— స్వాతీ శ్రీపాద

సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, కవితాప్రేమికులు, సాహితీ విశ్లేషకులు, ప్రాచార్యులు, మరియు విద్యావేత్త అయిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారిని పరిచయంచేసేందుకు ఈ విశేషణాలు సశేషాలే. జీవితాన్ని ఒక తపస్సుగా సాధనచేసి సాహితీసేవకు అంకితం చేసిన ఆయనను అజో-విభొ-కందాళంవారు 2009వ సంవత్సరానికిగాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం వారిని వారు గౌరవించుకోవడమే! విశ్వనాథరెడ్డిగారి దృక్పథం మానవ సంఘర్షణ. అందుకే జీవితపు దారి ఘర్షణల దారి అని నొక్కి వక్కాణించారు. అవార్డు గ్రహీతగా విశ్వనాథరెడ్డి గారితో సంభాషించినప్పుడు విశ్వైక విజ్ఞాన మనో భాండాగారంలోనికి ప్రవేశించిన అనుభూతి కలిగింది.
అవార్డు గురించి ప్రస్తావించగానే “అజో-విభొ-కందాళంవారు ఈ అవార్డుకు నన్ను ఎంపికచేసి సంప్రదించినపుడు, ‘జీవిత పర్యంతం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు, నాకంటే ఎందరో ప్రతిభావంతులు వున్నారు, వారెవరికైనా ఇవ్వ’మని సూచించాను. ఈసారి నన్నే ఎంపిక చేయటం జరిగింది. సంతోషం.” అంటూ ఆయన తన అనుభూతిని మాతో పంచుకున్నారు.
*అజో విభొ కందాళం గురించి
ఈ సంస్థ సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తోంది. కథలను తీసుకుని వాటిని నాటకీకరించి ప్రదర్శించి, ఉత్తమమైనవాటికి బహుమతులందిస్తోంది. పుస్తకాలను అచ్చువేయటమే కాకుండా, విదేశాంధ్రులకు అందుబాటులో ఉంచటానికి ఒక వెబ్ సైటును నడుపుతోంది. ఇంత వరకు మరెవరూ గుర్తించని కృషిని ఈ సంస్థ వెలుగులోకి తెచ్చింది. నా కథలు కూడా నాటకీకరించి వాటిని ప్రదర్శిస్తామని అడిగారు. కాని వాటిని నాటకీకరించడం, నాటకీకరణకనుగుణంగా సంభాషణలు రాయటం, పాత్రలు అనుభవించే మానసిక ఘర్షణని రంగస్థలంమీద చూపడం, గ్రామీణ వాతావరణాన్ని ప్రదర్శించడం కష్టం. ఏమైనా వాళ్ళ ప్రయత్నాలను అభినందించాలి.

*కథల దృశ్యీకరణ గురించి మాట్లాడుతూ
లక్షల కథలు అందు బాటులో ఉన్నపుడు కనీసం వెయ్యి కథలైనా దృశ్యీకరణకి అనుగుణంగా ఉంటాయి. వాటిలో కొన్ని కథలను టీవీలు దృశ్యీకరించాయి. వాటిలో ఆర్.కె.నారాయణ్ మాల్గుడి కథలు, తెలుగులో అమరావతి కథలు, శ్రీపాదవారి కథలు వచ్చాయి. ఇక సినిమా రంగంలో వేల కథలు సినిమాలకనుగుణంగా వుంటాయి. వాస్తవికతకి సంబంధించిన కథలు వాళ్లు తీసుకోవడం లేదు. కృత్రిమత్వం వున్న వాటికి ప్రాముఖ్యం ఇస్తుంటారు. 1947 వరకు రామబ్రహ్మం గారు లాంటి వారు కొంత కొంత ఆ ప్రయత్నాలు చేశారు. నేటి సినిమాల్లో సహజత్వం ఉంటోందా? సినిమాకూ జీవితానికీ సంబంధం ఉండటం లేదు. జీవితం దారి వేరు, సినిమా దారి వేరు. జీవితాల్లో బాధలు, ఆరాటాలు, ఘర్షణల దారి వుంటుంది… సినిమాలది డబ్బుదారి. మనము మలయాళ తమిళ సినిమాలతో పోల్చుకుంటే తెలుగుసినిమా అధమస్థాయిలో వుంది.
*మీరు కవిత్వం మాట్లాడతారు, మరి కవితలెందుకు రాయరు?
(నవ్వుతూ) నేనూ సహజంగా కవిని కాను. కవితా ప్రేమికుణ్ణి. కవిత్వం వ్యక్తి అనుభూతులను ఆత్మీయంగా చెప్పేది. గాఢమైన సంవేదనతో విషయాన్ని చెప్పేది కవిత. సాహిత్యాన్ని, జీవితాన్ని ఒక తాత్విక పోరాట దృష్టితో విశ్లేషించడం నాకిష్టం. కవి మిత్రులతో సరదాగా ఘర్షణ పడేవాడ్ని. నీకు కవిత్వం నచ్చదనేవాళ్లు వాళ్లు. కాని నేను కవితా ప్రేమికుణ్ణని చెప్పేవాణ్ణి.
*సాహిత్యం పట్ల ఆసక్తి, అభిరుచి ఎప్పుడు మొదలైంది..?
నేను సాహిత్యపాఠకుడిగా మొదలైనపుడు చలం, బుచ్చిబాబు అపారమైన ఇష్టం. కాని వారికంటే గురజాడ, కుటుంబరావు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వారు జీవితాలను గురించి ఆలోచిస్తూ, జీవితాన్ని విశ్లేషించారు. మానవ సంబంధాలను గురించి చెప్పేవారు. రావిశాస్త్రి అంటే కూడా ఇష్టం. ఒక కోణంలోంచి చలం, ఒక కోణంలోంచి రావిశాస్త్రి ఇష్టం. నేను తీవ్రమైన భావనలు కలవాణ్ణి. కానీ నా ఉద్వేగాన్ని ఎప్పుడూ కూడా హద్దుల్లో ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తూవుంటాను. నా మిత్రుడు సొదుం జయరాం మీకు తెలుసనుకొంటాను. నా గురించి ఆయనో ఆయన గురించి నేనో గానీ అవసరానికి మించిన అనుభూతి మంచిది కాదని అనుకునే వాళ్ళం. అనుభూతి జీనితానికి తప్పనిసరిగా కావాలి. గాఢమైన అనుభూతులు కావాలి. కానీ ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోతే మనిషి ఆలోచించడమనేది కొంచెం కష్టం.
*మీరు ఎప్పటినుంచి రచనలు చేస్తున్నారు?
ఇంటర్ చదువుతున్నప్పటినుంచి రాస్తున్నాను.ఆ రోజుల్లో రచయిత్రుల రొమాంటిక్ రచనల ఊహాగానాలమీద విరుచుకుపడుతూ ఒక వ్యాసం రాశాను.
*కథలు రాశారా చిన్నప్పుడు?
SSLC రోజుల్లో నుంచే పద్యాలు రాయడం లాంటి కొన్ని పనులు, తుంటరి పనులు చేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రొద్దుటూరు మొత్తం కవిత్వ వాతావరణమే, అందులోనూ ప్రాచీన కవిత్వ వాతావరణం ఉండేది. హైస్కూల్లో చదువు చెప్పిన గురువులు తెలుగులోను సంస్కృతంలోనూ పండితులు. వారి ప్రభావం వల్ల నేను కూడా కొంత రాసేవాణ్ని. గడియారం వెంకట శేషశాస్త్రిగారు శివభారతంలో ఒక భాగం చెప్పేవారు మా ఫిప్త్ ఫారంలో, అంటే ఇప్పటి పదోతరగతిలో అనుకోండి. అప్పుడు మాకు గొప్ప గురువు గార్లుండేవాళ్లు. వాళ్లు నాకు స్ఫూర్తి. గణితంలో మంచి ప్రావీణ్యం వుందనిపించుకున్నాను పాఠశాల రోజుల్లో.
*మీరు అనుకున్నారా జీవితంలో అధ్యాపక వృత్తిని చేపడతానని?
మానాన్న బలవంతంగా సైన్సులో చేర్పించి డాక్టర్ని చేయాలనుకున్నారు. కుదరలేదు. బొమ్మలు బాగా వేసేవాడిని. శాంతినికేతన్ లో చేరుదామనుకున్నా అదీ కుదరలేదు. చివరికి కడపలో చేరాను. తెలుగులో పిహెచ్ డి చేసి డాక్టరేట్ పొందాను.
*మీరు నందలూరిలో ఒకసారి అన్నారు, పల్లె నుంచి పట్నానికివచ్చి దారి తప్పిపోయిన భావన అనుభవించానని. ఆ తరువాత విదేశాలలో ఉన్నారు కదా, మరి మీకు అప్పుడెలా అనిపించింది?
ఎక్కడ వున్నా ఒకేలా అనిపించేది. ఒకరకంగా గుంపులో వున్నా ఒంటరి మనస్తత్వమే నాది. ఎక్కడ వున్నా ఒకేలా వుండేది.
*మీరు స్వచ్ఛమయిన పల్లె వాతావరణం నుండి పట్నం వచ్చి పల్లె జీవితాల గురించి రాస్తున్నారు. మళ్ళీ పల్లెకి వెళ్ళాలని అనుకోవడం లేదా..?
తిరిగి మా వూరికి వెళ్ళాలని వుంది. కాని నేను పట్నానికి బందీని. పల్లెలూ మారిపోయాయి. అక్కడ ఇమడగలమా అని అనిపిస్తుంది. అందులోనూ వయసు వల్ల వచ్చే ఇబ్బందులున్నాయి.
*మీకు ఉపాధ్యాయ వృత్తి నచ్చిందా లేక సంపాదకీయమూ రచనలూ మీకు సంతృప్తి నిస్తాయా?
అది నా బలమో లేక బలహీనతో తెలీదు కాని ఏ వృత్తి అయినా పనిలో నిమగ్నం కాలగను. ఎటువంటి పనినైనా చేయగలను. కాని అన్యాయం, పొరపాట్లను సహించలేని మనస్తత్వం. రెండింటిలో నేను చాలా ఇష్టపడింది ఉపాధ్యాయ వృత్తి. పిల్లలు చాలా అభిమానించేవారు. స్కూలు పిల్లల నుంచి పిహెచ్డి చేసేవారివరకు విద్యార్థులందరితో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఎక్కడ వున్నా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానించడం నా అదృష్టంగా భావిస్తాను. సంపాదక వృత్తిలో రాసిన ఏ రచన ఐనా తీర్పు ఇవ్వాల్సింది పాఠకులే.
*కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ తర్వాత, తుమ్మేటి రఘోత్తమరెడ్డి పని పిల్ల తర్వాత మీ అమ్మవారి చిరునవ్వు మీద విపరీతమైన విశ్లేషణలూ వాద వివాదాలు నడిచాయి కదా. దానిపై మీ స్పందన ఏమిటి?
ఏ వివాదమైనా సహేతుకమైనప్పుడు నాకు వాటి మీద గౌరవం వుంది. ఆ విమర్శలు ఏమీ నన్ను కదిలించలేదు. నేను ఏమీ పట్టించుకోలేదు. రచన విఫలత, సఫలత అనే తీర్పు పాఠకులకే వదిలేస్తాము. పాఠకులే లిట్మస్ టెస్ట్. సాహిత్యము విఫలత, సఫలత, వివాదాలు అనేవి కాంప్లెక్స్ ఫాక్టర్స్.
*కరికులం కమిటీలో చాలా కాలం పని చేశారు కదా. పాఠ్యాంశాలలో ఏమైనా మార్పులు ప్రవేశ పెట్టగలిగారా?
ఫస్ట్ నుంచి టెన్త్ స్టాండర్డ్ కమిటీలో, ఇంటర్మీడియట్ కమిటీలో, ఓపెన్ యూనివర్శిటీ కమిటీలో వున్నాను. చాలా మార్పులే తేగలిగాను. మౌలికంగా విద్యార్థులు ఆధునిక చైతన్యం మీద, వచన రచన మీద పట్టు సాధించాలని నా అభిప్రాయం. అందరూ కవిత్వం రాయలేరు కదా! వచనం అందరూ రాస్తారు. కవిత్వం రాసేవాళ్లు కూడా వచనం రాయాల్సిన అవసరం వుంటుంది. మంచి వచనం రాయగలగడమనేది ఎప్పుడూ అవసరం. అది సైన్సు విద్యార్థికి కావచ్చు, కామర్సు విద్యార్థికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మేము తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా స్త్రీలను అగౌరవపరిచే పాఠాలు, దళితులని కించపరిచే పాఠాలు ఉండకూడదని నిబంధన విధించాము. పాఠాల మూలంగా విద్యార్థులలో మార్పు రావాలని, కొన్ని నిబంధనలు ఉండకూడదని నిర్దాక్షిణ్యంగా ఖండించాను. నన్ను కమిటీనుంటి తొలగించినా ఇబ్బంది పడలేదు కాని కాంప్రమైజ్ కాలేదు. కరికులం కమిటీలో కొంతవరకూ మార్పు తేగలిగాం. మిత్రులు కూడా తోడ్పడ్డారులెండి. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామరావుగారు, కొత్తపల్లి వీరభద్రరావుగారు, కె.కె.రంగనాథాచార్యులు మొదలైన వారి అందరి సహకారం నాకు లభించింది. నేను చేస్తున్న ప్రతి పనిలోనూ నాకు చేదోడు వాదోడుగా వున్నవారి సహకారం గొప్పగావుంది.
*మీరు జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక కమిటీలో సభ్యులుగా పని చేశారు కదా! కన్నడ రచయితలు ఏడుగురికి జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చింది కాని ఇద్దరు తెలుగు వారికే ఎందుకు వచ్చింది..?
ఎందరు గొప్ప రచయితలు మన తెలుగులో వున్నా వారిగురించీ వారి రచనలగురించీ ఇతరులకు తెలీదు. వారి రచనలు ఇతర భాషలలోనికి అనువదింపబడలేదు. మనవారి గురించి కమిటీలో తెలిసినపుడే వారికి అవార్డు ఇవ్వాలా లేదా అని తెలిసేది. అందుకే అనువాదానికి ప్రాముఖ్యత నివ్వాలి. ఇదివరకు కన్నా నేడు అనువాదకులు పెరిగారు.
*రచయితల లక్షణాల గురించి మాట్లాడుతూ –
రచయితలకు వినయం, నిగ్రహం అవసరం. కీర్తి తనంత తానుగా వచ్చినా గర్వమొందనివాడు ఉత్తముడు. కీర్తి వెంట పడేవాడు మధ్యముడు. కీర్తిని చెరబట్టినవాడు అధముడని పెద్దలన్నారు. తెలుగు కవులూ రచయితలూ ఎదుటి వారి గొప్పను ఒప్పుకోవడం నేర్చుకోవలసిన అవసరం వుంది.
*విద్య వల్ల, సాహిత్యం వల్ల సమాజంలో మార్పు వస్తుందనుకుంటున్నారా?
సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే. మార్పు అనేది అన్నిరంగాల్లో రావాలి.
*కథా రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
విస్తృతంగా చదవాలి – జీవితాన్నీ సాహిత్యాన్నీ కూడా. విస్తృతంగా పరిశీలించాలి.
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.
20 Responses to కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి