నేనెఱిగిన విశ్వనాథ

– భైరవభట్ల కామేశ్వర రావు

“చిరుత తొలకరివానగా… చిన్ని సొనగ…పొంగి పొరలెడు కాల్వగా… నింగి కెగయు
కడలిగా… పిల్లగ్రోవిని వెడలు వింత తీయదనముల లీనమై పోయె నెడద”

విశ్వనాథ సత్యనారాయణ

ఇది కృష్ణశాస్త్రి పద్యం. కృష్ణుని మురళీగానం చిన్న తొలకరివానగా మొదలై, క్రమక్రమంగా పెరుగుతూ పోయి, నింగి కెగసే కడలిలాగ ఎలా ముంచెత్తిందో వర్ణించే పద్యం.

విశ్వనాథ కవిత్వం నన్ను ముంచెత్తింది కూడా సరిగ్గా ఇలాగే! ఎప్పుడో మొదటిసారి, ఎవరి గొంతులోనో, కొండవీటి పొగమబ్బుల పద్యాన్ని విన్నప్పుడు నా మనసు కూడా ఒక పొగమబ్బై కొండవీటి బురుజులపైన తేలిపోయిన అనుభూతి. విశ్వనాథతో అదే నా తొలిపరిచయం. అలా మొదలైన ఆ పరిచయం ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, తెలుగు ఋతువులు, ఇలా ఇలా పెరిగి పెరిగి రామాయణ కల్పవృక్ష పరిచయంతో ఒక గాఢమైన అనుబంధంగా మారింది. తీరా చూస్తే విశ్వనాథ సాహిత్యంలో నేను చదివినది మొత్తం కలిపి ఒక పావువంతు కూడా ఉండదు! మరి ఇంతటి అభిమానానికి కారణమేమిటి?

నాకు తెలుగు పద్యమంటే, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తెలుగు పద్య కవిత్వమంటే చాలా ప్రీతి. నన్ను విశ్వనాథకి దగ్గర చేసినవి ముమ్మాటికీ ఈ మూడు మాటలే! “తెలుగు”, “పద్యం”, “కవిత్వం”. తెలుగుదనం, పద్య రచనా వైదుష్యం, గాఢమైన కవిత్వం. విశ్వనాథ సాహిత్యానికున్న వేయిపడగలలో తక్కిన పడగల మాట నేను చెప్పలేను కాని, ఈ మూడు పడగలూ మాత్రం అచ్చమైన అమృతాన్నే చిందిస్తాయి. ఆ అమృత సాగరంలోనే నా మనసు లీనమైపోయింది.

దాన్ని ఒక చిన్న చెంచాలో మీకందించే ప్రయత్నమే యీ వ్యాసం.

తెలుగుదనం

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీ వఱకుంగల యాంధ్ర పూర్వ రా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతర మేలొ చలించిపోవు నా
ర్ద్రమ్ముగ చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్ని జ
న్మమ్ములుగాగ నీ తనువునన్ బ్రవహించునొ యాంధ్ర రక్తముల్

“పూర్వాంధ్ర రాజ్యవైభవం గురించి విన్నప్పుడల్లా ఎందుకో మనసంతా ఆర్ద్రమైన భావాతిరేకంతో సంచలించిపోతుంది. బహుశా ఎన్నో జన్మలుగా నా యీ శరీరంలో ఆంధ్ర రక్తాలు ప్రవహిస్తూ ఉన్నాయి కాబోలు!”

కనులెత్తి చూడాలనే ఆకాంక్ష. కాని దాన్ని అడ్డుతున్న సిగ్గు బరువుతో ఱెప్పలని ఎత్తలేక పోతున్నారు. కనులెత్తకుండానే, కంటి చివళ్ళ సందుల్లోంచి పక్కచూపులు చూస్తున్నారు. ఒక్కసారి ఆ అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి (లేదా గుర్తు తెచ్చుకోండి!).

ఒంట్లో తెలుగు రక్తం ప్రవహించే ఎవ్వరికైనా ఇలాటి పద్యాలు చదినప్పుడు అది ఉరకలెత్తక మానుతుందా చెప్పండి!

ఆంధ్రప్రశస్తి కావ్యం నిండా ఇలాటి తెలుగుదనమే. గుండెలని పొంగించే తెలుగుదనం. “ఇంతకు ముందెప్పుడో – ఇక్కడ, యీ ఆంధ్రదేశంలో, గడ్డిపోచలు కూడా వాడి కత్తులై శత్రువుల కుత్తుకలను ఉత్తరించిన కాలంలో, నువ్వూ నేనూ తోడి సైనికులమై చేసిన స్నేహం కాబోలు మన ఈ అనుబంధం” అని ఆంధ్రప్రశస్తిని అంకితం చేస్తూ మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో అన్న విశ్వనాథలో అణువణువూ ఆంధ్ర పౌరుషం ఉరకలు వేసి, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి చాలామందికి తెలియని ఆంధ్రుల పూర్వ ప్రశస్తిని పద్యాలలో మధురంగా గానం చేసారు విశ్వనాథ. ఆంధ్ర మహావిష్ణువుతో మొదలుపెట్టి, శాతవాహనుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, మాధవవర్మ, వేంగీ క్షేత్రము, ముఖలింగము, నన్నయ భట్టు, ప్రోలరాజు, కొండవీటి పొగమబ్బులు, చంద్రవంక యుద్ధము, అళియరామరాయల వరకూ తెలుగు చరిత్రలోని ముఖ్య సన్నివేశాలని, ముఖ్య ప్రదేశాలని, వ్యక్తులని కథలు కథలుగా కవితాత్మకంగా మనకి పరిచయం చేసే కావ్య మాల ఆంధ్ర ప్రశస్తి.

కల్పవృక్షం

కొందరికిది “మా తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకండి” అన్నట్టుగా అనిపించవచ్చు. కాని “మన” అనే భావనలోంచి అసంకల్పితంగా పొంగుకొచ్చే ఆనందాతిశయం యిది. ఈ మధ్యనే మన రహమాన్ ఆస్కారు అవార్డులు గెలిస్తే భారతదేశమంతా “జై హో” అన్నది ఎందుకు? ఈ “మన” అనే భావం వల్లనే కదా. అలాగే మన పూర్వ చరిత్రను, దాని వైభవాన్నీ కీర్తించి “జయహో” అన్నారు విశ్వనాథ. “ఆంధ్రప్రశస్తి”లో చారిత్రక దృష్టి కనిపిస్తే, “ఆంధ్రపౌరుషము” కావ్యంలో తెలుగువాళ్ళ పౌరుషం ఉరకలు వేస్తుంది. ఆ పౌరుషమంతా యిప్పుడేమైపోయిందీ అన్న ఆర్తి ప్రతి అక్షరంలోనూ ధ్వనిస్తుంది.

నేటి ఆంధ్రులు గుడ్డకు గూటి కున్న
చాలు ననువారలైనారు, చచ్చిపోయె
నేమొ జాతీయ సత్వంబు, కోమలంబు
మల్లికకు నీరులేకున్న మాడిపోదె!

జాతీయ భావన అనే శక్తి లేకపోతే నీరులేని మల్లికలాగా జాతి మాడిపోదా అని ఆక్రోశించారు విశ్వనాథ. అయినా అతనికి ఆంధ్ర పౌరుషం మీద, ఆంధ్ర జాతి మీద ఉన్న నమ్మకం అపారం. ఎదో పొరపాటున ఇలా ఉంది కాని, నిజానికి “తెనుగు చురకత్తి పదునుకు తిరుగులేదు” అంటారు.

విశ్వనాథలోని తెలుగుదనం “ఆంధ్రపౌరుషం”, “ఆంధ్రపశస్తి” కావ్యాలలో మాత్రమే కాదు, అతని ప్రతి రచనలోనూ ఉట్టిపడుతుంది. ఆరు ఋతువులని వర్ణించినప్పుడు కూడా, ఆయా ఋతువుల్లో తెలుగుదేశంలోని వాతావరణం మన కళ్ళకి కట్టిస్తారు. అందుకే అవి “తెలుగు ఋతువులు” అయ్యాయి.

“పేరంటమున కేగు పిన్న బాలిక వాలు
జడ మల్లెమొగ్గ కన్పడినయంత” వసంతం వచ్చిందని తెలుస్తుందిట! ఎంత చక్కని ఊహ!

తెలుగుదనంలో మునకలేసిన విశ్వనాథ, తన రామాయణ కల్పవృక్షంలో, మరీ ముఖ్యంగా బాలకాండ అంతటా కూడా తెలుగుదనం రాశులు పోసారు. తెలుగువారి ఇళ్ళల్లో ఉండే మమకారాలు, తల్లిదండ్రులకి పిల్లలకీ మధ్యనుండే వాత్సల్యాలు, తెలుగు పండుగలు, తెలుగువారి ఆచారాలు ఇవన్నీ మనకి బాలకాండలో కనిపిస్తాయి.

రాముడు పుట్టినప్పుడు, పుట్టిన శిశువుపై మంత్రసాని కలినీళ్ళు చల్లి కుదిలించడం, బొడ్డు కోయడం, గోధుమలు పోసి దానిపై చీర పఱచి శిశువుని పడుకోబెట్టడం ఇలా తెలుగిళ్ళల్లో తన కాలంలో జరిగే ఆచారాలన్నిటినీ వర్ణించారు.

బాల రాముణ్ణి ఉయ్యాలలో వేసే సన్నివేశం అది. పేరంటానికి చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. రాముణ్ణి ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నారు. ఉయ్యాల ఊపేటప్పుడు మరి పాటలు పాడొద్దూ. దానికెవరూ ముందుకు రావడం లేదు. ఆ సందర్భంలో ఒకరినొకరు పాడమంటూ ఎలా మాట్లాడుకుంటున్నారో వినండి:

నోరు పెగలదటే నీకు? నూరక తెగ
రాలిపోవుదు కూనిరాగాలతోడ!

బిఱ్ఱబిగిసెదు తొట్టెను బెట్టు స్వామి
నేలగా పాడగా నొక్క జోలపాట

అనరమ్మ యొక్కపాటను,
వనితామణులెల్ల నిటకు వాయనములకై

చనుదెంచిరొ? యెల్లరకును
నినుమడి దాళాలు పడెనటే నోళులకున్!

