యుద్ధం

-వైదేహి శశిధర్

విరిగిన కొమ్మలా వాలిన

తండ్రి చేతిని తన గుప్పెటలో బంధించి

ఘనీభవించిన కన్నీళ్ళ నావై

వేదనల తెరచాపలెత్తి

ఆ వైపు నిశ్శబ్దంగా నిలచిన ఆమె

 

కదిలే కారుణ్య వీచికనై

చార్టులో రిపోర్టులను మధించి

కరిగిపోతున్న కాలంతో

ఏకదీక్షగా పోరాడుతూ

ఈ వైపు కర్తవ్య నిమగ్ననై నేను

 

నివురు గప్పిన గాండీవాలై

మా మధ్య రెప్పవేయక చూస్తూ

రెస్పిరేటర్లు, డీఫిబ్రిలేటర్లూ

 

ప్రతిరోజూ అమ్ములపొది సర్దుకుని

రుగ్మతలపై యుధ్ధానికి

సన్నధ్ధమవుతూనే ఉంటాను.

కాలం గడచినా, వ్యక్తులు మారినా

యుద్ధం మాత్రం నిరంతరం

సాగుతూనే ఉంటుంది,

వేలాది గాయాలను మాన్పుతూ

————————-

డా. వైదేహీ శశిధర్ గారు పుట్టింది నరసరావుపేట, పెరిగింది గుంటూరు జిల్లాలో. మెడికల్ విద్య -ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. గత పన్నెండేళ్ళుగా అమెరికాలో కుటుంబంతో నివాసం. ప్రస్తుతం న్యూజెర్సీలో ఫిజిషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సాహిత్యం, ప్రత్యేకించి కవిత్వం, సంగీతం అభిమాన విషయాలు. అభిమానకవి తిలక్. ‘నిద్రితనగరం’ కవితాసంకలనం ప్రచురించారు. దీనికి 2009 ఇస్మాయిల్ పురస్కారం లభించింది. అప్పుడప్పుడూ ఇంగ్లీషులో కూడా కవితలు రాస్తూంటారు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

9 Responses to యుద్ధం

Comments are closed.