: వహ్వా!

కొత్తపాళీ:: నాకు ఒక్క సందేహం ఉంది .. లంబ హాసంబు ఏవిటీ అని. లబోదరుణ్ణి విన్నాము ..

చంద్రమోహన్:: అది ఆలంబ హాసమేమో అనుకున్నాను

శ్రీరామ్:: ఇక్కడ ఆస్య+అలంబ

గిరి:: విశ్వామిత్రా, మీ పద్యాలు రానురాను మంచి పదునెక్కుతున్నాయి

కామేశ్వరరావు:: సుదతి మోవి విల్లైతే, ఆమె నవ్వులు బాణాలనడం చాలా బాగా కుదిరింది!

రాకేశ్వరుఁడు:: ఆస్యాలంబహాసంబగున్ ? వివరించాల్సిన సమయం వచ్చింది

విశ్వామిత్ర:: అన్నట్టు ఈ ఈశుడు కామేశుడు , ఆయన కరుణిస్తేనే .. మన్మధుడు శాంతించాడు పద్యంలో

కామేశ్వరరావు:: 🙂

గిరి:: హ హా

విశ్వామిత్ర:: ముఖముపై దోగాడు చిరునవ్వే బాణము

రాకేశ్వరుఁడు:: చాలా పదునెక్కింది మీ ఈ బాణం!

కామేశ్వరరావు:: “సుదతి” అన్నది కూడా చాలా సార్థకమైన పదం!

విశ్వామిత్ర:: @రాకేశ్వరుఁడు, బ్రహ్మచారికి ఏమి తెలుసు, మహేంద్రవరంలో సంధులు తప్ప?

రవి:: 🙂

రాకేశ్వరుఁడు:: మీ అహానికికి మేనకే సమాధానం విశ్వామిత్రా!

రవి:: మహేంద్రవరం = గుణ సంధి

రాకేశ్వరుఁడు:: రాణ్మహేంద్రవరం అనునాసిక సంధి – సంధులకే కింగు 🙂

శ్రీరామ్:: సొట్టబుగ్గల సుదతా విశ్వామిత్రులవారూ? ఈ మధ్య చెలమల్లో ఈదుతున్నారు కదా… 🙂

విశ్వామిత్ర:: @Sriraam హహహా! మన్మధుడు – బ్రహ్మచారీ గురించి చర్చలో నండి

కొత్తపాళీ:: సరే .. ఇదే దత్తపదిని పూరించమని ఫణిప్రసన్న గారికి మనవి

ఫణి:: అందుకోండి

కం.

తరమా? సులభంబా, సుమ

శర! ఈశునికిం గురినిడి శరములు వేయన్?

ఒరుడింకేడీ నీవలె

సుర కార్యము సేయ గల్గు శూరుడు మదనా!

నరసింహారావు:: బాగుందండీ.

గిరి:: నిజమే

కామేశ్వరరావు:: చాలా బాగుందండి! మాసు, బాసు ఒకే పాదంలో వచ్చేసారు!

రాకేశ్వరుఁడు:: మాస్వాదులను చిత్తుగా చించారుగా 🙂

చంద్రమోహన్:: ఆహా! చక్కగా కందంలో ఇరికించేశారు

రాఘవ:: చాల బాగుందండీ.

సనత్ కుమార్:: 🙂

విశ్వామిత్ర:: చిలుక చక్కని రౌతా .. ఎందుకీ హుంకరింత అని మల్లాది వారి గానం -గుర్తుచేశారు

రవి:: చాలా సులభంగా పూరించారు.

గిరి:: అవును – సులభంగా పూరించేసారు

ఫణి:: ధన్యవాదాలు

కొత్తపాళీ:: విశ్వామిత్ర నేనూ సరిగ్గా అదే అనబోతున్నా .. కానీ అక్కడ గిరిజ చెలికత్తెల గొంతులో హేళన, ఇక్కడ కవి గానంలో మన్మథుని శౌర్యానికి మెచ్చుకోలు

Posted in కవిత్వం | Tagged , | 4 Comments

రమాదేవి మళ్ళీ రమ్మంది

-సిముర్గ్

అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో 2007, నవంబరు 4 న అచ్చైంది. ఈ కథను ఆయన బ్లాగులో కూడా చదవొచ్చు.

(జాలపత్రికలో ప్రచురితమైన రచనలను యధాతథంగా తిరిగి ప్రచురించుకొన్నా – ప్రింటు పత్రికలు ఆ సంగతిని చాపకింద నీరులానే ఉంచుతాయి. ’జాలంలో వచ్చినవాటిని ప్రచురించినా మేం వాటికి ‘క్రెడిట్’ ఇవ్వం’ అన్నారు కూడా ఓసారి. కానీ, ఆ నామోషీలు మాకులేవు. మొదట ప్రచురించిన పత్రికకే ‘ఎడిటోరియల్ క్రెడిట్’ దక్కుతుందనేదే పత్రికా సంప్రదాయం. ఆ లింకు ఇది: http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2007/4-11/story. జ్యోతిలో వచ్చిన ఈ కథ లింకు అదృష్టవశాత్తూ ఇంకా జాలంలో ఉంది.)

“అక్కిరాజు కథ నడపటంలో చాలా మెచ్యూరిటీ చూపించాడు, కాని కథావస్తువే ఛీపుగా ఉంద”న్న వారు కొంతమందైతే, “ఆఁ – ఉత్త బూతుకథే” అని తేల్చిపారేసిన వారున్నారు. “ఇట్లాంటి కథల అవసరం మనకెంతో ఉంది”అని ఆకాశానికెత్తినవారు కూడా లేకపోలేదు.

ఈ కథ వెనుక మరో కథ ఉంది.

రమారమి మూడేళ్ల క్రితం, కొంతమంది మిత్రులకి అక్కిరాజు “చదివి ఎలా ఉందో చెప్పండం”టూ ఓ కథ పంపారు, అదే ‘రమాదేవి ఎందుకు రమ్మంది‘ కథకి మొదటి ప్రతి. ఆనాటి మొదటి ప్రతికి, ఆర్నెల్ల తర్వాత అచ్చైన కథకీ శిల్పంలోనూ కథనంలోనూ కొన్ని మౌలికమైన తేడాలున్నాయి. అచ్చైన కథ చదివి, “బంగారంలాటి కథని తగలెట్టావు” అంటూ మొదటిప్రతిని చదివిన మిత్రులు కొందరు అక్కిరాజుకి తలంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథలో, రచయిత రమాదేవి తరఫునుంచీ కూడా ఈ కథని చెప్పారు. మొదటిప్రతిలో ఆ రమాదేవి ప్రసక్తి పెద్దగా ఉండదు. ఆవిడో ‘షాడో’ కారెక్టరు అందులో. ఆవిడ రాజారావుని పిలవడానికి కానీ, రాజారావులాంటి మెతక సన్నాసిని దగ్గరకి తీయటానికిగానీ వెనక ఉన్న కారణాలేవీ (అసలంటూ ఉంటే!) రచయిత మొదటిప్రతిలో చూపించే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే, అసలు రమాదేవి అన్న పాత్ర ఈ కథకి పూర్తిగా అనవసరం. ఈ కథంతా మధ్యతరగతి మొగాడికి ప్రతీకైన రాజారావు ఫాంటసీ. రమాదేవి తన కూతురి పెళ్ళికి రమ్మని పిలిచినా ఈ కథకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ అనవసరమైన గొడవతో పాఠకుడిని పట్టి కుదపాల్సిన ట్రాజెడీ కాస్తా ‘ఓ సరసమైనకథ’గా నీరుకారిపోయిందనేది నాలాటి వాళ్ల బాధ.

జ్యోతిలో ప్రచురించిన కథేగనుక నా చేతుల్లో పడుంటే, కథ శీర్షికని కొటేషన్లలో పెట్టి, కథలోంచి రమాదేవి వైపునుంచీ చెప్పినదంతా కత్తిరించి ఉండేవాడిని. ఆ అవసరంలేకుండా, అక్కిరాజు తన “రమాదేవి ఎందుకు రమ్మంది” కథకి మొదటిప్రతిని మాకిచ్చారు. ఇప్పుడు పొద్దులో పునఃప్రచురించిన “రమాదేవి ఎందుకు రమ్మంది?” (Author’s Cut)’ ఆ మొదటి ప్రతే.

“గోడమీద తుపాకీ ఉందని చెప్తే, కథ అయ్యేలోగా ఆ తుపాకీ పేలాలి” అంటాడు ప్రఖ్యాత కథారచయిత చెకోవ్. కథలో ఉండాల్సిన క్లుప్తత గురించో లేక అనవసరమైన వర్ణనల గురించో ఆయన ఆ మాట అనుండొచ్చుగాక. అచ్చులో వచ్చిన ఈ కథలో అనవసరమైన కథనం వల్ల పేలాల్సిన తుపాకీ కాస్తా పేలలేదేమో అనేది నా సందేహం.

అదీగాక, పొలిటికల్ కరెక్ట్‍నెస్ అనో, మరేదో చెత్తా చెదారమనో -ధైర్యంగా చెప్పదలచుకొన్నది చెప్పలేనివారు, తమ పెన్నులకి క్యాపులు బిగించుకోవడమో, బూట్లు మేకుకి వేలాడదీసుకోవడమో మంచిది.

చెకోవ్‌ని వదిలి మరికాస్త ముందుకెళ్లాల్సిన సమయమూ వచ్చిందేమో. మొన్నీమధ్య టి.వి.లో ప్రసారం చేసిన ఓ తెలుగు సినిమా పతాక సన్నివేశంలో కథానాయిక ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది. చివరి నిమిషంలో ఆమెని ఆస్పత్రిలో జాయిన్‌ చేస్తారు. యధావిధిగా ఆపరేషన్ థియేటర్ తలుపు పైన ఎర్రలైటు వెలుగుతూ ఉంటుంది. బయట ఆవిడ తల్లిని ఊరడిస్తూ ఉంటాడు హీరోయిన్‍కి కాబోయే మావగారు – “ఏం కాదు, నీ మంచితనం, దాని అమాయకత్వం దాన్ని కాపాడతాయి, భగవంతుడు ఉన్నాడు” లాంటి రొడ్డకొట్టుడు డైలాగులతో. “లోపలున్నది హీరోయిన్, ఆమె చచ్చిపోతే మన సినిమా హిట్టవదు, అందుకని మరీ అంతలా ఏడవకు అంటే బావుటుంది కదా” అంది ఆ సినిమా చూస్తున్న ఓ స్నేహితురాలు. ఇదెందుకు ఉటంకించాల్సి వచ్చిందంటే – పాఠకులు ఇప్పటికే చాలా కథలు చదివారు, అందులో కాకరకాయలో, కీకరకాయలో కోసుకుని కూరొండుకు తిన్నారు – ఈ కథల గురించీ, సమాజం గురించీ వాళ్ళకి అంతో ఇంతో, ఆ మాటకొస్తే మనకంటే బాగానే తెలుసు. చాలా కథల్లో తుపాకీ ఎప్పుడు పేలుతుందో, ఎవరిమీద పేలుతుందో, పేలాక ఏమవుతుందో వారికి వారే ఎంచగ్గా ఊహించుకోగలరు. అందుకని, ఆ తుపాకీ ఇంతకు ముందోసారి పేలితే, మళ్ళీ పేల్చాల్సిన అవసరం లేదు. అందుకే, ’మంచి రచయిత కావాలంటే ముందుగా మంచి పాఠకుడు కావాలి’ అంటారు కారామాస్టారు.

పాఠకుల తెలివితేటలపై, వారి అనుభవంపై, వారి సాహిత్య, ప్రపంచ జ్ఞానంపై నమ్మకంలేని రచయితలు కాని, వారి రచనలుకాని నాలుగు కాలాల పాటు బతికి బట్టకట్టలేవు. “ఇక్కడ మీరో ఐదు నిమిషాలు ఏడవండి, ఇక్కడో పది నిమిషాలు నవ్వండి. ఇక్కడ నొచ్చుకోకపోతే మీరు ఇంకా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది” అని పాత్రల పేరుతో పాఠాలు చెప్పే ఉపన్యాసకుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఎవరైనా అమాయకంగా – “అబ్బే, అక్కడ నాకు ఏడుపురాలేదండీ – ఏడవాల్సిన అవసరం కూడా కనిపించలేదు” అంటే పాఠకుల అవగాహనా రాహిత్యాన్ని ఎద్దేవా చెయ్యడమూ సరికొత్త సంప్రదాయంలానే ఉంది.

“I have all the ingredients, I have the necessary tools. I even have the recipe and I know how to bake my own bread. All I need from you – my dear author – is the Yeast so that I can make the dough” అని అరవాలనుంటుంది ఓ పాఠకుడిగా. Concealment is the art అన్న చాసోకి ఈ సంగతి బాగా తెలుసు.

ఈ పైకారణాలవల్ల, నాకు మొదట చదివిన “రమాదేవి ఎందుకు రమ్మంది?” నచ్చింది. రచయిత కూడా తను వెనక్కి తిరిగి చూసుకొంటే — తను మొదటరాసిన కథే తను చెప్పదలచుకొన్న అసలైన కథ అనుకోవడం ఈ కథని ఇప్పుడు తిరిగి తోడ్డానికి మొదటి కారణం. “ఓ కథరాసి దాన్ని బయటకి పంపేసాక, సత్తా ఉంటే దాని బతుకేదో అది బతుకుతుంది, కరువైతే దాని ఖర్మ – అంతేకాని, స్కాలర్-షిప్పెక్కి దానివెంట రచయిత వెళ్లకూడదు” అంటాడు అక్కిరాజు. అందుకే, తన కథలపై ఆయనెప్పుడూ మాట్లాడలేదు. కానీ, ఈ కథ ఎందుకు రాసాడో ఆయన కథవెనుక కథ అని పొద్దుకోసం రాసిన ఓ ప్రత్యేక వ్యాసంలో చెప్పాడు. ఆ వ్యాసం ప్రచురిస్తూ, అవకాశం వచ్చింది కాబట్టి – ఈ కథకి రచయిత నిజాయితీగా రాసుకొన్న మొదటి ప్రతిని కూడా తెరకెక్కిద్దాం అనేది రెండో కారణం.

కథాశిల్పం గురించి జాలంలో అడపాదడపా చర్చలు జరుగుతున్నాయి. బహుశా దీనికి కారణం ఇక్కడ అధికశాతం వర్ధమానులు, చాలామంది దిన దిన ప్రవర్ధమానులు, కొద్దిమంది తలపండిన ప్రసిద్ధులూ అయిన రచయితలే కావడం అయ్యిండవచ్చు. ఒక మంచి రచయిత చేతుల్లోంచి వచ్చిన ఒకే కథకి ఉన్న రెండు రూపాలు దొరకటం కథాశిల్పం, కథనం వంటి వాటిపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడవచ్చనే గంపెడాశ ఈ కథకున్న మరో రూపాన్ని బయటకి తేవడానికున్న మూడోకారణం. దాంతోపాటు, రచయిత ఈ కథ ఎందుకు రాసాడో కూడా చెప్పటం వల్ల – ఈ కథకున్న రెండు ప్రతుల్లోనూ, ఏది రచయిత సాధించాలనుకొన్నదానికి దగ్గరగా వచ్చిందో తులనాత్మకంగా ఎవరికి వారే బేరీజు వేసుకొనే అవకాశం ఉంది కదా?

ఇహపోతే.. నాబోటివాడి IMHOలకి విలువెంత? మెచ్చినవారికి మరుమల్లె పువ్వంత, గుచ్చితే గులాబీ ముల్లంత. కాళీపట్నం రామారావుగారు కథలు ఎలా రాయాలో వివరిస్తూ కొన్ని చక్కని వ్యాసాలు రాసారు, ఇప్పుడు చక్కటి, చిక్కటి కథలు రాయడం నేర్చుకోగోరేవారికి అవి అమూల్యమైనవి. వీటిని కూడా వీలువెంబడి పొద్దులో ప్రచురిస్తాం.

****
ఈ అంశానికి సంబంధించిన లింకులు:

  1. “రమాదేవి ఎందుకు రమ్మంది?” (Author’s Cut)
  2. రమాదేవి ఎందుకు రమ్మంది? – కథ వెనుక కథ
  3. ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడ్డ కథ
  4. అదే కథ అక్కిరాజు గారి బ్లాగులో
  5. గోడమీద తుపాకీపై రచ్చబండలో చర్చ
  6. వికీపీడియాలో చెకోవ్ తుపాకీ
  7. రచయిత, సంపాదకుడు -వీరిద్దరి సంబంధంపై నిడదవోలు మాలతి గారి బ్లాగులో జరిగిన చర్చ
  8. కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ మొదటి భాగం
  9. కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ రెండవ భాగం
Posted in వ్యాసం | Tagged | 6 Comments

రమాదేవి ఎందుకు రమ్మంది (Author’s cut)

-అక్కిరాజుభట్టిప్రోలు

“రమాదేవి ఎందుకు రమ్మంది?”

మరోసారి అలోచనలోకి జారిపోబోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో తనకే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్ మెంట్ లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్ కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్ళకి చెప్పులు లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన ఆలోచనలు ఇక సాగవని తెలిసి, ఆ ప్రయత్నం మానేశాడు. తన చెప్పులు కూడా వెతికి పట్టుకుని, పక్కనే ఉన్న పాత బ్రీఫ్ కేస్ ని చంటి పిల్లని దగ్గరికి తీసుకున్నట్టుగా దగ్గరికి తీసుకుని బయటకు చూడసాగాడు.

ఎప్పుడో ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి వచ్చాడు హైదరాబాదు. మళ్ళీ ఇప్పుడు ఇలా… అయినా…

“రమాదేవి ఎందుకు రమ్మంది ?”

మళ్ళీ ఆలోచనలోకి జారకుండా జాగ్రత్తపడి పక్కనున్న ప్రయాణీకుడితో మాట కలిపాడు. “హైదరాబాద్ లో ఓ మాదిరి హోటల్ రూం ఎంతవుతుంది?”

“సెక్రటేరియట్లో పనయితే లక్డీకా పుల్లో ట్రయ్ జెయ్యండి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ హోటల్ రేట్లు ఎట్ల తెలుస్తయ్ సార్. లక్డీకా పుల్లో అన్నిరకాల హోటళ్ళుంటయ్. స్టార్ హోటల్ నుండి చిన్న హోటల్ దాకా”

తనకి అవసరమైన విషయం దొరక్కపోవడంతో ఇక రెట్టించే ఉద్దేశం లేక మిన్నకుండి పోయాడు రాజారావు. రెండు రోజులు హోటల్లో ఏనాడూ గడపలేదు. ఎంతవుతుందో తెలీదు. తెచ్చిన డబ్బులు సరిపోతాయో లేదో అంతకన్నా తెలీదు. ఇంతకు మించితే ఇంట్లో ఏమని చెప్పాలి? రోట్లో తలపెట్టి రోకటి పోటుకు భయపట్టమా? సమాధాన పర్చుకున్నాడు.

రైలు ఆగగానే వెంటనే దిగేశాడు. పెళ్ళాం, పిల్లలూ సామానూ లేకపోతే ఎంత త్వరగా దిగగలిగానా అని ఆశ్చర్యపోయాడు. పిల్లలతో, సామాన్లతో, ఎదురెక్కుతున్న కూలీలలతో అష్టావధానం చేస్తున్న సంసారుల మధ్యనించి కాలేజీ కుర్రాడిలా దిగిపోవటం తనకే తమాషాగా అనిపించింది. తానెప్పట్నించి సంసారి కాకుండా పోయాడా అన్న ఆలోచన అతనికి రాలేదు.

రమాదేవి వస్తున్న రైలు మరో గంట తర్వాత వస్తుంది కరక్ట్ టైంకి వస్తే. తనని ఒకటో నంబరు ప్లాట్ ఫారం మీద మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చుని ఉండమంది. అలవాటు లేని స్టేషన్. మిగతా అందరూ హడావిడిగా నడుస్తుంటే, రాజారావు మాత్రం బెరుకు బెరుగ్గా చూసుకుంటూ ప్లాట్ ఫాం ఒకటి మీదకి చేరాడు. మెయిన్ ఎంట్రన్స్ ఏదో కనిపెట్టి అక్కడే కూర్చున్నాడు. నిజానికి బయటికి వెళ్ళి అర్జంటుగా సిగరెట్ తాగాలని ఉంది. ప్లాట్ ఫాం మీద కాలిస్తే పోలీసులతో గొడవ. దిగకముందే రైల్లో బాత్ రూంలో తాగకపోవటం తప్పు. ప్లాట్ ఫాం నుండి బయటకి వెళ్ళేటప్పుడు టికెట్ తీసేసుకుంటే మళ్ళీ లోపలికి రావటం కష్టం. అన్ని లెక్కలూ వేసుకుని సిగరెట్ తాగడాన్ని ప్రస్తుతానికి విరమించడమే శ్రేయస్కర మనుకున్నాడు.

రమాదేవిని తాను గుర్తు పట్టగలడా ఇప్పుడు? పదిహేనేళ్ళ క్రితం చుడీదారుల్లో చూసిన క్లాస్ మేట్ ని, ముప్పయి అయిదేళ్ళ చీరలోకి అనువదించి మనసులో బొమ్మ వేసుకోవటానికి ప్రయత్నించాడు.

తనకున్న తెలివితేటలకి ఇంజనీరింగ్ లాంటి సీట్లేమీ రావనీ, వచ్చినా చదివించే స్థోమత ఇంట్లో లేదనీ తెలిసి ఆ ప్రయత్నాలేమీ చేయకుండా బుద్ధిగా, విజయవాడలో BSc చదివాడు రాజారావు. ఓ మాదిరి కాలేజీ. కో ఎడ్యుకేషన్. నలభయ్ మందున్న క్లాసులో పది మంది అమ్మాయిలు. అందులో ఒకర్తి రమాదేవి. ఎలా మొదలయిందో తెలీదు. తనేమీ గొప్ప అందగాడూ కాదు, ఆస్తిపరుడూ కాదు, తెలివయిన వాడూ కాదు. అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ చెప్పుకోతగ్గ ఏ గొప్ప విషయమూ లేని సర్వసాధారణ మయిన రాజారావుకు రమాదేవి ‘గర్ల్ ప్రెండ్’ అయి కూర్చుంది.

ఎలా మొదలయిందో తెలీదు. రాజారావు దృష్టిలో రమాదేవి చాలా తెలివయింది. అందరి దృష్టిలోనూ ఆమె అందగత్తె కిందేలెక్క. వాళ్ళ నాన్నకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో చాలా భూములూ గట్రా ఉన్నాయని కూడా క్లాసందరికీ తెలుసు. అసలు ఆమె నెల్లూరు వదిలి విజయవాడ ఎందుకు వచ్చి, ఆ కాలేజీలోనే ఎందుకు BSc చదవాల్సి వచ్చిందో కూడా రాజారావుకు గుర్తులేదు.

“మీరు లవర్సా” అని అడిగేవారు ఫ్రెండ్స్ రాజారావును. “పెళ్ళి చేసుకుంటారా”, “ఏరా ఎంత దూరం వచ్చావ్… చెయ్యెయ్య నిచ్చిందా?” ఇంకా ఇలా ఎన్నెన్నో…. “తనకి నేనంటే ఇష్టం. నేనే ఏమీ ఆలోచించుకోలా” అని చెప్పేవాడు.

తన సినిమా ఖర్చులకీ, సిగరెట్ ఖర్చులకీ రమాదేవి వుంటం మూలాన డిగ్రీ చదివినంత కాలం రాజారావుకు ఇబ్బంది కలగలా!

ఓసారి ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు మరో క్లాస్ మేట్ నేరుగా అడిగింది. “ఇంతకీ మీరిద్దరూ ఎప్పుడు పెళ్ళిచేసేసు కుంటారు, ఫైనల్ యియర్ అవంగానేనా?” అని. రాజారావుకు గొంతులో వెలక్కాయ పడింది. రమాదేవి వెకిలిగా, పెద్దగా నవ్వటం మొదలు పెట్టింది. “రాజా.. ఏదో అడుగుతోంది చూడు” అని రెట్టించింది పైగా. తానేమీ మాట్లాడక పోయేసరికి రమాదేవే మాట్లాడింది, నవ్వాపి కాస్త కరుగ్గా… “నీకెందుకే, మేమేం చేస్తే.. నీకు రాజాని చేసుకోవాల్నుంటే అడుగు… నేను పక్కకి వెళ్తా” అని.

నిజానికి రాజారావుకు అడగాలనే ఉండేది. “పెళ్ళిచేసుకుందామా” అని. ఒకవేళ తాను ఒప్పుకున్నా ఆమెని చేసుకునే శక్తి తనకుందా అని మిన్నకుండే వాడు. తనకున్న తెలివితేటలకీ చదువుకీ ఎలా బతుకుతాడో తెలీని తాను రమాదేవి లాంటి అమ్మాయిని భరించగలనా అని సందేహించి ఏనాడూ పెళ్ళి గురించి రమాదేవిని అడిగే సాహసం చేయలేదు రాజారావు.

