జనపదం

 


అదొక చిన్న పల్లెటూరు. కాని మెయిన్ రోడ్డు మీద వుంది. టౌనుకెళ్లాలంటే ఆ వూరు మీంచి వెళ్లాల్సిందే. అందుకే ఆ పల్లె రోడ్డు చిన్న చిన్న షాపులతో, టీ బంకులతో, సైకిల్ షాపులతో కళకళలాడుతూ వుంటుంది. ఒకసారి టౌను వెళ్తూ రోడ్డువార టీ కొట్టు దగ్గర ఆగాను. కస్టమర్లతో సందడిగా వుంది. ఒకాయన వచ్చి బెంచీ మీద కూచుంటూ, "ఓ టీ కొట్టు అర్జంటుగా" అన్నాడు. ఆ బంకులో యజమానే సర్వస్వం. "స్ట్రాంగ్‌గా కొట్టనా, లైట్‌గా కొట్టనా" అన్నాడు పొయ్యి దగ్గర్నించి టీ మాస్టర్ కమ్ యజమాని. "లౌక్యంగా కొట్టు" అన్నాడు కస్టమరు. ఆ భాష అవతలి వ్యక్తికి అర్థమైంది. నాకు అర్థం కాలేదు. "లౌక్యం" అంటే మరీ అంత స్ట్రాంగూ కాదు, అట్లాగని లైటూ కాదు అని తెలుసుకున్నాను. ఆహా! లౌక్యాన్ని ఎంత లౌక్యంగా వాడారని నివ్వెరపోయాను.
 

జనపదాల్ని వినాలంటే జనపదాల్లోనే వినాలి. గడచిన పాతికేళ్లలో ఎన్నో జనపదాలు మరుగున పడిపోయాయి. అర్బనైజేషన్ మొదలై నలభై ఏళ్లు దాటింది. తొలినాళ్లలో కొద్దిగా రాకపోకలు, పల్లె పట్నం మధ్య వారధులు వుండేవి. ఆ తరం తరవాత సంబంధాలు తెగిపోయాయి. పల్లెలు తమ స్వరూప స్వభావాలను కోల్పోయాయి. దీనికి కారణాలు యిక్కడ అప్రస్తుతం. పిల్లలు మాట్లాడుకునే మాటలు కొన్ని యిప్పుడు పట్నంలోనే కాదు పల్లెల్లో కూడా వినిపించడం లేదు. తాయిలం, అప్పచ్చి, బువ్వ, కాకెంగిలి లాంటి మాటలు లేవిప్పుడు. పల్లెటూరి పిలకాయలకు కూడా వీటి అర్థాలు తెలియవు. కొన్ని తినుబండారాలను పక్కపక్క ప్రాంతాలైనా తేడాగా పిలుస్తారు. ఒకసారి బడికి ఇన్స్‌పెక్టర్ గారు తనిఖీకి వచ్చారు. మా బడిలో ఒక మేస్టారు తరగతిలో చిరుతిళ్లు తింటున్నారని ఆయనకు ఆకాశరామన్న వుత్తరం అందిందిట. మా బడిలో ఏడుగురు టీచర్లుండేవారు. ఇన్స్‌పెక్టర్ గారు వస్తూనే, ఆ వుత్తరం ఎవరు రాసిందీ కనిపెట్టేసారు. ఫలానా టీచరు తరగతి గదిలో పప్పుచెక్క, బుగ్గారెలు తినుచున్నారు — అని రాశాడు ఆకాశరామన్న. మా ప్రాంతంలో పునుగులంటాం. పల్నాడులో వాటిని బుగ్గారెలు – బుగ్గ గారెలు అంటారు. కొత్తగా ఒకాయన వినుకొండ నించి బదిలీ అయి మా బడికి వచ్చారు. ఆయన తప్ప బుగ్గారెని మరొకరు ప్రయోగించలేరు. అందుకే ఆకాశరామన్న దొరికిపోయాడు!
 

కొన్ని కొన్ని పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలు వచ్చి అక్కడి భాషని సంస్కృతిని సమూలంగా మార్చేస్తాయి. నాగార్జునసాగర్ వచ్చి పల్నాటి రూపు రేఖల్ని మార్చేసింది. శ్రీనాథ మహాకవి, చిన్న చిన్న రాళ్లు చిల్లరదేవుళ్లు… పద్యం, జొన్నకలి జొన్నయంబలి… చాటువులు నేడు చెల్లవు. అలాగే కృష్ణా గోదావరి నదుల మీద పలుచోట్ల వంతెనలు వచ్చాక రేవులు పోయాయి. దానివల్ల దానికి సంబంధించిన పదజాలం అంతరించిపోయింది. రాదారి పడవ, నావ, పుట్టి, డింగీ లాంటివి వినిపించడం కనిపించడం తగ్గింది. ఇద్దరి నించి అద్దరికి చేర్చేందుకు చెల్లించే సొమ్ముని "కేవు" అంటారు. మారుమూల గ్రామాలకు, గూడేలకు కూడా కరెంటు వచ్చింది. దానితో బుడ్డి దీపం, లాంతరు, చిమ్నీ, లస్టర్, గ్యాస్ లైట్ లాంటివి పోయాయి. అభ్యుదయం, నాగరికత పోయే మాటల కోసం ఆగదు, ఆగకూడదు. మాటల గురించిన మాట వచ్చింది కాబట్టి ఓసారి మననం చేసుకుంటున్నాం.
 

మనది వ్యవసాయదేశం. భారతీయత, భారతీయ ఆత్మ పల్లెల్లోనే వుందని చెప్పుకునేవారు. వ్యవసాయంతో బాటు వృత్తి విద్యలు పల్లె జనాన్ని పోషించేవి. యంత్రాలు రంగప్రవేశం చేశాయి. పశుసంపద పూర్తిగా తగ్గిపోయింది. దానితో ఎన్నో మాటలు పనిముట్లు మూల పడ్డాయి. ఎలపటెద్దు, దాపటెద్దు, ఎల్లావు పుల్లావు, కోడెదూడ పెయ్యదూడ, గిత్త ఎద్దు ఆబోతు యిలాంటివి ఇప్పుడు కుర్ర రైతులకు కూడా కొత్తగా వినిపిస్తాయి. సిగమార్లు, ముకుతాళ్లు, పట్టెళ్లు, చెర్నాకోల, ములుకోల, ములుగర్ర, చిక్కం లాంటివి రైతు నోళ్లలో నానేవి. పశువుల దాణాకి సంబంధించిన చిట్టు, తవుడు, కుడితి ప్రాచీన పదాలైనాయి. మేతకి పశువుల్ని డొంకలకి తీసికెళ్లడాన్ని "పుల్లరి" అంటాం. పుల్లరి సుంకం మీదే నాడు కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు.
 

మరైతే కొన్నాళ్లకి వేలాది జనపదాలు పూర్తిగా మాయమవుతాయా. ఎప్పటికీ కావు. భాష సజీవమైంది. పాతవి పోతూ వుంటే కొత్తవి వస్తూ వుంటాయి. సమయం గడిచిన కొద్దీ కొన్ని మాటలు అర్థాలు మార్చుకుంటాయి. ఇక్కడ ఒక్క నిజాన్ని చెప్పుకోవాలి. అర్బనైజేషన్ ఆ తర్వాత గ్లోబలైజేషన్ జరిగాక యింకా అనేక తెలుగు నుడికారాలు జాతీయాలు సామెతలు పడికట్టు పదాలు జనంలో వున్నాయంటే దానికి కారణం పత్రికలు రేడియో. రోజూ పత్రికల్లో పతాక శీర్షికలలో మంచి తెలుగు జాతీయాలని నుడికారాలని చదువుతూ వుంటాం. రేడియోలో వింటూ వుంటాం. నిప్పులు చెరిగారు, చేతివాటం, చక్రం తిప్పనున్నారా, మొండిచెయ్యి, అంతా హుళక్కి, ఏతావాతా, వేరు కుంపటి, చిలవలు పలవలు, పావులు కదిపారు, విధివిధానాలు, నీరు కార్చిన వైనం, జీర్ణించుకోలేకపోతున్నారు, నిర్వీర్యం, సయోధ్య, జయకేతనం, స్పందన, ప్రతిస్పందన – యిలా ఎన్నో వుదహరించవచ్చు. ’పగ్గాలు’ అనే మాట జనపదంలో పోయినా అధికారం అప్పగించినపుడు ’పగ్గాలు ఫలానా వారి చేతికిచ్చారు’ అని పత్రికల్లో కనిపిస్తుంది. భాషాభివృద్ధికి కూడా పత్రికలు నాడూనేడూ కృషి చేస్తూనే వున్నాయి. కాందిశీకులు, అలీనవిధానం, అస్మదీయులు, వంటి పలు కొత్త మాటలను పాఠకులకు పరిచయం చేశాయి పత్రికలు. రావణకాష్ఠం, శల్యసారధ్యం, శిఖండి, సైంధవుడు, కీచకుడు, చక్రం అడ్డేయడం లాంటివి వాడుతూ ఇతిహాసపాత్రల్ని గాథల్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ’చక్రం అడ్డేయడం’ అంటే ఏమిటో తెలియాలంటే భారత కథంతా తెలియాలి. అలాగే మిగిలినవీ. ఆలస్యంగా రంగప్రవేశం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా తెలుగుభాషకి కొత్తరంగులు అద్దింది. దృశ్య మాధ్యమం అవడం వల్ల, ప్రపంచీకరణ ప్రభావం వల్ల తన ’పలుకు’బడిని మార్చుకుంది. విజువల్ మీడియా అవిశ్రాంత కృషి ఫలితంగా జనపదాలు బొత్తిగా మొహం చాటేసాయి. చాలా స్కూల్స్‌‌లో తెలుగుని కూడా ఆంగ్లంలో బోధించడం ఆనవాయితీ అయింది.
 

మునుపు వయసు మళ్లిన అత్తగారు, "కీలు దాని కాడుంది. అది తిప్పినట్టు యీడాడతాడు" అని కోడలు కొడుకు గురించి వ్యాఖ్యానించేది. ఇప్పుడు, "స్విచ్చి దాని కాడుంది. ఆ మీటపెట్టె దాన్చేతులో పెట్టుకుని నొక్కుతా వుంటే – యీడ బొమ్మ మారుతా వుంటది" అంటోందావిడ. అంటే రిమోట్ కోడలి చేతిలో వుందని వేష్ట. ఏదైనా తీగ, ఏ సొరపాదో చీరపాదో బాగా విస్తరిస్తే "అనూపంగా అల్లుకుంది" అనేవారు. పుచ్చపువ్వులాంటి వెన్నెల, గచ్చపొదలాంటి గయ్యాళి యిప్పుడు లేవు. విశ్వనాథ వారి తెలుగు ఋతువులు లఘుకావ్యం చదివితే ఎన్ని మాటలు జానపదాల్లోంచి జారిపోయాయో తెలుస్తుంది. అలాగే ఎన్నిఆచారాలు వ్యవహారాలు కాలగతిలో కలిసిపోయాయో అర్థమవుతుంది. విశ్వనాథ వర్షరుతువుని వర్ణిస్తూ ఒక పద్యంలో పందిరి గుంజ మీద మొలిచిన కాకిబొడ్డుని ప్రస్తావిస్తారు. అక్కడ ఆగకుండా "… కన్నె పిల్ల ఎద పొంగగ" అని కాకిబొడ్డుతో అనుసంధిస్తారు. ఇది సమగ్రంగా తెలియాలంటే యాభై ఏళ్లనాటి పల్లెటూరికి వెళ్ళాల్సిందే. వానాకాలం వస్తోందనగానే నేల పాతర్లలో ధాన్యాన్ని తీసి గాదెల్లో పోస్తారు. పూడ్చిన పాతరగుంట మీద ఏ కూరపాదు పెట్టినా చులవలు పలవలుగా అల్లుకుంటుంది. దానికి చెట్టుకొమ్మలతో పందిరి వేస్తారు. చెట్టుకొమ్మకి కణుపులుంటాయి. వాటిలో నీళ్లు నిలుస్తాయి. చెట్టుకొమ్మలో వుండే జీవ పదార్థం నీళ్లతో కలిసి ఒక విధమైన ఫంగస్ తలెత్తుతుంది. అవే పుట్టగొడుగులు, అవే కాకిబొడ్లు. వర్షాకాలంలో అట్ల తద్దె వస్తుంది. ఇది ఆడపిల్లల పండగ. గోరింటాకు పెట్టుకోవడం, తెల్లవారుజామున అన్నాలు తిని ఆడుకోవడం, ఉయ్యాలలూగడం రివాజు. అప్పట్లో పెరటిగోరింటాకే గానీ మెహందీ కోన్స్ లేవు. గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో కాకిబొడ్డు వేస్తే ఎర్రగా పండుతుందని అప్పటి నమ్మకం. ఈ "కన్నెపిల్ల ఎదపొంగగ" అని కవి సమ్రాట్ వాడకం వెనక యింత విషయం వుంది.
 


 

ఆనాటి కవులు గ్రామీణ జీవన నేపథ్యంలోంచి వచ్చిన వారే. తమ నేలని పరిసరాల ప్రకృతిని అమితంగా ప్రేమించిన వారు. అందుకే విశ్వనాథ, జాషువా, తుమ్మల, ఏటుకూరి మొదలైన పలువురి రచనలలో తెలుగు జీవితాలు ప్రతిబింబిస్తాయి. జనపదాలు పదే పదే ప్రతిధ్వనిస్తాయి.
 

ఒక ఆసామి వూళ్లోకి వస్తున్న రైతుని, "కాలవ వురవడిగా వస్తోందా" అని అడుగుతాడు. "లేదు లేదు… తొలి జాము దాకా సజావుగానే వచ్చింది గాని తర్వాత సచ్చిపోయింది" అంటాడు రైతు. అంటే కాలవలో నీరు తగ్గిందని అర్థం. జనపదంలో వర్షాన్ని దుక్కులలో చెప్పుకునేవారు. "దుక్కి" వారి కొలమానం. దుక్కి దున్నడం కూడా వుంది. నాగలి పన్నడం అంటారు. అంటే దున్నాల్సిన నేలని ఎక్కడ ప్రారంభిస్తే నాగేటిచాళ్లు సక్రమంగా వస్తాయో చూసి మొదలెట్టడం. ఇదొక గొప్ప కళ. నాగలికి కాడి మేడి వుంటాయి. వెనకాల వుండే పెద్ద కొయ్యని నాగలిదుంప అంటారు. దుంపకి కర్రు వుంటుంది. అది ఇనుముతో చేసిన పలుగు ములుకు. అదే నేలని చీలుస్తుంది. దానితో పాటు నడిచే దుంప చాలుని వెడల్పు చేస్తుంది. ఎన్నిసార్లు దున్నితే అన్ని చాళ్లు దున్నామంటారు. ఎడ్లబండి కూడా మానవ నాగరికతకి గొప్ప చిహ్నంగా చెబుతారు. బండి చక్రాలని జోడు అని కూడా పిలుస్తారు. బండి చట్రాన్ని నిలిపే దాన్ని డొలుపు అంటారు. దాంట్లోంచే ఇరుసు వస్తుంది, చక్రాలకి వుండే అడ్డకొయ్యలని ఆకులంటారు. ఎడ్ల మెడ పైన కాడి వేసి, మెడ కింద నించి పట్టెడ వేసి దాన్ని తగిలించే కర్రల్ని చిడతలంటారు. ఇవి బండి కాడికి ఆ చివర యీ చివర వుంటాయి. ఇరుసుకి చక్రాల్ని ఎక్కించి చివర శాయి మేకుల్ని పెడతారు. కూచోడానికి వీలుగా వెదురుతో అల్లిన జల్లని బండివైపు వుంచి, అది కదలకుండా వసి కర్రల్ని అటూయిటూ గుచ్చుతారు. వీటన్నిటికీ చేతలోనే కావల్సిన ఏర్పాట్లు అమరికలు వుంటాయి.
 

ఏదైనా నగగాని వస్తువుగాని కుదిరిగ్గా పొందిగ్గా వుంటే "చేతాళం" బావుందంటారు. చేతాళం, చేత అనే పదాలిప్పుడు అరుదే. రైతులు కూడా ప్రస్తుతం విత్తనం, వంగడం మాటల్ని వదిలేశారు. బ్రాండ్స్‌తో వస్తున్న తరుణంలో సీడ్స్ అనడం పరిపాటి అయింది. నీళ్లకి అంటే సాగునీటికి సంబంధించి రకరకాల వనరులు వచ్చాక ఆనాటివి మూలపడ్డాయి. ఏతం అనే మాట బ్లాక్ అండ్ వైట్ సినిమా పాటల్లో మాత్రమే కనిపించి వినిపిస్తుంది. గూడ వేయడం, నత్తగుల్ల తిప్పడం, మోట బావి మూరెడు బారెడు చారెడు లాంటి కొలతలు యిప్పుడు లేవు. పుంజీడు అంటే నాలుగు అని అర్థం. శేరు, సోల, గిద్ద అనేవి కూడా పోయాయి. మానికతో గాని ఆ మాటతో గాని యిప్పుడు పన్లేదు. మానికని చూడాలంటే ప్రస్తుతం గోవింద రాజస్వామి గుడిలో మాత్రమే కనిపిస్తుంది. రూకలు కొలిచి కొలిచి అలిసిపోయిన గోవిందరాజస్వామి దానినే తలకింద పెట్టుకుని నడుం వాలుస్తారు. ఇదొక ఐతిహ్యం.
 

మత్స్యకారులకు సముద్రం మీద ఎంతటి అవగాహన వుంటుందో గ్రామీణులకు ఆకాశం మీద అంతటి పట్టు వుంటుంది. ఆకాశాన్ని చూసి వాతావరణాన్ని ఆ రోజుల్లో చెప్పేవారు. చంద్రుడు చుట్టూ మేఘాలు కట్టే గూడుని "వరదగుడి" అనేవారు. దాన్ని బట్టి వాన రాకడ తెల్సుకునేవారు. చుక్క పొడుపుల్ని బట్టి రాత్రివేళల్ని చెప్పేవారు. వేగుచుక్క పొడిస్తే నిద్రలేచే వేళైనట్టు. ఒక పెద్ద నక్షత్రం చుట్టూ చిన్న నక్షత్రాలు గుంపుగా వుండే దాన్ని పిల్లల కోడి అనేవారు. వీటిల్లో జనపదాలే కాదు జానపద విజ్ఞానం కూడా వుందని మనం గ్రహించాలి. అందానికి ప్రతీకగా చెప్పుకునే ఇంద్రధనుస్సుని కర్షక శత్రువుగా పిలిచేవారు. ఇంద్రచాపం వానవెలిశాక ప్రత్యక్షమవుతుంది. సూర్యుడు కూడా వుండాలి. వాతావరణంలో వున్న నీటి బిందువులు ప్రిజమ్‌లా పని చేస్తాయి. వాటి పైబడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది, ఆకాశం తెర మీద వానవెల్లిగా దర్శనమిస్తుంది. ఒక ప్రసిద్ధ సబ్బుల కంపెనీ, వానవెల్లి రంగులలో లభిస్తాయని వ్యాపారప్రకటన యిచ్చేది. తమిళనాడులో ఇంద్ర ధనుస్సుకి "సింగారి చెంగు" అనే పేరుంది. ఎంత ముచ్చటైన పేరు! ఇప్పుడువున్నదల్లా రెయి‌న్‌బో… ఓన్లీ రెయి‌న్‌బో!
 

ఒక్క సంగతి గమనించాలి. చాలా పల్లెపదాలు మాయం కావడమో, మారిపోవడమో జరిగింది గాని దేవుడు మాటలు చాలా వరకూ సర్వత్రా సురక్షితంగానే వున్నాయి. ఆలయం, ప్రాకారం, ధ్వజస్తంభం, గర్భగుడి, మండపం, అర్చన, ప్రదక్షిణం, గోపురం, తీర్థం, ప్రసాదం, నైవేద్యం, హారతి, మొక్కు, పూజ, పూలుపత్రి యివి యథాతథంగానే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక కాలేజి అమ్మాయి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల గురించి చాలా పొగుడుతూ – "దేవుడి కాన్వాయ్ చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఐ రియల్లీ లైక్డిట్" అనడం విన్నాను. ఓరి భగవంతుడా అనుకున్నాను. అయితే, కైంకర్యం, స్వాహా, శఠగోపం, నామం లాంటి దేవుడి మాటలు దొంగలపరంగా వాడుతున్నారు. ఈ దురాచారం ఎందుకొచ్చిందో తెలియదు. బడిలో వినిపించే పలక, బలపం, పేనా, పెన్ను, ఇంకు, సిరా, పాళీ లాంటి మాటల్ని పెన్, రిఫిల్ మింగేశాయి. కుంభకారుడు సారె మీద అనేక రకాల మట్టి పాత్రలని తయారు చేసేవాడు. కడవ, కుండ, బుంగ, చట్టి, దుత్త, ముంత, పిడత, బాన, తాబేటికాయ – యివి కొన్ని పేర్లు. ఎద్దు మెడని అర్రు అంటారు. అందని వాటికి అర్రులుజాచడం అంటే మెడ చాచడం అని అర్థం. లావో దేవో అనే హిందీ పదాల్లోంచి లావాదేవీలు వచ్చింది. హమ్ తుమ్ నించి అమీతుమీ వచ్చింది. అమీ తుమీ తేల్చుకోవడం అంటే నువ్వో నేనో తేలాలని భావం. ఏకులు, పోగులు, చిలపలు, నూలు విచ్చెలు యివి రాట్నానికి సంబంధించిన సరుకు సరంజామా. ఏకులు వడికాక పోగుల్ని ఆసుపోస్తారు. దానికి వాడేందుకు చిన్న గొట్టం వుంటుంది. అటూయిటూ తిరిగే వారిని చూసి ఆసులో గొట్టంలా తిరుగుతున్నాడంటారు. పడుగుపేక అంటే వస్త్రం నేయడానికి అడ్డంగా నిలువుగా కూర్చే నూలుపోగులు. ఈ పడుగుపేకని నిత్య జీవితంలో పలుసందర్భాలలో వాడతాం. పల్లెల్లో విశ్వాసాలు, నమ్మకాలు బస్తీలకంటే ఎక్కువ. ఇంట్లోంచి ఎవరైనా పొరుగూరు వెళ్తుంటే, "అన్నం తిని వెళ్లు" అనరు. అలా అన్నాక తప్పక తిని వెళ్లాలి. లేకపోతే అశుభం జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకని ఎంగిలిపడి వెళ్లు, మంచిమాట చేసికెళ్లు అంటారు. అప్పుడు ఔనన్నా కాదన్నా ఫర్వాలేదు. రాత్రిపూట ఉప్పు అనే మాట వాడరు. చవి, రుచి, బుట్టలోది అని వ్యవహరిస్తారు. "పెళ్లివారమంటూ భోరు భోరున వెళ్ళాం. వెళితే ఏవుందక్కడ? మడత కుడుములు శేష పాన్పులూ తప్ప" – ఇది నిష్టూరంగా అనే మాట. కుడుము గుండ్రంగా వుంటుంది. మడత కుడుం అంటే తినడానికి ఏమీ లేదని. శేష పాన్పులంటే తిండి లేక డొక్కల్లో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకున్నామని ధ్వని. బడిలో మాస్టారు బెత్తాన్ని, బరికెని వాడేవారు. "ఏరా అల్లరి కట్టిపెడతారా, చింతావారి అమ్మాయితో పెళ్లి చెయ్యమంటారా" అనేవారు మాస్టారు. చింతావారి అమ్మాయంటే చింతబరికె అని అర్థం. పెళ్లి చేయడమంటే బాదడం అని అర్థం. దూదేకుడు, గుద్దుల బెల్లం కూడా పిల్లల్ని కొట్టే పరిభాషే. ఇక వంటింట్లోకి వస్తే ఎంత సామాగ్రి కనుమరుగైంది. పొయ్యి, కుంపటి యిప్పుడు మ్యూజియమ్ వస్తువులు. ఏవుందీ పొయి రాళ్లలాగా మేం ముగ్గురం అంటారు పెద్దవాళ్లు. అంటే పిల్లలు రెక్కలొచ్చి ఎవరిదారిన వారెళ్తే మేం మిగిలామని చెప్పడం. రోలు, రోకలి, తిరగలి, సన్నెకల్లు, పీట, కల్వం, కుంది యివన్నీ వెళిపోయాయ్. పాలు పల్చనవుతున్నాయ్, పాలల్లో నీళ్లు కలపద్దు అనడం కొంచెం యిబ్బందిగా వుంటుంది. అందుకని పూర్వీకులు "తోడు పాలు కలపద్దు" అనేవారు. తోడుపాలంటే నీళ్లని అర్థం. ఎంత హాయిగా వుందండీ నిజంగా!
 

సాంకేతికరంగం చాలా అభివృద్ధి చెందింది. దీనివల్ల టెలిగ్రామ్ పూర్తిగా పాతబడిపోయింది. బంధువులు, స్నేహితుల మధ్య వుత్తరప్రత్యుత్తరాలు పూర్తిగా తగ్గిపోయాయి. E-mail, SMS వచ్చాయి. లేఖా సాహిత్యం కనుమరుగై, ఎన్నో మాటలు యీ తరానికి తెలియని పరిస్థితి వచ్చింది. వుత్తరం రాయడానికి కొన్ని లాంఛనాలు మర్యాదలు వుండేవి. పైన "క్షేమం" అని పెద్దక్షరాలతో రాయాలి. ఎవరికి ఎవరు రాస్తున్నారో చెప్పి, ఉభయకుశలోపరి అని రాయాలి. ఆపైన లేఖాంశాలు మొదలుపెట్టాలి. ఆ యింటి పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు దీవెనలు వుండాలి. చిత్తగించవలెను, ఇట్లు మీ విధేయుడు అంటూ చేవ్రాలు చేసి ముగించాలి. అన్నట్టు చేవ్రాలు అంటే సంతకం. నిశాని అంటే ఎడమచేతి బొటనవేలి ముద్ర. అయిదారు దశాబ్దాల క్రితం లేఖాసాహిత్యం ఒక శాఖగా వర్థిల్లింది. వుత్తరాలతో కథ, వుత్తరాలతోనే నవల తెలుగులో వచ్చాయి. కనుపర్తి వరలక్షుమ్మ గారి "శారదలేఖలు" అనేక సాంఘిక సామాజిక సమస్యల్ని చర్చించే సందేశాలు. ప్రముఖ రచయిత తాత్వికుడు చిత్రకారుడు సంజీవదేవ్ తన మిత్రులకు రాసిన లేఖలు విలక్షణమైనవి. విలువైన సమాచారంతో రాసిన విలక్షణమైనవి. సాధికారత గల చరిత్రకి ప్రముఖుల లేఖలు అక్షర సాక్ష్యాలుగా నిలిచాయి. ఇప్పుడు లిఖిత సంప్రదాయం పోయి ఆశుసంప్రదాయం మిగిలింది. చాలా సంగతులు గాలిలో కలిసిపోతున్నాయి. వార్తా ప్రసార సౌకర్యాలు లేని రోజుల్లో పల్లెలకు సమాచారం తెచ్చేవి పోస్టు కార్డ్సే. "టెలిగ్రాం" ఒకనాటి అర్జంట్ సమాచార వాహిక. టెలిగ్రాం కొట్టాడు, వైరిచ్చాడు అనడం పరిపాటిగా వుండేది. తెలుగులో తంతి. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌‍ని తంతితపాలాశాఖ అని పిలిచేవారు. మోర్స్‌కోడ్‌లో కట్టు, కడ అనే రెండు ధ్వని సంకేతాలతో ఎంత సమాచారాన్నైనా చేరవేసేవారు. వివిధ సందర్భాలకు తగిన శుభాకాంక్షల జాబితా, వాటికో నెంబరు వుండేది. ఆ నెంబరు కొట్టేస్తే అవతల కొసన ఆ గ్రీటింగ్‌‍ని పూర్తిగా రాసేసి అడ్రస్‌‍దారుడికి చేర్చేవారు. టెలిగ్రామ్ ఇవ్వాలంటే మాటకి యింతని వసూలు చేసేవారు. అందుకని అతిక్లుప్తంగా పంపే సందేశాన్ని కుదించేవారు. దీనికి వ్యాకరణాలు మర్యాదలు పాటించే ఆచారం లేదు. అందుకే దీన్ని "టెలిగ్రామ్యభాష" అని శ్రీశ్రీ పేరు పెట్టాడు. ఇప్పుడు SMS కూడా చిత్రమైన భాషని అలవాటు చేసింది.
 

సర్వత్రా వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా కరెంటు స్తంభాలు తప్ప పచ్చని చెట్లు కనిపించడం లేదు. చాలా చెట్ల పేర్లు యిప్పటి పిల్లలకుతెలియదు. తుమ్మ తమ్మి తుమ్మి జమ్మి నేరేడు మారేడు పొగడు పొన్న పున్నాగ లాంటి చెట్లు యిప్పుడు జనపదాలలో కూడా లేవు. వేప కానుగ లాంటి చెట్ల నీడలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని వాటిని శ్రద్ధగా పెంచేవారు. వాటి పుల్లలతో పళ్లు తోమేవారు. పళ్లు తోమే పుల్లల్ని పందుం పుల్లలు అని పిలిచేవారు. అందాకా దేనికి, చేల చుట్టూ వుండే తాడి చెట్టు నిజంగా కల్పవృక్షం. ఒకనాడు మహాకావ్యాలన్నీ తాళపత్రాల మీదనే వచ్చాయి. తాటాకు ఇంటి కప్పుకి వాడేవారు. చిన్న తాడిని బొంద అంటారు. బొందడు, బొందపాపడు అనే మాటలు దాని మీంచి పుట్టినవే. తాటికాయ, తాటిముంజె, తాటిపండు పల్లెల్లో యిష్టంగా తినే వుచిత ఆహారం. మామిడితాండ్ర… తాండ్రంటే జెల్లీ… తాటి తాండ్ర కూడా వుంటుంది. అంత రుచిగానూ వుంటుంది. తాటిపండు గుజ్జుతో రొట్టెలు చేసుకుంటారు. ఇప్పుడీ ఫార్ములా తెలిసిన తరం దాదాపు అంతరించింది. తీసిన కొద్దీ వస్తుంటే, ఎన్ని తీసినా తరగకపోతే – "తేగల పాతరలా తరిగితేనా" అంటారు. ముంజెలు ముదిరి టెంకలవుతాయి. ఆ టెంకల్ని పాతర వేస్తారు. అవి మొలకెత్తుతాయి. తేగ తాడిచెట్టు అంకురమని ఎందరికి తెలుసు. ధనియాలు జల్లితే కొతిమీర మొలిచిందని ఆశ్చర్యపోతున్న రోజులు.
 

బతికుంటే బలుసాకు తిని బతకచ్చు – అని సామెత. బలుసాకు అనేది ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా పెరుగుతుంది. అనేక శక్తివంతమైన క్రిమి సంహారక మందుల కారణంగా కొన్ని కూరాకు కలుపు మొక్కలు కనుమరుగైనాయి. పొన్నగంటి, దొగ్గలి కూర లాంటివి ఎన్నో. ఈ పేర్లు కూడా పోయినట్టే. "నల్లేరు మీద బండి నడక" అంటే కేక్‌వాక్ అని అర్థం. నల్లేరు కూడా ఒకరకం కలుపుగడ్డే. నల్లేరు కాయలు, బుడంకాయలు తినడానికి బావుండేవి. కొంచెం పొట్టిగా లావుగా వుండి, ఎక్కువగా మాట్లాడుతుంటే, "వీడొక బుడంకాయ్" అంటుంటారు. అలాంటిదే "వుల్లిత్తు" కూడా. ప్రకృతిని మానవీకరించడం ప్రాచీన సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తుంది. "తీగె కూన" భూమాతని చుట్టుకుందంటాడొక కవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి "జాబిలి కూన" ప్రయోగం విలక్షణమైంది. జాను – పిల్లి జాబిలి. పిల్లి పిల్లల్ని కూనలంటాం కదా. చిన్న చందమామని జాబిలి కూన అన్నారాయన. ప్రకృతిని మనిషి ఎంతగా ఇష్టపడేవాడంటే – చాలా సందర్భాలలో చుట్టరికాలు కూడా కలుపుకునేవాడు. చందమామ, చందమామయ్య లాంటి వుదాహరణలు ఎన్నో.

శివారు, పొలిమేర లాంటి జానపదాలు చెవిన పడడం లేదు. పొలిమేర అంటే సరిహద్దు. సరిహద్దుల్ని ఎల్లలని కూడా అంటాం. గ్రామసరిహద్దులలో గ్రామ దేవత వుంటుంది. ఎల్లమ్మ తల్లి వూరి ఎల్ల దగ్గర కాపలా వుంటుంది. "పొలియో… పొలి" అన్న కర్షక పదాలు కూడా యిందు మీంచి వచ్చిందే. ప్రభవ, విభవ మొదలైన తెలుగు సంవత్సరాల పేర్లు, కార్తెల పేర్లు వెళ్లిపోయి, ఇంగ్లీష్ నెలల తారీకులు వాడుకలో మిగిలాయి. ఒకప్పుడు "ఏరువాక" వ్యవసాయ సంవత్సరానికి సంకేతంగా వుండేది. జానపద కళారూపాలు అంతరించడంతో వాటికి సంబంధించిన జనపదాలూ అంతరించాయి. సంక్రాంతి తరుణంలో వచ్చే సాతానిజియ్యర్లు, బుడబుక్కల వారు, జంగం దేవర్లు, మాసాబత్తని వారు, పగటి వేషగాళ్ళు, విప్రవినోదులు, చెంచుదొరలు, కొమ్మదాసర్లు, పిచ్చుకుంట్లవారు ఆధునిక సంస్కృతిలో తెరమరుగైనారు. బొమ్మలాటలు లేవిప్పుడు. వీధి నాటకాలు కనుమరుగైనాయి. బుర్రకథలో జముకుల కథలో ఎంతటి జవజీవాలుంటాయో వీధి నాటకాలలో అంతకుమించిన రసావేశం వుంటుంది. "అగ్గి తిరణాలంట – అజ్జునీ కతలంట; ఔరా! ఎంత సోద్దెవో! ఎన్నెన్ని యింతలో? బారత కతలంట! సుగ్గీజయం దానిసుట్టు బలాదూర్" అంటాడొక కవి. సుగ్గీజయం అంటే సుగ్రీవ విజయం. బలాదూర్ అంటే తీసికట్టు, దిగతుడుపు అని అర్థం. కుచ్చలకుశలాయకం అంటే లవకుశుల కథ – ఉత్తర రామాయణం.
 

పావురం, పిచ్చుక లాంటి పక్షుల్లో ఆడమగ చెప్పడానికి పెంటి, పోతు అని వాడతారు. దాశరథి తన శాంతిగీతంలో, "ఫిరంగి గొట్టంలో పిచ్చిక పెంటి నీళ్ళాడింది" అంటారు. అంటే ఫిరంగి గొట్టం కొన్నాళ్లుగా రికామీగా వుంది. అందుకే నిర్భయంగా పిచ్చిక గుడ్లని అందులో పెట్టింది. రికామీ అంటే తీరిక. అర్బనైజేషన్ తర్వాత మనిషికి ప్రకృతికి దూరం పెరిగిన మాట నిజం. చెట్టు పుట్ట, వాగు వంక, చెరువు చెలమ, పాడి పంట, పిల్లా మేక లాంటివి దూరమైనాయి. "ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది…" అన్న నండూరి వారి ఎంకిపాటలో ప్రకృతిని జంతువుతో సమకట్టారు. జంతువులు నెమరు వేస్తాయని చిన్నప్పుడు చదువుకున్నాం. దొరికిన మేతని గబగబా తినేసి, తర్వాత తీరిగ్గా దానిని నోట్లోకి తెచ్చుకుని, తాపీగా నమిలి మింగుతాయి జంతువులు. అన్ని జంతువులు నెమర్లేస్తాయ్ కాని గుర్రం మాత్రం వేయదు. తిరపతి వేంకటకవులు ఎవరో మరో ప్రసిద్ధులు తెలియక గుర్రాన్ని కూడా గాడిద గాటన కట్టేసరికి నానాయాగీ చేసారు. పశువులకి మేత వేసే చోటుని "గాడి" అంటారు. ఇప్పటికీ పత్రికల్లో అనుభవాలని నెమరువేసుకున్నారు, జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు అంటూ ప్రస్తావిస్తూ వుంటారు. మునుపు పత్రికల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే – "పరుశురామ ప్రీతి" అనే మాట వాడేవారు. త్రేతాయుగంలో పరుశురాముడు రాజులపై దండెత్తి సంహరించి, వారి ప్రాసాదాల్ని దగ్ధం చేసేవాడట. అక్కడ నుంచి పుట్టింది పరుశురామ ప్రీతి.
 

ఎన్నో వెండి బంగారు నగలు రాను రాను మోటుగా అనిపించి రూపాలు వాటితోబాటు పేర్లు మార్చుకున్నాయి. ముక్కెర, నత్తు, బేసరి, చావిలీలు, అందెలు, పాంజేబులు, మురుగులు, కడియాలు, నాగవత్తులు, దండకడియాలు, కట్టెవంకీలు, పాపిడి గొలుసులు, పలకసర్లు – యివి కొన్ని మాత్రమే. మనిషి అనాది నించీ తన జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి నిరంతరం ఆలోచిస్తూనే వున్నాడు. అవసరంలోంచి ఆలోచనలు పుడతాయి కదా. ఏళ్ల క్రితం డొంకదార్లలో ఎంతెంత బరువులైనా తల మీద పెట్టుకుని నడిచి వెళ్లాల్సిందే కదా. డొంక వారగా యిప్పటికీ చిన్న రాతి నిర్మాణాలు కన్పిస్తాయి. అయిదడుగుల ఎత్తున రెండు రాళ్లు పాతి, వాటిపై అడ్డంగా మరో రాయి వేస్తారు. ఎవరైనా గడ్డిమోపులు, పళ్లబుట్టలు మోసుకు వెళ్ళేటప్పుడు, కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అక్కడ ఆగుతారు. సరిగా ఆ రాతివద్ద నిలబడి బరువుని దానిపైకి బదలాయించేవారు. మళ్ళీ తలకెత్తుకోవాలన్నా, మనిషి సాయం దొరకని డొంక దారిలో వారే తలకెత్తుకోడానికి యిది అనువుగా వుండేది. దీనికి తమిళంలో "శుమైతాంగి" అని చక్కని పేరుంది. తెలుగులో భారమితి. ఈ ఏర్పాటు చాలా చిన్నదే, కాని చాలా ఉపయోగకరమైంది. పూర్వం పాలు పెరుగు వెన్న యింకా అనేక తినుబండారాలు పెట్టుకోడానికి ఉట్టిని కనిపెట్టాడు మనిషి. ప్రతి యింట్లో కనీసం రెండు ఉట్లు వేలాడుతుండేవి. ఇది చూడ్డానికి సింపుల్‌గా వున్నా యిందులో బోలెడు మెకానిజం వుంది. ఎత్తులో వేలాడుతూ వుంటుంది కాబట్టి పిల్లులు, కుక్కలు అందుకోలేవు. దీన్ని వేలాడదీసేటప్పుడు ఒక కొక్కెం, దానికో చిన్న దొన్నె వుంచుతారు. ఆ దొన్నెలో మడ్డి ఆముదం కొద్దిగా పోస్తారు. అంటే పైనించి తాడు ఆధారంగా చీమలు రాకుండా ఆ జిడ్డు దొన్నె అగడ్తలా అడ్డుకునేది. "ఉట్టి" జనపదంలో ఎంతో సేవ చేసింది. విపరీతమైన ప్రజామోదం పొందింది. "ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కిందట" అన్న సామెతలో మాత్రం యిప్పుడు మిగిలింది.
 

ఒక్కొక్క వస్తువునో నిర్మాణాన్నో తీసుకుంటే, దాని చుట్టూ బోలెడు మాటలు. అవి కూడా ఎంత చక్కగా నప్పుతాయో! ఉదాహరణకి బావి వుందనుకోండి. దాని సైజుని చెప్పాలంటే చుట్టుకొలతో, వ్యాసమో చెప్పరు – దాని కన్ను అయిదడుగులు అంటారు. నాలుగు నిలువుల లోతు, వరల బావి అంటూ వర్ణిస్తారు. నేలపైన చుట్టూ కట్టే వంచని బొడ్డు అని పిలుస్తారు. చుట్టూ వుండే చప్టాని పళ్ళెం అనేవారు. నీళ్లు౮ తోడడానికి వాడే చేతితాడు చేంతాడు అయింది. ఒకప్పుడు చాలా పొడవుకి ఉపమానంగా కొండవీటి చేంతాడుని చెప్పేవారు. మనిషి చక్రాన్ని కనిపెట్టడం యీ యుగానికే పెద్ద సాంకేతిక విప్లవం. అది బావి గిలక దాకా వర్తిస్తుంది. గిలకని కప్పీ అని కూడా అంటారు. కపిలబావి అనే మాట అందుమీంచి వచ్చిందే. గిలకతో నీళ్లు తోడడం వల్ల శ్రమశక్తి సగానికి పైగా తగ్గుతుంది.
 

జానపదంగా పుట్టి పాఠ్యపుస్తకాలకెక్కిన పాట – కలవారి కోడలూ కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్లకీ నీళ్లిచ్చి కనీళ్ళు నింపె – అని కామాక్షి కథ నడుస్తుంది. ఇందులో మాటలు, సంవిధానం ఒకనాటి వుమ్మడి కుటుంబాలని కళ్లకు కడతాయి. ఆర్థిక సాంఘిక పరిస్థితులు మర్యాదలు మన్ననలూ సమస్తం తెలుస్తాయి. "రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగీ, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా" అని భర్తని అడుగుతుంది కామాక్షి. రచ్చ అంటే రచ్చబండ. పల్లెల్లో అన్ని పంచాయితీలూ యిక్కడే జరిగేవి. తీర్పులూ యిక్కడే చెప్పేవారు. ఇక్కడ పదిమందీ కూడేవారు. అందుకే రచ్చకీడ్చారు, రచ్చ చెయ్యద్దు లాంటి ప్రయోగాలు వచ్చాయి. సాంఘికాలే కాదు జానపదులు తమకు తోచిన విధంగా భారత రామాయణాలని, ప్రచారంలో వున్న వీరగాథల్ని పాటలుగా కట్టి పాడుకునే వారు. మహామహాదేవుళ్లని, మహారాజుల్ని కూడా తమ స్థాయిలోనే వూహించి పాట కట్టేవారు. లేనిపోని వైభవాలు గాని, ఆడంబరాలుగాని వ్యక్తీకరణలో అలంకారాలు గాని వారికి తెలియదు. అందుకే జానపద సాహిత్యం ముడివజ్రంలా అతిసహజమైంది. సానలు పెట్టడం, నగల్లో పొదగడం ఆధునికుల నైజం.
 

కొలతలు, తూకాలు కాలక్రమంలో మారిపోయాయి. పూర్వం నాటు పద్ధతిలో వుండేవి. "ఎంతెంత దూరం? కోసెడు కోసెడు దూరం" యిది పిల్లల ఆటలపాట. కోసెడు అంటే సుమారు రెండు మైళ్లు. ఇప్పుడు మైలురాయి వాడుకలో వుందిగాని మైళ్లు లేవు. మీటర్లు కిలోమీటర్లు వచ్చాయి. తూకాల్లో కూడా తులం పలం సవాశేరు వీశకట్టు మణుగు వుండేవి. సవాపావు అంటే సవాశేరులో నాలుగో వంతు. "సవాలక్ష" అంటూంటారు. అంటే చాలామంది అని వుద్దేశం. వస్త్రాలని మూరలు, గజాలు, వీసాలు లెక్కన కొలిచేవారు. ఇప్పుడు డబ్బుతో సహా అన్నీ దశాంశ పద్ధతిలోకి వచ్చాక సర్వత్రా ఒకటే అమలవుతోంది. ఇప్పటికీ పాతకాలం వారు అణా బేడల్ని మర్చిపోలేక పోతున్నారు. మారిన పైసల్ని యింకా నయాపైసలనే పిలుస్తుంటారు.
 

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందని సామెత. మొగసాల అంటే బహుశా మొగశాల మొగసాలగా రూపాంతరం చెందివుండవచ్చు. ఇంటిముందు విశాలమైన అరుగుకి కప్పుగా వుంటుంది. అది ఇంటి ప్రహరీలో భాగం. అది దాటితే ఇంటి సింహద్వారం. సరంబీ అంటే అటక. దీన్నే మచ్చు అని కూడా అంటారు. మచ్చు అంటే మరో మంచి మాట జ్ఞాపకం వచ్చింది – మంచె. పంట చేలల్లో అనువైన మూల మంచె కడతారు. ఎత్తుగా చిన్నపందిరిలా వేసి, దాని మీద నిలబడి పిట్టలని తోలుతుంటారు. "వడిసెల" అనే పరికరం వుంటుంది. అందులో చిన్న రాయి పెట్టి, గిరగిరా తిప్పి, ఒక కొస వదిల్తే అది దూరంగా వెళ్లి పడుతుంది. పంట చేల అందాలని, మంచె మీది వొయ్యారాన్ని, వడిసెల విన్యాసాల్ని వర్ణిస్తూ ఎందరో కవులు అందమైన పద్యాలు చెప్పారు. మంచెకి శృంగార ఛాయలు అద్దారు. పశువుల కొట్టం, గొడ్లసావడి, బందుల దొడ్డి యివన్నీ జనపదాలే. బందుల దొడ్డి అంటే పశువుల జైలు. పంటచేలో పడి మేస్తే, చేను యజమాని బందుల దొడ్లో పెట్టించేవాడు. దానికి ఫైన్ చెల్లించి విడిపించుకోవాలి. "గుదిబండ" యిప్పటికీ వాడుకలో వుంది. కొంచెం మాటవినని పశువులకి మెడలో ఒక కొయ్యదుంగని వేలాడ దీస్తారు. అది పరుగెత్తడానికి ఏమాత్రం వీలుండదు.
 

వాడికి కుదురు లేదు – అంటే నిలకడ లేదని. కుదురు అంటే పాలకుండని నిలపడానికి గుండ్రంగా అల్లిన చుట్ట. కడవ కుదురు, తల కుదురు యిలా ఎన్నో రకాలు. మజ్జిగ చిలకడానికి వెన్న తీయడానికి మనిషి కనిపెట్టిన చక్కని పరికరం నిలువు కవ్వం. దాన్ని ఒక గుంజకి కట్టి కవ్వపు తాడుతో చిలకడం. బహుశా క్షీరసాగర మథనం దీనికి స్ఫూర్తేమో. మంథర గిరిని కవ్వం చేసి, వాసుకిని తాడుగా చేసి దేవదానవులు చిలికారని కదా పురాణగాథ. చేట, జల్లెడ యిప్పటికీ వాడుకలో వున్నా వేరే పేర్లతో చెలామణీలో వున్నాయి.
 

సుప్రసిద్ధ పండితులు, పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి ఒక శిష్యునింటికి భోజనానికి వెళ్లారు. శిష్యుని తల్లి పెద్దావిడ, చక్కగా వండి వడ్డించింది. ఆయన ఎంతటి గొప్పవాడో కొడుకు పలుమార్లు చెప్పగా విన్నది తల్లి. ఆయన భోజనం ముగించి లేస్తుంటే, "బాబుగారూ, ఏదో నా చేతనైంది చేసి పెట్టా. నా వంట ఎట్లా వుందో ఏమో. ఇంతకీ వాసయోగ్యంగా వున్నదా" అని అడిగింది – మహానుభావుడిని చిన్న మాటల్లో అడిగితే బావుండదని. ఆయన హాయిగా నవ్వి, తేన్చి… "ఆహా, శ్రావ్యంగా వుందమ్మా" అన్నారట. ఎటూ వేటూరివారి మాట వచ్చింది కనక చెబుతున్నా. హింసించునది కాబట్టి హింసం అయి, అది సింహంగా రూపాంతరం చెందిందట. అలాగే తోక గలది తోకి. క్రమేపీ కోతిగా మారి స్థిరపడింది. ఇలాంటి శబ్దాల పుట్టుపూర్వోత్తరాలను వెలికితీసి సూత్రీకరించారు.
 

పల్లెటూళ్లలో సరదాలు, సరసాలు ఒకనాడు మానసిక వికాసానికి వినోదానికి ఉపయోగపడేవి. ఎంతటి కష్టాన్నైనా మరిపించి నవ్వించేవి. చతుర్లాడడం, మేలమాడడం నాడు పరిపాటి. ధనిక పేద, చిన్న పెద్ద తేడాలు పక్కనపెట్టి వరసలు కలిపి పిలుచుకోవడం ఒక సంప్రదాయం. అందులో ఒక ఆత్మీయత ఒక అభిమానం ధ్వనించేవి. ఉమ్మడి కుటుంబాలు అంతరించాక ఎన్నో పిలుపులు కొరవడ్డాయి. చిన్నాన్న, బాబాయ్, క్కక్కయ్య యీ మూడూ అర్థంలో ఒకటే. నాన్నని కొందరు బాబయ్య, కొందరు బాబు అని పిలవడం కద్దు. ఇప్పుడు డాడీ ఒక్కటే వినవస్తోంది. చిన్నమ్మ, పిన్ని, కక్కి యీ మూడూ అమ్మ చెల్లెలికి పిలుపులు. పెద్దమ్మ, ఆమ్మ, అమ్మక్క – యివి అమ్మ పెద తోబుట్టువు పిలుపులు. ఇప్పుడు అన్నిటికీ ఒకే మాట "కజిన్". బంగారి మామ పాటలో, "అవిశి పువ్వులు రెండు అందకున్నై నాకు తుంచి నా సిగలోన తురిమి పోదువు గాని రావోయి బంగారి మామ" ఈ బంగారి మామ పదాలను ఆస్వాదించాలంటే అవిశి పువ్వుల కథాకమామీషు తెలియాలి. తమలపాకు తీగెల్ని అవిశి చెట్లకు అల్లిస్తారు. అవిశి చాలా త్వరగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. తమలపాకు తోటలో రకరకాల పనులుంటాయి. పెరిగిన తీగెలకు అల్లు పెట్టడం, తయారైన ఆకుల్ని పదునైన ఇత్తడి గోళ్లు పెట్టుకుని గిల్లడం యివి పనితనంతో కూడిన పనులు. తమలపాకుల్లో కవిటాకు, లేతాకు, నౌజు యిలా దశల్ని బట్టి రకరకాలు. అవిశిపువ్వులు చిన్న చిన్న కొడవళ్లలా వొంపు తిరిగి తెల్లగా అందంగా వుంటాయి. తోటలో పని చేసే బంగారి మామని మరదలు అడుగుతోంది – అందని అవిశిపువ్వుల్ని తుంచి తన సిగలో తురవమని. ఈ తోటల వివరం తెలిస్తే గాని అవిశిపువ్వుల అంతరార్థం బోధపడదు. లేకుంటే అవిశిపూలు అసందర్భంగా తోస్తాయి.
 

జనపదాలు మరుగున పడ్డాక ఎన్నో సామెతల్ని అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. "ఈనగాచి నక్కలపాలు చేసినట్టు"… యిది సాధారణ సామెత. ఆవుని యీనే దాకా జాగ్రత్తగా కాపాడి, తర్వాత దూడని నక్కలపాలు చేశారని దీని అర్థం. ఈతకి వచ్చింది – యీ మాట పశువుకి పంట చేనుకి కూడా వర్తిస్తుంది. సామెతలు గ్రామీణ జన జీవితాల్లోంచి వచ్చాయి. సామెతలు జనపదాల్లో పుట్టి ప్రవహించిన పంట కాలవలు. "సాము గరిడీలు" అనే పెద్దన ప్రయోగం పదహారణాల జనపదం. కోడి పందాలు మన జానపద క్రీడ. కోడి పుంజుల్లో బెరస, నెమలి పేర్లతో పలుజాతులున్నాయి. కోడి పుంజుకి కాలు మధ్యన పొడవైన ఎముక వుంటుంది. దాన్ని "కాటా" అంటారు. కాటాకి కత్తి కడతారు. ఒడుపుగా అది పందెంలో అవతల పుంజుని కొట్టినపుడు కత్తి దెబ్బకి మెడ తెగిపడుతుంది. అట్లాగే ఎడ్ల పందాలు. ఇసక ప్రతిలో బరువు వేసిన బండిని అందులో లాగిస్తారు. దాన్ని "కావు" అంటారు. బరువైన బండని నేల మీద లాగించడం మరో రకం పందెం. ఎద్దు, గిత్త, కోడె వీటి మధ్య తేడా వుంది. కోడె దూడకి కోడెతనం రాగానే ముకుతాడు వేస్తారు. తర్వాత జతకలపడం ఒక పెద్ద పని. అంటే బండి లాగడం, నాగలి దున్నడం నేర్పుతారు. "కాడి బుజాన పడిందని" బాధ్యత తీసుకున్నప్పుడు వాడుతుంటారు. పెళ్లిలో నవదంపతుల బుజాన కాడి వుంచి, పాలు పోసే ఆచారం యిప్పటికీ కొన్ని చోట్ల వుంది.
 


జనపదంలో వెతకాలే గానీ లేని శిల్పం వుండదు. అద్భుతమైన ఉపమానాలుంటాయి. "మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన" అనే మాట ఎప్పటికైనా ఎక్కడైనా యిముడుతుంది. పూచిన తంగేడు, తామర తంపర, తామరాకుపై నీటి బొట్టు, అటుకులు చింతాకులు, పేలాలు బొండుమల్లెలు యిట్లా ప్రతిదానికీ వారి స్థాయిలో తగిన పోలికని ఎంచుకుంటారు. హనుమంతుడు రాముల వారిచ్చిన ఎర్రరాయి వుంగరాన్ని ఆనవాలుగా రొంటిన ధరించి లంకకి వెళ్తుంటే – "అగ్గెత్తుకెళ్తున్నట్లుంది" అని ఒక్క జానపదుడు మాత్రమే అనగలడు. లంకాదహనాన్ని ఎంత గొప్పగా స్ఫురింప చేశాడని ఆశ్చర్యం వేస్తుంది. "ఇంటెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా గుప్పెడు కాదు" ఇదొక పొడుపు కథ. ఒక పదునైన abstract వూహ. దీన్ని పొడుపు కథగా పొడుస్తారు. పొడుపు కథలో పొడుపు – విడుపు వుంటాయి. ఇంటి వెనుక ఇంగువ చెట్టంటే పొగ. ఎంత కోసినా గుప్పెడు కాదు! ఇలాంటి శిల్పనైపుణ్యం వున్నవి వందల సంఖ్యలో దొరుకుతాయి. "అనగనగనగా…" అంటూ కథల్ని సుద్దుల్ని ప్రారంభించి, శ్రద్ధగా వింటున్నదానికి సంకేతంగా "ఊఁ" కొట్టించుకుంటూ కథ నడిపే సంప్రదాయం నేడు కరువైంది. "తప్ప తాలు తారం కరుగు ఎన్ని పోతే" అంటాడు రైతు. ధాన్యంలో తప్పతాలు తూర్పాతలో కొట్టుకు పోతాయి. ఖాళీగోతం అవతల వేసి తూచడాన్ని తారం అంటారు. దాళా అంటే ఒక సిబ్బె బరువు. కూరగాయల తూకంలో అయితే, కొసరు మొగ్గు వుంటాయి. "నల్లపూసలో పచ్చపూస లేదు" అంటే చిన్న బంగారంకూడా లేదని. "ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు" అంటే ఎవరికీ పిడికెడు బిచ్చం వెయ్యడని. "ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడయేది" సంతకి అమ్మకానికొచ్చిన పశువుల మీద యీ విసురు సర్వసాధారణం.
 


"దొరవలె వున్నాడు భద్రాద్రి రాముడితడేనేమో చూడు" అనే తూము నరసింహదాసు కీర్తన చాలా ఠీవిగా వుంటుంది. దొర, దొరవారు, దొరసాని బ్రిటిష్ పాలనలో పుట్టిన మాటలు. మనవి రాచరికాలే గాని దొరతనాలు కావు. బడిలో పలకబలపం తియ్యకుండా కూచుంటే, అయ్యవారు – "ఏరా మన్నెదొరలా కూచున్నావ్.. తీ పలకతీ!" అనేవారు. మన్నెదొర మన్యం దొరలోంచి వచ్చిన మాట. అల్లూరి సీతారామరాజు పోరాడిన రంపచోడవరం ప్రాంతాన్ని మన్యం అంటారు. ఏజెన్సీ అన్నమాట. ఆనాడు అక్కడి దొరల గురించి, దర్పం గురించి బోలెడు కథలు ప్రచారంలో వుండేవి. అక్కడ నించి వాడుకలోకి వచ్చిన మాట ఈ మన్నెదొర. అయివేజు అంటే ఆదాయం. పంట మీద రావాల్సిన ఫలసాయం. కిస్తీ అంటే వాయిదా (ఇన్‌స్టాల్‌మెంటు). శిస్తు అంటే కౌలు డబ్బు. రెవిన్యూ శాఖకి పంటభూమికి చెల్లించే మొత్తాన్ని కూడా శిస్తు అంటారు. దీనికి నీటి తీరువా, మురికి నీటి పన్ను కలుస్తాయి. "సరికిసరి" అనే మాట కొంతకాలం పల్లెల్లో ఎక్కువ వినిపించేది. ఇది బార్టర్ పద్ధతిలో వాడతారు. ధాన్యానికి ఉప్పు సరికి సరి. నూకలకి రెండు సర్లు. అంటే మానెడుకి మానెడిస్తే సరికి సరి. రెండిస్తే రెండు సర్లు.వెచ్చాలికి ధాన్యం బియ్యం తీసుకోవడం, తిరిగి వాటిని సరుకులకి పరటా వేయడం కొంతకాలం క్రితం వరకూ పల్లెల్లో అమల్లో వుంది.
 


కోడు, కుంట, దొరువు యిప్పుడు వినిపించని మాటలు. ఇసక ప్రాంతాల్లో, చాలా పైనే నీళ్లుండే చోట దొరువులు తవ్వుతారు. వాటి చుట్టూ ఆకు కూరలు, కనకాంబరం మల్లె లాంటి పూల మొక్కలు తోటకి నీళు జల్లుతారు. కుంట అంటే మెట్ట ప్రాంతాల్లో పశువులు నీళ్లు తాగడానికి ఒక మూల పెద్ద గుంట తవ్వుతారు. ఇవి నారుమళ్లకి కూడా ఉపయోగపడతాయి. కొన్ని చోట్ల నారుమళ్లని ఆకుమళ్ళంటారు. ఇక కోడు అంటే వూర చెరువుని ఆనుకుని వుండే చిన్న చెరువు. టెయిలెండ్ రిజర్వాయర్ లాంటిది. వర్షాలతో చెరువు పొంగి పొర్లినపుడు, అదనపు నీటిని కోడు భరిస్తుంది. చెరువులో చేపలు సద్దుకి వూరి మీద పడకుండా కోడులోకి చేరతాయి. నీరు తీశాక తిరికి కోడు నీరు చెరువులోకి చేపలతో సహా వెళ్తాయి. నీటి పరిరక్షణ, పెత్తనం మీద ఆనాటి గ్రామీణ ప్రజానీకానికి గల పట్టు చాలా గట్టిది. కొన్ని మాటలు, భావజాలం అంతరించడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు అదే జరిగింది. విశాలమైన డొంకలు, వాటి మీద పచ్చగడ్డితోబాటు రకరకాల కలుపు మొక్కలు పెరిగేవి. వాటిలో ఔషద గుణాలన్న కలుపు వుండేది. పశువులు గడ్డితోపాటు వాటిని మేసినపుడు ఆరోగ్యాన్ని కాపాడేవి. పచ్చిగడ్డిని  కూడా పంటలా పెంచడం వచ్చాక, వాటికి కూడా రసాయనాలను వాడుతున్నారు. దీంతో మంచి చేసే కలుపు మొక్కలు పోతున్నాయి. ఈ భూమ్మీదికి ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపయోగంతోనే వచ్చిందని గ్రహించాలి. చిన్న చిన్న పురుగులు, సీతాకోక చిలకలు క్రిమిసంహారకాల వల్ల గణనీయంగా తగ్గిపోయాయి. దాని వల్ల పరపరాగ సంపర్కం క్షీణించి ముఖ్యంగా కూరగాయల దిగుమతులు పడిపోయాయని నిన్నమొన్నటి పరిశీలనలో వెల్లడైంది.
 


అక్షరాలకు కొమ్ములుంటాయి. పశువులకి కొమ్ములుంటాయి. అలాగే పసుపుకొమ్ము అల్లపుకొమ్ము శొంఠికొమ్ము వున్నాయి. పసుపు నేలలో వూరుతుంది. ఇది చేతి వేళ్లలాగా వూరుతుంది. వేళ్లులా విస్తరించిన వాటిని చిల్లలు అంటారు. చిన్న కుండ పెంకుని కూడా చిల్ల పెంకు అంటారు. భాష మారిపోయిందని కొందరు, మాయమైపోయిందని కొందరు ఆందోళన పడుతున్నారు. దొరలపాలనలో కంటె ప్రపంచీకరణ తరువాత భాషకి ఎక్కువ నష్టం కలిగింది. ఒక్క తెలుగే కాదు, చాలా స్థానిక భాషలకి యీ నష్టం జరిగింది. కారణం పరభాషా ప్రయోగం, దాని అవసరం. ఏది కూడు పెడుతుందో దానివైపు పరుగులు తీయడం నైజం కదా. అదే జరిగింది. చాలాకాలం క్రితం బతకడానికి రంగం వెళ్ళేవాళ్ళు. చదువు సంధ్యలతో పని లేదు. అక్కడ రకరకాల పనులు చేసుకు బతికేవారు. రంగూన్‌ని ఆ రోజుల్లో పల్లె ప్రజలు రంగం అనేవారు. తర్వాత కొయిటాం వచ్చింది. అంటే కువైట్. ఇప్పుడు ఎన్నో దేశాలు దగ్గరైపోయాయి. చాలా ఏళ్ల క్రితం ఒక పెద్ద మనిషి "ఎస్పిరాంటో" అని ఒక ప్రపంచభాషకి శ్రీకారం చుట్టాడు. కాని అది ఏమాత్రం వ్యాప్తిలోకి రాలేదు. తిండి అలవాట్ల నించి మారిపోయిన మాట నిజం. నగరంలో, కాంక్రీట్ జంగిల్‌లో వుండే కాకికి పుల్లలు దొరకవు. చెట్లుండవు. అందుకే అది సైకిల్‌స్పోక్స్‌ని, కరెంట్‌వైర్ ముక్కల్ని, సన్నటి తీగెల్ని ముక్కున కరుచుకు తెచ్చి, కరెంటు స్తంభం మీద గూడు కట్టుకోవడం మనం చూడొచ్చు. మన కోసం సంప్రదాయమా? సంఫ్రదాయం కోసం మనమా? తెలుగువాడి పంచె లాల్చీ వుత్తరీయం ఎక్కడ? తెలుగు తల్లుల జరీ చీరెల మెరుపులెక్కడ? తెలుగు పిల్లల పట్టుపావడాలు ఓణీలు ఎక్కడ? వీటి కోసం ఎంతని వెదుకుదాం ఎక్కడని వెతుకుతాం? కాలం కనిపించని ఒక మహా ప్రవాహం. అందులో మనమంతా బుడగలం.
 


(ఈ వ్యాసం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి, ఆగస్ట్ 2010 లో మొదలై పన్నెండు వారాల పాటు ప్రతీ గురువారం ప్రసారమైన "మన తెలుగు" ప్రసంగ వ్యాసపరంపరలో భాగం.)

About శ్రీరమణ

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి. ”మిథునం” కథకుడాయన.

కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి. శ్రీరమణ పేరడీల కర్త ఆయనే.

కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన. హాస్యజ్యోతి, గుత్తొంకాయకూర – మానవసంబంధాలు, శ్రీఛానెల్ ఆయన చలవే!

”బాల్యం చూసేవారికి బావుంటుంది. యవ్వనం అనుభవించే వారికి బావుంటుంది.” అని కన్ఫ్యూజన్ లేకుండా అనెయ్యగలరు, ”ఏ ప్రక్రియైనా ఒకే మూసలో వేసి తీసిన కజ్జికాయల్లా ఉండకూడదు. వేటికి అవి స్వేచ్చగా చేతితో వేసిన పకోడీల్లా ఉండాలంటాను.” అంటూ రుచిగా రచయితల వీపు చరచగలరు శ్రీరమణ.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారన్నట్టు మన పేర్లు చెప్పకుండా మన ఫోటోల నెగెటివ్ లని, మన రక్తమాంసాల వెనకున్న అసలు రూపాల్ని మనకే చూపించే గడసరి.

గచ్చు మీద కుప్పగా పోస్తే గుప్పెట నిండుగా గుండెకు హత్తుకోవాలనిపించే నీలపు గోళీల్లాంటి అక్షరాల ఆటలో నేర్పరి.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

32 Responses to జనపదం

  1. రవి – “అబ్బదు”, “గేరి” ఈ మాటలు విని ఎన్నిరోజులయ్యిందో…. 🙂 – కర్నూలులో 1992 ప్రాంతాల్లో తిరిగినప్పటి రోజులు గుర్తుకొచ్చినై…

    అంగీ రాయలసీమ ప్రాంతానిదే కాదనుకుంటా – తాతయ్య “ఆ కొక్కేనికి తగిలించిన అంగీ ఇలా పట్రారా” అనేవాడు…మావయ్య దగ్గరికొచ్చేటప్పటికి చొక్కా అయిపోయింది.. 🙂

  2. మా అమ్మమ్మ హైదరాబాదు వెళ్ళివచ్చినప్పుడు ఎలావుందని అడిగితే. అస్సులు కాకులేలేవురా అని సమాధానమిచ్చి, ఎప్పుడైనా ఎంగిలి చెత్తో కాకిని కొడితేగా అని అన్నది. ఒకే మాటతో హైదరాబాదులో కాకులు లేకపోవడాన్ని, అక్కడి జనాల పసినారితన్నాన్ని ఆవిష్కరించింది ఆవిడ. తరువాత నేను హైదరాబాదు వెళ్ళి, తిఱిగి వస్తానన్న నాళ్ళకి రాకపోయేసరికి, ఏంటి బాబిగాడు అక్కడే నిలవఁజేసాడు అని అడిగింది.
    ఇక మా నానమ్మ విషయానికి వస్తే, ఒక సారి వెనకటి మా బాబయ్యలకోసం సంబంధాలు వేదికే విషయాలు చెబుతూ, ఆ పిల్ల చాలా బాగుందిరా పొడిచే౨ పొద్దులాగా, కానీ కుటుంబంలో ఏదో జబ్బుంది అంది. నా ఆలోచన ఆ పొడిసే పొద్దు కాడ ఆగిపోయింది.
    ఈ రోజుల్లో జనాలకు పొద్దు అంటే ఉదయం అనే అర్థంలోనే వాడుతున్నారు. పొద్దు వాలడం, పొద్దు పొడవడం, పొద్దు గుంకడం, పొద్దు పోడవం, పొద్దు వుండడం, పొద్దు మండడం ఇలా పొద్దులు పలు రకాలని గుర్తించి వాడట్లేదు.

  3. రవి says:

    @రానారె: “అంగీ” అన్నమాట నా చిన్నతనంలో (అనంతపురం చుట్టుపక్కల) విరివిగా వినబడేది. ఎంచేతో 80 వ దశకం మధ్యలో మరుగయ్యింది. అలాంటివే గేరి (వీధి), అబ్బదు (కుదరదు), ఉడ్డ (గుంపు) వగైరా.

  4. చదవటానికి ప్రాణానికి హాయిగా ఉన్నదనే వంశిగారి వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.
    సంపాదకులకి ఒక సూచన – ఇదే విషయమ్మీద పొద్దు తొలిరోజుల్లో రానారె ఒకటి రెండు మంఛి వ్యాసాలు రాశాడు. వాటికి లంకెలు కూడా ఈ వ్యాసానికి కింద జతచేయమని మనవి.

  5. త్రివిక్రమ్ says:

    చక్కటి వ్యాసం, బావి లోతును మావైపు మట్లలో చెప్తారు (ఏ.వ.: మట్టు). ఉదా: ఐదు మట్ల బావి. పందెపు కోడి ప్రావీణ్యానికి ఆరె వేలు ఒక సూచిక. ఉరువు అనే మాటను చాకలి పద్దుల్లో తరచూ వింటూంటాను (ఐదు చొక్కాలు, ఐదు పంచెలు, ఐదు రుమాళ్ళు కలిపి పదైదు ఉరువులు :-)). అలాగే “ఉరువు లేదు/ఉరువు లేడు” అంటే ఆనవాలైనా లేదు అని అర్థం.

    అంగీ అనేది రాయలసీమ అంతటా వాడుకలో ఉన్న పదం కాదు. కడప, చిత్తూరు జిల్లాల్లో అసలు వినబడదు. అంగరఖా అనే ఉర్దూ(?) పదానికి అది క్లుప్తరూపం. తెలంగాణా వాడుక అనుకుంటా.

  6. bollojubaba says:

    శ్రీ రమణ గారి వ్యాసం లోని దాదాపు అన్ని పదాలు మా గోదావరి జిల్లాల పదసంపదతో సరిపోయాయి. అన్నీ ఒకనాడు విన్నా/చదివిన ప్రయోగాలే. భూషణ్ గారు వచ్చి మొత్తం వ్యాసాన్ని సీమ జిల్లాలకు హైజాక్ చేసి తీసుకుపోయారు. కామెంట్లలోని చాలా పదాలతో నాకు పరిచయం లేదు. 🙂

    బొల్లోజుబాబా

  7. తమ్మినేని యదుకుల భూషణ్ says:

    అచ్చ తెనుగు రూపాలు అన్ని చోట్లా ఒకేలా వాడుకలో ఉంటాయన్న నా వాదానికి బలం చేకూరుస్తుంది మీ ఉదాహరణ.
    అరువు గురించి మీరిచ్చిన ప్రయోగము చూసి నాకు చాలా ఆనందము కలిగింది, ఇదే కారణము వల్ల. తమిళ నాడు తెలుగులో అరువు సజీవంగా ఉంది , పాత అర్థంలో . సర్కారు జిల్లా పెద్ద రచయితలను అరువు గురించి అడిగితే వారు తెల్ల మొహం వేశారు.
    తెలుగు ఎమ్మే చదివిన వాడి కన్నా తిరిపెమెత్తుకు తిరిగేవాడి అచ్చ తెనుగు పరిజ్ఞానమెక్కువ అన్నది నాకు అనుభవంలోని
    విషయమే. నేను ప్రాచీన చైనీస్ నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు కొరకరాని కొయ్య లాంటి ఒక చైనీస్ పదం
    అడ్డగించింది . ఆ పదాన్ని అన్య భాషల వాళ్ళు అనువాదం చేయకుండా అలాగే వాడేసుకున్నారు. ఆ సందర్భంలో అరువు
    పనికి వచ్చింది. దాని గురించి ప్రత్యేక వ్యాసం రాస్తాను మరొక్క సారి.
    ఇంకొక విషయం , అంగడికి వెళ్లి నప్పుడు ఎన్ని వస్తువులు కావాలో చీటీ లో రాసుకొంటాము కదా..కొన్న తర్వాత
    అన్ని ఉరువులు ( number of items ) సరి పోయినాయా అని చూసుకొనే వారము.( ఇంటి కొచ్చాక కూడా
    అదే పని అమ్మో అక్కో చేసే వారు ) .ఉరువులు అన్నది ఎంత ఖచ్చితమైన పదమో గమనించారా ??

  8. మంచెని ఏమంటారా అని నేను చాలా నాళ్ళగా గుర్తుచేసుకోబ్రయత్నం చేస్తున్నాను. ఇన్నాళ్ళకు తెలిసింది. ధన్యవాదం.

  9. gaddeswarup says:

    చిన్నప్పుడు సముద్రస్నానాలకు పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒకపాటలో ‘బుడంకాయ ‘ ఉన్నట్లు గుర్తు. కాని ఎప్పుడూ తినలేదు.

  10. budugoy says:

    “దివ్య నామ” సంకీర్తన అంటే? ఏదైనా ప్రత్యేక వర్గీకరణా?

  11. sirish says:

    పేజీకి కుడివైపున, “ఈ ట్యాగు ఉన్న రచనలు” అనే శీర్షిక కింద ఉన్న లింకుల్లో ఆ వ్యాసాలు ఉన్నాయండి.

  12. budugoy says:

    అంగీ అన్న పదం తెలంగాణలో ఇప్పటికీ వాడతారు. అంగీ-లాగు (షర్టు-నిక్కరు) అన్న కాంబినేషనే ఇప్పటికి వాడతారు మా ఊరివాళ్ళ ఇళ్ళల్లో. చిన్నప్పుడు బాలమిత్రలూ, బాలజ్యోతుల్లో ఈ చొక్కా అన్న పదం చదివి “చొక్కా అంటే ఏమయ్యుంటుందో? అంగీయా? లాగూనా?” అన్నది నాకు చాన్నాళ్ళకు వీడిన సందేహం 🙂
    ఇక “అరయు” అన్నది బ్రౌణ్యంలో క్రియగా ఉన్నది. తెలంగాణలో వాడుకలో అరుసుకోవడమన్న ప్రయోగముంది. అతిథులను అవీ ఇవీ విచారించి వారికి కావలసిందల్లా చూసుకోవడమనే అర్థంలో వాడడం చూస్తాం. ఉదా:కి “ఎంద్రా మీ బావను అరుసుకుంటలేవు, ఈడ కొంచెం వడ్డించు” అని.
    ఇక మొన్న తూమునరసింహదాసు కృతి వింటుంటే భూషణ్ మీరు చెప్పిన ప్రయోగం కనిపించింది. http://www.andhrabharati.com/kIrtanalu/tUmu/tUmu101.html రెండో చరణం చూడండి.
    “పరమభక్తుల జేరి పరియాచకము జేసి, అరసి సద్గురు నెఱుగనైతి” అని. ఈయన గుంటూరు ప్రాంతం వారట మరి.

    ఇంత చక్కని వ్యాసం అందజేసిన వారికి నమోవాకాలు. పుస్తకంగా వస్తే బాగుంటుంది.

  13. అరసి, అరయన్, అరయగా .. ఇలాంటి వాడుకలు చాటు పద్యాల్లోనూ, కీర్తనల్లోనూ విచారించగా, పరిశోధించగా అనే అర్ధంలో కనబడుతుంటాయి. తూము నరసింహదాసుగారు రామదాసు సంకీర్తనలు, త్యాగయ్య దివ్యనామ సంకీర్తనల పద్ధతిలోనే గానం చేశారు, అంచేత ఆ సాంప్రదాయం నించి వాడి ఉండవచ్చు.

  14. తమ్మినేని యదుకుల భూషణ్ says:

    మీ ప్రయోగాలు బావున్నాయి. ఉరువే లేదు. ( అసలే లేదు అన్న అర్థంలో ; అసలు ఉర్దూ / పారశీక భవమన్నది తెలిసినదే ) అంగీ అంగరఖా నుండి వచ్చినదా ?? లేదా సంస్కృతం అంగి యా అన్నది కొంత ఆలోచించాలి. ఉర్దూ / పారశీకం నుండి వచ్చినదైతే కడప మాండలికంలో కూడా కనిపించాలి అని నా అభిప్రాయం.

  15. lalitha pochiraju says:

    అంగిడి, ధ్వని, లెస్సగా హాస్య మాడడం, నూకడం, ఏకం పెట్టడం…ఇవి కూడా రాయలసీమలో వాడతారు
    సకలం ముకలం అని పెళ్ళి పీటలకు అంటారు(సకలం ముకుళం నుంచీ వచ్చింది ఈ పదం)

  16. మరికొన్ని…

    “వురువులు” మాటని శాల్తీలకు పర్యాయంగా కూడా వాడతారు. దర్వాజాలు, కిటికీలు, అలమరలు యింటికి పెట్టేటప్పుడు వురువులెన్ని అంటారు. “ఐటమ్‌”కి సమానార్థకం. రైల్లోంచి సామాను దింపేటప్పుడు “వురువులన్నీ దిగాయా” అనేవాళ్లు. అప్పట్లో ట్రంకు పెట్టె, హోల్డాల్ లేదా బెడ్డింగ్, చేసంచీ, పేము బుట్ట, గొడుగు, మరచెంబు, పెద్ద టిఫిన్ క్యారేజీ ప్రయాణంలో విధిగా వుండేవి. “Less luggage more comfort” అనేది అప్పటి రైలు నినాదం.

    “అచ్చుకోవడం” కూడా యిప్పుడు వినిపించడం లేదు. “పెళ్లిలో మేళం ఖర్చు కూడా మనమే అచ్చుకోవాల్సి వచ్చింది” అంటే భరించడం. కాని చిన్న తేడా వుంది. కన్యాశుల్కంలో “ఆబోరు దక్కదు” అనే ప్రయోగం యిప్పుడసలు చాలామందికి తెలియదు. నేను దాఖలు చేసుకుంటాను అంటే యిస్తానని అర్థం. ఒక్కొక్క కల్చర్ పోయినపుడు దానికి సంబంధించిన జార్గాన్ తెరమరుగు అవుతుంది. కాలంతో బాటు పదాల అర్థాలు మారిపోవడం కూడా వుంది. “కుల్లాయుంచితి, కోక చుట్టితి…” అంటాడు శ్రీనాథుడు. కోక అంటే అప్పుడు వస్త్రమని అర్థం. ఇప్పుడు చీర అని అర్థమే స్థిర పడింది. నాడు సభికులంటే జూదగాళ్లని, కంపు అంటే పరిమళమనీ అర్థం. ఇది చాలా విస్తృతమైన టాపిక్. ఆస్ట్రేలియాలో వేటకి వాడే పరికరాన్ని బూమరాంగ్ అంటారు. ఇక్కడ మన ఆదివాసిలు “దోదమ్మి” అంటారు. మల్లాది రామకృష్ణశాస్త్రి యీ పేరుతో ఓ కథ రాశారు. ఆ కథ వున్న సంపుటికి అదే పేరు పెట్టారు. బూమరాంగ్‌ని విసిరితే, పరిగెత్తే జంతువుని కొట్టి, తిరిగి వెనక్కివస్తుంది. ఎయిరోడైనమిక్స్‌‍కి అనుగుణంగా తేలికగా వుండే ఒక కొయ్యతో దీన్ని వేటగాళ్లే తయారు చేసుకుంటారు.

    మర వచ్చింది. దంపుళ్లు పోయాయి. బోలెడు దంపుళ్ల పాటలు (జానపదాలు) పోయాయి. రోకళ్లు, రోళ్లు, కుంది యిప్పుడు లేవు. రోకలి చివర ఇనప కడియం వుంటుంది. దాన్ని పొన్ను అంటారు. గొప్పవాళ్లు చేతి కర్రకి కూడా వెండి పొన్ను వేయించుకునేవారు. మండువా లోగిలిలో స్తంభాలకు ఇత్తడి పొన్నులు నాటి విశేష అలంకారం. కల్యాణ సుందరి జగన్నాథ్ గారి సుప్రసిద్ధ కథ “అలరాస పుట్టిళ్లు”. దీని ఇతివృత్తానికి దంపుళ్ల పాట మూలమని మా గురువు గారు డా. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి చెప్పేవారు. ఆయన వూరూరు తిరిగి చాలా జానపదాలు సేకరించారు. జానపదాలు నాల్కల మీద నర్తిస్తాయే గాని అచ్చులో దొరకవు. డా. బిరుదరాజు రామరాజు ఎంతో కృషి చేశారు. ఇక్కడ నూతలపాటి గంగాధరం గారిని కూడా సంస్మరించుకోవాలి. “అంతా హుళక్కి” అంటే ఏమీ లేదని అర్థం. మన ప్రాచీన సాహిత్యానికి, గత శతాబ్దిలో వచ్చిన ఆధునిక రచనలకు కూడా టీకా టిప్పణి ఎవరైనా రాయాలి. లేకుంటే ముందు తరాలకి చాలా మాటలు ఫ్రెంచ్ అండ్ లాటిన్ అయ్యే ప్రమాదం వుంది.

    ~ శ్రీరమణ

  17. సత్యం says:

    చాలా బావుందండీ! కృతఙ్ఞతలు. ఈ పాత పదాలతో నా బాల్యాన్ని గుర్తుచేసినందుకు ఒకింత సంతోషంగా వున్నా, ఈ పదాలన్నీ ఇక లేవు అనే విషయం గుండెల్ని బరువెక్కించింది.
    ‘మన కోసం బాషా లేక బాష కోసం మనమా?’ అని నన్ను నేను ఓదార్చు కోవలసి వచ్చింది!

    అన్నట్లు, నే నెప్పుడూ “ఎంగిలి చెత్తో కాకిని తోలదు” లేదా ‘తోలడు’ అనే విన్నాను. ‘కోడితేగా’ అనేది కొద్దిగా వింతగా అనిపించింది.

Comments are closed.