మందిమన్నియమ్ -3

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మూడోది:

సూత్రము – 21 : విశ్వాసాధారితము.

వృత్తి :

ప్రజాస్వామ్యము తమ నాయకులయందుఁ బ్రజలు పెట్టికొను గ్రుడ్డివిశ్వాసము మీఁద నాధారపడి వడచును.

(అ) ప్రజాస్వామ్యమునం దెన్నికైన నాయకులు ఏతీరునఁ బరిపాలింపవలెనను విషయముపైన నే విధమైన సంప్రదాయములు గాని, మార్గదర్శకములుగాని, నియంత్రణములు గాని యుండవు.

(ఆ) లభ్యమగుచున్న వివిధ దేశ రాజ్యాంగములు , ఏదైన తభావతు జరిగినప్పుడు న్యాయస్థానము నాశ్రయించుట కుపయోగపడు విధముగా వ్రాయఁబడినవే గాని తభావతులు జరుగకుండను, శాసనబద్ధముగాఁ దెలివిగా జరుగు తభావతులను నిరోధించు విధముగాను వ్రాయఁబడినవి కావు. అవి హెచ్చుపాలు ప్రభుత్వోద్యోగుల సావధానమునకున్ను, బడిపిల్లల భక్తిశ్రద్ధలకున్ను ఉద్దేశించినవే తప్ప నాయకుల సావధానమున కుద్దేశించినవి కావు. నాయకుల తప్పులకుఁ బ్రభుత్వము లప్రతిష్ఠ పాలైన సందర్భములలో సైతము ప్రభుత్వములనే మూకుమ్మడిగా బాధ్యము సేయు విధముగా శాసనములు రూపొందింపఁబడినవి తప్ప తప్పుడు నిర్ణయములకు నిజముగాఁదెఱవెనుక బాధ్యులైనవారిని వ్యక్తిగతముగా నిలువఁదీయుటకున్ను, శిక్షించుటకున్ను సౌలభ్యము లేదు. అక్కారణమునఁ బ్రభుత్వమునందున్న ప్రతికాపథగామియు యావత్తు ప్రభుత్వము నంతులేని వ్యాజ్యముల పరంపరయందు వాదిగాను, బ్రతివాదిగాను ద్రోసి తాను మాత్రము తప్పించికొనును. వ్యక్తిగతముగా నిలువఁదీయుటకు సౌలభ్యమున్న కొద్దిపాటి సందర్భములలో సైతము పదవీత్యాగమే కఠోరశిక్షగా భావింపఁబడును. తమతప్పుడు నిర్ణయముల వలన దేశమునకు జరిగిన యే నష్టమునకున్నునాయకులు గాని, వారి పక్షములు గాని ద్రవ్యరూపముగాఁ బరిహారముచెల్లించి క్షమాపణ వేఁడికొను సంప్రదాయము ఏ దేశపుఁ బ్రజాస్వామ్యమునందును లేదు.

(ఇ) ఎన్నిక కాకముందు తాము చేసిన వాగ్దానములను నాయకులు ఎన్నికైనతరువాత నుల్లంఘించినను, ముందుగాఁ జెప్పియుండని పనులు చేసినను,వారు అధికారమునం దున్నంతకాలమున్ను ప్రజలు మౌనముగా సైఁచితలవంచికొని యనుసరింపవలెను.

(ఈ) ఒకానొక విధానమును విస్తృత ప్రజానీకమునందు సుదీర్ఘ చర్చకుఁబెట్టకయే కేవలము ప్రజలెన్నికొన్న కొందరు ప్రతినిధులు సమర్థించిరన్నయొకే యొక కారణముచేత దానినిఁ జట్టముగాను బ్రభుత్వాజ్ఞగాను బ్రభుత్వము ప్రకటింపఁదలఁచినచో దానికెట్టి యాటంకమున్ను లేదు. ఇష్టములేనివారు న్యాయస్థానము నాశ్రయింపవచ్చును. కాని యొకవంక ప్రాఁతవ్యాజ్యములు పచ్చిగా నుండఁగానే మరియొక వంక భవిష్యత్తులోఁ బ్రభుత్వమట్టీ యప్రజాస్వామిక చర్యలను ఆమ్రేడింపదను హామీ మాత్రము లేదు.అదియును గాక, ప్రతినిధిసభల ద్వారమున జారీయగు కొన్ని చట్టములకుసంబంధించి మంచిచెడులను సమీక్షించుట సర్వోన్నత న్యాయస్థానములవిచారణపరిధికి సైత మతీతమైనది. కనుక వారున్ను నిస్సహాయులు.

