సాలూరు చినగురువుగారు

యవ్వనంలో సీతారామశాస్త్రిగారిని అడిదం సూరకవి రచించిన పద్యాలు చాలా ఆకర్షించాయి. లౌకిక విషయాలను వస్తువులుగా తీసుకొని పద్యరచన చేసిన ఈ కవి శైలి, శాస్త్రిగారి మీద ప్రభావం చూపింది. కచేరీలలో కూడా అడిదం సూరకవి పద్యాలను గానం చేస్తూ ఉండేవారుట.

శాస్త్రిగారు రచించిన పద్యాలలో చాలా పద్యాలు లౌకికమయిన విషయాలు వస్తువులుగా ఉండడంతో పాటు, భాషలో ప్రయోగించిన పదాలు అప్పటి వ్యవహారంలో ఉండడం గమనించగలం.

ప్రాసకోసం సరదాగా చెప్పిన పద్యాలు రెండు కనిపిస్తాయి.
తే.గీ.

పురుషుడిటుమిండ యింటిలో – పొలతి రండ
తగవులిలునిండ చేసొమ్ము తరుగుచుండ
మనసు కడుమండ పాపకర్మములు పండ
కలియుగపు జెండ ఎగురును తెలియకుండ

అటు ఇల్లాలు ఇటు ప్రియురాలు ఇద్దరి మధ్య నలిగే వాడి బాధ ఎలా ఉంటుందో చెప్పే పద్యం. ఇంటిలో ఎప్పుడూ తగవులు, చేతిలో సొమ్ము తరిగిపోవడం వంటి కష్టాలతో ఆఖరికి పాపం పండుతుందని చమత్కరిస్తారు. ఘనుల తలవంపు వారకామినుల సొంపు, కులటల తలంపు కులవధూటుల చలింపు, కలికి మనసింపు సొగసరి కౌగలింపు అంటూ ఇల్లాలిని వదలిన మగవాడి వేశ్యా ప్రియత్వాన్ని వెల్లడిస్తూ, .కామియై స్త్రీలోలత్వం చూపి, ఆడదాని కటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నం చేస్తే అధమగతి తప్పదని లోకంలోని మగవారిని హెచ్చరిస్తారు.

ఇదే వస్తువుతో మరొక పద్యం-
చం.

మదన వికార సంజనిత మాధురికిన్ మనసొగ్గి కామినీ
ముదిత కటాక్షవీక్షణల మోహముకున్ కనులూగి యెప్పుడున్
మదగజయాన పై మెరగు మాటలకున్ చెవియొగ్గియున్
అథమ గతిన్ చరించెదవురా మగవాడవురా తలంపరా

సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల నృత్య, సంగీత శిక్షకులకు అవకాశం ఎక్కువగా ఉండేది. పెదగురువుగారు గృహస్థుల కుటుంబాలలోని వారికి పాఠాలు చెప్తే, చినగురువుగారు ఊళ్ళోని కళావంతుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పాఠాలు చెప్పేవారు. చిన్న వయసులోనే వేశ్యలతో గల పరిచయం వల్ల సంసారజీవితంపై వేశ్యాప్రియత్వం, విచ్చలవిడి శృంగార జీవనం చూపే చెడు ప్రభావం వంటి విషయాలన్నీ శాస్త్రిగారికి అవగతం అయిఉంటాయి. పై పద్యాలలోని భావాలు, మగవాడికి హెచ్చరికలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.

తంపెళ్ళ సత్యనారాయణగారితో

సాలూరులో చినగురువుగారి వద్ద ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు, రేడియో కళాకారుడు తంపెళ్ళ సత్యనారాయణగారు, శాస్త్రిగారి తొలితరం శిష్యవర్గంలోని వారు. ఇద్దరికీ వయోభేదం ఎక్కువ లేకపోవడం వలన స్నేహంతో పాటు స్పర్థ కూడా ఉండేదట.

తంపెళ్ళ సత్యనారాయణగారు గ్రామఫోను రికార్డులు కూడా ఇచ్చారు. ఒక రికార్డులో కొన్ని పాటలు సీతారామశాస్త్రిగారి రచనలే. సింహేంద్ర మధ్యమంలో ధవళ మృదుతర, చక్రవాకంలో భావమెరిగిన, కాపిరాగంలో భజరే గురు చరణం శాస్త్రిగారి రచనలు.

తంపెళ్ళ సత్యనారాయణగారి గ్రామఫోను రికార్డులో కొన్ని పాటలు సీతారామశాస్త్రిగారు రచించారు

సాలూరు జమీందారు సన్యాసిరాజుగారి స్నేహం, ఆదరణలతో తనలోని కళాకారుడిని బహుముఖంగా ప్రదర్శించిన శాస్త్రిగారి స్వేచ్ఛామయ కళా జీవితానికి కుటుంబ బాధ్యతలు సంకెళ్ళు వేసాయి. కుటుంబ పోషణార్థం దేశసంచార బాట పట్టారు. కొంతకాలం కలకత్తా, ఖరగ్ పూర్ వంటి ప్రాంతాలలో ఉత్తరదేశ సంచారం చేసారు. ఈ విధంగా హిందుస్తానీ సంగీతంలోని లోతుపాతులను కూడా గ్రహించే అవకాశం ఆయనకి కలిగింది. కొంత సొమ్ము సంపాదించుకొని సాలూరు వచ్చి సంగీత పాఠాలు చెప్తూ జీవిక సాగించేవారు. ఆ డబ్బు అయిపోతే తిరిగి దేశాటన! కానీ కాలక్రమంలో కుటుంబ పోషణతో పాటు, పాఠశాల నిర్వహణ భారంగా మారి, డబ్బుకు కటకట పడవలసిన పరిస్థితిలో విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో అథ్యాపకుడిగా స్థిరపడవలసి వచ్చింది. విజయనగరంలో సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండిటిలోను అసమానప్రజ్ఞ కనపరిచారు. తన సంగీత విద్యా ప్రదర్శనతో సంగీత విద్వాంసులతో పాటు, సాహిత్య రచనలతో పండితులనుకూడా మెప్పించారు. విభిన్నమయిన వస్తువుతో అనేక పద్యరచనలు చేసి వాటిని స్వరపరచి సభలలో వాటిని ఆలపించేవారు.

సంగీత సంప్రదాయం-శాస్త్రిగారి ప్రయోగాలు

పండు తమలపాకు వంటి శరీరం, విశాలమైన నుదురు, వంగి కొనతేలిన నాసిక, అమాయకంగా ఆకర్షణీయంగా ఉండే నేత్రాలు, అర్భకంగా కనిపించే నాజూకైన రూపం – సీతారామ శాస్త్రిగారిది. రూపంలోనే కాక, సంగీత ప్రదర్శనలోను జనరంజకంగా ఉండే ప్రత్యేకతను ప్రదర్శించిన వ్యక్తిత్వం ఆయనది.

కర్ణాటక సంగీతంలోని కచేరీ పద్ధతిలో విద్వాంసులు చేసే రాగాలాపనలో సంగీత శాస్త్ర విషయంలో నిష్ణాతులైన వారికి కలిగే శాస్త్రానందం తప్ప సాధారణమైన ప్రజానీకానికి కలిగేది పరోక్షానందమే. అటువంటి సంగీత కచేరీలలో సాధారణమైన భాషలో లలితమైన పదాలతో, సమకాలీన వస్తువుతో చమత్కారంగా చేసిన రచనలను సీతారామశాస్త్రిగారు సభలలో పాడేవారు. సామాన్య ప్రజానీకానికి సంగీతంలో రససిద్ధి కలిగించే అనుభవాన్ని రుచిచూపడానికి శాస్త్రిగారు ఎన్నుకున్న మార్గం ఇది. సుందరమైన మందస్మిత వదనంతో ఎంతో తన్మయంగా గానం చేస్తున్న శాస్త్రిగారి పాటకు సభలో యావన్మందీ రసానుభూతిని పొందేవారుట.

ఆనాడు కచేరీలలో సంప్రదాయంగా మారిన కొత్త పద్ధతి ప్రతి సంగీత కచేరీలోను త్యాగరాజకీర్తన పాడి తీరాలి అనేది. అందువల్ల సంగీత విద్వాంసులందరూ తప్పనిసరిగా త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవలసిన అవసరం, అదీ గురుముఖతః నేర్చుకోవలసిన అగత్యం ఉండేది. తెలుగువారు చాలామంది దక్షణదేశం వెళ్లి త్యాగరాజ సంప్రదాయంలో కీర్తన గ్రంథం నేర్చుకునేవారు. కర్ణాటక సంగీతం తెలుగువారిదే అయినా అత్యంత భక్తిశ్రద్ధలతో అభ్యసించి ప్రచారం చేసినవారు తమిళులు. అందువల్ల తమిళభాష ప్రభావం త్యాగరాజుగారి తెలుగుకీర్తనలపై కనిపించేది. తమిళుల సంగీతానికి సాహిత్యం ఒక ఉపకరణం మాత్రమే.

త్యాగరాజస్వామి విరచిత కీర్తనలను తెలుగువారు తమిళయాసతో పాడడం, సాహిత్యంలో ఔచిత్యభంగం కలిగే విధంగా పదాలను విరవడం ఆయనను చాలా బాధించేది. అందువల్ల వివిధ ప్రాంతాలలో తాను విన్న త్యాగరాజ కృతులకు, విన్న సాహిత్యానికి స్వతంత్రంగా స్వరకల్పన చేసి రాగాలాపన చేస్తూ సాహిత్యానికి తగిన రాగాన్ని, సంగతులను ప్రదర్శిస్తూ కచేరీలలో గానం చేసేవారు శాస్త్రిగారు. దాక్షిణాత్య సంగీత సంప్రదాయం పేరున సంగీత విద్వాంసులు కచేరీలలో పాడే త్యాగరాజు కీర్తనలలో సాహిత్యపోషణకు ఔచిత్యభంగం కలుగుతోందని గురువుగారు అభిప్రాయపడేవారు. రామ నన్ను బ్రోవరా, ప్రక్కల నిలబడి వంటి త్యాగరాజకృతులు పాడినప్పుడు సంగీత విద్వాంసులు సాహితీ భంజకంగా సంగతులు వేస్తున్న విధానం ప్రదర్శిస్తూ, సాహిత్య భావానుగుణంగా సంగతులువేసి ఔచిత్యానికి భంగం కలుగకుండా ఏ విధంగా పాడవచ్చునో నిరూపిస్తూ గానం చేసి సభలలో జనాకర్షణ పొందేవారు.

సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండూ సమానమైన తూకంలో ఉంటేనే ఆ కృతి రాణిస్తుందని నమ్మేవారు.భాష భావం కలిస్తేనే రాగరసస్ఫూర్తి కలుగుతుందని భావించారు.

ఆనాటి కచేరీలలో సంగీత విద్వాంసులు సంప్రదాయంగా భావించే పద్ధతిలో సీతారామశాస్త్రిగారి కచేరీలు ఉండేవి కావు. ముందు శృంగార రసభావాన్ని వెల్లడించే వర్ణం పాడడం, వెంటనే భక్తిరసప్రధానమైన కృతిని పాడడం అనే ఆనాటి కచేరీ సంప్రదాయం ఆయనకు నచ్చేదికాదు.

సీతారామశాస్త్రిగారిది మొదటి నుంచి సంప్రదాయంలో ఒదిగిన ధోరణి కాదు. శుద్ధసంప్రదాయవాది యైన తండ్రిగారితో ఆయన కొంత విభేదించవలసి వచ్చినా, తను నమ్మిన మార్గంలోనే శాస్త్రిగారు జీవించారు. శాస్త్ర సమ్మతమైన సంప్రదాయమార్గంలో ప్రయాణిస్తూనే స్వతంత్ర మార్గంలో ప్రయోగాలు చేయడం శాస్త్రిగారి ప్రత్యేకత. ఆవిధంగా ఆయన చేసిన ప్రయోగం – తెలుగు సంగీత కచేరీలలో పద్యాలు, లలితగేయాలు పాడడం. సంగీత కచేరీలలో సంప్రదాయంగా వస్తున్న వర్ణం, కీర్తనలు, కృతులు మొదలైనవి పాడుతూనే, తన స్వీయరచనలైన పద్యాలు గానంచేసేవారు. సమకాలీన వస్తువుతో రచించిన పద్యాలు సామాన్యుడిని సైతం ఆకట్టుకునేవి. సంగీతం మీద కంటే సాహిత్యం మీద మక్కువ ఎక్కువగా ఉన్న సభికులు ఉన్న సభలలో స్వీయ రచనలతో పాటు ప్రబంధాలలోని పద్యాలు, చాటుపద్యాలను జనరంజకంగా గానం చేసేవారు. “వనజాతాస్త్రకుడేయు సాయకములన్ వారింపగా రాదు” “ఏ వనితల్ మముందలఁపనేమి పనో, తమరాడువారుకారో, వలపించు నేర్పెరుగరో” “వరబింబాధరమున్” మొదలైన పద్యాలను సంగీతపు సొబగులద్ది ఆలపించి సభికులను అలరించేవారు.

కేవలం రాగప్రదర్శనకు, తన వాక్పటిమ ప్రదర్శనకు కాక సంగీతాన్ని ఆయా పద్యభావానికి తగ్గట్టుగా కూర్చి ప్రదర్శించేవారు.

జనరంజకమైన సంగీతానికి ముఖ్యస్థానం ఇస్తూ కచేరీ సంప్రదాయంలో శాస్త్రిగారు చేసిన ప్రయోగం ఆయనకి సంగీత విద్వాంసులలో ఒక ప్రత్యేకస్థానాన్ని కల్పించడమే కాక, తదనంతర కాలంలో సంగీత కచేరీ అంటే పద్యాలు, భావగీతాలు, లలితమైన సంగీతం వినిపించడం కూడా అన్న మరో కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఘంటసాల వంటి గాయకులు ఆకాలంలో భావగీతాలతో కచేరీలు చేయడం మనం గమనించవచ్చు. శాస్త్రీయ సంగీత కచేరీలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో ఆయన రకరకాల ప్రయోగాలు చేసారు. ఆ అసంతృప్తిని వెల్లడిస్తూ ఆయన రచించిన పద్యం “స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి” -.బహుళ జనాదరణ పొందినది.

ఆనాటి తెలుగు పౌరాణిక నాటకాలలో చదివే పద్యాలపై మరాఠీ సంగీత ప్రభావం ఉండేది. దాక్షిణాత్య సంగీత ప్రదర్శనలలో విద్వాంసుల కీర్తనలపై తమిళయాస ప్రభావం ఎక్కువగా ఉండి, కేవలం రాగ ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి తెలుగు భాషా సాహిత్య మర్యాదలను పక్కన పెట్టడం చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. దీనిని గురించి సీతారామశాస్త్రిగారు స్వయంగా రచించి సభలలో గానం చేసిన ఈ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్యాన్ని ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు ఒక రికార్డుగా విడుదల చేసారు.
సీ.

స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి పరవశత్వముఁజెందు సరసులార
అరవనొక్కులె శాస్త్రమంచు నెంచి దాని భావమే యెరుగని ప్రాజ్ఞులార
మహరాష్ట్ర గానంపు మహిమ చూపెదనంచు గళము గిర్గిర త్రిప్పు ఘటికులార
మూలనుండిన వీణ ముందరకున్ లాగి తంత్రులంద్రెంపు విద్వాంసులార

తే.గీ

కాలగతి చేత ప్రస్తుత కాలమందు
ఆంధ్ర సంగీతమిన్ని విధంబులాయె
గాన శాస్త్రజ్ఞులార సుజ్ఞానులార
గాన శాస్త్రజ్ఞులార అజ్ఞానులార

ఎన్నెన్నో తెన్నులుగా చీలిపోయి ఎందునా రససిద్ధి పొందలేకపోయిన నాటి ఆంధ్ర సంగీతాన్ని గురించి విమర్శించిన పద్యం ఇది. ఆంధ్రసంగీతం ఈ విధమైన అధ్వాన్న స్ధితిని పొందడానికి కారకులు – తాము గాన శాస్త్రజ్ఞులమనుకుని భాషని అలక్ష్యం చేసే గాయకులేనని శాస్త్రిగారి అభిప్రాయం. ఆ భావానికి తగినట్టు శాస్త్రిగారు పద్యంలో మాటలను మహారాష్ట్ర ప్రభావం కనిపించే విధంగా గళము గిరగిరా త్రిప్పడం, అరవనొక్కులే అన్న చోట తమిళయాసతో పలుకుతూ ఒక కొత్త పద్ధతిలో గానంచేసేవారుట. అది ఆనాటి శ్రోతలను ఎంతగానో ఆకర్షించింది. అందువల్లనే సమకాలీన విద్వాంసులలో వెలిపడ్డ వారిగా కనిపించినా అత్యంత జనాదరణ పొందిన మేటి విద్వాంసులుగా జనుల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు

శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట. ఆ గానం కూడా కేవలం పాటలా కాక పరమేశ్వరుడికి సమర్పించుకునే హృదయ నివేదనలా ఉండేదట. అలాంటి భక్తి, జ్ఞాన యోగాలను ప్రదర్శించే పద్యాలను కీర్తనలను శాస్త్రిగారు స్వయంగా రచించి అమృతమయంగా గానం చేసేవారుట.

అతిబాల్యంలోనే తల్లిని పోగొట్టుకొని సహజమయిన ప్రతిభతో సంగీతంలోను, సాహిత్యంలోను నవనవోన్మేషమయిన ప్రజ్ఞా పాటవాలను చూపి సంగీతంతో నాదోపాసన చేసి, సరస్వతీ పుత్రులుగా ఆనాటి ప్రజల అభిమానాన్ని పొందారు శాస్త్రిగారు. తనకు ఈ విద్యను ప్రసాదించిన సరస్వతీదేవిని తల్లిగా, పుత్రుడి లాగే ఆరాధించారు శాస్త్రిగారు. తన ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా సరస్వతి అమ్మవారితో పంచుకున్నారు.

సంగీతకళా మూర్తి శారదాదేవిని తల్లిగా భావించి ఆమెకు చేసుకున్న నివేదన-

సీ.

రాగమందనురాగ రసమునొల్కించుటే అమ్మరో నీ మందహాసమమ్మ
గడియారమునకె సద్గతి జూపు లయతాళ గతులెన్న నీ మందగమనమమ్మ
పూలమాలికల కూర్పును బోలు స్వరకల్ప నలు నీదు మృదుల భాషలు గదమ్మ
శ్రుతి యందు లీనమౌ గతి మది నిల్పుటే భారతీ నీ శాంత భావమమ్మ
నవరసంబుల సముద్భావమంద జేయుటే శారదా నీ కటాక్షము గదమ్మ

తే.గీ.

భావ రాగంబులను, తాళ ఫణితి, శ్రుతియు
గలియ గానంబు చేసెడి గాయకునకును
శ్రుతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జనని
శరణు ముఖజిత శశి బింబ శారదాంబ

పద్యంలో కనిపిస్తుంది. ఇందులో వస్తువు సరస్వతిని స్తుతించడం. రాగమందు అనురాగ రసమునొల్కించుట ఆమె మందహాసమని, గడియారమునకే గతులు చూపే లయతాళగతులు ఆమె మందగమనమని, పూలమాలికలవలె కూర్చిన స్వర కల్పనలు ఆమె భాషలని, ఈ విధంగా చేసే నవరస సముద్భవం ఆమె కటాక్షమని, భావరాగ తాళాలతో శ్రుతిపక్వంగా పాడి ఆమెను ఆనందింపచేయని గాయకుడు గాయకుడే కాదని వర్ణించారు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

  1. సుధా రాణి గారూ ! సాలూరు చిన గురువు గారి గురించి ఎంత చక్కగా విలువయిన సమాచారం అందించేరండీ … అభినందనలు. నేను ఉద్యోగ రీత్యా కొన్ని ఏళ్ళు సాలూరులో గడిపాను. ఆ రోజులలో చిన గురువు గారి శత జయంతి వేడుకలు మా మిత్రులంతా కలిసి, ఏదో మాకు ఉన్నంతలో జరిపించుకుని సంబర పడ్డాం.

    చిన గురువు గారు కొంత కాలం నివసించిన సాలూరులోని ఇల్లు సంగీత పాఠశాల , ఆరోజుల తీపి గుర్తుగా ఇప్పుడూ ఉంది.

  2. సాలూరి చిన్న గురువుగా గణుతికెక్కిన పట్రాయుని సీతారామ శాస్త్రి గారిని గురించి సమగ్రంగా తెలిపారు. వ్యాసకర్త సుధారాణి గారికి అభినందనలు. ఈ వ్యాసం చదివి.. త్యాగరాజుల వారు అన్నట్లుగా.. ” ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని మనసులో నమస్కరించుకున్నాను.

  3. Rohiniprasad says:

    అంతంతమాత్రమే అనిపించే తెలుగువారి సంగీతచరిత్రలోని ఒక ముఖ్యఘట్టపు వివరాలను ఈ వ్యాసం చక్కగా తెలియజేసింది.
    ఇందులో ప్రస్తావించిన కొన్ని అంశాలు నాకు తెలిసిన కొన్ని హిందుస్తానీ సంగీతజ్ఞుల విశేషాలతో పోల్చదగినవిగా ఉన్నాయి.
    @”భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు.”
    మహా విద్వాంసులుగా పేరు పొందిన తరవాత కూడా బడేగులాం అలీఖాన్, అమీర్ ఖాన్‌వంటి గాయకులు కొంతకాలంపాటు బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలలోనే నివసిస్తూ అక్కడి వేశ్యలు కొందరికి గాత్రం నేర్పేవారట. పాతరోజుల్లో ఇలా నేర్పేవారిది మిరాస్‌దార్ సంప్రదాయం అనేవారట. కళకు సంబంధించినంతవరకూ ఇదేమీ సిగ్గుపడవలసిన విషయం కాదని భావించేవారు.
    @”ప్రభుత్వంవారు హార్మోనియం వాయిద్యాన్ని నిషేధించారు. ”
    కేస్కర్ సమాచారమంత్రిగా ఉన్నప్పటి సంగతి ఇది. తన కచేరీలలో హార్మోనియం పక్కవాద్యంగా ఉపయోగించిన అమీర్‌ఖాన్ రేడియోలో పాడేటప్పుడు గాయకులతో పోటీపడుతూ, అడ్డొచ్చినట్టుగా వినిపించే సారంగీని ఉపయోగించలేదు. తన రేడియో కచేరీలలో కేవలం తబలా మాత్రమే ఉపయోగించి కచేరీలు చేశాడు. హార్మోనియంమీద కర్నాటక గమకాలు ఎంత బాగా పలుకుతాయో సంగీతరావుగారు చక్కగా చూపేవారు. బాగా వాయించే కళాకారుడుంటే వాయిద్యపు పరిమితులు లెక్కలోకి రావు.
    @”గాయకులు సాహిత్యభావాన్ని పోషిస్తూనే, నాదంలో లీనమై గానం చేయాలని, ఆ ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన శాస్త్రిగారు జీవితపర్యంతం దాన్ని ప్రచారం చేసారు.”
    సీతారామశాస్త్రిగారికి సాహిత్యం గురించిన స్పృహ ఎక్కువేనని ఈ వ్యాసంవల్ల మనకు తెలుస్తుంది. నిజానికి శాస్త్రీయసంగీతంలో సాహిత్యానిది చిన్నపీటే. తమిళపద్ధతిలోనో, మరొక వికృతరూపంలోనో పదాలను ఉచ్చరిస్తూ ఎవరైనా గాత్రకచేరీ చేసినప్పుడే తెలుగువారికి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ వంకర్లు వాద్యసంగీతంలోనూ ఉన్నప్పటికీ మాటల ఉచ్చారణ ఉండదు కనక కష్టం అనిపించదు. లలితసంగీతంలో మటుకు సాహిత్యానికి సగం ప్రాముఖ్యత ఉంటుంది కనక అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా సహించడం కష్టం. గజల్ పాడుతున్నప్పుడు ఉచ్చారణలో తప్పులు చేసినవారిని తీవ్రంగా కోప్పడే ఉర్దూ ప్రేమికులను నేను చూశాను.
    @”ఘంటసాల తెలుగు చిత్రసంగీతంలో ప్రవేశించే నాటికి చిత్రసీమ పై మహారాష్ట్ర సంగీత ప్రభావం కనిపించేది.”
    రఘురామయ్య గాత్రం అమోఘమైనది. అయితే ఆయన తెలుగు పాడితే ఏ మరాఠీవాడో పాడుతున్నట్టుంటుంది. ఇది కొంతవరకూ తెచ్చిపెట్టుకున్నదే కనక అదొక మెచ్చుకోదగ్గ లక్షణమని ఆయన అనుకుని ఉంటాడు. అలాగే రాజేశ్వరరావు ఎంత బాగా పాడినప్పటికీ అందులో బెంగాలీ పోకడలను పక్కనపెట్టలేకపోయాడు. తెలుగువాడు పాడినట్టుగా తొలిసారి పాడినది ఘంటసాలే. అందుకనే ఆయనకు ఎదురులేకుండాపోయింది. సాహిత్యం, శాస్త్రీయసంగీతం రెండూ అర్థం చేసుకుని, వాటి సంస్కారాన్ని జీర్ణించుకున్న గొప్ప గాయకుడు ఘంటసాల. ఆయనకు ఆ స్పృహను పెంపొందించినవాడుగా శాస్త్రిగారు చిరస్మరణీయుడు. లలిత సంగీతంలో తెలుగు ఎలా పాడాలో ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఘంటసాలనూ, సుశీలనూ వినాలి. పలుకుతున్న తెలుగుమాటల్లో ఏదో value addition చెయ్యాలని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంవంటివారు పడే అవస్థలు నాకు చాలా కృత్రిమంగా అనిపిస్తాయి.
    @”శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట.”
    కిరానా ఘరానా గాయకులలో కరీం ఖాన్ తరవాత ప్రసిద్ధుడైన అబ్దుల్ వహీద్ ఖాన్ 1949లో చనిపోయేదాకా పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు. ఈయన హీరాబాయి బడోదేకర్ తదితరులకు గురువు. ఈయన కరాచీ రేడియో స్టేషన్‌కు వచ్చి, తన కచేరీ అయిపోయాక కూడా రోజంతా అక్కడే కూర్చుని పాడేవాడట. పెద్దాయన సంగతి ఇంజనీర్లకు కూడా తెలుసు కనక తలుపులు మూసేసి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూసేవారట. సంగీతాన్ని తపస్సులాగా పరిగణించినవారికి కాలపరిమితులుండవు.
    ఇటువంటి పత్రికలు చదివేవాళ్ళలో సంగీతాభిమానులు ఎందరుంటారో చెప్పటం కష్టం. ఈ వ్యాసంలో ప్రస్తావించిన విషయాలకు సంబంధించిన ఆడియో లింకులేవైనా జత చెయ్యగలిగితే వెబ్ పత్రిక సదుపాయాలను వినియోగించుకున్నట్టవుతుంది.

  4. chavakiran says:

    వ్యాసం చాలా బాగుంది. నెనర్లు.

  5. P.H. Thyagaraju says:

    My sincere compliments for the great article. This makes me proud of musical heritage of Andhra Pradesh. This should be expanded and brought out in the form of a book-let. Warm regards.

  6. Rohiniprasad says:

    శాస్త్రిగారి శైలి ద్వారం నాయుడుగారికి అంతగా రుచించకపోవడంవల్లనే నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణవంటివారిని గాత్రం నేర్చుకోవడానికి డాక్టర్ శ్రీపాద పినాకపాణి వద్దకు పంపారట. ఇదొక చారిత్రక పరిణామం.
    తెలుగునాట ‘ఘరానా’లనేవి ఉన్నాయనుకుంటే సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రిగారిదీ, పట్రాయనివారిదీ, వాసావారిదీ, పినాకపాణిగారిదీ ఇలా కొన్ని సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. తమిళనాడులో త్యాగరాజు శిష్యవర్గానికి చెందినవీ, చెందనివీ కూడా కొన్ని ఉండేవి. అలాగే కేరళ, కర్నాటక ప్రాంతాలలో కూడా.

  7. voleti srinivasa bhanu says:

    1970..in the month of April, I had the great opprtunity to visit the falicitation to Swargeeya Ghantasala and also to attend the concert given by Sri Sangeetarao garu in the music school established by the great Saluru Chinna Guruvu garu. Out of my devotion towards Ghantasala I drew Sri Tyagaraja Swamy sketch and resented to the great person. At the end of the meetinh Ghantasala announced my name and conveyed thanks to me. Even after 40 years I am able to isten the golden voice which blessed me.

  8. ఉష says:

    సంగీతంలో నాకు ప్రవేశం లేదు అయినా అభిమానం. ఆస్వాదించే అభిరుచి. ఇటువంటి వ్యాసాలు చదవటం పట్ల ఆసక్తి. ఘంటసాల గారి గురువుగా కొన్ని వ్యాసాల్లో చదవటమే కానీ శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని గూర్చి పరిపూర్ణ వ్యాసం చదవటం ఇదే.

    “సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, స్వరరచనలో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ పద్య, గేయరచనలు చేస్తూ, వాటిని పారవశ్యంతో గానంచేస్తూ వాగ్గేయకారుడిగా రామభక్తిలో తరించిపోయిన ఒక పోతన, ఒక త్యాగయ్య కలిసిన మూర్తిమంతంగా సంగీత సాహిత్య మేళవింపుగా కనిపిస్తారు -సాలూరు చిన గురువుగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు.”

    పైమాటలు కవుల్లోనే కాదు సంగీతకారుల్లోనూ స్వాతంత్ర్యాన్ని కోరుకుని, స్వేఛ్ఛాయుత సాధన, జీవితం గడిపినవారున్నారు అనిపించింది. కనుక ఈ మార్పులు, చేర్పులన్నవి అన్ని కళలకీ తప్పని పరిణామక్రమాలనేగా.

    అలాగే పైన ప్రసావించిన,

    “సీతారామశాస్త్రిగారు స్వకీయ అయి గృహిణిగా ఉండే నాయికకు సంబంధించిన అంశాలతో సాహిత్యాన్ని కూర్చి జావళీ వంటి రచన చేసారు. జావళీలో ఒక కొత్త ప్రయోగం ఇది.

    వగల వయ్యారి అదిరా…
    ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా”

    ఆ గీతానికి పూర్తి సాహిత్యాన్ని వ్యాసకర్త అందించగలిగితే బాగుండు.

    సంగీతం అభ్యసిస్తున్న పదేళ్ళ మా అమ్మాయికి ఈ కళ పట్ల మరింత అవగాహన పెంచాలన్న అభిప్రాయంతో ఆసక్తికన్నా, ఈమధ్య అవసరంగా చదవటంతో – “ఈమాట” పత్రికలో చదివిన కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న గార్ల వివిధ వ్యాసాలకి పొడిగింపుగా ఈ వ్యాసం చాలా బావుంది. వ్యాసకర్తకి, పొద్దువారికి ధన్యవాదాలు.

  9. voleti srinivasa bhanu says:

    On March 24th, 2010 I attended a marriage at Annavaram. Sri Sangeeta Rao garu’s younger brother’s daughter from Yaanam also attended the same function. On my request she sang some of the great keertanas written and composed by Swargeeya China Guruvu garu for an hour or so. I was so thrilled and happy.

  10. మొన్ననే ఇక్కడ చెన్నైలో సీతారామశాస్త్రిగారి 110వ జయంత్యుత్సవ సభ జరిగింది. దానికి వెళ్ళగలిగే అదృష్టం నాకు చిక్కింది. బాలమురళీకృష్ణగారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆ సభ చాలా బాగా జరిగింది. సీతారామశాస్త్రిగారి గురించి చక్కని డాక్యుమెంటరీ తయారుచేసారు. మొత్తం పట్రాయనివారి కుటుంబమంతా కళా కుటుంబంలా అనిపించింది! సీతారామశాస్త్రిగారి మనుమరాళ్ళు, మునిమనుమరాళ్ళు అతని కృతులని ఆలపించారు, నాట్యం కూడా చేసారు!

    ప్రియా సిస్టర్స్, సీతారామశాస్త్రిగారి పద్యాలను పాటలనూ ఆలపించారు. పద్యాన్ని పాటకి ఆలాపనగా పాడడం చాలా కొత్తగా అద్భుతంగా నాకు అనిపించిన విషయం!

  11. dhavala Bhaskara Rao says:

    My Born at Saluru, Naidu Veedhi, near by Sangeeta Pathasala. At my education time somebody family stayed in sangeeta pathasaala. so many time we enjoyed with them at that place.

    Dhavala Bhaskara Rao
    Mobile :+919912038993
    Hyderabad

Comments are closed.