శ్రీ రమణీయ చానెల్- రెండవ భాగం

ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన ఊరు, బాల్యం లోని సంఘటనలు, వ్యక్తులు – వీటన్నిటి ప్రభావం తర్వాతి జీవితం లోని అభిరుచులూ, అలోచనా విధానం పై తప్పక ఉంటుంది. అదీ రచయితల విషయం లో ఐతే ఆ చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ తరిగిపోని ప్రేరణా, పెన్నిధీ కూడా. అటువంటి తమ పా’తలపోతల్ని’ మనతో కలబోసుకుని తర్వాత్తర్వాత ఆ చిన్న అలవాట్లే ప్రవృత్తిగా,వృత్తిగా, సర్వస్వం గా తన జీవితం తో పెనవేసుకుపోయిన వైనాన్నిరమణీయమైన రెండవభాగం లో మిథునం కథల మాయావి మాటల్లో చదవండి.

తొలిరోజుల్లో పఠనం

చిన్న చదువులో బాల పత్రిక నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. ఆ నాటి విద్యా విధానం, ఉపాధ్యాయులు మా తరం యువతని ఎంతగానో ప్రభావితం చేశాయి. హైస్కూల్లో స్థాయికి తగిన జనరల్ పుస్తకాలు వుండేవి. ఒక్కొక్కటి 40 ప్రతులు.

పంచతంత్రం, బొమ్మల భారతం, రామాయణం లాంటివి వుండేవి. పెద్ద తరగతుల వాళ్ళకి శరత్ అనువాదాలు, రాజు – పేద, కాంచన ద్వీపం లాంటి పుస్తకాలు యిచ్చేవారు. డిక్ష్నరీ ఎలా చూడాలో నేర్పించేవారు. మా తెలుగు మాస్టారు స్కూల్ ఫైనల్ స్థాయి వరకు సరిపడే నిఘంటువుని కూర్చారు. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తను రాసిన ఖండ కావ్యాన్ని (పెనుగొండ లక్ష్మి) తనే పాఠ్యాంశంగా చదువుకున్నారట!

విశ్వనాథ, కరుణశ్రీ లాంటి మన కవులు తాము రచించిన కావ్య ఖండికలను తామే బోధించడం వింత విశేషం! ఆ విద్యార్థులు ఎంత అదృష్టవంతులు!

ఫిజిక్స్‌లో పోస్ట్ డాక్టరేట్ చేసి, పురావస్తు శాస్త్రం, తెలుగు సాహిత్యం, జానపద సాహిత్యంపై సాధికారత సాధించిన శ్రీపాద గోపాల కృష్ణమూర్తి పాఠాలు విన్నాను. వూరూరు తిరిగి ఆయన సేకరించిన జానపదాలు వారే పాడగా విన్నాను. పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి “కౌసల్య” నవల సీరియల్‌గా వచ్చే రోజుల్లో ఆయన మాకు ఇంగ్లీషు పాఠాలు చెబుతూండేవారు. కౌసల్య నవల భారతీయ భాషలన్నింటిలోకి అనువదితమైంది. తల్లిదండ్రులు సినిమాగా వచ్చింది. స్కూలు రోజుల్లోనే సారస్వత పరిషత్ పుణ్యమా అని చాలా బరువైన పుస్తకాలు భట్టీయం వేయాల్సి వచ్చింది. తోచెంచుక్కలు, పూచెంగలువలు లాంటి సంథి సూత్రావళిని వల్లించాను. ఉదాహరణలు కూడా చిన్నయసూరి ఎంత అర్థవంతంగా యిచ్చారోనని తరువాత తెలిసింది. వ్యాఖ్యని “రమణీయం” పేరుతో రాసిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రిని చూశాను. ఆయన వచనం చాలా బావుంటుంది. “చంద్రవంక” లాంటి వాగు కఠినశిలల్ని సైతం “నీటికింబల్చన” చేస్తూ లేడిపిల్లలా దూకినట్టు వుంటుంది దువ్వూరి వచనం. దేవులపల్లి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మల వచనం కవితాత్మతో కస్తూరి పరిమళంతో సాగుతుంది. ముగింపులు నెమలి పురివిప్పి ముడిచిన చందంగా వుంటాయి. ఎప్పటికైనా వాళ్ళ రీతిలో ఒక్క వాక్యం రాయగలనా అని కలలు కనేవాణ్ణి.

పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి నాకో వ్యసనం. దాదాపు యాభై ఏళ్ళ క్రితం, అడవి బాపిరాజు నవలలు, విశ్వనాథ రచనలు, ముద్దు కృష్ణ వైతాళికులు, పానుగంటి సాక్షి, తాపీ ధర్మారావు “విజయోల్లాస వ్యాఖ్య”, పోతన భాగవతం, శతక సాహిత్యం, మధుకలశమ్ (ఉమర్ ఖయ్యాం అనువాదం – ఫిట్జ్‌గెరాల్డ్ ఆంగ్లానువాదం నుంచి) కరుణశ్రీ ఉదయశ్రీ, బారిష్టర్ పార్వతీశం — యిలా కొన్ని పుస్తకాలు తప్పనిసరిగా చాలా యిళ్ళలో వుండేవి. మా ఇంట్లో యింకొంచెం ఎక్కువగా వుండేవి. కాలేజీలో చేరేనాటికి, చేరాక డిగ్రీలో వుండగా ఆంధ్ర వార పత్రికలో నా మొదటి కథ వచ్చింది. ఎమెస్కో ఇంటింటా సొంత గ్రంథాలయమంతా వచ్చి చేరింది. ఇష్టమైన రచయితలను మళ్ళీ మళ్ళీ చదవడం, కొత్త అందాలను పట్టుకోవడం నా అలవాటు.

తెనాలి/ బాపట్ల ప్రముఖులు

తెలుగునాటకం అనగానే స్ఫురించే డా. కొర్రపాటి గంగాధరరావు; స్త్రీ జనాభ్యుదయాన్ని కాంక్షించి సేవాకార్యక్రమాలతో బాటు, శారద లేఖలు ద్వారా రచయిత్రిగా వాసికెక్కిన కనుపర్తి వరలక్షుమ్మ; 70, 80 సంవత్సరాల క్రితమే తెలుగులో రచనలు చేసిన మహిళలను గుర్తించి, “ఆంధ్ర కవయిత్రులు” పుస్తకాన్ని వెలువరించిన ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ మా ఇరుగు పొరుగు. ఆమె తండ్రి మధురకవి నాళం కృష్ణారావు సాహితీ లోకంలో లబ్ధ ప్రతిష్టులు. జీవితాన్నీ, ఆస్తిపాస్తులను హేతువాద వుద్యమానికి ధారపోసిన మల్లాది దంపతులు (ఎమ్.వి.రామ్మూర్తి, మల్లాది సుబ్బమ్మ) మా గుమ్మానికి మూడు గుమ్మాల దూరంలో వుండేవారు.

నా కంటె సీనియర్. అప్పటికి బాపట్ల కాలేజి లేదు. చీరాల కళాశాల ప్రోడక్టు. సినిమా హీరోగా, రాజకీయనేతగా, గవర్నర్‌గా ఎల్లలెరిగిన కోన ప్రభాకర రావుది మా వీథి. దీక్ష సినిమాతో “దీక్ష రాంగోపాల్”గా వాసికెక్కిన పిల్లవాడు లాయర్ కాళిదాసు గారి అబ్బాయి. ఆడ వేషాలలో అగ్రస్థానం పొందిన స్థానం నరసింహారావు బాపట్లవాసి. నాకు వేలు విడిచిన తాతయ్య. సత్యభామ, రోషనార వేషాలలో స్థానం అద్భుతంగా వుండేవారని చెప్పుకునేవారు. నేను వారిని మఫ్టీలో చూడటమే గాని చీరకట్టులో చూడలేదు. “మీర జాల గలడా…” పాట మాత్రం పలుసార్లు ప్రత్యక్షంగా విన్నాను.

బాపట్లలో లాయర్లు ఎక్కువ. దాదాపు వందమంది. అప్పట్లో చెన్నపట్నం సంస్కృతి కొంచెం కనిపిచేది. భావనారాయణ స్వామి గుడి ప్రాచీనమైంది. దాని వల్ల భావపురిగా పుట్టి, బ్రిటిష్ హయాంలో బాపట్ల అయింది. అయిదారు మైళ్ళలో సముద్రం వుంది. వాతావరణం అన్ని కాలాల్లోనూ బావుండేది. నేను పెరిగిన వాతావరణం ఇది.

వేమూరి గగ్గయ్యని వినడమే గాని చూడలేదు. వాళ్ళబ్బాయి వేమూరి రామయ్యని ఎరుగుదును. వేమూరులో వారి ఇంటి కాంపౌండ్‌లోనే ఓపెనెయిర్ నాటకశాల వుండేది. రామయ్యకి కర్ణుడు వేషం బాగా నప్పేది. వేమూరు హైస్కూల్లో చదివేటప్పుడు హార్మోనియం నేర్చుకున్నాను. నాకు అంత యిష్టం లేదు గాని మా నాన్నకి సరదా. ఆరేళ్ళ రామయ్య (నిజంగానే ఆయన రెండు చేతులకు ఆరేసి వేళ్ళుండేవి. బొటన వేళ్ళకి అంటుకుని చిన్న వేళ్ళు) తెనాలి పౌరాణిక నాటకాలకి పెట్టింది పేరు, కాశీ క్షేత్రం. ఓగిరాల, శనగవరపు, విష్ణుంభొట్ల, రామయ్య, పంచనాధం అప్పట్లో డబల్‌రీడ్ హార్మోనియంలో ప్రసిద్ధులు. అంబా ప్రసాద్‌ని చూశాను హార్మణీ రీడ్స్ మీద ఆయన పది వేళ్ళూ పాతికలా నాట్యం చేయడం విన్నాను. పెద్ద ఆర్టిస్టులకు వ్యక్తిగత హార్మనిస్టులు వుండేవారు. కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య, పీసుపాటి నరసింహమూర్తి, అద్దంకి, మాధవపెద్ది వీరంతా తెనాలిలోనే వుండేవారు. ఒక పేటంతా ద్రౌపదులు, సీతలు, చింతామణులు, చిత్రలు వుండేవారు. నేను మా గురువుగారితో వెళ్ళాలి కనుక గొప్ప గొప్ప కాంబినేషన్లతో పౌరాణిక నాటకాలు వందలాదిగా చూశాను. చింతామణి అయితే లెక్కే లేదు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (ఇప్పుడు వృద్ధులై భక్తి టివిలో ప్రవచనాలు చేస్తున్నారు) చింతామణిగా ప్రేక్షకుల్ని పరవశింపచేసేవారు. మాధవపెద్ది, పిఠాపురం బిల్వమంగళుడు భవానీశంకరుడుగా తరచు కనిపించేవారు. “తాతల నాటి క్షేత్రముల్ తెగనమ్మి దోసిళ్లతో ధారవోసినాను… అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…” అనగానే చప్పట్లు మొదలై, ఆనక ఈలలు వన్స్‌మోర్‌లు దద్దరిల్లేవి. ఉద్యోగ విజయాల్లో జెండాపై కపిరాజుకి, హరిశ్చంద్రలో కాటిసీన్‌కి వన్స్‌మోర్‌లు పడకపోతే నాటకం రక్తి కట్టలేదని లెక్క. కాటిసీన్‌లో “ఇచ్చోట ఏ లేత ఇల్లాలు నల్లపూసల సౌరు…” తో సహా నాలుగైదు పద్యాలు కవి జాషువావి. వాటిని తెచ్చి యిక్కడ కలిపేశారు. “ముదురు తమస్సులో”, “భస్మ సింహాసనం” లాంటి మాటలు నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత నాకిక పద్య పాదాలు కాదు, కవి పాదాలే కన్పించేవి. ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లే భావం. అనితర సాధ్యమైన మాట కట్టు. నిజం, నవ్యాంధ్ర మహా రాష్ట్రానికి పీష్వా మా జాష్వా అన్నది సత్యం పునఃసత్యం. ఆ కవి కోకిలను నేను చూశాను. వేమూరికి సరిగ్గా మైలు దూరం రావికంపాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు స్వగ్రామం. మేము స్కూలుకి వెళ్ళే రోజుల్లో ఆయనని వేమూరులో చూసేవాళ్ళం. అప్పటికే ఆయన సినిమాల ద్వారా సుప్రసిద్ధులు. మద్రాస్ నుంచి సొంత వూరు వచ్చినప్పుడు వేమూరులో ఒక కిళ్ళీ కొట్లో సాయంత్రం పూట వచ్చి కూచునేవారు. ఆ కొట్టు యజమాని గుమ్మడి బాల్యమిత్రుడు. చాలా అందంగా వుండేవాడు. గుమ్మడి కూచుంటే ఆ సెంటరంతా సందడి సందడి అయిపోయేది. ఇంక మేం సరేసరి. తర్వాత సినిమా రంగానికి నేను దగ్గరయాక ఆనాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. గుమ్మడి మంచి మాటకారి. అంటే చమత్కారంగా మాట్లాడడం కాదు. ఒక సంఘటనని చూసినట్టు చెప్పగలరు. వ్యక్తుల్ని చక్కగా విశ్లేషించగలరు. దశరథుడు అచ్చం యిలాగే వుంటాడని యావత్ ప్రపంచాన్ని తన వేషభాషలతో నమ్మించారాయన. “సీతా కళ్యాణం” చికాగో ఫెస్టివల్‌లో ప్రదర్శించినపుడు అక్కడి వారిని అధికంగా ఆకర్షించింది దశరథుడే!

దేశ పర్యటన

పర్యటన, సత్సాంగత్యం జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయని ఆర్యోక్తి. ఒక రోజు వున్నట్టుండి చిన్నసంచీ తగిలించుకుని ప్రత్యేకమైన ప్రణాళిక లేకుండా బయలు దేరాను. కలకత్తా, లక్నో, బొంబాయి, ఢిల్లీ లాంటి నగరాలని ముఖ్యంగా అక్కడి సంస్కృతి సంప్రదాయాలను గమనించాలని వుత్సాహపడ్డాను. ట్రావెలర్స్ చెక్కులు, క్రెడిట్ కార్డులు లేని రోజులు. ఎక్కడ డబ్బులు అయిపోతే అక్కడ నుంచి అడ్రస్‌తో ఇంటికి టెలిగ్రాం యిస్తే వెంటనే టెలిగ్రాం మనియార్డర్ వచ్చేది. నచ్చిన చోట వారాల తరబడి వుండిపోయేవాణ్ణి. అలా నచ్చిన ప్రదేశాల్లో లక్నో ఒకటి. చాలా ప్రదేశాల్ని చూశాను. ప్రముఖుల్ని కలిశాను. నేషనల్ హెరాల్డ్ పత్రిక కోటంరాజు రామారావు సంపాదకత్వంలో అక్కడ నుంచే నడిచేది. బొంబాయిలో ముల్క్‌రాజ్ ఆనంద్ “మార్గ్” పత్రిక చాలా ప్రసిద్ధి. కలకత్తా సరేసరి. వంగసాహిత్యంలో గంగానదికి వారెంత ప్రాముఖ్యం యిచ్చారో? కథ చదివినా, కవిత చదివినా, వ్యాసం నవల ఏది చదివినా గంగ ప్రస్తావన వుండి తీరుతుంది. ఢిల్లీ వీథులు భారతీయ చరిత్రని చెబుతాయి. ఢిల్లీ కోటలో పాగా వేసిన ముంగండ అగ్రహారీకుడు పండిత రాయలు గుర్తుకు వస్తాడు. పర్యటనల్లో చెట్లు, గుట్టలు, శిథిలాలు, వీథులు, నదులు, వారథులు, భవనాలు అన్నీ మనకు బోలెడు సంగతులు చెబుతాయి.

ఉజ్జయిని వీథుల్లో ఒక నెలరోజులు తిరిగితే ఎందరు మహామహులు మదిలో మెదుల్తారు? దాదాపు రెండేళ్ళ తర్వాత మా వూరు చేరాను. ఇంకా రెండు దక్షిణాది రాష్ట్రాలు చూడనే లేదు. తగళి శివశంకరం పిళ్ళైని (చెమ్మీన్ నవలని “రొయ్యలు” పేరుతో పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు చేశారు) శంకరాచార్యుల పుట్టిన కాలడి గ్రామాన్ని తర్వాత చూశాను. తర్వాత దశాబ్దాలు గడిచాక నా మిథునం కథని ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ కాలడిలో చిత్రీకరిస్తానన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

రామకృష్ణమిషన్ (అద్వైత ఆశ్రమ్) ప్రచురణలు కొంతమేర చదివి కొద్దిగా అర్థం చేసుకుని వున్నాను. అద్వైత సిద్ధాంతకర్త, జగద్గురువు శంకరుడు ప్రతిపాదించిన మాయావాదాన్ని, స్వామి వివేకానంద నవీకరించి కాలానుగుణంగా భాష్యం చెప్పాడు. ముఖ్యంగా యువతకి అనుగుణంగా సనాతన ధార్మిక సూత్రాలను నవీనీకరించాడు. ఆకొన్నవాడికి అన్నం కావాలి గాని తత్త్వం కాదన్నాడు. ఆ తర్వాత దాన్ని మరోసారి వర్తమాన కాలానికి అనుగుణంగా జిడ్డు కృష్ణమూర్తి కొనసాగించాడని నాకు గల కొద్ది పరిజ్ఞానంలో అనిపించేది. శ్రీశ్రీ, “రోల్స్ రాయ్స్ కారు మిథ్యంటావా మాయంటావా నా ముద్దుల వేదాంతీ” అని ప్రశ్నించాడు. తప్పకుండా మాయే! తిరుగులేని ప్రజాభిమానం, రాష్ట్రం పట్టనంత అధికారబలం, అచంచల విశ్వాసం — యిన్నీ వున్న ఒక ముఖ్యమంత్రి కేవలం పది నిమిషాల్లో మాయం అవడం చూశాం. వేల కోట్ల రూపాయలు ఆర్జించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహారాజు కటకటాలు లెక్కించడం చూస్తున్నాం. పలాయనవాదాన్ని ఆశ్రయించనంత వరకు ముద్దుల వేదాంతి చెప్పినవన్నీ శిలాక్షరాలు. “పదండి ముందుకు” గీతాన్ని భజగోవిందం అనుస్టుప్ ఛందంలో రాసి, “భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ” అని తిరగేయడం నచ్చిందన్నాడు శ్రీ శ్రీ. శంకరుని అద్వైత వాదం వజ్ర సంకల్పంతో ప్రతిపాదించింది. కనుక కాలం గడిచిన కొద్దీ వజ్రం మరింత గట్టిపడుతుంది. పరంపరలో సానలు తీరి ప్రకాశిస్తుందని చాలామందిలా నేనూ నమ్ముతాను.

పేరడీలు/ జ్యోతి కాలమ్స్

5th photoనా లైబ్రరీలో “ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా” వచ్చి చేరింది. రాండమ్ హౌస్ డిక్ష్నరీ నా కల. అరవిందుని సావిత్రి యింకా మరికొన్ని. సంఖ్య కోసమో, చాలా కనిపించాలనో పుస్తకాలు చేర్చడం అనవసరపు ప్రయాస అని తొలినాళ్ళలోనే గ్రహించాను. బాపిరాజు, విశ్వనాథల నవలలు, జాషువా కవిత్వం, ముద్దుకృష్ణ వైతాళికులు, శ్రీశ్రీ, తిలక్, చలం పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకునేవాణ్ణి. కుటుంబరావు, బుచ్చిబాబు, శ్రీపాద, ముళ్ళపూడి, ఆనాటి పాప్యులర్ రచయిత్రుల్ని రంగనాయకమ్మని చదివాను. “రామాయణ విషవృక్షం” చదివాక ఆమెలో కొంత అయోమయం వుందనిపించింది. మనం సృష్టించని పాత్రల్ని మనం సవరించే బాధ్యత మీద వేసుకోకూడదు. గిరీశం అలా ప్రవర్తించలేదు, యిలా ప్రవర్తించివుంటాడని వందేళ్ళ తర్వాత మనం చెబితే గిరీశం కంటే హాస్యాస్పదంగా తయారవుతాం. ప్రజల నమ్మకాలు విశ్వాసాలు ముడిపడివున్న వాటి జోలికి పోవడం మర్యాద కూడా కాదు.

సొంత శైలి గల రచయితల్ని చదివాక, అప్పుడప్పుడు పేపర్ చదువుతూ — యిదే వార్తని గురజాడ రాస్తే, విశ్వనాథ లేదా బాపిరాజు రాస్తే… అని వూహించేవాణ్ణి. నాకే తమాషాగా అనిపించింది. అప్పుడు వచ్చింది పేరడీ ఆలోచన. వచనంలో అప్పటికి పేరడీ ఒక ప్రక్రియగా రాలేదు. జరుక్, మాచిరాజు దేవీ ప్రసాద్ గురించి తెలుసు. ఒకటి రాసి ఆంధ్రజ్యోతి (డైలీ)కి పంపాను. నాలుగు రోజుల్లో నండూరి రామమోహనరావు ప్రచురిస్తున్నామనీ, బావుందనీ, రాయండనీ పెద్ద ఉత్తరం రాశారు. 21, 22 ఏళ్ళ వయసులో ఆ వుత్తరం ఎంత నిషా! ఇక చూస్కోండి! వరసపెట్టి రాసేశాను. ఆయన వేసేశారు. పైగా ప్రతిసారీ ఒక పెద్ద ఉత్తరం అందులో మెచ్చుకోళ్ళు. నా ఆప్తమిత్రులు బాపు రమణ కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారని రాశారు. అలా గాలి మీద నడుస్తూ, నేను ఆంధ్రజ్యోతిలో కాలమ్ రాస్తాన్సార్ అని జాబు రాశాను. భలే వారే, రాయండి అన్నారు. “రంగుల రాట్నం” పేరుతో ఆంధ్రజ్యోతి డైలీలో ప్రతి మంగళవారం ఎడిట్ పేజిలో వచ్చేది. మొదటి పేజిలో చిన్న బాక్స్‌లో “రంగుల రాట్నం” ప్రకటన వుండేది. ఈ విధంగా వారానికి రెండుసార్లు “శ్రీరమణ” పేరు పెద్దక్షరాలలో అచ్చులో కనిపించేది. ఆ రోజుల్లో విజయవాడ నుంచి ఒకే ఎడిషన్‌గా ఆంధ్రజ్యోతి వెలువడేది. అయితే దీనికి యీవెనింగ్ ఎడిషన్ కూడా వుండేది. అదే రాయలసీమకు మర్నాటి ఉదయపు ఎడిషన్‌గా వెళ్ళేది.

సంజీవదేవ్‌తో…

ప్రఖ్యాత సాహితీవేత్త, చిత్రకారులు అన్నిటినీ మించి గొప్ప మానవతావాది, అతిధేయుడు అయిన సంజీవదేవ్‌తో అప్పటికే పరిచయం వుంది. వారానికి కనీసం ఒక్కసారైనా తుమ్మపూడి వెళ్ళడం, వారింట (“రసరేఖ”) కమ్మని భోజనం ఫలహారాలు ఆరగించడం ఒక వ్యసనం అయింది. నేను కేవలం ఇంటావిడ సులోచన వండి వడ్డించే ప్రశస్థమైన భోజనం కోసం వస్తున్నానని ఇంటాయన పసికడతాడేమోనని కొంచెం సాహిత్య విషయాలు కూడా ప్రస్తావించేవాణ్ణి. చివరిదాకా పట్టుబడకుండా లాగించాను. ఇది నా క్రియేటివ్ టాలెంట్‌కి గీటురాయి! మా యిద్దరికీ ఒక బాదరాయణ సంబంధం వుంది. సంజీవదేవ్ 17, 18 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా హిమాలయాలకు పారిపోయారు. నేను కూడా అదే వయసులో రామకృష్ణమిషన్ ప్రత్యేక ఆహ్వానంపై హిమాలయాలకు వెళ్ళాను. ఆల్మోరా జిల్లాలో “మాయావతి” అని ఒక ప్రదేశం. అక్కడ మాయావతి పేరుతో చిన్న నది వుంది. అక్కడ బ్రిటిష్ దంపతులు కెప్టెన్ సేవియర్, మదర్ సేవియర్ తమ ఎస్టేట్‌ని వివేకానందకు సమర్పించారు. వారు స్వామి వివేకానంద శిష్యులు. అక్కడ మిషన్ హెడ్‌ క్వార్టర్స్, ఒక ఉచిత హాస్పిటల్ వుండేవి. అక్కడ అయిదారుగురు స్వామిజీలు మాత్రం వుండేవారు. మిషన్ నడిపే ప్రబుద్ధ భారత (Awakened India) మంత్లి ఎడిటోరియల్ బోర్డు అక్కడ వుండేది. దాని ప్రింటింగ్ వగైరా కలకత్తా (నరేంద్రపూర్) నుంచి నిర్వహించేవారు. అక్కడ స్వామీజీల తోబాటు, వారి ప్రత్యేక ఆజ్ఞపై వెళ్ళి వున్నాను. అదొక గొప్ప అనుభవం. వరసగా ఆరేళ్ళు వివేకానందునిపై వేర్వేరు వ్యాసాలు రాసి బహుమతి పొందాడని నన్ను పిలిచారు. అక్కడికి దేశవిదేశాల నుంచి బోలెడు పత్రికలు వచ్చేవి. అక్కడ “త్రివేణి” కనిపిస్తే ప్రాణం  లేచి వచ్చింది. బందరు నుంచి వచ్చే ఆంగ్ల “త్రివేణి”కి ఎంతో పేరుండేది. భావరాజుని చూశావా అని అడిగారు స్వామీజీలు. చూశానని నిజం చెప్పాను. ఆశ్రమంలో నాకో సువిశాల భవనంలో బస. కొయ్య పలకలతో నిర్మించిన భవంతి. అందులో మునుపెప్పుడో రవీంద్రనాథ్ ఠాగోర్, జె.సి. బోసు లాంటి మహానుభావు కొంతకాలం వున్నారట. వృక్షాలకు ప్రాణం వుందని తెలియచెప్పిన జె.సి.బోసు — పొద్దున పూట, సాయంత్రం వేళ అలా నడిచి వెళ్తుంటే చెట్లు తలవంచి నమస్కరించేవట! ఇది కొంచెం అతిశయోక్తే కావచ్చుగాని ప్రాణమున్న చెట్లకి ఆయన పట్ల ఆమాత్రం గౌరవం వుండి వుండచ్చు కదా. అక్కడ చాలా గొప్ప లైబ్రరీ వుంది. ఠాగోర్, వివేకానంద లాంటి మహనీయుల చేతి రాతలు అక్కడ చూశాను. రవీంద్రుని “Home Coming” కథ ఆయన దస్తూరితో చదివాను. చాలదా యీ జీవితానికి?

సంజీవదేవ్ యిల్లు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా వుండేది. మా తెనాలికి పదిహేను మైళ్ళలో తుమ్మపూడి. ఊరి పక్కనుంచి బకింగ్‌హామ్ కాలవ. ఆ కాలవ దాటితే చిన్నపాలెం, పెద్దపాలెం. అక్కడే మోరంపూడి. కొంగర జగ్గయ్య స్వగ్రామం. రాహుల్ సాంకృత్యాయన్ నుంచి ఎందరో విశ్వవిఖ్యాతులు “రసరేఖ”లో సేద తీరారు. నేను నిలయ మరియు నిలవ విద్వాంసుణ్ణి కనుక అక్కడ పెద్దవాళ్ళతో పరిచయాలు అయేవి. పలు సందర్భాలలో నేమ్ డ్రాపింగ్‌కి వుపయోగపడేవి. వారింట వుండటమేగాక ఎప్పుడూ వూళ్ళు తిరిగే సరదావున్న సంజీవదేవ్‌తో కూడా వెళ్ళడం అలవాటు చేశాను. కొన్నాళ్ళకి వెంట నేను లేకపోతే ఆయనని ప్రజానీకం గుర్తుపట్టని పరిస్థితి కల్పించాను. బెంగుళూరులో, శాండల్‌‍వుడ్ ఎస్టేట్ యజమానులుగావున్న సెతల్వొ రోరిక్ (నికొలస్ రోరిక్ కుమారుడు) దేవికారాణి గారింట ఆయనతో గడిపాను. నికొలస్ రోరిక్ ప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు. ఆయన హిమాలయాల్లో స్థిరపడి, వందలాది చిత్రాలు హిమాలయ థీమ్ మీదనే వేశారు. సంజీవదేవ్ ఆయనతో కొంతకాలం వున్నారు. పెళ్ళికానుకగా సంజీవదేవ్‌కి పంపిన “దిగంగ” అనే రోరిక్ మాతృక తుమ్మపూడిలో వుంది. కొన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో ఆయన పరిచయాలన్నీ నాకూ కాస్తో కూస్తో అంటుకున్నాయి. పైన మనవి చేసినట్టు ఇప్పటికీ నేమ్ డ్రాపింగ్‌‍కి ఎంతగానో ఉపయోగపడే అవకాశం వచ్చింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావుని, వి.ఆర్. నార్లని యిలాంటి అనేకానేక ప్రముఖుల్ని అక్కడే చూశాను. సంజీవదేవ్ కూడా మా యింటికి వచ్చేవారు. ఆయన వస్తున్నారని చాలామంది సాహితీ ప్రియులు కూడా వచ్చేవారు. మా వూరంతా సందడిగా మారేది. ఇలా కాలక్షేపం జరుగుతూ వుండగా —

ఆంధ్రజ్యోతి నుంచి జాబు

పోజు లేని గొప్ప ప్రోజు రైటర్. అందగాడు. యాభైల్లో వున్న నండూరి ఓ పదేళ్ళు తొక్కేసి చెబితే ఎవ్వరూ అనుమానించరు.

ఆంధ్రజ్యోతి నుంచి నండూరి రామమోహనరావు ఒకసారి రమ్మని జాబు రాశారు. కొన్నేళ్ళుగా ఆంధ్రజ్యోతికి రాస్తున్నా నేను వారిని కలవలేదు. వారు నన్ను చూడలేదు. ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కి వెళ్ళాను. “మీ రాతలు చూసి మినిమమ్ అరవై అనుకున్నా…” అని ఆశ్చర్యపోయి అభినందించారు. ఆయనని నేను ఒకటి రెండు సందర్భాలలో దూరం నుంచి చూశాను. పోజు లేని గొప్ప ప్రోజు రైటర్. అందగాడు. యాభైల్లో వున్న నండూరి ఓ పదేళ్ళు తొక్కేసి చెబితే ఎవ్వరూ అనుమానించరు. సాయంత్రం దాకా కబుర్లు చెప్పి, వెళుతూ వెళుతూ ఇంటికి తీసికెళ్లారు. రేడియో స్టేషన్ ఎదురు సందులో (పున్నమ్మ తోట) మేడ మీద వుండేవారు. మేము కొత్తగా మూడు పేపర్లు పెట్టాలనుకుంటున్నాం. “వనితా జ్యోతి, బాల జ్యోతి, యువ జ్యోతి — మీరు వస్తే సంతోషిస్తాను” అన్నారు. ప్రస్తుతం జీవితం బావుంది. స్వేచ్ఛగా కాలం గడుస్తోంది. సంజీవదేవ్ పరిచయం మరింత ప్రభావితం చేసింది. ఉత్తరాలు రాస్తూ, అందుకుంటూ; చదువుకుంటూ; ఇష్టమైన మిత్రుల్ని కలుస్తూ పిలుస్తూ; పొలం గట్లన తిరిగివస్తూ; వెళ్ళాలనిపించిన చోటికి సంచి సర్దుకు వెళ్ళిపోతూ ఎంతో బావుంది. కొంచెం ఆలోచించుకుని చెబుతానన్నాను. మొత్తం మీద ఆ పూటే “సరే” అనిపించేలా చేశారు నండూరి. నండూరి, పురాణం చాలా బలమైన సూదంటురాళ్లు. నాలాంటి గుండు సూదిని లాగలేరా! నండూరి “కాంచనద్వీపం” “టామ్‌సాయర్” ఆ వచనశైలి చిన్నప్పుడు ఎంత అలరించాయి. తరువాత రాసిన “నరావతారం”, “విశ్వరూపం” అనితరసాధ్యం. “విశ్వదర్శనం” రాసే నాటికి నేను సలహాలిచ్చేంత పెద్దవాణ్ణి అయాను. కాని ఒక్కటి కూడా స్వీకరించకపోవడం వారి విజ్ఞతకి తార్కాణం. అలాగ ఆంధ్రజ్యోతి సంపాదకవర్గంలో నేను సైతం ఒక కలం అయాను. జీవనశైలి మారింది. పురాణం, నండూరి కోసం ఎందరో గొప్ప గొప్ప వాళ్లు వస్తూండేవారు. బాపురమణ ముఖ్యులు. ఆరుద్ర, రావిశాస్త్రి, కాళీపట్నం, చాసో, సోమసుందర్, సినారె, భమిడిపాటి జగన్నాథరావు, భరాగొ, విజయవాడ ఆకాశవాణి మొత్తం, ఐజె రావు, జ్యేష్ట, ఆదివిష్ణు, గొల్లపూడి. . . ఒకరేమిటి, యు నేమిట్. వడ్డెర చండీదాస్ “హిమజ్వాల”, శంకరమంచి సత్యం “అమరావతి కథలు” అచ్చులోకి రాకముందు నుంచి నేనెరుగుదును. ఎన్నో “ఇల్లాలి ముచ్చట్లు” పురాణం చెబుతుంటే నేను రాశాను. తర్వాత పెట్టాలనుకున్న మూడు మాసపత్రికల్లో రెండు పెట్టారు. “యువ జ్యోతి” ప్రారంభించలేదు. అప్పటికే “జ్యోతి చిత్ర” వస్తోంది. నేను ఆ పత్రికల కంటే ఆంధ్రజ్యోతి వీక్లీ పని, జ్యోతి డైలీ, ఆదివారం సాహిత్యానుబంధం ఎక్కువ చూసేవాణ్ణి. తెగ రాసేవాణ్ణి. ఒకసారి బాపు రమణ వచ్చి “శరత్ కథా చంద్రిక” అని టైటిల్ చెప్పి, శరత్ నవలల్ని సంక్షిప్తంగా రాయించండి అని సలహా యిచ్చారు. వెంటనే నండూరి ఆ పని నాకు అప్పగించారు. ఆఖరికి “శ్రీకాంత్” లాంటి భారీ నవలను కూడా ఎనిమిది కాలాల్లోకి దించాను. ఒక ఫైన్ మార్నింగ్ నండూరికి మద్రాస్ నుంచి వుత్తరం వచ్చింది. కొడవటిగంటి రాశారు. “అన్యాయం, వుత్సాహం వుందని అంతలా రాయించకూడదు. శ్రీరమణని చూడాలని వుంది. తీసుకు రాకూడదూ” అని కార్డు రాశారు. కొ.కు ఆంధ్రవారపత్రికలో నండూరికి పైవారు. గురుతుల్యులు. వెంటనే మద్రాస్ వెళ్ళాం. అప్పుడాయన విజయ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. మేమంతా తెనాలి వాళ్ళమేనని తెలుసుకుని మరింత ఆనంద పడ్డాం. తెనాలిలో ఎంతమంది జీనియస్‌లు పుట్టారు? అదో పెద్ద గ్రంథం.

బాపు రమణలు — సినిమా

ఓ రోజు బాపురమణ విజయవాడ వచ్చినపుడు, ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కి వచ్చారు. నా టేబుల్ దగ్గర కొచ్చారు. బాపు, “నా కార్టూన్స్‌ని నవోదయా వారు పుస్తకంగా వేస్తామన్నారు. ఇదే నా మొదటి బుక్కు. మీరు ముందుమాట రాస్తే సంతోషం” అన్నారు. అరె! తప్పకుండా… ఎప్పటిలోగా యివ్వాలన్నాను ఆదుర్దాగా. బాపు నవ్వేసి అంత కంగారు లేదు, టేక్ యువరోన్ టైమ్ అని స్థిమిత పరచారు. నిజానికి అలా అనకూడదట. నేనేంటి, మీ పుస్తకానికి రాయడమేంటి, అని కొంచెం మొహమాటం ప్రదర్శించాలిట. నాకేం తెల్సు. వెంటనే రాసిచ్చేశాను కూడా. తర్వాత ఓ ఫైన్ యీవెనింగ్ బాపురమణలు అన్నారు కదా — “ఇంక యింతే, పేపర్లు రోజూ అలా గుద్దేస్తూ వుంటారు. ఇలా అయిపోతూ వుంటాయ్. ఇదొక రొటీన్. మీరు మద్రాస్ వచ్చెయ్యండి” అని ఆశపెట్టారు. అప్పటికే సింగీతం శ్రీనివాసరావు సినిమాకి (“గందరగోళం”) మాటలు రాశాను. ఇంకా కొన్ని కథా చర్చల్లో పరుపుల మీద కూచున్న అనుభవం వుంది. “జై పరమేశ్వరా” అని మద్రాసు చెక్కేశాను.

పొలం గట్ల మీద తిరుగుతూ, అందమైన సూర్యాస్తమయాలను చూస్తూ వుండేవాణ్ణి మద్రాస్ మెరీనా బీచ్‌లో పైకి లేచే సూర్యుణ్ణి చూస్తున్నాను. బావుంది. ఇదొక కొత్త అనుభవం. పైగా వున్నది బాపురమణలతో. వారిల్లు ఒక టోల్ గేట్. సినిమా ప్రముఖులే కాదు, సాహిత్య సంగీత కళారంగాలకు చెందిన వారందరినీ అక్కడ ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. దాదాపు ఇరవై ఏళ్ళకు పైబడి అక్కడే వారితోనే వున్నాను. మధ్యలో ఎన్.టి.ఆర్ వీడియో పాఠాలు తీయమంటే తరచు హైదరాబాదు వస్తుండే వాళ్లం. ఎక్కువగా నేను రమణగారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో బస. ఎర్రదీపం కారులో తిరిగేవాళ్లం. హైదరాబాదు వచ్చినపుడల్లా యాదగిరి గుట్ట వెళ్లేవాళ్లం. సినిమాలు ఒక ఎత్తు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను చిత్రీకరించి, వ్యాఖ్యానంతో మంత్ర సంగీత సహితంగా వాటిని రూపొందించడం ఒక ఎత్తు. ఎంత చిన్నపని అయినా శ్రద్ధాసక్తులతో దీక్షగా చేయడం బాపురమణల స్కూలు. శ్రీ భాగవత కథలు స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగా పూర్తయేదాకా మద్రాసులోనే వారితోనే వున్నాను. భాగవతానికి ఆరుద్ర, వేటూరి, జొన్నవిత్తుల పాటలు రాశారు. ధృవోపాఖ్యానం, రామలాలి పాట జొన్నవిత్తుల గొప్పగా రాశారు.

క్షీరసాగర మథనంకి వేటూరి రాసిన పాట అమృత తుల్యం. సుందరకాండని సంపూర్ణంగా ఆరుద్ర రాసి పుణ్యం కట్టుకున్నారు.

మళ్ళీ హైదరాబాద్‌కి

6th photoహైదరాబాదు వచ్చేశాను. అయినా ఇప్పటికీ బాపురమణలతో వున్నట్టే లెక్క. ఇక్కడికి రాగానే మిత్రులు శ్రీకాంత శర్మ ఆంద్రప్రభ వీక్లీ ఎడిటర్‌గా వున్నారు. షరా మామూలే అన్నట్టు కాలమ్ రాయించడం, తర్వాత నాతో పాటు మీరు కూడా. . . అన్నారు. వుద్యోగ అవసరం కూడా వుంది జై అంటూ జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రభ వీక్లీలో రెండేళ్ళపాటు ఎంతో ఆనందంగా నడిచింది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సంస్కృతాంధ్రాలు, ఆంగ్లంలో కూడా తగిన పరిశ్రమ చేసిన వారు. నాకు ఏనాటి మిత్రుడు! “కృష్ణావతారం” (సాంఘికం) సినిమాలో తొలి సినిమా పాట ఆయనతో బాపు రమణలే రాయించారు. ఆనక జంధ్యాల దర్శకత్వంలో, యింకా అక్కడక్కడా 40 పాటలు దాకా రాశారు. ఆంద్రప్రభలో ఆయన నాలుగేళ్ళ కాల పరిమితి ముగియగానే విరమించుకున్నారు. నేనూ విరమించుకున్నాను.

అప్పుడే “వెబ్‌సైట్ల” బూమ్ మొదలైంది. నీహార్ ఆన్‌లైన్ వారిదే సరసమ్ పోర్టల్. ఆ పోర్టల్‌ని నేను నింపాలి. మోహన్ బొమ్మలు. మొత్తం హాస్యం. దాదాపు వంద వారాలు మేమిద్దరం అనేకానేక హాస్యప్రయోగాలు చేశాం. పోర్టల్ 60 దేశాల్లో లక్షల క్లిక్స్‌తో క్లిక్ అయింది. సైట్ మాత్రం నిలవలేదు. మా లోపం లేదు. ఇంతలో ఆంధ్రజ్యోతి (అప్పటికి మూతపడి రెండేళ్ళు) పునఃప్రారంభం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐ. వెంకట్రావ్ (ఐ.వి.ఆర్) కొత్త యాజమాన్యానికి, యజమానులకు మధ్య సంధానకర్తగా వుండి సెటిల్ చేశారు. నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో వుండగా ఐ.వి.ఆర్ చీఫ్ రిపోర్టర్. నండూరి నమ్మే ఒకరిద్దరిలో ఐవిఆరే ఒకరిద్దరు! కొత్త ఆంధ్రజ్యోతికి కె. రామచంద్రమూర్తి ఎడిటర్‌గా పగ్గాలు పట్టారు. ఐ.వి.ఆర్ పట్ల నాకు గౌరవం, నా పట్ల ఆయనకు అభిమానం — అప్పట్నించీ (1974). ఐ.వి.ఆర్ తర్వాత అంధ్రజ్యోతి ఎడిటర్ అయారు. అనేక ఎడిషన్లుగా విస్తరించింది. ఐ. వెంకట్రావ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి స్వీకరించారు. సంస్థకి గుర్తింపు, సొంతభవనం ఆయన హయాంలోనే సంక్రమించాయి. సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం “పత్రిక” (మన మాస పత్రిక) పేరుతో ఒక మాస పత్రిక ప్రారంభించారాయన. ఐదురూపాయల వెలతో ఇప్పటికీ అది రెగ్యులర్‌గా వస్తూనే వుంది. దానికుండే పాఠకులు దానికున్నారు. అయితే, ఆయన ఆంధ్రజ్యోతికి రమ్మని పిలిచారు. మాతృసంస్థ కదా. పైగా ఏదో ఒకటి చెయ్యాల్సిన అవసరం వుంది. ఆంధ్రజ్యోతిలో “రిసోర్స్ ఎడిటర్” పేరు మీద చేరిపోయాను. అన్నట్టు, మర్చిపోయాను. తొలి ఆంధ్రజ్యోతి హయాంలో పెళ్ళైంది. నేను పుట్టిన సంవత్సరం పెద్ద గాలివాన వచ్చి మా పాతికెకరాల అరటితోట కోతకి వచ్చింది పడిపోయిందట! పెళ్ళి కాగానే (దివిసీమ అత్తవారి వూరు) దివిసీమ  తుఫాను వచ్చి దేశ చరిత్రలో గొప్ప బీభత్సంగా నమోదైంది. అదీ మన కాళ్ల మహత్యం!

రెండేళ్ళ క్రితం ఐ.వి.ఆర్ అమెరికా నుంచి ఫోన్ చేసి న్యూస్ ఛానెల్ పెడుతున్నట్టు చెప్పారు. ఆయన మాటతో పని లేకుండానే నేను ఛానెల్‌లో వుంటానని, వున్నట్టే భావించాను. నిజానికి నేను లేకపోయినా ఛానెల్ నడిచిపోతుంది. అప్పటికే ఆంధ్రజ్యోతి సంస్థ వీక్లీ ప్రారంభించింది “నవ్య” పేరుతో. దాని సంపాదకత్వ బాధ్యతలు నాకు అప్పగించారు. ఎప్పుడూ నా వృత్తిని, బాధ్యతని గౌరవించాను. అందుకు నాకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఏడాది క్రితం మహా ఛానెల్‌కి వచ్చాను. ఈ కొత్త లోకం చూడాలని ఆశ. ఇద్దరు అబ్బాయిలు. చదువులు పూర్తి చేసి యిప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. పత్రికలు, సినిమాలు, వెబ్‌సైట్స్, న్యూస్ ఛానెల్ దాదాపు ప్రముఖ మాధ్యమాలన్నీ చూశాను. కొన్ని సంగతులు తెలుసుకున్నాను. కొంత సందడి చేశాను.

కథలు

7th photoమిఠాయి కొట్లో పొద్దస్తమానం వుండే వాళ్లకి మిఠాయి మీద యిష్టం పోతుంది. అలాగే, నేను ఆంధ్రజ్యోతిలో చేరడం వల్ల ఆఘ్రాణ దోషం అంటుకుంది. అరవైదశకంలో రా.వి. శాస్త్రి, కాళీ పట్నం ముమ్మరంగా రాస్తున్నారు. జ్యేష్ఠ, హవిస్, దనిష్ఠ, భజరా, స్మైల్, మధురాంతకం, ఆదివిష్ణు, విహారి-శాలివాహన, శాయి – రాంబాబు, చంద్ర, ద్వివేదుల విశాలక్షి, డి. వెంకట్రామయ్య, భరాగో, ద్విభాష్యం, వాకాటి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సత్యం శంకరమంచి అద్భుతమైన కథలు రాస్తున్న రోజులు. ప్రతి రోజూ ఆఫీస్‌కి వచ్చేవారి కథల్ని వేడి వేడిగా వారి దస్తూరిలో చదివే అదృష్టం పట్టింది. పురాణం మంచి కథకులు. “ఇల్లాలి ముచ్చట్లు” సరేసరి. పురాణం “శివకాంత”, “సంతకం”, “ఉప్పు బస్తాలు” అప్పుడు రాసినవే. అందుకని నాకు కథలు రాయాలనే తాపత్రయం వుండేది కాదు. పైగా “కాలమ్” రాసేటప్పుడు బుర్రలోంచి చాలా సరుకు ఖాళీ అయిపోతుంది. నాలాంటి సామాన్య రచయితకి ఆలోచనల కరువు తీవ్రంగా వుండేది. పైగా ఇంతమంది యిన్ని గొప్ప రచనలు చేస్తుండగా నా రంగ ప్రవేశం అవసరమా అనే ఆలోచన నన్ను కథ, నవల రచనల నించి నిలవరించేది.

నీతి చంద్రిక కథలు నాకు చాలా యిష్టం. అందునా చీమ – పావురం; పాము – రత్నాల హారం లాంటి కథలు మరీమరీ యిష్టం. తరువాత ఎప్పటికో తెప్పరిల్లి, “బంగారు మురుగు” కథ రాశాను. చాలామందికి నచ్చింది. ఏడాదికో కథ అన్నట్టు “ధనలక్ష్మి”, “షోడానాయుడు”, “పెళ్ళి” యిలా కొన్ని రాశాను. 1998లో “మిథునం” కథ రాశాను. ఇది కూడా చాలామందికి నచ్చింది. కొందరు ఆక్షేపించినవారూ వున్నారు. “బ్రాహ్మణ వంటలు, తిండి, తప్ప అందులో ఏముంది. పైగా వివాహ వ్యవస్థని పల్లకీలో వూరేగించడం కడు ధూర్తము” అని కొందరు చివాట్లు పెట్టారు. దీనికి కథా సంపుటాలలో చేర్చేటంత దృశ్యం లేదని తెలుగు కథకి గార్డియన్‌లుగా చెలామణి అవుతున్న కథావులు (కథ + మేధావులు) తేల్చారు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 50 యేళ్ళు అయిన సందర్భంగా, తెలుగులో వచ్చిన మంచి కథల్లోంచి 50 కథల్ని ఎంపిక చేసి “బంగారు కథ” సంపుటిని సాహిత్య అకాడెమీ ప్రచురించింది. అందులో “బంగారు మురుగు” కథ వేశారు. అది అన్ని భారతీయ భాషలలోకి అనువాదితమైంది.

ఇక “మిథునం” గురించి. కథ చదివి అభిప్రాయం చెప్పండని బాపుకి యిచ్చాను. తెల్లారి పొద్దున అన్ని పేజీలు తన దస్తూరిలో రాసిచ్చారు బాపు. కథకి జరిగిన మొట్టమొదటి గొప్ప గౌరవం యిది. దాన్ని “దస్తూరి తిలకం”గా రచన – యింటింటి మాస పత్రిక రెండుసార్లు ప్రచురించింది. “కథ” జాతీయ అవార్డ్ లభించింది. పలు భారతీయ భాషలతో బాటు నాలుగు విదేశీ భాషల్లోకి కూడా వెళ్లింది. అమెరికాలో వుండే సాహిత్యాభిమాని డాక్టర్ జంపాల చౌదరి బాపు దస్తూరిలో వున్న కథని కోరిన వారందరికీ జిరాక్స్ కాపీలు పంపారు. బోలెడు అభినందనలు. రేడియో నాటికగా, స్టేజ్‌ప్లేగా వచ్చింది. ప్రముఖ రచయిత, దర్శకులు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ మళయాళంలో (ఉరు చిరు పుంజరి / A slender smile) సినిమాగా తీశారు. వారి వాతావరణానికి కావల్సిన మార్పులు చేసుకున్నారు. ఏషియా ఫిలిమ్ ఫెస్టివల్‌లో, మరికొన్ని చోట్ల బహుమతులు వచ్చాయి. అవన్నీ వాసుదేవన్ ప్రతిభకి వచ్చినవే గాని కథకి కాదని నా నమ్మకం. “మిథునం” కథా సంపుటి చాలా ఎడిషన్లు పడింది. ఈ పదేళ్లలో ఎన్నో మంచి మాటలు ఆ కథ గురించి విన్నాను. [ఎవరైనా చేయూతనిస్తే, “మిథునంకి పదేళ్లు” అని పది సెంటర్లలో దండోరా వేసి దండలు వేయించుకోవాలని వుంది. కాని ఇటీవలి వరదల్లో మా ప్రాంతం ఆర్థికంగా దెబ్బతిన్నది. కనీసం పుష్కరానికైనా దీని సంగతి చూడాలి.]

ఎక్కువమందికి చేరి, ఎక్కువ మందికి అర్థమై, ఆరోగ్యకరమైనదే గొప్పరచన అనుకుంటాను. నాకు బొత్తిగా అర్థం కానప్పుడు ఎందరు మెచ్చుకున్నా నాకేమీ ప్రయోజనం వుండదు. సందేశాల మీద నమ్మకం లేదు. ఇప్పటికీ నాకు రాయడం కన్నా మహానుభావుల రచనలు చదువుకోవడంలోనే ఆనందం ఎక్కువ. ఎందుకంటే మనం మన సొంత ఆలోచన అనుకున్నది ఎవరో ఎక్కడో ఎప్పుడో రాసే వుంటారు. జగద్గురువు శంకరుని మిథ్యావాదాన్ని ఆరాధిస్తాను. దానివల్ల నా మనసుకెంతో సాంత్వన. భారతీయ ఇతిహాసాలను అర్థమైన మేరకు గౌరవిస్తాను. మానవ నైజాలను వేదికపై చూపించే రామాయణ భారతాలను మనసుకి అద్దుకోవాలనుకుంటాను. భారతంలో “ఒరులేయవి యొనరించిన…” పద్యాన్ని మహాసూక్తిగా భావిస్తాను. దేవుడంటే భ్రమ లేదు గాని నమ్మకం వుంది. దయని మించిన దేవుడు లేడనుకుంటాను. సింప్లిసిటీని మించిన మానవత లేదనుకుంటాను. ఎక్కడైనా కొన్ని అతిశయోక్తులు చాపల్యం కొద్దీ దొర్లివుంటే పెద్దమనసుతో మన్నించండి. సెలవు.

శ్రీరమణ
తేదీ: 01 జనవరి, 2010
ఫోన్: 040 – 23514358

X —— X —— X

రచనా సంచయం

అచ్చయిన పుస్తకాలు:

శ్రీరమణ పేరడీలు
ప్రేమ పల్లకి (నవల)
రంగుల రాట్నం (కాలమ్)
శ్రీఛానెల్
హాస్య జ్యోతి
నవ్య మొదటి పేజి
గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు
శ్రీకాలమ్
మిథునం (కథా సంపుటి)
శ్రీరామాయణం

రావల్సినవి:

మహాభారతం (విరాట వుద్యోగ పర్వాలు)
మొదటి పేజి (II)
మానవ సంబంధాలు
సరసమ్.కామ్ (5 సంపుటాలు)
శ్రీరమణీయం
సింహాచలం సంపెంగ (కథా సంపుటి)
బొమ్మ – బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామిషు)
ఇతరత్రా
—— ఇవన్నీ కలిసి సుమారు ఇరవై చిన్న సంపుటాలు రావల్సి వుంది.

నడిపిన శీర్షికలు (కాలమ్స్):

రంగుల రాట్నం
జేబులో బొమ్మ
టీ కప్పులో సూర్యుడు
శ్రీఛానెల్
శ్రీకాలమ్
పూలు – పడగలు
వెంకట సత్య స్టాలిన్

ప్రస్తుతం:

మహాటీవిలో రిసోర్స్ ఎడిటర్
“పత్రిక” – మాసపత్రిక సంపాదకత్వం
మునిమాణిక్యం మోనోగ్రాఫ్ (కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం)
మరో విస్తృత ప్రాజెక్టు

కృతజ్ఞతలు: ఈ ఇంటర్వ్యూ గురించి అడిగిందే తడవుగా రమణ గారిని సంప్రదించి ఒప్పించటమే కాక విలువైన సంగతులు జారిపోకుండా రాబట్టాలని తపన పడి, మొత్తం పాఠాన్ని టైపించి మరీ సహకరించిన ఫణీంద్ర గారికి పొద్దు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

14 Responses to శ్రీ రమణీయ చానెల్- రెండవ భాగం

  1. Purnima says:

    Very valuable! Thanks to everyone involved in the task.

  2. cbrao says:

    ఇరవై ఏళ్ల పైబడి బాపు రమణలతో గడిపిన విశేషాలు సంక్షిప్తంగా ఉన్నాయి. పలు చలన చిత్రాలకు సంభాషణలు వ్రాసారు. శ్రీరమణ గురించి మరి కొన్ని విశేషాలు- V.రాధాకృష్ణ పారడీలే కాకుండా చక్కటి కవితలు రాసేవారు ఒకప్పుడు. చక్కటి దస్తూరితో అందమైన కాగితంపై చూడచక్కని ఉత్తరాలు రాసేవారు. కబుర్లలో పడితే ఎంతోమంది సాహితీకారుల గురించి మనకు తెలియని ఎన్నో విశేషాలు చెప్తారు. వారి ఇంటి పై అంతస్తులోని వ్యక్తిగత గ్రంధాలయంలో ఎన్నో అమూల్య పుస్తకాలు చూడొచ్చు. నిగర్వి. స్నేహశీలి.

  3. జంపాల చౌదరి says:

    మిథునానికి పదేళ్ళేనా? ఎప్పట్నుంచో చదువుతున్నట్టుగా ఉంది.
    మిథునానికి పదేళ్ళా? నిన్నో మొన్నో మొదటిసారి చదివినట్టుగా ఉంది.
    ఎం.టీ.వాసుదేవన్ నాయర్ గొప్ప సినిమాలు తీసుండొచ్చు కాని ఆయన తీసిన సినిమాకన్న రమణగారి కథే బాగుంటుందని నా అభిప్రాయం.

    వరదలొచ్చినంతమాత్రాన పండగలాపుకోకూడదు శ్రీరమణగారూ.

    మొదటి పేరడీలు ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు సాహిత్యం అంటే ప్రేమ ఉన్న కాలేజీ మిత్రులందరిలో (చాలామందే ఉండేవారు) చెలరేగిన కోలాహలం ఇప్పటికీ గుర్తే. అప్పట్నించి ఇప్పటిదాకా శ్రీరమణగారు వ్రాసిందేమైనా ఇష్టంగా ప్రేమగా చదువుతాను. మిథునం, బంగారుమురుగులతో పాటు ధనలక్ష్మి కూడా తెలుగులో వచ్చిన గొప్పకథలని నమ్ముతాను.

    శ్రీరమణ గారితో ఆయనచేతే ఒక క్రమంలో (కోతికొమ్మచ్చి ఎక్కువగా ఆడకుండా) చెప్పించటం గొప్ప విషయమే.

    ధన్యవాదాలు.

  4. Sowmya V.B. says:

    Nice article!
    అప్పుడే అవగొట్టేశారేమిటండీ!

  5. అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఏమైనా విలువైన వ్యాసం. పొద్దుకు అభినందనలు.

    జంపాలగారితో నేనూ ఏకీభవిస్తాను. శ్రీరమణగారి మిథునం స్థాయిని మళయాల చిత్రం అందుకోలేదనిపిస్తుంది. దాని గురించి నా పరిశీలన ఇక్కడ – http://navatarangam.com/2009/08/oru-cheru-punchuri/

  6. Rohiniprasad says:

    “కొడవటిగంటి … అప్పుడాయన విజయ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటున్నారు…”
    ఆ సమయంలో నేనుకూడా బొంబాయినుంచి వచ్చి అక్కడే ఉన్నాను. పేరడీల రచయితగా నాకు బాగా నచ్చిన శ్రీరమణగారిని చూడడమే కాక ఆయన మా మామగారు వంకమామిడి బాలకోటేశ్వరరావుగారికి బంధువని తెలుసుకుని సంతోషించాను. “మీదీ తెనాలి, మాదీ తెనాలి” అనే సినిమా జోక్ అప్పటికి రాలేదింకా!

  7. Sri Ramanaaji!
    chaduvutunte ‘PODDU’ teliyaledu. Mo……Vegunta//
    Telugu vaariki vinipinchani Cheganta—naaku inka gurthundi. Mo.. maa guruvu garu. adee sangati.
    itlu..naa cellu..
    98484-10237

  8. Mula Ravi Kumar says:

    SreeramaNa gaari ooru varahapuramaa? ayyabaabOy (nEnaa ooru naalugaidusaarlu veLLEnsaar). So far I have only professional satisfaction in recalling about the village, and now, I have a better reason to be proud of haviong visited that village. I am an infant writer and after reading RangularaaTanaM started thinking twice before penning-down anything, lest I should commit those mistakes mentioned by Sreeramana.

    After reading MithunaM, I strongly believed, the writer cannot be under-eighty. and four years after reading it, I met a less-than fifty person, guessed that Sreeramana gaaru must be his father, and shocked to know the fact, and felt extreamly happy to be offered a coffee by Sriramana garu.

    Dr. Mula Ravi Kumar, Bharatpur, Rajasthan

    I had a privilage of

  9. Mula Ravi Kumar says:

    #poddu ki dhanyavaadamulu

  10. budugoy says:

    ఈ వ్యాసం ప్రచురించినందుకు పొద్దుకు అభివందనాలు,అభినందనలు. శ్రీరమణ గారి గురించి ఇన్నాళ్ళకు ఒకటి రెండు ముక్కలు తెలిశాయి. అన్ని అధరువులతో మృష్టాన్నభోజనం తిందామని కూర్చున్నవాడికి ఏదో ఒక సూపు తాగించి పంపినట్టుంది. రమణగారూ మాకో కోతికొమ్మచ్చి లాంటి పుస్తకం ప్రసాదించరూ…అంతేసి గొప్పగొప్ప మనుషుల కబుర్లూ, పరిచయాలు ఇంకో తరానికి అందించకుండా తప్పించుకుంటారా? హన్నా..:-?

    98లో ప్రచురించిన మిథునానికి మంచికథల్లో దూరే గౌరవం లభించకపోవడం నాకైతే చారిత్రక తప్పిదంలా అనిపించింది. ఈ మధ్య జ్యోతిలో నామిని ఇంటర్వ్యూ, ఈమాటలో కనకప్రసాద్ వ్యాసం చదివాక ఈ మంచి కథలపై నా అనుమానం నిజమేననిపిస్తోంది.

    హ్మ్ ఈ వ్యాసమంతా చదివాక, శ్రీరమణ గారిని ఆంధ్రజ్యోతి కాలంలో ఇరికించిన నండూరిగారివల్ల మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అన్న అనుమానం వచ్చింది. పాపం శమించుగాక.

  11. Tamirisa Janaki says:

    Sriramana garu manishi manasu kuda simplega unde goppa vyakti ani evarikina ardhamavutundi idi chadivaka. Poddu.net ki thanks.
    Tamirisa Janaki

  12. gcs says:

    Chaala baagundi.

  13. శ్రీరమణగారి ధనలక్ష్మి కథ కథాజగత్ వెబ్‌సైట్లో ఉంది.
    http://www.kathajagat.com
    కథాభిమానులందరూ చదవండి.

  14. చిన్నప్పుడు అమ్మ” అనగాఅనగ ఒక ఊళ్ళో” అని కావలించుకుని కధ చెబుతున్నంత అనుభూతి కలిగించారు శ్రీరమణ. శ్రీశంకర మాయావాదాన్ని, ఘోరప్రమాదంతోనూ, మరో ఘోరమానవతప్పిదనంతోనూ, విడమరచి చెప్పడం అద్భుతం. “మాగాయపచ్చడి పసందు ఎటుల కనుగొంటివయ్యా” అని బమ్మెరవారిని మెచ్చుకోలుగా అడిగిన కరుణశ్రీ గారి ఆశ్శీస్సులను,నిజం చేసిన శ్రీరమణగారికి జేజేలు.

Comments are closed.