కవికృతి-౧౨

౧.

– చావా కిరణ్

ఆ రోజు ప్రభూ,

నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు.
—-

నేను పిలవకుండానే

ఒక సామాన్యునిలా

హృదయంలోకొచ్చి

అశాశ్వత క్షణాలపై

అమృత ముద్రవేశావు.
—-

ఈ రోజు అనుకోకుండా

గతం నెమరు వేసుకుంటూ

నీ రాజముద్రలు చూశాను.

—-
అవి ఆనంద విషాదాల్తో కలగలిసి

మర్చిపోయిన మామూలు అనుభవాల్లో

దుమ్ములో చెదురుమదురుగా ఉన్నాయి.

—-
చిన్నప్పుడు మట్టిలో ఆడేనాటినుండి

కావాలనే అలక్ష్యం చేయకున్నా

అప్పుడు నే విన్న అడుగుల చప్పుడు

తారల నడుమ ఇప్పుడు ప్రతిద్వనిస్తున్నదే.

—-

The day was when I did not keep myself in readi­ness for thee; and enter­ing my heart unbid­den even as one of the com­mon crowd, unknown to me, my king, thou didst press the signet of eter­nity upon many a fleet­ing moment of my life.

And today when by chance I light upon them and see thy sig­na­ture, I find they have lain scat­tered in the dust mixed with the mem­ory of joys and sor­rows of my triv­ial days forgotten.

Thou didst not turn in con­tempt from my child­ish play among dust, and the steps that I heard in my play­room are the same that are echo­ing from star to star.

౨. వేర్పాటు వాదం!

– వెంపటి హేమ

తెలంగాణం వేరననేల తమ్ముడా!
తెలుగుదేశం మనదనరాదా తీరుగా –
అన్నదమ్ముల మధ్య కలహం
అన్వయానికే అనర్ధ దాయకం !
చరిత్ర లోని తప్పులు మళ్లీ మళ్ళీ
చర్విత చర్వణం కారాదు సుమీ!
మనలో మనమే కొట్లాడుకుంటే
అయ్యో! మందికి లోకువ ఐపోమా!!
చరిత్ర నేర్పిన గుణపాఠం ఎపుడూ
మనసున చెరగని ముద్రగ ఉండాలి.-
పృధ్వీశు లందరూ పూనికతో వచ్చి
పురుషోత్తమునికి అండై ఉంటే…
హద్దు దాటి వచ్చేనా అలగ్జాండర్
అలనాడు భారతావనిని ఏలేనా !
మొహరించి నృపులెల్లరూ చేరి
నాడు మొగసాలను కాచియుంటే
మొగలాయీ సామ్రాజ్యానికి
మన దేశంలో మొలక పుట్టేదా –
పరదేశీయ పాలన మనకు వచ్చేదా,
నైజాం చేతిలో రాష్ట్రం నలిగిపోయేదా,
పాకిస్తాన్ పేరిట భరతమాత త్రుంచి
తన గుండెను పంచి ఇచ్చేదా ?
తెల్లవాడు వచ్చి ఎల్లర తెలివి హీనులజేసి
“డివైడ్ అండ్ రూల్” అంటూ దిగదొక్కి
దిక్కులన్నీ చుట్టి భువిని ఏలగలిగేనా,
మన లోకువ కనిపెట్టి విర్రవీగేనా?
కాలదోషం పట్టిన కథలన్నీ కలిసి
కావాలి ఇప్పుడు కనువిప్పు మనకు
కలతలు పెంచుకు మనలోనె మనము
పుట్టిన గడ్డనే చీల్చి పంచుకోనేల!
కలిమిని బలిమిని కలబోసుకుంటూ
ఐకమత్యముతో మనము హాయిగా ఉంటే
దీవించదా బిడ్డలను తెలుగు తల్లి!
తెలుగు దేశం కాదా తేనె మాగాణం!
* * *
తెలుసుకోవా నీవిది తెలుగువాడా …
నేడు నీవు తెలంగాణం వేరంటే
రేపు తానూ వేరనదా రాయల సీమ!
మరచారా నన్నంటూ రాదా మన్యభూమి!
వెనువెంట నడవదా మన వేంగినాడు! !
కోపగించి కొండెత్తక మానునా కోనసీమ!
ఒకేభాష మాట్లాడే వంద సీమ లుండె మనకు
నేను వేరనే మాటను నేర్పబోకు వారి కిపుడు –
అసూయాద్వేషాలు అన్నపుడూ రాణించవు
ఐక్యత లోపించిపోతే అలుసైపోమా అందరికీ!
ఇదే కదా ఇంతవరకు చరిత్రలోని ఘనలోపం!
మరువరాదెపుడు మహాభారత మహిత కథను!
అందరికీ చెరుపు చేసి అది విజయమేలా గౌతుంది?
ఆన్నలార! తమ్ములార!! ఆదర్శమూర్తులార!!!
అందరమూ కలిసిమెలిసి అభివృద్ధిని సాధిద్దాం…
వేర్పాటును కోరి మనం వేరై పోయిననాడు
“గ్లోబలైజేషన్”అన్న పదం గోలై వినిపించదా?
పరసీమలందున్న మనవాళ్లకు ఇంక
పరపతెలా మిగిలుంటుందో చెప్పగలవా ?
మనలోమనమే కలహిస్తూపొతే చూసి
మనలను ఇతరు లెలా మెచ్చగలరు !!!
తెలివిగల్గి తీరుగా మనం మసలుకుంటే
తెలుగు నేలను పారవా తేనెల వాకలు!
తెలుగుతల్లికి “జై”కొట్టు తెలుగువాడా!
గతమందు ఘనకీర్తి ఎంతో ఉన్నవాడా!!

* * *
చావా కిరణ్:

You are confused 🙂

If you are proposing Indian jaateeya vaadaM. Then there is nothing wrong in
Telangana Demand as another state.

If you are proposing Telugu jaateeya vaadaM, then you need to edit your
examples.

కత్తి మహేష్:

A complete miss understanding of the issue doesn’t make a meaningful poem.

చావా కిరణ్:

Not very complete mis-understanding. As the issue itself is pseudo issue
based on pseudo statistics for pseudo benefits. Don’t worry keep writing.

ఆచంట రాకేశ్వర్రావు :

చాలా బాగుంది పాట। కవితకంటే పాత గొప్పది।

ప్రాసయతి బాగా కుదిరింది। లయచాలా బాగుంది। హాయిగా చదువుకోగలిగాం।

చావాగారు ప్రస్థావించిన విషయమై,
గీతలు గీయడం మొదలు పెట్టాక దానిని ఎక్కడ ఆపాలి, నా ఊరి చుట్టూనా, నా భాష
మాట్లాడేవారి చుట్టూనా, నా యాసలో మాట్లాడేవారి చుట్టూనా, నా రంగులో
వున్నజనం చుట్టూనా, యేం బర్మా ఎందుకు కాకూడదు మనదేశం, యేం ఇండోనేషియా
ఎందుకు కాకూడదు? వంటి ప్రశ్నలు వస్తాయి। ఇవి మంచి ప్రశ్నలే కానీ ఈ పాట
నేపథ్యం దాని ఆత్మదష్ట్యా ఇవి ఇక్కడ అనవసరం। తెలుగు భక్తి గీతాలు
చాలానేవున్నాయి। ఇలాంటి ప్రశ్నలు వాటికి వేయడం రెంటికీ చెడ్డ రేవడి –
పాటనీ ఆశ్వాదించలేరు। సమస్యా తీఱదు।

మహేశ్ గారు ప్రస్థావించిన విషయమై,
వాక్ స్వాతంత్ర్యం అంటే మనము ఏమి మాట్లాడాలో అన్నవిషయానికే గానీ, ఎదుటి
వారు ఎలా అర్థంచేసుకొని, వారు ఎలా మాట్లాడాలి అన్న విషయానికి వర్తించదు
కాబట్టి, ఆ మాటలు పట్టించుకోకూడదు। నేను కూర్చుని – నేను
భారతీయరాజ్యాంగాన్ని ఎందుకు అనుసరించాలి, నాకు అది ఆమోదయోగ్యంగా లేదు –
అని ప్రశ్నించవచ్చుఁ, అలాంటి ప్రశ్నలవల్ల కాలక్షేపమేగానీ పురుషార్థం
దక్కదు।

వెంపాటి హేమగారి మంచి కవితకు అభినందనలు।

వెంపటి హేమ:
కవి మిత్రులకు శుభాకాంక్షలు, నేనేమీ పెద్దగా చదువుకున్న
దాన్ని కాదు. కానీ బతుకు బడిలో చదువుకుని ఇప్పుడు చరమాకం చేరుకున్న దానిని.
(పుట్టిన తేదీ ౧ జూలై ౧౯౩౬.)
న్యూస్ పేపర్లలో వస్తున్న ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను గురించిన
వార్తలకు, నిజం చెప్పాలంటే – దుర్వార్తలకు వ్యధతో స్పందించిన నా హృదయ ఘోష ఈ
కవిత. పొద్దువాలిపోయిన ఈ వయసులో నా మనసులోని వేదన వెనక ఉన్నది, ఐకమత్యంతో అందరూ
హాయిగా ఉండాలి అన్న కోరిక మాత్రమే గాని స్వార్ధం, స్వలాభాపేక్ష, వలపక్షం లాంటి
దురూహలేమీ కావు. “లోక సమస్తా సుఖినో భవంతు” అని కోరే అతిసామాన్య గృహిణిని నేను!
ఏ రాజకీయాలతోనూ నాకు ఏ సంబంధం లేదు. మీరిన వయసు ఇచ్చిన చొరవతో నాకు తెలిసినంత
వరకు నా కవితకు మూలమైన భావాలను ఇక్కడ రాస్తున్నాను. “బామ్మ మాట బంగారు బాట” అని
మంచి మనసుతో అర్ధం చేసుకోండి. లేదా, బామ్మ బొత్తిగా సెనైల్ ఐపోయింది – అని
నవ్వుకుని ప్రేమతో నన్ను మన్నించండి…..
ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన స్వతంత్ర పోరాటం, “ఏకులా వచ్చి మేకులా
బిగిసిన” అన్యదేశీయులైన బ్రిటష్ వారిని మనదేశం నుండి వెళ్ళగొట్టడానికి
భారతదేశవాసులు ఐక్యతతో సాగించిన శాంతియుత పోరాటం! అది విదేశీయులతో స్వదేసీయులు
చేసిన పోరాటం!
దేశం స్వతంత్ర మైన తరువాత దానిని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా
విభజించారు అన్న విషయము మనకు తెలిసినదే కదా. తరవాత కొన్నాళ్ళు మన రాష్ట్రాన్ని
తమిళనాడుతో కలిపి, ఉమ్మడి పాలన సాగించారు. రెండు విభిన్న భాషలు మాట్లాడే జనం
మధ్య పొత్తు కుదరడం కష్టమయ్యింది. అసలు .రాజ్యాంగ చట్టం ప్రకారం తెలుగుభాష
మాట్లాడే వారికందరికీ ఒక రాష్ట్రం న్యాయమని గుర్తించడానికి ఎందుకనో కేంద్రం
కొంత కాలయాపన చేసింది. చివరకు ఎంతో కష్టమ్మీద “ఆంధ్రప్రదేశఓ” ఒక రాష్టంగా
ఏర్పడింది. ఇది రెండు విభిన్న భాషల జనం మధ్య పోరు! దీనితోనూ ప్రస్తుతానికి
పోలికలేదు. ఇప్పుడు సాగుతున్న రాజకీయం ఒకే గడ్డ మీద పుట్టిన బిడ్డలమధ్య! ఒకే
భాష మాట్లాడే వాళ్ళ మధ్య !!
ఆంధ్ర ప్రదేశo లో రాయలసీమ, తెలంగాణం, వేంగినాడు, మన్యం,
కోనసీమ, పట్టి సీమ….. ఇలా ఏవేవో పేర్లతో ఎన్నో మండలాలు వున్నాయి. ప్రతి
మండలానికి ఒక ప్రత్యేకమైన యాస కూడా ఉంది. కానీ మూలభాష మాత్రం తెలుగే. రాష్ట్ర
సరిహద్దుల్లో ఉన్న భాష మీద పక్కరాష్ట్రపు భాష యొక్క ప్రభావం ఉండడంతో, ఒకే
మండలంలోని యాసలలో కూడా ప్రదేశాన్ని బట్టి కొద్దిపాటి మార్పులు చోటుచేసుకోక
మానవు. ఇక పొతే తెలంగాణంలోని తెలుగు భాషమీద అదనపుభారం పడింది. అది ఆ నాటి
పాలకులైన నిజాం సుల్తానుల స్వభాష ఐన “ఉరుదూ” తాలూకు భారం! ఇది సర్వసాధారణంగా
జరిగేదే. ఉత్తరభారతం మొగలాయీ పాలనలో ఉన్నప్పుడు ఎన్నో ఉరుదూ పదాలు హిందూస్తానీ
లో చేరడమే కాదు, దానికి స్వంతమే అయ్యాయి.ఇక మన దేశంలోని చాలాభాసలకి మూలమైన
సంస్కృతం మన దేశభాషలన్నింటిలోనూ ధారాళంగా చోటు చేసుకుంది కదా! ఉరుదూ
ఇన్ప్లూయన్సు కూడా చోటుచేసుకున్న తెలంగాణ మాండలిక భాష లో యాస వేరవ్వడంలో
ఆశ్చర్యమేముంది? అయినా మూలభాష తెలుగే కదా!
చాన్నాళ్ళకు పూర్వం నిజాం రాజ్యాన్ని పాలించిన సుల్తానులకి`
కర్నాటకలోనూ. మహారాష్ట్రలోనూ కూడా పాలిత ప్రాంతాలు ఉండడంతో గుర్తు తెలియడం
కోసం తెలుగు భాషను మాటాడేవాళ్ళు ఉండే చోటుని “తెలుగు ప్రాంగణం” అని వ్యవహరించే
వారుట! అదే కాలక్రమంలో తెలంగానంగా మారిందిట! ఇది విన్నప్పుడు భాషాపరంగా
ప్రదేశానికి పేరు పెట్టడంలో నిజాం సుల్తానులే ముందడుగు వేసారనిపించింది నాకు!
రాష్ట్రావతరణం తరువాత క్రమంగా మన రాష్ట్రం అభివృద్ధి లోకి
వచ్చింది. ఇటీవల ఇంటర్నేషనల్గా కూడా మన రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చింది!
అలాగని సంతోషించి నంతలోనె మళ్ళీ అరాచకపు చర్యలు మొదలయ్యాయి. ధనమనప్రాణ నష్టాలు
జరుగుతున్నాయి. అది నాలాంటి శాంతి కాముకులకు విచారాన్ని కలిగిస్తుంది. పిట్టల
మధ్య పోరు వస్తే పిల్లి బాగుపడిందిట! హైదరాబాదుకి రావలసిన ఎన్నో లాభసాటి
బేరాలు, అక్కడి కల్లోల పరిస్థితిని చూసి పక్కరాష్ట్రాలకి తరలిపోతున్నాయిట కదా!
ఇది ఇలా జరగనా … అన్న బాధ నాకు ఉంది. బయటికి అనేస్తే బాధ తగ్గుతుంది అంటారు
కదా అని దాన్ని కాగితం మీద పెట్టా ఒక కవితగా. సమయానికి “పొద్దు” ఒక అవకాశం
చూపించింది. ఆ కవితను పంపడం జరిగింది. మనలో మనకు ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని
పోగొట్టే ప్రయత్నం చెయ్యడం బాగుంటుందని నా అభిప్రాయం. వేర్పాటు పరిష్కారం కాదని
నా నమ్మకం .
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నారు మనవాళ్ళు! (నేనూ
కొన్నాళ్ళు అమెరికాలోనూ కొన్నాళ్ళు ఇండియాలోనూ ఉంటాను.) మనలో మనమే ఒకటిగా
ఉండలేకపోతే, పరదేసీయులు మనల్ని వాళ్ళల్లో …

౩.

-పెరుగు.రామకృష్ణ

రక్తం రంగు చెప్పనక్కరలేదు
నువ్వు మనిషి వాసన వేస్తే చాలు..
నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంతర
నులివెచ్చదనమొక్కటే కరువైంది
ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం
నీలోని శాంతి సహన పర్వానికి నిదర్సనం
నీ చిరునామా కొరకు నువ్వెతుక్కోవడమంటే
పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే
మట్టివాసన సమసిపోయిందనే
లింగ వివక్షా పరీక్షల్లో నీ ఉనికి నువ్వు కోల్పోయావనే
పావురం కోసం తొడ మాంసాన్ని తూచిన
నీకొండ పిడికెడు గుండెగా మారిందా..?
నీ కాలి ధూళి తాకితే రాతి నాతిగా మారే గుణం కరువైందా..?
వొక్క పిలుపుకి కోటి పాదాలై కదలిన నీ నడక
శాంతి యుద్ధానికి శత సహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ
నీలోని పంచభూతాల్లోని జీవ లక్షణమే కదా..!
జీవ లక్షణానికి మరణం వుండదు,ఋణం తప్ప
బతికుండగానే, అమ్మను కాటికి మోసినప్పుడే
నీ భుజాల నుంచి కుళ్ళిన శవాల కంపు మొదలైంది
నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది
ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్ధ సమిధలు నిరర్ధకం
పిచ్చుక గూట్లో ఇరుక్కొని రాత్రంతా వెలుతురైన
ఒక మిణుగురు కావాలి ,స్తబ్దాటవిలో పాదయాత్ర కోసం
ఆ మిణుగురు తనం ఆరిపోయింది నీలో
కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన
కరుణకు మొలిచిన ఆ చేయి విరిగిపోయింది నీలో..
వర్షానికి గొడుగుపట్టడం వేరు,
ఎండకి నీడగా చెట్టు అయి మొలవడం వేరు
రెండు చేతుల్ని వేయిచేసి నిండు మనసుతో
కౌగిలించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో..
విత్తుగా మొలకేత్తే గుణం చచ్చిపోయింది నీలో
నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే
నేల తల్లి చిరునామా మారిపోవడానికి ముందే
నువ్వు ఫీనిక్స్లా ,అగ్నిస్నానం చేయాలిప్పుడు
కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త రుతువులు అక్కర్లేదు
వందేమాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు…!

(This poem bagged First best prize of Rs 4000/- and citation
in International poetry contest by koumudi.net
web journal in April2007 )

౪.

-ఆత్రేయ కొండూరు

గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,
పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..

సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..

వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..

ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..

ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.

౫. అచ్చులు

-పెరుగు రామకృష్ణ

ముద్ద బంగారమే
నీ చేయి తాకితే చాలు
చింతాకు పతకం
పచ్చల చంద్ర హారం
నవరత్నాలని పేర్చినా
మాంగల్యం బిళ్ళలు చేసినా
నీది అమృత హస్తమే
మా అమ్మ చేతి గాజులకి
నువ్వుపెట్టిన మెరుగు
మా నాన్న చిరునవ్వంత తాజాగా
షష్టిపూర్తికీ మెరుస్తూనే వుంది
దుర్గమ్మ ముక్కుపుడక చూసినప్పుడల్లా
నీ కళా నైపుణ్యం ముందు
రెండు చేతులూ ముకుళిస్తాయి
కానీ ఏంలాభం..?
అక్షరాల్ని బతికించిన అచ్చులు
నీ కడుపులో చిచ్చు రేపాయి
యంత్ర చక్రాల తిరుగుడులో
నీ బతుకు చక్రం వెనక్కి తిరిగింది
నువ్విప్పుడు పడమటి ఆకాశంలో
రాలిపోయిన సూర్యుడివి…!

(కోల్పోతున్న కుల వృతుల్లో బంగారు పనిచేసే వారు
కనుమరుగవుతుండడం చూసి..)

——

౬.

-స్వాతీ శ్రీపాద

కాలానికీ విలువకూ మధ్యన
సామరస్యం పచ్చగడ్డి భగ్గుమంటుంది.
ఒకప్పటి అతిశయోక్తులు
ఇప్పుడు ఆధునికత జారుడు బండ దిగువన
శుష్క వచనాల దిగులు మొహాల్తో
శూన్యాన్ని దిగంతాలకు వేళ్ళాడదీస్తూంటాయి.

సమయం సాన మీద అనవరతం
అరిగిన గంధపు చెక్కగా అద్భుత సౌందర్యం
అలసి సొలసి లేత నీరెండ చెక్కిళ్ళలో
ఓ క్షణం కునుకుదీస్తూంటుంది.

అనుభవం ఉలితాకిడిలో పెనవేసుకున్న
ఆలోచనలు అదృశ్యంగా
అద్భుత శిల్పాలై
అంతరంగం అడుగడుగునా నర్తిస్తూ

ఒకప్పుడు చెలియలి కట్టదాటి
పొంగి పొర్లిన మధురోహల స్మృతి సువాసనలు
సజీవంగా
పడమట చేరుతున్న వసంతానికి రూపమిస్తూ …..
అనుకోవాలే గాని ప్రతి ఉషోదయం ఉగాదే కదా…
ప్రతి శిశిరం ఓ వసంతపు ఛాయే కదా!

=========================

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to కవికృతి-౧౨

  1. నాకు తెలిసి – మహేశ్ కుమార్ ఒకప్పుడు సమైక్యవాదే. కానీ తెలుగువాళ్ళకి రెండు రాష్ట్రాలుంటే అటూ ఇటూ దళితులకి మేలని ఆయనతో ఎవరో చెప్పారు. ఆయనా కన్విన్సయ్యారు. అప్పట్నుంచి తెలంగాణవాదిగా మారారు.

Comments are closed.