“ఏవిటీ ఒక్కళ్ళకీ నోరు పెగలదు? ఉట్టినే ఓ తెగ కూనిరాగలు తీస్తారే! తొట్టెలో పెట్టిన స్వామిని లాలిస్తూ ఇప్పుడొక్క జోలపాటకూడా పాడరేం? ఒక్క పాటైనా పాడండర్రా! ఇక్కడికందరూ వాయనాలు పుచ్చుకోడానికే వచ్చారా ఏమిటి? అందరికీ నోటికి పెద్ద పెద్ద ఇనప తాళాలు పడ్డట్టున్నాయే!” – ఇదీ వరస. తెలుగుదనం యింకా కాస్తైనా మిగిలున్న ఇళ్ళల్లో ఇప్పటికీ ఇలాటివప్పుడప్పుడూ కనిపిస్తాయి.

ఇలా ఒకటేమిటి, రాముడు పుట్టినదాదిగా సీతా కల్యాణం వరకూ జరిగిన వేడుకలన్నిటిలోనూ మన తెలుగువారి ఆచార వ్యవహారాలే కనిపిస్తాయి. దశరథ పుత్రులు నలుగురినీ పెళ్ళి కొడుకులని చెయ్యడం, కల్యాణ మండపం తీర్చిదిద్దడం, సీతనీ ఆమె ముగ్గురు చెల్లెళ్ళనీ బుట్టల్లో తీసుకురావడం, జీలకఱ్ఱ బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు, మంగళహారతులు, స్థాలీపాకం, అరుంధతి దర్శనం, అప్పగింతలు ఇలా తెలుగువాళ్ళ పెళ్ళివేడుకలు సమస్తమూ దర్శనమిస్తాయి! వధూవరులు పక్క పక్కన కూర్చుని ఉన్నప్పుడు, ఒకరి వంక ఒకరు చూసుకోవాలన్న ఆకాంక్ష, నేరుగా చూసుకోవడానికి సిగ్గు – ఇలాటి అవస్థ చాలామంది కొత్త దంపతులకి ఉండేదే కదా! దాన్ని ఎంత అందంగా కవిత్వీకరించారో విశ్వనాథ, చూడండి:

ఎదురుబళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్పలవి యెత్తబడకుండ గ్రేవలందు
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్పిన ప్రథమ విద్య

“ఎదురు బళ్ళు” కావడం తెలుగు నుడికారం. కనులెత్తి చూడాలనే ఆకాంక్ష. కాని దాన్ని అడ్డుతున్న సిగ్గు బరువుతో ఱెప్పలని ఎత్తలేక పోతున్నారు. కనులెత్తకుండానే, కంటి చివళ్ళ సందుల్లోంచి పక్కచూపులు చూస్తున్నారు. ఒక్కసారి ఆ అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి (లేదా గుర్తు తెచ్చుకోండి!). అలా చూడడం మన్మథుడు ఆ వధూవరులకి నేర్పే మొదటి విద్యట!

విశ్వనాథ కన్నా అందంగా పద్యాన్ని రాయగల కవులున్నారు. అతనికన్నా మధురంగా రాయగలవారున్నారు. అతనికన్నా ప్రౌఢంగా రాయగల కవులూ ఉన్నారు. అతనికన్నా వాడిగా పద్యాన్ని నడిపించగలవారు కూడా ఉన్నారు. కాని యిన్ని రకాలుగానూ పద్యాన్ని నడిపించగల సమర్థులు మరొక్కరెవ్వరూ లేరు!

ఈ వాతావరణం, యీ ఆచారాలు, యీ సంస్కృతీ వీటన్నిటినీ యిలా కావ్యంలో సంతరించడం వల్ల ఏమిటి ప్రయోజనం? అంటే, ఒకటి మనం మరిచిపోతున్న మనదైన సంస్కృతిని మనకి గుర్తు చెయ్యడం. అంత కన్నా ముఖ్యంగా గత కాలపు సంస్కృతిని ముందు తరాలకి తెలియజెయ్యడం. ఒక రకంగా యిది సాంస్కృతిక చరిత్ర.

ఇంక భాష విషయానికి వస్తే, విశ్వనాథ సంస్కృత భూయిష్టమైన కవిత్వాన్ని రాస్తాడనీ, అది ఎవరికీ అర్థం కాదనీ ఒక ప్రచారం ఉంది. ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. విశ్వనాథ కవిత్వంలో ప్రౌఢ సంస్కృత భాషా ప్రయోగం ఎంతగా కనిపిస్తుందో, అచ్చమైన తెలుగు నుడికారం, పలుకుబడి అంతగానే కనిపిస్తాయి, చూసే కళ్ళుండాలే గాని.

తొలినాళ్ళలో రాసిన కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు లాంటి కావ్యాల్లో జాను తెలుగు సౌందర్యం చాలామందికి తెలిసినదే. అయితే తర్వాత రాసిన చాలా కావ్యాలలో కూడా వాడుక తెలుగు వయ్యారాలు మనసులని ఉయ్యాలలూగిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రశస్తి కావ్యాన్ని మల్లంపల్లివారికి అంకితం చేస్తూ,

“నీవనుకోను లేదు మరి నేనది చెప్పను లేదు కాని, అ
న్నా! వినవయ్య నేటికిది నా చిఱుపొత్తము నీకు నంకితం
బై వెలయింపజేతు”

అన్నప్పుడు ఆ తెలుగు పలుకుబడిలో ఎంతటి ఆత్మీయత నిండి ఉన్నదో గమనించండి!

శృంగారవీథిలో, మేలుకొలుపు అనే ఖండిక ఒకటుంది. చిన్ని కృష్ణుని నిద్రలేపే సన్నివేశం. ఆ సందర్భంలో యశోద పలుకులివి:

పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండు
కొనును, నీవేమొ పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు

ఆ పలుకుబడి, ఆ వాక్యవిన్యాసం అచ్చమైన తెలుగు వాడుక భాష కాదూ!

ఇలా విశ్వనాథ కావ్యాలన్నిటా తెలుగు పలుకుబడి, వ్యవహార భాష మనకి దర్శనమిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ సంగీతము, విశ్వనాథ మధ్యాక్కరలలో ఉన్న తెలుగు వ్యావహారిక భాషా సౌందర్యం అనన్యం! వాటిని ఇక్కడ ఉదహరించడం కన్నా ఎవరికివారు స్వయంగా చదువుకొని, అనుభవించడమే ఉత్తమం.

విశ్వనాథ కవితా వైదుష్యమంతా రాశీభూతమైన రామాయణ కల్పవృక్షంలో కూడా, తెలుగు పద సంపద, నుడికారం అడుగడుగునా కనిపిస్తాయి.

అగస్త్యుని గురించి అతని అన్నదమ్ముడు (పేరులేని అగస్త్యభ్రాత) చెప్పే కథలో ఈ పద్యాన్ని చూడండి:

అబ్బో అగస్త్యుడాతడు
సెబ్బర మానిసి! ధరిత్రి శిరసాన్చిన ఆ
గబ్బిరి గిరి తోడ నిట్లనె
అబ్బీ! మునిలోక భక్తుడై వర్ధిలుమీ!

“అబ్బో ఆ అగస్త్యుడున్నాడే, అతను మా చెడ్డ మనిషయ్యోవ్! భూమ్మీద తల ఆన్చిన గర్వాత్ముడైన ఆ పర్వతంతో అన్నాడూ, అబ్బీ! నువ్వు మునిలోక భక్తుడై వర్ధిల్లుదువుగాక”

ఇది తెలుగు పలుకుబడి పుణికిపుచ్చుకున్న సంభాషణా శైలి. సెబ్బర, గబ్బిరి మొదలైనవి తెలుగువాళ్ళు మరిచిపోయిన అచ్చ తెలుగు పదాలు.

విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి కథ చెప్పే యీ సన్నివేశం చూడండి. గంగావతరణ కథ చెప్పమని రామలక్ష్మణులు అడుగుతారు. చెప్పడం మొదలుపెడతాడు విశ్వామిత్రుడు.

అసలు కథ జెప్పెదను వినుడంచు మౌని
“పుడమి పడతికి బెట్టిన పునుగుబొట్టు

కల దయోధ్య యటన్న చక్కని పురంబు
మీరెఱుంగుదురే” యన వారు నగుచు

“మే మెఱుంగుదు” మన మౌని “మేలు మేలు
మీ రెరింగిన గథలోని మేలి సగము

నెఱుగుదురె యంట! అప్పుర మేలు దొల్లి
యనగ ననగను సగరు డన్నట్టి రాజు”

సగరుడు రాముని వంశంలోని రాజే! అతను రాజ్యం చేసినదీ అయోధ్యే. అందుకే కథ మొదలుపెడుతూనే, “భూమి అనే స్త్రీకి పెట్టిన పునుగు బొట్టు లాంటిది, అయోధ్య అని, ఒక చక్కని నగరం ఉంది. మీకు తెలుసా?” అని విశ్వామిత్రుడు అడుగుతాడు. “ఓ మాకు తెలుసు!” అని నవ్వుతూ జవాబిస్తారు రామలక్ష్మణులు. “ఓహో మంచిది, మంచిది! అయితే కథలోని మేలు సగం మీకు తెలిసిపోయినట్టే! అనగ అనగ సగరుడనే రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు.” ఇలా మొదలవుతుంది. తెలుగువాళ్ళు కథ చెప్పడంలోని ఒడుపంతా ఇందులో ఒడిసిపట్టారు విశ్వనాథ. ఈ కాలంలో ఎంతమంది పెద్దవాళ్ళు పిల్లలకి యిలా కథలు చెప్తున్నారు?

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో ఉద్గ్రంథమే అవుతుంది!

పద్యరచనా వైదుష్యం

తన గొంతులో ఊగిసలాడుతున్న నాదాలు అపూర్వమైన గానంగా బయటకి వచ్చి నిలిచినట్టుగా, తన గుండెలో దాగున్న మృదువైన స్థానాలు భావాల రూపాలు దాల్చి పైకి వచ్చినట్టుగా, తన సృష్టిలో నిండిన తీయని ప్రదేశాలన్నీ గంతులు వేస్తూ వచ్చి ఎదురుగా కనిపించినట్టుగా, ముందెప్పుడూ తెలియని పరమానందపు హద్దులని ఆత్మ తనకి తాను స్వయంగా తెలుసుకొన్నట్టుగా – ఇలాంటి అపూర్వమైన జలదరింపుతో, పులకరింపుతో కనుల చివరలనుండి కన్నీరు కారి, శరీరమంతా గొగుర్పొడిచింది.

విశ్వనాథ కన్నా అందంగా పద్యాన్ని రాయగల కవులున్నారు. అతనికన్నా మధురంగా రాయగలవారున్నారు. అతనికన్నా ప్రౌఢంగా రాయగల కవులూ ఉన్నారు. అతనికన్నా వాడిగా పద్యాన్ని నడిపించగలవారు కూడా ఉన్నారు. కాని యిన్ని రకాలుగానూ పద్యాన్ని నడిపించగల సమర్థులు మరొక్కరెవ్వరూ లేరు!

ఛందస్సు వేదపురుషుడి పాదాలంటారు. అంటే ఛందస్సు నడకనిస్తుందన్నమాట. వేదాలూ చాలావరకూ పూర్వ సంస్కృత కావ్యాలూ కూడా ఛందస్సుని నడకకి మాత్రమే ఉపయోగించుకున్నాయి. కావ్య కళ వృద్ధి చెందిన కొద్దీ, చెప్పే విషయానికి అనుగుణంగా ఛందస్సుని ఎన్నుకోవడం మొదలయ్యింది. దీనినే క్షేమేంద్రుడు వృత్తౌచిత్యం అన్నాడు. ఇక మన తెలుగు కవులు ఏంచేసేరయ్యా అంటే, యీ ఛందస్సుని కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేక అంశాలని ధ్వనించడానికి ఉపయోగించుకున్నారు. అంటే ఛందస్సుకి నడకతో పాటు గొంతు కూడా ఇచ్చారన్నమాట! పద్యపు టెత్తుగడ, పద్య నడకలో వివిధ గతులు, యతి ప్రాసలని అతకడంలో ప్రత్యేకత – వీటన్నిటి ద్వారా చెప్పే విషయాన్ని ధ్వనింప చెయ్యడం పద్య శిల్పం. ఇలాటి పద్య శిల్ప నైపుణ్యంలో విశ్వనాథ అసామాన్యుడు. ఉదాహరణకి యీ పద్యం చూడండి. ఇందులో రావణుడు సీత దగ్గర తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు:

ఓహో! మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్ ఫణా
వ్యూహంబందు నటో యిటో యొరుగగా నూనంగ నైనట్టి శే
షాహిం దక్కగ వింశతి ప్రభుభుజాహంకార సంభార రే
ఖా హేలాధృత శైవ పర్వత భుజాస్కందున్ ననున్ దక్కగన్

“సమర్థమైన నా ఇరవై భుజాల శక్తీ ద్యోతకమయ్యేట్లుగా వట్టి ఆటగా కైలాసాన్నే ఎత్తిన వాడిని నేను. ఇంతటి కార్యాన్ని చేసినవాడు మరెవడున్నాడు? మహా చెప్పుకోవాలంటే ఆదిశేషుడున్నాడు. మొత్తం తన పడగలన్నిటితో అటో, ఇటో ఒరిగిపోయినట్టుగా భూమిని మోస్తున్నాడు. అతన్ని తప్ప, మరో మూడో వాడసలెవడినైనా ఉన్నాడేమో చూపించు!” ఇదీ రావణుడి అహంకారం. ఇందులో శేషుడు చేస్తున్న పనిని వర్ణించే రెండవపాదాన్ని, రావణుని ఔద్ధత్యాన్ని వర్ణించే చివరి రెండు పాదాలతో పోల్చి చూడండి. “అటో యిటో యొరుగగా నూనంగ నైనట్టి” ఇది ఆగి ఆగి వెళుతున్న నడక. అది ఒక పక్క శేషువు పడుతున్న శ్రమని, మరో వంక రావణుడికి అతని మీదున్న తిరస్కార భావాన్ని ధ్వనిస్తోంది. అదే రావణుడి విషయంలో, పద్యం ఏక సమాసంలో ధారగా సాగి, ఒకవైపు కైలాసాన్ని ఎత్తడంలోని సునాయాసాన్ని, మరో పక్క రావుణుడి అహంకారాన్ని ధ్వనిస్తోంది. పద్యం ఎత్తుకోవడంతోనే, “ఓహో మూడవ వాని జూపుము” అనడం రావణుని సంభాషణా పటిమని పట్టిస్తోంది. ఇదీ పద్య శిల్పం.

వేయిపడగలు

విశ్వనాథ ఒక్కొక్క కావ్యంలోనూ ఒక్కొక్క రకమైన పద్య శైలి కనిపిస్తుంది. కిన్నెరసాని పాటల్లో కిన్నెర నడకలలో ఉన్న వైవిధ్యాన్ని గతిభేదంతో ఎంత సుందరంగా ఆవిష్కరించారో చదివిన వాళ్ళకి తెలిసిన విషయమే. కిన్నెరసాని పరుగులు పెడితే, పాటల గతి కూడా పరుగులు పెడుతుంది. కిన్నెర నింపాదిగా, వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేటప్పుడు, పాట కూడా కదలలేక కదలలేక కదులుతుంది. ఇవన్నీ విశ్వనాథ సొంత గొంతులో వింటే మరింత అద్భుతంగా అనిపిస్తాయి!

పూర్వ కవులెవ్వరూ పెద్దగా పట్టించుకోని మధ్యాక్కర ఛందస్సుని తీసుకొని ఏకంగా పది శతకాలు (అంటే వెయ్యి పద్యాలకి పైగా!) రాయడమన్నది విశ్వనాథకి ఛందస్సు మీదున్న పట్టుని నిరూపిస్తుంది. అతి సామాన్యమైన తెలుగు సంభాషణలకి మధ్యాక్కర ఛందస్సు చాలా అనువైనదని అతను గుర్తించారు. దానికి తగ్గట్టు పద్యరచన చేసారు.

“కోరి కబేలాకు మందగా దోలికొనిపోవుచుండ,
దారి ప్రక్కనయున్న పచ్చిగడ్డిపై దారాడు పసుల
తీరుగానున్నది, జనుల భోగాశ! తెలివి సర్వమ్ము
చూఱ పుచ్చెదవు శ్రీశైల మల్లికార్జున! మహాలింగ!”

ఇలా సాగుతుంది మధ్యాక్కర నడక!

విశ్వనాథ కల్పవృక్షంలో వాడినన్ని ఛందస్సులు మరెవ్వరూ ఎక్కడా నాకు తెలిసి వాడలేదు. ఛందస్సు పేరుకీ అందులో చెప్పే విషయానికీ సంబంధం ఉంటే, ఒక చమత్కారం కలుగుతుంది. ఉదాహరణకి మేఘాన్ని వర్ణించడానికి “జలదము” అనే వృత్తం, లేడిని వర్ణించడానికి “హరిణి” అనే వృత్తం వాడడం. ఇలాటివి కల్పవృక్షంలో చాలా కనిపిస్తాయి. అయితే ఇలాంటి రచన ఒక చమత్కారాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప, మరేమీ ధ్వనించదు. ఒకానొక విషయాన్ని ధ్వనించడానికి ఛందస్సుని వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ముక్కూచెవులు కోసేసినప్పుడు శూర్పణఖ కోపంతో బొబ్బలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అలా అలా ఎగిరిపోతున్న శూర్పణఖ మాటలు ఒక నాలుగు పద్యాలలో రచించారు. అందులో మొదటి పద్యం లాటీవిటమనే ఛందస్సు, రెండవది అసంబాధము, మూడవది హలముఖి, నాలుగవది వ్రీడ. మొదటి పద్యంలో పాదానికి యిరవయ్యొక్క అక్షరాలు. రెండవ దానిలో పధ్నాలుగు, మూడవ దానిలో తొమ్మిది, చివరి దానిలో నాలుగు అక్షరాలు. ఇలా పద్య పరిమాణం క్రమేపీ తగ్గుతూ పోతుంది.

ఇదొక విచిత్రమైన పద్యశిల్పం. ఇలాంటిది తెలుగు సాహిత్యంలో మరెక్కడా నాకు కనిపించలేదు! ఇది రెండు విషయాలని ధ్వనిస్తోంది. ఒకటి, శూర్పణఖ పెద్దగా అరవడం మొదలుపెట్టి, క్రమంగా అలిసిపోయి, చివరకి మెల్లిగా అరిచింది అని అనుకోవచ్చు. లేదూ దూరంగా వెళిపోతున్న ఆమె గొంతు కిందనున్న రామలక్షణులకి, సీతకి క్రమేపి తగ్గుతూ వినిపించిందనీ అనుకోవచ్చు. ఇలా ఛందస్సులో గొంతుని వినిపించడం ఇక్కడ విశేషం.

ఆసక్తి ఉన్నవాళ్ళు విశ్వనాథ పద్య రచనలో చూపించిన వైవిధ్యాన్ని, వైదుష్యాన్ని మరింత లోతుగా పరిశీలించవచ్చు.

చెళ్ళపిళ్ళ వారు చెప్పిన, “నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్, నా తాత ముత్తాతలం దేమార్గమ్మును కాదు, వీని దెదియో ఈ మార్గ మట్లౌటచే సామాన్యుండనరాదు!” అన్న మాటలు విశ్వనాథ పద్య రచనా శైలి విషయంలో అక్షరాలా నిజమనిపిస్తుంది.

కవిత్వం

తన గొంతులోన నూగు నినాదము లపూర్వ

నినదితంబులు వచ్చి నిట్టవొడిచి

తన గుండెలోన డాగిన మెత్తనగు చోట్లు

భావరూపములంది పైకివచ్చి

తన సృష్టిలోన నుండిన క్రొత్త మాధుర్య

సీమలు క్రేళ్ళుగా జెంగలించి

తన ఆత్మ దా నెఱుంగని ఒక్క ఆనంద

పరిథి రేఖా స్వయంవ్యక్తి కలిగి

కను గొలుకులందు కన్నీళ్ళు గార్చి, మై గ

గుర్పొడవ…

తన గొంతులో ఊగిసలాడుతున్న నాదాలు అపూర్వమైన గానంగా బయటకి వచ్చి నిలిచినట్టుగా, తన గుండెలో దాగున్న మృదువైన స్థానాలు భావాల రూపాలు దాల్చి పైకి వచ్చినట్టుగా, తన సృష్టిలో నిండిన తీయని ప్రదేశాలన్నీ గంతులు వేస్తూ వచ్చి ఎదురుగా కనిపించినట్టుగా, ముందెప్పుడూ తెలియని పరమానందపు హద్దులని ఆత్మ తనకి తాను స్వయంగా తెలుసుకొన్నట్టుగా – ఇలాంటి అపూర్వమైన జలదరింపుతో, పులకరింపుతో కనుల చివరలనుండి కన్నీరు కారి, శరీరమంతా గొగుర్పొడిచింది.

గొప్ప కవులు, కవిత్వాన్ని గురించి కూడా కవిత్వం చెప్పడం పరిపాటి. విశ్వనాథ కూడా తన కావ్యాలలో చాలాచోట్ల ఆ పని చేసారు. ఆ చెప్పడం అన్యాపదేశంగా చెప్పారు, అంటే కవితాత్మకంగా చెప్పారన్న మాట. పైనున్న పద్యం అలాటి సందర్భాలలో ఒకటి.

ఋశ్యశృంగుడు లోకం తెలియకుండా పెరిగిన ముని కుమారుడు. అతను మొట్టమొదటిసారి మధుర గానాన్ని విన్నప్పుడు అతనిలో కలిగిన సంచలనాన్ని, స్పందననీ వర్ణించే పద్యమిది. కాని యిది కవిత్వానికి, ఆ మాటకొస్తే ఏ కళకైనా వర్తిస్తుంది. సహృదయుడైన ఒక రసజ్ఞునికి కళ ద్వారా కలిగే రస స్థితి యిలాగే ఉంటుందని విశ్వనాథ తీర్పు. అతను అలాంటి కవిత్వమే రాసారు.

తరువాతి పేజీ

About భైరవభట్ల కామేశ్వరరావు

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగులో ప్రసిద్ధి చెంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to నేనెఱిగిన విశ్వనాథ

  1. lalithasravanthi says:

    naaku “kalpavRksham” tution ceptaaraaa plssssss
    mee article chadivinadaggari nuncii manasantaa elaagO ayyindi, plss cheppanDi sir

  2. మాలతి says:

    కామేశ్వరరావుగారూ, నమోవాకములు. ఇంత విశిష్టమయిన విశ్లేషణ నేను చదివి చాలాకాలమయింది. చాలా సంతోషంగా వుంది మీవ్యాసం చదువుతుంటే. ధన్యవాదాలు.

  3. కామేశ్వరరావు గారు,
    చక్కటి వ్యాసాన్ని అందిచ్చినందుకు ధన్యవాదాలు.

  4. Vennela says:

    చక్కని వ్యాసం!!అద్భుతమైన పద్యాలు!నేను మొదట విన్న విశ్వనాధ వారి పద్యం
    “ఏ రాజు పంచెనో ఇచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితినాళ్ళ
    ఏ యెఱ్ఱ సంజెలో నెలమి పల్లవ రాజ రమణులు కాళ్ళపారాణి నిడిరొ….”
    ఎంత అందమైన భావన ! ఎంత చదివినా, ఎన్ని సార్లు చదివినా, చదివిన ప్రతిసారీ ఆయన కవితాసౌందర్యానికి ఆశ్చర్య పోతూనే ఉంటాను.

    ధన్యవాదాలు.

  5. రవి says:

    చాలా అద్భుతంగా చెప్పారు. ఓ రచనలో తాదాత్మ్యత చెందితే తప్ప ఇంత ప్రగాఢమైన వ్యాసం వెలువడదు. పొద్దు వారికీ, మీకూ హృదయపూర్వక అభినందనలు.

    ఇక –
    “పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
    అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండు
    కొనును, నీవేమొ పక్కంత కుమ్మి కుమ్మి
    పక్క యటులుండ నీవిట్లు పండుకొందు”

    అచ్చంగా మా పాపాయి ఇంతే. నిన్నే మనసులో అనుకున్నాను, “ఏమీ చంటిది, ఇలా గడియారం ముల్లు లా తిరుగుతోంది పక్క మీద అని.” పై పద్యం, నా మనసు నాతో మాట్లాడినట్టు ఉన్నది.

  6. రాఘవ says:

    విశ్వనాథవారి కృతులు కచ్చితంగా చదవాలన్న కుతూహలాన్ని పెంచేలా వ్రాసారు. బావుంది. 🙂

  7. విశ్వనాధ వారిపై ఇంత చక్కటి విశ్లేషణతో కూడిన వ్యాసం ఈ మధ్య కాలంలో ఇదే చదవటం! మీకూ, పొద్దు వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు..

  8. యోగి says:

    భైరవభట్ల గారూ

    మీరెరిగిన విశ్వనాథను చూసి, ఒకవేళ బ్రతికి ఉంటే, అసలు విశ్వనాథ కూడా మిమ్మల్ని అభినందించేవారు 🙂

  9. భైరవభట్లగారికి
    అద్బుతమైన వ్యాసం చదివించారు. విశ్వనాధవారికి భయపడుతూనే అభిమానించేవారిలో నేనొకరిని.
    పద్యాల తాత్పర్యాలు, విశేషార్ధాలు ఎక్కడివక్కడ వివరించటం వల్ల పద్య అందాలు అర్ధంచేసుకోవటంలో దోహదపడ్డాయి.

    వ్యాసం ఆద్యంతం మెదడుకు మేతపెడుతూనే, మీరిరువురిపట్ల గౌరవాన్నినుమడింపచేస్తూ సాగింది.

    బొల్లోజు బాబా

  10. అద్భుతమైన వ్యాసం! ముఖ్యంగా సీతారాముల అద్వైతాన్ని వివరించే పద్యాన్ని మీరు వివరించిన తీరు!!

    మీ వ్యాసాలు, ఈమాటలో మోహన గారి వ్యాసాలతో పద్య సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలన్న కోరిక బలపడింది. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి!

