పురాతన ఉషోదయం

ప్రకృతి పాఠం ఎప్పుడూ ఒకేలా  ఉండదు .

 

పాదాల కింద  భూగోళం

శిరస్సు పైన ఆకాశం

రెండింటి  మధ్య ఆయుధం !

 

గుడి గంట  వినపడగానే గువ్వల గుంపు

ఆకాశానికి పందిరివేసి పల్లవి అందుకునే

పురాతన  ఉషోదయం….

కల కనడానికి  బాగానే ఉంటుంది !

 

రోజూ లాగే కాలం గడవదు

కొన్ని కాలనాగు వలయాలు

ఇంకొన్ని కాలకూట ప్రళయాలు

నువ్వు  చూసేది, వినేది మాత్రమే నిజం కాదు

జననం లేకుండా… మరణం లేకుండా…

ఇంకొక మాయాలోకం  పని చేస్తుంటుంది

అదృశ్యంగా!

 

చరిత్ర ఇప్పుడు మారింది .

దానికి నీ రక్తం కావాలి …నీ  దేహం  కావాలి .

అదిప్పుడు

నీ  కంకాళంపై వాలే రాబందు !

 

నడి రాత్రి  ఆకాశపు వెలుగులు

దూరంగా  రాలిపోయే  నక్షత్రాలు

చంద్రుడి చుట్టూ  రాహు కేతువులు

మర్రి కొమ్మల్లో కూసే  తీతువులు

ఇవాళ కూడా ఎప్పటి  లాగే కళ్ళనిండా కల్లోలం

వర్షం కుండపోతగా  నీలో కురుస్తూనే ఉంటుంది ….!

 

నడి అడివిలో  నూకల వల  పరిచిన వైనం

మనం ఇప్పుడు వాలడం కాదు …

ఫైపైకి ఎగరడం నేర్చుకోవాలి …

 

నెత్తుటి పూలు తెలియని ఉషోదయం

ఇప్పుడొక కల మాత్రమే!

మనిషి నేర్వని  పాఠం ఎప్పుడూ  ఒకటి  మిగిలే  ఉంటుంది!

About డా. వేంపల్లి గంగాధర్

డా. వేంపల్లి గంగాధర్ సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయితాను. పద్దెనిమిదికి పైగా కథలు, ఐదు కవితలు రాసారు.
నేల దిగిన వాన అనే నవల కూడా రాసారు. రాయలసీమ ఇతిహాసం అనే పేరుతో వార్తలో వచ్చే కాలమ్ వీరిదే. మొలకల పున్నమి, హిరణ్య రాజ్యం,.. మొదలైన ఐదు పుస్తాలు రాసారు.

వందకు పైగా వీరి వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

గంగాధర్ గారు అనేక బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

3 Responses to పురాతన ఉషోదయం

Comments are closed.