నువ్వాదరిని… నేనీదరిని…

–కొల్లూరి సోమ శంకర్

కథ గురించి:
కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నేపథ్యంలో సాగే “నువ్వా దరిని…… నేనీ దరిని” అనే ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ లేని ఓ సింధీ యువకుడి ఆవేదనకి అద్దం పడుతుంది. అన్ని రాజకీయ సరిహద్దులు మానవ తప్పిదాల్లా అనిపిస్తాయతనికి. రాజకీయ “సరిహద్దుల” సమస్యపై ఈ కథ వ్యంగ్యాత్మక చెణుకులు విసురుతుంది.

ఇక చదవండి … నువ్వాదరిని…… నేనీదరిని

—————————————-

ధూళి మేఘాలు ఒక్కసారిగా పైకెగసి, గాలినంతా దుమ్ముతో నింపేసాయి. ఆఖరి సిమెంటు లారీ నుంచి బస్తాలు దించేసారు. దూరం నుంచి లయబద్ధంగా సాగే “హై హై హొ హొ” అనే శబ్దాలు వినబడుతున్నాయి. రేగిన దుమ్ము సర్దుకున్నాక, వంతెన ఐదవ, ఆఖరి స్తంభంపైకి వీపుపై సిమెంటు బస్తాలు మోసుకెడుతున్న వందలాది శ్రామికుల అర్థనగ్న శరీరాలు ఊగుతూ కనబడ్డాయి.
నది ఒడ్డుపై నుంచి “పొంగు ” పరిగెత్తుకొచ్చాడు.
“సార్. ….యాక్సిడెంట్….” అంటూ రొప్పుతూ అరిచాడు. “201 నెంబరు ‘మెండు’ మంచెపై నుంచి పడిపోయాడు….”
“అంబులెన్స్ పిలవండి….త్వరగా …..” అని చెబుతూ, “అతను మునిగిపోయాడా?” అంటూ రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న వర్క్స్ సూపర్‌వైజర్‌ని ఉద్దేశించి గట్టిగా అరిచాను.
“వాపిలో పడ్డాడు…..” అంటూ అతను కూడా గట్టిగా అరిచాడు.
అప్పటిదాకా లయబద్ధంగా సాగుతున్న ‘ హై హై హొ హొ ‘ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. రాళ్ళను పగలగొట్టే గ్రైండర్ కూడా ఆగిపోయింది. పైకి వెడుతున్న వంద టన్నుల క్రేన్ వేగం మందగించింది. ఆడ, మగ, పిల్లలు తమ జీవితాలను పట్టించుకోకుండా నిర్మాణంలో ఉన్న వంతెన వైపు పరిగెడుతున్నారు.
“ఆపండి…వాళ్ళని ఆపండి…” అంటూ వర్క్స్ సూపర్‌వైజర్‌కి చెప్పాను. అయితే, వేలాది శ్రామికుల ఉత్సుకతని, అందులోను ఆ ఘటన వారిలో ఒకరికి సంబంధించినదైతే ఆ ఉత్సుకతని ఆపడం మరీ కష్టం..!
నేను అందుబాటులో ఉన్న పడవ ఎక్కాను, ప్రమాదం జరిగిన స్థలానికి త్వరగా చేరుకోవాలని. మార్గమధ్యంలో ప్రభుత్వ లాంచి ఎదురైంది. అందులో ఉన్న చీఫ్ ఇంజనీర్ రంగనాథరావు ఆందోళనగా ఉన్నారు.
“మళ్ళీ యాక్సిడెంటా? ఈ వంతెన ఇప్పటికే చాలామందిని బలి తీసుకుంది…” అన్నారాయన లాంచి మీదుగా చూస్తూ.
కృష్ణానదిపై కడుతున్న ఆ వంతెనకి ఆధారంగా ఉన్న ఐదవ స్తంభం వద్దకి మేము వేగంగా కదిలాం.

నీటిలో మునిగిన కూలీని గబగబా పైకి తీసి, ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాదిలో ఇది ఐదో ప్రమాదం.
లయబద్ధంగా సాగే ‘ హై హై హొ హొ ‘ ధ్వనులు మళ్ళీ మొదలయ్యాయి. క్రేన్ వృత్తాకారంలో తిరగసాగింది. గ్రైండర్ రాళ్ళని ముక్కలు చేసే తన పనిని మళ్ళీ మొదలుపెట్టింది. శ్రామికులు అనేక బారులలో పైకి కిందకి వడివడిగా ఆవేశంగా కదులుతున్నారు.
ఓ వంతెన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే, దాన్ని కళ్ళారా చూడాల్సిందే. ఇరవై నాలుగు గంటలూ, రాత్రింబవళ్ళూ, బుల్‌డోజర్లు, భారీ క్రేన్లు, గ్రైండర్ల నేపథ్యంలో మానవ శరీరాలు హుందాగా కదులుతూంటాయి. ఓ నది రెండు తీరాలను కలపడానికి మనుషులు యంత్రాలు పొందికగా పనిచేస్తారు. ఆ నది కృష్ణా అయితే, ఇంక చెప్పేదేముంది? సహ్యాద్రి పర్వతాలలో పుట్టి, కర్నాటకలోకి….. తన జన్మస్థలానికంటే ఎన్నో విధాలుగా భిన్నమైన, విశాలమైన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. నేను కృష్ణా నదిని మొదటిసారిగా ‘వాయ్ ‘ దగ్గర చూసాను. అక్కడ నదీ ప్రవాహం ఓ జలపాతంలా, ఇరుకైన కొండల మీద నుంచి, రాళ్ళ మీదుగా కిందకి జారుతూ, బండరాళ్ళకున్న పగుళ్ళ మధ్యలోకి చేరి ఓ సన్నని ధారగా కనిపించింది. మహాబలేశ్వరంలో ఉండగా నాకు టెలిగ్రాం వచ్చింది, కృష్ణానదిపై వంతెన కట్టేందుకు నేను బిర్కోండ్వా వెళ్ళాలని.
“నేను చెప్పలేదు? కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలని? లేకపోతే స్తంభం ఎలా నిలబడుతుంది? ” అన్నారు రంగనాథరావు కోపంగా. “మీ కుర్రాళ్ళకు వేరే ఆలోచనలుంటాయి. ప్రాచీన ఆచారాలలోని ప్రయోజనాలని మీరు విశ్వసించరు….”
బదులుగా, “ఓ కొబ్బరికాయ ప్రమాదాలను ఎలా అరికట్టగలుగుతుంది?” అంటూ అరుద్దామనుకున్నాను. కానీ ఆయన వయసులోను, హోదాలోను నాకన్నా చాలా పెద్దవారు. ఆయనతో గొడవ పెట్టుకునేంత సాహసం నేను చేయలేను.
“చూడబ్బాయ్, మనం వెంటనే ఓ కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలని నేనంటాను. అప్పుడు మాత్రమే యాక్సిడెంట్లు ఆగుతాయి…” అని అన్నారాయన. నా అంగీకారంతో సంబంధం లేకుండా, దురదృష్టవంతుడైన ఆ 201 నెంబరు కూలీ పడిపోయిన మంచెపైన పూజకి ఏర్పాట్లు చేయమని తన సిబ్బందికి ఆదేశాలిచ్చేసారు.
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున కృష్ణా నదీ తీరంలో ఒక లాంచి ఇరుక్కుపోయింది. ఆ రోజు నదిలో అలలు బలంగా ఉన్నాయి, నది పొంగుతోంది కూడా. లాంచి ఏ మాత్రం కదల్లేదు.
అప్పుడు రంగనాథరావు గారు కొబ్బరికాయతో వచ్చారు. నిజానికి కొబ్బరికాయని, ఇతర పూజాసామాగ్రిని వెండి పళ్ళెంలో పెట్టుకుని తెచ్చింది ఆయన కూతురు గాయత్రి . కొబ్బరికాయ కొట్టారు . కొబ్బరినీళ్ళని లాంచి ముందు భాగం నుంచి నదిలో పోసారు. సరిగ్గా అప్పుడే లాంచి కదిలింది. అనూహ్యం! నిజం! అసలే మాత్రం నమ్మశక్యం కానిది! నాకు కోపం వచ్చింది. కాదు, కాదు ఈ అద్భుతం పట్ల నాకు ఆగ్రహమే కలిగింది. ఇంత పెద్ద లాంచిని ఓ చిన్న కొబ్బరికాయ కదిలించింది. ఇంతకు ముందు ఐదుగురు స్ట్రక్చరల్ ఇంజనీర్లు లాంచిని కదపడానికి విశ్వప్రయత్నం చేయగా, అది కదలకుండా అలాగే మొండిగా ఇసుకలో నిలుచుంది. రంగనాథరావు గారు కొబ్బరికాయలు కొట్టి నదిపై వంతెన నిర్మించగలరు కాబట్టి నన్ను ఉద్యోగంలోంచి తీసేయమని నా యజమానులైన ఎబిసి కన్‌స్ట్రక్షన్స్ వారికి ఉత్తరం రాద్దామనుకున్నాను. గాయత్రి తలెత్తి చూసి పెద్దగా నవ్వింది. తెరలు తెరలుగా వినబడిన ఆ నవ్వు నా కోపాన్ని చల్లార్చింది.
“ఏం విచిత్రం? తమాషాగా ఉంది కదా నాన్నా?” అంది గాయత్రి.
“ఇందులో విచిత్రం ఏముంది? …. ” అన్నారు రంగనాథరావు ఆక్షేపణగా.
“ఏమో నాకు మాత్రం విచిత్రంగా అనిపించింది” అంటూ మళ్ళీ నవ్విందామె. తర్వాత గాయత్రి గబగబా గట్టు దిగింది, అలా దిగడంలో ఆమె కొద్దిగా నీళ్ళలోకి జారినట్లయింది. వాళ్ళ నాన్నతో పాటు జీపులో ఎక్కి కూర్చుంటూ..” రేపొద్దున్న ఇక్కడికి రావాలి. ఉదయం పూట ఈ ప్రాంతమెంతో బాగుంటుంది” అని అంది.
ఆ నవ్వు నా చుట్టూ ప్రతిధ్వనిస్తుండగా ఆ చిమ్మ చీకట్లో నేనలాగే నిలబడిపోయాను. ఆ నవ్వు కృష్ణవేణి మానవాకారం ధరించి వచ్చినట్లుంది.
అవతలి ఒడ్డున ఓ క్రమంలో ప్రకాశిస్తున్న హరికేన్ లాంతర్లు వెలుగురేఖలని ప్రసరిస్తున్నాయి. వందలాది గుడిసెల మధ్య విహారం చేస్తున్నట్లుగా ఇటుకలతో కట్టిన ఓ ఇల్లు ఉంది. దానికి అలంకారంలా చుట్టూ ఆకుపచ్చని గుడారాలు ఉన్నాయి. ఆ ఇల్లు రంగనాథరావు గారిది. మా ఒడ్డు వైపు కూడా వందలాది గుడిసెలు ఉన్నాయి. ఎబిసి కన్‌స్ట్రక్షన్స్ వారి సిబ్బంది కోసం కట్టిన నాలుగు తాత్కాలిక భవన సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం వారి ఫైళ్ళ ప్రకారం మేము ఎడమ గట్టు మీద, ప్రభుత్వ సిబ్బంది కుడి గట్టుపైన నివాసముంటున్నాము.
రంగనాథరావు గారుంటున్నది కేవలం అవతలి గట్టు పైనే కాదు, అది మరో రాష్ట్రం ….. కర్నాటక! మనిషి దేవుడైతే, నదులను తన రాష్ట్రంలో మాత్రమే ప్రవహించేంత పరిమాణంలో సృష్టించేవాడేమో! కాని మనిషి దేవుడు కాదు. నది తన గమనాన్ని కొనసాగించాల్సిందే. ఐదేళ్ళ క్రితం ఈ వంతెన నిర్మాణం కోసం ప్లానింగ్ కమీషన్‌కి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్‌కి ప్రతిపాదనలందాయి. అప్పటి పోలీసు కాల్పులలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఆందోళనలు, ఘెరావ్‌లు, సత్యాగ్రహాలు జరిగాయి. ఒక వర్గం వంతెన మహారాష్ట్రలో ఉండాలని అంటే, మరో వర్గం వంతెన కర్నాటకలో ఉండాలని పట్టుపట్టింది.
వాస్తవానికి ఈ సరిహద్దుకి 25 మైళ్ళ లోపు ఎటువంటి తేడాలు లేవు. మహారాష్ట్రులు కన్నడం మాట్లాడుతారు. చాలామంది కన్నడిగులు తమ జీవన రీతుల ప్రకారం మహారాష్ట్రులే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో ఉండేవారికి ఏమాత్రం తీసిపోరు. గాయత్రినే ఉదాహరణగా తీసుకుందాం. ఆమె మరాఠీ మాత్రమే మాట్లాడగలదు. మరో భాష…మరాఠీ కన్నడాల సమ్మిళిత మాండలీకం కొంకణి…మాట్లాడేవారు మరి కొందరు ఇక్కడ ఉన్నారు.

వంతెనలో సగ భాగం మహారాష్ట్రలోను, మరో సగ భాగం కర్నాటకలోను ఉండేలా స్థల నిర్ణయం చేయాలని మా కంపెనీకి ఆదేశాలందాయి. మానవుడి రాజీ ప్రయత్నాలకు భగవంతుడు సైతం కొన్నిసార్లు ఊతమిస్తాడు. సరిగ్గా ఇక్కడే అంటే బిర్కోండ్వా వద్ద నది విశాలంగా ఉంటుంది, మా డిమాండ్లకు అనుగుణంగా ఉంటుంది. నీటి మట్టం ఓ మాదిరిగా ఉంటుంది. నదీగర్భం కొంత మెత్తగాను, కొంత దృఢంగాను ఉండి మాకు అనుకూలంగా ఉంది. ఇసుక ఉన్నట్లే, రాళ్ళు ఉన్నాయి. ప్రమాదకరమైన బావులున్నట్లే, అక్కడక్కడ మెత్తని అడుగునేలలు ఉన్నాయి. విచిత్రం! ఇక్కడ వంతెన నిర్మించడం సరైనది. రెండు రాష్ట్రాల పట్ల సముచితంగా వ్యవహరించినట్లుంది.
“ప్రకాశ్ …” అంటూ నన్ను పిలుస్తోంది గాయత్రి. తను ప్రభుత్వం వారి పడవలో ఉంది.
” మీ అమ్మగారు వచ్చారా? …. ”
” వచ్చింది. నిన్న సాయంత్రం. …. ” అంటూ బదులిచ్చాను.
” నేనొచ్చి ఆవిడని కలుస్తాను …. ”
” తప్పకుండా. నువ్వెప్పుడైనా రావచ్చు…. ”
నైలాన్ చీరలో గాయత్రి కొంచెం కొత్తగా కనపడింది. జడని ముడేసి బన్‌లో పెట్టుకుంది. ఆమె కళ్ళలో చిరునవ్వు.
” నేనసలు పొద్దున్నే వద్దామనుకున్నా. కాని ఆ యాక్సిడెంట్ వలన…. ”
” నువ్వక్కడ కనిపిస్తే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చావేమోనని అనుకున్నాను…. ”
” ఛ..ఛ..నాకలాంటి నమ్మకాల్లేవు. ఏదో మా నాన్న మాటని కాదనలేక…. ”
” అయితే నీకిలాంటి విషయాలలో నమ్మకం లేదన్నమాట? …. ”
” ఏమో! కొన్నిసార్లు అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. పైగా శుభారంభం కోసం కొబ్బరికాయ కొట్టడం మన ఆచారం…. ”
” అవును నిజమే…. ”
గాయత్రి నాకేసి చూసి సిగ్గు పడింది. హాయిగా నవ్వుకుంటూ, స్వేచ్ఛగా తిరుగుతున్న బంజారా కూలీల వెనుక మేమిద్దరం నడుస్తున్నాం. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు వాళ్ళు ధరించిన ఎంబ్రాయిడరీ దుస్తులలోని అద్దాలపై పడి మెరుస్తున్నాయి. కాసేపు అలా తిరిగాక, గాయత్రిని వాళ్ళింటి దగ్గర దింపి నేను మా ఇల్లు చేరాను.
నన్ను చూడగానే, ” నీకీ మదరాసీ పిల్ల ఎలా నచ్చిందిరా బాబు?…. ” అంది మా అమ్మ. నాకు బాధనిపించింది.
” అమ్మా తను మదరాసీ కాదు. ఇక్కడి అమ్మాయే. తను చాలా కాలం పాటు బొంబాయిలో గడిపింది…”
“కానీ ఆ పిల్ల చూడడానికి మదరాసీలానే ఉంది…”
60 ఏళ్ళ వృద్ధాప్యంలోను అమ్మ శరీరం తెల్లగా మెరిసిపోతోంది. దక్షిణమంటే మద్రాసని, ఉత్తరమంటే పంజాబని మాత్రమే అమ్మకి తెలుసు.
“అమ్మా, తనే ప్రాంతానిదైతే మాత్రం ఏమయింది? ఈ విషయం మీద మనం ఇంక మాట్లాడుకోవద్దు…”
అమ్మ తలపై నుంచి కొంగు కప్పుకుని, తన జపమాల తీసి జపం చేసుకోసాగింది. మధ్య మధ్య పైకి వినబడేలా గొణుగుతోంది.
” నువ్వు బదిలీ కోసం ఎందుకు ప్రయత్నించవు? ఈ నిర్జన ప్రదేశంలో ఇంకెంత కాలం ఉంటావు? …”
” వంతెన పూర్తయ్యేదాక ఇక్కడే ఉండాలి…” అని అన్నాను. ఆ సంగతి అమ్మకి కూడా తెలుసు.
స్థానికంగా ఘర్షణలు జరిగాకా, ఓ లౌకికవాదిని, ఏ పక్షం వైపు మొగ్గు చూపని ఇంజనీరుని నియమించమని మా కంపెనీకి ఆదేశాలందాయి. నాకంటూ ఓ రాష్ట్రంలేని ‘ సింధీ ‘ని నేను తప్ప; ఎటువంటి సరిహద్దులైనా చారిత్రక తప్పిదాలేనని భావించే నాలాంటి వాడు తప్ప…. ఈ పనికి మరెవరు దొరుకుతారు? తన తండ్రి ముఖంలో దేశ విభజన యొక్క బాధని, దుఃఖాన్ని చూసిన కుర్రాడికి, సంస్కృతిలో తన మూలాలు తెలియకుండా పెరిగిన వ్యక్తికి కృష్ణా, కావేరి, గంగ లేదా గోదావరి…. ఏ నదిపై వంతెనైనా ఆశలను కల్పిస్తుంది, కొత్త ఊపిరులందిస్తుంది. కృష్ణానది రెండు తీరాలను గమనించాను. రెండు ఒడ్లు ఒకే రంగులో ఉన్నాయి, కందకాల మరకలతోను, చిట్టడవులతోను, అక్కడక్కడ మామిడి చెట్లతోను ఒకే రకంగా ఉన్నాయి. వేసవిలో ఎండ వలన కోల్పోయే ప్రవాహం ఓ మాదిరిగా ఉంటుంది, ఆ నీరు కూడా నదీ గర్భం నుంచే పోతుంది. అయినా, ఆ ఒడ్డు ప్రత్యేకమైనది; కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రంగనాథరావు గారికి నివాస స్థలం!
ఆ రాత్రి గాయత్రి వాళ్ళింటికి వెళ్ళాను. మాటల మధ్యలో అమె తన జాతకం గురించి, వాళ్ళ బావ అశోక్ గురించి ఏవో గొణిగింది. నా మనసు గాయపడకూడదని…. “నదికి ఇటు వైపు నా బంధువర్గం, నా మూలాలు, నా ఎముకలు, నా ఆత్మ, మొత్తం నా ఉనికే ఉంది. నది దాటాలని చూస్తే నేను మునిగిపోతాను …” అని అంది.
నాకేం మాట్లాడాలో తెలియలేదు.
“మానవ జీవితపు సార్వజనీనతనే తీసుకో! ఆచారాల, అలవాట్ల, జీవనశైలుల నైతిక సామాజిక విలువలు అంతగా ప్రాముఖ్యత లేనివి, కొన్నిసార్లు నిరుపయోగమైనవి కూడా. అయినప్పటికీ ప్రతి సమాజం విడివిడిగా విభిన్నమైనదే. నీకు నాకు అడ్డుగా నిలిచేదేదీ లేదు గాయత్రి. నేను నీ నుంచి మైళ్ళ దూరంలో ఉన్నానని నేననుకోడంలేదు. నాకు కావల్సిందల్లా సంధానమే. పరిస్థితి నీకర్థమవుతోందా? లేదంటే నన్ను నా మానాన అవతలి ఒడ్డున ఉండిపొమ్మంటావా? ” అన్నాను. నేను ఏదేదో మాట్లాడి మరిన్ని సందేహాలు కలిగించాను, మరిన్ని నిర్వాదాలని జోడించాను.
గడచిన నాలుగు నెలల్లో వంతెన పెరగడం, ఆవలి తీరాన్ని తాకడం చూస్తునే ఉన్నాను.

ఈ వంతెనని ఎవరు ప్రారంభిస్తారు? ఇంకెవరు కేంద్ర మంత్రే.! ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆయనకి తీరిక కుదిరినప్పుడు!
నదికి రెండు వైపులా ఉన్న వాళ్ళు ఆ వంతెనని ఎప్పుడెప్పుడు వాడుకుందామా అని తహతహలాడుతున్నారు. నిజానికి, తక్షణమే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. కాని స్థానిక రాజకీయ నాయకులు పట్టు వీడడంలేదు. ఈ వైపు ఒడ్డున బంజారాలు మూటాముల్లె సర్దుకుని ఎప్పుడో వెళ్ళిపోయారు. బంజారా స్త్రీలు మెరుస్తున్న దుస్తులు , వెండి ఆభరణాలు ధరించి నడవడం; వారి సామాన్లు వస్తువులు జాగ్రత్తగా మూటలు కట్టి గాడిదలపై మోసుకెళ్ళడం లేదా బండి గుడారాలను తోసుకుపోడం, విశ్వాసం కలిగిన కుక్కలు వాళ్ళని అనుసరించడం…… ఇదంతా ఓ ఉత్సవంలా సాగింది. తమ తమ తాత్కాలిక ఇళ్ళను కూల్చేస్తున్నప్పుడు వారిలో కొంత విషాదం, మరికొంత ఆనందం. కాసేపు నవ్వుకున్నారు, కాసేపు కన్నీరు కార్చారు. తమ జీవితాలలో కొన్ని సంవత్సరాల పాటు సరిపోయేంత ధనాన్ని ఈ వంతెన వారికందించింది.
అవతలి ఒడ్డున వంతెన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హడావుడిగా జరుగుతున్నాయి. పడవలన్నీ తీరానికి కొట్టుకొచ్చాయి, లాంచిలను ఒడ్డుకీడ్చేసారు. క్రేన్‌ని విప్పేస్తున్నారు. వేడెక్కిన గ్రైండర్ తొలి వర్షపు చినుకులకు చల్లారిపోయింది. గాయత్రి కూడా, తన తల్లిదండ్రులతో పాటు బెల్గాం వెళ్ళిపోడానికి సామాన్లు సర్దుకుంటోంది. ఆమె ప్రయాణం రేపే. నేను కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. నా యజమానులు..అంటే మా కంపెనీ డైరక్టర్లు రేపిక్కడకి వస్తున్నారు. వేరే వంతెన నిర్మాణానికి ఇంకో చోటికి వెళ్ళడానికి నేను అంగీకరించను.
ఒకప్పుడు కూలీలు పొయ్యిలపై వంటలు చేసుకోగా గుంటలు పడి, ఎండి పోయిన ప్రాంతం నుంచి ‘దోండీ ‘ వస్తూ కనపడ్డాడు.
నా దగ్గరికి రాగానే, ” చెప్పు ” అని అన్నాను.
“కొత్త గుడి చాలా బావుంది. వస్తారా, వెళ్ళి చూసొద్దాం.” అని అన్నాడు. వంతెన మొదట్లో ఓ గుడి కట్టారు. అక్కడికి చేరుకున్నాం. అదొక చిన్న దీర్ఘ చతురస్రాకారపు నిర్మాణం, పైన గోపురం ఉంది. లోపల వినాయకుడి, హనుమంతుడి, కృష్ణుడి విగ్రహాలున్నాయి. వాటికి సిందూరం పూసారు.
“దీన్ని కట్టినందుకు లేబర్ ఛార్జిలు…?” అని అడిగాను.
” లేదు. ఇది ఉచితం! బంజారాలు స్వచ్ఛందంగా కట్టారు. డబ్బులేమీ తీసుకోలేదు.”
తమకు మూడేళ్ళ పాటు అన్నం పెట్టిన నదికి కృతజ్ఞతగా, వంతెన నిర్మాణం పూర్తయ్యాక, మిగిలిపోయిన ఇటుకలు, రాతి సున్నం, ఇనుముతో కూలీలు ఆ గుడిని కట్టారు
“మరి విగ్రహాలు…?” అడిగాను.

“ఈ విగ్రహాలు పెద్ద ఖరీదేం కాదు, స్థానికంగా తయరైనవే. విగ్రహాల ఖర్చును రంగనాథరావు గారు పెట్టుకుంటానన్నారు. రేపు వేలాదిమంది గ్రామస్తులు వచ్చి కానుకలు సమర్పించుకుంటారు. ”
“అలాగా…”
వంతెన యొక్క పొడవు వెడల్పులని చూస్తుంటే గుడి చాలా చిన్నగా కనిపిస్తోంది. కాని వింతగా, దాని వలన వంతెనకి నిండుదనం వచ్చినట్లుంది. గుడి బయట కూర్చున్నాను…. ఇంటికి వెళ్ళి నన్ను నేను ఎదుర్కోడం ఇష్టం లేక!
సాయంత్రం, వంతెనని చూడడానికి గ్రామస్తులు చాలా మంది వచ్చారు. ప్రభుత్వోద్యోగుల పిల్లలు కూడా వంతెనపై వేసిన తారు రోడ్డుమీద ఉత్సాహంగా పరిగెత్తారు. రకరకాల మనుషులున్న ఆ గుంపులోంచి గాయత్రి ప్రత్యక్షమైంది. నా ముందు నిలుచుంది.
ఆమె విచారంగా ఉంది.
“గుడి బావుంది” అని అంది.
“అవును”
” ఏం ఆలోచిస్తున్నావు?”
” ఈ వంతెన రూపకల్పన నేనెందుకు చేసానాని……..”
నా మాటలు ఆమెని బాధించినట్లున్నాయి. ఆమె ముఖంలో వ్యధ గోచరించింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, ” ఎందుకంటే నదిని దాటి నేను నీ దగ్గరికి వచ్చేందుకు” అని అంది.
ఈ మాటలకి కృష్ణమ్మే సాక్ష్యం!
* * *
ఆంగ్ల మూలం: అరుణా జేఠ్వాని

అరుణా జేఠ్వాని

శ్రీమతి అరుణా జేఠ్వాని గారు వృత్తిరీత్యా అధ్యాపకులు. రచనలు వీరి ప్రవృత్తి. పూనేలోని ఓ సుప్రసిద్ధ మహిళల కాలేజికి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అనేక విద్యా సంస్థలకు సేవలందిస్తున్నారు. అరుణగారు రచయిత్రి, కాలమిస్ట్, ఇంకా చిత్రకారిణి కూడా. అరుణగారు రాసిన ” ఎ బ్రిడ్జ్ ఆన్ రివర్ కృష్ణ ” అనే కథకి జాతీయ సమైక్యతకి గాను 2001లో రాజాజీ అవార్డ్ లభించింది. వీరి రచనలు ఎన్నో జాతీయ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ నుంచి కథలను, కవితలను ఆంగ్లంలోకి అనువదించారు. మరిన్ని వివరాల కోసం http://www.arunajethwani.com అనే వెబ్‌సైట్ చూడవచ్చు.

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 74 అనువాద కథలు, 30 దాకా స్వంత కథలు (10 పిల్లల కథలతో సహా) రాసారు. ఒక చిన్న పిల్లల నవలను, యోగకి సంబంధించిన రెండు నాన్- ఫిక్షన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు. సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగును చూడవచ్చు

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ. Bookmark the permalink.

2 Responses to నువ్వాదరిని… నేనీదరిని…

  1. కౌండిన్యతిలక్ కుంతీపుర says:

    మీ వెబ్ సైట్ ఈ రోజే చూశాను .చాలాబగుంది.
    కుంతి

  2. కథ బాగుంది.
    కాని
    “ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది” అని మాత్రం నాకు అనిపించలేదు.

Comments are closed.