
అంతరిక్షంలోని నక్షత్రసముదాయాలు
సూర్యుడు పాలపుంత అనే గేలక్సీలో ఒక నక్షత్రం. ఈ నక్షత్ర సముదాయం చాలా పెద్దది. దాని కొలతలకి కిలోమీటర్లు చాలవు. కాంతి సంవత్సరాలు కావాలి. సెకండుకు 186 వేల మైళ్ళు ప్రయాణించే కాంతి కిరణాలు ఒక సంవత్సరం పాటు ప్రసరిస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల కిలోమీటర్లు వెళతాయి. అందువల్ల ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు పది లక్షల కోట్ల కిలోమీటర్లు. ఈ లెక్కన చూస్తే సర్పిలాకారంలో ఉండే పాలపుంత అడ్డకొలత లక్ష కాంతి సంవత్సరాలు. దీని ఒక అంచునుంచి రెండో అంచుకు చేరడానికి కాంతికే లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇది మధ్యలో ఇడ్లీలాగా ఉబ్బి ఉంటుంది. కేంద్రంవద్ద దీని మందం పదివేల కాంతి సంవత్సరాలు. భూమి చుట్టుకొలత 40 వేల కిలోమీటర్లు మాత్రమే కనక మనిషికి ఈ దూరాలు ఊహించరానంత పెద్దవి. ఈ బ్రహ్మాండమైన చక్రం ఒకసారి గుండ్రంగా తిరగడానికి 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది. విశ్వంలో పాలపుంతవంటి గేలక్సీలు దాదాపుగా వందకోట్లున్నాయి. ఒక్క పాలపుంతలోనే సుమారు వందకోట్ల నక్షత్రా లున్నాయి. వాటిలో చిన్నవీ, మన సూర్యుడి కన్నా చాలా పెద్దవీ అనేకం. సూర్యుడు ఒక సగటు సైజు నక్షత్రం. పాలపుంత వెలపలి అంచులు రెండు వంపు తిరిగిన బాహువుల్లా ఉంటాయి. అందులో ఒక అంచున వెతికితే కాని కనబడనంత సామాన్యమైన నక్షత్రం “కోటి ప్రభలతో వెలిగే”మన సూర్యుడు.

పైనుంచి చూసినప్పుడు పాలపుంత దృశ్యం
మన పాలపుంత గేలక్సీకి సమీపంలో ఇతర నక్షత్ర సముదాయాలు ఇరవై ఉన్నాయి. ఇవన్నీ ఒక జట్టు. ఇవన్నీ కలిసికట్టుగా కదులుతూ ఉంటాయి. “మన” జట్టుకు చెందినదైన మృగశిర రాశిలోని ఆండ్రోమెడా గేలక్సీ పాలపుంతలాగే పెద్దది. ఇదికాక చిన్నవి కొన్ని ఉన్నాయి. ఇలాంటి మరొక గుంపు కన్యారాశిలో ఉంది. అందులో వేలకొద్దీ గేలక్సీలున్నాయి. మరొక విశేషమేమిటంటే ఇటువంటి “స్థానిక” జట్లు కొన్ని మహాసముదాయాలుగా కనిపిస్తాయి. ఈ మహాసముదాయాలలో కొన్నిటి అడ్డకొలత 30 కోట్ల కాంతి సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. కారణమేమిటో సరిగ్గా తెలియదుగాని విశ్వంలోని పదార్థరాశి అంతా ఇలా మహాసముదాయాల రూపంలో వ్యాప్తమై ఉంది. పైన చెప్పినట్టుగా వీటిలో చిన్నచిన్న జట్లూ, ఒక్కొక్క జట్టులోనూ చిన్నా, పెద్దా గేలక్సీలూ, గేలక్సీల్లో వందల కోట్ల నక్షత్రాలూ, వాటిలో కొన్నిటి చుట్టూ తిరిగే గ్రహాల్లో కొన్నిటి మీద జీవరాశి పెరిగే పరిస్థితులూ కనిపిస్తాయి.
“పై”నుంచి మన పాలపుంతను ఎవరైనా చూడగలిగితే సూర్యుణ్ణి గుర్తుపట్టడమే కష్టం అవుతుంది. విశ్వం సంగతి అలా ఉంచి, మన పాలపుంతలోనే మన సూర్యుడికి గాని, మనకు గాని ప్రత్యేకమైన స్థానం ఏదీ లేదనేది స్పష్టం. “సృష్టి”లో మనం చాలా గొప్పవాళ్ళమనుకునేవారికి అహం ఏదైనా ఉంటే అది అసమంజసమనే అనాలి.
ఒక శతాబ్దం క్రితం దాకా మనిషికి కాలినడకా, మచ్చిక జంతువులూ, తెరచాప పడవలే రవాణాకు పనికొచ్చాయి. దూరాలని “జయించడం” ఆధునిక పరిణామమే. అయినా “పృథివి దాటితే” అన్నీ ఇబ్బందులే. మన సౌరకుటుంబం “పెరడు”ను దాటడానికే ఆధునిక రోదసీనౌకలకు దశాబ్దాల సమయం పడుతోంది. మనకు చాలా దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారై మనకు నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరాన ఉంది. సాంకేతిక అభివృద్ధి ద్వారా కాంతి వేగంలో పదోవంతు సాధించినా ఈ ప్రయాణానికి నలభై సంవత్సరాల పైనే పడుతుంది. అందుకనే భవిష్యత్తులో జరిగే రోదసీ ప్రయాణాల్లో వెళ్ళేవారు కాపరాలు చేసి, పిల్లల్ని రోదసిలోనే కని, పెంచి, నావికులుగా తయారు చెయ్యడం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక తరంవారికి సాధ్యమయే పనులుకావు.
ప్రకృతి అంటే భయం ఏర్పడడానికి కారణాల్లో మనిషికి తొలినుంచీ తనకున్న పరిమితులని గురించిన అవగాహన ముఖ్యమైనది. ముందు తన పరిసరాల గురించీ, తరవాత మొత్తం భూమి గురించీ, విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ విశ్వం గురించిన సమాచారం తెలుసుకున్న మానవుడికి విశ్వంలో తన ఉనికిని గురించిన జిజ్ఞాస ఎక్కువ అవుతోంది. తన “అల్పత్వం” తెలిశాక “వినయ భావన” కలుగుతోంది. ఎందుకంటే కొన్ని భౌగోళిక పరిస్థితుల్లో తలెత్తిన జీవపరిణామం మనిషి రూపాన్నీ, ఆయుర్దాయాన్నీ, శక్తియుక్తులనీ నిర్దేశించిందనేది మరిచిపోరాదు. భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి రోజువారీ కదలికకూ, పనులకూ తగినంత బరువూ, కండరాల బలమూ మనిషికి ఉన్నాయి. ఒకటిన్నర రెండు మీటర్ల నిడివి కలిగిన శరీరాలూ, డబ్భై ఎనభై ఏళ్ళ జీవితకాలమూ ఉన్న మనుషులకు బుద్ధివికాసం ద్వారా సాధించిన సాంకేతిక పరిజ్ఞానంతో తప్ప స్వతహాగా గ్రహాంతర యానాలు చేసే సామర్య్థం లేదు. తొలిదశల్లో గెలీలియో మొదలుకొని అనేకమంది శాస్త్రవేత్తలు టెలిస్కోప్ల సహాయంతో అంతరిక్షంలోకి చూసి వివరాలు సేకరించారు. 1957లో స్పూత్నిక్ ప్రయోగంతో సోవియట్ యూనియన్ రోదసీ యుగాన్ని ప్రారంభించింది. 1977లో అమెరికా ప్రయోగించిన వొయేజర్2 నౌక ప్రస్తుతం సౌరకుటుంబం పొలిమేరలు దాటి అంతరిక్షంలోకి వెళిపోతోంది.

స్పూత్నిక్ ప్రయోగం
ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఇతర గ్రహాల్లో ప్రాణులూ, బుద్ధిజీవులూ ఉన్నారా అనే ప్రశ్నే. ఈ అన్వేషణకు నాసా 1992 నుంచీ ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మనకు తెలిసిన పద్ధతిలో జీవపరిణామం జరగడానికి వాతావరణంలోనూ, ఉష్ణోగ్రతలోనూ కొన్ని పరిమితులూ, నీరు ద్రవరూపంలో ఉండే పరిస్థితులూ అవసరం అవుతాయి. అవన్నీ ఇతర నక్షత్రాల గ్రహ సముదాయాల్లోనూ జరిగే అవకాశం ఉంది. సూర్యుడికీ, భూమికీ ప్రత్యేకత ఏమీ లేదనుకున్నాక ఇలాంటి నక్షత్రాలూ, వాటి చుట్టూ తిరిగే గ్రహాల మీద జీవరాశి పుట్టడానికి అనువైన పరిస్థితులు కలగడం అసాధ్యమేమీ కాదని శాస్త్రజ్ఞుల నమ్మకం. శక్తివంతమైన టెలిస్కోప్ల సహాయంతో ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమిని పోలినవి ఉన్నాయని స్పష్టమైంది. అక్కడికి వెళ్ళిరావడం ఇప్పట్లో అసాధ్యం కనక ఈ జిజ్ఞాస పరిశీలనల స్థాయిలోనే మిగిలింది. భూమికి వెలపల మనకు “తోడు”గా ఎవరైనా ఉన్నారా అనేది తేలితే జీవపరిణామం గురించిన మన అవగాహనకు చాలా లాభం కలుగుతుంది. మనకు అతి సమీపగ్రహమైన కుజుడి మీద సూక్ష్మజీవుల కోసం వెతుకులాట అందుకే.
మరి భూమి మాటేమిటి? చల్లని సాయంత్రాలు హాయిగా ఆరుబయట పచ్చికలో కూర్చుని,అస్తమిస్తున్న సూర్యుణ్ణీ, మిలమిలలాడ సాగుతున్న నక్షత్రాల్నీ చూసి, కవులేకాదు, సామాన్యులు కూడా పరవశిస్తారు. ఆహా,ఎంత రమణీయంగా ఉందీ ప్రకృతి! సరిగ్గా మన మనసుకూ, శరీరానికీ ఆహ్లాదం కలిగించేందుకే సృష్టించబడిందా ఈ లోకం? అప్పుడప్పుడూ, వానలూ, వరదలూ,కరువులూ వస్తూనే ఉన్నా మొత్తంమీద మన బతుకులు “చల్ల”గానే సాగిపోతున్నాయికదా! మనమే కాదు, పక్షులూ, జంతువులూ అన్నీ బాగానే ఉన్నాయి.
మనకు అన్నివిధాలా సౌకర్యంగా అనిపించే పరిస్థితులు “అదృష్టవశాత్తూ” ఏర్పడలేదనీ, ఉన్న పరిస్థితులు సుఖంగా అనిపించే ప్రాణికోటి మాత్రమే భూమి మీద మనగలుగుతోందనీ విజ్ఞానం చెపుతుంది. మనం పీల్చే గాలీ, చూడగలిగిన వెలుతురూ, తాళగలిగిన ఉష్ణోగ్రతా యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. వీటికి తట్టుకోలేని ప్రాణులు ఏవైనా పుట్టినా త్వరలోనే అంతరించిపోయి ఉంటాయి. భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని అధిగమించి అవయవాలను కదిలించలగలిగే శక్తి మన కండరాలకు ఉంది. వాటి శక్తికి మించిన బరువు మనకు లేదు. నేలమీద నడిచే పెద్దపెద్ద ఏనుగుల కన్నా నీటిలో ఈదే తిమింగలాలు పెద్దవి కావడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఎగిరే పక్షులు తేలికగానే ఉంటాయి. ఈ పరిణామాలకు వెనక ఉన్న భౌతిక కారణాలు మనకు తెలియనివి కావు. మనిషి ప్రమేయం లేకుండా జరిగిన ఈ “సృష్టి” వెనకాల “రహస్యాలు” ఏవీ ఉన్నట్టు కనబడదు.
అనంతం అనిపించే విశ్వాంతరాళంలో పాలపుంత గేలక్సీలో సూర్యుడు అనబడే ఒకానొక నక్షత్రం చుట్టూ భూమీ, ఇతర గ్రహాలూ తిరుగుతున్నాయి. సూర్యుడితో సహా ఈ “సౌరకుటుంబం” అంతా ఒకేసారిగా సుమారుగా 470 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. సమీపంలో ఒక సూపర్నోవా పేలడంతో ఆ ప్రాంతంలో వ్యాపించి ఉండిన వాయువులన్నీ పోగుపడి, గురుత్వాకర్షణ కారణంగా ఒక “సౌరమేఘం”గా రూపొంది ఉంటాయి. ఒకే వేగంతో గుండ్రంగా, చక్రంలాగా తిరగసాగిన ఆ బ్రహ్మాండమైన మేఘానికి నడిబొడ్డున సూర్యుడు నక్షత్రమై వెలగడం మొదలైంది. ఆ దరిదాపుల్లో ఉన్న వేడిమికి కాస్త సాంద్రంగా ఉండే సిలికేట్లు కూడా ఏర్పడలేకపోయాయి. సూర్యుడి సరసనే ఉన్న బుధగ్రహపు కేంద్రంలో ఇనుము ఉంది కాని, మీద భూమిమీద ఉన్నంతగా సిలికేట్లు కనబడకపోవటానికి కారణం ఇదే కావచ్చు. చంద్రుడి మీదా, కుజుడి మీదా ఉన్నవి రాళ్ళూ రప్పలేనని తేలింది. సూర్యుడికి దూరాన, శీతలప్రాంతాల్లో వాయువులన్నీ గడ్డకట్టి గురువుతో మొదలుకొని వెలపలి గ్రహాలుగా రూపొందాయి. ఆ మధ్య గురుగ్రహం మీదకు పారాషూట్తో దింపిన అంతరిక్ష పరికరం అంతకంతకూ సాంద్రమైన విషవాయువుల్లో ప్రవేశించి, కాసేపటికి వేడిమికి మాడి మసై పోయింది. గురువు కేంద్రంలో ఘనపదార్థం ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.
సూర్యుడికి దూరాన, శీతలప్రాంతాల్లో వాయువులన్నీ గడ్డకట్టి గురువుతో మొదలుకొని వెలపలి గ్రహాలుగా రూపొందాయి. ఈ సౌరకుటుంబం ఏర్పడిన తొలిదశలో బయటి గ్రహాలు ఇంకా రూపుదిద్దుకోలేదు. ప్లూటో కక్ష్య ప్రాంతాల్లో ఘనీభవించిన వాయువుల ముద్దలు అప్పుడప్పుడూ తోకచుక్కలూ, ఉల్కల రూపంలో సూర్యుడికేసి విసురుగా వచ్చిపడుతూ ఉండేవి. ఈ తాకిడి రానురాను తగ్గినా పూర్తిగా ఆగిపోలేదు.

తొలి దశలో భూమి ఊహాచిత్రం
ఆ యుగంలో భూగ్రహం మీద ఇటువంటివి అడపాదడపా పడుతూ ఉండడం వల్లనే నీరూ, జీవకోటి ఆవిర్భావానికి దారితీసిన జీవరసాయన పదార్థాలూ దిగుమతి అయాయని కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. అంతకుముందు భూమి సెగలు కక్కుతూ, వేడిగా ఉండేది. గ్రహంగా ఏర్పడ్డప్పుడు అంత వేడి లేకపోయినా, సూర్యుడిలాగే భూమియొక్క పదార్థరాశి గురుత్వాకర్షణవల్ల సంకోచం చెందింది. ఆ కారణంగానూ, అప్పటికి ఇంకా రేడియోధార్మికత పూర్తిగా క్షీణించని బరువైన అణువులు ఎక్కువగా ఉండడంవల్లనూ భూమి వేడెక్కసాగింది. అందువల్ల నికెల్, ఇనుమువంటి బరువైన లోహాలతో కూడుకున్న కేంద్రం ద్రవరూపాన్ని సంతరించుకుంది. ఆ కారణంగా భూమివంటి గ్రహాలకు అయస్కాంతక్షేత్రం ఏర్పడింది. మన కాళ్ళకు తగిలే భూపటలం అనబడే పెచ్చూ (క్రస్ట్), దాని కింద మేంట్ల్ అనే పొరా విడిగా ఏర్పడ్డాయి. లోపలున్న వేడిమివల్ల నష్టం కలగనటువంటి జీవరాశి పుట్టుకొచ్చింది. ఎందుకంటే జీవరసాయనిక పదార్థాలు ఉష్ణోగ్రతలో కలిగే పెద్ద మార్పులకు తట్టుకోలేవు. ఈ రోజుల్లో గ్రీన్హౌజ్ వాయువుల ప్రభావాన్ని గురించిన ఆందోళన అందుకే.
ఇక వాతావరణం సంగతి. మొదట్లో తేలికైన వాయువులన్నీ వేడెక్కిన భూమి అంతర్భాగంనుంచి క్రమంగా అగ్నిపర్వతాలనుంచి బైటికి రాసాగాయి. వీటిలో నైట్రొజన్, కార్బన్ డయాక్సైడ్వంటివి రోదసిలోకి వెళిపోకుండా భూమ్యాకర్షణవల్ల వాతావరణపు పొరగా ఏర్పడ్డాయి. నీటి ఆవిరి వర్షంగా కురిసి సముద్రాలూ, మహాసముద్రాలూ ఏర్పడడానికి దారితీసింది. కురిసిన చోట ఉండిన లవణాలు నీటిలో కరిగి సముద్రాలన్నీ ఉప్పునీటితో నిండాయి. కార్బన్ డయాక్సైడ్ శిలలతో రసాయనికంగా కలవగా కార్బొనేట్లు ఏర్పడి ఉంటాయి. అవి నీటిలో కరిగి లవణాలుగా రూపొందాయి. ఈనాడు అగ్నిపర్వతాలనుంచి వెలువడే వాయువుల్లో ఆక్సిజన్ ఉండదు.
ఇదే పరిస్థితి అప్పుడూ ఉండేదని అనుకుంటే ఈ రోజుల్లో కనబడుతున్న 21 శాతం ఆక్సిజన్ ఆ తరవాత ఇతర మార్పుల కారణంగా గాలిలో చేరింది నీటిలో తొలిగా అవతరించిన మొక్కలు సూర్యరశ్మి వల్ల కిరణసంయోగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తూ ఉండేవి. ఇది క్రమంగా పెరిగి, సుమారు 57 కోట్ల సంవత్సరాల కిందట నీటిలోనూ, గాలిలోనూ ఎంతగా కలిసిందంటే ఆక్సిజన్ను పీల్చి బతకగలిగిన జంతువులు పుట్టుకురావడం ఆ తరవాతనే సాధ్యమైంది. మరికొంతకాలానికి, అంటే 40 కోట్ల సంవత్సరాల కిందట, గాలి పీల్చే భూచరాలు కూడా ఆవిర్భవించాయి.
దీనివల్ల తేలుతున్నదేమంటే ప్రాణుల ఆవిర్భావానికి అడ్డు తగలనివీ, దోహదపడేవీ అనేక పరిస్థితులు ఒక్కసారిగానో, క్రమంగానో కలిసిరావడంవల్ల ఇతర గ్రహాలకు భిన్నంగా ఒక్క భూమి మీద మాత్రమే జీవాలు పుట్టుకురాగలిగాయి. సరిగ్గా ఇటువంటి పరిస్థితులే మరే గ్రహం మీద ఒనగూడినా జీవరాశి ఉద్భవించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కుజగ్రహంమీద ఒకప్పుడు నీరు ఉండేదని ఖచ్చితంగా తెలుస్తోంది. ఆ కాలంలో జీవకణాల పుట్టుకకు దారితియ్యగలిగిన పరిస్థితులు ఉండేవేమోనని శాస్త్రవేత్తలు ఆశగా అన్వేషిస్తున్నారు. ఉల్కల్లోనూ, తోకచుక్కల్లోనూ సేంద్రియ (ఆర్గానిక్) కణాలున్నాయని వారు అనుమానిస్తున్నారు. భూమికి వెలపల ఎక్కడ జీవకణాలు దొరికినా అది అద్భుతమైన విషయంగా అనిపిస్తుంది.
భౌతికవాద దృక్పథం ఉన్నవారికి మాత్రమే ప్రకృతిని గురించీ, మనుషుల స్థానం గురించీ సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆ తరవాత మనందరికీ జీవవైవిధ్యాన్నీ, పర్యావరణాన్నీ కాపాడుకోవడమనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం ఉండదు.
————–
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.
9 Responses to విశ్వంలో మనిషి స్థానం