  11. వ్యాఖ రాసిన అందరికీ నెనరులు.
    @లలితగారు, కల్పవృక్షానికి ట్యూషన్ చెప్పేంత సీను నాకు లేదండి. అందులో నాకు నచ్చిన అంశాలని, నాకున్న అతి తక్కువ పరిథిలో, వివరించే ప్రయత్నం వీలువెంబడి చేస్తాను.
    కల్పవృక్ష కావ్యానికి అర్థ వ్యాఖ్యానాలతో ఒక్క ప్రచురణా లేకపోవడం దురదృష్టం. ఈ కాలంలో అది చెయ్యగలవాళ్ళు కూడా చాలా చాలా అరుదైపోయారు. సమీప భవిష్యత్తులో వాళ్ళుకూడా ఉండకుండా పోతారు. ఎవరైనా పెద్దవాళ్ళు పూనుకొని ఆ పని చేస్తే బావుంటుంది.

    @వెన్నెల గారు, మీరు చెప్పిన అద్భుతమైన పద్యం కూడా ఆంధ్రప్రశస్తిలోనిదే. ఆంధ్రభారతి సైటులో ఆంధ్రప్రశస్తి పద్యాలున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు.

  12. Vaidehi Sasidhar says:

    చాలామంచి వ్యాసం! ఒకటికి రెండుసార్లు చదివించిన వ్యాసం. “కన్నె కాటుక కళ్ళు” కవితను పాటగా మా నాన్నగారు పాడటం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. అది విశ్వనాధ వారి కవిత అని మా నాన్నగారు కొన్నేళ్ళ క్రితం ఏదో సందర్భం లో చెప్పినపుడు, “పాషాణా పాకా’ అనిపించుకున్న ఆయనేనా ఇంత సరళమైన,సొగసైన పదాలతో అంతటి సుకుమారమైన కవిత వ్రాసింది అని ఆశ్చర్యపోయాను.అందమైన పద్యాలు ఎన్నో పరిచయం చేసారు.ధన్యవాదాలు.

  13. విశ్వనాధని ఇంత గొప్పగా పరిచయం చేయడం మీకే చెల్లింది.

  14. C.S.Rao says:

    భైరవభట్ల కామేశ్వరరావు గారు విశ్వనాధ వారి కవితా వైభవాన్ని వారి వివిధ కావ్యాలనుండి సోదాహరణంగా వివరిస్తూ వ్రాసిన వ్యాసం చాలా బావుంది. అనేకానేక విషయాలు చక్కగా విశదీకరింపబడినవి.
    విశ్వనాధ వారి మహా కావ్యం రామాయణ కల్పవృక్షం యొక్క వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ చక్కగా విపులీకరించారు.

    శ్రీ రామచంద్ర స్వామివారికి శబరి పూలు,పండ్లు తీసుకెళ్ళే దృశ్యాన్ని చాలా మనోహరంగా విశ్వనాధ వారు చిత్రీకరించారు.
    “తుట్టకొక ఎండిన చెట్టు కొమ్మ
    శేఖరంబున యందు పుష్పించినట్లు”

    ఇది కేవలం ఒక అందమైన భావమే కాదు; కేవలం ఒక భౌతికమైన ,సుందరమైన దృశ్యమే కాదు ;దీని ప్రత్యేకత కేవలం దీని లోని మెటఫారికల్ బ్యూటీ మాత్రమే కాదు.వయోభారం శరీరాన్ని కృశింపచేసినా ,ఒక మహదాశయం ,ఒక నిరంతర నిరీక్షణ ,ఒక నిస్వార్ధ సేవా తత్పరత, ఏ మాత్రం ఏనాటికీ సడలని పట్టుదల మనిషిని బ్రతికిస్తాయనేది ఇక్కడ సూచితార్ధం.ప్రేమతొ,భక్తితో,ఆనందంతో,తన జీవిత పరమార్ధం నెరవేరబోతుందనే పారవశ్యం తో శబరి నెమ్మది నెమ్మది గా ముందుకుసాగటం గొప్ప కమనీయమైన,కరుణామయమైన దృశ్యం.రామచంద్రస్వామి వారికి పూలు,పండ్లు సమర్పించుకోవటం వారి పాదాల చెంత సంపూర్ణమైన శరణాగతి కోరుకోవటమే.

    మరొక విషయం:
    శూర్పణఖ ఎపిసోడు లో ఒక గొప్ప స్పిరిచ్యువల్ సింబాలిజం ఉంది.దుర్బుద్ధితో,దుష్టశక్తులనుపయోగించి ,మాయాజాలంతో సంతరించుకున్న కృత్రిమసౌందర్యం రామస్వామివారి లాంటి ధర్మదీక్షాతత్పరుని ముందు కకావికలై పోతుందనేది సూచితం.

    ఇంకొక విషయం:
    మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి వంచనతో ,అతి తెలివితేటలతో, నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేసే నటనతో కూడిన కౌటిల్యపుటాటలు రామచంద్రమూర్తి వారిలానే ధర్మదీక్షా తత్పరుడైన లక్ష్మణస్వామివారి ముందు సాగవు.ఇదంతా గమనిస్తున్న రావణుడు లక్ష్మణస్వామి వారి కుశాగ్రబుద్ధికి విస్తు పోతాడే కానీ ఆయన ధర్మ దీక్షా నిరతి వాని బుద్ధికందనట్టి ఎత్తులోనే నిలిచిపోతుంది.
    వీటన్నింటా గొప్ప తేజోమయమైన కవితాశిల్పం !!!
    శ్రీమద్రామాయణ మహోదధిలో ఎన్నెన్ని అనర్ఘ రత్నాలో!!

    ఇంతటి చక్కని వ్యాసాన్ని అందించిన భైరవభట్ల వారికి అభినందనలు!!!!

    సి.ఎస్.రావు

Comments are closed.