అంతర్జాలంలో తెలుగు నాటిక

శ్రీధర్

అంతర్జాలంలో తెలుగు నాటిక ఇంత వరకు వెలువడలేదనే చెప్పాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రహసనాల రూపంలో వెలువడింది. బహుశా బుక్స్& గాల్స్ బ్లాగులో ఒక రచయిత్రి హాస్య సంభాషణలతో నాటకీయతని ప్రదర్శించారు. అది చూసాక నాకు గంటసేపు రంగస్థలం మీద ప్రదర్శించగలిగే దృశ్యనాటికని అంతర్జాలంలో పెట్టాలని అనిపించింది.

జాలంలోనే ఎందుకు? అంటే వర్తమాన తెలుగు వార, మాస పత్రికలు నాటికల ప్రచురణని పూర్తిగా విరమించాయి గనుక ! మరి ఔత్సాహిక నాటక సమాజాలు స్క్రిప్టు కోసం ఎక్కడికి పోతారు! తమకి తామే వ్రాసుకొంటారా, లేక పాత వాటినే మార్చి, మార్చి వ్రాస్తారా? (ప్రస్తుతం అదే జరుగుతోంది లెండి)

30 ఏళ్ల క్రితం అంటే 1980/1985 మధ్యలో అంద్రప్రభ, ఆంధ్రజ్యోతి నాటిక రచనల పోటీలు నిర్వహించాయి. దురదృష్ట వశాత్తు ఆ పోటీలు సద్వినియోగం కాలేదు. ఎందుకంటే దృశ్యనాటికల పట్ల న్యాయనిర్ణేతలకు సరైన అవగాహనా లోపం వల్ల! మచ్చుకి ఒక ఉదాహరణ ఇస్తాను.

1984లో ఆంధ్రప్రభ బహుమతి ఇచ్చిన ఒక పౌరాణిక నాటిక పేరు, “వియోగ విభావరి”, రామాయణంలోని కథ! కైకేయి కోరికలు విన్న దశరథ మహారాజు పడ్డ వేదన, ఆ పైన రాముణ్ని పిలిచి వనవాసానికి పొమ్మన్న ఘట్టం ! దృశ్యనాటికలో కైకేయి, సీత, మంథర లాంటి మూడు స్త్రీ పాత్రలున్న నాటకాన్ని ఎలా ఎన్నుకొన్నారో తెలియదు. అలాగే చారిత్రిక నాటకం పేరు “మహాప్రస్థానం”—గౌతమ బుద్ధుని గృహత్యాగ ఘట్థం. దీంట్లో కూడా ప్రదర్శనా సౌలభ్యం లేదు.

ఎందుకంటే, దృశ్యనాటికకి ముఖ్యమయిన గుణం ప్రదర్శనా సౌలభ్యం, అది లేకపోతే దాన్నెవరూ ప్రదర్శించరు. ఒక స్త్రీ పాత్ర కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, చాల ఇబ్బందులు ఎదురవతాయి. ముఖ్యంగా నటీమణుల కొరత. ఆ తరువాత, గంటసేపు ఉండే నాటికలలో ఏ పాత్రకీ సరయిన ప్రాతినిధ్యం ఉంఢదు గనుక ! నటనకీ, సంభాషణలకీ మేకప్పుకీ సెట్లకీ (రాజభవనం లాంటి సెట్లు నిర్మించడం కష్టమే కదా) ఖర్చూ శ్రమాను. అందుకే తక్కువ పాత్రలు, హీరో హీరోయిన్ల పాత్రలలో వీలయినంత ఉదాత్తతాచిత్రణ, విలన్ పాత్రలో రాక్షసత్వం, చిన్నచిన్న పాత్రలలో సైతం సంభాషణా చాతుర్యం.. అంటే మాండలికాలు, సామెతలు, ఊతపదాలు లాంటి సామగ్రి తప్పని సరిగా ఉండాలి. కట్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు వాడుక భాషలో గాని యాస భాషలో గాని ఉండాలి. దీర్ఘ సమాసాలు, ఫుల్ స్థాపు లేని పొడవు డైలాగులు, పౌరాణికాలలో సైతం ఉండకూడదు. అందువల్ల పత్రికలు ప్రచురించిన నాటికలు ఆశించిన ఫలితాలు సాధించలేక పోయాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పత్రికా రంగం నాటికల విషయంలో సమాజం పట్ల తమ భాధ్యతని నెరవేర్చ లేక పోయాయి.

