ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 1

అట్ట

అట్ట

1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు మద్రాసులో చందమామ, యువ, ఆంధ్రజ్యోతి అనే పత్రికలను నడిపారు. ఇవన్నీ నాగిరెడ్డిగారు నడిపే బి.ఎన్.కె.ప్రెస్‌లో అచ్చయేవి. చక్రపాణిగారు ప్రెస్ పనిమీద మాటిమాటికీ తల్లిలేని తన ఇద్దరు కొడుకులతో తెనాలినుంచి మద్రాసుకి రావలసిరావడమెందుకని నాగిరెడ్డిగారి భార్య ఆయనను తమ ఇంటి మేడమీదనే ఉండమని ఆహ్వానించడం. ఆ కుర్రవాళ్ళ బాధ్యత తీసుకోవడం మొదలైన విషయాలు ఇతర సందర్భాల్లో మనకు తెలిశాయి.

నా దగ్గరున్న అరుదైన పాత పుస్తకాల్లో ఏప్రిల్ 1950నాటి ఆంధ్రజ్యోతి సంచిక ఒకటి పూర్తిగా దొరికింది. దాన్ని ఈ తరం పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో పూర్తిగా స్కాన్‌చేసి సమర్పిస్తున్నాను. యువ అనే పత్రికను మొదటగా తెనాలినుంచి నడిపినది మానాన్నే. అది ఆగిపోవడంతో ఆయన అనుమతితో చక్రపాణి అదే పేరును మళ్ళీ వాడుకున్నాడు. అయితే ఇదీ కొన్నాళ్ళకు ఆగిపోయి, ఆ తరవాత మరొక అవతారమెత్తింది.

1          2

ఈ సంచికలో మా నాన్న కుటుంబరావుగారి రచన ఒకటీ, మా అమ్మకు పెదనాన్న చలంగారి నాటిక ఒకటీ, ఆయన పెద్ద కుమార్తె సౌరిస్ రచన ఒకటీ ఉన్నాయి. వీరంతా చక్రపాణిగారికి పాత తెనాలి స్నేహితులనేది చెప్పాలి.

ఈ సంచికలో నేను గమనించిన కొన్ని విశేషాలున్నాయి. ఒక చిత్రానికి భావపరిచయపోటీ పెట్టడం. ఇది బెంగాలీ పత్రికలనుంచి చక్రపాణిగారు అలవరుచుకున్న సంగతేమో తెలియదుగాని చందమామలో ఫోటోవ్యాఖ్యల పోటీ, యువ మాసపత్రికను 1961 నుంచి మరొకసారి హైదరాబాద్‌ నుంచి ప్రచురించడం మొదలెట్టాక దాని ముఖచిత్రానికి వ్యాఖ్యల పోటీవంటివన్నీ ఇదే ధోరణిని సూచిస్తాయి.

ఈ సంచికలో ముఖచిత్రమూ. లోపలి ఇలస్ట్రేషన్లూ, కార్టూన్లూ అన్నీ

వెనక అట్ట

వెనక అట్ట

వేసినది కేశవరావు. ఈయన చందమామ తొలి సంచికలలో కూడా బొమ్మలు వేసేవాడు. 1950నాటికి చిత్రా

చందమామలో చేరాడుకాని శంకర్ ఇంకా ప్రవేశించలేదు. అప్పటికి బాపూ యుగం మొదలవడానికింకా అయిదారేళ్ళ వ్యవధి ఉంది. కథలకి బొమ్మలూ, ముద్రణలో అచ్చుతప్పులు లేకుండా తీసుకున్న జాగ్రత్తలూ వగైరా

విశేషాలు నేటి పాఠకులు గమనించగలరు. అప్పటి ప్రకటనలూ, అణా

పైసలలో పుస్తకాల ధరలూ కూడా కొంత ఆర్కైవల్ వేల్యూ కలిగిన విషయాలే.

పొద్దు చదివేవారిలో కొందరివద్దనైనా ఇటువంటి అరుదైన పాత పత్రికల కాపీలుంటే వాటిని పంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్నయ. తిక్కనలతో పోల్చలేకపోయినా ఇవన్నీకూడా సాహిత్యచరిత్రలోని భాగాలే. తెలుగువారిలో సాహిత్యమూ, కళలూ వగైరాల గురించిన ఆత్మవిశ్వాసం వీటివల్ల బలపడుతుంది.

————————–

* ఇదే సంచిక నుండి మరికొన్ని పేజీలు మరొక భాగంలో ప్రచురించబడతాయి – పొద్దు

 

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 1

Comments are closed.