(ఉ) రాజకీయవాది యొక్క యెల్ల యుద్దేశ్యములున్ను అనుమానములకతీతముగా శుచియే నని ప్రజలు నమ్మవలెను.

సూత్రము – 22 : కల్లోలభరితము.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు హింసలేకపోయినను బ్రజోద్యమములమూలమున నశాంతి తరచు.

(అ) పాలకులు తమయంతఁ దాము ప్రాప్తకాలజ్ఞులై ప్రజలకేది యత్యవసరమో ప్రయత్నపూర్వకముగా నెఱిఁగి తదనురూపమైన చర్యలు గైకొనుటయీ కాలమునందు జరుగదు కనుక సమస్యల తీవ్రతను బయల్పఱచు నిమిత్తము ప్రజలు తఱచుగా నుచ్చైః స్వరులై వీథినఁ బడుచుందురు.

(ఆ) ఇది మిక్కిలి యభ్యాసమైపోవుటచేత నట్లు వీథినఁ బడఁజాలనివారినిబ్రభుత్వముకూడ సరకుగొనదు. అందువలన వీథులకెక్కి సంఖ్యాబలమును బ్రదర్శింపలేనివారిని దక్కుంగల ప్రజలు కూడ లక్ష్యపెట్టరు.

(ఇ) కనుక వీథుల కెక్కుట సుసంగతమైనను, గాకపోయినను బలప్రదర్శననిమిత్తమున్ను, ప్రత్యర్థుల తోడి పోటి నిమిత్తమున్ను, నాయకత్వ సిద్ధి నర్థించియుఁ బెక్కుమంది తఱచుగా వీథులకెక్కుచుందురు.

(ఈ) ఊఱక వీథుల కెక్కుట వలనఁ బ్రయోజనము లేదు గనుక నెవరినోయొకరిని విమర్శనవిషయముగాఁ గొని సునిశితమైన దూషణములకుఁబాల్పడుచుందురు. ౌ్ఛలితార్థముగాఁ బ్రజాస్వామ్యమునం దొండొరులకుగౌరవమిచ్చుపుచ్చుకొను సంస్కృతియన్ననో మిక్కిలి యడుగంటి యుండును.

సూత్రము – 23 : విలంబన మయము.

వృత్తి :

విలంబనమనఁగా జాప్యము. ప్రజాస్వామ్యమునందుఁ బ్రతి నిర్ణయమున్ను మరియు దాని యనుష్ఠానమున్ను మిక్కిలి జాప్యమగును.

(అ) ప్రజాస్వామ్య మేకకాలములో బహునాయకత్వము నంగీకరించు వ్యవస్థగనుక నే యొక్క నాయకుని మాటను గాని పాటిగాఁ గొని పనిసేయుటజరుగదు. అట్లు తతౖఉక్షణమే పాటిగాఁ గొనఁదగినంత నమ్ముబాటు కూడనే యొక్క నాయకునికిని ఉండదు.

(ఆ) అందువలనఁ బ్రతిపాద న పరంపరలున్ను, వానిపై సుదీర్ఘ చర్చలున్ను,పరిశీలన విచారణములున్ను మినహా, దత్క్షణ నిర్ణయములుండవు.

(ఇ) చర్చలు ముగిసి, యొక నిక్కచ్చి తీరుమానమునకు వచ్చిన సందర్భముల యందును ఆది యనుష్ఠానరూపమును సంతరించికొనుట దుర్ఘటము. ఏల ననఁగాఁ, బ్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థ యందధికార కేంద్రములనేకము. అధికారుల పరముగాను, నాయకుల పరముగాను ఒక తీరుమానమనేక స్థాయిలను, దశలను గడచి, బాలారిష్టములను దాఁటికొని, తుదకువిజయవంతముగా నెఱవేఱినచో నది యొక గొప్ప యదృష్టముగా నెంచవలసి యున్నది. పెక్కు సందర్భములయందుఁ పుణ్యకాలము తీఱి తీరుమానములకుఁ కాలదోషము పట్టుటయే యనివార్యమగును.

(ఈ) ఈ కతనఁ బ్రజాస్వామ్యపుఁ బనితీరు మిక్కిలి యసమర్థముగా నుండును.

సూత్రము – 24 : ఒక సుస్థిరమైన యస్థిరత.

వృత్తి :

ప్రజాస్వామ్య మస్థిరత్వమునకు దారితీయును.

(అ) ప్రజాస్వామ్యమునందుఁ బ్రజాస్వామ్యము మినహా తక్కుంగల వెల్లయునశాశ్వతమే. ప్రజాస్వామ్యమునం దత్యున్నతాధికారము కూడఁ బ్రతి కొంతవ్యవధానమునకున్ను చేతులు మారుచుండుటచేఁ బ్రభుత్వములు తరచుగామరణించుచుండును. వానితోఁ బాటుగా వాని యొక్క యెల్ల సిద్ధాంతములున్ను, పథకములున్ను, చేపట్టులున్ను మరణించును. కనుక సమాజమునం దస్తవ్యస్తతయు, అల్లకల్లోలమున్ను మిక్కిలి తఱచగును.

సూత్రము – 25 : ప్రజలను ఈకోళ్ళుగాఁ జూచును.

వృత్తి :

ఈకోలనఁగా సమ్మతి. అట్టి సమ్మతిని దెల్పుచు ముద్రవేసిన కాగితములు కూడ ఈకోళ్ళే. ప్రజాస్వామ్యమునందుఁ బ్రభుత్వముల దృష్టిలోఁబ్రజలకు మనుష్యప్రతిపత్తి కంటె ఈకోళ్ళ ప్రతిపత్తి యెక్కువ. అనఁగాఁదమకు ఈకోలిచ్చి తమ యధికారమును నిలువఁబెట్టఁగల వర్గములనే వారుపరిగణనములోనికిఁ దీసికొందురు.

సూత్రము – 26 : సర్వస్వాధికార ధోరణికి దారితీయును.

వృత్తి :

ప్రజాస్వామ్యము యావత్తు ప్రజానీకమును బ్రభుత్వము నెన్నికొనుటలో భాగస్వాములను జేయును గనుకఁ బ్రతి పౌరునికిని ప్రభుత్వమునెన్నికొనుటలోఁ దన స్వంత కార్యాచరణ పథకమొకటి యుండును. ప్రభుత్వమెన్నికైన పిదప దాని నాచరణములోనికిఁ దేరవలసినదని పౌరులు ప్రభుత్వముపై నొత్తిడి తెచ్చెదరు. అట్లు ప్రభుత్వ మెవరికిఁ గావలసిన యభీష్టపరిపూర్తి వారికిఁ జేసిపెట్టు ప్రక్రియలో భాగముగా నెల్ల రంగములను మరియువిషయములను దన యధికారపరిధిలోనికిఁ దెచ్చికొని స్వాధీనము జేసికొనును. కనుకఁ బ్రజాస్వామ్యములోఁ బ్రభుత్వము జోక్యము చేసికొనని విషయమనునదేదియు నుండదు. అందుచేతఁ బ్రజాస్వామ్య ద్వారమున నధికారపీఠమును గైవసము జేసికోఁదలఁచు నియంతలకీ పరిస్థితి మిక్కిలి సంతోషకరముగా నుండును.

సూత్రము – 27 : సమన్వయ విచ్ఛేదకము

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు ఖచ్చితమైన శ్రమవిభజన మూలమునఁబ్రత్యేక నైపుణ్యములకు మిక్కిలి ప్రాధాన్యమేర్పడుటచే వివిధరంగములుకొందరు మహానిపుణుల యొక్కయు ననుభవజ్ఞులైన యధికారుల యొక్కయు స్వంత సామ్రాజ్యములుగా మారిపోవును. కనుక వారి యాజ్ఞలనునెఱవేర్చుటే తప్పఁ దాము చేయుచున్న పనుల మంచిసెబ్బరల గురించిలోఁతుగా యోచించు నవకాశము సామాన్యుల కుండదు. మంచిసెబ్బరలవివాదము తమ కప్రస్తుతమనియు, వాని విషయమును దమ పైవారెఱుఁగుదురనియు, జీతము దీసికొనుచున్నందుకుఁ దమ కర్తవ్యమును దాముప్రభుత్వముపట్ల సక్రమముగా నెఱవేర్చుటయే చాలు ననియు వారు వాదించెదరు. అందుచేతఁ బ్రజాస్వామ్య ద్వారమున నధికార పీఠమును గైవసము జేసికోఁదలఁచు నియంతలకీ పరిస్థితి తద్దయు సంతోషకరముగా నుండును.

సూత్రము – 28 : ప్రజాస్వామ్యమునందుఁ బ్రజాభీష్ట నిర్వర్తనము బహుళము.

వృత్తి :

బహుళ మనఁగాఁ – బ్రజాభీష్టము నది కొన్నిసారులు సంపూర్ణముగా నెఱవేర్చవచ్చును. కొన్నిసారులు కొంతవరకు మాత్రమే నెఱవేర్చవచ్చును. కొన్నిసారులు బోత్తిగా నెఱవేర్చకయే పోవచ్చును. మఱికొన్నిసారులు ఆశించినట్లు కాక, రూపాంతరముగా నెఱవేర్చవచ్చును.

