సృష్టి ప్రతిపాదనలు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఈజిప్ట్ నాగరికతలో ఒక ఆదిదేవత వమనంనుంచీ, లాలాజలంనుంచీ లోకం సృష్టి అవుతుంది. ఆఫ్రికాలోని బకూబా ధోరణి ప్రకారం మొదట్లో అంధకారంతో జలమయంగా ఉన్న లోకాన్ని ఊహించారు. ఒక పెద్దరాక్షసుడు తన కడుపునొప్పి కారణంగా సూర్యచంద్రులనూ, నక్షత్రాలనూ వమనం చేసుకున్నాడట.

మానవుల సామాజికజీవితం నిరక్షరాస్యదశలో మొదలైనటువంటిది. ఇప్పుడు మనకది అజ్ఞానంతో కూడుకున్నదిగా అనిపించవచ్చుగాని తమ జీవితాలకు అవసరమైన వ్యవహారిక ప్రపంచజ్ఞానాన్ని పొందటానికి అప్పటివారికి చదువు రాకపోవటం ఏమీ ప్రతిబంధకం అనిపించి ఉండదు. లిపీ, పుస్తకాలూ వగైరాలేవీ సృష్టికాని ఆ దశలోని పరిస్థితులే వేరు. 50ఏళ్ళ కిందటి ఆఫీసుల్లో కంప్యూటర్లు లేకపోవడం ప్రతిబంధకం అనిపించనట్టే ఆనాటి ప్రజలు ప్రకృతిని గమనించి, పెద్దవారినుంచి విషయాలు నేర్చుకుంటూ జీవితపు సమస్యలను ఎదుర్కునే ప్రయత్నం చేశారు. మనకన్నా ప్రకృతికి సన్నిహితంగా ఉండిన వారి జీవితాల్లో జంతువులకు భిన్నమైన పద్ధతిలో మానవనైజం అనేదొకటి ఏర్పడటానికి ముఖ్యకారణం వారి మేధోపరిణామమే.

పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మనుగడను కొనసాగించేందుకు మనుషులకు పనికొచ్చినవి వారి ఆలోచనలే. మెదడు ముందుభాగంలోని లలాటికలంబిక ముందాలోచనకూ, ఊహాశక్తికీ ఆధారం. తక్కిన నరవానరజాతులలో కనబడనంత అభివృద్ధి మనుషులకు ఈ భాగంలో జరిగింది. దీని పనితనం నానాటికీ పెరుగుతూపోయింది. ప్రకృతిలో నిత్యమూ పునరావృతం అయే పేటర్న్‌లను కనిపెట్టడం ఇందులో ముఖ్యంగా ఉండేది. ఇటువంటి ఊహాశక్తి మనుషులకు చాలా లాభించింది. ఊహలూ, కల్పనలూ, భావనలూ లేకుండా అప్పటి మానవసముదాయాలు రోజువారీ కష్టాలను ఎదుర్కోగలిగి ఉండేవికావు. ఎటొచ్చీ ఊహాశక్తి అనేది రెండంచుల కత్తివంటిది. చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందులో ఏదైనా క్రూరమృగం పొంచి ఉందేమోనన్న అనుమానం మనుషుల ప్రాణాలు కాపాడే ఉంటుందిగాని ఆ గుహలోనే, కంటికి కనబడని అతీతశక్తులేవో కూడా ఉండవచ్చనే సందేహం అపోహలకే దారితీస్తుంది. ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉండవు.
నిత్యావసరాలైన ఆకలిదప్పులూ, తలదాచుకునే చోటూ, ప్రాణభయమూ మొదలైన ఈతి బాధలుకాక, దీర్ఘకాలిక పద్ధతిలో తమకూ, తమసాటివారికీ పనికొచ్చే తాత్వికచింతనకూడా తొలి మానవసముదాయాల్లో మొదలయింది. సృష్టిని గురించిన జిజ్ఞాసకూడా అందులోని భాగమే. చేతులతో పనిచెయ్యడం జంతువులకు సాధ్యంకాదు. మనుషుల కార్యాచరణ గిజిగాడు గూడు కట్టినట్టుగా జరగదు. పనులవెనక ఉద్దేశాలూ, ఆలోచనలూ ఉండితీరుతాయి. తమ చేతులతో పని చెయ్యడం, ఆ పని తాలూకు ఫలితాలూ మనుషులకు కొట్టవచ్చినట్టుగా తెలుస్తూ ఉండేవి. చిన్న జంతువులను పట్టుకోవటానికి ఉచ్చులు బిగించినా, ఒక రాతిగదనో, వాడిములికిగల బాణాన్నో తయారుచేసినా ఆ పనులయొక్క కార్యకారణసంబంధం వారికి స్పష్టంగా గోచరించేది.

ఎవరైనా మట్టి పిసికి కుండను తయారుచేస్తే తప్ప దానంతట అది తయారవదు. మరి మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎలా తయారయింది? కొండలనిగాని, చెట్లనిగాని, జంతువులనిగాని, మనుషులనిగాని ఎవరు తయారుచేస్తున్నారు? అలాంటిదేదీ కనబడదే? ఎవరో తయారుచేస్తే తప్ప ఏదీ దానంతట అదే తయారుకాజాలదనే గట్టినమ్మకం మనుషులకు ఆటవికదశలో ఏర్పడి, ఇప్పటికీ భావజాలంగా కొనసాగుతోంది. సృష్టికర్తను ఊహించుకోకుండా ప్రపంచపు ఉనికిని చాలామంది ఈ నాటికీ గుర్తించలేకపోవటానికి కారణం అదే. అణువుల్లోనూ, జీవకణాల్లోనూ తలెత్తే భౌతిక, రసాయనిక ప్రక్రియలను వివరిస్తున్నప్పుడుకూడా “దాన్నే మనవాళ్ళు భగవంతుడని భావించారు” అంటూ చటుక్కున అడ్డొచ్చేవారు చాలామంది కనిపిస్తారు. కర్తృత్వం (లేదా ఎవడో ఒక సృష్టికర్త) లేకుండా ఏదీ జరగదనే నమ్మకమే అందుకు కారణం. ఇదొక ఆదిమభావన అనీ, అనుభవంద్వారా రూపొంది నటువంటి సహజమైన అపోహ అనీ వారు ఒప్పుకోరు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి.

లోకసృష్టిని గురించిన తొలి తాత్వికభావనలు చాలా ప్రాచీనమైనవి. ఇవి ప్రపంచంలో ప్రతిచోటా పుట్టుకొచ్చాయి. స్థానిక నాగరికతలనుబట్టి వివిధప్రతిపాదనలు వివిధప్రాంతాల్లో వ్యాప్తి చెందాయి. బేబిలోనియాలో ఒకానొక సముద్రదేవత దేవగణాలపై సాగించిన కుట్రను భగ్నం చేసేందుకని మార్దుక్ అనేవాణ్ణి సృష్టించినట్టుగా నమ్మకం ఉండేది. అందుకు ప్రతిఫలంగా మార్దుక్ తనకు అంతులేని శక్తులు ప్రసాదించమని కోరుకుంటాడు. ఆ తరవాత అతని ఆధ్వర్యంలో జరగవలసినవన్నీ జరుగుతాయి. ఈజిప్ట్ నాగరికతలో ఒక ఆదిదేవత వమనంనుంచీ, లాలాజలంనుంచీ లోకం సృష్టి అవుతుంది. ఆఫ్రికాలోని బకూబా ధోరణి ప్రకారం మొదట్లో అంధకారంతో జలమయంగా ఉన్న లోకాన్ని ఊహించారు. ఒక పెద్దరాక్షసుడు తన కడుపునొప్పి కారణంగా సూర్యచంద్రులనూ, నక్షత్రాలనూ వమనం చేసుకున్నాడట. వాటి వేడిమివల్ల తేమ అంతా ఇగిరిపోయిందట. మరొకసారి వాంతి చేసుకున్నాక ప్రపంచమూ, స్త్రీ పురుషులూ, జంతువులూ అంతా ఉద్భవించారట.

ఆఫ్రికాలోనిదే అయిన మాసాయి తాత్వికచింతనలో ప్రపంచం తొలిసారిగా ఒక చెట్టుబోదె నుంచి రూపొందింది. ఆసియా సంస్కృతుల్లో ఎక్కువగా తొలి ప్రపంచాన్ని జలమయంగా భావించారు. కొందరు చీకటితోనో, రూపరహితంగానో, ఒక అండం, లేదా బీజరూపంలోనో విశ్వం మొదలయిందని నమ్మారు. ఫిన్లండ్ ప్రజలు ఒక ఆదిమపక్షి గుడ్డునుంచి లోకమంతా బైటికొచ్చిందని అనుకున్నారు. నార్వేవారు ఉత్తరాన ఉన్న మంచుకూ, దక్షిణాన ఉన్న నిప్పుకూమధ్య తలెత్తిన ప్రక్రియలే సృష్టికి కారణమని భావించారు. తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా పెంపొందిన అమెరికా ఆదిమతెగల్లో సృష్టిని గురించిన భావనల్లో సర్పాల పరికిణీవంటిది ధరించిన ఆదిమాత ప్రస్తావన కనిపిస్తుంది. కొన్ని తెగల్లో పురుష అంశ కలిగిన ఆకాశానికీ, స్త్రీ అంశ కలిగిన భూమికీమధ్య సంపర్కం మొదలయిందనే నమ్మకం ఉండేది.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి. ఈ రోజుల్లో ఒక్క మాత్రతో నయంచెయ్యగలిగే రోగాల చికిత్సకు ఏ పంతొమ్మిదో శతాబ్దంలోనో మేటివైద్యులు ఎంతో కష్ట పడేవారని మనం గుర్తించినట్టే ఏ యుగానికా యుగంలో ప్రజలు తమకు అర్థమైనంతమేరకు లోకంలో తమకు కనబడుతున్న, కనబడనటువంటి వింతలకు వివరణలిచ్చే ప్రయత్నాలు చేశారనేది మరిచి పోకూడదు. అంతమాత్రాన ప్రాచీనసంస్కృతిని గౌరవించడానికి ప్రతి పురాతన తత్వధోరణినీ నెత్తిన పెట్టుకోనవసరంలేదు. అటువంటివాటి చారిత్రక, సామాజిక నేపథ్యాలను అర్థం చేసుకోవాలి.

జుడాయిజం, జొరాస్ట్రియన్, క్రైస్తవ, ఇస్లాం మతాలన్నీ ఆవిర్భవించినది తొలి నాగరికతలకు పుట్టినిల్లయిన పశ్చిమాసియాలోనే. అందుకే వాటి మూలాల్లో కొంత సామ్యం కనిపిస్తుంది. తొలిసారిగా పర్వతమెక్కి పది ఈశ్వరాజ్ఞలని సంపాదించుకొచ్చిన మోసెస్ తన తెగలలోని ప్రజలు సాగిస్తున్న విగ్రహారాధనను ఈసడించుకున్నాడు. బంగారు లేగదూడవంటివాటిని ఆరాధించే సంస్కృతి అప్పట్లో ఉండేది. అలాకాకుండా అగ్నినో, రూపరహితుడైన ఒక ఈశ్వరుణ్ణో ఆరాధించాలనే వైఖరి మొదల యింది. తొలి ఆరాధన అంతా చెట్లకూ, జంతువుల విగ్రహాలకూ జరిగేది. ఇటువంటి ఆదిమభావనల స్థానంలో కొంత ఉన్నతమైన తాత్వికచింతన ప్రతి ప్రాంతంలోనూ తలెత్తడానికి ఒక కారణం ఒక్కొక్క తెగలోనూ ఒక్కొక్క బొమ్మను పూజిస్తూ ఇతర తెగలతో కయ్యాలకు దిగడమే. అందరికీ వర్తించే తాత్వికధోరణులను ప్రతిపాదిస్తున్నప్పుడు కొంత నైరూప్యభావనలు చోటుచేసుకోలేక తప్పలేదు.

బేబిలోనియాలో క్రీ.పూ. 2000 ప్రాంతాల్లోనే వ్యాప్తిలో ఉన్న మతభావనలు అప్పటికే ఎన్ని వేల సంవత్సరాలనుంచీ కొనసాగుతూ వచ్చాయో తెలియదు. ఇవన్నీ తరవాత రూపొందినటువంటి మతాల్లో భాగాలైపోయాయి. వీటిని ప్రశ్నించ సాహసించినవారిని సవాలు చేసేందుకు వీటి ప్రాచీనతనే కారణంగా చూపుతారు. ప్రాచీనకాలం అనేది జ్ఞానసంపద పరిపక్వం కానటువంటి దశ అని వారు ఒప్పుకోరు. ప్రాచీనయుగాల్లో దేవుళ్ళూ, దేవతలూ మనుషులతో సంభాషిస్తూ, వారితో ఎక్కువ సంబంధబాంధవ్యాలు నెరిపేవారనే భావన గ్రీక్ పురాణాల్లోకూడా కనిపిస్తుంది. అవన్నీ ఎప్పుడు మొదలై, ఎప్పుడు నిలిచిపోయాయో ఎవరూ చెప్పరు. మనుషులు ఆటవిక, అనాగరిక, బర్బరదశలన్నీ దాటి ముందుకు వచ్చారని ఆమోదించేవారు మధ్యలో ఈ స్వర్ణయుగం ఎప్పుడొచ్చి అంతమయిందో వివరించరు.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.