రమాదేవి ఏనాడూ రాజారావును ప్రేమిస్తున్నానని గానీ పెళ్ళి చేసుకుందామని గానీ అడగలా. అసలామెకి అలాంటి ఆలోచన ఉందో లేదో కూడా తెలీదు రాజారావుకి… ఇప్పటికి కూడా. రమాదేవి ఎప్పటికీ, ఎవ్వరికీ అర్థంకాదు అనుకున్నాడు.

పెళ్ళికాకముందు, అందమయిన అమ్మాయి పక్కనే నడుస్తుంటే ఊరుకునేంత బుద్ధిమంతుడేమీ కాదు రాజారావు. ఓరోజు సినిమాహాల్లో చాలా మామూలుగా చేతిమీద చేయి వేశాడు. రమాదేవి ఏమీ అనలేదు. ఓ వారంలోపు ఎవరూ లేకుండా చూసి కౌగిలించుకునేదాకా వచ్చేశాడు. రమాదేవి ఏమీ అనలా. సినిమాహాల్లో చీకట్లో ఇంకా చాలా దూరం వెళ్ళినా ఏమీ అనలా రమాదేవి. ఎప్పుడు సినిమా కెళ్దామన్నా సరే అనేది. అక్కడికి దాకా వచ్చాక కూడా ఏమీ అనక పోవడంతో “దీనికి ఇంతకుముందే అలవాటుందేమో. జాణ” అని అనుమాన పడేవాడు కూడా ఒక్కోసారి.

ఎక్కడికన్నా రమ్మంటే రాత్రికి కూడా వచ్చేస్తుంది రమాదేవి అని చెప్పేవాడు ఫెండ్స్ కి రాజారావు. “అయితే సీరియస్ కాదా? ఫక్ అండ్ ఫర్గెట్టేనా? లక్కీ నాకొడకా” కుళ్ళుపడేవాళ్ళు స్నేహితులు. కొంత గర్వంగా ఉండేది రాజారావుకి ఇట్లాంటి మాటలు వింటం.

ఆమెని అనుభవించేద్దామని ఎంత తహతహ ఉన్నా సాహసించలేక పోయాడు ఏనాడూ. తానేమి చేసినా కాదనదు. శరీరం స్పందిస్తున్నట్టున్నా ఈమె మనసుకి మాత్రం చీమ కుట్టినట్టుకూడా లేనట్టుందే అని తికమక పడేవాడు. అయినా గీత దాటితే ఏం జరుగుతుందోనని భయం. ఏ భయమూ లేనట్టు రమాదేవి ఉండటం చూస్తే ఒక్కోసారి కోపమొచ్చేది. తను వద్దని వారించవచ్చు కదా అని తనకే అర్థం కాని విసుగేసేది. ఆమె ఉద్దేశ్యమేమిటో తెలిసేది కాదు.

తను డిగ్రీ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా “రాజా ఇంకా ఏమన్నా చెప్పేదేమన్నా ఉందా” అని అడిగింది ఆఖరి సారి కలిసినప్పుడు. తర్వాత “పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు” అని రాసింది. ఆ తర్వాత శుభలేఖ వచ్చింది. ఆ తర్వాత ఇంకేమీరాలా. గుర్తుచేసుకున్నాడు.

రమాదేవి వెళ్ళిపోయాక చాలా అవస్థే పడ్డాడు రాజారావు, సిగరెట్లకీ సినిమాలకీ డబ్బులు లేక. అలవాటు పడ్డ ఆడస్పర్శ కూడా కరువవటంతో సినిమాల్లో హీరోయిన్లని చూసినప్పుడల్లా తట్టుకోలేని ఉద్రేకానికి లోనయ్యేవాడు. “ఎవత్తినో రేప్ చేసి పడ దొబ్బేస్తే కాని దూల తీరేట్టులేదు” అనుకునే వాడు. “ముప్పయి రూపాయిలు తేరా ఫామిలీటైపు సెటప్ చేస్తా” ననే వాడు స్నేహితుడు. “దగ్గరకొచ్చి పయట మీద చెయ్యేసినా ఏమీ అనని పిటపిట లాడే పిల్లనే ఏమీ చెయ్యలేని కొజ్జా లంబ్డీ కొడుకువి నీకు లంజలెందుకులే” అని తనే తేల్చేసేవాడు.

ఏదో ప్రయివేట్ స్కూలులో లెక్కలు చెప్పేందుకు చేరాడు. 20 మందితో ప్రారంభమయిన ఆ చిన్న స్కూలు బాగానే పెరిగి ఇప్పటికీ తనకి సరిపడీ సరిపడని జీతాన్నిస్తోంది. మరే గవర్నమెంటు ఉద్యోగమూ తనకు ఎలాగూ దొరకలేదు.

రమాదేవి వెళ్ళిపోయిన రెండేళ్ళకి 40 వేల కట్నంతీసుకుని ఇంట్లోవాళ్ళు పెళ్ళిచేశారు. ఆ కట్నం డబ్బులు పెళ్ళాం పేరుమీద బాంకులో వేసి ఇప్పటికీ అత్తా మామలే లెక్క చూడటం ఒళ్ళు మండే వ్యవహారం రాజారావుకి. పెళ్ళాం రావటంతో పోయిన ఆడతోడు దొరికింది. ధైర్యంగా సంసారం చేసి రెండేళ్ళలో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అల్లుడిమీద నమ్మకం ఉండబట్టో, లేకపోబట్టో తెలీదుగానీ, అత్తా మామలే కూతుర్ని తీసుకెళ్ళి మరింక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి పంపించారు, రెండో పురుడు పోసుకోగానే.

రమాదేవికి కూడా ఇద్దరు పిల్లలను కుంటా. ఎప్పుడో ఓ క్లాస్ మేట్ చెప్పిన గుర్తు. నెల్లూరులోనే ఉంటోందని ఎప్పుడో వినటమే. గత పదేళ్ళుగా ఆమె సంగతే వినలేదు రాజారావు. సడన్ గా ఎలా తెల్సుకుందో తెలీదు. తన సెల్ కి ఫోన్ చేసింది. ఎవరో స్కూల్లో పనిచేసే క్లర్క్ వాళ్ళ ఊరి వాడనీ తన ద్వారా నంబర్ సంపాయించాననీ చెప్పింది.

రాజారావుకి ఏమి మాట్లాడ్డానికీ కనపళ్ళా. అడిగిన వాటికి సమాధానం చెప్పాడు. ఎక్కడ ఉంటున్నాడు, పిల్లలేంచేస్తున్నారు అలాంటివన్నీ అడిగింది. “సినిమాలు చూస్తున్నావా, మీ ఆవిడకి చూపిస్తున్నావా?” అని అడిగి సమాధానం కోసం చూడకుండా పగలబడి నవ్వింది. ఎందుకో తెలీకపోయినా కోపం వచ్చింది రాజారావుకి. “చీ! మొగుడూ పెళ్ళాల గురించి మాట్లాడే మాటలేనా ఇవ్వి” అనుకున్నాడు కానీ బయటికి అనలేక పోయాడు.

తన దగ్గర్నించి పెద్ద ఆసక్తి కనపడక పోవటం మూలాన అనుకుంటాను, రమాదేవి మరో ఒకటి రెండు సార్లు ఫోన్ చేశాక మళ్ళీ మానేసింది.

ఓ రోజు అకస్మాత్తుగా మళ్ళీ ఫోన్ చేసి అడిగింది. “హైదరాబాద్ వస్తావా” అని.

“ఎందుకు”

“నిన్ను చూడాలని ఉంది. సినిమాకి కూడా వెళ్దాం” వినపడీ వినపడకుండా నవ్వు.

“ఒక్కదానివే వస్తున్నావా? నేనూ ఒక్కణ్ణే రావాలా”

“అవును. రాగలవా? ఓ రెండు రోజులు గడిపి వచ్చేద్దాం”

“అమ్మో మా ఆవిడకి తెలిస్తే?”

“అవన్నీ నువ్వు చూసుకో. నేను మా ఆయన్ని వదిలి రావట్లా?”

“నువ్వు వేరు, ఎంతకయినా తెగించిన దానివి”

“……….” నిశ్శబ్దం అటునుంచి

“చూస్తా. ఆలోచించుకుని చెప్తా”

“రేపు ఫోన్ చేస్తావా”

“ఎల్లుండి. నువ్వే చెయ్యి. నా సెల్ లో రిసీవింగ్ మాత్రమే ఉంది”

అప్పట్నించీ ఆలోచిస్తున్నాడు.

“రమాదేవి ఎందుకు రమ్మంది?”

“మొగుడు చాతకాని వాడా? అంతటి జాణకి ఒక్క మగాడు సరిపోవట్లేదేమో? నా మీద మోజు అలాగే ఉందేమో, అప్పుడు తీరలేదని ఇప్పుడు వస్తోందేమో? ఇంత తీట ఉన్న ఆడది నాకెట్లా తగులుకుందో” ఎన్నెన్నో ఆలోచనలు.. దేనికీ సమాధానం దొరకలా.

అత్తారింటికీ, గుళ్ళకీ, సినిమాలకీ తప్పా ఎక్కడికీ తిరగని రాజారావు, రెండు రోజులు హైదరాబాదు వెళ్ళి రావడానికి తగిన కారణం వెతకడానికి చాలా అవస్థ పడ్డాడు.

మొత్తానికి ఏదో ఒకటి చేసి రైలెక్కాడు. ఇప్పటికీ తెలీదు..

“రమాదేవి ఎందుకు రమ్మంది”

“ఎందుకన్నా రమ్మననీ. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి పోయాయి. ఎవరికీ దొరకనంత వరకూ ఏం చేసినా గొడవ లేదు. పదిహేనేళ్ళ క్రితం ఉన్న భయాలేవీ ఇప్పుడు లేవు. రమాదేవి బయట పడి తన మెడకు చుట్టుకోలేదు. తనూ తప్పు చేస్తోందిగా? దొరికిందే సందు, ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడమే” రాజారావు ఉన్న డబ్బులు తీసుకుని రైలెక్కి వచ్చేశాడు. నెల్లూరు నించి వచ్చే రైలు విజయవాడ మీదుగానే రావాలని తెలిసినా, చెరో రైల్లోనే రావాలని ప్లాన్ చేసింది రమాదేవి.

అత్తారింటిని వేధించి రెండేళ్ళక్రితం సాధించుకున్న వాచీలో టైం చూసుకున్నాడు. మరో పావుగంటలో వచ్చేస్తుంది రమాదేవి రైలు. ఇక్కడ హైదరాబాదులో తనని గుర్తు పట్టేవాళ్ళు లేరు కదా అని ఓ సారి చుట్టూ చూశాడు, హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా ఆ సికిందరాబాద్ ప్లాట్ ఫాం ఒకటి మీదే ఉన్నట్టు!

తనొచ్చే ట్రెయిన్ తెలుసు. కంపార్ట్ మెంట్ నంబరు చెప్పుండచ్చు కదా అనుకుంటుండగానే ఆమె వస్తున్న రైలు అనౌన్స్ అయ్యింది. కూర్చున్న చోటే కొద్దిగా తిరిగి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వస్తున్న వాళ్ళు కనపడేట్టుగా కూర్చున్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అందర్నీ చూస్తున్నా ఎలా మిస్ అయ్యాడో తెలీదు… దగ్గర కొచ్చిందాకా గమనించలా, నీలం రంగు కాటన్ చీరలో, వెనక కూలీ నెత్తన సూట్ కేస్ తో, చేతిలో హేండ్ బాగ్ తో వస్తున్నది రమాదేవి.

రమాదేవి మాత్రం ఎంత దూరం నించి గుర్తించిందో తెలీదు గానీ, “రాజా! నువ్వేగా?” అంటూ దగ్గర కొచ్చేసింది.

“నేనే” అంటూ మరో మాట రాక, రమాదేవిని పైన్నించి కింద దాకా చూడ్డం మొదలు పెట్టాడు. అప్పటికంటే కొంచెం లావయింది. కళ్ళేమిటో లోతుగా ఉన్నాయి. బహుశా రాత్రి నిద్ర లేక పోవటాన. ఇప్పటికీ అందగత్తె కిందే లెక్క.

రమాదేవి చనువుగా చేతిని చేతిలోకి తీసుకుని “పద, తీరిగ్గా బయటకి వెళ్ళి మాట్లాడు కుందాం” అంటూ వెంటే రమ్మని కూలీకి సైగ చేసి ప్లాట్ ఫాం బయటకి నడిచింది.

బయటకి నడిచి కూలీకి డబ్బులిచ్చి పంపించేసింది. ఈ లోపు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగుంచాడు రాజారావు.

“నీకేమన్నా ఊరు తెలుసా? ఆటోవాణ్ణే అడిగి వెళ్దామా?” అయోమయంగా చూస్తూ అడిగాడు.

“నువ్వలా సిగరెట్ తాగతా వుండు. మిగతావి నే చెప్తాగా” అంటూ సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. అరనిమిషం మాట్లాడిందో లేదో ఫోన్ కట్ చేసి 2413 నంబరు కారు వస్తుంది చూడు అంది. మరో నిమిషం గడిచిందో లేదో, తెల్ల అంబాసిడర్ కారు మెట్ల దగ్గరికి వచ్చి ఆగింది.

“ఈమెకి ఎప్పుడూ డబ్బుకి కొదవలేదు. ఊళ్ళో దిగక ముందే టాక్సీ ఏర్పాటు చేసుకుని మరీ వచ్చింది. చూడపోతే అన్ని ఏర్పాట్లూ చేసుకునే వచ్చినట్టుంది. ఈ లెక్కన హోటల్ ఖర్చు కూడా నాకు తప్పేట్టుంది.” మనసులోనే హమ్మయ్య అనుకున్నాడు.

“ఇప్పుడు చెప్పు. ఎలాఉన్నావు” కారు కాస్త దూరం వెళ్ళాక మొదలు పెట్టింది రమాదేవి.

“నాకేముంటాయి రమా. ఏదో చిన్న బళ్ళో లెక్కలు చెప్పుకుంటున్నాను. నువ్వే చెప్పాలి. ఆ బెజవాడ తప్పా నాకేం తెలీదు” కాస్త నిజాయితీగానే చెప్పాడు.

కాసేపు మామూలు పిల్లలూ, సంసారం కష్టాలూ సుఖాలూ అన్నీ దొర్లి పోయినయ్. మాట్లాడుతూనే హైదరాబాద్ నగరాన్ని వింతగా చూస్తున్నాడు.

“నెల్లూరు నించి వచ్చిన నేను బానే ఉన్నాను. బెజవాడ లాంటి నగరాన్ని వచ్చి అంత పల్లెటూరి వాడిలా చూస్తావేం?” అంది రమాదేవి, సిటీ చూస్తూ ముభావంగా సమాధానాలు చెప్తున్న రాజారావుతో.

“నువ్వు దేశాన్నంతా తిరిగేసినట్టున్నావు. నాకు ఆ బెజవాడే ప్రపంచం. పెద తిరపతికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళివస్తా. అంతకు మించి పెద్ద తాహతు లేదు నాకు” కిటికీ లోంచి సిగరెట్ పొగ బయటికి వదులుతూ చెప్పాడు.

“అవునులే, హైదరాబాదు వస్తునే ఉంటాం మేము” అంది రమాదేవి.

“ఎవరితో” అని అడగబోయి ఆగి పోయాడు. “ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం?” అని అడిగాడు. చూడపోతే కారు ఊరు దాటి బయటకి పోతున్నట్టు అనిపించింది. మిలటరీ వాళ్ళ ఏరియాలో ఉంది కారు.

“ఇంకో అయిదు నిమిషాలు. ఊరిబయట రిసార్ట్ కి” వివరించింది

“రిసార్ట్ అంటే?”

“ఊరి బయట పెద్ద తోటలో… హోటల్ రూముల్లా అన్నీ ఉంటాయి. రెండురోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా” చేతి మీద చేయి వేసి చెప్పింది.

పూర్తిగా తయారయే వచ్చింది అనుకున్నాడు. మరో పావుగంటలో రిసార్ట్ చేరారు. ఆఫీసులో వెళ్ళి అన్నీ తనే మాట్లాడి వచ్చింది. వేసుకున్న బట్ట్లలు చూస్తే పెద్ద ఖరీదయిన బట్టలేమీ వేసుకోలా రమాదేవి. అయినా ఆమెలో ఏదో తనకు లేని దర్పం ఉందనిపించింది. అలా అనిపించిందే తడవు అందరూ తననే చూస్తున్నారని కూడా అనిపించింది. అనిపించడమేమిటి, తననే చూస్తున్నారు. మగాడు బెరుకు బెరుగ్గా దిక్కులు చూడడమేమిటి, ఆడది చురకత్తిలా అన్నీ చేసుకు పోవడమేమిటి?