సూత్రము – 29 : ప్రజాస్వామ్యమునందు శిక్షలు సుతారము.

వృత్తి :

ఇదిప్రజాస్వామ్యమునందు నేరస్థులకు శిక్షలు పడుట తక్కువ. పడినను అవి కఠినముగా నుండవు.

(అ) న్యాయాధికారులతో సహా యెవ్వరున్ను వైయక్తిక భావోద్వేగములకులోను గానంత మునీశ్వరులు కారనిన్నీ, ఎట్టి పొఱపాటును సేయనంతదైవాంశ సంభూతులు మొదలే కారనిన్నీ ప్రజాస్వామ్యము నమ్మును. కాఁబట్టినేరము స్మృతిశాస్త్ర ప్రకారము సాంకేతికముగా ఋజువైనను మఱియొకప్రక్కనింది తుఁడు తనపై నారోపింపఁబడిన తప్పు బోత్తిగాఁ జేసియుండకపోవునవ కాశము కూడఁ గలదని ప్రజాస్వామ్యవాదులు భావించెదరు. అదియేనిజ మగుచో నిందితునికిఁ గఠినశిక్ష విధించుట ౌ్ఛూరాతిౌ్ఛూరమగునన్యాయమే యగును. నూఱుగురు దోషులు తప్పించికొన్నను మేలే గాని,ఒక్క నిర్దోషి కైనను శిక ్ష పడరాదని చెప్పెదరు. కనుక నరుదైన సందర్భములలోమినహా, నెంత పెద్ద నేరమునకైనను బ్రజాస్వామ్యమునందుఁ జెఱసాలయేవిధింపఁబడును.

(ఆ) ౌ్ఛలితార్థముగా వాస్తవికాచరణమునందు దోషులందరును దప్పించికొనుచుందురు. నిర్దోషులున్ను నిర్ధనులున్ను మాత్రమే చెఱసాలలయందు మ్రగ్గుచుందురు.

(ఇ) శిక్షలు కఠినము కాకపోఁబట్టి యొక నేరస్థుఁ డదే నేరము నెన్నిసారులైనను జేయవచ్చును. కావలసినన్ని సారులు చెఱసాలకుఁ బోవచ్చును.మఱల బయటకు రాను వచ్చును.

(ఈ) ఆ నేరస్థులను దమతమ పనుల నిమిత్తము ఉపయోగించికొనుపెద్దలుందురు గనుక నిట్లు చెఱసాలకుఁ బోవుచుండుటయు మగుడ బయటకు వచ్చుచుండుటయు నొక లాభసాటి వ్యాపారముగాఁ బరిణమించును.తఱచుగా నేరములు చేసి చెఱసాలకుఁ బోవువారి యసమాన శౌర్యప్రతాపములకు జనసామాన్యము వెఱతురు గనుక కొందరికీ చెఱసాల యనుభవము వారి కీర్తికిరీటములోఁ గలికితురాయి వలె గర్వకారణమగును.

(ఉ) పర్యవసానముగా యావత్తు సమాజమున్ను నేరపూరితమై భయముగొల్పుచుండును.

::నాలుఁగవ ప్రస్తావనము: ప్రజాస్వామ్యపుఁ బరిమితులు::

సూత్రము – 30 : ప్రజాస్వామ్యము పెద్ద భూభాగములకుఁ బెద్దగానప్పదు.

వృత్తి :

చిన్న దేశమనఁగా –

(అ) ఏ భూభాగపు నడిబోడ్డు నుండి యొక రౌతొక యుత్తమాశ్వముపై బయలుదేరి యిఱువది (20) ఘడియల వ్యవధానము లోపల నేదో యొక పొలిమేరను జేరఁగలుగునో యట్టి భూభాగమున్ను, మఱియు దాని నాశ్రయించికొని కాపురముండు జనసందోహపు మొత్తమున్ను. ఘడియ యనఁగా సరాసరి దినప్రమాణమునం దఱువదవ వంతు.

(ఆ) అట్లఱువది (60) ఘడియల వ్యవధానము లోపలఁ జేరఁగలుగుచోనది పర్యాప్త పరిమాణము గల దేశము.

(ఇ) అంతకు మించిన విరివి గల పెద్ద దేశములలోను, సామ్రాజ్యములలోను బాక్షిక ప్రజాస్వామ్యము మాత్రమే ఉనికి యందుండుట కవకాశము గలదు.

About తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

”నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు.

తెలుగు భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం ప్రశంసనీయమైనవి. ’తెలుగు సాహిత్యం’ బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు.

ఆయన రచనల్లో ఎక్కువ భాగం అముద్రితాలు. వాటిని తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.