అతీంద్రియ శక్తుల గురించిన భావనల్లో ప్రతివారికీ భౌతిక శరీరంతోబాటుగా, దానికి భిన్నమైన ఒక ఆత్మ వంటిది ఉంటుందన్న నమ్మకం ప్రధానమైనది. శరీరం భౌతికంగా నశించిపోయిన తరవాత కూడా ఆత్మకు అస్తిత్వం ఉంటుందని చాలామంది నమ్ముతారు. మానవచరిత్రను పరిశీలిస్తే ఇటువంటి నమ్మకాలు ఆటవికదశలోనే రూపొందినట్టు తెలుస్తుంది. నిద్రలో కలలు కంటున్నప్పుడు ఆత్మ శరీరం నుంచి వేరయి, లోకమంతా కలయదిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చావుకూ, నిద్రకూ పోలికలున్నట్టు ఆదిమానవులు భావించారంటే విడ్డూరం లేదు. “దీర్ఘనిద్ర” తరవాతకూడా ఆత్మ స్వేచ్ఛగా తిరుగుతూనే ఉండాలి. దానికి చావు ఉండదు.
నిరూపణ అవసరంలేని ఇలాంటి “నిరపాయకరమైన” నమ్మకాలు ఎవరినీ బాధించవు సరికదా, కొంత ఊరటను కూడా ఇస్తాయి. అభ్యంతరమేదీ లేకపోవడంతో ఆనాటి ప్రజలు తమ శరీరాల్లో నశించలేనిదేదో ఉందనీ, అది భౌతిక శరీరంతో సంబంధంలేని పదార్థమనీ నమ్మసాగారు. ఈ ఆత్మ అనేది శరీరాన్ని శాసించి, నియంత్రించగలదు. నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ కూడా అద్భుతాలు సాధించగలదు. మన తెలివితేటలకూ, జ్ఞానానికీ అదే కారణం. అందుచేతనే కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధులు కూడా వివేకంతో మాట్లాడతారు. మరికొద్ది రోజుల్లోనే వారు చనిపోతారన్నమాటే గాని, మరి వారి అనుభవమూ, జ్ఞానసంపదా “ఎక్కడికి పోతాయి”? ఎక్కడికీ పోవు. వారి తరవాత కూడా ఆత్మ రూపంలో కొనసాగుతాయి. వడిలి, జబ్బులతోనూ, వయస్సుతోనూ కృశించి, శిథిలమైపోయిన వారి శరీరాలు మిగలవు కాని ఆత్మ సంగతి వేరు. దానికి వయస్సుతోనూ, చావుతోనూ నిమిత్తంలేదు.
మనుషులు ఒకచోటినుంచి మరొకచోటికి వలసపోవడం ఆదిమానవులకు తెలుసు కనక ఎన్నో ఏళ్ళుగా “అలవాటుపడ్డ” శరీరాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఆత్మకు కూడా ఏదో ఒకనాడు కలుగుతుందనేది వారికి సహజంగానే అనిపించి ఉంటుంది. అదొక మహాప్రస్థానం. బాల్యం, యవ్వనం, వార్థక్యం వగైరాలలాగే జీవితంలో అది మరొకదశ. ఎటొచ్చీ అది “ఇహలోకానికి” సంబంధించినది కాదు. ముసలితనంలో పోనుపోను ఆప్యాయతలూ, అనురాగాలూ తగ్గుతాయి. జీవితంలో రకరకాల అనుభవాలు పొందినవారికి ఇలా తమవారికి దూరమవడం తెలిసిన విషయమే. ఈనాటికీ మత బోధకులూ, ప్రవచనాలు చేసేవారూ ఇదేరకం ఇమేజరీ ఉపయోగించి ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేస్తారు. వారికి మరణానంతర అనుభవమేదీ లేకపోయినా “అన్ని బంధనాలూ తెంచుకున్న” ఆత్మను గురించి నమ్మబలుకుతూ వారు నెలల తరబడి ఉపన్యాసాలిస్తారు. వినేవాడెవడూ “నీకిదంతా ఎలా తెలుసు నాయనా” అని అడిగిన పాపాన పోడు.
