-స్వాతి కుమారి
కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది?
కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి ఈ సందేహాలన్నీ ఎప్పటికప్పుడు ముసురుకుంటూ ఉండేవే. ఇవన్నీ పెద్దలందరూ వివరించిన విషయాలే ఐనా, రోజురోజుకి కవితా ధోరణులు చురుగ్గా మారిపోతున్న నేపథ్యంలో మనకి మనం చర్చించుకుని ఆత్మవిమర్శ చేసుకోవటం సమంజసం. ఈ విషయం మీద పిచ్చాపాటీ జరపటానికి పొద్దు తరఫున మూలా సుబ్రహ్మణ్యం గారిని అతిధిగా ఆహ్వానించాం. ఇక కబుర్ల లోకి..
స్వాతి: ఇక మొదలెడదాం. పొద్దుకి నేను పాతేగానీ మీరు ఇంకా పరిచయం కాలేదు.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఒక వ్యక్తిగా, ఇంకా కవిత్వానికి సంబంధించీ మీ పరిచయం ఇవ్వగలరా
సుబ్రహ్మణ్యం: సొంత ఊరు : విశాఖపట్నం, ప్రస్తుత నివాసం బెంగుళూరు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వృత్తి, కవిత్వం ప్రవృత్తి. “ఏటి ఒడ్డున” అనే కవితా సంపుటి ప్రచురించాను. ఇది పరిచయం
స్వాతి: మరి ప్రేరణ మీరు సహజంగా యే భావానికి, ప్రేరణకి స్పందించి కవిత్వం రాస్తారు?
సుబ్రహ్మణ్యం: ఏ కళకైనా పునాది, ప్రేరణ జీవితమే అనిపిస్తుంది. ముగింపు ముందే తెలిసినా ఒక్కో మనిషి జీవితమూ ఒక్కో మహాకావ్యమే! అందుకని నా కవిత్వానికి కూడా జీవితమే ప్రేరణ.
సుబ్రహ్మణ్యం: మీ ప్రేరణ కూడా చెప్పండి
స్వాతి: మీరు చెప్పినట్టే విస్తృతార్ధంలో అందరికీ జీవితమే ప్రేరణ ఐనా. ఇంకొంచం సూక్ష్మంగా చెప్పాలంటే నాకు ఎక్కువ ప్రకృతి లోంచి ప్రేరణ దొరుకుతుంది. మనమంతా ఎంతో ప్రణాళికా బద్ధంగా ఒక రొటీన్ కి కట్టుబడి జీవిస్తూ ఉంటాం, సవ్యమైన మనుగడకి అది చాలా అవసరం కూడా. కానీ చాలాసార్లు ఇది యాంత్రికంగా విసుగు తెప్పించేలా పరిణమిస్తుంది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: అలాంటప్పుడే అనుకోకుండా రాలిపడే ఒక వర్షపు చినుకో, చెప్పకుండా తాకే ఒక చిరుగాలో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
సుబ్రహ్మణ్యం: నా కవిత్వానికి ముందు మాట రాస్తూ విన్నకోట గారు ఇలా అన్నారు “కవిత్వం జీవితాన్ని వెలిగిస్తుంది.. కాంతి మయం చేస్తుంది” అని
స్వాతి: నిజం.
సుబ్రహ్మణ్యం: ప్రకృతిలో ప్రతి అంశం ఏవో రహస్యాల్ని దాచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రహస్యాల శోధనే కవిత్వం అనుకోవచ్చేమో!
స్వాతి: ఒక పార్శ్వం నుంచి అంతే!
సుబ్రహ్మణ్యం: మరి ఇంకో పార్శ్వం?
స్వాతి: కానీ వింతేమిటంటే అవి అందరికీ తెలిసిన విషయాలే. ఒక కవి శోధించి చెప్పాక, ‘అవును కదా ఇన్నాళ్ళూ గమనించలేదు’ అనిపిస్తుంది.
సుబ్రహ్మణ్యం: చాలా నిజం. అయ్యో నేను ఇలా ఎందుకు రాయలేదు అనిపిస్తుంది. అదే గొప్ప కవిత్వం.
స్వాతి: అవును, ఎవరికోసం వారు రాసుకున్నదే అందరినీ తాకుతుంది. పాఠకులకిలా నచ్చుతుంది అనుకుని రాసినప్పుడు సార్వజనీన భావన ఉండదు కవితలో.
సుబ్రహ్మణ్యం: అవును Target audience ని దృష్టిలో పెట్టుకుని రాస్తే అది కవిత్వం కాదు.
స్వాతి: తిలక్ చెప్పినట్టు నువ్వు రాసేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి. సరే.. మీ మిగతా ప్రేరణల మాటేమిటి? ప్రకృతి కాకుండా ఇంకా మీరు కవిత్వం ఎక్కువగా దేని గురించి రాస్తారు?
సుబ్రహ్మణ్యం: నేను మొదట్లో చిన్న చిన్న వస్తువులు తీసుకుని కవిత్వం రాసేవాడిని.. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ అంటూ… అప్పుడు విన్నకోటగారు జీవితానుభవాలని కవితలుగా మలచమని సలహా ఇచ్చారు.. అలా ప్రాజెక్టు డెడ్ లైనులు, డీబగ్గింగ్ ఇలా చాలా విషయాల మీద కవిత్వం రాశాను. అదంతా ఒక సాధన అనుకోండి.
సుబ్రహ్మణ్యం: ఇవి కాక ప్రతి మనిషినీ “జీవితానికి అర్ధం ఉందా?” , ” కాల మరణాలేమిటి?” ” రాగద్వేషాలకి మూలాలేమిటి” , ” పరిపూర్ణమైన సౌందర్యం ఉందా?” వగైరా ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలో కూడా కవిత్వం రాస్తారనిపిస్తుంది. నావి కూడా కొన్ని కవితలు ఆ కోవలోనివే..
స్వాతి: ఆహా, ఒక తాత్విక చింతన ఉన్న కవిత్వం.. నిజమే.. ప్రతి రచయిత/ కవీ ఆ మాటకొస్తే ప్రతి మనిషికీ ఏదో ఒక దశ లో తప్పనిసరిగా కలిగే అలోచనే అది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఐతే నాకో సందేహం..
సుబ్రహ్మణ్యం: చెప్పండి.
స్వాతి: ఈ తరహా కవిత్వం వల్ల కవి తనకి తాను కానీ పాఠకుడి నుండి గానీ ఆశించేదేమిటి?
సుబ్రహ్మణ్యం: రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారుట.. “ఏమయ్యా నువ్వేదో కొండల్లో కూచుని తపస్సు చేస్తే ప్రపంచానికేమిటి ప్రయోజనం” అని
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: దానికి ఆయన ‘నాలోంచి ఒక తరంగం లేచి ప్రపంచాన్ని చుట్టబెడుతుంది. అది ప్రపంచంలో ఉన్న అశాంతిని కాస్తైనా తగ్గిస్తుంది’ అని అన్నారట. కాబట్టి అన్నిటికీ లౌకికమైన ప్రయోజనాలు ఉంటాయనుకోకూడదు.
స్వాతి: అది నిజమే ఆ మాటకొస్తే ఏ కళనుంచైనా అలోచన నుంచైనా లౌకికమైన ప్రయోజనాన్ని ఆశించలేము.
సుబ్రహ్మణ్యం: కవిత్వం విముక్తి కూడా… బాగా అలజడిలో ఉన్నప్పుడు అది రాసేస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.. కదా?
స్వాతి: తనలోని అంతర్గతమైన తపనని అనుభూతిని అలోచనని తనకి తాను వ్యక్తపరచుకోవటమే కళాకారుడి / కళ యొక్క మొదటి ఉద్దేశం అనిపిస్తుంది
సుబ్రహ్మణ్యం: అవును.
స్వాతి: నిజం ఆనందం కోసం ఎందరు రాస్తారో నాకు తెలీదు కాని. బాధ తీరటానికి చాలా మందే రాస్తారు
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ఎప్పుడైతే ఇక ఇది రాయకుంటే ఇంకే పని మీదా ధ్యాస ఉండదు అనేంత desperate భావన కలుగుతుందో అప్పుడు మాత్రమే రాసే తరహా అన్నమాట ఇది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: కవిత్వం – పద్యం నుంచి, చంధస్సు నుంచి దూరంగా వచ్చి వచన కవిత్వంగా మారటం పట్ల మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో పద్యం లోని శాస్త్రీయత, చంధస్సులో నిగూఢమైన శబ్ద సౌందర్యం సాటి రానివి.
సుబ్రహ్మణ్యం: పద్యమైనా, గద్యమైనా నేను అందులో కవిత్వం కోసం చూస్తాను. వట్టి చమత్కార పూరిత పద్యాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో కవిత్వం ఉండదు. అలాగే వచన కవితల పేరిట వస్తున్న కొన్ని రచనలు శుద్ధ వచనం. కాబట్టి కవిత్వమే ముఖ్యం.
సుబ్రహ్మణ్యం: ఐతే చెప్పండి.. పద్య కవిత్వం, వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
స్వాతి: పద్య కవిత్వం మన సంస్కృతికి, భాషా సంపదకు చిహ్నమే కాకుండా, ఒక క్రమశిక్షణాబద్ధమైన రచనా శైలి
సుబ్రహ్మణ్యం: అవును, ఐతే ఛందోబద్ధంగా రాసినదంతా కవిత్వమేనా?
స్వాతి: సరైన మాటే అన్నారు. పద్యం అనేది పదాల్ని ఒక పద్ధతిలో కూర్చోబెట్టగలిగే సాధనం మాత్రమే!
సుబ్రహ్మణ్యం: అవును..
స్వాతి: ఇక దానిలోని కవితాత్మ కవి తపనని బట్టీ..
సుబ్రహ్మణ్యం: ఒక ఉపమానం తీసుకుని చెప్పినట్లైతే
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: ఛందస్సు ఒక పాత్ర లాంటిది.. ద్రవానికి చక్కని ఆకృతిని ఇస్తుంది.. ఐతే ఆ పాత్రలో పోసేది అమృతమా, ఉట్టి నీరా అన్నది వేరే విషయం.
స్వాతి: right, ఐతే తమ పాలని గానీ నీటిని గాని తెలిసీ తెలీక ఎక్కడో ఒలకబోసుకోకుండా ఒక చక్కటి పాత్రలో పెట్టుకునేందుకు ఇదో మంచి ఏర్పాటు.
సుబ్రహ్మణ్యం: 🙂
8 Responses to ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు