సాలూరు చినగురువుగారు

పట్రాయని సుధారాణి

సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. తెలుగు సాహిత్యచరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటివారు శృంగార భక్తిరస ప్రధానములైన రచనలు చేసి, గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి ఎందరో మహానుభావులు మన సాహిత్యాన్ని, సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు.

పట్రాయని సీతారామశాస్త్రి

ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు.

పట్రాయని సీతారామశాస్త్రిగారిని గొప్ప సంగీత విద్వాంసుడిగా, సాలూరు చినగురువుగారు అనే పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో చాలామంది ఎరుగుదురు. మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి విజయనగరంలో సంగీతవిద్య నేర్పిన గురువుగారిగా మరికొంత మందికి తెలుసు. 2010 సంవత్సరం సీతారామశాస్త్రిగారి 110వ జయంతి సందర్భంగా మే 24వ తేదీన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ మినీహాల్ లో శాస్త్రిగారికి స్వరనివాళినర్పిస్తూ జయంత్యుత్సవ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రిగారి స్వరరచనలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ నేపథ్యంలో సీతారామశాస్త్రిగారికి సంబంధించిన జీవితవిశేషాలను, రచనలను ఈ తరం వారికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ వ్యాసరచన సాగింది.

సీతారామశాస్త్రిగారి జీవన రేఖలు

పట్రాయని సీతారామశాస్త్రిగారు పట్రాయని నరసింహశాస్త్రిగారి కుమారుడు. ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన సాలూరు, విజయనగరం సంస్థానాలలో, ఒరిస్సారాష్ట్రంలోని బరంపురం, పర్లాకిమిడి వంటి ప్రాంతాలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధి పొందిన పట్రాయని నరసింహశాస్త్రిగారు ‘సాలూరు పెదగురువుగారు’ గాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు ‘సాలూరు చిన గురువుగారు’ గాను ఉత్తరాంధ్ర ప్రజల ఆదరాన్ని పొందారు.

సీతారామ శాస్త్రిగారి బాల్యం

పట్రాయని సీతారామశాస్త్రిగారు 1900 సంవత్సరం మార్చి 20న (ఫాల్గుణశుద్ధ విదియ, ఆదివారం) జన్మించారు. అతి చిన్న వయసులోనే మాతృవియోగం కలగడం వల్ల మాతామహుల ఇంటిలోనే పది సంవత్సరాలపాటు పెదతల్లి చెల్లమ్మగారి సంరక్షణలో పెరిగారు.

మాతామహులు మధురాపంతుల కూర్మన్నగారు. మానాపురం దగ్గర గుడివాడ అగ్రహారంలో వ్యవసాయవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉండేవారు. సీతారామశాస్త్రిగారిని బాల్యంలో చిట్టిబాబు అని పిలిచేవారుట. తాతగారు కూర్మన్నగారు ఇసుకలో ఓం నమః వ్రాయించి అక్షరాభ్యాసం చేయించారు. బాలరామాయణం కంఠస్థం చేయించారు. అంతకుమించి సీతారామశాస్త్రిగారు ఏ బడిలోనూ చదువుకోలేదు. ఆవులు కాస్తూ, గాలిపాటలు పాడుకుంటూ, తాతగారికి పూజాపునస్కారాలలో సహాయం చేస్తూ పదిసంవత్సరాలు వచ్చేవరకు స్వేచ్ఛామయ జీవితం గడిపారు.

పట్రాయని నరసింహశాస్త్రిగారికి ముగ్గురుపిల్లలు. వారిలో ఒక కుమారుడు, కుమార్తె చనిపోగా మిగిలిన పుత్రుడు, సీతారామశాస్త్రిగారు. కొంతకాలానికే భార్య సూరమ్మగారు కూడా స్వర్గస్థులు కావడం నరసింహశాస్త్రిగారిని తీవ్ర మానసికవేదనకు గురిచేసింది. కుమారుడిని గుడివాడ అగ్రహారంలో మామగారు కూర్మన్నగారి సంరక్షణకు వదిలి దేశాటనం ప్రారంభించారు. అత్యంత శ్రద్ధాసక్తులతో నేర్చుకొని, అప్పటికే ప్రావీణ్యం సంపాదించిన దాక్షిణాత్య సంగీతం ఆయన జీవికకు ఆధారం అయింది. ఒరిస్సాలో జమీందారీ ఆస్థానాలకు చెందిన రాజుల ఆదరణలో చాలాకాలం గడిపారు. ఘనమైన సన్మానాలను అందుకున్నారు. జరడా, పర్లాకిమిడి, చినకిమిడి, ధారాకోట, చీకటికోట ఇంకా అనేక చిన్న చిన్న సంస్థానాలు నరసింహశాస్త్రిగారిని ఆదరించాయి.

పిల్లవాడు తండ్రిదగ్గరే పెరగడం మంచిదన్న అభిప్రాయంతో మాతామహులు పదిసంవత్సరాల వయసుగల సీతారామశాస్త్రిగారిని తండ్రికి అప్పగించారు. నరసింహశాస్త్రిగారు అప్పటికి బరంపురంలో సంగీత శిక్షకులుగా కొంత మానసికంగా, ఆర్థికంగా స్థిరపడ్డారు. బరంపురంలో త్రిపాసూరి ముఖ్యప్రాణరావు, చక్రవర్తిపంతులుగారు వీరిరువురినీ అత్యంత ప్రేమానురాగాలతో ఆదరించారు.

సీతారామశాస్త్రిగారు తండ్రివెంట తిరుగుతూ ఆయన సంగీతం చెప్పుకొనే ఇళ్ళలోని విద్యార్ధులతో పాటుగా సంగీతం నేర్చుకున్నారు. ప్రత్యేకంగా తండ్రిగారు సంగీత శిక్షణ అంటూ ఇవ్వలేదు. తండ్రి చెప్పిన పాఠాలన్నీ వారి విద్యార్థులతో పాటు నిత్యపారాయణ చేసేవారు. సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథం కంఠస్థం అయింది. తరువాత స్వయంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పన్నెండవ ఏడు వచ్చేసరికి సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తుల వలన బాలగురువుగా పేరు సంపాదించుకున్నారు.

బాలుడైన సీతారామశాస్త్రిగారి మీద ఏదో అవ్యాజమైన అనురాగం ఏర్పరచుకున్న ఒక వంటబ్రాహ్మణుడు, నరసింహశాస్త్రిగారికి నచ్చచెప్పి తను పనిచేసే నాళంవారి సత్రానికి తీసుకొని పోయి, తల్లికన్నా ఎక్కువగా సంరక్షించేవాడుట.

బరంపురం మంగళవారప్పేటలోని విద్యార్థి బృందంతో సీతారామశాస్త్రిగారికి అనుబంధం ఉండేది. ఒక దేవాలయంలో ఆ బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి కచేరి చేసి స్వర్ణ కంకణం అందుకున్నారు.

ఆ రోజుల్లో బరంపురం గొప్పవిద్యాకేంద్రం. గొప్పసాహిత్యవేత్తలు, సంగీత విద్వాంసులకు నిలయం. ఆ వాతావరణంలో ఏ మహాపండితుల, విద్వాంసుల ప్రభావం పడిందో తెలియదుకానీ, పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రత్యేకమైన విద్యాభ్యాసం చేయకపోయినా, స్వయంగా పద్యాలు వ్రాయడం, స్వతంత్రంగా సంగీత రచన చేయడం అలవోకగా అలవడ్డాయి సీతారామశాస్త్రిగారికి.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఎవరికి వారే ధనసంపాదన చేసేవారు. ఒరిస్సాలో చాలా జమీందారీలలో తండ్రి, కొడుకు కలిసి కచేరీలు చేసారు. జరడా, చీకటి కోట, చినకిమిడి, పెదకిమిడి వంటి చిన్నచిన్న సంస్థానాలు వీరిరువురినీ సన్మానించాయి. బరంపురం, జయపురం, ధారాకోట, విజయనగరం, తణుకు మొదలైన ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు చేసి ఘనసన్మానాలు, మెడల్స్ అందుకున్నారు.

సాలూరు జీవితం

నరసింహశాస్త్రిగారు, కుమారుడు సంపాదించిన ధనంలో రూపాయికి కాణీ వంతున అతని ఖర్చుకి ఇచ్చి మిగిలినసొమ్మును ఆదా చేసేవారుట. ఆవిధంగా మిగిల్చిన ధనంతో బొబ్బిలి సమీపంలోని ఆనవరం అగ్రహారం దగ్గర కొద్దిగా భూమిని కొన్నారు. వృద్ధురాలైన నరసింహశాస్త్రిగారి తల్లి ఆనవరంలోనే తన కుమార్తె వద్ద ఉండేవారు. ఆమెని చూడడానికి వెళ్లినపుడే సాలూరు, బొబ్బిలి రాజాస్థానాలను దర్శించడం, వారి కోరిక మీద సాలూరులో స్థిరపడడం జరిగింది. సాలూరులో తండ్రీ కొడుకుల సంగీత శిక్షణలో ఎందరో, గొప్ప సంగీత విద్వాంసులుగా రూపుదాల్చారు. అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఆదినారాయణరావు నరసింహశాస్త్రిగారి శిష్యులే. సాలూరులో స్థిరపడేనాటికి సీతారామశాస్త్రిగారు నవ యువకులు.

సాలూరు రాజులు సవరలు. సాలూరు, ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం ప్రాంతంలో ఉండేది. రాజుల భాష ఒరియా అయినా తెలుగు భాషా సాహిత్యాలమీద సంగీతం మీద చాలా అభిమానం ఆదరణ చూపేవారు. సాలూరు చిన్న సంస్థానమే అయినా కళలను ఎంతగానో ఆదరించింది. సాలూరు అధిపతులలో పదవతరానికి చెందిన లక్ష్మీనరసింహ సన్యాసిరాజు కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. అతని భార్య కృష్ణపట్ట మహాదేవి కూడా సంగీత కళానిధి. ఈ రాజుగారు సంగీతసాహిత్యాలకే గాక నాటకాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చినవారు. అంతేకాక స్వయంగా నాటకాలలో వేషాలు కూడా వేసేవారు. రాజుగారు మంచి మార్దంగికులు కూడా. రాజకుటుంబాలన్నిటి తోటి శాస్త్రిగారికి ఆత్మీయమైన అనుబంధం ఉండేది.

సాలూరు రాజావారికి, సీతారామశాస్త్రిగారికి మంచి స్నేహం. రాజుగారికి నాటకాల సరదా ఉండేది. నాటకం రిహార్సులకు ఒక సమయం అంటూ ఉండేది కాదు. ఆ నాటకాలకు చినగురువుగారు హార్మోనియం వాయిస్తూ ఉండేవారు. వేళాపాళా అంటూలేని ఈ కార్యక్రమాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి నరసింహశాస్త్రిగారు ఆందోళన పడేవారు. ఆనాటికి ఆయన ఒకయోగిలాగ, సన్యాసి జీవితం గడిపేవారు. సాలూరులో స్థిరపడేనాటికి తండ్రీ కొడుకుల జీవన విధానంలో చీలిక వచ్చింది.

సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల అక్కడ నాట్య, సంగీత శిక్షణకు అవకాశం చాలా ఉండేది. గృహస్తుల కుటుంబాల పిల్లలకు పెదగురువుగారు, భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు. ఏ సంఘటనల ప్రభావమో కానీ కొంతకాలానికి వేశ్యలకు సంగీతం చెప్పనని శపథం చేసుకున్నారట సీతారామశాస్త్రిగారు.

సాలూరులో స్థిరపడిన వెంటనే చినగురువుగారికి కిండాం అగ్రహారానికి చెందిన ఆయపిళ్ల లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారితో వివాహం జరిగింది. స్వేఛ్ఛామయ జీవితం గడుపుతున్న చినగురువుగారికి సంసారబంధం కళ్ళెం వేసింది. మానసికంగా, ఆర్థికంగా జీవితానికి కట్టుబాటు ఏర్పడింది.

జీవనభృతి కోసం పాటుపడుతున్న రోజులలో ఫీల్కానా శివరావు పంతులుగారి ఆహ్వానంపై శ్రీకాకుళంలో నివాసం ఏర్పఱచుకున్నారు. గుడివీధిలో కొంతకాలం, పాలచెట్టువీధిలో కొంతకాలం నివసించారు. అప్పటికి ముగ్గురు మగపిల్లలు సంతానం. పెద్దకుమారుడు సంగీతరావు, రెండవకుమారుడు నారాయణమూర్తి, మూడవకుమారుడు ప్రభాకరరావు. ఆఖరిపిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో ఉండగా మంగమ్మగారు స్వర్గస్థులయేరు. అప్పటికి చినగురువుగారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునర్వివాహం తలపెట్టలేదు. తల్లిలేని పిల్లలు ఒక్కొక్కరుగా మాతామహుల దగ్గరనుండి సీతారామశాస్త్రిగారి దగ్గరకు చేరారు.

శాస్త్రిగారి తండ్రి నరసింహశాస్త్రిగారు సాలూరులో లూథరిన్ చర్చి వెనక, చిన్న ఇంట్లో ఉండేవారు. సీతారామశాస్త్రిగారు పిల్లలతో పాటుగా తండ్రి వద్దకు వచ్చి సాలూరులో స్థిరపడ్డారు. ఆయన పెదతల్లిగారి కూతురు అయిన నరసమ్మగారు వీరందరి సంరక్షణభారం వహించారు.

దేశాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న కాలం అది. ప్రజలకు గడ్డు రోజులు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులులేవు. డబ్బు ఖర్చుచేసి సంగీత కళని సాధన చేసేవారు అప్పటి ఆంధ్ర దేశంలో తక్కువ. అందువల్ల ధనసంపాదనకు సంగీత శిక్షణ ఇవ్వడమో, కచేరీలు చేయడమో తప్ప వేరే మార్గం లేక, దేశాలు పట్టుకుని తిరగవలసి వచ్చింది చినగురువుగారికి. రెండు మూడు మాసాల గ్రాసానికి సరిపడా డబ్బు సంపాదించి సాలూరుకు తిరిగివచ్చేవారు. సాలూరులో ఉన్న సమయంలో విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు చెప్తూ ఉండేవారు.

పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు సంగీతాన్ని సంప్రదాయానుసారం ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నారు. సంప్రదాయానికి ఏ మాత్రం భంగం ఏర్పడినా ఆయన తట్టుకోలేక పోయేవారు. కానీ చినగురువుగారిది సృజనాత్మకమైన స్వతంత్రమార్గం. గానసభలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసుల కచేరీలలో గాయకులు పాడిన కీర్తనలు విని, తనకి రానివి ఉంటే తన పద్ధతిలో వాటికి రాగతాళాలతో స్వంతంత్రంగా స్వరరచన చేసేవారు. సంప్రదాయమైన కీర్తనలతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించే విధంగా పద్యరచనలు చేసి వాటిని ఎంతో మధురంగా గానం చేస్తూ తన సభలను జనరంజకం చేసేవారు. ఈవిధంగా చినగురువుగారి కచేరీ పద్ధతి జనాకర్షణ కలిగి, ఎంతో ప్రజాదరణకు నోచుకున్నా పెదగురువుగారికి మాత్రం అసంతృప్తి కలిగించేది. సంప్రదాయహాని జరుగుతోందని వ్యాకులపడేవారు. చినగురువుగారు దీన్ని పట్టించుకునేవారు కాదు. తండ్రి మరణించిన తరువాత చినగురువుగారిలో సంప్రదాయం పై కొంత అభిమానం కలిగింది.

సాలూరులోని శ్రీ శారదా గాన పాఠశాల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. నరసింహశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు కలిసి 1919 లోనే విద్యార్థులకు ఉచితంగా సంగీతబోధ చేయాలనే ఆశయంతో సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి, సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. నరసింహశాస్త్రిగారు మరణించాక సీతారామశాస్త్రిగారు పాఠశాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. పూరిల్లులా చుట్టూ వెదురు మణిగింపుతో పర్ణశాల రూపంలో ఉండేది పాఠశాల. రంగారావు పంతులుగారి సహకారంతో పర్ణశాల రూపం నుండి భవనంగా మార్చడానికి ప్రయత్నం చేసారు. కానీ ఆ ప్రయత్నం పునాదులతో ఆగిపోయింది. సీతారామశాస్త్రిగారి అనారోగ్యం వంటి కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్ళ తరువాత శాస్త్రిగారు స్వయంగా పూనుకొని కొందరు పురప్రముఖుల సహాయంతో సాలూరు తాలూకాలోని వివిధ గ్రామాలలో పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, సాలూరు ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలను విరాళాలుగా స్వీకరించి పాఠశాలన భవనరూపంలోకి మార్చారు. మొత్తానికి 1936 నాటికి సాలూరు గ్రామస్థుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల అండదండలతో, శాస్త్రిగారి దేశాటనలో వివిధ ప్రాంతాలలో చేసిన కచేరీలతో సంపాదించిన సొమ్ముతో పాఠశాల నిర్మాణం పూర్తయింది.

ఆంధ్రదేశం, ఒరిస్సా ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. సంగీత విద్యార్థులలో వయోభేదంకాని, జాతి భేదాలు కాని ఉండేవికావు. అనేక వృత్తులకు చెందినవారు విద్యార్థులుగా వచ్చేవారు. పాఠాలకి ప్రత్యేకమైన వేళలు కూడా ఉండేవికావు. ఇలా నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధులలో చాలామంది నిర్థనులే. సాలూరు ప్రజలు ఈ విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు సంగీత పాఠాలు ఉచితంగా చెప్పినా, వారికి భోజన సౌకర్యాలు కల్పించడం చిన గురువుగారికి తలకు మించిన భారం అయేది. సాలూరులో ఉన్న చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు కాని ఆధారం కానీ లేవు. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతాలలో గురువుగారికి చాలామంది అభిమానులు ఉండేవారు. వివాహాలకు, ఉత్సవాలకు గురువుగారు చేసే కచేరీలే జీవికకు ఆధారం.

జయపురం మహారాజు విక్రమ దేవవర్మ గారు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేవారు. ఉత్సవాలకు వచ్చే కళాకారులు, కవులు అందరికి సాలూరులోనే మకాం. సాలూరు రాజుగారి సహాయం, పౌరుల సహాయంతో వారందరినీ చినగురువుగారు ఆదరించేవారు. సాలూరుకు వచ్చే హరిదాసులకు కార్యక్రమాలు ఏర్పాటుచేసి, వారికి హార్మోనియంతో పక్క వాయిద్య సహకారం ఇచ్చేవారు.

సాలూరులో శిష్య బృందంతో సీతారామ శాస్త్రిగారు
సాలూరులో శిష్య బృందంతో సీతారామ శాస్త్రిగారు

పాఠశాలను అభివృద్ధి చేయాలని, సంగీత విద్యార్థులకు ఉచిత శిక్షణతో సహా సకల సౌకర్యాలు కల్పించాలని, అనేక మంది పండితులను అధ్యాపకులుగా రప్పించి బోధన చేయాలని, భక్తి, జ్ఞాన వైరాగ్యాల ఆదర్శంలో సంగీత విద్యా ప్రచారం చెయ్యాలని సీతారామశాస్త్రిగారు ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ భగవత్సంకల్పం వేరుగా ఉంది.

ఆర్థికంగా గురువుగారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలిసిన ఆయన శిష్యులు విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి పదవికి దరఖాస్తు పంపించారు. తరువాత ఆ పదవిని కాదనుకోవడం చినగురువుగారి ఆత్మగౌరవానికి పరీక్షగా తయారయింది. విజయనగరంలో జరిగిన విద్వత్పరీక్షలో నెగ్గి ఆ పదవిని దక్కించుకున్నారు. తాను అమితంగా ప్రేమించిన తన పాఠశాలను, తనను ఆదరించిన సాలూరును వదిలివెళ్ళవలసి వచ్చింది. తన శిష్యులకు పాఠశాలను అప్పగించి విజయనగరం వెళ్లి వోకల్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ప్రవేశించడానికి సాలూరు విడిచి వెళ్లిన సందర్భంలో సాలూరు ప్రజలు శాస్త్రిగారికి ఘనసన్మానం జరిపి అశ్రు నయనాలతో ఆత్మీయమైన వీడ్కోలు పలికారు

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

  1. సుధా రాణి గారూ ! సాలూరు చిన గురువు గారి గురించి ఎంత చక్కగా విలువయిన సమాచారం అందించేరండీ … అభినందనలు. నేను ఉద్యోగ రీత్యా కొన్ని ఏళ్ళు సాలూరులో గడిపాను. ఆ రోజులలో చిన గురువు గారి శత జయంతి వేడుకలు మా మిత్రులంతా కలిసి, ఏదో మాకు ఉన్నంతలో జరిపించుకుని సంబర పడ్డాం.

    చిన గురువు గారు కొంత కాలం నివసించిన సాలూరులోని ఇల్లు సంగీత పాఠశాల , ఆరోజుల తీపి గుర్తుగా ఇప్పుడూ ఉంది.

  2. సాలూరి చిన్న గురువుగా గణుతికెక్కిన పట్రాయుని సీతారామ శాస్త్రి గారిని గురించి సమగ్రంగా తెలిపారు. వ్యాసకర్త సుధారాణి గారికి అభినందనలు. ఈ వ్యాసం చదివి.. త్యాగరాజుల వారు అన్నట్లుగా.. ” ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని మనసులో నమస్కరించుకున్నాను.

  3. Rohiniprasad says:

    అంతంతమాత్రమే అనిపించే తెలుగువారి సంగీతచరిత్రలోని ఒక ముఖ్యఘట్టపు వివరాలను ఈ వ్యాసం చక్కగా తెలియజేసింది.
    ఇందులో ప్రస్తావించిన కొన్ని అంశాలు నాకు తెలిసిన కొన్ని హిందుస్తానీ సంగీతజ్ఞుల విశేషాలతో పోల్చదగినవిగా ఉన్నాయి.
    @”భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు.”
    మహా విద్వాంసులుగా పేరు పొందిన తరవాత కూడా బడేగులాం అలీఖాన్, అమీర్ ఖాన్‌వంటి గాయకులు కొంతకాలంపాటు బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలలోనే నివసిస్తూ అక్కడి వేశ్యలు కొందరికి గాత్రం నేర్పేవారట. పాతరోజుల్లో ఇలా నేర్పేవారిది మిరాస్‌దార్ సంప్రదాయం అనేవారట. కళకు సంబంధించినంతవరకూ ఇదేమీ సిగ్గుపడవలసిన విషయం కాదని భావించేవారు.
    @”ప్రభుత్వంవారు హార్మోనియం వాయిద్యాన్ని నిషేధించారు. ”
    కేస్కర్ సమాచారమంత్రిగా ఉన్నప్పటి సంగతి ఇది. తన కచేరీలలో హార్మోనియం పక్కవాద్యంగా ఉపయోగించిన అమీర్‌ఖాన్ రేడియోలో పాడేటప్పుడు గాయకులతో పోటీపడుతూ, అడ్డొచ్చినట్టుగా వినిపించే సారంగీని ఉపయోగించలేదు. తన రేడియో కచేరీలలో కేవలం తబలా మాత్రమే ఉపయోగించి కచేరీలు చేశాడు. హార్మోనియంమీద కర్నాటక గమకాలు ఎంత బాగా పలుకుతాయో సంగీతరావుగారు చక్కగా చూపేవారు. బాగా వాయించే కళాకారుడుంటే వాయిద్యపు పరిమితులు లెక్కలోకి రావు.
    @”గాయకులు సాహిత్యభావాన్ని పోషిస్తూనే, నాదంలో లీనమై గానం చేయాలని, ఆ ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన శాస్త్రిగారు జీవితపర్యంతం దాన్ని ప్రచారం చేసారు.”
    సీతారామశాస్త్రిగారికి సాహిత్యం గురించిన స్పృహ ఎక్కువేనని ఈ వ్యాసంవల్ల మనకు తెలుస్తుంది. నిజానికి శాస్త్రీయసంగీతంలో సాహిత్యానిది చిన్నపీటే. తమిళపద్ధతిలోనో, మరొక వికృతరూపంలోనో పదాలను ఉచ్చరిస్తూ ఎవరైనా గాత్రకచేరీ చేసినప్పుడే తెలుగువారికి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ వంకర్లు వాద్యసంగీతంలోనూ ఉన్నప్పటికీ మాటల ఉచ్చారణ ఉండదు కనక కష్టం అనిపించదు. లలితసంగీతంలో మటుకు సాహిత్యానికి సగం ప్రాముఖ్యత ఉంటుంది కనక అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా సహించడం కష్టం. గజల్ పాడుతున్నప్పుడు ఉచ్చారణలో తప్పులు చేసినవారిని తీవ్రంగా కోప్పడే ఉర్దూ ప్రేమికులను నేను చూశాను.
    @”ఘంటసాల తెలుగు చిత్రసంగీతంలో ప్రవేశించే నాటికి చిత్రసీమ పై మహారాష్ట్ర సంగీత ప్రభావం కనిపించేది.”
    రఘురామయ్య గాత్రం అమోఘమైనది. అయితే ఆయన తెలుగు పాడితే ఏ మరాఠీవాడో పాడుతున్నట్టుంటుంది. ఇది కొంతవరకూ తెచ్చిపెట్టుకున్నదే కనక అదొక మెచ్చుకోదగ్గ లక్షణమని ఆయన అనుకుని ఉంటాడు. అలాగే రాజేశ్వరరావు ఎంత బాగా పాడినప్పటికీ అందులో బెంగాలీ పోకడలను పక్కనపెట్టలేకపోయాడు. తెలుగువాడు పాడినట్టుగా తొలిసారి పాడినది ఘంటసాలే. అందుకనే ఆయనకు ఎదురులేకుండాపోయింది. సాహిత్యం, శాస్త్రీయసంగీతం రెండూ అర్థం చేసుకుని, వాటి సంస్కారాన్ని జీర్ణించుకున్న గొప్ప గాయకుడు ఘంటసాల. ఆయనకు ఆ స్పృహను పెంపొందించినవాడుగా శాస్త్రిగారు చిరస్మరణీయుడు. లలిత సంగీతంలో తెలుగు ఎలా పాడాలో ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఘంటసాలనూ, సుశీలనూ వినాలి. పలుకుతున్న తెలుగుమాటల్లో ఏదో value addition చెయ్యాలని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంవంటివారు పడే అవస్థలు నాకు చాలా కృత్రిమంగా అనిపిస్తాయి.
    @”శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట.”
    కిరానా ఘరానా గాయకులలో కరీం ఖాన్ తరవాత ప్రసిద్ధుడైన అబ్దుల్ వహీద్ ఖాన్ 1949లో చనిపోయేదాకా పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు. ఈయన హీరాబాయి బడోదేకర్ తదితరులకు గురువు. ఈయన కరాచీ రేడియో స్టేషన్‌కు వచ్చి, తన కచేరీ అయిపోయాక కూడా రోజంతా అక్కడే కూర్చుని పాడేవాడట. పెద్దాయన సంగతి ఇంజనీర్లకు కూడా తెలుసు కనక తలుపులు మూసేసి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూసేవారట. సంగీతాన్ని తపస్సులాగా పరిగణించినవారికి కాలపరిమితులుండవు.
    ఇటువంటి పత్రికలు చదివేవాళ్ళలో సంగీతాభిమానులు ఎందరుంటారో చెప్పటం కష్టం. ఈ వ్యాసంలో ప్రస్తావించిన విషయాలకు సంబంధించిన ఆడియో లింకులేవైనా జత చెయ్యగలిగితే వెబ్ పత్రిక సదుపాయాలను వినియోగించుకున్నట్టవుతుంది.

  4. chavakiran says:

    వ్యాసం చాలా బాగుంది. నెనర్లు.

  5. P.H. Thyagaraju says:

    My sincere compliments for the great article. This makes me proud of musical heritage of Andhra Pradesh. This should be expanded and brought out in the form of a book-let. Warm regards.

  6. Rohiniprasad says:

    శాస్త్రిగారి శైలి ద్వారం నాయుడుగారికి అంతగా రుచించకపోవడంవల్లనే నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణవంటివారిని గాత్రం నేర్చుకోవడానికి డాక్టర్ శ్రీపాద పినాకపాణి వద్దకు పంపారట. ఇదొక చారిత్రక పరిణామం.
    తెలుగునాట ‘ఘరానా’లనేవి ఉన్నాయనుకుంటే సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రిగారిదీ, పట్రాయనివారిదీ, వాసావారిదీ, పినాకపాణిగారిదీ ఇలా కొన్ని సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. తమిళనాడులో త్యాగరాజు శిష్యవర్గానికి చెందినవీ, చెందనివీ కూడా కొన్ని ఉండేవి. అలాగే కేరళ, కర్నాటక ప్రాంతాలలో కూడా.

  7. voleti srinivasa bhanu says:

    1970..in the month of April, I had the great opprtunity to visit the falicitation to Swargeeya Ghantasala and also to attend the concert given by Sri Sangeetarao garu in the music school established by the great Saluru Chinna Guruvu garu. Out of my devotion towards Ghantasala I drew Sri Tyagaraja Swamy sketch and resented to the great person. At the end of the meetinh Ghantasala announced my name and conveyed thanks to me. Even after 40 years I am able to isten the golden voice which blessed me.

  8. ఉష says:

    సంగీతంలో నాకు ప్రవేశం లేదు అయినా అభిమానం. ఆస్వాదించే అభిరుచి. ఇటువంటి వ్యాసాలు చదవటం పట్ల ఆసక్తి. ఘంటసాల గారి గురువుగా కొన్ని వ్యాసాల్లో చదవటమే కానీ శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని గూర్చి పరిపూర్ణ వ్యాసం చదవటం ఇదే.

    “సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, స్వరరచనలో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ పద్య, గేయరచనలు చేస్తూ, వాటిని పారవశ్యంతో గానంచేస్తూ వాగ్గేయకారుడిగా రామభక్తిలో తరించిపోయిన ఒక పోతన, ఒక త్యాగయ్య కలిసిన మూర్తిమంతంగా సంగీత సాహిత్య మేళవింపుగా కనిపిస్తారు -సాలూరు చిన గురువుగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు.”

    పైమాటలు కవుల్లోనే కాదు సంగీతకారుల్లోనూ స్వాతంత్ర్యాన్ని కోరుకుని, స్వేఛ్ఛాయుత సాధన, జీవితం గడిపినవారున్నారు అనిపించింది. కనుక ఈ మార్పులు, చేర్పులన్నవి అన్ని కళలకీ తప్పని పరిణామక్రమాలనేగా.

    అలాగే పైన ప్రసావించిన,

    “సీతారామశాస్త్రిగారు స్వకీయ అయి గృహిణిగా ఉండే నాయికకు సంబంధించిన అంశాలతో సాహిత్యాన్ని కూర్చి జావళీ వంటి రచన చేసారు. జావళీలో ఒక కొత్త ప్రయోగం ఇది.

    వగల వయ్యారి అదిరా…
    ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా”

    ఆ గీతానికి పూర్తి సాహిత్యాన్ని వ్యాసకర్త అందించగలిగితే బాగుండు.

    సంగీతం అభ్యసిస్తున్న పదేళ్ళ మా అమ్మాయికి ఈ కళ పట్ల మరింత అవగాహన పెంచాలన్న అభిప్రాయంతో ఆసక్తికన్నా, ఈమధ్య అవసరంగా చదవటంతో – “ఈమాట” పత్రికలో చదివిన కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న గార్ల వివిధ వ్యాసాలకి పొడిగింపుగా ఈ వ్యాసం చాలా బావుంది. వ్యాసకర్తకి, పొద్దువారికి ధన్యవాదాలు.

  9. voleti srinivasa bhanu says:

    On March 24th, 2010 I attended a marriage at Annavaram. Sri Sangeeta Rao garu’s younger brother’s daughter from Yaanam also attended the same function. On my request she sang some of the great keertanas written and composed by Swargeeya China Guruvu garu for an hour or so. I was so thrilled and happy.

  10. మొన్ననే ఇక్కడ చెన్నైలో సీతారామశాస్త్రిగారి 110వ జయంత్యుత్సవ సభ జరిగింది. దానికి వెళ్ళగలిగే అదృష్టం నాకు చిక్కింది. బాలమురళీకృష్ణగారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆ సభ చాలా బాగా జరిగింది. సీతారామశాస్త్రిగారి గురించి చక్కని డాక్యుమెంటరీ తయారుచేసారు. మొత్తం పట్రాయనివారి కుటుంబమంతా కళా కుటుంబంలా అనిపించింది! సీతారామశాస్త్రిగారి మనుమరాళ్ళు, మునిమనుమరాళ్ళు అతని కృతులని ఆలపించారు, నాట్యం కూడా చేసారు!

    ప్రియా సిస్టర్స్, సీతారామశాస్త్రిగారి పద్యాలను పాటలనూ ఆలపించారు. పద్యాన్ని పాటకి ఆలాపనగా పాడడం చాలా కొత్తగా అద్భుతంగా నాకు అనిపించిన విషయం!

  11. dhavala Bhaskara Rao says:

    My Born at Saluru, Naidu Veedhi, near by Sangeeta Pathasala. At my education time somebody family stayed in sangeeta pathasaala. so many time we enjoyed with them at that place.

    Dhavala Bhaskara Rao
    Mobile :+919912038993
    Hyderabad

Comments are closed.