నిద్ర అనేది ఏమిటో, నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ మన మెదడు ఎలా పనిచేస్తుందో, ఆలోచనలకూ, ఊహలకూ, భావాలకూ, కలలకూ ఎటువంటి సంబంధం ఉంటుందో ఈనాటికీ చాలా మందికి తెలియదు కనక ఇవన్నీ కలగలిసిపోయి ఆత్మ, ప్రేతాత్మ వగైరాల గురించిన అమాయకమైన అపోహలు అందరిలోనూ కనబడతాయి. బాహ్యప్రపంచంతో ఏమాత్రమూ సంబంధం లేనట్టు అనిపించే కలల ప్రపంచం మనలో “మరేదో” లోకంలో భ్రమిస్తున్న భావనను కలిగిస్తుంది. మన దేవుళ్ళందరూ సామాన్యంగా మనకు కలల్లోనే “సాక్షాత్కరిస్తూ” ఉంటారు. పరలోకాన్ని దాదాపు కళ్ళారా చూస్తున్నట్టే మన కనిపిస్తుంది. ఇది శ్రుతిమించి రాగాన పడ్డప్పుడు నిజంగా కనబడుతున్నదంతా మాయ అనీ, కలల ప్రపంచమే నిజమైనదనీ ప్రతిపాదనలు మొదలవుతాయి.
ఆదిమయుగంలో మనుషులు ఇంతగా అనుకోలేదు కాని ప్రేతాలనూ, భూతాలనూ నమ్మారు. వీటికి ఉనికి అంటూ ఉండదు. విచ్చలవిడిగా సంచరిస్తూ బతికున్నవారిని ఇబ్బందిపెడతాయి. వీటికి “శాంతులు” చేయించటానికి పెద్ద తతంగం అవసరమయింది. తరవాతి కాలంలో మతాలకు దారితీసిన పూజలకూ, తంతులకూ అదే మూలకారణం. ఈ ప్రేతాత్మలను “ప్రార్థిస్తే” కొంత ఉపయోగం ఉంటుందని భావించేవారు. గణాచారులూ, పూజారులూ, కులపెద్దలూ నాయకత్వం వహించి ఆటవికులకు “దారి” చూపిన ఆ కాలంలో మతమన్నా, గారడీ అన్నా, చేతబడి అన్నా, సైన్స్ అన్నా అంతా ఒక్కటిగానే ఉండేది. ఇందులో వ్యక్తిపరమైన స్వార్థంకన్నా తమ తెగకు మొత్తంగా మంచి జరగాలనే కోరికే ఎక్కువగా ఉండేది.

తమ పరిసరాలమీదా, వాతావరణంమీదా ఆధారపడి, వాటి “అనుగ్రహానికి” లోబడి జీవిస్తున్న ఆనాటి ప్రజలకు వానలూ, వరదలూ, వాటంతటవే తగలబడే అడవులూ ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకంగా ఉండేవి. అందుచేత “మేజిక్” వంటి తాంత్రిక శక్తులద్వారా “గారడీ” చేసి, ప్రకృతితో సంబంధం నెరిపి, దాన్ని లోబరుచుకునేందుకు ఆదిమానవ సముదాయాలు ప్రయత్నించాయి. ఈ తంతులన్నీ రోజువారీ జీవితాలకి పనికొస్తాయనే వారు భావించారు. ఇందులో అప్పటికి “ఆధ్యాత్మికత” ఏమీ ఉండేదికాదు. చేసిన కర్మకాండకు ఫలితం ఉంటుందని నమ్మి అందరూ పాల్గొనేవారు. సామూహికంగా అందరూ “గట్టిగా” కలిసి కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మేవారు. వానలు పడక క్షామం వచ్చినప్పుడు అమెరికాలోని ఆటవికులు “వానాట” ఆడేవారు. తామంతా కుండపోతగా కురుస్తున్న వర్షంలో తడిసి ముద్దవుతున్నట్టు తలమీద కప్పుకుని పరిగెత్తి ప్రకృతిని “ఫూల్” చేసేవారు. అంత మంది నమ్మకంగా వానొచ్చినట్టు పరిగెత్తుతూ ఉంటే నిజంగానే వర్షం పడకపోతుందా అని వారి ఉద్దేశమేమో. అలాగే తమకు తెలిసిన జంతువుల రూపాల్లోనూ, మనుషుల రూపాల్లోనూ బొమ్మలు చేసి వాటికి పూజలు చేసేవారు. తమకు కావలసినవి జరిగేదాకా వాటిని ప్రార్థించి, అవసరమైతే తిట్టి, కొట్టి, బతిమాలి ఎలాగో అలా అవస్థలు పడుతూ ఉండేవారు.
గుహల్లో నివసిస్తూ ఏ అడవిదున్ననో వేటాడి పొట్టపోసుకునే దశలో అడవిదున్న దొరకక పోవడం వారికీ, వారి తెగకూ చావుబతుకుల సమస్యగా పరిణమించేది. అలాంటి పరిస్థితుల్లో అడవిదున్న తమపై “కరుణించి” తమకు ఆహారం అయిందన్న కృతజ్ఞతాభావంతో వారు దున్నకు పూజలు చేసేవారు. చచ్చిన దున్న తోలు కప్పుకుని ఒకడు నృత్యం చేస్తే తక్కినవారు మళ్ళీ దాన్ని వేటాడినట్టు అభినయించేవారు. తామూ, తమ పశుసంపదా కలకాలం పచ్చగా ఉండాలని కోరుకునే సామాన్యమైన కోరికలు ఋగ్వేదం ప్రారంభంలో ఉన్నాయట.
ఇలా అడుగడుగునా కష్టాలుపడి బతికేరోజుల్లో వారి కళ్ళకి ప్రకృతిశక్తుల వెనక ఏదో “అదృశ్య హస్తం” కనబడేది. ప్రతి చెట్టులోనూ, సెలయేరులోనూ ఏవేవో శక్తులూ, భూతాలూ ఉండి తమ జీవితాలకు మంచినీ, చెడునీ చేస్తున్నాయని వారు భావించారు. వాటిని తమకు అనుకూలం చేసుకోవడానికి ఎంతో శ్రమపడి మంత్రతంత్రాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చేసినప్పటికీ ప్రకృతిశక్తులు అనుకూలించనప్పుడూ, అవి తమకు అర్థంకాక, తమ చెప్పుచేతలలో లేనట్టుగా అనిపించినప్పుడూ మతపరమైన వివరణలు ఇవ్వప్రయత్నించేవారు. దేవతలకు మనుషుల మీద “కోపం” వచ్చిందని చెప్పేవారు. ఇదేమీ ఆధునికయుగంలో హాస్యాస్పదంగా అనుకోనక్కర్లేదు. ప్రకృతిని “ఏదో పవరు” నడిపిస్తుందనీ, “అహంభావాన్ని” విడనాడి “ఆ సర్వేశ్వరుడికి” తలవంచాలనీ చెప్పే ఆధునికప్రవక్తలు ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ ఆదిమయుగం దాటి ముందుకు వచ్చినట్టుగా అనిపించరు. మనకి తెలియని విషయాలకు “అదృశ్యహస్తమే” కారణమని అనుకోవడంలో వీరంతా ఆటవికులే. జ్ఞానమూ, విజ్ఞానమూ లోపించిన ప్రతి చోటునూ మతవిశ్వాసాలు ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి.
ఇదంతా నమ్మకాలున్నవారిని వెక్కిరించడానికో, కించపరచడానికో రాసిన విషయంకాదు. మానవజాతి శైశవదశలో ఉన్నప్పుడు వారి బుద్ధీ, ఆలోచనలూ కూడా శైశవదశలోనే ఉండేవని కొందరు శాస్త్రవేత్తల ఉద్దేశం. కాలికి బల్ల తగిలి బాధ కలిగితే చిన్నపిల్లలు బల్ల సజీవమైనదయినట్టూ, తమను బుద్ధిపూర్వకంగా బాధించినట్టూ ఊహించుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అందుకు అనుకూలంగా బల్లను తిరిగి కొట్టి దానికి ‘బుద్ధి’ చెప్పినప్పుడే పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. అడవుల్లో రేగిన కార్చిచ్చులూ, కష్టాలపాలు చేసే తుఫానులూ అన్నీ ఎవరో తమను బాధించడానికే చేస్తున్న పనులనీ, తమకు ఆహారం అయిన దున్న తమను ‘కరుణించిందనీ’ భావించిన ఆదిమానవుల భావనలే మతాలకు పునాదులు అయాయి. ఈ రోజుల్లో చాలా ఉదాత్తస్థాయిలో మతబోధ చేస్తున్నామనుకుంటున్నవారి మనస్తత్వం, అవన్నీ నిజమనుకునేవారి వైఖరీ ఆనాటి ఆదిమలక్షణాలని అధిగమించలేనేదు. అసమానతలు పెచ్చుపెరిగిన సమాజ పరిస్థితుల వల్లనూ, తమ మెదళ్ళలో శారీరకంగా తలెత్తే గందరగోళంవల్లనూ అయోమయానికి గురయే కోట్లాది సామాన్యులను ప్రపంచ వ్యాప్తంగా తప్పుదారులు పట్టించే మతాలన్నీ ఇటువంటివే.
17 Responses to అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం