డిటో, డిటో

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/)

మన చిన్నపుడు
మనల్ని రాక్షసులు చెర పట్టారు
చేతులు కడిగీ మూతులు తుడిచీ
తలంటి స్నానాలు చేయించీ హింసలు పెట్టేరు
రాత్రిళ్ళు వెన్నెట్లో వెలిసిన కొమ్మల వెర్రి నాట్యాలు
చూసి జడుసుకొమ్మని వదిలేసారు
గడియారాల టిక్కుటిక్కుల్లో
భూమి సంతానాన్ని నమిలి మింగే చప్పుళ్ళు
మెలుకువొచ్చిన పీడకలల్లో వినమని శాసించారు

పగటి వేళల్లో మనం పంచదార నవ్వులూ
చేగోడీల వుంగరాలు తొడుక్కున్న వేళ్ళతో
చెమ్మచెక్క లాడుకున్నాం
జేబుల్లోని గచ్చకాయలూ గోళీలూ బొంగరాల తాళ్ళూ
చరాస్తులుగా మనం వ్యాపారాలు చేసాం
మేజాల కింద బూజూ మంచాల కింద నవారు నేతా
మనకి సుపరిచితాలు
చీమలూ చిట్టి పురుగులూ పిల్లిపిల్లల మీద
మనం జులుం చెలాయించాం
గులక రాళ్ళతో ప్రహరీ గోడలు కట్టి
యిసకలో పుల్లలతో గీసిన రాజభవనాలని
మనం రక్షించుకున్నాం
వొంటి కంటితో మనం వొక్క గడ్డిపరక
పచ్చదనాన్ని పరిశోధించాం

మామిడిపళ్ళ రసంలో పొగడపూల వాసనలో
నూతినీళ్ళ చల్లదనంలో
మధ్యాహ్నాల వేడిలో
పెద్దలందరూ నిద్దర్లోయే వేళల్లో
వేసంగి సెలవుల స్వర్గం మనని తాకింది

అదంతా మనకి కాలం తెలియని కాలం
యిపుడు వేరు, నేర్చుకున్నాం కద.
అంచేతే మన పిల్లలకీ అదే నేర్పుదాం.

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/)

“అప్పుడప్పుడూ కవిత్వం, అనుకోకుండా నవలలు రాసే” (I am an occasional poet, accidental writer) లలితాముఖర్జీ నిశీథిసంగీతం, నిద్రపోని పాట అనే కవితాసంపుటాలు, పారిపోయిన వసంతం, అగ్నిపంజరం అనే నవలలు వెలువరించారు. ఇరవయ్యేళ్ల క్రితం, స్వీయ కవితాసంపుటి ‘నిద్రపోని పాట’కి ముందుమాటలో “కవిత్వానికి యీ రోజుల్లో చలామణీ అవుతున్న అనేక ఇజాల్లో నాది కేవలం రౌద్రిజం మాత్రమే” అని రాసుకున్నారు లలితా ముఖర్జీ. “ఒక విశుధ్ధ చిత్తవృత్తినుండి వెలువడిన కవితలు” అన్నారు శ్రీ శ్రీ ‘నిశీథిసంగీతం’కి ప్రివ్యూ వ్రాస్తూ. “అనుభూతి సాంద్రత గుండెలో ఇమడలేనప్పుడు విస్ఫోటిస్తుంది; ఓసారి ముకుళంలా –ఓసారి జ్వాలా గర్భశిఖరంలా. రౌద్రి కవితాశీలమూ ఇదే అనుకుంటాను. ‘నిద్రపోని పాట’ అనే శీర్షిక ఈ విస్ఫోటన గుణానికి ప్రతీక” అన్నారు సినారె ‘నిద్రపోని పాట’కు రాసిన ముందుమాటలో. తన చివరి కవితాసంపుటి 1987లో వెలువరించిన లలిత గారు గత సంవత్సరం బ్లాగడం మొదలుపెట్టినప్పట్నుంచి క్రమం తప్పకుండా రాస్తున్నారు. తెలుగులో రౌద్రి, ఆంగ్లంలో lalitalarking వీరి బ్లాగులు. గళ్లనుడికట్లంటే వీరికి విపరీతమైన ఆసక్తి.

About లలితా ముఖర్జీ

"అప్పుడప్పుడూ కవిత్వం, అనుకోకుండా నవలలు రాసే" (I am an occasional poet, accidental writer) లలితాముఖర్జీ నిశీథిసంగీతం, నిద్రపోని పాట అనే కవితాసంపుటాలు, పారిపోయిన వసంతం, అగ్నిపంజరం అనే నవలలు వెలువరించారు. ఇరవయ్యేళ్ల క్రితం, స్వీయ కవితాసంపుటి 'నిద్రపోని పాట'కి ముందుమాటలో "కవిత్వానికి యీ రోజుల్లో చలామణీ అవుతున్న అనేక ఇజాల్లో నాది కేవలం రౌద్రిజం మాత్రమే" అని రాసుకున్నారు లలితా ముఖర్జీ. "ఒక విశుధ్ధ చిత్తవృత్తినుండి వెలువడిన కవితలు" అన్నారు శ్రీ శ్రీ 'నిశీథిసంగీతం'కి ప్రివ్యూ వ్రాస్తూ. "అనుభూతి సాంద్రత గుండెలో ఇమడలేనప్పుడు విస్ఫోటిస్తుంది; ఓసారి ముకుళంలా --ఓసారి జ్వాలా గర్భశిఖరంలా. రౌద్రి కవితాశీలమూ ఇదే అనుకుంటాను. 'నిద్రపోని పాట' అనే శీర్షిక ఈ విస్ఫోటన గుణానికి ప్రతీక" అన్నారు సినారె 'నిద్రపోని పాట'కు రాసిన ముందుమాటలో. తన చివరి కవితాసంపుటి 1987లో వెలువరించిన లలిత గారు గత సంవత్సరం బ్లాగడం మొదలుపెట్టినప్పట్నుంచి క్రమం తప్పకుండా రాస్తున్నారు. తెలుగులో రౌద్రి, ఆంగ్లంలో lalitalarking వీరి బ్లాగులు. గళ్లనుడికట్లంటే వీరికి విపరీతమైన ఆసక్తి.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

One Response to డిటో, డిటో

  1. phani says:

    adbhutham!! wonderful ma!

Comments are closed.