చైత్రము కవితాంజలి -3

స్వాతికుమారి (పొద్దు): కొన్ని కవితలు చదివినవారి మీద తమ గుర్తును ముద్రిస్తాయి. కొందరు కవులు ఎందరికో కవిత్వం మీద ప్రేమ కలిగిస్తారు. అటివంటి స్ఫూర్తిని నింపిన చిరకాలం గుర్తిండిపోయిన కవి/కవిత గురించి మనలోమనం పంచుకుంటే బావుంటుంది కదా! మీకు నచ్చిన కవిత్వం గురించి కొన్ని మాటలు చెప్పండిక్కడ

—————————-

"ఆకులో ఆకాశాన్ని
ఆకాశంలో అడవుల్నీ
చూడలేని వాడు,
మనిషిలోని మహత్తరమైన
అటవీ ఆకాశ సంపదల్ని చూడలేడు."

 


కె. శివారెడ్డి గారి కవితలోని ఈ భాగంతో పాటూ, మరొక చోట అతనన్న: " వాడికి కుక్కపిల్ల కుక్కపిల్లే, కానీ నాకు అనంత జీవన ఆర్తనాదం"
కూడా నాకు బాగా ఇష్టం. -గరిమెళ్ళ నారాయణ

——————————

 

మనుషుల బజార్లు తరిమేస్తే
నిశ్శబ్దం కొండల్లోకి పారిపోతుంది..
కాలం నీళ్ళలా వేళ్ళ నించి కారిపోతుంది
రుతువులు సాలేపురుగుల్లా కళ్ళ లోయల్లో గీత లల్లుతున్నాయి
కొండల నిశ్శబ్దాన్ని బొట్టు బొట్టుగా చప్పరిస్తున్నప్పుడు
చప్పుడు చేసే నా గుండెను కూడా క్షమించలేను..

 

అక్షరం అక్షరం లో కవిత్వం తొనికిస లాడే గుంటూరు శేషేంద్ర గారిదిది …

-పెరుగు.రామకృష్ణ

——————————-

పెరుగు రామకృష్ణ గారు మెచ్చిన శేషేన్ పద్యం చాల బాగుంది. అయితే, నాదొక ప్రశ్న. రూపకాలు కవి కష్టపడి సంపాదించినట్టు కనిపించడం లేదా? కవి బాగా చెప్పాడు గాని, ఇట్టా జరగదు అని అనిపించడం లేదా? ప్రాణం కన్న నిర్మాణం, ఆవేశం కన్న ఆలోచన… ఎక్కువగా కనిపించడం లేదూ? ఇది కేవలం నాకు అనిపిస్తున్నదేనా?

-హెచ్చార్కే
————————————-
నాకు బాగా నచ్చిన కవితల్లో ఒకటి ఘంటసాల నిర్మలగారి జుగల్బందీ. నింపాదిగా చదివుకోవాల్సిన కవిత. ఈ కవిత గురించి చెప్పడానికి మాటలేం లేవు!

జుగల్ బందీ (ఘంటసాల నిర్మల)
———————

రాత్రి దీపం రహిస్తుంది
మసక చీకటి మంత్రభస్మమై కలల పొగలు పొటమరిస్తాయి
ఏకంతధ్వాంతాన మొహమాటాల మొగ్గలు విప్పారి
స్వాగత సౌరభాలు ఎరుపుకొసల అగరుతీగలౌతాయి
పగలంతా సమస్యల పచ్చి గాయాలు రేగి దిగులు స్రవించిన కళ్ళు
నిశాలేపనం పులుముకుని లేవెన్నెల బయళ్ళవుతాయి
దైనిక మర్యాదల నిర్జల ధారలలో
తడిసి మోపెడైన సభ్యతావస్త్రాలు విదిల్చి
వాంఛాస్నానానికి ఉద్యమించి
ఆత్మలు రెండు
నిలువెత్తు నిస్సిగ్గుకి నిర్వచనభంగిమలౌతాయి
………….

దేహం మహతిపై స్పర్శాపవనాలు తరగలెత్తి
మగత నవ్వుల నిక్వాణాలతో మోహం మేఘమల్హారమౌతుంది
చీకటి నదిలో అనాది కాంక్షాకిరణం సోకి
విప్పారిన ఇరుకల్హారాలు పరవశాల పరిమళాలు పైకెగరేస్తాయి
వాంఛోధృతికి వణికిపడే ఒళ్ళూ
రహస్యాల్ని వడికే వేళ్ళూ
ఎప్పటికీ తెగని చిక్కుముడిని విప్పేందుకు పలకాబలపాలవుతాయి
ఊరువులూ నిట్టూరుపులూ
మానసాన్ని మాధుర్యమండలానికి మోసుకెళ్ళే పూలతాళ్ళవుతాయి
పరస్పర గాత్రసహకారంతో
జుగల్ బందీ తారాస్థాయిని చేరుతుంది
నెత్తురంతా నిషా పొంగి
అగాధ రహస్యాలు చెరిసగమై ఆవిష్కరించాక
చెమరించిన నొసట తృప్తి వజ్రం తళుకుమంటుంది
……….

డోలిక ఆగక తప్పదు
ఇంతా జరిగి పోయాక హాయి వూయల ఆగక తప్పదు
చాలీ చాలని సుఖం దుప్పటి బాహ్యాంతర నగ్నతను పూర్తిగా కప్పదు
హఠాత్తుగా పూచిన పరిమళాలు అంతలోనే ఆవిరవుతాయి
ఒడుపు తెలీక చేజార్చిన కలల పట్టు దారాల కోసం
కళ్ళు వెక్కిళ్ళు పెడతాయి
రూపాల్నీ లోపాలనీ సుతారం చేసి చూపిన
వెన్నెల వెండి అద్దం వెల వెల పోతుంది
యదార్థాల యాంటీక్లయిమాక్స్ ఎప్పటిలా ఎదురొస్తుంది
సమస్యలు రేగిన వ్రణాల్లా సలపరిస్తాయి
నిజాలు నిప్పుకణాల్లాగే నిగారిస్తాయి
ప్రశ్నల పునర్జ్వలనంతో అంతరాత్మల కమురుకంపుకు
అగరు కొసన వేలాడే బూడిద తీగ ఆఖరి ప్రేక్షక నేత్రమౌతుంది
క్షణం క్రితం గర్వపడ్డ హృదయం గాయమై పగులుతుంది
మాధుర్య మాణిక్యమై భాసించింది మట్టిముద్దయి మిగులుతుంది

నల్లని చల్లని రాత్రి గచ్చు మీద
తొలికిరణం తురాయి ముల్లయి గుచ్చుతుంది

-భైరవభట్ల కామేశ్వర్రావు

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.