ఈ రకమైన దృష్టి కోణంతో రచించి, ప్రదర్శించిన ప్రజా నాట్యమండలి (విజయవాడ) వారి నాటికలు రంగస్థలాన్ని అలంకరించి అవార్డులు రివార్డులు సాధించాయి. పావలా, ఉప్పెనొచ్చింది, మద్యంలో మానవుడు, ఒక దీపం వెలిగింది, చీకటి, అన్నమో రామచంద్రా, సమాథుల మీద పునాదులు వాటిలో కొన్ని. అయితే ఆ తరువాత వచ్చినవన్నీ ఒకే రకమయిన ఇతివృత్తాలతో, చిన్న చిన్న మార్పులు చేర్పులతో వ్రాసినదే వ్రాసి, వేసినదే వేసి, నాటక సమాజాలు ప్రేక్షకులని బోరు కొట్టించాయనే చెప్పాలి.

విభిన్నమైన కథతో, ప్రయోగాత్మకమైన నాటికలు వ్రాసి చూపిస్తే, వాటిని దర్శకులు ప్రదర్శనకి ఆమోదించేవారు కాదు. కారణం అవార్డులు రావేమోననే భయం. ఈ విషయంలో తిరిగి తిరిగి, ఎన్నెన్నో చెప్పులు అరగిన అనుభవం ఈ రచయితకు ఉంది.

దానా దీనా పత్రికలు, నాటక సమాజాలు ప్రజలని మోసం చేసాయి, వైవిధ్యభరిత మైన రచనలు రాకుండా చేసాయి.

ఆ తరువాత టి.వి మాధ్యమం వచ్చి, ప్రజలు నాటికల విషయం మరచి పోయారు.

చీకటి చకోరాలు దృశ్యనాటికే అయినా, దీన్లో ఇందులో చాల ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి భాషా పరంగా, ఇందులో పాత్రలు వాడుక భాషలోనే కాక, మాండలిక యాసలోనూ మాట్లాడుతాయి. అలాగే కొన్ని చోట్ల ఒకే డైలాగుని మాటిమాటికి చెప్తాయి. అంతే కాక, నాటకంలో కూడా నాటకమాడుతాయి. అయితే ఈ ప్రయోగాన్ని దర్శకులు, ‘అయోమయం బరంపురం’ లాగ ఉంది, సామాన్య జనాలకి అర్థం కాదేమో ! అని త్రోసిపుచ్చారు. ఏం చేస్తాను! 30 ఏళ్లు మూత పెట్టాను.

మళ్లీ ఇన్నాళ్లకి తెలుగులో బ్లాగు ప్రారంభించాక (నా బ్లాగు పేరు క్షీరగంగ) నా బ్లాగులోనే పెట్టేకన్నా, ఏదైనా వెబ్ పత్రికలో ప్రచురిస్తే బాగుంటుందని పొద్దు సంపాదకులని సంప్రదించాను. మూడు వారాల పరిశీలన తరువాత ఈ నాటిక ప్రచురణకు సిధ్ధమైంది.

ఆ విధంగా మీ ముందుకి వస్తోంది ఈ నాటిక! ఏ రచనకైనా పాఠకుల ఆమోదము, ఆశీర్వాదాలే పరాకాష్ట! పది నంది అవార్డుల పెట్టు! అందుకే ఈ నాటిక పైన మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి. అంతర్జాలంలో తొలి తెలుగు నాటిక! “చీకటి చకోరాలు“ని మీ పొద్దులో చదివి చెప్పండి.

భవదీయుడు,

ఎ. శ్రీధర్,
క్షిరగంగ బ్లాగు రచయిత

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to అంతర్జాలంలో తెలుగు నాటిక

  1. శివరామ ప్రసాదు కప్పగంతు says:

    “…..దానా దీనా పత్రికలు, నాటక సమాజాలు ప్రజలని మోసం చేసాయి, వైవిధ్యభరిత మైన రచనలు రాకుండా చేసాయి….” ఆ విధంగా చేసి నాటక సమాజాలు బావుకున్నది ఏమున్నది. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. ప్రజలు దృశ్య నాటకాలను పూర్తిగా విస్మరించారు. సినిమా, టివి వచ్చి వాటి పని అవి చేసినాయి. నాటక రంగం దాదాపుగా కనుమరుగైపోతున్నది.

Comments are closed.