కాటేజిలా చెట్ల మధ్యలో ఉన్న రూము తాళం చెవులు తీసుకుని వచ్చాడు బాయ్. మీ లగేజ్ అని చేతిలో ఉన్న చిన్న బ్రీఫ్ కేస్ వంక విచిత్రంగా చూసి మారు మాట్లాడకుండా తన చేతిలోకి తీసుకున్నాడు. రూము తలుపు తీసి, రూములో ఉన్న A.C ఆన్ చేసి అక్కడే నిలబడ్డాడు. బాత్ రూమ్ లోకి వెళ్ళబోయిన రమాదేవి ఆగి హేండ్ బేగ్ లోంచి పది రూపాయల నోటు బాయ్ చేతిలో పెట్టి పంపించింది. అలా నిలబట్టానికి అర్థం టిప్ కోసమని తెలియ లేదు రాజారావుకు.

ఇద్దరూ స్నానాలు చేసేటప్పటికి రూముకే బ్రేక్ ఫాస్ట్ వచ్చింది. అసలు అలాంటి ప్రపంచమే చూసెరగని రాజారావుకు అంతా అయోమయంగా ఉంది. సుబ్బరంగా తినేసి మళ్ళీ మరో సిగరెట్ కాల్చాడు.

తయారయి రిసార్ట్ అంతా తిరిగారు. మధ్యలో రెస్టారెంటుకి వెళ్ళి భోజనం చేశారు. చూడాల్సిన వన్నీ అయిపోయాక, ఓ మూలగా ఉన్న చెట్ల పక్కన కూర్చున్నారు. అప్పటికే మాట్లాడ డానికి ఉన్న మామూలు రోజువారీ సంగతులు అయిపోయాయి. రిసార్ట్ ప్రత్యేకతల గురించిన ఉత్సాహం తీరిపోయింది.

ఆనుకుని కూర్చున్న రమాదేవి నడుమ్మీద చెయ్యవెయ్యాలన్న కోరికని అతి కష్టం మీద ఆపుకున్నాడు. అప్పటికే తన చేతిలో చేతిని వేసి ఆనుకుని పొద్దుట్నించీ నడుస్తున్న రమాదేవి మీద చెయ్యి వేసినా ఏమీ అనదు అని నమ్మకమున్నా సాహసించ లేకపోయాడు. అలా ఎంతసేపున్నారో తెలీదు. మళ్ళీ ఊసుపోని కబుర్లు. మాట్లాడుతూనే వున్నాడు గానీ రాజారావుకు ఇంకా తేలట్లేదు…

“రమాదేవి ఎందుకు రమ్మంది?” “ఎందుకు వచ్చింది?”

ఎంత ఆలోచించినా మరో ఆలోచన రావట్లేదు. తనతో పడుకోవడానికి కాక అంత ఖర్చు పెట్టడానికి ఎందుకు సిద్ధ పడుతుంది? ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా మెల్లిగా కదిల్చి ఆమె నడుమ్మీద చెయ్యి వేశాడు. ఊహించినట్టుగానే రమాదేవి ఏమీ అనలేదు. మాట్లాడుతూనే ఉంది. మాట్లాడుతూనే ఏమీ తెలియనట్టు మెల్లిగా మరింత దగ్గరగా జరిగింది. ఆ ఒక్క కదలికతో మళ్ళీ కాలేజీ రోజులు తిరిగి వచ్చేశాయి.

ఇంక సందేహంలేదు ఆమె అందుకోసమే వచ్చింది. అని నిర్థారించేసుకున్నాడు రాజారావు. ఇక ఈ రెండ్రోజులూ చాన్స్ వదలకూడదని నిర్ణయించుకున్నాడు.

**************************

“రాజారావు గారూ, మీకు నెల్లూరు రమాదేవి గారు తెలుసటగా. క్రితం నెల నా దగ్గర మీ నంబరు తీసుకున్నారు” కాలేజీ క్లర్కు

“అవునండీ, మా క్లాసు మేటు” చాలా మామూలుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ సమాధానం చెప్పాడు రాజారావు.

“మీకు చెప్పే ఉంటారు… ఆయనకి ఇంకా సీరియస్ అయిందిట” క్లర్క్

“ఎవరికీ?” రాజారావు

“ఇంకెవరికి, రమాదేవి గారి భర్తకి. కేన్సర్. సంవత్సరం నించీ మంచంమీదే ఉన్నారు. ఇక రేపో మాపో అనుకుంటున్నారు. మీకు ఫోన్ చేశానంటే చెప్పే ఉంటారనుకున్నాను” అని పూర్తి చేశాడు క్లర్కు.

“ఆ మరే” అని చెప్పి అక్కణ్ణించి తప్పుకున్నాడు రాజారావు. షాక్ తగిలినట్టుగా ఉంది. ఒక్కమాట కూడా చెప్పలేదే, తనతో రెండురోజులు గడిపినా?

అటూ ఇటూ చూసి మెల్లగా వీలు చూసుకుని ఫోన్ చేశాడు రమాదేవికి.

“హల్లో మీ ఆయనకి బాగాలేదటగా… నాకు చెప్పలేదేం?”

“నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు రాజా”

“కనీసం నీ కోరిక అయినా తీర్చి ఉండేవాణ్ణి. నువ్వెందుకు రమ్మన్నావో తెలీక భయపడి నీకు దూరంగా ఉండి పోయాను”

“…….” అటు వయిపు నిశ్శబ్దం

ఎంత దగ్గర చేరినా ఎందుకో గీత దాట లేకపోయిన తన ఆ రెండురోజుల అసక్తతనీ గుర్తు చేసుకుంటూ అన్నాడు…

“ఈ సారి చెప్పు. ఎప్పుడంటే అప్పుడు. ఎన్ని రోజులంటే అన్నిరోజులు, పగలూ రాత్రీ నీతో గడిపేస్తా….” ఇంకా ఏదో చెప్పబోయాడు.

“పెట్టరా ఫోను. మళ్ళీ చేస్తే చంపేస్తాను. చిత్ర కార్తెపు కుక్కా” అని అరిచి ఫోన్ పెట్టేసింది రమాదేవి.

ఎన్నిరోజులయినా అర్థంకాలా రాజారావుకి

“రమాదేవి ఎందుకు రమ్మంది?”

సంబంధిత లింకులు

1. “రమాదేవి ఎందుకు రమ్మంది” – కథ వెనక కథ
2. రమాదేవి మళ్ళీ రమ్మంది

—————————

రాసి కంటే వాసిలో మిన్నయైన రచయిత, అక్కిరాజు భట్టిప్రోలు. హైదరాబాదులో సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్న వీరు మూడు బీర్ల తర్వాత అనే బ్లాగును నిర్వహిస్తున్నారు.

Posted in కథ | 6 Comments

“రమాదేవి ఎందుకు రమ్మంది” – కథ వెనక కథ

-అక్కిరాజు భట్టిప్రోలు

ఇప్పటి వరకు ఏ కథకీ నేను ముందుమాటలు, వెనక మాటలు రాయలా. ఏవో పెద్ద నవలలకి రాస్తారు గానీ, కథలకి ముందూ వెనకా మాటలేమిటి? అయినా కథ వెనక కథ అని రాసే సంప్రదాయం కొంత ఉంది. గొప్ప రచయితల బుర్రలో ’ఏ కుమ్మరి పురుగు తొలిస్తే ఆ కథ బయటికి వచ్చిందా’ అని సామాన్య పాఠకులకీ, వర్థమాన రచయితలకీ సహజంగానే ఉత్సుకత ఉంటుంది. అనుకున్నదొకటీ, అయినది ఒకటీ అయి, చెప్పిన కథ పూర్తిగా పాఠకులకి చేరలేదు అని అనిపించినప్పుడు కూడా రచయితలు తప్పనిసరై “కథ వెనక కథ” అనే పేరుతో సంజాయిషీ ఇచ్చుకునే సందర్భం కూడా ఉండచ్చు. ఇప్పుడు రమాదేవి కథకి ఎందుకు రాస్తున్నాను అనేది మీకు మీరే నిర్ణయించుకోండి.

నేను రాసిన కథలపై చర్చలు జరిగినప్పుడు ’బాగుంది’ అన్నవాళ్లకి “థాంక్యూ” అని చెప్పా. చెత్తగా ఉంది అన్నవాళ్ళకి కూడా “థాంక్యూ” అనే చెప్పా. ఏనాడూ నేరుగా చర్చలో దూరలా. కథ ఒకసారి బయటకి వచ్చాక, దాన్ని అదే డిఫెండ్ చేసుకోవాలి. రచయిత దాని వెనక కర్ర పుచ్చుకుని కాపలా కాయటం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు.

కథ వెనక కథ రాయటం అనేది అలా డిఫెండ్ చేసే కార్యక్రమంలా కాకుండా, నేపథ్యం, ప్రేరేపించిన సంగతులు, రాయటంలో పడ్డ కష్టం (ఒక్కోసారి క్షోభ కూడా) క్రోడీకరించుకోవటం కొంచెం సరదాగానే ఉంటుంది. నా బ్లాగు మొదలు పెట్టాక, ప్రతి కథకీ అలా రాద్దామనే అనుకున్నా. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు, నేను సహజ బద్ధకంతో పుట్టాను. ఆ బద్ధకమే ఈ ప్రపంచాన్ని నానించి కాపాడుతోంది అని గిట్టని వాళ్ళంటారు. వేరెవరి కోసమో కాదు, నాకోసమే నేను రాసుకుందామని. మరో పదేళ్ళ తరవాత, మళ్ళీ నా ఆలోచనలని నేనే ఎలా చూస్తాను అనే ఓ కోరిక.

రమాదేవి కథతోనే దీన్ని మొదలు పెట్టడం సబబుగా ఉంటుందని పించింది. ఎందుకంటే, నేను రాసిన కథల్లో చాలా ఎక్కువ మిశ్రమ స్పందన వచ్చిన కథగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు.

మేథావులూ మూస పాత్రలూ” అని ఓ వ్యాసం రాసి ఉన్నాను. అందులో ఐటి ఉద్యోగులందర్నీ తాగుబోతులూ, తిరుగుబోతులుగా చూపే మీడియాని, మేధావి (?) రచయితల వర్గాన్ని తీవ్రంగా నిరసించాను. వాళ్ళ జీతాలు కాస్త ఎక్కువగా ఉండచ్చు గానీ, అందులో ఉన్నదంతా మద్యతరగతినించి వచ్చి, ఇంకా ఆ విలువలతోనే సతమత మయ్యే సగటు జీవులు అని నా వాదాన్ని వినిపించా. ఈ కింది పేరా చూడండి.

“ఐటి ఉద్యోగుల్లో అక్కడక్కడా కనపడే వికృతాలకి కారణం ఐటీ కంపెనీలనుకోవటం అమాయకత్వం. దానికి కారణం, మధ్యతరగతి నించి బయటపడ్డ, మరే విలువలూ పాటించక్కరలేని ఓ స్వేచ్చ. ఓ పని చేయచ్చు. ఓ పదిమంది మధ్యతరగతి యువకులు ఓ మాదిరి పట్టణంలో (ఖమ్మం, కర్నూలు లాటి) వెతికి మనిషికో కోటి రూపాయలు ఇచ్చివద్దాం. వాళ్ళలో ఎంతమంది పబ్బుల్లోకి వెళ్తారు, వాళ్ళ శీలాలు (?) చెడగొట్టుకుంటారూ, ఎంతమంది జీవనవిధానం మారినా విలువలు (??) మారకుండా ఉంటారూ అని చూడచ్చు. ఇప్పుడు ఐటీలో ఉండే ఓ పదిమంది ఎలావున్నారో అలాగే ఈ పదిమందీ తయారవుతారని నా నమ్మకం.”

మధ్యతరగతి ఓ పెద్ద సంక్షోభంలో ఉంది. EAMCET నించి మొదలు పెట్టి IT, BPO, USA, F1, H1, H4, B1, L1 లాంటి కొత్త కొత్త పదాలు, అందాకా స్తబ్దుగా ఉన్న మధ్యతరగతిని వెర్రెక్కించాయి. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి సమాజం మీద. అదంతా వేరే కథ.

దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, అందాకా చాపకింద నీరులా ఉన్న మధ్యతరగతి హిపోక్రసీ బట్టలు విప్పుకుని బయట పడింది. శీలం అనేదానికి పైపై అలవాట్లతో, బలహీనతలతో ముడిపెట్టి తమని తామే మోసంచేసుకున్న మధ్యతరగతి మాయ పటాపంచలయిపోయింది. వీడు దుర్మార్గుడు “విలన్” అని సినిమాలో చెప్పడానికి పది సెకన్ల సమయం చాలు. ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో మందుగ్లాసు ఉంటే చాలు. వాడు దొరికిన అమ్మాయిని దొరికినట్టు రేప్ చేస్తాడు, మనుషుల్ని నరికేస్తాడు, అమ్మ, అక్క, అన్న, భార్య అనే సంబంధాలు తెలీనివాడు, స్మగ్లింగ్ చేసేవాడూ, డ్రగ్స్ అమ్మేవాడూ అయిపోతాడు. ఇదంతా ఒక్క సిగరెట్టూ, ఒక్క సగం నింపి ఉన్న మందుగ్లాసు చెప్పేస్తుంది. ప్రతి సిగరెట్ తాగేవాడూ, మందు తాగేవాడూ కనక హంతకులయి ఉంటే, ఈ పాటికి ఈ భూమిమీద మనిషనే వాడే మాయమయి ఉండేవాడు.

ఇలాటి విలువలనే ఆడవాళ్ళ పరంగా చెప్పినవి మరింత కౄరంగా ఉంటాయి. రేప్ చెయ్యబడ్డ అమ్మాయి, రేప్ చేసినవాణ్ణే పెళ్ళి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సూపర్ హిట్ సినిమాలు. అసలు రేప్ ఏం ఖర్మా, “తాత్కాలికంగా విచక్షణ నశించి ఎవరితోనో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఆ మనిషి ఇక ఎల్లకాలం మలినమయి పోతుందా” అని నాబోటివాడు అడిగితే ఎందరివో మనోభావాలు దెబ్బతినేస్తాయి.

చంటి సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? పొరపాటున ఆ పిచ్చాడు వెంకటేష్ తల్లి (విధవరాలు)కి తాళి కట్టేస్తాడేమోనని తెగ టెన్షన్ పెట్టే సీన్. మనలో మనమాట, ఒక వేళ మన హీరో గారు రావటం లేటయి కట్టేశాడే అనుకోండి. ఇక ఆవిడ అపవిత్రమయిపోయి ఆ పిచ్చి భర్తగారిని భరించాల్సిందేనా? కళాతపస్వి విశ్వనాథ్ గారేమీ తక్కువ తిన్లేదు. స్వాతిముత్యం కమలహాసన్ అలా తాళికట్టేస్తే, ఇలా రాధికగారు అలా సర్దుకు పోతారు. ఏమిటీ పెంట అని నాబోటిగాడు అడగాలన్నా భయమే.

విషయమేంటంటే, ఇవన్నీ కూడా పైపైన వేసే దొంగ వేషాలు. దొంగ విలువలు. నయనతార, త్రిష, చార్మీ బొడ్డూ చంకలూ చూపిస్తుంటే, చొంగ కార్చుకుంటూ ఈ మధ్యతరగతి ప్రతిరోజూ చేసే మానసిక వ్యభిచారం కనపడదు. ఓ పందెం కడతాను. టి.వి పెట్టి ఎక్కడన్నా మొదలు పెట్టండి. వరసగా మార్చుకుంటూ పొండి. అమ్మాయి బొడ్డు కనపడకుండా మీరు అయిదు చానల్స్ మార్చలేరు. ఇరవైనాలుగు గంటల్లో ఎప్పుడయినా సరే.

ఇంకా చెప్తాను. ఇదే పందెం అమెరికాలో కడితే ఓడిపోతాను. కానీ మనం ఏదో సంస్కారవంతులం, పాశ్చాత్యులు మాత్రం పూర్తిగా కుళ్ళిపోయిన వాళ్ళు అని చెప్పేస్తాం అమాయకంగా. అమెరికా టి.వి చానల్స్ మనకంటే సంస్కారవంతమయినవని నేను నిర్మొహమాటంగా చెప్తాను.

“నా పదమూడవ ఏటనించీ హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు. నేను సంసారానికి పనికివస్తానా?” “హస్త ప్రయోగం వల్ల నష్టంలేదు. శుభ్రంగా పెళ్ళి చేసుకోండి” ఈ ప్రశ్న, ఆ సమాధానం ఓ మిలియన్ సార్లు చదవని తెలుగువాడు ఉండడు. సమరం గారంటే నాకు ఎనలేని గౌరవం. చాలా అవసరమయిన సమాచారాన్ని మొదటిసారి తెలుగు ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ శీర్షికలని మధ్యతరగతి సాఫ్ట్‍పోర్న్ చదవడానికి ఓ వంకలా తయారు చేసుకుంది. ఆ సంగతి అందరికీ తెలుసు.

“సర్వకాలాల్లో, (అన్ని వేళల్లో) అన్ని ఊళ్ళల్లో సెక్స్ పుస్తకాలు, బ్లూ ఫిల్ములూ దొరుకుతున్నాయి” అనేది ఎవరికీ తెలియదా? అయినా అది “చట్టరీత్యా నేరం”. మన వాళ్ళంతా నీతిమంతులు. చట్టం దానిపని అది చేసుకుంటూ పోతూనే ఉంది. మనందరి “నీతి” అలా ప్రజ్వలంగా ఉండనే ఉంది.

ఎప్పుడూ అనిపించలా, ఎందుకు మనం ఇన్ని విరుద్ధాల్లో బతుకున్నాం, కనీస నిజాయితీ కూడా లేకుండా అని?

మనుషులకి సహజంగా ఉండే కోరికలని బలహీనతలుగా, తప్పులుగా తయారుచేసుకున్న మధ్యతరగతి లోంచి ఒక్కసారి బయటపడితే ఉండే వికృతాలే మనకి మన సమాజంలో కనపడుతున్నాయి అని నా భావన. మన నగరాల్లో మరింత ఎక్కువగా.

జరుగుతున్న యాసిడ్ దాడుల్ని చూడండి. నాకు బాధేస్తుంది. యాసిడ్ ఎవరిమీద పడిందో వారి పట్ల జాలి పట్టానికి మనకి కావల్సినంత సంస్కారం, దయ, మానవత్వం, మిగిలే ఉన్నాయి. కానీ ఆ యాసిడ్ పోసిన వాళ్ళని ఎన్‍కౌంటర్ చేసి చంపేసేటంత కౄరత్వం మనకి ఎక్కణ్ణించి వచ్చింది?

ఆ యాసిడ్ పోసిన వాళ్ళ వయసులు ఎంత? వాళ్ళు ఏ సమాజంలో పెరిగారు? వాళ్ళు అంత దుర్మార్గులుగా తయారవగల వాతావరణం ఎక్కడ ఎలా ఏర్పాటయింది. ఏదో ఒక్క సంఘటనే జరిగి ఉంటే ఆ ఒక్కడిలోనే ఏదో లోపం ఉందనుకోవచ్చు. వరస పెట్టి ఇలా సంఘటనలు జరుగుతుంటే, ఈ సమాజం ఏమీ బాధ్యత వహించదా? వాళ్ళు పెరిగినట్టే, అదే ప్రాంతంలో, అదే రకంగా నేను కూడా పెరిగి ఉంటే, అప్పుడు కూడా ఇలా రచయితలా ఈ వ్యాసం రాస్తూ ఉండేవాణ్ణా, లేక నేను కూడా ఎవరి మీదో యాసిడ్ పోసి ఎన్‍కౌంటరయి పోయి ఉండేవాణ్ణా?

ఈ సాఫ్ట్‍పోర్న్ సినిమాలూ, పుస్తకాలూ పిల్లల్లో హార్మోన్లని వెర్రెత్తి పరిగెట్టిస్తూ ఒక వైపు. అందుకు తగ్గట్టుగా సమాజం పబ్లిగ్గా అంగీకరించలేని తగలడిపోయిన దొంగవిలువల అడ్డుకట్టలు ఒక వైపు. ఏం చేయాలి యువత? సెక్స్ అనేది ఓ పెద్ద లయబిలిటీ అయిపోయింది. పార్కుల్లో, బీచిల్లో, చెట్ల చాటునా, నెట్ కఫేల్లో, కానిస్టేబుళ్ళ మామూళ్ళ మధ్య, మధ్యతరగతి యువత నలిగిపోతోంటే సూటిగా ఆ సమస్యని చూసే ధైర్యంలేదు. MMS లూ, దొంగ వీడియోలూ ఎన్ని జీవితాల్ని నాశనం చేసినా విడివిడి సంఘటనలు గానే చూస్తాం. అంత కంటే ఈ టీనేజర్లకి ఓ కండోమ్ ఇచ్చి బెడ్ రూం చూపించ గలిగితే మనం ఈ సమాజానికి చాలా మేలు చేసిన వారవుతాం.

ఆ ఐటీ పబ్ కల్చర్ దగ్గర్నించి, ఆ యాసిడ్ దాడులదాకా అన్నిటి వెనకా ఉన్నది మానసికంగా కుళ్ళిపోయిన ఈ మధ్యతరగతి అని చెప్పడానికే ఆ కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” రాసింది.

ఐటి, హైదరాబాద్ సిటీ లాంటి వాటినించి దూరంగా, ఓ మధ్య తరగతి మనిషిలో దాగిఉన్న, దాగి ఉండే అగ్నిగుండాన్ని ఆవిష్కరించడమే ఆ కథ ఉద్దేశం. రాజారావు ఫాంటసీలు సగటు మధ్యతరగతి మొగాడి మదిలో మెదిలేవా కావా అనేది నిజాయితీగా ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. అది నిజమయితే, నిజమని పాఠకుడు అంగీకరిస్తే, ఆ కథకి అర్థం ఉంది. కాదనుకుంటే, అది రచయిత వికృత మనస్తత్వానికి ఋజువు. కథని పక్కన పెట్టి మర్చే పోవచ్చు.

హాస్టల్స్ లో చాలాకాలం ఉన్న నాలాంటి వాళ్ళకి తెలుసు. మెన్స్ హాస్టల్స్ లో వాడే భాష. సొంత క్లాస్ మేట్స్ అయిన అమ్మాయిల గురించి మాట్లాడే మాటలు. ఆ పచ్చిబూతులు వినీ వినీ (మాట్లాడి కూడా) వున్న నా బోటివాడికి వెనక్కి తిరిగి చూస్తే ఏమిటి వీటికి మూలం అని అని పించదా?

నాకు మన పత్రికల మీద, సాహిత్య సెన్సార్షిప్ మీద కూడా చాలా కోపం. ఇంగ్లీషు కథల్లో రోడ్డు మీద మాట్లాడే భాష యథాతథంగా రాయచ్చు. మన సో కాల్డ్ సంస్కారవంతులు, “మంచి కుటుంబాలనించి వచ్చిన వాళ్ళూ” హాస్టళ్ళలో మాట్లాడే భాషని రాయలేని పరిస్థితి. ఇక్కడ కూడా అదే హిపోక్రసీ. అందరికీ తెలుసు అక్కడేం మాట్లాడతామో. అయినా సరే దాన్ని అంగీకరించలేని పరిస్థితి. అది యథాతథంగా రాసి ఎండ కట్టాలని నాకు మా చెడ్డ కోరిక. ఇక ఇంగ్లీషులో రాయడమే మార్గం.

వీటన్నిటినీ క్రోడీకరించి, కసిగా, కోపంగా రాసిన కథ రమాదేవి ఎందుకు రమ్మంది. ఆ రాజారావు అర్భకుడు కాబట్టి అలా మిగిలిపోయాడు. మరో రాజారావు యాసిడ్ పోస్తాడు. మరో రాజారావు ధాబాల్లో పడుకుని కుటుంబానికి ఎయిడ్స్ అందిస్తాడు. భారతదేశంలో అక్రమ సంబంధాలు అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనది అని మనందరికీ తెలుసు. యాసిడ్ పోసినా, పోయక పోయినా మన చుట్టూ ఎంత మంది రాజారావులు ఉన్నారో మీ నిర్ణయానికే వదిలేస్తాను. జాగ్రత్తగా గమనించండి. బయటనించి చూస్తే రాజారావు “సంస్కార వంతుడూ”, “దైవభీతి కలవాడూ”, “చక్కగా సంసారం చేసుకుంటున్న వాడూ”.

యాసిడ్ దాడులు జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన కోపానికి తుది రూపం ఈ కథ. ఈ కథలో ఒక్క యాసిడ్ దాడీ ఉండక పోవచ్చు. కానీ, వాటికి కారణాలు మనచుట్టుతానే ఉండి, మనం కూడా బాద్యులుగానే మిగులుతాం అనేది సూచించటానికి చేసిన ఓ వ్యర్థ ప్రయత్నం ఈ కథ.
అందుకే, నా వరకూ నేను రాసుకొన్న పూర్తి విషాధభరిత కథ ఇది.

సంబంధిత లింకులు

1. రమాదేవి ఎందుకు రమ్మంది (Author’s cut)
2. రమాదేవి మళ్ళీ రమ్మంది

—————————

రాసి కంటే వాసిలో మిన్నయైన రచయిత, అక్కిరాజు భట్టిప్రోలు. హైదరాబాదులో సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వీరు మూడు బీర్ల తర్వాత అనే బ్లాగును నిర్వహిస్తున్నారు.

Posted in వ్యాసం | Tagged | 3 Comments